తాజ్ మహల్ మూసేస్తారా?

ప్రపంచంలోని ఎడు  వింతల్లో ఒకటైన తాజ్ మహల్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్ మహల్ ఇకపైన పర్యాటకుల సందర్శనకు అందేబాటేలో ఉండదా? అంటూ ఔననే అంటోంది ఉత్తర ప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. కారణమేమిటంటే..ఏళ్ల తరబడి ఆస్తి పన్ను, నీటి పన్ను, సేవా పన్ను బకాయిలు పేరుకు పోవడం. వీటిని పక్షం రోజులుగా చెల్లించకుంటే.. తాజ్ మహల్ కు తాళం వేసేస్తామని యోగి సర్కార్ తాఖీదు ఇచ్చింది. దేశ ప్రతిష్టకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన కట్టడాన్ని మూసివేయడమే లక్ష్యం అన్నట్లుగా ఆ తాఖీదు ఉంది. ఇంతకీ విషయమేమిటంటే తాజ్ మహల్ బాగోగులు చూసుకునే పురావస్తు శాఖ ప్రభుత్వానికి తాజ్ మహల్ కు సంబంధించి 5 కోట్ల సేవా పన్ను, 2 కోట్ల నీటి పన్ను, అలాగే ఒకటిన్నర కోట్ల ఆస్తి పన్ను బకాయిపడింది. దీనిని పదిహేను రోజుల్లోగా చెల్లించాలని   ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్, కంటోన్మెంట్ బోర్డు జమిలిగా తాఖీదులు జారీ చేశాయి.  అయితే ఇందుకు పురావస్తు శాఖ శసేమిరా అంటోంది. పురాతన కట్టడాలకు, చారిత్రక కట్టడాలకు టాక్సులు కట్టడమేమిటి? చాన్సే లేదని సమాధానం ఇచ్చారు. అయితే ఇంకో రాష్ట్రం ఇంకో రాష్ట్రం అయితే ఊరుకుంటుందేమో.. కానీ యూపీలో ఉన్నది బుల్ డోజర్ సర్కార్.. యోగి సర్కార్ ఊరుకుంటుందా.. అంటే ఊరుకోదనే సమాధానమే వస్తుంది ఎవరి నుంచైనా. ఈ తాఖీదుల వ్యవహారం చూస్తుంటే తాజ్ మహల్ కు తాళం తప్పదా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

చంద్రబాబు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్లు చెల్లుతాయి!

ఏపీ సీఎం జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయానికీ కోర్టుల్లో చుక్కెదురౌతున్న పరిస్థితీ ఉంది. అదే తెలుగుదేశం హయంలో అంటే చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయం అన్ని విధాలుగా న్యాయ సమీక్షకు నిలబడే విధంగా ఉంటుంది. ఈ విషయం మరోసారి రుజువైంది. చంద్రబాబు హయంలో ఏపీలో కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన సంగతి తెలిసిందే. అలా రిజర్వేషన్లు కల్పించడం చట్టబద్ధమేననీ, చంద్రబాబు హయాంలో కాపులకు  ఇచ్చిన 5శాతం రిజర్వేషన్లు చెల్లుతాయనీ కేంద్రం విస్పష్టంగా చెప్పింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు సమాధానం ఇచ్చింది.  దీంతో చంద్రబాబు హయాంలో ఇచ్చిన కాపు  రిజర్వేషన్ ఇప్పుడు అమలవుతుందని, జగన్ సర్కార్ అమలు చేస్తుందని అనుకుంటే అది భ్రమే అవుతుంది. ఎందుకంటే.. ఆ రిజర్వేషన్లను జగన్ సర్కార్ రద్దు చేసింది.  మూడున్నరేళ్ల కిందట జగన్ అధికార పగ్గాలు చేపట్టగానే చంద్రబాబు హయాంలో కాపులకు ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది.  అయితే అప్పట్లో  కాపులు కానీ, ఆ సామాజిక వర్గానికి చెందిన వైపీసీ నేతలు కానీ దీనిపై ఎలాంటి  అభ్యంతరం వ్యక్తం చేయలేదు.  గతంలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ..టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. అయితే అప్పట్లో కేంద్రం దీనిని అంగీకరించలేదు.  సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదన్న నిబంధన ను ప్రస్తావిస్తేూ పక్కన పెట్టేసింది.   కేంద్రం మాత్రం ఆర్థికంగా వెనుకబడిన ఓసీల కోసం పది శాతం రిజర్వేషన్లను అందుబాటులోకి తెచ్చింది.  దీంతో చంద్రబాబు ముందు చూపుతో  ఆలోచించి.. ఏపీలో ఆ రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ.. అసెంబ్లీలో తీర్మానం చేశారు. అమలు కోసం జీవో కూడా జారీ చేశారు. ఇచ్చారు. గవర్నర్ ఆమోద ముద్ర కూడా పడింది.   అయితే ఎన్నికలు జరిగి జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే..  ఈ రిజర్వేషన్లు సాధ్యం కావని.. చెల్లుబాటు కావనీ పేర్కొంటూ   రద్దు చేసేశారు. భారీ మెజార్టీతో గెలిచిన ఊపులో ఉన్న వైసీపీ నేతలు.. చివరికి కాపు నేతలు కూడా   రిజర్వేషన్ల ఫలాన్ని తీసేస్తూంటే.. నోరెత్తలేదు. దాంతో కాపు సామాజిక వర్గం అంది వచ్చిన ఫలాన్ని జారవిడు చుకున్నట్లైంది. ఇప్పటికైనా వైసీపీలోని కాపు నేతలు  తమ ప్రజల ప్రయోజనాలు.. యువత ఉద్యోగావకాశాలు..విద్యావకాశాలు ఇతర విషయాల్లో మేలు జరిగేందుకు .. గత ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లను పునరుద్ధరించాలన్న డిమాండ్ చేయాలి. కాపు సామాజిక వర్గం కూడా గత ప్రభుత్వం తమకు కల్పించిన రిజర్వేషన్ ను ప్రస్తుత ప్రభుత్వం పునరుద్ధరించాలన్న డిమాండ్ తో జగన్ పై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. 

కరోనా విజృంభణ.. ఆందోళనలో ప్రపంచ దేశాలు

కరోనాపై మానవాళి విజయం అంటూ ప్రకటించి... ఇక మాస్కులు ధరించనవసరం లేదని ప్రపంచ ఆరోగ్య శాఖ చెప్పడం ఎంత తప్పిదమో ఇప్పుడు అర్ధమౌతోంది. కరనో మహమ్మారిపై జయంచేశామని  నిర్లక్యంగా వ్యవహరిస్తున్న వేళ చైనాలో మళ్లీ మొదలై ప్రపంచ దేశాలను చుట్టేయడానికి కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచం అంతా కరోనా నుంచి విముక్తి  పొందామని భావిస్తున్న వేళ చైనాలో  మహమ్మారి మళ్లీ కోరలు సాచింది. అక్కడ నుంచి జపాన్, కొరియా దేశాలకు విస్తరించింది. భారత్ లోనూ అడుగుపెట్టింది. స్వల్ప వ్యవధిలోనూ ప్రపంచాన్ని చుట్టేస్తుందన్న ఆందోళన వ్యక్తమౌతుంది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం వచ్చే 90 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 10 శాతం మంది జనాభాకు కోవిడ్ సంక్రమించే అవకాశం ఉంది.  ఇక భారత్ విషయానికి వస్తే ఇప్పటి వరకూ జీరో కోవిడ్ పరిస్థితి  లేకపోగా కొత్తగా 112 కేసులు నమోదయ్యాయి. 3,490 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి.   ఈనేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.

జయప్రదకు నాన్ బెయిలబుల్ వారంట్

సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ఆమెకీ వారంట్ ను రాంపూర్ స్పెషల్ కోర్టు జారీ చేసింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ సందర్భంగా ఆమె వరుసగా కోర్టుకు గైర్హాజర్ అవుతూ వచ్చారు. ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా ఆమె హాజరు కాకపోవడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు తదుపరి విచారణ సమయానికి ఆమెను కోర్టులో హాజరు పరచాలని పోలీసులకు ఆదేశిస్తూ జయప్రదపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది.  తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, బెంగాళీ, కన్నడ భాషల్లో 300కు పైగా సినిమాల్లో జయప్రద నటించారు.రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, చంద్రమోహన్ తదితర హీరోలతో  నటించారు.  సీనియర్ ఎన్టీఆర్ పిలుపుతో సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఏపీ ప్రజలకు సేవ చేయాలని భావించినా అనూహ్యంగా ఉత్తరప్రదేశ్ కు వెళ్లారు. రాంపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉన్నారు.

తెలంగాణలో తెలుగుదేశం.. అదే ఆదరణ.. అదే ప్రభంజనం

ఒక రాజకీయ పార్టీ తెలంగాణలో గత ఎనిమిదిన్నరేళ్లలో నామమాత్రంగానే కార్యక్రమాలు నిర్వహించింది. ఈ ఎనిమిదిన్నరేళ్లలో ఒక్క ఎన్నికలో గెలిచింది లేదు. ఉన్న నాయకులంతా వేరే వేరే పార్టీలోని జంపింగ్ చేసేశారు. కార్యకర్తలు దిశా నిర్దేశం లేక నిస్తేజంగా మిగిలిపోయారు. ఆ పార్టీ తెలుగుదేశం. తెలంగాణలో తెలుగుదేశం పనైపోయిందన్నవారే అందరూ. చివరకు స్థానిక ఎన్నికల్లో కూడా తెలుగుదేశం జెండా కనిపించని పరిస్థితి. తెలుగుదేశం ఉనికి తెలంగాణలో నామమాత్రమన్న విశ్లేషణలు వచ్చాయి. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం జోరు తగ్గింది. హైదరాబాద్ సహా తెలంగాణ ప్రతి అభివృద్ధి మలుపులోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం చేపట్టిన కార్యక్రమాలు, అవలంబించిన విధానాలూ కారణమని అంతా అంగీకరిస్తారు. రాష్ట్ర ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఒక సందర్భంలో స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. అయినా తెలంగాణలో తెలుగుదేశం పని అయిపోయిందనే అంతా భావించారు. అయితే తెలుగుదేశం కార్యకర్తలు చెక్కు చెదరలేదనీ, వారికి దిశా నిర్దేశం చేయడానికి రాష్ట్ర నాయకత్వమే లేదనీ కూడా చెబుతూ వచ్చారు.  ఔను నిజమే రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ  తెలంగాణలో దాదాపుగా ఉనికి కోల్పోయింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కొందరు నేతలు అప్పటి టీఆర్‌ఎస్‌లో చేరగా, మరికొందరు విభజన తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. దాంతో తెలంగాణలో టీడీపీకి సరైన నాయకత్వం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ పుంజుకోవడంపై పార్టీ అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. పార్టీకి నాయకులు హ్యాండ్ ఇచ్చినా.. కార్యకర్తలు ఇంకా తెలుగుదేశంతోనే ఉన్నారని ఆయన నమ్మారు. ఆ నమ్మకమే నిజమని బుధవారం ఖమ్మంలో జరిగిన తెలుగుదేశం సభ నిరూపించింది. తెలంగాణలో తెదేపా ఎక్కడుందన్న వారికి ఈ సభే సమాధానం చెప్పింది. ఈ సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఎక్కడా ఎవరినీ విమర్శించకుండానే.. తెలంగాణతో తెలుగుదేశం అనుబంధాన్ని గుర్తు చేశారు. విమర్శలు లేవు, పరుష వాక్యాలు లేవు.. ఆయన మాట్లాడిందంతా తెలుగుదేశం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తన విజన్ తో సాధించిన ప్రగతి, భవిష్యత్ తరాల ప్రయోజనం గురించి వేసిన బాటల గురించే. అయినా సభకు హిాజరైన అశేష జనవాహిని ఆయన ప్రసంగాన్ని శ్రద్ధగా వింది.జేజేలు  పలికింది.  తెలంగాణ ప్రగతిలో అడుగడుగునా తెలుగుదేశమే ఉదన్న విషయాన్ని ప్రస్తావించారు. మూడు దశాబ్దాలు ముందు చూపుతో భవిష్యత్ ను నిర్మించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని చాటారు. అసలు తెలుగుదేశం పుట్టిందే తెలంగాణ గడ్డపై అని ఉద్ఘాటించారు. తెలంగాణ అభివృద్ధి చరిత్రలో తెలుగుదేశందే సింహ భాగమని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రగతికి బాటలు వేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందిన ఐఎస్బీ హైదరాబాద్ కు రావడానికి కారణం తనేనని చెప్పారు.  బెంగళూరుతో పోటీపడి మరీ ఐటీ రంగాన్ని హైదరాబాద్ లో అభివృద్ధి చేశామన్నారు. తాను కాలికి బలపం కట్టుకుని మరీ ఐటీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చానన్నారు. ఇదంతా యువత భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకునే చేశానన్నారు. తన కృషి వల్లే ఐటీ ఆయుధం మన తెలుగుయువత చేతికి వచ్చిందన్నారు. సంపద సృష్టించి యువతకు ఉపాధి కల్పించేలా తీసుకు వచ్చిన విషయాన్ని చెప్పారు. కొవిడ్‌కు టీకా కనిపెట్టిన భారత్‌ బయోటెక్‌ను హైదరాబాద్ కు తీసుకువచ్చింది తెలుగుదేశమేనని వివరించారు. నాలుగు దశాబ్దాల తెలుగుదేశం భవిష్యత్  ప్రగతిని పునాదులు వేసిందని, వెస్తుందనీ చెప్పారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు శక్తి అన్నారు. ఆయన తెలుగుజాతి గుండె చప్పుడు. ఆయన విగ్రహం ముందు నిలబడి సంకల్పం చెప్పుకుంటే.. చాలు అది నెరవేరుతుందని చంద్రబాబు అన్నారు. ఇటీవలి కాలంలో మళ్లీ ఉభయ రాష్ట్రాలూ ఎకం అవుతాయంటూ కొందరు చేస్తున్న వాదనను ఆయన తోసిపుచ్చారు. బుద్ధి లేని వాళ్ల మాటలు పట్టించుకోవద్దు.. రెండు తెలుగు రాష్ట్రాలూ ఎప్పటికీ కలిసే అవకాశం లేదనని కుండ బద్దలు కొట్టారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా.. దేశంలోనే ఆదర్శ రాష్ట్రాలుగా నిలవాలన్నది తెలుగుదేశం అభిమతమన్నారు. తెలుగు రాష్ట్రాలు దేశంలో తొలి రెండు స్తానాల్లో నిలవాలన్నదే తన ఆకాంక్ష అన్నారు.  ఘనచరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఖమ్మంలో నిర్వహించిన తెలుగుదేశం శంఖారావం  సభ నాంది పలుకుతుందని చెప్పారు.  తానెప్పుడూ అధికారం కోరుకోలేదని..  ప్రజల అభిమానం మాత్రమే కోరుకున్నానన్నారు. వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీదేనని చంద్రబాబు చెప్పారు. వెనుకబడిన, బడుగు బలహీన వర్గాల నాయకులను తయారు చేశామన్నారు.  తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడుందని అడిగే వాళ్లకు ఖమ్మం బహిరంగ సభే సమాధానమిస్తుందని పేర్కొన్నారు.  ఎస్‌ఎల్‌బీసీ, బీమా, నెట్టెంపాడు, ఎస్‌ఆర్‌ఎస్‌పీ, దుమ్ముగూడెం ప్రాజెక్టులు నిర్మించిన ఘనత తెదేపా ప్రభుత్వానిదేనని వివరించారు.  వేర్వేరు కారణాలతో పార్టీని విడిచివెళ్లిన వారంతా మళ్లీ తిరిగి రావాలని ఆహ్వానం పలికారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు లేకున్నా ఇంత ప్రజాబలం తెదేపాకు ఉందంటే అది కార్యకర్తల వల్లేనన్నారు.    ఖమ్మం శంఖారావం స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించేందుకు తెలుగుదేశం నిర్ణయించింది.  బహిరంగ సభకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక వాహనశ్రేణిలో వచ్చిన చంద్రబాబుకు ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.  అడుగడుగునా పార్టీ కార్యకర్తలు, ప్రజలు చంద్రబాబుకు స్వాగతం పలికారు.  ఖమ్మంలో జరిగిన సభకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.  

జగన్ ఆశలు ఆవిరి?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి   జగన్  వచ్చే ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ స్థానాలు.. అంటే అటు ఇచ్చాపురం నుంచి ఇటు తడ వరకు.. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే చంద్రబాబు పోటీ చేసే కుప్పం, నారా లోకేశ్ పోటీ చేసే మంగళగిరితోపాటు జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే.. అన్ని స్థానాలు హోల్ సేల్‌గా ఫ్యాన్ పార్టీ ఖాతాలో గంపగుత్తగా పడిపోతాయంటూ కలలు కంటున్నారు. గడప గడపకు మన ప్రభుత్వ సమీక్షా కార్యక్రమంలో లీడర్ నుంచి కేడర్ వరకు అందరికీ ఇదే మాట పదే పదే చెబుతూ వస్తున్నారు. నేను బటన్ నొక్కుతూ సొమ్ములు పందేరం చేస్తున్నాను. ఓట్లు మనకు కాక ఇంకెవరికి పడతాయి.. మీరు గడప గడపకూ వెళ్లి నేను చేస్తున్న బటన్ నొక్కుడు సంక్షేమాన్ని వివరించండి అని చెప్పిందే చెబుతూ వస్తున్నారు. కానీ వాస్తవంగా జగన్ ప్రభుత్వం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు. ఆ పార్టీ పట్ల ఏ స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం పేరుకుపోయింది అన్నది ఆయన గమనించడం లేదు... తన పార్టీ  ఎమ్మెల్యేలు, నాయకులనూ కూడా గమనించొద్దు అంటున్నారు. అయితే జగన్ కంటున్నవన్నీ పగటి కలలేనని తాజా నివేదిక ఒకటి తేటతెల్లం చేసింది. కేంద్రానికి అందిన ఆ నివేదిక ప్రకారం జగన్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాల సంగతి అటుంచి ఓ 20 స్థానాలలో గెలవడం కూడా కష్టమేనన్నది ఆ నివేదిక సారాంశం. వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ మహా గెలిస్తే ఓ 15 నుంచి 19 స్థానాలలో గెలవవచ్చని కేంద్ర నిఘావర్గాల నివేదిక పేర్కొందని అంటున్నారు. ఆ నివేదికలో జగన్ పార్టీ జాతకం అంతా పక్కాగా ఉందని సమాచారం. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఉన్న ప్రజాదరణ.. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత లేదని.. దీంతో గత ఎన్నికల నాటితో పోలిస్తే ఆయన గ్రాఫ్   22 శాతానికి పడిపోయిందని..   ప్రస్తుతం ఆయనకు 29 శాతం మేర ప్రజల మద్దతు ఉన్నా..  వచ్చే ఎన్నికల నాటికి ఈ శాతం మరింత తగ్గే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయనీ.. కేంద్ర నిఘా వర్గాల నివేదికలో స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. నేను ఉన్నాను.. నేను విన్నానంటూ... ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ 341 రోజుల పాటు చేసిన పాదయాత్రలో ప్రతిరోజు చెప్పిందే .. చెప్పుకొంటూ వెళ్లారు... అలాగే అదే సమయంలో జనాన్ని హామీల సునామీతో ముంచేశారు. కానీ  జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. నాడు పాదయాత్రలో వైయస్ జగన్ చెప్పిన దానికి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న దానికి   ఫొంతన లేదు. ఈ విషయంలో ఇఫ్పటికే ప్రజలు ఓ క్లారిటీకి  వచ్చేశారు. అలాగే జగన్ అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో రాష్ట్రంలో ఎక్కడ ఎంత అభివృద్ధి జరిగిందంటే.. అందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ సైతం సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందని ఆ సదరు నివేదిక స్పష్టం చేసిందని సమాచారం. అదీకాక వచ్చే ఎన్నికల వేళ.. ప్రజల్లోకి వెళ్లితే.. మేము చేసిన అభివృద్ధి ఇదీ అంటూ.. ప్రజలకు వివరించాల్సి ఉంటుందని... అలా వివరించేందుకు  జగన్ పాలనలో ఒక్కటంటే ఒక్క అంశం కూడా లేదని... అలాంటి పరిస్థితుల్లో జగన్ పార్టీకీ ఓట్లు పడే అవకాశం అయితే లేవని ఆ నివేదిక పేర్కొన్నట్లు తెలుస్తోంది.   మరోవైపు.. గత ఎన్నికల వేళ.. జగన్ విజయం కోసం.. తల్లి,చెల్లే కాదు.. టాలీవుడ్‌లోని పలువురు నటీ నటులు, వివిధ రంగాల ప్రముఖులు  ముందుకు వచ్చి..  ప్రచారం చేశారని.. దీంతో జగన్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడక అయిందని..  కానీ వచ్చే ఎన్నికల వేళ.. వైయస్ జగన్‌కు అంత సీన్   లేదని సదరు నివేదికలో స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే వివేకా హత్య కేసు, కోడి కత్తి కేసులు సైతం ఒక కొలిక్కి రాకుండా.. కొన.... సాగుతోండడంపై ఇప్పటికే..   జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో సందేహాల నీడలు అలుముకున్నాయని... అలాగే నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి క్రైమ్ రేట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. నెంబర్ వన్ స్థానంలో ఉందని.. ఇక విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి.. కేంద్ర  నుంచి రావాల్సిన వాటిపై పోరాటం చేయకపోవడం.. అలాగే విభజన కారణంగా.... తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై సీఎం కేసీఆర్‌ను సైతం వైయస్ జగన్ పెదవి తెరచి అడగకపోవడం వంటి అంశాలు సైతం సదరు నివేదికలో స్పష్టంగా పొందు పరిచి ఉన్నట్లు తెలుస్తోంది. సదరు నివేదిక కేంద్రానికి అందిన విషయం తెలుసుకొన్న అధికార ఫ్యాన్ పార్టీలోని పలువురు కీలక నేతలు.. కొంత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదే అంశం బయటకు పొక్కి.. సోషల్ మీడియలో సైతం వైరల్ అవుతుండడంతో... నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మరి వచ్చే 30 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీలో నేను సీఎంగా ఉండాలి.. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు ఫ్యాన్ పార్టీ రెక్కలపై వాలి పోవాలంటే మాత్రం ఇంకా ఏదో ఒకటి చేయాలని ఆ పార్టీ అధినేత వైయస్ జగన్‌కు ఉచిత సలహా అందిస్తున్నారీ నెటిజన్లు. మరి వైయస్ జగన్ ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.

ఏపీ ఆర్ధిక విధానాలు అధ్వానం

ఏపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం గురించి అందరూ మాట్లాడుతున్నారు. అయితే ఆ ఆరచకత్వాన్ని నిరోధించడానికి చేయాల్సినది మాత్రం చేయడం లేదు. అప్పులు వాటిని తీర్చడానికి మళ్లీ అప్పులు, ఉచిత పందేరాలకు అప్పులు.. అవీ సరిపోక పథకాల లబ్ధిదారుల సంఖ్యలో కోతలు. బటన్ నొక్కితే ఓట్లు రాలే మంత్రం కనిపెట్టాశానంటున్న ముఖ్యమంత్రి జగన్.. ఉద్యోగులకు సమయానికి జీతం ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా గుర్తించడం లేదు. పిఛనర్లకు పించన్ల విషయమూ పట్టించుకోవడం లేదు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని కూడా భావించడం లేదు. దీంతో రాష్ట్రంలో అన్ని వర్గాలూ ఆందోళన బాట పట్టాయి. గత మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంది. ఇది రహస్యం కాదు. అందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వానికి చెక్ పెట్టి నియంత్రించి దారిలో పెట్టాల్సిన కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చోలేదు. అన్ని విధాలుగా సహకరిస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా పేరెత్తకుండా రాష్ట్రంలో ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితుల గురించి సన్నాయి నొక్కులు నొక్కుతూ పరోక్ష విమర్శలు చేస్తున్నది. తాజాగా పార్లమెంటులో కేంద్రం విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ పేరు ప్రస్తావించకుండా.. ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటూ జీతాలు సమయానికి ఇవ్వలేని పరిస్థితికి వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులంతా నిరసనలు చేస్తుంటే.. ఆ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తో.. తమ పథకాల ప్రచారానికి మాత్రం భారీ మొత్తం వెచ్చించి మరీ ప్రకటనలు గుప్పిస్తోందని విమర్శించారు. ఉచితాలను తప్పుపట్టడం లేదు కానీ.. ఆదాయం లేకుండా అప్పులు చేసి మరీ పందేరం చేయడం సరికాదన్నారు. ఏపీ పేరు ప్రస్తావించకపోయినా.. ఆమె ఈ విమర్శలు, వ్యాఖ్యలు చేసింది ఏపీని ఉద్దేశించేనని ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. సభలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు.   ఏపీలో ఆదాయం పెరగలేదు.. ఖర్చులు మాత్రం రెట్టింపు అవుతున్నాయి.  కార్పొరేషన్ల పేరుతో అడ్డగోలుగా అప్పులు చేస్తోంది.  ఆర్బీఐకి దృతరాష్ట్రుడిలా అనుమతులు ఇచ్చేస్తోంది. ఈ విషయాలన్నీ తెలసీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం పరోక్ష విమర్శలతో సరిపెట్టేస్తోంది. ఇందుకు కారణం రాజకీయం అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. పరోక్షంగా అన్ని విధాలుగా ఏపీ ఆర్థిక వినాశనానికి సహకరిస్తూ.. పరోక్షంగా విమర్శలు హెచ్చరికలతో సరిపెట్టేసి తమ నిర్వాకాన్ని  కప్పిపుచ్చుకోవాలని కేంద్రం చూస్తోందనడానికి తాజాగా విత్తమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు మరో నిదర్శనం.

ఏపీకి చంద్రబాబే దిక్కు.. డీఎల్ రవీంద్రారెడ్డి

ఏపీకి చంద్రబాబే దిక్కు అంటూ వైసీపీ నాయకుడొకరు సంచలన వ్యాఖ్యలు చేశారు.ముఖ్యమంత్రి జగన్ సామాజిక వర్గానికీ, జగన్ సొంత జిల్లాకు చెందిన ఆ నాయకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుత అస్తవ్యస్థ పరిస్థితి నుంచి ఏపీని గట్టెక్కించాలంటే చంద్రబాబే దిక్కు.. ఈ మాట అన్నది ఏ తెలుగుదేశం నాయకుడో కాదు.. సాక్షాత్తూ వైసీపీ నేత. రాయలసీమలో గుర్తింపు ఉన్న నాయకుడు డీఎల్ రవీంద్రారెడ్డి. ఔను డీఎల్ రవీందరారెడ్డి బుధవారం (డిసెంబర్ 21) కడపలో మీడియా సమావేశం పెట్టి మరీ సొంత పార్టీపైనా, పార్టీ అధినేతపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ పై విమర్శించడానికి ఆయన ఎంచుకున్న భాష.. వైసీపీ నాయకులలో వస్తున్న మార్పునకు తార్కానంగా చెప్పుకోవచ్చు. ఎక్కడా పరిధి మీరకుండానే జగన్ అవినీతిని ఎండగట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడని అనుకోలేదని సున్నితంగానే అయినా నషాళానికి అంటేలా ఘాటుగా విమర్శించారు. ఇంత విమర్శలు గుప్పిస్తున్న తనను పార్టీ నుంచి బహిష్కరించడం వల్లే తాను ఇలా విమర్శలు గుప్పిస్తున్నానని అనుకుంటారో ఏమో అన్నట్లుగా తాను ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నానని, వాళ్లేం తనను పార్టీ నుంచి తీసేయలేదనీ స్పష్టత ఇచ్చారు. జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచీ అవినీతి పాలనే సాగిస్తున్నారని దుయ్యబట్టారు. తమ పార్టీ   వచ్చే  ఎన్నికలలో సింగిల్ డిజిట్ స్థానాలలోనే గెలుస్తుందని జోస్యం చెప్పారు. 2019 ఎన్నికలకు ముందు తన ఇంటికి మనుషులను పంపి బతిమాలి పార్టీలో చేర్చుకున్నారని రివీల్ చేసిన డీఎల్ రవీంద్రారెడ్డి.. .జగన్ పాలన అవినీతి మయం అన్నారు. ఈ పార్టీలో ఉన్నందుకు తన మీద తనకే అసహ్యం వేస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు తప్ప మరెవరూ రాష్ట్రాన్ని కాపాడలేరని డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఒంటరి పోరు సాగిస్తున్న డాక్టర్ సునీత ధైర్యాన్ని అభినందించాల్సిందే అన్నారు. జనవరి 3 నుంచీ వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మార్పులు ఉంటాయని అన్నారు. గత ఎన్నికల ముందు తనను బతిమలాడి జగన్ పార్టీలో చేర్చుకున్నారనీ, ఆ సందర్బంగా ఎంతో ఆదర్శవంతంగా మాట్లాడారనీ డీఎల్ వివరించారు. తనకు తండ్రిని మించిన పేరు తెచ్చుకోవాలన్న ఆకాంక్ష తప్ప మరే కోరికలూ లేవని జగన్ అన్నారనీ, కానీ పాలన మొదలు పెట్టిన క్షణం నుంచీ జగన్ పాలన అంతా అవినీతేనని డీఎల్ విమర్శించారు. జనసేనాని నిజాయితీ పరుడే కానీ పాలనాదక్షత ఉందని తాను భావించడం లేదన్నారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు కలిసి పని చేస్తే ఏపీకి మేలు జరుగుతుందన్నారు. 

నా కంటే పెద్ద మూర్ఖుడెవరు?.. ఎలాన్ మస్క్

ట్విట్టర్ సీఈవోగా తాను ఉండాలా? వద్దా అంటూ ఎలాన్ మస్క్ నిర్వహించిన పోల్ లో అత్యధికులు ఆయన సీఈవోగాతప్పుకోవాలని ఓటేశారు. దీంతో హతాశుడైన మస్క్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టడానికి నా కంటే మూర్ఖుడెవరైనా దొరకాలిగా.. దొరకగానే తప్పుకుంటానంటూ ట్వీట్ చేశాడు. ట్విట్టర్ సీఈవోగా తాను తప్పుకునే ప్రశక్తే లేదని చెప్పకనే చెప్పాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మస్క్ కంటే మూర్ఖుడు దొరికే అవకాశమే లేదంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.  ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ఏ ముహూర్తాన ట్విట్టర్ పగ్గాలు తీసుకున్నాడో ఆ క్షణం నుంచీ అత్యంత వివాదాస్పదుడిగా మారిపోయాడు. కేవలం టెస్లా అధినేతగా ఉన్నంత కాలం ఎలాన్ మస్క్ విషయంలో ఎలాంటి వివాదాలూ లేవు. కానీ ఎప్పుడైతే ట్విట్టర్ పగ్గాలు అందుకున్నాడో ఆ క్షణం నుంచీ ప్రపంచంలో అత్యంత వివాదాస్పదుడైన పారిశ్రామిక వేత్తగా మారిపోయాడు. ట్విట్లర్ లో వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకడం నుంచీ ట్వీట్టర్ విధానాలలో మార్పులు చేయడం వరకూ, తన విధానాలను వ్యతిరేకించే జర్నలిస్టుల ఖాతాలను ట్విట్టర్ నుంచి తొలగించడం నుంచి.. ఉద్యోగుల ఉద్వాసన కొనసాగుతుందని ప్రకటించడం వరకూ ఎలాన్ మస్క్ ప్రతి చర్యా, ప్రతి అడుగూ వివాదాస్పదంగానే తయారైంది. అయితే తాజాగా ట్విటర్  వ్యవహారాలపై తనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతుండటంతో  ఎలాన్ మస్క్ అంతర్మథనంలో పడ్డారు. ట్విట్టర్ సీఈవోగా కొనసాగాలా వద్దా అన్న మీమాంశలో పడ్డారు. తాను ట్వట్టర్ సీఈవోగా కొనసాగాలా వద్దా అంటే ట్విట్టర్ లో ఓ పోల్ పెట్టాడు. అందులో 58 శాతానికి పైగా ఎలాన్ మస్క్ వైదొలగాలనే ఓటు చేశారు. ఓ 42 శాతం మంది మాత్రం ఎలాన్ మస్క్ కు అనుకూలంగా ఓటేశారు. దీంతో ఎలాన్ మస్క్ కొత్త సీఈవో తన కొంటే మూర్ఖుడు అయి ఉండాలని పేర్కొంటూ.. సీఈవోగా వైదలగడం లేదని స్పష్టం చేశాడు. 

రాహుల్ భారత్ జోడో యాత్రకు కోవిడ్ ప్రొటోకాల్..కేంద్రం హుకుం

కరోనా మహమ్మారి విజృంభణ ప్రపంచంలో ప్రమాద ఘంటికలు మోగిస్తోందన్న వార్త అందరిలోనూ భయాందోళనలను రేకెత్తించింది నిజమే. రాష్ట్రాలకు కేంద్రం కరోనా విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు సూచించింది. అదే సమయంలో భారత్ లో కరోనా వ్యాప్తి తీవ్రత పెరిగే అవకాశాలు తక్కువే అని ధైర్యమూ చెప్పింది. అయితే సక్సెస్ ఫుల్ గా జరుగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విషయంలో మాత్రం విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ ప్రొటో కాల్ పాటించేటట్లయితే మాత్రమే యాత్రను కొనసాగించాలనీ, లేకుండా యాత్ర వాయిదా వేసుకోవాలనీ సూచన ప్రాయమైన హెచ్చరిక చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మున్ సుక్ మాండవీయ ఈ మేరకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు లేఖ రాశారు. ఆ లేఖలో యాత్రలో పాల్గొనే వారంతా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటిండం, శానిటైజర్లు వాడటం వంటికి తప్పని సరి అని పేర్కొన్నారు. అలాగే ప్రికాషనరీ డోస్ తో సహా వ్యాక్సినేషన్ చేయించుకున్న వారు మాత్రమే యాత్రలో పాల్గొనాలని కండీషన్ పెట్టింది. అలా చేయడం కుదరదనుకుంటే యాత్రను వాయిదా వేసుకోవాలని సూచించింది. ఈ లేఖపై కాంగ్రెస్ భగ్గు మంది. రాహుల్ భారత్ జోడో యాత్రకు విశేష జనస్పందన లభిస్తుండటం.. ఒకరి తరువాత ఒకరుగా సెలబ్రిటీలు ఆయనతో అడుగులు కలపడంతో కేంద్ర ప్రభుత్వం  రాహుల్ యాత్ర విషయంలో అప్రమత్తమైంది. ప్రధాని మోడీయే స్వయంగా కాంగ్రెస్ ను తక్కువ అంచనా వేయవద్దని పార్టీ శ్రేణులను హెచ్చరించారు కూడా.  ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో కరోనా వ్యాప్తి సాకుగా తీసుకుని కేంద్రం రాహుల్ యాత్రపై ఆంక్షలు విధిస్తోందని విమర్శించింది.   ఇతర పబ్లిక్ ప్లేసుల్లో, సమావేశాల్లో ఏ ప్రొటోకాల్ రూల్స్ అమలవుతున్నాయని ప్రశ్నించింది. ఉన్నట్లుండి కాంగ్రెస్ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ విషయంలోనే ప్రొటోకాల్ రూల్స్ గుర్తొచ్చాయా అని నిలదీసింది. . గుజరాత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీ చేపట్టిన ర్యాలీలు, సభల్లో కోవిడ్ ప్రొటోకాల్ ఫాలో అయ్యారా? రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు వస్తున్న స్పందన చూడలేకే కేంద్ర మంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.

మాస్కులతో ముఖాన్ని దాచుకోవలసిందేనా?

ప్రపంచ దేశాల్లో కరోనా విలవతాండవం మళ్లీ మొదలైంది. రెండున్నరేళ్లు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చైనా, జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్ దేశాల్లో కరోనా వైరస్  విజృంభిస్తుండడం మిగతా దేశాల గుండెల్లో గుబులు రేపుతోంది. మరోవైపు నిపుణులు.. కరోనా ఫోర్త్ వేవ్ కు ఇవి సంకేతాలంటున్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న కేసులు ఏ వేరియంట్ కు చెందినవో తెలుసుకోవాలని తెలిపింది. కరోనా పరీక్షల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తాజా నివేదికల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా వారానికి 35 లక్షల కరోనా కేసులు నమోదవుతుండటం.. మాయదారి మహమ్మారి ముప్పు ఇంకా తొలపోలేదనేందుకు అద్దంపడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు. అందుకే కరోనా టెస్టుల శాంపిళ్లను ముందుగానే జీనోమ్ సీక్వెన్సింగ్ వల్ల కొత్త వేరియంట్ల ఉనికిని ప్రారంభంలోనే గుర్తించవచ్చని, తద్వారా అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా.. ఇప్పుడు చైనా ఎదుర్కొంటున్న పరిస్థితులు భారత్ లో ఉండబోవని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ గులేరియా అభిప్రాయపడ్డారు.  ఇలా ఉండగా ప్రపంచంలో కరోనా కేసుల ఉధృతి పెరిగిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుక్ మాండవీయ బుధవారం (డిసెబర్21) దేశంలో కోవిడ్ పరిస్థితిపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దేశంలో కోవిడ్ విజృంభించకుండా తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు. కొన్ని దేశాలలో కోవిడ్ వ్యాప్తి ఒక్క సరిగా పెరిగిన నేపథ్యంలో ఈ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన వారంతా మాస్కులు ధరించి హాజరు కావడం విశేషం. ఉన్నత స్థయి సమావేశంలో అందరూ మాస్కులు ధరించి ఉండటం చూస్తుంటే దేశం మరోసారి లాక్ డౌన్ కి సిద్ధపడాలా, లేక మళ్లీ మాస్కులు ధరించక తప్పని పరిస్థితులు ఎదురు కానున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 

ఎర్రబెల్లి, ఉత్తమ్ రహస్య భేటీ మర్మమేమిటి?

తెలంగాణ రాజకీయాలలో తెరవెనుక డీల్స్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఒక వైపు తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షొభం తారస్థాయిలో ఉన్న నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకుడు టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నేత, మంత్రిఎర్రబెల్లి దయాకరరావుతో రహస్యంగా భేటీ అవ్వడం చర్చనీయాంశమైంది. రెండు రోజుల కిందట  మునుగోడులో ఓ వివాహ వేడుకకు హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడ ఏకాంతంగా దాదాపు మూడు గంటల పాటు భేటీ అయ్యారు. ఈ విషయాన్ని  గమనించిన కొందరికి వారు తమ భేటీ గురించి ఎక్కడా ప్రస్తావించవద్దని గట్టిగా హెచ్చరించినట్లు చెబుతున్నారు. ఇంత రహస్యంగా  అన్ని గంటల పాటు భేటీ అవ్వడం వెనుక మతలబేంటన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. ఒక వైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా.. ఢిల్లీ నుంచి హుటాహుటిన  వచ్చిన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా వివాహ వేడుకకు హాజరై, అక్కడ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో భేటీ అయ్యారు. భేటీ పూర్తి కాగానే నేరుగా హస్తినకు బయలుదేరి వెళ్లిపోయారు. ఎర్రబెల్లి, ఉత్తమ భేటీ జరుగుతున్న సమయంలోనే టీపీసీసీ భేటీ జరుగుతుండటం గమనార్హం. ఈ రహస్య భేటీ నేపథ్యంలోనే గతంలో ఉత్తమ్ కుమార్  రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలోనే కేసీఆర్ కు అనుకూలంగా వ్యవహరి స్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతిని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అప్పట్లోనే ఉత్తమ్ కుమార్ పై కేసీఆర్ కోవర్ట్ అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ఉత్తమ్ కుమార్ రహస్యంగా భేటీ అయిన ఎర్రబెల్లి దయాకరరావుపై కూడా గతంలో అంటే ఆయన తెలుగుదేశం తెలంగాణ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఉన్న సమయంలో కేసీఆర్ కోవర్ట్ గా పని చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి విదితమే. ఆయన టీడీఎల్పీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే2014 ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీలు మిత్ర పక్షాలుగా పోటీలోకి దిగాయి. ఆ ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీ కూటమి పరాజయం పాలైంది. గెలవాల్సిన స్థానాలలో కూడా కూటమి అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. అయితే ఇందుకు పొత్తలో భాగంగా సీట్ల పంపకాలలో జరిగిన పొరపాట్లే ఆ ఓటమికి కారణమని అప్పట్లో తెలుగుదుశం, బీజేపీలు భావించాయి. అయితే టీడీఎల్పీ నేతగా అప్పట్లో ఎర్రబెల్లి ఇరు పార్టీలనూ మిస్ గైడ్ చేసి బీజేపీకి బలం ఉన్న స్థానాలలో తెలుగుదేశం అభ్యర్థులు, తెలుగుదేశానికి బలం ఉన్న స్థానాలలో బీజేపీ అభ్యర్థులను రంగంలోకి దింపేలా చేశారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎర్రబెల్లి కేసీఆర్ కోవర్టుగా పని చేశారని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఆ తరువాత ఎర్రబెల్లి తెలుగుదేశంను వీడి.. గులాబి గూటికి చేరడం.. కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టడం తెలిసిందే. ఆ విధంగా కేసీఆర్ ఎర్రబెల్లి చేసిన ఉపకారానికి మంత్రిపదవితో బదులు తీర్చుకున్నారన్నమాట. ఇప్పుడు ఎర్రబెల్లి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రహస్య భేటీతో నాడు ఇరువురూ కేసీఆర్ కు కోవర్ట్ లుగా పని చేశారన్న విషయాలను గుర్తు చేస్తూ ఈ భేటీ వెనక మర్మమేమిటన్న చర్చ జరోందుకుంది. కాంగ్రెస్ సంక్షోభ సమయంలో అదును చూసి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతోంది. 

పలుకే బంగారమాయెనా.. అనుమానాలకు తావిస్తున్న కేసీఆర్ మౌనం

ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో కేసీఆర్ పలుకే బంగారం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయన మౌనం పలు అనుమానాలకు తావిస్తున్నదన్నచర్చరాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది. ఇదే విషయాన్ని బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ ప్రస్తావిస్తూ కేసీఆర్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరును ఈడీ చార్జి షీట్ లో 18 సార్లు ప్రస్తావించిందనీ, అసలు హస్తినలోని ఒబెరాయ్ హోటల్ లో కవిత మీటింగ్ ల మతలబు ఏమిటో బయటపెట్టాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. ఈ కేసులో నిందితుడు సమీర్  మహేంద్రుతో కవిత లావాదేవీలేమిటన్నవీ వెలుగులోకి రావాలన్నారు. తెలంగాణలో మొదలైన కల్వకుంట్ల కుటుంబం అవినీతి హస్తన వరకూ విస్తరించిందనడానికి డిల్లీ కుంభకోణంలో కవిత ప్రమేయంపై బయటపడుతున్న వాస్తవాలే నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వాస్తవాలు బయటపడతాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ పై దర్యాప్తు తరహాలో తెలంగాణ, పంజాబ్ లిక్కర్ పాలసీ పైనా దర్యాప్తు జరగాలన్న డిమాండ్ జోరందుకుంటోంది.   కవిత ఎందుకు అన్ని ఫోన్లు ధ్వంసం చేశారన్న ప్రశ్నా తలెత్తుతోంది. మాఫియా తరహాలో ఫోన్లు మార్చడం, ధ్వంసం చేయడం లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయానికి తిరుగులేని నిదర్శనం అన్న నమ్మకం అందరిలోనూ బలపడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    

కవితదే ఇండో స్పిరిట్ కంపెనీ!?

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పీకల్లోతు ఇరుక్కున్నారా? ఈ కేసులో  దాఖలు  చేసిన చార్జిషీట్ లోదాఖలు చేసిన తాజా చార్జిషీట్‌లో ఈడీ ఈ విషయమే వెల్లడించింది.  ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసిన ఇండో స్పిరిట్ కంపెనీకి   కల్వకుంట్ల కవితే ఓనర్ అని చార్జిషీట్ లో ఈడీ పేర్కొంది. మొత్తంగా ఈడీ తాజా చార్జ్ షీట్ లో కవిత పేరును 28 సార్లు పేర్కొంది.  శరత్ రెడ్డి, మాగుంట రాఘవ్ రెడ్డితో కలిసి కవిత లిక్కర్ వ్యాపారం చేశారని వివరించింది. ఈ వ్యాపారానికి అరుణ్ రామచంద్ర పిళ్లైను కవిత బినామీగా పెట్టుకున్నారని పేర్కొంది. ఈడీ దాఖలు చేసిన 181 పేజీల చార్జ్‌షీట్లో 28 సార్లు కవిత పేరును ప్రస్తావనకు వచ్చింది. కవిత, మాగుంట రాఘవ్‌, శరత్‌రెడ్డి నిర్వహిస్తున్న సౌత్‌గ్రూప్ దే ఈ కుంభకోణంలో  కీలక  పాత్ర అని ఈడీ చార్జ్ షీట్ లో పేర్కొంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దినేష్ అరోరా వాంగ్మూలం మేరకు హైదరాబాద్, ఢిల్లీ స్టార్ హోటళ్లలో పలుమార్లు సమావేశాలు జరిగాయి. కవిత పలుమార్లు ఫేస్ టైమ్ ద్వారా నిందితులతో మాట్లాడి కలసి వ్యాపారం చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. సమీర్ మహేంద్ర కవితను ఆమె నివాసంలో కలిసి చర్చలు కూడా జరిపారని ఈడీ చార్జ్ షీట్ లో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో దక్షిణాది నుంచి ఆప్ కి చెందిన కొందరు నేతలకు హవాలా మార్గంలో ముడుపులు అందినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పేర్కొంది.  ఓ వైపు సీబీఐ, మరో వైపు ఈడీ కేసులతో కల్వికుంట్ల  కవిత చిక్కుల్లో పడ్డారని న్యాయనిపుణులు పేర్కొన్నారు. ఈడీ తాజా చార్జిషీట్ ను బట్టి ఆమెను నిందితురాలిగా పేర్కొని అరెస్టు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. 

ఆరు రాష్ట్రాలలో బీఆర్ఎస్?

కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాలలో తన కార్యకలాపాలను విస్తరించడానికి ప్రణాళికలు, కార్యాచరణ సిద్ధం చేసింది. దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించాలన్న వ్యూహంలో భాగంగా ముందుగా ఆరు రాష్ట్రాలను ఎంపిక చేసుకుంది.   ఇందు కోసం ముందుగా ఆ ఆరు  రాష్ట్రాలలోనూ బీఆర్ఎస్ అనుబంధ సంస్థ బీఆర్ఎస్ కిసాన్ సమితిని ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ముందుగా పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిస్సా, సహా ఆంధ్ర ప్రదేశ్ లలో బీఆర్ఎస్ కిసాన్ సెల్ లు ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఈ సారి రైతు రాజ్యం అన్ననినాదంతో ముందుకు పోవాలని అధికారికంగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించిన నాడే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకే ఏపీ సహా ఆరు రాష్ట్రాలలో బీఆర్ఎస్ తన కార్యకలాపాలను విస్తరించ నుంది. ఏపీ సహా పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిస్సా రాష్ట్రాలలో క్రిస్మస్ తరువాత ఏ క్షణంలోనైనా బీఆర్ఎస్ కిసాన్ సెల్ లు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.  

దిగ్విజయ్.. ట్రబుల్ షూట్ చేయగలరా?.. రాష్ట్ర కాంగ్రెస్ ను గాడిన పెట్టగలరా?

తెలంగాణ కాంగ్రెస్ సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోతోంది. ఇందుకు ప్రధాన కారణం పార్టీలో సీనియర్లమంటూ పెత్తనం చెలాయిస్తున్న వారే అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఇంత కాలం పదవులు అనుభవించిన సీనియర్లు తరువాతి తరం నాయకత్వానికి స్వాగతం పలకడం లేదు సరికదా.. అడుగడుగునా అడ్డుపడుతున్నారు. దీంతో సహజంగానే పార్టీలో సీనియర్లు.. జూనియర్ల మధ్యా గ్యాప్ బాగా పెరిగిపోయింది. పెరిగి పోయింది అనడం కంటే ఇరువురి మధ్యా  అగాధం ఏర్పడింది అని చెప్పవచ్చు. యువ నాయకత్వాన్ని స్వాగతించలేక పోవడంతోనే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లోని సంక్షోభానికి కారణం. యువనాయకత్వానికి వ్యతిరేకొంగా గ్రూపులు కట్టి పార్టీలో చిచ్చుకు కారణమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత నుంచీ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమి నుంచి ఓటమి అన్నట్లు..దిన దినం దిగజారిపోతోంది.  రాష్ట్రంలో పార్టీ బలంగా మారేందుకు అన్ని అవకాశాలు ఉన్నా.. పార్టీలో కుమ్ములాటలతో ప్రజలలో పార్టీ  చులకన అవుతోంది.   తెలంగాణ కాంగ్రెస్ సారధిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత  పార్టీ ఒకింత పుంజుకుందన్న  మాట ఎవరూ కాదనలేరు. అయితే  అది ఎన్నికలో విజయం రూపంలో ఫలితం వచ్చేందుకు అవకాశం  లేకుండా పార్టీలో అంతర్గత విభేదాలు, రచ్చకెక్కి విమర్శలతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందా అన్నట్లు తయారైంది. ఇక తాజాగా పీసీసీ కమిటీల నియామకం వ్యవహారంలో పార్టీ సీనియర్లు బహిరంగంగా రేవంత్ పై తిరుగు బావుటా ఎగురు వేశారు. ఇందుకు ప్రతిగా రేవంత్ వర్గీయులు కూడా రాజీనామా ఆస్త్రాలు సంధించడంతో హై కమాండ్ రంగంలోకి దిగక తప్పని అనివార్యత ఏర్పడింది. అయితే పార్టీలో యువ రక్తాన్ని నింపాల్సిన అవసరం గురించి పదేపదే చెబుతూ వస్తున్న పార్టీ అధిష్ఠానం తెలంగాణలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దడానికి మాత్రం వృద్ధ నేతనే పంపించింది. తెలంగాణ ఆవిర్భావ సమయంలో దిగ్విజయ్ సింగ్ వ్యవహరించిన తీరుపై ఇప్పటికీ కాంగ్రెస్ లోని ఒక వర్గం అసంతృప్తిగానే ఉంది. అప్పటికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిగా ఉన్న దిగ్విజయ్ సింగ్ వలనే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అన్న విషయాన్ని ప్రజలకు బలంగా చెప్పడంలో విఫలమయ్యామని పలు సందర్భాలలో వీహెచ్ వంటి నాయకులు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు పార్టీలో సంక్షోభ నివారణకు దిగ్గిరాజేనే హైకమాండ్ పంపడంతో ఆయన సీనియర్లను ఎంత వరకూ సముదాయించగలరన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అంతే కాకుండా డిగ్గి రాజా ఇప్పటి వరకూ యువ నేతలకు ప్రోత్సాహం ఇచ్చిన దాఖలాలు లేవు. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన హయాంలో యువ నేతలు తిరుగు బావుటా ఎగుర వేసిన సందర్భాన్ని ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో అటు సీనియర్లకు, ఇటు జూనియర్లకూ సమ్మతం లేని దిగ్గిరాజాను అధిష్టానం దూతగా పంపడంతో ఆయన రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దగలుగుతారా అన్నఅనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. 

175 ఔటాఫ్ 175.. జగన్ ధీమా వెనుక ఆ రెండే..!

175 అవుటాఫ్ 175 అంటూ ఎన్నికలకు సిద్ధమౌతున్న ఏపీ సీఎం జగన్ ది పగటి కల అనాలో, అతి విశ్వాసం అనాలో అర్ధం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ సారి ఎన్నికలలో రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలకు 175 స్థానాలనూ మనమే గెలవాలి, ఆ అవకాశం మనకు మాత్రమే ఉంది.. అంటూ ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ శ్రేణులను ఊదరగొట్టేస్తున్నజగన్ అందుకోసం ఎమ్మెల్యేలకు నిర్దేశించిన కార్యాచరణ ఏదైనా ఉందంటే.. అది గడప గడపకూ మాత్రమే. ఆ ఒక్క కార్యక్రమం మీరు ప్రజలెంత ఈసడించుకున్నా..వ్యితిరేకించినా, ముఖం మీదే తలుపులేసినా లెక్క చేయకుండా పూర్తి చేయండి. ప్రతి గడపకూ మీరు వెళ్లండి.. మిగిలినదంతా నేను చూసుకుంటాను అంటున్నారు.  అయితే   గడపగడప కార్యక్రమానికి వస్తున్న స్పందనతో ఎమ్మెల్యే, మంత్రులు మాత్రం తమ ఇంటి గడప దాటడానికే జంకు తున్నారు. పొరపాటున ఎవరైనా వెళ్లినా మంత్రులు, ఎమ్మెల్యేలు అని కూడా చూడకుండా   ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ముఖం మీదే ఇంటి తలుపులు వేసేస్తున్నారు. మీరేం చేశారని ప్రశ్నిస్తున్నారు. ఇలా రాష్ట్రం మొత్తం ప్రభుత్వ వ్యతిరేకతే కనిపిస్తున్నది. పాపం ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రజల నుంచి తాము ఎదుర్కొంటున్ నిరసన గురించి చెప్పుకునే అవకావంకూడా లేదు. ఎందుకంటే 175 అవుటాఫ్ 175 గ్యారంటీ అన్న ధీమాతో ఉన్న జనగ్ చెప్పడమే తప్ప  వినడమన్నది మానేసి చాలా కాలమైంది. పరిస్థితి చూసిన చాలా మంది వైసీపీ నాయకులు వచ్చే ఎన్నికలు పార్టీకి గండమేనని భావిస్తున్నారు. అంతర్గత సంభాషణల్లో ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు.   ఇంతకీ ప్రజలలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నా.. జగన్ గెలుపు ధీమాతో ఎలా ఉండగలుగుతున్నారు. ఆయన ధీమా వేనుక, ధైర్యం వెనుక ఉన్నదేమిటి? అంటే రెండే కారణాలు.  ఔను ఎవరు ఔనన్నా మూడు రాజధానులు, బటన్ నొక్కి అమలు చేస్తున్న సంక్షేమం. వచ్చే ఎన్నికలలో ఈ రెండింటినే ఆయన తన గెలుపు మంత్రాలుగా నమ్ముతున్నారు. అందుకే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలూ వ్యతిరేకిస్తున్నా.. జనం అమరావతే రాజధానిగా ఉండాలని నినదిస్తున్నా  జగన్ లెక్క చేయకుండా మొండిగా మూడు రాజధానులంటూ ముందుకు సాగుతున్నారు. ఇక సంక్షేమం పేర రాష్ట్రాన్నిఆర్థిక సంక్షోభంలో నెట్టేసి, ఉద్యోగులకు వేతనాలు సైతం సమయానికి ఇవ్వకుండా, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ఉచిత పథకాలను కొనసాగిస్తూ విజయం తథ్యమన్న కలల లోకంలో విహరిస్తున్నారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరే విషయంలో  వాలంటీర్లు, అతి చేస్తున్నా కూడా జగన్ పట్టించుకోవడం లేదు. ఇక హేతు రహితంగా జగన్ సాగిస్తున్న సంక్షేమ రాజకీయం రాష్ట్రానికి చేస్తున్న చేటును ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు.  ఒక్కొక్కరికి ఇంత లెక్కన అందరికీ డబ్బు పంచుతున్నాను..  ఓటెందుకు వేయరని తన పార్టీ నాయకులనే కాదు ప్రజలనూ దబాయిస్తున్నారు.  ‘సంక్షేమమే’  వచ్చే ఎన్నికలలో గెలుపు తీరాలకి చేర్చుతుందని నమ్ముతున్నారు.  మూడు రాజధానులు..   రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు రాజధాని తెస్తా అంటుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ప్రచారం చేసుకోవడం ద్వారా మూడు ప్రాంతాలలోనూ జనం తన వెనుకే ఉంటారన్నది జనగ్ భావనగా కనిపిస్తోంది.  అయితే జగన్ మూడు రాజధానుల అస్త్రం బూమరాంగ్ అయిన సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఈ రెంటి మీద నమ్మకం పెట్టుకుని ఎన్నికలకు సమాయత్తమౌతున్న జగన్ ను ఇవి రెండు..కేవలం ఇవి రెండూ మాత్రమే గట్టెక్కిస్తాయా? అంటే ఔనని తలూపడం కష్టం. 

ఈడీ చార్జి షీట్ లో 22 సార్లు కవిత పేరు

దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ తాజా  సమర్పించిన చార్జిషీట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు కనీసం 22 సార్లు ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత చుట్టూ ఉచ్చు బిగిసినట్లేనని న్యాయ నిపుణులు  అంటున్నారు. తొలుత ఈ లిక్కర్ స్కాం లో కవిత ప్రమేయంపై ఆరోపణలు మాత్రమే అనుకున్నారు. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు దూకుడు పెంచిన తరువాత ఈ కేసులో కవిత పాత్ర కీలకమన్న విషయం వెలుగులోకి వస్తోంది. తొలుత ఢిల్లీ లిక్కర్ స్కాంతో తనకు ఎంత మాత్రం సంబంధం లేదంటూ బల్ల గుద్ది మరీ చెప్పిన కవిత.. దర్యాప్తు సాగుతున్నకొద్దీ ఆమె మాటల్లో మునుపటి ధీమా కనిపించడం లేదు.   చీటికీ మాటికీ  ప్రగతి భవన్ కు వెళ్లి ఈ కేసు విషయంలో న్యాయనిపుణులతో సంప్రదించడం, తండ్రితో మంతనాలు జరపడంతో కేసు కవితకు ఉచ్చు బిగించిందన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఈడీ తాజా చార్జి షీట్ తో ఆ విషయం  నిర్ధారణ అయినట్లేనని చెప్పవచ్చు. ఈ కేసులో ఈడీ తాజా ఛార్జిషీట్‌లో కీలక విషయాలను ప్రస్తావించింది. ఇండోస్పిరిట్స్ సంస్థ అసలు భాగస్వాములు కవిత,  మాగుంట రాఘవ్ రెడ్డిలేనని , ఈడీ చార్జిషీట్లో పేర్కొంది. దిల్లీ మద్యం కుంభకోణంలో ఆమ్‌ ఆద్మీ పార్టీతో పాటు అత్యధికంగా లబ్ధి పొందిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఒకరు అని ఈడీ పేర్కొంది.  సమీర్ మహేంద్రు కేసులో దాఖలు చేసిన ఈ ఛార్జి షీట్లో కవితతోపాటుగా వైసీపీ ఎంపీ మాగుంట శీనివాస్ రెడ్డి, అతడి కుమారుడు రాఘవ్ రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పాత్రలను చెప్పింది. అయితే ఈ కేసులో బోయినపల్లి అభిషేక్‌, బుచ్చిబాబు, అరుణ్‌పిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగానే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్టు కోర్టుకు తెలిపింది. ఛార్జిషీట్ ప్రకారం.., కవిత నేరుగా దిల్లీలోని స్టార్ హోటళ్లలో, హైదరాబాద్‌లోని తన నివాసంలో లేదా కాల్స్ ద్వారా వారిని కలుసుకోవడం ద్వారా నిరంతరం టచ్‌లో ఉన్నారని ఈడీ పేర్కొంది. సాక్ష్యాలను చెరిపేసేందుకు దాదాపు డజను మొబైల్ ఫోన్‌లను కవిత ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.

టికెట్ల కోసం ఎమ్మెల్యేల నుంచి జగన్ సొమ్ములు వసూలు!

ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరగడం  ఖాయమని వైసీపీ రెబల్ ఎంపి  రఘురామకృష్ణం రాజు అన్నారు . కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తో పాటు, లేదంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో కలిసి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయన్నారు.  2024 లో పార్లమెంట్ ఎన్నికల తో పాటు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు దాదాపు మృగ్యమన్నారు. .   రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మంగళవారం మీడియాతో మాట్లాడారు. మూమూలుగా అయితే ఎంపీలను, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి జగన్ చులకనగా చూస్తారనీ, వారికి ఇసుమంతైనా గౌరవం ఇవ్వరనీ, అయితే ముందస్తు ఎన్నికలు తరుముకు వస్తున్నాయి కనుక  ఎమ్మెల్యేలకు ఇప్పుడు కాసింత గౌరవం ఇచ్చి సమీక్షలు నిర్వహిస్తున్నారని రఘురామ కృష్ణం రాజు అన్నారు.  అంతే కాకుండా ఎన్నికల నిమిత్తం జగన్ రెడ్డి ఎమ్మెల్యేలను కొంత మొత్తం ఇవ్వాలని కోరుతున్నట్లు తన  వద్ద విశ్వసనీయ సమాచారం ఉందన్న వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు మాత్రం జగన్ కోరిన విధంగా సొమ్ము ఇచ్చేందుకు సుముఖంగా లేరన్నారు. సొమ్ము ముట్ట చెప్పి టికెట్లు తెచ్చుకున్నా గెలిచే అవకాశాలు లేవని ఎమ్మెల్యేలకు ఇప్పటికూ పూర్తిగా అర్ధం కావడమే కారణమన్నారు.  జగన్ రెడ్డి గృహ సారథులు పేరిట గృహ హింసకులను రంగంలోకి దింపుతున్నారని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు. ఇప్పటికే ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ను నియమించిన జగన్ సర్కార్ వారికి అదనంగా మరో ఇద్దరు గృహ సారథులను నియమిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులను గుర్తించి వారి ఓటును తొలగించేలా చేయడమే వీరి పని అని ఆరోపించారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకల నిర్వహణ కోసం ప్రజాధనం ఖర్చు చేయడం తగదని రఘురామ కృష్ణం రాజు అన్నారు. సొంత సొమ్ముతో జరుపుకోవలసిన జన్మదిన వేడుకలకు ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము కేటాయించడమేమిటని ప్రశ్నించారు.