కేబినెట్ లోకి కడియం! ఆ మంత్రికి చెక్ పడినట్టేనా? 

రాజకీయ వ్యూహాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను దిట్ట అంటారు. ఆయన ఎప్పుడో ఏం చేస్తారో , ఎవరిని దూరం పెడతారో, ఎవరిని దగ్గరికి తీస్తారో  ఎవరూ ఊహించలేరని చెబుతారు. అయితే గులాబీ బాస్ ఏం చేసినా దానికో లెక్క , పొలిటికల్ లింకు ఉంటుందన్నది రాజకీయ నిపుణుల మాట. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చిన సమయంలోనూ కేసీఆర్ తనదైన వ్యూహాలతో గట్టెక్కారు. తనకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారిని కూడా ఉన్నఫళంగా పక్కన పెట్టేస్తారు కేసీఆర్. ఇందుకు ఇటీవల మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందరే ఉదాహరణ. తనకు అవసరం లేదనుకున్న వారిని దూరం పెడుతూ.. సడెన్ గా మళ్లీ అక్కున చేర్చుకుంటారు. ఇలాంటి ఘటనలు టీఆర్ఎస్ లో ఎన్నో జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కేసీఆర్  వరంగల్ పర్యటనలు పలు ఈక్వేషన్స్ ను తెరపైకి తెచ్చింది. ఈటల రాజీనామాతో మంత్రివర్గంలో ఒక ఖాళీ అయింది. ఇప్పుడున్న మంత్రుల్లో కొందరిని తొలగిస్తారనే ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. ఆ నేపథ్యంలోనే తాజాగా కొత్త సమీకరణలు బయటికి వచ్చాయి. కేబినెట్ లో మార్పులు చేయాలని డిసైడ్ అయిన కేసీఆర్.. ఎవరిని తొలగించాలి, ఎవరిని తీసుకోవాలన్న దానిపై క్లారిటీకి వచ్చారని తెలుస్తోంది. ఆ దిశగా తొలగించబోయే మంత్రులకు, కొత్తగా ప్రమోషన్ ఇవ్వబోయే నేతలకు గులాబీ బాస్ సిగ్నల్స్ ఇచ్చారని చెబుతున్నారు. జిల్లాల పర్యటనలోనూ తమ మనోగతాన్ని ఆయన చెప్పకనే చెబుతున్నారని సమాచారం. సోమవారం వరంగల్ లో పర్యటించిన కేసీఆర్... మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నివాసంలో లంచ్ చేయడం ఆసక్తిగా మారింది. గతంలో వరంగల్ ఎప్పుడు వచ్చినా రాజ్యసభ సభ్యులు కెప్టెన్  లక్ష్మికాంత రావు ఇంట్లో లంచ్ చేసేవారు. విడిది కూడా అక్కడే చేసేవారు. కాని ఈసారి మాత్రం కడియం ఇంటికి వెళ్లారు కేసీఆర్. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ పునర వ్యవస్థికరణలో కడియంకు చోటు కల్పించాలని కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కడియం అంతా యాక్టివ్ గా ఉండటం లేదు. ఆయన బీజేపీలో చేరతారనే  ప్రచారం కూడా జరిగింది. అయితే కొన్ని రోజులుగా మాత్రం కడియం ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కేసీఆర్ పై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్రంగానే స్పందించారు కడియం శ్రీహరి. కొన్ని రోజులగా కడియంలో వచ్చిన మార్పులు, కేసీఆర్ అతని ఇంట్లో లంచ్ చేయడంతో... ఆయనకు కేబినెట్ లో చోటు ఖాయమనే ప్రచారం వరంగల్ లో జోరుగా సాగుతోంది. దీనిపై కడియంకు కూడా ఇప్పటికే సంకేతాలు వచ్చాయంటున్నారు. టీఆర్‌ఎస్ తొలి  పాల‌న‌లో క‌డియం శ్రీహ‌రి ఉప ముఖ్యమంత్రి ప‌ద‌వితో ఓ వెలుగు వెలిగారు. అవినీతి, అక్రమాలు లేని నేత‌గా కేసీఆర్ వ‌ద్ద క‌డియంకు మంచిపేరు ఉంది. అప్పగించిన శాఖ‌ను స‌మ‌ర్థవంతంగా నిర్వహించ‌గ‌ల స‌మ‌ర్థుడ‌ని కేసీఆర్ బ‌లంగా న‌మ్ముతున్నారంట‌.  క‌డియం లాంటి సీనియ‌ర్ నేత సేవ‌ల‌ను వినియోగించుకుంటే పార్టీకి మరింత బలం వస్తుందని గులాబీ బాస్  భావిస్తున్నారట‌. ఇందుకోసం ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌విని రెన్యూవ‌ల్ చేయ‌డంతో పాటు మంత్రి వ‌ర్గంలోకి తీసుకుని ఓ కీల‌క శాఖ‌ను అప్పగించేందుకు సిద్ధప‌డుతున్నట్లుగా తెలంగాణ భవన్ లో జోరుగా చర్చ జరుగుతోంది.  అయితే కడియంను తీసుకుంటే ఎవరికి చెక్ పెడతారనే చర్చ కూడా జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ మంత్రులుగా ఉన్నారు. వీళ్లలో ఒకరిని తప్పించి.. కడియంను తీసుకుంటారా లేక ఈటల స్థానాన్ని ఆయనతో భర్తీ చేస్తారా అన్నది చర్చగా మారింది. ఈటల స్థానాన్ని మరో బీసీ నేతతోనే భర్తీ చేస్తారని, కడియంను తీసుకుంటే జిల్లాకు చెందిన ఒకరిపై వేటు పడుతుందనే వాదన వస్తోంది. అదే జరిగితే ఎర్రబెల్లికి చెక్ పడవచ్చని చెబుతున్నారు. వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు ముందు నుంచి స్థానిక ఎమ్మెల్యేలుమంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదులు ఇచ్చినట్లు స‌మాచారం. మంత్రి ఎర్రబెల్లి వ్యవ‌హార‌శైలితో తాము ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తోంద‌ని, అధిష్ఠానం వ‌ద్ద ఒక‌టి చెబుతూ.. వాస్తవంలో మాత్రం ఆయ‌న అనుచ‌రుల‌కు, రాజ‌కీయ ల‌బ్ధికి పావులు క‌దుపుతున్నారంటూ  ఫిర్యాదు చేశారట. ఇదే విష‌యం కేసీఆర్ దృష్టికి వెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో కడియంతో ఎర్రబెల్లికి చెక్ పెట్టడానికి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ గీసేసి ఉంటారనే చర్చ జరుగుతోంది. మరోవైపు మంత్రి ఎర్రబెల్లికి జిల్లాలోని సహచర ఎమ్మెల్యేలతో విభేదాలు ఉన్నా.. ఆయన పనితీరు మాత్రం బాగా ఉందనే టాక్ వస్తోంది. దీంతో ఎర్రబెల్లిని కొనసాగిస్తూనే.. కడియంను కేబినెట్ లోకి తీసుకుని ఆయన దూకుడుకు కొంత చెక్ పెట్టవచ్చనే ఆలోచన కూడా కేసీఆర్ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ లెక్కన సత్యవతి రాథోడ్ ను తొలగించి.. ఆమె స్థానంలో కడియంకు చోటు ఇవ్వవచ్చని భావిస్తున్నారు. సత్యవతి రాథోడ్ ప్లేస్ లో మరో గిరిజన ఎమ్మెల్యేను కేబినెట్ లోకి  తీసుకోనే యోచనలో కేసీఆర్ ఉన్నారంటున్నారు. మొత్తానికి కడియం శ్రీహరికి మాత్రం ప్రమోషన్ దక్కడం ఖాయమని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

విశ్వమంతా యోగా జపం .. టీటీడీలో మౌనవ్రతం! జగన్ రెడ్డికి పట్టదా.. ?

తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) హిందూ ధార్మిక సంస్థ. హిందూ ధర్మాన్ని, భారతీయ సంప్రదాయాలు విలువలు,ఆచార వ్యవహారాలను పరిరక్షించడం సంస్థ ప్రధాన కర్తవ్యం. టీటీడీ సభ్యులు, సిబ్బంది హిందూ ధార్మిక విలువలను, భారతీయ సంప్రదాయాలను తూ.చతప్పక పాటించే వారై ఉంటారని, ఉండాలని హిందూ సమాజం కోరుకుంటుంది. అది సహజం. ఎందుకంటే, ఇక్కడ ఖర్చు పెట్టే ప్రతి పైసా, వివిధ రూపాల్లో భక్తులు స్వామి వారికి సమర్పించుకున్నకానుకల ద్వారా వచ్చిన సొమ్ములే. నిజానికి, టీటీడీకి ప్రభుత్వం నుంచి పైసా నిధులు రావు. ప్రభుత్వమే దేవస్థానం నిధులను, ప్రజా ప్రయోజనాలు, సంక్షేమం పేరున దారి మళ్ళించి, అన్య మత ప్రచారకులకు సైతం వినియోగిస్తున్నారనే, పాస్టర్లకు  పందారం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీటీడీ వ్యవహారాల్లో అన్యమత జోక్యం అధికం అవుతోందన్న ఆరోపణలున్నాయి.  టీటీడీ పరిధిలోని, సప్తగిరి పత్రిక, శ్రీ వెంకటేశ్వరభక్తి చానల్ ఇతర ధార్మిక ప్రచార సంస్థలు తరచూ  వార్తలో తేలుతున్నాయి. అయితే, అలా వార్తలకెక్కిన ప్రతి సందర్భం, హిందువులు తల వంచుకునేలా చేస్తోంది    హిందూ ధర్మ ప్రచారం కోసం నడుపుతున్న సప్తగిరి పత్రికలో, అలవాటుగానో , గ్రహపాటుగానో హిందూ ధర్మ వ్యతిరేక ప్రచారం జరిగిన ఆరోపణలున్నాయి. అలాగే   క్రైస్తవ మత  ప్రచారం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి.  క్రైస్తవ గీతాలు ప్రచిరించడం, సప్తగిరి పత్రికకు అనుబంధంగా  క్రైస్తవ ప్రచార బుక్ లెట్’ను జత చేయడం వంటి అపచారాలు అనేకం వెలుగు చూశాయి. అలాగే  అయోధ్య రామాలయం భూమిపూజ కార్యక్రమాన్ని దేశంలోని ప్రైవేటు టీవీ చానల్స్ సహా అన్ని చానల్స్ ప్రత్యక్ష ప్రసారం చేశాయి. కానీ, టీటీడీ ఆధ్వర్యంలోని  శ్రీ వెంకటేశ్వర భక్తీ చానల్,  ఎస్వీబీసీ చానల్ మాత్రం  ప్రసారం చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే, ఇలాంటి అపచారలు అనేక జరుగుతూనే ఉన్నాయి.  ఇప్పడు ఇదే కోవకుచెందిన మరో దురాగతం, ప్రపంచం అంతటా జరుపుకున్న ప్రపంచ యో దినోత్సవాన్ని టీటీడీ పూర్తిగా విస్మరించింది.యోగా దినోత్సవం హిందూ ధార్మిక వేడుక కాదు,కానీ, హిందూ ధర్మంతో, భారతీయతతో  ముడిపడిన,ప్రతి భారతీయడు, ప్రత్యేకించి ప్రతి హిందువు గర్వించే కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాన్ని ఉపేక్షించడం క్షతవ్యం కాదని, యోగా సంస్థలు అక్షేపిస్తున్నాయి. అంతే కాదు, ఇదేదో పొరపాటున జరిగింది కాదు. ఉద్దేశ పూర్వకంగానే జరిగిందని, వ్యవహారం పేనుకు పెత్తనం ఇస్తే తలంతా తినేసింది’ అన్నట్లుగా టీటీడీ వ్యవహారం ఉందని ధార్మిక సంస్థలు మరో మారు అక్షేపిస్తున్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా సోమవారం యోగ దినోత్సవాన్ని నిర్వహించినా, టీటీడీలో మాత్రం ఆ ఊసే కనిపించలేదు. టిటిడి విద్యాసంస్థలలో కూడా  యోగా దినోత్సవం జరిపిన దాఖలాలు లేవు.  గతంలో టీటీడీ ఆధ్వర్యంలో యోగా నేర్పించే విద్యా సంస్థ ఉండేది. డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను నిర్వహించి ఉత్తీర్ణులకు సర్టిఫికెట్లు ఇచ్చేవారు. నిత్యం యోగ సాధన చేసే వారి కోసం పాత మెటర్నిటీలో హాల్‌ను కూడా కేటాయించేవారు.  అనంతరం టీటీడీ విద్యాశాఖ పరిధిలోని యోగా సంస్థను ఆయుర్వేద కళాశాల పరిధిలోకి తెచ్చింది. రెండేళ్ల కిందటి వరకు సంస్కృత విద్యాపీఠంతో కలిసి టీటీడీ యోగా దినోత్సవాన్ని ఓ ఉత్సవంలా నిర్వహించేది.  కావచ్చును, కొవిడ్ కారణంగా, గతంలో లాగా కార్యక్రమాన్ని నిర్వహించక పోవడాన్ని అర్ధం చేసుకోవచ్చును,కానీ, ఈ విధంగా పూర్తిగా విస్మరించడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో వై ఎస్  జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గత రెండేళ్లుగా  యోగా దినోత్సవాన్ని టీటీడీ నిర్లక్ష్యం చేసింది. సనాతన ధర్మంలో ఎంతో కీలకమైన యోగాను టీటీడీ లాంటి ధార్మికసంస్థ పట్టించుకోక పోవటం చర్చనీయాంశంగా మారింది.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,పాలనలో టిటిడిలో అన్యమతస్థుల ప్రాబల్యం పెరుగుతున్నదని ఆరోపణలకు తోడు,తరచూ చోటు చేసుకుంటున్న ఇలాంటి దురగాలు, టీటీడీలో జరుగతున్న హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు ప్రభుత్వ మద్దతు ప్రోత్సం ఉందనే అనుమానాలను మరింత బలోపేతం చేస్తున్నాయి. టిటిడిలో పనిచేస్తున్న అన్యమతాలకు చెందిన ఉద్యోగులను తొలగించడం పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా  వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం. ఇటువంటి సమయంలో యోగా దినోత్సవంను పట్టించుకొనక పోవడం ప్రభుత్వ ధోరణిని వెల్లడి చేస్తున్నది.

వైద్యుల నిర్లక్ష్యం.. మరొకరికి ఆపరేషన్‌? అరుపులు, కేక‌లు..

వైద్యుల నిర్ల‌క్ష్యం. ఇది కామ‌న్‌గా వినిపించే న్యూసే. ఇది కూడా అలాంటిదే. ఎన్ని ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నా.. ఎంత‌గా న్యూస్ వైర‌ల్ అవుతున్నా.. ప్ర‌భుత్వ డాక్ట‌ర్లు మాత్రం తీరు మార్చుకోవ‌డం లేదు. అదే డాక్ట‌ర్లు త‌మ ప్రైవేట్ క్లినిక్స్‌లో బాగా ప‌ని చేస్తారు. గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్‌కు వ‌చ్చే స‌రికి నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తారు. త‌మ‌ను ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌నే ధీమానో.. ఇలాంటి వాటికి శిక్ష‌లు ప‌డ‌వ‌నో ధైర్య‌మో.. తెలీదు కానీ అజాగ్ర‌త్త‌గా, ఉదాసీనంగా ప‌ని చేస్తుంటారు. తాజాగా, ఓ ప్ర‌భుత్వ వైద్యుడి నిర్వాకం ఓ నిండు ప్రాణాన్ని బ‌లి తీసుకోబోయింది. బాధితురాలు అప్ర‌మ‌త్తంగా ఉండి అర‌వ‌డంతో పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది. ఈ ఘటన కరీంనగర్‌ మాతాశిశు సంరక్షణ కేంద్రంలో జ‌రిగింది. వైద్యుడి నిర్లక్ష్యం ఆ మహిళ పాలిట శాపంగా మార‌బోయింది. ప్రసవం కోసం ఆప‌రేష‌న్‌ చేయాల్సింది ఒక మహిళకైతే.. మ‌రో మ‌హిళ‌కు పొట్టకోశారు డాక్ట‌ర్లు. ఆమె నొప్పిని భరించలేక అరవడంతో అప్రమత్తమైన వైద్యులు కుట్లు వేసి పంపించారు. బాధితురాలి భర్త ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం వెలుగు చూసింది. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్‌కు చెందిన మాలతి, నరోత్తమరెడ్డి దంపతులు. మాలతి ఏడు నెలల గర్భవతి.. నీరసంగా ఉండటం, కడుపునొప్పి రావడంతో కరీంనగర్‌లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి వచ్చారు. స్కానింగ్‌ చేసిన వైద్యసిబ్బంది.. గర్భంలో ఇద్దరు శిశువులు ఉన్నారని గుర్తించారు. అందులో ఒక శిశువు బతికే అవకాశం లేదని, ఇంకొక శిశువును కాపాడేందుకు గర్భాశయానికి కుట్లు వేయాల‌ని వైద్యులు తెలిపారు. మాలతిని ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకువెళ్లారు. అక్కడున్న డాక్టర్‌ వేరొకరి కేస్‌షీట్‌ చదివి మాలతి పొట్ట కోశారు. మాలతి గట్టిగా అరవ‌డంతో డాక్ట‌ర్ అప్ర‌మ‌త్త‌మ‌య్యాడు. మాల‌తి త‌న కేసు వివరాలు చెప్పడంతో జ‌రిగిన‌ త‌ప్పును గుర్తించాడు ఆ డాక్ట‌ర్‌. వెంట‌నే చీరిన పొట్టకు కుట్లు వేసి త‌ప్పు స‌రి చేసే ప్ర‌య‌త్నం చేశారు. మాలతి అప్రమత్తంగా లేకపోతే తల్లీబిడ్డలకు ప్రమాదం జరిగేదని అంటున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని మాలతి భర్త నరోత్తమరెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు వచ్చిందని, విచారణ చేస్తామని ఆర్‌ఎంఓ శౌరయ్య తెలిపారు.   

మూడు అంత ఈజీ కాదు.. ఫ్రంట్‌పై పీకే క్లారిటీ..

ఓవైపు థర్డ్ ఫ్రంట్ ఊహాగానాలు. అంత‌లోనే కాదు కాద‌నే సందేశాలు. బీజేపీకి వ్య‌తిరేకంగా ప్రాంతీయ పార్టీల ప్ర‌య‌త్నాలు. అదంత ఈజీ కాదంటూ ప్ర‌శాంత్ కిషోర్ స్టేట్‌మెంట్లు. ఇలా దేశంలో పొలిటిక‌ల్ క‌న్ఫ్యూజ‌న్ ఓ రేంజ్‌లో నెల‌కొంది. మంగ‌ళ‌వారం నాటి మీటంగే ఈ గంద‌ర‌గోళానికి కార‌ణం. బీజేపీ వ్య‌తిరేక భావ‌సారుప్య నేత‌లంతా స‌మావేశం అయ్యేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. అదితో థ‌ర్డ్ ఫ్రంట్ మీటింగ్ అంటూ బ్రేకింగ్ న్యూస్ మొద‌లైపోయింది. మోదీపై మంట మీదున్న వారంతా తెగ ఖుషీ అయ్యారు. అయితే, మంది పెరిగితే మ‌జ్జిగ ప‌ల‌చ‌న అన్న‌ట్టు.. అప్పుడే ఆ మీటింగ్‌లో అంత ప‌స లేదంటూ ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తున్నాయి. అవి కూడా కీల‌క నేత‌ల నుంచి రావ‌డంతో అస‌లేం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. కేంద్రంలోని బీజేపీని ఎదుర్కొనేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కొంత‌మంది కీల‌క నేత‌ల‌తో ఓ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో రాజకీయ నేతలు, మేధావులు. సినీ, మీడియా ప్రముఖులు పాల్గొంటుండ‌టంతోర మీటింగ్‌కు ఎక్క‌డ‌లేని ప్రాధాన్య‌త వ‌చ్చింది. ఇది థ‌ర్డ్ ఫ్రంట్‌కు శుభారంభం అంటూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే, తాము తృతీయ ఫ్రంట్ ఏర్పాటు కోసం మీటింగ్ ఏర్పాటు చేయడం లేదని, ప్రస్తుత పరిణామాలపై చర్చించేందుకే దీన్ని నిర్వహిస్తున్నామని ఆ త‌ర్వాత‌ శరద్ పవార్ క్లారిటీ ఇవ్వ‌డంతో ఉత్సాహం నీరుకారిపోయింది.  ఇది తాను 2018లో ఏర్పాటు చేసిన పొలిటికల్ యాక్షన్ గ్రూప్- రాష్ట్ర మంచ్ సమావేశం మాత్ర‌మేనంటూ బీజేపీ మాజీ నేత, తృణమూల్ కాంగ్రెస్ నాయ‌కుడు యశ్వంత్ సిన్హా తెలిపారు. 2024 ఎన్నికల్లో ప్రధాని మోదీని ఎదుర్కోవడానికి తృతీయ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు, ఈ సమావేశానికి సంబంధం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. జేడీ-యూ నేత పవన్ వర్మ దీనిపై వివరణనిస్తూ..ఈ సమావేశానికి బీజేపీని తప్ప అన్నివర్గాల వారిని ఆహ్వానించామన్నారు. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్.వై.ఖురేషీ, మాజీ రాయబారి కె.సి.సింగ్, సినీ గీత రచయిత జావేద్ అఖ్తర్, చిత్ర నిర్మాత ప్రీతిష్ నంది, మీడియా ప్ర‌ముఖుడు కరణ్ థాపర్, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తదితరులు ఇందులో పాల్గొన‌నున్నారు.  అయితే, కొన్ని రోజుల ముందు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్‌, శ‌ర‌ద్ ప‌వార్‌ల మ‌ధ్య సుదీర్ఘంగా చ‌ర్చ జ‌ర‌గ‌డం.. ఆ త‌ర్వాత ప‌వార్ నేతృత్వంలో ఈ స‌మావేశానికి ఏర్పాట్లు చేయ‌డంతో ఇది బీజేపీ యేత‌ర కూట‌మి మీటింగ్‌గానే భావించారు అంతా. కానీ, ప్ర‌శాంత్ కిశోర్ మాత్రం ఇలాంటి ప్ర‌చారానికి ఆదిలోనే బ్రేకులు వేశారు. తాను థర్డ్ ఫ్రంట్ కు సంబంధించి ఏ సమావేశానికి హాజరయ్యే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. బీజేపీని ఎదుర్కోవడానికి ఇలాంటి ఫ్రంట్.. స‌రిపోద‌ని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. బీజేపీని.. థర్డ్ ఫ్రంట్ లేదా ఫోర్త్ ఫ్రంట్ లు.. గట్టి సవాలు ఇవ్వ‌గ‌ల‌వ‌ని తాను భావించ‌డం లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు ప్ర‌శాంత్ కిశోర్‌.   

చిక్కుల్లో ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్! 

కొన్ని రోజులుగా వివాదాలకు కేంద్రంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఆయనపై ఏకంగా గవర్నర్ కే ఫిర్యాదు వెళ్లింది. సీఐడీ అధికారి పీవీ సునీల్ కుమార్, అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబులపై చట్టబద్ధమైన చర్యలను తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. ఉగ్రవాదులను ఆదర్శంగా తీసుకోవాలని దళిత యువతను వీరిద్దరూ ప్రోత్సహిస్తున్నారని లేఖలో వర్ల రామయ్య ఆరోపించారు. ఉగ్రవాదుల చర్యను సమర్ధించిన ఇరువురిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి తాను ఫిర్యాదు చేశానని... అయినప్పటికీ ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదని తన లేఖలో వర్ల రామయ్య  అసహనం వ్యక్తం చేశారు. సివిల్ కాండక్ట్ రూల్స్ ను ఉల్లంఘించి, ఉగ్రవాదులను సమర్థించే విధంగా వ్యవహరిస్తున్న ఈ ఇద్దరు అధికారులపై రాజద్రోహం కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వర్ల రామయ్య ఫిర్యాదుపై గవర్నర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.  ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పై ఇటీవలే నర్సాపురం ఎంపీ రఘురామ కేంద్రానికి, ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘురామ రాజు ఫిర్యాదుతో ఆయన పోస్టింగ్ ఊస్టింగ్ కావచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇటీవలే ఏపీ సీఐడీ సునీల్ కుమార్ కు సంబంధించి మరో సంచలన అంశం వెలుగులోనికి వచ్చింది. సునీల్ కుమార్ రిజర్వేషన్ ద్వారా తన ఉద్యోగానికి ఎన్నికయ్యారు. అయితే, భారత రాజ్యాంగం ప్రకారం… క్రిస్టియన్ మతం స్వీకరించిన వారికి రిజర్వేషన్లతో వచ్చిన ఉద్యోగాలు పోతాయి. ఈ విషయంలో కఠినంగా ఉండాలని ఇటీవలే కోర్టులు కూడా తీర్పులిచ్చాయి. మతం మారితే ఉద్యోగం కోల్పోతారంటూ ఇటీవల వచ్చిన మద్రాస్ హైకోర్టు తీర్పుతో.. సునీల్ కుమార్ పై లీగల్ రైట్స్ అడ్వైజరీ కన్వీనర్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందిన సునీల్ కుమార్ క్రిస్టియన్ మతంలోకి మారారని కాబట్టి ఆయన్ను పదవి నుంచి తొలగించాలని ఫిర్యాదులో కోరారు.  సునీల్ కుమార్ తాను క్రిస్టియన్ అని గతంలో చాలా సార్లు ఓపెన్ గానే చెప్పుకున్నారు. దీంతో ఆయన పదవికి గండం ఖాయమని అంటున్నారు. 

తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటనలో షాకింగ్ నిజాలు! ఇద్దరు నిందితుల గుర్తింపు? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు సమీపంలోనే యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే  ప్రాంతంలోనే అత్యాచార ఘటన జరిగితే.. రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతుందని విపక్షాలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఏపీలో మహిళకు రక్షణే లేకుండా పోయింది, జగన్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న దిశ చట్టం ఎటు పోయిందనే ప్రశ్నలు వస్తున్నాయి. పోలీసుల నిఘా, పని తీరుపై అన్ని వర్గాల నుంచి తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటన ప్రభుత్వాన్ని కలవరానికి గురి చేసింది. దీంతో నిందుతులను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో డీజీపీ స్వయంగా కేసును పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. తాడేపల్లి సమీపంలోని సీతానగరం పుష్కరఘాట్ లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారని తెలుస్తోంది. యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. నిందితులు సీతానగరంకు చెందిన కృష్ణ, వెంకటేష్ గా పోలీసులు భావిస్తున్నారు.  నిందితులిద్దరు కృష్ణానది ఇసుక తిన్నెలు, పుష్కరఘాట్లలో సంచరిస్తూ ఒంటరిగా ఉన్నవారిపై దాడులు చేసి సొమ్ములు దోచుకోవడం, ఆ సొమ్ముతో గంజాయి సేవించి నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నిందితులను బాధితురాలు గుర్తించినట్లు తెలుస్తోంది. యువతి, ఆమెకు కాబోయే భర్త దగ్గర లాక్కున్న ఫోన్లను దాస్ అనే వ్యక్తి దగ్గర తాకట్టుపెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఘటన జరిగిన తర్వాత నిందితులు విజయవాడ వైపు పారిపోయినట్లు తెలిసింది. ప్రత్యేక బృందాలతో గాలించడంతో పాటు సీతానరగంలో అనుమానితులను విచారించడంతో నిందితుల వివరాలు తెలిశాయని చెబుతున్నారు. వీళ్లిద్దరూ నాలుగు రోజుల నిందితుల్లో ఒకరికి హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడకు చెందిన బాధిత యువతి ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు ఇటీవలే ఓ యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. శనివారం రాత్రి విధులు ముగించుకొని అతడితో కలిసి సీతానగరం పుష్కరఘాట్ కు వెళ్లింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్పింది. వీళ్లిద్దరినీ గమనించిన ఇద్దరు యువకులు... వారిపై వెనుక నుంచి దాడి చేశారు. యువకుడి చేతులు కాళ్లు కట్టేసి... యువతిపై అత్యాతారం చేశారు. యువకుడు ఎదురుతిరగకుండా బ్లేడుతో బెదిరించారు. అనంతరం చెవి రింగులు, డబ్బులు, సెల్ ఫోన్ తీసుకొని ఓ నాటుపడవలో అక్కడి నుంచి పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న బాధితులు స్థానికుల సాయంతో కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. 

క్యాంటీన్లు ఏవి జ‌గ‌న‌న్న‌? నిగ్గ‌దీసి అడిగిన ర‌ఘురామ‌..

న‌వ ర‌త్నాల‌కు కౌంట‌ర్‌గా.. న‌వ ప్ర‌భుత్వ క‌ర్త‌వ్యాలు. సీఎం జ‌గ‌న్‌రెడ్డికి ఆ పార్టీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు చుక్క‌లు చూపిస్తున్నారు. రోజుకో ప్ర‌జాస‌మ‌స్య‌ను ప్ర‌స్తావిస్తూ.. ముఖ్య‌మంత్రికి లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ ఇచ్చిన హామీలు, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వాటిని తుంగ‌లో తొక్కిన వైనాన్ని నిగ్గ‌దీసి అడుగుతున్నారు. ఈ రెండేళ్ల కాలంలో మాట త‌ప్పిన‌, మ‌డ‌మ తిప్పిన అంశాల‌ను ఎత్తి చూపుతున్నారు. అటు ప్ర‌జాస‌మ‌స్య‌లు, ఇటు రాజ‌కీయ విధానాల లోటుపాట్ల‌పై ఘాటైన లేఖ‌లు రాస్తున్నారు. ఇన్నాళ్లూ వీడియోల‌తో వాయించిన ర‌ఘురామ‌.. కొంత‌కాలంగా లేఖ‌ల‌తో సీఎం జ‌గ‌న్‌రెడ్డిని కుళ్ల‌బొడుస్తున్నారు. తాజాగా.. జ‌గ‌న్ అధికారంలోకి రాగానే ర‌ద్దు చేసిన అన్న క్యాంటీన్ల అంశాన్ని ప్ర‌స్తావించారు. పేద‌ల‌కు అన్నంపెట్టే అన్న క్యాంటీన్ల ర‌ద్దును తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. అన్న క్యాంటీన్ల బ‌దులు జ‌గ‌న‌న్న క్యాంటీన్ల‌ను వెంట‌నే ప్రారంభించాల‌ని లేఖ‌లో డిమాండ్ చేశారు ర‌ఘురామ‌. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు రాసిన ఆ లేఖ య‌ధాత‌ధంగా..... ‘‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’’ అని దాదాపు అన్ని పవిత్ర గ్రంథాలలో చెబుతుంటారు. ఆకలితో ఉన్న వారికి మంచి ఆహారం అందించడం అనేది ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఎంతో అవసరమైనది. ఈ లేఖ ద్వారా మీకు ఈ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. అన్నదానం అనేది అన్ని దానాల్లోకెల్లా మిన్న అనే నానుడి కూడా మనం చిన్నతనం లోనే నేర్చుకున్నాం. అన్నదానం ద్వారా మంచి పేరు రావడమే కాకుండా మీరు ‘దైవదూత’ అనేది కూడా జన బాహుళ్యంలో స్థిరపడిపోతుంది. అందుకని.. తక్షణమే జగనన్న క్యాంటీన్ స్కీమ్ ప్రారంభించాలని సూచిస్తున్నాను’’ ‘‘గతంలో ఈ పథకం ద్వారా ఐదు రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందించేవారు. మూడు విడతలుగా అందించే ఈ ఆహారం కేవలం రూ.15కే పేదవారికి అందేది. ఈ స్కీమ్ లేకపోతే ఇదే మూడుపూటల ఆహారం కనీసం రూ.150 అయ్యేది. ప్రభుత్వానికి ఈ మూడు విడతల ఆహారానికి కలిపి రూ.58 ఖర్చు అయ్యేది. ఒక్కో క్యాంటీన్‌లో 900 నుంచి 1200 మంది వరకూ ఆకలి తీర్చుకునేవారు. ఇలా అన్ని క్యాంటీన్లలో కలిపితే సుమారు 2.15 లక్షల మందికి ప్రతి సారి ఆకలి తీరుతూ ఉండేది. గత ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించడమే కాకుండా దాతల నుంచి విరాళాలు కూడా సేకరించి మొత్తం 35 పట్టణాల్లో 100 క్యాంటీన్లు, 75 పట్టణ ప్రాంతాలలో 103 అన్న క్యాంటీన్లు, మొత్తం 73 మున్సిపాలిటీలలో 204 అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. గత ప్రభుత్వాన్ని తలదన్నే విధంగా  రూ.వెయ్యి కోట్లతో జగనన్న క్యాంటీన్లను ప్రారంభించాలని కోరుతున్నాను’’ ’‘గత ప్రభుత్వం 13 జిల్లాలను మూడు జోన్లుగా విభజించి 204 అన్న క్యాంటీన్లను ప్రారంభించి... వాటిని  నిర్వహించే బాధ్యత అక్షయ పాత్ర ఫౌండేషన్‌కి అప్పగించింది. ఈ ప్రభుత్వం వచ్చాక.. వారికి ఆర్డరు క్రమంగా తగ్గిస్తూ ప్రభుత్వం పూర్తిగా వాటిని మూసివేసింది. ఒక్కో జోన్‌లో అన్న క్యాంటీన్ల కోసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సుమారు రూ.6 కోట్లు ఖర్చు చేసినట్లుగా నాకు తెలిసింది. ఫేస్ రికగ్నిషన్ సహా.. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి.. అవకతవకలకు తావు లేకుండా చేసింది. కరోనా విజృంభించిన వేళ ప్రభుత్వం నిత్యావసర వస్తువులను సరఫరా చేయడం, నెలవారీ ఆర్థిక సహాయం అందించినా... నిరాశ్రయులను ఆదుకోలేకపోయింది. తమిళనాడులో ‘అమ్మ క్యాంటీన్లు’, కర్ణాటకలో ‘ఇందిరా క్యాంటీన్లు’, తెలంగాణలో ‘అన్నపూర్ణ క్యాంటీన్లు’ గుణాత్మకమైన సేవలు అందిస్తుండగా మీ పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నిరాశ్రయులను గాలికి వదిలేశారు.’’ ‘‘లాక్‌డౌన్ సమయంలో ఇల్లు కూడా లేని కడు నిరుపేదలను ఆదుకోవాల్సిన అవసరం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి దుర్భర పేదరికంలో ఉన్నవారిని కరోనా లాక్‌డౌన్ సమయంలోనే కాకుండా అన్ని వేళలా కాపాడాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టర్లను మార్చేందుకే అన్న క్యాంటీన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు...మంత్రి బొత్స ప్రకటించి.. తర్వాత వాటిని పునరుద్ధరిస్తామని సెలవిచ్చారు. దురదృష్టవశాత్తూ ఇప్పటి వరకూ వాటిని పునరుద్ధరించే చర్యలు ఏవీ చేపట్టలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రజావ్యవహారాల సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి త్వరలో క్యాంటీన్లను తెరుస్తామని చెప్పిన మాటలు కూడా ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. ఈ క్యాంటీన్ల ‘రంగు’, ‘పేరు’ మార్చి ఎప్పుడు తెరుస్తారో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎంతో మంది తమ సంతోషం కోసం చేసుకునే వ్యక్తిగత ఆడంబరాలు, కార్యక్రమాలకు వెచ్చించే సొమ్మును ఈ పవిత్ర కార్యానికి విరాళాలు ఇవ్వాలని కోరవచ్చు. దీని వల్ల ఆడంబరంగా పుట్టిన రోజులు, పెళ్లి రోజులు జరుపుకొనే వారు ఆ సొమ్మును విరాళంగా ఇచ్చి ఈ పథకాన్ని కొనసాగించేందుకు తమ వంతు సాయం అందించేందుకు అవకాశం ఉంది. వారి వారి పుట్టిన రోజులు, పెళ్లి రోజులకు గుర్తుగా విరాళాలు కూడా అందించేందుకు ఎంతో మంది సిద్ధంగా ఉంటారు. మూడు జోన్లు లేదా జిల్లాలు, మండలాల వారీగా ఇలా సేకరించిన విరాళాలు ఈ పథకం కోసం ఖర్చు చేయవచ్చు.’’  ‘‘సాటి మనిషి ఆకలి తీర్చడం కన్నా పరమాత్ముడి సేవ ఇంకేముంటుంది ?ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన అక్షయ పాత్ర సంస్థ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. విశాఖపట్నం, కాకినాడ, మంగళగిరి, నెల్లూరులో అక్షయ పాత్ర వంటశాలలు కూడా ఏర్పాటు చేసింది. ఈ పథకానికి వారి సేవలు వినియోగించుకుంటే, వారిని భాగస్వామిగా చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అనాథలను, అభాగ్యులను, దివ్యాంగులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని ఎలా భావిస్తారో.. అలానే నిరుపేదల ఆకలి తీర్చడం కూడా ప్రధానమైన అంశంగా మీరు గుర్తించాలని కోరుతున్నాను. పేదవారి ఆకలి తీర్చడం ద్వారా మానవత్వం ప్రదర్శించేందుకు ఇది వేదిక అవుతుంది. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి జయంతి కార్యక్రమం సందర్భంగా జగనన్న క్యాంటీన్ లేదా రాజన్న క్యాంటీన్ పేరుతో ఈ స్కీమ్‌ను మళ్లీ ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ 

భారత అథ్లెట్లకు రోజు కరోనా టెస్ట్! ఒలింపిక్స్ కమిటి రూల్ పై ఐఓఏ ఫైర్... 

వచ్చే నెలలో  జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. కరోనా మహమ్మారితో గత సంవత్సరం వాయిదా పడిన ఒలింపిక్స్ ను జూలైలో నిర్వహిస్తున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ తో ఈసారి కూడా నిర్వహణ జరుగుతుందో లేదోనన్న అనుమానాలు వచ్చినా.. చివరకు నిర్వహణపై మొగ్గు చూపింది జపాన్ ప్రభుత్వం. అయితే కొవిడ్ మార్గదర్శకాల పేరుతో కఠినంగా వ్యవహరిస్తోంది టోక్యో ఒలింపిక్స్ కమిటి. కరోనా ప్రభావం అధికంగా ఉన్న 11 దేశాల నుంచి వచ్చే అథ్లెట్లకు జపాన్ ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. ఆయా దేశాల క్రీడాకారులు జపాన్ బయల్దేరడానికి ముందు వారం రోజుల పాటు నిత్యం కరోనా టెస్టులు చేయించుకోవాలని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు స్పష్టం చేశారు. టోక్యో  ఒలింపిక్స్ నిర్వాహకులు కఠిన చట్టాలు విధించిన దేశాల్లో భారత్ కూడా ఉంది. భారత్ తో పాటు పాకిస్థాన్, బ్రిటన్ దేశాలు కూడా ఉన్నాయి. 11 దేశాలకు చెందిన అథ్లెట్లు తమతమ దేశాల్లో చివరి వారం రోజుల పాటు రోజు కరోనా టెస్టు చేయించుకోవడంతో పాటు జపాన్ చేరుకున్న తర్వాత మూడు రోజుల పాటు ఇతర దేశాల జట్లతో కలవకుండా క్వారంటైన్ లో  ఉండాలని తెలిపింది. తద్వారా ఒలింపిక్స్ క్రీడల్లో కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని భావిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా భారత్ వంటి దేశాల్లో కరోనా వేరియంట్ల కారణంగా గణనీయమైన నష్టం జరిగిందని వెల్లడించారు. టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులపై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత్ వంటి దేశాల అథ్లెట్లపై ఆంక్షలు విధించడం తీవ్ర అనైతికం అని విమర్శించింది. ఈ నిబంధనల కారణంగా అథ్లెట్లు మూడు రోజుల పాటు కీలకమైన శిక్షణకు దూరమవ్వాల్సి వస్తుందని వెల్లడించింది. దీనిపై ఐఓఏ అధ్యక్షుడు నరిందర్ బాత్రా, కార్యదర్శి రాజీవ్ మెహతా సంయుక్త ప్రకటన చేశారు. అథ్లెట్లు తమ ఈవెంట్ ప్రారంభానికి కేవలం ఐదు రోజుల ముందు ఒలింపిక్ క్రీడాగ్రామంలోకి ప్రవేశిస్తారని, కొత్త నిబంధనల నేపథ్యంలో మూడు రోజులు వృథా అని తెలిపారు. భారత క్రీడాకారులు ఒలింపిక్స్ కోసం ఐదేళ్లు కఠోరంగా శ్రమించారని, భారత క్రీడాకారులకు కూడా వర్తించేలా టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు నిబంధనలు తీసుకురావడం సరికాదని అభిప్రాయపడ్డారు.

సీఎంల‌ జ‌ల‌క్రీడ‌.. స్నేహం ముసుగులో వైరం!.. ఇక స‌మ‌ర‌మేనా?

అవును, వాళ్లిద్ద‌రూ కౌగిలించుకున్నారు. పుష్ప‌గుచ్చాలు ఇచ్చుకున్నారు. శాలువాలు క‌ప్పుకున్నారు. క‌లిసి భోజ‌నం చేశారు. క‌లిసి చ‌ర్చించుకున్నారు. అధికారులూ రోజుల త‌ర‌బ‌డి మాట్లాడుకున్నారు. ఆ సీన్ల‌న్నీ చూసి.. ఇక జ‌ల‌వివాదం స‌మ‌సిపోయింద‌ని అనుకున్నారంతా. విడిపోయిన తెలుగురాష్ట్రాలు క‌లిసిపోయాయ‌న్నంత సంతోషం. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు మంచి దోస్తుల‌య్యార‌నే సంబ‌రం. అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లో ఆవిష్కృత‌మైందీ జ‌ల‌దృశ్యం. ఇక ఆల్ ఈజ్ వెల్‌. ఆల్ ప్రాబ్ల‌మ్స్ సాల్వ్డ్ అనుకున్నారంతా.  క‌ట్ చేస్తే, అది మూన్నాళ్ల ముచ్చ‌టేన‌ని ఇంత‌కుముందే తేలిపోయింది. ఇప్పుడు మ‌ళ్లీ వాట‌ర్ వార్ ముదురుతోంది. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు మొండికేస్తున్నారు. త‌గ్గేదే లే అంటూ జ‌ల‌జ‌గ‌డానికి సిద్ద‌మైపోయారు. ఒక‌రిది ఇంకొక‌రికి త‌ప్పులా క‌నిపిస్తోంది. ఎవ‌రి లెక్క‌ల్లో వాళ్లు త‌మ‌దే ఒప్పు అంటున్నారు. మా నీళ్లు మాకే సొంతం. మా ప్రాజెక్టులు మా ఇష్టం. ఇక చ‌ర్చ‌లు.. చ‌ర్చించుకోవ‌డాలు లేవ్‌.. ప్రాజెక్టులు, నీటి కేటాయింపులే ముఖ్యం.. అంటూ ఎవ‌రికి వారే పంతానికి పోతున్నారు. స‌మ‌రానికీ సై అంటున్నారు. ముఖ్య‌మంత్రుల త‌ర‌ఫున మంత్రులు రంగంలోకి దిగి.. మాట‌ల తూటాలు పేల్చుతున్నారు. దేనికైనా రెడీ అంటూ జ‌ల‌ఖ‌డ్గం రువ్వుతున్నారు. పోతిరెడ్డిపాడు. ఇదే ప్ర‌స్తుత వివాదానికి మూలం. నిబంధ‌న‌ల‌కు లోబ‌డే సామ‌ర్థ్యాన్ని పెంచుతామ‌ని ఏపీ స్ప‌ష్టం చేస్తోంది. గ‌ట్లైతే మేం ఒప్పుకోమంటూ తెలంగాణ తిర‌గ‌బ‌డుతోంది. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచితే.. పాల‌మూరు-రంగారెడ్డి గ‌తి ఏంటంటూ గొడ‌వ ప‌డుతోంది. అది అంత‌కంత‌కూ ముదిరి.. ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ కేబినెట్ వ‌ర‌కూ వ‌చ్చింది. ఏపీ తీరుపై సీఎం కేసీఆర్ గ‌రంగ‌రం అయిన‌ట్టు తెలిసింది. మ‌నోడే గ‌దాని మంచిగుంటే.. గిట్ల చేస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ కేసీఆర్.. జ‌గ‌న్‌పై ఫైర్ అయ్యార‌ని అంటున్నారు. వైఎస్సార్ కంటే మోనార్క్‌లా ఉన్నాడంటూ.. జగన్ తీరుతో ఏపీకే నష్టమంటూ వార్నింగ్ కూడా ఇచ్చార‌ట‌. ఏపీ ప్రాజెక్టులు ఆగకపోతే.. ఎగువన కృష్ణా నదిపై కొత్త బ్యారేజీలు కడతామని కూడా తెలంగాణ కేబినెట్ హెచ్చరించింది. అయితే, కేసీఆర్ అంటే కాస్త భ‌యం భ‌యంగా ఉండే ఏపీ మంత్రులు ఈసారి మాత్రం గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చారు. రెండుమూడు రోజులు బాగా ఆలోచించుకున్నాక‌.. అంత‌ర్గ‌తంగా చ‌ర్చించుకున్నాక‌.. ఏపీ ఇరిగేష‌న్ మినిస్ట‌ర్ అనిల్‌కుమార్ తెలంగాణ‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లను తరలిస్తే తప్పేంటని గ‌ట్టిగానే నిలదీశారు మంత్రి అనిల్‌. తెలంగాణలోనే అనుమతులు లేకుండానే ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారంటూ.. కల్వకుర్తి, నెట్టెంపాడు సామర్థ్యం పెంచుకున్నారంటూ.. మంత్రి ఓ రేంజ్‌లోనే మండిపడటం మంట రేపుతోంది. త్వ‌ర‌లోనే నేర‌డి ప్రాజెక్ట్ ప్రారంభిస్తామంటూ నీళ్ల‌ మంట మ‌రింత ఎగ‌దోశారు. జ‌గ‌న్ సీఎం అయ్యాక ఏపీ నుంచి ఈ స్థాయిలో తెలంగాణ‌పై ఎదురుదాడి జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి. ఏపీ నుంచి ఈ రేంజ్‌లో రివ‌ర్స్ అటాక్‌తో కంగుతిన్న తెలంగాణ‌.. అంత‌లోనే తేరుకొని.. గంట‌ల వ్య‌వ‌ధిలోనే కౌంట‌ర్ అటాక్‌కు దిగింది. పాల‌మూరు జిల్లాకు చెందిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చారు. ఆయ‌న సీఎం జ‌గ‌న్‌కు, ఏపీకి వీర లెవెల్‌లో వార్నింగ్ ఇచ్చారు. తెలుగు గంగకు మానవతా దృక్పథంతో మంచి నీళ్ల కోసం సహకరిస్తే అది జల దోపిడీ గా మారిందని మంత్రి మండిప‌డ్డారు. పోతిరెడ్డి పాడు సామర్ధ్యాన్ని అంతకంతకు పెంచుతూ పాలమూరు జిల్లాకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ పథకంపై అపెక్స్ కౌన్సిల్‌కి ఇచ్చిన హామీని తుంగలో తొక్కి మోసం చేస్తోంది జగన్ కాదా? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. స్నేహ హస్తం అంటూనే వెకిలి చేష్టలు చేస్తున్నారని.. నోట్లో చక్కర.. కడుపులో కత్తెర.. అన్నట్టుగా ఏపీ ప్రభుత్వం తీరు ఉందంటూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు తెలంగాణ‌ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌. ‘‘తాము పైన ఉన్నాం. ప్రాజెక్టులు ఎన్నయినా కొట్టుకోవచ్చు.. జగన్‌ను కేసీఆర్ తమ్ముడిలా భావించి స్నేహ హస్తం అందించినా సరిగా స్పందించలేదు.. సీఎం కేసీఆర్ మంచికి మంచి వారు.. చెడుకు చెడ్డవారు.. పాలమూరును ఎడారి చేస్తామంటే ఊరుకునే పరిస్థితి లేదు. ఎంతకైనా తెగిస్తాం. ఏపీ మొండి వైఖరి కొనసాగితే మహబూబ్‌నగర్ జిల్లాలోనే కృష్ణా జలాలను మళ్లించే వ్యూహం మాకు ఉందంటూ ఏపీకి ఖ‌త‌ర్నాక్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌.  ఇరు రాష్ట్రాల‌కు చెందిన ఇద్ద‌రు మంత్రుల మాట‌ల‌తో తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురిన‌ట్టే ఉందంటున్నారు. సీఎం కేసీఆర్‌, సీఎం జ‌గ‌న్‌ల మ‌ధ్య స్నేహం ముసుగు తొల‌గిపోయిందంటున్నారు. ఈ జ‌ల జ‌గ‌డం ఏ తీరాల‌కు దారి తీస్తుందోన‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. నీళ్ల కోసం మ‌ళ్లీ లొల్లులు త‌ప్ప‌వా? రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య మ‌ళ్లీ ప్రాజెక్ట్ ఫైట్ మొద‌లైందా?    

లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ భయం!

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీల మధ్య ఎప్పడూ ఘర్షణ వాతావరణమే. రాష్ట్రంలో ఏం జరిగినా ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతుంటాయి. టార్గెట్  చేసేందుకు  ఏ చిన్న అవకాశం వచ్చిన వదులుకోవు ఇరు పార్టీలు. ఇటీవల టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దూకుడు పెంచారు. పంచ్ డైలాగులతో అదరగొడుతున్నారు. పదునైన విమర్శలతో ఒక రకంగా అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు చినబాబు. దీంతో లోకేష్ లక్ష్యంగా ఏపీ మంత్రులు రెచ్చిపోతున్నారు. గౌరవప్రదమైన పదవిలో ఉన్నామన్న సంగతి మర్చిపోయి మరీ.. బూతులు మాట్లాడుతున్నారు.  తాజాగా తాడేపల్లిలో వెలుగుచూసిన గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు దగ్గరలోనే ఘోరం జరగడంతో పోలీసులు, వైసీపీ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో లోకేష్ కు కౌంటరిచ్చిన ఏపీ మంత్రి పేర్ని నాని.. జూనియర్ ఎన్టీఆర్ ను మధ్యలోకి లాగారు.  నారా లోకేశ్ ఇప్పుడు సొంత పార్టీలోనే ఉనికి కోసం తాపత్రయపడుతున్నాడని విమర్శించారు. లోకేశ్ కు జూనియర్ ఎన్టీఆర్ భయం పట్టుకుందన్నారు నాని.  జూనియర్ ఎన్టీఆర్ రావాలని టీడీపీ కార్యకర్తలు కోరుకుంటుండడమే అందుకు కారణమని తెలిపారు. టీడీపీ  కార్యకర్తలు "రావాలి జూనియర్ ఎన్టీఆర్, కావాలి జూనియర్ ఎన్టీఆర్" అంటుండడంతో... "జూనియర్ ఎన్టీఆర్ అక్కర్లేదు నేనే సరిపోతాను" అంటూ జగన్ మోహన్ రెడ్డిపై  నోటికొచ్చినట్టు నారా లోకేష్  మాట్లాడుతున్నాడని పేర్ని నాని మండిపడ్డారు. అసభ్యంగా, విచక్షణ లేకుండా ఏరా, ఒరే అని మాట్లాడుతున్నారని.. తాము కూడా అలాగే మాట్లాడగలమని హెచ్చరించారు.  గడ్డం పెంచినవాడల్లా గబ్బర్ సింగ్ కాలేడని లోకేశ్ ను ఎద్దేవా చేశారు నాని .  లోకేశ్ ఉద్యోగం పోయిన రాజకీయ నిరుద్యోగి అని  సెటైర్ వేశారు. లోకేశ్ ప్రస్తుతం తీవ్ర అసహనంలో ఉన్నారని, అతన్ని చూస్తుంటే జాలి  కలుగుతోందని కామెంట్ చేశారు పేర్ని నాని. 

సీఎం ఇంటి సమీపంలోనే ఘోరమా! ఏపీలో మహిళకు రక్షణే లేదా?

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. సీతానగరం పుష్కరఘాట్ వద్ద చోటు చేసుకున్న అత్యాచార ఘటనపై ఆయన  లేఖలో నిలదీశారు. అత్యాచార ఘటన జరిగిన ప్రదేశం సీఎం నివాసానికి దగ్గర లోనే ఉందని, పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూడా మూడు కిలోమీటర్లు దూరంలో ఉందన్న చంద్రబాబు.. ఈ ఘటనను పరిశీలిస్తూ సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.  రాష్ట్రంలో అసలు దిశ యాక్ట్ అమలవుతుందా? అని ప్రశ్నించారు. దిశ చట్టం కింద ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు చేశారని డీజీపీని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. దిశ చట్టం ద్వారా తీసుకున్న చర్యలేమిటో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.  రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లల కు రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు విమర్శించారు. పెట్రోలింగ్, గట్టి నిఘా లేకపోవడం వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని చంద్రబాబు విమర్శించారు. కృష్ణా నది ఒడ్డున, పుష్కర ఘాట్‌ల వద్ద గంజాయి, మద్యం సేవిస్తున్నారని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని చంద్రబాబు ఆరోపించారు. వెంటనే పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం అవకుండా మహిళలకు రక్షణ కల్పించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను చంద్రబాబు డిమాండ్ చేశారు. మహిళలను రక్షించలేని చట్టాలు, యాప్‌లతో ఉపయోగం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేస్తే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు సరిపోతాయన్నారు. అత్యాచార ఘటన జరిగి ఇన్ని గంటలవుతున్న ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సీతానగరం ప్రాంతంలో సమర్థవంతమైన పోలీసింగ్, పెట్రోలింగ్ అవసరమన్నారు. ఈ ప్రాంతంలో గతంలో ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్టు శిథిలావస్థలో ఉండటం బాధాకరమన్నారు. డీజీపీ కార్యాలయం, ముఖ్యమంత్రి నివాసాలకు దగ్గర మాదక ద్రవ్యాల అమ్మకం, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్న ఎందుకు చర్యలు చేపట్టడం లేదని  చంద్రబాబు నిలదీశారు.   ప్రజల్లో విశ్వాసం పెంచేలా కృష్ణా నది ఒడ్డున పోలీస్ గస్తీ పెంచడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల రక్షణకు చర్యలు చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. నేరస్తులను త్వరగా పట్టుకోవాలని డీజీపీని లేఖలో కోరారు. రాష్ట్రంలో మహిళలకు రియల్ టైంలో భద్రత కల్పించాలన్నారు.గత రెండేళ్లలో మహిళలపై దాడులు పెరగడం విచారకరమన్నారు.  ప్రభుత్వం ఆర్భాటం చేసిన దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ మొబైల్ వాహనాలు, ప్రత్యేక యాప్ లన్నీ మోసపూరితంగా మారయన్నారు. వైసీపీ రంగులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి మాత్రమే దిశ చట్టం పనికొచ్చినట్లుందని చంద్రబాబు లేఖలో తెలిపారు.  గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్‌ వద్ద నదీ తీరంలో సేదతీరుతున్న ప్రేమజంటపై దుండగులు దాడి చేసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. తన కాళ్ళు, చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. అనంతరం నిందితులు పడవలో విజయవాడ వైపు వెళ్లిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం నాడు చోటు చేసుకున్న ఈ దారుణం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనను పోలీస్ యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. ఈ దురాఘతానికి పాల్పడింది గంజాయి, బ్లేడ్ బ్యాచ్ అని పోలీసులు అంచనాకు వచ్చారు. 

నిరుద్యోగ తేనెతుట్టును కదిపారా.. జగన్ కు మూడినట్టేనా? 

గొప్ప కోసం పోతే...తిప్పలు తప్పలేదా? జగన్ అనవసరంగా తేనెతుట్టును కదిపారా? అవుననే అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు. చేయలేనప్పుడు చేయలేననే చెబుతానని గతంలో రైతు రుణ మాఫీపై గట్టిగా నొక్కి చెప్పిన జగన్... అధికారంలోకి వచ్చాక ఎందుకిలా మేనేజ్ చేయాలని చూస్తున్నారో అర్ధం కావడం లేదనే కామెంట్లు వినపడుతున్నాయి. జాబ్ క్యాలెండర్ అంటూ ఆయన చేసిన హంగామా నిరుద్యోగులను రోడ్డెక్కించింది. మనసులోనే మదనపడుతూ ఆవేదన చెందుతున్నవారిని ఆవేశంతో బయటకు రప్పించింది. ఏదో ఇస్తాడు.. చేస్తాడు..విన్నాడు..ఉన్నాడు లాంటి స్లోగన్లు వినివినీ ఉన్నవారికి ఈ క్యాలెండర్ తగలబెట్టాలన్నంత కోపం వచ్చేసింది. కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్..అవి కూడా డిపార్టుమెంట్లు మారినవాటిని కూడా ఉద్యోగాల్లా లెక్కేసి చెప్పడంతో ముందు షాకైనా..తర్వాత తిట్టుకోవడం మొదలెట్టారు నిరుద్యోగులు. ప్రతి ఏడాది డీఎస్సీ ప్రకటిస్తానని హామీ ఇచ్చిన పెద్దమనిషి.. ఇప్పుడు ఇలా తూతూ మంత్రం క్యాలెండర్ ఇవ్వడంతో వారికి మండిపోతోంది.అందుకే దాదాపు అన్నిజిల్లాల్లో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారికి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం చెప్పలేదు ఆందోళనలు చేయమని..కాని వారే స్వచ్చంధంగా రోడ్డుమీదకు వచ్చి నిరసన చేస్తుండటంతో.. టీడీపీ నేతలు సైతం అలర్టయ్యారు. గౌరవవేతనానికి పనిచేసే వలంటీర్లను, మినిమమ్ శాలరీకి చేస్తున్న సచివాలయ ఉద్యోగులను లెక్కేసి లక్షల ఉద్యోగాలిస్తున్నట్లు ప్రకటించుకోవడం జగన్ కే చెల్లిందనే కామెంట్లు వస్తున్నాయి. అంతే కాదు వారికిచ్చేదానికన్నా..వారితో చేయించుకునే పనులు మాత్రం వంద రెట్లు ఉంటున్నాయని.. పైగా వారు రాజకీయంగా అధికారపార్టీకే పనిచేయాలని ఓపెన్ గానే ఆదేశాలిస్తున్నారని.. ఆ ఇబ్బందులు పడుతూనే ఉద్యోగాలు చేస్తున్నవారు... జగన్ ప్రకటనలు చూసి నివ్వెరపోతున్నారు. జీతం పెంచమంటే మీది ఉద్యోగమే కాదన్నవాడు.. నేడు ఉద్యోగాల లెక్కల్లో తమని చూపించడంతో ఏమనాలో అర్ధం కాక అయోమయంగా చూస్తున్నారు. హెల్త్ వర్కర్లు, నర్సింగ్ కలిపే 7 వేలు పైనఉండగా..మొత్తం 10 వేల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ అని ప్రకటించడం..హాస్యాస్పదంగా ఉందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. హెల్త్ డిపార్ట్ మెంట్ లో చేసే రిక్రూట్ మెంట్లు అన్నీ కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద ఇచ్చే నిధులతోనే అని కూడా వారు క్లారిటీ ఇస్తున్నారు. గ్రూప్ 1, 2 రెండు కేటగిరీలు కలిపి 36 పోస్టులు ఉన్నట్లు చూపించారు. లెక్కల తప్పులు సంగతి తర్వాత..అసలు ప్రకటించినదానినైనా సక్రమంగా అమలు చేస్తారా లేదా అన్నది కూడా అనుమానంగానే ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆర్ధిక సంక్షోభంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం..వీటికి బడ్జెట్ కేటాయింపులు చేసి అన్నీ అయ్యేసరికి..పుణ్యకాలం దాటిపోతుందని.. ఈలోపు నోటిఫికేషన్లు, పరీక్షల పేరుతో క్యాలెండర్ ఫాలో అయి..అసలు రిక్రూట్ మెంట్ మాత్రం చేయరనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా అసలే ఆర్ధిక సంక్షోభం, ఆ పై కోవిడ్ సంక్షోభంతో అల్లాడిపోయి అలిసిపోయి ఉన్న ప్రజలను..జగన్ మేలుకొలిపినట్లయింది ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటనతో.  ఈ సంక్షోభాలతో ప్రైవేటులో ఉన్న ఉద్యోగాలు కూడా పోయి నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో వారంతా ఇప్పుడు ఆగ్రహావేశాలతో ఆందోళనలకు దిగుతున్నారు. జగన్ కదిపిన ఈ తేనెతుట్టు.. ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. రాజకీయంగా ఇది తమకు నష్టమే చేస్తుందని వైసీపీ నేతలు కూడా గింజుకుంటున్నారని తెలుస్తోంది.

సీఎం మాత్ర‌మే సేఫ్‌! సామాన్యుల ర‌క్ష‌ణ మాటేంటి? బ‌్లేడ్ బ్యాచ్ దొరికేనా?

తాడేప‌ల్లిలో ముఖ్య‌మంత్రి నివాసం. ఆయ‌న ప్యాలెస్ మాత్రం ఫుల్ సేఫ్‌. ప్ర‌జావ్య‌తిరేక‌త విప‌రీతంగా ఉండ‌టంతో సీఎం ఇంటి చుట్టుప‌క్క‌ల ‌టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పోలీసుల క‌న్నుగ‌ప్పి చీమ కూడా అటువైపు వెళ్ల‌లేదు. సీఎం ఇల్లు మాత్ర‌మే సేఫ్‌గా ఉంటే స‌రిపోతుందా? రాష్ట్రమంతా సుర‌క్షితంగా ఉండాల్సిన ప‌నిలేదా? ఎక్క‌డి వ‌ర‌కో ఎందుకు.. ముఖ్య‌మంత్రి ఇంటికి జ‌స్ట్ కిలోమీట‌రున్న‌ర దూరంలోనే దారుణ అత్యాకాండ జ‌రిగడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ ప్రాంతం అరాచ‌క శ‌క్తుల‌కు అడ్డాగా మారడంపై ఎందుకు ఉదాసీనంగా ఉంటోంది ఈ ప్ర‌భుత్వం. తాడేప‌ల్లి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో, కృష్ణాన‌ది తీరంలో ఇటీవ‌ల కాలంలో వ‌రుస‌గా నేరాలు-ఘోరాలు జ‌రుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్న‌ట్టు? జ‌గ‌న్ ఇంటికి మాత్ర‌మే కాప‌లా కాస్తే స‌రిపోతుందా? ఆ ప‌క్క‌నే అఘాయిత్యాలు జ‌రిగినా, హ‌త్య‌లు జ‌రిగినా ప‌ట్టించుకోరా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు ప్ర‌జ‌లు. తాడేపల్లి పుష్కరఘాట్‌లో జ‌రిగిన అత్యాచార ఘ‌ట‌న‌లో నిందితులెవ‌రో ఇంకా గుర్తించ‌లేక‌పోయారు పోలీసులు. ప్ర‌త్యేక బృందాల‌తో గాలిస్తున్నా.. బ్లేడ్ బ్యాచ్‌పై అనుమానం ఉన్నా.. ద‌ర్యాప్తు ముందుకు సాగ‌డం లేదు. ఇప్పటికే విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లోని రౌడీషీటర్లు, ఇతర అనుమానితులను విచారిస్తున్నారు. ఒక అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే బాధితురాలికి కాబోయే భర్తను కూడా విచారించినా.. అతని పాత్ర ఏమీ లేదని తేల్చినట్టు సమాచారం. ఘటనపై సీఎం జ‌గ‌న్ తీరిగ్గా స్పందించారు. పోలీస్ అధికారులను ఆరాతీశారు. హోంమంత్రి సుచరిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితను జీజీహెచ్ కు పంపారు. ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించి ధైర్యం చెప్పారు మ‌హిళా మంత్రులు. బాధితురాలికి 5 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించింది ప్ర‌భుత్వం. మహిళల భద్రత కోసం అనేక చట్టాలున్నా ఉన్మాదులు రెచ్చిపోతున్నారని హోంమంత్రి సుచరిత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్ వినియోగం ఎక్కువైందన్న సమాచారం ఉంద‌న్నారు హోంమంత్రి. ఆ ప్రాంతంలో నిఘా పెంచినట్లు సుచరిత చెప్పారు.  స్వ‌యాన హోంమంత్రే తాడేప‌ల్లి పరిస‌ర ప్రాంతాల్లో గంజాయి, డ్ర‌గ్స్ బ్యాచ్‌లు ఉన్నాయ‌ని అన‌టం ప్ర‌భుత్వ చేత‌గానిత‌నానికి నిద‌ర్శ‌న‌మ‌ని ప్ర‌తిప‌క్షం మండిప‌డుతోంది. ప్ర‌మాదం ఉంద‌ని తెలిసినా.. నేరం జ‌రిగే వ‌ర‌కూ ఎందుకు ఉపేక్షించార‌ని నిల‌దీస్తున్నారు. తాగుబోతులు, దోపిడీ ముఠాలు, బ్లేడ్ బ్యాచ్‌లు.. సీఎం ఇంటి స‌మీప ప్రాంతాల్లోనే సంచ‌రిస్తుండ‌టం.. ముఖ్య‌మంత్రి ఇంటి చుట్టుప‌క్క‌ల ప్రాంతాలు అరాచ‌క‌, అసాంఘీక కార్య‌క‌లాపాల‌కు అడ్డాగా మారడం దారుణ‌మైన విష‌య‌మ‌ని నిందిస్తున్నారు.  ఇక ఆదివారం జ‌రిగిన ఉదంతం అత్యంత దారుణం. కాబోయే భ‌ర్త‌తో క‌లిసి సీతానగరం పుష్కరఘాట్‌లో విహారానికి వెళ్లిన యువ‌తిపై ఇద్ద‌రు దుండ‌గులు అత్యాచారానికి పాల్ప‌డ‌టం క‌ల‌క‌లం రేపింది. ఆ జంట‌పై ఇద్ద‌రు దుర్మార్గులు వెనుక నుంచి దాడి చేయ‌డం.. యువకుడి చేతులు కాళ్లు కట్టేసి... బ్లేడ్‌తో గొంతు కోస్తామ‌ని బెదిరించి.. యువతిని ఇసుక‌లో వేసి ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అత్యాతారం చేయ‌డం దారుణం. ఆ త‌ర్వాత దుండ‌గులు బాధితురాలి‌ చెవి రింగులు, డబ్బులు, సెల్ ఫోన్ తీసుకొని.. నాటుపడవలో నదిలోంచి విజ‌య‌వాడ‌వైపు పారిపోగా.. వారికోసం విస్తృతంగా గాలిస్తున్నారు పోలీసులు. ఎలాంటి ఆధారాలు లేని ఈ కేసును చేధించ‌డం ఖాకీల‌కు స‌వాల్‌గా మారింది. పాత నేర‌స్తుల‌ను, అనుమానితుల‌ను ప్ర‌శ్నిస్తూ.. ఆ దిశ‌గా కేసును కొలిక్కితెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా తాడేప‌ల్లి ప‌రిస‌ర ప్రాంతాల‌ను నేర ర‌హితంగా, ప్ర‌శాంతంగా మార్చాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.  సీఎం మాత్ర‌మే సేఫ్‌గా ఉంటే స‌రిపోదు.. సామాన్యులూ సుర‌క్షితంగా ఉండేలా చేయాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానిదే. మ‌రి, మ‌రో దారుణం జ‌ర‌గ‌కుండా పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటారా? పుష్క‌ర‌ఘాట్ కేసును వెంట‌నే సాల్వ్ చేస్తారా?  

పాత లోకేష్ కాదు.. ఇప్పుడు చూడు! వైసీపీకి చుక్కలే..

మొన్నటిదాకా ఆయననే తిట్టారు. ఆయన మీదే ఫోకస్ చేశారు. ఆయన కదిలితే చాలు విమర్శల వర్షం కురిపించారు. ఆయన కొడుకును ఎగతాళి చేయడం తప్ప విమర్శలు చేసేవారు కాదు. ఏమన్నా సరే తీసిపారేసేవారు. అలాంటిది ఇప్పుడు ఆ కొడుకుపైనే కస్సుమంటున్నారు. నీకెంత ధైర్యం అంటూ విరుచుకుపడుతున్నారు. ఊరుకోమంటూ వార్నింగులు ఇస్తున్నారు.  జగన్మోహన్ రెడ్డిని తిట్టినందుకే లోకేష్ పై వైసీపీ నేతలు మండిపడుతున్నారనుకుంటే పొరపాటు...లోకేష్ స్టయిల్ మారింది..మాట మారింది.. మాటల తూటాలతో చురుక్కుమనిపిస్తున్నాడు. జనం, జనంతో పాటు  టీడీపీ కేడర్ సైతం ఇప్పుడు లోకేష్ ఏం చెబుతున్నాడనేదానిపై దృష్టి పెడుతున్నారు. మారుతున్న ఈ వాతావరణం వైసీపీకి నచ్చలేదు. అందుకే టార్గెట్ మార్చుకున్నారు.. రెచ్చిపోయి దాడులు చేయడం మొదలెట్టారు. అవును..లోకేష్ స్టయిల్ మారింది. ఈ విషయం రెండు, మూడు నెలల క్రితమే మీడియాలో వచ్చినప్పటికీ... ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి. గడ్డం పెంచితే సరిపోదు అంటూ ఓ మంత్రి లోకేష్ పై సెటైర్ వేశాడు. అంతకు ముందు బయటకు రావటం లేదన్నారు. బయటకు వచ్చి విమర్శలు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ఆ పంచ్ డైలాగులకు ఆశ్చర్యపోతున్నారు. ట్విట్టర్ లో కనపడినప్పుడు..ఎవరితోనో రాయించుకున్నాడని కామెంట్ చేశారు. ఇప్పుడు బయటికొచ్చి అంతకంటే ఘాటుగా డైలాగులు వదులుతుంటే షాకవుతున్నారు.  గతంలో లోకేష్ పొరపాటున పలికిన పదాలను పట్టుకుని ఆ వీడియోలను వైరల్ చేశారు వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్. జగన్ అధికారంలోకి వచ్చాక బయట, అసెంబ్లీలోనూ మాట్లాడిన తప్పులను ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న లోకేష్ ఇప్పుడు పదునైన మాటలతో కరకుగా మాట్లాడుతూ అధికార పార్టీ నేతల ఫ్రస్టేషన్ పెంచేస్తున్నారనే కామెంట్లు వినపడుతున్నాయి. బరువు బాగా తగ్గిపోయిన లోకేష్.. గడ్డం పెంచి.. మాస్ లుక్ లోకి వచ్చేశారు. గతంలో క్లీన్ షేవ్ తో క్లాస్ గా ఉండే లోకేష్ ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. ఎంతలా అంటే... వైసీపీని సమర్ధించే పోర్టల్స్ లో అసలు కొత్త ఫోటోలే వాడటం లేదు.. గతంలోని ఫోటోలనే పెట్టి వార్తలు రాస్తున్నారు. అంటే ఆ లుక్ లో ఎంత ఛేంజ్ వస్తే..దానిని వాడటానికి వారు భయపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఫిజికల్ గా కూడా లోకేష్ తన ఫిట్ నెస్ బాగా పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మీడియాలో చూస్తున్న లోకేష్ పర్సనాలిటీకి...గతంలో చూసినదానికి చాలా తేడా కనపడుతోంది. ఇంకొన్ని రోజుల్లో మరింత ఛేంజ్ వస్తుందని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. చాలా పట్టుదలతో లోకేష్ తన ఫిట్ నెస్ పెంచుకుంటున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.మొన్నటికి మొన్న టెంత్, ఇంటర్ పరీక్షలపై గట్టిగా పట్టుబట్టి వ్యూహాత్మకంగా వ్యవహరించిన లోకేష్ విజయం సాధించారు. కేవలం లోకేష్ ఆ సమస్యను ఎత్తుకున్నందుకే నిర్ణయం తీసుకోని జగన్..ఇప్పుడు సుప్రీంకోర్టు ఒత్తిడితో నిర్ణయం తీసుకోక తప్పని పరిస్దితిలో పడ్డారు. విజయం ముందే ఫిక్స్ అయిపోయిన పోరాటాన్నిలోకేష్ తెలివిగా తీసుకున్నట్లయింది. అయితే లోకేష్ ఇంకా అగ్రెసివ్ గా ఉండాలని..సమస్యలపై పోరాటం చేసి చూపించాలని.. కేవలం ట్విట్టర్ లో స్టేట్ మెంట్ ఇవ్వడం.. ఏదైనా ఘటన జరిగితే అక్కడకు వెళ్లి ప్రెస్ తో మాట్లాడటం కాదని.. పార్టీ కార్యకర్తలతో ఆందోళనలను నిర్వహించి..తాను స్వయంగా పాల్గొనాలని రాజకీయ వర్గాలు సూచిస్తున్నాయి

 కేసీఆర్ కు ఏపీ మంత్రి కౌంటర్.. ఏమన్నారంటే.. ?

తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జల వివాదం ముదురుతోంది. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు నుంచి అక్రమంగా నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా కొత్త ఎత్తిపోథలు కడుతుందని తెలంగాణ సర్కార్ ఆరోపిస్తోంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారనే ప్రచారం జరిగింది. జగన్ .. ఆయన తండ్రి వైఎస్సార్ కంటే మోనార్క్ లా వ్యవహరిస్తున్నారని, చట్టాలను కూడా గౌరవించడం లేదని కేసీఆర్ ఫైరయ్యారట. జగన్ తీరుతో ఏపీకే నష్టం జరుగుతుందని కూడా చెప్పారుట. ఏపీ ప్రాజెక్టులు ఆగకపోతే.. ఎగువన కృష్ణా నదిపై కొత్త బ్యారేజీలు కడతామని కూడా తెలంగాణ కేబినెట్ హెచ్చరించింది. తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో ఏపీ సీఎంతో ఆయనకు గ్యాప్ పెరిగిందనే చర్చ జరుగుతోంది. అయితే తాజాగా తెలంగాణ కేబినెట్ ప్రకటనకు కౌంటరిచ్చారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఏపీ ప్రాజెక్ట్‌లపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరికాదని  అన్నారు. కేంద్ర జల సంఘం కేటాయింపులకు లోబడే ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్ట్‌ల నిర్మాణం జరుగుతోందని మంత్రి అనిల్ వివరణ ఇచ్చారు.  పోతిరెడ్డి పాడు నుంచి నీళ్లను తరలిస్తే తప్పేంటని నిలదీశారు. శ్రీశైలంలో  840 అడుగులకు లెవెల్ పడిపోతే ఏపీ చుక్కనీరు తీసుకునే అవకాశం లేదన్నారు.  తాము ఎక్కడా కేటాయింపులు మించి వెళ్లడం లేదని చెప్పారు అనిల్ కుమార్ యాదవ్. తెలంగాణలోనే అనుమతులు లేకుండానే ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో కల్వకుర్తి, నెట్టెంపాడు సామర్థ్యం పెంచుకున్నారని మంత్రి మండిపడ్డారు.రాజోలిబండ ప్రాజెక్ట్‌కి 4 టీఎంసీల కేటాయింపు ఉందన్న అనిల్ కుమార్..  ఏపీ ప్రయోజనాలు కాపాడటంలో సీఎం జగన్‌ ముందుంటారని తెలిపారు.  వంశధార ట్రిబ్యునల్ నుంచి నేరడి ప్రాజెక్ట్ కట్టేందుకు అనుమతి ఇచ్చింది. త్వరలో ప్రారంభిస్తామన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రెండు రాష్ట్రాలు కలిసుండాలి అని కోరుకున్నారని మంత్అరి అనిల్భి చెప్పారు.  ఒక అడుగు ముందుకు వేసి స్నేహ హస్తం అందించే గొప్ప మనిషి తమ ముఖ్యమత్రి అని అన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టులు సృష్టించబడ్డాయని.. వాటి కెపాసిటీ పెంచుకునేందుకు మాత్రమే తాము ప్రయత్నం చేస్తున్నామని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు.

కరోనాకు కేసీఆర్ వాడిన మందులు ఇవే..

దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ బీభత్సం స్పష్టించింది. కొన్ని రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. తెలంగాణలోనూ కొవిడ్ సెకండ్ వేవ్ లో వైరస్ వేగంగా విస్తరించింది. మొదటి వేవ్ తో పోలిస్తే రెండో దశలో కేసులు ఎక్కువగా రావడమే కాక మరణాలు భారీగా  నమోదయ్యాయి. పేద, ధనిక , సామాన్య, వీఐపీ అన్న తేడా లేకుండా అందరిని కరోనా కబళించింది. ప్రగతి భవన్ లేదా ఫామ్ హౌజ్ లోనే ఎక్కువగా గడిపే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా కరోనా సోకింది. కేసీఆర్ వయసు, ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా..  కరోనాను ఎలా జయిస్తారో అన్న ఆందోళన వ్యక్తైమంది. టీఆర్ఎస్ నేతలైతే చాలా కంగారు పడ్డారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కొందరు పూజలు కూడా చేశారు. అయితే అందరి భయాలను అధిగమిస్తూ త్వరగానే కరోనా నుంచి కోలుకున్నారు సీఎం కేసీఆర్. ఆయన ఫామ్ హౌజ్ లో ఐసోలేషన్ లో ఉండే మహమ్మారిని జయించారు. హాస్పిటల్ లో అడ్మిన్ కావాల్సిన పరిస్థితి కూడా రాలేదు. కేసీఆర్ త్వరగానే కరోనాను జయించడంతో అంతా ఊపీరి పీల్చుకున్నారు. తాజాగా కరోనా సోకినప్పుడు తాను తీసుకున్న ట్రీట్ మెంట్ ఏంటో తెలిపారు కేసీఆర్. వరంగల్ లో పర్యటించిన ముఖ్యమంత్రి.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ... తాను కరోనాను ఎలా జయించారో వివరించారు.  క‌రోనా మ‌హమ్మారి విష‌యంలో మీడియా సంస్థ‌లు ప్ర‌జ‌ల్లో భ‌యోత్పాతం సృష్టిస్తున్నాయి అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది మంచిది కాదన్నారు. క‌రోనా ప‌ట్ల తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ప్ర‌సారం చేస్తే మంచిది. కానీ ఆందోళ‌న క‌లిగించే అంశాలు ప్ర‌సారం చేసి ప్ర‌జ‌ల బ‌తుకుల‌తో ఆట‌లాడుకోవ‌ద్దని సూచించారు. త‌న‌కు క‌రోనా వ‌చ్చిన‌ప్పుడు రెండు ట్యాబ్లెట్లు మాత్ర‌మే వేసుకున్నాననని చెప్పారు. పారాసిట‌మాల్‌తో పాటు ఒక యాంటిబ‌యోటిక్ ట్యాబ్లెట్ వేసుకున్నా.. డీ విట‌మిన్ వేసుకోమ‌ని చెప్పారు.. కానీ అది తాను వేసుకోలేదని కేసీఆర్ తెలిపారు. అంత‌లోనే క‌రోనా త‌గ్గిపోయిందన్నారు. జాగ్ర‌త్త‌లు పాటిస్తే క‌రోనాను నియంత్రించ వచ్చన్నారు. మీడియా మిత్రులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి, అన‌వ‌స‌రంగా లేని ఉత్పాతాన్ని సృష్టించ‌వ‌ద్దు అని సీఎం కేసీఆర్ సూచించారు. థర్డ్ వేవ్‌ వస్తుందని జరుగుతున్న ప్రచారంపైనా సీఎం కేసీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ‘‘స్కూళ్లు లేక ఇళ్లన్నీ అంగడంగడి చేస్తున్నారు పిల్లలు. వాళ్లకు కరోనా వస్తుందన్న పుకార్లు పుట్టాయి. వీనికి ఫోన్ చేసి చెప్పిందా. ఈ తాప అచ్చి పిల్లలకు పడతాననని.. ఎట్ల పుట్టించినరంటే... ఇప్పటికే పుస్తలతాళ్లు అమ్ముకుని లక్షలు కుమ్మరించారు జనం. దండం పెట్టి చెబుతున్నా... పుకార్లు మానండి. మాస్కు పెట్టుకోమని చెప్పండి. అంతేకాని భయపెట్టకండి. దీనికి ఇన్ని కథలా... ఇన్ని ప్రచారాలా.. ఇన్ని భయోత్పాతాలా... దయచేసి మీడియా వాళ్లు ఇది గుర్తించాలి. ప్రజల బతుకులతో ఆడుకోవడం సరికాదు’’ అని వరంగల్ సభలో కేసీఆర్ అన్నారు. 

కుల బహిష్కరణ.. పోలీస్టేషన్.. ఇంటిపై దాడి..

కాలి నడక నుండి రాకెట్ ప్రయాణం. అది మానవుడి నుండి అలెక్సా వరకు ఈ  సమాజంలో ఎన్నో పరిణామాలు జరిగిన ఇంకా మారానిది..రూపుమాపనిది కులవ్యవస్థ.. అందరి రంగులు వేరు కావచ్చు కానీ, రక్తం ఒకటే.. భాషాలు యాసలు వేరు కావచ్చు కానీ ప్రాణం ఒక్కటే.. ఇలా అందరికి  అన్ని పోలికలు ఉన్న.. అన్ని  రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ శ్రీ శ్రీ కవిత్వం లాగ పదండి ముందుకు అని దూసుకుపోతుంటే.. ఇంకా ఈ సమాజంలో కుల గజ్జీ వదలడంలేదు. కొన్ని చోట్ల ఆ కులగజ్జె పరిపాలన చేస్తుంది. తాజాగా జగిత్యాల జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కుల బహిష్కరణ పేరుతో దుండగులు రెచ్చిపోయారు. ఓ కుటుంబంపై పడి బీభత్సం సృష్టించారు. చంపుతామని బెదిరించడమే కాదు.. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జగిత్యాల రూరల్‌ మండలంలోని మోతే గ్రామంలో బావాజీ పల్లెలో  భూ పంచాయతీ విషయంలో కొండపల్లి నీలయ్య కుటుంబాన్ని గ్రామంలోని కులస్థులు ఆంక్షలు విధించారు. ఆ కుటుంబసభ్యులను ఎవరిని ఎటువంటి కార్యక్రమాలకు పిలవ్వద్దని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బహిష్కరణపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ.. కులపెద్దలు రెచ్చిపోయారు. నీలయ్య ఇంట్లో లేని సమయంలో మిగిలిని కుటుంబసభ్యులపై ఆడవాళ్లు పిల్లలు అని చూడకుండా దాడికి దిగారు. ఇంట్లో టీవీ, ఫర్నీచర్‌, ఫ్రిడ్జ్‌తో పాటు ఇంట్లోని వస్తువులను పగలగొట్టారు.  టూ వీలర్‌, సీసీటీవీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. మొత్తం 15 మంది వరకు వచ్చి తమ ఇంటిపై దాడికి దిగారని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై నీలయ్య కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బవాజీపల్లెకు చెందిన వీరయ్య, గంగారావు, సంపత్‌, రవి, మస్తాన్‌ అనే ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కులాలు లేని మతాలు లేని నవసమాజమే మన ధ్యేయంగా ముందుకు సాగాలి.. ఆ రోజు కోసం అందరు ఆలోచించాలి. అందుకు ముందుకు అడుగులు వెయ్యాలి.   

జ‌స్టిస్ క‌న‌గ‌రాజ్‌.. మ‌ళ్లీ మూన్నాళ్ల ముచ్చ‌టేనా?

జస్టిస్‌ కనగరాజ్‌. జ‌స్టిస్ చౌద‌రి రేంజ్‌లో నిరుడు ఏపీలో ఎంట్రీ ఇచ్చారు. నిమ్మ‌గ‌డ్డ ప్లేస్‌లో ఎస్ఈసీ సీట్లో కూర్చొన్నారు. రాజ‌కీయంగా ఆట‌లో అర‌టిపండు అయ్యారు. చెన్నై నుంచి రాత్రికిరాత్రి ఎలాగైతే డౌన్‌లోడ్ అయ్యారో.. అలానే మ‌ళ్లీ పెట్టాబేడా స‌ర్దేసుకొని చెన్నై తిరుగెళ్లిపోయారు. క‌ట్‌చేస్తే.. లేటెస్ట్‌గా మ‌ళ్లీ ఏపీలో అడుగుపెట్టారు జ‌స్టిస్ క‌న‌గ‌రాజ్‌. ఈసారి మ‌రో ప‌ద‌వి.. మ‌రో కాంట్ర‌వ‌ర్సీ.. మ‌ళ్లీ నిబంధ‌న‌లు తుంగ‌లో తొక్కి.. ఏపీ పోలీసులు అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నార‌నేది విప‌క్షాల విమ‌ర్శ‌. పోలీస్ పెద్ద‌ల నుంచి కానిస్టేబుల్ వ‌ర‌కూ.. అనేక మందిపై ఏదో ఒక సంద‌ర్భంలో ఆరోప‌ణ‌లు వ‌స్తూనే ఉన్నాయి. పాల‌కుల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ఖాకీలు చేస్తున్న ఓవ‌రాక్ష‌న్ అంతాఇంతా కాదు. ఇటీవ‌ల జ‌రిగిన ర‌ఘురామ ఎపిసోడ్‌లోనైతే సీఐడీ అడిష‌న‌ల్ డీజీ సునీల్‌కుమార్‌పై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఇక‌, అచ్చెంనాయుడు నుంచి ధూళిపాళ్ల న‌రేంద్ర వ‌ర‌కూ టీడీపీ బ‌డా నాయ‌కుల‌పై పోలీస్ కేసులు న‌మోద‌వ‌డంతో పాటు.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేసే వారినీ కేసుల‌తో వేధిస్తున్నార‌ని.. గ్రామాల్లో ఒక వ‌ర్గానికి ఖాకీలు స‌హ‌క‌రిస్తున్నార‌ని.. ఒక వ‌ర్గం వారిపైనే కేసులు బ‌నాయిస్తున్నార‌ని.. ఇలా అనేక విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. పోలీసుల ప‌ని తీరుపై ప్ర‌జ‌ల ఉంచి భారీగా ఫిర్యాదులు వ‌స్తున్నాయి. అందుకే, రాష్ట్ర పోలీసు కంప్లయింట్‌ అథారిటీ (పీసీఏ) అధిప‌తిగా త‌మ వారు ఉంటే ప్ర‌భుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంద‌ని భావించిన‌ట్టుంది జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు. అందుకే కాబోలు.. గ‌తంలో ఓసారి త‌మ‌కు స‌హ‌క‌రించి అబాసు పాలైన జ‌స్టిస్ క‌న‌గ‌రాజ్‌కు కృత‌జ్ఞ‌త‌గా  పీసీఏ ఛైర్మన్ సీటులో కూర్చోబెట్టార‌ని ప్ర‌తిప‌క్షం ఆరోపిస్తోంది.  అయితే, గ‌తంలో ఎస్ఈసీ ఎపిసోడ్ మాదిరే ఈ సారి కూడా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా పీసీఏ ఛైర్మ‌న్ ఎంపిక జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ పోలీసు కంప్లయింట్‌ అథారిటీ రూల్స్‌- 2020లోని సెక్షన్‌ 4(ఏ) ప్రకారం రిటైర్డ్‌ హైకోర్టు జడ్జిని చైర్మన్‌గా నియమించాలి. అయితే, ఆయన 65 ఏళ్ల వయసు వచ్చేవరకు.. లేదంటే మూడేళ్లు.. ఏది ముందైతే అప్పటి వరకు ఆ పదవిలో ఉండొచ్చు. 65 ఏళ్లు దాటిన వారు ఈ పోస్టులో కొనసాగడానికి వీల్లేదు. కనగరాజ్‌ వయస్సు దాదాపు 75 ఏళ్లు. రూల్స్‌ ప్రకారం ఆయన ఆ పోస్టుకు అనర్హులు అవుతార‌ని చెబుతున్నారు. ఎవ‌రైనా హైకోర్టులో కేసు వేస్తే.. మ‌ళ్లీ ఈయ‌న పోస్ట్ ఊస్ట్ అవ‌డం గ్యారంటీ అంటున్నారు.  త‌మ‌కు ఇబ్బందిగా మారిన, మారుతాయ‌ని అనుకున్న పోస్టుల్లో ప్ర‌తీసారి క‌న‌గ‌రాజ్‌తోనే తొండాట అడుతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారిందని అంటున్నారు. గ‌తంలో మాదిరే ఈసారీ ఆయ‌న మ‌ళ్లీ ఆట‌లో అర‌టిపండు అవక త‌ప్ప‌దంటున్నారు. మ‌రి, ఇలాంటి వివాదాస్ప‌ద విష‌యాల‌కు సీఎం జ‌గ‌న్‌రెడ్డి ఎందుకు ప‌దే ప‌దే క‌న‌గ‌రాజ్‌నే ఎంచుకుంటున్నారో.. క‌న‌గ‌రాజ్ సైతం సీఎం జ‌గ‌న్‌రెడ్డికి ఎందుకు ప‌దే ప‌దే స‌హ‌క‌రిస్తున్నారో తెలీని ప‌రిస్థితి.   

యడ్డీ  ఆయన లెక్కే వేరప్పా 

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, నక్కను తొక్కిన నాయకుడు. ఆయన కుర్చికి ముప్పు ఎప్పుడూ పోంచే ఉంటుంది. ఆయన ప్రమాణ స్వీకారానికి ముందు నుంచే పార్టీలో అసమ్మతి రాజుకుంటుంది. ఆయన పాలనలో ప్రతిపక్షాల కంటే ముందు నుంచే సొంత పార్టీ నేతలకు లోపాలు కనిపిస్తాయి. అవినీతి దర్శనమిస్తుంది. ఆయన రాజీనామాకు డిమాండ్ కూడా ముందు సొంత పార్టీ అసమ్మతి నేతల నుంచే ఇనిపిస్తుంది.  సుమారు రెండు మూడు నెలలుగా బీజేపీ అసమ్మతి నాయకులు ఆయనను గద్దేదింపే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒక దశలో అయిపొయింది, యడ్డీ ఇక ఇంటికే, అనే వరకు ఊహాగానాలు పరుగులు తీశాయి. యడ్డీ అనుకూల, వ్యతిరేక వర్గాలు రెండూ ఢిల్లీ చేరి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు, సంజాయిషీలు సమర్పించుకున్నాయి. రాష్ట్రంలో అయితే, ముఖ్యమంత్రి మార్పు తధ్యమన్న సీన్ క్రియేట్ అయింది. అసమ్మతి రాగానికి విపక్షాలు స్వరం కలిపాయి. మీడియా అయితే  యడ్డీ ఉద్వాసనకు ముహూర్తాలు కూడా నిర్ణయించింది.  అయితే, చివరాఖరుకు, “గజం మిథ్య, పలాయనం మిథ్య" అన్నట్లుగా అంతా తేలిపోయింది. రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించేందుకు అధిష్టానం దూతగా బెంగుళూరు చేరుకున్న, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక వ్యవహరాల ఇంచార్జి అరుణ్ సింగ్, మూడు రోజుల పాటు పరిస్థితిని మదింపు వేసి, ముగ్గురు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ యడ్డీకి జై కొట్టారని తేల్చారు. ఈ మేరకు ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నివేదిక సమర్పించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సీపీ యోగీశ్వర్, హుబ్బాలి- ధార్వాడ్ పశ్చిన ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్,ఎమ్మెల్సీ విశ్వనాథన్ మినహా మిగిలిమ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ ముఖ్యమంత్రిని మార్చాలని కోరడం లేదని ఆయన నివేదికలో స్పష్టం చేశారు. అయితే అదే సముంలో ఆయన వివిధ విషయాలకు సంబంధించి బహిరంగంగా ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్న నేతలపై  క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ అగ్రనాయకత్వాన్ని కోరారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను బహిరంగంగా చర్చించడం వలన అనవసర ఊహాగానాలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని, పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని,  కాబట్టి అలాంటి నాయకులపై క్రమశిక్షణ చర్యలు తెసుకోవడం తక్షణ అవసరమని ఆయన  పేర్కొన్నారు.  అరుణ సింగ్ ఇచ్చిన నివేదికతో, యడ్డీ ఉద్వాసన వట్టిదే అని తేలిపోయింది. అయితే, యడియూరప్ప ఇలా సేవ్’ అయిపోవడం ఇదే మొదటి సారి కాదు. నిజానికి ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడమే పార్టీ పెద్దలు ఇద్దరికీ ఇష్టం లేదని పార్టీ వర్గాల సమాచారం. అయితే, గతంలో, ఆయనపై తీవ్ర అవినీతి, భూ కుంభకోణం ఆరోపణలు వచ్చి, లోకా యుక్త  విచారణలో ఆయన దోషిగా తేలడంతో, అధిష్టానం ఆయన్ని తప్పించింది. ఆ నేపధ్యంలో ఆయన పార్టీపై తిరుగుబాటు చేశారు. సొంత పార్టీ పెట్టి బీజేపీ ఓటమికి కారణమయ్యారు. అయితే, ఆ తర్వాత ఆయన మళ్ళీ పార్టీలో చేరడంతో మళ్ళీ పార్టీ పగ్గాలు, ప్రభుత్వ పగలు కూడా అయన చేతికే వచ్చాయి. ఈ నేపధ్యంలో పార్టీ అధినాయకత్వం ఇష్టం ఉన్న లేకున్నా యడ్డీకి తలోగ్గుతోంది. ఇప్పుడ మళ్ళీ ఆ మంత్రమే పనిచేసిందని, మరో సంవత్సరంన్నరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఇప్పుడు ఆయన జోలికి వెళ్ళడం ఎందుకనే ఉద్దేశంతో ఆయన్నే కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే, విశ్లేషకులు యడ్డీ లెక్కే వేరప్పా .. అంటున్నారు.