జగన్ కు నాడు కలిసి వచ్చిన ఆ రెండు సంఘటనలే ఇప్పుడు ప్రతికూలం?

2019 ఎన్నికలలో వైసీపీ విజయానికి ప్రధాన కారణాలలో ముందువరుసలో ఉన్న ఆ రెండు సంఘటనలే ఇప్పుడు 2024 ఎన్నికలలో అదే వైసీపీకి ప్రతికూలంగా మారనున్నాయా? అంటే వైసీపీ శ్రేణుల నుంచి సామాన్య జనం వరకూ ఔననే అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ రెండు సంఘటనలూ ఏమిటంటే.. ఒకటి విశాఖ విమానాశ్రయంలో అప్పటికి విపక్ష నేతగా ఉన్న జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి కాగా రెండోది..   జగన్ సొంత బాబాయ్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన స్వగృహంలో దారుణ హత్యకు గురి కావడం. ఈ రెండు సంఘటనలూ   జగన్ 2019 ఎన్నికలలో విజయం సాధించడానికి దోహదపడ్డాయనడంలో సందేహం లేదు. సరే ఆ తరువాత ఎన్నికలలో విజయం సాధించి జగన్ అధికారంలోకి వచ్చి కూడా నాలుగు సంవత్సరాలు కావస్తోంది. ఈ నాలుగేళ్ల కాలంలోనూ ఈ రెండు సంఘటనలకు సంబంధించిన కేసులూ ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. కోడి కత్తి కేసు విషయానికి వస్తే.. తనపై దాడి జరిగిందంటూ అప్పట్లో ఊరూవాడా ఏకం చేసి ఎన్ఐఏ దర్యాప్తును సాధించుకున్న జగన్ తాను ముఖ్యమంత్రి అయ్యాకా.. ఆ కేసు ను పట్టించుకున్న దాఖలాలే లేవు. పైపెచ్చు ఈ కేసు ముందుకు సాగాలంటే.. బాధితుడిగా జగన్ కోర్టుకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు పేర్కొన్నా.. జగన్ హాజరు కావడం లేదు. ఈ నాలుగేళ్లుగా ఈ కేసులో నిందితుడైన జనుపల్లి శ్రీను అనే యువకుడు రిమాండ్ ఖైదీగానే మగ్గిపోతున్నాడు. తనపై హత్యాయత్నం కేసు విచారణ పూర్తై నిందితుడికి శిక్ష పడాలన్న భావన జగన్ లో  ఏ కోశానా కనిపించడం లేదు. అసలా సంఘటనే జరగలేదన్నట్లుగా ఆయన తీరు కనిపిస్తోంది.  ఇక సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయాన్నే తీసుకుంటే.. అప్పట్లో అప్పటి అధికార పక్షమే ఈ దారుణానికి కారణమంటూ గగ్గోలు పెట్టిన జగన్.. విపక్ష నేతగా ఈ హత్య కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి హోదాలో సీబీఐ విచారణ అవసరం లేదన్నారు. కానీ వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత తన తండ్రి హంతకులకు శిక్ష పడాల్సిందేననీ, ఈ హత్య వెనుక పాత్రధారులు, సూత్రధారులు వెలుగులోనికి రావాల్సిందే అంటూ పట్టుబట్టి సీబీఐ దర్యాప్తును సాధించారు. ఆ తరువాత సీబీఐ దర్యాప్తునకు ఏపీలో అడుగడుగునా..అడ్డంకులు అవాంతరాలు కలగడంతో మళ్లీ సునీతే సుప్రీం ను ఆశ్రయించి కేసు విచారణను మరో రాష్ట్రానికి బదలీ చేయాలని కోరింది. ఆ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానానికి సీబీఐ కూడా సునీత చెప్పిన ప్రతి మాటా అక్షర సత్యమని నివేదించింది. దీంతో కేసు విచారణ తెలంగాణకు మారింది. అప్పటి నుంచీ దర్యాప్తులో వేగం పెరిగింది. కేసు దర్యాప్తు వేగంగా వివేకా హత్య వెనుక సూత్రధారులు, పాత్ర ధారులు ఎవరన్నది లేల్చే దిశగా సాగుతోందన్న అభిప్రాయమూ అందరిలో కలిగింది. సరిగ్గా ఈ తరుణంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ దర్యాప్తు తీరు సరిగా లేదని ఆరోపిస్తూ, కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్టు చేయకుండా సీబీఐని ఆదేశించాలంటూ కోర్టుకు వెళ్లారు. ఆ సందర్భంగా ఈ హత్య వైఎస్ వివేకా అల్లుడే చేశాడంటూ ఆరోపించారు. సరే ఇదంతా కొద్ది సేపు పక్కన పెడితే.. కోడికత్తి కేసు, వివేహా హత్య కేసు ఈ రెండిటి విషయంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ ప్రతిష్టను మసకబార్చిందనడంలో సందేహం లేదు. విపక్షంలో ఉన్న సమయంలో ఒకలా, అధికారంలోకి వచ్చాకా మరోలా వ్యవహరించడం వల్ల ఈ రెండు సంఘటనల్లో గతంలో జగన్ ఆరోపణలు వాస్తవాలు కావన్న అభిప్రాయం జనంలోకి బలంగా వెళ్లిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ముఖ్యంగా సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య విషయంలో విపక్షంలో ఉన్న సమయంలో అప్పటి అధికార పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా, తెలుగుదేశం పార్టీపైనా విమర్శలు గుప్పించిన వైసీపీ ఇప్పుడు ఆయన హత్య వెనుక ఉన్నది తెలుగుదేశం కాదు, వివేకా కుటుంబ సభ్యులే అనడంతో వైసీపీ, జగన్ ల మాటలలో విశ్వసనీయత కరవైందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీ ప్రతిష్ట మసకబారిందన్న భావన కలుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ జీవించి ఉన్న కాలంలో రామలక్ష్మణులకు ప్రతీకగా వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డిలను జనం చెప్పుకునే వారు.  అయితే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తరువాత నుంచీ పరిస్థితుల్లో మార్పు వచ్చింది.   వివేకానందరెడ్డి కాంగ్రెస్ లోనే ఉండటం, జగన్ వైసీపీ పార్టీ ప్రారంభించడం, ఆ తరువాత వివేకా వైసీపీలోకి వచ్చిన తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన స్వయంగా పరాజయం పాలు కావడంతో వివేకా, జగన్ మధ్య విభేదాలున్నాయా అన్న అనుమానాలు అప్పట్లోనే పొడసూపాయి. ఇక వైఎస్ వివేకా హత్య, తదననంతర పరిణామాలు  వైపీపీ ప్రతిష్ట మసకబార్చడమే కాకుండా, వైఎస్ ఫ్యామిలీ ప్రతిష్టను కూడా మసకబార్చాయంటున్నారు.  వైఎస్సార్ ఫ్యామిలీ ప్రతిష్టకు భంగం వాటిల్లిందనీ చెబుతున్నారు.   కేసు దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ మరెన్ని విషయాలు బయటకు వస్తాయో అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. 

ఆస్కార్ కొట్టిన ‘నాటు నాటు’ పాట

అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ సత్తా చాటింది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కింది. దీంతో ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి భారతీయ గీతంగా ఈ పాట చరిత్ర సృష్టించింది.  ఆర్ఆర్ఆర్ సంగీత దర్శకుడు కీరవాణి, నాటు నాటు పాట రచయత  చంద్రబోస్ ఆస్కార్ వేదికపైస ఈ అవార్డు అందుకున్నారు. అయితే పురస్కారం ప్రకటించడానికి ముందే  ఆస్కార్ వేదికపై.. నాటు నాటు పాటకు హాలీవుడ్ డ్యాన్సర్లు డ్యాన్స్ చేశారు. సినిమాలో ఈ పాట పాడిన గాయకులు రాహుల్ సిప్లింగంజ్, కాలభైరవ లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. వారి పాటకీ, బీట్ కి ఆస్కార్ ఆడియన్స్ స్టాండిగ్ ఒవేషన్ ఇచ్చారు. అస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకకు  ఆర్ఆర్ఆర్  దర్శకుడు రాజమౌళి, నటులు రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ హాజరయ్యారు. కాగా తెలుగు సినిమా పాటకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కడం పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు  కేసీఆర్, జగన్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు,  జనసేనాని పవన్ కల్యాణ్, మెగా స్టార్ చిరంజీవి..ఇలా ఒకరని కాదు రాజకీయ సినీ ప్రముఖులెందరో ఆర్ఆర్ఆర్ బృందానికి అభినందనలు తెలిపారు.  ఇక ఆస్కార్ పురస్కారం పొందిన నాటు నాటు పాట కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ప్రాంతం, భాష,  దేశం ఇలాంటి వాటి వేటితోనూ సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లభించింది. వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ ఉర్రూతలూగించింది. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరిచేతా స్టెప్పులేయించింది. ఇప్పుడు ఆస్కార్ పురస్కారాన్ని సాధించుకు వచ్చింది. ఇక బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో  ఇండియాకు మరో ఆస్కార్ పురస్కారం కూడా దక్కింది. 'ది ఎలిఫెంట్ విష్పర్స్' ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఒకే ఏడాది ఇండియాకి రెండు ఆస్కార్స్ రావడం గర్వించదగ్గ విషయం.

ఇప్పటికి ముగిసింది.. మళ్లీ రండి మేడమ్!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ శనివారం సుదీర్ఘంగా ఉంటే ఎనిమిది గంటలకు పైగా విచారించింది. ఉదయం ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లినప్పటి నుంచీ తిరిగి రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో బయటకు వచ్చే వరకూ అక్కడ హస్తినలో, ఇక్కడ తెలంగాణలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది.  కవితను అరెస్ట్ చేస్తారంటూ ఉదయం నుంచి ఏర్పడిన ఓ టెన్షన్ వాతావరణానికి రాత్రి ఎనిమిది గంటల సమయంలో ముగింపు లభించింది. ఎనిమిది గంటల విచారణ తర్వాత కవితను వదిలేశారు. దాంతో ఆమె ఢిల్లీలోని ఇంటికి వెళ్లిపోయారు. అక్కడ నుంచి రాత్రికి రాత్రే బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు. మళ్లీ కవితను ఈడీ ఈ నెల 16న విచారించనుంది. అయితే శనివారం రోజంతా మాత్రం హై డ్రామా నడిచింది. తొలుత సాయంత్రం ఐదు గంటల వరకూ కవిత విచారణ సాగుతుందన్న వార్తలు వచ్చినా, విచారణ మాత్రం రాత్రి ఎనిమిది దాటే వరకూ కొనసాగింది. మధ్యలో ఆమె ఫోన్ ను ఈడీసీజ్ చేసింది. ఉదయం విచారణకు వచ్చేటప్పుడు కవిత పోన్ తెచ్చుకోలేదు. ఢిల్లీలోని నివాసంలోనే ఫోన్ ఉంచి వచ్చారు. అయితే విచారణలో ఫోన్ గురించి ఈడీ అధికారులు వాకబు చేశారు. తన వద్ద లేదని చెప్పడంతో వెంటనే తెప్పించాలని ఆదేశించారు.దీంతో అప్పటికప్పుడు ఆమె తన డ్రైవర్ ను డిల్లీలో తాను బస చేసిన నివాసానికి పంపి ఫోన్ ను తెప్పించారు. వెంటనే సామాజిక మాధ్యమలో ఫోన్ సీజ్ చేశారంటే అరెస్టు ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.   రామచంద్ర పిళ్లై, కవితను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగారని.. అలాగే ఇతర నిందితుల నుంచి విచారణలో భాగంగా రాబట్టిన అంశాలను ఆధారం చేసుకుని కూడా కవితను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారని అంటున్నారు.   ఈడీ కార్యాలయం బయట ఎదురు చూస్తున్న కవిత డ్రైవర్‌కు సమాచారం పంపి.. ఆయనను నివాసానికి వెళ్లి ఫోన్ తీసుకు రావాలని పురమాయించారు. మధ్యాహ్నం సమయంలో కవిత డ్రైవర్ ఫోన్ తీసుకుని ఈడీ కార్యాలయానికి వచ్చి అధికారులకు ఇచ్చారు.  అంతే కాకుండా శుక్రవారం నాడే బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కవితను అరెస్టు చేయవచ్చంటూ చెప్పడంతో   ఆర్ఎస్ నేతలు  ఆందోళనలు చేయడానికి సిద్ధమయ్యారు. ఢిల్లీ, తెలంగాణల్లో ధర్నాలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఢిల్లీలో ఈడీ కార్యాలయం వద్దా   పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు మోహరించారు. కవితకు సంఘిభావంగా … మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా ఢిల్లీ చేరుకున్నారు. అలాగే ఇతర సీనియర్ నేతలు.. బీఆర్ఎస్ న్యాయనిపుణులు కూడా ఢిల్లీలోనే మకాం వేశారు.  చివరకు కవితను సుదీర్ఘంగా విచారించిన ఈడీ మరో సారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పి ఆమెను పంపేశారు. కవిత హైదరాబాద్ చేరుకోగానే ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి అయిన కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు. ఈడీ విచారణకు సంబంధించి అంశాలన్నీ వివరించారు. ఇక కవితను ఈడీ సుదీర్ఘంగా విచారించి పంపిన క్షణం నుంచీ బీఆర్ఎస్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం గురించి కానీ, ఈడీ కవితను విచారించడంపై కానీ ఆ పార్టీ నేతలు కానీ, శ్రేణులు కానీ మాట్లాడటం లేదు. అలా మాట్లాడవద్దని వారికి పార్టీ అగ్రనేత నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లుగా పార్టీ శ్రేణులే అంటున్నాయి. దీంతో ఈ కుంభకోణం విచారణలో బీఆర్ఎస్ రాజీధోరణి అవసంబిస్తోందా అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తమౌతున్నాయి.  హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీ వెళ్లి చేసిన ప్రయత్నాల వల్లే కవిత అరెస్టు కాకుండా ఈడీ విచారణ ఎదుర్కొని బయటకు వచ్చారని కూడా పరిశీలకులు అంటున్నారు.  అయితే కల్వకుంట్ల కవిత మరోసారి ఈ నెల 16న ఈడీ విచారణకు హాజరు కానున్నారు. అంత వరకూ ఈ అనుమానాలు, ప్రచారాలు అయితే సాగుతూనే ఉండే అవకాశాలు ఉన్నాయి.  

సమైక్యాంధ్రవాదికి కమలం పార్టీలో తెలంగాణ బాధ్యతలా?

ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి   నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి చర్చల ప్రక్రియ పూర్తయ్యిందని చెబుతున్నారు. వాస్తవానికి గతంలోనే ఆయన కమలం గూటికి చేరతారన్న వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే అప్పట్లో ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. పేరుకైతే కాంగ్రెస్ లో ఉన్నారు కానీ పార్టీలో ఏ మాత్రం క్రియాశీలంగా వ్యవహరించడం లేదు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ తో విభేదించి జై సమైక్యాంధ్ర పేరుతో పార్టీ స్థాపించి 2014 ఎన్నికలలో పరాజయం తరువాత ఆయన రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నది లేదు. రాహుల్‌గాంధీ ఏపీ-తెలంగాణలో పాదతయాత్ర సాగినప్పుడు కూడా ఆయన బయటకు వచ్చిన దాఖలాలు లేవు. చివరాఖరికి ఆయన తన సొంత జిల్లా అయిన చిత్తూరులో కూడా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.  అయితే ఆయన  సోదరుడు నల్లారి కిశోర్‌రెడ్డి టీడీపీలో చురుకుగా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఎక్కువగా హైదరాబాద్‌లోనే గడుపుతున్నారు రాజకీయాలతో సంబంధం లేకుండా. అంటే రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకులలో లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్లు ప్రకటించి రాజకీయ సన్యాసం తీసుకుంటే.. ఎటువంటి ప్రకటనా లేకుండా ఇంతకాలం అదే పని చేశారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. అంటే రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు  అటువంటి ఆయన ఇప్పుడు బీజేపీలో చేరి రాజకీయాలలో క్రియాశీలంగా మారేందుకు సమాయత్తమౌతున్నారు. అయితే ఆయనకు బీజేపీలో ఏపీ బాధ్యతలు కాకుండా, తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా, సమైక్యాంధ్ర పేరుతో పార్టీని స్థాపించిన కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు అప్పగించడం బీజేపీకి ఎంత వరకూ ఉపయుక్తంగా ఉంటుందన్నది ప్రశ్నార్థకమే. అయితే బీజేపీ మాత్రం స్వయంగా తెలంగాణ జాతిపితగా తనను తాను అభివర్ణించుకున్న కేసీఆరే తెలంగాణ వాదానికి స్వస్తి చెప్పి జాతీయ వాదమంటూ ఏపీలో కూడా బీఆర్ఎస్ విస్తరణకు ప్రయత్నాలు ప్రారంభించిన పరిస్థితుల్లో ఇక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నాటి వాదనలకు తావే ఉండదని   భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే తెలంగాణలో బీజేపీకి రెడ్డి సమాజిక వర్గాన్ని చేరువ చేసే బాధ్యతలు కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించాలని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఏది ఏమైనా ఒక మాజీ సీఎం పార్టీలో చేరారంటే.. అది బీజేపీకి ప్లస్ అవుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన క్రియాశీలంగా ఉన్నారా లేదా అన్నది తరువాత ఇప్పటి పరిస్థితుల్లో మాజీ సీఎం స్థాయి వ్యక్తి కమలం గూటికి చేరారు అని చెప్పుకోవడం ఎంత కాదనుకున్నా బీజేపీకి సానుకూల వాతావరణం ఉన్నందునే చేరికకు ఇతర పార్టీల నేతలు ఉత్సుకత చూపుతున్నారన్న ప్రచారమైనా జరుగుతుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు.  

వాట్సప్ చాట్ డీకోడ్.. ఇక అరెస్టేనా?

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ కవితను విచారిచడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దేశం మొత్తం దృష్టి ఇప్పుడు కవితను ఈడీ అరెస్టు చేస్తుందా? చేయదా అన్న అంశంపైనే ఉంది. కాగా ఈడీ కూడా కవిత విచారణకు ముందు చాలా పకడ్బందీగా ఈ కుంభకోణంలో ఆమె ప్రమేయానికి సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించిందని కూడా అంటున్నారు. కవితను విడిగా విచారించడమే కాకుండా.. ఈ కేసులో ఇప్పటికే అరెస్టై ఉన్న ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా,  మనీష్ సిసోడియా, అరుణ్ పిళ్లై, దినేష్ ఆరోరా, బుచ్చిబాబు, మనీష్ సిసోడియా మాజీ కార్యదర్శి అరవింద్, మాజీ అధికారులు కులదీప్ సింగ్, నరేంద్ర సింగ్ లతో కలిపి విచారిస్తోందనని తెలుస్తోంది. వీరంతా కూడా తమతమ సెల్ ఫోన్ లను ధ్వంసం చేసిన వారేనని ఈడీ చెబుతోంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కుంభ కోణం వ్యవహారంలో వీరు కోడ్ భాషలో వాట్సాప్ చాటింగ్ చేశారన్న విషయాన్ని గుర్తించిన ఈడీ ఆ కోడ్ ను కూడా డీ కోడ్ చేయగలిగిందని అంటున్నారు.  దీంతో పక్కా సాక్ష్యాధారాలతో ఆమె అరెస్టుకు ఈడీ రంగం సిద్ధం చేసిందని పరిశీలకులు అంటున్నారు. ఈ కుంభకోణంలో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న వారంతా తమ ఐఫోన్లను ధ్వంసం చేశారని, అందులో ఉన్న సమాచారాన్ని మొత్తం క్రోడీకరిస్తే కీలక విషయాలు తెలిసాయని ఈ డి అంటోంది. వాటి ఆధారంగానే కవిత, మిగతా తొమ్మిది మందిని ఒకేసారి ఈడి అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ విస్తరణకు దోహదం?!

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ సమన్ల మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. విచారణ షురూ అయ్యింది. విచారణ అనంతరం కవితను అరెస్టు చేసే అవకాశాలున్నయన్న ప్రచారమూ జోరుగా సాగుతోంది. నిన్న మొన్నటి వరకూ కవితకు పెద్దగా మద్దతు ప్రకటించని బీఆర్ఎస్ అధినేత, తండ్రి కేసీఆర్, మంత్రి సోదరుడు కూడా అయిన కేటీఆర్, సమీప బంధువు హరీష్ రావు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఇప్పుడు ఆమెకు సంఘీభావంగా హస్తిన చేరుకున్నారు. బీఆర్ఎస్ నినాదమైన బైబై మోడీ ఫ్లెక్సీలు ఢిల్లీలో కవితకు మద్దతుగా వెలిశాయి. ఒక్క సారిగా బీఆర్ఎస్ రాజకీయం మొత్తం ఢిల్లీపై కాన్సన్ ట్రేట్ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కవితను అరెస్టు చేసే అవకాశాలున్నాయని చెప్పేశారు. చేసుకోనివ్వడం చూద్దాం అంటూ చాలెంజ్ కూడా చేశారు. అలా బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ముగిసిందో లేదో ఇలా మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు హస్తిన ఫ్లైట్ ఎక్కేశారు. ఈ మధ్యలోనే ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ విచారణలో తాను ఎమ్మెల్సీ కవితకు బినామీని అని అంగీకరించిన హైదరాబాద్ కు చెందిన వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై యూటర్న్ తీసుకున్నారు. అంతే కాదు తాను ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతించాలంటూ కోర్టును శుక్రవారం (మార్చి 10) ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై కోర్టు ఈడీకి నోటీసులు ఇచ్చింది. వాస్తవానికి కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడానికి అరుణ్ రామచంద్రపిళ్లై వాంగ్మూలమే ఆధారమని చెప్పవచ్చు. అటువంటిది అరుణ్ రామచంద్రపిళ్లై తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకుంటానంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కవితకు ఏదో మేరకు ఊరట లభించినట్లేనని అంటున్నారు. ఆమెను అరెస్టు చేసే అవకాశాలు పెద్దగా లేవన్న ప్రచారం కూడా సాగుతోంది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు హైదరాబాద్ నుంచి హుటాహుటిన హస్తినకు వెళ్లినది కూడా ఈడీ విచారణ ఎదుర్కొని బయటకు వచ్చే కవితకు ఘనస్వాగతం పలికి తోడ్కొని రావడానికేనని కూడా అంటున్నారు.   అయితే  ఒక సారి ఇచ్చిన వాంగ్మూలం ఉపసంహరించుకోవటం సాధ్యం అవుతుందా.. చట్టంలో  అటువంటి  వెసులు బాటు ఉందా, అలాగే వాగ్మూలం ఉపసంహరించుకోవటానికి కోర్టు అనుమతి ఇస్తుందా? అన్న ప్రశ్నలపైనే ఇప్పుడు చర్చ అంతా సాగుతోంది.  మొత్తానికి అరుణ్ రామచంద్రపిళ్లై వాంగ్మూలం ఉపసంహరించుకోవడానికి దాఖలు చేసిన పిటిషన్ అలా ఉంటే.. కవిత మాత్రం ఈడీ విచారణకు హాజరయ్యారు.  అమె అరెస్టవుతారా లేదా అన్న ఉత్కంఠకు మరి కొన్ని గంటలలో తెరపడుతుంది. అయితే కవితకు ఈడీ  నోటీసులు, విచారణ నేపథ్యంలో జాతీయ రాజకీయాలలో ఒక్కసారిగా కుదుపు వచ్చిన మాట వాస్తవం. ఆమె హస్తిన వేదికగా శుక్రవారం (మార్చి 10) చేపట్టిన మహిళా రిజర్వేషన్ల బిల్లు దీక్షకు దాదాపు 18 రాజకీయ పార్టీలు మద్దతు, సంఘీభావం ప్రకటించాయి. ఈ దీక్ష వేదికగా ఆమె కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలలో మరింత చురుకుగా వ్యవహరించేందుకు ఈ పరిణామాలు కచ్చితంగా దోహదం చేస్తాయనడంలో సందేహం లేదు. 

ఇక నమ్మలేం.. నమ్మం కూడా.. జగన్ సర్కార్ కు తేల్చేసిన ఉద్యోగులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగులు జగన్ సర్కార్ ను ఇక నమ్మేదేలే.. అంటూ బాహాటంగా చెప్పేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ ఉద్యోగులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ప్రభుత్వంపై ఆగ్రహంతో మండిపడుతున్నారు. నిరసనలతో హోరెత్తించడానికి రెడీ అయిపోయారు. ప్రభుత్వంతో చర్యలంటున్న తమ సంఘాల నేతలపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు ఆగ్రహాగ్ని తట్టుకోలేకే అనివార్యంగా ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళనా కార్యక్రమాలకు కార్యాచరణ ప్రకటించారు. ఔను ఉద్యమ కార్యాచరణ తప్ప మరో మార్గం లేని పరిస్థితిని నేతలను ఉద్యోగులే తీసుకువచ్చారు. ఉద్యోగులు ఇంకెంత మాత్రం ప్రభుత్వాన్ని నమ్మడానికి సిద్ధంగా లేరని నేతలే చెప్పేపరిస్థితికి వచ్చారు. ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వం ఇచ్చే హామీలను ఉద్యోగులు ఎంత మాత్రం నమ్మే పరిస్థితి లేదని కుండబద్దలు కొట్టేశారు. ప్రభుత్వం చర్చలంటూ పిలిచి ఓవో నోటి మాటలతో హామీలు ఇచ్చినంత మాత్రాన సరిపోదనీ...తాము ఉద్యమ కార్యాచరణ మేరకే ముందుకు వెడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర నాయకత్వం నచ్చచెప్పినా ఉద్యోగులు వినే పరిస్థితి అయితే కనిపించడం లేదని తేల్చేశారు. వాస్తవం కూడా అదే. చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఐఆర్ కంటే తక్కువ పీఆర్సీకి ఉద్యోగ సంఘాల నేతలు తలలూపినప్పుడే వారు ఉద్యోగుల నమ్మకాన్ని కోల్పోయారు. అది కూడా ఆచరణలోనికి రాకపోయే సరికి ఉద్యోగులే నేతలను ఉద్యమ కార్యాచరణ దిశగా నడిపించారు. ఇప్పుడు ఆ వాస్తవం నెమ్మదిగా నేతలకూ అర్ధం అవుతోంది. అందుకే ప్రభుత్వ హామీలను నేతలు కూడా నమ్మడం లేదు. తక్షణం బకాయిలు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం జీతాలే చెల్లించడం లేదనీ, ఇటువంటి పరిస్థితుల్లో తాము తగ్గితే ఇక బకాయిలకు నీళ్లొదిలేసుకోవాల్సిందేనని వారు అంటున్నారు. ఆందోళనను కొనసాగించాల్సిందేననీ, అవసరమైతే మరింత ఉధృతం చేయడానికైనా వెనుకాడవద్దనీ ఉద్యోగులు నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ విషయాన్నే విలేకరుల సమావేశంలో చెప్పారు. తమ కార్యవర్గ సమావేశంలో ఇదే అభిప్రాయం చాలా చాలా బలంగా వ్యక్తమైందని చెప్పారు. ఈ నెలాఖరులోగా  చట్టబద్ధంగా తమకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేయడం ఖాయమని చెప్పారు. అసలు ప్రభుత్వం పిలిస్తే చర్చలకు వెళ్లడంపైనే తన నేతలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలు అనగానే ఎందుకు ఎగిరి గంతేసి మరీ వెళుతున్నారని నిలదీస్తున్నారు. సీఎం జగన్ సర్కార్ ఉద్యోగ సంఘాల నాయకులను తమ గుప్పిట్లో పెట్టుకుందనీ ఆరోపిస్తున్నారు.  పీఆర్సీ వివాదం తలెత్తిన సమయంలో ప్రభుత్వం ఇదే విధంగా ఉహ్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేరలేదని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.   అసలు ఉద్యోగుల సొమ్ములు వారికి తెలియకుండా తీసుకోవడం తప్పు. కాదు నేరం. నిజానికి  నేరం చేసిన సర్కార్ ను ఉద్యోగ సంఘాలు నిలదీయాలి. కానీ  ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం అందుకు భిన్నంగా మంత్రి వర్గ ఉప సంఘంతో చర్చలు జరపడాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు.   మార్చి నెలాఖరులోపు  మూడు వేల కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెబుతున్నారు. కానీ ప్రభుత్వం ఇస్తుందన్న నమ్మకం అయితే  ఉద్యోగులలో కలగడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, టీచర్లు ఓట్లు కావాలి కనుకనే  చర్చల పేరు ఉద్యోగులను మరో సారి మోసం చేసేందుకు సర్కార్ ప్రయత్నిస్తోందని ఉద్యోగులు గట్టిగా చెబుతున్నారు.  

అవినాష్ పిటిషన్ సీజే బెంచ్ మీదకు రాకపోవడం వెనుక మర్మం ఏమిటి?..రఘురామకృష్ణం రాజు

కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ తనను అరెస్టు చేయకుండా సీబీఐను ఆదేశించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు కాకుండా మరో బెంచ్ కు ఎలా వెళ్లిందన్న అనుమానాన్ని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ పార్లమెంటు సభ్యులు దాఖలు చేసే కేసులన్నీ ప్రధాన న్యాయమూర్తి బెంచ్ విచారించాలన్న విధానానికి విరుద్ధంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ మరో బెంచ్ కి వెళ్లడం వెనుక ఏదో మర్మం ఉందని  అనుమానం వ్యక్తం చేశారు.  గతంలో ఆంధ్ర, తెలంగాణ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును సవాలు చేస్తూ,తాను పిటిషన్ దాఖలు చేయగా అది ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు విచారణకు వెళ్ళిందని ఆయన గుర్తు చేశారు.  అవినాష్ రెడ్డి లంచ్ మోషన్ లో అత్యవసరంగా కేసు మూవ్ చేయగా, జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ పైకి వెళ్ళింది. రోస్టర్ విధానంలో ఈ కేసు సంబంధిత బెంచ్ పైకి వెళ్లాల్సి ఉండగా, తన బెంచ్ పైకి రావడం పట్ల న్యాయమూర్తి ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశారన్నారు. అన్నిటికీ మించి తన స్టేట్మెంట్లను పరిగణలోకి తీసుకోవద్దని అవినాష్ రెడ్డి న్యాయస్థానంలో చెప్పడం ఆశ్చర్యంగా ఉందని రఘురామ అన్నారు.  ఇక మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి హత్య చేశారని వైయస్ అవినాష్ రెడ్డి కోర్టులో అభియోగం మోపడమేమిటని రఘురామ ప్రశ్నించారు. వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారన్న అభియోగాన్ని మోపాల్సింది సిబిఐ. కోర్టుకు వచ్చి అవినాష్ రెడ్డి అభియోగాన్ని మోపుతున్నారంటే దాని వెనుకనున్న ఆంతర్యాన్ని అర్థం చేసుకోవచ్చునని అన్నారు.   వివేక ఇంట్లో అదే రాజశేఖర్ రెడ్డి, అవినాష్ రెడ్డికి చెప్పి రక్తపు మరకలు తుడిచేయమని, కట్లు కట్టమని, సీఐ శంకరయ్యను కూడా మేనేజ్ చేయమని చెప్పారా? అని ప్రశ్నించారు. దస్తగిరికి హత్య చేయమని వారే చెప్పారని అంటున్న అవినాష్ రెడ్డి ఇంట్లో హత్యకు ముందు, తరువాత దస్తగిరి తో పాటు ఇతర నిందితులంతా ఎందుకు ఉన్నారని నిలదీశారు.  వైఎస్ వివేకా హత్య అనంతరం ఇంట్లోని రక్తపు మరకలను తుడిపించింది నిజం కాదా?, గాయాలకు కట్లు కట్టించింది నిజం కాదా?, గుండెపోటుతో మరణించారని చెప్పింది వాస్తవం కాదా? రాజశేఖర్ రెడ్డి ఏమైనా తన మామ గుండెపోటుతో మరణించారని చెప్పమని మీకు చెప్పారా? అంటూ ప్రశ్నించారు.

అబద్ధాల కథలల్లి అడ్డంగా దొరికిపోయారా?

అబద్ధాలు చెప్పేవాళ్లకి జ్ణాపకశక్తి ఎక్కువ ఉండాలి. అప్పుడే వారు చెప్పిన అబద్ధానికి కట్టుబడి ఉండగలుగుతారు. లేకపోతే గతంలో ఏం చెప్పామో గుర్తు ఉండదు. కనుక మరేదో చెప్పి దొరికి పోతూ ఉంటారు. నవ్వుల పాలౌతారు. రోజుకో కొత్త కథ అల్లలేక ఉక్కిరిబిక్కిర అవుతుంటారు.  వివేకా హత్య కేసులో జగన్ అండ్ కో ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో వారు గతంలో ఎవరి మీద ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఇదే కేసులో వారి వేళ్లెటు చూపుతున్నాయి అన్నది గమనిస్తే.. స్వయంగా తమ అబద్ధాలతోనే వారు అడ్డంగా దొరికిపోయారన్న భావన దర్యాప్తు పూర్తి కాకుండానే, వివేకా హత్య కేసులో దోషులెవరన్నది న్యాయస్థానం ఇంకా నిర్ధారించకముందే జనానికి అర్ధమైపోతోంది అనే పరిస్థితి ఏర్పడింది.    కడప మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య విషయంలో ముందు బాబాయ్‌ది  గుండెపోటు కథ బెడిసి కొట్టడం, ఆయన గొడ్డలి పోటుతో హత్యకు గురయ్యారని తేలిపోవడంతో వెంటనే అప్పటికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబునాయుడిపై, ఆయన కుమారుడు, అప్పటి మంత్రి లోకేష్ పై ఆరోపణలు చేశారు. అధికారంలో ఉన్నారు కనుక దర్యాప్తును ప్రభావితం చేస్తారు, విచారణ సీబీఐకి అప్పగించాల్సిందే అంటూ గుండెలు బాదుకున్నారు. సరే అధికారంలోకి వచ్చాకా సీబీఐ దర్యాప్తు అవసరం లేదని వారే చెప్పారు. అది పక్కన పెడితే.. వివేకా కుమార్తె తన తండ్రి హత్యకు సూత్రధారులు, పాత్రధారులు ఎవరో తెలియాల్సిందేనంటూ చేస్తున్న న్యాయపోరాటం కారణంగా అసలు హంతకులు ఎవరన్నది తేలే దిశగా దర్యాప్తు సాగుతున్న సమయంలో   అల్లుడే అసలు హంతకుడంటూ చెబుతున్నారు. అంటే గతంలో వీరే ఒక కన్ను మరో కన్నును పొడుచుకుంటుందా? అంటూ చేసిన వాదన కాస్తా..ఇప్పుడు కను రెప్పే కంటిని మింగేసింది అనే స్థాయికి వచ్చేసింది.   వివేకా అసలు హంతకుడు, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డేనని.. ఈ కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తరఫున వాదించిన లాయర్‌ శుక్రవారం (మార్చి 10)న కోర్టులో సంచలన ఆరోపణ చేశారు. వివేకా రెండో పెళ్లి చేసుకున్న తర్వాత.. ఆయన కుటుంబం వివేకాను దూరం పెట్టడంతో పాటు, ఆయన చెక్‌ పవర్‌నూ లాగేసుకుందన్నది, అవినాష్‌రెడ్డి లాయర్‌ కోర్టులో చేసిన వాదన. హత్యకు ఆ నేపథ్యమే కారణమన్నది ఆయన తెరపైకి తెచ్చిన వాదన.   వివేకా  ,రెండో భార్య కొడుకును వారసుడిగా ఎంపిక చేసుకునే క్రమంలో.. కుటుంబంలో వచ్చిన కలతలే, ఆయన హత్యకు కారణమన్నది అవినాష్‌రెడ్డి లాయర్‌   ఆరోపణ. అసలు సీబీఐ ఆ కోణంలో ఎందుకు విచారించడం లేదన్నది ఆయన ప్రశ్న.  ఇది కోర్టులో అవినాష్ రెడ్డి న్యాయవాది చేసిన వాదన కనుక ఇది అవినాష్ చెప్పినట్లుగానే భావించాల్సి ఉంటుంది. అవినాష్ రెడ్డి చెప్పినట్లుగానే ఆయన తరఫు న్యాయవాది కోర్టులో వాదిస్తారు. దీనిని బట్టే గతంలో జగన్, అవినాష్ సహా వైసీపీ నేతలు చంద్రబాబుపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని తేటతెల్లమైపోయింది. వైఎస్ వివేకా రెండో పెళ్లి గురించీ, ఆయన ఇబ్బందుల గురించీ, ఆయన కుటుంబంలో వచ్చిన కలహాల గురించీ.. ఇప్పటి వరకూ పాపం వీరికెవరికీ తెలియలేదా?   వివేకా అల్లుడే.. మామను చంపిన విషయాన్ని  ఇప్పుడు బయట ప్రపంచానికి చెబుతున్న అవినాష్‌రెడ్డి.. వివేకా హత్య జరిగినప్పుడు మీడియాకు ఆ విషయం ఎందుకు చెప్పలేదు? పోనీ ఈ సంగతిని అప్పట్లో హత్య కేసును విచారించిన ‘సిట్‌’కు ఎందుకు చెప్పలేదు. జగన్‌ సీఎం అయిన ఏడాది వరకూ మనుగడలో ఉన్న సిట్‌కు వివేకా అల్లుడిపై కనీసం ఫిర్యాదు కూడా చేయలేదెందుకు?   ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత ఈ కేసులో నిండా ఇరుక్కున్నామని తేలిపోయిన తరువాత ఇప్పుడు తప్పించుకోవడానికి, లేదా దర్యాప్తును పక్కదారి పట్టించడానికి కొత్త వాదన తెరపైకి తీసుకువచ్చారా అన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తమౌతున్నాయి. అయితే ఏ నోటితో అయితే హత్య జరిగిన సమయంలో చంద్రబాబు తదితరులపై ఆరోపణలు గుప్పించారో, ఇప్పుడు అదే నోటితో తాము గతంలో చెప్పినదంతా అబద్ధమని ఒప్పుకుంటున్నారని వివేకా అల్లుడే హంతకుడు అన్న అవినాష్ మాటలతో తేటతెల్లమైపోయింది. ఇక వివేకా అల్లుడే హంతకుడు అని స్వయంగా అవినాషే చెప్పేసిన తరువాత.. ఇప్పుడు తెరమీదకు హత్య జరిగిన రోజు ఆ ప్రాంతంలో అంటే సంఘటనా స్థలంలో, అంటే హత్యకు గురైన వివేకా నివాసంలో రక్తపు మరకలు తుడిచిందెవరు? వివేకా మృతదేహానికి కుట్లు వేసిందెవరు? అన్న ప్రశ్నలకు కూడా అవినాషే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. హత్య జురిగిన వెంటనే గంటల పాటు అవినాష్ రెడ్డి ఫోన్ లో ఎవరితో మాట్లాడారు? ఎందుకు మాట్లాడారు? అవినాష్ కాల్ డేటా ఆధారంగా సీబీఐ వెలుగులోకి వచ్చిన పేర్లలో వివేకా అల్లుడి పేరు ఎందుకు లేదు? ఈ ప్రశ్నలకు కూడా ఈ అబద్ధాల హరిశ్చంద్రులు బదులు చెప్పాల్సి ఉంది.  అసలు హంతకులు అల్లుడే అని చెబుతున్నారు.. మరి గుండెపోటుతో మరణించారని అప్పడు అంత కచ్చితంగా ఎలా, ఎందుకు చెప్పారు? గుండెపోటు కథ తరువాత ఈ హత్య వెనుక ఉన్నది నారా చంద్రబాబునాయుడే అని ఎలా చెప్పగలిగారు? వివేకా హత్య వెనుక చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు ఉన్నారని ఆరోపించిన వీరు.. మరి ఇప్పుడు కోర్టులో  వివేకా అల్లుడే అసలు హంతకుడని ఎందుకు చెబుతున్నారు?  కట్టుకథలు అల్లి నేరం నుంచి తప్పించుకోవాలన్న ఆత్రం, తపనతో నోటికొచ్చిన అబద్ధాలు చెబుతూ.. చెప్పిన అబద్ధం మర్చిపోయి ఎప్పటికప్పుడు అల్లుతున్న కొత్త అబద్ధాల కథల వల్లే ఇప్పుడు వివేకా హత్య కేసులో దర్యాప్తు జరుగుతుండగానే, కోర్టులో కేసు తేలకుండానే జనం దోషులెవరన్నది నిర్ధారణకు వచ్చేసే అవకాశాన్ని అవినాష్ రెడ్డే స్వయంగా ఇచ్చినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

పిళ్ళై యూ టర్న్ కవితకు కాసింత ఊరట?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొంత  ఊరట లభించిందా? మూడు రోజుల క్రితం కవితకు బినామీగా వ్యవహరించానని ఈడీ ఎదుట వాగ్ములం ఇచ్చిన అరుణ్ రామచంద్ర పిళ్లయ్.. యూటర్న్ తీసుకున్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఇచ్చిన నా వాంగ్మూలాన్ని ఉప సంహరించుకోవటానికి అవకాశం ఇవ్వాలంటూ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో శుక్రవారం (మార్చి 10)   పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. నిజానికి, పిళ్ళై వాంగ్ములం ఆధారంగానే ఈడీ  విచారణకు హాజరు కావాలని కవితకు సమన్లు జారీ చేసింది.  శనివారం  (మార్చి 11)వ విచారణకు హాజరయ్యేందుకు కవిత సిద్ధమయ్యారు. అయితే   కవిత విచారణకు హాజరు అవ్వడానికి 24 గంటల ముందు.. పిళ్ళై పిటిషన్ దాఖలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.  విచారణ సందర్భంగా అరుణ్ పిళ్ళై ఇచ్చిన సమాచారం ఆధారంగానే..  కవిత బినామీ అంటూ పిళ్ళై ఛార్జిషీట్ లో ఈడీ ఆనేక మార్లు కవిత పేరును ప్రస్తావించింది.  పిళ్ళై విచారణ తర్వాతే కవితకు నోటీసులు జారీ చేయటం.. విచారణకు హాజరుకావాలని ఆదేశించటం చకచకా జరిగిపోయాయి. ఇదే సమయంలో తీహార్ జైల్లోనే ఉన్న ఆప్ నాయకుడు మనీష్ సిసోడియాను సైతం ఈడీ అరెస్ట్ చేసింది. కస్టడీలోకి తీసుకుని విచారిస్తారనే వార్తలు వస్తున్న క్రమంలో..  పిళ్ళై తన వాగ్మూలం వెనక్కి తీసుకునెందుకు అనుమతి కోరుతూ సిబిఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేయటం అనూహ్య  పరిణామంగా చెప్పవచ్చు.   ఈ నేపధ్యంలో ఒక సారి ఇచ్చిన వాంగ్మూలం ఉపసంహరించుకోవటం సాధ్యం అవుతుందా.. చట్టంలో  అలాంటి వెసులు బాటు ఉందా, అనే విషయంలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. వాగ్మూలం ఉపసంహరించుకోవటానికి కోర్టు అనుమతి ఇస్తే.. అప్పుడు కవిత  విచారణ వాయిదా పడుతుందా లేక యథావిధిగానే జరుగుతుందా? అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే, ఒక వేళ కోర్టు, పిళ్ళై వాంగ్ములం ఉపసంహరణకు అనుమతిచ్చినా, అది కవిత విచారణకు అవరోధం కాబోదని అంటున్నారు.  నిజానికి, ఏదైనా కేసు విచారణ సమయంలో ముద్దాయి, సాక్షి లేదా కేసుతో సంబంధం ఉన్న వారెవరైనా అప్ప్రోవర్ గా మారి ఇచ్చిన వాంగ్మూలాన్ని, విచారణ సంస్థలు యథా తథంగా తీసుకోవని, సర్కమ్ స్టెన్స్ ఎవిడెన్స్, ఫోన్ సభాషణలు ఇతర ఆధారాలు చూసుకునే  సమన్లు జారీ చేయడం, విచారించడం  లేదా అరెస్ట్ చేయడం వంటి చర్యలకు ఉపక్రమిస్తాయని  నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, పిళ్ళై యూ టర్న్ తో  కవితకు ఒక వేళ కొంత ఉపశమనం లభించినా అది తాత్కాలికమే అంటున్నారు.

ఈ సారికి వెళ్లండి.. మళ్లీ రండి!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ శుక్రవారం (మార్చి 10) ముచ్చటగా మూడో సారి విచారించింది. విచారణ ముగిసిన అనంతరం మళ్లీ పిలిచినప్పుడు రావాలని చెప్పి పంపించింది. యధా ప్రకారం విచారణ అనంతరం బయటకు వచ్చిన అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ సవ్యదిశలో సాగడం లేదని మీడియాకు చెప్పారు. ఇలా ఉండగా అవినాష్ రెడ్డి సీబీఐ విచారణపై తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్ ను విచారించిన కోర్టు ఆయనను సోమవారం వరకూ అరెస్ట్ చేయవద్దని  సీబీఐని ఆదేశించింది.   కేసు పూర్తి వివరాల ఫైల్‌ను తమ ముందు ఉంచాలని ఆదేశించంది. కేసు విచారణలో భాగంగా సేకరించిన ఆడియో, వీడియో లను హార్డ్ డిస్క్ రూపంలో తమ ముందు ఉంచాలని కూడా  హైకోర్టు సీబీఐని ఆదేశిస్తూ  తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.   తనను అరెస్టు చేయకుండా  సీబీఐకి ఆదేశాలివ్వాలని అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ  సందర్భంగా అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ఈ   కేసులో సీబీఐ విచారణ ఏకపక్షంగా సాగుతోందన్నారు. రెండు దఫాలుగా అవినాష్ రెడ్డి నుంచి తీసుకున్న స్టేట్మెంట్‌ను పరిగణలోకి తీసుకోవద్దని కోరారు.   అవినాష్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను సీబీఐ ఎస్పీ రాంసింగ్ పదుల సార్లు ఎడిట్ చేశారని పేర్కొన్నారు. అంతే కాకుండా వివేకా హత్య కేసులో అసలు నేరస్థుడు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి  అని పేర్కొన్నారు. ఇలా ఉండగా అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్‌లో వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె ఇంప్లీడ్ అయ్యారు.  తనపై వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేసినందున తమ వాదనలు వినాలని కోర్టును కోరారు.  మొత్తం మీద మూడో సారి విచారణకు సీబీఐ పిలవడంతో అవినాష్ రెడ్డి అరెస్టు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ విస్తృతంగా జరిగిన ప్రచారానికి తాత్కాలికంగా తెరపడింది. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని సీబీఐ అవినాష్ రెడ్డికి చెప్పడంతో ఆయన అరెస్టు విషయంలో చర్చకు అయితే ఫుల్ స్టాప్ పడలేదు. మరో వైపు హైకోర్టు అవినాష్ రెడ్డిని విచారించిన సందర్భంగా రికార్డు చేసిన ఆడియో, వీడియోలను సమర్పంచాలని,  అలాగే సోమవారం వరకూ అరెస్టు చేయవద్దంటూ సీబీఐని ఆదేశించడంతో సోమవారం తరువాత ఏం జరుగుతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ వేగం చూస్తుంటే ఈ కేసు ముగింపు దశకు చేరుకుందన్న అభిప్రాయాన్ని న్యాయనిపుణులు వ్యక్తం చేస్తున్నారు. 

అడ్డంగా దొరికిపోయారా?!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి   జగన్   చిన్నాన్న, మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి.. ఎట్టకేలకు శుక్రవారం (మార్చి 10) సీబీఐ విచారణకు హాజరయ్యారు. అయితే అంతకు ముందు రోజు  ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి.. రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ హత్య కేసులో సీబీఐ తనను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని... అదేవిధంగా 160 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారని.. ఈ నేపథ్యంలో ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని వైయస్ అవినాష్ రెడ్డి కోరారు.  దీనిని బట్టి చూస్తుంటే.. ఈ హత్య కేసులో   అవినాష్‌రెడ్డి ప్రమేయం ఉందా?   అడ్డంగా దొరికిపోయారా? అనే సందేహాలు వ్యక్తమవుతోన్నట్లుగా ఉందని..  ఆ క్రమంలో ఆయనలో భయం వ్యక్తమవుతోన్నట్లు స్పష్టంగా  అర్థమవుతోందనే ఓ చర్చ  పోలిటికల్ సర్కిల్‌లో జోరందుకుంది. మరోవైపు...   వివేకా కుమార్తె  సునీత సైతం తెలంగాణ హైకోర్టుకు ఆశ్రయించారు.  అవినాష్ రెడ్డి పిటిషన్‌లో తనను ఇంప్లిడ్ చేయాలని కోరారు. దీంతో  అవినాష్ రెడ్డిని సీబీఐ ఏం విచారిస్తుందో ఏమో కానీ.. ఈ అంశంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చే ఆదేశాలపైనే అందరు తీవ్ర ఆతృతతో ఎదురు చూస్తున్నారు.  అసలు వైయస్ వివేకా హత్య జరిగిన సమయంలో నాటి ప్రతిపక్ష నేత  జగన్ పులివెందుల్లో వివేకా కుమార్తె వైయస్ సునీత సమక్షంలో చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత రాష్ట్రంలో   జగన్ ప్రభుత్వం ఏర్పడడం.. దీంతో తన తండ్రి హత్య కేసులో నిందితులు ఎవరో తెల్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ సోదరి వైయస్ సునీత, సోదరుడు ప్లస్ ముఖ్యమంత్రి జగన్ వద్దకు వెళ్లి.. కోరడం.. ఆ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో ఖిన్నురాలై  ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవడంతోపాటు ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించడం...  అలా ఈ కేసు సీబీఐ చేత్లులోకి వెళ్లడం.. ఆ తర్వాత వైయస్ వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారి... ఈ హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారుల పేర్లు సీబీఐకి వెల్లడించడంతోపాటు ఈ కేసుకు సూపారీ కింద 40 కోట్ల రూపాయిలు చేతులు మారినట్లు పేర్కొనడం..  అనంతరం ఈ హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం.. అలాంటి ఒకానొక సమయంలోవైఎస్ వివేకా కుమార్తె  సునీత, అల్లుడు ఎన్ రాజశేఖరరెడ్డిలే ఈ హత్య చేయించారంటూ ఆరోపణలు ఎదుర్కోవడం.. అలాగే సీబీఐ అధికారులపై ఎదురు కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు జరగడం.. అదే విధంగా సీబీఐ అధికారుల కారు డ్రైవర్‌ను కడప వదిలి వెళ్లాలంటూ ఆగంతకులు బెదిరించడం.. మరోవైపు ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న వారు ఒక్కొక్కరుగా మరణిస్తూ ఉండడం.. సరిగ్గా ఆ సమయంలోనే కడప సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ మారడం... అదే సెంట్రల్ జైల్‌లో ఉన్న వైయస్ వివేకా హత్య కేసులో నిందితులకు ప్రాణానికి హాని ఉందంటూ ... ప్రతిపక్ష టీడీపీ రంగంలోకి దిగి.. వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు గుప్పించడం..  దీంతో జగన్ ప్రభుత్వం సదరు జైలు సూపరింటెండెంట్‌ను బదిలీ చేయడం.. ఆ తర్వాత వివేకా హత్య కేసు దర్యాప్తు ఒకానొక దశలో ఆగిపోవడం.. దాంతో  వివేకా కుమార్తె సునీత మళ్లీ రంగంలోకి వచ్చి.. తన తండ్రి హత్య కేసు దర్యాప్తు.. మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. అలా ఈ కేసు... తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయడం.. ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తు ముమ్మరం కావడం... ఆ క్రమంలో   అవినాష్‌ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం.. అలా విచారణకు హాజరైన   అవినాష్ కాల్ డేటాపై సీబీఐ దృష్టి సారించి..   వివేకా హత్య జరిగిన సమయంలో.. అంతకు ముందు.. ఆ తర్వాత పోన్ కాల్స్ వెళ్లిన జాబితాలో ఉన్న వారి పేర్లను పరిశీలించడం.. ఆ క్రమంలో రెండు నెంబర్లకు పలుమార్లు ఫోన్ కాల్స్ వెళ్లినట్టు గుర్తించిన సీబీఐ అధికారులు ఆ నెంబర్లపై ప్రశ్నల వర్షం కురిపించడం.. అలా నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు వైయస్ జగన్ భార్య వైయస్ భారతీ పీఏ నవీన్‌ పేర్లు బయటకు రావడం..  వారిద్దరికి వెంటనే సీబీఐ నోటీసులు ఇవ్వడం..  ఈ ఇద్దరిని కడపలో సీబీఐ అధికారులు ప్రశ్నించడం.. ఆ తర్వాత  అవినాష్ రెడ్డిని మళ్లీ సీబీఐ విచారణకు రావాలని పిలువడం.. అలా పిలిచిన 10 రోజులకే మరోసారి ఈ కేసు విచారణకు రావాలంటూ వైయస్ అవినాష్ రెడ్డితోపాటు ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డికి నోటీసులు జారీ చేయడం.. అలా వైయస్ భాస్కర్ రెడ్డి కడప జైలుల్లో మార్చి 12న విచారణకు హాజరుకానున్నారు. ఈ వివేకా హత్య కేసులో ఈ మొత్తం ఎపిసోడ్‌లో తెరచాటు సూత్రదారులు ఎవరు అనేది ఇప్పటికే సీబీఐకి క్లియర్ కట్‌గా అర్థమైందని.. ఈ విషయం కడప ఎంపీ వైయస్ అవినాష్ ‌రెడ్డికి కూడా అర్థమైందని అందుకే తెలంగాణ హైకోర్టును అంత కంగారుగా ఆశ్రయించారనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కల్‌లో దూసుకుపోతోంది.

ఏపీలో కొత్త కూటమి ?

మనం ప్రేమించేవారి కంటే, మనల్ని ప్రేమించే వారితో కలిసి ప్రయాణం చేయడం మంచింది. ఇది ప్రేమ పెళ్లి  విషయంలో సినిమా పెద్దలు చెప్పే మాట. అయితే, సినిమా ప్రేమకే కాదు, రాజకీయ ప్రేమలకూ  ఇది వర్తిస్తుంది.ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు,  తద్వారా వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు, తెలుగు దేశం, జనసేన పార్టీలు బేషజాలు మరిచి జట్టు కట్టేందుకు సిద్ధమయ్యాయి. అదే సమయంలో బీజేపీ కూడా కలసిరావాలని ఇటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్  కోరుకుంటున్నారు. అయితే బీజేపీ నాయకత్వం టీడీపీతో పొత్తుకు ససేమిరా అంటోంది.  నిజానికిమ ఏపీలో బీజేపీకి నిండా ఒక శాతం ఓటు కూడా లేదు. అయినా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా కమల దళాన్ని కలుపుకు పోవడం వలన  వైసేపీ  ఎన్నికల అరాచకాలకు కొంత వరకు చెక్ పెట్టవచ్చనే ఉద్దేశంతో కావచ్చు  టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో పొత్తును కోరుకుంటున్నాయి.  అయితే  బీజేపీ కలిసి రాకపోవడంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్   వామపక్ష పార్టీలతో కలిసి కొత్త కూటమి ఏర్పాటు  దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీని వదిలేసి  వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎంలతో  జట్టుకట్టే  ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. జనసేన వామపక్షాలతో కలిసి పోటీచేస్తే, 2014 కంటే మంచి ఫలితాలు సాధించవచ్చని రాజకీయ పరిశీలకులు కూడా భావిస్తున్నారని అంటున్నారు. నిజానికి బీజేపీతో జట్టు కట్టడం వలన మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎదుర్కుంటున్న వ్యతిరేకతను మోయవలసి వస్తుంది. అదే  కమల దళంతో పొత్తు లేకుండా టీడీపీ, జనసేన, వామ పక్ష పార్టీలు జట్టుకడితే అటు మోడీ ప్రభుత్వ వ్యతిరేకత, ఇటు జగన్ రెడ్డి  ప్రభుత్వ వ్యతిరేకత కొత్త కూటమికి  కలిసొస్తాయని విశ్లేషిస్తున్నారు.  నిజానికి ఇటు టీడీపీకి అటు జనసేనకు కూడా  గతంలో వామపపక్ష పార్టీలతో కలిసి పనిచేసిన అనుభవం  వుంది.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీలు, టీడీపీ పొత్తు పెట్టుకుని పోటీచేసిన సందర్భాలు లేక పోలేదు. ఆ సమయంలో లెఫ్ట్ పార్టీలకు సీట్ల పరంగా గౌరవమైన ప్రాతినిధ్యమే దక్కేది. అయితే గత కొన్నేళ్లుగా వామపక్షాలు ప్రాభవాన్ని కోల్పోయినా ఇప్పటికీ,  కొన్ని కొన్ని పాకెట్స్ లో ఎర్ర జెండాను నమ్ముకున్న జనమున్నారు. మంగళగిరి వంటి కొన్ని కీలక నియోజక వర్గాల్లో వామ పక్షాలకు నిర్దిష్టమైన ఓటు బ్యాంకుంది. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు,పవన్ కళ్యాణ్  చూపు లెఫ్ట్ పార్టీల వైపుకు తిరిగిందని అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు పట్టభద్రుల స్థానాలతో పాటు రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 23న పోలింగ్ జరగనుంది.  తెలుగుదేశం పార్టీ పట్టభద్రుల స్థానాల్లో మాత్రమే బరిలో దిగింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయడం లేదు. అయితే వామపక్షాల అనుబంధ కమిటీలు సంయుక్తంగా పీడీఎఫ్ కూటమిగా అటు పట్టభద్రులు, ఇటు ఉపాధ్యాయ స్థానాల్లో పోటీకి దిగారు. వాస్తవానికి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో వామపక్షాలదే పట్టు. కానీ గత కొన్నేళ్లుగా వామపక్షాలు వెనుకబడ్డాయి. మళ్లీ తమ ప్రాభవాన్ని పెంచుకోవాలన్న యోచనలో ఉన్న లెఫ్ట్ పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహకారం కోరినట్టు వార్తలు వస్తున్నాయి. రెండు పార్టీల మధ్య పరస్పర సహకార పద్దతిలో ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుదిరిన ఒప్పందం ప్రాతిపదికన రానున్న రోజుల్లో, టీడీపీ, జనసేన, వామ పక్ష పార్టీలు కూటమి ఏర్పడుతుందని పరిశీలకులు అంటున్నారు.

షేక్ ‘హ్యాండ్’ కు బీఆర్ఎస్ రెడీ కానీ..?!

తానే మారెనా.. తీరే మారెనా.. దారీ తెన్ను లేనే లేక ఈ తీరాయెనా.. అన్నట్లుగా ఉంది కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ పరిస్థితి. నిన్న మొన్నటి దాకా ఇష్టారీతిన నోరు పారేసుకుని విమర్శించిన కాంగ్రెస్ తోనే చేతులు కలిపేందుకు తహతహలాడాల్సి వస్తోంది. ఔను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు?  రాష్ట్రంలో అధికారం నిలుపుకునే వ్యూహంలో భాగంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో చెలిమి  కోరుకుంటుటున్నారు? ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కాంగ్రెస్ పార్టీని పొగుడుతూ చేసిన ప్రసంగం,  అలాగే, అంతకు ముందు విలేకరుల సమవేశంలో  కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కితాబునిస్తూ చేసిన వాఖ్యాలను గమనిస్తే  కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో చెలిమి కోరుకుంటున్నారనే అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. నిజమే...  రాజకీయాలలో తాత్కాలిక ప్రయోజనాలే కానీ, శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఇప్పుడు తెలంగాణలో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నిన్న మొన్నటిదాకా అనధికార మిత్ర పక్షాలుగా చెలామణి అయ్యాయి. మోడీ ప్రభుత్వం తెచ్చిన వివాదస్పద వ్యవసాయ చట్టాలు మొదలు పెద్ద నోట్ల రద్దు చట్టం వరకు,  కాంగ్రెస్ సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ  వ్యతిరేకించిన అనేక చట్టాలకు  బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. మోడీకి జై కొట్టింది. పెద్దల సభలో  స్నేహ ధర్మాన్ని చక్కగా పోషించింది.  సరే ఆ తర్వాత ఇద్దరి మధ్య సంబంధాలు చెడిన తర్వాత అవే వ్యవసాయ చట్టాలను బీఆర్ఎస్ వ్యతిరేకించింది. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళన చేసింది. అది వేరే విషయం.  అదలా ఉంటే, ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత వరకు గులాబి పార్టీ ముఖ్య నాయకులు చేస్తున్న ప్రకటనలు గమనిస్తే  బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.   రాష్ట్రంలో రాజకీయ అవసరాలతో పాటుగా, జాతీయ స్థాయిలో కేంద్ర  దర్యాప్తు సంస్థల దాడి నుంచి రక్షణ పొందేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని కూటమికి దగ్గరయ్యే ప్రయత్నాలకు బీఆర్ఎస్ నాయకత్వం సుముఖంగా ఉందనే సంకేతాలు స్పష్ట మవుతున్నాయని అంటున్నారు.  కాగా తాజగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ, అరెస్ట్ కు సిద్దమవుతున్న ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత   గురువారం(మార్చి 9) ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన వాఖ్యలు బీఆర్ఎస్ కాంగ్రెస్ తో చెలిమి కోరుకుంటున్న సంకేతాలను మరింత స్పష్టం చేశాయని అంటున్నారు.  ఈ సందర్భంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ జంతర్‌ మంతర్‌లో నిర్వహించదలచిన దీక్షకు సోనియా గాంధీని ఆహ్వానించారా అన్న విలేకరుల ప్రశ్నకు కవిత..  సోనియా గాంధీ చాలా పెద్ద నాయకురాలు.. నేను చాలా చిన్న నాయకురాలిని.  అంతే కాదు,   సోనియా మెడలో ఒక మెచ్చుకోలు హారం కూడా వేశారు. 2010లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఎ సంకీర్ణ ప్రభుత్వం రాజ్యసభలో మహిళా బిల్లు పెట్టడంలో సోనియా కీలక పాత్ర పోషించారని,  ఆమె ధైర్యానికి దేశ మహిళల తరఫున ‘సెల్యూట్‌ ’ చేస్తున్నానని కవిత వ్యాఖ్యానించారు. అలాగే,  బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీ-టీమ్‌ అని కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణల్పి స్పందిస్తూ, ప్రస్తుతం దేశంలో ఒక పెద్ద ప్రాంతీయ పార్టీగా మాత్రమే మిగిలిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలతో కలవాలని సూచించారు. సరే ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ పార్టీ భ్రమల్లోంచి బయటకు రావాలని అంటూ ఒకటి రెండు చిన్న చిన్న చురకలు కూడా అంటించినా,  మొత్తంగా చూస్తే,  బీఆర్ఎస్ నాయకత్వం హస్తంతో దోస్తీనే కోరుకుంటోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  అయితే  కొసమెరుపు ఏమంటే, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో తలపెట్టిన దీక్షకు కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులు హాజరయ్యే అవకాశాలు లేవని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ తెలిపారు. దీక్షకు ప్రతినిధులను పంపాలంటూ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను ఆహ్వానించినట్లు కవిత ప్రకటించినా..  ఉద్దేశపూర్వకంగానే ఈ దీక్షకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ నిర్ణయించిందని  ఆయన తెలిపారు.  ఒక పార్టీ ఎమ్మెల్సీ చేసే దీక్షకు తాము వెళితే తప్పుడు సంకేతాలు వెళతాయని ఆయన పేర్కొన్నారు.  జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే..  కాలం కలిసి రానప్పుడు తాడే పామై కాటేస్తుందన్న సామెత  ప్రస్తుతం బీఆర్ఎస్ ఉన్న పరిస్థితికి అద్దం పట్టినట్లుగా సరిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

అమరావతికి రైల్ కనెక్టివిటీ దేనికి సంకేతం?

అమరావతి.. ఆంధ్రుల కలల రాజధాని. 2015లో అమరావతి నగర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఏపీ రాజధానిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 217 చ.కి.మీ.ల విస్తీర్ణంలో అన్ని హంగులతో అభివృద్ధి చేయడానికి విజన్ తయారు చేశారు. రైతులను ఒప్పించి 30 వేల ఎకరాలకు పైగా భూ సమీకరణ చేశారు.  అమరావతిలో రూ.40 వేల కోట్లకుపైగా అంచనాలతో టెండర్లు పిలిచారు. దాదాపు రూ.10వేల కోట్లు ఖర్చుపెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం రూపొందించిన అమరావతి నగర డిజైన్లు ఆహా అనిపించాయి.  దేశంలోని ఏ మహానగరానికీ తీసిపోని విధంగా ప్రజారాజధాని అమరావతి వస్తుందని రాష్ట్ర ప్రజలు భావించారు. తమ కలల రాజధాని కల సాకారం అవుతున్న దన్న ఆనందం రాష్ట్ర ప్రజలలో వ్యక్తమైంది. అయితే ఎప్పుడైతే 2019 ఎన్నికల అనంతరం జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిందో.. అప్పటి నుంచి అమరావతి ప్రభ మసకబారింది. అప్పటి వరకూ  కళకళలాడిన అమరావతి బోసిపోయింది. జగన్ సర్కార్ అక్కడ  కొనసాగుతున్న నిర్మాణాలను ఆపేసింది.  జగన్ సర్కార్ తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి రాజధాని నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. భూ సమీకరణ, రూ.10 వేల కోట్లతో చేసిన పనులు.. వేలమంది శ్రామికుల నిరంతర శ్రమ.. నిష్ఫలంగా మిగిలిపోయాయి.   రోడ్ల పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో.. అవి  పూర్తిగా పాడైపోయాయి. రోడ్లను తవ్వి కంకర కూడా దోచుకెళ్లారు దుండగులు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుందా అన్న పరిస్థితి కనిపిస్తోంది. జగన్ సర్కార్ విశాఖ రాజధాని అంటూ అమరావతికి కనెక్టివిటీకి ప్రతిపాదించిన  రైల్వే ప్రాజెక్టులను పట్టించుకో కపోయినా.. ఇప్పుడు రైల్వే శాఖ  ఆ ప్రాజెక్టులను సొంతంగానే చేపట్టాలని నిర్ణయించింది.   అమరావతి నూతన రైల్వే లైన్‌ ప్రాజెక్టును   తెరపైకి తెచ్చింది. విజయవాడ బైపాస్‌ రైల్వేలైన్‌ కింద దీన్ని రైల్వే శాఖ నిర్మించనుంది. తెలుగుదేశం హయాంలో కేంద్ర బడ్జెట్‌లో అమరావతి నూతన రైలు మార్గం సర్వేకు బడ్జెట్‌ కేటాయించారు. సర్వే ప్రక్రియను కూడా పూర్తిచేశారు.  విజయవాడ -గుంటూరులను అమరావతి మీదుగా అనుసంధానంగా చేసేందుకు రూ.2800 కోట్ల అంచనా వ్యయంతో నూతన రైలు మార్గాన్ని ప్రతిపాదించారు.  2017-18 బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. అయితే అదంతా జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత మూలన పడిపోయింది.  ఇప్పుడు ఏమైందో ఏమో కానీ అమరావతికి  కనెక్టివిటీని పెంచేందుకు రైల్వే శాఖ నడుంబిగించింది. అమరావతి విషయంలో కేంద్రం ఇటీవల పార్లమెంటులో, కోర్టుకు ఇచ్చిన నివేదికలో  అమరావతికి అనుకూలంగా కేంద్ర స్పందించడం, ఇప్పుడు రైల్వే శాఖ అమరావతి కనెక్టివిటీ విషయంలో అడుగు ముందుకు వేయడంతో రాష్ట్ర ప్రజలలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ఇప్పటికీ జగన్ అమరావతి కాదు అనే అంటున్నారు. ఇటీవల విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ వేదికగా త్వరలో తాను విశాఖ నుంచి పాలన సాగించబోతున్నట్లుగా విస్పష్టంగా ప్రకటించారు. ఒక వైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉండగా జగన్ ఇలా ప్రకటించడంలోని ఔచిత్యమేమిటన్న ప్రశ్న, మరో వైపు జగన్ ఇలా ప్రకటించడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందన్న వాదన ఉన్నాయి. అయినా వాటిని వేటినీ ఇసుమంతైనా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి, మంత్రులు విశాఖ రాజధాని అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనూ ఇటీవల పార్లమెంటు వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఏపీ రాజధాని అమరావతేనని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారమే ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించడం జరిగిందనీ, దానిని మార్చాలంటే మళ్లీ పార్లమెంటులో చట్టం చేయాల్సిందేనన్న క్లారిటీ ఇచ్చారు. దీంతో జగన్ చెబుతున్నట్లుగా మూడు రాజధానులు, అమరావతి నుంచే పాలన సాధ్యమయ్యే అవకాశాలు లేవు. కేంద్రం ఇదే విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకువెళ్లింది. ఈ నేపథ్యంలోనే అమరావతికి రైల్వే కనెక్టివిటీ విషయంలో రైల్వే శాఖ ఒక అడుగు ముందుకు వేయడం శుభపరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఫైర్ సర్వీసెస్ డీజీగా ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ డాక్టర్ సునీల్ కుమార్ లాంగ్ లీవ్ నుంచి తిరిగి  వచ్చారు.  ఆయనను ఏపీ సీఐడీ చీఫ్ గా బదలీ చేసే సమయంలో ఆయనను ఏపీ డీజీపీగా నియమించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. ఏమో జరగవచ్చేమో అని కూడా అంతా అనుకున్నారు. ఎందుకంటే సీఐడీ చీఫ్ గా  ఆయన తీరు జగన్ పాలన అంత వివాదాస్పదంగానే ఉంది. ప్రభుత్వ వ్యతిరేక భావన ఉందన్న అనుమానం కలిగితే చాలు సీఐడీ వాలిపోయి.. కేసులు, అరెస్టులూ అంటూ హడావుడి చేసేది.  విపక్ష నేతలపై ఇష్టారీతిగా కేసులు బనాయించి, అరెస్టులతో వేధించి విమర్శలు ఎదుర్కొన్న చరిత్ర సీఐడీ మాజీ చీఫ్ డాక్టర్ సునీల్ కుమార్ ది. అటువంటి సునీల్ కుమార్ ను ఏపీ సర్కార్ అకస్మాత్తుగా బదలీ చేసింది. వెంటనే ఆయనకు మరో పోస్టింగ్ ఇవ్వలేదు.  బదలీ చేయడానికి కొద్ది ముందే ఆయనకు డీజీగా పదోన్నతి కూడా కల్పించింది.  అలా   డీజీ హోదాలో ఉన్న సునీల్ కుమార్ కు  మరో పోస్టింగ్‌ కూడా ఇవ్వకుండా  జీఏడీలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశించింది. సునీల్ కుమార్ స్థానంలో  ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సంజయ్ కుమార్  ఏపీ సీఐడీ  చీఫ్ గా నియమించింది.  జగన్ సర్కార్ ఏర్పడినప్పటి నుండి సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ ను ఇప్పుడు ఆయన లాంగ్ లీవ్ నుంచి వచ్చిన తరువాత ఫైర్ సర్వీసెస్ డీజీగా అత్యంత అప్రాధాన్యమైన పోస్టులో నియమించింది. వాస్తవానికి ఏపీలో జగన్ సర్కార్ కొలువుదీరినప్పటి నుంచీ ఇటీవల అకస్మాత్తుగా బదలీ అయ్యే వరకూ సునీల్ కుమారే ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ గా ఉన్నారు. జగన్ మనసెరిగి ప్రవర్తిస్తున్నారన్న కితాబులు(?) అందుకున్నారు.  ఆయన హయాంలో ఏపీ సీఐడీ ఒక  ప్రైవేటు సైన్యంలా, విపక్ష నేతలను వేధించడం కోసమే  ఉందా అన్నట్లుగా వ్యవహరించిందన్న ఆరోపణలను ఎదుర్కొంది.  రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టడమే ఏపీ సీఐడి పనిగా పెట్టుకుందని, అందుకోసమే  పని చేస్తున్నదన్న ఆరోపణలూ వెల్లువెత్తాయి. స్వయంగా సీఐడీ చీఫ్   సునీల్ కుమార్ పై కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి.  అయినా ఆయన పని తీరును మెచ్చి జగన్ సర్కార్ సునీల్ కుమార్ కు డీజీగా పదోన్నతి ఇచ్చింది. అలా పదోన్నతి ఇచ్చి  నిండా నెలరోజులు అయ్యిందో లేదో అదే జగన్ సర్కార్ ఆయనపై   బదలీ వేటు వేసింది. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. అంతే కాదు డీజీ స్థాయిలో ఉన్న ఆయనకు  పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టు, మ్యాన్ హ్యాండలింగ్,  ఐటీడీపీ చీఫ్ చింతకాయల విజయ్ నివాసంపై సీఐడీ పోలీసుల దాడి వంటి ఘటనలన్నీ ఈయన హయాంలోనే జరిగాయి. జర్నలిస్టు అంకబాబును అర్ధరాత్రి అరెస్టు చేయడం కూడా సీఐడీ చీఫ్ గా సునీల్ కుమార్ ఉన్న సమయంలోనే జరిగింది.  ఏపీ సీఐడీ చీఫ్ గా సునీల్ ఉన్న కాలంలో ఆ దర్యాప్తు సంస్థ డీల్ చేసిన కేసులన్నీ వివాదాస్పదమైనవే. విపక్ష నేతలనే కాదు.. సామాన్యులను  సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న నెపంతో వేధించారన్న ఆరోపణలు సైతం ఆయనపై ఉన్నాయి. అయితే సునీల్ కుమార్ కు ప్రభుత్వం నుంచి పూర్తిగా దన్ను, ప్రోత్సాహం ఉండటంతోనే అలా వ్యవహరించారని అప్పట్లో పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు. అలాంటి సునీల్ కుమార్ కు హఠాత్తుగా ఏపీ సీఐడీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పించి ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా  జీఏడీలో రిపోర్టు చేయమనడం వెనుక ఏం జరిగి ఉంటుందా అన్న అనుమానాలు వెల్లువెత్తాయి.  అయితే ఆయనను ఏపీ డీజీపీగా నియమించేందుకే సీఐడీ చీఫ్ పోస్టు నుంచి తప్పించారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది.  అటువంటిది   ఆయన హఠాత్తుగా లాంగ్ లీవ్ పెట్టడం, ఆయన లాంగ్ లీవ్ లో ఉన్న సమయంలోనే.. గతంలో ఆయనపై   హై కోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ  చేసిన ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర హోంశాఖ ఆయనపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ డీజీపీ  రాజేంద్రనాథ్ రెడ్డి,  సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది. అదలా ఉంటే ఇప్పుడు ఏపీ సీఐడీ మాజీ చీఫ్ లాంగ్ లీవ్ నుంచి తిరిగి వచ్చారు. ఇంత కాలం విదేశాలలో ఉన్న ఆయన స్వరాష్ట్రానికి తిరిగి రాగానే జగన్ సర్కార్ ఆయనను అప్రాధాన్య శాఖలో అత్యున్నత హోదాలో నియమించింది.   తద్వారా ఆయన సీఐడీ చీఫ్ గా ఉన్న సమయంలో ఏర్పడిన వివాదాలతోనూ, విపక్షాలపై అక్రమ కేసుల వ్యవహారంలోనే ప్రభుత్వానికి ప్రమేయం లేదని చెప్పుకుంటోంది.  మరో వైపు సునీల్ కుమార్ పై  చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు ఎటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో  సునీల్ కుమార్ ను ప్రభుత్వం సమర్ధించే అవకాశాలు దాదాపు మృగ్యమనే పరిశీలకులు అంటున్నారు.  

వారాహిలో బందరు కు జనసేనాని

జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఈ నెల 14న మచిలీపట్నం వేదికగా జరగనుంది. ఇందుకు సన్నాహాలు, ఏర్పాట్లూ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. బందర్ సభను జనసేన అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గత ఏడాది   గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఆ పార్టీ ఆవిర్భావ సభ కు స్థలం ఇవ్వడమే నేరంగా భావించిన అధికార పార్టీ ఇప్పటంలో జనసేన సభకు ఇచ్చిన వారి గృహాలను రోడ్డు విస్తరణ  పేరుతో కూల్చేవేతలకు పాల్పడటం,   జనసేనానికి సామాజిక వర్గానికే చెందిన మాజీ మంత్రి పేర్ని నాని వ్యూహం ప్రకారం జనసేనానిపై విమర్శలు గుప్పించడం తో జనసేనాని ఈ సారి పార్టీ ఆవిర్భావ సభ ను బందర్ వేదికగా నిర్వహించి అన్ని విమర్శలకూ దీటుగా బదులివ్వాలని నిర్ణయానికి వచ్చారు.   అయితే  సభా వేదికపై  నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతారు.. ఎవరిని టార్గెట్ చేస్తారన్న చర్చ మీడియాలో విస్తృతంగా సాగుతోంది.  ఈ నెల 14న బందర్ వేదికగా జరగనున్న జనసేన ఆవిర్భావ సభలో అధికార పార్టీ నేతలు, ముఖ్యంగా పేర్నినాని తదితరుల విమర్శలకు దీటుగా బదులివ్వడమే కాకుండా.. వచ్చే ఎన్నికలలో పొత్తు విషయంలో కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక క్లారిటీ ఇస్తారని పరిశీలకులు అంటున్నారు.   సరైన సమయంలో సరైన వేదిక మీద నుంచి  తన మాటల తూటాలను ప్రత్యర్థులపై గురి చూసి  వదలడంలో పవన్ కల్యాణ్ ముందుంటారని ఆయన అభిమానులకే కాదు, రాజకీయ ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారు. ఈ నాలుగేళ్ల కాలంలో జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలోనూ వెనుకబడిందన్న భావన సర్వత్రా  నెలకొని ఉంది. ఇప్పటికే పలు వేదికల మీదనుంచి జనసేనాని కూడా ఇదే విషయాన్ని విస్పష్టంగా చెప్పారు. మరో సారి జగన్ ను అధికారంలోకి రానివ్వను, అందు కోసం విపక్ష ఓట్లు చీలకుండా చూస్తాను అని పవన్ కల్యాణ్ గతంలోనే చెప్పారు. అప్పటి  నుంచి ఆయన అడుగులు ఓట్లు చీలకుండా చూడటం దిశగానే సాగాయి. ఈ నేపథ్యంలోనే వచ్చేఅసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకుంటాయన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. పరిశీలకుల విశ్లేషణల ప్రకారంఇప్పటికే క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం, జనసేన శ్రేణులకు కలిసే పని చేస్తున్నాయి. పొత్త వార్తలను ఇటు జనసేన కానీ, అటు తెలుగుదేశం కానీ ఖండించ లేదు.   ఇక బందర్ వేదికగా జరగనున్న జనసేన ఆవిర్భావ సభ కోసం పవన్ షెడ్యూల్ కూడా ఖరారైంది.  ఆ షెడ్యూల్ ప్రకారం పవన్ కల్యాన్ ఈ నెల 11న మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగే బీసీ సదస్సులో పాల్గొంటారు. అనంతరం 12వతేదీన కాపు ఉద్యమ నేత హరిరామజోగయ్య, అలాగే ఆ సమాజిక వర్గానికి చెందిన ఇతర నేతలతో భేటీ అవుతారు. ఆ మరుసటి రోజు అంటే జనవరి 13న పవన్ కల్యాణ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్  నజీర్ తో భేటీ అవుతారు. ఇక బందర్ లో జరిగే జనసేన ఆవిర్భావ సభకు జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి వాహనంలో రానున్నారు.  అవసరం ఉన్నా లేకున్నా సందర్భం ఉన్నా లేకున్నా మీడియా సమావేశం పెట్టి మరీ  పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించే మాజీ మంత్రి పేర్ని నాని ఇలాకాలో జనసేన సభ జరుగుతుండడం, అలాగే పవన్ వారాహి వాహనంతో మచిలీపట్నంలో ప్రవేశించనుండడం తో జనసేన ఆవిర్భావ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

తెరపైకి మళ్ళీ ముందస్తు ముచ్చట!

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాలలో రాటు తేలిన నాయకుడు. సందేహం లేదు. రాజకీయ వ్యూహ రచనలో ఆయనకు ఆయనే సాటి, సమకాలీన రాజకీయ నాయకుల్లో  ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఆయనకు సమ ఉజ్జీగా నిలిచే నాయకుడు రాష్ట్ర నేతలలో మరొకరు లేరు.  నిజానికి  కేసీఆర్ విజయ రహస్యం కూడా అదే. ఆయన రాజీయ చాణిక్యమే ఆయన విజయ రహస్యం. ప్రత్యర్ధులను చిత్తు చేసే ఎత్తుగడలే ఆయన ప్రధాన రాజకీయ అస్త్రాలు అంటారు రాజకీయ విశ్లేషకులు.  కేసీఆర్ గత కొంత కాలంగా చాలా మౌనంగా ఉంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్  మార్కు సందడి కనిపించడం లేదు. ఆయన ఎక్కడా వినిపించడం లేదు. కనిపించడం లేదు. అయితే, ఒక పక్షం రోజుల క్రితం కావచ్చును, ఆయన వరసగా మూడు నాలుగు రోజులు, బీఆర్ఎస్  ముఖ్యనేతలు, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సీరియస్ గా చర్చలు జరుపుతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే, ఆ చర్చలు ఎందుకు జరుపుతున్నారు? ఏమిటి చర్చిస్తున్నారు? అనేది ఎవరికీ తెలియక పోయినా, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ముఖ్యమంత్రి మళ్ళీ మరోమారు ముందస్తు ఎన్నికలపై దృష్టిని కేద్రీకరించినట్లు తెలుస్తోందని కథనాలు వెలువడ్డాయి. అందులో భాగంగానే అభ్యర్ధుల ఎంపిక కసరత్తు చేస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. నిజానిజాలు ఎలా ఉన్నా ఆ తర్వాతనే,  అంతకు ముందు చెప్పినట్లుగా సిట్టింగులు అందరికీ మళ్ళీ టికెట్  రాక పోవచ్చని , కొందరికి మొండి చేయి తప్పదనే ప్రచారం జరిగింది.  అదలా ఉంటే ఇప్పుడు మళ్ళీ ముందస్తు  ఊహాగానాలు తెరపైకొచ్చాయి.  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో  ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లు జారీ చేయడం, ఆమె అరెస్ట్ తప్పదనే సంకేతాలు వస్తున్న నేపధ్యంలో విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహంతో ముఖ్యమంత్రి కేసేఅర్ మళ్ళీ ముందస్తు ఎన్నికల చర్చను తెరపైకి తెచ్చారు. నిజానికి  2018లో ఆరు నెలలు ముందు ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండవసారి అధికారంలోకి వచ్చిన నేపధ్యంలో సెంటిమెంట్స్  కు పెద్దపీట వేసే కేసీఆర్, మూడవసారి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు.. మళ్ళీ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ఊహాగానాలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హుజురాబాద్ ఓటమి తర్వాత ముఖ్యమంత్రి ముందస్తు ఆలోచనలు చేస్తున్నారనే కధనాలు   వస్తూనే ఉన్నాయి.  బీఆర్ఎస్ కీలక విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించిన ప్రతిసారి ఈ తరహా ఊహాగానాలను వినవస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో తొలి భారీ బహిరంగ సభగా పేర్కొన్న ‘ఖమ్మం సభ’ ముందూ వెనకా కొంత కాలం ఇదే ప్రచారం నడిచింది.  తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ఈడీ విచారణ , అరెస్ట్ ఊహాగానాల మధ్య మరోసారి ఆ చర్చ తెరపైకి వచ్చింది. సీఎం కేసీఆర్  గురువారం(మార్చి9)   క్యాబినెట్ భేటీ నిర్వహించడం, మరుసటి  రోజు శుక్రవారం(మార్చి10) బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశానికి పిలుపునివ్వడంతో మరో మారు ముందస్తు ఊహాగానాలు జోరుగా షికారు చేస్తున్నాయి. కవితను అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయని, అందుకే ముఖ్యమంత్రి ముందస్తు చర్చను మరో మారు తెరపైకి తెచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇక్కడితో ఆగకుండా కాళేశ్వరం అవినీతి ఆరోపణల నిగ్గు తేల్చేందుకు కాగ్ ను రంగలోకి దించినట్లు తెలుస్తున్న నేపధ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి, హ్యాట్రిక్ సాదించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.  అయితే  ఏదైనా  అంతిమ నిర్ణయం ఇప్పటిప్పుడు రాదని  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టయితే  ఆ తర్వాత  ప్రజల్లో ముఖ్య్మగా మహిళలలో ఏ మేరకు సానుభూతి వస్తుందనేది అంచనా వేసుకుని ఆ తర్వాతనే ముఖ్యమంత్రి కేసీఆర్ అంతిమ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.   అదలా ఉంటే.. శనివారం(మార్చి 11) కవిత ఈడీ ఎదుట విచారణకు హాజరవుతున్నారు. అయితే ఈవిచారణ ఎన్ని రోజులు జరుగుతుంది .. అంతిమ నిర్ణయం ఎప్పుడు వస్తుంది  అనేది ఎవరి ఊహకు అందని విషయం. సో .. ముందస్తు వ్యూహాగానాలు ఎంతవరకు నిజమవుతాయి .. అనేది ఈడీ నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. మరోవైపు కవిత అరెస్టయితే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక ఉద్యమాన్ని తీసుకురావాలని బీఆర్ఎస్ భావిస్తోందనే ప్రచారమూ ఉంది. మరి ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయనేది వేచిచూడాల్సిందే.

పోటాపోటీ దీక్షలు.. అక్కడ కవిత.. ఇక్కడ కమలం!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ఢిల్లీలో కంటే తెలంగాణలోనే ఎక్కువగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న  ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది  అయన రాజీనామా చేశారు. ఆయనతో పాటుగా మరో అవినీతి కేసులో అరెస్టయిన మరో మంత్రి సత్యేంద్ర జైన్ కూడా రాజీనామా చేశారు. ఆ ఇద్దరి స్థానంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు సౌరభ్‌ భరద్వాజ్‌, అతిషీ  సీఎం కేజ్రీవాల్‌  కేబినెట్‌లో కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.  ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా వీరిద్దరితో  సీఎం కేజ్రీవాల్‌ సమక్షంలో ప్రమాణస్వీకారం చేయించారు. సిసోడియా నిర్వహించిన విద్యాశాఖతో పాటు  పబ్లిక్‌ వర్క్స్‌ విద్యుత్‌, పర్యాటక శాఖలను అతిషీ చూడనున్నారు. అలాగే, గతంలో జైన్‌ చూసిన వైద్య ఆరోగ్య శాఖతో పాటు పట్టణాభివృద్ధి, జలవనరులు, పరిశ్రమల శాఖలను ఇక నుంచి భరద్వాజ్‌ నిర్వహించనున్నారు.  అంటే,ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ప్రకంపనలు ఢిల్లీలో  పెద్దగా కనిపించడం లేదు. ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ కేసులు, ఆరోపణలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  చట్టం తనపని తాను చేసుకుపోతుందనే విధంగా  నింపాదిగా, తమ పని తాము చేసుకుంటున్నారు. ఒక విధంగా కేజ్రీవాల్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు అని చెప్పవచ్చు. ఇప్పట్లో ఎన్నికలు లేక పోవడం ఒకటైతే, స్కామ్  లో చిక్కున్న మాజీ మంత్రి సిసోడియా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుడు కాకపోవడం వలన మద్యం మరక గురించి ఆయన అంత పెద్దగా పట్టించుకున్నట్లు లేదని అంటున్నారు.    కానీ, తెలంగాణలో మాత్రం రాజకీయం మొత్తం ఢిల్లీ మద్యం కేసు, అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పాత్ర చుట్టూనే తిరుగుతోంది.  మరో వంక శనివారం(మార్చి10) అధికార బీఆర్ఎస్ విస్త్రుత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే విషయంలో ఉత్కంఠ చోటు చేసుకుంది.  ఆలాగే  బీఆరేస్ ఎమ్మెల్సీ కవిత,  ఢిల్లీలో నిర్వహించనున్న దీక్షకు పోటీగా హైదరాబాద్‌లో దీక్ష చేపట్టేందుకు బీజేపీ  సిద్ధమైంది. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపడుతుండగా.. ఆమెకు దీటుగా హైదరాబాద్‌లో బీజేపీ మహిళా మోర్చా నేతలు రాష్ట్రంలోని బెల్టు షాపులు, మహిళలపై హత్యలు, అత్యాచారాలను నిరసిస్తూ దీక్ష చేయనున్నారు. ఈ దీక్షలో బీజేపీ  జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు పలువురు సీనియర్‌ నేతలు పాల్గొననున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. వీధుల కెక్కాయి.