కర్నాటక కాంగ్రెస్ లో కుమ్ములాటలు

కర్నాటక కాంగ్రెస్ లో కుమ్ములాటలు మొదలయ్యాయి. ఈ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లాగే కర్నాటకలో కూడా ఏ పార్టీ వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నది నడుస్తున్న చరిత్ర. ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఐదేళ్ల కోసారి ఇక్కడ సర్కార్ ను మార్చేస్తారు. ఆ ప్రకారం ప్రస్తుతం కర్నాటకలో అధికారంలో ఉన్నది బీజేపీ కనుక వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో అధికారం తమదేనన్న విశ్వాసం కాంగ్రెస్ లో  మెండుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో పదవీ రగడ రాజుకుంది. రాబోయే అధికారాన్ని ఊహించుకుంటూ ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఇప్పటి నుంచే హస్తం పార్టీలో కుమ్ములాటలు ఆరంభమయ్యాయి. ఇప్పటికే పార్టీలో డీకే శివకుమార్, సిద్దరామయ్య మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వీరి విభేదాలు చేరుకున్నాయి. పార్టీలో రగడ సంగతి పక్కన పెడితే వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ కోసం కూడా రాష్ట్ర నాయకులలో పోటీ తీవ్రంగా పెరిగింది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆనవాయితీ ప్రకారం వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ దేనన్న నమ్మకంతో పార్టీ టికెట్ల  కోసం పోటీ తార స్థాయికి చేరింది. ఇలా టికెట్ల కోసం పోటీ పడుతూ పైరవీలు చేసుకుంటున్న వారిలో సీనియర్ నాయకులు, జూనియర్లు అన్న తేడా లేకుండా పోయింది. తమకే టికెట్ కావాలంటూ వారు పైరవీలతో పార్టీ హైకమాండ్ కు తల నొప్పులు తెచ్చి పెడుుతున్నారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో  కాంగ్రెస్ టికెట్ ఆశావహులంతా ఇప్పటికే హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.  పార్టీ కొత్త అధ్యక్షుడు మల్లి కార్జున్ ఖర్గే చుట్టూ తిరుగుతున్న వారు కొందరైతే.. నేరుగా పార్టీ అధికార కేంద్రం అని అంతా భావించే సోనియా గాంధీ, ప్రియాంకల దయా దాక్షిణ్య కటాక్ష వీక్షణాల కోసం మరి కొందరు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నాటక అసెంబ్లీకి వచ్చే ఏడాది మే లోగా ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు మే నాటికి పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అప్పుడు రాజకీయ సందడి ప్రారంభమైనా.. కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ సందడి, హంగామా ఓ రేంజ్ కి చేరిపోయింది. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అసమ్మతిని వ్యక్తం చేయడంలోనూ తన వ్యతిరేకులలో అసహనాన్ని నింపి టెన్షన్ పెట్టడంలోనూ నిజంగానే సిద్దహస్తుడు. ఆయన ఇప్పటికే రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వంలో కాబోయే సీఎంను తానేనని చెప్పుకుంటూ తనదైన స్టైల్ లో పార్టీ అభ్యర్థులను సైతం ప్రకటించేస్తున్నారు. ఇది ఆయన వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగు అనడంలో సందేహానికి తావు లేదు కానీ, ఆయన స్టైల్ , ఆయన తీరు పార్టీ హైకమాండ్ కు కొత్త తలనొప్పులు తీసుకు వస్తోంది. అదే సమయంలో రాష్ట్ర పార్టీలో ఆయన ప్రత్యర్థి సీఎం ఆశావహ అభ్యర్థి డీకే శివకుమార్ కు అరికాళ్ల కింద భూమిని కదిలిపోతున్న భావన కలిగిస్తోంది.  అభ్యర్థుల ఎంపిక లో పార్టీ అనుసరించే సంప్రదాయాలకు సిద్దరామయ్య పూర్తిగా తిలోదకాలిచ్చేసి.. అటు హైకమాండ్ తో కానీ, ఇటు రాష్్ట పార్టీతో ఏమాత్రం సంప్రదింపులు జరపకుండానే వరుసగా అభ్యర్థులను ప్రకటించేస్తూ తన వర్గంలో జోష్ నింపుతూ, పార్టీలోని ప్రత్యర్థి వర్గాన్ని టెన్షన్ పెడుతున్నారు. ఆ జోష్ లోనే తాజాగా బాగల్కోట నియోజకవర్గానికి విజయానంద్ అభ్యర్థిత్వాన్ని సిద్ధు కన్ఫర్మ్ చేసేసి ప్రకటించేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే విజయానంద్ నియోజకవర్గంలో తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.  తన బయోగ్రఫీని బయోపిక్ గా ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసి ప్రచారంలో దూసుకుపోయేలా సన్నాహాలు చేసుకుంటున్నారు.   మరో వైపు సిద్దరామయ్య స్పీడ్ ను ఆపడమెలాగో తెలియక డీకే సతమతమౌతున్నారు. పైగా కర్నాటక రాష్ట్రం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వంత రాష్ట్రం. అయినా కూడా అక్కడ పార్టీలో విభేదాలను పరిష్కరించడంలో ఆయన కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. పరిస్థితి చూస్తుంటే వచ్చే ఎన్నికలలో విజయానికి అన్ని అవకాశాలూ ఉన్నప్పటికీ కాంగ్రెస్ అంతర్గత కలహాలు, కుమ్ములాటలతో చేజేతులా ఆ అవకాశాన్ని చేజార్చుకుంటుందా అన్న ఆందోళన కలుగుతోందని రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు.    

అమరావతి రైతుల దర్నాకు కేసీఆర్?

ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు. అయితే కేసీఆర్ ఇంట గెలిచారు. రచ్చ గెలవడానికి బయలు దేరారు. ఆ ప్రస్థానంలో ఇంటి గెలుపును వదులు కోవాల్సి వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ పేరు మార్చడానికి ముందు కేసీఆర్ తెలంగాణ సెంటిమెంటుకు బ్రాండ్ అంబాసిడర్. తెలంగాణ సాధించిన నేతగా, తెలంగాణ జాతి పితగా భుజకీర్తులున్న వ్యక్తి. అయితే ఎప్పుడైతే జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారో.. అప్పటి నుంచీ అనివార్యంగా తనపై ఉన్న తెలంగాణ ముద్రను వదుల్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న లక్ష్యంతో కూటమి, ఫ్రంట్, టెంట్ అంటూ దేశం చుట్టేసిన కేసీఆర్.. ఆ సందర్భంలోనే తెరాసను ఉద్యమ పార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీ అంటూ ప్రకటించి.. తెలంగాణ ఉద్యమంతో పార్టీకి ఉన్నబంధాన్ని తెంచేశారు. దీంతో కేసీఆర్ తెరాసను ఫక్తు  రాజకీయ పార్టీగా ప్రకటించిన నాటి నుంచి పేరులో తప్ప తెరాసలో తెలంగాణకు స్థానం లేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ప్రజా వ్యతిరేకతను గుర్తించి మరో మారు తెరాస సెంటిమెంటును పండించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. తెలంగాణ ఉద్యమంతో పార్టీకి ఉన్న అనుబంధం పుటుక్కున తెగిపోయిందని గ్రహించిన కేసీఆర్.. ఇక ఫ్రంట్, టెంట్ లతో పని కాదన్న నిర్ణయానికి వచ్చేశారు. రాష్ట్రంలో నిలబడాలంటే టీఆర్ఎస్ కాదు జాతీయ పార్టీయే శరణ్యమని భావించారు. అందుకే ప్రిపరేషన్స్ పూర్తి కాకపోయినా.. కలిసి వచ్చే వారెవరో.. కాదు పొమ్మనే వారెవరో తేల్చుకోకుండానే టీఆర్ఎస్ ను కాలగర్భంలో కలిపేసి బీఆర్ఎస్ అంటూ పాత సినిమానే కొత్తగా తెరమీదకు తీసుకు వచ్చారు. సరే ఆ తరువాత జరిగిందేమిటో? జరుగుతున్నదేమిటో అందరూ తెర మీద చూస్తున్నారు. అది వేరే సంగతి. బీఆర్ఎస్  భవిష్యత్ ఏమిటన్నది చాలా వరకూ పార్టీకి నామకరణం చేసిన రోజునే తేలిపోయింది. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే అధికారికంగా పార్టీని ప్రకటించిన రోజు అందరికీ అవగతమైపోయింది. ఇంకా మిగిలి ఉన్న దింపుడు కళ్లెం ఆశను హస్తిన లో పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవ వేడుక చంపేసింది. దీంతో పేరు బీఆర్ఎస్..సరే ఊరేదంటే మాత్రం చెప్పుకోవడానికి ఒక్క రాష్ట్రమూ మిగలని పరిస్థితి. ఇప్పటికే తెలంగాణయే దిక్కు అంటే మాత్రం తెరాస పేరు మార్చాల్సిన అవసరమేమిటని సొంత ఎమ్మెల్యేలూ, మంత్రులే నిలదీసే పరిస్థితి. అందుకే కేసీఆర్ ఎవరూ వచ్చి కలవకున్నా.. కనీసం గుర్తించకున్నా ఇంకా హస్తినలోనే మకాం వేశారు. ఒక్క అవకాశం.. ఒకే ఒక్క అవకాశం అన్నట్లు ఆశగా ఇతర రాష్ట్రాలు, పార్టీల కేసి చూస్తున్నారు.  అయితే ఇప్పుడు ఆయనకు అంతో ఇంతో అనువుగా కనిపిస్తున్న రాష్ట్రం సాటి తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అక్కడ తానాడమన్నట్లు ఆడే ప్రభుత్వం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. కానీ రాష్ట్రంలో అడుగు పెట్టేందుకు అయితే చెప్పినట్లు నడుచుకునే నేత అక్కడ అధికారంలో ఉంటే సరిపోతుంది. కానీ నిలదొక్కుకోవాలంటే.. జనానికి నచ్చే కార్యాచరణ చూపాలి. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ.. తొలి సారి అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనూ.. ఆంధ్రోళ్లు అంటూ తెరాస అధినాయకుడు, ఆ పార్టీ నేతలూ చేసిన వ్యాఖ్యలు, విమర్శలు, చూపిన వివక్ష ఏపీ జనం ఈ ఎనిమిదిన్నరేళ్లలో మరిచిపోయి ఉంటారని కేసీఆర్ కూడా భావించడం లేదు. అందుకే ఇప్పుడు  ఏపీ సీఎం తోడు ఒక్కటి చాలు అని ఆయన భావించడం లేదు. మరి ఏపీలో జనం మనసులను గెలుచుకోవడానికి ఏం చేస్తారు?  ఇప్పుడు ఆయనకు ఆ దిశగా కనిపిస్తున్న ఒకే ఒక ఆశాకిరణం అమరావతి రైతుల ఆందోళన. అమరావతి శంకుస్థాపనకు స్వయంగా  వచ్చిన సందర్భం. ఆ తరువాత ఇన్నేళ్లలోనూ ఎన్నడూ అమరావతి రాజధాని అంశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదన్న ధైర్యం. అందుకే ఆయన ఏపీలో అడుగు పెట్టేందుకు అమరావతి రైతులకు మద్దతు ప్రకటించడమే ఏకైక మార్గంగా ఎంచుకున్నారని రాజకీయ నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు. ఆయన పెద్దగా పనులేమీ లేకపోయినా.. తెలంగాణలో పాలనను గాలికి వదిలేసి హస్తినలోనే మకాం వేయడానికి కారణం కూడా అమరావతి రైతులేనని చెబుతున్నారు.జగన్ తో ‘రహస్య’చెలిమి ఉభయ రాష్ట్రాలలోనూ బహిరంగంగా అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమ రహస్య చెలిమికి చెల్లు చీటీ ఇచ్చేసైనా సరే అమరావతి రైతులకు మద్దతు పలకడమే మేలా అన్న యోచనలో కేసీఆర్ ఉన్నారు. అందుకే  ధర్నా కోసం అమరావతి రైతులు ధరణి కోట టు ఎర్రకోట అంటూ హస్తిన చేరుకున్న సందర్భాన్ని రాజకీయంగా తనకు తెలంగాణలో ఏదో మేర మద్దతు దొరికేందుకు ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జంతర్ మంతర్ వద్ద శనివారం (డిసెంబర్ 17) అమరావతి రైతుల ధర్నాకు కేసీఆర్ హాజరై మద్దతు పలికే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. దీని ద్వారా బీఆర్ఎస్ కు ఏపీలో అడుగు పెట్టేందుకు ఒక స్పేస్ సృష్టించుకున్నట్లు అవుతుందని భావిస్తున్నారు. అమరావతి రైతుల ధర్నా వద్దకు కేసీఆర్ వచ్చి మద్దతు ప్రకటిస్తే.. ఏపీలో రాజకీయ సమీకరణాలలో గుణాత్మక మార్పు తథ్యమని అంటున్నారు. అదే జరిగితే జగన్ కు ఏపీలో ఇప్పటికే ఉన్న ప్రత్యర్థులు తెలుగుదేశం, జనసేనలకు తోడుగా బీఆర్ఎస్ వచ్చి చేరుతుంది. ఒక వేళ తెలుగుదేశం, జనసేనలకు పొత్తు పెట్టుకుని పోటీలో దిగినా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును భారీగా చీల్చేందుకు బీఆర్ఎస్ దోహదపడుతుందని, ఇది ఒక రకంగా బయటకు జగన్ కు ప్రత్యర్థిగా నిలబడినట్లు కనిపించినా.. అంతర్గతంగా ఏపీ సీఎంకు మేలు చేయడమే అవుతుంది. అసలు అదే వ్యూహంతో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ అడుగులు వేస్తున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.  

పేరుకే బీఆర్ఎస్.. మిగిలినదంతా టీఆర్ఎస్సే

భారత రాష్ట్రసమితి (బీఆర్ఎస్) పేరులో భారత్ ఉంది తప్ప ఏ రకంగా చూసినా ఆ పార్టీకి జాతీయ హోదా ఉన్నదన్నభావన కలగదు. ఇక్కడ హోదా అంటే అధికారిక గుర్తింపు కాదు. పార్టీకి జాతీయ స్థాయి. ఆ స్థాయి ఇప్పుడున్న బీఆర్ఎస్ లో ఆ స్థాయి ఇసుమంతైనా కనిపించలేదు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన వారిలో రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరంటే ఇద్దరు మాత్రమే ప్రముఖులు ఉన్నారు. వారిలో ఒకరు హెచ్ డి కుమారస్వామి కాగా, మరొకరు ఎస్పీ నాయకుడు అఖిలేష్ యాదవ్. వీరిరువురు మినహా రైతు నేతలంటూ వచ్చిన ఎవరూ  కూడా పెద్దగా రాజకీయ గుర్తింపు ఉన్న వారు కారు. చివరాఖరికి పలు దఫాలుగా బీఆర్ఎస్ రైతు అజెండాపై ప్రగతి భవన్ కు వచ్చి మరీ కేసీఆర్ తో రోజుల తరబడి చర్చలు జరపిన రైతు నాయకుడు తికాయిత్ కూడా బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎక్కడా కనిపించలేదు. ఇక హస్తినలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం రోజున పొద్దుట నుంచి సాయంత్రం వరకూ కేసీఆర్ ను కలిసిన నేతలందరూ తెరాస నాయకులే. హస్తినలో కేసీఆర్ వరుస భేటీలతో బిజీగా ఉన్నారన్న కలర్ ఇచ్చుకోవడానికే తెరాస నేతలు హస్తిన వచ్చారా అన్న అనుమానాలు కూడా వ్యక్త మయ్యాయి. ఇంతే కాకుండా బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం జనంతో కళకళలాడిందని చెప్పు కోవడానికి తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలను తరలించారని కూడా విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఒక్కో ఎమ్మెల్యే టార్గెట్లు నిర్దేశించుకుని మరీ కార్యకర్తలను బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి తరలించారని చెబుతున్నారు.  ఏతా వాతా అందరూ చెప్పేదేమిటంటే బీఆర్ ఎస్ కేంద్ర కార్యాలయంలో కనిపించిన వారంతా తెలంగాణ నేతలే. అంటే బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్న టీఆర్ఎస్ కు కొత్తగా క్యాడర్ కానీ, లీడర్ కానీ వచ్చి చేరలేదు. అంటే బీఆర్ఎస్ లో ఉన్నదంతా పాత టీఆర్ఎస్ నాయకత్వం, కార్యకర్తలేననిపరిశీలకులు సోదాహరణంగా వివరిస్తున్నారు. మామూలుగా రాజకీయ నాయకులు ప్రత్యర్థులకు కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేస్తుంటారు. కనీసం కేసీఆర్ కొత్త పార్టీ పెట్టిన సందర్బంగా ఆయనకు ఇతర పార్టీల నేతల నుంచి అలా శుభాకాంక్షలు తెలిపిన దాఖలాలు లేవు. కనీసం సాటి తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్ కూడా కేసీఆర్ కొత్త పార్టీపై స్పందించలేదు. ఏపీ ప్రభుత్వ సలహాదారు ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేయవచ్చు అంటూ చెప్పినా యథాలాపంగా ఎవరో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు అంతే.   కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వచ్చినా అందుకు రాజకీయంగా పెద్ద ప్రాముఖ్యత లేదు. ఆయన పార్టీని.. కర్నాటకలోనే పెద్దగా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు.   కేసీఆర్ నుంచి ఆహ్వానం అందుకున్న వారు కూడా బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాకపోవడమే.. బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ఏకాకిగా మిగిలిపోయిందని చెప్పడానికి తార్కానంగా పరిశీలకులు చెబుతున్నారు.  హస్తినలో కూడా కేసీఆర్ చుట్టూ ఉన్నది తెలంగాణ నేతలే కావడం చూస్తుంటే..  పేరుకే బీఆర్ఎస్ కానీ దాని రుచి, రంగూ, వాసనా అంతా టీఆర్ఎస్సే అన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోందని అంటున్నారు. 

ఢిల్లీకి కేసీఆర్ కవితకు సీఎం కుర్చీ?

ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు రాజకీయ ఎత్తుగడల్లో మాంచి దిట్ట. ఎన్నికల వ్యూహ రచనలో ఆయనకు ఆయనే సాటి, కానీ, పుష్కర కాలానికి పైగా తెలంగాణ ఉద్యమాన్ని ఒడిదుడుకులు లేకుండా నడిపిన ఆయన, ఇప్పడు కుటుంబ రాజకీయాలను చక్క దిద్దడంలో తడబడుతున్నారు. తప్పులు చేస్తున్నారు. చిక్కులు  తెచ్చుకుంటున్నారు. ఇది ఎవరో రాజకీయ ప్రత్యర్ధులు చేస్తున్న రాజకీయ విమర్శ కాదు, సొంత పార్టీ నాయకులు చేస్తున్న సద్విమర్శ. నిజానికి, తెరాస పేరు  మారినా తీరు మారక పోవడానికి, పార్టీ ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలు అన్నిటికీ, కుటుంబ కలహాలే కారణమని పార్టీ నేతలు పబ్లిక్ గానే మాట్లాడుకుంటున్నారు. ఢిల్లీ వెళ్ళిన నేతలు ఎవరిని కదిల్చినా  ఇదే మాట వినిపిస్తోంది.  జాతీయ రాజకీయాలంటూ ఢిల్లీలో జెండా ఎగరేసేందుకు  రాష్ట్రం నుంచి నాయకులు, కార్యకర్తలను తోలుకు రావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసేఆర్ తో ఫోటో కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఢిల్లీ రావడం చిత్రంగా ఉందని, ఈ అన్నిటికీ కుటుంబ కలహాలే కారణమని అంటున్నారు. సొంత పార్టీ నాయకులు ఢిల్లీ గోడలకు చెవులుండవనే భరోసాతోనే కావచ్చును కానీ, మాట్లాడుకుంటున్న మాటలు, పార్టీ పరిస్థితికి అద్దం పడుతున్నాయని, ఢిల్లీ వాలాలు,  అంటున్నారు. అదలా ఉంటే రాష్ట్రంలో పత్రికలు, ప్రతిపక్ష నాయకుకులు మంత్రి కేటీఆర్, భారత రాష్ట్ర సమితి (భారాస) ఢిల్లీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎందుకు వెళ్ళలేదు? ఆయన అలిగారా? ముఖ్యంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కంటే కుమార్తె కవితకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా? అందుకే ఆ  అక్కసుతో కేటీఆర్  తండ్రి మీద అలిగి ఢిల్లీ వెళ్ళలేదా? అందుకే ఆయన భారాస వేడుకకు దూరంగా ఉన్నారా ? డుమ్మా కొట్టారా? అని ఉహాగానాలు షికారు చేస్తున్నాయి. అయితే కేటీఆర్ అదేమే లేదని, ముఖ్యమైన కార్యక్రమాలు ఉండడం వల్లనే ఢిల్లీ వెళ్ళ లేక పోయానని వివరణ  ఇచ్చారు.  అదలా ఉంటే మాజీ మంత్రి  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కొండా సురేఖ ఈ మొత్తం వ్యవహారాన్ని మరో మలుపు తిప్పారు. ముఖ్యమంత్రి కేసేఆర్ జాతీయ రాజకీయాల్లో బిజీ  అయిపోతున్న నేపధ్యంలో   రాష్ట్రంలో భారాస పార్టీ  పగ్గాలు కవితకు ఇవ్వాలని, అదే విధంగా ముఖ్యమత్రి పదివిని కూడా కూతురు కవితకు ఇచ్చే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారా .. అనే అనుమానాలు కలుగుతున్నాయని కొండ సురేఖ బాంబు పేల్చారు. కొండ సురేఖ ఏ ఆధారాలతో ఈ అనుమానాలు వ్యక్త పరిచారో ఏమో కానీ, అన్నా- చెల్లీ మధ్య రాజకీయ చిచ్చు రగులుతోందనేది మాత్రం తిరుగులేని నిజం. గతంలోనూ  కవిత పండగలు పబ్బాలకు కూడా పుట్టిల్లు ( ప్రగతి భవన్) గడప తొక్కడం లేదని, వార్తలొచ్చాయి. చివరకు రాఖీ, బతుకమ్మ పండగ వేడుకలలో కూడా ఆమె ప్రగతి భవన్ లో కనిపించేలేదు.  ఈ నేపధ్యంలోనే  కావచ్చును ఇప్పడు కేటీఆర్ బీఆర్ఎస్ కార్యాయలం ప్రారంభోత్సవానికి వెళ్లకపోవడం వెనుక ఇంకేదో కారణం ఉందనే  అనుమానాలు, కొండ సురేఖ వంటి వారు వ్యక్తపరుస్తున్నారు.  అయితే, అవ్వన్నీ ఎలా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక చాలు దొర అని ప్రజలు సాగనంపే వరకు ముఖ్యమంత్రి పదవిని వదులు కోరని సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి. నిజానికి ముఖ్యమంత్రి కుర్చీ కోసం కేసీఆర్, కేటీఆర్, కవిత మధ్య సాగుతున్న తెరచాటు యుద్ధమే, తెరాస/ భారాస సమస్యలకు మూల కారణం అంటున్నారు. అవును కుటుంబ పార్టీలలో కుటుంబ కలహాలే ఉంటాయి .. అంటున్నారు.నిజమేనేమో ..

రౌండప్ 2022.. పంజాబ్, హర్యాణ మధ్య రాజధాని వివాదం

కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 2022 మోస్ట్ హ్యాపెనింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు.  కొద్ది  రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే.. ఏప్రిల్ 2022 ఏప్రిల్ నెలలో దేశ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తీసుకున్నాయి .. పంజాబ్,  హర్యాణ రాష్ట్రాల మధ్య ఉమ్మడి రాజధాని చండిఘడ్ మాదంటే మాదనే వివాదం మరో మారు తెర మీదకు వచ్చింది. పంజాబ్ లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ( ఆప్) ఏప్రిల్ 1 న శాసన సభ ప్రత్యేక సమావేశంలో  చండిఘడ్’ను తక్షణమే పంజాబ్’కు బదిలీ చేయాలని  తీర్మానం చేసింది. కేంద్రానికి పంపింది. అయితే, ఏప్రిల్ 5న హర్యాణ ప్రభుత్వం, పంజాబ్ తీర్మానానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి కేద్రనికి పంపింది. బంతి కేంద్రం కోర్టుకు చేరింది. ఏప్రిల్ ఫస్ట్ ఫూల్స్  డే .. అదే రోజున బీజేపీ మరో రికార్డు సృష్టించింది. పెద్దల సభ రాజ్యసభలో  పార్టీ బలం వంద (100) మార్క్ దాటింది. 1990 తర్వాత పెద్దల సభలో ఏ పార్టీ  కూడా 100 మార్కును చేరుకోలేదు. 32 ఏళ్లలో మొదటి సారిగా బీజీపీ 100 మార్కును చేరుకొని రికార్డు సృష్టించింది. ఏప్రిల్ 2 న భారత్ – నేపాల్ రైల్ లింక్ ప్రారంభమైంది, భారత దేశంలో పర్యటిస్తున్న నేపాల్ ప్రధాని, దియుబా, భారత ప్రధాని నరేంద్ర మోడీ సంయుక్తంగా ఈ రైలు లింక్’ను ప్రారంభించారు.  తమిళనాడు ముఖ్యమత్రి ఎంకే స్టాలిన్’ మిత్ర పక్షం కాంగ్రెస్ పార్టీకి సూచనలు చేశారు. ప్రతిపక్షాల పెద్దన్న పాత్ర, పోషించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ దేశంలోని, ప్రధాన రాజకీయ పార్టీలతో స్నేహ సంబంధాలను మెరుగు పరచు కోవాలని కోరారు. అలాగే, బీజేపీ ఓడించేందుకు, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలిసి పనిచేయాలని స్టాలిన్ సలహా ఇచ్చారు. దేశంలో ఉన్న ఏ ఒక్క పార్టీ కూడా బీజేపీని ఇప్పట్లో గద్దె దింపలేవని అన్నారు తమిళనాడులో బీజేపీ బలపడుతున్న నేపధ్యంలో స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  ఏప్రిల్ 8 ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ముంబై నివాసంపై మెరుపు దాడి  జరిగింది. అయితే, ఈ దాడికి ఎవరు బాధ్యులు, ఎందుకు చేశారు అనేది స్పష్టం కాలేదు.  ఏప్రిల్ 11  తెలంగాణ ముఖ్యమత్రి కేసేఆర్, కేంద్ర ప్రభుత్వ ధాన్యం కొనుగోలు విధానానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఢిల్లీ తెలంగాణ భవన్’ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఇతర పార్టీ నేతలతో కల్సి ధర్నా నిర్వహించిన కేసేఆర్, కేంద్రానికి 24 గడువు విదించారు. ఈ లోగ కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లకు  సానుకూలంగా స్పందించాలని, లేని పక్షాన దేశ వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు.  కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా భర్త,రాబర్ట్ వాద్రా, ప్రజలు కోరుకుంటే పాలిటిక్స్’లోకి వస్తానని  సంచన ప్రకటన చేశారు. అలాగే, 2024 ఎన్నికలలో పోటీ చేసేందుకు కూడా సిద్ధమని వాద్రా ప్రకటించారు.  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గాన్ని పునర్వ్యవ్యవస్థీకరించారు. 25 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.   ఏప్రిల్ 12 పాకిస్థాన్ నూతన ప్రధాన మంత్రిగా షెహబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేశారు.  ఏప్రిల్ 14  ఢిల్లీ తీన్’ మూర్తి ఎస్టేట్ ప్రాంగణంలో నిర్మించిన  ‘ప్రధాన మంత్రి సంగ్రహలయ’ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు.స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్’లాల్ నెహ్రు మొదలు దేశాన్ని పాలించిన ప్రదానమంత్రుల జీవిత చిత్రాలను, దేశానికీ వారు చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచి పోయే విధంగా ‘ప్రధాన మంత్రి సంగ్రహలయ’ను నిర్మించారు.  ఏప్రిల్ 15 అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేశారు. ఏప్రిల్ 24  ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు ముందు జమ్మూ కశ్మీర్ లో  పేలుళ్లు సంభవించాయి. అయితే ఎలాంటి హనీ జరగ లేదు.  ఏప్రిల్ 26.. కాంగ్రెస్ పార్టీలో తాను చేరతానంటూ వస్తున్న వార్తలకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెర దించారు. కాంగ్రెస్’లో చేరడం లేదని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీని పునర్జీవింప చేసేందుకు, ప్రశాంత్ కిశోర్ రూపొంచిన బ్లూ ప్రింట్’ పై చర్చించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించింది. అయితే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అభ్యర్ధనను తిరస్కరించారు.

తిరుమలలో తిరుప్పావై

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం గురువారం (డిసెంబర్ 16) నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజు సాయంత్రం 6.12 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానుండటంతో డిసెంబరు 17 నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా ధనుర్మాస ఘడియలు 2023 జనవరి 14న ముగియనున్నాయి. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్‌(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. డిసెంబరు 17 నుంచి జనవరి 14 వరకు శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్ స్వామి మ‌ఠంలో తిరుప్పాపై పారాయ‌ణం జరుగుతుంది. పవిత్ర ధనుర్మాసం సంద‌ర్బంగా డిసెంబ‌రు 17 నుండి 2023 జ‌న‌వ‌రి 14వ తేదీ వ‌ర‌కు శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్ స్వామి మ‌ఠంలో తిరుప్పావై పారాయ‌ణం చేయ‌నున్నారు. కాగా విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్ర‌తిపాదించిన భ‌గ‌వ‌ద్ రామానుజాచార్యులు 900 సంవత్సరాల క్రితం తిరుమ‌ల‌లో పెద్ద‌జీయర్ మఠం ఏర్పాటు చేశారు. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం ఎదురుగా ఉన్న శ్రీ‌శ్రీ‌శ్రీ పెరియకోయిల్‌ కేల్వి అప్పన్‌ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్‌స్వామి సమక్షంలో శ్రీ పెద్ద జీయ్యంగారు మ‌ఠంలో నెల రోజుల పాటు ఉద‌యం 7 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు తిరుప్పావై పాశురాల‌ను పారాయ‌ణం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా వెలసి ఉన్న శ్రీవారి భక్తుల కోసం ఎస్వీబీసీ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇటు గోవిందరాజ స్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలని టీటీడీ ఆదేశించింది. బంగారు తాపడానికి సంబంధించి జరుగుతున్న పనులను జేఈవో పరిశీలించారు. 50 మంది స్వర్ణకారులు బంగారు తాపడం పనులు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. స్వర్ణకారులకు అవసరమైన వర్క్ షాప్ లను మరిన్ని ఏర్పాటు చేయాలని జేఈవో సీఈని ఆదేశించారు. ఇక్కడ ఉన్న కార్యాలయ గదిని మరోచోటికి మార్చి ఆ స్థలంలో కూడా వర్క్ షాప్ ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం ఐదు వర్క్ షాప్ లు ఏర్పాటు చేయడం ద్వారా పనుల వేగం పెంచవచ్చు అన్నారు. వివిధ దశల్లో జరుగుతున్న బంగారు తాపడం పనులను ఆయన పరిశీలించి, ఈ పనుల్లో నిమగ్నమైన వారితో మాట్లాడారు. బంగారు తాపడం పనులను భక్తిశ్రద్ధలతో చేయాలని జేఈవో వారికి సూచించారు. అనంతరం పాత హుజూర్ ఆఫీస్‌లో ఖాళీగా ఉన్న గదులను పరిశీలించారు. వీటికి అవసరమైన మరమత్తులు చేసి ఉపయోగంలోకి తేవాలని సీఈని ఆదేశించారు. రాగి ,ఇత్తడి సామగ్రి పరికరాలు ఉంచే గదిని జేఈవో పరిశీలించారు. పంచలోహ విగ్రహాల తయారీ విభాగాన్ని పరిశీలించారు. ఈ విభాగం గది మరింత విశాలంగా ఉండి గాలి వెలుతురు బాగా వచ్చేలా మార్పులు చేయాలన్నారు.

బాపు జయంతి రోజు నెట్టింట వైరల్ నివాళి

బాపు తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు.. తెలుగుదనం ఉట్టిపడే బొమ్మల కొలువును కానుకగా ఇచ్చిన దానకర్ణుడు. రాతలోనే కొత్త వాసిని ప్రపంచానికి పరిచయం చేసిన బాపు జయంతి గురువారం. ఆ సందర్బంగా అశేష బాపు అభిమానుల్లో ఒకరు నెట్టింట పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది. తెలుగు లోగిళ్లలో బాపు బొమ్మ లేని ఇల్లు ఉంటుందంటే అతిశయోక్తే. అంతగా బాపు గీత  తెలుగు జీవితంలో జీవనంలో మమేకమైపోయింది. తెలుగు వన్ పాఠకుల కోసం ఆ అజ్ణాత నెటిజన్ పెట్టిన పోస్టును ఇక్కడ యథాతథంగా ఇస్తున్నాం. గుండ్రంగా రాయడం రాక ఇలా వంకరటింకరగా లాగించేస్తున్నాడు... ఏం తెలివి?’ అనేసుకుని నోట్లో కొంగులూ, కండువాలూ కుక్కేసుకున్నార్ట! ఆ అక్షరాలు చూడ్డానికి అదోలా వుంటాయి. కాసేపు  చూస్తే ‘ఏదోవుందిందులో!’ అనిపించేస్తుంది. ఆనక పుస్తకం మూసేశాక మళ్ళీ తెరిచి చూడాలనిపిస్తుంది.  మనం పెట్టే కొమ్ములూ, దీర్ఘాలన్నింటినీ కొత్తరకంగా తగిలించే తెలివి.  పేరంతా రాసేసిన తరవాత చూస్తే ఊరేగింపుకి తయారైన దేవుడి పల్లకీలా వుంటుంది.  ఆ నిండుదనం గోదారినించీ, ఆ అందం చందమామనించీ తెస్తాడు.  ఇహ బొమ్మలు.... ఒక స్త్రీ బొమ్మంటే మనం చదువుకున్న సామాన్యశాస్త్రం పుస్తకంలో ఆడమనిషి బొమ్మలా అందరూ వేస్తున్న రోజుల్లో ఇతగాడు చుక్కల ముగ్గెట్టినంత చులాగ్గా వేసేసి చూపించాడు.  రావాకుల్లా పరుచుకున్న రెండుకళ్ళు, మకరధ్వజాల్లా కనుబొమ్మలు, చదరంగంలో శకటులా దీటైన ముక్కు,  చిన్న చెగోడీలా నోరూనూ!  చూడగానే ముద్దిస్తున్నట్టూ, ముద్దొస్తున్నట్టూ అనిపించేస్తుంది ఎవరికైనా!  ఇహ మెడా, జడా సంగతి సరే సరి! జుట్టంతా పొందిగ్గా అల్లి, పాపిడితీసి, నాగుబాములా పేద్ధ జడేసేసేవాడు. చివర్న ఓ రెండు గంటలు కట్టేవాడు.  నడుం మీద ఆట్టే ఆసక్తి చూపెట్టేవాడు కాదు. ఎంచేతంటే...అసలది వుంటేగా? అలా గీసేవాడు మరి!  ఈ యవ్వారాలన్నీ పూర్తయ్యేసరికి మగపిల్లలందరికీ గుండెల్లో గుబులు మొదలయ్యింది.  పెళ్ళిచేసుకోరా నాయనా!  అని బామ్మలూ, అమ్మానాన్నలూ అడిగితే ‘బాపూ బొమ్మను తీసుకురండం’టూ బ్రాండొకటి చెప్పేవారు. అలాంటి పిల్లలే కావాలంటే ఎక్కణ్ణించొస్తారు? ఆఖరికి అదొక గోల్డ్ స్టాండర్డ్ అయి కూర్చుంది. ఇహ ఈ రవఁణున్నాడే! గొప్ప కబుర్లపోగు. ఏవో కథలూ గట్రా రాస్తూండేవాడు. ఆయనగారి మనంలో ఏఁవుందో ఈయనకి తెలిసిపోయేది. ఈయనగారి కలంలో ఏఁవుందో ఆయనకి అర్ధమైపొయ్యేది.  బుడుగూ, సీగానపెసూనాంబ.... అనేసి రెండు పేర్లు అనుకుని ‘ఓం విఘ్నేశ్వరాయ’ అని ముందస్తుగా రాసి మొదలెట్టగానే ఈయనేసిన రెండు బొమ్మలూ రూపం తెచ్చేసుకున్నాయి. ఆనక వాళ్ళనాన్న గోపాళం, రాద, బాబాయ్, రెండుజెళ్ళసీత, పక్కింటి లావుపాటి పిన్నిగారు, ఆవిడ ముగుడు... అందరికన్నా అందంగా... వత్తులపెట్లో డబ్బులు దాచుకునే బామ్మ... వీళ్ళందరి బొమ్మలూ వేషాలేసుకుని పుస్తకమ్మీదకి వచ్చేశాయి.  మనకింక తడుంకునే పన్లేదు. ‘బుడుగంటే ఎలావుంటాడూ?’ అని నీ బుర్రనీ, పుస్తకాన్నీ చించుకోవాల్సిన అవసరంలేకండా తాళ్ళలాగేసి, ఓ బుగ్గలబూరిగాణ్ణి మనముందు నిలబెట్టేశాడు.  రెండు కొత్తిమీర కట్టల్లాంటి జళ్ళేసి సీగాననీ లాక్కొచ్చేశాడు. వాళ్ళెంత నచ్చేస్తారంటే అందరూ చూస్తుండగా వందసార్లూ, ఎవరూ చూడకండా మరోవందసార్లూ పుస్తకాన్ని ముద్దెట్టేసుకునేంత! వీళ్ళిద్దరితోనే అయ్యిందేఁవిటి?  ‘రామపట్టాభిషేకం పటం ఇంటోవుంటే శుభం! బాపూదయితే ఇంకా శుభం!’.... ఇది మన తెలుగింటి నానుడి! నేనన్నది అతిశయోక్తేమోగానీ అతిమాత్రం కాదు. ఓమారు ఆ చివర్నించి ఈచివరిదాకా చూడండి... సీతారాములేమో మొహమాటంగాను, లక్ష్మణ భరత శత్రుఘ్నులేమో ‘హమ్మయ్య! అన్నయ్యొచ్చేశాడు! ఇహ మనకేం ఫరవాలేద’న్నట్టుగాను, వసిష్టులవారేమో ‘ఈరోజుకోసం ఎన్నాళ్ళనించి చూస్తున్నానో తెలుసా రామా?’ అన్నట్టుగాను, ఇహ హనుమంతుడయితే ‘నాకోసఁవే అప్పుడాగిపోయింది పట్టాభిషేకం. నే లేననే! అదీ అదృష్టఁవంటే!’ అనుకునేంత గాఢభక్తితోను... చూస్తూనే వుండిపోయి, చుట్టుపక్కలేం జరుగుతోందో కూడా మర్చిపోతావు. ఆ క్షణంలో ఓ అప్పారావొచ్చి ‘ఓ ఫైవ్ లాక్స్ అప్పిస్తావోయ్?’ అనడిగినా ఇచ్చిపడేస్తావ్! అంత విషయం వుందక్కడ! ఈయన బొమ్మ వుందంటే పుస్తకానికి పసుబ్బొట్టు పెట్టినంత అందం. గుమ్మానికి మావిడాకు కట్టినట్టు, కొత్తబట్టలు కొనుక్కున్నట్టు పత్రికలవాళ్ళు పండగలన్నిటికీ ఈయన్నే వెయ్యమనేవారు ముఖచిత్రాన్ని. అంతవరకూ ప్రతివారం వచ్చే వాణిశ్రీలూ, జమునలూ, జయప్రద, సుధ, చిత్రాలూ మాయమైపోయేవారు. వాళ్ళందరికన్నా అందంగా ఓ పిల్ల దిగేది. ఆ పుస్తకాన్ని లోపలి కథల కోసం కొందరూ, బయట బొమ్మకోసం కొందరూ ఏళ్ళతరబడి దాచుకునేవారు. అమరావతి కథలకి ఈయన గీసిన బొమ్మల్ని చూసారా? సత్యంగారి ఆత్మ బాపు బొమ్మల్లో కనబడుతుంది. ఆయనేఁవనుకుని రాశాడో తెలీదుగానీ ‘రాగిచెంబులో చేపపిల్ల’, ‘భోజన చక్రవర్తి’, ‘ముద్దులల్లుడు’ కథలకి బొమ్మలొకసారి చూడండి.  పుస్తకంలేదా మీయింటో? అదే మరి! మీరేం తెలుగువాళ్ళూ? కథని చదివి, జీర్ణం చేసేసుకుని, రక్తంలోకీ, మనసులోకీ ఎక్కించుకుని ఆనక బుర్రకి పనిచెప్పి ఓ బొమ్మగీస్తే.... కథంతా ఒక్క బొమ్మలో తెలిసిపోతుంది! అంత పనిమంతుడు మన బాపు! మిథునఁవైతే ఇహ లాభంలేదని ఏకంగా మొత్తం తన దస్తూరీలోనే రాసిపడేశాడు. ఒకసారి దూరంనించి చూస్తే పళ్ళెంలో పారిజాతాల్లా వుంటాయి అక్షరాలన్నీ!  ....ఏరి వాసన చూడాలన్నంత అందంగా! ఎంతమందికో కథలకీ, నవలలకీ బొమ్మలేశాడు. సినిమా పుస్తకాల్లో రేలంగిరిజల్నీ, జమునాసావిత్రుల్నీ కళ్ళకి కట్టేసేవాడు.అంతర్జాతీయ స్థాయి అందాలబొమ్మల అపురూప చిత్రకారుడు...అమరలోకంలో రంభావూర్వశులు రోజూ వాళ్ళ బొమ్మలెయ్యమని సలపాదిస్తూ వుండేవుంటారు. తన బొమ్మల్ని చూస్తూ పెరిగాం. తన బొమ్మల్ని చూస్తుండగానే మనలనొదిలి వెళిపోయాడు. మనసులో ఆ బొమ్మ మాత్రం పదికాలాలపాటు పదిలంగా అలానే వుంటుంది.  బాపూకి జయంతి నివాళులు!

సంక్షేమం పేర దోపిడీ.. బ్రదర్ అనిల్ వ్యాఖ్యల సారాంశమిదేనా?

ఏపీ ప్రజలు ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టామా అని బాధపడుతున్నారా?.. జగన్ పాలనలో నానా కష్టాలూపడుతున్నారా? సంక్షేమం పేరుతో రూపాయి ఇచ్చి వంద రూపాయలు లాగేసుకుంటున్న తీరుతో జనం విసిగిపోయారా? అంటే ఔననే అంటున్నారు ముఖ్యమంత్రి జగన్ కు స్వయానా బావ  అయిన బ్రదర్ అనీల్ కుమార్. బ్రదర్ అనీల్ కుమార్ జగన్ సోదరి షర్మిల భర్త. క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఏపీకి వచ్చారు. ఈ సందర్బంగా విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా జగన్పేరు ఎత్తకుండానే బ్రదర్ అనీల్ కుమార్ ఏపీ సీఎం, తనకు స్వయానా బావ మరిది అయిన జగన్ పై విమర్శలు గుప్పించారు. విపక్షం తెలుగుదేశం ఇంత కాలంగా ఏ విషయంలో అయితే జగన్ పై విమర్శలు గుప్పిస్తోందో అరిగ్గా అవే లైన్స్ లో బ్రదర్ అనీల్ కుమార్ మాట్లాడటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. క్రిస్మస్ ముందస్తు వేడుకకు సంబంధించిన ఆ కార్యక్రమంలో బ్రదర్ అనీల్ చేసిన ప్రసంగం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవడం విశేషం. అయితే బ్రదర్ అనీల్ ప్రసంగం వెనుక ఇటీవల తన భార్య షర్మిలను తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేయడం, వాహనంలో ఉండగానే టోవింగ్ చేసి పీఎస్ కు తరలించడం పై ఏపీ సీఎం, షర్మిల సోదరుడు జగన్ స్పందించకపోవడమే కారణమై ఉంటుందా అన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరందుకుంది.  షర్మిల ఏపీని పట్టించుకోకుండా తెలంగాణలో తన సొంత పార్టీ వ్యవహారాలలో తలమునకలై ఉన్న సంగతి విదితమే. అయితే గత చాలా కాలంగా జగన్, షర్మిల మధ్య పొసగడం లేదన్న వార్తలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే షర్మిల వైఎస్ వివేకా హత్య కేసులో హస్తిన వెళ్లి వాంగ్మూలం ఇచ్చి రావడం. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ.. సీబీఐకి ఫిర్యాదు చేయడం.. ఆ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో జగన్ కు ఇరుకున పెట్టే విధంగా చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ గమనిస్తే అన్నా చెళ్లెళ్ల మధ్య సంబంధాలు బాగా చెడ్డాయనీ అర్ధమౌతుంది. ఆ నేపథ్యంలోనే తెలంగాణలో షర్మిల అరెస్టుపై జగన్ స్పందించలేదని అంటున్నారు. అయితే బ్రదర్ అనీల్ కుమార్ విశాఖలో జగన్ సర్కార్ పై పరోక్షంగా చేసిన విమర్శలు గమనిస్తే.. నిప్పుకు కప్పిన నివురు కరిగిపోతున్నదా అనిపించక మానదు. తన ప్రసంగంలో ఆయన స్వార్థం కోసం ప్రభుత్వాలు ఇచ్చే పథకాలపై ఆధారపడవద్దని ఆయన ఏపీ జనాలకు హితవు చెప్పారు. అంతే కాదు.. ఏపీలో పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టామా అని ప్రజలు బాధపడేలా ఉందన్నారు. ఏపీలో పాలన దారుణంగా ఉందనీ, జనం జీవనం దుర్భరంగా మారిపోయిందనీ అనిల్ అన్నారు. స్వయానా తనకు బావ అయిన బ్రదర్ అనీల్ కుమార్ ఏపీ గడ్డపై చేసిన  ఈ వ్యాఖ్యలు జగన్ కు ఇబ్బందికరం అన్న విషయంలో సందేహం అవసరం లేదు. షర్మిల, జగన్ ల మధ్య ఉన్న విభేదాలు, వివాదాల కారణంగానే బ్రదర్ అనిల్ ఈ వ్యాఖ్యలు చేశారనిపరిశీలకులు అంటున్నారు. అయితే జగన్ టార్గెట్ గా బ్రదర్ అనీల్ కుమార్ వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ఆయన సొంతంగా ఏపీలో పార్టీ పెట్టేందుకు కొన్ని ప్రయత్నాలు సాగించారు. ఆ సందర్బంగా పలు ప్రసంగాలలో రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి రావాలని చెప్పారు. అయితే ఏపీలో బ్రదర్ అనిల్ పార్టీ విషయం ఆ తరువాత ఎప్పుడూ తెరమీదకు రాలేదు అది వేరే విషయం. మొత్తంగా ఏపీ సర్కార్ పై బ్రదర్ అనీల్ వ్యాఖ్యలు రాజకీయ హీట్ ను పెంచేయడం మాత్రం ఖాయం. సొంత బావమరిది పాలనపై బ్రదర్ అనిల్ చేసిన వ్యాఖ్యలు విపక్షాలకు ఆయుధాలుగా మారతాయి. క్రిస్మస్ ముందస్తు సన్నాహాల కోసం బ్రదర్ అనిల్ రాష్ట్రంలో ఎక్కడక్కడ అయితే పర్యటిస్తారో అక్కడల్లా వైసీపీకి గడ్డు పరిస్థితులు ఏర్పడటం ఖాయమన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతోంది. మొత్తం మీద ఏపీలో పాలన, పరిస్థితులు, సంక్షేమ పథకాలు వంటి అంశాలపై బ్రదర్ అనిల్ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. 

పెళ్లి మంటపంలోనే కొత్త జంట డిష్యూం డిష్యూం

పెళ్లంటే నూరేళ్ల పంట.. అంటారు. కలకాలం కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలని పెళ్లిక వచ్చిన వారంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అక్షింతలు వేస్తారు. పెళ్లి మంటపం అంతా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చటి తోరణాలతో శోభాయమానంగా ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో పెళ్లి పందిట్లో ఘర్షణలు జరుుగతున్న వార్తలు తరచుగా వింటున్నాం. పెళ్లి విందులో చికెన్ వడ్డించలేదన్న గొడవ కారణంగా పెళ్లి ఆగిపోయిన సంగతి ఇటీవలే జరిగింది. పెళ్లి కొడుకు ముక్కు చిన్నగా ఉందంటూ పీటల మీదే పెళ్లిని పెటాకులు చేసుకున్న పెళ్లి కూతురి4 ఉదంతమూ తెలిసిందే. తాజాగా పెళ్లి పీటల మీదే వధూవరులు కోట్లాటకు దిగి ఒకరిని ఒకరు కట్టుకున్న ఉదంతం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. ఎక్కడ జరిగింది.. ఎప్పుడు జరిగింది అన్న సంగతి స్పష్టంగా తెలియడం లేదు కానీ ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తోంది.  పెళ్లి తంతులో భాగంగా వరుడు వధువుకు మిఠాయి తినిపించాలి. అయితే మిఠాయి తినడానికి వధువు నిరాకరించింది. అదంతా సరదా లేదా సరసం అనుకున్నాడో ఏమో వరుడు ఆమె నోట్లో బలవంతంగా మిఠాయి పెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో వధువు ఒక్క సారిగా భద్రకాళి అవతారం ధరించినట్లుగా రెచ్చిపోయింది. వరుడి చెంప పగుల కొట్టింది. దీంతో వరుడు దిమ్మతిరిగింది. తేరుకున్న వెంటనే నన్నే కొడతావా అంటూ వధువుపై చేయి చేసుకున్నాడు. ఇక అక్కడ నుంచీ వారి మధ్య యుద్ధకాండ మొదలైంది. ఒకరినొకరు కొట్టుకుంటూ రచ్చ చేశారు. పెళ్లికి వచ్చిన బంధువులు వారిని నివారించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పెళ్లి మంటపంలో ఒక్క సారిగా పిన్ డ్రాప్ సైలెన్స్ అలుముకుంది. అయితే ఈ సంఘటన అంతా వీడియో తీసిన వారు మాత్రం వధూవరుల యుద్ధ కాండకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అదీ అలాంటిలాంటి బ్యాక్ గ్రౌండ్ కాదు బాహుబలి, అఖండ వంటి సినిమాలను మించిపోయే సౌండ్ ఎఫెక్ట్ ఇచ్చారు. పీటల మీద తన్నుకున్న వధూవరులు తరువాత ఏం చేశారో ఏమో కానీ వారి ఫైటింగ్ సీన్ మాత్రం నెట్టింట నవ్వులు పూయించారు.  

నిర్భయ ఘటనకు పదేళ్లు... దేశంలో మార్పేది.. మృగాళ్లకు శిక్షలెక్కడ?

 దేశాన్ని కదిలించి కన్నీళ్లు పెట్టిన నిర్భయ సంఘటన జరిగి నేటికి సరిగ్గా పదేళ్లు. దేశంలో మహిళల భద్రత గాలిలో దీపం అని ప్రపంచానికి చాటిన ఘటన అది.  దేశ రాజధాని నగరం ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఓ అమ్మాయిపై   సామాహిక అత్యాచారం జరిగింది. తన స్నేహితుడితో కలిసి బస్సు ఎక్కిన ఆమెపై సామూహిత అత్యాచారం జరిగింది. అత్యంత పాశవికంగా హింసించి ఆమెపై అఘాయిత్యం చేసి బస్సులోంచి తోసేశారు. ఆమె స్నేహితుడిని సైతం కొట్టి బయట పారేశారు.  ఈ అత్యాచార ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పార్లమెంట్‌ను  కుదిపేసింది. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ చేత కన్నీళ్లు పెట్టించింది. దేశం అంతా కదిలిపోయింది. ఆగ్రహంతో రగిలిపోయింది. ప్రభుత్వమూ స్పందించింది.   నిర్భయ పేరుతో చట్టం తీసుకొచ్చింది. తర్వాతి కాలంలో నిర్భయ ఘటనలో దోషులకు శిక్ష పడింది. అయితే ఈ ఘటన జరిగి పదేళ్లయినా మహిళల భద్రత విషయంలో దేశంలో పరిస్థితిలో ఇసుమంతైనా మార్పు వచ్చిన దాఖలాలు లేవు. కఠిన చట్టాలు తీసుకు వచ్చినా  మృగాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. మహిళలపై దాడులు, అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. చాలా ఘటనల్లో దోషులకు శిక్షలు పడటం లేదు. మహిళలపై అఘాయిత్యాల కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారించి సత్వరమే శిక్షలు పడేలా చేయాలన్న లక్ష్యం నెరవేరలేదు. ఆ కారణంగానే దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. ఇందుకు జాతీయ క్రైం బ్యూరో రికార్డులే సాక్ష్యం. గత ఏడాది అంటే 2021లో దేశంలో  మహిళలపై అత్యాచారాలు 2020తో పోలిస్తే 40శాతం పెరిగాయి. దేశ రాజధాని నగరంలో అయితే 2021 సంవత్సరంలో మహిళలపై నేరాల సంఖ్య 13 వేలు. తాజాగా స్కూలుకు వెళ్లే చిన్నారిపై యాసిడ్ దాడి జరిగింది. మహిళలపై అత్యాచార ఘటనలు జరుగుతున్నంత కాలం తమ కుమార్తె నిర్భయకు న్యాయం జరిగినట్లు కాదని నిర్బయ తల్లిదండ్రులు అన్నారు.  పారామెడికల్‌ స్టూడెంట్ అయిన నిర్భయ  2012 డిసెంబర్ 16  అర్ధరాత్రి తన స్నేహితుడితో కలిసి ఓ ప్రైవేట్ బస్సు ఎక్కింది. అందులో ఉన్న ఆరుగురు కామాంధులు ఆమె  స్నేహితుడిని తీవ్రంగా కొట్టి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బస్సును  ఢిల్లీ వీధుల్లో తిప్పుతూ ఒకరి తర్వాత ఒకరు ఆ అమాయకురాలిపై పైశాచికంగా లైంగిక దాడికి పాల్పడారు. జననాంగాల్లో ఇనుప రాడ్డులు జొప్పించడంతో బాధితురాలి పేగులు చిధ్రమయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడుతున్న ఆమెను ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డపై విసిరేసి పరారయ్యారు. ముందుగా ఢిల్లీలో చికిత్స పొందిన నిర్భయను ఆ తర్వాత మెరుగైన వైద్య చికిత్స కోసం సింగపూర్‌‌ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. దేశ రాజధానిలో జరిగిన ఈ ఘోర ఘటన దేశం మొత్తాన్ని కదిలించింది. దేశ నలుమూలలా ఆందోళనలు, ర్యాలీలు ఒక ఎత్తయితే ఢిల్లీ వేదికగా సాగిన పోరాటం మరో స్వాతంత్య్ర సంగ్రామాన్ని తలపించింది. ఈ ఉద్యమానికి యువతే మార్గ నిర్దేశం చేసింది. అనేక యూనివర్సిటీలు, కాలేజీల నుంచి వేల సంఖ్యలో వచ్చిన యువతీ యువకులు ఇండియాగేట్‌పై దండెత్తారు. భారతదేశ చరిత్రలోనే తొలిసారి రాష్ట్రపతి భవన్‌ను ముట్టడించిన ఘటన ఇదే. అమాయక అబలలపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేయాలని..నిర్భయ లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదని నాటి యూపీఏ ప్రభుత్వం నిర్భయ పేరుతో చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ.. ఎన్ని చట్టాలు తెచ్చినా మృగాళ్లలో మార్పు కనిపించడం లేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారత్‌లో రోజుకు సగటున 90 అత్యాచార కేసులు నమోదవుతున్నాయంటే ఇక్కడ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అత్యాచార కేసుల సంఖ్య పెరుగుతున్నా ఈ కేసుల్లో నిందితులలో చాలా తక్కువ మందికి శిక్షలు పడుతున్నాయి.ఎన్ని చట్టాలు తెచ్చినా.. కఠిన శిక్షలు విధించినా మార్పు శూన్యం. మహిళలపై దాడులు, అత్యాచారాలు ఎప్పటిలానే కొనసాగుతున్నాయి. 

వ్యతిరేక ఓట్లను చీల్చే పార్టీలకు స్వాగతం.. తెలుగు రాష్ట్రాల సీఎంల ఉమ్మడి వ్యూహం

ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీలు, అనివార్యంగా కనిపిస్తున్న ఓటమి నుంచి బయట పడేందుకు   పరస్పర సహకారంతో  ఉమ్మడి వ్యూహం రచిస్తున్నాయా? ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా?  అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి, తెలంగాణ ముఖ్యమత్రి కేసేఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్య సఖ్యత ఎంత మేరకు ఉందనేది అనుమానమే, అయినా, నువ్వొకందుకు పోస్తుంటే, నేనోకందుకు తాగుతున్నాను అనే స్నేహ బంధం అయితే వుందనేది  మాత్రం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అందుకే, ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు అవసరార్ధం చేతులు కలిపారని, ప్రతిపక్షాలు ఆరోపించడమే కాదు, ఆ ఇద్దరి నడక, నడతలను దగ్గరగా గమనిస్తున్న రాజకీయ పండితులు, విశ్లేషకులు సైతం అదే అంటున్నారు.  నిజమే 2019 ఎన్నికల్లోనూ వైసేపీని గెలిపించేదుకు,కేసేఆర్ ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా మరీ ముఖ్యంగా ఆర్ధిక వనరులు సమకూర్చడంలో జగన్ రెడ్డికి సంపూర్ణ సహకరం అందించారు. అంతే కాదు, తెలుగుదేశం టికెట్ పై గెలిచి, తెరాసలో చేరి మంత్రి అయిన తలసాని శ్రీనివాస యాదవ్  ను తెలుగు దేశం పార్టీకు వ్యతిరేకంగా రంగలోకి దించారు. తెలుగు దేశం పార్టీలో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే  పనికి తలసానిని ఉపయోగించారు. అందుకే  ఎన్నికల ఫలితాలు వచ్చి  జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే  ఆయన కేసేఆర్  చేతుల్లోకి వెళ్ళిపోయారనే ఆరోపణలు మొదలయ్యాయి. మరో వంక జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయాలు కూడా అదే విషయాన్ని  స్పష్టం చేశాయి.  అదేదో నాగార్జున సినిమాలో.. బ్రహ్మానందం,   ముందు ఆమె నన్ను ప్రేమించింది  ఆ తర్వాత నేను ఆమెను ప్రేమిచవలసి వచ్చింది అంటారు చూడండి, అలాగే, కేసీఆర్ వ్యూహత్మకంగా జగన్ రెడ్డిని ముగ్గులోకి లాగి ఉచ్చులో బిగించారని అంటారు. ముందు కేసీఆర్ జగన్ రెడ్డి దంపతులను హైదరాబాద్ కు ఆహ్వానించి, శాలువ కప్పి సన్మానం చేశారు. ఇక ఆతర్వాత ఏమి జరిగిందనేది  అందరికీ తెలిసిన విషయమే. ఆఫ్కోర్స్  అలాగని జగన్ రెడ్డి అమాయకుడు  కేసీఆర్ ఉచ్చులో చిక్కుకు పోయారు అనుకుంటే  అది పొరపాటే అవుతుంది. ఇంతకు ముందే అనుకున్నట్లుగా, ఇద్దరు ఇద్దరే, నువ్వొకందుకు పోస్తుంటే నేనోకందుకు తాగుతున్నాను, అన్నట్లు ఎవరి ప్రయోజనాలు వారు చూసుకున్నారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రభుత్వ ఆస్తులను, తెలంగాణ సర్కార్ కు సమర్పించి  అందుకు ప్రతిఫలంగా  హైదరాబాద్ లో తమ అక్రమ ఆస్తులను కాపాడు కోవడంలో  కేసీఆర్ ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నారని అంటారు. అయితే, ఇలా ఇద్దరు సార్ల మధ్య సాగుతున్న బేరసారాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలు ముఖ్యంగా ఆంద్ర ప్రదేశ్ ప్రయోజనాలు ‘క్విడ్ ప్రో కో’ టైపులో కొట్టుకు పోతున్నాయని అంటారనుకోండి అది వేరే విషయం.  ఇక ప్రస్తుత ‘ప్యూర్’ పాలిటిక్స్ విషయానికి వస్తే, లక్ష్యం ఏదైనా కావచ్చును, తెలంగాణలో అధికారాన్ని నిలబెట్టుకోవడమే కావచ్చును. కాదంటే, కాలం ఖర్మం కలిసోస్తే దేవెగౌడ లెక్క  ప్రధాని కావాలనే పగటికలల  ప్రభావమే కావచ్చును అదీ కాదంటే చుట్టుముడుతున్న అవినీతి ఆరోపణలు, సిబిఐ, ఈడీ దాడుల నుంచి రక్షణ పొందే వ్యూహమే కావచ్చును కారణం ఏదైనా తెలంగాణ ముఖ్యమంత్రి, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగా  ఏపీలో తెరాస నయా చహారా  బీఆర్ఎస్ కు రూట్ క్లియర్ చేసుకునే పనిలో పడ్డారు. ఇక్కడే మరోసారి, ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల, ఉభయకుశలోపరి.. సంభాషణ మొదలైందని అంటున్నారు.  అందులో భాగంగా ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చేందుకు జగన్ రెడ్డి ... తెరాస నయా చహర.. భారత రాష్ట్ర సమితి (భారాస)కు స్వాగతం పలుకుతున్నారు. ఏపీ వ్యాప్తంగా బీఆర్ఎస్ కు మద్దతుగా స్వాగత బ్యానర్లు వెలుస్తున్నాయి. అటు విజయవాడలో ఆఫీసు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ అన్నిటి వెనకా ఎవరున్నారో వేరే చెప్పనక్కరలేదు. ఇప్పటికే సజ్జల రామకృష్ణా రెడ్డి  భారాసకు స్వాగతం పలికారు. మిగిలిన విషయాలు ముఖ్యమంత్రులు ఇద్దరూ మాట్లాడుకుంటారని అన్నారు. అంటే ఆ ఇద్దరి మధ్య ఇప్పటికే ఒక అవగాహన ఉందని  సజ్జల చెప్పకనే చెప్పారు. నిజనికి ఇద్దరి మధ్య అవగాహన లేకుంటే  ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకునే  ‘రహస్యం’  ఏముంటుంది? అందుకే, ఓటమి నుంచి తప్పించుకునేదుకు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉమ్మడి కుట్రకు పాల్పడుతున్నారనే విషయం స్పష్టమవుతోంది పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అలాగే  తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు జగన్ రెడ్డి ఇప్పటికే సోదరి షర్మిలను బరిలో దించారు. ఇంతకాలం ఆమె ఎవరు విడిచిన బాణం అనే విషయంలో అనుమానాలున్నా, రీసెంట్ ఎపిసోడ్స్ లో ఆమె కేసీఆర్ కోసం జగన్ రెడ్డి వదిలిన బాణం అనే విషయం స్పష్టమైంది. అదొకటి అలా ఉంటే, ఇద్దరు ముఖ్యమంత్రుల ఉమ్మడి వ్యూహంలో భాగంగా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ  ఆమ్ ఆద్మీ పార్టీ, (ఆప్) సహా మరికొన్ని, ప్రభత్వ వ్యతీరేక ఓటును చీల్చే పార్టీలు నాయకులకు స్వాగత తోరణాలు సిద్దం చేస్తునట్లు తెలుస్తోంది. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలే ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో వుందో చెప్పకనే చెపుతోందని పరిశీలకులు అంటున్నారు. అందుకే, ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకటై ఎన్ని వ్యూహాలు రచించినా, అక్కడ ఏపీలో వైసీపీ, ఇక్కడ తెలంగాణలో తెరాస ప్రభుత్వాలు ప్రభుత్వ వ్యతిరేక పవనాల్లో కొట్టుకు పోవం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. చూద్దాం. కథ అయిపోలేదు.. సశేషమే!

తెర పైకి మళ్ళీ జమిలి ఎన్నికలు!

దేశంలో నెక్స్ట్ జరిగేది జమిలి ఎన్నికలేనా? కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందా? అంటే అవుననే సమాధానం కాదనే జవాబు రెండూ ఒకేసారి వస్తున్నాయి. నిజానికి, ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో బీజేపీ, 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చింది మొదలు,  కేంద్ర ప్రభుత్వం  జమిలి ఎన్నికలకు సుముఖగానే వుంది. సుముఖంగా ఉండడమే కాదు,అప్పటి నుంచి ఆ దిశగా పావులు కదుపుతూనే వుంది. 2019 బీజేపీ ఎన్నికల మానిఫెస్టోలో కూడా’జమిలి’ అంశాన్ని చేర్చారు. 2019ఎన్నికల తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జమిలి పై చర్చకు .. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. జమిలి ఎన్నికల మంచి చెడులను చర్చించారు. కాంగ్రెస్,కమ్యూనిస్ట్ పార్టీలు, ఒకటిరెండు ప్రాతీయ పార్టీలు మినహా, తెరాస సహా చాలా వరకు పార్టీలు  జమిలికి జై కొట్టాయి.నీతీ ఆయోగ్‌ కూడా నివేదిక సిద్ధం చేసింది. లా కమిషన్‌ రాజకీయ పార్టీల అభిప్రయాలను రికార్డు చేసింది.  మరో వంక జమిలి ఎన్నికల నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఏకాభిప్రాయం వ్యక్తం అయితే రాజ్యాంగ సవరణ ద్వారా వన్‌ నేషన్..‌ వన్‌ ఎలక్షన్‌కు ముందుకు వెళ్లే అవకాశం ఉందని ఎన్నికల సంఘం ఆ దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాదు, పార్లమెంట్ ఎప్పుడు ఆమోదం తెలిపినా, నిర్దిష్ట  సమయంలో లోక్’సభ, అసెంబ్లీలలతో పాటుగా స్థానిక సంస్థలు ఒకే సారి, ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా వుందని, అధికారులు పలు సందర్భాలలో పేర్కొన్నారు. అంతే కాదు, జమిలి ఎన్నికల అవసరాన్ని, ప్రయోజనాలను వివరిస్తూ నిర్వహించే సెమినార్లు, వర్క్ షాపులలో కేంద్ర ఎన్నికల సంఘం క్రియాశీలక భూమికను పోషిస్తోంది. జమిలి ఎన్నికలకు సానుకూల వాతావరణం నిర్మాణంలో కేంద్ర ఎన్నికల సంఘం తన వంతు పాత్రను పోషిస్తోంది.  అదలా ఉంటే, తాజగా కేంద్ర ప్రభుత్వం మరోమారు జమిలి ఎన్నికలకు సానుకులతను వ్యక్తపరిచింది. రాజ్యసభలో ఇందుకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 1951, 1952, 1957, 1962, 1967లో జమిలి ఎన్నికలు జరిగాయని తెలిపారు.1968, 69లో పలు అసెంబ్లీలు నిర్ణీత గడువు కంటే ముందే రద్దుకావడంతో జమిలి ఎన్నికలకు అంతరాయం కలిగిందని రిజుజు చెప్పారు. విడివిడిగా ఎన్నికల నిర్వహణతో బడ్జెట్ పెరిగిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిపాలనలో సుస్థిరత కోసం జమిలి ఎన్నికలే మేలంటూ లా కమిషన్ తన 170వ నివేదికలోనూ సూచించిందని కేంద్రం తెలిపింది.  దీంతో మరోమారు జమిలి ఎన్నికలపై చర్చ మొదలైంది. అయితే అది అనుకున్నంత తేలిక కాదని, ముఖ్యంగా కొన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, జమిలి ఎన్నికల వస్తే, ప్రస్తుతం కేంద్రంలో, సగానికి పైగా రాష్ట్రాలో అధికారంలో ఉన్న బీజేపీని ఒకే సారి ఎదుర్కోవడం కష్టమనే రాజకీయ కోణంలో జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయని అంటున్నారు. అయితే, తరచుగా వచ్చే ఎన్నికల వలన  నిత్యావసర సేవలు సహా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని, అన్నిపార్టీల ఎంపీలు సభ్యులుగా ఉన్న పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పేర్కొంది. పార్లమెంటుకు, రాష్ట్ర అసెంబ్లీలకు వేరువేరుగా జరిగే ఎన్నికల కారణంగా భారీగా ప్రజాధనం ఖర్చవుతుందని తెలిపింది. 2014-22 మధ్యకాలంలో 50 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎనిమిదేళ్లలో రూ. 7వేల కోట్లకు పైగా ఎన్నికల నిర్వహణపై ఖర్చు పెట్టాల్సి వచ్చిందని స్టాండింగ్ కమిటీ పేర్కొంది.అయితే జమిలి ఎన్నికల నిర్వహణకు కనీసం అయిదు రాజ్యాంగ సవరణలను చేయాలని లా కమిషన్‌ పేర్కొంది. ఈ సవరణలను పార్లమెంట్ ఉభయ సభలతో పాటుగా, సగం రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. ఆ లెక్కన మెజారిటీ రాష్ట్రాల్లో ఎన్డీయే పాలక పక్షాలున్నాయి. రాజ్యసభలో బలం లేకపోయినా మద్దతిచ్చే పార్టీలున్నాయి. కాబట్టి రాజ్యాంగ సవరణ ద్వారా వన్‌ నేషన్.. వన్‌ ఎలక్షన్‌కు ఇదే సరైన సమయం అని ప్రధాని మోడీ భావిస్తే.. జమిలి ఎన్నికలు వచ్చినట్లే అంటున్నారు. అలాగే ఎన్నికల నిర్వహణ పెద్ద కష్టం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  కానీ, జమిలి ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోవడంలో వెనకా ముందవుతోంది. ఓ వంక జమిలి ఎన్నికలకు సై అంటూనే బీజేపీ,గుజరాత్, హిమాచల్ ఫలితాలు వచ్చిన వెంటనే 2023 లో జరగనున్న  పది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించింది. కమిటీలు, రోడ్ మ్యాపులు సిద్ధచేసుకునే పనికి బీజేపీ రెడీ అయింది. అయితే, బీజేపీ నాయకులు మాత్రం మోడీ, షా నేతృత్వంలో బీజేపీ ఎన్నికల పరుగు నిరంతర ప్రవాహంలాగా సాగుతూనే ఉంటుందని, అంత మాత్రం చేత బీజేపీ, కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల అంశాన్ని అటకెక్కించినట్లు కాదని అంటున్నారు. అయితే, జమిలి ఎన్నికలు 2024 లో వస్తాయా? అంతకు ముందే వస్తాయా? అంటే మాత్రం ఎవరి దగ్గర సమాధానం లేదు.

హైదరాబాద్ ఐఎస్ బీ చంద్రబాబు దార్శనికతకు దర్పణం

ఒక దార్శనికుడిని రాజకీయ వైరంతో మరుగున పడేయడం ఎవరి వల్లా కాదు. ఆ విషయం చంద్రబాబు విషయంలో పదే పదే రుజువు అవుతోంది. రాజకీయంగా చంద్రబాబుకు వస్తున్న గుర్తింపు, పెరుగుతున్న ప్రతిష్టం ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపు కలిగిస్తే కలిగించొచ్చు కానీ.. నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను ఆయన ఉపయోగించిన తీరు మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారూ మాత్రం చంద్రబాబు దార్శనికతపై ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు. కేవలం చంద్రబాబు దూరదృష్టితో చేసిన ప్రయత్నం వల్లనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి) హైదరాబాద్ కు వచ్చింది. కేవలం రెండు దశాబ్దాలలోనే ఐఎస్ బి హైదరాబాద్ అంతర్జాతీయంగా ఎనలేని గుర్తింపు పొందింది.  ఏవో ఏవేవో రాజకీయ కారణాల వల్ల హైదరాబాద్ ఐఎస్ బీ విషయంలో చంద్రబాబు ప్రమేయాన్ని తక్కువ చేసి చూపడానికో, గుర్తించకుండా ఉండటానికో ఎన్ని ప్రయత్నాలు జరిగినా చరిత్ర మాత్రం హైదరాబాద్ లో ఐఎస్ బీ రావడానికి ఏకైక కారణం చంద్రబాబుదార్శనికత, సమర్ధత కారణమని పదే పదే గుర్తు చేస్తూనే ఉంది. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఐఎస్ బి రెండు దశాబ్దాల ఉత్సవాల ముగింపు సమావేశంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. శుక్రవారం (డిసెంబర్ 16) సాయంత్రం  ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) హైదరాబాద్ క్యాంపస్‌లో 20 ఏళ్ల ఆవిర్భావ ముగింపు వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకల్లో  తెలుగుదేశం అధినేత చంద్రబాబు  ఐఎస్‌బీ విద్యార్ధులతో ముఖాముఖీ చర్చలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో  ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ క్యాంపస్ ఆవిర్బావానికి కర్త, కర్మ, క్రియ అన్నీ అయిన  అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముందు చూపును, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా,  రాష్ట్రానికి సీఈవోగా ఆయన ఐఎస్ బీని హైదరాబాద్ లో ఏర్పాటయ్యేలా చేయడానికి చేసిన కృషిని ఒక సారి అవలోకనం చేసుకుందాం.     అప్పటికే ఐటీ హబ్ గా అమెరికా తరువాత అంతటి గుర్తింపు పొందిన బెంగళూరు (కర్నాటక)ను, భారత వాణిజ్య రాజధాని ముంబై అప్పటి బొంబై ( మహారాష్ట్ర)లను  కాదని ఐఎస్ బీని హైదరాబాద్ ( అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని)కు తీసుకువచ్చిన చంద్రబాబు సమర్థత కళ్లకు కడుతుంది. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రగతి, పురోగతికే ప్రాధాన్యత ఇచ్చి, వర్తమానంతో పాటు భవిష్యత్ తరాల బాగును దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు  తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన విధానాలే.. ఆయనకు ఒక ప్రత్యేక నేతగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి.    ఆసియాలో ఒక బిజినెస్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రపంచంలోని 500 కంపెనీలు ఉమ్మడి భాగస్వామ్యంతో ముందుకు వచ్చిన తరుణంలో  నాడు అంటే 1988లో ఇండియన్ బిజినెస్ స్కూల్ ను తమ రాష్ట్రంలో ప్రారంభించాలంటే తమ రాష్ట్రంలో ప్రారంభించాలంటూ అప్పటికే ఐటీ హబ్ గా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన కర్నాటక సహా పలు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. తొలుత బిజినెస్ స్కూల్ ఏర్పాటు కోసం పరిశీలించినది కూడా బెంగళూరునే..  ఏపీలో ఐఎస్ బీ అనే ఉద్దేశమే   బిజినెస్ స్కూల్ ఏర్పాటు కోసం అనువైన నగరం కోసం అన్వేషించేందుకు వచ్చిన ప్రతినిథి బృందానికి లేదు. అయితే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలనలో పారదర్శకతకు, మెరుగైన ప్రజాసేవకు ఐటీని వినియోగించుకుంటున్న తీరు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సుపరిపానల అందిస్తున్న విధానంపై  దేశంలోనే కాదు, ప్రపంచంలోని పారిశ్రామిక వేత్తలు సైతం  గుర్తించారు. అయినా కూడా అప్పటికి ఐఎస్ బీ ప్రమోటర్లు బిజినెస్ స్కూల్ ను బెంగళూరులో ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నారు. అప్పుడప్పుడే హైదరాబాద్ బెంగళూరుకు పోటీగా ఐటీ హబ్ గా ఎదుగుతున్న దశ.  దక్షిణాదిన ప్రతిష్టాత్మక ఇండియన్ బిజినెస్ స్కూల్ ఏర్పాటుకు ప్రమోటర్లు ముందుకు వస్తున్నారన్న సంగతి తెలిసిన వెంటనే చంద్రబాబు స్వయంగా వారిని సంప్రదించారు. ఒక ముఖ్యమంత్రిగా ప్రమోటర్లతో సంప్రదింపులకు ఆయన వెనుకాడలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన సీఎంగా కంటే ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గానే ఎక్కువ కష్టపడ్డారు.  ఆ చొరవతోనే ఆయన ఇండియన్ బిజినెస్ స్కూల్ ప్రమోటర్లతో స్వయంగా మాట్లాడారు. హైదరాబాద్ ఆలోచనే లేదు..మా తొలి ప్రాధాన్యత బెంగళూరే అంటూ వారు కుండబద్దలు కొట్టినట్టు ముఖం మీదే చెప్పినా ఆయన నిరుత్సాహ పడలేదు.  ఆ బృందాన్ని హైదరాబాద్ కు ఆహ్వానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారిని ఆయన తేనేటి విందుకు ఆహ్వానించారు. బిజినెస్ స్కూల్ ప్రమోటర్లు అప్పటి వరకూ పలు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపారు. కానీ ఏపీ నుంచి సంప్రదింపుల ప్రతిపాదన ముఖ్యమంత్రి నుంచే రావడం వారికి ఒకింత ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే అప్పటి వరకూ వారితో సంప్రదింపులకు వచ్చింది అధికారులే. అందుకు భిన్నంగా సీఎం స్వయంగా ఆహ్వానించడంతో వారు కాదనలేక కేవలం మొహమాటంతోనే హైదరాబాద్ వచ్చారు. అలా వచ్చినంత మాత్రాన    హైదరాబాద్ లో ఐఎస్ బీ ఏర్పాటు  గ్యారంటీ అని భావించవద్దని వారు ముందుగానే చంద్రబాబుకు చెప్పారు.  అందుకు సమ్మతించే చంద్రబాబు వారిని ఆహ్వానించారు.  అలా వచ్చిన వారిని  ప్రొటోకాల్ ను సైతం కాదని ఎదురేగి ఆహ్వానించారు.   స్వయంగా  బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేశారు. తన నివాసంలోనే ఐఎస్ బీ ఏర్పాటు చేస్తే తమ ప్రభుత్వం ఇచ్చే రాయతీలు, కల్పించే సౌకర్యాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రం ప్రగతి దారిలో దూసుకుపోతున్న తీరును కళ్లకు కట్టారు. ఐటీని స్మార్ట్ గవర్నెన్స్ కోసం వినియోగించుకుంటున్న తీరునూ సవివరంగా వారికి ఎరుకపరిచారు.  చంద్రబాబు వ్యవహార శైలి, అభివృద్ధి కోసం ఆయన పడుతున్న తపన, ఆయన దార్శనికత ఆ బృందాన్ని మెస్మరైజ్ చేశాయి. చంద్రబాబు నివాసంలో తేనీటి విందు తరువాత కొన్ని రోజులకే హైదరాబాద్ లోనే బిజినస్ స్కూల్ ఏర్పాటు కార్యరూపం దాల్చింది.  బెంగళూరును కాదని హైదరాబాద్ ను ఎంచుకోవడానికి కారణం ఐఎస్ బి బృందం మీడియా సమావేశంలో వివరిస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రోచ్, విజన్, అద్భుతం అని ప్రశంసించారు.  అయితే అంతటితో  పని అయిపోలేదు. అభివృద్ధిని అడ్డుకునే శక్తులు, రాజకీయంగా చంద్రబాబును ఇబ్బందులు పెట్టాలన్న శక్తులు తమతమ ప్రయత్నాలను కొనసాగించాయి. ఐఎస్బికి హైదరాబాద్‌ గచ్చిబౌలిలో 260 ఎకరాల స్థలాన్ని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది.  స్టాంపు డ్యూటీ మినహాయింపుతో పాటు కొన్ని రాయితీలూ కల్పించింది. దీనిపై నాడు ఏపీలో విపక్షం అయిన   కాంగ్రెస్‌ పలు విమర్శలు చేసింది.  ఆరోపణలు గుప్పించింది.   కొందరు నాయకులైతే కేసులు పెట్టారు. కానీ న్యాయస్థానం  సదుద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఐఎస్ బికి రాయతీలు ఇవ్వడంలో  రాష్ట్ర ప్రభుత్వం  ఎటువంటి అధికార దుర్వినియోగానికీ పాల్పడలేదని విస్పష్టంగా తీర్పు చెప్పింది.  అదిగో ఆ విషయాన్నే తాజాగా  మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఐఎస్బీ లీడర్ షిప్ సమ్మిట్లో చెప్పారు.  సరే అదలా ఉంచితే రాష్ట్రంలో ఐఎస్బీకి   రాయతీలు ఇవ్వడాన్ని అప్పట్లో ఇక్కడ విపక్షంలో ఉన్న కాంగ్రెస్ విమర్శలు, ఆరోపణలూ గుప్పిస్తే కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు తమ రాష్ట్రానికి ఐఎస్ బీని సాధించలేకపోయినందుకు తమ రాష్ట్ర ముఖ్యమంత్రిపై విమర్శలు చేశారు. చంద్రబాబు ఐఎస్ బీని సాధించడం ద్వారా ఏపీకి గొప్ప మేలు చేకూరిందంటూ జాతీయ పత్రికలు అప్పట్లో సంపాదకీయాలు రాశాయి. ఆయన దార్శనికత దేశానికి అవసరమంటూ ప్రశంసలతో ముంచెత్తాయి. 1999లో  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఐఎస్‌బి హైదరాబాద్‌ క్యాంపస్‌కు పునాదిరాయి పడింది.  2001లో నాటి ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా, సీఎం చంద్రబాబు సమక్షంలో ఐఎస్‌బి హైదరాబాద్‌ క్యాంపస్‌ ప్రారంభోత్సవ వేడుక   ఘనంగా జరిగింది.   

నితీష్ కుమార్’ కు కోపమొచ్చింది .. ఎందుకో తెలుసా?

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జాతీయ స్థాయిలో మంఛి పేరున్న నాయకుడు. కాలం కలిసొస్తే, 2024లో  ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్ధిగా బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్న సీనియర్ మోస్ట్  రాజకీయ నాయకుడు.     అవినీతి అంతగా అంటని మంచి పరిపాలన దక్షుడు. రాజకీయ పొత్తులు, రాజకీయ సమీకరణలు మారినా ముఖ్యమంత్రి పీఠం చేజారకుండా కాపాడుకోవడంలో సిద్ద హస్తుడు. రాజకీయ చతురుడు. అటో మోడీ, షా,ఇటు లాలూ అండ్ ఫ్యామిలీ ఇద్దరినే తమ ఎత్తులతో చిత్తూ చేస్తూ ముఖ్యమంత్రి కుర్చీలో శాశ్వతంగా సెటిలై పోగల రాజకీయ జిత్తుల మారి ‘నేత’. ఈ అన్నిట్నీ మించి, నితీష్ కుమార్’కు  సౌమ్యుడు. సహనశీలి, స్నేహశీలి అనే మంచి గుర్తింపు వుంది.  అయితే, అంతటి మంచి మనిషికి కోప మొచ్చింది.  అంతటి సహన శీలి, సౌమ్యుడిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అది కూడా రాష్ట్ర శాసన సభలో... నితీష్ కుమార్ ఉగ్రరూపం ప్రదర్శించారు. అది కూడా నిన్నమొన్నటి వరకు తాను  కూర్చున్న ముఖ్యమంత్రి పల్లకీని మోసిన, మాజీ మిత్ర పక్షం, ప్రస్తుత విపక్షం బీజేపీ నేతలపై , ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫైరయ్యారు . భగ్గుమన్నారు. ఆయున నోటి నుంచి ఏకే 47 తూటాల వంటి మాటలు దూసుకొచ్చాయి. అయితేమ ఇంతేకీ నితీష్ కుమార్ సార్’కు ఇంతలా కోపం ఎందుకొచ్చింది? అంటే అందుకు మందు కారణం. కాదు, ఆయన మందు తాగి, సభకు రాలేదు. కానీ, సంపూర్ణ మధ్య నిషేధం అమలులో ఉన్న రాష్టంలో, ఈ మధ్య కాలంలో కల్తీ మద్యం అమ్మకాలు ఎక్కువయ్యాయి. కల్తీ మద్యం తాగి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఛాప్రా జిల్లాలో కల్తీ మద్యం తాగిన ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సహజంగానే రాజకీయ దుమారం భగ్గుమంది. ఈ నేపధ్యంలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో గడచిన రెండు రోజులుగా అధికార, ప్రతిపక్షాల మధ్య మద్యం మాటల యుద్ధం సాగుతోంది.ప్రజలకు ముఖ్యమంత్రి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్ష బీజేపీ సభ్యులు డిమాండ్‌ చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు.  ఈ క్రమంలో సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ‘తాగేసి వచ్చారా?’ అంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు.‘‘ఒకవేళ తాగితే చస్తారు’’ అని నితీశ్ నోరు జారారు.దీంతో అసహనానికి గురైన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్‌ చేశారు.కాగా, మద్యం సాగి సభకు వచ్చారా అంటూ సీఎం అసెంబ్లీలో గద్దించడంపై బీజేపీ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో ఆదరణ తగ్గి వయసు పెరుగుతుండటంతో ఆయనకు కోపం పెరుగుతోందని ఆ పార్టీ నేత గిరిరాజ్ సింగ్ విమర్శించారు. నితీష్ పని అయిపోయిందని, అందుకే కోపం ప్రదర్శిస్తున్నారని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ అన్నారు.  అయితే, అధికార ప్రతిపక్షాల మాటలు ఎలా ఉన్నప్పటికీ, బీహార్’లో నితీష్ కుమార్ బీజీపే తో తెగతెంపులు చేసుకుని,ఆర్జేడీతో చేతులు కలిపినా తర్వాత, ఆయన అసహనననికి గురవుతున్నడి నిజమే,ఆర్జేడీ, బీజేపీల మధ్య సాగుతున్న రాజకీయ యుద్ధంలో నితీష్ లేగ దూడల నలిగి పోతున్నారు. అందుకే, చివరకు ఈ ఒక్కసారికి మాత్రమే తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతాని, వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో, ఆర్జేడీ నేత, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్’ ముఖ్యమంత్రి అభ్యర్ధిగానే ఆర్జేడీ, జేడీయు కూటమి ఎన్నికలకు వెళుతుందని ప్రకటించారని, అంటున్నారు. నిజానికి, పొత్తులు మార్చి ముఖ్యమంత్రి కుర్చీని అంటిపెట్టుకుని  కూర్చోవడం వలన నైతేనేమి, ఇతరత్రా కారణాల వలన చేతనేతే నేమి, నితీష్ కుమార్ చరిష్మా చాలా వరకు మసక బారింది. అలాగే, జేడీయు కూడా ఒక విధంగా  క్షీణ దశకు చేరుకుంది, ఇప్పటికే థర్డ్ ప్లేస్’లో ఉన జేడీయు వచ్చే ఎన్నికల్లో బలం మరింత తగ్గి, పార్టీ కాలగర్భంలో కలిసి పోతుందని, అందుకే నితీష్ కుమార్’ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంతోందని పరిశీలకులు సైతం అంటున్నారు.

108 సమ్మె సైరన్

ఏపీలో ఆందోళన బాట పట్టని వర్గం లేదంటే అతి శయోక్తి కాదు. ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, రైతులు, కార్మికులు ఇలా సమాజంలోని అన్ని వర్గాల వారూ కూడా తమ సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఆందోళన బాట పడుతున్నారు. ఇప్పుడు 108 సర్వీసుల కాంట్రాక్టు ఉద్యోగులు కూడా సమ్మె సైరన్ మోగించారు. సకాలంలో వేతనాలు అందక నానా యాతనలూ పడుతున్నామని, ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన ఒక్క హామీ కూడా ఈ మూడున్నరేళ్లలో నెరవేరలేదని వారు చెబుతున్నారు. అంతే కాకుండా 108 నిర్వహణ సంస్థ కారణంగా పలు సమస్యలు ఎదురౌతున్నాయని వారు ారోపిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించకుండా వచ్చే నెల 15 తరువాత ఏ క్షణమైనా సమ్మె బాట పడతామని 108 కాంట్రాక్టు ఉద్యోగులు హెచ్చరించారు.

మద్యం మృతులకు నో ఎక్స్ గ్రేషియా.. బీహార్ సీఎం

సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్ లో కల్తీ మద్యం కాటేసింది. ఈ కాటుకు 30 మంది బలయ్యారు. రాష్ట్రంలోని సారన్ జిల్లా ఇసువాపూర్ పరిధిలో బుధవారం మద్యం తాగిన వారిలో 30 మంది మరణించగా.. పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. మద్యం తాగిన వారిలో 21 మంది బుధవారం మరణించగా, మరో తొమ్మిది మంది మరణించారు. కాగా కల్తీ మద్యం కాటుకు 30 మంది మరణించిన ఘటనపై అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమల్లో ఉన్నా.. కల్తీ మద్యం  విక్రయాలు ఎలా జరుగుతున్నాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. కల్తీ మద్యం యథేచ్ఛగా ఏరులై పారుతోందనీ, ఇది ప్రభుత్వ వైఫల్యమేననీ విమర్శించాయి.  మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే విపక్షాల విమర్శలను తిప్పి కొట్టిన బీహార్ సీఎం నితీష్ కుమార్ బీహార్ లో మద్య నిషేధం అమలులో ఉందని, అలాంటి రాష్ట్రంలో మద్యం తాగడం కూడా నేరమేనని అన్నారు. తాగితే చస్తారు. అలా చనిపోయన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేది లేదని స్పష్టం చేశారు.   

మత్తు మహిమ ఇంతింత కాదయా..!

మత్తు మనిషిని చిత్తు చేస్తుంది. విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. ఇవన్నీ పెద్దలు చెప్పిన మాటలు.. ఏపీ ప్రభుత్వ మద్యం విధానం కారణంగా జేబు, ఒళ్లు కూడా గుల్ల అవుతున్నా.. గుర్తించలేని స్థితిలో మందు బాబులు ఉన్నారు. అధిక ధరలకు చౌక మద్యం విచ్చల విడిగా సరఫరా చేస్తున్న జగన్ సర్కార్ సంపూర్ణ మద్య నిషేధం బాటలో అడుగులు వేస్తున్నాం కనుకనే జనంలో మద్యం అలవాటుకు మాన్పించేందుకు ధరలు పెంచేస్తున్నాం అని చెబుతోంది. మద్యం విషయంలో సమాజానికి ఏపీ సర్కార్ చేస్తున్న చేటు చాలదన్నట్లు డ్రగ్స్, గంజాయిలకు రాష్ట్రంలో గేట్లు తెరిచేసింది. దేశంలో ఏమూల డ్రగ్స్ పట్టుబడినా, గంజాయి దొరికినా ఆ రవాణా మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయంటేనే పరిస్థితి ఏమిటో అర్దం చేసుకోవచ్చు. ఇక విశాఖ వంటి నగరాలలో అయితే గంజాయి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. స్మగ్లింగ్ కు గేట్లు తెరిచేయడంతో గంజాయి ఇంటి ముంగిటికి కూడా వచ్చే చేరుతోంది. దీంతో విశాఖలో ఆడా, మగా తేడా లేకుండా మద్యం, గంజాయి వాడకం పెరిగిపోయింది. దీనికి నిదర్శనంగా తాజాగా విశాఖ బీచ్ రోడ్ లో జరిగిన ఒక సంఘటన నిలుస్తోంది. బీచ్ రోడ్డులో మద్యం తాగుతూ, గంజాయి సిగరెట్ పీలుస్తూ.. ఓ యువతి వీరంగం సృష్టించింది.  ఇదేమిటని ప్రశ్నించిన ట్రాఫిక్ ఎస్ ఐ పై ఆ ఆమ్మాయి దాదాపు దాడి చేసినంత పని చేసింది. అసభ్యంగా దూషిస్తూ తన బాయ్ ఫ్రెండ్ కు చెప్పి శాల్తీ లేపేస్తా జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది. మద్యం మత్తులో ఒళ్లు మరచి వీరంగం చేస్తున్న ఆమెను నియంత్రించలేక చేతులెత్తేసిన పోలీసులు చివరికి అదుపులోనికి తీసుకుని తొలుత ఆసుపత్రికి ఆ తరువాత ఠాణాకు తరలించారు.

కమలానికి కన్నా గుడ్‌బై?

ఉభయ తెలుగు రాష్ట్రాలలో, ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయ ముంది. ముందస్తు ఎన్నికలు తధ్యమని ప్రచారం జరుగుతున్నా, ఆ ముచ్చట ముడిపడే సూచనలు పెద్దగా కనిపించడం లేదు. అయినా అటు ఏపీలో, ఇటు తెలగాణ ఎన్నికల సందడి ఉపందుకుంటోంది, పొత్తులు,ఎత్తులు తెరపై కొస్తున్నాయి. రాజకీయ లెక్కలు మారి పోతున్నాయి. ఉభయ రాష్ట్రాల రాజకీయ ‘కుల’ సమీకరణాలు కలగాపులగంగా కలిసి పోతున్నాయి.  ముఖ్యంగా ఉభయ రాష్ట్రాలలో ఎంతో కొంత సినిమా, రాజకీయ గ్లామర్’ ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందనే వార్త సహజంగానే  ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. ఏపీలో బీజేపీ మిత్ర పక్షంగా ఉన్న జనసేన తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయడం అంటే ... ఎవరికోసం అనే ప్రశ్న సహజంగానే, పై కొచ్చింది. అంతే కాదు  అక్కడ ఎపీలోనూ పవర్ స్టార్, బీజేపీతో తెగతెంపులు చేసుకునే ఆలోచనలో ఉన్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి. నిజానికి, బీజేపీ, జనసేన పొత్తు ఉన్నా లేనట్లే, ఎవరి దారిలో వారు పోతున్నారు. రోడ్ మ్యాప్ అవీ ఇవీ అని మాట్లాడుతున్నా ఎప్పుడైనా బీజేపీ, జనసేన బంధం పుటుక్కుమనవచ్చనే ఉహాగానాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. అదలా ఉంటే, ఇప్పడు బీజేపీ - జనసేన పొత్తు కథ కొత్త మలుపు తిరిగింది. కాంగ్రెస్ ను వదిలి కమలం గూటికి చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారయణ బీజేపీకి గుడ్ బై చెప్పనున్నారనే వార్త గుంటూరు జిల్లా రాజకీయాల్లో చాలా కాలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కమలం గూటికి వచ్చిన కొద్ది కాలానికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిని చేరుకున్న కన్నా, గత కొంత కాలంగా పార్టీలో తనకు అంతగా ప్రాధాన్యత లేకుండా పోతోందనే అసంతృప్తిని అక్కడా, ఇక్కడా వ్యక్త పరుస్తున్నారు. ముఖ్యంగా తన  నుంచి పార్టీ అధ్యక్ష పగ్గాలు పుచ్చుకున్న సోము వీర్రాజుకు కన్నాకు మధ్య దూరం పెరిగింది. సోము వీర్రాజు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కన్నా సన్నిహితుల  వద్దనే కాదు మీడియా ముందు కూడా మొరపెట్టుకున్నారు. అయినా బీజేపీ అగ్ర నాయకత్వం కన్నా వేదనను  ఏమంత పట్టించుకోలేదు. అందుకే ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పే  ఆలోచనలో ఉన్నట్లు, పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.  అందుకు తగ్గట్టుగానే   బుధవారం(డిసెంబర్14)  కన్నా ఇంటికి అనుకోని జనసేన అతిథి వచ్చారు. జనసేన పీఏసీ చైర్మన్, ఆ పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్‌ మరి కొందరు స్థానిక నాయకులను వెంట పెట్టుకుని  కన్నా  ఇంటికి వచ్చారు. దీంతో ఇప్పటికే ఆయన పార్టీ మారబోతున్నారని గాల్లో వినిపిస్తున్నవదంతులకు  మరింత బలం చేకూరింది. నిజానికి, నాదెండ్ల మనోహర్‌ ఒకరిద్దరు అనుచరులతో వచ్చి వెళ్లుంటే ఎలా ఉండేదో ఏమో కానీ, అది అలా జరలేదు. మరో వంక అదే సమయంలో కన్నా అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో  ఆయన నివాసానికి చేరుకోవడంతో ఏదో జరుగుతోందనే గుసగుసలు గుప్పుమన్నాయి. ఈ నేపధ్యంలోనే గతంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.  రెండు  మూడు నెలల క్రితం కన్నా పార్టీని నడిపే విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తమతో పొత్తులో ఉన్న జనసేనతో సమన్వయం చేసుకోవడంలోనూ రాష్ట్ర నాయకత్వం విఫలమైందని ఆయన పరోక్షంగానే అయినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై కారాలు మిరియాలు నూరారు. అలాగే, రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై పార్టీ అధినాయకత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా కన్నా వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన జనసేన ముఖ్యనేతతో భేటీ కావడంతో పార్టీ మార్పు విషయంలో నిర్ణయం తీసుకున్నారా  అనే వార్తలు జోరందుకున్నాయి. అయితే, చివరకు అటు కన్నా, ఇటు నాదెండ్ల కూడా అబ్బే అదేం లేదు. ఒకప్పుడు ఒకే గూటి పక్షులం కదా, పైగా కలిసి చాలా కాలమైంది..ఒకసారి కలసి కూర్చుని కబుర్లాడుకున్నాం.. అంతే  అంతకు మించి ఇంకేమీ లేదు. కోడి గుడ్డు మీద ఈకలు పీక్కండి అనే అర్ధం వచ్చేలా చిన్నపాటి వివరణ ఇచ్చారు. కానీ, ఆడవారి మాటలకే కాదు, రాజకీయ నాయకుల మాటలకూ అర్థాలు వేరనే విషయం తెలియంది కాదు.  అవునంటే కాదని,  కాదంటే అవునని అనే కదా అని అనుకునే వారు అనుకుంటున్నారు. అలాగే, ‘దాల్ మే కుచ్ కాలా హై ..అని కొందరు హిందీలో,  నిప్పులేనిదే పొగ రాదుగా అని తెలుగులో ఇంకొందరు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే  కన్నా  పార్టీ మారడం విషయం ఎలా ఉన్నా  కేసేఅర్,  జగన్ రెడ్డి సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో, పవన్ కళ్యాణ్  హీరోనా ..? విలనా? అనేది ..అసలు ఆయన నటిస్తున్నారా .. నటిస్తుంటే ... ఇలా చాలా చాలా కొత్త సందేహాలు తెరపైకి వస్తున్నాయి.

జగన్ సర్కార్ రుణానంద లహరి

ఎవ్వనిచే జనించు ఋణ మెవ్వనిచే భ్రమియించు లోకమం దెవ్వని బుద్ధియే ఋణద మెవ్వడు నవ్వుచు నప్పులిచ్చు దా నివ్వగ జాలనంచనక నివ్వగ జాలక, దిప్పనట్టి వా డెవ్వడు --- ఆ ఋణాత్ము, ఋణదేశ్వరు నేను ఋణంబు వేడెదన్ పోతన పద్యానికి ఇది ప్రసిద్ధ రచయత ముళ్లపూడి వెంకటరమణ పేరడీ. ఇప్పుడు ఈ పేరడి జగన్ సర్కార్ తీరుకు సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. ముళ్లపూడి వెంకటరమణ సాహిత్యంలో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ పేరు అప్పారావు. అవసరం, కారణాలతో సంబంధం లేకుండా అప్పులు చేసుకుంటూ  పోవడం ఆ క్యారెక్టర్ తీరు.   ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలన సాగిస్తున్న తీరు చూస్తుంటే.. ఎవరైనా సరే ఈ సర్కార్ ను అప్పారావు క్యారెక్టర్ తో పోల్చకుండా ఉండలేరు. ఎడాపెడా వృధా నియామకాలు, వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేస్తున్న ఉచిత పందేరాలు, ఇందు కోసం నిధుల లేమిని ఎదుర్కొనేందుకు జగన్ సర్కార్ అప్పులను అలంబనగా చేసుకుంది. ఎడా పెడా.. ఎక్కడ దొరికితే అక్కడ కోట్లకు కోట్లు అప్పులు చేసేస్తోంది. ఒక కుటుంబ యజమాని ఏదైనా అవసరం కోసం అప్పు చేయాల్సిన అనివార్య పరిస్థితి వస్తే.. ఆ చేసిన అప్పు తీర్చడానికి ఉన్న మార్గాలేమిటి? తన కుటుంబ వ్యయాన్ని ఏ మేరకు నియంత్రించుకోవాలి, తీసుకున్న అప్పుకు నెలనెలా వడ్డీ ఎలా కట్టగలం అన్న అన్ని అంశాలనూ పరిగణనలోనికి తీసుకుని  ఫరవాలేదు.. అప్పు తీర్చగలను అన్న నమ్మకం కలిగితేనే అప్పు చేస్తాడు. అలాంటిది ఒక ప్రభుత్వాధినేత అప్పు చేయాల్సివచ్చినప్పుుడు.. ప్రభుత్వానికి ఉన్న ఆదాయవనరులేమిటి? అప్పు తీర్చేందుకు ఆ వనరులు సరిపోతాయా.. లేదా ఆదాయ పెంపు మార్గాలేమిటి? వంటివన్నీ ఆలోచించాలి. రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమం కుంటు పడకుండా అన్ని విధాలుగా ఆలోచించి ముందడుగు వేయాలి. కానీ డబ్బు కొడితే ఓట్లు రాలతాయి.. అనుకుంటూ.. ఆదాయానికి పొంతన లేకుండా వ్యయాలను పెంచేస్తూ.. అభివృద్ధిని విస్మరించి సాగితే... ఏమౌతుందో ప్రస్తుతం ఏపీ పరిస్థితిని చూస్తే అర్ధమౌతుంది.  ఇక మళ్లీ జగన్ సర్కార్ అప్పోపాఖ్యానం వద్దకు వస్తే.. ఏపీ సర్కార్ అప్పుల పై కేంద్రం కన్నెర్ర చేసింది. బ్యాంకులు ఇక ఇవ్వలేం బాబోయ్ అంటున్నాయి. ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఇంత చేసినా కేంద్రం ఏపీ సర్కార్ కోరడం ఆలస్యం అన్నట్లు అదనపు అప్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఆర్బీఐ చూసీ చూడనట్లు వ్యవహరిస్తుంది. దారులన్నీ మూసుకుపోయినా కిటికీలు బలవంతంగానైనా సరే తెరిచేసి జగన్ సర్కార్ అప్పుల బాటలో రాష్ట్రాన్ని తిరోగమన బాటలో బ్రహ్మాండంగా పరుగులెట్టించేస్తున్నది.  తాజాగా ఏపీ సర్కార్ మరో 2300 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఎందుకో తెలుసా?... రిజర్వ్ బ్యాంకు అప్పు తీర్చడానికి. ఎందుకంటే ఈ  నెల 17లోగా ఓడీ అప్పు చెల్లించకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లింపులు పూర్తిగా నిలిపివేస్తామని రిజర్వ్ బ్యాంకు విస్పష్ట హెచ్చరిక జారీ చేయడంతో జగన్ ప్రభుత్వం మళ్లీ అప్పు చేసింది. మూడు కార్పొరేషన్లను అడ్డం పెట్టుకుని ఓ 23వందల కోట్ల రూపాయలు అప్పు చేసేసింది. ఇలా అప్పు చేసి అలా రిజర్వ్ బ్యాంకుకు 200 కోట్లు చెల్లించేసి.. మళ్లీ ఓడీకి లైన్ క్లియర్ చేసుకుంది. తీసుకున్న అప్పులో మిగిలిన 300 కోట్ల రూపాయలతో  ప్రభుత్వోద్యోగుల నవంబర్ నెల వేతనాలకు కొందరికి చెల్లించింది. ఇంకా దాదాపు 30 శాతం మందికి వేతనాలు అందనే లేదు. వారికి వేతనాలు చెల్లించాలంటే మళ్లీ ఎక్కడో అప్పుపుట్టాల్సిన  పరిస్థితి. జగన్ సర్కార్ ఇలా రుణగొణ ధ్వనితో అప్పులు చేస్తూ పాలనను నెట్టుకొచ్చేస్తోంది. ఇక్కడకు ఇది  అలా ఉంచితే..   అసలు కార్పొరేషన్ల ద్వారా ఏపీ సర్కార్ కు రుణం ఎలా లభించిందన్నది సమాధానం రాని మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందు కంటే.. కార్పొరేషన్లద్వారా తీసుకున్న అప్పును ఆయా కార్పొరేషన్ల అభివృద్ది, అవసరాలకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది.  అయితే జగన్ సర్కార్ అందుకు భిన్నంగా వాడేసుకుంటోంది. దీంతో ఏపీలోకి కార్పొరేషన్లకు రుణాలు ఇవ్వవద్దని, ఒక వేళ ఇస్తే ఆయా కార్పొరేషన్లకు తిరిగి ఆ అప్పు తీర్చే స్తోమత ఉందో లేదో పరిశీలించడంతో పాటు.. ఆ తీసుకున్న అప్పును ఎలా వినియోగిస్తున్నారో కూడా చూడాలని ఆర్బీఐ బ్యాంకులకు విస్పష్ట ఆదేశాలిచ్చింది. అయినా జగన్ సర్కార్ కు యథేచ్ఛగా కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందుతున్నాయి. ఆర్బీఐ ఆదేశాలు ఉత్తుత్తినే ఇచ్చిందా? లేక ఆ ఆదేశాలను బ్యాంకులు ఖాతరు చేయడం లేదా? అంతా జగన్మాయ.. జగన్ రుణ లీలలు ఇన్నిన్ని కావు.