ఒక్క‌రు చ‌నిపోయినా రూ.కోటి ఇవ్వాలి.. ఏపీకి సుప్రీం స్ట్రాంగ్ వార్నింగ్‌..

పరీక్షల కార‌ణంగా ఒక్క‌రు చ‌నిపోయినా.. ఒక్కొక్క‌రికీ కోటి రూపాయ‌లు ప‌రిహారం ఇవ్వాల్సి ఉంటుంద‌ని సుప్రీంకోర్టు ఏపీ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించింది. క‌రోనా క‌ల్లోల ప‌రిస్థితుల్లో ఒక్కో గ‌దిలో 15 నుంచి 20 మంది విద్యార్థులను ప‌రీక్ష‌ల‌కు కూర్చోబెట్ట‌డం స‌మంజ‌స‌మా?  ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కార‌మే 28వేల గ‌దులు అవ‌స‌రం అవుతాయి? అది సాధ్య‌మా? రెండో ద‌శ తీవ్రత చూశాక కూడా.. ఇంకా ప‌లు వేరియంట్లు పుట్టుకొస్తున్నాయ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నా కూడా.. ప్ర‌భుత్వం ఎందుకు ఇలా వ్య‌వ‌హ‌రిస్తోంది.. ప‌రీక్ష‌ల స‌మ‌యంలో మూడో వేవ్ వ‌స్తే ఏం చేస్తారు? అంటూ సుప్రీంకోర్టు ఏపీ స‌ర్కారును తీవ్ర స్థాయిలో త‌ప్పుబ‌ట్టింది.   రాష్ట్రాల బోర్డుల పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుమారు గంటన్నర పాటు వాదనలు జ‌రిగాయి. పరీక్షల తేదీలు, పరీక్షల నిర్వహణ, విద్యార్థుల సేఫ్టీ అంశంపై ప్రణాళికలు ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. ఏ ఒక్క విద్యార్థి మృతి చెందినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని గ‌తంలోనే హెచ్చ‌రించింది సుప్రీంకోర్టు. తాజాగా మ‌రిన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. పరీక్షల సమయంలో కోవిడ్ ఉధృతి పెరిగితే దానిపై కూడా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్కుల ఎవల్యూషన్‌పై కూడా తాము నిపుణులతో మాట్లాడి ఒక చార్ట్ ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.  ఇప్పటికే 10, 12 తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం, 11 తరగతి పరీక్షలు నిర్వహిస్తామని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపాయి. మరోవైపు ఇప్పటికే 21 రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయి. 12 వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని, ప్రత్యామ్నాయం లేదని సుప్రీంకోర్టులో బుధవారం నాడు ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. శుక్రవారం మ‌రోసారి విచార‌ణ జ‌రిపి.. పరీక్షలు నిర్వహించాలా..? లేక, రద్దు చేయాలా..? అనే దానిపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.   

భార్య చావుకి, భర్త ప్లాన్.. చివరికి.. 

ఈ మధ్య కాలంలో భార్య భర్తల మధ్య వివాదాల కేసులు చాలానే తలెత్తుతున్నాయి. అటు పెద్దలు కుదిర్చిన పెళ్ళిలో కావచ్చు, ఇటు ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి విషయంలో గొడవలు సహజంగా జరుగుతున్నాయి. ఏ కుటుంబంలో అయిన గొడవలు జరగడం సహజమే కానీ ఆ గొడవలు చావుల వరకు వెళ్తున్నాయి. ఇంకొందరు మాత్రం గదులలో బందించి మరి హింసిస్తున్నారు. అయితే సరిగ్గా అలాంటి సంఘటనే జరిగింది. మీరే చూడండి అసలు ఏం జరిగిందో. వాళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా నాలుగు ఏళ్ళ బాబు కూడా ఉన్నాడు. కారణాలు తెలియలేదుగానీ మనసుకు నచ్చి  ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చంపాలని ప్రయత్నించాడు. వివరాలు ఇలా ఉన్నాయి.  నెల్లూరు జిల్లాకు చెందిన ఆశ అనే మహిళ కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి సినీ పరిశ్రమలో పనిచేసేది. అక్కడ సీతానగరం మండలంలోని పెదకొండేపూడికి చెందిన కర్రి అభిరామ్‌ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే బంధించి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాడో దుర్మార్గపు భర్త. కొంతకాలం అభిరామ్ ఆమెను దూరం పెట్టడంతో ఇటీవల పెదకొండేపూడిలోని అత్తమామల ఇంటిముందు కొడుకుతో కలిసి నిరసన దీక్ష చేపట్టింది. పెద్దలు రంగంలోకి దిగి ఇద్దరికి సర్ది చెప్పి వారి  మధ్య రాజీ కుదర్చడంతో ఆశ అత్తింట్లోనే ఉంటోంది. అయితే ఆమెతో కాపురం చేయడం ఇష్టం లేని అభిరామ్ కొద్దిరోజులుగా భార్యను ఇంట్లోనే బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. పధకం వేశాడు ఆ పధకాన్ని అమలు పడ్డామని దిండుతో ముఖంపై అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఇంట్లోని కుటుంబ సభ్యులు అతనికి సహకరించారు. వారి నుంచి తప్పించుకున్న ఆశ సీతానగర పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భర్త అభిరామ్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడిలో వెలుగుచూసింది. మోసాల మనుషులు మోసపు రోజులు ఎవరిని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో అర్థం కానీ రోజులు ఇవి.. ప్రేమ పేరుతో కలవడం ఆ తర్వాత విడిపోవడం.. పిల్లలు ఉన్నారు వారి భవిష్యత్తు ఏం అవుతుందని ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం. అని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.   

పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పాద‌యాత్ర‌? మ‌రో రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అవుతారా?

టైటిల్ చూసి.. అదేంటి? ఇంకా పీసీసీ చీఫ్ కానే లేదు.. అప్పుడే పాద‌యాత్ర న్యూస్‌ ఏంటి? అనుకుంటున్నారా. అదేమ‌రి, రాజ‌కీయం అప్ప‌టిక‌ప్పుడు అనుకుని చేసేది కాదు. భ‌విష్య‌త్ అంతా ముందే డిసైడ్ అయిపోతుంది. ఫ్యూచ‌ర్‌ను బేస్ చేసుకునే ప్ర‌జెంట్ పాలిటిక్స్ చేస్తారు. రేవంత్‌రెడ్డి అలాంటి సత్తాగ‌ల లీడ‌ర్ కాబ‌ట్టే.. నెక్ట్స్ మూడేళ్ల‌కు స‌రిప‌డా మాస్ట‌ర్ ప్లాన్ రెడీ చేసుకొని పెట్టుకున్నారు. ఈజీగా వ‌రిస్తుంద‌నుకున్న పీసీసీ పీఠం కాస్త ఇబ్బంది పెట్టి, ఇంకాస్త‌ ఆల‌స్య‌మైనా.. ఆ పోస్టుపై త‌న పేరే రాసుంద‌ని ప‌క్కా కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు రేవంత్‌రెడ్డి. రేపేమాపో పీసీసీ ప‌గ్గాలు చేతికంద‌గానే.. కేసీఆర్‌పై దండ‌యాత్రే ఆయ‌న అంతిమ‌ల‌క్ష్యం. అయితే, అందుకు తొంద‌రేమీ లేద‌నేది రేవంత్‌రెడ్డి ఉద్దేశ్యంలా ఉంది.  ఎగిరెగిరి దంచినా.. నిల‌బ‌డి దంచినా.. అదే ఫ‌లితం. అసెంబ్లీ సంగ్రామానికి ఇంకా రెండున్న‌రేళ్ల గడువుంది. అందుకే, ఇప్ప‌టి నుంచే ఆవేశ‌ప‌డకుండా.. తుదిపోరుకు ఎన‌ర్జీ సేవ్ చేసుకునేలా ఆచితూచి అడుగులు వేయాల‌నేది రేవంత్‌రెడ్డి స్ట్రాట‌జీలా క‌నిపిస్తోంది. ఆలోగా ముందు ఇంటిని చ‌క్క‌బెట్టుకోవాల‌ని చూస్తున్నారు. కాంగ్రెస్‌లో త‌న కాలికి అడుగ‌డుగునా అడ్డొస్తున్న ముళ్ల‌ను ఏరిపారేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌కు రేవంత్‌రెడ్డి ఒక్క‌రే కింగ్ అండ్ కింగ్‌మేక‌ర్ అనేలా పార్టీని పూర్తిగా త‌న చేతుల్లోకి తీసుకునేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. నిత్యం మీడియా ముందు అసంతృప్తి స్వ‌రాలు వినిపించే.. అధిష్టానానికి ప‌దే ప‌దే లేఖ‌లు రాసే.. త‌న మీద ఫిర్యాదులు చేసే.. వీహెచ్‌, జ‌గ్గారెడ్డి, న‌ల్గొండ బ్యాచ్ లీడ‌ర్ల‌ను సైడ్ చేసేలా.. పార్టీలో త‌న ఆధిప‌త్యమే చెలామ‌ని అయ్యేలా స్కెచ్ వేస్తున్నారు రేవంత్‌రెడ్డి. అందుకు, గ‌తంలో కాంగ్రెస్‌ను పూర్తిగా క‌బ్జా చేసిన వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డినే రోల్ మోడ‌ల్‌గా తీసుకుంటున్నారు. అచ్చం.. వైఎస్సార్ అనుస‌రించిన ఎత్తుగ‌డ‌ల‌నే రేవంత్‌రెడ్డి ఇంప్లిమెంట్ చేసేలా స‌న్నద్ద‌మ‌వుతున్నార‌ని స‌మాచారం.  వైఎస్సార్ ముఖ్య‌మంత్రి కాక‌ముందు కూడా కాంగ్రెస్‌లో ఇలాంటి ప‌రిస్థితే ఉండేది. అప్పుడు సైతం రాజ‌శేఖ‌ర్‌రెడ్డిపై సీనియ‌ర్లు క‌ళ్ల‌మంట‌తో ఉండేవారు. ఆయ‌న్ను ఎలాగైనా తొక్కేయాల‌ని చూసేవాళ్లు. కేడ‌ర్ మాత్రం వైఎస్సార్‌కు స‌పోర్ట్‌గా ఉండేది. ఇప్ప‌టి వి.హ‌నుమంత‌రావు అప్పుడు కూడా వైఎస్సార్‌పై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూనే ఉండేవాడ‌ని చెబుతారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డిపైనా అలానే హైక‌మాండ్‌కు చాడీలు చెబుతున్నాడ‌ని అంటున్నారు. సీనియ‌ర్ల చేతుల్లో ఉన్న కాంగ్రెస్‌ను త‌న గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు వైఎస్సార్ వేసిన తిరుగులేని ఎత్తుగ‌డ‌.. పాద‌య‌త్ర‌. అదే ఆయ‌న రాజ‌కీయ జీవితానికి మ‌రో ప్ర‌స్థానంగా బాట‌లు ప‌రిచింది. చేవెళ్ల‌లో వేసిన తొలి అడుగు.. వైఎస్సార్‌ను ముఖ్య‌మంత్రి పీఠం వ‌ర‌కూ తీసుకెళ్లింది. ఆ పాద‌యాత్ర‌ ప‌దఘ‌ట్ట‌న‌ల‌తో పార్టీలో సీనియ‌ర్లంద‌రినీ తొక్కిప‌డేశారు వైఎస్సార్‌. కాంగ్రెస్‌లో తిరుగులేని నేత‌గా ఎదిగారు. ఆ త‌ర్వాత ముఖ్య‌మంత్రిగా ఇటు పార్టీని, అటు అధిష్టానాన్ని శాసించారు. సేమ్ టూ సేమ్ ఇదే స్ట్రాట‌జీని రేవంత్‌రెడ్డి సైతం ఫాలో కాబోతున్నార‌ని తెలుస్తోంది.  పీసీసీ ప్రెసిడెంట్‌గా త‌న పేరును ప్ర‌క‌టించాక‌.. పై నుంచి కాకుండా ముందు కింద నుంచి న‌రుక్కొస్తార‌ని అంటున్నారు. ముందుగా డీసీసీల‌పై దృష్టి పెట్ట‌నున్నట్టు తెలుస్తోంది. జిల్లాల వారిగా ఇప్ప‌టికే రేవంత్‌రెడ్డికి విశేష అనుచ‌ర‌గ‌ణం ఉంది. వారిలో స‌మ‌ర్థుల‌కు, త‌న అనుకున్న వారికి.. డీసీసీ ప‌ద‌వులు క‌ట్ట‌బెడ‌తార‌ట‌. ఇప్ప‌టికే ఆ జాబితా కూడా రెడీ చేసుకున్నార‌ని తెలుస్తోంది. ఇలా జిల్లాల వారీగా త‌న మ‌నుషుల‌తో పార్టీలో బ‌లం పుంజుకొని.. అప్పుడిక వైఎస్సార్ మాదిరే మ‌హా పాద‌యాత్ర‌తో.. అస‌లైన దండ‌యాత్ర‌కు శ్రీకారం చుడతార‌ని అంటున్నారు.  పాద‌యాత్ర‌తో టూ బ‌ర్డ్స్ ఎట్ వ‌న్ షాట్ అనేది రేవంత్‌రెడ్డి లెక్క. తెలంగాణ‌లో గ్రామ‌గ్రామాన కాలిన‌డ‌క‌న ప‌ర్య‌టించి.. ఊరూరా త‌న పాద‌ముద్ర వేసి.. ఆ అడుగుల స‌వ్వ‌డితో సీనియ‌ర్ల కూనిరాగాలు వినిపించ‌కుండా చేయ‌డం సులువ‌ని భావిస్తున్నారు. పాద‌యాత్ర‌తో బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగి.. ఇటు పార్టీకి.. అటు కేసీఆర్‌కి త‌న స‌త్తా చాటేలా ఎత్తుగ‌డ వేస్తున్నార‌ని తెలుస్తోంది. కేసీఆర్ పాల‌న‌లోని లోటుపాట్ల‌ను ఇంటింటికీ వెళ్లి ఎండ‌గ‌డుతూ.. ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకొస్తార‌ని అంటున్నారు. అయితే, ఈ పాద‌యాత్ర ఇప్పుడే చేస్తారా? లేక‌, ఎల‌క్ష‌న్ల ఏడాది చేయాలా? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేద‌ని తెలుస్తోంది. అనుకోకుండా ఈట‌ల రాజేంద‌ర్ పాన‌కంలో బుడ‌గ‌లా బ‌య‌ట‌కు రావ‌డం.. అందులోనూ బీజేపీలో చేరి.. త‌న‌కు పోటీగా నిలిచే అవ‌కాశం ఉండ‌టంతో.. పాద‌యాత్ర‌కు ఇదే మంచి స‌మ‌యం అని అంచ‌నా వేస్తున్నార‌ట‌. గ‌తంలో పాద‌యాత్ర‌ను న‌మ్ముకున్న ఏ ఒక్క‌రు వైఫ‌ల్యం చెంద‌లేద‌ని.. వైఎస్సార్‌, చంద్ర‌బాబు, జ‌గ‌న్‌.. ఆ ముగ్గురూ పాద‌యాత్ర‌తోనే ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిష్టించార‌ని.. అలానే రేవంత్‌రెడ్డి సైతం పాద‌యాత్రతో సీఎం అయ్యేలా అడుగులు వేస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి, పాద‌యాత్ర‌తో రేవంత్‌రెడ్డి హిస్ట‌రీ రిపీట్ చేస్తారా? కాంగ్రెస్‌లో మ‌రో వైఎస్సార్‌లా తిరుగులేని నేత‌గా నిల‌బ‌డ‌తారా?

నాజీలను మించి జగన్ రెడ్డి అరాచకాలు! 

మొన్న కడప జిల్లా.. నిన్న కర్నూల్ జిల్లా.. తాజాగా ప్రకాశం జిల్లా... ఏపీలో హత్యా రాజకీయాలు పెరిగిపోతున్నాయి. ప్రతిపక్ష టీడీపీ కార్యకర్తలు బలవుతున్నారు. రోజు  ఏదో ఒక చోటు అధికార పార్టీ నేతలు , కార్యకర్తలు తెగబడుతూనే ఉన్నారు, టీడీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో వైసీపీ దాడులు తీవ్రమయ్యాయి. వారం క్రితం కర్నూలు జిల్లాలో వైసీపీ-టీడీపీ మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన మరుక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లాలో టీడీపీ-వైసీపీ వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. సంతమాగులూరు మండలం కామేపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలు, ఇనుప రాడ్లతో టీడీపీ, వైసీపీ వర్గాలు దాడికి దిగాయి. ఈ ఘర్షణలో టీడీపీ వర్గీయుడు లక్కిపోగు సుబ్బారావు మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. దాడిలో గాయపడిన వారి దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు.  ఏపీలో జరుగుతున్న దాడుల ఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ప్రశాంత పరిస్థితులు నెలకొనగా.. వైసీపీ అధికారంలోకి వచ్చాకే మళ్లీ విష సంస్కృతి పెరిగిపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఫ్యాక్షన్ గొడవలు మళ్లీ హీటెక్కిస్తున్నాయి. ఏపీలో నెలకొన్న పరిస్థితులపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నవ్యాంధ్రప్రదేశ్‌ను వైసీపీ హత్యాంధ్రప్రదేశ్‌గా మార్చిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. టీడీపీ కార్యకర్తలను వేధించడమే వైసీపీ పనిగా పెట్టుకుందన్నారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధిత కుటుంబాలకు టీడీపీ అన్ని విధాలా అండగా వుంటుందని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తల ప్రాణాలకు రక్షణలేదన్నారు అచ్చెన్నాయుడు. పరిశ్రమలతో కళకళలాడాల్సిన నవ్యాంధ్ర.. దాడులు, హత్యలతో విలవిల్లాడుతోందన్నారు. రాష్ట్రంలో జరిగే అరాచకం సీఎం కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. జర్మనీలో నాజీల దురాగతాలకు మించి ఏపీ సీఎం జగన్ రెడ్డి అరాచకాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. రోజులెప్పుడూ తమవే ఉండవని జగన్ రెడ్డి గూండాలు గుర్తుంచుకుంటే మంచిదని హెచ్చరించారు. అధికారంలోకొచ్చాక 27 మంది టీడీపీ కార్యకర్తలను బలితీసుకున్నారని మండిపడ్డారు. ఇన్ని హత్యలు, దాడుల జరుగుతున్నా డీజీపీ కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. హత్యల్లో పాత్రులైన వారిలో ఒక్కరినైనా పట్టుకుని శిక్ష విధించారా అని నిలదీశారు. ఇష్టానుసారంగా తమ కార్యకర్తలపై దాడులకు తెగబడతామంటే చూస్తూ ఊరుకోమని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

నీళ్ల గొడవలో ఇద్దరు మృతి.. భద్రాద్రి జిల్లాలో దారుణం

భద్రాద్రి  కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామంలోనీ ఎస్సీ కాలనీలో గల తాగునీటి ట్యాంకు పంచాయతీ అధికారులు గత కొన్ని నెలలుగా శుభ్రం చేయలేదు. అసలే కరోనా టైం అలాగే వర్షాకాలం కూడా వచ్చింది. వర్షాకాలంలో కొత్త వైరుసులు వస్తాయని కనీస భాద్యత కూడా లేకుండా ప్రవర్తించారు అధికారులు. ఆ  కలుషితమైన నీరు త్రాగి గ్రామంలో ఇద్దరు మృతి చెందారు అంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆ కాలనీలో విషజ్వరాలు రావడంతో త్రాగునీరు వలనే ఇలా జరిగిందని అనుమానం వచ్చి ట్యాంక్ పైకి గ్రామస్తులు ఎక్కి చూడగా, అడుగు భాగం మొత్తం బురదమయంతో ఉండి అపరిశుభ్రంగా ఉండటంతో ఖంగుతిన్నారు. గ్రామస్తులు రోజు ఈ నీరు త్రాగడం వలనే తమకు విషజ్వరాలు వచ్చాయని అధికారులు నిలదీయడంతో అధికారులు మిషన్ భగీరథ నీరు వలన ఇలా జరిగిందని తెలిపారు. గ్రామస్తులు ఈ విషయంపై ప్రజాప్రతినిధులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.   మిషన్ భగీరథ నీరు వలన తమకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని కేవలం ట్యాంక్ శుభ్రం చేయకపోవడం వలనే తమకు విష జ్వరాలు వచ్చాయని గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడంతో వెంటనే అధికారులు తప్పు ఒప్పుకొని గ్రామస్తులకు సర్దిచెప్పి, వెంటనే నారాయణపురం గ్రామంలో ఉన్న అన్ని ట్యాంకులను శుభ్రం చేసి పరిశుభ్రమైన త్రాగునీరు అందించారు. ఇదే గ్రామానికి చెందిన నీరు త్రాగి వారం రోజుల వ్యవధిలో తుంగ కిట్టయ్య (30), వేల్పుల రాంబాబు (35) ఇద్దరు వ్యక్తులు కామెర్ల బారిన పడి మృతి చెందినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా అనేకమంది గ్రామస్తులు మెరుగైన వైద్యం కోసం భద్రాచలం, ఖమ్మం, సత్తుపల్లి పట్టణాల్లో ఉన్న ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాల సోమరితనం వల్లే ప్రజలు ఇలా ప్రాణాలు కోల్పోతున్నారని స్థానికులు మాట్లాడు కుంటున్నారు. సో దీన్ని బట్టి మనకు ఏం అర్థం అవుతుందంటే అధికారులను నిలదీయాలి నిలదీసి మన హక్కులను అడగాలి ఆడితే గాని మన సమస్యలు తీరవు. సో అందరు ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోండి. 

ఏపీ ప్రభుత్వానికి షాక్.. ప్రాజెక్టులు ఆపాలని కృష్ణా బోర్డు ఆదేశం

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్ని జల వివాదంలో కీలక పరిణామాం చోటు చేసుకుంది. తెలంగాణ సర్కార్ ఫిర్యాదుపై కృష్ణా నది మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ స్పందించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ముందుకు వెళ్లకూడదని తెలిపింది. దీనిపై డీపీఆర్‌ సమర్పించాలని కృష్ణా మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ సూచించింది. . డీపీఆర్ ఇవ్వకుండా, అత్యున్నత మండలి ఆమోదం లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టరాదని బోర్డు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ, ఫొటోలను దీనికి జత చేసింది బోర్డ్‌. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శికి బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్ మీనా లేఖ రాశారు. పనులు చేపట్టవద్దంటూ ఫిబ్రవరిలో జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను ఈ లేఖలో హరికేశ్ మీనా గుర్తు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులు జరుగుతున్నాయో, లేదో చెప్పాలని అప్పట్లో జాతీయ హరిత ట్రైబ్యునల్ కృష్ణాబోర్డు నిపుణుల కమిటీని ఆదేశించింది. అయితే, నిపుణుల కమిటీ పర్యటనకు ఏపీ అవకాశం ఇవ్వడం లేదన్నారు  మీనా. ఎన్జీటీ ఆదేశాల ఉల్లంఘన జరుగుతుందా లేదా అన్న విషయాన్ని తేల్చేందుకు బోర్డుకు ఏపీ సహకరించలేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై తెలంగాణ ప్రభుత్వం కూడా ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. కాబట్టి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను సమర్పించాలని, అది ఆమోదం పొందాకే ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లాలని ఆ లేఖలో స్పష్టం చేశారు.  ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ జలవివాదం రాజేసుకుంది.  ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలోనే కృష్ణనదిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తుందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. బోర్డు చైర్మన్‌కు నీటిపారుదల శాఖ స్పెషల్‌ సెక్రటరీ రజత్‌ కుమార్ లేఖ రాశారు. అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పోతిరెడ్డిపాడు విస్తరణ పనులపై ఫిర్యాదు చేసింది. ఎన్జీటీ స్టే విధించినా పనులు కొనసాగుతున్నాయని, కృష్ణా బోర్డు వాటిని అడ్డుకోలేకపోయిందని తెలంగాణ ప్రభుత్వం లేఖలో పేర్కొంది. ఏపీ చర్యలతో తెలంగాణలో కృష్ణా బేసిన్‌లో ఉన్న కరవు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలపై ప్రభావం పడుతుందని తెలంగాణ కేబినెట్ పేర్కొందని లేఖలో రజత్ కుమార్ తెలిపారు. డీపీఆర్‌లు సమర్పించకుండా ఎటువంటి పనులు చేపట్టారదాని గతంలోనే జలశక్తి శాఖ స్పష్టం చేసిందని ఈ సందర్భ్మగా గుర్తుచేశారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను తక్షణమే ఆపాలని తెలంగాణ నీటిపారుదలశాఖ స్పెషల్ సెక్రెటరీ రజత్ కుమార్ కోరారు.

డెల్టా ప్లస్ డేంజర్ బెల్స్.. భారత్ లో మళ్లీ పెరుగుతున్న కేసులు..

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసరనుందా? థర్డ్ వేవ్ రావడం ఖాయమేనా? కొన్ని రోజులుగా ఇదే ఆందోళన జనాల్లో నెలకొంది. థర్డ్ వేవ్ వస్తుందని కొన్ని సంస్థలు హెచ్చరిస్తుండగా.. ఖచ్చితంగా చెప్పలేమని మరికొన్ని సంస్థలు చెబుతున్నాయి. పశ్చిమ దేశాల్లో వెలుగుచూసిన డెల్టా ప్లస్ వేరియంట్ చాలా ప్రమాదకరమని, వేగంగా విస్తరించనుందనే ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఇండియాలోనూ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయటపడ్డాయి. అంతేకాదు దేశంలో గత రెండు రోజులుగా కొత్త పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. దీంతో దేశంలో మళ్లీ మహ్మమారి పంజా విసరనుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.  దేశంలో గత 24 గంటల్లో పాజిటివ్ కేసులు మరోసారి పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 54,069 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,82,778కి చేరింది. ఇందులో 6,27,057 యాక్టివ్ కేసులు ఉన్నాయి. బుధవారం కొత్తగా 68,885 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 2,90,63,740కి చేరింది. 1,321 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,91,981 చేరుకుంది. దేశంలో వెలుగు చూస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్‌ కేసులు కలవరపెడుతున్నాయి. ఇప్పటిదాకా దేశంలో మొత్తం 40 డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదు అయినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇందులో మహారాష్ట్రలో 21 కేసులు, మధ్యప్రదేశ్ 6, కేరళ 3, తమిళనాడు 3, కర్ణాటక 2, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, జమ్మూలలో ఒక్కొక్క కేసు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా 30.2 కోట్ల(30,16,26,028) వ్యాక్సినేషన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.61 శాతంగా ఉందని.. మరణాల రేటు 1.30 శాతంగా ఉందని తెలిపింది.

మరో వ్యక్తిని.. కొట్టి చంపిన పోలీసులు..  

ప్రపంచం నలుదిక్కుల ఎక్కడ చూసిన ఇప్పుడు వినిపించే పేరు కరోనా. ఈ కరోనా మహమ్మారి విసిరిన పంజాకి మానవ సమాజం వణిపోతుంది. వరిసేలా విసిరితే చెట్టు మీద పిట్టలు ఎగిరిపోయినట్లు. మనుషుల ప్రాణాలు క్షణంలో  ఎగిరిపోతున్నాయి. ఇంత అభివృద్ధి చెందిన సైన్సు ప్రపంచంలో దాదాపు రెండు పాటుగా విరుచుకుపడుతున్న కరోనని చూస్తూ ఉండడమే కానీ దానికి సరైన వైద్యం లేదు. గ్రహాల మీదికి క్షణాల్లో వెళుతున్నాం, గడ్డి పరకతో వింతలు చేస్తున్నాం, మా దేశం సైన్సు లో ముందు అంజలో ఉంది అని సంకలు గుద్దుకోవడం. వీడే చేశాడు వాడే చేశాడు అని నిందించడం తప్ప.. ఏ ఒక్క దేశం కరోనా వైరస్ ని చెక్ పెట్టడం లేదు. ఇంకా కొంత మంది ముందుకు వచ్చి కరోనా గురించి నిజాలు చెపితే వారికి శిక్షించడం లాంటి పనులు చేస్తుంది. ఏ ప్రభుత్వం అయినా.. కొంత మంది మేధావులు అయితే ఇంతకీ కరోనా అనేది ఉందా ? లేక ప్రజలను నాశనం చేయడానికే కార్పొరేట్ వ్యవస్థ ఈ పనికి పూనుకుండా అని మాట్లాడుతున్నారు.  వారి మాటలు వింటుంటే అప్పుడప్పున అది కూడా నిజమే కావచ్చు అనిపిస్తుంది. సరే ఇది అంత ఒక ఎత్తు ఐతే కరోనా వచ్చిందని చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరోనా టెస్ట్ చేయించి తనకు పాజిటివ్ వస్తుందేమో అని కొందరు చనిపోయారు. అలా హాస్పిటల్స్ లో చనిపోయిన వాళ్ళు చంపినా వాళ్ళు అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఇవి అన్ని ఒక రకం అయితే లాక్ డౌన్ టైంలో బయటికి వచ్చిన వాళ్ళను పోలీసులు కొట్టి చంపిన వాళ్ళు కూడా లేకపోలేదు. తాజాగా తమిళనాడు లో బయటికి వచ్చారని కొట్టి చంపారు పోలీసులు వివరాల్లోకి వెళితే.. మన దేశంలో కరోనా కారణంగా  పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు అదుపులోకి రావడంతో అక్కడక్కడా లాక్‌డౌన్ సడలింపులు ఇస్తున్నారు. అయితే, తమిళనాడులో కరోనా కేసులు ఇంకా అదుపులోకి రాకపోవడంతో అక్కడ ఇంకా నిర్భంధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బయటకు వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అడ్డుకుని చితకొట్టారు. అతను ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఘటన రాష్ట్రంలో పెను సంచలనం రేపింది. గతంలో చెన్నైలో మొబైల్ షాప్ ఓనర్ ని జయరాజు అతని కొడుకుని కర్ఫ్యూ టైం కి మించి 15 నిముషాలు షాప్ ఓపెన్ చేశాడని పోలీసులు పెద్ద రచ్చ చేసి చివరికి జయరాజును అతని కొడుకును కొట్టి చంపారు.. అది చాలా పెద్ద సంచలనం రేపింది. ఆ సంఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది.   లాక్‌డౌన్ లో ఎవరూ బయటకు రాకూడదని అక్కడి ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అయితే, మురుగేషన్ (40) అనే వ్యక్తి పనిమీద సేలం నుంచి ధర్మపురికి బయలుదేరాడు. మార్గమధ్యలో ఎడప్పురి చెక్ పోస్టు వద్ద అతన్ని గమనించి పోలీసులు అడ్డుకున్నారు. బయటకు ఎందుకు వచ్చావని చితకబాదారు. కొట్టొద్దని మురుగేషన్ ఎంత ప్రాధేయపడ్డాడు.  అయినా పోలీసులు వినిపించుకోలేదు. దెబ్బ మీద దెబ్బలు కొట్టారు. చివరికి ఆ వ్యక్తి దెబ్బలకు తాళలేక చివరకు  మరణించాడు. విషయం తెలియడంతో స్టేట్ వైడ్ సంచలనం అవ్వగా.. పలువురు పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై ఆరా తీసిన ఉన్నతాధికారులు మురుగేషన్ మరణానికి కారణమైన ఎస్సై సహా మరో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. కాగా, మృతుడు మద్యం సేవించి తమతో వాదనకు దిగాడని, దీంతో తాము కొట్టాల్సి వచ్చిందని పోలీసులు ఆరోపించారు. ప్రజా ఆరోగ్యం పట్టని ప్రభుత్వాలు ప్రజలపైనే వాళ్ళ ప్రతాపం చూపిస్తుంది. ఎన్నికల కోసం ప్రజలను పోగుచేసి మీటింగ్ పెట్టొచ్చు. ఆక్సిజన్ అందించకుండా ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలు తీయొచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు కనీస అవసరాలు లేకుండా చేయొచ్చు. ఎదావిదిగా వైన్స్ లు నడపొచ్చు, చచ్చిపోయిన శవాన్ని తగల పెట్టడానికి అవకాశం లేకుండా చేయొచ్చు. కానీ ప్రజలు ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తే వారిపైన కేసులు, పెడ్దుతున్నరు. దేశద్రోహం ముద్ర వేస్తున్నారు. మాస్క్ లేకుంటే ఫైన్లు వేస్తున్నారు.. ఇదెక్కడి ప్రభుత్వాలు.. అందుకే ప్రజలు ఓట్లు వేసే ముందు ఆలోచించాలి. ప్రజల కోసం పని చేసే వారిని ఎన్నుకోవాలి.  

బీజేపీ జెండా.. సొంత ఎజెండా!.. ఈట‌ల రూటే సెప‌రేటా?

జై ఈట‌ల‌.. జై జై ఈట‌ల‌.. నినాదాల‌తో హుజురాబాద్ మారుమోగిపోతోంది. నియోజ‌క‌వ‌ర్గ‌మంతా కాషాయ సంద‌డితో హోరెత్తిపోతోంది. హుజురాబాద్ అంతా ఈట‌ల అనుచ‌రుల హంగామా న‌డుస్తోంది. రాజేంద‌ర్ సైతం జోరు మీదున్నారు. ఆయ‌న వెంట బీజేపీ ద‌ళ‌మంతా ఉంది. కేసీఆర్‌పై ఒంటికాలిపై లేస్తున్నారు. ఘోరీ క‌డ‌తా బిడ్డా అంటూ ఖ‌త‌ర్నాక్ వార్నింగ్‌లు ఇస్తున్నారు. త‌న‌ స‌త్తా ఎంటో చూపిస్తానంటూ స‌వాల్ చేస్తున్నారు. ఈట‌ల‌ మాట‌ల‌కు ఈలలు.. కేక‌లు.. హుజురాబాద్‌లో ఇప్పుడంతా ధూం ధాం పాలిటిక్స్‌..  అంతా బాగుంది. ఈట‌ల హంగామా జ‌బ‌ర్ద‌స్త్‌గుంది. అయితే, కాషాయ జెండాలైతే క‌నిపిస్తున్నాయి కానీ, బీజేపీ ఊసే వినిపిస్త లేద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. రోజంతా కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు.. ఈట‌ల‌పై ప్ర‌శంస‌లు.. ఇదే జ‌రుగుతోంది. కార్య‌క‌ర్త‌ల నోటి నుంచి జై ఈట‌ల‌.. జైజై ఈట‌ల.. ఇదే నినాదం. మ‌ధ్య మ‌ధ్య‌లో గుర్తొస్తే జై బీజేపీ స్లోగ‌న్‌. అంతే కానీ.. బీజేపీకి ఓటేయండి.. బీజేపీని ఆద‌రించండి.. బీజేపీని గెలిపించండి.. అనే డైలాగే రావ‌ట్లేద‌ని చెబుతున్నారు. ఈట‌ల చుట్టూనే రాజ‌కీయం న‌డుస్తోంది కానీ, అందులో బీజేపీ ప్రాధాన్య‌త అతి త‌క్కువ‌గా ఉంటోంద‌ని అంటున్నారు. ఈట‌ల‌ను గెలిపించండి.. కేసీఆర్‌కు బుద్ధి చెప్పండి.. ఇదే ప్ర‌చార ఎజెండాగా ఉంటోంది. ఈట‌ల సంగ‌తి స‌రే.. మ‌రి బీజేపీ మాటేమిటి? మోదీ ప్ర‌స్తావ‌న ఏది? కేంద్ర ప‌థ‌కాల ఊసేది? అని అడుగుతున్నారు ఈట‌ల కోసం హుజురాబాద్‌లో మ‌కాం వేసిన క‌రుడుక‌ట్టిన‌ బీజేపీ శ్రేణులు.   ఇలాంటి ప‌రిణామం ఇంత‌కు ముందెప్పుడూ చూడ‌లేద‌ని అంటున్నారు క‌మ‌ల‌నాథులు. బీజేపీ ఎప్పుడైనా పార్టీ సిద్ధాంతాలపైనే న‌డుస్తుంది. మోదీ వ‌చ్చిన‌ప్పటి నుంచీ సీన్ మారిపోయింది. మోదీ బొమ్మ‌తోనే, న‌మో నామ‌జ‌పంతోనే క‌మ‌ల‌నాథులు ఎన్నిక‌ల‌కు వెళుతున్నారు. అది కార్పొరేట‌ర్ ఎన్నికైనా స‌రే.. మోదీకే మీ ఓటు అన‌డం వారికి బాగా అల‌వాటైపోయింది. ఏ ప్ర‌సంగ‌మైనా జై శ్రీరాం నినాదంతోనే ముగియాలి. ఏ ఎల‌క్ష‌న్ అయినా.. కేంద్ర ప‌థ‌కాల‌ను ఏక‌రువు పెట్టాలి. నిధుల‌న్నీ కేంద్రమే ఇస్తోంది.. రాష్ట్రం గొప్ప‌లు పోతోంది అంటూ ఊద‌ర‌గొట్టాలి. ఇటీవ‌ల జ‌రిగిన దుబ్బాక‌, జీహెచ్ఎమ్‌సీ, నాగార్జున‌సాగ‌ర్ ఎన్నిక‌ల్లో అదే జ‌రిగింది. ఇక దుబ్బాక ఉప ఎన్నిక‌లోనైతే బీజేపీకి-టీఆర్ఎస్‌కి హోరాహోరీ స‌వాళ్లు-ప్ర‌తిస‌వాళ్లు న‌డిచాయి. కేంద్ర నిధుల‌పై పెద్ద ఎత్తున రాద్దాంత‌మే జ‌రిగింది. హుజురాబాద్‌లోనూ దుబ్బాక ఎపిసోడ్  రిపీట్ అవుతుంద‌ని అనుకున్నారంతా. కానీ, అక్క‌డ‌ జ‌రుగుతోంది వేరు. ఈట‌ల వ‌ర్సెస్ కేసీఆర్ న‌డుస్తోంది. ఎక్క‌డా బీజేపీ ప్ర‌స్తావ‌న రాక‌పోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈట‌ల‌కు అన్యాయం జ‌రిగింది.. కేసీఆర్ అరాచ‌క‌వాది.. ఈట‌ల‌ను గెలిపించండి.. టీఆర్ఎస్‌ను ఓడించండి.. ఇదే ప్ర‌చారం. మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఈట‌ల ఎక్క‌డా కేసీఆర్ అవినీతిని కానీ, ప్ర‌భుత్వ లొసుగులు కానీ, అక్ర‌మాల చిట్టా కానీ బ‌య‌ట‌కు తీయ‌డం లేదు. ద‌శాబ్దాలుగా కేసీఆర్ వెంట ఉన్న ఈట‌ల‌కు అలాంటి విష‌యాలేమీ తెలీవ‌నుకోవాలా? లేక‌, స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌యోగించ‌డానికి కావాల‌నే దాస్తున్నారా? మ‌రేదైనా కార‌ణ‌ముందా? అనే అనుమాన‌మూ వ‌స్తోంది. ఇలా, పైకి జెండా మాత్రం బీజేపీది.. ఎజెండా మాత్రం ఈట‌ల‌ది అనే విమ‌ర్శ మొద‌లైపోయింది.  ఈట‌ల తీరుపై బీజేపీ పెద్ద‌లు అసంతృప్తితో ఉన్న‌ట్టు తెలుస్తోంది. పార్టీ కంటే ఎవ‌రూ ఎక్కువ కాద‌ని అంటున్నారు. మోదీ ప్ర‌స్తావ‌న తేకుండా.. బీజేపీ నినాదాలు వినిపించ‌కుండా.. ఈట‌ల త‌న సొంత ఎజెండా అమ‌లు చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. బీజేపీకి క‌మ‌లం గుర్తు.. మోదీ ఫోటో.. ఈ రెండే ముఖ్యం. ఎంత‌టి నాయ‌కుడైనా స‌రే.. ఈ రెండింటి ముందు డ‌మ్మీనే. అందుకే, వార్డు మెంబ‌ర్‌గా పోటీ చేసే వారు కూడా మోదీకే మీ ఓటు అని అడుగుతుంటారు. కిష‌న్‌రెడ్డి, కె.ల‌క్ష్మ‌ణ్‌, బండి సంజ‌య్‌లాంటి వాళ్లు సైతం ఏనాడు వారి సొంత‌ ప్ర‌స్తావ‌న చేయ‌కుండా.. బీజేపీ ఇమేజ్‌తోనే పాలిటిక్స్ చేస్తుంటారు. అలాంటిది.. నిన్న‌కాక మొన్న వ‌చ్చిన ఈట‌ల రాజేంద‌ర్‌.. బీజేపీ జెండా ప‌ట్టుకొని.. త‌న సొంత ఎజెండా అమ‌లు చేస్తున్నారంటూ క‌మ‌ల‌నాథులు కాక మీదున్నారు. ముందుముందు కూడా ఇలానే ఉంటే.. ఈట‌ల‌తో బీజేపీకి ఏం లాభం అన్న ప్ర‌శ్న త‌లెత్తుతుంద‌ని అంటున్నారు. అయితే, ఇప్పుడే బ‌య‌ట‌ప‌డిపోతే అది పార్టీకి న‌ష్టం చేస్తుంద‌ని.. ముందైతే ఈట‌ల‌ను గెల‌వ‌నిచ్చి.. ఆ త‌ర్వాత ఆయ‌న్ను పార్టీ లైన్‌లోకి తీసుకురావ‌చ్చ‌ని బీజేపీ పెద్ద‌ల అభిప్రాయంలా క‌నిపిస్తోంది. ఈట‌ల‌ ఇంకా బీజేపీ శైలి రాజ‌కీయానికి అల‌వాటుప‌డ‌లేద‌ని.. ముందుముందు అంతా స‌ర్దుకుంటుంద‌ని అంటున్నారు.   

కాంగ్రెస్ సీనియర్ నేతపై అనర్హత వేటు.. మూడేళ్ల వరకు నో పోటీ..

ఎన్నికల రూల్స్ పాటించని వారిపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళీపించింది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతపై అనర్హత వేటు వేసింది. కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్‌పై ఎన్నికల సంఘం వేటు వేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే నిర్ణీత గడువు లో ఎన్నికల వ్యయం వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన సమర్పించలేకపోయారు. దీంతో బలరాం నాయక్ పై ఈసీ అనర్హత వేటు వేసింది.  ఈసీ అనర్హత వేటు వేయడంతో వచ్చే మూడేళ్లపాటు పార్లమెంట్‌ ఉభయసభలకు, శాసనసభకు, శాసనమండలికి పోటీచేసే అర్హతను బలరాం నాయక్ కోల్పోయారు. ఈ మేరకు సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. సీఈసీ నిర్ణయానికి  అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. మహబూబాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి వెంకటేశ్వరరావుపై కూడా ఈసీ అనర్హత వేటు వేసింది. 

మావోయిస్టు అగ్రనేతను కాటేసిన కరోనా! హరిభూషన్ అలియాస్ జగన్ పోరాట చరిత్ర ఇది.....

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహ్మమారి మావోయిస్టులకు గండంగా మారింది. అడవుల్లో ఉండే మావోయిస్టులు వైరస్ భారీన పడ్డారని సమాచారం. చాలా మంది మావోయిస్తులకు కరోనా సోకిందని, కొందరి పరిస్థితి విషమంగా ఉందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మావోయిస్టులకు కరోనా సోకిందన్న వార్తలు నిజం కాదని.. కొన్ని లేఖలు విడుదలైనా.. వరుసగా వెలుగుచూస్తున్న ఘటనలు చూస్తే మాత్రం మావోయిస్టులను కరోనా కాటేస్తుందని తెలుస్తోంది. తాజాగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ అలియాస్‌ జగన్‌ అలియాస్‌ లక్మూ అలియాస్‌ ధర్మన్న మృతి చెందినట్లు తెలుస్తోంది. 56 ఏళ్ల జగన్.. ఛత్తీ‌సగఢ్‌ బస్తర్‌ జిల్లా అడవుల్లో సోమవారం రాత్రి ఆయన చనిపోయినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ ధ్రువీకరించారు. హరిభూషణ్‌ కొవిడ్‌ బారిన పడి, గుండెపోటుతో మృతి చెందారని బస్తర్‌ ఐజీ పి.సుందర్‌రాజ్‌  చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ కూడా హరిభూషన్ అలియాస్ జగన్ మృతిని ధృవీకరించారు.  అయితే హరిభూషణ్‌ మృతిపై మావోయిస్టు పార్టీ నుంచి ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు ఛత్తీ‌సగఢ్‌ సుక్మా జిల్లా మీనగుట్ట అటవీ ప్రాంతంలో విషతుల్యమైన ఆహారం తినడం వల్ల మృతి చెందారన్న ప్రచారం కూడా జరుగుతోంది. జగన్  మృతిపై ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు దయాకర్‌, ఐతు, ప్రకాశన్న లాంటి వారు కరోనాతో చనిపోయిన క్రమంలో ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మావోయిస్టులు, తాజాగా జగన్ విషయంలో మౌనం వహించడంపై సస్పెన్స్‌ నెలకొంది. అయితే  హరిభూషణ్‌ మృతి చెందినట్లుగా తమవద్ద విశ్వసనీయమైన సమాచారం ఉన్నట్లు మావోయిస్టు కార్యకలాపాలను పర్యవేక్షించే వర్గాలు చెబుతున్నాయి.  మావోయిస్టు అగ్రనేతగా ఎదిగిన హరిభూషణ్‌ది ఆదివాసీ గిరిజన కుటుంబం. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం మడగూడెం ఆయన స్వగ్రామం. ఆయన అసలు పేరు యాప నారాయణ. కొమ్మక్క-రంగయ్య దంపతుల ఏడుగురు సంతానంలో పెద్దవాడు. నర్సంపేట సమీపంలోని సాయిరెడ్డిపల్లిలో పదో తరగతి వరకు చదివారు. నర్సంపేటలో ఇంటర్‌ చేశారు. వరంగల్‌ ఎల్బీ కళాశాలలో డిగ్రీ చదువుతూనే రాడికల్‌ విద్యార్థి, యువజన సంఘాల్లో పని చేశారు. మడగూడెం, నర్సంపేట, పాకలకొత్తగూడెం ఏరియాల్లో పీపుల్స్‌వార్‌, న్యూడెమోక్రసీల మధ్య తీవ్ర ఘర్షణలు జరుగుతున్న దశలో 1984లో హరిభూషణ్‌ పీపుల్స్‌వార్‌ దళంలో చేరారు. హరిభూషణ్‌ భార్య సమ్మక్క, అలియాస్‌ శారదక్క ప్రస్తుతం మావోయిస్టు బస్తర్‌ ప్రాంత నేతగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అజ్ఞాతంలో ఉన్నప్పుడే సమ్మక్కను హరిభూషణ్‌ వివాహం చేసుకున్నారు.  మావోయిస్టుగా హరిభూషణ్‌ది 37 ఏళ్ల ప్రస్థానం.  గోదావరి లోయలో ఛత్తీ‌సగఢ్‌, బస్తర్‌ ఏరియాల్లో పోలీసులకు ఆయన కొరకరాని కొయ్యగా మారారు. ఖమ్మం, వరంగల్‌ జిల్లాల ఏరియా కమిటీ కార్యదర్శిగా, కేకేడబ్ల్యూ కమిటీలో, ఉత్తర తెలంగాణ స్పెషల్‌జోనల్‌ కమిటీ లో మిలటరీ ప్లాటోన్‌ తెలంగాణ యాక్షన్‌ కమిటీ క మాండర్‌గా పనిచేశారు. రాష్ట్ర విభజన సమయం లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా పనిచేసిన హరిభూషణ్‌ తదుపరి కేంద్రకమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తెలంగాణ, ఛత్తీ‌సగఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రల్లో మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతగా ఉన్నారు జగన్. ఆయన తలపై 40లక్షల రివార్డు ఉంది.   మావోయిస్టులు, ప్రభుత్వం మధ్య శాంతి చర్చల సమయం లో హరిభూషణ్‌ ఖమ్మం, వరంగల్‌ ఉమ్మడి జిల్లా ల్లో పీపుల్స్‌వార్‌ విస్తరణ కోసం విస్తృతంగా పనిచేశారు. హరిభూషణ్‌ స్వయంగా ఇల్లెందు, కొత్తగూడెం, ములుగు ఏజెన్సీ ప్రాంత గ్రామాల్లో సంచరించి దళాల్లో నియామకాలు పెంచారు. పీపుల్స్‌వార్‌ టార్గెట్లు పూర్తి చేయడంలో, యాక్షన్లు జరపడంలో దిట్టగా పేరుగాంచిన హరిభూషణ్‌ ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం అందితే ప్రత్యర్థులు హడలిపోయేవారు.   హరిభూషణ్‌ బాల్యంలో మంచి కబడ్డీ క్రీడాకారుడు అని నర్సంపేట ప్రాంతంలో గుర్తింపు ఉంది. జగన్ పలు ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు. గెరిల్లా యుద్ధ తంత్రంలో గట్టి పట్టు కలిగిన హరిభూషణ్‌ ఛత్తీ‌సగఢ్‌లో పలు విధ్వంసాలకు వ్యూహకర్త అని, తెలంగాణలో అనేక సంచనల హింసాత్మక ఘటనలకు కారణంగా చెబుతుంటారు. 

వాసాలమర్రిపై సీఎం వరాలెందుకు! అసలు కథ ఇదా కేసీఆర్.. !

ప్రగతి భవన్ ను, ఫామ్ హౌజ్ ను వీడి ప్రజల్లోకి వెళుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. జిల్లాలు చుట్టేస్తున్నారు. రెండు రోజుల్లో నాలుగు జిల్లాలు పర్యటించిన గులాబీ బాస్.. మంగళవారం తన దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిని సందర్శించారు. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తర్వాత గ్రామ సభలో పాల్గొన్నారు కేసీఆర్. ఈ సందర్భంగా వాసాలమర్రిపై వరాల జల్లు కురిపించారు. ఏడాదిలోనే వాసాలమర్రిని బంగారు వాసాలమర్రిగా మారుస్తానని చెప్పారు. గ్రామస్తులకు కూడా బోలేడు వరాలు ప్రకటించారు కేసీఆర్.  సీఎం కేసీఆర్ వాసాలమర్రి పర్యటనపై రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసీఆర్ ను ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తన ఫౌమ్ హౌజ్ దారి కోసమే వాసాలమర్రిని డెవలప్ చేయాలని కేసీఆర్ చూస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రోడ్లు వేసేది కూడా తన కాన్వాయ్ పోవడానికి వీలుదా ఉండేందుకేనని విమర్శించారు. కేసీఆర్ వాసాలమర్రి వరాలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరో ఆసక్తికర విషయం చెప్పారు. యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామిని జగదేవ్‌పూర్ మీదుగా వెళ్లి దర్శనం చేసుకున్న చాలామంది సీఎంలు పదవులు కోల్పోయారని ఓ స్వామి సీఎం కేసీఆర్ కు చెప్పడంతోనే, వాసాలమర్రిని బంగారు వాసాలమర్రిగా చేస్తానని హామీ ఇస్తున్నారని అర్వింద్ ఆరోపించారు.  2000 జనాభా ఉన్న వాసాలమర్రి మీదుగా యాదాద్రికి వెళ్లడానికే 60 ఫీట్ల రోడ్లు, వరాలు జల్లులు అని విమర్శలు చేశారు.  వాసాలమర్రిని బంగారు వాసాలమర్రిగా చేయడానికి మార్బలం అవసరం ఏమిటని, ప్రతి ఇంటికి పోలీస్ బందోబస్తు పెట్టిమరీ సీఎం పర్యటన చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్ ఇచ్చిన షాక్ తోనే, హుజురాబాద్ ఉపఎన్నికల కోసం జిల్లాల పర్యటన చేస్తున్నారన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పేరుచెప్పి కేసీఆర్ చేసిన 4 లక్షల కోట్ల అప్పులు, ప్రభుత్వ భూముల అమ్మకాల విషయంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయిస్తామని, ఈ విషయంలో బీజేపీ పెద్దలతో ఒత్తిడి తెస్తానని అన్నారు. సీఎం చెప్పినట్లు చేస్తూ సర్కారు భూములు కొన్న, అమ్మిన వారికి సహకరించే అధికారులకు భవిష్యత్తులో కష్టాలు తప్పవన్నారు. ఎంపీ అర్వింద్.  కేసీఆర్ వాసాలమర్రి పర్యటనపై విపక్షాలు చేస్తున్న కామెంట్లపై రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. వాస్తు కోసం కేసీఆర్ ఏమైనా చేస్తారని కొందరు చెబుతున్నారు. వాస్తు బాగాలేదనే సచివాలయానికి వెళ్లలేదనే సంగతిని గుర్తు చేస్తున్నారు. ప్రగతి భవన్ ను కూడా వాస్తు సరిగా లేదని రిన్నోవేషన్ చేయించారని మరికొందరు అంటున్నారు. ఈ లెక్కన కేసీఆర్ వాసాలమర్రి పర్యటనపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై జనాల్లోనూ ఆసక్తికర చర్చే జరుగుతోందని తెలుస్తోంది.  

మైనర్ బాలిక పై.. ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం.. 

అపురూపమైనదమ్మా ఆడ జన్మ అని అన్నారు కానీ ఇప్పుడు ఆ మాటే ఆడవాళ్ళ పాలిట శాపంగా మారింది. తల్లిగా, అక్కగా, చెల్లిగా, ఆలిగా, ఇలా ఎన్నో అవతారాలు ఎత్తుతూ నిత్యం మగవాడి విజయం వెనక పరోక్షంగానో ప్రత్యేక్షంగానో తనదైన ప్రభావం చూపుతుంది. ఆ వనిత త్యాగమూర్తులు.  కానీ వారి త్యాగాలకు తూకం వేస్తుంది నేటి సమాజం.. ఆడవాళ్లు అంటే మగవాడి వాంఛ తీర్చే సాధనంగానే చూస్తున్నారు. నలుదిక్కుల ఎక్కడ చూసిన ఆడవాళ్ళ కన్నీళ్లతో ఈ నేల తడుస్తూనే ఉంది. తాచుపాము పగపట్టి కాటు వేసినట్లు ఆడవాళ్లను నిత్యం మగవాళ్ళు కాటు వేస్తూనే ఉన్నారు.  చిన్న, పెద్ద, ముసలి, ముతక, వావివరసలు కూడా చూడకుండా కొందరు దుర్మార్గులు వారి కామ వాంఛలు తీర్చుకుంటున్నారు. బలిచేస్తున్నారు. మగవారి కామ ఖైదీలుగా నేటికీ మహిళలు శిక్షలు అనుభవిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ మైనర్ బాలిక పై ముగ్గురు మూర్ఖులు సామూహిక అత్యాచారం చేశారు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..     అది నిజామాబాద్ జిల్లా. కోటగిరి మండలం. ఓ గ్రామంలో మైనర్ బాలికపై ముగ్గురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని ఓ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మైనర్ బాలురు లను అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో 14 ఏళ్ల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ బాలురులు గ్రామ శివారులోకి తీసుకెళ్లి సామూహిక హత్యాచారానికి ఒడిగట్టారు. అత్యాచారానికి గురైన బాలిక ఐదు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు బాలికను చికిత్స నిమిత్తం బోధన్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి బాలికపై హత్యచారం జరిగినట్లు వెల్లడించడంతో బాధితురాలి తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా ముగ్గురు తనపై సామూహికంగా హత్యచారానికి పాల్పడినట్లు తెలిపింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు కోటగిరి పోలీసులను ఆశ్రయించారు. రుద్రూర్ ఎస్సై రవీందర్ ఈ విషయంపై విచారణ జరిపి ముగ్గురు బాలురలను అదుపులోకి తీసుకొని, పోక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు.

ఆ పాపం జ‌గ‌న్‌రెడ్డిదే.. ప్ర‌భుత్వంపై ఆనంద‌య్య ప్ర‌కోపం..

ఆనంద‌య్య‌ను ఆగం చేసింది జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ‌మే. ఆనంద‌య్య మందు అంద‌రికీ దూరం చేసిందీ జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారే. ఈ ఆరోప‌ణ ప్ర‌తిప‌క్ష నేత‌లు చేస్తున్న‌ది కాదు. స్వ‌యాగా ఆనంద‌య్యే ఈ విమ‌ర్శ‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. తాజాగా, మీడియాతో మాట్లాడుతూ.. మందు త‌యారీ, పంపిణీకి ప్రభుత్వం సహకరించకపోవడం బాధాకరమని ఆనందయ్య ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మందు పంపిణీ కోసం ప్రభుత్వానికి లేఖ రాశానని, స‌ర్కారు నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు. సరైన సామాగ్రి లేక మందు తయారీ విషయంలో వెనుకబడ్డానని ఆనందయ్య చెప్పారు. బడ్డి కొట్టుల్లో తన మందు అమ్ముతున్నారంటే.. అది ప్రభుత్వ లోపమని, అటువంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆనందయ్య కోరడం క‌ల‌క‌లం రేపుతోంది. ఎంత ఆవేద‌న‌. ఎంత బాధ‌. ఆనంద‌య్య మాట‌లతో స‌ర్కారు వైఫ‌ల్యం కొట్టొచ్చినట్టు క‌నిపిస్తోంది. ఆయ‌న ఏం అడిగారు పాపం? మందు త‌యారీకి కావ‌ల‌సిన గిన్నెలు.. కాసింత‌ క‌రెంటు.. మందు పంపిణీకి ఏర్పాట్లు.. ఇంతే. ఇంకేం కోర‌లేదు ఆనంద‌య్య‌. ప్ర‌జ‌ల కోసం ఆ మాత్రం ఉడ‌తాభ‌క్తి సాయం చేయ‌ని ప్ర‌భుత్వం ఉండెందుకు? ఆనంద‌య్య మందుపై అంత కుట్ర ఎందుకు? అంటూ నిల‌దీస్తున్నారు ప్ర‌జ‌లు.  ఆనంద‌య్య మందు క‌రోనా బాధితుల పాలిట సంజీవ‌ని. ఆయ‌న మందుతో పోయే ప్రాణం లేచి కూర్చుంటోంది. ఆ మందుతో మిరాకిల్ జ‌రుగుతోంది. అందుకే ఆయుష్ శాఖ అన్నిర‌కాల ప్ర‌యోగాలు చేసి మ‌రీ ఆనంద‌య్య మందు ఓకే చేసింది. హైకోర్టు సైతం మందు పంపిణీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. మ‌రిక ప్రాబ్ల‌మ్ ఏముంది? అంగ‌ట్లో అన్నీ ఉన్నా.. స‌ర్కారులో మాత్రం చిత్త‌శుద్ధి క‌రువైందని అంటున్నారు. వైసీపీ నేత‌లు ఆనంద‌య్యను హైజాక్ చేసేసి.. త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే మందు పంపిణీ చేసుకుంటున్నారు. అది కూడా ఆనంద‌య్య బొమ్మ లేకుండా.. త‌మ ఫోటోల‌తో, వైసీపీ గుర్తుల‌తో ఆనంద‌య్య మందుతో నీచ రాజ‌కీయం చేశారనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఓ ద‌శ‌లో వెబ్‌సైట్లో పెట్టి మ‌రీ ఆనంద‌య్య మందుతో కాసులు దండుకోవాల‌నే ఎత్తుగ‌డ వేసినా.. టీడీపీ నేత సోమిరెడ్డి జోక్యంతో ఆ కుట్ర బెడిసికొట్టింది. ఒక‌ప్పుడు కృష్ణ‌ప‌ట్నంలో అంద‌రికీ ఉచితంగా ల‌భించిన ఆనంద‌య్య మందు.. ఇప్పుడు వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంది. ఆనంద‌య్య మందును అస‌లు న్యూస్‌లోనే లేకుండా చేయ‌డం వెనుక డ్ర‌గ్ మాఫియా కుట్ర‌తో పాటు ప్ర‌భుత్వ పాత్ర కూడా ఉంద‌నే అనుమానం వినిపిస్తోంది.  ఎంత‌మందికైనా మందు త‌యారు చేసేందుకు ఆనంద‌య్య రెడీగా ఉన్నారు. అంద‌రికీ ఉచితంగా మందు ఇస్తానంటున్నారు. ప్ర‌జ‌లు సైతం ఆనంద‌య్య మందు కోసం ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. మ‌రి, ప్రాబ్ల‌మ్ ఎక్క‌డ ఉంది? ఆనంద‌య్య‌ను అడ్డుకుంటున్న‌ది ఎవ‌రు? ఆనంద‌య్య‌కు స‌హాయ నిరాక‌ర‌ణ చేస్తున్న‌ది ఎవ‌రు? ఇంకెవ‌రూ జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ‌మే అంటున్నారు ఆనంద‌య్య‌. నేరుగా స‌ర్కారునే దోషిగా చూపిస్తున్నారు. ఇంత‌కంటే సాక్షం ఇంకేం కావాలి? ఆనంద‌య్యే చెబుతుండ‌గా ఇంకా అనుమాన‌మేముంది? జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు ఆనంద‌య్య‌పై, ఆయ‌న త‌యారు చేసే మందుపై అంత కుట్ర‌పూరితంగా ఎందుకు వ్య‌వ‌హ‌రిస్తోంది? డ్ర‌గ్ మాఫియా, మెడిక‌ల్  మాఫియా నుంచి ఒత్తిడే కార‌ణ‌మా? ప్ర‌భుత్వ పెద్ద‌లు పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకున్నారా? అందుకే, ఆనంద‌య్య మందును క‌నుమ‌రుగు చేసేశారా? ప్ర‌జ‌ల ప్రాణాల‌తో ఇంత‌లా చెల‌గాటమా? ఏపీలో పుట్ట‌డ‌మే ఆనంద‌య్య చేసిన పాప‌మా? జ‌గ‌న్‌రెడ్డి పాల‌నే ప్ర‌జ‌ల పాలిట శాప‌మా?

టీఆర్ఎస్ సర్పంచ్ మృతి ఎందుకో తెలుసా..? 

కరోనా వాళ్ళను కబళించలేదు. బ్లాక్ ఫంగస్ చుట్టూ మూటలేదు. అలా అని వాళ్ళను ఎవరు చంపలేదు, చేతబడి చేయలేదు, ఇంట్లో వేసి అన్నం పెట్టకుండా బండిచలేదు. గుండె పోట్టు లాంటివి రాలేదు. కానీ, ప్రకృతి వాళ్లపై పగపట్టింది. కాలం వాళ్ళని పడుకున్న ఇంట్లోనే రక్తంతో తడిపింది. రాత్రి ఇంట్లో పడుకున్న నానమ్మ, మనుమడు తేరుకోలేని నిద్రలోకి వెళ్లిపోయారు.   అది వనపర్తి జిల్లా. రేవల్లి మండలం. బండరావిపాకుల సర్పంచ్ ఆమె పేరు లచమ్మ. తన వయసు  51 సంవత్సరాలు. తన మనవడు యోగేశ్వర్. ఆ బాలుడి వయసు  12  సంవత్సరాలు. మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు వేరువేరు గదులలో నిద్రించ‌గా సర్పంచ్ లచ్చమ్మ, తన మనవడు యోగేశ్వర్ 12  తో కలిసి మరో గదిలో నిద్రించారు. అర్థరాత్రి దాటిన తర్వాత సర్పంచ్, ఆమె మనవడు నిద్రిస్తున్న గది పైకప్పు ఒక్కసారిగా కూలి కిందపడటంతో వారు అక్కడికక్కడే సజీవ సమాధి అయ్యారు. వల్ల దురదృష్టం కాకపోతే అందరూ ఇంట్లోనే పడుకున్నారు.. కానీ వెళ్లి పడుకున్న గది కూలి మృతిచెందారు. బుధవారం ఉదయం మిగతా కుటుంబ సభ్యులు లేచి తలుపులు తెరిచే ప్రయత్నం చేశారు. ఇల్లు కూలింది అన్న విషయం గుర్తించి తలుపులు బద్దలు కొట్టి చూసే వరకు ఇద్దరు మట్టిలో కలిసిపోయారు. కుటుంబ సభ్యులంతా గొల్లుమని ఏడ్చారు. గ్రామం అంత సర్పంచ్ మరణం పట్ల చలనం లేకుండా ఉండిపోయారు.  సమాచారం తెలిసిన వెంటనే గ్రామస్తులు పెద్ద ఎత్తున ఇంటికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. బండ రాయిపాకుల ఏదుల రిజర్వాయర్ ముంపు గ్రామం కావడంతో చాలా రోజులుగా పునరావాసం కోసం వేచిచూస్తున్న గ్రామస్తులు, ప్రభుత్వం పునరావాసం కల్పించకపోవడంతో అదే ఇళ్లలో ఉంటున్నారు. రాత్రి ఇలా జరగడంతో గ్రామం మొత్తం విషాదఛాయలు అలముకున్నాయి. తెల్లవారు జామున మట్టి మిద్దె కూలి మృతి చెందారు. ఇటీవల సర్పంచ్ మట్టి మిద్దె పై చౌడు వేశారు. పైగా కప్పును మోసే దూలాలు, వాట్లు దెబ్బ తిన్నాయి. ఉదయం మిగతా కుటుంబ సభ్యులు లేచి తలుపులు తెరిచే ప్రయత్నం చేశారు. ఇల్లు కూలింది అన్న విషయం గుర్తించి తలుపులు బద్దలు కొట్టి చూసే వరకు ఇద్దరు మృతి చెందారు. గ్రామ సర్పంచ్‌తో పాటు ఆమె మనవడు దుర్మరణం పాలయ్యారు. మిద్దె కూలి ఇద్దరు మృతి చెందారు. 

ఆరు రోజులు దాచెయ్​.. ఆదివారం వేసెయ్​! జగన్ సర్కార్ వ్యాక్సిన్ పాలసీ అదుర్స్... 

కొవిడ్ కట్టడి ఏకైక అయుధం వ్యాక్సినేషన్. అందుకే దేశ వ్యాప్తంగా ప్రస్తుతం టీకాల పంపిణి వేగంగా సాగుతోంది. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నంతవరకు అన్ని రాష్ట్రాలు వేగంగా తమ ప్రజలకు అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే వ్యాక్సినేషన్ లో ఏపీ సర్కార్ తీరు మాత్రం తీవ్ర విమర్శల పాలవుతోంది. రికార్డుల కోసం అరాటమే తప్పు నిజమైన చిత్తశుద్ది లేదనే ఆరోపణలు వస్తున్నాయి. గత అదివారం ఒక్క రోజే పదమూడున్నర లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చింది ఏపీ సర్కార్. దేశంలో ఇప్పటివరకు ఇదే రికార్డ్ అని ప్రకటించుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. తర్వాత జరిగిన వ్యాక్సిన్ లెక్కలు చూస్తే అంతా షాక్ అవ్వాల్సిందే.  ఆదివారం 13.5 లక్షల వ్యాక్సిన్లు ఇచ్చిన ఏపీ సర్కార్ ... తర్వాత రోజైన సోమవారం మాత్రం కేవలం 46 వేల టీకాలు వేసింది. ఇదే ఇప్పుడు విమర్శలకు కారణమైంది. ఆదివారం రికార్డ్ స్థాయిలో వ్యాక్సిన్ వేసిన వాళ్లు.. సోమవారం అందులో కనీసం ఐదు శాతం కూడా ఎందుకు వేయలేదన్నదే ప్రశ్న. నిజానికి సోమవారం అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా భారీగా వ్యాక్సినేషన్ చేపట్టారు. సోమవారం ఒక్కరోజే 80 లక్షల మందికి టీకాలు వేశారు. కాని ఏపీలో మాత్రం కేవలం 46 వేలే. రికార్డులంటూ పబ్లిసిటి చేసుకోవడం కోసం మిగితా రోజుల్లో టీకాలు వేయకుండా.. ఒక్కరోజే డ్రైవ్ పేరుతో హడావుడి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆరు రోజులు దాచెయ్..ఆదివారం వేసెయ్ అన్నట్లుగా జగన్ రెడ్డి ప్రభుత్వం తీరు ఉందని కొందరు సెటైర్లు వేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఏపీ అవలంభిస్తున్న విధానాల వల్ల ముందు ముందు సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. జూన్ 20న టీకా తీసుకున్న పదమూడున్నర లక్షల మందిలో కోవిషీల్డ్ తీసుకున్న వారికి 12 వారాల తర్వాత.. కొవాగ్జిన్ తీసుకున్న వారికి 4 నుంచి 6 వారాల్లో సెకండ్ డోస్ వేయాల్సి ఉంటుంది. అంటే మళ్లీ ఇదేరకమైన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అది సాధ్యమవుతుందో లేదో చెప్పలేం. వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉండాలి. అంతా సాఫీగా జరిగితే సమస్య లేదు. కాని మెగా డ్రైవ్ చేపట్టకపోతే.. సెకండ్ డోస్ కోసం అంతా ఎగబడే పరిస్థితి ఉంటుంది. ఇదో మరో సమస్యకు కారణం కావచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయాలన్ని పరిగణలోకి తీసుకుంటూ పలు రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ను అమలు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రోజుకు దాదాపుగా లక్ష వరకు మాత్రమే వ్యాక్సిన్లు వేస్తున్నారు. తమ దగ్గర టీకాలు ఎక్కువగానే అందుబాటులో ఉన్నా... తెలంగాణ అధికారులు మాత్రం హడావుడి చేయకుండా రోటీన్ గా వెళుతున్నారు. అలా చేయడం వల్ల సెకండ్ డోస్ సమయంలో ఇబ్బంది ఉండదన్నది తెలంగాణ అదికారుల మాట. జూన్ లోకోవిషీల్డ్ ఫస్ట్ డోస్ తీసుకున్న వారికి సెప్టెంబర్ లో సెకండ్ డోసు వేయాల్సి ఉంటుంది. వైద్య నిపుణుల అంచనా ప్రకారంలో ఆ సమయంలో దేశంలో థర్డ్ వేవ్ వస్తుందని అంటున్నారు. అదే జరిగితే సెకండ్ డోస్ వ్యాక్సిన్ పంపిణికి ఆటంకం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవేమి పరిశీలించకుండానే, భవిష్యత్ వ్యూహం అంటూ లేకుండానే ప్రచారం కోసం ఏపీ సర్కార్ ప్రమాదకరమైన పరిస్థితులను స్పష్టిస్తుందనే విమర్శలు వైద్య వర్గాల నుంచి వస్తోంది.  మరోవైపు వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం మండిపడ్డారు. సోమవారం రికార్డు స్థాయిలో వ్యాక్సిన్లు వేసి.. మరుసటి రోజే భారీగా పడిపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ముందు వ్యాక్సిన్లన్నింటినీ దాచేసి.. ఆ తర్వాత వేసి.. మళ్లీ మామూలుగా ఇబ్బందులు పడడమే రికార్డు వెనక ఉన్న అసలు రహస్యమని ఎద్దేవా చేశారు. ‘‘ఆదివారం దాచెయ్.. సోమవారం వేసెయ్.. మంగళవారం చేతులెత్తేయ్’’ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇదే ఒక్కరోజులో ఎక్కువ మందికి టీకాలు వేసి ప్రపంచ రికార్డు సృష్టించడం వెనక అసలు రహస్యమని అన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ ఈ ఫీట్ కు చోటు దక్కక తప్పదంటూ సెటైర్ విసిరారు. ‘‘మోదీ ప్రభుత్వానికి మెడిసిన్ లో నోబెల్ ప్రైజ్ ఇచ్చినా ఇస్తారు. ఎవరికి తెలుసు!’’ అని మరో కామెంట్ చేశారు. ‘మోదీ ఉంటే ప్రతిదీ సంభవమే’ అన్న దానిని ‘మోదీ ఉన్న చోట అద్భుతాలే’గా మార్చుకోవాలన్నారు. 

కేంద్ర మంత్రి వర్గంలోకి జేడీయూ! 

కేంద్ర మంత్రివర్గ విస్తరణ లేదా పునః వ్యవస్థీకరణ ఎప్పుడు ఉటుంది? ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఈ ప్రశ్న చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కొద్ది రోజుల క్రితం వరకు జోరుగు సాగిన ఊహాగానాలు కూడా కొంత సర్దు కున్నాయి. అదలా ఉంటే గతంలో పిలిచి బెర్తు ఇస్తామంటే అలిగి వద్దు పొమ్మన్న జనతాదళ్ (యు), ఇప్పుడు పిలిస్తే చాలు ఎగిరి గంతేసేందుకు సిద్ధంగా ఉంది. అంతే కాదు మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందా, అని వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది. ఎన్డీఎ వరసగా రెండవ సారి, 2019లో ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలోనే, ప్రధాని మోడీ, మిత్రపక్షం జేడీ(యు)ను మంత్రివర్గంలోకి  చేరమని కోరారు. అయితే, జనతాదళ్(యు) నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుందని స్పష్టం చేయడంతో బేరం బెడిసి కొట్టింది. ఒక్కటే బెర్త్ అయితే వద్దుపొమ్మని, జనతా దళ్(యు) అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి అలక పానుపు ఎక్కారు.  అయితే ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో శరవేగంగా మారుతున్నరాజకీయ సమీకరణల నేపధ్యంలో, జనతా దళ్(యు) కేంద్ర మంత్రివర్గంలో చేరేందుకు ఉత్సాహం చూపుతోంది. మరోవంక బీజేపీ కూడా, త్వరలో జరగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని  మంత్రివర్గ విస్తరణలో మిత్రపక్షాలకు పెద్ద పీట వేయాలని నిర్ణయానికి వచ్చింది. అందులోనూ, బీహార్’ను అనుకుని ఉన్న యూపీలోని పూర్వాంచల్ ప్రాంతంలో పటేల్ /కుర్మీ తెగలకు చెందిన ఓటర్లపై నితీష్ కుమార్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ దృష్టా కూడా బీజేపీ నితీష్ కుమార్ తో బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి వర్గంలో ఒకటి కంటే ఎక్కువ బెర్తులే సిద్దం చేస్తోందని అంటున్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉహాగానాలు షికార్లు చేస్తన్న సమయంలోనే, సోమవారం నితీష్ కుమార్ ఢిల్లీ వెళ్ళడంతో జనతాదళ్ (యు), కేంద్ర మంత్రివర్గంలో చేరడం ఖయమైపోయినట్లేనని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. ఈ ఉహగానాలకు బలాన్నిచ్చే విధంగా,  జనతాదళ్ (యు) జాతీయ అధ్యక్షుడు ఆర్సీపీ  సింగ్, బీహార్ లో మా రెండు పార్టీలు (జనతాదళ్ (యు),బీజేపీ) అధికారాన్ని పంచుకుంటున్నాయి, కాబట్టి, కేంద్ర మంత్రి వర్గంలో జనతాదళ్ (యు), చేరినా ఆశ్చర్య పోనవసరం లేదని అన్నారు. అయితే నితీష్ కుమార్ ఢిల్లీ పర్యటనకు, మంత్రివర్గ విస్తరణపై జరుగుతున్న ఉహాగానాలకు సంబంధం లేదని అయన అన్నారనుకోండి, అది వేరే విషయం.ప్రస్తుతం జనతా దళ్ (యు)కు లోక్ సభలో 16మంది  రాజ్య సభలో ఐదుగురు సభ్యులున్నారు.  ఇటేవల లోక్ జన శక్తి (ఎల్జీపీ) చిలీక వచ్చిన నేపధ్యంలో, చీలిక వర్గం  నేత పశుపతి పరసకు మంత్రి వర్గంలో స్థానం లభించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే, బీహార్ నుంచి బీజేపీ కోటాలో, రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీకి అవకాశం ఉంటుందని అంటున్నారు.అదే విధంగా జనత దళ్ జాతీయ అద్యక్షుడు ఆర్సీపీ సింగ్ కూడా కేంద్ర మంత్రివర్గంలో బెర్త్ కన్ఫరం అయిందని అంటున్నారు. అయితే, 2017 నుంచి ఇదేమాట వింటున్నానని , సింగ్ అన్నారు. అయితే ఇంతకీ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడుంటుంది, అనేది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. అది అయితేనే గానీ, ఊహాగానాలు చల్లారావు.

ఇల్లు అద్దెకు.. అందులో వ్యభిచారం.. 

అసలే కరోనా కాలం. అందులోను కలికాలం. కరోనా వల్ల సోషల్ డిస్టెన్స్ పాటించాలి. మనిషికి మనిషి మూడు మీటర్ల దూరం ఉండాలి. కొత్త వ్యక్తులకు దూరంగా ఉండాలి అని ఒక వైపు నోర్లు పగిలేలా మొత్తుకుంటున్నారు. మరో వైపు ఈ కరోనా ఆర్థికంగా అట్టడుగు ను తొక్కిపడేస్తుంది. చాలా మంది జాబ్ లేక, జీవనాధారం లేక అన్నమో రామచంద్ర అని అంటుంటే కొందరు మాత్రం ఈ క్రిటికల్ పరిస్టిస్తులను కూడా కాసులు చేసుకుంటున్నారు. అద్దెకు ఇల్లు తీసుకుని వ్యభిచారానికి గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నారు. లాక్ డౌన్ టైం లో తనికీలు కూడా ఎక్కువగా ఉండవనుకుని యధావిధిగా వ్యభిచారాన్ని నడుపుతున్నారు. తాజాగా కొందరు చేయడానికి ఓ ఇల్లు అద్దెకు తీసుకున్న ముఠా కొంతకాలంగా గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తోంది. యువతుల్ని తీసుకొచ్చి సెక్స్ రాకెట్ నడుపుతోంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు.   వివరాల్లోకి వెళితే హైదరాబాద్  కేపీహెచ్‌బీ లో  గుట్టుగా నిర్వహిస్తున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో  కేపీహెచ్‌బీ పోలీసులు ఆ ఇంటిపై ఆకస్మికంగా దాడి చేశారు. దీంతో ఓ యువతితో పాటు యువకుల్ని అదుపులోకితీసుకున్నారు. ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేపీహెచ్‌బీకాలనీ మొదటి ఫేజ్‌లోని ఈడబ్ల్యూఎస్‌ 702 గృహంలో కొందరు అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిన్నారు. గత కొన్ని రోజులుగా ఈ దందా గుట్టుగా సాగుతోంది. అమ్మాయిలను తీసుకురావడం డబ్బులు అవసరం ఉన్నవాళ్ళకి అకామిడేషన్ పాటు అమ్మాయిలను అప్పజెపి డబ్బులు సొమ్ముచేసుకోవడం. కట్ చేస్తే సమాచారం అందుకున్న పోలీసులు  సోమవారం రాత్రి ఆకస్మికంగా  దాడిచేసి ముగ్గురు యువకులను, ఒక యువతిని అదుపులోకి తీసుకున్నారు. యువతిని రెస్క్యూ హోమ్‌కు తరలించి యువకులు సురదామ శీను, రాయగిరి హరిప్రసాద్, సునీల్‌ జన్నాలపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వ్యభిచార గృహ నిర్వాహకుడు మధు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  

పీసీసీ పగ్గాలు సరే.. కారు, కాంగ్రెస్ కలిస్తే? రేవంత్ దారేది..? 

రేపోమాపో పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పేరు ప్ర‌క‌ట‌న‌. ఇప్ప‌టికే ఖ‌రారైనా ఎందుకో ఆల‌స్యం అవుతోంది. హ‌స్తిన‌లోనే మ‌కాం వేసిన రేవంత్‌.. త‌న పేరు ప్ర‌క‌టించే దాకా ఢిల్లీని వీడేలా లేరు. కోమ‌టిరెడ్డి నుంచి గ‌ట్టి పోటీ వ‌స్తున్నా.. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌నే ఫుల్‌రేంజ్ ప్రెసిడెంట్‌గా చేసేందుకు హైక‌మాండ్ సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. సీనియ‌ర్లు అసంతృప్తితో ర‌గిలిపోతున్నా.. వారిని ఏదో ఒక ప‌ద‌వితో సంతృప్తి ప‌రిచేలా క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. అందుకే మ‌రింత ఆల‌స్యం అవుతోంద‌ని స‌మ‌చారం.  లేటైనా.. లేటెస్ట్‌గా జెట్ స్పీడ్‌తో దూసుకురాబోతున్నారు రేవంత్‌రెడ్డి. ఆయ‌న టార్గెట్ ఒక్క‌టే. తెలంగాణ‌లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావ‌డం.. అనేక‌న్నా.. తాను ముఖ్య‌మంత్రి కావ‌డం.. కేసీఆర్‌ను ఒక్క‌రోజైనా జైల్లో కూర్చోబెట్ట‌డం. ఇదే ఆ డైన‌మిక్ లీడ‌ర్ జీవిత‌ల‌క్ష్యం. ఆ టార్గెట్‌ను రీచ్ అవ‌డానికి ఆయ‌న ముందున్న బెస్ట్ ఆప్ష‌న్ కాంగ్రెస్. అందుకే, ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాక‌.. ఇక టీడీపీతో వ‌ర్క‌వుట్ కాద‌ని.. హ‌స్తం పార్టీని ఆశ్ర‌యించారు. అన‌తికాలంలోనే వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. ఇప్పుడు పీసీసీ చీఫ్ పోస్ట్‌కు అడుగు దూరంలో ఉన్నారు. ప‌ద‌వి ప‌ట్టి.. కేసీఆర్‌ను కొట్టాల‌నేది రేవంత్ టార్గెట్‌. కానీ.... రాజ‌కీయాల్లో ఈ 'కానీ' కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. 'కానీ' అనే ప‌దం క‌నిపించిందో ఏదో తేడా ఉన్న‌ట్టే. రేవంత్ లెక్కంతా బాగానే ఉంది. స‌మ‌ర్థుడు, స‌రైనోడు, స‌త్తా ఉన్నోడు.. రేవంత్‌రెడ్డితో కాంగ్రెస్‌కు అన్నీ అడ్వాంటేజీలే. కానీ, అది ప్రాంతీయ పార్టీ కాక‌పోవ‌డం.. రేవంత్ నిర్ణ‌య‌మే ఫైన‌ల్ కాక‌పోవ‌డం.. ప్ర‌తీదానికీ హైక‌మాండ్ ప‌ర్మిష‌న్ త‌ప్ప‌నిస‌రి కావ‌డం.. ఆయ‌న‌కు పెద్ద మైన‌స్‌. ఎంత స్వ‌తంత్ర నిర్ణ‌యాలు తీసుకోవాల‌నుకున్న‌.. ఆ స్వ‌తంత్ర‌త అధిష్టానం ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగానే ఉండాలి. అంతేకానీ, కేసీఆర్‌ను జైల్లో పెడ‌తా.. కేసీఆర్‌ను కుమ్మేస్తా.. అంటేకూడా దానికి 10-జ‌న్‌ప‌థ్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వాలి. ఇక్క‌డే య‌వ్వారం బెడిసికొట్టేలా ఉంది. రేవంత్‌రెడ్డి పీసీసీ ప‌గ్గాలు చేప‌ట్టాక.. కేసీఆర్‌పై దూకుడుగా ముందుకెళ్లాక‌.. చివ‌రాఖ‌రును వ్యూహం బెడిసికొడితే? మాయ‌ల మ‌రాఠి కేసీఆర్.. రేవంత్ ఎదురుదాడిని కాచుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి న‌రుక్కొస్తే..?  అప్పుడు రేవంత్‌రెడ్డి ప‌రిస్థితి ఏంట‌నేది చెప్ప‌డం క‌ష్టం. ఎందుకంటే, జాతీయ స్థాయిలో ప‌రిణామాలు అంత వేగంగా మారుతున్నాయి కాబట్టే.. ఇలాంటి అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  మోదీని గ‌ద్దె దింపేందుకు, రాహుల్‌ను ప్ర‌ధాని చేసేందుకు... పాపుల‌ర్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిశోర్ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఇప్ప‌టికే శ‌ర‌ద్‌ప‌వార్‌తో పాటు ప‌లు పార్టీల అధినేత‌లు, ముఖ్య‌మంత్రులతో ఓ ద‌ఫా చ‌ర్చ‌లు కూడా జ‌రిపారు. అందులో భాగంగా యూపీఏ కూట‌మిలో భాగ‌స్వామ్యం చేసేందుకు కేసీఆర్‌నూ లైన్లో పెట్టార‌ని అంటున్నారు. అదే నిజ‌మైతే.. అది రేవంత్‌రెడ్డికి ఇబ్బందిక‌ర ప‌రిణామ‌మే. రాహుల్‌గాంధీని ప్ర‌ధాని చేయ‌డ‌మే కాంగ్రెస్ ఏకైక ల‌క్ష్యం. ఆ గోల్ రీచ్ అవ‌డానికే రేవంత్‌రెడ్డిలాంటి లీడ‌ర్ల‌ను వాడుకుంటుంది కానీ.. రేవంత్‌కు మంచి చేయాల‌నేది కాంగ్రెస్ ఉద్దేశ్యం కానేకాదు. ఆ లెక్క‌న‌.. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో యూపీఏ కూట‌మికి  కేసీఆర్ స‌పోర్ట్ అవ‌స‌ర‌మైతే.. ఆ రెండు పార్టీలు నిస్సందేహంగా క‌లిపిపోతాయ‌ని అంటున్నారు. గ‌తంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర‌ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న చ‌రిత్ర కేసీఆర్‌ది కాబ‌ట్టి.. మ‌రోసారీ అలా జ‌రిగే అవ‌కాశం లేక‌పోలేద‌ని చెబుతున్నారు.  మ‌రి, ఆ అంచ‌నానే నిజ‌మైతే.. రేవంత్‌రెడ్డి ప‌రిస్థితి రెంటికీ చెడ్డ రేవ‌డిగా మారే ప్ర‌మాదం ఉంది. పీసీసీ చీఫ్‌గా రానున్న రెండున్న‌రేళ్లు కేసీఆర్‌తో యుద్ధం చేసి.. క్లైమాక్స్‌లో అంతా తూచ్.. మ‌నం మ‌నం ఒక‌టే అనే ప‌రిస్థితే వ‌స్తే..? హైక‌మాండ్‌ను ఎదిరించ‌నూ లేడు.. అలాగ‌ని కేసీఆర్‌తో చేతులు క‌ల‌ప‌నూ లేడు.. అస్స‌లు కాంప్ర‌మైజ్ అయ్యే ర‌కం కానేకాదు రేవంత్‌రెడ్డి. రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే అంటారు కాబ‌ట్టి.. త‌ప్ప‌నిస‌రి అయితే అటు కాంగ్రెస్ కేసీఆర్ మ‌ద్ద‌తు తీసుకోవ‌చ్చు.. ఇటు కేసీఆర్ సైతం కాంగ్రెస్‌కు జై కొట్టొచ్చు. మ‌ధ్య‌లో రేవంత్‌రెడ్డే ఆగ‌మ‌య్యేలా ఉన్నాడ‌ని అంటున్నారు. అందుకే, పీసీసీ చీఫ్ కాగానే పండ‌గ కాద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్‌ను ఓడించ‌డం ఎంత‌ముఖ్య‌మో.. టీఆర్ఎస్‌-కాంగ్రెస్ క‌ల‌వ‌కుండా ఉండ‌ట‌మూ అంతే ముఖ్యం. అందుకే, రేవంత్‌రెడ్డి భ‌విష్య‌త్తు ఆయ‌న చేతుల్లో కాకుండా.. కేసీఆర్‌-రాహుల్‌గాంధీ అవ‌స‌రాల‌ను బ‌ట్టి ఉండ‌బోతోందని అంచ‌నా వేస్తున్నారు. అస‌లు జ‌రుగుతుందో లేదో తెలీని ఊహాత్మ‌క అంచ‌నాల‌ను ప‌ట్టించుకోకుండా.. కేవ‌లం వ‌ర్త‌మానాన్ని మాత్ర‌మే దృష్టిలో పెట్టుకొని త‌న ప‌ని తాను చేసుకుపోతున్నాడు రేవంత్‌రెడ్డి. అందులో భాగంగా త‌న ఫ‌స్ట్ టార్గెట్ పీసీసీ చీఫ్ ప‌గ్గాలు చేప‌ట్టేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఇక రేవంత్ నెక్ట్స్ టార్గెట్‌.. కేసీఆర్‌ను ఢీ కొట్ట‌డ‌మే.. దేత్త‌డి.. పోచ‌మ్మ గుడి....