డిస్మిస్డ్ కానిస్టేబుల్ పై వైసీపీ ఎంపీ దాడి! గుంటూరు జిల్లాలో కలకలం..
posted on Dec 11, 2021 @ 9:34AM
ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ తనను కొట్టారంటూ డిస్మిస్ అయిన కానిస్టేబుల్ ఆరోపించడం తీవ్ర కలకలం రేపుతోంది. గతంలోనూ ఆ ఎంపీపై చాలా ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగులను బెదిరించారనే ఫిర్యాదులు కూడా వచ్చాయి. టీడీపీ నేతలను ఇష్టమెచ్చినట్లుగా తిడతారనే ఆ ఎంపీపై విమర్శలు ఉన్నాయి. సస్పెండ్ చేసిన తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరినందుకు ఎంపీ నందిగం సురేశ్ తనపై చేయి చేసుకున్నారని, కులం పేరుతో దూషించారని డిస్మిస్ అయిన కానిస్టేబుల్ బత్తుల బాబూరావు ఆరోపించారు. ఆయన నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ గుంటూరు ఎస్పీకి వినపతిపత్రం అందించారు.
అనారోగ్యం కారణంగా మూడేళ్లుగా విధులకు హాజరు కాలేకపోయానని, దీంతో తనను ఉద్యోగం నుంచి తొలగించారని బాబురావు చెప్పారు. తిరిగి తనను విధుల్లోకి తీసుకునేందుకు సాయం చేయాలని ఎంపీని కోరితే తనపై చేయిచేసుకోవడమే కాకుండా కులం పేరుతో దూషించారని ఆరోపించాడు. ఢిల్లీలో ఉన్న ఎంపీకి ఎస్ఎంఎస్ ఇచ్చి ఫోన్ చేసి అడిగినందుకు దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నెల 7న అర్ధరాత్రి వేళ తుళ్లూరు పోలీసులు తనను ఎంపీ ఇంటికి తీసుకెళ్లారని, ఎంపీ, ఆయన అనుచరులు, తుళ్లూరు ఎస్సై తనను కొట్టి ఫోన్ లాగేసుకున్నారని, అందులోని ఆడియో, వీడియో రికార్డులను తొలగించారని బాబూరావు ఆరోపించారు. తన భార్య, కుమారుడిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారని, 8వ తేదీ అర్ధరాత్రి వరకు స్టేషన్లోనే ఉంచి తెల్లకాగితాలపై సంతకం తీసుకున్నారని ఆరోపించాడు.
అయితే సస్పెండెడ్ కానిస్టేబుల్ బాబురావు ఆరోపణలను ఎంపీ సురేశ్ ఖండించారు. తాను అతడిపై చేయి చేసుకోలేదని వివరణ ఇచ్చారు. అతడెవరో కూడా తనకు తెలియదని అన్నారు. సాయం కోరుతూ పదేపదే విసిగించాడని చెప్పారు. మరో నంబరుతో ఫోన్ చేసి ఆడియో రికార్డును ఎవరివద్ద పెట్టాలో వారి వద్ద పెడతానని హెచ్చరించడంతో తన పీఏ ద్వారా ఫిర్యాదు చేయించినట్టు వివరించారు.బాబూరావు ఆరోపణలపై పోలీసులు స్పందించారు. తాము ఆయనపై చేయి చేసుకోలేదని, ఎంపీకి ఫోన్ చేసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడారన్న ఎంపీ పీఏ ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసినట్టు తెలిపారు. తాము పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చాం తప్పితే చేయిచేసుకోలేదని తుళ్లూరు డీఎస్పీ పోతురాజు తెలిపారు.