అక్కడా.. ఆ నలుగురే!.. కేసీఆర్ ఒంటరే

తెలంగాణ ముఖ్యమంత్రి,భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అధినేత, కల్వకుట్ల చంద్రశేఖర రావు జాతీయ రాజకీయ ప్రస్థానంలో మరో ముందుగు వేశారు.  నిజానికి, కేసేఅర్  గత నాలుగు సంవత్సరాలుగా జాతీయ రాజకీయ ప్రస్థానం గురించి ఇదిగో అదిగో అంటూ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. తెరాస నాయకులు కుడా జాతీయ కలలలో తెలిపోతూనే ఉన్నారు. అలాగే, అనేక సమయాల్లో అనేక ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. వ్యూహాలు మారుస్తూనే ఉన్నారు. ప్రాంతీయ పార్టీల జాతీయ కూటమి, ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్’ ఇంకో ఫ్రంట్ మరో ఫ్రంట్  అంటూ నాలుగు సంవత్సరాలుగా కేసేఆర్ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అయితే, ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించ లేదు. కేసీఆర్ తో చేతులు కలిపేందుకు, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ప్రాంతీయ  నాయకులు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపధ్యంలో, ఆయన ఫ్రంట్  టెంట్ ఆలోచనను పక్కన పడేసి, తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస) పేరును, భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) గా మార్చి, జాతీయ రాజకీయాలలో కాలు పెట్టేందుకు కేసేఆర్ తనకు తాను ఒక వేదిక తయారు చేసుకున్నారు. ముహూర్తం చూసుకుని దేశ రాజధాని ఢిల్లీలో కాలు పెట్టారు. జాతీయ పార్టీ కార్యాలయానికి రిబ్బన్ కత్తిరించారు. బీఆర్ఎస్ జెండాని ఢిల్లీలో అవిష్కరించారు.  అయితే ఢిల్లీ వెళ్ళినా మళ్ళీ అదే కుమార స్వామి, అదే అఖిలేష్ యాదవ్ తప్పించి మరో ముఖ్య నాయకుడు ఎవరూ అటు కేసి కన్నెత్తి చూడలేదు. చివరికి కుమారస్వామి కేసీఆర్ కార్యక్రమానికి హాజరవ్వడానికి ఒక రోజు ముందు ఆయన తండ్రి హెచ్ డి దేవెగౌడ్ హస్తినలో ప్రధాని మోడీని కలిసి వచ్చారు. అదీ సంగతి. సరే, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ మరికొన్ని రాష్ట్రాల నుంచి కొందరు రైతు నాయకులు బీఆర్ఎస్  వేడుకల్లో పాల్గొన్నా, ఆ  నాయకులకు వారి సొంత రాష్ట్రాలలో ఉన్న క్రెడిబిలిటీ ఏమిటో ఎవరికీ తెలియదు. దేశంలో రైతు నాయకుడిగా ఎంతో కొంత గుర్తింపు ఉన్న తికాయత్  వస్తారని ప్రచారం జరిగినా, ఆయన రాలేదు. అలాగే, స్వాగత తోరణాల్లో కనిపించిన బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్  కూడా బీఆర్ఎస్ వేదిక మీద కనిపించలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ సంగతి అయితే చెప్పనే అక్కర లేదు. కేజ్రివాల్ కాదు కదా  ఆయన పార్టీ నుంచి మరో నాయకుడు కనీసం ఉప ముఖ్యమంత్రి సిసోడియా అయినా కేసీఆర్ ను పలకరించిన పాపాన పోలేదు. అంతే కాదు, హైదరాబాద్’ లో కట్టి నట్లు , అడ్డదిడ్డంగా అనుమతులు లేకుండా, కట్టిన, ‘దేశ్ కీ నేతా కేసేఆర్   బ్యానర్లు, పోస్టర్లను ఆప్  సర్కార్ కట్ట కట్టి చెత్త కుప్పలో పడేసింది. అనుమతులు లేకుండా బ్యానర్లు, హోర్డింగులు కట్టినందుకు ఢిల్లీ ఆప్ సర్కార్ కేసులు పెట్టిందో లేదో తెలియదు కానీ, తెలంగాణ ప్రజల పైసలు మూట కట్టి ఆప్ ఏలుబడిలోని పంజాబ్ లో పందారం చేసినా, ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మాత్రం తమ్ముడు తమ్ముడే పేకాటే అన్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  కు కనీస మర్యాద ఇవ్వలేదు. నిజానికి  ఇప్పుడే కాదు  గతంలోనూ కేసేఆర్ ను కేజ్రీవాల్  ఇంతకంటే ఘోరంగా అవమానించారు. ఇంచుమించుగా వారం రోజులు అప్పాయింట్మెంట్ ఇవ్వకుండా గేటు దగ్గరే ఆపేశారు.      ఒక్క కేజ్రీవాల్ మాత్రమే కాదు, గతంలో ఆ రాష్ట్రాలలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు డబ్బుల మూటలో వెళ్ళినప్పుడు కేసేఆర్ కు స్వగతం పలికిన  బీహార్, ఝారఖండ్ ముఖ్యమంత్రులు, ముఖ్య నాయకులు   బీఆర్ఎస్ వేడుకకు రాలేదు. కనీసం  ఆయన ఢిల్లీలో అడుగు పెట్టిన విషయాన్నీ గుర్తించ లేదు. కనీసం, మాటవరసకు అయినా  ‘ఆల్ ది బెస్ట్’ చెప్పలేదు. చివరకు  మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా, తెరాసతో జట్టు కట్టిన ఉభయకమ్యూనిస్ట్ పార్టీల జాతీయ నాయకులు కనీసం మర్యాదపూర్వకంగా అయినా కేసేఆర్ ను పలకరించలేదు.  ఎవరి దాకానో ఎందుకు, రాష్ట్రం నుంచి అనేక అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రెక్కలుకట్టుకుని  విమానాల్లో ఢిల్లీ వెళ్ళారు. కానీ, మంత్రి కేటీఆర్ మాత్రం ఎందుకనో ఢిల్లీ పండక్కి డుమ్మా కొట్టారు. వై ..ఎదుకు .. అందుకే  ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కార్యక్రమం చాంతాడంత రాగం  తీసి ఏదో పాట పడినట్లు ముగిసిందని, ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంతో కేసేఆర్, సింపుల్  గా మరోసారి ఒంటరి అయిపోయారనే విషయం రుజువైందే తప్ప, పెద్దగా ఒరిగిందేమీ లేదని పార్టీ నాయకులు మరో ‘సారీ’ నిట్టురుస్తున్నారు. అక్కడా .. ఆనలుగురితోనే అయింది, అనిపించారని, ఢిల్లీ వెళ్లి వచ్చిన ముఖ్య నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.

2022 రౌండప్ .. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే కీలకం

మార్చి  2022 కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. మరి కొద్ది  రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే ...తెలుగు మాసాల్లో మాసానాం మార్గశీర్షోహం – అన్ని మాసాల్లోకి మార్గశిర మాసం శ్రేష్టమైనది అన్నట్లుగా 2022 సంవత్సరంలో మార్చి మాసానికి,  ప్రత్యేక ప్రాధాన్యత వుంది. అంతకు ముందు నెలరోజులకు పైగా జరిగిన ఐదు రాష్త్రాల ఆసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అందుకే 2022 మార్చి నెలలో ఎన్నికల ఫలితాలే మీడియా ఫోకస్ గా నిలిచాయి.  ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7వ  తేదీవరకు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్టాల శాసన సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఉత్తర ప్రదేశ్,లో అత్యధికంగా ఎనిమిది విడతల్లో పోలింగ జరిగితే, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఒకటి  రెండు విడతల్లో పోలింగ్ జరిగింది.  మార్చి 10  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. కాగా ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. పంజాబ్’ లో కాంగ్రెస్’ ను ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీ ... ఆప్ అధికారంలోకి వచ్చింది. కాగా, అసెంబ్లీ ఎన్నికలలో  ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని,కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు.ఈ ఓటమి నుంఛి గుణపాఠం నేర్చుకుని ముందుకు సాగుతామని అన్నారు.   యోగీ ఆదిత్య నాథ్. మార్చి 25 న వరసగా రెండవ సారి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ... ప్రమాణ స్వీకారం చేశారు.అలాగే, పుష్కర్ సింగ్ ధామి మార్చి 23న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా రెండవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. దామి అసెంబ్లీ ఎన్నికల్లో ఖతిమా నియోజక వర్గంలో ఓటమి చవిచూశారు. అయినా, బీజేపీ ఆయనకు మరో అవకాశం ఇచ్చింది. మార్చి 16 పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆప్ ఖాతాలో మరో రాష్ట్రం చేరింది. మార్చి 28 న గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపధ్యంగా మార్చి 13...న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, సీబ్ల్యుసి సమావేశం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వం పట్ల పూర్ణ విశ్వాసాన్ని పునరుద్ఘాటించింది.  పార్టీని బలోపేతం చేసేందుకు సోనియా గాంధీ దిద్దుబాటు చర్యలుతీసుకుంటారని సీడ్ల్యుసి విశ్వాసం వ్యక్త పరిచింది. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని సీడ్ల్యుసి సభ్యులు మరోమారు విజ్ఞప్తి చేశారు.  మార్చి నెల చివరి రోజు, అంటే మార్చి 31 న రాజ్యసభ  పదవీ కాలం  ముగిసిన 72 మంది సభ్యులకు వేడ్కోలు పలికింది. అలాగే, పెద్దల సభలో ఇటీవల కాలంలో తొలి సారిగా బీజేపీ సంఖ్యాబలం వంద మార్కు దాటింది. ఏప్రిల్ 2022 విశేషాలు రేపు

కరీంనగరా.. కరినగరా?

తెలంగాణ బీజేపీ కరీంనగర్ కు కొత్తగా నామకరణం చేసిందా? కరీంనగర్ ను కరినగర్ గా ఏకపక్షంగా మార్చేసిందా? అంటే ఆ పార్టీ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర 5వ విడత ముగింపు సభ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ప్రకటనలలో కరీంనగర్ పేరును కరినగర్ గా పేర్కొంది. దీంతో అందరూ కరీంనగర్ పేరు కరినగర్ గా ఎప్పుడు మారింది అన్న సందిగ్ధంలో పడ్డారు. మరి కొందరేమో ముద్రారాక్షసమంటూ చర్చ లేవదీశారు. చివరకు తేలిందేమిటంటే.. పూర్వ కాలంలో కరీంనగర్ ను కరినగరంగా పిలిచేవారట. ఎందుకంటే కరి అంటే ఏనుగు.. ఎనుగులు ఎక్కువగా తిరిగే ప్రదేశం కనుక అప్పట్లో కరీంనగర్ ను కరినగరంగా పిలిచేవారట.. కాలక్రమేణా నాటి కరినగరంపేరు కరీంనగర్ గా స్థిరపడిందట. ఇప్పుడు పాత చరిత్ర పుటలను తిరగేసి బీజేపీ ఏకంగా ఏకపక్షంగా  కరీంనగర్ ను కరినగర్ గా మార్చేసింది. అయినా బీజేపీకి ఇలా నగరాలు, ప్రదేశాల పేర్లను మార్చేయడం  కొత్తేమీ కాదు.  బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచీ దేశంలోని పలు నగరాలకు పున: నామకరణం చేస్తూ వస్తోంది. యూపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని పలు నగరాల పేర్లే మార్చేశారు. కర్నాటకలోనూ బీజేపీ ప్రభుత్వం అదే చేసింది. తెలంగాణలో కూడా తమ పార్టీ అధికారంలోకి వచ్చాకా పలు నగరాల, ప్రాంతాల పేర్లు మారుస్తామని చెబుతోంది. అయితే రాష్ట్రంలో ఇంకా అధికారంలోకి  రాకుండానే బీజేపీ కరీంనగర్ కు కరినగరంగా నామకరణం చేసేసింది. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సందర్భంగా ఇచ్చిన అడ్వర్టైజ్ మెంట్లలోనూ, పోస్టర్లు, ఫ్లెక్సీలలోనూ కరీంనగర్ అని కాకుండా కరినగర్ అని పేర్కొంది. బీజేపీ పేర్ల మార్పు ప్రహసనంపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని పేర్ల మార్పు ప్రక్రియను బీజేపీ చేపట్టిందన్న విమర్శలు ఉన్నాయి. ఇక కరీంనగర్ విషయానికి వస్తే కరీం అంటే మైనారిటీ వర్గానికి సంబంధించిన పేరు అంటూ అసలు కరీంనగర్ వాస్తవ నామం కరినగర్ అంటూ వాదిస్తోంది. ఇటీవల తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ భైంసా పర్యటన సందర్బంగా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే భైంసా పేరును మార్చేస్తామని ప్రకటించారు. ఎప్పటి నుంచో హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామంటూ వస్తున్నారు. హిందుత్వ అజెండాలో భాగంగానే బీజేపీ ఈ విధంగా వ్యవహరిస్తోందన్న విమర్శలకు ఆ పార్టీ అసలు ఖాతరు చేయడం లేదు.  

హస్తినలో బీఆర్ఎస్.. క్యా సీన్ హై!

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలన్న లక్ష్యంతో చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా అంటే సంతృప్తికరమైన సమాధానం మాత్రం దొరకదు. దాదాపునాలుగేళ్లుగా ఆయన జాతీయ రాజకీయాలలో  ప్రవేశం కోసం చేయని ప్రయత్నం లేదు.. కలవని పార్టీ లేదు.   ప్రాతీయ పార్టీల జాతీయ కూటమి అంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మొదలు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వరకు, బీహార్ సీఎం, జేడీఎస్ అధినేత నితీష్ కుమార్ మొదలు యూపీ మాజీ సీఎం, ఎస్పీ నేతఅఖిలేష్ యాదవ్  వరకు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి  తమిళనాడు సీఎం స్టాలిన్ దాకా అందరినీ కలిసారు.  వీళ్లూ వాళ్లూ అని లేకుండా బీజేపీ యేతర పార్టీల నేతలందరినీ కలిశారు. కానీ జేడీయు నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామిని మినహాయిస్తే ఇంకెవరూ కేసీఆర్ తో కలిసి నడవడానికి సుముఖత వ్యక్తం చేయలేదు.  దీంతో ఆయన  తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)  పేరును భారత రాష్ట్ర సమితి ( భారాస)గా మార్చి, జాతీయ రాజకీయాల్లోకి జంప్ చేసేశారు. కానీ బీఆర్ఎస్  జాతీయ పార్టీ అని, కేసీఆర్ ఆయన పరివారం ఎంతగా ప్రచారం చేసుకున్నా అదిఇప్పటికిప్పుడు జాతీయ పార్టీ కాదు. దానికా గుర్తింపు రాదు. సరే అధికారిక గుర్తింపు సంగతి పక్కన పెడదాం. కానీ జాతీయ స్థాయిలో ఆ పార్టీకి ఇతర పార్టీల నుంచి ఏమైనా స్వాగతం లభిస్తోందా? అంటే దానికీ సంతృప్తి కరమైన సమాధానం రాదు. సరే హస్తినలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ఆర్భాటంగా యాగం చేసి మరీ ప్రారంభించిన కేసీఆర్ కు అక్కడైనా ఏమైనా సానుకూల స్పందన లభించిందా అంటే అదీ లేదు. హైదరాబాద లో పార్టీ ఆవిర్బావ సభకు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి మాత్రమే వచ్చారు. హస్తినలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభ కార్యక్రమానికి కుమారస్వామికి అదనంగా యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఒకరు కలిశారు అంతే. పోనీ జాతీయ మీడియా అయినా రాజకీయ యవనికపై ఒక కొత్త పార్టీ వచ్చి చేరిందన్న ఆసక్తి కూడా కనబరచలేదు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం వ్యవహారం అంతా ఏదో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ వ్యవహారంగా జాతీయ మీడియా లైట్ తీసుకుంది. బీఆర్ఎస్ ను అస్సలు పట్టించుకోలేదు. ఏదో ప్రాంతీయ పార్టీ పేరు మార్చుకుని ఢల్లీలో కార్యాలయం ఏర్పాటు చేసుకుంటోందంటూ ఆ కార్యక్రమాన్ని పూర్తిగా విస్మరించింది. దేశ రాజధాని నగరంలో యాగం చేసి, నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు, పోస్టర్లతో హడావుడి చేసినా కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశానికి సంబంధించిన వార్తలకు జాతీయ మీడియా పెద్దగా పట్టించుకోలేదు.  ఇటీవలి కాలంలో దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇవ్వని విధంగా కేసీఆర్ జాతీయ మీడియాకు కోట్లాది రూపాయల అడ్వర్టైజ్ మెంట్లు ఇచ్చారు. జాతీయ చానెళ్లకైతే స్లాట్లు తీసుకుని మరీ తెలంగాణ మోడల్ అభివృద్ధిని ప్రచారం చేసుకున్నారు.  అవేవీ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కవర్ చేసే విధంగా జాతీయ మీడియాను కదిలించలేకపోయాయి. అంతే కాకుండా బీఆర్ఎస్ కు జాతీయ, అంతర్జాతీయ మీడియా కో ఆర్డినేటర్ గా కేసీఆర్ తన బిడ్డ కవితను నియమించారనీ, ఆమె రికమెండ్ చేసిన విధంగా ఒక పీఆర్వోను కూడా నియమించారనీ అంటున్నారు. ఇంత చేసినా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కనీసంగా కూడా ప్రచారం చేయించుకోలేకపోయారు. మీడియా సంగతి పక్కన పెడితే ఢిల్లీలోనే ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అసలు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం జరుగుతోందనే గుర్తించ లేదు. కనీసం అటుకేసి తొంగి చూడలేదు. ఆయన ఆహ్వానం అందిందా? అందలేదా అన్నది వేరే ప్రశ్న.. కానీ బీజేపీని వ్యతిరేకించే బలమైన పార్టీ నాయకుడిగా.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా మరో బీజేపీ వ్యతిరేక పార్టీ కార్యక్రమానికి ఆయన హాజరు కాకపోవడమే బీఆర్ఎస్ విషయంలో ఆయన వైఖరి ఏమిటన్నది స్పష్టమౌతుంది. అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వీరెవరూ ఇటు కేసి కనీసం చూడను కూడా చూడ లేదు. దీనిని బట్టి చూస్తే పేరు మార్పు తప్ప బీఆర్ఎస్ తో కేసీఆర్ సాధించిందేమీ లేదని పరిశీలకలు అంటున్నారు. టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ పేరు మార్పు ప్రహసనంగానే మిగిలిపోయిందంటున్నారు.  

ధరణి కోట టు ఎర్రకోట.. అమరావతి రైతుల మరో పోరు యాత్ర

ఆంధ్రప్రదేశ్‌కి ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. అందుకు భూములు ఇచ్చిన రైతులు  మరో పోరాటానికి సిద్దమయ్యారు. 2019, డిసెంబర్ 17వ తేదీన ఏపీ సీఎం వైయస్ జగన్.. ఏపీకి మూడు రాజధానులంటూ కీలక ప్రకటన చేశారు.. ఆయనా ప్రకటన చేసి 2022, డిసెంబర్ 17వ తేదీకి మూడేళ్లు పూర్తవుతుంది.  ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని.. అమరావతి రైతులు ధరణి కోట నుంచి ఎర్రకోట వరకు... పేరుతో దేశ రాజధాని ఢిల్లీకి పోరు బాట పట్టనున్నారు. ఆ క్రమంలో 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఢిల్లీలో రైతులు..  నిరసనలు తెలపనున్నారు. ఆ క్రమంలో 17వ తేదీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అమరావతి రైతులు ధర్నా చేపట్టనున్నారు. అలాగే 18వ తేదీన ఇతర రాష్ట్రాల ఎంపీలను కలిసి.. వారికి ఈ తమ గోడును విన్నవించుకోనున్నారు. ఇక 19వ తేదీన రామ్‌లీలా మైదానంలో జరిగే కిసాన్ సంఘ్ కార్యక్రమంలో  అమరావతి రైతులు పాల్గొననున్నారు. అదీకాక.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీల ఎంపీలు.. ఢిల్లీలోనే ఉంటారని.. వారందరినీ కలిసి.. రాజధాని అమరావతికి మద్దతు ఇవ్వాలని రైతులు కోరనున్నారు. అందుకోసం అమరావతి నుంచి 1800 మంది రైతులు... ప్రత్యేక రైలులో ఢిల్లీకి పయనమవుతున్నారు. ఏపీకి  అమరావతే ఏకైక రాజధాని అని న్యాయస్థానం స్పష్టం చేసినా... జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిపై అమరావతి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ మూడు రాజధానులంటూ ప్రకటన చేసిన నాటి నుంచి... అమరావతికి భూములు ఇచ్చిన రైతులు.. వరుసగా నిరసనలు, దీక్షలు, యాత్రలలో పోరాడుతూనే ఉన్నారు. ఆ క్రమంలో న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి నుంచి తిరుపతి వరకు మహాపాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రకు జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో.. రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నారు. అలాగూ అమరావతి నుంచి అరసవల్లి వరకు అమరావతి రైతులు మరో మహాపాదయాత్ర చేపట్టారు. అయితే ఈ పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం వద్ద ఈ పాదయాత్రకు బ్రేకులు పడ్డాయి. దీంతో ఈ పాదయాత్ర ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.   అయితే విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని అంటూ ఇప్పటికే జగన్ ప్రభుత్వం ప్రకటించింది. దాంతో అమరావతి రైతుల పాదయాత్ర... ఉత్తరాంధ్ర జల్లాల్లో ప్రవేశిస్తే.. పరిస్థితులు  ఎలా ఉంటాయన్న ఆందోళన వ్యక్తమైంది. ఎందుకంటే.. అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా.. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఉంటే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటూ... జగన్ పార్టీలోని పలువురు కీలక నేతలు.. అమరావతి రైతుల మహాపాదయాత్రకు పోటీగా  ఆందోళనలు నిర్వహించేందుకు రంగం చేస్తుకొన్నారని సమాచారం. అలాంటి వేళ.. ఈ అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రలో ప్రవేశిస్తే.. పరిస్థితులు ఆందోళనకరంగా మారే అవకాశాలు బలంగా ఉన్నాయని ఓ చర్చ సైతం బలంగా సాగుతోంది.    మరోవైపు గతంలో శాతవాహనుల రాజధానిగా అమరావతి ఉండేది. ఆ సమయంలో అమరావతిని ధాన్యకటకం.. ధరణికోట పేర్లుతో ప్రజలు పిలిచుకునే వారు. ఈ పేర్లను పురస్కరించుకొని. ధరణికోట నుంచి ఎర్రకోట పేరుతో అమరావతి రైతులు హస్తిన యాత్రకు శ్రీకారం చుట్టారు.

హెలికాప్టర్ కు యాదాద్రిలో వాహన పూజ..

ఆలయాల్లో వాహన పూజలు సర్వసాధారణం. ఎవరైనా కొత్త వాహనం కొనుక్కుంటే ముందుగా ఆలయానికి తీసుకువచ్చి వాహన పూజ చేయిస్తారు. ఇలా చేయిస్తే ఆ వాహనంపై ప్రయాణం ఎలాంటి ప్రమాదాలకూ తావు లేకుండా సజావుగా సాగుతుందని ఒక విశ్వాసం. కార్లు, బైకులు, ట్రక్కులు, బస్సులు, వ్యానుకు ఇలా రకరకాల వాహనాలకు వాటి యజమానులు పూజలు చేయించడం విశేషమేమీ కాదు. తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన  యాదాద్రి ఆలయం వద్ద తమ వాహనాలకు వాహన పూజలు చేయిచుకునే వారి సంఖ్య చిన్నదేం కాదు.  కానీ ఒకాయన ఏకంగా తాను కొనుక్కున్న చాపర్ కు పూజలు చేయించడానికి ఆలయానికి తీసుకు వచ్చారు. దీంతో ఆ హెలికాప్టర్ ను చూడటానికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సంఘటన యాదాద్రిలో జరిగింది. ఇంతకీ అసలు విషయమేమిటంటే..యాదాద్రిలో మొట్టమొదటి సారిగా ఒక హెలికాప్టర్ కు వాహన పూజ జరిగింది. దీంతో ఆ హెలికాప్టర్ ను చూడటానికి వచ్చిన జనం పర్వదినాలలో యాద్రాద్రి లక్ష్మీనరసింహస్వామిని చూడటానికి వచ్చిన భక్త జనసందోహం కంటే తక్కువగా లేరు. ఇంతకీ తన చోపర్ కు వాహన పూజ చేయించిందెవరయా అంటే.. కరీంనగర్‌ ప్రతిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎండీ, హైదరాబాద్ ఎయిర్‌ లైన్స్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ అయిన బోయినపల్లి శ్రీనివాసరావు. ఆయన తాను కొనుగోలు చేసిన హెలికాప్టర్‌కు యాదాద్రి పెద్దగుట్టపై బుధవారం (డిసెంబర్ 14)  వాహన పూజ చేయించారు. హెలికాప్టర్ కు పూజారులు వాహన పూజ చేస్తుంటే.. ఆ విషయం తెలుసుకున్న జనం పెద్ద సంఖ్యలో హెలికాప్టర్ ను చూసేందుకు పోటెత్తారు.   

కేరళలో కోళ్లు, బాతులకు చంపేస్తున్నారు.. ఎందుకో తెలుసా?

కేరళలో కోళ్లు, బాతులను వెంటనే చంపేయాలని ఓ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నిజమే.. కొట్టాయం జిల్లా కలెక్టర్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే కొట్టాయం జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందింది. దీంతో కోళ్లు, బాతులు, ఇతర పెంపుడు పక్షులను చంపేసి క్రిమి సంహారక మందులు చల్లాలని ఆయన ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు వేల సంఖ్యలో కోళ్లు, బాతులు, పెంపుడు పక్షులను చంపేస్తున్నారు. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుని మాళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్న వేళ మళ్లీ వైరస్ లు విజృంభించడం ఆందోళన రేకెత్తిస్తోంది. బర్డ్ ఫ్లూ, ఎబోలా, జికా ఇలా వైరస్ ల వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. మరో వైపు ఉదృతి తగ్గినా మరో సారి పడగ విప్పేందుకు కరోనా, ఒమిక్రాన్ వైరస్ లు పొంచే ఉన్నాయి.  తాజాగా కర్ణాటకలో ఐదేళ్ల చిన్నారికి జికా వైరస్ సోకినట్లు నిర్దారణ అయ్యింది. చైనాలో కరోనా కోరలు చాస్తోంది. ఈ నేపథ్యంలో కేరళలో బర్డ్ ఫ్లూ విజృంభణను అరికట్టేందుకు పెద్ద సంఖ్యలో పక్షులను చంపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొట్టాయం జిల్లాలో బుధవారం (డిసెంబర్ 14) నుంచి మూడు రోజుల పాటు వ్యాధి వ్యాప్తికి కేంద్రంగా ఉన్న చోటు నుంచి పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న కోళ్లు, బాతులు,ఇతర పెంపుడు పక్షులు, అలాగే   మాంసం సహా సేంద్రీయ ఎరువుల క్రయ విక్రయాలను నిలిపివేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. బర్డ్ ఫ్లూ వల్ల ప్రజలకు నేరుగా ఎలాంటి హానీ లేకపోయినప్పటికీ, బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయిన.. పక్షుల మాంసం తినడం వల్ల   ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నారు.

గుంజీలు తీస్తే బస్ టికెట్ ఫ్రీ.. ఎక్కడంటే?

ఇప్పటి పిల్లలకు తెలియదు కానీ.. గతంలో స్కూళ్లలో హోంవర్క్ చేయకపోయినా, అల్లరి చేసినా గుంజీలు తీయించే వారు. గోడ కుర్చీ వేయించేవారు. అవి పిల్లలకు అప్పట్లో విధించే శిక్షలు. కానీ గుంజీలు తీయడం వ్యాయామంలో అతి కీలకమన్న విషయం అప్పట్లో శిక్షలు విధించిన టీచర్లకు కానీ, వాటిని అనుభవించిన విద్యార్థులకు కానీ తెలియదు. ఇప్పుడు అందరిలోనూ హెల్త్ కాన్షస్ నెస్ పెరిగింది. జిమ్ములనీ, మార్నింగ్  వాక్ లనీ, సిట్అప్స్ (గుంజీలు) అని ఎక్కువ మంది ఎక్సర్ సైజ్ లు చేస్తున్నారు. కానీ చాలా మందికి వ్యాయామాలంటే బద్ధకం. లేదా పని ఒత్తిడిలో నిర్లక్ష్యం చేస్తుంటారు. అటువంటి వారి కోసం గుంజీలు తీస్తే బస్ టికెట్ ఫ్రీ అని బంపరాఫర్ ప్రకటించిందో ప్రభుత్వం. ఔను నిజమే రొమేనియా నగరంలో స్పెర్ట్స్ ఫెస్టివల్ అనే ఒక హెల్త్ మిషన్ లో భాగంగా రొమేనియా ప్రభుత్వం ఈ బంపరాఫర్ ఇచ్చింది. గుంజీలు తీసి పొందిన ఫ్రీ బస్ టికెట్ కు ఓ పేరు కూడా పెట్టేసింది. దాని పేరు హెల్త్ టికెట్. అయితే ఈ టికెట్ పొందాలంటే రెండే రెండు నిముషాల్లో 20 గుంజీలు తీయాలి. అలా తీస్తేనే హెల్త్ టికెట్ అనే ఫ్రీ బస్ టికెట్ ఇస్తారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. ఆ విడియోలో ఓ అమ్మాయి టికెట్ మిషన్ ఎదుట నిలబడి 20 గుంజీలు తీసింది. ఆమె గుంజీలు తీయడం పూర్తి కాగానే టికెట్ మిషన్ నుంచి టికెట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.  మన దేశంలో కూడా ప్రజలలో వ్యాయామం పట్ల ఆసక్తినీ, అవగాహనను పెంపొందించడానికి ఇటువంటి చర్యలు తీసుకుంటే బెటర్ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

హైకోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఏపీ సీఎస్ కు కోర్టు ఆదేశం

కోర్టులు ఎన్ని సార్లు మొట్టికాయలు వేసినా జగన్ సర్కార్ కు బొప్పి కట్టడం లేదు. కోర్టు ఆదేశాలను ఖాతరు చేసే ఉద్దేశమే లేదన్నట్లుగా సర్కార్ వ్యవహార శైలి ఉంది. తాజాగా హైకోర్టు మరో సారి ఏపీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పాఠశాలల ఆవరణల్లో ఇతర నిర్మాణాలేవీ చేపట్టరాదని హైకోర్టు గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే హై కోర్టు ఆదేశాల తరువాత కూడా పాఠశాల ఆవరణల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం చేపట్టడంపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విస్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా వాటిని ఖాతరు చేయకుండా కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేయడం, నిర్మాణాలు చేపట్టడంపై స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22న కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.   ఏపీ సర్కార్ తీరు, అధికారుల వ్యవహార శైలిపై కోర్టు గతంలో కూడా పలు మార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. సీఎస్ కు కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించడానికి ఒక్క రోజు ముందు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డికి నెల రోజులు జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధించింది. ఉద్యోగుల క్రమబద్ధీకరణ వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు టీటీడీ ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష విధించింది. ఇలా పలు సందర్భాలలో కోర్టు ధిక్కరణ కేసుల్లో ఏపీ అధికారులు కోర్టు మందలింపులకు, శిక్షలకు గురయ్యారు.  

ఉద్యోగం కోసం తల్లీ కూతుళ్ల పోటీ.. ఇద్దరూ విజేతలే

రాజకీయాలలో తల్లీ కూతుళ్లు, తండ్రీ కొడుకులూ.. అన్నాదమ్ములు ఇలా రక్త సంబంధీకులు సైతం ప్రత్యర్థులుగా మారి పోటీలు పడటం చూశాం. కానీ ఉద్యోగం విషయంలో తల్లీ కూతుళ్లు పోటీ పడిన సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఖమ్మం జిల్లా చెన్నారం గ్రామానికి చెందిన తళ్లీ కూతుళ్లు ఎస్సై పరీక్ష రాసి ప్రిలిమనరీలో పాసయ్యారు. ఈవెంట్స్ కువచ్చారు. వాటిలోనూ ఒకరికొకరు పోటీ పడ్డారు. చివరకు ఇద్దరూ పాసయ్యారు.  ఇక మెయిన్ పరీక్ష ఒక్కటే మిగిలింది. అందులోనూ పాసైతే ఇద్దరూ ఎస్సై కొలువుల్లో స్థిరపడతారు. మెయిన్ లో కూడా విజయం సాధించి జాబ్ కొడతామని ఇద్దరూ విశ్వాసం వ్యక్తం చేశారు. తల్లీ కూతుళ్లు నాగమణి, త్రిలోకిని కి పోలీసు కొలువు చేయాలని ఆకాంక్ష. తల్లి నాగమణి ఇప్పటికే హోం గార్డుగా పని చేశారు. ఆ తరువాత కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ములుగు జిల్లాలో కానిస్టేబుల్ గా కొలువులో ఉన్నారు. ఆమె కుమార్తె త్రిలోకిని తల్లి బాటలో నడిచి కానిస్టేబుల్ కాకుండా ఎస్ ఐ కావాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. కుమార్తె పట్టుదల చూసి తాను సైతం అంటూ నాగమణి కూడా ఎస్సై పోస్టు కోసం తన వంతుగా ప్రిపరేషన్స్ ప్రారంభించింది. ఆ కక్రమంలోనే కుమార్తెతో ప్రిలిమినరీ పరీక్ష రాసి పాసయ్యింది. ఆ తరువాత ఎస్ఐ సెలక్షన్స్ లో అత్యంత ముఖ్యమైన ఈవెంట్స్ కు హాజరైంది. అక్కడా కూతురితో పోటీపడి ఆమెతో సమానంగా విజేతగా నిలిచింది. ఇక మిగిలింది మెయిన్ పరీక్ష. అందులోనూ గెలుస్తామన్న ధీమాను తల్లీ కూతుళ్లు వ్యక్తం చేశారు.

బాలయ్య చికెన్ బిరియానీ @ రూ.2/-

హిందూపురం ఎమ్మెల్యే, యువరత్న నందమూరి బాలకృష్ణ రియల్ లైఫ్‌లో అయినా.. రీల్ లైఫ్‌లో అయినా.. ఏం చేసినా సన్సేషనే.   నిర్ణయం తీసుకోవడం దానికి అమలు చేయడం అన్ స్టాపబుల్ స్పీడ్ లో జరిగిపోతుంటుంది.  బాలయ్య ప్రతిపనిలోనూ ఆయన మార్క్ స్సష్టంగా కనబడుతుంది. తాజాగా బాలయ్య బాబు.. తన నియోజవర్గమైన హిందూపురంలో జస్ట్ 2 రూపాయిలకే చికెన్ బిర్యానీ అందుబాటులోకి తీసుకువచ్చారు.  స్థానిక హిందూపురం ప్రభుత్వాసుపత్రి వద్ద దాదాపు 500 మందికి  అన్న క్యాంటిన్   చికెన్ బిర్యానీ ఆయన అందించారు. అన్న క్యాంటీన్లు ప్రారంభించి 200 రోజులు పూర్తి కావడంతో బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మెనూలో చికెన్ బిర్యానీ, గుడ్డు పాటు ఓ స్వీట్ అందించారు.  గతంలో చంద్రబాబు  హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  కానీ జగన్ ముఖ్యమంత్రి అయన తర్వాత.. అన్న క్యాంటీన్లు ఎత్తివేశారు. కేవలం రెండు రూపాయిలకే అన్నం అందింస్తుండంతో ప్రజలు వీటిని బాగా ఆదరించారు. అయితే అలాంటి ప్రజాప్రయోజనమైనటువంటి వాటిని వైఎస్ ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ నాయకులు అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేసినా వాటిని కూడా వైసీపీ సర్కార్ తొలగిస్తోంది.   అలాంటి పరిస్థితుల్లో నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో అన్న క్యాంటీన్లకు భారీ ప్రజాదరణ దక్కింది. అలాగే స్థానిక ప్రజల కోసం మొబైల్ వైద్యశాలను సైతం ఆయన ప్రారంభించారు. గతంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్.. తన ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు.. రెండు రూపాయిలకే కిలో బియ్యం అందించే పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఈ పథకమే.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని పలు ప్రభుత్వాలు అమలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు... వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. ఆ క్రమంలో గతంలో తమ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అందించిన అన్ని పథకాలు మళ్లీ అమలు చేస్తామని ఆయన క్లియర్ కట్‌గా ప్రజలకు స్పష్టం చేస్తున్నారు. ఇంకోవైపు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం మంగళగిరిలో అన్న క్యాంటీను ఏర్పాటు చేయడమే కాకుండా.. మొబైల్ వైద్యశాలను సైతం ప్రారంభించారు. అలాగే జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానలను సైతం ఆయన బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అన్న క్యాంటీన్ల అంశం టీడీపీ ప్రధాన ప్రచారాస్త్రంగా మారనుందనడంలో ఏటువంటి అతిశయోక్తి లేదనే ఓ చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది.

ఖమ్మంలో సైకిల్ సవారీ

కారు పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. తన కారును దేశవ్యాప్తంగా షికారు చేయించేందుకు దేశ రాజధాని హస్తినలో సమాయత్తమైతే.. సైకిల్ పార్టీ అధినేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. తెలంగాణలో సైకిల్‌ సవారీకి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో డిసెంబర్ 21వ తేదీన ఖమ్మంలో తెలంగాణ టీడీపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు చంద్రబాబు హాజరుకానున్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు చంద్రబాబుతో పాటు ఆ పార్టీ లీడర్ నుంచి కేడర్ వరకు అంతా భారీ ర్యాలీగా వెళ్లనున్నారని సమాచారం. అయితే ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు బాధ్యతను ఇప్పటికే పార్టీలోని పలువురు సీనియర్లకు చంద్రబాబు అప్పగించారని.. అందుకు సంబంధించిన పనులు వారు.. వాయువేగంతో చేస్తున్నట్లు తెలుస్తోంది.    తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్జానేశ్వర్‌ ఇటీవల ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో  బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. అలాగే పార్టీని మళ్లీ ప్రజలకు చేరువ చేసేందుకు అమలు చేయాల్సిన కార్యాచరణపై ఈ సందర్భంగా తెలంగాణలోని పలువురు కీలక నేతలతో చంద్రబాబు భేటీ అయి చర్చించారు. ఆ క్రమంలో ఖమ్మం జిల్లాతోపాటు హైదరాబాద్ మహానగరంలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉందని  అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తొలుత ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని జిల్లా నేతలకు చంద్రబాబు సూచించారు. ఈ నేపథ్యంలోనే ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు టీటీడీపీ నేతలు సమాయత్తమయ్యారు. అదీకాక.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకొంది. కానీ ఆ తర్వాత ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కారు పార్టీలోకి జంప్ కొట్టేసిన సంగతి తెలిసిందే.  మరోవైపు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా పేరు మార్చుకొని.. దేశ రాజధాని హస్తినలో చక్రం తిప్పి..బీజేపీకి ఝలక్ ఇవ్వాలని తెగ ఊవ్విళ్లూరుతోంది. దీంతో గులాబీ పార్టీ ప్రాంతీయ వాదాన్ని పక్కన పెట్టి జాతీయ వాదాన్ని చేపట్టినట్లు అయింది. అలాంటి వేళ.. టీడీపీ సైతం తెలంగాణలో పార్టీ బలోపేతానికి రంగం సిద్దం చేసుకొంటోంది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. సైకిల్ పార్టీలోని కీలక నేతలంతా... కారు పార్టీలో చేరిపోయారు. దీంతో సదరు పార్టీలో నాయకత్వ లేమి కొట్టొచ్చనట్లు కనిపించింది. కానీ సైకిల్ పార్టీలో కేడర్ మాత్రం అలాగే జెండా కర్రలాగా నిలబడి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా..ఆ ఎన్నికల్లో తెలుగు దేశం తన సత్తా చాటుతోంది. తాజాగా కాసాని జ్జానేశ్వర్.. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత.. సైకిల్ సవారీ జోరందుకొందనే ఓ చర్చ అయితే తెలంగాణలో సవారీ చేస్తోంది. మరికొద్ది రోజుల్లో హైదరాబాద్ మహానగరంలో కూడా తెలుగుదేశం పార్టీ భారీ సభ నిర్వహించేందుకు సన్నాహలు చేపట్టనుందని.. దీంతో పార్టీలోని లీడర్ నుంచి కేడర్ వరకు నయా జోష్ వస్తుందనే ఓ టాక్ అయితే పసుపు దళంలో వైరల్ అవుతోంది.

రాహుల్ యాత్రలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ లక్ష్యం వైపుగా అడుగులు వేస్తోంది. నిజానికి భారత్ జోడో యాత్ర  ఇంతలా  ప్రజలను ఆకర్షిస్తున్నదని కానీ, ఇలా ఎక్కడా ఒక చిన్న ప్రతిబంధకం అయినా లేకుండా సాఫీగా సాగిపోతుందని  ఎవరూ ఉహించి ఉండరు. కానీ, ఇంతవరకు యాత్ర జరిగిన ఏ రాష్ట్రంలోనూ యాత్రకు ప్రతిబంధకాలు ఏర్పడలేదు. చివరకు, ప్రస్తుతం యాత్ర సాగుతున్న రాజస్థాన్’లో కాంగ్రెస్ వైరి వర్గాలు కత్తులు దూసుకుంటున్న నేపథ్యంలో యాత్రఫై కాంగ్రెస్ ‘ఇంటర్నల్  ఫైట్’  ప్రభావం ఉంటుందని విశేషకులు భావించారు. ముఖ్యంగా  యాత్ర రాజస్థాన్  లో ప్రవేశించే ముందు, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, అసమ్మతి నేత సచిన్ పైలట్  వర్గాల మధ్య జరిగిన మాటల యుద్ధం, నేపథ్యంలో రాహుల్ యాత్రపై నీలి మేఘాలు కమ్ముకున్న మాట నిజం. అయితే, అంతవరకు ఫైటింగ్ మూడ్  లో ఉన్న గెహ్లాట్, పైలట్ వర్గాలు రాహుల్ రాష్ట్రంలో అడుగు పెట్టే సరికి  ఎదో మంత్రం వేసినట్లు సర్కస్ పులుల్లా సైలెంటై పోయారు.  సరే  ఇంతవరకు సాగిన యాత్ర ఎన్నికల ఫలితాలను అంతగా ప్రభావితం చేయలేక పోయిందనే అసంతృప్తి ఉన్నా, యాత్ర మాత్రం ఎలాంటి ఒడిడుడుకులు లేకుండా సాగిపోతోంది. కాంగ్రెస్‌ నేతలు, ఆ పార్టీ శ్రేణులతో పాటు బాలీవుడ్ తారలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ జోడో యాత్రలో పాల్గొని రాహుల్‌ వెంటన నడిచారు.  బుధవారం డిసెంబర్ 14)ఉదయం సవాయ్‌ మాధోపూర్‌ నుంచి ప్రారంభమైన ‘జోడో యాత్ర’లో పాల్గొన్న ఆర్బీఐ మాజీ గవర్నర్న్.. రాహుల్‌‌తో పలు అంశాల గురించి చర్చించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో రఘురామ్ రాజన్ పాల్గొన్న ఫోటోను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేసింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పాదం కలిపారు.. ద్వేషానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేయడానికి నిలబడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం మనం విజయం సాధించగలమనే నమ్మకాన్ని ఇస్తుంది అని ట్వీట్ చేసింది. రాహుల్ పాదయాత్రలో రఘురామ్ రాజన్ పాల్గొనడంపై బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయా ట్విట్టర్‌లో స్పందించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్‌కు చెందిన ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చేరడం ఆశ్చర్యకరం కలిగించలేదు.తదుపరి మన్మోహన్ సింగ్‌గా తనను తాను అభివర్ణించుకున్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలను తృణప్రాయంగా తోసిపుచ్చాలి. ఇది రంగులు మార్చే అవకాశవాదం అని విమర్శించారు. కాగా, 2013 నుంచి 2016 వరకూ ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన రఘురామ్ రాజన్.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీకి మద్దుతుగా నిలిచిన విషయం తెలిసిందే. ఆయన సైతం పలు సందర్భాల్లో నోట్ల రద్దుపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఇలాంటి నిర్ణయాల వల్ల దీర్ఘకాల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని తాను రాసిన ఓ పుస్తకంలో పేర్కొన్నారు. అంతేకాదు, భారత ఆర్థిక వృద్ధి, ద్రవ్యలోటుపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది కాంగ్రెస్‌ నిర్వహించిన ఓ సదస్సులోనూ పాల్గొన్న రాజన్.. మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని ఉద్యోగ సంక్షోభాన్ని రాజకీయ నాయకులు కప్పిపుచ్చుకోవాలని భావిస్తే శ్రీలంక తరహా పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. కాగా, రాహుల్ సెప్టెంబరు 7న కన్యాకుమారిలో ప్రారంభించిన పాదయాత్ర కశ్మీర్ వరకూ 3,500 కి.మీ. మేర కొనసాగనుంది.

కింగ్ కోహ్లీ సాధిస్తాడా?

బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ జరుగుతోంది. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ విఫలమయ్యాడు. అయితే ఈ సిరీస్ లో కోహ్లీ కనుక ఒక శతకం బాదితే ఓ అరుదైన రికార్డు అతడి ఖాతాలో పడుతుంది. అదేమిటంటే ఒకే క్యాలెండర్ ఇయర్ లో మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన రికార్డు. అంటే టెస్టులు, వన్డేలు, టి20లలో సెంచరీ చేసిన ఘనత సాధించాలంటే.. కోహ్లీ బంగ్లాతో టెస్ట్ సిరీస్ లో సెంచరీ చేయాలి. ప్రస్తుతమున్న ఫామ్ లో కోహ్లీకి అదే మంత పెద్ద విషయం కాదు. ఇప్పటి వరకూ అలా మూడు ఫార్మాట్ లలోనూ ఒకే క్యాలెండర్ ఇయర్ లో సెంచరీ సాధించిన వారిలో మ‌హేలా జ‌య‌వ‌ర్థ‌నే(2010), సురేశ్ రైనా(2010), దిల్షాన్‌(2011), అహ్మ‌ద్ షెహ‌జాన్‌(2014), త‌మీమ్ ఇక్భాల్‌(2016), కేఎల్ రాహుల్(2016), రోహిత్ శ‌ర్మ‌(2017) డేవిడ్ వార్న‌ర్‌(2019), బాబ‌ర్ అజామ్‌(2022) ఇప్ప‌టికే ఈ జాబితాలో ఉన్నారు. వారి సరసన కోహ్లీ చేరాలంటే తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో కానీ, రెండో టెస్టులో కానీ సెంచరీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ ఈ ఏడాది ఆసియా కప్ లో టి20లలో కోహ్లీ సెంచరీ చేశాడు. అలాగే బంగ్లాదేశ్ లో వన్డే సిరీస్ లో భాగంగా జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేశాడు. ఇక టెస్టుల్లో సెంచరీ ఒక్కటే మిగిలింది.  ఇప్పటి వరకూ ఇంటర్నేషనల్ క్రికెట్ లో కోహ్లీ 72 సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. కోహ్లీ కంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఒకే ఒక్కడు సచిన్ టెండూల్కర్. టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేయాలంటే కోహ్లీ మరో 28 సెంచరీలు చేయాల్సి ఉంది. 

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ స్వరం?

దేశం మొత్తంలో తెలుగు రాష్ట్రాల రాజకీయం ఒక ప్రత్యేకత సంతరించుకున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధించి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న ఆసక్తి కంటే జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్రాల రాజకీయం పట్లే ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది. అందుకే గతంలో ఎప్పుడూ లేనంతగా దేశ వ్యాప్తంగా అందరి దృష్టీ తెలుగు రాష్ట్రాలపై పడింది.  నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పుట్టినట్లు చెప్పుకుంటూ.. రాష్ట్రం తెరాస చేతుల్లో ఉంటేనే ‘సేఫ్’ అని చెప్పుకుంటూ వస్తున్న తెరాస ఒక్కసారిగా జాతీయ ప్రయోజనాల కోసం జాతీయ స్థాయిలో కొట్లాడతామని ఢిల్లీకి చేరుకుంది. జాతీయ స్థాయి రాజకీయం అంటే తెలంగాణతో పాటు ఏపీ, కర్నాటకలలో కూడా బీఆర్ఎస్ కాలూనేందుకు ప్రయత్నాలు చేపట్టింది.  తెలంగాణ నినాదాన్ని వదిలేసి కేసీఆర్ జాతీయ నినాదం అందుకోవడంతో  తెలంగాణలో  ఇతర ప్రాంతీయ పార్టీలకు స్కోప్ లేదా స్పేస్ లభించిందనడంలో సందేహం లేదు. రాష్ట్ర విభజన అనంతరం వైసీపీ తెలంగాణలో రాజకీయాలు వదులుకున్నా.. తెలుగుదేశం మాత్రం ఇప్పటికీ ఇక్కడ పార్టీ కార్యక్రమాలు చేపడుతూనే ఉంది. పార్టీకి నాయకుల కొరత ఉన్నా.. కేడర్ విషయంలో మాత్రం గట్టి బలమే ఉంది. అందుకే ఈ సారి ఎన్నికలలో టీడీపీ కూడా తెలంగాణలో  యాక్టివ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే జనసేనాని పవన్ కల్యాణ్ కూడా తెలంగాణలో పోటీకి సై అంటున్నారు.   తెలంగాణలో పోటీకి సిద్ధంగా ఉండాలంటూ ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్ తన క్యాడర్ కు పిలుపునిచ్చేశారు.  ఇప్పటికే 32 నియోజకవర్గాల్లో కార్యనిర్వాహకులను ఎంపిక చేసినట్లు తెలంగాణ జనసేన ఇన్ చార్జి   శంకర్ గౌడ్ వెల్లడించారు. ఆ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటిస్తామన్న ఆయన  మరి కొన్ని  నియోజకవర్గాలలో పోటీ చేసే విషయం యోచిస్తున్నామని వివరించారు. అయితే ఏపీలో  కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్.. తెలంగాణలో తెలుగుదేశం, జనసేన పార్టీలు పోటీకి దిగితే రాజకీయంగా ఇరు రాష్ట్రాలలో ప్రభావం ఎలా ఉంటుందన్న చర్చలు ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో జోరందుకున్నాయి. అలాగే పరిశీలకులు తమ విశ్లేషణలకు పదును పెడుతున్నారు.   ఏపీలో పొత్తుకు సిద్దమవుతున్న జనసేన-టీడీపీ తెలంగాణలో కూడా కలిసి పోటీకి దిగితే ఎలా ఉంటుంది?.. ఒకవేళ వీటికి బీజేపీ కూడా తోడై రెండు తెలుగు రాష్ట్రాలలో  ఉమ్మడిగా రంగంలోకి దిగితే ఏమౌతుందన్న చర్చ తెరపైకి వచ్చింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగితే ఏపీలో ఈ కూటమికి ఎదురే ఉండదనీ, అదే ఫార్ములా తెలంగాణలో కూడా సక్సెస్ అయ్యేందుకే ఎక్కువ అకాశాలున్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుగా పోటీకి దిగితే ఏపీలో వైసీపీకి నష్టమని చాలా కాలంగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక కొత్తగా బీఆర్ఎస్ ఆవిర్బావంతో తెలంగాణలో తెలుగుదేశం, బీజేపీ, జనసేనల పొత్తు.. సమైక్య ముద్రతో ప్రజలకు దూరం అవుతుందా అన్న సందేహాలు కూడా రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. అదే జరిగితే.. పార్టీ పేరు నుంచి తెలంగాణను తీసేసిన కేసీఆర్ బీఆర్ఎస్ కే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని అంటున్నారు. మొత్తం మీద పొత్తు పొడుపులు, రాజకీయ సమీకరణాల విషయంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు రంజుగా మారాయనడంలో సందేహం లేదు. మొత్తంమీద ఈ సారి తెలుగు రాష్ట్రాల రాజకీయాలు జాతీయ స్థాయిలో ఏదో ఒక మేరకు ప్రభావితం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

2022 రౌండప్ .. సమతామూర్తి విగ్రహావిష్కరణ

  ఫిబ్రవరి..    కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. మరి కొద్ది  రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే ... నిన్న జనవరిలో ఏమి జరిగింది తెలుసుకున్నాం .. ఈరోజు ఫిబ్రవరిలోకి వెళదాం రండి ..  జనవరి నెల చివరి రోజు జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి..ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 2022-23వార్షిక బడ్జెట్ నుపార్లమెంట్ కు సమర్పించారు.  ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హైదరాబాద్  లో పర్యటించారు.ఇక్రిసాట్ 50వ స్థాపక దినోత్సవం స్మారక పోస్టల్ స్టాంప్’ ను అవిష్కరించారు.  అదే రోజున హైదరాబాద్ శివార్లలో 12 వందల కోట్ల రూపాయల వ్యయంతో, 45 ఎక‌రాల విస్తీర్ణంలో నిర్మించిన స‌మ‌తామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. స‌మ‌తామూర్తి స్ఫూర్తి కేంద్రంలో 108 అడుగుల సమతాముర్హ్తి, రామానుజుల వారి రెండవ అతిపెద్ద పంచలోహ విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. ప్రధానమంత్రి పాల్గొన్న ఈ రెండు కార్యక్రమాలలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు పాల్గొనలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రధానికి స్వాగతం పలికారు.   ఫిబ్రవరి 6:   ప్రముఖ గాయనీ, భారత రత్న లతా మంగేష్కర్ కన్ను మూశారు. కొవిడ్ నుంచి కోలుకున్న లతాజీ, శ్వాసకోశ సంబంధిత సమస్యలకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందతూ, 6 వతేదీ ఉదయం 8 గంటల ఒక  నిముషానికి తుది శ్వాస విడిచారు. రాజకీయ, సినీ రంగ ప్రముఖులు అనేక మంది ఆమెకు  నివాళులు అర్పించారు. ప్రధాని లతా మంగేష్కర్ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటుగా పలువురు  పేర్కొన్నారు. లతా మంగేష్కర్ మృతి నేపథ్యంలో కేంద్రం రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి, రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై, రాజ్య సభలో జరగిన సుదీర్ఘ చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 8 సమాధాన మిచ్చారు.  వారసత్వ రాజకీయాలు, వారసత్వ రాజకీయ పార్టీలు దేశానికి పెద్ద ముప్పని ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సల్స్ గుప్పిట్లో బందీ అయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు, సిద్ధాంతాలను అర్బన్ నక్సల్స్ నియంత్రిస్తున్నారని ఆరోపించేరు. ధన్యవాదాల తీర్మానాన్ని రాజ్యసభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది. (మార్చి 22 లో ఏమి జరిగింది ..రేపు చూద్దాం)  

బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి కేటీఆర్ డుమ్మా కారణమేంటి?

జాతీయ రాజకీయాలే లక్ష్యంగా గత కొంత కాలంగా వేగంగా అడుగులు వేస్తున్న కేసీఆర్..చివరికి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి జాతీయ రాజకీయాలలో తొలి అడుగు వేసేశారు. తన కొత్త పార్టీ కేద్ర కార్యాలయాన్ని హస్తినలో  బుధవారం (డిసెంబర్ 14) ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలు పార్టీల నాయకులు కూడా హాజరు కానున్నారు. అయితే.. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మాత్రం తన హస్తిన పర్యటనను చివరి నిముషంలో రద్దు చేసుకున్నారు. అలా రద్దు చేసుకోవడానికి జపాన్ కంపెనీ కార్యాలయం ప్రారంభోత్సవమే కారణమని బయటకు చెబుతున్నా.. అసలు కారణం వేరే ఉందని రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఆవిర్బావానికి ముందు నుంచీ కూడా తెరాసలో లుకలుకలు ఉన్నాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా తండ్రీ కొడుకుల మధ్య అంతగా పొసగడం లేదన్న ప్రచారమూ ఉంది. అందుకే కేసీఆర్ ‘జాతీయ’ బాట పట్టారనీ కూడా అంటున్నారు. నిజమే, ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పుడు కాదు, చాలా కాలంగా, జాతీయ రాజకీయాల గురించి ముచ్చటిస్తూనే ఉన్నారు. వ్యూహాలు రచిస్తున్నారు.  ఉపన్యాసాలలో వినిపిస్తున్నారు. నిజానికి, 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యమత్రి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం, ఆ వెంటనే, “ కల్వకుట్ల తారక రామారావు .. అను నేను ... అంటూ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఒకేసారి, ఒక దాని కొకటి సమాంతరంగా సాగుతాయని తెరాస శ్రేణులే కాదు, ఇతర రాజకీయ పార్టీలు కూడా భావిస్తున్నారు. అందులో రహస్యం ఏమీ లేదు. నిజానికి, 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిందే అందుకని అప్పట్లోనే ప్రచారం జరిగింది. అయితే, అది జరగలేదు. ఆ కారణంగానే అప్పట్లో సుమారు ఆరేడు నెలలకు పైగా, మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. ముఖ్యమంత్రి కేసేఆర్, ఉప ముఖ్యమంత్రి ముహ్మదాలీ ఇద్దరే పరిపాలన సాగించారు.  ఇక అక్కడి నుంచి, కేటీఆర్ పట్టాభిషేకానికి ఎన్ని సార్లు సనాహాలు జరిగాయో, ఎన్ని ముహూర్తాలు మురిగి పోయాయో  లెక్కలేదు. నిజానికి ఒక దశలో, తెరాస మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కేటీఆర్ పట్టాభిషేకం గురించి బహిరంగంగానే ప్రకటనలు చేశారు. కానీ, వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నా లే అన్నట్లు కేటీఆర్ పట్టాభిషేకానికి ఎప్పటి కప్పుడు  విఘ్నాలు అడ్డుపడుతున్నాయి. ఈ కారణంగానే తండ్రీ కొడుకుల మధ్య దూరం పెరిగిందని పార్టీ వర్గాల్లో అప్పటి నుంచీ గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ కారణంగానే ఇప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభో త్సవానికి డుమ్మా కొట్టారన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది. 

అయోధ్య మసీదు డిజైన్ ఎలా ఉందంటే..?

వివాదాస్పద అయోధ్యరామజన్మ భూమి అంశం కోర్టులో పరిష్కారం అయిన తరువాత రామమందిర నిర్మాణం జోరందుకుంది. అలాగే కోర్టు సూచనల మేరకు అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి వీలుగా ఐదు ఎకరాల స్థలాన్ని    అయోధ్య సమీపంలోని లక్నో-ఫైజాబాద్ హైవే పక్కన, దన్నిపూర్ గ్రామంలో సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయింపు కూడా జరిగింది. ఆ ప్రదేశంలో మసీదు నిర్మాణం కానుంది. ఇందుకు సంబంధించిన డిజైన్ కూడా రెడీ అయ్యింది.   అయోధ్య డెవలప్ మెంట్ అథారిటీ నుంచి మసీదు నిర్మాణానికి అనుమతి వచ్చింది. ఇక మసీదు నిర్మాణం కూడా జోరందుకుంటుంది. అయితే ఆ స్థలంలో కేవలం మసీదే కాకుండా 200 పడకల హాస్పిటల్ కూడా నిర్మిస్తామని  ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ సెక్రటరీ ఆథర్ హుస్సేన్ తెలిపారు.  ఇందు కోసం మొదటి దశలో రూ.100 కోట్లు, రెండో దశలో రూ.100 కోట్లు మొత్తం 200 కోట్ల రూపాయలు వెచ్చిస్తామని వివరించారు. తాజాగా అయోధ్యలో నిర్మించనున్న మసీదు డిజైన్ ను విడుదల చేశారు. మసీదు ఎలా డబోతోందో ఊహా చిత్రాన్ని కూడా విడుదల చేశారు.  దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చేసేందుకే మసీదు డిజైన్ అద్భుతంగా ఉందనీ, నిర్మాణం పూర్తయితే మరింత బ్రహ్మాండంగా ఉంటుందని అంటున్నారు. 

జేడీ లక్ష్మీనారాయణకు బీఆర్ఎస్ ఆహ్వానం?

సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్, జేడీ లక్ష్మీనారాయణకు పరిచయం అవసరం లేదు. సిబిఐలో ఆయన హోదా (జేడీ)నే ఇంటి పేరుగా మార్చుకున్నఆయన అసలు పేరు, వీవీ లక్ష్మి నారాయణ, వాసగిరి వెంకట లక్ష్మీ నారాయణ. ఆ పేరుతో ఆయన్ని ఎవరూ గుర్తుపట్టక పోవచ్చును కానీ, జేడీ అంటే చాలు, లక్ష్మీనారాయణ కళ్ళ ముందు కనిపిస్తారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జేడీ లక్ష్మినారాయణ వార్తల్లో వ్యక్తిగా, మీడియలో తరచు కనిపిస్తూనే ఉన్నారు. అయితే    ఇప్పడు ఇక్కడ ఆయన ప్రస్తావనకు  ఆయన సిబిఐ బ్యాక్ గ్రౌండ్ కు సంబంధం లేదు. అయితే  అందుకో కారణం వుంది. నో .. ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సిబిఐ విచారణ ఎదుర్కుంటున్న  తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్ కుమార్తె  తెరాస ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత కేసు గురించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు  విశ్లేషణలు, ఇక్కడ ఆయన ప్రస్తావనకు కారణం కాదు.  నిజానికి ఆయన పూర్వాశ్రమంలో ఐపీఎస్ ఆఫీసర్ అయినా సిబిఐ వాసనలు ఆయనను వదలక పోయినా, ఆయన ప్రస్తుతం  ఒక పొలిటీషియన్. రాజకీయ వేత్త. ఆరేడేళ్ళ కిందట స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. జనసేన పార్టీలో చేరారు.  2019 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం లోక్ సభ స్థానం  నుంచి పోటీ చేశారు. ఓడి పోయారు.ఆ తర్వాత జనసేన నుంచి బయటకు వచ్చారు. అయితే అయిన రాజకీయాలను వదిలేయలేదు. మరో పార్టీలో చేరలేదు కానీ రాజకీయాలో మాత్రం కొనసాగుతూనే ఉన్నారు. అంతే కాదు. 2024 లోక్ సభ ఎన్నికల్లో తాను విశాఖ నుంచి మళ్లీ పోటీ చేస్తానని.. ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో చెప్పలేదు. ఇప్పడు అదే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పొలిటికల్ సర్కిల్స్ లో  హాట్ టాపిక్. జేడీ ఏ పార్టీలో చేరతారు అనే విషయం  కట్టప్పను ఎవరు చంపారు  స్థాయిలో టెన్షన్  క్రియేట్ చేస్తోందని అంటున్నారు.  మరో వంక చాలా కాలంగా జేడీ రాజీకీయ భవిష్యత్ ప్రస్థానం గురించి రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కొందరు బీజేపీలో చేరతారని అంటుంటే.. మరికొందరు వైసీపీలో చేరే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇంకొందరు టీడీపీలో చేరొచ్చని చెబుతున్నారు. ఇలా ఎవరికి తోచినట్టు వారు ప్రచారం చేస్తున్నారు. మరోవంక మాజీ జేడి అమ్ ఆద్మీ పార్టీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అదలా ఉంటే  గత నాలుగైదు రోజులుగా జేడీ లక్ష్మినారాయణ రాజకీయ ప్రస్థానం గురించి మరో  బ్రేకింగ్ న్యూస్ వినవస్తోంది.  అవును జేడీ లక్ష్మినారాయణను తమ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్న పార్టీలలో మరో పార్టీ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. తాజాగా జాతీయ రాజకీయ యవనిక పై తెలంగాణ జెండా ఎగరేసే లక్ష్యంతో, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పేరును భారత రాష్ట్ర సమితి ( భారాస) గా మార్చుకున్న  తెలంగాణ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల ‘జాతీయ’ పార్టీ కూడా ఆయనకు స్వాగతం పలుకుతున్నట్లు తెలుస్తోంది. భారాస ఏపీ బాధ్యతలు చూస్తున్నట్లు చెపుతున్న  మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్  మాజీ జేడీతో సంప్రదింపులు ప్రారంభించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే  తలసాని జేడీతో కలవాలని అనుకుంటోంది, అందుకోసంగా ఆయనను ఫోనులో సంప్రదించింది నిజమే అయినా ఆయనని పార్టీలోకి ఆహ్వానించేందుకు కలవాలనుకుంటున్నారా  లేక కవిత కేసులో సలహాలు తీసుకునేందుకు కలవాలని అనుకుంటున్నారా? అనేది స్పష్టం కావలసి ఉందని అంటున్నారు. నిజానికి, ఈ అనుమానంతోనే కావచ్చును జేడీ లక్షినారాయణ  ఏ పార్టీలో చేరాలనే విషయంలో ఇంకా ఒక ఆలోచనకు రాలేదని  సున్నితంగా తలసానికి నో .. చెప్పినట్లు తెలుస్తోంది.  అదలా ఉంటే, ఇంతవరకు పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ పై అంతగా దృష్టి పెట్టని  కేసీఆర్  ఇప్పడు ఏపీ, కర్ణాటక రాష్ట్రాలపై దృష్టిని  కేంద్రీకరించారని  ఏపీలో ముఖ్యంగా కాపు వర్గం పై దృష్టి పెట్టారని  అంటున్నారు. అందులో భాగంగానే  యాదవ్ సామాజిక వర్గానికి చెందిన  మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో కోడి పందేల బంధుత్వాలు, టీడీపీ రాజకీయ చుట్టరికాలు ఉన్న తలసాని శ్రీనివాస రావుకు ఏపీ బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. అందులో భాగంగానే కాపు సామాజిక వర్గానికకి చెందిన జేడీ లక్ష్మీనారాయణతో సంప్రదింపులు ప్రారంభించి నట్లు తెలుస్తోంది. అయితే  ఈసారి ఎలగైనా గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టాలని గట్టిగా భావిస్తు జేడీ లక్ష్మీనారాయణ అసలు  ఏ పార్టీలోనూ చేరక పోవచ్చని  చివరకు ఒక జాతీయ పార్టీ ప్రత్యక్ష, మరో ప్రాంతీయ పార్టీ పరోక్ష మద్దతుతో విశాఖ నుంచి ఇండిపెండెంట్  గా పోటీ చేసే ఆలోచన నడుస్తోందని అంటున్నారు. నిజానికి  స్వయంగా జేడీ లక్ష్మినారాయణ కూడా  ఒక ఇంటర్వ్యూలో ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం లేకపోలేదని సూచన ప్రాయంగా చెప్పారు.  కర్ణాటకలో సినీనటి సుమలత అంబరీష్ ఎంచుకున్న మార్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, ఇండిపెండెంట్ గా  పోటీ చేస్తే అందరి  మద్దతు పొందే అవకాశం ఉంటుందని ఆయన అత్యత సన్నిహిత మిత్రులు అంటున్నారు.  సో .. జేడీ భారాస లో  చేరతారా, లేదా, అనేది ఇప్పట్లో తేలే విషయం కాదు. సస్పెన్స్ ఇంకా కొనసాగుతుందనే అనుకోవచ్చును.