ఇదేంది జగనన్న.. మీ ఎమ్మెల్యే ఫోన్ చేస్తేనే దిక్కులేదు!
posted on Dec 11, 2021 @ 1:19PM
కుయ్ కుయ్ కుయ్.. ఇది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సభల్లో ఎక్కువగా పలికిన పదం. తండ్రి బాటలోనే ఆయన తనయుడు కూడా తన ఎన్నికల సభల్లో ఇదే పదాన్ని ఎక్కువగా వాడుకున్నారు. 108 అంబులెన్సుల గురించి చెబుతూ కుయ్ కుయ్ కుయ్ మంటూ వైఎస్సార్ హయాంలో వచ్చేవని చెప్పేవారు. ఈ మాటలు అనగానే జనాల నుంచి మంచి స్పందన వచ్చేది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాకా కూడా జగన్ 108ని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎవరూ ఫోన్ చేసినా ఐదు నిమిషాల్లోనే 108 అంబులెన్స్ వచ్చేలా చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు.
అయితే అనంతపురం జిల్లాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సీఎం జగన్ కు తీవ్ర ఇబ్బందిగా మారింది. జగన్ ను ఉద్దేశించి నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ``జగనన్నా.. మీ ఎమ్మెల్యే ఫోన్ చేస్తేనే దిక్కు లేదు.. ఇప్పుడు ఏం చెబుతావ్!!`` అని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇంతకు అనంతపురం జిల్లాలో ఏం జరిగిందంటే.. అనంతపురం రూరల్ కురుగుంట గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని సిమెంటు లోడుతో వెళ్తున్న ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన మహేశ్ అనే యువకుడు గాయపడ్డాడు ఆ సమయంలో అనంతపురం నుంచి అదే రోడ్డు మార్గంలో రాయదుర్గం వెళ్తున్న వైసీపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రాంచంద్రారెడ్డి గాయపడిన యువకుడిని చూశారు. వెంటనే 108 వాహనానికి మూడు సార్లు తానే ఫోన్ చేశారు. అయినా అంబులెన్స్ రాలేదు.
ఈ విషయాన్ని సమీప ఆసుపత్రికి కూడా చెప్పారు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. అయినా అంబులెన్స్ రాలేదు. దీంతో తీవ్ర నిరాశ చెందిన ఎమ్మెల్యే కాపు ఒక ప్రజా ప్రతినిధి గాయపడిన వ్యక్తి కోసం ఫోన్ చేస్తే రాకపోవడం రాకపోవడం ఏంటని ఆంబులెన్స్ సిబ్బందిపై ఫోన్లో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఎవరూ రియాక్ట్ కాలేదు. చివరకు ఆయనే స్వయంగా గాయపడిన యువకుడిని ప్రైవేటు వాహనంలో అక్కడి నుంచి చికిత్స నిమిత్తం తరలించారు.
అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. `దీనికే మంటావు.. జగనన్నా!`` అంటూ.. నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. రాష్ట్రంలో 108 సేవలు దారుణంగా ఉన్నాయని, ఎవరూ ఫోన్ చేసినా సరిగా స్పందించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. చాలా మందికి 104 108 సేవలు సమయానికి అందుబాటులో లేవనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో అనేక ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. అయితే వైసీపీ నేతలు మాత్రం ఇవన్నీ గిట్టనివారు.. ప్రతిపక్ష నాయకులు చేస్తున్న వాదనగా కొట్టిపారేశారు. అయితే తాజాగా జరిగిన ఘటనలో వైసీపీ ఎమ్మెల్యేనే నివ్వెర పోవడంతో 108 అంబులెన్సుల పరిస్థితి ఎలా ఉందో తెలిసిపోతోంది.