Who is Zulfi Ravdjee

లోగుట్టు పెరుమాళ్ళకెరుక.. గల్ఫ్ లో జుల్ఫీ చేసే పనేంటి?

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గత తొమ్మిది నెలలలో కొన్నివేల రహస్య జీవోలు విడుదలయ్యాయి. ప్రభుత్వం తీసుకొనే కొన్ని నిర్ణయాలు వ్యతిరేకత తెచ్చే ప్రమాదం ఉందనుకుంటుంటే వాటిని రహస్యంగా ఉంచడం ప్రతి ప్రభుత్వం చేసే పనే అయినా జగన్ ప్రభుత్వం ఇందులో ఎప్పుడో పరిధులు దాటేసింది. అయితే, గత ఏడాది నవంబర్ 13వ తేదీన విడుదల చేసిన ఒక రహస్య జీవో వివరాలు తాజాగా బయటకొచ్చాయి. ఆ జీవో ఆర్ టీ 2561 ప్రకారం ఏపీ ప్రభుత్వం గల్ఫ్ దేశాలను కవర్ చేసేలా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఓ వ్యక్తిని మిడిల్ ఈస్ట్‌కు ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. ఆయన పేరు జుల్ఫీ రవ్‌డిజీ. ఆయనెవరో సామాన్యులెవరికీ తెలియదు కానీ ఆయనకు ఏపీలో ఉన్న మంత్రులకు ఉండే అధికారాలన్నీ కట్టబెడుతూ పదవి ఇచ్చారు. ఒక్క ఈయనే కాదు.. గల్ఫ్ దేశాలే కాదు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు సంబంధించి చాలా మందికి పదవులను పంచి పెట్టింది. వాళ్లందరికీ క్యాబినెట్ ర్యాంక్ కూడా ఇచ్చేశారు. అయితే ఈ జుల్ఫీ రవ్‌డిజీ అనే వ్యక్తి మాత్రం అటు ఏపీ ప్రజలకే కాదు ప్రముఖులకు.. ప్రభుత్వంలో పనిచేసే ఉన్నతాధికారులకు కూడా తెలియదు. పోనీ ప్రభుత్వం ఇచ్చిన ఆ రహస్య జీవోలో అయినా చెప్పారా అంటే అది కూడా ఎక్కడా ఒక్క ముక్క కూడా లేదు. ఆయన ఏ రంగానికి చెందిన వ్యక్తి? ఆయనను నియమించడానికి గల కారణాలేమిటి? అయన నిర్వహించాల్సిన విధులు ఏంటి? అయన ఆయా దేశాలలో ఎవరెవరిని కలుస్తారు? ఏ బాధ్యతలను నిర్వర్తిస్తారు? అన్న విషయాలేమీ ఆ జీవోలో లేవు. కేవలం క్యాబినెట్ ర్యాంక్ అధికారాలతో పాటు అదే స్థాయిలో ఇచ్చే జీతభత్యాల వివరాలు మాత్రమె ఇచ్చారు. అయితే, ఈ జీవో ఇప్పుడు బయటపడగానే రాజకీయ, అధికార వర్గాల్లో చర్చ మొదలైంది. గత ఏడాది జులై నెలలో పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఆ అరెస్ట్ జరిగిన మూడు నెలలకు జీవో విడుదల జరిగింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో నివాసి అయిన ఆ వ్యక్తి కూడా గల్ఫ్ దేశాలలోనే విధులను నిర్వర్తించనున్నారు. ఇప్పటికి ఆయనను ఏపీ ప్రభుత్వం నియమించి ఆరు నెలల కాలం జరగగా ఈ సమయంలో అయన ఎవరిని కలిశారు.. ఏపీకి ఏం ప్రయోజనం సమకూర్చారు? అన్నది సస్పెన్స్ గా కొనసాగుతుంది. అయితే అసలు గత ఆరు నెలలుగా రహస్యంగా ఉన్న జీవోను ఇప్పుడు ఎందుకు బయటకు తెచ్చారు? ప్రభుత్వంలోని వ్యక్తులే బయటపెట్టారా? దానివెనుక ఉన్న మతలబు ఏంటో అన్నది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉండగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ప్రతిపక్షం నిమ్మగడ్డ ఇప్పటికే అరస్టైన రస్ అల్ ఖైమా కేసుతో ఈ జీఓ ముడిపెడుతూ ఆ కేసుకు సంబంధించి వ్యవహారం నడిపెందుకే  జుల్ఫీ ని నియమించుకున్నారని, అందుకే ఈ జీఓ రహస్యంగా ఉంచారని డంకా భజాయించి మరీ చెప్తోంది.  

Reasons behind Mukesh Ambani meet with YS Jagan

క్లోజ్డ్ డోర్‌లో జ‌రిగిన మంత‌నాలేమిటి? అస‌లు అంబానీ ఎందుకు వ‌చ్చారు?

ఇద్ద‌రి మ‌ధ్య డీల్ డ‌న్ అయ్యిందా?   ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ భేటీ పై రాష్ట్రంలో ఆస‌క్తిక‌రంగా మైన చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తంలో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మృతి వెనుక రిల‌య‌న్స్ కుట్ర వుందంటూ గ‌గ్గోలు పెట్టిన వారే ఇప్పుడు చేతులు క‌లుపుతారా? బ‌బాయి వివేకానంద‌రెడ్డి హ‌త్య ఉదంతంపై కేసు ఓ కొలిక్కి రాలేదు. ఇప్పుడేమో తండ్రిని చంపిన‌వారితో జ‌గ‌న్ మంత‌నాలేమిట‌ని పార్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సిఎం జ‌గ‌న్ అంబానీతో ఏం మాట్లాడారు? రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత  ముఖేష్ అంబానీ పర్యటనకు గల కారణాలపై అటు పార్టీలో, ఇటు అధికారుల్లో ఊహాగానాలు వెల్లువెత్తాయి. గన్నవరం విమానాశ్రయంలో దిగేవరకూ అంబానీ వస్తున్నారనే విషయం ఎవరికీ తెలియదు. వాస్తవానికి సీఎం జగన్ షెడ్యూల్ లో అంబానీతో భేటి లేదు. పోనీ పారిశ్రామిక పెట్టుబడుల కోసం కావచ్చు అంటే అదీ లేదు.   ఒక ప‌క్క అంబానీ తనతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికారులను  తీసుకురాలేదు. అంటే ఇది అఫీషియ‌ల్ బిజెనెస్‌కు సంబంధించిన భేటి కాదని తెలిసింది. ముఖేష్ అంబానీతో అతడి కుమారుడు అనంత్ అంబానీ రాజ్యసభ సభ్యుడు పరిమల్ నాత్వానీ ఉన్నారు. మ‌రో ప‌క్క సీఎం జగన్ - ముకేష్ అంబానీల సమవేశానికి ప్రభుత్వ అధికారులు ఎవరూ లేరు. ఇది పూర్తిగా ప్రైవేటు భేటి అని తెలిసింది. ఏప్రిల్ లో జ‌ర‌గ‌నున్న రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో  పరిమల్ నాత్వానీని ఏపీ కోటాలో వైసీపీ తరుఫున రాజ్యసభకు పంపడానికి నామినేట్ చేయాలని సీఎం జగన్ ను కోరడానికే ముఖేష్ అంబానీ వచ్చినట్టు తెలుస్తోంది. పరిమల్ నాత్వానీ జార్ఖండ్ రాష్ట్రం నుంచి రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. బీజేపీ జార్ఖండ్ లో దారుణంగా ఓడిపోవడంతో ఈసారి అక్కడి నుంచి నాత్వానీ రాజ్యసభకు వెళ్లడం కష్టం. అందుకే ముకేష్ అంబానీయే కదిలివచ్చి సీఎం జగన్ ను ఒక రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరినట్టు ప్రచారం సాగుతోంది.  వైసిపి త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యే అభ్య‌ర్థుల జాబితాలో రిల‌య‌న్స్ అభ్య‌ర్థికి చోటు ద‌క్కుతుందా? అయితే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఈ ప్ర‌తిపాద‌న‌కు ఎలా రియాక్ట్ అయ్యార‌న్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

sbi home loan interest rates fall down

ఇల్లు కొనాలనుకుంటున్నారా?.. ఎస్బీఐ ఆఫర్

ఇల్లు కొనాలనుకుంటున్నారా? అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లు సామాన్య ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. హోమ్ లోన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఎస్బీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది. 7.90 శాతం వడ్డీ రేట్లతో గృహరుణాలు ప్రారంభం అవుతున్నాయని తెలిపింది. పారదర్శకమైన గృహ రుణాల కోసం ఎస్బీఐ హోమ్ లోన్స్ వెబ్ సైట్ను సందర్శించడని ఎస్బీఐ ప్రకటించింది. మరోవైపు ఎస్బీఐ కార్డు ఐపీవో సబ్స్క్రిప్షన్ మార్చి రెండో తేదీన మొదలు కానుంది. ఇప్పటివరకు ఎస్బీఐ కార్డ్ అండ్ పేమెంట్ సర్వీస్ ఎస్బీఐకు అనుబంధ సంస్థగా పనిచేస్తోంది. ఈ ఐపీవో ద్వారా దాదాపు పదివేల కోట్లకు పైగా సమీకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐపీవో ధర రూ.750 నుంచి రూ.755 మధ్య ఉండొచ్చునని భావిస్తున్నారు. దీనిలో మొత్తం 13 కోట్ల వాటాలను ఎస్బీఐ విక్రయిస్తోంది.

AP HC summons DGP over arrest of Chandrababu

డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు హైకోర్టు నోటీస్‌!

టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై దాడి ఘటన పట్ల హైకోర్టు సీరియస్ గా స్పందించింది. స్వయంగా హాజరు కావాలంటూ డీజీపీకి ఆదేశాలు జారీ అయ్యాయి. మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబుపై దాడి చేయడానికి గల కారణాలపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని కోర్టు సూచించింది. దీనిపై డీజీపీ ఇప్పటికే కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసినప్పటికీ.. వ్యక్తిగతంగా హాజరు కావాలని తాజాగా ఆదేశించింది. విశాఖపట్నం విమానాశ్రయం వ‌ద్ద చంద్రబాబుపై కిందటి నెల 27వ తేదీన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తల ఘ‌ర్ష‌ణ మ‌ధ్య చంద్ర‌బాబునాయుడు దాడికి గురిఅయ్యారు.  విమానాశ్రయం నుంచి ఆయన కాన్వాయ్ బయలుదేరకుండా అడ్డు పడ్డారు. కారుపై రాళ్లు, చెప్పులు, కోడిగుడ్లను రువ్వారు. ఈ సందర్భంగా పోలీసులు చంద్రబాబును అరెస్టు చేసి, వెనక్కి తిప్పి పంపించారు. ఈ మొత్తం వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని తప్పు పట్టింది. సిఎం ఆదేశాల మేర‌కు పోలీసులు ఇలా వ్య‌వ‌హ‌రించార‌ని టిడిపి ఆరోపించింది. పోలీసులపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని కోరుతూ గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు పర్యటనకు పోలీసులు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి.. అడ్డుకున్నారని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించారని, తీవ్రమైన నేరాలకు సంబంధించిన సెక్షన్ 151ను చంద్రబాబుపై ప్రయోగించారని అన్నారు. 151 కింద నోటీసులు ఇచ్చి, అరెస్టు చేశారని తన పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్య‌వ‌హారంపై హైకోర్టు కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని గ‌తంలో పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఈ కౌంటర్ అఫిడవిట్‌పై సోమవారం హైకోర్టు విచారణ నిర్వహించింది. పోలీసులు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని, కౌంటర్ అఫిడవిట్‌లో సమగ్ర వివరాలను లేవని అభిప్రాయపడింది. అందుకే డీజీపీకి గౌతమ్ సవాంగ్ స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.

Nara Lokesh Lunch Meet With TDP Young Leaders

నారా లోకేష్ విందు రాజకీయం... భవిష్యత్ పై భరోసా కల్పిస్తూ మీటింగ్

టీడీపీ చరిత్రలో ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇఫ్పటికే తెలంగాణలో తెలుగుదేశం తుడిచిపెట్టుకుపోగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నిలదొక్కుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగుదేశం హిస్టరీలోనే ఎన్నడూలేనివిధంగా అత్యంత దారుణమైన పరాజయం పాలవడంతో, పార్టీని బలోపేతం చేసేందుకు, నేతలకు కాపాడుకునేందుకు చంద్రబాబు, నారా లోకేష్ తీవ్రంగా కష్టపడుతున్నారు. అయితే, ఎంతకాదన్నా, ఎవరు అవునన్నా, కాదన్నా... ముందుముందు తెలుగుదేశం పార్టీకి ముందుకు నడిపించాల్సింది నారా లోకేషే. అందుకే, పార్టీలో పట్టు పెంచుకునేందుకు లోకేష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, పలువురు టీడీపీ సీనియర్ నేతలు వయోభారంతో దాదాపు రాజకీయాల నుంచి తప్పుకునే పరిస్థితి వచ్చింది. దాంతో, ఇప్పటికే ఆయా నేతల వారసులు తెరపైకి వచ్చారు. కొందరు మొన్నటి ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. అదే సమయంలో, టీడీపీని నడిపించాల్సిన నారా లోకేష్... పార్టీలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా భవిష్యత్ పై భరోసా కల్పిస్తూ యువ నాయకులతో ఎక్కువగా టచ్ లో ఉంటున్నారు. అందులో భాగంగానే, టీడీపీ సీనియర్ లీడర్ల వారసులతో నారా లోకేష్ సమావేశమయ్యారు. ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేతలు, ముఖ్యనేతలు, మాజీ మంత్రుల వారసుల్లో కొందరిని ఎంపికచేసి విందు సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశానికి పలువురు యువ నాయకులు హాజరయ్యారు. ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటు పరిటాల శ్రీరాం, టీజీ భరత్, మాగంటి రాంజీ దంపతులు, మాజీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు కుమారులు, కోడళ్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ విందు సమావేశంలో నారా లోకేష్ తోపాటు బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు. అలాగే, చంద్రబాబు, భువనేశ్వరి కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే, యువ నాయకులతో ఎక్కువగా ఇంటరాక్ట్ అయిన నారా లోకేష్ .... భవిష్యత్ టీడీపీదేనని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ భరోసా కల్పించినట్లు తెలుస్తోంది.

ys jagan may get negative image with grama volunteer system

అప్పుడు గ్రామ కమిటీలు... ఇప్పుడు వాలంటీర్లు... 2025లో జగన్ కొంప మునగడం ఖాయమేనా?

టీడీపీ గ్రామ కమిటీలతో చంద్రబాబుకు ఎంత నష్టం జరిగిందో 2019 ఎన్నికల్లో రుజువైంది. తెలుగుదేశం గ్రామ కమిటీ సభ్యుల అతితో పార్టీకి నష్టం జరుగుతోందని, సొంత నేతలు నెత్తీనోరు మొత్తుకున్నా, ఆనాడు చంద్రబాబు వినిపించుకోలేదు. చివరికి, ఏమైంది, 2019లో ఎన్నడూలేనంతగా దారుణమైన ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. తెలుగుదేశం ఘోర పరాజయంలో టీడీపీ గ్రామ కమిటీ సభ్యుల పాత్ర అంత గొప్పది. చంద్రబాబు చేసిన తప్పిదాల కంటే క్షేత్రస్థాయిలో తెలుగుదేశం గ్రామ కమిటీ సభ్యులు చేసిన నష్టమే ఎక్కువ. అంతలా టీడీపీ కొంప ముంచారు వాళ్లు. అయితే, టీడీపీ గ్రామ కమిటీ సభ్యుల తరహాలోనే.... గ్రామ వాలంటీర్లు త్వరలో జగన్ కొంప ముంచడం ఖాయమంటున్నారు. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ వాలంటీర్ వ్యవస్థ... చివరికి, వైసీపీ పాలిట శాపమయ్యే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. గ్రామ వాలంటీర్లపై ప్రస్తుతం తీవ్రస్థాయిలో వ్యతిరేకత లేకపోయినా, ఇప్పడిప్పుడే అసంతృప్తి, నెగటివ్ నెస్ మొదలవుతోందని అంటున్నారు. ముఖ్యంగా పెన్షన్లు లాంటి నగదు సంబంధమైన సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో గ్రామ వాలంటీర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పెడుతోన్న రకరకాల నిబంధనల్లో ఏదో ఒకటి సాకుగా చూపి, తమకు ముడుపులు ఇవ్వకపోతే... మీ పెన్షన్ తీసేస్తాం... మీకు ఆ పథకం వర్తింపకుండా చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే, ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే కాదు, నిజంగా క్షేత్రస్థాయిలో ఇదే జరుగుతోంది. ఎందుకంటే, మంత్రులకు, స్థానిక ఎమ్మెల్యేలకు గ్రామ వాలంటీర్ల మీద ప్రతిరోజూ అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వ్యాఖ్యలే అందుకు రుజువు. గ్రామ వాలంటీర్ల అవినీతిపై ఆధారాలతో సహా తనకు ఎన్నో ఫిర్యాదులు అందాయని, బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, పైగా ఆ డబ్బును వైసీపీ నాయకులకు ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాలనాగిరెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రజాప్రతినిధులు ఎంతోమంది గ్రామ వాలంటీర్ల అవినీతిపై గుర్రుగా ఉన్నారు. లంచాలు డిమాండ్ చేయడం, లెక్కలేనితనంగా ఇష్టానుసారంగా మాట్లాడటం, మహిళలకు మర్యాద ఇవ్వకపోవడం లాంటి ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని చెబుతున్నారు. అయితే, ఎంతో ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను అప్రతిష్టపాలు చేయడం ఇష్టంలేకే మౌనంగా ఉంటున్నామని, కానీ పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం, ఇప్పుడు టీడీపీకి పట్టిన గతే, 2025లో వైసీపీకి పడుతుందని హెచ్చరిస్తున్నారు.

harish rao focus on sangareddy constituency

సంగారెడ్డిపై హరీష్ ఫోకస్... నియోజకవర్గం మారతారా? లేక జగ్గన్నకు చెక్ పెట్టేందుకేనా?

హరీష్‌ రావు అంటే సిద్దిపేట... సిద్దిపేట అంటే హరీష్‌ రావు... అంతలా సిద్దిపేటను తన పేటగా మార్చేసుకున్నారు హరీష్ రావు.... ఎంతలా ఉంటే, మొత్తం రాష్ట్రంలోనే హైయ్యెస్ట్ మెజారిటీ తనకే వచ్చేలా ప్రజల మనిషిగా మారారు... అయితే, హరీష్‌ రావు మనసు ఇప్పుడు మరో సెగ్మెంట్‌పై మళ్లుతోందని అంటున్నారు. హరీష్ ఫోకస్ మరో నియోజకవర్గంపై పడిందట. అదేదో కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కంచుకోట సంగారెడ్డి. మున్సిపల్ ఎన్నికల దగ్గర్నుంచి సంగారెడ్డిపై హరీష్ ప్రత్యేక దృష్టిపెట్టారని అంటున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో రెండు కీలక మున్సిపాలిటీలను టీఆర్ఎస్‌ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు హరీష్ రావు. దాంతో, నియోజకవర్గంపై పూర్తి పట్టు సాధించాలనే పట్టుదలతో ఉన్నారట హరీష్. అందులో భాగంగానే తన నియోజకవర్గం సిద్దిపేట తర్వాత, సంగారెడ్డి నియోజకవర్గానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఏ చిన్న ప్రభుత్వ కార్యక్రమమైనా, సంగారెడ్డిలో హరీష్ వాలిపోతున్నారని మాట్లాడుకుంటున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా, సంగారెడ్డిలో కలియ తిరిగిన హరీష్ రావు.... పలు వార్డుల్లో పర్యటించి, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడికక్కడే పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్నించారు. అంతేకాదు, సంగారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ క్యాడర్‌కు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారట హరీష్. సంగారెడ్డి గులాబీ నేతల ఫోన్ కాల్స్‌కు రెస్పాండ్ కావడంతోపాటు, వారికి కావాల్సిన పనులు చేసి పెడుతూ నియోజకవర్గంపై పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. సంగారెడ్డి పర్యటనకు వచ్చినప్పుడల్లా ముఖ్య కార్యకర్తల ఇంటికెళ్లి మాట్లాడుతున్నారు.  సంగారెడ్డిపై హరీష్ ప్రత్యేక దృష్టి పెట్టడానికి కారణం స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి వైఖరే కారణమని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో హరీష్ ను జగ్గారెడ్డి బహిరంగంగా దూషించడం, అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, మంత్రి కసి పెంచుకున్నారని అంటున్నారు. ఎలాగైనా జగ్గారెడ్డికి చెక్‌పెట్టాలన్న లక్ష్యంతోనే నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా, ఇప్పుడు నియోజకవర్గంపై పూర్తిస్థాయి పట్టు సాధించి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఊపిరాడకుండా చేయాలనేది హరీష్ వ్యూహంగా టీఆర్ఎస్‌ నేతలు మాట్లాడుకుంటున్నారు.

first coronavirus case in telangana

తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ తెలంగాణలోకి ప్రవేశించింది. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. భారత్‌లో కొత్తగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయని తాజాగా కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకిందని పేర్కొంది. ఆదివారం నాడు దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఐదుగురికి కోవిడ్‌-19 పరీక్షలు జరపగా నలుగురికి నెగిటివ్‌ రాగా.. మరొకరికి పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారించారు. అలాగే ఢిల్లీలో కూడా ఓ వ్యక్తికి కరోనావైరస్ సోకిందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతను ఇటలీ నుంచి వచ్చాడని పేర్కొంది. కరోనా సోకిన వారిద్దరికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.

minister indrakaran reddy vs mla konappa

గురు-శిష్యుల మధ్య విభేదాలు... ఇంద్రకరణ్ పై కోనప్పకు కోపం..!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే కోనప్ప సంబంధాలు రోజురోజుకీ దిగజారుతున్నాయి. ఒకప్పుడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాటను కోనప్ప వేదంగా భావించేవారు. కానీ, ప్రస్తుతం వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరాయి. ఒకప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశిస్తే తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చిన కోనప్ప... ఇప్పుడు అస్సలు పట్టించుకోవడం లేదట. అంతేకాదు, తన నియోజకవర్గంలో ఏ కార్యక్రమం నిర్వహించినా, ఇంద్రకరణ్ రెడ్డితోనే ప్రారంభింపజేసే కోనప్ప... ఇప్పుడు మర్యాద కోసమైనా పిలవడం లేదని చెబుతున్నారు. గురుశిష్యులుగా పేరున్న ఇంద్రకరణ్, కోనప్ప మధ్య టామ్‌ అండ్‌ జెర్రీ వార్‌ నడుస్తోందని అంటున్నారు. ఇద్దరూ ఎదురెదురుపడినా, కనీసం పలకరించుకోవడం లేదంటున్నారు. ఇద్దరి మధ్యా పార్టీ పెద్దలు సయోధ్య కుదిర్చినా పూడ్చలేనంతగా అగాధం పెరిగిపోతోందని అనుచరులు మాట్లాడుకుంటున్నారు. మొన్నటివరకు ఎంతో అనుబంధంగా కొనసాగిన వీరిద్దరూ ఇప్పుడు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారని అంటున్నారు. అయితే, వీళ్లిద్దరి మధ్య అగాధం ఏర్పడటానికి కోనప్ప తమ్ముడు క్రిష్టే కారణమంటున్నారు. కుమ్రుంభీమ్ జిల్లాలో అటవీ అధికారిపై జరిగిన గొడవే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే కోనప్ప సంబంధాలను దెబ్బతీసిందని అంటున్నారు. అటవీ అధికారిపై దాడి ఘటనలో తనకు అండగా నిలవలేదన్న కోపంతో ఇంద్రకరణ్ రెడ్డిపై కోనప్ప రగిలిపోతున్నారని చెబుతున్నారు. మరోవైపు, రాష్ట్ర వన్యప్రాణి బోర్డులో సభ్యునిగా కోనప్పను సీఎం కేసీఆర్ నియమించడం కూడా గురు-శిష్యుల మధ్య అగాధానికి కారణమైందని అంటున్నారు. అటవీశాఖ మంత్రి ఉండే ఈ కమిటీలో, సభ్యునిగా నియమించడం వల్ల కోనప్ప పలుకుబడి పెరిగిందని అనుచరులు చెప్పుకుంటున్నారు. అయితే, అటవీ బోర్డులో కోనప్ప ఉండటం, ఇంద్రకరణ్‌కు అస్సలు ఇష్టంలేదన్న మాటలు వినపడ్తున్నాయి. ఇలా ప్రతి అంశంలోనూ మంత్రికి, కోనప్పకు ‌మధ్య విభేదాలు ముదిరాయని చెబుతున్నారు. నిన్నమొన్నటివరకు ఎంతో అనుబంధంతో మెలిగిన గురు-శిష్యులు... ఇఫ్పుడు ఒకరిపై మరొకరు కస్సుబుస్సులాడుకోవడం చర్చనీయాంశమైంది.

Milk prices could increase in summer

పాల ప్యాకెట్ ధ‌ర ఇంకా పెరగ‌నుందా?

గడిచిన 9 నెలల్లో దేశవ్యాప్తంగా లీటర్‌ పాల ధర రూ. 5 పెరిగింది. రాబోయే ఎండా కాలంలో పాల ధరలు మరింతగా పెర‌గ‌నుంది. దేశీయంగా రోజుకు 500 మిలియన్‌ లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని, అయినప్పటికీ సుమారు 50 మిలియన్‌ లీటర్ల కొరత ఉంటున్నదని సదరు సంస్థలు గుర్తుచేస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించాలంటే ఎస్‌ఎంపీ దిగుమతి ఒక్కటే మార్గమని లాక్టలీస్‌ ఇండియా సీఈవో రాహుల్‌ కుమార్‌ అన్నారు. లక్ష టన్నుల ఎస్‌ఎంపీ దిగుమతులు వెంటనే అవసరమన్న ఆయన ప్రైవేట్‌ డైరీలతోపాటు సహకార సంఘాలకు దీన్ని అందించాలని సూచించారు. దేశంలో నెల‌కొన్న అతివృష్టి, అనావృష్టి, ఎండిపోతున్న జల వనరులు,  ఆ త‌రువాత వరదలు.. డైరీ పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. నీరు, గడ్డి కొరతలతో పాల ఉత్పత్తి క్షీణించిందని పాల వ్యాపారులు చెప్తున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలతో అడుగంటిన భూగర్భ జలాలు పశువులకు నీటి ఎద్దడిని సృష్టించగా, ఆ తర్వాత కురిసిన భారీ వర్షాలతో పంట పొలాలు, పచ్చిక బైళ్లు నీట మునిగి గడ్డి లభించకుండా పోయిందని వెల్లడించారు. ముఖ్యంగా మొక్కజొన్న, చెరకు పంటలు పూర్తిగా దెబ్బతినడంతో పశువులకు గడ్డి లేకుండా పోయిందని, పాల ఉత్పత్తిని ఇది పెద్ద ఎత్తునే కుంగదీసిందని డైరీ యాజమాన్యాలు పేర్కొన్నాయి. అననుకూల వాతావరణ పరిస్థితులు పశువుల ఆరోగ్యంపైనా ప్రభావం చూపాయని క్రిసిల్‌ తెలిపింది. గడిచిన 9 నెలలకుపైగా కాలంలో దేశవ్యాప్తంగా లీటర్‌ పాల ధర రూ.4-5 పెరిగింది. మార్కెట్‌లో క్రమేణా పెరుగుతూపోతున్న పాల ధరలకు కారణం ఉత్తరాది రాష్ర్టాల్లోని పరిస్థితులే. ఇవి మొత్తం దేశీయ పరిశ్రమనే ప్రభావితం చేస్తున్నాయి. తొలుత పాల ధరలను అముల్‌, మదర్‌ డైరీలు పెంచగా, మిగతా సంస్థలూ అదే బాట పట్టాయి. అంతకుముందుతో పోల్చితే నిరుడు ఏప్రిల్‌-డిసెంబర్‌లో దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా పాల సేకరణ ధరలు 19 శాతం పెరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. వచ్చే నెలాఖరుదాకా ఇదే పరిస్థితి ఉండొచ్చని రేటింగ్స్‌, రిసెర్చ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా వేస్తున్నది. రాబోయే ఎండా కాలంలో పాల ధరలు మరింతగా పెరుగడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నీటి కొరత, పశువులకు ఆహార సమస్య.. ఉత్పత్తిని ఇంకా తగ్గించే వీలుందని, పెరిగే డిమాండ్‌తో ధరలు విజృంభిస్తాయని లాక్టలీస్‌ ఇండియా సీఈవో  రాహుల్‌ హెచ్చరించారు.

Delhi Court Refuses To Put On Hold Nirbhaya Convicts Execution Tomorrow

నిర్భయ దోషులకు రేపే ఉరి... డిలే గేమ్ కు చెక్ పెట్టిన ఢిల్లీ కోర్టు

ఉరిశిక్ష అమలుపై నిర్భయ దోషులు ఆడుతోన్న డిలే గేమ్ కు ఢిల్లీ కోర్టు చెక్ పెట్టింది. న్యాయపరంగా తమకున్న అవకాశాలను ఉపయోగించుకుంటూ ఇప్పటికే రెండుసార్లు ఉరిశిక్ష అమలు జరగకుండా వాయిదాపడేలా చేసిన నిర్భయ దోషుల ఆటలు ఈసారి సాగలేదు. నిర్భయ దోషులను ఉరి తీయొద్దంటూ  దాఖలైన పిటిషన్ ను తిరస్కరించిన ఢిల్లీ కోర్టు... డెత్ వారెంట్ ప్రకారం మార్చి మూడున ఉదయం ఆరు గంటలకు నలుగురినీ ఉరి తీయాలని ఆదేశించింది. ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ నిర్భయ దోషి పవన్ గుప్తా పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అసలా పిటిషన్‌ విచారణకు ఎలాంటి కొత్త అంశాలు  లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే, తమ ఉరిశిక్ష అమలును నిలిపివేయాలంటూ నిర్భయ దోషులు చేసుకున్న అభ్యర్ధనను ఢిల్లీ పాటియాలా కోర్టు తిరస్కరించింది. దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ మరోసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. తాను మరోసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నందున ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలంటూ ఢిల్లీ కోర్టును కోరాడు. అయితే, అక్షయ్ అభ్యర్ధనను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. అయితే, దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా తన చిట్టచివరి అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, చివరిగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. అయితే, డెత్ వారెంట్ ప్రకారం రేపు ( మార్చి 3న) నిర్భయ దోషులను ఒకేసారి ఉరి తీసేందుకు తీహార్ జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

YCP MLA Mustafa statement on CAA and NRC

ముస్తఫాది ధిక్కార‌మా? వైసిపి ఎత్తుగ‌డ‌న‌! 

రాజ‌కీయాలు  ముఖ్యం కాదు! ఎంత‌టికైనా తెగిస్తానంటున్న వైసిపి ఎమ్మెల్యే ముస్త‌ఫా! జ‌రిగిందేదో జ‌రిగిపోయింది. వైసిపి ఎంపీలు సి.ఎ.ఎ.కు అనుకూలంగా పార్ల‌మెంట్‌లో ఓటు వేశారు. అయితే ముఖ్యమంత్రి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి గారి దృష్టికి ముస్లింల మ‌నోభావాల‌ను తీసుకు వెళ్తాను. త్వరలో నిర్వహించనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దానికి సంబంధించి తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలని కోర‌తాను. అలా చేయకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. ఎంతటికైనా తెగిస్తాను. నాకు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ముఖ్యమంటున్నారు ఎమ్మెల్యే ముస్త‌ఫా. ఎమ్మెల్యే ముస్త‌ఫా నిజంగానే రెచ్చిపోయారా? లేక వైసిపి పార్టీ ఎత్తుగ‌డ‌నా అనే అంశంపై రాష్ట్ర రాజ‌ధానిలో ఉత్కంఠ‌త నెల‌కొంది. భారత్‌లో నివసించే ముస్లింల మనుగడను ప్రశ్నార్థకం చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఎమ్మెల్యే ముస్త‌ఫా ఆరోపించారు. మతాల వారీగా ప్రజలను విడగొట్టే ఇలాంటి చట్టాలను  రాష్ట్రం లో అమలు చేయ‌కుండా ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకువెళ్తాన‌ని ఆయ‌న అన్నారు.   ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివాదాస్పద చట్టాలను రాష్ట్రంలో అమలు చేయరని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఈ విషయంలో తనకు త‌మ నాయ‌కుడిపై నమ్మకం ఉందని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం జాతీయ జనాభా రిజిస్టర్ కార్యక్రమాలకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని  ఆయ‌న చెప్పారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయ‌న తెలుగుఒన్ తో త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు.  పౌరసత్వ సవరణ చట్టం జాతీయ జనాభా రిజిస్టర్ కార్యక్రమాలకు  రాష్ట్రంలోని ముస్లింలు సైతం తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. కాబ‌ట్టి ఈ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ లో తీర్మానం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సానుకూలంగా ఒప్పుకుంటార‌నే న‌మ్మ‌కం త‌న‌కుంద‌ని ఆయ‌న చెప్పారు. త‌నే కాదు గతంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కూడా ఇవే వ్యాఖ్యలు చేశారని ఆయ‌న గుర్తుచేశారు.

Economy of Andhra Pradesh

ఆందోళ‌న‌క‌రంగా ఎపి ఆర్థిక ప‌రిస్థితి!

రాష్ట్ర ప్రభుత్వం మార్చి 6 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు  నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.  6వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. సభలో గవర్నర్ ప్రసంగం తర్వాత సభను వాయిదావేసి.. మార్చి 9వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. శాసనసభలో ఆర్థికమంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి పద్దును ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ ను కురసాల కన్నబాబు ప్రకటిస్తారు. వీరిద్దరూ మండలిలోనూ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడతారు.  ప్ర‌స్తుత గ‌ణాంకాల‌ను క‌నుక ప‌రిసీలిస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా వుంద‌నిపిస్తోంది.  పన్ను ఆదాయాలు, జీఎస్టీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ ఫీజులు, ఎక్సైజ్ ట్యాక్స్, పన్నేతర ఆదాయం.. ఇలా ఏ విభాగం చూసినా అంచనాలకు తగినట్టు లేవు. అన్నిట్లోను భారీ కోతలే కనిపిస్తున్నాయి. జనవరితో పోలిస్తే ఫిబ్రవరి నెలలో ఆంధ్రాలో  జీఎస్టీ వసూళ్లు కొంత  పెరిగాయి.  ఫిబ్రవరిలో రూ. 2,563 కోట్ల మేర జీఎస్టీ వసూలైంది. 2020 జనవరిలో ఈ వసూళ్లు రూ.2,356 కోట్లు. అంటే రూ.207 కోట్ల మేర పెరుగుదల నమోదైంది.  ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూళ్లు   23 శాతం పెరిగిన‌ప్ప‌ట్టికీ ఇత‌ర రెవెన్యూ వ‌సూళ్ళు ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డంతో బ‌డ్జెట్ త‌ల‌కిందులైంది. ఇది బడ్జెట్ ఖర్చులపై తీవ్ర  ప్రభావం చూపిస్తోంది.  మ‌రో ప్ర‌క్క జనవరి నెలాఖరు వరకు కేంద్రం నుంచి ఆశించిన రెవెన్యూ వసూళ్లలో రాష్ట్రానికి సగం కూడా దక్కలేదు. ఈసారి ఆర్థిక కార్యకలాపాలు తగ్గిపోవడం.. ఇతరత్రా కారణాలతో రాష్ట్రానికి వచ్చే అన్ని రకాల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడింది.  కేంద్ర సాయంపైనా  కేంద్రం నుంచి ఆశించిన దాంట్లో నాలుగో వంతు కూడా దక్కలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో 61 వేల కోట్లకుపైగా వస్తుందని అంచనా వేశారు.  కానీ.. జనవరి నెలాఖరు వరకు దక్కింది 13 వేల 558 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే.. ఆశించిన మొత్తంలో కేవలం 22 శాతం మాత్రమే. మొత్తం వసూళ్లపైనా ఇది ప్రభావం చూపింది.  ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో ఒక లక్ష 78 వేల 700 కోట్ల వరకు రాబడి వస్తుందని అంచనా వేశారు. అయితే.. గట్టిగా 86 వేల కోట్లు మాత్రమే వచ్చింది. ఇది రాబడితో పోలిస్తే 48 శాతం మాత్రమే. గత సంవత్సరం కంటే ఈసారి మరింత వెనుకబాటు కనిపిస్తోంది.  2018-19 సంవత్సరంలో రెవెన్యూ వసూళ్ల అంచనా లక్ష 55 వేల 507 కోట్లు కాగా, 2019 జనవరి నెలాఖరు వరకు 91 వేల 755 కోట్లు వచ్చాయి. అంటే.. 59 శాతం.  బడ్జెట్ అంచనాల్లో మొత్తం 2.14లక్షల కోట్లుగా లెక్కిస్తే.. జనవరి నెలాఖరుకు వచ్చిన మొత్తం 1.33 లక్షల కోట్లు. అంటే 62 శాతం మాత్రమే. ఈ ప్రభావం సహజంగానే రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులపైనా కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తమ్మీద 32 వేల 293 కోట్లు పెట్టుబడి వ్యయంగా బడ్జెట్ అంచనాల్లో చూపారు.  జనవరి నెలాఖరు వరకు కేవలం 7 వేల 297 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. బడ్జెట్ అంచనాల్లో ఇది కేవలం నాలుగో వంతు మాత్రమే.  అదే సమయంలో రెవెన్యూ లోటు కట్టలు తెంచుకుంది. బడ్జెట్ పద్దుల్లో రెవెన్యూ లోటును ఒక వెయ్యి 778 కోట్లుగా చూపించారు. జనవరి వరకు 10 నెలల కాలంలో లోటు.. 34 వేల 690 కోట్లకు చేరింది.  వాస్త‌వ ప‌రిస్థితులు ఇలా వుంటే సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, న‌వ‌ర‌త్నాల‌పై దృష్టి పెట్టిన జ‌గ‌న్ స‌ర్కార్ బ‌డ్జెట్ ఎలా వుండ‌బోతుందోన‌ని ఉత్కంఠ‌త నెల‌కొంది.

allegations on ap ministers over sand mafia

ఇసుక మాఫియాలో మంత్రులు! 

ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాఫియా నడుస్తోందని  టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.  67 మంది ఎమ్మెల్యేలు, 10 మంది మంత్రులు, నలుగురు ఎంపీల పాత్ర ప్రత్యక్షంగా ఉందంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సత్యప్రసాద్ బహిరంగ లేఖ రాశారు.  'గతంలో రూ.1500 ఉన్న ట్రాక్టర్ ఇసుక రూ.5000కు చేరింది. రూ.10వేలు ఉన్న ట్రాక్టర్ ఇసుక రూ.50వేల నుండి లక్ష వరకు పలుకుతోంది. ప్రజలపై ఇంత దారుణంగా భారం వేస్తున్న విధానం అత్యుత్తమం ఎలా అవుతుంది.?' అని సత్యప్రసాద్ ప్రశ్నించారు.  ఒక యూనిట్ ఇసుకకు పర్మిట్ తీసుకుని వందలాది లారీల ఇసుకను అర్ధరాత్రి వేళల్లో తరలిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ తెచ్చిన ఉచిత ఇసుక పాలసీని రద్దు చేసి కొత్త పాలసీ పేరుతో దుర్మార్గానికి తెరలేపారని ఆరోపించారు. 'వైసీపీ నాయకులు మాఫియాగా ఏర్పడి ఇసుకను తెగనమ్ముకుంటున్నారు. ఇసుక అక్రమాలపై ఫిర్యాదు చేయండి, క్షణాల్లో చర్యలు తీసుకుంటామని మీరు ప్రకటించిన టోల్ ఫ్రీ నెంబర్ 14500 కు సమాచారం అందించినా స్పందించ‌డం లేద‌ని  సత్యప్రసాద్ ఆరోపించారు. వే బిల్లులు గానీ, పర్మిట్లు గానీ లేకుండా వందలాది లారీల ఇసుక సరిహద్దులు దాటిపోతోందన్నారు.  ఇసుక తరలిస్తున్న ఏ వాహనానికి కూడా జీపీఎస్ లేకున్నా చర్యలు లేవు. ఇసుక రీచుల్లో సీసీ కెమెరాల నిఘా మచ్చుకు కూడా కనిపించడం లేదు.' అని టీడీపీ ఎమ్మెల్యే అన్నారు. ఇసుక తవ్వకాల కోసం తీసుకున్న అనుమతులకు, జరుగుతున్న తవ్వకాలకు అసలు సంబంధమే ఉండడం లేదని టీడీపీ ఎమ్మెల్యే ఆరోపించారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అధికార పార్టీకి చెందిన మంత్రలు, ఎంపీలు, శాసనసభ్యుపై ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి వందలాది ఫిర్యాదులు వచ్చినా పట్టించుకున్నవారు లేద‌ని ఆయ‌న త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

విజృంభిస్తున్న మంకీ ఫీవర్!

కరోనా(కోవిడ్)వైరస్ గురించి భయపడుతున్న సమయంలో కర్ణాటకలో మరో రోగం విజృభిస్తుంది. మంకీ ఫీవర్ గా కూడా పిలిచే కైసనూర్ ఫారెస్ట్ డిసీస్(KSD)ఇప్పుడు కర్ణాటకలో విజృంభిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో ఈ వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నెల రోజుల క్రితం శివమొగ్గకు చెందిన ఓ 58ఏళ్ల మహిళ ఈ వ్యాధికి బలైంది. ఈ ఘటన మరిచేలోపే ఈ రోగం మరో ప్రాణాన్ని బలిగొంది. ఉత్తర కన్నడ జిల్లాలోని సిద్దపూర తాలూకాకు చెందిన 64 ఏళ్ల భాస్కర్ గణపతి హెగ్దే ఈ మంకీ ఫీవర్ తో ప్రాణాలు కోల్పోయాడు. మణిపాల్లోని ఓ హాస్పిటల్ కి తరలిస్తుండగా మధ్యలోనే భాస్కర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ వ్యాధి ఇక్కడ బాగా ప్రబలుతోంది. ఒక్క శివమొగ్గలోనే 55మంది ఈ వ్యాధి బారినపడ్డారు. వీరిలో 22మందికి వ్యాక్సీన్లు వేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరికీ సూచనలిస్తున్నట్లు మెడికల్ అధికారి ఒకరు చెప్పారు.

ఢిల్లీ అల్లర్లకు సోషల్ మీడియా కారణమ‌ట‌!

అల్లర్లపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని.. ఎన్ని జరిగినా సీఏఏ ఎన్నార్సీలను అమలు చేస్తామంటున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. పక్క దేశాల్లోనే మైనార్టీ హిందువులకు భారత పౌరసత్వం ఇస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. గచ్చిబౌలిలోని ఐఎస్బీలో ఏర్పాటు చేసిన సదస్సును ప్రారంభించిన కిషన్ రెడ్డి మాట్లాడారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలే ఢిల్లీ అల్లర్లకు అసలు కారణమని అన్నారు. రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే ధోరణియే అల్లర్లకు కారణమవుతున్నాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ నేతలైన కపిల్ మిశ్రా సహా బీజేపీ నేతల ప్రసంగాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత బీజేపీ నేతలనే తప్పుపట్టిన కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనమయ్యాయి. ఢిల్లీ అల్లర్లలో పోలీస్ అధికారులను కూడా ఆందోళనకారులు కిరాతకంగా చంపారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

విదేశాలకు రేషన్ బియ్యం!

విజిలెన్స్  అధికారులు దాడులతో ఈ బండారం బట్టబయలైంది. 1,645 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ ఈ బియ్యం విలువ రూ.546 కోట్లు  ప్రభుత్వం పేదల కోసం కోట్లు ఖర్చు పెట్టి రూ.1కే కిలోబియ్యం అందిస్తోంది. అయితే దొడ్డుగా ఉండే ఈ బియ్యాన్ని పేదలు తిన‌డం లేదు. సన్నిబియ్యం తిండికి అలవాటు పడడంతో ప్రభుత్వం అందించే దొడ్డు రేషన్ బియ్యాన్ని ఎవరూ తినడం లేదు.దీంతో ఈ బియ్యం దళారులు వ్యాపారుల ద్వారా ఇతర రాష్ట్రాలకు దేశాలకు గుట్టుచప్పుడు కాకుండా ఎగుమతి అవుతోంది. కోట్ల రూపాయల విలువ చేసే రేషన్ బియ్యం యథేచ్ఛగా విదేశాలకు తరలిపోతుంది.  నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ల రవాణా కేంద్రంగా వ్యవహరించే సీబర్డ్ కంపెనీ గోదాముల్లో విజిలెన్స్, సివిల్ సప్లయ్స్, కస్టమ్స్ అధికారులు విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్న 1,645 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. వీటి విలువ రూ.546 కోట్లు అని తేల్చారు. ఈ బియ్యా న్ని 5 బ్రాండ్ల పేరుతో 25కిలోల ప్లాస్టిక్ సంచుల్లో సిద్ధం చేసి ఉంచారు. సీబర్డ్ కంపెనీ ద్వారా కస్టమ్స్ అనుమతులు లభిస్తే, కంటైనర్ల ద్వారా ఆఫ్రికన్ దేశాలకు ఎగుమతి చేసేందుకు రంగం సిద్ధం చేశారు. విజయవాడ, కాకినాడ, గుంటూరు జిల్లాలతో పాటు చెన్నై, కర్ణాటక నుంచి ఈ బియ్యాన్ని సీబర్డ్ గోదాములకు తరలించినట్లు గుర్తించారు.

వీటిని పాటిస్తే కరోనా వైరస్ సోకదు

కరోనా వైరస్ (కోవిడ్-19) ను నివారించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ 10 ప్రాథమిక వ్యక్తిగత నివారణ చర్యలను సూచించింది. వీటిని పాటిస్తే మీకు కరోనా వైరస్ సోకదని వివరించింది. ఈ మేరకు డబ్యూహెచ్ ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ సాధారణ మార్గదర్శకాలను ప్రకటించారు. ఆ పది కరోనా వైరస్ రాకుండా చేసే నివారణ చర్యలు  1) చేతులను శుభ్రంగా కడుక్కోవడం.. కలుషితమైన పరిసరాలు అనారోగ్య వ్యక్తులను తాకిన తర్వాత ముఖంతో సహా వైరస్ వ్యాప్తి చెందే అన్నింటిని శుభ్రంగా కడుక్కోవాలి. దీని ద్వారా ప్రమాదాన్ని తగ్గింవచ్చు. 2) క్రిమిసంహారక మందులతో క్రమం తప్పకుండా ఉపరితలాలు కిచెన్ బెంచీలు పనిచేసే చోటున చల్లి శుభ్రం చేయాలి. 3) చాలా మందికి ముక్కు కారడం.. జ్వరం పొడిదగ్గుతో ప్రారంభమవుతాయి. తేలికపాటి వ్యాధిలా కనిపిస్తుంది. శ్రద్ధ తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం. 4) జ్వరం దగ్గు వచ్చినప్పుడు ప్రయాణాలకు దూరంగా ఉండండి. విమానం లో రైలు సహా ప్రయాణం లో అనారోగ్యానికి గురైతే ఇంటికి వచ్చాక ఆరోగ్యనిపుణులతో పరీక్ష చేయించండి. 5) దగ్గు తుమ్మినప్పుడు కర్ఛీఫ్ లు వాడండి. వాటిని వాడాక చెత్త డబ్బాలో వేయండి. చేతులు శుభ్రం చేసుకోండి 6) 60ఏళ్లు పైబడిన వారు గుండె శ్వాసకోశ డయాబెటిస్ రోగులకు ఇది త్వరగా వచ్చి ప్రాణాలు తీస్తుంది. రద్దీగా ఉండే ప్రాంతాలు అనారోగ్యంతో ఉండేవారితో దూరంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి 7) అనారోగ్యానికి గురైన వారు సమాజంలో తిరగవద్దు ఇంట్లో ఆస్పత్రులలో ఒంటరిగా ఉండాలి. ఎవరిని కలవకపోతే బెటర్. ఇతరులకు సోకకుండా సహాయపడుతుంది. 8) అనారోగ్యానికి గురైనప్పుడు ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యుల నుంచి విడిగా ఉండండి. ఎక్కువగా నిద్రించండి.. తినడానికి వివిధ పాత్రలు పరికరాలు వేరుగా వాడండి. 9) శ్వాస తీసుకోవడం కష్టమవడం.. ఊపిరి ఆడకపోవడం కరోనా ప్రధాన లక్షణం.. ఇలా అయితే వెంటనే వైద్యులను వెంటనే సంప్రదించండి 10) కరోనా సోకిన ప్రదేశాలు ప్రాంతాల్లో పర్యటించాల్సి వచ్చినప్పుడు తప్పని సరిగా మాస్కులు గ్లౌజులు ధరించండి.. కార్యాలయాలు పాఠశాల ప్రార్థనాస్థలాలకు వెళ్లకుండా ఉంటే మంచిది. పుకార్లు నమ్మకుండా ధైర్యంగా ఎదుర్కొంటే ఏ వ్యాధి అయినా నయం అవుతుందని డబ్యూహెచ్ ఓ తెలిపింది.