నారా లోకేష్ విందు రాజకీయం... భవిష్యత్ పై భరోసా కల్పిస్తూ మీటింగ్
టీడీపీ చరిత్రలో ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇఫ్పటికే తెలంగాణలో తెలుగుదేశం తుడిచిపెట్టుకుపోగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నిలదొక్కుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగుదేశం హిస్టరీలోనే ఎన్నడూలేనివిధంగా అత్యంత దారుణమైన పరాజయం పాలవడంతో, పార్టీని బలోపేతం చేసేందుకు, నేతలకు కాపాడుకునేందుకు చంద్రబాబు, నారా లోకేష్ తీవ్రంగా కష్టపడుతున్నారు. అయితే, ఎంతకాదన్నా, ఎవరు అవునన్నా, కాదన్నా... ముందుముందు తెలుగుదేశం పార్టీకి ముందుకు నడిపించాల్సింది నారా లోకేషే. అందుకే, పార్టీలో పట్టు పెంచుకునేందుకు లోకేష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు, పలువురు టీడీపీ సీనియర్ నేతలు వయోభారంతో దాదాపు రాజకీయాల నుంచి తప్పుకునే పరిస్థితి వచ్చింది. దాంతో, ఇప్పటికే ఆయా నేతల వారసులు తెరపైకి వచ్చారు. కొందరు మొన్నటి ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. అదే సమయంలో, టీడీపీని నడిపించాల్సిన నారా లోకేష్... పార్టీలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా భవిష్యత్ పై భరోసా కల్పిస్తూ యువ నాయకులతో ఎక్కువగా టచ్ లో ఉంటున్నారు. అందులో భాగంగానే, టీడీపీ సీనియర్ లీడర్ల వారసులతో నారా లోకేష్ సమావేశమయ్యారు. ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేతలు, ముఖ్యనేతలు, మాజీ మంత్రుల వారసుల్లో కొందరిని ఎంపికచేసి విందు సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశానికి పలువురు యువ నాయకులు హాజరయ్యారు.
ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటు పరిటాల శ్రీరాం, టీజీ భరత్, మాగంటి రాంజీ దంపతులు, మాజీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు కుమారులు, కోడళ్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ విందు సమావేశంలో నారా లోకేష్ తోపాటు బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు. అలాగే, చంద్రబాబు, భువనేశ్వరి కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే, యువ నాయకులతో ఎక్కువగా ఇంటరాక్ట్ అయిన నారా లోకేష్ .... భవిష్యత్ టీడీపీదేనని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ భరోసా కల్పించినట్లు తెలుస్తోంది.