కొంపదీసి ఓట్లు కేసీఆర్ ఫామ్ హౌస్లో లెక్కిస్తారా.. విజయశాంతి
posted on Oct 28, 2020 @ 7:44PM
దుబ్బాక ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి తరుఫున అన్ని తానే అయి ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న హరీష్ రావు ఈ ఉప ఎన్నికలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ కూడా రాదని సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. తాజాగా మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు అనేక సందేహాలకు తావిస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి అనుమానం వ్యక్తం చేసారు. మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా కొన్ని అనుమానాలు వ్యక్తం చేసారు. ఫలితాలు ఎలా ఉండాలో ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించే స్థాయికి వెళ్లి పోయిందంటే... అధికార పార్టీ అరాచకాలపై దుబ్బాక ఓటర్లకు ఒక స్పష్టత వచ్చి ఉంటుందని విజయశాంతి తెలిపారు. హరీష్ రావు వ్యాఖ్యలను పరిశీలిస్తే... దుబ్బాకలో పోలింగ్ జరిగిన తర్వాత ఈవీఎం మిషన్లను కేసీఆర్ ఫామ్ హౌస్లో పెట్టి, ఓట్లను లెక్కిస్తారేమోనని అనుమానం కలుగుతోందని ఆమె ఎద్దేవా చేశారు.
అసలు అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే మరణించడంతో జరిగే ఉప ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ పార్టీ.. అలాగే హరీష్ రావు ఎందుకు ఇంత హైరానా పడుతున్నారో ఎవరికి అంతుబట్టడం లేదని ఫేస్బుక్ కామెంట్ లో ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలకు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఉప ఎన్నికలో ఎక్కువ ఓట్లు వస్తే.. దాని ప్రభావం హరీష్ రావు మంత్రి పదవి మీద పడుతుందని సీఎం కేసీఆర్ ఏదన్నా అల్టిమేటం జారీ చేశారేమోనన్న చర్చ కూడా ప్రజలలో జరుగుతోందని విజయశాంతి సందేహం వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మెదక్ జిల్లాకు కేటాయించిన నిధుల కంటే.. దుబ్బాకలో ఓటర్లను కొనేందుకు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నట్టుగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారని విజయశాంతి తెలిపారు.