భారత అథ్లెట్లకు రోజు కరోనా టెస్ట్! ఒలింపిక్స్ కమిటి రూల్ పై ఐఓఏ ఫైర్... 

వచ్చే నెలలో  జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. కరోనా మహమ్మారితో గత సంవత్సరం వాయిదా పడిన ఒలింపిక్స్ ను జూలైలో నిర్వహిస్తున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ తో ఈసారి కూడా నిర్వహణ జరుగుతుందో లేదోనన్న అనుమానాలు వచ్చినా.. చివరకు నిర్వహణపై మొగ్గు చూపింది జపాన్ ప్రభుత్వం. అయితే కొవిడ్ మార్గదర్శకాల పేరుతో కఠినంగా వ్యవహరిస్తోంది టోక్యో ఒలింపిక్స్ కమిటి. కరోనా ప్రభావం అధికంగా ఉన్న 11 దేశాల నుంచి వచ్చే అథ్లెట్లకు జపాన్ ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. ఆయా దేశాల క్రీడాకారులు జపాన్ బయల్దేరడానికి ముందు వారం రోజుల పాటు నిత్యం కరోనా టెస్టులు చేయించుకోవాలని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు స్పష్టం చేశారు. టోక్యో  ఒలింపిక్స్ నిర్వాహకులు కఠిన చట్టాలు విధించిన దేశాల్లో భారత్ కూడా ఉంది. భారత్ తో పాటు పాకిస్థాన్, బ్రిటన్ దేశాలు కూడా ఉన్నాయి. 11 దేశాలకు చెందిన అథ్లెట్లు తమతమ దేశాల్లో చివరి వారం రోజుల పాటు రోజు కరోనా టెస్టు చేయించుకోవడంతో పాటు జపాన్ చేరుకున్న తర్వాత మూడు రోజుల పాటు ఇతర దేశాల జట్లతో కలవకుండా క్వారంటైన్ లో  ఉండాలని తెలిపింది. తద్వారా ఒలింపిక్స్ క్రీడల్లో కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని భావిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా భారత్ వంటి దేశాల్లో కరోనా వేరియంట్ల కారణంగా గణనీయమైన నష్టం జరిగిందని వెల్లడించారు. టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులపై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత్ వంటి దేశాల అథ్లెట్లపై ఆంక్షలు విధించడం తీవ్ర అనైతికం అని విమర్శించింది. ఈ నిబంధనల కారణంగా అథ్లెట్లు మూడు రోజుల పాటు కీలకమైన శిక్షణకు దూరమవ్వాల్సి వస్తుందని వెల్లడించింది. దీనిపై ఐఓఏ అధ్యక్షుడు నరిందర్ బాత్రా, కార్యదర్శి రాజీవ్ మెహతా సంయుక్త ప్రకటన చేశారు. అథ్లెట్లు తమ ఈవెంట్ ప్రారంభానికి కేవలం ఐదు రోజుల ముందు ఒలింపిక్ క్రీడాగ్రామంలోకి ప్రవేశిస్తారని, కొత్త నిబంధనల నేపథ్యంలో మూడు రోజులు వృథా అని తెలిపారు. భారత క్రీడాకారులు ఒలింపిక్స్ కోసం ఐదేళ్లు కఠోరంగా శ్రమించారని, భారత క్రీడాకారులకు కూడా వర్తించేలా టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు నిబంధనలు తీసుకురావడం సరికాదని అభిప్రాయపడ్డారు.

సీఎంల‌ జ‌ల‌క్రీడ‌.. స్నేహం ముసుగులో వైరం!.. ఇక స‌మ‌ర‌మేనా?

అవును, వాళ్లిద్ద‌రూ కౌగిలించుకున్నారు. పుష్ప‌గుచ్చాలు ఇచ్చుకున్నారు. శాలువాలు క‌ప్పుకున్నారు. క‌లిసి భోజ‌నం చేశారు. క‌లిసి చ‌ర్చించుకున్నారు. అధికారులూ రోజుల త‌ర‌బ‌డి మాట్లాడుకున్నారు. ఆ సీన్ల‌న్నీ చూసి.. ఇక జ‌ల‌వివాదం స‌మ‌సిపోయింద‌ని అనుకున్నారంతా. విడిపోయిన తెలుగురాష్ట్రాలు క‌లిసిపోయాయ‌న్నంత సంతోషం. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు మంచి దోస్తుల‌య్యార‌నే సంబ‌రం. అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లో ఆవిష్కృత‌మైందీ జ‌ల‌దృశ్యం. ఇక ఆల్ ఈజ్ వెల్‌. ఆల్ ప్రాబ్ల‌మ్స్ సాల్వ్డ్ అనుకున్నారంతా.  క‌ట్ చేస్తే, అది మూన్నాళ్ల ముచ్చ‌టేన‌ని ఇంత‌కుముందే తేలిపోయింది. ఇప్పుడు మ‌ళ్లీ వాట‌ర్ వార్ ముదురుతోంది. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు మొండికేస్తున్నారు. త‌గ్గేదే లే అంటూ జ‌ల‌జ‌గ‌డానికి సిద్ద‌మైపోయారు. ఒక‌రిది ఇంకొక‌రికి త‌ప్పులా క‌నిపిస్తోంది. ఎవ‌రి లెక్క‌ల్లో వాళ్లు త‌మ‌దే ఒప్పు అంటున్నారు. మా నీళ్లు మాకే సొంతం. మా ప్రాజెక్టులు మా ఇష్టం. ఇక చ‌ర్చ‌లు.. చ‌ర్చించుకోవ‌డాలు లేవ్‌.. ప్రాజెక్టులు, నీటి కేటాయింపులే ముఖ్యం.. అంటూ ఎవ‌రికి వారే పంతానికి పోతున్నారు. స‌మ‌రానికీ సై అంటున్నారు. ముఖ్య‌మంత్రుల త‌ర‌ఫున మంత్రులు రంగంలోకి దిగి.. మాట‌ల తూటాలు పేల్చుతున్నారు. దేనికైనా రెడీ అంటూ జ‌ల‌ఖ‌డ్గం రువ్వుతున్నారు. పోతిరెడ్డిపాడు. ఇదే ప్ర‌స్తుత వివాదానికి మూలం. నిబంధ‌న‌ల‌కు లోబ‌డే సామ‌ర్థ్యాన్ని పెంచుతామ‌ని ఏపీ స్ప‌ష్టం చేస్తోంది. గ‌ట్లైతే మేం ఒప్పుకోమంటూ తెలంగాణ తిర‌గ‌బ‌డుతోంది. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచితే.. పాల‌మూరు-రంగారెడ్డి గ‌తి ఏంటంటూ గొడ‌వ ప‌డుతోంది. అది అంత‌కంత‌కూ ముదిరి.. ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ కేబినెట్ వ‌ర‌కూ వ‌చ్చింది. ఏపీ తీరుపై సీఎం కేసీఆర్ గ‌రంగ‌రం అయిన‌ట్టు తెలిసింది. మ‌నోడే గ‌దాని మంచిగుంటే.. గిట్ల చేస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ కేసీఆర్.. జ‌గ‌న్‌పై ఫైర్ అయ్యార‌ని అంటున్నారు. వైఎస్సార్ కంటే మోనార్క్‌లా ఉన్నాడంటూ.. జగన్ తీరుతో ఏపీకే నష్టమంటూ వార్నింగ్ కూడా ఇచ్చార‌ట‌. ఏపీ ప్రాజెక్టులు ఆగకపోతే.. ఎగువన కృష్ణా నదిపై కొత్త బ్యారేజీలు కడతామని కూడా తెలంగాణ కేబినెట్ హెచ్చరించింది. అయితే, కేసీఆర్ అంటే కాస్త భ‌యం భ‌యంగా ఉండే ఏపీ మంత్రులు ఈసారి మాత్రం గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చారు. రెండుమూడు రోజులు బాగా ఆలోచించుకున్నాక‌.. అంత‌ర్గ‌తంగా చ‌ర్చించుకున్నాక‌.. ఏపీ ఇరిగేష‌న్ మినిస్ట‌ర్ అనిల్‌కుమార్ తెలంగాణ‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లను తరలిస్తే తప్పేంటని గ‌ట్టిగానే నిలదీశారు మంత్రి అనిల్‌. తెలంగాణలోనే అనుమతులు లేకుండానే ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారంటూ.. కల్వకుర్తి, నెట్టెంపాడు సామర్థ్యం పెంచుకున్నారంటూ.. మంత్రి ఓ రేంజ్‌లోనే మండిపడటం మంట రేపుతోంది. త్వ‌ర‌లోనే నేర‌డి ప్రాజెక్ట్ ప్రారంభిస్తామంటూ నీళ్ల‌ మంట మ‌రింత ఎగ‌దోశారు. జ‌గ‌న్ సీఎం అయ్యాక ఏపీ నుంచి ఈ స్థాయిలో తెలంగాణ‌పై ఎదురుదాడి జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి. ఏపీ నుంచి ఈ రేంజ్‌లో రివ‌ర్స్ అటాక్‌తో కంగుతిన్న తెలంగాణ‌.. అంత‌లోనే తేరుకొని.. గంట‌ల వ్య‌వ‌ధిలోనే కౌంట‌ర్ అటాక్‌కు దిగింది. పాల‌మూరు జిల్లాకు చెందిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చారు. ఆయ‌న సీఎం జ‌గ‌న్‌కు, ఏపీకి వీర లెవెల్‌లో వార్నింగ్ ఇచ్చారు. తెలుగు గంగకు మానవతా దృక్పథంతో మంచి నీళ్ల కోసం సహకరిస్తే అది జల దోపిడీ గా మారిందని మంత్రి మండిప‌డ్డారు. పోతిరెడ్డి పాడు సామర్ధ్యాన్ని అంతకంతకు పెంచుతూ పాలమూరు జిల్లాకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ పథకంపై అపెక్స్ కౌన్సిల్‌కి ఇచ్చిన హామీని తుంగలో తొక్కి మోసం చేస్తోంది జగన్ కాదా? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. స్నేహ హస్తం అంటూనే వెకిలి చేష్టలు చేస్తున్నారని.. నోట్లో చక్కర.. కడుపులో కత్తెర.. అన్నట్టుగా ఏపీ ప్రభుత్వం తీరు ఉందంటూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు తెలంగాణ‌ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌. ‘‘తాము పైన ఉన్నాం. ప్రాజెక్టులు ఎన్నయినా కొట్టుకోవచ్చు.. జగన్‌ను కేసీఆర్ తమ్ముడిలా భావించి స్నేహ హస్తం అందించినా సరిగా స్పందించలేదు.. సీఎం కేసీఆర్ మంచికి మంచి వారు.. చెడుకు చెడ్డవారు.. పాలమూరును ఎడారి చేస్తామంటే ఊరుకునే పరిస్థితి లేదు. ఎంతకైనా తెగిస్తాం. ఏపీ మొండి వైఖరి కొనసాగితే మహబూబ్‌నగర్ జిల్లాలోనే కృష్ణా జలాలను మళ్లించే వ్యూహం మాకు ఉందంటూ ఏపీకి ఖ‌త‌ర్నాక్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌.  ఇరు రాష్ట్రాల‌కు చెందిన ఇద్ద‌రు మంత్రుల మాట‌ల‌తో తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురిన‌ట్టే ఉందంటున్నారు. సీఎం కేసీఆర్‌, సీఎం జ‌గ‌న్‌ల మ‌ధ్య స్నేహం ముసుగు తొల‌గిపోయిందంటున్నారు. ఈ జ‌ల జ‌గ‌డం ఏ తీరాల‌కు దారి తీస్తుందోన‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. నీళ్ల కోసం మ‌ళ్లీ లొల్లులు త‌ప్ప‌వా? రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య మ‌ళ్లీ ప్రాజెక్ట్ ఫైట్ మొద‌లైందా?    

లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ భయం!

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీల మధ్య ఎప్పడూ ఘర్షణ వాతావరణమే. రాష్ట్రంలో ఏం జరిగినా ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతుంటాయి. టార్గెట్  చేసేందుకు  ఏ చిన్న అవకాశం వచ్చిన వదులుకోవు ఇరు పార్టీలు. ఇటీవల టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దూకుడు పెంచారు. పంచ్ డైలాగులతో అదరగొడుతున్నారు. పదునైన విమర్శలతో ఒక రకంగా అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు చినబాబు. దీంతో లోకేష్ లక్ష్యంగా ఏపీ మంత్రులు రెచ్చిపోతున్నారు. గౌరవప్రదమైన పదవిలో ఉన్నామన్న సంగతి మర్చిపోయి మరీ.. బూతులు మాట్లాడుతున్నారు.  తాజాగా తాడేపల్లిలో వెలుగుచూసిన గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు దగ్గరలోనే ఘోరం జరగడంతో పోలీసులు, వైసీపీ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో లోకేష్ కు కౌంటరిచ్చిన ఏపీ మంత్రి పేర్ని నాని.. జూనియర్ ఎన్టీఆర్ ను మధ్యలోకి లాగారు.  నారా లోకేశ్ ఇప్పుడు సొంత పార్టీలోనే ఉనికి కోసం తాపత్రయపడుతున్నాడని విమర్శించారు. లోకేశ్ కు జూనియర్ ఎన్టీఆర్ భయం పట్టుకుందన్నారు నాని.  జూనియర్ ఎన్టీఆర్ రావాలని టీడీపీ కార్యకర్తలు కోరుకుంటుండడమే అందుకు కారణమని తెలిపారు. టీడీపీ  కార్యకర్తలు "రావాలి జూనియర్ ఎన్టీఆర్, కావాలి జూనియర్ ఎన్టీఆర్" అంటుండడంతో... "జూనియర్ ఎన్టీఆర్ అక్కర్లేదు నేనే సరిపోతాను" అంటూ జగన్ మోహన్ రెడ్డిపై  నోటికొచ్చినట్టు నారా లోకేష్  మాట్లాడుతున్నాడని పేర్ని నాని మండిపడ్డారు. అసభ్యంగా, విచక్షణ లేకుండా ఏరా, ఒరే అని మాట్లాడుతున్నారని.. తాము కూడా అలాగే మాట్లాడగలమని హెచ్చరించారు.  గడ్డం పెంచినవాడల్లా గబ్బర్ సింగ్ కాలేడని లోకేశ్ ను ఎద్దేవా చేశారు నాని .  లోకేశ్ ఉద్యోగం పోయిన రాజకీయ నిరుద్యోగి అని  సెటైర్ వేశారు. లోకేశ్ ప్రస్తుతం తీవ్ర అసహనంలో ఉన్నారని, అతన్ని చూస్తుంటే జాలి  కలుగుతోందని కామెంట్ చేశారు పేర్ని నాని. 

సీఎం ఇంటి సమీపంలోనే ఘోరమా! ఏపీలో మహిళకు రక్షణే లేదా?

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. సీతానగరం పుష్కరఘాట్ వద్ద చోటు చేసుకున్న అత్యాచార ఘటనపై ఆయన  లేఖలో నిలదీశారు. అత్యాచార ఘటన జరిగిన ప్రదేశం సీఎం నివాసానికి దగ్గర లోనే ఉందని, పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూడా మూడు కిలోమీటర్లు దూరంలో ఉందన్న చంద్రబాబు.. ఈ ఘటనను పరిశీలిస్తూ సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.  రాష్ట్రంలో అసలు దిశ యాక్ట్ అమలవుతుందా? అని ప్రశ్నించారు. దిశ చట్టం కింద ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు చేశారని డీజీపీని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. దిశ చట్టం ద్వారా తీసుకున్న చర్యలేమిటో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.  రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లల కు రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు విమర్శించారు. పెట్రోలింగ్, గట్టి నిఘా లేకపోవడం వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని చంద్రబాబు విమర్శించారు. కృష్ణా నది ఒడ్డున, పుష్కర ఘాట్‌ల వద్ద గంజాయి, మద్యం సేవిస్తున్నారని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని చంద్రబాబు ఆరోపించారు. వెంటనే పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం అవకుండా మహిళలకు రక్షణ కల్పించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను చంద్రబాబు డిమాండ్ చేశారు. మహిళలను రక్షించలేని చట్టాలు, యాప్‌లతో ఉపయోగం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేస్తే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు సరిపోతాయన్నారు. అత్యాచార ఘటన జరిగి ఇన్ని గంటలవుతున్న ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సీతానగరం ప్రాంతంలో సమర్థవంతమైన పోలీసింగ్, పెట్రోలింగ్ అవసరమన్నారు. ఈ ప్రాంతంలో గతంలో ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్టు శిథిలావస్థలో ఉండటం బాధాకరమన్నారు. డీజీపీ కార్యాలయం, ముఖ్యమంత్రి నివాసాలకు దగ్గర మాదక ద్రవ్యాల అమ్మకం, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్న ఎందుకు చర్యలు చేపట్టడం లేదని  చంద్రబాబు నిలదీశారు.   ప్రజల్లో విశ్వాసం పెంచేలా కృష్ణా నది ఒడ్డున పోలీస్ గస్తీ పెంచడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల రక్షణకు చర్యలు చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. నేరస్తులను త్వరగా పట్టుకోవాలని డీజీపీని లేఖలో కోరారు. రాష్ట్రంలో మహిళలకు రియల్ టైంలో భద్రత కల్పించాలన్నారు.గత రెండేళ్లలో మహిళలపై దాడులు పెరగడం విచారకరమన్నారు.  ప్రభుత్వం ఆర్భాటం చేసిన దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ మొబైల్ వాహనాలు, ప్రత్యేక యాప్ లన్నీ మోసపూరితంగా మారయన్నారు. వైసీపీ రంగులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి మాత్రమే దిశ చట్టం పనికొచ్చినట్లుందని చంద్రబాబు లేఖలో తెలిపారు.  గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్‌ వద్ద నదీ తీరంలో సేదతీరుతున్న ప్రేమజంటపై దుండగులు దాడి చేసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. తన కాళ్ళు, చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. అనంతరం నిందితులు పడవలో విజయవాడ వైపు వెళ్లిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం నాడు చోటు చేసుకున్న ఈ దారుణం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనను పోలీస్ యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. ఈ దురాఘతానికి పాల్పడింది గంజాయి, బ్లేడ్ బ్యాచ్ అని పోలీసులు అంచనాకు వచ్చారు. 

నిరుద్యోగ తేనెతుట్టును కదిపారా.. జగన్ కు మూడినట్టేనా? 

గొప్ప కోసం పోతే...తిప్పలు తప్పలేదా? జగన్ అనవసరంగా తేనెతుట్టును కదిపారా? అవుననే అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు. చేయలేనప్పుడు చేయలేననే చెబుతానని గతంలో రైతు రుణ మాఫీపై గట్టిగా నొక్కి చెప్పిన జగన్... అధికారంలోకి వచ్చాక ఎందుకిలా మేనేజ్ చేయాలని చూస్తున్నారో అర్ధం కావడం లేదనే కామెంట్లు వినపడుతున్నాయి. జాబ్ క్యాలెండర్ అంటూ ఆయన చేసిన హంగామా నిరుద్యోగులను రోడ్డెక్కించింది. మనసులోనే మదనపడుతూ ఆవేదన చెందుతున్నవారిని ఆవేశంతో బయటకు రప్పించింది. ఏదో ఇస్తాడు.. చేస్తాడు..విన్నాడు..ఉన్నాడు లాంటి స్లోగన్లు వినివినీ ఉన్నవారికి ఈ క్యాలెండర్ తగలబెట్టాలన్నంత కోపం వచ్చేసింది. కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్..అవి కూడా డిపార్టుమెంట్లు మారినవాటిని కూడా ఉద్యోగాల్లా లెక్కేసి చెప్పడంతో ముందు షాకైనా..తర్వాత తిట్టుకోవడం మొదలెట్టారు నిరుద్యోగులు. ప్రతి ఏడాది డీఎస్సీ ప్రకటిస్తానని హామీ ఇచ్చిన పెద్దమనిషి.. ఇప్పుడు ఇలా తూతూ మంత్రం క్యాలెండర్ ఇవ్వడంతో వారికి మండిపోతోంది.అందుకే దాదాపు అన్నిజిల్లాల్లో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారికి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం చెప్పలేదు ఆందోళనలు చేయమని..కాని వారే స్వచ్చంధంగా రోడ్డుమీదకు వచ్చి నిరసన చేస్తుండటంతో.. టీడీపీ నేతలు సైతం అలర్టయ్యారు. గౌరవవేతనానికి పనిచేసే వలంటీర్లను, మినిమమ్ శాలరీకి చేస్తున్న సచివాలయ ఉద్యోగులను లెక్కేసి లక్షల ఉద్యోగాలిస్తున్నట్లు ప్రకటించుకోవడం జగన్ కే చెల్లిందనే కామెంట్లు వస్తున్నాయి. అంతే కాదు వారికిచ్చేదానికన్నా..వారితో చేయించుకునే పనులు మాత్రం వంద రెట్లు ఉంటున్నాయని.. పైగా వారు రాజకీయంగా అధికారపార్టీకే పనిచేయాలని ఓపెన్ గానే ఆదేశాలిస్తున్నారని.. ఆ ఇబ్బందులు పడుతూనే ఉద్యోగాలు చేస్తున్నవారు... జగన్ ప్రకటనలు చూసి నివ్వెరపోతున్నారు. జీతం పెంచమంటే మీది ఉద్యోగమే కాదన్నవాడు.. నేడు ఉద్యోగాల లెక్కల్లో తమని చూపించడంతో ఏమనాలో అర్ధం కాక అయోమయంగా చూస్తున్నారు. హెల్త్ వర్కర్లు, నర్సింగ్ కలిపే 7 వేలు పైనఉండగా..మొత్తం 10 వేల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ అని ప్రకటించడం..హాస్యాస్పదంగా ఉందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. హెల్త్ డిపార్ట్ మెంట్ లో చేసే రిక్రూట్ మెంట్లు అన్నీ కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద ఇచ్చే నిధులతోనే అని కూడా వారు క్లారిటీ ఇస్తున్నారు. గ్రూప్ 1, 2 రెండు కేటగిరీలు కలిపి 36 పోస్టులు ఉన్నట్లు చూపించారు. లెక్కల తప్పులు సంగతి తర్వాత..అసలు ప్రకటించినదానినైనా సక్రమంగా అమలు చేస్తారా లేదా అన్నది కూడా అనుమానంగానే ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆర్ధిక సంక్షోభంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం..వీటికి బడ్జెట్ కేటాయింపులు చేసి అన్నీ అయ్యేసరికి..పుణ్యకాలం దాటిపోతుందని.. ఈలోపు నోటిఫికేషన్లు, పరీక్షల పేరుతో క్యాలెండర్ ఫాలో అయి..అసలు రిక్రూట్ మెంట్ మాత్రం చేయరనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా అసలే ఆర్ధిక సంక్షోభం, ఆ పై కోవిడ్ సంక్షోభంతో అల్లాడిపోయి అలిసిపోయి ఉన్న ప్రజలను..జగన్ మేలుకొలిపినట్లయింది ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటనతో.  ఈ సంక్షోభాలతో ప్రైవేటులో ఉన్న ఉద్యోగాలు కూడా పోయి నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో వారంతా ఇప్పుడు ఆగ్రహావేశాలతో ఆందోళనలకు దిగుతున్నారు. జగన్ కదిపిన ఈ తేనెతుట్టు.. ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. రాజకీయంగా ఇది తమకు నష్టమే చేస్తుందని వైసీపీ నేతలు కూడా గింజుకుంటున్నారని తెలుస్తోంది.

సీఎం మాత్ర‌మే సేఫ్‌! సామాన్యుల ర‌క్ష‌ణ మాటేంటి? బ‌్లేడ్ బ్యాచ్ దొరికేనా?

తాడేప‌ల్లిలో ముఖ్య‌మంత్రి నివాసం. ఆయ‌న ప్యాలెస్ మాత్రం ఫుల్ సేఫ్‌. ప్ర‌జావ్య‌తిరేక‌త విప‌రీతంగా ఉండ‌టంతో సీఎం ఇంటి చుట్టుప‌క్క‌ల ‌టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పోలీసుల క‌న్నుగ‌ప్పి చీమ కూడా అటువైపు వెళ్ల‌లేదు. సీఎం ఇల్లు మాత్ర‌మే సేఫ్‌గా ఉంటే స‌రిపోతుందా? రాష్ట్రమంతా సుర‌క్షితంగా ఉండాల్సిన ప‌నిలేదా? ఎక్క‌డి వ‌ర‌కో ఎందుకు.. ముఖ్య‌మంత్రి ఇంటికి జ‌స్ట్ కిలోమీట‌రున్న‌ర దూరంలోనే దారుణ అత్యాకాండ జ‌రిగడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ ప్రాంతం అరాచ‌క శ‌క్తుల‌కు అడ్డాగా మారడంపై ఎందుకు ఉదాసీనంగా ఉంటోంది ఈ ప్ర‌భుత్వం. తాడేప‌ల్లి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో, కృష్ణాన‌ది తీరంలో ఇటీవ‌ల కాలంలో వ‌రుస‌గా నేరాలు-ఘోరాలు జ‌రుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్న‌ట్టు? జ‌గ‌న్ ఇంటికి మాత్ర‌మే కాప‌లా కాస్తే స‌రిపోతుందా? ఆ ప‌క్క‌నే అఘాయిత్యాలు జ‌రిగినా, హ‌త్య‌లు జ‌రిగినా ప‌ట్టించుకోరా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు ప్ర‌జ‌లు. తాడేపల్లి పుష్కరఘాట్‌లో జ‌రిగిన అత్యాచార ఘ‌ట‌న‌లో నిందితులెవ‌రో ఇంకా గుర్తించ‌లేక‌పోయారు పోలీసులు. ప్ర‌త్యేక బృందాల‌తో గాలిస్తున్నా.. బ్లేడ్ బ్యాచ్‌పై అనుమానం ఉన్నా.. ద‌ర్యాప్తు ముందుకు సాగ‌డం లేదు. ఇప్పటికే విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లోని రౌడీషీటర్లు, ఇతర అనుమానితులను విచారిస్తున్నారు. ఒక అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే బాధితురాలికి కాబోయే భర్తను కూడా విచారించినా.. అతని పాత్ర ఏమీ లేదని తేల్చినట్టు సమాచారం. ఘటనపై సీఎం జ‌గ‌న్ తీరిగ్గా స్పందించారు. పోలీస్ అధికారులను ఆరాతీశారు. హోంమంత్రి సుచరిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితను జీజీహెచ్ కు పంపారు. ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించి ధైర్యం చెప్పారు మ‌హిళా మంత్రులు. బాధితురాలికి 5 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించింది ప్ర‌భుత్వం. మహిళల భద్రత కోసం అనేక చట్టాలున్నా ఉన్మాదులు రెచ్చిపోతున్నారని హోంమంత్రి సుచరిత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్ వినియోగం ఎక్కువైందన్న సమాచారం ఉంద‌న్నారు హోంమంత్రి. ఆ ప్రాంతంలో నిఘా పెంచినట్లు సుచరిత చెప్పారు.  స్వ‌యాన హోంమంత్రే తాడేప‌ల్లి పరిస‌ర ప్రాంతాల్లో గంజాయి, డ్ర‌గ్స్ బ్యాచ్‌లు ఉన్నాయ‌ని అన‌టం ప్ర‌భుత్వ చేత‌గానిత‌నానికి నిద‌ర్శ‌న‌మ‌ని ప్ర‌తిప‌క్షం మండిప‌డుతోంది. ప్ర‌మాదం ఉంద‌ని తెలిసినా.. నేరం జ‌రిగే వ‌ర‌కూ ఎందుకు ఉపేక్షించార‌ని నిల‌దీస్తున్నారు. తాగుబోతులు, దోపిడీ ముఠాలు, బ్లేడ్ బ్యాచ్‌లు.. సీఎం ఇంటి స‌మీప ప్రాంతాల్లోనే సంచ‌రిస్తుండ‌టం.. ముఖ్య‌మంత్రి ఇంటి చుట్టుప‌క్క‌ల ప్రాంతాలు అరాచ‌క‌, అసాంఘీక కార్య‌క‌లాపాల‌కు అడ్డాగా మారడం దారుణ‌మైన విష‌య‌మ‌ని నిందిస్తున్నారు.  ఇక ఆదివారం జ‌రిగిన ఉదంతం అత్యంత దారుణం. కాబోయే భ‌ర్త‌తో క‌లిసి సీతానగరం పుష్కరఘాట్‌లో విహారానికి వెళ్లిన యువ‌తిపై ఇద్ద‌రు దుండ‌గులు అత్యాచారానికి పాల్ప‌డ‌టం క‌ల‌క‌లం రేపింది. ఆ జంట‌పై ఇద్ద‌రు దుర్మార్గులు వెనుక నుంచి దాడి చేయ‌డం.. యువకుడి చేతులు కాళ్లు కట్టేసి... బ్లేడ్‌తో గొంతు కోస్తామ‌ని బెదిరించి.. యువతిని ఇసుక‌లో వేసి ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అత్యాతారం చేయ‌డం దారుణం. ఆ త‌ర్వాత దుండ‌గులు బాధితురాలి‌ చెవి రింగులు, డబ్బులు, సెల్ ఫోన్ తీసుకొని.. నాటుపడవలో నదిలోంచి విజ‌య‌వాడ‌వైపు పారిపోగా.. వారికోసం విస్తృతంగా గాలిస్తున్నారు పోలీసులు. ఎలాంటి ఆధారాలు లేని ఈ కేసును చేధించ‌డం ఖాకీల‌కు స‌వాల్‌గా మారింది. పాత నేర‌స్తుల‌ను, అనుమానితుల‌ను ప్ర‌శ్నిస్తూ.. ఆ దిశ‌గా కేసును కొలిక్కితెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా తాడేప‌ల్లి ప‌రిస‌ర ప్రాంతాల‌ను నేర ర‌హితంగా, ప్ర‌శాంతంగా మార్చాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.  సీఎం మాత్ర‌మే సేఫ్‌గా ఉంటే స‌రిపోదు.. సామాన్యులూ సుర‌క్షితంగా ఉండేలా చేయాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానిదే. మ‌రి, మ‌రో దారుణం జ‌ర‌గ‌కుండా పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటారా? పుష్క‌ర‌ఘాట్ కేసును వెంట‌నే సాల్వ్ చేస్తారా?  

పాత లోకేష్ కాదు.. ఇప్పుడు చూడు! వైసీపీకి చుక్కలే..

మొన్నటిదాకా ఆయననే తిట్టారు. ఆయన మీదే ఫోకస్ చేశారు. ఆయన కదిలితే చాలు విమర్శల వర్షం కురిపించారు. ఆయన కొడుకును ఎగతాళి చేయడం తప్ప విమర్శలు చేసేవారు కాదు. ఏమన్నా సరే తీసిపారేసేవారు. అలాంటిది ఇప్పుడు ఆ కొడుకుపైనే కస్సుమంటున్నారు. నీకెంత ధైర్యం అంటూ విరుచుకుపడుతున్నారు. ఊరుకోమంటూ వార్నింగులు ఇస్తున్నారు.  జగన్మోహన్ రెడ్డిని తిట్టినందుకే లోకేష్ పై వైసీపీ నేతలు మండిపడుతున్నారనుకుంటే పొరపాటు...లోకేష్ స్టయిల్ మారింది..మాట మారింది.. మాటల తూటాలతో చురుక్కుమనిపిస్తున్నాడు. జనం, జనంతో పాటు  టీడీపీ కేడర్ సైతం ఇప్పుడు లోకేష్ ఏం చెబుతున్నాడనేదానిపై దృష్టి పెడుతున్నారు. మారుతున్న ఈ వాతావరణం వైసీపీకి నచ్చలేదు. అందుకే టార్గెట్ మార్చుకున్నారు.. రెచ్చిపోయి దాడులు చేయడం మొదలెట్టారు. అవును..లోకేష్ స్టయిల్ మారింది. ఈ విషయం రెండు, మూడు నెలల క్రితమే మీడియాలో వచ్చినప్పటికీ... ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి. గడ్డం పెంచితే సరిపోదు అంటూ ఓ మంత్రి లోకేష్ పై సెటైర్ వేశాడు. అంతకు ముందు బయటకు రావటం లేదన్నారు. బయటకు వచ్చి విమర్శలు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ఆ పంచ్ డైలాగులకు ఆశ్చర్యపోతున్నారు. ట్విట్టర్ లో కనపడినప్పుడు..ఎవరితోనో రాయించుకున్నాడని కామెంట్ చేశారు. ఇప్పుడు బయటికొచ్చి అంతకంటే ఘాటుగా డైలాగులు వదులుతుంటే షాకవుతున్నారు.  గతంలో లోకేష్ పొరపాటున పలికిన పదాలను పట్టుకుని ఆ వీడియోలను వైరల్ చేశారు వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్. జగన్ అధికారంలోకి వచ్చాక బయట, అసెంబ్లీలోనూ మాట్లాడిన తప్పులను ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న లోకేష్ ఇప్పుడు పదునైన మాటలతో కరకుగా మాట్లాడుతూ అధికార పార్టీ నేతల ఫ్రస్టేషన్ పెంచేస్తున్నారనే కామెంట్లు వినపడుతున్నాయి. బరువు బాగా తగ్గిపోయిన లోకేష్.. గడ్డం పెంచి.. మాస్ లుక్ లోకి వచ్చేశారు. గతంలో క్లీన్ షేవ్ తో క్లాస్ గా ఉండే లోకేష్ ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. ఎంతలా అంటే... వైసీపీని సమర్ధించే పోర్టల్స్ లో అసలు కొత్త ఫోటోలే వాడటం లేదు.. గతంలోని ఫోటోలనే పెట్టి వార్తలు రాస్తున్నారు. అంటే ఆ లుక్ లో ఎంత ఛేంజ్ వస్తే..దానిని వాడటానికి వారు భయపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఫిజికల్ గా కూడా లోకేష్ తన ఫిట్ నెస్ బాగా పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మీడియాలో చూస్తున్న లోకేష్ పర్సనాలిటీకి...గతంలో చూసినదానికి చాలా తేడా కనపడుతోంది. ఇంకొన్ని రోజుల్లో మరింత ఛేంజ్ వస్తుందని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. చాలా పట్టుదలతో లోకేష్ తన ఫిట్ నెస్ పెంచుకుంటున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.మొన్నటికి మొన్న టెంత్, ఇంటర్ పరీక్షలపై గట్టిగా పట్టుబట్టి వ్యూహాత్మకంగా వ్యవహరించిన లోకేష్ విజయం సాధించారు. కేవలం లోకేష్ ఆ సమస్యను ఎత్తుకున్నందుకే నిర్ణయం తీసుకోని జగన్..ఇప్పుడు సుప్రీంకోర్టు ఒత్తిడితో నిర్ణయం తీసుకోక తప్పని పరిస్దితిలో పడ్డారు. విజయం ముందే ఫిక్స్ అయిపోయిన పోరాటాన్నిలోకేష్ తెలివిగా తీసుకున్నట్లయింది. అయితే లోకేష్ ఇంకా అగ్రెసివ్ గా ఉండాలని..సమస్యలపై పోరాటం చేసి చూపించాలని.. కేవలం ట్విట్టర్ లో స్టేట్ మెంట్ ఇవ్వడం.. ఏదైనా ఘటన జరిగితే అక్కడకు వెళ్లి ప్రెస్ తో మాట్లాడటం కాదని.. పార్టీ కార్యకర్తలతో ఆందోళనలను నిర్వహించి..తాను స్వయంగా పాల్గొనాలని రాజకీయ వర్గాలు సూచిస్తున్నాయి

 కేసీఆర్ కు ఏపీ మంత్రి కౌంటర్.. ఏమన్నారంటే.. ?

తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జల వివాదం ముదురుతోంది. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు నుంచి అక్రమంగా నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా కొత్త ఎత్తిపోథలు కడుతుందని తెలంగాణ సర్కార్ ఆరోపిస్తోంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారనే ప్రచారం జరిగింది. జగన్ .. ఆయన తండ్రి వైఎస్సార్ కంటే మోనార్క్ లా వ్యవహరిస్తున్నారని, చట్టాలను కూడా గౌరవించడం లేదని కేసీఆర్ ఫైరయ్యారట. జగన్ తీరుతో ఏపీకే నష్టం జరుగుతుందని కూడా చెప్పారుట. ఏపీ ప్రాజెక్టులు ఆగకపోతే.. ఎగువన కృష్ణా నదిపై కొత్త బ్యారేజీలు కడతామని కూడా తెలంగాణ కేబినెట్ హెచ్చరించింది. తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో ఏపీ సీఎంతో ఆయనకు గ్యాప్ పెరిగిందనే చర్చ జరుగుతోంది. అయితే తాజాగా తెలంగాణ కేబినెట్ ప్రకటనకు కౌంటరిచ్చారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఏపీ ప్రాజెక్ట్‌లపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరికాదని  అన్నారు. కేంద్ర జల సంఘం కేటాయింపులకు లోబడే ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్ట్‌ల నిర్మాణం జరుగుతోందని మంత్రి అనిల్ వివరణ ఇచ్చారు.  పోతిరెడ్డి పాడు నుంచి నీళ్లను తరలిస్తే తప్పేంటని నిలదీశారు. శ్రీశైలంలో  840 అడుగులకు లెవెల్ పడిపోతే ఏపీ చుక్కనీరు తీసుకునే అవకాశం లేదన్నారు.  తాము ఎక్కడా కేటాయింపులు మించి వెళ్లడం లేదని చెప్పారు అనిల్ కుమార్ యాదవ్. తెలంగాణలోనే అనుమతులు లేకుండానే ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో కల్వకుర్తి, నెట్టెంపాడు సామర్థ్యం పెంచుకున్నారని మంత్రి మండిపడ్డారు.రాజోలిబండ ప్రాజెక్ట్‌కి 4 టీఎంసీల కేటాయింపు ఉందన్న అనిల్ కుమార్..  ఏపీ ప్రయోజనాలు కాపాడటంలో సీఎం జగన్‌ ముందుంటారని తెలిపారు.  వంశధార ట్రిబ్యునల్ నుంచి నేరడి ప్రాజెక్ట్ కట్టేందుకు అనుమతి ఇచ్చింది. త్వరలో ప్రారంభిస్తామన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రెండు రాష్ట్రాలు కలిసుండాలి అని కోరుకున్నారని మంత్అరి అనిల్భి చెప్పారు.  ఒక అడుగు ముందుకు వేసి స్నేహ హస్తం అందించే గొప్ప మనిషి తమ ముఖ్యమత్రి అని అన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టులు సృష్టించబడ్డాయని.. వాటి కెపాసిటీ పెంచుకునేందుకు మాత్రమే తాము ప్రయత్నం చేస్తున్నామని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు.

కరోనాకు కేసీఆర్ వాడిన మందులు ఇవే..

దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ బీభత్సం స్పష్టించింది. కొన్ని రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. తెలంగాణలోనూ కొవిడ్ సెకండ్ వేవ్ లో వైరస్ వేగంగా విస్తరించింది. మొదటి వేవ్ తో పోలిస్తే రెండో దశలో కేసులు ఎక్కువగా రావడమే కాక మరణాలు భారీగా  నమోదయ్యాయి. పేద, ధనిక , సామాన్య, వీఐపీ అన్న తేడా లేకుండా అందరిని కరోనా కబళించింది. ప్రగతి భవన్ లేదా ఫామ్ హౌజ్ లోనే ఎక్కువగా గడిపే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా కరోనా సోకింది. కేసీఆర్ వయసు, ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా..  కరోనాను ఎలా జయిస్తారో అన్న ఆందోళన వ్యక్తైమంది. టీఆర్ఎస్ నేతలైతే చాలా కంగారు పడ్డారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కొందరు పూజలు కూడా చేశారు. అయితే అందరి భయాలను అధిగమిస్తూ త్వరగానే కరోనా నుంచి కోలుకున్నారు సీఎం కేసీఆర్. ఆయన ఫామ్ హౌజ్ లో ఐసోలేషన్ లో ఉండే మహమ్మారిని జయించారు. హాస్పిటల్ లో అడ్మిన్ కావాల్సిన పరిస్థితి కూడా రాలేదు. కేసీఆర్ త్వరగానే కరోనాను జయించడంతో అంతా ఊపీరి పీల్చుకున్నారు. తాజాగా కరోనా సోకినప్పుడు తాను తీసుకున్న ట్రీట్ మెంట్ ఏంటో తెలిపారు కేసీఆర్. వరంగల్ లో పర్యటించిన ముఖ్యమంత్రి.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ... తాను కరోనాను ఎలా జయించారో వివరించారు.  క‌రోనా మ‌హమ్మారి విష‌యంలో మీడియా సంస్థ‌లు ప్ర‌జ‌ల్లో భ‌యోత్పాతం సృష్టిస్తున్నాయి అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది మంచిది కాదన్నారు. క‌రోనా ప‌ట్ల తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ప్ర‌సారం చేస్తే మంచిది. కానీ ఆందోళ‌న క‌లిగించే అంశాలు ప్ర‌సారం చేసి ప్ర‌జ‌ల బ‌తుకుల‌తో ఆట‌లాడుకోవ‌ద్దని సూచించారు. త‌న‌కు క‌రోనా వ‌చ్చిన‌ప్పుడు రెండు ట్యాబ్లెట్లు మాత్ర‌మే వేసుకున్నాననని చెప్పారు. పారాసిట‌మాల్‌తో పాటు ఒక యాంటిబ‌యోటిక్ ట్యాబ్లెట్ వేసుకున్నా.. డీ విట‌మిన్ వేసుకోమ‌ని చెప్పారు.. కానీ అది తాను వేసుకోలేదని కేసీఆర్ తెలిపారు. అంత‌లోనే క‌రోనా త‌గ్గిపోయిందన్నారు. జాగ్ర‌త్త‌లు పాటిస్తే క‌రోనాను నియంత్రించ వచ్చన్నారు. మీడియా మిత్రులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి, అన‌వ‌స‌రంగా లేని ఉత్పాతాన్ని సృష్టించ‌వ‌ద్దు అని సీఎం కేసీఆర్ సూచించారు. థర్డ్ వేవ్‌ వస్తుందని జరుగుతున్న ప్రచారంపైనా సీఎం కేసీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ‘‘స్కూళ్లు లేక ఇళ్లన్నీ అంగడంగడి చేస్తున్నారు పిల్లలు. వాళ్లకు కరోనా వస్తుందన్న పుకార్లు పుట్టాయి. వీనికి ఫోన్ చేసి చెప్పిందా. ఈ తాప అచ్చి పిల్లలకు పడతాననని.. ఎట్ల పుట్టించినరంటే... ఇప్పటికే పుస్తలతాళ్లు అమ్ముకుని లక్షలు కుమ్మరించారు జనం. దండం పెట్టి చెబుతున్నా... పుకార్లు మానండి. మాస్కు పెట్టుకోమని చెప్పండి. అంతేకాని భయపెట్టకండి. దీనికి ఇన్ని కథలా... ఇన్ని ప్రచారాలా.. ఇన్ని భయోత్పాతాలా... దయచేసి మీడియా వాళ్లు ఇది గుర్తించాలి. ప్రజల బతుకులతో ఆడుకోవడం సరికాదు’’ అని వరంగల్ సభలో కేసీఆర్ అన్నారు. 

కుల బహిష్కరణ.. పోలీస్టేషన్.. ఇంటిపై దాడి..

కాలి నడక నుండి రాకెట్ ప్రయాణం. అది మానవుడి నుండి అలెక్సా వరకు ఈ  సమాజంలో ఎన్నో పరిణామాలు జరిగిన ఇంకా మారానిది..రూపుమాపనిది కులవ్యవస్థ.. అందరి రంగులు వేరు కావచ్చు కానీ, రక్తం ఒకటే.. భాషాలు యాసలు వేరు కావచ్చు కానీ ప్రాణం ఒక్కటే.. ఇలా అందరికి  అన్ని పోలికలు ఉన్న.. అన్ని  రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ శ్రీ శ్రీ కవిత్వం లాగ పదండి ముందుకు అని దూసుకుపోతుంటే.. ఇంకా ఈ సమాజంలో కుల గజ్జీ వదలడంలేదు. కొన్ని చోట్ల ఆ కులగజ్జె పరిపాలన చేస్తుంది. తాజాగా జగిత్యాల జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కుల బహిష్కరణ పేరుతో దుండగులు రెచ్చిపోయారు. ఓ కుటుంబంపై పడి బీభత్సం సృష్టించారు. చంపుతామని బెదిరించడమే కాదు.. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జగిత్యాల రూరల్‌ మండలంలోని మోతే గ్రామంలో బావాజీ పల్లెలో  భూ పంచాయతీ విషయంలో కొండపల్లి నీలయ్య కుటుంబాన్ని గ్రామంలోని కులస్థులు ఆంక్షలు విధించారు. ఆ కుటుంబసభ్యులను ఎవరిని ఎటువంటి కార్యక్రమాలకు పిలవ్వద్దని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బహిష్కరణపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ.. కులపెద్దలు రెచ్చిపోయారు. నీలయ్య ఇంట్లో లేని సమయంలో మిగిలిని కుటుంబసభ్యులపై ఆడవాళ్లు పిల్లలు అని చూడకుండా దాడికి దిగారు. ఇంట్లో టీవీ, ఫర్నీచర్‌, ఫ్రిడ్జ్‌తో పాటు ఇంట్లోని వస్తువులను పగలగొట్టారు.  టూ వీలర్‌, సీసీటీవీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. మొత్తం 15 మంది వరకు వచ్చి తమ ఇంటిపై దాడికి దిగారని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై నీలయ్య కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బవాజీపల్లెకు చెందిన వీరయ్య, గంగారావు, సంపత్‌, రవి, మస్తాన్‌ అనే ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కులాలు లేని మతాలు లేని నవసమాజమే మన ధ్యేయంగా ముందుకు సాగాలి.. ఆ రోజు కోసం అందరు ఆలోచించాలి. అందుకు ముందుకు అడుగులు వెయ్యాలి.   

జ‌స్టిస్ క‌న‌గ‌రాజ్‌.. మ‌ళ్లీ మూన్నాళ్ల ముచ్చ‌టేనా?

జస్టిస్‌ కనగరాజ్‌. జ‌స్టిస్ చౌద‌రి రేంజ్‌లో నిరుడు ఏపీలో ఎంట్రీ ఇచ్చారు. నిమ్మ‌గ‌డ్డ ప్లేస్‌లో ఎస్ఈసీ సీట్లో కూర్చొన్నారు. రాజ‌కీయంగా ఆట‌లో అర‌టిపండు అయ్యారు. చెన్నై నుంచి రాత్రికిరాత్రి ఎలాగైతే డౌన్‌లోడ్ అయ్యారో.. అలానే మ‌ళ్లీ పెట్టాబేడా స‌ర్దేసుకొని చెన్నై తిరుగెళ్లిపోయారు. క‌ట్‌చేస్తే.. లేటెస్ట్‌గా మ‌ళ్లీ ఏపీలో అడుగుపెట్టారు జ‌స్టిస్ క‌న‌గ‌రాజ్‌. ఈసారి మ‌రో ప‌ద‌వి.. మ‌రో కాంట్ర‌వ‌ర్సీ.. మ‌ళ్లీ నిబంధ‌న‌లు తుంగ‌లో తొక్కి.. ఏపీ పోలీసులు అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నార‌నేది విప‌క్షాల విమ‌ర్శ‌. పోలీస్ పెద్ద‌ల నుంచి కానిస్టేబుల్ వ‌ర‌కూ.. అనేక మందిపై ఏదో ఒక సంద‌ర్భంలో ఆరోప‌ణ‌లు వ‌స్తూనే ఉన్నాయి. పాల‌కుల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ఖాకీలు చేస్తున్న ఓవ‌రాక్ష‌న్ అంతాఇంతా కాదు. ఇటీవ‌ల జ‌రిగిన ర‌ఘురామ ఎపిసోడ్‌లోనైతే సీఐడీ అడిష‌న‌ల్ డీజీ సునీల్‌కుమార్‌పై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఇక‌, అచ్చెంనాయుడు నుంచి ధూళిపాళ్ల న‌రేంద్ర వ‌ర‌కూ టీడీపీ బ‌డా నాయ‌కుల‌పై పోలీస్ కేసులు న‌మోద‌వ‌డంతో పాటు.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేసే వారినీ కేసుల‌తో వేధిస్తున్నార‌ని.. గ్రామాల్లో ఒక వ‌ర్గానికి ఖాకీలు స‌హ‌క‌రిస్తున్నార‌ని.. ఒక వ‌ర్గం వారిపైనే కేసులు బ‌నాయిస్తున్నార‌ని.. ఇలా అనేక విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. పోలీసుల ప‌ని తీరుపై ప్ర‌జ‌ల ఉంచి భారీగా ఫిర్యాదులు వ‌స్తున్నాయి. అందుకే, రాష్ట్ర పోలీసు కంప్లయింట్‌ అథారిటీ (పీసీఏ) అధిప‌తిగా త‌మ వారు ఉంటే ప్ర‌భుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంద‌ని భావించిన‌ట్టుంది జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు. అందుకే కాబోలు.. గ‌తంలో ఓసారి త‌మ‌కు స‌హ‌క‌రించి అబాసు పాలైన జ‌స్టిస్ క‌న‌గ‌రాజ్‌కు కృత‌జ్ఞ‌త‌గా  పీసీఏ ఛైర్మన్ సీటులో కూర్చోబెట్టార‌ని ప్ర‌తిప‌క్షం ఆరోపిస్తోంది.  అయితే, గ‌తంలో ఎస్ఈసీ ఎపిసోడ్ మాదిరే ఈ సారి కూడా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా పీసీఏ ఛైర్మ‌న్ ఎంపిక జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ పోలీసు కంప్లయింట్‌ అథారిటీ రూల్స్‌- 2020లోని సెక్షన్‌ 4(ఏ) ప్రకారం రిటైర్డ్‌ హైకోర్టు జడ్జిని చైర్మన్‌గా నియమించాలి. అయితే, ఆయన 65 ఏళ్ల వయసు వచ్చేవరకు.. లేదంటే మూడేళ్లు.. ఏది ముందైతే అప్పటి వరకు ఆ పదవిలో ఉండొచ్చు. 65 ఏళ్లు దాటిన వారు ఈ పోస్టులో కొనసాగడానికి వీల్లేదు. కనగరాజ్‌ వయస్సు దాదాపు 75 ఏళ్లు. రూల్స్‌ ప్రకారం ఆయన ఆ పోస్టుకు అనర్హులు అవుతార‌ని చెబుతున్నారు. ఎవ‌రైనా హైకోర్టులో కేసు వేస్తే.. మ‌ళ్లీ ఈయ‌న పోస్ట్ ఊస్ట్ అవ‌డం గ్యారంటీ అంటున్నారు.  త‌మ‌కు ఇబ్బందిగా మారిన, మారుతాయ‌ని అనుకున్న పోస్టుల్లో ప్ర‌తీసారి క‌న‌గ‌రాజ్‌తోనే తొండాట అడుతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారిందని అంటున్నారు. గ‌తంలో మాదిరే ఈసారీ ఆయ‌న మ‌ళ్లీ ఆట‌లో అర‌టిపండు అవక త‌ప్ప‌దంటున్నారు. మ‌రి, ఇలాంటి వివాదాస్ప‌ద విష‌యాల‌కు సీఎం జ‌గ‌న్‌రెడ్డి ఎందుకు ప‌దే ప‌దే క‌న‌గ‌రాజ్‌నే ఎంచుకుంటున్నారో.. క‌న‌గ‌రాజ్ సైతం సీఎం జ‌గ‌న్‌రెడ్డికి ఎందుకు ప‌దే ప‌దే స‌హ‌క‌రిస్తున్నారో తెలీని ప‌రిస్థితి.   

యడ్డీ  ఆయన లెక్కే వేరప్పా 

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, నక్కను తొక్కిన నాయకుడు. ఆయన కుర్చికి ముప్పు ఎప్పుడూ పోంచే ఉంటుంది. ఆయన ప్రమాణ స్వీకారానికి ముందు నుంచే పార్టీలో అసమ్మతి రాజుకుంటుంది. ఆయన పాలనలో ప్రతిపక్షాల కంటే ముందు నుంచే సొంత పార్టీ నేతలకు లోపాలు కనిపిస్తాయి. అవినీతి దర్శనమిస్తుంది. ఆయన రాజీనామాకు డిమాండ్ కూడా ముందు సొంత పార్టీ అసమ్మతి నేతల నుంచే ఇనిపిస్తుంది.  సుమారు రెండు మూడు నెలలుగా బీజేపీ అసమ్మతి నాయకులు ఆయనను గద్దేదింపే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒక దశలో అయిపొయింది, యడ్డీ ఇక ఇంటికే, అనే వరకు ఊహాగానాలు పరుగులు తీశాయి. యడ్డీ అనుకూల, వ్యతిరేక వర్గాలు రెండూ ఢిల్లీ చేరి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు, సంజాయిషీలు సమర్పించుకున్నాయి. రాష్ట్రంలో అయితే, ముఖ్యమంత్రి మార్పు తధ్యమన్న సీన్ క్రియేట్ అయింది. అసమ్మతి రాగానికి విపక్షాలు స్వరం కలిపాయి. మీడియా అయితే  యడ్డీ ఉద్వాసనకు ముహూర్తాలు కూడా నిర్ణయించింది.  అయితే, చివరాఖరుకు, “గజం మిథ్య, పలాయనం మిథ్య" అన్నట్లుగా అంతా తేలిపోయింది. రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించేందుకు అధిష్టానం దూతగా బెంగుళూరు చేరుకున్న, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక వ్యవహరాల ఇంచార్జి అరుణ్ సింగ్, మూడు రోజుల పాటు పరిస్థితిని మదింపు వేసి, ముగ్గురు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ యడ్డీకి జై కొట్టారని తేల్చారు. ఈ మేరకు ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నివేదిక సమర్పించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సీపీ యోగీశ్వర్, హుబ్బాలి- ధార్వాడ్ పశ్చిన ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్,ఎమ్మెల్సీ విశ్వనాథన్ మినహా మిగిలిమ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ ముఖ్యమంత్రిని మార్చాలని కోరడం లేదని ఆయన నివేదికలో స్పష్టం చేశారు. అయితే అదే సముంలో ఆయన వివిధ విషయాలకు సంబంధించి బహిరంగంగా ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్న నేతలపై  క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ అగ్రనాయకత్వాన్ని కోరారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను బహిరంగంగా చర్చించడం వలన అనవసర ఊహాగానాలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని, పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని,  కాబట్టి అలాంటి నాయకులపై క్రమశిక్షణ చర్యలు తెసుకోవడం తక్షణ అవసరమని ఆయన  పేర్కొన్నారు.  అరుణ సింగ్ ఇచ్చిన నివేదికతో, యడ్డీ ఉద్వాసన వట్టిదే అని తేలిపోయింది. అయితే, యడియూరప్ప ఇలా సేవ్’ అయిపోవడం ఇదే మొదటి సారి కాదు. నిజానికి ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడమే పార్టీ పెద్దలు ఇద్దరికీ ఇష్టం లేదని పార్టీ వర్గాల సమాచారం. అయితే, గతంలో, ఆయనపై తీవ్ర అవినీతి, భూ కుంభకోణం ఆరోపణలు వచ్చి, లోకా యుక్త  విచారణలో ఆయన దోషిగా తేలడంతో, అధిష్టానం ఆయన్ని తప్పించింది. ఆ నేపధ్యంలో ఆయన పార్టీపై తిరుగుబాటు చేశారు. సొంత పార్టీ పెట్టి బీజేపీ ఓటమికి కారణమయ్యారు. అయితే, ఆ తర్వాత ఆయన మళ్ళీ పార్టీలో చేరడంతో మళ్ళీ పార్టీ పగ్గాలు, ప్రభుత్వ పగలు కూడా అయన చేతికే వచ్చాయి. ఈ నేపధ్యంలో పార్టీ అధినాయకత్వం ఇష్టం ఉన్న లేకున్నా యడ్డీకి తలోగ్గుతోంది. ఇప్పుడ మళ్ళీ ఆ మంత్రమే పనిచేసిందని, మరో సంవత్సరంన్నరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఇప్పుడు ఆయన జోలికి వెళ్ళడం ఎందుకనే ఉద్దేశంతో ఆయన్నే కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే, విశ్లేషకులు యడ్డీ లెక్కే వేరప్పా .. అంటున్నారు.

సీఎస్ పదవీ కాలం పొడిగింపు లేనట్లే కొత్త సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్?

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్‌ పదవీ కాలం జూన్ నెలాఖరుకు ముగుస్తుంది. అయినా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కనీసం మరో ఆరు నెలల వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగించేందుకు సుముఖంగా ఉన్నారు. అయన సుముఖంగా ఉండడమే కాదు, అందుకు కేంద్రాన్ని ఒప్పించేందుకు ఆయన తమ పలుకుబడిని వినియోగించారు. ఇటీవల ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ,  కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాల వద్ద సీఎస్ పదవీ కాలం పొడిగింపు ప్రస్తావన చేశారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కారణాలు ఏవైనా, సీఎం అభ్యర్ధనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లుగా కూడా వార్తలొచ్చాయి. ముందు మూడు నెలలు, ఆ తర్వాత మరో మూడు నెలలు మొత్తం ఆరు నెలలు పొడిగింపు ఉంటుందని, అధికార వర్గాలను ఉతంగిస్తూ వార్త లొచ్చాయి.  అయితే తాజా సమాచారం ప్రకారం, ఆదిత్యనాధ్ దాస్‌కు, పొడిగింపు ఇవ్వకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. అందుకు ప్రధానంగా రెండుకారణాలు చెపుతున్నారు. అందులో, మొదటి కారణం, ‘దేవుడు వరమించిన పూజారి కరుణించలేదు’ అన్నట్లుగా ఆదిత్యానాథ్ దాస్ పదవీ కాలం పొడిగింపు ముఖ్యమత్రికి ఇష్టం (అవసరం) అయినా, ముఖ్యమంత్రి కార్యాలయంలో చక్రం తిప్పే ఒక అస్మదీయ అధికారికి అస్సలు ఇష్టం లేదు. అందుకే, ఆయన చాకచక్యంగా సిఎస్ పదవీ కాలం ఫైల్’ను పక్కదారి పట్టించి, సకాలంలో ముఖ్యమంత్రి టేబుల్ మీదకు రాకుండా చక్రం తిప్పారు. చివరకు ఆయన ఆశించిన విధంగానే సీఎస్ పదవీ కాలం పొడిగింపు అభ్యర్ధన లేఖ కేంద్రానికి  ఆలస్యంగా చేరింది. దీంతో ఆదిత్యానాథ్ పదవీకాలం పొడిగింపు అంశం సాంకేతిక చిక్కుల్లో చిక్కుకు పోయిందని, ఈ కారణంగా పొడిగింపు ఉండక పోవచ్చని అధికారులు చెపుతున్నారు.  అదలా ఉంటే  కొద్ది రేజుల క్రితం తెలుగు దేశం పార్టీ రాజ్య సభ సభ్యుడు కనకమేడల రవీందర్ కూడా, సీఎస్’కు  సర్వీసు పొడిగింపు ఇవ్వవద్దని కోరుతూ డిఓపిటికి లేఖ రాశారు. అయన తమ లేఖలో అధిత్యనాద్ దాస్’కు జగన్ అక్రమాస్తుల కేసులతో ఉన్న లింకులను ప్రస్తావించారు. “2013, జగన్ రెడ్డిపై సేబేఐ నమోదు చేసిన  క్విట్ ప్రో కో కేసులో ఆదిత్యానాథ్ కూడా తీవ్ర ఆరోపణలు ఎదుర్కున్నారు. జలవనరులశాఖ కార్యదర్శిగా, జగనమోహన్ రెడ్డి పెట్టుబడులు పెట్టిన ఇండియా సిమెంట్స్’కు నీటిని కేటాయించడంలో అధికార పరిధిని అతిక్రమించి అనవసర సహాయ, సహాకారాలు అందిచారు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటుగా అదిత్యానాథ్ పై కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగాలపై, సీబీఐ అనేక సెక్షన్ల  కింద కేసు నమోదు చేసింది. 2019 సెప్టెంబర్’లో ఆకేసులకు సంబంధించి సుప్రీం కోర్టు తిరిగి నోటీసులు జారీ చేసింది. ఈ నేపధ్యంలో వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారి పదవీ కాలం పొడిగించడం సరికాదు” అని కనకమేడల తమ  లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోని ముఖ్య అధికారి ప్లే చేసిన ట్రిక్ పనిచేసిందో లేక కనకమేడల రాసిన లేఖ ప్రభావం చూపిందో గానీ, మొత్తానికి ఆదిత్యానాథ్ దాస్ పదవీ కాలం పొడిగింపు అవకాశాలు అటకెక్కాయి.  అందుకు అవకాశమే లేదని, అధికార వర్గాలు చెపుతున్నాయి. ఈ నేపధ్యంలో,  ఏపీ కొత్త సీఎస్ ఎంపికకు రేస్ మొదలైనట్లు  చెపుతున్నారు. ఈ రేసులో ప్రస్తుత సమాచారం మేరకు, సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్‌కుమార్ ప్రసాద్ ముందున్నారు. 1987 బ్యాచ్‌కు చెందిన నీరబ్‌కుమార్ ప్రసాద్‌ను చీఫ్ సెక్రటరీగా నియమించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 1986 బ్యాచ్‌కి చెందిన సతీష్‌చంద్ర, 1987 బ్యాచ్‌కే చెందిన మరో సీనియర్ ఐఏఎస్ జెఎస్వీ ప్రసాద్, 88 బ్యాచ్‌కు చెందిన గిరిధర్, పూనం మానకొండయ్య రేసులో ఉన్నారు. వీరిలో ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్న గిరిధర్, రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖంగా లేరంటున్నారు. ఇక ముక్కసూటి అధికారిగా పేరున్న జేస్వీ ప్రసాద్‌ను తీసుకోవడానికి ప్రభుత్వ పెద్దలు సుముఖంగా లేరని చెబుతున్నారు. సతీష్‌చంద్ర గత సీఎం చంద్రబాబు పేషీలో కీలకపాత్రపోషించినందున, ఆయనకు అవకాశాలు ఉండకపోవచ్చంటున్నారు. అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ ఏమంటే, ప్రస్తుత సీఎస్ పదవీ కాలం పొడిగింపుకు చక్రం అడ్డువేసిన సీఎంఓ కీలక అధికారే, సీఎస్‌గా నీరబ్‌కుమార్‌ ఎంపికలోనూ చక్రం తిప్పారని అధికారవర్గాల సమాచారం. ఈ ఉదంతం నిజమైతే, సీఎం, సీఎస్ కంటే సీఎంఓలో చక్రం తిప్పే రింగ్ మాస్టర్’ కే పవర్ ఎక్కువని మరోసారి రుజువైనట్లవుతుంది.  కాగా, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ, 2000 సంవత్సరం డిసెంబర్ 31న  పదవీ విరమణ చేయడంతో ఆమె స్థానంలో ఆదిత్యనాథ్ దాస్, 2021 జనవరి 1 న పదవీ బాధ్యతలు చెప్పట్టారు. ఆరు నెలలోనే పదవీ విరమణ చేస్తున్నారు

కొడుకు ప్రాణం తీసిన.. తల్లి మంత్రం.. 

దేవుడు, దెయ్యం ఏ రెండు ఎప్పటికి అర్థం కానీ పాఠాలు. అంతు చిక్కని సమాధానాలు.. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు, ఈ  భూత వైద్యం లేకుండా భారతదేశం ఉండదు.. మరో రకంగా అవి ఉన్నందుకే ఈ దేశం ఇలా ఉందేమో అనిపిస్తుంది. అలాగే ఈ సమాజంలో చాలా దేవుడు ఉన్నారని నమ్మితే.. ఇంకొంత మాది దేవుడు లేదు దెయ్యం లేదని చెప్పే వాళ్ళు లేకపోలేదు. మరికొంత మంది రెండింటి మధ్య న్యూట్రల్ గా కూడా ఉన్నారు ఈ సమాజంలో.. అయితే దేవుడు పేరు మీద పుణ్యం, జ్ఞానోదయం ఏం వస్తదోలేదో తెలియదుగాని, దెయ్యం పేరు మీద మాత్రం చాలా విచక్షణ మైన సంఘటనలు జరుగుతుంటాయి. సూటిగా చెప్పాలంటే మన దేశంలో దేవుడు, దెయ్యం, మాత్రం ఓ పెద్ద బిజినెస్.. వీటి పేరుతో మన దేశంలో జరగని మోసాలు లేవు. మదన పల్లి ఘటనలు, మొన్న ఈ మధ్య వరంగల్ లో జరిగిన సంఘటనలు మనం అభివృద్ధి పేరుతో మునకు వెళ్తున్నామా ? లేదా మూడాచారాల అడ్డం పెట్టుకుని వెనక్కి వెళ్తున్నామా అని డౌట్ గా ఉంటుంది. తాజాగా ఒక  మంత్రాల పేరుతో బాలుడ్ని చిత్రహింసలు పెట్టి నిలువునా ప్రాణాలు తీసేసిన మూఢత్వం జరిగింది. అనారోగ్యంతో ఉన్న కొడుకుకు దెయ్యం పట్టిందనే మూఢ నమ్మకంతో కన్నతల్లి చిత్రహింసలు పెట్టి చంపింది. ఈ ఘటనలో తల్లి సహా మరో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అది తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా అరణిలో ముగ్గురు మహిళలు కలిసి ఏడేళ్ల పసివాడిని చిత్రహింసలు పెట్టారు. అది గమనించిన స్థానికులు కన్నమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ, పాపం..అప్పటికే బాలుడు మృతిచెందాడు. దీంతో తల్లితో సహా ముగ్గురు మహిళలు పోలీసులు అరెస్ట్ చేశారు. కొడుకుకి దెయ్యం పట్టిందని, అందుకే పూజలు చేశామని, ఈ క్రమంలో బాలుడు చనిపోయాడని వారు పోలీసులకు తెలిపారు. కన్నతల్లి సబరియమ్మ మానసిక స్థితి సరిగ్గా లేదని, డబ్బుల కోసమే ఇదంతా జరిగి ఉంటుందని బంధువులు జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. సాక్షాత్తు రమణ మహర్షి కొలువైన తిరువన్నామలై లో జరిగింది. భక్తి పెరిగితే చివరికి ఆ భక్తి  మూర్ఖత్వం పెరుగుతుందనే దానికి ఇలాంటి సంఘటనలే ప్రధాన కారణం అని కూడా చెప్పాలి.   

కొత్తవి కాదు ముందు  ఉస్మానియా బిల్డింగ్ కట్టండి! కేసీఆర్ కు అసద్ ఝలక్.. 

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అధికార టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా చెప్పుకునే ఎంఐఎం పార్టీకి స్వరం మార్చినట్లు కనిపిస్తోంది. గతంలో ఎప్పుడు లేనంతగా కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కామెంట్లు చేయడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఉస్మానియా హాస్పిటల్ విషయంలో కేసీఆర్ పై ఘాటైన విమర్శలు చేశారు అసద్.  ఉస్మానియా హాస్పిటల్ లో సూపరింటెండెంట్ తో సోమవారం సమావేశమయ్యారు MIM నేతలు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ తో సహా  గ్రేటర్ పరిధిలోని ఎంఐఎం ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉస్మానియా హాస్పిటల్ పాత భవనం కుల్చకుండా... రెన్యూవేషన్ అంశం పై చర్చించారు. ఉస్మానియా సూపరింటెండెంట్ తో చర్చల తర్వాత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.  గ్రేటర్ పరిధిలో కొత్తగా 3 హాస్పిటల్స్  కడతామని కేసీఆర్ ప్రకటన చేశారన్న అసద్.. వాటి కంటే ముందు ఉస్మానియ హాస్పిటల్ ను బాగు చెయ్యాలని కోరారు. ప్రస్తుతం ఉస్మానియాలో సరైన వసతులు లేకున్నా డాక్టర్స్ గ్రేట్ హ్యూమన్ సర్వీస్ ఇస్తున్నారని తెలిపారు.   న్యూ ఇన్ పేషంట్స్, ఔట్ పేషెంట్,  న్యూ ఏమర్జెని బిల్దింగ్స్ కట్టించాలన్నారు. ఉస్మానియా హాస్పిటల్ కు వెంటనే కొత్త భనాలు  కట్టించాలని ఎంపీ అసద్ డిమాండ్ చేశారు. పాత భవనంలో గతంలో 6 వందల బెడ్స్ ఉండేవని.. బిల్డింగ్ క్లోజ్ చేయడంతో ప్రస్తుతం రోగులకు ఇబ్బందిగా ఉందన్నారు హైదరాాబాద్ ఎంపీ. కర్నాటక, మహారాష్ట్ర  నుంచి కూడా ఉస్మానియాకు రోగులు వస్తున్నారని అసద్ తెలిపారు. ఉస్మానియా హాస్పిటల్ లో 35 లక్షల చదరపు అడుగులు విస్తీర్ణం అందుబాటులో ఉందన్న అసద్.. వెంటనే కొత్త నిర్మాణాల కోసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. కొవిడ్ వల్ల ఓల్డ్ సిటీలో వేలాదిమంది చనిపోయారని చెప్పారు. హెరిటేజ్ బిల్డింగ్ గురించి చర్చ అనవసరమన్నారు అసద్. మిషన్ భగీరథ మీద వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.. ప్రాణాల కోసం వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చెయ్యరా అని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు .  పాత బిల్డింగ్ ను కుల్చాలంటే కూల్చేయండని చెప్పారు. అందుకు తాము అభ్యంతరం చెప్పమని.. తమకు వెంటనే కొత్త హాస్పిటల్ బిల్డింగ్ కావాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు.

ఆనంద‌య్య ఆగం.. మందు మాయం.. అంతా వారి కుట్రేనా?

ఆనంద‌య్య‌. ఆనంద‌య్య‌. ఆనంద‌య్య‌. కొన్నివారాల క్రితం రోజుల త‌ర‌బ‌డి మారుమోగిన పేరు. ఇప్పుడు విందామ‌న్నా ఆయ‌న పేరు వినిపించ‌డం లేదు. ఒకప్పుడు అన్ని ఛానెల్స్‌లోనూ ఆయ‌నే బ్రేకింగ్ న్యూస్‌. ఇప్పుడు చూద్దామ‌న్నా ఆయ‌న టీవీల్లో క‌నిపించ‌ట్లేదు. క‌రోనాను జ‌యించే సంజీవ‌నిలాంటి మందును తయారు చేశారంటూ ఊరూరా ప్ర‌చారం. కృష్ణ‌ప‌ట్నంలో జాత‌ర‌. సోష‌ల్ మీడియాలో మోత‌. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఆయ‌న మందు త‌యారు చేస్తున్నారో లేదో తెలీదు.. ఆయ‌నస‌లు కృష్ణ‌ప‌ట్నంలో ఉన్నారో లేరో కూడా తెలీదు.. అస‌లెవ‌రైనా ఆనంద‌య్య మందు తీసుకుంటున్నారో లేదో తెలీదు.. అస‌లిప్పుడు ఆనంద‌య్య ఊసే లేదు.. ఆయ‌న‌తో పాటు ఆయ‌న మందూ క‌నిపించ‌డం లేదు.. అస‌లేం జ‌రిగింది? మ‌ంత్రం వేసిన‌ట్టు ఆయ‌న ఉనికి ఎందుకు మాయ‌మైపోయింది? ఎవ‌రి తంత్రానికి ఆ మందు మ‌రుగున‌ప‌డింది? మ‌ందు కోసం కృష్ణ‌ప‌ట్నంకు జ‌నాలు ఎందుకు క్యూ క‌ట్ట‌డం లేదు? ఆన్‌లైన్లో మందు స‌ర‌ఫ‌రా చేస్తామ‌న్నారు ఏమైంది? అన్నీ చిక్కుప్ర‌శ్న‌లే. అంత‌కు మించి అనుమానాలే. రాజ‌కీయం త‌లుచుకుంటే ఏదైనా సాధ్య‌మే. రాత్రికిరాత్రి ఆనంద‌య్య‌ను దేవుడిని చేసేశారు ప్ర‌జ‌లు. రాత్రికిరాత్రి ఆ దేవుడిని క‌నుమ‌రుగు చేశారు రాజ‌కీయ నేత‌లు. పాల‌కులు త‌లుచుకుంటే ఏదైనా చేస్తార‌ని చెప్ప‌డానికి ఆనంద‌య్య ఎపిసోడే బెస్ట్ ఎగ్జాంపుల్‌. మందుకు విప‌రీత‌మైన క్రేజ్ ఉన్న‌ప్పుడు.. కృష్ణ‌ప‌ట్నం జ‌నాల‌తో కిక్కిరిసిపోయిన‌ప్పుడు.. ప‌రీక్ష‌ల పేరిట ప్ర‌భుత్వం రంగంలోకి దిగింది. అది ఎంట‌ర్ ది డ్రాగ‌న్ అనే విష‌యం ఆ స‌మ‌యంలో ఆనంద‌య్య‌కు కూడా తెలీక‌పోవ‌చ్చు. క్ర‌మ‌క్ర‌మంగా అన‌కొండా మింగేసిన‌ట్టు.. ఆనంద‌య్య మందుకున్న డిమాండ్‌ను డైల్యూట్ చేసేశారు పాల‌కులు. ఆ ప‌రీక్ష‌లు, ఈ ప‌రీక్ష‌లు.. ఆ అనుమ‌తులు, ఈ అనుమ‌తులు అంటూ వార‌ల త‌ర‌బ‌డి ఆల‌స్యం చేశారు. 144 సెక్ష‌న్‌తో కృష్ణ‌ప‌ట్నంను ప్ర‌జ‌ల‌కు దూరం చేసేశారు.  అదే స‌మ‌యంలో నాయ‌కులు ముసుగు తీసేశారు. ఆనంద‌య్య‌ను హైజాక్ చేసేసి.. ర‌హ‌స్యంగా ట‌న్నుల‌కు ట‌న్నులు మందు తయారు చేయించుకున్నారు. రాత్రికి రాత్రే.. కార్ల‌ల్లో, డ‌బ్బాల్లో ఆనంద‌య్య మందు ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌కు, ప‌క్క‌రాష్ట్ర స‌న్నిహితుల‌కు చేర‌వేశారు. ఈ గూడుపుఠాని అంతా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్థ‌న్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో జ‌రిగింద‌నేది టీడీపీ నేత‌ సోమిరెడ్డి మాట‌. రోజుల త‌ర‌బ‌డి మందు త‌యారు చేయించుకుని.. త‌మ వారంద‌రికీ పంచేసుకొని.. ఇక చాలు అనుకున్నాకే ఆనంద‌య్య‌ను వ‌దిలేశారు. ఆ త‌ర్వాత కూడా ఆయ‌న్ను వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులే మ‌ళ్లీ హైజాక్ చేశారు. ముందు స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే ఆనంద‌య్య మందు ఇవ్వాలంటూ కండీష‌న్ పెట్ట‌డం దారుణం. మ‌రోవైపు, ఆనంద‌య్య కుమారుడిని, శిష్యుల‌ను తీసుకుపోయి.. మ‌రో జిల్లా ఎమ్మెల్యే చెవిరెడ్డి త‌న వారికోసం.. త‌న పేరుతో, త‌న ఫోటోతో మందు పంపిణీ చేసుకోవ‌డం వివాదాస్ప‌ద‌మైంది. ఆ త‌ర్వాత వైజాగ్ ఎంపీ, ఒంగోలు ఎంపీల కోసం మాత్ర‌మే మందు త‌యారు చేయాల్సి వ‌చ్చింది ఆనంద‌య్య‌కు.  వారాలు గ‌డుస్తున్నా.. ఆనంద‌య్య మందు వైసీపీ పాల‌కుల‌కు మాత్ర‌మే అందుబాటులోకి వ‌స్తోంది కానీ, సామాన్య ప్ర‌జ‌ల‌కు మాత్రం ఇంకా అంద‌ని ద్రాక్ష‌గానే మిగిలిపోతోంది. పెద్ద ఎత్తున మందు త‌యారు చేసి, రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ మందు పంపిణీ చేసేందుకు తాను సిద్ధ‌మ‌ని.. అందుకు ప్ర‌భుత్వం స‌హ‌క‌రించాలంటూ ఆనంద‌య్య స్వ‌యంగా సీఎం జ‌గ‌న్‌కు లేఖ‌తో మొర‌పెట్టుకున్నా ఆయ‌న వేద‌న‌ను వినేవారెవ‌రూ లేకుండా పోయారు. క‌నీసం.. మందు త‌యారు చేసేందుకు అవ‌స‌ర‌మైన గిన్నెలు, వ‌న‌మూలిక‌లు, కరెంట్ స‌ర‌ఫ‌రా చేసేందుకూ స‌ర్కారు ముందుకురాక‌పోవ‌డం దారుణ‌మైన విష‌యం అంటున్నారు. మొద‌ట ఆనంద‌య్య మందును త‌యారు చేసేందుకు టీటీడీ సిద్ధ‌మైంది. కానీ, ప్ర‌భుత్వ పెద్ద‌ల నుంచి వ‌చ్చిన ఒత్తిడో మ‌రే కార‌ణ‌మో తెలీదు కానీ ఆ త‌ర్వాత టీటీడీ సైడ్ అయిపోయింది. ఇక‌, ఆన్‌లైన్‌లోనూ అడ్డ‌గోలుగా అమ్ముకునే ప్ర‌య‌త్నం చేసినా.. సోమిరెడ్డి ఎంట్రీతో ఆ కుతంత్రానికి ఆదిలోకే అడ్డుప‌డింది. ఇప్ప‌టికీ ఆనంద‌య్య‌ మందు క‌రోనా పాలిట బ్ర‌హ్మాస్త్రంగానే భావిస్తున్నారు అంతా. ప్ర‌జ‌ల్లో ఆ మందుపై ఎలాంటి అనుమాన‌మూ లేదు. కాక‌పోతే, జ‌నానికి అందుబాటులో లేకుండా చేయ‌డంతో.. ఇక మ‌న‌కు ఆనంద‌య్య మందు ద‌క్కే ప్రాప్తం లేదులే అనే అభిప్రాయానికి వ‌చ్చేశారు బాధితులు. సంజీవ‌నిలాంటి మందును అంతా మ‌ర్చిపోయేలా చేయ‌డంలో పాల‌కులు స‌క్సెస్ అయ్యార‌నే చెప్పాలి. ఆనంద‌య్య మీడియా ముందుకు రాకుండా, ఆనంద‌య్య మందు కోసం ఎవ‌రూ రాకుండా.. గ‌ట్టిగా క‌ట్ట‌డి చేశారు. ఆయుష్ సైతం ఓకే అంది. హైకోర్టూ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. స‌ర్కారూ సై అంది. ఆ త‌ర్వాత ఏదో జ‌రిగింది. తెర వెనుక పావులు క‌దిపారు పెద్ద‌లు. ఇక అంతే. ఆనంద‌య్య మందు జ‌నానికి అందుబాటులో లేకుండా పోయింది. ఆ కుట్ర‌లు, కుతంత్రాల‌కు కార‌కులెవ‌రు? ఇదంతా రాజ‌కీయ‌మా? పాలకుల సాయంతో‌ డ‌్ర‌గ్ మాఫియా ప‌న్నిన ప‌న్నాగ‌మా? మెడిక‌ల్ మాఫియా మామూళ్ల కోసం ప్ర‌భుత్వ పెద్ద‌లు ప్ర‌జ‌ల ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టారా? అంద‌రివాడు ఆనంద‌య్య‌ను అంద‌రికీ దూరం చేసేసిన‌ట్టేనా? ప‌్రాణాలు నిల‌పే మందుకు పాత‌రేసిన‌ట్టేనా? స‌మాధానం లేని ప్ర‌శ్న‌లివి.

కేసీఆర్ పర్యటనలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరసన! 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరసన... ఏంటీ తప్పు చదివామని అనుకుంటున్నారా... కాని ఇది నిజం. కేసీఆర్ వరంగల్ పర్యటనలో ఈ ఘటన జరిగింది. ముఖ్యమంత్రి పర్యటనలో అధికార పార్టీ ఎమ్మెల్యేనే నిరసన తెలపడం కలకలం రేపుతోంది.   జిల్లాల పర్యటనలో భాగంగా సోమవారం వరంగల్ లో పర్యటించారు సీఎం కేసీఆర్. పట్టణంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. తర్వాత సెంట్రల్ జైలు స్థానంలో నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అయితే కేసీఆర్ పర్యటనలో వరంగల్ పోలీసుల తీరుపై ఇప్పుడు వివాదాస్పదమైంది.  నర్సంపేట అధికార పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డికి కూడా చేదు అనుభవం ఎదురైందిపోలీసుల తీరు వల్లే నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిరసనకు దిగారని తెలుస్తోంది.  హన్మకొండ మీదుగా సీఎం కేసీఆర్ వద్దకు వెళ్తున్న  పెద్ది సుదర్శన్ రెడ్డి వాహనాన్ని  అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. హెడ్ క్వార్టర్స్ వద్దనే పోలీసులు నిలిపివేయడంతో మనస్థాపం చెందిన సుదర్శన్ రెడ్డి కారు దిగారు. అనంతరం హెడ్ క్వార్టర్స్ నుంచి అర్‌అండ్‌బీ అతిథి గృహం వరకు నడిచివెళ్లారు. తర్వాత  ఏకశిలా పార్క్ వద్ద సీఎం కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ది సుదర్శన్ రెడ్డి వెళ్లినా.. అక్కడ కూడా  అనుమతి లేదని పోలీసులు మరోసారి అడ్డుకోవడంతో ఆయన తీవ్ర మనస్థాపం చెందారు. పోలీసుల తీరుపై ఆగ్రహంగా కారు దిగి నడుచుుకంటూ వెళ్లి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో అధికార పార్టీ ఎమ్మెల్యే పాదయాత్ర చేయడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. సొంత పార్టీ ఎమ్మెల్యే సీఎం వద్దకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని స్థానిక నేతలు మండిపడుతున్నారు.  సీఎం కేసీఆర్ వరంగల్‌ పర్యటనతో వరంగల్ పోలీసులు అతి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. తొలుత పాసులు జారీ చేసి మీడియా కవరేజ్‌కి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సీఎం వస్తున్న కారణంగా ఆయన పర్యటన దారిలో ఉన్న షాపులను పోలీసులు మూసివేశారు. సీఎం పర్యటనలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా పోలీసులు తగు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఇలా చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. సీఎం వరంగల్ పర్యటన సందర్భంగా పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మండ‌లి ర‌ద్దు.. ఆనాడు ఏమైంది? ఇప్పుడు ఏమ‌వుతోంది?

మాట తప్పును.. మడమ తిప్పను.. ఈ డైలాగ్ సీఎం జ‌గ‌న్‌రెడ్డికి ట్యాగ్‌లైన్‌. అయితే, ఇదంతా ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడే. అంద‌లమెక్కాక అంతా అరాచ‌క‌మే. అడుగ‌డుగునా మాట త‌ప్ప‌డ‌మే.. ప్రతీ అడుగులోనూ మ‌డ‌మ తిప్ప‌డ‌మే. అందుకు, రాజ‌ధాని అమ‌రావ‌తి వ్య‌వ‌హార‌మే బెస్ట్ ఎగ్జాంపుల్‌. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు 33వేల ఎక‌రాలు స‌రిపోవు, ఇంకా చాలా పెద్ద రాజ‌ధాని ఉండాల‌న్న జ‌గ‌న్‌.. సీఎం కాగానే రాజ‌ధానిని మూడు ముక్కలు చేసి అమ‌రావ‌తి నోట్లో మ‌ట్టికొట్టార‌నే విమ‌ర్శ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి యూట‌ర్న్ నిర్ణ‌యాలు. అవ‌న్నీ తెలియాలంటే ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణ‌రాజు.. సీఎం జ‌గ‌న్‌రెడ్డికి రాస్తున్న లేఖ‌లు చూడాల్సిందే. తాజాగా, జ‌గ‌న్ యూటర్న్‌పై మ‌రో లేఖాస్త్రం సంధించారు ర‌ఘురామ‌. ఈసారి మండ‌లి ర‌ద్దు అంశాన్ని గుర్తు చేశారు. అప్పుడెప్పుడో మీ అవ‌స‌రం కోసం మండ‌లి రద్దు కోసం ఓవ‌రాక్ష‌న్ చేశారుగా.. మ‌రి, అవ‌స‌రం తీరిపోయింద‌నా.. ఇప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారంటూ చురుక్కులు అంటించారు.  గ‌త ఏడాది మూడు రాజ‌ధానుల ఏర్పాటు, ఏపీ సీఆర్‌డీఏ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తూ.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. సంఖ్యాబ‌లం ఉన్న అసెంబ్లీలో వాటిని అమోదించేసుకుంది. కానీ, పెద్ద‌ల స‌భ‌లో జ‌గ‌న్ దూకుడుకు చెక్ ప‌డింది. శాస‌న మండ‌లిలో టీడీపీకి ఆధిప‌త్యం ఉండ‌టంతో జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం తీసుకొచ్చిన మూడు రాజ‌ధానుల బిల్లుకు అడ్డుక‌ట్ట వేసింది. ఆ రోజు మండ‌లిలో జ‌రిగిన హైరేంజ్ పొలిటిక‌ల్ డ్రామా ఇప్ప‌టికీ అంద‌రికీ గుర్తే ఉండి ఉంటుంది. స‌ర్కారు మండ‌లిలో మంత్రులంద‌రినీ మోహ‌రించినా, ఛైర్మ‌న్‌పై ఎంత‌గా ఒత్తిడి తీసుకొచ్చినా.. నారా లోకేశ్ వ్యూహాల‌తో ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ త‌ప్ప‌లేదు. టీడీపీ సీనియ‌ర్ స‌భ్యుడు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు త‌న అనుభ‌వంతో వేసిన ఎత్తుగ‌డ‌ల‌కు.. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారుకు మండ‌లిలో దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. దీంతో తీవ్ర ఆగ్ర‌హానికి, అస‌హ‌నానికి గురయ్యారు సీఎం జ‌గ‌న్‌. రాత్రికిరాత్రి మండ‌లి ర‌ద్దుకు ప్ర‌తిపాదించారు. త‌న తండ్రి వైఎస్సార్ పున‌రుద్ద‌రించిన మండ‌లి వ్య‌వ‌స్థ‌పై వేటు వేయాల‌నుకున్నారు. వెంట‌నే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కానీ, ఇప్ప‌టికీ మండ‌లి ర‌ద్దు కాలేదు. ఆ మేర‌కు జ‌గ‌న్‌రెడ్డి త‌ర‌ఫున ఎలాంటి ప్ర‌య‌త్నాలూ జ‌ర‌గ‌లేదు. అప్ప‌టినుంచి ఇప్ప‌టివ‌ర‌కు ప‌లుమార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం జ‌గ‌న్‌రెడ్డి.. కేంద్రం ముందు మండ‌లి ర‌ద్దు డిమాండ్‌ను పెట్ట‌డ‌మే లేదు. అందుకే, ఎంపీ ర‌ఘురామ.. మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యం ఏమైంది సీఎం గారు? అంటూ లేఖ రాయ‌డం ఆస‌క్తిగా మారింది.  ఆనాడు మండ‌లిలో త‌మ నిర్ణ‌యం చెల్లుబాటు కాలేద‌నే అస‌హ‌నంతో ఆవేశంలో తీసుకున్న నిర్ణ‌యం అది. కానీ, కాలం గ‌డిచే కొద్దీ.. మండ‌లిలో వైసీపీ సంఖ్యాబ‌లం పెరుగుతూ వ‌స్తోంది.. ఆ మేర‌కు టీడీపీ బ‌లం త‌గ్గిపోతోంది. అందుకే, మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యంపై జ‌గ‌న్‌రెడ్డి వైఖ‌రిలో మార్పు వ‌చ్చింది. త‌మది అప్ప‌ర్ హ్యాండ్ అవ‌గానే.. మండ‌లి ర‌ద్దుపై మాట త‌ప్పారు.. మ‌డ‌మ తిప్పారు.. అంటూ ఎంపీ ర‌ఘురామ‌.. సీఎం జ‌గ‌న్‌ను నిల‌దీస్తూ లేఖ రాశారు. మెజార్టీ ఉన్నప్పుడు మండలి రద్దు చేస్తే చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారన్నారు. మెజార్టీ లేనప్పుడు మండలి రద్దుకు చేసిన తీర్మానం ప్రజల్లో సందేహాలు లేవనెత్తింద న్నారు. మండలిలో మెజార్టీ సాధించిన తర్వాత రద్దు చేస్తే ప్రజల్లో మీ గౌరవం పెరుగుతుందని రఘురామ లేఖ‌లో ప్ర‌స్తావించారు. మండలి కొనసాగించడం వృథా అవుతుందని జగన్‌ చెప్పిన మాటలను నమ్మాలంటే.. తక్షణమే మండలిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా మండలి రద్దుకు పార్లమెంట్‌లో ప్రయత్నిస్తానన్నారు.  ఎంపీ ర‌ఘురామ లేఖ‌తో జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు ఉలిక్కిప‌డుతోంది. మాట ఇచ్చాం.. మ‌ర్చిపోయాం.. మ‌డ‌మ తిప్పేశాం.. మ‌రుగున ప‌డిపోయింద‌నుకున్న ఆ అంశాన్ని ఇప్పుడు మ‌ళ్లీ ర‌ఘురామ లేఖ‌తో వెలుగులోకి తీసుకురావ‌డంతో.. ప్ర‌జ‌ల‌కు ఏం స‌మాధానం చెప్పాలో తెలీక తెగ ఇబ్బంది ప‌డుతోంది. తానే స్వ‌యంగా పార్ల‌మెంట్‌లో ఈ అంశాన్ని ప్ర‌స్తావిస్తానని అన‌డంతో ఎంపీ ర‌ఘురామ అన్నంత ప‌నీ చేస్తే ఎలా అని బెదిరిపోతోంది. ఒక‌వేళ మండ‌లి ర‌ద్దు అయిపోతే? త‌మ పార్టీ రాజ‌కీయ ఉపాధికి గండి ప‌డుతుంద‌ని ఆందోళ‌న చెందుతోంది. ఏ ముహూర్తాన ర‌ఘురామతో పెట్టుకున్నారో కానీ, అప్ప‌టి నుంచి జ‌గ‌న్‌రెడ్డిని ప్ర‌శాంతంగా ఉండ‌నివ్వ‌డం లేదుగా....! రాజు గారు త‌గ్గేదే లే అంటూ తెగ రెచ్చిపోతూ ఏపీ పాలిటిక్స్‌లో కాక రేపుతున్నారు.   

పాముకు ఊపిరి పోశాడు.. 

కరోనా టైంలో ఆక్సిజన్ అంతకపోతే చాలా మంది ఆక్సిజన్ అందిస్తున్నారు. అయితే  సాధారణంగా ఎవరైనా కళ్ళముందు శ్వాస అందక కొట్టుమిట్టాడుతుంటే చూసి జాలి పడతాం. వాళ్ళను కాపాడడానికి మన ప్రయత్నం మనం చేస్తాం..కొంచెం జాలి గుండె కలవారైతే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఇక కాస్త అవగాహన ఉండి, మనసున్న వారైతే వెంటనే నోట్లో నోరు పెట్టి ఊపిరి ఊది ప్రాణం పోసే ప్రయత్నం చేస్తారు. మరి ఒక పాము ఊపిరి అందక కొట్టుమిట్టాడుతుంటే ఏం చేస్తాం. మనుషులనే పట్టించుకోవడం లేదంటే మళ్ళీ పాము గురించి మాట్లాడుతావ్ ఏంటి భయ్యా అని అనుకుంటున్నారా ? అంతేగా.. అంతేగా .. సాధారణంగానైతే పాముని చూస్తేనే ఒళ్ళు వణికిపోతుంది.. తడిసి ముద్దవుతుంది. ఒక వేళా ఎవరైనా  పామును చూశారు అనుకుందాం.. దాన్ని చూడగానే పనుకుంది వెళ్లడమో.. లేదంటే దాన్నీ చంపడమే చేస్తారు. ఒక వేళ ఏ స్థితిలో ఉందో కూడా పట్టించుకోం. వెంటనే దానికి ఆమడ దూరం పరుగెడతాం. పాముకు కూడా మనం అంటే భయం ఎక్కడ దాన్ని చంపేస్తామో అని.  కానీ, ఇక్కడ అంతా రివర్స్ జరిగింది. ఒక్క వ్యక్తి  మనుషుల వలే దాన్ని కూడా దగ్గరకు తీసుకొని నోట్లో నోరు పెట్టి ఊపిరి ఊదే సాహనం ఎవరైనా చేస్తారా? అసలు ఊహకు కూడా అందడం లేదు కదా? స్నేహాశీష్‌ అనే వ్యక్తి స్థానికంగా పాములను పట్టుకుంటుంటాడు. అలాగే ఎలకలు ఉన్నచోట పాములు కూడా వాటి ఆహారం కోసం వస్తుంటాయి. అలా ఎలుకను వేటాడుతూ ఓ ఇంట్లోకి దూరిన పాము ఓ కన్నంలో ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న స్నేహాశీష్‌ వెంటనే అక్కడికి చేరుకొని ఆ 10 అడుగుల పామును బయటకు తీశాడు. కానీ, అది అప్పటికే అపస్మార స్థితిలోకి వెళ్లడం గమనించాడు. ఊపిరి ఊదాలని తలచాడు. చుట్టుపక్కల చూడగా.. ఓ స్ట్రా కనపడింది. వెంటనే దాన్ని పాము నోట్లో పెట్టి ఊపిరి ఊదాడు. దాదాపు 15 నిమిషాల తర్వాత అది స్పృహలోకి వచ్చింది. ఆ పాముకు ఎలాంటి ప్రాణాపాయం లేదని నిర్ధారించుకున్న తర్వాత దాన్ని సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతుంది. వన్యప్రాణుల అభిమానులు, వాటికి ఆదరించే వాళ్ళు  పాముకి ప్రాణం పోసిన స్నేహాశీష్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సంఘటన  ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో జరిగింది.