దేశంలో కరోనా వ్యాప్తి తరువాత మొదలైన మొట్టమొదటి అసెంబ్లీ పోలింగ్..
posted on Oct 28, 2020 @ 9:53AM
మనదేశంలో కరోనా వ్యాప్తి మొదలైన తరువాత ఒక రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు కొద్దీ సేపటి క్రితం బీహార్ లో మొదలయ్యాయి. కరోనా కారణంగా ఒక్కో బూత్లో 1000 మంది ఓటర్లు మాత్రమే ఓటు వేసేలా ఏర్పాటు చేశారు. 80 ఏళ్లకు పైబడిన వృద్దులు అలాగే కరోనా లక్షణాలు ఉన్న వారికి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను శానిటైజ్ చేశారు. పోలింగ్ సిబ్బందికి మాస్కులు, ఇతర రక్షణ సామగ్రిని అందించారు. థర్మల్ స్కానర్, హ్యాండ్ శానిటైజర్లను పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు
మొత్తం బీహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉండగా.. తొలి విడత పోలింగ్ లో ఈరోజు మొత్తం 71 స్థానాలకు పోలింగ్ జరుపుతున్నారు. ఈరోజు పోలింగ్ జరిగే ప్రాంతాల్లో.. నక్సల్ ప్రభావిత జిల్లాలైన గయా, రోహ్తాస్, ఔరంగాబాద్ కూడా ఉన్నాయి. దీంతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. తొలి విడతలో భాగంగా ఈరోజు మొత్తం 2 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.
ఈ ఎన్నికలలో బీజేపీ జేడీయూ కూటమి తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వంటి ముఖ్యులు ప్రచారం చేశారు. సీఎం నితీష్ కుమార్కు మరో అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా ఓటర్లను ప్రధాని కోరారు. ఇక కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాల కూటమి తరపున కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తేజశ్వి యాదవ్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. నవంబరు 3న రెండో దశలో 94 స్థానాలకు, నవంబరు 7న మూడో దశలో 78 స్థానాలకు ఎన్నికలు జరపనున్నారు. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు నిర్వహించి, అదేరోజు ఫలితాలను వెల్లడిస్తారు.