పారిపోను.. భయం ఏంటో చూపిస్తా! వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్..
posted on Sep 29, 2021 @ 4:27PM
జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ మధ్య వివాదం మరింత ముదురుతోంది. కొన్ని రోజులుగా తనపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలకు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. ఏపీ పర్యటనలో భాగంగా మంగళగిరి కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు జనసేనాని. ఈ సమావేశంలో అధికార పార్టీపై ఆయన పంచ్ లు విసిరారు. జన సైనికుల సింహ గర్జనలు, వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు సహజమని అన్నారు. గ్రామ సింహాలు అంటే కుక్కలు, వీధి కుక్కలు, పిచ్చికుక్కలు, ఊరకుక్కలు అన్నారు. వైసీపీ వ్యక్తులకు డబ్బు, అధికారం, అహకారం, మదం బాగా పుష్కలంగా ఉన్నాయన్నారు. వారికి లేనిదల్లా భయం.. ఆ భయం అంటే ఏమిటో నేర్పిస్తా అంటూ పవర్ స్టార్ హెచ్చరించారు.
తాను పారిపోయే వ్యక్తిని కాదని, కోడికత్తి, కిరాయి మూకలకు భయపడే ప్రశ్నేలేదని జనసేన చీఫ్ స్పష్టం చేశారు. కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతానని పవన్ హెచ్చరించారు. తాను ఆడబిడ్డలను చాలా గౌరవిస్తానని చెప్పారు. సొంత చిన్నాన్న హత్యకు గురైతే చంపిందెవరో చెప్పలేరా? కోడికత్తి కేసు ఏమైందని అడిగితే మీరు స్పందించిన తీరేంటి? నాకు బూతులు రాక కాదు, బాపట్లలో పుట్టినోడిని నాకు తిట్లు రావా? నేను నాలుగు భాషల్లో బూతులు తిట్టగలను. నాలుగు రోజులు సమయమిస్తే నేర్చుకుని మరీ.. ఏ భాషలో కావాలంటే ఆ భాషలో తిడతా అన్నారు. రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి బూతులు మాట్లాడటం లేదని చెప్పారు
తన వ్యక్తిగత జీవితం బ్లాక్ అండ్ వైట్ అన్న పవన్ కల్యాణ్.. సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం తనదని చెప్పారు. తాను మాటలు చెప్పే వ్యక్తిని కాదని, తాను ఎప్పుడు ఏం అడిగినా ఏపీ గురించే అడుగుతానని చెప్పారు. 2014లో టీడీపీ, బీజేపీకి అభివృద్ధి కోసమే మద్దతిచ్చానన్నారు. ఇంట్లో వారి కారణంగా ఇష్టం లేకపోయినా సినిమాల్లోకి వచ్చా. రాజకీయాల్లో కలుపు మొక్కలను తీసేయగలను. నిజమైన ప్రెసిడెంట్ మెడల్ రావాలంటే యుద్ధాలు చేయాలి. ఏపీ ప్రభుత్వం నెలకు రూ.5000 ఇస్తే ప్రెసిడెంట్ మెడల్ ఇస్తుంది. రూ.5000కే ప్రెసిడెంట్ మెడల్, మద్యం అమ్ముతున్నారు. నిత్య దరిద్రుడు నిశ్చింత పురుషుడు అనే సామెత జగన్ ప్రభుత్వం నిజం చేస్తుందని పవన్ కల్యాణ్ విమర్శించారు.
వైసీపీ అధినేత కూడా నా వ్యక్తిగతం గురించి మాట్లాడారు.. నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పారు.. నేను వైసీపీ వారిలా మాట్లాడట్లేదు. మా నాన్న నాకు ధైర్యం, తెగింపు, ధర్మరక్షణ లక్షణాలు ఇచ్చారు. వైసీపీ నేతల ఇంట్లో ఆడవారిపై తప్పుగా మాట్లాడబోమని హామీ ఇస్తున్నా’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ నేతలకు ఏ పద్ధతిలో కావాలంటే అలా యుద్ధం చేస్తామని తెలిపారు. నన్ను తిడితే ఏడుస్తానని వైసీపీ నేతలు భ్రమపడుతున్నారు. నన్ను తిట్టేకొద్దీ నేను బలపడతాను తప్ప బలహీనపడను. నేను బలహీనపడక పోగా ఎవరినీ మరిచిపోయే ప్రశ్నే లేదు. నా అంతట నేను యుద్ధం చేయను, నన్ను లాగితే వదలను. అభివృద్ధి గురించి ఏపీలో మాట్లాడటానికేం లేదు. ఏపీలో రోడ్లు వేయటానికి కూడా ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవు. ప్రజలు నావారు అనుకోబట్టే ప్రతి సన్నాసితో తిట్టించుకుంటున్నాన అని పవన్ కల్యాణ్ అన్నారు.