Telugu States Ration Rice Illegally Transport to Other States

రెచ్చిపోతున్న రేషన్ మాఫియా!!

తెలంగాణ, ఏపీలలో అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది.  పేదలు నోటి దగ్గరికి చేరాల్సిన రేషన్ బియ్యం సరిహద్దులు దాటిపోతుంది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి తూర్పు గోదావరి జిల్లాలోకి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కాకినాడ పోర్టు ద్వారా వేరే ప్రాంతాలకు తరలిపోతోంది. మధ్యలో ఎన్నో చెక్ పోస్టులు అధికారులు విజిలెన్స్ ఉన్నా దర్జాగా తరలించుకుపోతోంది రేషన్ మాఫియా. పశ్చిమ గోదావరి జిల్లాను అడ్డాగా చేసుకున్న అక్రమార్కులు సరిహద్దు ప్రాంతాలైన చింతలపూడి, రాఘవపురం, గురుభట్లగూడెం గ్రామాల్లో డంపులు పెట్టి లారీలతో లోడ్లకు లోడులు తరలిస్తున్నారు. వందల టన్నుల బియ్యాన్ని సరిహద్దులు దాటిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. అయితే పలు ప్రాంతాలను నుంచి తూర్పు గోదావరి జిల్లాకు తరలించి అక్కడ రీసైక్లింగ్ చేస్తున్నారు. దగ్గర్ లోనే కాకినాడ పోర్టు ఉండటంతో ఆ దారిలో దేశంలోని ఇతర ప్రాంతాలకు సైతం పేదల బియ్యం తరలిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మాఫియా పని మరింత ఈజీ అయ్యింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లాలలోని కొందరు రైస్ మిల్లర్లు ఈ రేషన్ దందాను వెనుకుండి నడిపిస్తున్నారు. రేషన్ బియ్యాన్ని అంతా ఒక చోట చేర్చి తర్వాత పెద్దపెద్ద లోడులతో సరిహద్దులు దాటిస్తున్నాయి రైసు మిల్లర్ల యాజమాన్యాలు. రేషన్ మాఫియాతో కుమ్మక్కైన అధికారులు రేషన్ బియ్యాన్ని ఎలాంటి తనిఖీలు చేయకుండా సరిహద్దులు దాటిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. కేవలం లారీలోనే కాదు వ్యాన్ లు, ఆటోల్లోనూ మూటలకు మూటలు తరలిస్తున్నారు. ఈ పాస్ విధానంలో సరుకుల పంపిణీని కూడా డీలర్ లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. కార్డుదారులు ఎక్కడైనా బియ్యాన్ని తీసుకునే సౌలభ్యాన్ని వక్రమార్గం పట్టిస్తున్నారు. ప్రతి నెల సరుకులు పంపిణీ చేయాల్సి ఉన్నా కొందరు డీలర్లు కుంటి సాకులతో లబ్ధిదారులను వెనక్కి పంపించేస్తున్నారు. చాలా చోట్ల రెండు నెలలకు ఒకసారి రేషన్ ఇస్తున్నారు. డీలర్ల తీరుతో చాలా పట్టణాల్లో లబ్ధి దారులు విసిగిపోతున్నారు. సరుకులు కూడా తీసుకోవడం లేదు. దాంతో వారి రేషన్ మాఫియా చేతికందుతోంది. రేషన్ డీలర్లు ఈ పాస్ యంత్రాల టెక్నీషియన్ లు, ఎన్ఐటీ టెక్నీషియన్ లు, వీఆర్వోలు, ఫుడ్ ఇన్ స్పెక్టర్ ల అండతో దళారీలు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అరికట్టాల్సిన అధికారగణం చేష్టలుడిగి చూస్తుండటం పట్ల ప్రజలు మండిపడుతున్నారు.  

andhra pradesh facing financial crisis

బాబును మించిపోతున్న వైఎస్ జగన్!

ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చాలా లోటులో ఉన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో బ్యాంకుల నుంచి అప్పులు తేవడం జరుగుతుంది. సహజంగా ప్రభుత్వ అవసరాలకు అప్పులు తీసుకు రావడం మామూలే. ఆయా కార్పొరేషన్ ల ఆస్తులను తనఖా పెట్టి మరీ తెచ్చిన రుణ మొత్తాలను జగన్ ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించేస్తున్నారు. అదేమంటే.. ప్రభుత్వ కార్పొరేషన్ ల ద్వారా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని వాటిని ప్రభుత్వ అవసరాలకు మళ్లించడంలో వైఎస్ జగన్ సర్కార్ గత ప్రభుత్వాన్ని మించిపోయింది. గత సర్కారు చివరి సంవత్సరంలో కార్పొరేషన్ ల అప్పులు భారీగా తీసుకురాగ, జగన్ ప్రభుత్వం తొలి ఏడాది నుంచే ఈ తరహా మళ్లింపులో ఆరి తేరింది. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, పౌరసరఫరాల సంస్థ, గృహ నిర్మాణ సంస్థ, ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చినట్లు సమాచారం. ఏప్రిల్ నుంచి జనవరి వరకు ఇలా 12 వేల కోట్ల రూపాయల వరకు అప్పుగా తెచ్చిన మొత్తాన్ని సదరు కార్పొరేషన్ల కోసమే వినియోగించారా? లేక ప్రభుత్వ అవసరాలకు మళ్లించారా? అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది. ఈ అప్పులేమీ ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం పరిధిలోకి రాకపోవడంతో ఎక్కడ దొరికితే అక్కడ ఎడా పెడా దూసుకొస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 1.14 లక్షల కోట్ల ఆదాయం రాగా ఇందులో 90% శాతం మొత్తానికి ప్రభుత్వం గ్యారెంటీలు ఇచ్చి అప్పులు తెచ్చుకోవచ్చు అని సమాచారం. అంతేకాకుండా ఆర్థిక శాఖ ఏప్రిల్ నుంచి జనవరి వరకు 16 వేల కోట్ల రూపాయల అప్పులకు గ్యారెంటీ ఇచ్చింది. ఇందులో జనవరి నాటికి 12 వేల కోట్లు రుణంగా తెచ్చారు. పీఎఫ్సీ నుంచి మొత్తం 9వేల కోట్ల అప్పు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకు వీలుగా పలు జిల్లాల్లో ఏపీ జెన్ కో భూములనూ కొన్ని ప్రాజెక్టులను ఆ కార్పొరేషన్ కు బదిలీ చేశారు. బ్యాంకుల వద్ద ఈ ఆస్తులను తనఖా పెట్టి భారీ మొత్తంలో అప్పులు తెస్తున్నారు. పీఎఫ్సీ నుంచి లక్ష్యంగా పెట్టుకున్న 9 వేల కోట్లలో ఇప్పటికే 5,500 కోట్ల రూపాయల అప్పు తెచ్చుకోగా ఇంకో రూ. 3500 కోట్లు రావాల్సి ఉంది. ఎస్బిఐ అలహాబాద్ బ్యాంకులో నుంచి పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా రూ.3 వేల కోట్ల రూపాయిల అప్పు తెచ్చారు. హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రూ.1800 కోట్ల రూపాయల రుణాలు తెచ్చారు. మిగతా కార్పొరేషన్ ల నుంచి కొద్దికొద్దిగా 1,700 ల కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చారు. ఈ మొత్తం 12 వేల కోట్లకు చేరుకుంది. జెన్ కో ద్వారా మరో 2,500 ల కోట్ల రూపాయల రుణం తేవటానికి సంప్రదింపులు జరుగుతున్నాయి. మొత్తానికి చూసుకుంటే గత ప్రభుత్వం కంటే జగన్ సర్కార్ రుణాలను ఎక్కువగా తీసుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

AP Assembly Budget Session Starts from March 15

మార్చి 15 నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి మార్చి 15 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. నెల రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ముందుగా బడ్జెట్ ను ప్రవేశ పెట్టి, ఆమోదింప చేసుకుని ఆ తర్వాత ఇతర బిల్లులను సభ ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులమీద ఎలాంటి అడుగులు వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్ధల ఎన్నికల్లో సవరణలకు బీజం వేస్తూ పంచాయతీ రాజ్ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. వ్యవసాయ మండలి ముసాయిదా బిల్లుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపనుంది.  గత నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు సీఆర్డీయే రద్దు బిల్లులును ప్రవేశపెట్టింది. అయితే శాసనసభ ఆమోదం పొందిన రెండు బిల్లులకు శాసన మండలిలో బ్రేక్ పడింది. వాటిని సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్లు చైర్మన్ షరీఫ్ ప్రకటించటంతో పెద్ద దుమారం రేగింది. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుని ఏకంగా శాసన మండలిని రద్దు చేస్తూ శాసన సభ తీర్మానం చేసింది. మార్చి 15 వ తేదీ లోపే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో ఎన్నికలు కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి సత్తా చాటితే మూడు రాజధానులకు ప్రజల మద్దతు లభించినట్టేననే అభిప్రాయాన్ని అసెంబ్లీ సాక్షిగా నిరూపించాలని ప్రభుత్వం భావిస్తోంది.  

CBI opposes Jagan plea for court visit exemption

జగన్ ని వదలని సీబీఐ.. హోదాను బట్టి మినహాయింపు తగదు!

ముఖ్యమంత్రి హోదాను అడ్డుపెట్టుకొని అక్రమాస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరడం సరి కాదని సిబిఐ స్పష్టం చేసింది. హాజరు మినహాయింపు ఏ నిందితుడికి హక్కు కాదని అది న్యాయస్థానం విచక్షణాధికారమని పేర్కొంది. నిందితుడికి హోదా ఆర్థిక స్తోమత కోర్టుపై ప్రభావం చూపలేవని స్పష్టం చేసింది. అలాగే చట్టం ముందు అందరూ సమానమేనని చట్టం అందరికీ ఒకేలా వర్తిస్తుందని తెలియజేసింది. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను సిబిఐ ప్రత్యేక కోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ జగన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ లను కొట్టేయాలంటూ సీబీఐ హైదరాబాద్ విభాగం ఎస్పీ పీసీ కల్యాణ్ 17 పేజీల కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. అదేవిధంగా చిన్న చిన్న కేసులలో న్యాయస్థానాలు విచక్షణాధికారం మేరకు నిందితుల వ్యక్తిగత హాజరు కు మినహాయింపు ఇస్తాయని తెలిపారు.  కానీ జగన్ పై ఉన్నవి తీవ్రమైన ఆర్ధిక నేరాలని వీటిలో హాజరు మినహాయింపు ఇవ్వడం సరి కాదని అఫిడవిట్ పేర్కొన్నారు. సీఎం హోదా ఉందన్న కారణంగా మినహాయింపు ఇస్తే ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని ఆరోపణలు చేశారు. తీవ్రమైన ఆర్థిక నేరం కాబట్టి మినహాయింపు ఇవ్వలేమని 2014 ఫిబ్రవరిలో సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని 2016 లో ప్రతిపక్ష నేత హోదాలో జగన్ ఇదే అభ్యర్థనతో మరోసారి పిటిషన్ లు దాఖలు చేయగా వాటిని అదే కోర్టు కొట్టివేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీలును కూడా హైకోర్టు 2017 ఆగస్టు 31న కొట్టేసిందన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత నెల 10 న ఒకసారి సీబీఐ కోర్టుకు జగన్ హాజరయ్యారు. దాదాపు 9 నెలలు సీఆర్పీసీ సెక్షన్ 317 కింద హాజరు మినహాయింపు కోరారు. సహేతుకమైన కారణాలు లేకుండానే మినహాయింపు కోరుతూ విచారణ ప్రక్రియకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లుగా ఉందని తెలిపింది.  నేర న్యాయస్మృతి లోని సెక్షన్ 273 ప్రకారం నిందితుడు సమక్షంలోనే నేర విచారణ జరగాలని సిబిఐ తన కౌంటర్ లో తెలిపింది. జగన్ ఇతర నిందితులతో కుమ్మక్కై ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీశారు. మోసం నమ్మక ద్రోహానికి పాల్పడి రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారు. రాష్ట్ర వనరులను ఇతరులకు కట్టబెట్టడం ద్వారా లబ్ది పొందారు. దాల్మియా కేసులో పునీత్ దాల్మియాకు సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చిందని ఆ కారణంగా జగన్ మినహాయింపు కోరడం సరికాదని పునీత్ ఒక్క కేసులో నిందితుడు జగన్ 11 చార్జిషీట్ లలో ప్రథమ నిందితుడిగా ఉన్నారని అన్నారు. దీంతో పుణిత్ తో పోలిస్తే ఆర్ధికంగా కూడా ఆయన భారీగా లబ్ది పొందారు కాబట్టి ఈ నేపథ్యంలో జగన్ పిటిషన్ లను కొట్టివేయండి అని సీబీఐ అభ్యర్థించింది. ఈ పిటిషన్ పై హైకోర్టు ఏప్రిల్ 9న తుది విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. మొన్నటి కోర్ట్ విచారణ వాయిదా పడిన కారణంగా ఏపీ సీఎం జగన్ కు కొంత మేర ఉపశమనం కలిగినట్లు తెలుస్తోంది.

Pawan Kalyan Slams YCP Govt

ఓడిపోయినా కూడా ప్రజల్లోనే ఎందుకు తిరుగుతున్నానో తెలుసా?: పవన్

రెండు రోజుల పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లాకు వచ్చిన పవన్ కల్యాణ్ ముందుగా సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. తర్వాతి రోజు కూడా అక్కడే ఉండి పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. స్థానిక రైతులు, చేనేత కార్మికులు ప్రజల కష్టాలు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధులు చిన్నపాటి వంతెన కూడా నిర్మించలేకపోతే ఎన్నికల్లో గెలిచి ఏం ప్రయోజనమని జనసేనాని ప్రశ్నించారు. ప్రలోభాలకు లోనై ఓట్లేస్తే ఇలాంటి పరిస్థితులే తలెత్తుతాయని చురకలంటించారు.  జోరాపురం వంతెన సమస్యపై స్థానికులతో చర్చించారు. ఎమ్మిగనూరులో చేనేత కార్మికులతో భేటీ అయ్యారు పవన్. వారి గోడు విన్న పవన్ సమస్యలపై పోరాటానికి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. మిగతా నాయకుల్లాగా మాటలు చెప్పి తప్పించుకోనని, భవిష్యత్తులో మీ బిడ్డలకు కష్టాలు రాకుండా చూసుకునే అవకాశం దక్కితే అంతే చాలు అంటూ పవన్ భావోద్వేగానికి లోనయ్యారు. చేనేతల సమస్యలపై కేంద్రం దిగొచ్చేలా కలిసి పోరాడదామని హామీ ఇచ్చారు.  ఎన్నికల ముందు వైఎస్ జగన్ హామీ ఇచ్చినట్లు పెన్షన్ లు పెంచాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోయినా తానింకా ప్రజల్లోనే ఎందుకు తిరుగుతున్నానో అర్థం చేసుకోవాలని ఆయన వేడుకున్నారు. జనం కష్టాలూ, కన్నీళ్లలో అండగా ఉండటానికే జనసేన పార్టీని స్థాపించానని చెప్పారు. వెంటనే అధికారంలోకి రావడం తన టార్గెట్ కానేకాదన్నారు. పవర్ అంటే నిజమైన అర్థం ప్రజల కష్టాలు తీర్చేదని, తన చేతుల్లో పవర్ ఉంటే అందరి కష్టాలు తీర్చే వాడిని అని పవన్ కళ్యాణ్ చెప్పారు.

CM KCR Takes Key Decision On Irrigation Department

సొంత పబ్లిసిటీ కోసం, సొంత ఎజెండాలతో పనులు చేయొద్దు: సీఎం కేసీఆర్

గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాల్సిన క్రమంలో బ్యారేజీల ఆపరేషన్ రూల్స్ ను సిద్ధం చేయాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్ లో సాగునీటి రంగంపై అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. అధికారుల వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు హుందాగా ప్రవర్తించాలని సూచించారు. సొంత పబ్లిసిటీ కోసం సొంత ఎజెండాలతో పనులు చేయొద్దని ప్రభుత్వ కార్యక్రమాలే అమలు చేయాలని కేసీఆర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. జూన్ నెలాఖరులోగా ఇరిగేషన్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు.  కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సాగునీటికి సంబంధించిన ఇంజినీరింగ్ విభాగాలన్నీ ఒకే గొడుగు కిందికి తేవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. ఈ వ్యవస్థను పదకొండు సర్కిళ్లుగా విభజించాలని సూచించారు. సర్కిల్ అధిపతిగా చీఫ్ ఇంజనీర్ ఉండాలని సూచించారు. ఏప్రిల్ నెలాఖరులోగా ఇరిగేషన్ అధికారులు సిబ్బందికి క్వార్టర్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 530 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసేలా అధికారులు అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. కాళేశ్వరం నుంచి తుమ్మడిహట్టి వరకు ఆరు చోట్ల గేట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏజెన్సీలు సకాలంలో పనులు పూర్తి చేయటం లేదని అలాంటి వాటిని గుర్తించి రద్దు చెయ్యాలని ఆదేశించారు.  అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా లక్ష్మి బ్యారేజీని సందర్శించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రాణహిత నదీ జలాలను పరిశీలించారు, ఏరియల్ వ్యూ ద్వారా లక్ష్మి బ్యారేజ్ ను వీక్షించారు సీఎం. నీటి నిర్వహణపై అధికారులు, ఇంజనీర్ లతో సమీక్షించారు. రాబోయే వర్షాకాలంలో వరద నీరు ఉధృతంగా చేరుతుందని లక్ష్మీ బ్యారేజి నుంచి ఎప్పటికప్పుడు నీటిని తోడుకోవాలని సూచించారు. లక్ష్మీ బ్యారేజీ సందర్శన కంటే ముందు కరీంనగర్ నుంచి హెలికాప్టర్ లో కాళేశ్వరం చేరుకున్న కేసీఆర్ హెలికాప్టర్ నుంచి మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్ లను ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం త్రివేణి సంగమం వద్ద పూజలు చేశారు, నదిలో నాణేలు వదిలి జల నీరాజనాలు అర్పించారు. ముక్తేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు.

TDP MLCs to move privilege motion against CM

దెబ్బకి దెబ్బ.. వైసీపీపై యుద్దానికి సిద్దమైన టీడీపీ!!

ఏపీ మండలి రద్దుపై ఢిల్లీ పర్యటనకు టీడీపీ ఎమ్మెల్సీలు సిద్ధమయ్యారు. రాజకీయ కారణాలతోనే మండలి రద్దు చేశారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు. కౌన్సిల్ రద్దు అంత సులభం కాదని హస్తినలో తమ వాదన వినిపిస్తామని చెబుతున్నారు. అటు ఉభయ సభలను ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ ఇచ్చిన నోటిఫికేషన్ పై కూడా చర్చ జరుగుతోంది. ఏపీ కౌన్సిల్ వార్ ఢిల్లీకి చేరుతోంది, ప్రధానిని కలిసిన సీఎం జగన్ కౌన్సిల్ రద్దుపై విజ్ఞప్తి చేశారు. కౌన్సిల్ లో బిల్లులను అడ్డుకునే పరిస్థితిని వివరించి అసెంబ్లీ చేసిన తీర్మానం ఆధారంగా మండలిని రద్దు చేయాలని కోరారు. కౌన్సిల్ రద్దు అంత సులభం కాదని జాప్యం జరుగుతుందని టిడిపి వాదిస్తోంది.  సీఎం ఢిల్లీ పర్యటన తరుణంలో ప్రతిపక్ష టీడీపీ కౌంటర్ పర్యటనకు సిద్ధమవుతోంది. మండలి రద్దు పూర్తిగా రాజకీయ కారణాలతో జరుగుతోందని ఆరోపిస్తున్న టిడిపి ఈ విషయాన్ని ఢిల్లీ వరకు తీసుకు వెళ్లాలని చూస్తోంది. మూడు రాజధానులు వద్దన్నందుకు మాత్రమే మండలి రద్దు చేస్తున్నారనే వాదనను కేంద్ర మంత్రులకు వివరించనున్నారు. కేంద్ర న్యాయశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రులను కలిసి మండలి పరిణామాలపై కేంద్రానికి నివేదించనున్నారు. ఇదే క్రమంలో ప్రధాని, రాష్ట్రపతి కూడా కలిసేందుకు టిడిపి ఎమ్మెల్సీలు ప్రయత్నం చేస్తున్నారు.  ఇప్పటికే ఢిల్లీలోని టిడిపి ఎంపీలు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. మండలిపై సీఎం వ్యాఖ్యలపై టిడిపి చర్యలకు దిగుతోంది. కౌన్సిల్ ను, సభ్యులును అవమానించేలా సిఎం మాట్లాడారని టిడిపి ఆరోపిస్తోంది. సిఎంపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నట్లు టిడిపి ప్రకటించింది. కౌన్సిల్ లో లాయర్లూ, డాక్టర్లూ గ్రాడ్యుయేట్ లు ఉన్నారని వారిని కించ పరిచేలా సిఎం వ్యాఖ్యలు చేశారని టిడిపి వాదిస్తోంది. ఉభయ సభలను ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వడంపై కూడా టిడిపి ఎమ్మెల్సీలలో చర్చ జరిగింది. ఆర్డినెన్స్ ఇచ్చినా వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టాల్సిందేననీ చెబుతోంది. కౌన్సిళ్లు సమావేశపరచకుండా అసెంబ్లీ సెషన్స్ జరపకూడదని వాదిస్తోంది.

AP Govt To Bring Ordinance for Three Capitals

వ్యూహానికి ప్రతివ్యూహంతో ముందుకు వెళుతున్న జగన్ ప్రభుత్వం...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శాసనసభ, శాసన మండలిని ప్రొరోగ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉభయ సభలను ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గవర్నర్ సభలను ప్రొరోగ్ చేయటం సాధారణ ప్రక్రియ అయినా ఈసారి మాత్రం ఇలా చేయటం అధికార పార్టీకి మేలు చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి.  బిల్లును సభ ముందు ఉండగానే ఆర్డినెన్స్ జారీ చేసిన సందర్బాలు రాజ్యసభలోనూ వివిధ అసెంబ్లీలోనూ ఉందంటూ ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది. ట్రిపుల్ తలాక్ వంటి బిల్లులు రాజ్యసభ ముందున్నా కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పార్లమెంటు ఆమోదించిన 2013 భూ సేకరణ చట్టం విషయం లోనూ సవరణల కోసం రెండు సార్లు కేంద్రం ఆర్డినెన్స్ లు జారీ చేశాయి అన్నది ప్రభుత్వ వర్గాల వాదన.  వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులపై ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ఉన్న ప్రభుత్వానికి ఉభయ సభల ప్రోరోగ్ ఉత్తర్వులతో వెసులుబాటు లభించినట్టయ్యింది. ఇప్పటి కిప్పుడు మండలి రద్దు కాదు, తనకున్న బలంతో ఎలాగైనా సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేసి జనంలోకి వెళ్లి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని టిడిపి భావిస్తోంది. దీంతో వైసీపీ ప్రతివ్యూహంతో ముందుకు వెళుతోంది. సెలక్ట్ కమిటీతో సంబంధం లేకుండా ఆర్డినెన్స్ ను జారీ చేసి పని మొదలెట్టాలని యోచిస్తోంది. అందుకే సెలెక్ట్ కమిటీ ఏర్పాటును జాప్యం చేసినట్లు తెలుస్తోంది.  ఒకసారి సెలక్ట్ కమిటీకి బిల్లును చైర్మన్ పంపించిన తరువాత అదే బిల్లుపై ఆర్డినెన్స్ ఇవ్వడం కుదరదని అంటున్నారు టీడీపీ నేతలు. ప్రభుత్వం సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేసినా లేకున్నా రూల్స్ ప్రకారం ఆర్డినెన్స్ ఇవ్వలేరని చెబుతోంది. సెలక్ట్ కమిటీ రూలుతో ప్రభుత్వానికి టిడిపి షాకిస్తే మండలి రద్దు తీర్మానం చేసి ఇప్పుడు ప్రొరోగ్ ద్వారా ఏకంగా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ సవరణ బిల్లులపై ఆర్డినెన్స్ కు సిద్ధమవుతోంది జగన్ ప్రభుత్వం. మండలి రద్దు అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని ఈ విషయంలో కేంద్రం రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తోందని వైసిపి చెబుతోంది. టిడిపి ఎమ్మెల్యేలు స్టేజ్ షో కోసం ఢిల్లీ వెళుతున్నారని ఎద్దేవ చేస్తున్నారు. మరి ఈ ప్రొరోగ్ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

ap cm ys jagan to meet amit shah

మొన్న మోడీ, నేడు షా.. వరుస భేటీలతో విపక్షాలను భయపెడుతున్న జగన్!!

ఏపీ సీఎం జగన్ ఈరోజు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం ప్రధాని మోడీతో సుదీర్ఘ భేటీ అయ్యారు జగన్, ఇవాళ మళ్లీ అమిత్ షాతో భేటీకి పిలుపు రావడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిగ్గా మారింది. అమిత్ షాతో పాటు, మరికొందరు కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  మూడు నెలలుగా సీఎం జగన్ ను పట్టించుకోని కేంద్రం ఆకస్మికంగా వరుస భేటీలకు అవకాశం ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ప్రధానితో జరిగిన సుదీర్ఘభేటీలో విభజన సమస్యలు, పెండింగ్ నిధులతో పాటు మూడు రాజధానులు, శాసన మండలి రద్దు అంశాలను ప్రస్తావించారు. అలాగే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించటంతో సీఎం జగన్ సక్సెస్ అయ్యారు. ప్రధానితో భేటీ తర్వాత ప్రభుత్వంతో పాటు వైసీపీ కూడా ఫుల్ జోష్ లో ఉంది. ముఖ్యంగా ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆందోళనలు, ఆరోపణలు చేస్తుండటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి అది కూడా ప్రధాని మోడీ వీటిపై సానుకూలంగా వ్యవహరించటం వైసీపీలో ఉత్సాహాన్ని నింపింది.  ప్రధానితో జరిగిన భేటీలో ప్రస్తావించిన మూడు రాజధానులు శాసనమండలి రద్దుతో పాటు హైకోర్టు తరలింపు వ్యవహారాలను కేంద్ర హోంశాఖ పర్యవేక్షిస్తోంది. ఇందులో భాగంగానే హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ ప్రత్యేక భేటీ కోసం మళ్లీ ఢిల్లీ వెళుతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ చట్టం, కర్నూలు జుడీషియల్ రాజధాని ప్రకటనతో హై కోర్టు తరలింపు వ్యవహారానికి సంబంధించిన అంశాలను అమిత్ షాతో చర్చిస్తారు. మహిళల రక్షణ కోసం అమలు చేస్తున్న దిశా యాక్టుతో పాటు రాష్ట్ర విభజనకు సంబంధించిన తొమ్మిది, పది షెడ్యూల్స్ అంశాలు కూడా చర్చించనున్నారు.  అమిత్ షాతో భేటీ తర్వాత మరికొందరు కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానితో భేటీలో రెవెన్యూ లోటు, విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, కడప స్టీల్ ప్లాంట్ అంశాలున్న నేపథ్యంలో ఆయా మంత్రిత్వ శాఖల మంత్రులతో భేటీ అయ్యే అవకాశముంది. అవసరమైతే ఇవాళ రాత్రి ఢిల్లీలోనే బస చేసి, రేపు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ ను కలవనున్నట్లు సమాచారం. మొత్తానికి కేంద్రంతో రెండు రోజులుగా సాగుతున్న చర్చలు, సానుకూల ధోరణి అధికార పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మూడు నెలలుగా ప్రతిపక్షాలతో ఎదురవుతున్న అడ్డంకులు, అవరోధాలు తొలగిపోతే పాలనపై పూర్తి దృష్టి సారించే అవకాశాలుంటాయని భావిస్తోంది.

YCP MLAs Upset Over Officials Negligence in Vizianagaram

మమ్మల్ని డమ్మీ ఎమ్మెల్యేలను చేశారంటూ తెగ ఫీలైపోతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!!

2014 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోల్చితే 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ తో విజయనగరం జిల్లా రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. తొమ్మిదికి తొమ్మిది స్థానాలను వైసీపీ గెలుచుకుంది, ఇంకేముంది పార్టీ కూడా అధికారంలోకి రావడంతో చక్రం తిప్పాలని అనుకున్నారు ఎమ్మెల్యేలు. గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా అయితే టిడిపి నేతల హవా నడిచిందో అదే విధంగా చేద్దామని వీళ్లు కూడా భావించారు కానీ, వారి ఆశలు అడియాసలయ్యాయట.  2014 ఎన్నికల్లో జిల్లాలో టిడిపి ఆరు, వైసిపి మూడు చోట్ల గెలిచింది. సుజయ కృష్ణ రంగారావు టిడిపిలో చేరి మంత్రి అయ్యారు, అప్పట్లో టిడిపి ఎమ్మెల్యేలు ఏది చెబితే అది జరిగేది అని అంటారు. పింఛన్ లు, ఇళ్ల కేటాయింపులు, వెనుకబడిన తరగతులకు లోన్లు, ఔట్ సోర్సింగ్ నియామకాల్లో టిడిపి శాసన సభ్యుల హవా నడిచేదట. వైసిపి ఎమ్మెల్యేలున్న చోట కూడా టిడిపి నేతలు చెప్పినదానికే అధికారులు ఊ కొట్టేవారట. ఇదంతా చూసిన వైసీపీ నేతలు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలాగే చేయాలని కలలు కన్నారు. అయితే సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజాప్రతినిధుల పాత్ర పరిమితం చేయడంతో వైసీపీ ఎమ్మెల్యేల గొంతులో పచ్చి వెలక్కాయ పడిందని టాక్. అవినీతికి ఆస్కారం లేకుండా వాలంటీర్ల సాయంతో నిజమైన లబ్దిదారుల ఎంపిక జరుగుతుండటంతో తమకు పని లేకుండా పోయిందని అనుచరుల దగ్గర చెప్పుకుని ఎమ్మెల్యేలు వాపోతున్నారట. అంతా అధికారుల కనుసన్నల్లోనే సంక్షేమ పథకాల కేటాయింపులు జరగడం, డిజిటల్ పద్ధతిలోనే లబ్దిదారుల ఎంపిక నిర్వహిస్తుండటంతో తామంతా డమ్మీలం అయినట్లు శాసనసభ్యులు మధనపడుతున్నారట.  సామాన్య ప్రజలు, పార్టీ కార్యకర్తలు వచ్చి తమకు పింఛన్ లు ఇప్పించాలని ఇంకో పథకంలో లబ్ధి చేకూర్చాలని కోరినా చేయలేకపోతున్నారట. పనేదైనా ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా గ్రామ సచివాలయం, జిల్లా కలెక్టర్ స్థాయిలోనే పరిష్కారమవుతుండడంతో జనాలు కార్యాలయాల చుట్టూనే తిరుగుతున్నారట. గతంలో అధికారుల బదిలీలు. పోస్టింగ్ ల విషయంలో ఎమ్మెల్యే సిపార్సు లేఖలకు డిమాండ్ ఉండేది. ఎమ్మెల్యేలు కూడా తమకు నచ్చిన అధికారిని నియోజకవర్గానికి తెచ్చుకునేవారు. ప్రస్తుతం అమరావతి పరిధిలోనే ట్రాన్సఫర్స్ జరుగుతున్నాయని, మరికొన్ని మంత్రుల కనుసన్నల్లో జరిగిపోతున్నాయని అంటున్నారు. దీంతో సొంత పనులు సైతం ఎవరినో ఒకరిని అడుక్కునే పరిస్థితి నెలకొందని కుమిలిపోతున్నారట అధికార పార్టీ ఎమ్మెల్యేలు. పరిస్థితి ఇలానే ఉంటే వచ్చే ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగగలమని తమలో తామే ప్రశ్నించుకుంటున్నారట శాసన సభ్యులు.

Ratan Tata reveals his own Love Story

ప్రేమించా...పెళ్లి వరకు వెళ్లా...కానీ... రతన్ టాటా ప్రేమకథ...

టాటా సన్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ప్రేమ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వయంగా రతన్ టాటా చెప్పిన తన రియల్ లవ్ స్టోరీ కావడంతో నెటిజన్లు విపరీతంగా ఆసక్తి చూపుతున్నారు. హ్యూమన్స్ ఆఫ్ బాంబే అనే ఫేస్ బుక్ పేజీలో తన ప్రేమ కథను పంచుకున్న రతన్ టాటా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అమెరికా లాస్ ఏంజెల్స్ లోని కార్నెల్ వర్సిటీలో చదువుతున్న రోజుల్లో ఓ అమ్మాయితో ప్రేమాయణం సాగించినట్లు తెలిపారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే వ‌ర‌కు త‌మ రిలేష‌న్ వెళ్లింద‌న్నారు. అయితే, ఆ స‌మ‌యంలో త‌న‌ బామ్మ ఆరోగ్యం స‌రిగా లేక‌పోవ‌డంతో ఇండియాకు తిరిగి వ‌చ్చాన‌ని, అదే స‌మ‌యంలో ఇండో చైనా యుద్ధం జ‌ర‌గ‌డం వ‌ల్ల ప‌రిస్థితులు తారుమారైన‌ట్లు చెప్పారు. త‌న‌తోపాటు ఇండియాకు తన ప్రేయసి వస్తుందని భావించానని, కానీ యుద్ధం నేప‌థ్యంలో ఆ అమ్మాయి పేరెంట్స్ ఆమెను ఇండియాకు పంపేందుకు నిరాక‌రించిన‌ట్లు ర‌త‌న్ చెప్పారు. ఆ కార‌ణంగానే రిలేష‌న్ తెగిపోయింద‌న్నారు.   రతన్ టాటా తన లవ్ స్టోరీతోపాటు తన బాల్యం, అలాగే తన కుటుంబ పరిస్థితుల గురించి నెటిజన్లతో పంచుకున్నారు. దాంతో, క్షణాల్లో అవి వైరల్ గా మారాయి. పలువురు నెటిజన్లు అయితే, దేశం మీకు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటోంది... అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Newcastle Disease in Andhra Pradesh

గోదావరి జిల్లాల్లో డేంజర్ వైరస్... భయంతో వణికిపోతున్న జనం...

ప్రపంచాన్ని కరోనా వణికిస్తే... ఉభయగోదావరి జిల్లాలను మాత్రం వీవీఎన్డీ వైరస్ భయపెడతోంది. కరోనా దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతుంటే... వీవీఎన్డీ వైరస్ దెబ్బకు వందలకొద్ది బాయిలర్ కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అయితే, బాయిలర్ కోళ్లకు సోకుతున్న వీవీఎన్డీ వైరస్ కారణంగా చికెట్ అమ్మకాలను నిలిపివేశారు. వీవీఎన్డీ వైరస్ సోకిన కోళ్లను తింటే జనం రోగాల బారినపడే ప్రమాదం ఉండటంతో పశ్చిమగోదావరి జిల్లాలో చికెన్ హాలీడే ప్రకటించారు. ముఖ్యంగా తణుకులో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో వారంరోజులపాటు చికెన్ అమ్మకాలను నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు ప్రాంతంలో బాయిలర్ కోళ్లు, ఫౌల్ట్రీ కోళ్లు వీవీఎన్డీ వైరస్ బారినపడి పిట్టల్లా రాలిపోతుండటంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా చనిపోయిన కోళ్లను ఊళ్లకు దూరంగా తీసుకెళ్లి మట్టిలో పూడ్చిపెడుతున్నారు. అయితే, ఒక్క తణుకులోనే కాకుండా పశ్చిమగోదావరి జిల్లాలో పలుచోట్లకు ఈ వైరస్ వ్యాపించిందని అంటున్నారు. దాంతో, వీవీఎన్డీ వైరస్ సోకకుండా కోళ్లకు ముందే టీకాలు వేయిస్తున్నారు రైతులు. అయితే, వీవీఎన్డీ వైరస్ వార్తలతో ఉభయగోదావరి జిల్లాల్లో చికెన్ అమ్మకాలు పడిపోయాయి. చికెన్ తినడానికి జనం భయపడిపోతున్నారు. అయితే, కోడి మాంసాన్ని  100 డిగ్రీల వేడిలో వండి తినేవారికి ఎలాంటి అనారోగ్యం కలగదని డాక్టర్లు చెబుతున్నారు. కానీ, ఇప్పటికే ఒకపక్క కరోనా వైరస్ కల్లోలం కలవరం పుట్టిస్తుండటంతో... చికెన్ తినడానికి జనం భయపడుతున్నారు.

Over Rs 2000 Crore Uncovered In IT Raids In AP and Telangana

2వేల కోట్ల అక్రమాలు... ఐటీశాఖ సంచలన ప్రకటన...

తెలుగు రాష్ట్రాల్లో జరిపిన సోదాలపై ఐటీశాఖ ప్రకటన చేసింది. ఏపీ, తెలంగాణతోపాటు ఢిల్లీ, పుణె సహా 40 చోట్ల సోదాలు నిర్వహించినట్లు తెలిపిన ఆదాయపు పన్నుశాఖ... వేల కోట్ల అక్రమాలను గుర్తించినట్లు వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖలో దాడులు జరిపినట్లు తెలియజేసిన ఐటీ అధికారులు.... తెలుగు రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేస్తున్నట్లు ప్రకటించింది. ఏపీ, తెలంగాణలో సుమారు 2వేల కోట్ల రూపాయల అవకతవకలను గుర్తించినట్లు ప్రకటనలో పేర్కొంది. ముఖ్యంగా మూడు ఇన్ ఫ్రా కంపెనీల్లో నకిలీ బిల్లులను గుర్తించామని, అలాగే, లెక్కచూపని 85లక్షల నగదును, 71లక్షల విలువైన ఆభరణాలను తమ సోదాల్లో స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఓ ప్రముఖుడి మాజీ వ్యక్తిగత కార్యదర్శి నివాసంలోనూ తనిఖీలు జరిపినట్లు తెలిపింది. ఇక, బోగస్ సబ్ కాంట్రాక్టర్లు నకిలీ బిల్లుల ద్వారా పెద్దఎత్తున నగదు చలామణి చేసినట్లు గుర్తించినట్లు ఐటీశాఖ ప్రకటించింది. అదేవిధంగా 25 బ్యాంక్ లాకర్లు సీజ్ చేసినట్లు తెలిపింది.  ఫిబ్రవరి ఆరు నుంచి దాదాపు వారం రోజులపాటు సాగిన ఐటీ సోదాల్లో విస్మయకర వాస్తవాలు బయటపడ్డాయి. బోగస్‌ సబ్‌ కాంట్రాక్టులు, తప్పుడు బిల్లులతో అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 2వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్టు అంచనా వేసింది. దాడుల్లో భాగంగా పలు కీలక పత్రాలు, ఖాళీ బిల్లులు, ఈ-మెయిల్స్‌, వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా జరిపిన లావాదేవీలతోపాటు విదేశీ లావాదేవీల వివరాలను సైతం గుర్తించినట్లు పేర్కొంది ఏపీ‌, తెలంగాణలో మూడు ఇన్‌ఫ్రా కంపెనీల కార్యాలయాలపై దాడులు జరిగాయి. అయితే, ఒక ప్రముఖ వ్యక్తి మాజీ వ్యక్తిగత కార్యదర్శి ఇంటిపై జరిపిన దాడులతో ఈ భారీ రాకెట్ బయటపడినట్లు పేర్కొంది. ఉనికిలో లేని కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్టు పత్రాలు సృష్టించినట్లు వెల్లడించింది. పన్ను లెక్కలకు దొరకకుండా డొల్ల కంపెనీల ద్వారా 2కోట్ల లోపు చిన్న మొత్తాల రూపంలో నిధులను దారి మళ్లించినట్లు గుర్తించింది. ప్రధాన కార్పొరేట్ సంస్థ ఐపీ అడ్రస్ నుంచి సబ్ కాంట్రాక్టర్లు, ప్రధాన కాంట్రాక్టర్లు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లు గుర్తించామని... గ్రూపు కంపెనీలకు కోట్ల రూపాయల అనుమానిత విదేశీ పెట్టుబడులు వచ్చినట్టు వెల్లడైందని పేర్కొంది.

Son in law of Infosys Murthy named UK finance minister

బ్రిటన్ ఆర్ధికమంత్రిగా భారతీయుడు...

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్‌కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ ఆర్ధికమంత్రిగా రిషి సునక్‌‌ నియమితులయ్యారు. ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ సజిద్ జావిద్ రాజీనామా చేయడంతో రిషిని తన కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. భారత సంతతికి చెందిన రిషి సునక్‌... బ్రిటన్‌లోని హాంప్‌షైర్‌లో జన్మించారు. 2014లో రాజకీయాల్లోకి వచ్చిన రిషి... 2015 ఎన్నికల్లో యార్క్‌షైర్ రిచ్‌మాండ్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు, అనూహ్యంగా బ్రిటన్ ఆర్ధికమంత్రిగా పగ్గాలు చేపట్టి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 39ఏళ్ల రిషి సునక్... ఆక్స్‌‌ఫర్డ్ యూనివర్శిటీ నుంచి ఫిలాసఫీ, రాజకీయాలు, ఎకనామిక్స్‌ పట్టాలు అందుకున్నారు. ఆ తర్వాత స్టాన్ ఫర్డ్‌ వర్శిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో చదువుకుంటున్నప్పుడే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షత పరిచయం కావడంతో... ఆ తర్వాత స్నేహం ప్రేమగా మారడంతో 2009లో వివాహం చేసుకున్నారు. రిషి, అక్షతకు ఇద్దరు ఆడపిల్లలు. అయితే, రిషి సునక్ రాజకీయాల్లోకి రాకముందు పలు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకుల్లో పనిచేశారు. గోల్డ్‌మ్యాన్ సచ్ కంపెనీలో విశ్లేషకుడిగా సేవలు అందించారు. ఇక, ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కాటమారన్‌లోనూ రిషి సునక్ డైరెక్టర్ గా ఉన్నారు.

AP Governor prorogues AP legislative council and assembly

కేపిటల్‌ గేమ్‌కు ఎండ్ కార్డు... జగన్ సర్కార్ ఆర్డినెన్స్ అస్త్రం..! ఢిల్లీ వేదికగా టీడీపీ కౌంటర్

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఆట క్లైమాక్స్‌‌కి చేరింది. అధికార, ప్రతిపక్షాల మధ్య రెండు నెలలుగా సాగుతున్న కేపిటల్‌ గేమ్‌కు ఎండ్ కార్డు పడబోతోంది. మూడు రాజధానులపై పంతం నెగ్గించుకునేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్న జగన్ ప్రభుత్వానికి.... అసెంబ్లీ ప్రోరోగ్ వరంగా మారింది. దాంతో, మూడు రాజధానులపై పంతం నెగ్గించుకునేందుకు జగన్ సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను అడ్డుకున్నారన్న కోపంతో ఇప్పటికే మండలి రద్దుకు తీర్మానం చేసిన ప్రభుత్వం... సెలెక్ట్ కమిటీ ఫైల్‌ ముందుకు కదలకుండా పావులు కదిపింది. ఇక, వీలైనంత త్వరగా మండలి రద్దు జరిగిపోయేలా సీఎం జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ టూర్‌లో మూడు రాజధానుల ఆవశ్యకతను ప్రధాని మోడీకి వివరించిన జగన్మోహన్‌రెడ్డి... మండలి రద్దు ప్రక్రియను పూర్తి చేయాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చర్చించనున్నారు. అయితే, సర్కారు వ్యూహాన్ని పసిగట్టిన తెలుగుదేశం... కౌంటర్ గేమ్ మొదలుపెట్టింది. జగన్ సర్కారు స్టెప్స్‌‌కు దీటుగా టీడీపీ అడుగులు వేస్తోంది. రాజకీయ కక్షతోనే మండలి రద్దుకు జగన్ ప్రభుత్వం తీర్మానం చేసిందంటూ కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది. ఢిల్లీ వెళ్లనున్న టీడీపీ ఎమ్మెల్సీలు.... రాష్ట్రపతితోపాటు కేంద్ర పెద్దలను కలిసేందుకు అపాయింట్ మెంట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. దాంతో, కేపిటల్‌పై అధికార, ప్రతిపక్షాల ఎండ్ గేమ్‌ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇదిలా ఉంటే, ఏపీ శాసనసభ, శాసనమండలిని గవర్నర్ ప్రోరోగ్ చేయడంతో మూడు రాజధానులపై ముందుకెళ్లేందుకు జగన్ ప్రభుత్వానికి వెసులుబాటు దొరికింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై ఆర్డినెన్స్‌‌కు అవకాశం లభించింది. అయితే, రాజధాని ఇష్యూ కోర్టుల్లో ఉండగా ఆర్డినెన్స్‌ ఇవ్వడం సాధ్యంకాదని టీడీపీ వాదిస్తోంది. కానీ, జగన్ ప్రభుత్వం ...ప్లాన్ Aతోపాటు ప్లాన్ Bని కూడా రెడీ చేసుకుందని చెబుతున్నారు. ప్లాన్ A ప్రకారం... రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించుకోవడం... అది, కుదరకపోతే ప్లాన్ Bని తెరపైకి తీసుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకురావాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే, తాము చెప్పేవరకు కార్యాలయాలను తరలించొద్దంటూ హైకోర్టు ఖరాకండిగా తేల్చిచెప్పడంతో ఆర్డినెన్స్ ద్వారా రాజధాని తరలింపు సాధ్యమేనా? అనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. మరోవైపు, సెలెక్ట్ కమిటీలపై జాప్యంచేస్తే చర్యలు తప్పవంటూ మండలి ఛైర్మన్ హెచ్చరికలు పంపడాన్ని సీరియస్‌‌గా తీసుకున్న ప్రభుత్వం... న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. మొత్తానికి, రాజధాని షిఫ్టింగ్‌కు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్న జగన్ ప్రభుత్వం... అసెంబ్లీని ప్రోరోగ్‌ చేయడంతో తర్వాతి స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయన్నది ఉత్కంఠ రేపుతున్నాయి.

ఆట మొదలైంది.. ఏపీ అసెంబ్లీ, శాసనమండలి ప్రోరోగ్‌!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి ప్రోరోగ్‌ అయ్యాయి. ఉభయ సభలను ప్రోరోగ్‌ చేస్తూ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ప్రోరోగ్‌ చేసిన నేపథ్యంలో పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఆర్డినెన్స్‌ తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రోరోగ్ ఉత్తర్వులతో వైసీపీ ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించినట్టయింది. బిల్లులు శాసనమండలి ముందున్న సమయంలో సభలను ప్రోరోగ్ చేయడం వల్ల.. ఆర్డినెన్స్ జారీకి ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. బిల్లులు సభ ముందు ఉండగానే ఆర్డినెన్స్ జారీ చేసిన సందర్భాలు రాజ్యసభలోనూ, వివిధ అసెంబ్లీల్లోనూ ఉందంటూ ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ట్రిపుల్ తలాఖ్ వంటి బిల్లులు రాజ్యసభ ముందున్నా, కేంద్రం  ఆర్డినెన్స్ తెచ్చిందని సచివాలయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. పార్లమెంట్ ఆమోదించిన 2013 భూసేకరణ చట్టం విషయంలోనూ సవరణల కోసం రెండు సార్లు కేంద్రం ఆర్డినెన్సులు జారీ చేసిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి, ఉభయ సభలు ప్రోరోగ్ కావడంతో మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టం రద్దు అంశాలను అమల్లో పెట్టేందుకు ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేయనుంది.

గాంధీ గుట్టు ఒక్కొక్కటిగా వెలుగులోకి..

తెలంగాణలోని గాంధీ ఆసుపత్రి లోగుట్టు ఒక్కొక్కటిగా బయటపడుతోంది. తాజాగా డాక్టర్ వసంత్ గాంధీలో జరిగే అక్రమాలను బయటపెట్టాడు. ఆ తర్వాత ఆయన సస్పెన్షన్ తో అనేక అవినీతి, అక్రమాల బయటకు పొక్కుతున్నాయి. ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకుంటూ కొట్టిపారేస్తున్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్. గాంధీ ఆసుపత్రిలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమేనని శ్రవణ్ అంటున్నారు.  కరోనాపై తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలతో సస్పెండైన గాంధీ ఆస్పత్రి వైద్యుడు వసంత కుమార్ వ్యవహారం ఎవరూ ఊహించని మలుపులు తిరుగుతోంది. డాక్టర్ వసంత్ చేసిన ఆరోపణలు ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి. రెండేళ్లుగా గాంధీలో బయో మెట్రిక్ సిస్టం పని చేయడం లేదని మరో సంచలనాంశం వెలుగులోకి వచ్చింది. విధుల్లోకి వస్తున్న వైద్యులు ఎవరో కూడా తెలియని పరిస్థితి గాంధీలో నెలకొన్నదని వసంత్ చెప్తున్నదాన్ని బట్టి చాలా మంది వైద్యులు అసలు విధులకు రావడం లేదని కూడా సమాచారం అందుతుంది. అలాగే.. డ్యూటీలకు రాకపోయినా సరే.. శాలరీలు మాత్రం మొత్తంగా దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వసంత్ చుట్టూ అవినీతి ఆరోపణలు కమ్ము కుంటున్నాయని మెడికల్ సిబ్బందిని దుర్భాషలాడిన ఫోన్ రికార్డింగ్ లు కూడా వెలుగులోకి వచ్చాయి. అదేవిధంగా గాంధీ ఘటన నేపథ్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వసంత్ చేసిన ఆరోపణలపైనా కమిటీ విచారణ జరుపుతోంది. అయితే గాంధీ సూపరింటెండ్ శ్రవణ్ మాత్రం వసంత్ ని ఓ అక్రమాల కోరుగా తెలిపపడమే కాకుండా మెడికల్ షాపులో కూర్చొని తప్పుడు బర్త్ సర్టిఫికెట్ల జారీ చేస్తున్న దృశ్యాలను విడుదల చేశారు. కాగా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన డాక్టర్ వసంత్ గాంధీ హాస్పిటల్ పై, అందులో ఉన్న నిష్ణాతులైన వైద్యులపై అనేక ఆరోపణలు చేశారు. అలాగే.. వారు ఒక్కరోజు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోడమే కాక వారి వేతనాలు తగ్గించి తీవ్రంగా దండించే వారని కూడా డాక్టర్ వసంత్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో హౌస్ సర్జన్ సర్టిఫికెట్ల జారీలో భారీ కుంభకోణం జరిగిందని, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ పాత్ర ఇందులో ఉందని ఆయన ఆరోపించారు.

నల్లమలలో గుప్త నిధుల కోసం తవ్వకాలు.. టీఆర్ఎస్ నేత అరెస్ట్!

నల్లమల అడవుల్లో మరోసారి గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం దౌలాపూర్ లో బౌరాంబా దేవి ఆలయంలో దుండగులు విధ్వంసం సృష్టించారు. గుప్త నిధుల కోసం చెంచుల ఆరాధ్య దైవమైన భ్రమరాంబ విగ్రహాన్ని తొలగించారు. అయితే స్థానిక చెంచులు ఈ నిందితుల ముఠాను పట్టుకొని అటవీ శాఖాధికారులకు అప్పగించారు. ఈ ముఠాలో తిరుమలేశ్‌ నాయుడు అనే వ్యక్తి ఉన్నాడు. అతడు హైదరాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ ముఖ్యనేత అనుచరుడుగా తెలుస్తోంది. అసలు వాస్తవానికి అధికారుల కళ్లు గప్పి ఎవరూ ఇక్కడి అడవిలోకి అడుగు పెట్టే పరిస్థితి లేదు. కానీ రాత్రికి రాత్రే ఆలయాల్లో తవ్వకాలు జరిగి పోతున్నాయి. దీంతో ఈ తవ్వకాల వెనుక ఇంటి దొంగల పాత్ర కూడా ఉందనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.  గతంలో ఓసారి ఫారెస్టు అధికారులు కొందరు భ్రమరాంబిక దేవాలయంలో గుప్త నిధుల తవ్వకాలు జరిపారని చెంచు వాచర్స్ ఆరోపిస్తున్నారు. బయటపెడితే తమను ఉద్యోగాల నుంచి తీసేస్తామని కూడా బెదిరించారని వారంతా ఆవేదన  వ్యక్తంచేస్తున్నారు. అంతేకాకుండా అడవిని కాపాడేవారే అక్రమాలకు పాల్పడితే ఎలా అంటూ చెంచు వాచర్స్ ప్రశ్నిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం రాంపూర్ పెంట వద్ద అటవీ శాఖాధికారులు గుప్త నిధుల తవ్వకాలు జరుపుతూ ఉండగా స్థానికులు వారిని బంధించారు. కానీ పైఅధికారుల ఒత్తిడితో వారిని వదిలేశారు. అప్పటి ఆటో కూడా ఇప్పటికీ చెక్ పోస్టు లోనే ఉంది. తాజాగా పట్టుబడిన ముఠా వెనుక కూడా అధికారుల పాత్ర ఉందని అంటున్నారు స్థానికులు. అయితే నిందితులను ప్రశ్నించి వారి వెనుక ఎవరున్నారో తెలుసుకొని పటిష్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడిస్తున్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారానికి కేవలం ఐదే పనిదినాలు

మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో రెండు రోజుల పాటు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. మహారాష్ట్రలో పని చేస్తున్న ప్రభుత్వం సెమీ గవర్నమెంట్ ఉద్యోగులు అందరూ ఇక మీదట వారంలో కేవలం ఐదు పనిదినాలే ఉండబోతున్నాయి. తాజాగా సీఎం ఉద్దవ్ థాక్రే అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని.. ఇక నుంచి వీరందరికీ వారంలో రెండు రోజుల పాటు సెలవులూ అమలు కానున్నాయని అన్నారు. అదే విధంగా ఓబీసీ, ఎస్సీబీసీ, వీజేఎన్టీ అన్నిటికీ ప్రత్యేక డిపార్ట్ మెంట్ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది క్యాబినెట్. అలాగే.. వెనకబడిన వర్గాల అన్నింటికీ కలిపి బహుజన్ కల్యాణ్ అనే పేరుతో కొత్త శాఖను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా మహారాష్ట్ర లోని అన్ని కాలేజీల్లో జాతీయ గీతం ఆలాపనను తప్పని సరి చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆదేశాలు శివాజీ జయంతి రోజైన ఈ నెల 19 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ప్రతి రోజూ ఉదయం అన్ని కాలేజీలలో తరగతులు ప్రారంభించడానికి ముందు జాతీయ గీతం ఆలపించేలా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు అన్ని కాలేజీలకూ పంపనుంది ప్రభుత్వం. దీనిని అమలు చేసేందుకు ఇప్పటికే అన్ని కాలేజీలూ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం అందుతుంది. ఇప్పుడు ఈ ఆదేశాల ద్వారా మహారాష్ట్ర కాలేజీల్లో చదువుకుంటున్న 15 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులు తప్పకుండా జాతీయ గీతాలాపన ప్రతి రోజూ చేస్తారు. దీంతో జాతీయ గీతాలాపన తప్పని సరి చేస్తూ దేశంలోనే ఏకైక రాష్ట్రంగా మహారాష్ట్ర నిలవనుంది. విద్యార్ధుల్లో దేశ భక్తి జాతీయ భావాలను పెంపొందించేందుకు ఈ నిర్ణయం దోహద పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.