అమ్మో అమ్మాయేనా?.. ఇంటికొస్తున్నా ఇవన్నీ సిద్ధం చేయండంటూ తండ్రికి మెసేజ్

పిల్లలంటే తల్లిదండ్రులకు మురిపెం. పిల్లలేం చేసిన వారికి ముద్దుగానే ఉంటుంది. అందులోనూ తమకు దూరంగా హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న పిల్లలంటే మరీను. వారికి సెవలులెప్పుడొస్తాయా? ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తారా అని  ఎదురు చూస్తూనే ఉంటారు. అలాగే పిల్లలకు కూడా ఇంటి మీద బెంగ ఉంటుంది. గారంగా కోరితే కొండమీది కోతిని కూడా తెచ్చిచ్చే తల్లిదండ్రులకు దూరంగా హాస్టళ్లలో ఉండటం వారికీ ఇబ్బందే. అందుకే హాస్టల్ కు వెళ్లిన రోజు నుంచీ వారు ఎప్పుడు సెలవులు వస్తాయా? ఎప్పుడు ఇంటికి వెడదామా అని రోజులు లెక్కిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఇంటి దగ్గర అమ్మ తనకు ఇష్టమైనవన్నీ అడిగి మరీ వండి పెడుతుంటే.. ఆ రుచికి అలవాటు పడిన వారు హాస్టళ్లలో తిండి తినలేక ఇంటి ఫుడ్ కోసం మొహంవాచిపోయి ఉంటారు. అలా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లి ఇష్టమైనవన్నీ తినేద్దామా అన్న ఆత్రంలో ఉన్న ఓ బాలిక హాస్టల్ నుంచి తన తండ్రి ఫోన్ కు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తాను ఫలానా రోజున ఇంటికి వస్తున్నాననీ, ఆ రోజుకు తాను పంపిన మెనూ ప్రకారం ఫుడ్ రెడీ చేయమనీ ఆ మెసేజ్ సారాంశం. శ్వేతాంక్ భూషణ్ అనే వ్యక్తి   కుమార్తెను హాస్టల్ ఉండి చదువుకుంటోంది. ఐదు నెలల తరువాత శుక్రవారం (డిసెంబర్16)   క్రిస్మస్ సెలవుల కోసం ఇంటికి రానుంది. ఈ సందర్బంగా ఆమె తండ్రికి మెసేజ్ చేసింది. తాను సెలవలకు ఇంటికి వస్తున్నాననీ, తనకు సెలవులలో ఏం ఫుడ్ కావాలో ఓ లిస్ట్ పెట్టింది. ఆ లిస్ట్ చూసిన శ్వేతాంక్ భూషణ్ తొలుత షాక్ అయ్యాడు. ఆ తరువాత కూతురిపై ప్రేమ పొంగుకొచ్చింది. ఆమె కోరినవన్నీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. తన కూతురు తనకు పంపిన మెసెజ్ ను యథాతథంగా సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. వెంటనే అది వైరల్ అయ్యింది. ఇంతకీ తన తండ్రికి ఆ అమ్మాయి మెసేజ్ చూసిన లిస్ట్.. సెలవుల్లో ఆ అమ్మాయి తినాలనుకుంటున్న ఫుడ్ ఐటెమ్స్. ఆ జాబితా ఏం చిన్నగా లేదండోయ్ చాలా చాలా భారీగా ఉంది. హాస్టల్ తిండి తినలేక రుచికరమైన ఫుడ్ కోసం ఆ అమ్మాయి ఎంతగా తహతహలాడిపోతోందో ఆ లిస్ట్ చూస్తే ఇట్టే అర్దమైపోతుంది. అందుకే సామాజిక మాధ్యమంలో  తెగ వైరల్ అయిపోయింది. గతంలో నా కుమార్తే ఇలాగే చేసేది.. ఇప్పుడు పెళ్లై పిల్లలు పుట్టిన తరువాత కూడా ఇంటికి వస్తోందంటే ఇలా తనకు కావలసిన ఫుడ్ ఐటెమ్స్ జాబితా పంపుతుంది.. అయితే ఇప్పుడు తన ఒక్కర్తికే కాదు.. భర్త,  పిల్లల కోసం కూడా సెపరేట్ లిస్ట్ పెడుతోందని ఓ తండ్రి స్పందించాడు. ఇక విద్యార్థులైతే మేం కూడా అంతే అని కొందరు...ఇక పై మేమూ ఇదే ఫాలో అవుతామని మరి కొందరూ స్పందించారు.  

జాతీయ పానియంగా తేనీరు.. బీజేపీ ఎంపీ డిమాండ్

జాతీయ జంతువు పులి, జాతీయ పక్షి నెమలి.. మరి జాతీయ పానియం? ఈ విషయంలోనే అసోంకు చెందిన బీజేపీ పబిత్రా మర్గెరిటాకు కోపం వచ్చింది. తేనీరు (టీ)ని జాతీయ పానియంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యసభ జీరో అవర్ లో మంగళవారం (డిసెంబర్ 13)న ఆయన మాట్లాడారు. దేశంలో మరేం సమస్యా లేదన్నట్లు టీకి జాతీయ పానియం హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. అంతటితో ఊరుకోకుండా దేశంలో ప్రజల జీవనంలో తేనీరు ఒక భాగమని చెప్పారు. దేశంలో అత్యధికులు తమ రోజును ఒక కప్పుటీతో ప్రారంభిస్తారని తెలియజేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ అందరి జీవనంలో తేనీరు అంతర్భాగమన్నారు. అంతెందుకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం చాయ్ వాలాగానే ప్రారంభించి అత్యున్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు.  మరి ఇన్ని ఘనతలున్న తేనీరును జాతీయ పానియంగా ప్రకటించకపోతే ఎలా అని పార్లమెంటు వేదికగా ప్రశ్నించారు. టీని జాతీయ పానియంగా ప్రకటించడంతో పాటు.. తేయాకు తోటల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. తేయాకు తోటలలో పని చేసే కార్మికుల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలనీ కోరారు.   2023లో అస్సాం టీ 200వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుందనీ,  అసోం ప్రజలు ఈ వేడుకను ఉత్సాహంగా జరుపుకుంటారని చెప్పిన ఆయన ఈ సందర్భంగానైనా తేనీరును జాతీయ పానియంగా ప్రకటించి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. 

ప్రత్యేక హోదా వన్స్ మోర్.. అదే ప్రశ్న ..అదే జవాబు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ఎలా జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పడు ఆ లోతుల్లోకి పోవలసిన అవసరం లేదు. అయితే, రాష్ట్ర విభజన న్యాయంగా జరిగిందో  అన్యాయంగా జరిగిందో ఇప్పుడు చర్చించి ప్రయోజనం లేదు. అయితే, కనీసం  రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల కోసం అయినా  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  ఆంద్ర ప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు పార్లమెంట్ లోపల వెలుపల ఎందుకు గళం విప్పలేక పోతున్నారు. ముఖ్యంగా అధికార వైసేపీ సభ్యులు  పార్లమెంట్  ఉభయ సభల్లో హోదా, పోలవరం ప్రస్తవన వచ్చిన ప్రతి సంధర్భలో ఎందుకు మౌనంగా ఉండి పోతున్నారు. ఎందుకు వారు గళం ఎత్తుతారని ఆశించడం కూడా అత్యాశగా అనిపిస్తోంది? అంటే,   వైసేపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీ ఎంపీలు కేంద్రానికి అంతగా దాసోహం అంటున్నారు కాబట్టే అనే సమాధానమే వస్తోంది. ఆ మాటలు అంటోంది  ఎవరో కాదు, అధికార పార్టీ  నాయకులూ, క్యాడర్ నోటి నుంచే ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి.  రాష్ట్ర విభజన చట్టంలో అవశేష ఆంధ్ర ప్రదేశ్ కు ప్రామిస్ చేసిన  ప్రత్యేక హోదాకు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడేసింది. అదొక ముగిసిన అధ్యాయం  అంటూ పక్కన పెట్టేసింది. ఎన్ని సార్లు అడిగినా అదే సమాధానం. అవే మోసపు మాటలు. తాజాగా మంగళవారం  (డిసెంబర్ 13) రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రతిపాదన వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. అటు లోక్ సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా విభజన అంశాలపై ప్రశ్నించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం మళ్ళీ అదే పాత పాటనే మరోమారు వినిపించింది. 14, 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాలకు నిధులు అందిస్తున్నామని వెల్లడించింది.  14వ ఆర్థిక సంఘం కేటగిరీ రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీలో ఎలాంటి వ్యత్యాసం చూపడంలేదని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తున్నామని పేర్కొంది.  తద్వారా ప్రత్యేక హోదా అంశం తమ దృష్టిలో లేదని స్పష్టం చేసింది. అలాగే 14వ ఆర్థిక సిఫారసులను పరిగణనలోకి తీసుకుని కేంద్రం రాష్ట్రాలకు పన్నుల వాటాను కేంద్రం 32 శాతం నుంచి 42 శాతానికి పెంచిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా తెలియజేశారు.    కేంద్ర ప్రభుత్వం  పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని తుంగలో తొక్కి రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది. నిజమే   అయితే, మన బంగారం మంచిదైతే కదా, వేరొకరిని వేలెత్తి చూపేందుకు.. నిజానికి  2019 ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అసెంబ్లీ  లోక్ సభ ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే  ప్రత్యేక హోదా సాధిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాక ముందే చేతులు ఎత్తేశారు. కేంద్రలో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచింది కాబట్టి ఇక, ప్రత్యేక హోదా మోడీ దయ మన ప్రాప్తం అంటూ జగన్ రెడ్డి చేతులు  ఎత్తేశారు.  నిజమే  కావచ్చును  కానీ, రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పడు  సంఖ్యాబలంతో పని లేకుండా పార్లమెంట్ లోపల, వెలుపల, న్యాయస్థానాల ద్వారా.. కేంద్రం మెడలు వంచేందుకు ఉన్న ఇతర మార్గాలను ఎందుకు ఉపయోగించు కోలేదు. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా ఎన్ని సార్లు ప్రధానిని కలిసినా ఎంత సేపు కాళ్ళకేసి చూడడమే తప్ప గొంతెత్తి అడిగిందేదని అధికార పార్టీ క్యాడర్, ముఖ్యంగా ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురు చూసిన యువత జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. పార్లమెంట్ లో తెలుగు దేశం సభ్యులు పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు  వైసీపీ సభ్యులు మౌనంగా ఉండడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్న ఎవరు అడిగారన్నది కాదు... రాష్ర ప్రయోజనాల విషయంలో అయినా  వైసేపీ రాజకీయాలకు అతీతంగా ఎందుకు కేంద్రాన్ని  నిలదీయ లేక పోతోంది, అనేదే అసలు ప్రశ్న అంటున్నారు.

మోడీ కంటే ఘనుడు భూపేంద్ర పటేల్!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరున చాలా రికార్డులే నమోదై ఉండవచ్చును. ఆయన,  గుజరాత్ అసెంబ్లీ లో ముఖ్యమంత్రిగానే తొలి  అడుగు, వేశారు. కనీసం ఎమ్మెల్యే అయినా కాకుండానే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే, మోడీ,  పార్లమెంట్  ఎంట్రీ కూడా అంతే. ఆయన ప్రధానమంత్రిగానే  లోక్ సభలో అడుగు పెట్టారు. అలాగే ఆయన  ఇంతవరకు ఏ ఎన్నికలోనూ ఓడిపోలేదు. ఆయన ఓడిపోక పోవడమే కాదు  ఆయన సారధ్యంలో పోటీ చేసిన ఏ ఎన్నికల్లోనూ అది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలే అయినా  పార్లమెంట్ ఎన్నికలే అయినా  ఏ ఎన్నికల్లోనూ బీజేపీ ఓడి పోలేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా వరసగా మూడు సార్లు ప్రభుత్వ వ్యతిరేకతను జయించిన మోడీ, 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ ప్రభుత్వ వ్యతిరేకతను జయించారు. ముందు (2014) కంటే 2019లో ఎక్కువ మెజారిటీతో విజయం సాధించారు.  మోడీ రికార్డులు ఇంకా  చాలానే ఉంటాయి, అయితే  గుజరాత్ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన  భూపేంద్ర పటేల్  (ఈయన కూడా అనుకోకుండా, అనుహ్యంగా  ముఖ్యమంత్రి అయ్యారు) మోడీ సాధించలేని ఒక కొత్త రికార్డును సృష్టించారు. గుజరాత్ ఎన్నికల్లో బిజెపి అఖండ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పటేల్ ప్రధానమంత్రి నరేంద్రమోడీ రికార్డునే బద్దలు కొట్టారు.అత్యధిక మెజార్టీ సాధించిన బిజెపి ఎమ్మెల్యేగా,ముఖ్యమంత్రిగా రికార్డు సాధించారు. 2021 సెప్టెంబర్ లో గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రుపానీని అనూహ్యంగా ఆ పదవి నుంచి తొలగించి భూపేంద్ర పటేల్ కు అధిష్టానం పగ్గాలు అప్పగించింది. రూపానీ రాజీనామా తర్వాత చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయినా మంత్రి అయినా కానీ, ఫస్ట్ టైం ఎమ్మెల్యే భూపేంద్ర పటేల్ పేరును  ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. నిజానికి, 2001లో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి, ఆయన ముఖ్యమంత్రి అవుతారని ఎవరూ ఉహించలేదు. ఎవరో  ఏమిటి, మోడీ కూడా ఉహించలేదు. పటేల్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించే సమయానికి, కనీసం ఎమ్మెల్యే. మోడీ అది కూడా కాదు. అలాగే  భూపేంద్ర పటేల్  ముఖ్యమంత్రి అవుతారని, ఆయనతో సహా ఎవరు ఉహించలేదు. ఎలాంటి మంత్రి పదవులు నిర్వహించిన అనుభవం లేకుండానే, పటేల్ గత ఏడాది తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయినా,అయన సారధ్యంలో బీజేపీ, చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. నరేంద్ర మోడి సారధ్యంలో 2014 ఎన్నికలలో బీజేపీ, మూడు దశాబ్దాల చరిత్రను తిరగరాసింది.ఎన్డీఎ కూటమిగా పోటీ చేసిన, బీజేపీ, మూడు పదుల కాలంలో మొదటి సారిగా ఒంటరిగా ( సింగిల్ పార్టీ) మెజారిటీ సాధించి చరిత్రను సృష్టించింది. అలాగే గుజరాత్ లో 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఇతవరకు ఆదుకోలేక పోయిన కాంగ్రెస్ రికార్డును భూపేంద్ర పటేల్  సారథ్యంలో బీజేపీ అందుకుంది. 1985లో ముఖ్యమంత్రి మాధవ సింగ్ సోలంకి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ  సృష్టించిన, 149/182 సీట్ల రికార్డును, 2022 ఎన్నికల్లో భూపేంద్ర పటేల్ 156/182 సీట్ల భారీ మెజారిటీతో  బద్దలు కొట్టారు. 2002లో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో బిజెపి 127 స్థానాల భారీ మెజారిటీతో విజయం సాధించింది.. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భూపేంద్ర పటేల్ ఆ రికార్డును బద్దలు కొట్టారు. ఏకంగా 156 మంది ఎమ్మెల్యేల బలగంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. అదొకటి అలా ఉంటే ఘట్లోడియా నియోజకవర్గం నుంచి 2017 లో తొలిసారి పోటీ చేసి 1.17 లక్షల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి శక్తి కాంత్ పటేల్ పై విజయం సాధించారు. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే పటేల్ అత్యధిక మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోను అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 1.92 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. అందుకే, మోదీ కంటే ఘనుడు పటేల్ .. అంటున్నారు గుజరాత్ ప్రజలు. ఓటర్లు.

2022 రౌండప్ ..

కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 2022 మోస్ట్ హ్యాపెనింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు.  కొద్ది  రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే.. జనవరి 1 2021 సంవత్సరం వస్తూనే విషాదాన్ని మోసు కొచ్చింది. కొత్త సంవత్సరం తొలి పొద్దు విషాద వార్తతో  కళ్ళు తెరిచింది. ప్రతి సంవత్సరంలానే,ఈ సంవత్సరం కూడా, జనవరి ఫస్ట్’న జమ్మూలోని వైష్ణవదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొత్త సంవత్సరంలో తమను చల్లగా చూడమని, వైష్ణవదేవీ మాతను ప్రార్ధించేందుకు భక్తిపారవశ్యంలో పరుగులు తీశారు. తొక్కిసలాట జరిగింది.12 మంది ప్రాణాలు వదిలారు, 20 మంది వరకు గాయాల పాలయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇతర ముఖ్య నేతలువిచారం వ్యక్తపరిచారు.చనిపోయిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం ప్రకటించారు. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం క్షతగగాత్రులకు సహాయం అందించింది.   జనవరి 4 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మణిపూర్ లో పర్యటించారు. ఐదు జాతీయ రహదారులు, 200 పడకల సెమి – పెర్మనెంట్  ఆసుపత్రితో పాటుగా నాలుగు వేల 815 కోట్ల  విలువైన 22  అభివృద్ధి పధకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మణిపూర్ అభివృద్ధి ప్రణాళికతో  ఈశాన్య భారతం, భారతదేశ అభివృద్ధి వాహనానికి చోదక శక్తిగా పనిచేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్త  పరిచారు.  జనవరి 5  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన, భద్రతా లోపం కారణంగా రద్దయింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాని పర్యటనలో భద్రతా లోపం చోటు చేసుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన పై జనవరి 7న, కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వం వేర్వేరుగా విచారణకు ఆదేశించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి, పంజాబ్ పరిణామాలను వివరించారు. కాగా  ప్రధాన మంత్రి పంజాబ్  పర్యటనలో చోటు చేసుకున్న భద్రతాలోపం పై చర్చించేందుకు సుప్రీం కోర్టు జనవరి 12న ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.  జనవరి 15 సైనిక దినోత్సవం... భారతదేశ చరిత్రలో ఈ రోజుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. భారత్‌లో బ్రిటిష్ చివరి సైన్యాధికారి ఫ్రాన్సిస్ బుచర్ నుంచి భారత్‌కు చెందిన లెఫ్టినెంట్ జనరల్ కమాండర్ ఎం. కరియప్ప 1949లో ఇదే రోజున సైన్యాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి భారత్ జనవరి 15ని 'ఆర్మీ డే'గా జరుపుకుంటోంది. సైనికుల త్యాగాలు, దేశ రక్షణలో సైనికుల పాత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా ప్రతీ ఏటా 'ఆర్మీ డే' వేడుకలను నిర్వహిస్తున్నారు. కాగా, ప్రతి సంవత్సరంలానే ఈ సవత్సరం కూడా, దేశ వ్యాప్తంగా ఆర్మీ డే వేడుకలు ఘనంగా  నిర్వహించారు. భారత సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ 'ఆర్మీ డే' శుభాకాంక్షలు తెలియజేశారు. 'ఆర్మీ డే సందర్భంగా మన ధీర సైనికులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. ధైర్య సాహసాలకు, సైనిక శిక్షణ సామర్ధ్యానికి భారత సైన్యం పెట్టింది పేరు. దేశ భద్రత కోసం భారత సైన్యం అందిస్తున్న అమూల్యమైన సేవలను వర్ణించేందుకు మాటలు సరిపోవు.' అంటూ నరేంద్ర మోదీ   ట్వీట్‌ చేశారు. జనవరి 20  బ్రహ్మ కుమారీల అధ్య్వర్యంలో, సంవత్సరకాలంపాటు జరిగే అజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేద్ర మోడీ ప్రారంభిచారు.  జనవరి 23  నేతాజీ సుభాష చంద్రబోస్ జయంతి.  దేశ రాజధాని ఢిల్లీలో గేట్ వే అఫ్ ఇండియా వద్ద, గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రారంభ చిహ్నంగా సుభాష్ చంద్ర బోస్, విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మంత్రి నరేంద్ర మోడీ, భారత్ స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి, నవ భారత నిర్మాణం జరిగి తీరుతుందని విశ్వాసం వ్యక్త పరిచారు.  జనవరి 30 మహాత్మాగాంధీ వర్ధంతి. అమర వీరుల దినోత్సవం. ఈ సందర్భంగా  రాజ్ ఘాట్ లోని గాంధీ సమాధి వద్ద రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్, ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ పలువురు ప్రముఖులు జాతి పితకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, మహాత్ముడి ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరూ ప్రయత్నించాలని అన్నారు. అలాగే, అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారి సేవలు, ధీరత్వాన్ని ప్రతి ఒక్కరు గుర్తుచేసుకోవాలని అన్నారు. జనవరి 31  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.   (ఫిబ్రవరి 22  రౌండప్ రేపు)  

టార్గెట్ 175 ఆఫ్ 175.. మరి అభ్యర్థులెవరు?

వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్... పక్కాగా ఫిక్స్ అయిపోయారు. అదీ కూడా మొత్తం 175కి 175 అసెంబ్లీ స్థానాలు తమ పార్టీ ఖాతాలో పడి పోవాలనే లక్ష్యంతో సీఎం జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలో పని చేసిన వారికే మళ్లీ టికెట్లు.. అంటూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సమీక్షా సమావేశంలో సీఎం జగన్ క్లియర్ కట్‌గా స్పష్టం చేశారు.  దీంతో తమకు మరో  ఛాన్స్ లేదని ఇప్పటికే వైసీపీలోని   పలువురు ఎమ్మెల్యేలు ఒక నిర్ణయానికి వచ్చేశారు.  మరోవైపు.. పలువురు ఎంపీలను ఈ సారి అసెంబ్లీకి పంపాలని సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో విశాఖ ఎంపీ .వి.వి.సత్యనారాయణ, కాకినాడ ఎంపీ వంగా గీత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, బాపట్ల ఎంపీ మార్గాని భరత్, హిందూపురం ఎంపీ గోరంట్ల మాదవ్ ఉన్నట్లు సమచారం.  విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు ఎం.వి.వి.సత్యనారాయణ సంగతే తీసుకుంటే.. విశాఖ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటన్నింటిలో.. ఎంవీవీ సత్యనారాయణపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సొంత పార్టీలోని నేతలు సైతం ఆయనపై అసంతృప్తితో రగలిపోతున్నారని.. ఈ విషయాన్ని పసిగట్టిన ఎంపీ సత్యనారాయణ.. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలోకి దిగుతానంటూ తన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానం  వద్ద కూడా ఆయన ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీంతో విశాఖ తూర్పు లేదా ఉత్తరం నుంచి ఎంవీవీ సత్యనారాయణ రంగంలోకి దిగే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.  ఇక కాకినాడ లోక్‌సభ సభ్యురాలు వంగా గీత కూడా ఈసారి అసెంబ్లీకి పోటీ చేసి.. మంత్రి పదవి దక్కించుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఆ క్రమంలో కాకినాడకు కూత వేటు దూరంలోని పిఠాపురం నుంచి ఆమె బరిలోకి  దిగే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఇక్కడున్న పెండెం దొరబాబుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయన్ని జగన్ పక్కన పెట్టినట్లు చెబుతున్నారు... దీంతో వచ్చే ఎన్నికల్లో వంగా గీత పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి  పోటీ చేస్తారని తెలుస్తోంది.       రాజమండ్రి లోక్‌సభ సభ్యుడు మార్గాని భరత్ కూడా ఈ సారి అసెంబ్లీపై కన్ను వేసినట్లు సమాచారం. ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేకున్నా.. సొంత పార్టీలోని నేతల్లో ఆయనపై పీకల వరకు అసంతృప్తి ఉందని తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తే.. సొంత పార్టీలోని వారే పనిగట్టుకొని మరీ తనను ఓడిస్తారని భరత్‌కు క్లియర్ కట్‌గా అర్థమైందని.. ఈ నేపథ్యంలో రాజమండ్రి నగర అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు భరత్.. తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఓ వేళ ఆయన అసెంబ్లీలో అడుగు పెడితే.. బీసీ వర్గానికి చెందిన తనకు జగన్ కేబినెట్‌లో బెర్త్ గ్యారంటీ అని భరత్ పూర్తిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.     ఇక మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.. నరసారావుపేట నుంచి   పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బందరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానికి ఎంపీ బాలశౌరి మధ్య పచ్చగడ్గి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బాలశౌరిని బందరు లోక్‌సభ స్థానం నుంచి కాకుండా మరో చోటు నుంచి పోటీ చేయించేందుకు పేర్ని నాని కంకణం కట్టుకొని మరీ జగన్ వద్ద లాబీయింగ్ చేస్తున్నట్లు ఓ చర్చ అయితే బందరులో హల్‌చల్ చేస్తోంది. అదీకాక ప్రస్తుతం నరసారావుపేట ఎంపీ లావు కృష్ణాదేవరాయులు.. రాజధాని రైతులకు మద్దతు తెలపడంతో.. తాడేపల్లి ప్యాలెస్ పెద్దల ఆగ్రహానికి ఆయన గురయ్యారు. ఈ నేపథ్యంలో కృష్ణదేవరాయులు... సైకిల్ పార్టీలోకి జంప్ చేసేందుకు తన ప్రయత్నాలు చేసుకొంటున్నట్లు తెలుస్తోంది.  బాపట్ల ఎంపి నందిగం సురేష్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి.. మంత్రి కావాలని ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. అయితే  జిల్లాలో ఎక్కడా అసెంబ్లీ సీట్లు ఖాళీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు.. హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఓ వేళ.. ఆమె పార్టీ మారితే.. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానం నుంచి నందిగం సురేష్‌ను నిలిపే అవకాశం ఉందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. న్యూడ్ వీడియోతో గట్టిగానే మకిలి అంటించుకొన్నారు. దీంతో పార్టీలోనే కాదు.. ప్రజల్లో సైతం ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఓ వేళ ఆయనపై వేటు వేస్తే.. వచ్చే ఎన్నికల్లో ఆయన సామాజిక వర్గ ఓట్లు దూరమయ్యే పరిస్థితి ఉందని.. ఆ క్రమంలోనే జగన్ అండ్ కో.. గోరంట్ల విషయంలో కాస్త వెనక్కి తగ్గిందనే  ఓ టాక్ అయితే అప్పట్లో బాగానే నడిచింది. అయితే వచ్చే ఎన్నికల్లో హిందూపురం ఎంపీగా మరో వ్యక్తిని నిలబెట్టే అవకాశాన్ని జగన్ పార్టీ పరిశీలిస్తుంన్నదనే   చర్చ   ఫ్యాన్ పార్టీలో వాడి వేడిగా సాగుతోంది.  ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్‌ను పెనుకొండ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దింపేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.   కడప ఎంపి వైయస్ అవినాశ్ రెడ్డి.. వైయస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతే కాదు.. సీఎం   జగన్ ఫ్యామిలీ తప్ప..ఆ కుటుంబంలోని మరో ఫ్యామిలీ   అవినాశ్  రెడ్డికి వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇచ్చే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో వైఎస్ అవినాశ్ రెడ్డిని రాజంపేట ఎమ్మెల్యేగా బరిలో దింపాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి.. గతంలో టీడీపీలో ఉండి.. ఎన్నికలకు ముందు జగన్ పార్టీలో చేరారు. ఆయనను ప్రస్తుతం పార్టీ అధిష్టానం సాధ్యమైనంత దూరం పెట్టింది. దీంతో ఆయన మళ్లీ టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.  మరో వైపు అన్నమయ్య జిల్లా కేంద్రంగా  రాజంపేటను కాదని  రాయచోటిని  చేయడంపై ప్రజల్లో ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దాంతో ఈ స్థానం నుంచి  ఆవినాశ్ రెడ్డిని బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయని పార్టీలో ఓ టాక్  వైరల్ అవుతోంది.

తెలంగాణలో ఎవరి గోల ఏమిటో?

ఆంధ్ర ప్రదేశ్ రెండుగా విడిపోయి, ఎనిమిదేళ్లు నిండి పోయాయి, అయినా ఇంకా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య  చాలా విషయాల్లో దాయాది తగవులు మాత్రం అలానే కొనసాగుతున్నాయి. విభజన చట్టంలోని అనేక అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. విబేధాలు, విమర్శలు, కోర్టు వివాదాలు కొనసాగుతున్నాయి. అయినా అక్కడ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాసల మధ్య స్నేహ పూర్వక సంబంధాలే కొనసాగుతున్నాయి. అలాగే  ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యక్తిగతంగా మంచి మిత్రులుగానే మెలుగుతున్నారు. చిన్న చిన్న పొర పొచ్చాలు ఉన్నా రాజకీయ ,స్నేహ సంబంధాల విషయంలో మాత్రం ఇచ్చి పుచ్చుకునే ధోరణి కొనసాగుతోంది. భారాస కు వైకాపా రెడ్ కార్పెట్  స్వాగతం పలికిందంటే, ఇక ఆ రెండు పార్టీల మధ్య స్నేహ బంధంగా ఎంత పటిష్టంగా వుందోవేరే చెప్పనక్కరలేదు. ఆలాగే, ఉభయ తెలుగు రాష్టాల రాజకీయాల విషయానికి వస్తే  ఎవరిదారి వారిది, అన్నట్లుగా  అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరి పరిధికి వారు పరిమితమై రాజకీయం చేస్తున్నారు. అయితే, ఇంతవరకు ఒక లెక్క, ఇప్పడు మరో లెక్క అన్నట్లుగా కథ మారింది. ముఖ్యంగా, తెలంగాణలో రాజకీయ ఈక్వేషన్స్ వేగంగా మారి పోతున్నాయి. అధికార  తెరాసని వరసగా రెండు సార్లు గెలిపించిన తెలంగాణ సెంటిమెంట్, ఇప్పడు అంత వేడిగా లేదు. చాలా వరకు  చల్లబడింది. అంతేకాదు  పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కుటుంబ పాలన, కుటుంబ అవినీతి పెరిగిపోయిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపధ్యంలో  తెలంగాణ సెంటిమెంట్ తిరగబడింది. మరో వంక తెరాస,భారాసగా పేరు మార్చుకుని జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించడంతో కొన ఊపిరితో మిగిలిన ఆ కాస్త సెంటిమెంట్  కూడా తుడిచి పెట్టుకు పోయింది.  ఈ నేపధ్యంలో తెలంగాణ రాజకీయాలలో ఏపీ పాలిటిక్స్  వచ్చి కలవడంతో తెలంగాణ రాజకీయ లెక్కలు మారుతున్నాయనే చర్చకు తెర లేచింది. నిజానికి తెలంగాణ రాజకీయాలు 2018 ఎన్నికల నుంచి చాలా దూరం వచ్చాయి.  2018లోనూ బీజేపీ బరిలో ఉన్నా, తెరాస,కాంగ్రెస్ పార్టీలను మాత్రమే ప్రజలు ప్రధాన ప్రత్యర్దులుగా గుర్తించారు. 2014లో  తెలుగు దేశంతో పొత్తు జనసేన మద్దతుతో పోటీచేసి ఐదు అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న బీజేపీ 2018లో నాలుగు సీట్లు కోల్పోయి, గోషామహల్ ( రాజా సింగ్) స్థానం ఒక్కటి మాత్రమే నిలబెట్టుకుంది. అయితే, ఆ తర్వాత ఆరు నెలలకే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా నాలుగు లోక్ సభ స్థానాలు గెలుచుకుంది. ఇక అక్కడి నుంచి మునుగోడు వరకు కథ మారుతూ వచ్చింది. తెరాసకు ప్రధాన ప్రత్యర్ధి స్థానం  కోసం జరిగిన పోటీలో బీజేపీ కాంగ్రెస్ పై పైచేయి సాధించింది.   ఈ నేపధ్యంలో, తెలంగాణ ప్రభుత్వ వ్యతిరేక ఓటును మరింతగా చీల్చేందుకు, తెరాస వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే  గురితప్పి తెలంగాణలో వాలిన జగనన్న విడిచిన బాణం, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇమేజ్  పెంచేందుకు, ఆమెను తెరాస ప్రత్యర్ధిగా చూపేందుకు, ఆమె పాదయాత్రను అడ్డుకోవడం, అరెస్ట్, గృహ నిర్భందం, రోడ్ (భైఠాయింపు) షో డ్రామాలతో రక్తి కట్టిస్తున్న తెరాస నాయకత్వం, ఇప్పడు ఏపీకి చెందిన మరో, ‘స్టార్’ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ ను తెర మీదకు తెచ్చింది. ఏపీలో ప్రస్తుతానికి బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్  తెలంగాణ తెర మీదకు ఎంట్రీ ఇచ్చారు. ఏపీలోనే కాదు  తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తుందనే సంకేతాలు ఇచ్చారు. జనసేన 32 స్థానల్లో పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. బీజేపీ అంతర్గత లెక్కల్లో, అదే విధంగా కేసీఆర్ సర్వేల్లో బీజేపీ 32 స్థానల్లో తెరాసకు గట్టి పోటీ ఇస్తుందని, ఆ 32 స్థానాల్లో బీజేపీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఇప్పడు పవన్ కళ్యాణ్  32 సీట్లలో పోటీ చేస్తారని ప్రచరం జరగడంతో పవన్, కేసేఆర్ వదిలిన బాణం అనే అనుమానానికి బలం చేకురుతోందని బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే ఇది నాణానికి ఒక వైపు, ఉహాగానం, అయితే, మరో వైపున షర్మిల బీజేపీ టచ్ లోకి వెళ్ళారని  అందుకే ఆమె అరెస్ట్ ఎపిసోడ్ లో ప్రధాని మోడీ సహా బీజేపీ నేతలు ఆమెకు సంఘీభావం ప్రకటించారని తెరాస నాయకులు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. అదే విధంగా ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం అవినీతిపై ఈడీ,సిబిఐలకు ఫిర్యాదు చేసిన షర్మిల త్వరలో ఢిల్లీకి వెళ్లి కేసీఆర్ ప్రభుత్వం పైన మరిన్ని ఫిర్యాదులు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే కేసీఆర్ ఆమెను టార్గెట్ చేశారని  మొదటి సారిగా  పాద యాత్రను అడ్డుకుని అరెస్ట్ చేశారని అంటున్నారు. అయితే  పవన్ కళ్యాణ్ విషయంలో ఇప్పటికే క్లారిటీతో ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకులు  షర్మిలతో సంబంధాల విషయంలో  మౌనంగా ఉండడంతో అనుమానాలు బలపడుతున్నాయని అంటున్నారు. తెలంగాణలో జనసేనతో తమ పార్టీకి పొత్తు ఉండదని బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గతంలోనే స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నబీజేపీ  నాయకులు షర్మిల విషయంలో మాత్రం మౌనంగా ఉంటున్నారు. నిజానికి, బీజేపీ నాయకత్వం  షర్మిలతోనే కాదు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో  ఉభయ తెలుగు రాష్ట్రాలలో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉందని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు, చెప్పారు. అయితే 2018 లో, కేసేఆర్, చంద్రబాబుబు బూచిగా చూపించి, తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని  కొంచెం అటూ ఇటవుతోందని అంటున్నారు. అదలా ఉంటే ఉహా గానాలు, వ్యూహా గానాలు ఎలా ఉన్నా, ఇప్పటికిప్పుడు బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోదని,  నిజానికి  బీజేపీనే కాదు తెరాస సహా ఏ పార్టీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోదని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికలు సమీపించే వరకు ఆట ఆలా సాగుతూనే ఉంటుందనే మాట కూడా పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది.అంతవరకు ఎవరి గోల వారిది ..చూసి, విని ఆనందించండి.

కోహ్లీ, స్మృతి ఇద్దరూ 18నే.. తగ్గేదే లే!

క్రికెట్ అనగానే ప్రపంచంలో ఆ క్రీడను అభిమానించే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ. కింగ్ కోహ్లీని అభిమానించే క్రికెట్ ప్రేమికులు ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాలన్నిటిలో ఉన్నారు. ముఖ్యంగా ఛేజింగ్ లో కోహ్లీలోని బెస్ట్ క్రికెటర్ బయటకు వస్తాడు. అంటే ప్రత్యర్థులు నిర్దేశించే విజయ లక్ష్యాన్ని ఛేదించే విషయంలో కోహ్లీ బ్యాటింగ్ విశ్వరూపాన్ని చూపుతాడు.  ముఖ్యంగా పొట్టి క్రికెట్ లో కోహ్లీ ఘనత గురించి ఎంత చెప్పినా తక్కువే. టి 20లలో అత్యధిక పరుగులు, హయ్యస్ట్ నంబర్ ఆప్ హాఫ్ సెంచరీలు, అత్యుత్తమ సగటు ఇలా దాదాపు రికార్డులన్నీ కోహ్లీ పేరునే ఉన్నాయి. అయితే అలాంటి ఘనత సాధించిన ఇండియన్ బ్యాటర్ మరొకరు ఉన్నారు. ఔను నిజమే టి20లో కోహ్లీతో సాటి రాగల క్రికెటర్ మరొకరున్నారు. అయితే పురుషుల క్రికెట్ లో కాదు. మహిళల క్రికెట్ లో ఆమె పేరు స్మృతి మందాన. మహిళల పొట్టి క్రికెట్ లో రికార్డులన్నీ స్మృతి మదాన పేరునే ఉన్నాయి. ముఖ్యంగా ఛేజింగ్ లో ఆమె బ్యాటింగ్ లెవెలే వేరు. విశేషమేమిటంటే కోహ్లీ జెర్సీ నంబర్ 18 అయితే స్మృతి జెర్సీ నంబర్ కూడా 18. ఇద్దరికీ బ్యాటింగ్ స్టైల్ నుంచి జెర్సీ నంబర్ వరకూ ఎన్నో సారూప్యతలు ఉన్నాయి.

సీఎం స్టాలిన్ సెక్యూరిటీ టీంలో మహిళా కమెండోలు

తమిళనాడు మహిళల సాధికారత దిశగా మరో ముందడుగు వేసింది. అన్ని రంగాలలో మహిళలకు సమప్రాధాన్యత ఇవ్వాలని తమిళనాడు సీఎం చెబుతున్నారు. ఆ సమ ప్రాధాన్యం దిశలోనే ఇప్పుడు ఆయన సెక్యూరిటీ దళంలో మహిళా కమెండోలకు స్థానం కల్పించారు. ఒక ముఖ్యమంత్రి సెక్యూరిటీ విభాగంలో మహిళా కమెండోలకు స్థానం కల్పించడం బహుశా ఇదే మొదటి సారి. మహిళా దినోత్సవం సందర్భంగా గత మార్చి 8న తమిళనాట మహిళా కమెండో విభాగాన్ని ఏర్పాటు చేశారు. శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న 80 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 9 మందికి సీఎం సెక్యూరిటీ విశాగంలో నియమించారు. 

రేవంత్ ‘రెడ్డి’ టీం రెడీ!

తెలంగాణ కాంగ్రెస్ లో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే స్వయంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సమాజిక వర్గమే రక్ష అన్నఅభిప్రాయాన్ని గతంలోనే వ్యక్తం చేశారు. అప్పట్లో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి పలువురు సీనియర్లకు మనస్తాపం కూడా కలిగించారు. ఆ తరువాత ఆ వివాదం ఎలాగో సద్దుమణిగింది. రేవంత్ రెడ్డి ఏదో వివరణ ఇచ్చారు. అదంతా వేరే సంగతి. గడిచిపోయిన గతం కూడా. అయితే ఇప్పుడు నాడు రేవంత్ రెడ్డి ఆ మాటలు  ఏదో యథాలాపంగా అనలేదని తాజాగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కొత్త కమిటీని చూస్తే అర్దమౌతుంది. రేవంత్ ‘రెడ్డి’ తన టీమ్ లో ఆ సామాజిక వర్గానికే పెద్ద పీట వేయించుకున్నారు.   కీలకమైన ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుల పదవులతోపాటు, జిల్లా అధ్యక్షుల నియామకంలోనూ సింహభాగం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. సహజంగానే ఈ పరిణామం పట్ల పార్టీలోని ఇతర సామాజిక వర్గాలలో అసంతృప్తి వ్యక్తమైంది. ముఖ్యంగా బీసీ వర్గాలలో ఈ అసంతృప్తి మరింతగా వ్యక్తమౌతోంది. రాష్ట్ర జనాభాలో కనీసం నాలుగు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీలను నిర్లక్ష్యం చేసి రాష్ట్రంలో విజయం కోసం కాంగ్రెస్ ఎలా ప్రయత్నిస్తుందని ప్రశ్నిస్తున్నారు. పీసీసీ కమిటీల్లో ఒకే సామాజిక వర్గానికి పెద్ద పీట వేయడంపై పార్టీ అధ్యక్షుడు మల్టికార్జన్ ఖర్గేకు ఇక ఫిర్యాదులు వెల్లువెత్తనున్నాయి. ఇప్పటికే  మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆధ్వర్యంలో బీసీలు ఖర్గేకు ఫిర్యాదు చేసేందుకు హస్తిన పయనమయ్యారు. వరుస ఓటములతో రాష్ట్రంలో కుదేలైన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కులకలం రేగడం ఆ పార్టీ అభిమానులను ఒకింత ఆందోళనకు గురి చేస్తోందనడంలో సందేహం లేదు కాంగ్రెస్ కు ఉన్న . బడుగు బలహీన వర్గాల పార్టీ  ముద్ర చెరిపివేసే కుట్ర జరుగుతోందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. తాజా కమిటీకీ, గతంలో రేవంత్ రెడ్డి చేసిన రెడ్డిసామాజికవర్గసుప్రిమసీ వ్యాఖ్యలకూ లింకు పెట్టి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. పీసీసీ కమిటీలో అధిష్ఠానం ప్రకటించిన 84 మంది ప్రధాన కార్యదర్శుల్లో 22 మంది, 24 మంది ఉపాధ్యక్షుల్లో 7, రాజకీయ వ్యవహారాల కమిటీలో 6గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావడం, అలాగే డసీసీ కమిటీల్లోనూ పది మంది ఆ సామాజిక వర్గానికి చెందిన వారే ఉండటం ఒకెత్తయితే.. వారంతా కూడా రేవంత్ వర్గీయులే కావడం పార్టీలోని ఆయన వ్యతిరేకులకు మరింత ఆగ్రహం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే కమిటీల విషయంలో రేవంత్ రెడ్డి అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ  నేతలు ఆరోపిస్తున్నారు.   సాధారణంగా  అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే కమిటీను ప్రకటిస్తారు. ఇప్పుడూ అలాగే చేశామని కాంగ్రెస్ హైకమాండ్ చెబుతున్నప్పటికీ సీఎల్పీ నాయకుడినైన తనకే కమిటీల గురించి ఎలాంటి సమాచారం లేదని భట్టి విక్రమార్క ప్రకటించడమే పార్టీలో అసంతృప్తి ఏ స్థాయికి చేరుకుందో తెలియజేస్తోంది. రేవంత్‌రెడ్డి, మాణిక్యం ఠాగూర్‌ కలసి అధిష్ఠానాన్ని తప్పుదోవపట్టించి, కమిటీని తమ సొంత మనుషులతో నింపేసుకున్నారన్న విమర్శలు, ఫిర్యాదులు  వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలు, ఫిర్యాదులపై అధిష్ఠానం స్పందన ఎలా ఉంటుందన్నది చూడాలి.

ఏపీలో ఉద్యోగుల ఉద్యమ బాట

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ తీరు  పట్ల అన్ని వర్గాలలోనూ తీవ్ర అసహనం, ఆగ్రహం పెచ్చరిల్లుతున్నాయి. ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్తితి రోజు రోజుకూ దిగజారుతోంది. చివరికి ఉద్యోగులు, పెన్షనర్లకు సమయానికి వేతనాలు ఇవ్వలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. అన్నింటికీ మించి ఇప్పటికే తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించడానికి నిధుల కోసం అన్వేషణలోనే ప్రభుత్వం పుణ్యకాలాన్ని గడిపేస్తోంది. ఇక పాలనపై దృష్టి ఎక్కడ సారిస్తుందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలన్న ఉద్దేశమే లేనట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.  దీంతో కాంట్రాక్టర్లు కొత్త పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. చేస్తున్న పనులలో వేగం తగ్గించేశారు. దీంతో కొత్త పనులు మొదలు కావడం లేదు. ఇప్పటికే ఆరంభమైన పనులు పూర్తయ్యే పరిస్థితే కనిపించడం లేదు. ఇక గోదావరి పెన్నా నధుల అనుసంధానం పనులైతే పూర్తిగా నిలిచిపోయాయి. వేల కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోవడానికి చేసిన పనులకు ప్రబుత్వం బిల్లులు క్లియర్ చేయకపోవడమే కారణం. ఇక వేదాద్రి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనుల సంగతైతే మరీ దారుణం. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ పథకం రూపకల్పన జరిగింది. టెండర్లు కూడా పిలిచారు. అయితే వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత రివర్స్ టెండరింగ్ అంటూ మళ్లీ టెండర్లు పిలిచి, అదే సంస్థకు పనులు అప్పగించింది. అయితే పనులు ప్రారంభం కాలేదు.ప్రస్తుతం ఏపీలో వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు పనులు ప్రభుత్వ నిర్వాకం కారణంగా నిలిచిపోయాయి. ప్రజాప్రతినిథులు, ప్రభుత్వ సలహాదారుల వేతనాలు సక్రమంగా చెల్లిస్తున్న ప్రభుత్వం కాంట్రాక్టులు దక్కించుకుని అప్పులు చేసి మరీ పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు చెల్లించడం లేదు. అడిగినా సమాధానం ఇచ్చే నాథుడు కనిపించడం లేదు. అలాగే వేతన జీవులకూ ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మేరకే వేతనాల చెల్లింపు జరుగుతోంది. నెల నెలా మొదటి తేదీన అందాల్సిన వేతనం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అంతే కాదు ఏ శాఖకు ఏ తేదీన వేతనాలు పడతాయో తెలియని పరిస్థితి.  ఇక ఉపాధ్యాయుల పరిస్థితి అయితే మరీ దయనీయం. పీఆర్సీ కోసం పట్టుబట్టారన్న కోపాన్ని వేతనాల విషయంలో తీర్చుకుంటోందా అన్నట్లుగా జగన్ సర్కార్ వ్యవహార శైలి ఉంటోంది. నవంబర్ జీతాలు ఇప్పటికీ చాలా జిల్లాలలో టీచర్లకు అందలేదు. ఎప్పుడు అందుతాయో కూడా తెలియని పరిస్థితి.వేతన జీవులకు సకాలంలో వేతనాలు అందకుంటే ఉండే ఇబ్బందులను ప్రభుత్వం అసలు పరిగణనలోనికే తీసుకోవడం లేదు.   ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు పదవీ విరమణ రోజునే వారికి రావలసిన ప్రయోజనాలన్నీ అందజేసి, పెన్షన్ పేపర్లు కూడా సిద్ధం చేసి గౌరవంగా సాగనంపేవారు.   ఇప్పుడా పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. తమ హక్కుల కోసం గొంతెత్తితే అరెస్టులూ, నిర్బంధాలు. నెలంతా పని చేసి వేతనం అడిగేందుకు వీలులేని పరిస్థితి. జీవితమంతా కొలువు చేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పెన్షన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే  ఉద్యోగులు ఉద్యమ బాటకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారని అంటున్నారు.

కవితకు కల్వకుంట్ల దూరం.. తెలంగాణ జాగృతే రక్ష?

కల్వకుంట్ల కవిత. ఎంపీ కావచ్చును, ఎమ్మెల్సీ కావచ్చును, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కావచ్చును,  రాజకీయంగా ఆమె ఏమైనా కావచ్చును, ఏమీ కాకపోనూ వచ్చును.కానీ, ఆమె ముఖ్యమంత్రి, తెరాస/ భారాస అధ్యక్షుడు కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె. రాష్ట్ర మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుట్ల తారకరామా రావు సోదరి. కల్వకుట్ల కుటుంబ సభ్యురాలు. నిజానికి ఆమె రాజకీయానికి పునాది, ఆమె కుటుంబం. కేసీఆర్ లేనిదే తెలంగాణ వచ్చేదో లేదో కానీ, కేసీఆర్ లేకుంటే కవిత రాజకీయ జీవితం ఇలా అయితే ఉండేది కాదు. కల్వకుట్ల బ్రాండ్ నేమ్ , కేసేఆర్ కుమార్తె అనే ట్యాగ్లైన్ తోనే ఆమె రాజకీయంగా ఎదిగొచ్చారు. నిజానికి, కేసీఆర్ అనే మూడక్షరాలు లేకున్నా తెలంగాణ వచ్చేదేమో కానీ, కవిత, కేటీఆర్ సహా  కల్వకుట్ల కుటుంబ సభ్యులు ఎవరు ఈరోజున్న స్థితిలో అయితే ఉండేవారు,కాదు. అలాగే, ఈరోజు కవిత సహా కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ఎదుర్కుంటున్న సమస్యలు  చికాకులు కూడా  ఉండేవి కాదేమో,  ఇది ఏవరైనా అంగీకరించి తీరవలసిన నిజం. సరే అది వేరే విషయం.అయితే, తెలంగాణ రాజకీయాల్లో ఫస్ట్ ఫ్యామిలీగా, రాజకీయంగా తిరుగులేని కుటుంబంగా నిలిచిన, కల్వకుంట్ల కుటుంబం, ఢిల్లీ లిక్కర్  కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న కల్వకుంట్ల కవితను దూరం పెట్టిందా? ఆ మచ్చ ఇటు పార్టీకి, అటు కుటుంబానికి అంటకుండా ఉండేందుకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి నంతవరకు కల్వకుంట్ల కవితతో పార్టీ పరంగా లేదా కుటుంబ పరంగా ప్రత్యక్ష సంబంధాలు లేకుండా, జాగ్రత్త వహిస్తున్నారా. అందుకే, తెలంగాణ జాగృతి నుంచి నైతిక మద్దతు పొందేందుకే ఆమె ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో సీబీఐ ఎదుట హాజరైన మరుసటి రోజే, తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఇంత కాలంగా ఢిల్లీ లిక్కర్  కుంభకోణంలో కల్వకుంట్ల కవిత పేరు, ప్రముఖంగా వినిపిస్తున్నా, కేసీఆర్, కేటీఆర్ సహా కల్వకుట్ల కుటుంబ సభ్యులు ఎవరూ పెద్దగా స్పందించలేదు.అయితే  ఈ కేసు విచారణ చేస్తున్న, సీబీఐ ఆమెకు సీఆర్పీసీ 160 నోటీసు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆమె మూడు నాలుగు పర్యాయాలు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి, ఇతర పార్టీ నేతలతో పాటుగా, న్యాయవాదులతోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్ర గురించి, ఆ కేసులోంచి ఆమె బయటపడే మార్గాల గురించి  చర్చించినట్లు వార్తలొచ్చాయి. కవితకు నోటీసు వచ్చిన వెంటనే, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులూ పోటీలు పడి మరీ, కవితకు మద్దతుగా ప్రెస్ మీట్లు పెట్టారు. కేంద్రాన్ని, మోడీని, సిబిఐ, ఈడీలను విమర్శించారు. బీఆర్ఎస్ భయానికి మోడీ, కేసీఆర్ ను కట్టిడి చేసేందుకు  కవితను టార్గెట్ చేశారని విమర్శించారు. అలాగే,ఆదివారం ఆరుగంటలకు పైగా ఆమెను, విచారించే వరకు కూడా కల్వకుంట్ల కుటుంబం కాకున్నా పార్టీ నాయకులు, మంత్రులు,ఎమ్మెల్యేలు ఆమెకు అండగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరికించిందని వాదించారు.  అయితే, విచారణ పూర్తయి, ఆమె ప్రగతి భవన్ కు వెళ్లి వచ్చిన తర్వాత సీన్  మారిపోయింది. అంతలోనే  సీబీఐ కవితకు 91 సీఅర్పీసీ నోటీసు ఇచ్చి ఆమె ఇచ్చిన  వాంగ్మూలానికి సంబదించిన ఆధారాలను ఇవ్వాలని కోరింది. అంతే  తెరాస నాయకులు మెల్లగా మెల్లగా  మౌనంలోకి వెళ్లి పోయారు. ముఖ్యమంత్రి, కేసేఆర్ సతీ సమేతంగా ఢిల్లీ వెళ్లారు. ఇక ఆపైన కల్వకుంట్ల కుటుంబం, తెరాస/భారాస నాయకులు అవసరానికి మించి మాట్లాడడం లేదు.ఈ పరిణామాలను గమనిస్తే, వ్యూహాత్మకంగానే కావచ్చును  కల్వకుంట్ల కవితను, కల్వకుంట్ల ఫ్యామిలీ పార్టీ తెరాస / భారాస, కల్వకుంట్ల కుటుంబం తాత్కాలికంగా అయినా దూరం పెట్టిందనే మాట పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అందుకే ఆమె  తనను తాను రక్షించుకునేందుకు  తెలంగాణ జాగృతిని తెర మీదకు తెచ్చారని అంటున్నారు. అందుకే ఆమె, తెలంగాణ జాగృతి విస్తృత స్తాయి సమావేశం ఏర్పాటు చేశారు.  తెలంగాణ తరహా ఉద్యమాన్ని దేశమంతా విస్తరిస్తామని ప్రకటించారు.  ఒక్క పిలుపు ఇస్తే ప్రతీ రాష్ట్రంలో తెలంగాణ జాగృతి శాఖ సిద్ధమవుతుందని  ధీమా వ్యక్తం చేశారు.  బీజేపీపై పోరాటం విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు.  సానుభూతికోసమో సెంటిమెంట్ పండించేందుకో తెలియదు కానీ  తెలంగాణ ఆడబిడ్డల కళ్లలో నుంచి వచ్చేది నీళ్లు కాదు నిప్పులని, అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు  మాట్లాడితే వాళ్లపైకి సీబీఐ వస్తోంది, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని, తనపై జరుగతున్న దాడులు కూడా అదే కోవకు చెందుతాయని నమ్మ పలికారు. అయినా  దాడులకు తాను భయపడనని ప్రకటించారు. అయితే, ఇప్పడు ప్రశ్న ఆమె భయపడుతున్నారా, లేదా అని కాదు. ఇంత అర్జెంటుగా కల్వకుంట్ల కవిత ఫ్యామిలీని, పార్టీని కాదని తెలంగాణ జాగృతిని ఎందుకు వేదిక చేసుకోవలసి వచ్చింది? కవితకు కల్వకుంట్ల దూరమయిందా? ఏమో  తెలియదు కానీ, ఆమె తమ భవిష్యత్ పోరాటానికి తెలంగాణ జాగృతిని వేదిక చేసుకున్నారా, అన్న అనుమానాలు మాత్రం నిజమని అంటున్నారు.

గ్రాండ్ ఓల్డ్ పార్టీకి చీపురు చెక్!

దేశంలోనే అత్యంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. దశాబ్దాల పాటు ఏకఛద్రాధిపత్యంగా దేశంలో అధికారంలో ఉన్నపార్టీ కాంగ్రెస్. అయితే ఇప్పుడు ఆ పార్టీ ఉనికి కోసం పోరాడుతోంది. ప్రధాన విపక్షంగానైనా తన స్థానాన్నినిలబెట్టుకోవాలని తాపత్రేయపడుతోంది. అయితే ఇటీవల ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ కు, గుజరాత్, హిమాచల్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి మరింత బలహీన పడటం ఖాయమన్న అభిప్రాయమే సర్వత్రా  వ్యక్తమైంది. ఏదో గుడ్డిలో మెల్ల అన్న చందంగా హిమాచల్ లో అధికారం చేజిక్కించుకున్నప్పటికీ.. కాంగ్రెస్ కు, రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిన బీజేపీకి ఓట్ల శాతం ఒకటి కంటే తక్కువే ఉండడాన్ని బట్టే కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో ఎంత నేరోగా గెలిచిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక గుజరాత్ లో అయితే కాంగ్రెస్ గత ఎన్నికలలో సాధించినన్ని స్దానాలను కూడా గెలవలేకపోయింది. వరుసగా ఆరు సార్లు అధికారంలో ఉండి.. ఏడో సారి ఎన్నికలకు సిద్ధమైన బీజేపీ గుజరాత్ లో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదనడంలో సందేహం లేదు.  దీంతో ఈ సారి గుజరాత్ లో కాంగ్రెస్ విజయం నల్లేరు మీద బండి నడకే అనుకున్నారంతా. అయితే ఫలితాలు అందుకుపూర్తి భిన్నంగా వచ్చాయి. బీజేపీ సునాయాస విజయం సాధించింది. ఇక ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల విషయం తీసుకుంటే.. ఇక్కడ కాంగ్రెస్ సోదిలోకి కూడా లేదన్నంతగా ఫలితాలు వచ్చాయి. ఈ మూడు ఎన్నికల ఫలితాలలో ఒక విషయం మాత్రం ప్రస్ఫుటంగా తేలుతున్న విషయం ఏమిటంటే.. ఢిల్లీలో కాంగ్రెస్   ఉనికి మసకబారింది. గుజరాత్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ ను కబలించేయడానికి ఆప్ రోజు రోజుకూ బలపడుతోంది. ఇప్పటికిప్పుడు అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాకున్నా, ఆ తరువాతి ఎన్నికల సమయానికైనా కాంగ్రెస్ ను వెనక్కు నెట్టి ఆప్ బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని  రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నాయి.  ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ప్రస్థానం ప్రారంభించినది మొదలు  ఏనుగు కుంభ స్థలాన్నే లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతోందనేలాగే ఆ పార్టీ ప్రస్థానం కొనసాగింది. బీజేపీ, కాంగ్రెస్ లను సవాల్ చేస్తూ తొలుత ఢిల్లీలో బలపడింది. ఆ తరువాత అంచలంచలుగా ఇతర రాష్ట్రాలలో విస్తరిస్తున్నది.    బీజేపీయేతర, కాంగ్రెస్సెతర పార్టీలకు, కూటములకు ప్రత్యామ్నాయంగా బలపడుతోంది.  ఢిల్లీలో వరుసగా రెండవసారి అధికారం చేజిక్కించుకోవడమే కాకుండా, పంజాబ్ లో కాంగ్రెస్ ఆశలకు గండి కొట్టి మరీ అక్కడ అధికారాన్ని దక్కించుకోవడం వరకూ.. ఆప్ రాజకీయ ప్రస్థానం దేశ రాజకీయాలలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించే దిశగానే సాగుతోందని చెప్పవచ్చు. ఓట్లూ, సీట్లూ లెక్కలను పక్కన పెట్టి జనానికి చేరువ కావడం అన్న వ్యూహంతోనే ఆ పార్టీ అడుగులు వేస్తున్నది. ఒకదాని వెంట ఒకటిగా రాష్ట్రాలలో బలోపేతం కావడంపైనే దృష్టి పెట్టింది. గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లూ, సీట్ల విషయంలో ఆ పార్టీ ఎటువంటి సంచలనాలూ సృష్టించ లేదు.. కానీ రెండు రాష్ట్రాలలోనూ పార్టీల (బీజేపీ, కాంగ్రెస్) గెలుపు ఓటములను ప్రభావితం చేసింది. హిమాచల్ లో పోటీ చేసిన ఏ స్థానంలోనూ డిపాజిట్ దక్కించుకోకపోయినా.. ఆప్ ఆ రాస్ట్రంలో తన ఉనికిని బలంగా చాటిందనడంలో సందేహం లేదు. ఆప్ భావజాలం ప్రజలపై ప్రభావం చూపుతోందన్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రజల ఆలోచనలను ప్రత్యామ్నాయం వైపు మళ్లించేలా ఆప్ ప్రయత్నాలు ఫలించే సూచనలూ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ యేతర కూటమి కాకుండా మరో సింగిల్ పార్టీ ప్రత్యామ్నాయం కోసం ఆప్ చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పటికిప్పుడు కాకపోయినా ముందు ముందు జనం ఆకర్షితులయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కు ఉన్న స్థానంపై ఆప్ కన్నేసింది. ఢిల్లీలో అది సాధించింది. ఇక జాతీయ స్థాయిలో ఆ స్థానం కోసం ఆప్ అడుగులు వేస్తోంది. కూటముల, ఫ్రంట్ ల కలగూర గంప ప్రభుత్వాలను చూసిన ప్రజలు సింగిల్ పార్టీగా జాతీయ స్థాయిలో ఆప్ కు ఓ చాన్స్ ఇస్తే అన్న ఆలోచన కలిగేలా చేయడం కోసమే ఆప్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందన్న విషయాన్ని గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఫలితాలు తేటతెల్లం చేశాయి. 

సీఎం సతీమణికి ఆలయ ఛత్రం! వివాదంలో స్టాలిన్ కుటుంబం

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నారు కానీ, ఒక ముఖ్యమంత్రి తలచుకుంటే తన సతీమణికి దేవుడి కంటే ఎక్కువ ప్రాముఖ్యత దక్కుతుందని ఎవరూ అనలేదు. కానీ తమిళనాడులో మాత్రం ఆలయ అధికారులు అలా చేసి సీఎం సతీమణి సేవలో తరించిపోయారు. విషయమేమిటంటే.. చెన్నై నగరంలోని ఓ ఆలయ వేడుకల్లో పాల్గొన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ వర్షంలో తడవకుండా ఉండేందుకు ఆ ఆలయ గొడుగు వాడటం తీవ్ర వివాదానికి దారితీసింది. నిజానికి తమిళనాడు సీఎం అధికారిక దర్పాలకు దూరంగా చాలా సింపుల్ గా ఉంటారు. సామాన్యుడిలా జనంలో మమేకమౌతారు. అయితే అధికారులు అత్యుత్సాహంతో చేసిన పని వల్ల ఆయన, ఆయనతో పాటు ఆయన సతీమణి దుర్గా స్టాలిన్ కూడా వివాదంలో చిక్కుకున్నారు. సీఎం సతీమణి వర్షంలో తడవకుండా ఉండటం కోసం  అత్యంత పవిత్రమైన ఆలయ ఛత్రాన్ని  ఉపయోగించడం  ఘోర తప్పిదమని రాష్ట్ర బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. చెన్నైలోని తిరువొత్తియూరులోని త్యాగరాజ స్వామివారి ఆలయ  ఉత్సవమూర్తి ఊరేగింపు ఆలయ మాఢవీధిలో జరిగింది. ఆలయ ప్రధాన అర్చకుడు విగ్రహాన్ని ఊరే గించేందుకు ఆలయ ప్రధాన ద్వారం వెలుపలకు వచ్చారు. ఆ ఉత్సవమూర్తి వానలో తడవకుండా ఉండేందుకు సిబ్బంది ఛత్రం పట్టారు. అదే సమయంలో దుర్గా స్టాలిన్ ఊరేగింపు వెనుక నడచి వస్తుండగా వర్షంలో ఆమె తడవకుండా ఓ ఉద్యోగి ఆలయ ఛత్రాన్ని పడుతూ అనుసరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. 

సింహపురి వర్సిటీలో సిత్రం చూశారా? 5,360 మార్క్స్ ఔటాఫ్ 800

నెల్లూరులోని సింహపురి విశ్వవిద్యాలయంలో బోధన ఎంత ఘనంగా సాగుతోందో చెప్పడానికి ఆ వర్సిటీ కాలేజీలో నాలుగో సెమిస్టర్ పేపర్ల వాల్యుయేషన్ తీరును చూస్తే ఇట్టే అర్ధమైపోతుంది. ఫోర్త్ సెమిస్టర్ ఫలితాలలో తమకు వచ్చిన మార్కులు చూసి విద్యార్థులు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. 800 మార్కులకు నిర్వహించిన పరీక్షలకు ఒక్కొక్కరికి 2 వేలకు పైగానే మార్కులొచ్చాయి. ఓ విద్యార్థికైతే ఏకంగా 5,360 మార్కులు వచ్చాయి. ఆ మార్కులు చూసిన విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. తాము ఏ గ్రేడ్ లో పాసయ్యామో తెలియక గందరగోళంలో పడ్డారు.   పరీక్షలు నిర్వహించిన ఎనిమిది నెలల తరువాత విడుదల చేసిన ఈ ఫలితాలలో మార్కులు తప్పుల తడకగా ఉండటంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 800 మార్కులకు నిర్వహించిన పరీక్షల్లో తమకు రెండు వేలకు పైగా మార్కులువచ్చినట్లు ఫలితాలలో ఉండటంపై విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిని యూనివర్సిటీ రిజిస్ట్రార్ చాలా లైట్ గా తీసుకున్నారు. మార్కుల జాబితాలో తప్పులుంటే ఏమైంది.. సరి చేసి మళ్లీ విడుదల చేస్తామంటూ కూల్ గా సమాధానమిస్తున్నారు. 

జగన్ పాలనపై వైఎస్ ‘ఆత్మ’ ఘోష

దివంగత ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్రరావు ఎట్టకేలకు నోరు విప్పారు. అదీ.. తన ప్రాణ స్నేహితుడు వైఎస్సార్ తనయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనా తీరు పై  వైఎస్‘ఆత్మ’  ఘోష వినిపించింది. దాదాపు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత .. అదీ మూడున్నరేళ్ల అనంతరం.... కేవీపీ రామచంద్రరావు ఈ విధంగా స్పందించడం జగన్ పాలనా వైఫల్యానికి అద్దంపడుతోంది. మూడున్నరేళ్లలో జగన్ పాలన గురించి కానీ, విపక్షాలపై ఆయన సాగించిన అణచివేత గురించి కానీ పన్నెత్తి మాట్లాడని కేవీపీ తాజాగా ఏపీలో జగన్ పాలనపై ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం, విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇలా ఏ విషయంలోనూ జగన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం సంగతి అటుంచి కనీసం విజ్ణప్తి కూడా చేయకపోవడాన్ని కేవీపీ తప్పుపట్టారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధపడుతున్న సమయంలో దానిని ఆపేందుకు సీఎం జగన్ ఒక్క ప్రయత్నం కూడా చేయడం లేదని కేవీపీ  విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తుందని చట్టంలో ఉందని వైఎస్ కుటుంబానికి ఎంతో సన్నిహితుడైన కేసీపీ... జగన్ కాంగ్రెస్ నుంచి విడిపడి కొత్త పార్టీని పెట్టుకున్నా ఆయన మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ సీఎం జగన్ కు సాయం చేస్తున్నారని కేవీపీ విమర్శలు లేకపోలేదు. అయితే తాజాగా కేవీపీ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ కు సన్నిహితుడైన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా సీఎం జగన్ పై విమర్శలు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి హాజరైన కేవీపీ ఆ తర్వాత సీఎంను కలవలేదు. కానీ హైదరాబాద్ కేంద్రంగా వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా విజయమ్మ నిర్వహించిన సదస్సులో  కేవీుపీ పాల్గొన్నారు.  అధికారం చేపట్టిన తరువాత ఒక్కరొక్కరుగా వైఎస్ సన్నిహితులు, చివరికి కుటుంబ సభ్యులు ఇలా అందరూ దూరం అవుతున్నా.. కేవీపీ మాత్రం ఇంత వరకూ జగన్ కు తెరవెనుక సహాయం అందిస్తున్నారన్న ప్రచారం ఉంది. తాజాగా ఆయన వ్యాఖ్యలతో ఆయన కూడా జగన్ కు దూరం జరిగారని తేటతెల్లమైపోయింది.  ఏపీ విభజన అంశాలను నెరవేర్చడానికి జగన్ ప్రయత్నించలేదనీ,  బీజేపీకి దగ్గరై  జగన్ ఏపీ అభివృద్ధిని దెబ్బతీస్తున్నారని కేవీపీ అనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటి వరకూ జగన్ బీజేపీకి దగ్గరవ్వడం కాదు.. కేసుల భయంతో ఆ పార్టీ అగ్రనాయకత్వం ఏం చెబితే అది చేస్తున్నారనీ ఉన్న విమర్శలకు కేవీపీ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చేవిగా ఉన్నాయి. కేవీపీ బహిరంగంగా జగన్ పాలనపై విమర్వలు చేయడంతో..ఇప్పుడు అందరి దృష్టీ సూరీడు అనే వ్యక్తిపై పడింది. కేవీపీ వైఎస్ కు ఆత్మ అయితే సూరీడు అనే వ్యక్తి వైఎస్ కు అంగరక్షకుడిగా ఆ రోజుల్లో గుర్తింపు పొందారు. ప్రభుత్వ కార్యక్రమమైనా, ప్రైవేటు కార్యక్రమం అయినా వైఎస్ ఎక్కడుంటే అక్కడ సూరీడు ఉండేవాడు. ఇంతకీ సూర్యనారాయణ రెడ్డి అనే సూరీడు కూడా వైఎస్ మరణానంతరం జగన్ పక్కన ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. వైఎస్ కు అత్యంత సన్నిహిడుడిగా గుర్తింపు పొందిన సూరీడు ఆయన మరణం తరువాత ఎందుకు జగన్ కు దూరం జరిగారు. కనీసం వైఎస్ వర్దంతి, జయంతి సందర్భాలలో కూడా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఇంత కాలానికి వైఎస్ ‘ఆత్మ’ కేవీపీ బహిరంగంగా జగన్ పాలనను తప్పుపడితే.. జగన్ తీరు, వ్యవహార శైలిని గుర్తించిన సూరీడు వైఎస్ మరణం తరువాత జగన్ కు దూరమయ్యారని నెటిజన్లు అంటున్నారు.       

మళ్లీ పెద్ద నోటు రద్దు

మళ్లీ నోట్ల రద్దు ప్రకటనకు రంగం సిద్దమవుతోందా? అదీ ముఖ్యంగా రెండు వేల రూపాయిలు.. ఇకపై   ఆదృశ్యం కానుందా?  గతంలో ఐదు వందల రూపాయిలు.., వెయ్యి రూపాయిల నోట్ల రద్దు చేసిన కేంద్రం ఇప్పుడు మరో సారి నోట్ల రద్దుకు సిద్ధమౌతోందా?   ఈ సారి  రెండు వేల రూపాయిల నోట్లను రద్దు చేయనున్నారా?  ఔననే సమాధానమే వస్తోంది. ఇప్పటికే రెండు వేల రూపాయల నోట్ల రద్దుపై  మోదీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుందన్న చర్చ   హస్తినలో వాడీ వేడిగా నడుస్తోంది.  మరోవైపు రాజ్యసభలో సోమవారం బీజేపీ ఎంపీ సుశీల్ మోదీ.. రెండు వేల రూపాయిల నోటు... బ్లాక్ మనీకి కేరాఫ్ ఆడ్రస్‌గా మారిందని అన్నారు. అలాగే మనీ లాండరింగ్‌కి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలకు, ఉగ్రవాద మూకలకు నిధులకు..  రెండు వేల రూపాయిల నోట్లు అత్యంత కీలకంగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రెండు వేల రూపాయిల నోట్లను దశల వారీగా రద్దు చేయాలంటూ ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఓ వేళ  రెండు వేల నోట్ల రద్దు చేసేటట్లు అయితే.. వాటిని మార్చుకోనేందుకు దేశ ప్రజలకు రెండేళ్ల సమయం ఇవ్వాలని ఆయన కేంద్రానికి సూచించారు. ఇప్పటికే ఏటీఎంల్లోరెండు వేల రూపాయిల నోట్లు కనిపించడం లేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే రెండు వేల నోట్లపై ప్రజల్లో ఓ విధమైన ఊహాగానాలు ఊపందుకోన్నాయని.. వీటిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత   ప్రభుత్వానిదేనంటూ ఆయనీ సందర్బంగా చెప్పారు. మరో వైపు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం.. గత మూడేళ్లు నుంచి అంటే 2019 నుంచి   రెండు వేల రూపాయిల నోట్లు ముద్రణను నిలిపి వేసిందని ఈ సభ సాక్షిగా ఎంపీ సుశీల్ మోదీ గుర్తు చేశారు.  2016 నవంబర్ 8న దేశంలో నల్లధనాన్ని నిర్మూలించడం కోసం.. పెద్ద నోట్ల రద్దు చేస్తున్నట్లు దేశ ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ క్రమంలో ఐదు వందలు, వెయ్యి రూపాయిల నోట్లను రద్దు చేశారు. కానీ ఆ తర్వాత.. అదే మోదీ ప్రభుత్వం రెండు వేల రూపాయిల నోట్లను   ముద్రించి చెలామణీలోకి తెచ్చింది. దీంతో పెద్ద నోట్లను రద్దు చేసి.. వాటి స్థానంలో మరీ పెద్ద నోట్లు పెట్టడం ఏమిటనే విమర్శ అప్పట్లో పెద్దగా వినిపించింది.   ఆ తర్వాత మోదీ ప్రభుత్వం ఏమనుకుందో ఏమో కానీ.. 2019 నుంచి రెండు వేల రూపాయిల నోట్ల ముద్రణను నిలిపివేసింది. అదీకాక... ఓ వైపు సార్వత్రిక ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దూసుకొస్తున్నాయి. ఇప్పటికే బహిరంగ మార్కెట్‌లో రెండు వేల రూపాయిల నోట్లు నేపాలి మాంత్రికుడు మాయం చేసినట్లు మాయమైపోయాయి. ఎన్నికల వేళ.. ఓటర్ల కోసం వివిధ రాజకీయ పార్టీలు.. ఇప్పటికే రెండు వేల రూపాయిల నోట్లను.. కట్టలుగా పేర్చి  గోదాముల్లో దాచేశాయనే ఓ వదంతి అయితే అటు ప్రజల్లో.... ఇటు నెటిజన్లుల్లో షికారు చేస్తోంది. అలాంటి వేళ.. ఓ వేళ రెండు  వేల నోట్ల రద్దు చేస్తే మాత్రం.. అధికార పార్టీలకే కాదు.. ప్రతిపక్ష పార్టీలకు సైతం పట్టపగలే చుక్కలు  కనిపిస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు. 

ఏపీలో బీఆర్ఎస్ కు వైసీపీ స్వాగతం

వైసీపీ కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ కు స్వాగతం పలుకుతోంది. ఇంకా ఏపీలో అడుగే పెట్టని బీఆర్ఎస్ కు వైసీపీ రెడ్ కార్పెట్ లో స్వాగతం పలకడానికి సిద్ధమౌతోంది. రాజకీయ లబ్ధి కోసం.. వైసీపీ పాలనా వైఫల్యాలను ఎత్తి చూపుతూ తెలంగాణలో మైలేజ్ పెంచుకున్న టీఆర్ఎస్ పార్టీయే పేరు మార్చుకుని బీఆర్ఎస్ గా మారింది. అటువంటి బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలోకి ఆహ్వానిస్తే తనకు రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందని వైసీపీ భావిస్తోంది. బీఆర్ఎస్ ఏపీలో అడుగుపెడితే ఎవరికి రాజకీయంగా నష్టం జరుగుతుందన్న చర్చ తెరమీదకు వచ్చిన నేపథ్యంలో వైసీపీ కేసీఆర్ బీఆర్ఎస్ కోరితే ఆ పార్టీకి మద్దతు కూడా ఇస్తామని ప్రకటించింది. దీనిని బట్టే బీఆర్ఎస్ ఎంట్రీ తెలుగుదేశం కు రాజకీయంగా ఒకింత నష్టం చేస్తుందన్న భావన వైసీపీలో ఉందన్నది అవగతమౌతోంది. వైసీపీ సీనియర్ నేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి  అందుకే ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తేనే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతే కాదు   ఏపీలో బీయారెస్ కు ఆ పార్టీ అధినేత కేసీఆర్ మద్దతు కావాలని కోరితే ఇచ్చేందుకు కూడా తాము సిద్ధమని చెప్పకనే చెప్పేశారు.   ఇప్పటికే బీఆర్ఎస్ ఏపీలో ఎంటర్ అయితే రాజకీయంగా వైసీపీకి లబ్ధి చేకూరుతుందన్న అంచనాలలో ఆ పార్టీ ఉంది.  అందుకే తెలంగాణ సీఎం కోరితే జగన్ ఆలోచించి సానుకూల నిర్ణయం తీసుకుంటారని సజ్జల చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో అన్ని విధాలుగా వైసీపీ గ్రాఫ్ పడిపోతోంది. వైసీపీకి అనుకూలంగా ఏ పార్టీ కూడా లేదు. పైపెచ్చు విపక్షాలన్నీ ముఖ్యంగా జనసేన, బీజేపీలు తెలుగుదేశం పార్టీకి దగ్గరౌతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలి అధికార పార్టీకి లబ్ధి చేకూరాలంటే బీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీయే మార్గమని వైసీపీ తలపోస్తున్నది. అయితే ఇరు రాష్ట్రాలూ మళ్లీ కలవాలన్న నోటితోనే సజ్జల బీఆర్ఎస్ కు మద్దతు అనడాన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న అనుమానాలు అయితే రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే ఇరు రాష్ట్రాలూ మళ్లీ కలిసిపోతే స్వాగతించే విషయంలో వైసీపీ ముందుంటుంది అన్న వైసీపీ సీనియర్ నేత, రాజకీయ సలహాదారు సజ్జల మాటల వెనుక ఉన్నది కేసీఆర్ వ్యూహమేనన్న భావన కూడా రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతోంది. ఇందుకు ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ల మధ్య బహిరంగ రహస్య మైత్రి కూడా ఒక కారణమేనని చెప్పక తప్పదు. ఒకే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (తెలుగు రాష్ట్రాల పున: విలీనం గురించి, బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్న తెరాసకు ఏపీలో స్వాగతం గురంచీ సజ్జల చెబుతున్న మాటల వెనుక ఉన్న వ్యూహమేమిటన్న చర్చ ఇప్పుడు రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. 

పాద యాత్ర ..పోరు బాట

తెలంగాణలో ఇప్పడు రాజకీయ నాయకుల పాద యాత్రల సీజన్ నడుస్తోంది. ఓ వంక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ప్రజా సంగ్రామ యాత్ర  ఐదవ విడత పాద యాత్ర సాగుతోంది. మరో వంక వైఎస్సార్ తెలంగాణ పార్టీ, (వైఎస్సార్ టీపీ) అధినాయకురాలు వైఎస్ షర్మిల సుమారు సంవత్సర కాలానికి పైగా, అంచెల వారీగా సాగిస్తూ వస్తున్న  ప్రజాప్రస్థానం పాద యాత్రకు బ్రేక్ పడింది. వారం రోజుల క్రితం వరంగల్ లో ఆమె యాత్రను తెరాస నాయకులు అడ్డుకున్నారు. ఇక అక్కడి నుంచి ఆమె యాత్రకు ముందుకు సాగకుండా, ఒకదానివెంట ఒకటిగా అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పడు ఆమె యాత్ర అనుమతి కోసం ‘దీక్ష’ చేసి ఆసుపత్రి పాలయ్యారు. ఆమె పాదయాత్రకు కోర్టు అనుమతి ఇచ్చినా, తెరాస సర్కార్,మాత్రం ససేమిరా అంటోంది.  నిజానికి, బండి సంజయ్  యాత్రకు మొదట్లో పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే, కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత పోలీసులు బండి యాత్రకు ఓకే చెప్పారు. కానీ, షర్మిల విషయంలో మాత్రం కోర్టు అనుమతించినా, పోలీసు పూజారులు నో  అంటున్నారు. అయితే, ఇంతవరకు ఎప్పుడూ షర్మిల యాత్రను అడ్డుకోని తెరాస, ఇప్పడు హటాత్తుగా షర్మిల యాత్రను అడ్డుకోవడం వెనక ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఉమ్మడి వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వ్యూహం ఏమిటో కానీ, ఇదేదో ట్రయాంగిల్  పొలిటికల్ స్టొరీలా ఉందనే  అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి.  అదలా ఉంటే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రకు సిద్డంవుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి డిసెంబర్ 9 నుంచి ఆయన పాదయాత్ర మొదలవుతుందని, కొంత ప్రచారం జరిగింది. అయితే,డిసెంబర్ 7 నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో, ఆయన యాత్రను వాయిదావేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, అదొక కారణమా అయితే కావచ్చును కానీ, అసలు కారణం వేరే ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో, రేవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వరకూ చేసిన పాదయాత్ర వివాదాస్పదమైన నేపధ్యంలో, ఆయన ఆచి తూచి అడుగులు వేస్తున్నారని అంటున్నారు. అయితే, రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రకు కొనసాగింపుగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాదయాత్రకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఇచ్చిందని, రూట్ మ్యాప్  కూడా ఓకే అయిందని, పాటలు, ప్రచార సామగ్రి సైతం సిద్ధమైందని రేవంత్ వర్గం ప్రచారం చేస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత, కొత్త సంవత్సరంలో రేవంత్  రెడ్డి పాదయాత్ర మొదలవుతుందని అంటున్నారు.  అదలా ఉంటే ఇప్పటికే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేసిన, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా, నేను సైతం అంటూ పాదయాత్రకు నడుం బిగిస్తున్నారు. హైకమాండ్ అనుమతి ఇస్తే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ఆయన ప్రకటించారు. మరోవంక కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొందరు, రేవంత్ రెడ్డి పాదయాత్ర లక్ష్యం పార్టీని బలోపేతం చేయడం కాదని, పాదయాత్ర ద్వారా రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకే పాదయాత్రకు తొందర పడుతున్నారని, సీనియర్లు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కరేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా ఇతర నేతలు కూడా పాదయాత్ర చేసేలా అంగీకరించాలని సీనియరాలు కోరుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ముగిసిన రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలంతా పాదయాత్ర చేయాలని ఆదేశించింది. అందులో భాగంగా, పీసీసీ, సీఎల్పీ నేతలు ఇద్దరు, కలిసి పాదయాత్ర చేయాలనే ప్రతిపాదనను అదిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, పార్టీ ఐక్యతను చాటే విధంగా పార్టీ కీలక నేతలంతా కలిసి బస్సు యాత్ర చేయాలన్నమరో  ప్రతిపాదన కూడా హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్లు చెపుతున్నారు.  అయితే, గమ్మతుగా, రేవంత్ రెడ్డి పాద యాత్ర చేపడితే, మద్దతు ఇస్తానని, జగ్గా రెడ్డి ప్రకటించారు. మరోవంక, రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాని శపధం చేసిన, కోమటి రెడ్డి వెంకట రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పొమ్మన కుండా పొగ పెట్టింది. అయన పార్టీలో ఉన్నా లేనట్లే, తాజాగా ప్రకటించిన కాంగ్రెస కమిటీలు వేటిలోనూ ఆయనకు స్థానం కల్పించలేదు. మరో వంక,మాణిక్ ఠాగూర్, రేవంత్ మీదనే కాంగ్రెస్ అధిష్టానం పూర్తి విశ్వాసం ఉంచింది. ఈ నేపధ్యంలో కొత్త సంవత్సరంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర ఖాయంగా ఉంటుదని,అయితే ఆయన వెంట భట్టి ఉంటారా లేదా అన్నదే తెలవలసిల్సి ఉందని అంటున్నారు.  అయితే ఎవరు ఏ యాత్రలు చేసినా రాష్ట్ర రాజకీయాలపై యాత్రల ప్రభావం ముపటిలా ఉండదని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలో పాదయాత్రల ప్రభావం పెద్దగా ఉందని, అంటున్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఒకటి రెండు రేజులు పాదయాత్ర చేశారు. అయినా కాంగ్రెస్ అభ్యర్ధి డిపాజిట్, కోల్పోయారు. అలాగే, పాదయాత్రలు చేసిన నాయకులు అందరూ గెలుస్తారనే భరోసా కూడా లేదని, అంటున్నారు.