ఆ ఇల్లు నిజంగానే బంగారం!

ఏదైనా మంచి పని చేస్తే నీ ఇల్లు బంగారం గానూ అంటారు. అంటు భోగభాగ్యాలతో తులతూగమని ఆశీర్వాదం. అంతే కానీ నిజంగా ఇల్లంతా బంగారం అయిపోతుందని కాదు. కానీ ఓ భవనాన్ని మాత్రం మొత్తం బంగారంతో నిర్మించేశారు. ఇందుకు సంబంధించిన వార్తలు, ఫొటోలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ బంగారంతో నిర్మించిన భవంతి ఎక్కడుందయ్యా అంటే వియత్నాంలో.  ఎంగ్యూయెన్ వాన్ ట్రుంగ్ అనే రియల్టర్ ఈ భవనాన్ని వియత్నాలోని కాన్తో నగరంలో నిర్మించాడు. ఇంటు గోడల నుంచి పై కప్పు వరకూ పూర్తిగా బంగారంతో తాపడం చేయించాడు, అలాగే ఇంటిని కూడా బంగారు వస్తువులతో నిర్మించేశాడు. ఇప్పుడు ఇదో బ్రహ్మాండమైన టూరిస్ట్ స్పాట్ గా మారిపోయింది. పూర్తిగా బంగారంతో నిర్మించిన ఇంటిని చూసి తరించాలని ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఇప్పుడు కాన్తో నగరానికి క్యూ కడుతున్నారు. ప్రపంచంలోనే పూర్తిగా బంగారంతో నిర్మించిన భవనం బహుశా ఇది ఒక్కటే అయి ఉంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. టూరిస్టులను ఆకర్షించడానికి బంగారు భవంతిని నిర్మించడమేమిటని ఆశ్చర్య పోతున్నారు. 

తెలంగాణ కాంగ్రెస్ లో ముదిరిన కుమ్ములాటలు.. హై కమాండ్ సపోర్ట్ రేవంత్ కే!?

తెలంగాణ కాంగ్రెస్ లో కుమ్ములాటలు పతాక స్థాయికి చేరాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ కు వ్యతిరేకంగా సీనియర్లంతా కట్టకట్టుకుని విమర్శలు గుప్పిస్తుంటే.. వారికి దీటుగా రేవంత్ వర్గం కూడా గళం విప్పుతోంది. సీనియర్ల విమర్శలు, వ్యాఖ్యలకు నోటితో కౌంటర్ ఇవ్వడమే కాకుండా చేతలతో చెక్ కూడా పెడుతోంది. వలస నేతలంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ వర్గాయులపై చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి వర్గం రాజీనామాలతో కౌంటర్ ఇచ్చింది. టీపీసీసీ కమిటీల్లో పదవులు పొందిన 12 మంది నేతలు తమ తమ పదవులకు రాజీనాలు చేశారు. అక్కడితో ఆగకుండా తాము రాజీనామా చేసి త్యజించిన పదవులను  తమను వలస నేతలంటూ కామెంట్లు చేస్తున్న సీనియర్లకు ఇవ్వాలని అధిష్ఠానానికి సూచించారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్  తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ.. సీనియర్లు ఏదో ఒక రూపంలో పార్టీ నడకకు, పురోగతికి అడ్డు పడుతూనే ఉన్నారు. అన్నిటినీ సహించి పార్టీని ఏకతాటిపై నడిపించాలని రేవంత్ చేసిన ప్రయత్నాలు ఏమంత సఫలం కాలేదు. ఇక మునుగోడు ఉప ఎన్నిక తరువాత నుంచీ రేవంత్ పై సీనియర్ల విమర్శల దాడి ఒక రేంజ్ కు చేరుకుంది. తాజాగా పీసీసీ కమిటీల నియామకంతో సీనియర్లు రేవంత్ ను వ్యతిరేకించే విషయంలో ఓపెన్ అప్ అయిపోయారు. రేవంత్ పట్టుబట్టి లేదా పైరవీలు చేసి పీసీసీ కమిటీలను వలస నేతలతో నింపేశారంటూ రోడ్డెక్కారు. కొందరు రాజీనామాల బాట పట్టారు. దీంతో ఇక లాభం లేదని రేవంత్ వర్గీయులూ కౌంటర్లు ఇవ్వడం ప్రారంభించారు. తెలంగాణ పీసీసీ కమిటీ పదవులకు రాజీనామా చేసిన 12 మంది నేతలు.. పార్టీ సీనియర్లపై మాటల యుద్ధానికి దిగారు.  పీసీసీ కమిటీలకు రాజీనామాలు చేసిన వారిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, వేం నరేందర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. వీరు రాజీనామా చేసి ఊరుకోకుండా.. రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న సీనియర్లతో అటో ఇటో తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది. రాజీనామాల అనంతరం వీరు సీనియర్ల పై విమర్శల దాడికి దిగారు. నిజానికి గతంలో ఉత్తమ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో నియమించిన కమిటీల్లో సగం మంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారేనని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాస్తవంగా చూస్తే తాజాగా అధిష్ఠానం నియమించిన కమిటీలు మొత్తంలో కలిపి తెలుగుదేశం నుంచి వచ్చిన వారు 13 మంది మాత్రమే ఉన్నారు. వీరంతా తెలంగాణలో తెలుగు దేశం క్రీయాశీలంగా వ్యవహరించకపోవడంతో అనివార్యంగా కాంగ్రెస్ లో చేరిన వారే. వీరంతా రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేస్తున్నవారే. పదేపదే వలస నేతలంటూ తమపై వస్తున్న విమర్శలను సమర్థంగా ఎదుర్కోవాల్న నిర్ణయానికి వచ్చారు. అందుకే రాజీనామాలు, విమర్శలతో రచ్చకెక్కారు. దీంతో ఇప్పటి వరకూ రేవంత్ పైన, రేవంత్ వర్గీయులపైనా విమర్శలు చేస్తూ వస్తున్న సీనియర్లంతా డిఫెన్స్ లో పడ్డారు. దీంతో పార్టీ విషయాలను బహిరంగంగా మాట్లాడటం కరెక్టు కాదు.. ఏమైనా ఉంటే పార్టీలో చర్చించాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.  ఒక వైపు పార్టీలో ఈ స్థాయిలో వాద ప్రతివాదాలు జరుగుతున్నా.. అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు బహిరంగం అయిపోయినా.. రేవంత్ రెడ్డి మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. ఇప్పటి వరకూ ఆయన తలపెట్టిన పాదయాత్రకు హై కమాండ్ అనుమతి ఉంటుందా... సీనియర్లు ఏమంటారు? అడుగులు పడనిస్తారా? అన్న అనుమానాలున్నాయి. నిజానికి రేవంత్ పాదయాత్ర చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నా.. సీనియర్లు పదే పదే అడ్డు పడుతుండటంతో రేవంత్ పాదయాత్ర వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. కానీ పీసీసీ కమిటీల నియామకం తర్వాత సీన్ మారిపోయింది. పార్టీ సీనియర్లు తమ వ్యతిరేకతను బహిరంగం చేయడంతో ఇక రేవంత్ కు దారి క్లియర్ అయిపోయినట్లైంది.  దీంతో జనవరి నుంచి సకల జనుల సంఘర్షణ పేరిట రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు ఆయన కార్యాచరణ ప్రకటించేశారు. రూట్ మ్యాప్ సిద్ధం చేసేశారు. సీనియర్లు కలిసి వచ్చినా, రాకున్నా తన పని తాను చేసుకుపోవాలన్న నిర్ణయానికి వచ్చేశారు. టీపీసీసీ చీఫ్ గా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు, 2023 ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తన పాదయాత్ర కొనసాగుతుందని రేవంత్ విస్పష్టంగా ప్రకటించేశారు. అంతే కాకుండా.. ఎంతగా బుజ్జగించినా, ఎన్నిసార్లు సీనియర్లను సమాధానపరిచినా వారి తీరు మారకపోవడంతో కాంగ్రెస్ హై కమాండ్ కూడా సీనియర్లను పట్టించుకోకుండా పని చేసుకుపోవాలని రేవంత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కాంగ్రెస్ లో కీలక నేత ప్రియాంక గాంధీ కూడా రేవంత్ కు పూర్తి మద్దతు ప్రకటించి గో ఎహెడ్ అని అనుమతి ఇచ్చేశారని అంటున్నారు.  రేవంత్ పైనా, రేవంత్ వర్గీయుల పైనా విమర్శలు గుప్పిస్తున్న  సీనియర్లెవరూ తమ సొంత నియోజకవర్గంలో కూడా గెలిచే సత్తాలేనివారేనని హై కమాండ్ గుర్తించడం వల్లనే వారిని లైట్ తీసుకుని రాష్ట్రంలో పార్టీని ముందుకు నడిపించే విషయంలో పీసీసీ చీఫ్ కు స్వేచ్ఛ ఇచ్చిందని రేవంత్ వర్గీయులు చెబుతున్నారు.  

పెళ్లితో దండలే కాదు.. జనసేన కండువాలూ మార్చుకున్నారు!

వివాహాలు వేడుకగా జరుపుకుంటారు. స్థోమతను బట్టి ఘనంగా చేసుకుంటారు. ఆకాశమంత పందిరి..  అంటూ వివాహం ఎంత ఘనంగా జరుపుకున్నారో చెప్పుకోవడానికి అతిశయోక్తులు కూడా ఉన్నాయి. ఇక కొంత మంది కమ్యూనిస్టు వివాహాలు చేసుకుంటారు. ఆడంబరంగా ఖర్చు లేకుండా స్టేజి పెళ్లిళ్లు చేసుకుంటారు. కలిసి అన్యోన్యంగా ఉంటామని ప్రతిజ్ణ చేస్తారు. ఇక రిజిస్టర్ మ్యారేజీ లు ఉండనే ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఓ జంట మాత్రం తమ వివాహ వేడుకలో వినూత్న పద్ధతిని అనుసరించారు. ఆ కొత్త జంట జనసేన కార్యకర్తలు అవునా కాదో.. తెలియదు. ఇంతకీ ఆ జంట వివాహం ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, వారి పెళ్ల ఫొటోలు మాత్రం నెట్టింట తెగ వైరల్ అయిపోయాయి.  ఇంతకీ వారు పెళ్లిలో అనుసరించిన వినూత్న పద్ధతి ఏమిటంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద అపారమైన అభిమానం ఉన్న ఆ జంత తమ పెళ్లితో దండలతో పాటు జనసేన కండువాలనూ మార్చుకున్నారు. ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకోవడమే కాకుండా జనసేన కండువాలు కూడా కప్పుకున్నారు. దీంతో వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అభిమానమంటే ఇదేరా భాయ్ అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. జనసేన ప్రచారానికి ఇదో కొత్త దారి అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి జనసేన కండువాలతో జరిగిన పెళ్లిపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. 

బంగ్లాతో సిరీస్.. తొలి టెస్ట్ లో టీమ్ ఇండియా విన్

బంగ్లాదేశ్‌తో జ‌రిగిన తొలి టెస్టులో టీమ్ ఇండియా 188 పరుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. 513 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన బంగ్లా 324 ప‌రుగుల‌కు ఆలౌటైంది.  దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఆఖరి రోజైనా ఆదివారం ఓవర్ నైట్ స్కోరు   272/6 తో  రెండో ఇన్నింగ్స్‌ను కొన‌సాగించిన‌ బంగ్లాదేశ్ మ‌రో 52 ప‌రుగులు జోడించి మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. అక్ష‌ర్ ప‌టేల్ నాలుగు, కుల్దీప్ యాద‌వ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా ఉమేశ్ యాద‌వ్‌, సిరాజ్‌, అశ్విన్ త‌లో  వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో పుజారా 90, శ్రేయ‌స్ అయ్య‌ర్ 86 ప‌రుగుల‌తో రాణించ‌డంతో 404 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బంగ్లా 150 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో భార‌త్‌కు 254 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. బంగ్లాను ఫాలో ఆన్ ఆడించే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ కూడా కెప్టెన్ రాహుల్ మ‌రోసారి బ్యాటింగ్ చేసేందుకే మొగ్గు చూపాడు. రెండు ఇన్నింగ్స్ లో శుభ్‌మ‌న్‌(110), పుజారా(102 నాటౌట్‌) శ‌త‌కాలు బాదారు.   భార‌త్ త‌న రెండో ఇన్నింగ్స్ ను 258/2 స్కోర్ వ‌ద్ద డిక్లేర్ చేసి బంగ్లాదేశ్‌ ముందు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే బంగ్లా 324 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. కుల్దీప్ యాద‌వ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లో కలిపి కల్దీప్ యాదవ్ ఎనిమిది వికెట్లు తీశాడు.  ఇరు జ‌ట్ల మ‌ధ్య రెండో, చివరి టెస్టు  డిసెంబర్  22 నుంచి ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు రెగ్యుల‌ర్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అందుబాటులోకి రానున్నాడు.

నా మరణదిన వేడుకలకు రండి.. మాజీ మంత్రి వింత ఆహ్వానం

పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం చూశాం.. వివాహ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడమూ చూశాం. ఇంకా గృహ ప్రవేశాలు, ఓణీ ఫంక్షన్లు, వివాహాలు ఇలా శుభ కార్యాలకు ఆహ్వానా పత్రికలు ముద్రించి పంచడమూ తెలుసు. కానీ ఒకాయన మాత్రం 12 ఏళ్ల తరువాత తాను మరణిస్తాననీ, అందుకే ఇప్పటి నుంచే తన మరణ దిన వేడుకలు ఏటా జరుపుకుంటాననీ అంటున్నారు. ఇందు కోసం తన మరణ దిన ఆహ్వాన పత్రికను ముద్రించి మరీ పిలుస్తున్నారు.  ఔను వినడానికి వింతగా ఉన్నా అది నిజం. మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు ఈ కొత్త ఆహ్వానం పలుకుతున్నారు.  తన మరణ దినోత్సవానికి రావాలంటూ ముద్రించిన ఆహ్వాన పత్రికలో మాజీ మంత్రి పాలేటి రామారావు  ఇకపై తాను ఏటా మరణ దిన వేడుకలు జరుపుకోవాలని భావిస్తున్నట్లే పేర్కొన్నారు. పుట్టన రోజు వేడుకలు జరుపుకోవడం అర్ధ రహితమనీ, 2034లో తాను మరణిస్తాననీ, మరో 12 ఏళ్ల తరువాత అంటే 2034లో తాను మరణిస్తాననీ. ఇక ఇప్పటి నుంచీ ఏటా తన మరణ దిన వేడుకలు జరుపుకుంటాననీ పేర్కొన్నారు. ఆ వేడుకలకు హాజరై ఆశీర్వదించాలని పాలేటి రామారావు ఆ ఆహ్వాన పత్రికలో కోరారు.   1994, 1999 ఎన్నికలలో తెలుగుదేశం తరఫున పోటీ చేసి విజయం సాధించిన పాలేటి రామారావు మంత్రిగా కూడా చేశారు. 2004లో తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఆ తరువాత ప్రజారాజ్యంలో చేరారు. ఆ తరువాత వైసీపీలో చేరి కొనసాగుతున్నారు.   

తెనాలిలో అన్నా క్యాంటిన్ కు నిప్పు

 మాచర్లలో వైసీపీ -టీడీపీ మధ్య చెలరేగిన ఘర్షణల విధ్వంస  సెగలు చల్లారలేదు. మాచర్ల పట్టణం నివురుగప్పిన నిప్పులా ఉంది. శుక్రవారం (డిసెంబర్ 17).. నాటి ఘటనలు మాచర్లను అట్టుడికించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన బాధితులు ఇంకా భయాందోళనల నుంచి తేరుకోనే లేదు.   సాధారణ ప్రజలు సైతం ఎప్పుడేం జరుగుతుందో అని భయంతో వణికి పోతూనే ఉన్నారు. అయితే పోలీసులు మాచర్లలో భారీ బలగాలను మోహరించామని చెబుతూనే ఈ ఘటనలపై ఇప్పటి వరకు తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదంటున్నారు. పల్నాడు ఘటనలో తెలుగుదేశం కార్యాలయంతో పాటు పార్టీ నేతల వాహనాలు ధ్వంసమయ్యాయి. వైసీపీ నేతలు నిప్పు పెట్టడంతో టీడీపీ కార్యాలయం కాలిపోయింది. టీడీపీ నేతలకు చెందిన 10కి పైగా వాహనాలు ధ్వంసం కాగా, 2 వాహనాలను దగ్ధం చేశారు. తెనాలి పరిస్థితి సద్దుమణగక ముందే గుంటూరు జిల్లా తెనాలిలో అన్న క్యాంటీన్ కు దుండగులు నిప్పు పెట్టారు. మార్కెట్ సెంటర్లో తెలుగుదేశం హయాంలో ఏర్పా టు చేసిన క్యాంటీన్ ను.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూసివేసిన విషయం తెలిసిందే. ఈ క్యాంటీన్ కు అర్ధరాత్రి సమయంలో దుండగులు నిప్పు పెట్టారు. క్యాంటీన్ తలుపు వద్దే ఈ నిప్పు పెట్టగా.. మంటలు చెలరేగటం  గమనించి స్థానికులు మంటలను అర్పి వేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో సంఘటన స్థలానికి వచ్చి న టీడీపీ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు దురుసుగా ప్రవర్తించారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్య క్తం చేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో అన్న క్యాంటీన్ కు నిప్పు పెట్టటం వెనుక ఉన్నది వైసీపీ హస్తమేనని తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. విధ్వంసం, దహనకాండలతో వైసీపీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపిస్తున్నారు.

ఏపీలో పొత్తులు పొడిచేసినట్లేనా? పవన్ మాటల మర్మమేటిటి?

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల నాటికి పొత్తు పొడుపులపై జనసేనాని స్పష్టత ఇచ్చేసి నట్లేనా.. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల నివ్వను అని పునరుద్ఘాటింవచిన పవన్ మాటల వెనుక ఉన్నది,  తెలుగుదేశం, బీజేపీ, జనసేనల కూటమేనా? అంటే ఔననక తప్పదు. వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలవదు అని ఖరాఖండీగా చేప్పేసిన పవన్   ఇప్పటికే బీజేపీతో మిత్రుత్వం ఉన్న జనసేన తమ కూటమితో తెలుగుదేశం పార్టీని కూడా కలుపుకుని వెళతామన్న సంకేతమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని పవన్ కల్యాణ్ అనడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా రాష్ట్రంలో పొత్తుల గురించి తొట్ట తొలుత మాట్లాడిన పవన్ కల్యాణ్ ఆ తరువాత దారి మార్చినట్లు కనిపించినా తాజాగా మరోసారి..అదు మాట పునరుద్ఘాటించారు. కొద్ది రోజుల ముందు శ్రీకాకుళంలో పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ కూడా ఇదే మాట చెప్పారు. రాష్ట్రంలో వైసీపీని తిరిగి అధికారంలోకి రాకుండా ప్రతిపక్షాల ఐక్యత పై తమ అధినేత జగన్ త్వరలో ప్రకటిస్తారన్నారు. ఆయనా మాట అన్న రోజుల వ్యవధిలోనే పవన్ కల్యాణ్.. వచ్చే ఎన్నికలలో ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను. ఈసారి వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తా.. అన్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రాదు.. రానివ్వనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. పల్నాడులో జనసేన కౌలురైతుల భరోసా యాత్రలో పాల్గొన్న పవన్ కళ్యాణ్..  ఈసారి ఎన్నికలలో రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతుందని.. వచ్చే ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రాకుండా చేస్తానన్నారు. వైసీపీ అధికారంలోకి రాకుండా చూసే బాధ్యత తనదన్న పవన్.. వైసీపీ నేతలు మాట్లాడే మాటలన్నీ పనికిమాలిన మాటలేనని.. రాష్ట్రంలో రౌడీయిజం తగ్గాలని.. బాధ్యత లేకుండా మాట్లాడే వైసీపీ నేతలకు బలంగా సమాధానం చెబుతానన్నారు. వాళ్ళు నన్ను ఎంత తొక్కాలని చూస్తే.. అంత బలంగా పైకి లేస్తానన్న పవన్.. అందుకు జన సైనికులే రక్షగా ఉండాలన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ పొత్తులపై కొంత క్లారిటీ ఇచ్చేసినట్లైంది.   అంతే కాకుండా 2014 ఎన్నికలలో బీజేపీ, టీడీపీలతో   జనసేన పొత్తు  ప్రస్తావించారు.  2014 మాదిరి 2019లో కూడా బీజేపీ, టీడీపీలతో పొత్తులో పెట్టుకుంటే వైసీపీ గెలిచేది కాదన్న పవన్.. ఈసారి  ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ  వైసీపీకి ఛాన్స్ ఇవ్వనని చెప్పేశారు. ఆయన మాటలను బట్టి చూస్తే ఈసారి ఎన్నికలలో మహా పొత్తు (అంటే తెలుగుదేశం, జనసేన అలయెన్స్) ఖరారైనట్లే. ఈ మాట పవన్ ప్రత్యక్షంగా చెప్పకపోయినా.. 2019ని ప్రస్తావిస్తూ ఈసారి అలా జరగదని చెప్పారంటే ఆయన మాటల వెనుక ఉన్న అర్ధమదే అని అంటున్నారు. దానికి తోడు వైసీపీ వ్యతిరేక శక్తులన్నటినీ ఏకం చేస్తానని కూడా చెప్పేశారు. సో.. మొత్తంగా ఈసారి ఏపీలో తెలుగుదశం పార్టీతో బీజేపీ, జనసేనలు కలసి పోటీ చేయడం గ్యారంటీగా కనిపిస్తుంది.

విశాఖకు జగన్.. ఇతర రాష్ట్రాలకు పరిశ్రమలు!

నవ్వి పోదురు గాక నాకేటి వెరుపు అన్నది సామెత... పారి పోదురు గాక కాకేటి వెరుపు అన్నది జగన్ నినాదం. లోకమంతా ఒక దారి అయితే ఉలికిపిట్టది ఒక దారి అంటారు. అలా ఉంది మూడు రాజధానుల విషయంలో జగన్ తీరు. కోర్టులు, రాజకీయ పార్టీలు, అమరావతికి భూములిచ్చిన రైతులు, ఆఖరికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలూ కూడా అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని ముక్త కంఠంతో చెబుతున్నా జగన్ చెవికెక్కడం లేదు.   హైకోర్టులో  ఎలాగూ వ్యతిరేకంగా తీర్పు  వస్తుందన్న ఆలోచనతోనే మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న ప్రభుత్వం.. మళ్ళీ పకడ్బంధీగా  బిల్లును తీసుకురావాలని చూస్తున్నది.  మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని ఇప్పటికీ వైసీపీ నేతలు చెప్తూనే ఉన్నారు. సుందర నగరమైన విశాఖలో దాదాపుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయని.. దానికి కొద్దిపాటి మొత్తం కేటాయిస్తే రాజధాని సిద్ధమవుతుందని సాక్షాత్తు సీఎం జగన్ పలుమార్లు చెప్పారు. అంతే కాదు ముఖ్యమంత్రిగా తాను ఎక్కడ  నుంచి పాలన సాగిస్తే అదే రాజధాని అవుతుందని కూడా సెలవిచ్చారు. అలా చెప్పడం ద్వారా తాను విశాఖ నుంచే పాలన సాగించాలని భావిస్తున్నట్లు చెప్పకనే చెప్పేశారు. విశాఖలో వసతులు, కార్యాలయాల కోసం.. ముఖ్యంగా సీఎం క్యాంప్ ఆఫీసు కోసం కూడా ఇప్పటికే స్థల నిర్ధారణ జరిగిపోయిందని వైసీపీ నేతలు చెబుతూనే ఉన్నారు. దీంతో అధికారికంగా  విశాఖకు పాలనా రాజధాని తరలించడం వీలు కాకపోయినా.. అనధికారికంగా రాజధానిని విశాఖకి తరలించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే..జగన్ రాజధానిని విశాఖకు తీసుకు వెల్లానంటుంటే.. అక్కడ ఉన్న పారిశ్రామిక వేత్తలు తమ పరిశ్రమలను అక్కడ నుంచి తరలించేస్తున్నారు. ఒక్క విశాఖ అని ఏమిటి జగన్ పాలనా నిర్వాకంతో  ఈ మూడున్నరేళ్లలో రాష్ట్రం నుంచి పలు పరిశ్రమలు తరలిపోయాయి. విస్తరణ లక్ష్యాలను విరమించుకున్నాయి. కొన్ని కంపెనీలతో ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వమే రద్దు చేసుకుంది.   కియా అనుబంధ సంస్థలు చెన్నై, హైదరాబాద్ కు తరలిపోయాయి. ఇక అదానీ డేటా సెంటర్, లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ వంటి సంస్థలతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు జగన్ ప్రభుత్వంరద్దు చేశారు.   ప్రకాశం జిల్లాలో ఏర్పాటు కావాల్సిన ఏషియన్ పల్ప్ పేపర్ పరిశ్రమ తన పెట్టుబడులు ఉపసంహరించుకోగా.. బీఆర్ షెట్టి సంస్థలు, సింగపూర్ స్టార్టప్ ప్రాజెక్టులు, రేణిగుంటలో రిలయన్స్ పెట్టుబడులు, ఒంగోలు నుంచి ఏపీపీ పేపర్ కంపెనీ, విశాఖ రుషికొండ ఐటి సెజ్ నుండి కంపెనీలు తరలిపోయాయి. చిత్తూరు జిల్లాకు తలమానికమైన అమర్ రాజా బ్యాటరీస్ కూడా తరలిపోయింది. అలా రాష్ట్రానికి గుడ్ బై చెప్పి వెళ్లిపోయిన   వాటిలో ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ సంస్థలతో ప్రభుత్వ ఒప్పంద సంస్థలే కాగా.. ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ కూడా అదే బాటలో ఉంది.  ఔను పెట్రోలియం యూనివర్సిటీ ఏపీ నుండి తరలిపొంతోంది.   విభజన హామీల్లో భాగంగా ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్టీ సంస్థను స్థాపించారు. ఈ విద్యా సంస్థ దేశంలో రెండే చోట్ల ఉంది. ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఉండగా.. రెండోదాన్ని విశాఖపట్నానికి కేటాయించారు.  ఈ సంస్థ కోసం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం విశాఖ జిల్లా పెందుర్తి మండలం వంగలి గ్రామంలో సుమారు 201.8 ఎకరాల సేకరణకు సిద్ధమై కొంత భూమిని సేకరించింది. దీనికి  2016లోనే భూమి పూజ పూర్తయ్యింది. శాశ్వత క్యాంపస్‌ అందుబాటులోకి వచ్చే వరకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాల భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో బీటెక్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌లో 60, పెట్రోలియం ఇంజనీరింగ్‌లో 60 సీట్లు ఉండగా.. ఇప్పటికే రెండు బ్యాచ్ లు తమ విద్యాభ్యాసాన్ని ముగించి  బయటకు వెళ్లిపోయాయి. మొత్తం రూ.655 కోట్లతో శాశ్వత క్యాంపస్‌ నిర్మాణం కోసం మొదటి దశగా రూ.150 కోట్లు విడుదల చేశారు. ముందుగా సేకరించిన భూమి చుట్టూ ప్రహరీ నిర్మాణ బాధ్యతను ఏపీఐఐసీకి అప్పగించగా ఇప్పటి వరకు ఈ ప్రహరీ నిర్మాణం   పూర్తి కాలేదు  పట్టాదారులతో సమానంగా తమకూ నష్టపరిహారం చెల్లించాలని పట్టాలేని రైతులు హైకోర్టులో పిటిషన్‌ వేయగా.. విచారించిన ధర్మాసనం సాగులో ఉన్నారు కనుక పట్టాదారులకు ఇచ్చినట్టుగానే పట్టాలేని రైతులకూ ఇవ్వాలని ఆదేశించింది. కానీ, పట్టాలేని రైతులకు ఇక్కడ అంత మొత్తంలో చెల్లిస్తే, రాష్ట్రవ్యాప్తంగా ఇలాగే చెల్లించాల్సి వస్తుందని, ఈ ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కు వెళ్లింది. ప్రస్తుతం అక్కడ కేసు పెండింగ్‌లో ఉండడంతో ఇది ఇప్పట్లో తేలే అంశం కాదని కేంద్రం ఈ విద్యా సంస్థను రాష్ట్రం నుంచి తరలించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దీనిని కూడా యూపీ యూనివర్సిటీలో విలీనం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.  

ఆత్మీయ సమ్మేళనమా.. రాజకీయ తంత్రమా?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి రోజు రోజుకూ పెరిగిపోతోంది. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా ఏణ్ణర్ధం సమయం ఉన్నప్పటికీ ఎలక్షన్ హీట్ మాత్రం మిడ్ సమ్మర్ ను తలపిస్తోంది. అలాగే రాష్ట్రంలో రాజకీయ కుల సమీకరణాలకు ఉన్న ప్రాధాన్యత తెలియనిది కాదు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో కాపు సామాజిక వర్గం మద్దతు కోసం పార్టీలన్నీ తెగ ఆరాటపడుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ముగ్గురు రాజకీయ నాయకుల అడుగులు అన్ని పార్టీలలోనూ రాజకీయ ఉత్కంఠను పెంచేస్తున్నాయి. ఆ ముగ్గురిలో ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారైతే.. మరొకరు కమలం పార్టీకి చెందిన నేత. ఈ ముగ్గురూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడమే ఇప్పుడు వారి కదలికలపై అన్ని పార్టీలలోనూ ఉత్కంఠ పెరిగేందుకు కారణమైంది.  రాష్ట్రంలో ఇటీవలికాలంలో వరుసగా జరుగుతున్న కాపు నేతల సమావేశాలు, సదస్సులూ రాజకీయ  హీట్ ను పెంచేస్తున్న నేపథ్యంలో బోండా ఉమ, గంటా శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణలు భేటీ కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ముగ్గురూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో ఆ ప్రాధాన్యత ఇంకా పెరిగింది. వీరిలో బోండా ఉమ, గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కాగా కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నాయకుడు. అయితే గంటా శ్రీనివాసరావు చాలా కాలంగా తెలుగుదేశం కార్యక్రమాలలో క్రియా శీలంగా పాల్గొనడం లేదు. అసలు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారా? లేరా అన్న సందేహం కలిగేంతగా గంటా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక బోండా విషయానికి వస్తే.. ఇటీవలి కాలంలో ఆయన గతంలోలా పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్నదాఖలాలుకనిపించడంలేదు. బోండా ఒకింత అసంతృప్తితో ఉన్నారని తెలుగుదేశం శ్రేణులే అంటున్నాయి. ఇక బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ సంగతి తీసుకుంటే.. ఆయనకు కమలం పార్టీలో పొమ్మన లేక పొగపెడుతున్న పరిస్థితి  ఉంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఓ వెలుగు వెలిగిన కన్నాకు.. ఆ పదవి పోయిన తరువాత బీజేపీలో ప్రాధాన్యత బాగా తగ్గింది. పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుతో అసలు పొసగడం లేదు. ఈ నేపథ్యంలోనే బోండా ఉమ, గంటా శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణలు బేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నిటికంటే మించి ఈ ముగ్గురి భేటీకి కొద్ది ముందు కన్నా లక్ష్మీ నారాయణ తో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ స్వయంగా గంటా నివాసానికి వచ్చి మరీ భేటీ అయ్యారు. దీంతో బోండా, గంటా, కన్నాల భేటీ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. ఈ ముగ్గురూ మాత్రం తమది ఆత్మీయ సమ్మేళనంగా చెప్పుకుంటున్నా... రాజకీయ వర్గాలు మాత్రం ఈ ముగ్గురి సమావేశం వెనుకా ఉన్నది రాజకీయమేనని  గట్టిగా చెబుతున్నాయి.  అయితే ఈ ముగ్గురు నేతల భేటీకి కారణాలేమిటన్న దానిపై భిన్న చర్చలు, వాదనలు వినవస్తున్నాయి.  

వ్యూహాలు, ఎత్తులు నితీష్ రాజకీయ జిత్తులు

నితీష్ కుమార్ రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరిది. పేరుకు జేడీయూ అధినేత.. కానీ ఈయన రాజకీయం అంతా పొత్తులు.. పొరపొచ్చాలే. మైనారిటీలో ఉండి కూడా సమయానుకూలంగా కూటములు కట్టి తన ముఖ్యమంత్రి పదవిని పదిలంగా కాపాడుకోవడంలో ఈయనను మించిన మొనగాడు లేడు. వివాదాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటూ.. అందరిలో మంచివాడు, మేధావి అని గుర్తింపు పొందేసి.. బీహార్ ముఖ్యమంత్రి పదవిని గత దశాబ్దంనర కాలంగా తన గుప్పిట్లోనే ఉంటేసుకున్న వ్యూహకర్త. మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు సక్సెస్ ఫుల్ గా నడిపేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహరావును మించిన రాజకీయ చాణక్యం ఈయన సొంతం.   అయితే ఇటు కాకుంటే అటు అన్నట్లుగా  బీహార్ లో అయితే బీజేపీతో కాదంటే ఆర్జేడీతో జతకట్టి జేడీయూ అధికారంలో కొనసాగేలా.. సీఎం పగ్గాలు తన చేతిలో ఉండేలా చూసుకుంటూ సక్సస్ ఫుల్ గా రాజకీయ ప్రస్థానాన్ని సాగిస్తున్న నితీష్ కుమార్.. రాష్ట్రంలో అన్ని సమస్యల పరిష్కారం విషయంలో ఒక స్పష్టత ఉందన్నట్లుగా ఆయన మాటల తీరు ఉంటుంది. విమర్శకు ప్రతి విమర్శ చేయడంలో నితీష్ కుమార్ దిట్ట. అయితే ఒక్క ప్రశాంత్ కిషోర్ విషయంలోనే నితీష్ కుమార్ మన్మోహన్ సింగ్ ను మించిన మౌనముని అయిపోతారు. ప్రశాంత్ కిషోర్ ఎవరంటారా? ఇంకా తెలియలేదా.. ఎన్నికల వ్యూహ బేహారి పీకే. ఔను పీకేనే.. గతంలో ప్రశాంత్ కిశోర్ అనబడే ఈ పీకే నితీష్ కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. అప్పట్లో నితీష్ కుమార్ పీకేను తన రాజకీయ వారసుడిగా కూడా ప్రకటించారు. అయితే ఆ తరువాత ఏం జరిగిందో ఏమో కానీ.. ఇరువురికీ చెడింది. ఇప్పుడు పీకే రాజకీయ వ్యూహ వ్యాపారానికి ఫుల్ స్టాప్ పెట్టేసి సొంత కుంపటి పెట్టుకుని బీహార్ లో పాదయాత్ర చేస్తున్నారు. నితీష్ పై విమర్శలతో నిరాటంకంగా నడుస్తున్నారు. అయితే నితీష్ కుమార్ మాత్రం పీకే విమర్శలకు కౌంటర్ ఇవ్వడం లేదు. కనీసం స్పందించడం లేదు. ఆయనది కాని తీరులో వ్యవహరిస్తున్నారు.  సరే తాను స్పందించేంత సీన్ పీకేకు లేదన్నది నితీష్ అభిప్రాయం అయితే అయి ఉండొచ్చును. అటు పీకే పాదయాత్ర కూడా ఎవరికీ పట్టని యాత్రగానే సాగుతోంది. ఇంత వరకూ విశేషం ఏమీ లేదు కానీ.. ఉరుములేని పిడుగులా నితీష్ కుమార్ 2025లో బీహార్ అసెంబ్లీకి జరిగనున్న ఎన్నికల్లో మహాఘట్ బంధన్ ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ నేతృత్వంలోనే ముందుకు సాగుతుందని ప్రకటించేశారు. అంతే కాదు ఇప్పటికే ఉపముఖ్యమంత్రి తేజస్వి ప్రసాద్ కు ఇప్పటికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. కాబోయే ముఖ్యమంత్రిఆయనే అన్నట్లుగా సీన్ బిల్డప్ చేస్తున్నారు నితీష్. నితీష్ తీరు. శైలి తెలిసిన వారంతా ఇదేంటని ఆశ్చర్యపోతున్నారు. సీఎంగా నితీష్ తాను వినా మరొకరిని కలలో కూడా  అంగీకరించరు.. అలాంటిది తేజస్వికి ఆయన స్వయంగా ఇంత బిల్డప్ ఇవ్వడమేమిటని నొసలు ముడేస్తున్నారు. అయితే అసలు విషయమేమిటంటే.. 2024  సార్వత్రిక ఎన్నికలలో మూడో ఫ్రంటో, థర్డ్ ఫ్రంటో ఏదో ఒకటి ఏర్పాటు చేసి తాను ప్రధానిగా పదవీ పగ్గాలు అందుకోవాలన్న వ్యూహ రచనతోనే.. రాష్ట్రంలో ఆయన తేజస్వి ప్రసాద్ కు పగ్గాలు అప్పగించేందుకు కార్యాచరణ ఆరంభించేశారు. అందుకే 2024 సాధారణ ఎన్నికల్లో విపక్షాలను ఐక్యం చేసే పనిలో నిమగ్నం కావడానికి ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందిస్తున్నారని అంటున్నారు. అందుకే 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మహాఘట్ బంధన్ కు తేజస్వి ప్రసాద్ నాయకత్వం వహిస్తారని నితీష్ కుమార్ ఇప్పటికే సంకీర్ణం లోని అన్ని పార్టీలకూ స్పష్టమైన సంకేతాలిచ్చేశారు. అయితే నితీష్ కుమార్ తేజస్విపై చూపుతున్నఈ అపార ప్రేమ వెనుక 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహం ఉందని అంటున్నారు. ఎందుకంటే ఆర్జేడీకి ప్రధానంగా అండగా ఉండేది ముస్లింలు, యాదవులు. ఇక జేడీయూకి అయితే.. దళితుల ఓటు బ్యాంకు మద్దతు ఎక్కువ. దేశ వ్యాప్తంగా కూడా ఈ మూడు వర్గాల మద్దతు కూడగడితే తన పీఎం ఆకాంక్ష సాకారం అవుతుందన్నది నితీష్ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు.. కారణమేమిటంటే?

అవిభక్త కవలల గురించి విన్నాం.. జన్యులోపాలతో  వైకల్యంతో జన్మించే శిశువుల గురించీ కన్నాం.. ఒకే కానుపులో నలుగురు శిశువులు జన్మించిన ఘటనలూ అరుదుగానైనా చూశాం. చేతికి ఆరువేళ్లు ఉండటాన్నీ విచిత్రంగా చూశాం. అయితే సికందర్ కాంపూ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు జన్మించిన బిడ్డను చూసి అందరూ అచ్చెరువోందుతున్నారు. ఎందుకంటే ఆ బిడ్డకు ఏకంగా నాలుగు కాళ్లు ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఓ ఆసుపత్రిలో ఆర్తి కుష్వారా అను మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన ఆ బిడ్డను చూసి వైద్యులే ఆశ్చర్య పోయారు. ఆ బిడ్డకుఏకంగా నాలుగు కాళ్లు ఉన్నాయి. ఇలా జన్మించడాన్ని వైద్య పరిభాషలో ischiopagus అంటారని వైద్యులు చెప్పారు. అరుదుగా   గర్భ ధారణలో కొన్ని పిండాలు అదనంగా ఉంటాయని. ఇలాంటి సందర్భాలలో పిండం రెండు భాగాలవుతుందని.. శిశువు శరీర భాగాలు రెండు చోట్ల అభివృద్ధి చెందుతాయని, ఈ పాప విషయంలో కూడా అదే జరిగిందని వైద్యులు అంటున్నారు. అన్ని పరీక్ష చేసి ఆపరేషన్ ద్వారా   అదనపు రెండు కాళ్లను తొలగిస్తామని చెప్పారు.

బెంజి కారుకు ఆటో ఆసరా!

తాతకు దగ్గులు నేర్పినట్లుఅన్నా.. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్లు అన్నా.. తమ కంటే పై స్థాయి వాళ్లకు సాయం చేస్తామనడం, సలహాలిస్తామనడం సరికాదు అని చెప్పడమే. అయితే అరుదుగానైనా అటువంటి సందర్బాలు ఎదురౌతుంటాయి. ఓ బెంజి కారు ఓనరుకు అలాంటి పరిస్థితే వచ్చింది. ఆగిపోయిన తన కారుకు ఆటోయే ఆసరా అయ్యింది. హాయిగా ఝామ్మంటూ వెళుతున్న వాహనం హఠాత్తుగా రోడ్డు మీద ఆగిపోతే.. దగ్గర్లో మెకానిక్ ఉంటే వెళ్లి పిలుచుకుని వచ్చి రిపేర్ చేయించుకుంటాం. అదే దగ్గరలో మెకానిక్ షాపేదీ లేకపోతే ఏం చేస్తాం. టూ వీలర్ అయితే తోసుకుంటూ వెళిపోతాం. అదే కారైతే.. రోడ్డు మీద వెళ్లే మరో కారు వాళ్లనో, ట్రాలీ డ్రైవర్ లో బతిమలాడుకుని దానికి ఓ తాడు కట్టి మెకానిక్ షాపు వరకూ తీసుకు వెళతాం. రోడ్డు మీద అలాంటి దృశ్యాలను చాలానే చూసి ఉంటాం. ఓ ఆటో ఆగిపోతే.. మరో ఆటో డ్రైవర్ తన ఆటోను నడుపుతూ కాలితో ముందు ఆగిపోయిన ఆటోను తీసుకువెళతాడు. ద్విచక్రవాహనాలనూ అలా తోసుకుంటూ వెళుతున్న సందర్భాలు మనకు చాలానే తారసపడి ఉంటాయి. అయితే ఏకంగా ఓ బెంజి కారుకు ఆటో డ్రైవర్ తన కాలి ఆసరా ఇచ్చాడు.  ఔను నిజమే.. రోడ్డు మీద  ఆగిపోయిన మెర్సిడీస్ బెంజ్ కారును ఒక ఆటో డ్రైవర్ తన ఆటోను నడుపుతూ ముందు బెంజికారుకు తన కాలు ఆసరాగా ఇచ్చి తోసుకుంటూ వెళుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన పుణెలో జరిగింది. కోరాగావ్ పార్క్ ప్రాంతంలో ఓ బెంజ్ కారు ఆగిపోయింది. అత్యంత రద్దీగా ఉండే ఆ రోడ్డుపై ఆగిపోయిన కారు ముందు బిక్కముఖం వేసుకు నిలుచున్న ఆ కారు యజమానిని చూసి జాలేసిందో ఏమో.. ఆ దారిలో వెళుతున్న ఆటో డ్రైవర్ తన ఆటోను నడుపుతూ.. తన కాలును కారు బంపర్ పై పెట్టి తోసుకుంటూ మెకానిక్ షెడ్ వరకూ తీసుకు వెళ్లాడు. ఆ ఆటో డ్రైవర్ సహకారాన్ని నెటిజన్లు తెగపొగిడేస్తున్నారు.  

చంద్రబాబు ప్రచార రథాలపై నిలువెత్తు బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్.. ఎన్ఎస్జీ సూచన

ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉంది. జడ్ ప్లస్ భద్రత ఉన్న విపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకే ముప్పు పొంచి ఉందని జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) భావిస్తోంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న  ఎన్ఎస్జీ మరో సారి చంద్రబాబు భద్రతపై దృష్టి పెట్టింది. స్వల్ప వ్యవధిలో చంద్రబాబు భద్రతపై రెండు సార్లు సమీక్ష చేసింది. తాజాగా ఎన్ఎస్జీ తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి వచ్చింది.  చంద్రబాబు పర్యటించే ప్రదేశాలు.. కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాలు వంటి అన్ని అంశాలను నిశితంగా పరిశీలించింది. చంద్రబాబు ఛాంబర్ ప్రచార రథాలను  పరిశీలించారు. అదేవిధంగా చంద్రబాబు ప్రచార సమయంలో రాత్రిపూట బస చేసే బస్సును   పరిశీలించి.. భద్రతా పరంగా కొన్ని మార్పులు సూచించింది. అలాగే టీడీపీ ప్రచార రథాలపైకి ఎక్కి మరీ పరిశీలించింది. రథం పై నుంచి ఆయన ప్రసంగించే ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్ఎస్జీ కీలకు సూచనలు చేసింది. వాటిలో ప్రధానంగా చెప్పుకోవలసినది ఆయన హైట్ కు సరిపోయేలా ఆయన ప్రసగించే చోట నిలువెత్తు బుల్లెట్ ప్రూఫ్ అద్దాన్ని ఏర్పాటు చేయాలన్న ఎన్ఎస్జీ సూచన. ఆ తరువాత ఎన్ఎస్జీ బృందం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం, చుట్టుపక్కల ప్రాంతాలను నిశితంగా పరిశీలించింది. ఇలా ఎన్ఎస్జీ బృందం చంద్రబాబు భద్రతా ఏర్పాట్లను పరిశీలించడం గత నాలుగు నెలలలో ఇది రెండో సారి. గత ఆగస్టులో ఎన్‌ఎస్‌జీ డీఐజీ సమరదీప్ సింగ్ టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఉండవల్లి నివాసాన్ని పరిశీలించిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే ఆయన భద్రతను ఎన్ఎస్జీ పెంచింది.  కాగా గతంలోనూ ఒకసారి చంద్రబాబు భద్రతకు సంబంధించి కేంద్ర దర్యాప్తు బృందం ప్రత్యేకంగా పరిశీలించిన విషయం తెలిసిందే. అయితే.. ఇటీవల నందిగామలో పర్యటించిన సమయంలో రాళ్ల దాడి జరిగి.. ఆయన భద్రతా సిబ్బంది చీఫ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో చంద్రబాబు హోం శాఖకు లేఖరాశారు. దీంతో చంద్రబాబు భద్రత అంశంపై మరోసారి ఎన్ ఎస్ జీ బృందం పరిశీలనకు రావడం గమనార్హం. అప్పట్లో చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు చంద్రబాబుకు అతి సమీపానికి అధికార వైసీపీ కార్యకర్తలు చేరుకోవడం వంటి ఘటనల నేపథ్యంలో చంద్రబాబు భద్రతపై సమీక్షించిన ఎన్ఎస్జీ ఇప్పుడు తాజాగా ఆయన భద్రతకు సంబంధించిన అంశాలను మరోమారు పరిశీలించి సమీక్షించడంతో ఆయనకు  ముప్పు ఉందన్న సంగతిని తెలియజేస్తున్నాయి.   ఇక తాజాగా ఎన్ఎస్జీ సమీక్ష కు కారణమేమిటంటే.. ఇటీవల నందిగామలో పర్యటించిన చంద్రబాబుపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరారు. అది చంద్రబాబుకు కాకుండా ఆయన సెక్యూరిటీ చీఫ్ గాయపడ్డారు. ఈ ఘటనపై చంద్రబాబు హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.  దీంతో చంద్రబాబు భద్రత అంశంపై మరోసారి ఎన్ ఎస్ జీ బృందం పరిశీలనకు వచ్చింది. జడ్ ప్లస్ సెక్యూరిటీ కవర్ ఉన్న చంద్రబాబు భద్రత విషయంలో  ఎటువంటి అలసత్వానికీ తావు ఉండరాదన్న భావనతోనే ఎన్ఎస్జీ నాలుగు నెలల వ్యవధిలో రెండు సార్లు ఆయన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిదని చెబుతున్నారు. 

సంక్షేమమే చాలదు గురువా..!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అడిగింది ఒక్క ఛాన్స్ మాత్రమే అయినా.. మరో సారి ముఖ్యమంత్రి కావాలని ఆయన  ఆశ పడడంలో తప్పులేదు. కానీ, అందుకు ఆయన ఎంచుకున్న మార్గం మాత్రం ఆయన్ని గమ్యానికి కాదు కదా, ఆ దరిదాపుల్లోకి కూడా తీసుకుపోయేలా లేదు. రాజకీయ ఆర్థిక రంగంలో ఓనమాలు తెలిసిన ఎవరైనా ఈ విషయం చెపుతారు. అయితే  జగన్ రెడ్డి దురదృష్టం ఏమంటే లక్షల్లో జీతాలు తీసుకునే వందల సంఖ్యలో ఉన్న సలహాదారులు ఎవరూ  ఆయనకు ఆ విషయం చెపుతున్నట్లు లేదు. సంక్షేమ పథకాలతోనే  అధికారం వెతుక్కుంటూ వస్తుందని ముఖ్యమంత్రి కంటున్న కలలు.. వాస్తవ పరిస్థితికి ఎంత దూరంలో ఉన్నాయో చెప్పే నాథుడే లేక పోయాడు. సంక్షేమ పధకాలు  మోతాదు మించినంత వరకు, ఓకే.. కానీ, గీత దాటితే.. ఏమవుతుందో.. చెప్పనక్కర్లేదు. సంక్షేమ పథకాల  లబ్ధిదారులు అందరూ.. తమకే ఓటేస్తారన్న జగన్ రెడ్డి లెక్క తప్పు.  లబ్దిదారులో,  కులాల కూడికలూ, తీసివేతలూ ఉంటాయి.. పార్టీ అఫ్లియేషన్ తిరకాసులుంటాయి. లబ్దిదారుల ఎంపికలో  వ్యతిరేకత  లుంటాయి.. చివరకు జగన్ రెడ్డి లెక్క మంచం కోళ్ల లెక్కలా తయారవుతుంది. అదలా ఉంచితే..   ప్రధాని మోడీ చెప్పినట్లుగా ఉచితాలు గుడ్ ఎలక్షన్ పాలిటిక్స్ అయితే  అవ్వచ్చేమో కానీ, బ్యాడ్ ఎకనామిక్స్. ఇది పలు సందర్భాలలో తేలింది. అందుకే.. అంతో ఇంతో ఇంగిత జ్ఞానం ఉన్న ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను ఎంతవరకు అవసరమో అంత వరకే అమలు చేస్తాయి. అందుకే  దివంగత ప్రియతమ నేత  సహా పెద్దలు ఏట్లో వేసినా ఎంచి ఎంచి వేయాలని..చెప్పారు. కానీ జగన్ రెడ్డికి మీట నొక్కడమే తప్ప, ఆ సొమ్ములు ఎక్కడకు పోతున్నాయి.. ఎందుకు ఖర్చవుతున్నాయానే స్పృహ లేదు. అందుకే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుక్కు తింటోందని మిగిలిన దేశం అంతా కోడై కూస్తున్నా చెవికెక్కించుకోవడం లేదు. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఏపీ మరో శ్రీలంక అయినా ఆశ్చర్యంలేదు. ఎందుకంటే.. జగన్ ప్రభుత్వం చేస్తున్నదేమిటయ్యా అంటే.. ఉత్పాదకత, అభివృద్ధి పథకాలను అటకెక్కించేసి.. సంక్షేమ పథకాల పేరుతో భారీగా ఖర్చు చేస్తున్నది. అయితే ఖర్చు మీట్ అవ్వడానికి అవసరమైన ఆదాయం లేకపోవడంతో అప్పులు చేస్తోంది. ఎడాపెడా అప్పులు చేసి.. సంక్షేమం అంటోంది. ఆ అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు.. వాటికి వడ్డీలు కట్టడానికి మళ్లీ అప్పు.. చివరాఖరికి ఉద్యోగుల వేతనాలను కూడా అప్పులు తెచ్చి విడతల వారీగా చెల్లించే పరిస్థితికి దిగజారిపోయింది. రాష్ట్రాన్ని అప్పుల కుంపట్లో ఫ్రై చేస్తూ జగన్ రెడ్డి సంక్షేమ పథకాలే ఎన్నికలలో గెలిపిస్తాయని నమ్ముకున్నారు. అయితే కేవలం సంక్షేమం ఒక్కటే ఎన్నికలలో గెలిపిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు. సంక్షేమం దారి సంక్షేమానిదే.. ప్రజల నిర్ణయం ప్రజలదే అని పలు మార్లు రుజువైంది. సంక్షేమంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడే.. ప్రజలు సంతృప్తి చెందుతారు. ఓ చేత్తో సంక్షేమం అంటూ తాయిలాలు ఇచ్చి మరో చేత్తో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు గండి కొడితే ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదు. అదీ కాకుండా జగన్ రెడ్డి ఓ చెత్తో సంక్షేమం పేరుతో తాయిలాలు పందేరం చేస్తూ.. మరో చేత్తో పన్నుల రూపంలో అంతకు రెండింతలు జనం నుంచి గుంజేస్తున్నారు. అదీ కాక సంక్షేమం పేరిట మీట నొక్కి డబ్బులు తమ ఖాతాల్లో వేస్తున్నారని జనం సంబరపడటం సంగతి పక్కన పెడితే అది జగన్ సొంత జేబులో సొమ్ము కాదని జనానికి తెలియదని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది తప్ప మరొకటి కాదు. సుపరిపాలన అంటే సమాజంలోని అన్ని వర్గాలకూ ప్రయోజన చేకూరేలా అభివృద్ది జరగాలి. ఆ అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందాలి. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సంక్షేమం దారీతెన్నూ లేకుండా సాగుతోంది. ఆ పథకాల లబ్ధిదారులకు సైతం సంతృప్తి లేని విధంగా జగన్ పథకాలు ఉంటున్నాయి. అభివృద్ధి ఆనవాలే లేకుండా పోయింది. ఇక ఇప్పుడు అప్పులు పుట్టని స్థితిలో ఏపీ దివాళా అంచులకు చేరుకుంది. కేంద్రం జీఎస్టీ తదితర అక్కౌంట్ల కింద రాష్ట్రానికి విడుదల చేసిన నిధులను పాత బకాయిల కింద వెనక్కు తీసుకునే పరిస్థితికి వచ్చిందంటే ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితికి వేరే ఉదాహరణ చెప్పనవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు, జీతాలు సకాలంలో రావడం లేదు. చివరకు పెన్షనర్ల పెన్షన్లు కూడా సకాలంలో జమ కావడం లేదు.  చిన్నా చితక కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బిల్లులు, కొండల్లా పేరుకు పేరుకుపోతున్నాయి. ఇవన్నీ కూడా జగన్ సర్కార్ ఆర్థిక అరాచకత్వానికి నిలువెత్తు నిదర్శనలే.  జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు, ఆర్థిక వ్యవస్థ   తప్పుటడుగులే వేస్తోంది. ఆదాయంతో సంబంధం లేకుండా ‘ఉచిత’వ్యయ పద్దును   పెంచేస్తుండటంతో ఇప్పుడిక చేతులెత్తేసే స్థితికి చేరుకుంది. అయినా కూడా జగన్ రెడ్డి రాష్ట్రం గురించిన చింత లేకుండా వైనాట్ 175 ఔటాఫ్ 175 అంటూ వస్తున్నారు. అయితే రాష్ట్రంలో వాస్తవ చిత్రం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. వై ఎట్ లీస్ట్ వన్ అని జనం ప్రశ్నించే పరిస్థితి మరెంతో దూరంలో లేదు. కేవలం సంక్షేమ పథకాలే ఓట్లు రాలుస్తాయన్న భ్రమలను వదుల్చుకోకుంటే 2019లో జనం ఇచ్చిన ఒక్క చాన్సే లాస్ట్ చాన్స్ అవుతుంది.

ఐటీలో ఏపీ బీహార్ కంటే అధమం

తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఆ చర్చ మొత్తానికి కేంద్ర బిందువుగా తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిలిచారు. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే సాప్ట్ వేర్ ఉత్పత్తులలో ఆంధ్రప్రదేశ్ బీహార్ కంటే దిగువన 15వ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రజీవ్ చంద్రశేఖర్ సమాధానమిచ్చారు. ఈ జాబితాలో కర్నాటక, మహారాష్ట్ర తరువాత మూడో స్థానంలో తెలంగాణ నిలిచింది. అంటే ఒకప్పుడు ప్రపంచ దేశాలతో పోటీ పడిన ఐటీ సాఫ్ వేర్ రంగం ఇప్పుడు అధమస్థానానికి చేరుకోవడానికి వేగంగా పరుగులెడుతోంది. ఇక రాజ్యసభలో కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో కర్నాటక ఆగ్రస్థానంలోనూ, మహారాష్ట్ర రెండో స్థానంలోనూ నిలిచాయి. తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. ఇంకా కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే 2021-21 ఆర్ధిక సంవత్సరంలో సాఫ్ట్ వేర్ ఉత్పత్తులలో కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తొలి ఐదు స్థానాలలో నిలిచాయి. మొత్తం ఉత్పత్తుల్లో ఈ ఐదు రాష్ట్రాల వాటా 88.57శాతం ఉండగా, మిగిలిన రాష్ట్రాలన్నిటి వాటా 11.43శాతం. కాగా ఇందులో ఏపీ వాటా 0.111 శాతం  మాత్రమే. సరిగ్గా కేంద్ర మంత్రి ఈ వివరాలను రాజ్యసభలో వెల్లడించిన రోజే హైదరాబాద్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి) 20వ వార్షికోత్సవ ముగింపు ఉత్సవాలు జరిగాయి. ఆ ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా హాజరయ్యారు. ఈ రెండింటికీ ఏమిటి  సంబంధం అనుకుంటున్నారా? సంబంధం ఉంది.  హైదరాబాద్ లో ఐఎస్ బీ ఏర్పాటు వెనుక అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు విజన్, కృషి, పట్టుదల ఉన్నాయి. నాడు కేవలం చంద్రబాబు చొరవ వల్లే హైదరాబాద్ కు వచ్చిన ఐఎస్ బి ఇప్పుడు   అంతర్జాతీయంగా  గుర్తింపు పొందిన సంస్థగా ఎదిగింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ క్యాంపస్ ఆవిర్బావానికి కర్త, కర్మ, క్రియ అన్నీ అయిన  అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అప్పటికే ఐటీ హబ్ గా అమెరికా తరువాత అంతటి గుర్తింపు పొందిన బెంగళూరు (కర్నాటక)ను, భారత వాణిజ్య రాజధాని ముంబై అప్పటి బొంబై ( మహారాష్ట్ర)లను  కాదని ఐఎస్ బీని హైదరాబాద్ ( అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని)కు తీసుకువచ్చారు. ఇందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలనలో పారదర్శకతకు, మెరుగైన ప్రజాసేవకు ఐటీని వినియోగించుకుంటున్న తీరు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సుపరిపానల అందిస్తున్న విధానంపై  దేశంలోనే కాదు, ప్రపంచంలోనే గుర్తింపు పొందడం గమనార్హం. ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారాచంద్రబాబునాయుడు హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో దోహదం చేశారు. బెంగళూరును కూడా అధిగమించి ఐటీ పరిశ్రమ హైదరాబాద్ లో ఎదిగింది. ఇక విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రంలో  ఐటీ పరిశ్రమ అభివృద్ధికి బాటలు పరిచారు. విశాఖపట్నం, మంగళగిరిలు ఐటీ హబ్ లుగా అవతరించాయి. రాష్ట్రంలో స్టార్టప్ లు వెల్లువెత్తాయి. అయితే ఇదంతా మూడున్నరేళ్ల కిందటి మాట. రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కటొక్కటిగా రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయి. జగన్ హయాంలో రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ కుదేలైంది.  ఇందుకు నిదర్శనమే రాజ్యసభలో కేంద్ర ఐటీ మంత్రి ఐటీ ఉత్పత్తులపై వెల్లడించిన గణాంకాలు. 

అమ్మలాలింపు.. కూతురు తాళింపు

 ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరులో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల.. తన నివాసంతో పాటు పార్టీ కార్యాలయానికి ఆమె భూమి పూజ చేశారు. అనంతరం వైయస్ షర్మిల మాట్లాడుతూ.. పాలేరు మట్టిని చేతిలోకి తీసుకొని. ఆ మట్టి సాక్షిగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ.. సైతం తనదైన శైలిలో మాట్లాడారు. అయితే వీరిద్దరి వ్యాఖ్యలు సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. పాలేరులో ఈ భూమి పూజ అనంతరం తొలుత వైయస్ విజయమ్మ మాట్లాడుతూ... వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ ఒకటికి రెండు సార్లు..  మాట్లాడుతుంటే.. వెనుక ఉన్న వారు అమ్మ.. వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అంటూ ఆమెకు గుర్తు చేయడం.. దీంతో వైయస్ విజయమ్మ.. తలకొట్టుకొంటూ... సారీ అమ్మ.. వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అంటూ సవరించుకొని మాట్లాడడం.. చూస్తే.. ఇదో కొత్త నాటకం అని వారు గుర్తు చేస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో సైతం.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. వైయస్ జగన్ 16 మాసాలు చంచల్‌గూడ జైల్లో ఉండగా.. ఈ తల్లీకూతుళ్లు.. సోదరుడు జగనన్న కోసం పాదయాత్రలు, ప్రచారాలు సైతం చేశారని ఈ సందర్బంగా నెటిజన్లు గుర్తు చేసుస్తున్నారు. ఆ క్రమంలో... తాను జగనన్న వదిలిన బాణం అంటూ ఆయన సోదరి వైయస్ షర్మిల..తనకు తాను అభివర్ణించుకొని మరీ ఆమె పాదయాత్ర చేసిందని వారు పేర్కొంటున్నారు. అలాగే వారి పాదయాత్రలో అయితేనేమీ.. వారి బస్సు యాత్రలో అయితేనేమీ.. ఏ ప్రచారంలో అయినా.. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా వీరు.. సెంటిమెంట్ అనే అయింట్‌మెంట్‌తో చాలా చాకుచక్యంగా.. తమ మాటల గారడీతో ప్రజలను బుట్టలో పడేశారని.. వీరి మాటలను నమ్మిన అమాయక ప్రజలు.. వీరిద్దరి బుట్టలో పడిపోయి.. నాడు ఫ్యాన్ పార్టీకి గంపగుత్తగా ఓట్లు గుద్దేశారని.. అలా వైయస్ జగన్ అధికారలోకి వచ్చారని.. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్‌లో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా చోటు చేసుకొంటున్న పరిణామాలపై ఈ వైయస్ విజయ్మమ్మ కానీ, వైయస్ షర్మిల కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని... జగన్ పరిపాలనలోని లోపాలను సైతం ఏనాడు వీరిద్దరు ఎత్తి చూపలేదని.. నెటిజన్లు సోషల్ మీడియా సాక్షిగా గుర్తు చేస్తున్నారు.   అదీకాక తొలుత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తాము అనుకూలమంటూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి లేఖ సైతం ఇచ్చిందని... ఆ తర్వాత తూచ్.. తూచ్.. మేము ఒప్పుకోమంటూ.. ఉమ్మడి రాష్ట్రానికే తాము కట్టుబడి ఉన్నామంటూ నాడు సదరు ఈ ప్యాన్ పార్టీ యూటర్న్ తీసుకోందని.. ఆ సమయంలో వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిలలను జగన్ పార్టీలోనే ఉన్నారని నెటిజనులు ఈ సందర్బంగా చెబుతున్నారు.   మరోవైపు జగన్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే..ఈ తల్లీకూతుళ్లు .. పక్క రాష్ట్రం తెలంగాణకు వెళ్లిపోవడం.. ఆ క్రమంలో వైయస్ షర్మిల.. వైయస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించడం. అనంతరం ఆమె చేపట్టిన మంగళవారం దీక్షలు..  అలాగే రాష్ట్రంలో ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు ఆమె పాదయాత్ర చేపట్టడం.. నాటి నుంచి నిన్న మొన్నటి హైదరాబాద్ ఎపిసోడ్ వరకు అంతా చాలా వ్యూహాత్మకంగా ..  పకడ్బందీగా వీరిద్దరు అడుగులు వేస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయినా.. వైయస్ షర్మిల ఏడాదిగా చేస్తున్న పాదయాత్రకు రానీ హైప్ ఒక్కసారిగా.. హైదరాబాద్ ఎపిసోడ్‌తో వచ్చేసిందని.. చివరకు ప్రధాని మోదీపై.. షర్మిలకు స్వయంగా పోన్ చేశారంటే... వీరి వేస్తున్నది.. పాదయాత్రలో అడుగులు కాదని.. అధికార పీఠం కోసం వీరు వేస్తున్న పాదముద్రలని అర్థమవుతోందని నెటిజనులు పేర్కొంటున్నారు.     గతంలో అంటే... 2019 ఎన్నికలకు ముందు.. ఆంధ్రప్రదేశ్‌లో రాజన్న రాజ్యం... జగనన్నతోనే సాధ్యమంటూ వీరిద్దరు ప్రచారం చేసి.. ఆయన్ని అందలం ఎక్కించారని.. ఆ తర్వాత వైయస్ జగన్ మాత్రం వీరికి అందకుండ పోయారని.. జగన్ అధికారంలోకి రావడం కోసం.. ఈ తల్లీకూతుళ్లు లాలింపు.. ఆ తర్వాత వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తల్లీకూతుళ్లకు తాళింపు బాగానే వేశారని.. నెటిజన్లు సోషల్ మీడియా సాక్షిగా సెటైరికల్‌గా వ్యాఖ్యానిస్తున్నారు.  

వెడ్డింగ్ షూట్ లో ఎలుగుబంటి వేట

అడవిలో జంతువులు తమ ఆహారం కోసం వేటాడే దృశ్యాలు ఎప్పుడూ అబ్బుర పరుస్తూనే ఉంటాయి. చిరుత జింకను వేటాడే దృశ్యాలను ఏనిమల్ ప్లానెట్ లో తిలకించడంలోని థ్రిల్లే వేరు. అయితే ఎలుగుబంట్లు వేడాటే దృశ్యాలు సాధారణంగా ఎక్కడా పెద్దగా కనిపించవు. అయితే వెడ్డింగ్ షూట్ కోసం అడవికి వెళ్లిన జంటకు ఈ అరుదైన ఎలుగుబంటి వేట ఎదురైంది. అంతే తమ వెడ్డింగ్ షూట్ ను పక్కన పెట్టేసి ఎలుగుబంటి వేటను చిత్రీకరించారు. పెళ్లికి ముందు కాబోయే భార్యా భర్తలకు వెడ్డింగ్ షూట్ ఒక మరపురాని మధురానుభూతి. అందుకే ప్రతి జంటా కూడా తమ వెడ్డింగ్ షూట్ ను వినూత్నంగా ప్లాన్ చేసుకుంటారు. అలాగే ఓ  జంట కూడా తమ వెడ్డింగ్ షూట్ కు అడవిని ఎంచుకున్నారు. అలా అడవిలో ఓ చెరువు గట్టున తమ వెడ్డింగ్ షూట్ జరుపుకుంటుంటే.. సరిగ్గా అదే సమయంలో ఓ ఎలుగుబంటి దుప్పిని వేటాడుతూ అక్కడకు వచ్చింది. అంతే వెంటనే ఆ జంట తమ వెడ్డింగ్ షూట్ ఆపేసి ఎలుగుబండి వేటను చిత్రీకరించారు. ఆ వీడియోను నెట్టింట పోస్టు చేయగానే వైరల్ అయ్యింది. ఆ జంట అదృష్టమే అదృష్టం.. అద్భుతమైన, అరుదైన వేటను లైవ్ లో తిలకించారని కొందరంటుంటే.. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్లి ఎలుగుబంటి వేటను చిత్రీకరించారా అంటే సరదా కామెంట్లు చేస్తున్నారు. 

ఎమ్మెల్యేలకు జగన్ మరో వార్నింగ్!

జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలకు మరోసారి లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, , రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఇన్ చార్జి మంత్రులతో శుక్రవారం (డిసెంబర్ 16) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాన్వయ కర్తలు సైతం హాజరయ్యారు. గతంలో నిర్వహించిన ఇలాంటి సమావేశాలలో గడప గడపకూ తిరగడం లేదంటూ ఎమ్మెల్యేల పై ఆగ్రహం వ్యక్తం చేసి, గడప గడపకూలో క్రియాశీలంగా, చురుకుగా పాల్గొనని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికలలో సీట్లు ఇవ్వనని తెగేసి చెప్పిన జగన్ తాజా సమీక్షా సమావేశంలో కూడా అదే వార్నింగ్ రిపీట్ చేశారు. కాకపోతే ఈ సారి సరిగా పని చేయడం లేదంటూ వేలెత్తి చూపి మరీ వార్నంగ్ ఇచ్చారు.పని తీరు మెరుగు పరచుకోకుంటే.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని పునరుద్ఘాటించారు. కొత్త వారిని బరిలోకి దింపడం ఖాయమన్నారు. వ్యక్తగతంగా తనకు ఎవరినీ మార్చాలని లేదనీ, ఎమ్మెల్యేలందరిపైనా తనకు ఎనలేని ప్రేమ ఉందని చెప్పిన జగన్.. పార్టీ కోసం పని చేయకుండా వారే వాళ్లకు ఉద్వాసన చెప్పక తప్పని పరిస్థితికి కొని తెచ్చుకుంటున్నారని చెప్పారు. జగన్ వార్నింగ్ ఇచ్చిన వారిలో పలువురు మంత్రులు కూడా ఉన్నారు. వారంతా  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 10 రోజుల కంటే తక్కువగా పాల్గొన్నారని తనకు అందిన నివేదిక ప్రకారం జగన్ వారికి మరో లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల దగ్గర పడుతున్నందున ప్రజలలోకి వెళ్లాలనీ, గడప గడపకూ కార్యక్రమంలో ప్రతి ఇంటికీ కనీసం ఐదు నిముషాలు కేటాయంచాలని జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రభుత్వం ఆ ఇంటికి చేసిన మంచిని వివరించి, వారి ఆశీర్వాదం కోరాలన్నారు అలాగే గ్రామాల్లో అత్యధిక ప్రభావం చూపే (హై ఇంప్యాక్ట్‌ వర్క్‌) పనులను గుర్తించి.. ఎక్కడా స్వప్రయోజనాలు ఆశించకుండా.. ఎవరినో సంతోషపర్చాలని కూడా ఆలోచించకుండా ముందుకి సాగాలని సూచించారు. ఆ పనుల కోసం ప్రతి సచివాలయానికి కేటాయిస్తున్న నిధుల్లో ఎక్కడా వెనకడుగు వేయడం లేదని.. అందరూ ముందుకు సాగాలని సూచించారు.

మాచర్లలో వైసీపీ శ్రేణుల గూండాగిరీ.. తెలుగుదేశం కార్యాలయం దగ్ధం

పల్నాడు జిల్లా మాచర్లలో తీవ్ర ఉఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి.   టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అనే కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా  శుక్రవారం (డిసెంబర్16) మాచర్ల టీడీపీ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో, మాచర్ల పట్టణంలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ వార్డులో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. దీంతో అక్కడి వైసీపీ శ్రేణులు బ్రహ్మానందరెడ్డితోపాటు, టీడీపీ నేతలపై దాడి చేశాయి. రాళ్లు, కర్రలతో దాడికి యత్నించాయి. ఈ ఘటనలో పలువురు టీడీపీ నేతలకు గాయాలయ్యాయి. వెంటనే టీడీపీ శ్రేణులు తిరగబడ్డాయి. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరుపక్షాలు పరస్పరం దాడికి పాల్ప్డడ్డాయి. వైసీపీ శ్రేణులు తాజాగా టీడీపీ ఆఫీసును దగ్ధం చేశాయి. టీడీపీ ఆఫీసులోనే బ్రహ్మానంద రెడ్డి ఇల్లు కూడా ఉంది. ఇక్కడికి చొరబడిన వైసీపీ శ్రేణులు ఫర్నీచర్ ధ్వంసం చేశాయి. మరోవైపు రైల్వే ట్రాక్ సమీపంలో ఆందోళనకారులు పలు కార్లను దహనం చేశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు బ్రహ్మానందరెడ్డిని మాచర్ల నుంచి తరలించారు. దీంతో టీడీపీ శ్రేణులు పోలీసులపై విమర్శలు చేశారు. వైసీపీ దాడికి పాల్పడుతున్నప్పటికీ, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు. ఈ ఘటనపై టీడీపీ, వైసీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. టీడీపీ నేతలే తమపై దాడికి పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది.   టీడీపీ శ్రేణులు స్థానిక బ్రిడ్జిపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందని, దీనికి ఈ ఘటనే నిదర్శనమని నారా లోకేష్ అన్నారు. కాగా తెలుగుదేశం ఆంధ్ర్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాచర్ల లో వైసీపీ అరాచకత్వం పరాకాష్టకుచేరిందని విమర్శించారు. ఈ మేరకు ఒక ప్రకటనలో ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. మాచ్చర్ల  ఏమైనా పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి జాగీరా ? ప్రతిపక్షాలు నిరసన కార్యక్రమాలు చేయకూడదా? దాడులు చేసిన వైసీపీ వాళ్లను వదిలేసి టీడీపీ ఇన్ ఛార్జ్ బ్రహ్మారెడ్డిని అరెస్టు చేయడం దారుణం, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. తక్షణమే బ్రహ్మారెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ శ్రేణులు గూండాల్లా వ్యవహరించారనీ,  ఐదుకార్లు ధ్వంసం చేసి, టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని ఆయన పేర్కొన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకట్రామిరెడ్డి దగ్గరుండి ఈ దాడులకు నాయకత్వం వహించారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మాచర్లలో టీడీపీ సానుభూతి పరుల షాపులను కూడా తగలబెట్టారని ఆరోపించారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వెళ్తున్న బ్రహ్మారెడ్డికి వైసీపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. మాచర్లను గూండాగిరితో మూడున్నరేళ్లుగా చేతిలో పెట్టుకున్నారు. ప్రజల నుండి తిరుగుబాటు మొదలవడంతో విధ్వంసాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల దుశ్చర్యలను పోలీసులు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారన్నారు. బ్రహ్మారెడ్డి ప్రాణాలకు ముప్పుంది. బ్రహ్మారెడ్డికి చిన్నపాటి అపాయం కలిగించినా టీడీపీ కార్యకర్తలతో పిన్నెల్లి ఇంటిని ముట్టడిస్తాం. మా బ్రహ్మారెడ్డిని చూసి  పిన్నెల్లి  ప్రతి రోజూ భయపడుతూ బ్రతుకుతున్నాడు.ఖబడ్దార్ పిన్నెల్లి..నీ పని అయిపోయింది. నీ ఓటమికి రోజులు లెక్కపెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఉండగా మాచర్ల ఘటనలను తీవ్రంగా పరిగణించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు గుంటూరు డీఐజీకి ఫోన్ చేశారు.  కి టీడీపీ మాచర్లలో పరిస్థితులు ఇంత దారుణం గా ఉంటే పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తక్షణమే బాధ్యులపై చర్య తీసుకోవాలని,  వైసిపి గూండాలకు సహకరించిన పోలీసు సిబ్బంది, అధికారులపై నా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.