వైసీపీ రాజ్యసభ రేసులో మెగాస్టార్, మాజీ న్యాయమూర్తి?
వైసీపీలో రాజ్యసభ రేస్ మొదలైంది. ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు త్వరలో ఖాళీ కానున్నాయి. అసెంబ్లీలో పార్టీల బలాబలాల ప్రకారం ఆ నాలుగు సీట్లూ అధికార వైసీపీకే దక్కనున్నాయి. దాంతో, రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకునేందుకు పలువురు పోటీ పడుతున్నారు. అయితే, ఖాళీ అవుతోన్న ఆ నాలుగు స్థానాల్లో మూడింటికి ఆల్రెడీ అభ్యర్ధులు ఖరారైనట్లు తెలుస్తోంది. నాలుగో అభ్యర్ధి ఎంపికపైనే తర్జనభర్జనలు జరుగుతున్నాయంటున్నారు. అయితే, మొదట్లో వినబడిన పేర్లు ఇఫ్పుడు సైడైపోయాయి. ఎందుకంటే, ఇటీవల పార్టీలో చేరిన బీద మస్తాన్ రావు, అలాగే గోకరాజు గంగరాజు తనయుడు గోకరాజు రంగరాజుకి రాజ్యసభ సభ్యత్వాలు దాదాపు ఖరారైనట్లు మొదట్లో ప్రచారం జరిగింది. అలాగే, మూడో అభ్యర్ధిగా అయోధ్యరామిరెడ్డి పేరు ఫైనలైజ్ చేశారని అన్నారు. ఇక, నాలుగో సీటును ఎస్సీలకు కేటాయిస్తారని లీకులిచ్చారు. అయితే, ఇఫ్పుడు పాధాన్యతాక్రమం మారిపోయింది. వైసీపీకి దక్కనున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో.... ఒకటికి రెడ్డికి... మరొకటి కాపుకి... అలాగే, మూడోది కమ్మకి... నాలుగోది దళితులు లేదా వెలమ లేదంటే ముస్లింలకు ఇవ్వాలనే జగన్ ఆలోచనగా చెబుతున్నారు.
ముఖ్యంగా, కాపు కోటాలో మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం దక్కనుందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధిస్తున్న చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం ద్వారా పవన్ కల్యాణ్ కు చెక్ పెట్టొచ్చన్నది వైసీపీ ఆలోచనగా తెలుస్తోది. ఇక, కమ్మ కోటాలో... సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ కు రాజ్యసభ సభ్యత్వం దక్కొచ్చని అంటున్నారు. ఇటీవల తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి జాస్తి చలమేశ్వర్ కలవడంతో అతనికి రాజ్యసభ సభ్యత్వం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇక, రెడ్డి కోటాలో బడా పారిశ్రామికవేత్త అయోధ్యరామిరెడ్డి పేరు మొదట వినిపించినా, ఇఫ్పుడు సడన్ గా మెగా కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇక, నాలుగవది ఎవరో తేల్చాల్సి ఉంది.
అయితే, అవగాహనలో భాగంగా బీజేపీకి రెండు రాజ్యసభ సీట్లను కేటాయిస్తే మాత్రం ఈ లెక్కల్లో తేడాలు వచ్చే అవకాశముంది. ఒకవేళ, ఎన్డీఏలో వైసీపీ చేరితే రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయని, ఒకటి రెడ్డికి... రెండోది ఎస్సీకి కేటాయిస్తారని అంటున్నారు. అదే జరిగితే, వైసీపీకి దక్కనున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.