గొర్రెకుంట తొమ్మిది మంది హత్య కేసులో తుదితీర్పు
posted on Oct 28, 2020 @ 8:10PM
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట తొమ్మిది మంది హత్య కేసులో తుదితీర్పు వెల్లడైంది. ఈ కేసులో నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ (24) కు ఉరిశిక్ష విధిస్తూ వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జయ్కుమార్ తీర్పు ప్రకటించారు.
బీహార్కు చెందిన సంజయ్ కుమార్ ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు తొమ్మిది మందిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఏడాది మే 21న తొమ్మిది మందిని ఆహారంలో విషం కలిపి హత్యచేసి వరంగల్ శివారులోని గొర్రెకుంట బావిలో పడేశాడు.
గొర్రెకుంటలోని గోనె సంచుల గోదాంలో మక్సూద్ కుటుంబం నివసించేది. ఆ పక్కనే ఇద్దరు బీహారీ యువకులు అద్దెకు ఉండేవారు. మక్సూద్ కుటుంబంతో సంజయ్ కి పరిచయం ఉంది. మక్సూద్ మరదలు రఫీకాతో సంజయ్ కొన్నాళ్లు సహజీవనం కూడా చేశాడు. అయితే ఆమె పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో.. తమవాళ్లకు పరిచయం చేస్తానని నమ్మించి తీసుకెళ్లి.. రైలు నుంచి తోసి హత్య చేశాడు.
అయితే, మక్సూద్ కుటుంబం రఫీకా గురించి ఆరా తీయడం, పోలీస్ కేసు పెడుతామని బెదిరించడంతో.. పోలీసులకు దొరికిపోతానన్న భయంతో ఆ కుటుంబం మొత్తాన్ని లేకుండా చేయాలనుకున్నాడు. ఇదే క్రమంలోమక్సూద్ ఇంట్లో జరిగిన అతని మనవడి బర్త్ డే పార్టీకి హాజరయ్యాడు. ఆ పార్టీకి ఇద్దరు బీహారీ యువకులు కూడా హాజరయ్యారు. పథకం ప్రకారం ఆహారంలో విషం కలిపి అందర్నీ హత్య చేశాడు.
నిజానికి తొలుత ఇద్దరు బిహారీ యువకులను వదిలేద్దామని భావించినట్టు సంజయ్ విచారణలో వెల్లడించాడు. కానీ హత్యల విషయం వారి ద్వారా బయటకు వస్తుందన్న భయంతో వారిని కూడా హత్య చేసినట్టు అంగీకరించాడు. అలా ఒక్క హత్యను కప్పి పుచ్చుకోవడానికి మరో తొమ్మిది మందిని సంజయ్ హత్య చేశాడు.