బ్రాహ్మణికి తెలుగుదేశం పగ్గాలు..! త్వరలో చంద్రబాబు కీలక నిర్ణయం
నారా లోకేష్ విందు రాజకీయంపై తెలుగుదేశంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ విందులో పాల్గొన్నది మొత్తం టీడీపీ నేతల రాజకీయ వారసులే. టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతల కుటుంబాలకు చెందిన సుపుత్రులు, సుపుత్రికలే. అయితే, ఇది పేరుకే విందు కార్యక్రమం అయినా, తాజా రాజకీయ పరిణామాలే ప్రధానాంశాలుగా ఈ మీటింగ్ జరిగింది. భవిష్యత్ కార్యాచరణతోపాటు పార్టీ బలోపేతంపైనా డిస్కషన్ చేశారు. అయితే, ఈ పార్టీలో బ్రాహ్మణి హైలైట్ అయ్యారు. లోకేష్తో కలిసి అందరితో మాట్లాడిన బ్రాహ్మణి... తన ఆలోచనల్ని పంచుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలపై లోకేష్తో కలిసి పార్టీ నేతలతో చర్చించారు.
అయితే, ఎన్నడూలేనిది, పార్టీ యంగ్స్టర్స్ మీటింగ్లో నారా బ్రాహ్మణి పాల్గొనడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బ్రాహ్మణిని క్రియాశీల రాజకీయాల్లోకి తేవాలని భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా, భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ చేయాలనుకుంటున్నారట. లోకేష్కు చేదోడువాదోడుగా ఉండేలా క్రియాశీలకం చేయాలనుకుంటున్నారని, త్వరలోనే బ్రాహ్మణికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు.
నందమూరి ఆడపడుచుగా, నారా వారి కోడలిగా బ్రాహ్మణికి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. కుటుంబ వ్యాపారాలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ బిజినెస్ మీటింగ్స్ లో ప్రసంగించి మెప్పించిన బ్రాహ్మణి... రాజకీయాల్లోకి వస్తే, ప్రజలను కూడా ఆకట్టుకోవడం ఖాయమంటున్నారు. అయితే, నిన్నమొన్నటివరకు ప్రస్తుతం తనకు రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదని చెప్పుకొచ్చిన బ్రాహ్మణి... ఇఫ్పుడు పార్టీ యంగ్స్టర్స్ మీటింగ్లో పాల్గొనడం చూస్తుంటే, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముందడుగు వేయబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, చంద్రబాబుకు వయసు మీదపడటం, ఏదోఒక రోజు నారా లోకేష్ చేతుల్లోకి పార్టీ వెళ్లక తప్పదు కనుక, భవిష్యత్తులో లోకేష్కు చేదోడువాదోడుగా ఉండేందుకు ఇఫ్పట్నుంచే బ్రాహ్మణిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి, పార్టీలో కీలక పదవి ఇవ్వాలని బాబు ఆలోచిస్తున్నారని తెలుగుదేశం నేతలు మాట్లాడుకుంటున్నారు.