ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం.. మూడు రాజధానుల ముచ్చటే లేదు!

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో  మూడు రాజథానుల అంశం ప్రస్తావనే లేకపోవడంపై అందరిలోనూ ఆశ్చర్యం వ్యక్తమౌతోంది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నా ముఖ్యమంత్రి జగన్ కానీ, ఆయన కేబినెట్ సహచరులు కానీ ఖాతరు చేయకుండా అవకాశం ఉన్నా లేకున్నా.. సందర్భం వచ్చినా రాకున్నా అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులు మా విధానం అంటూ ప్రకటనలు గుప్పిస్తూనే ఉన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ సైతం తాను త్వరలో విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తానంటూ గ్లోబల్ సమ్మిట్ కు ముందూ, సమ్మిట్ వేదికగానూ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగంలో కచ్చితంగా మూడు రాజధానుల ప్రస్తావన ఉంటుందని అంతా భావించారు. జగన్ సర్కార్ కోర్టు ధిక్కరణ అన్న అంశాన్ని ఇసుమంతైనా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరు కారణంగానే గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన జొప్పిస్తారని పరిశీలకులు సైతం అంచనా వేశారు. అయితే ఆశ్చర్యకరంగా గవర్నర్ ప్రసంగంలో ఆ ప్రస్తావనకు చోటు లేకుండా పోయింది. గవర్నర్ కు ఇచ్చే ప్రసంగ పాఠంలో ఆ అంశాన్ని జొప్పించే ధైర్యం జగన్ సర్కార్ చేయకపోవడానికి ఆయన సుదీర్ఘ కాలం సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేయడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక వేళ ఆ అంశాన్ని  జొప్పించినా గవర్నర్ అది చదవడానికి నిరాకరించి ఉండేవారన్న భావనతోనే జగన్ సర్కార్ వెనక్కు తగ్గిందని పరిశీలకులు చెబుతున్నారు. ఆ ఒక్క అంశం వినా గవర్నర్ ప్రసంగం మొత్తం జగన్ పాలనను ఆకాశానికి ఎత్తేస్తూనే కొనసాగింది. ఏపీ సర్కార్ పారదర్శక పాలన అందిస్తోందని అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.   పేదల సంక్షేమమే లక్ష్యంగా   పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అవినీతి రహితంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నట్ల చెప్పారు. అర్హులైన లబ్ధిదారుల ఖాతాలలో పథకాల సొమ్ములు క్రమం తప్పకుండా జమ చేస్తున్నట్లు తెలిపారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో తన సర్కార్ సుపరిపాలన అందిస్తోందన్నారు. అర్థిక రంగంలో ఏపీ పురోగమిస్తోందనీ, వ్యవసాయం, పారిశ్రామిక రంగం సహా అన్ని రంగాలూ అభివృద్ధి పథంలో నడుస్తున్నాయనీ గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. . కాగా గవర్నర్ ప్రసంగంలో వృద్ధి రేటు ప్రస్తావన రాగానే తెలుగుదేశం సభ్యులు అభ్యంతరం తెలిపారు. గవర్నర్ ప్రసంగంలో గణాంకాలన్నీ కల్పితాలేనని విమర్శించారు. గవర్నర్ నోట జగన్ సర్కార్ అబద్ధాలు పలికిస్తోందంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం ముగియగానే సభ వాయిదా పడింది. అనంతరం జరిగిన బీఏసీ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను 9 రోజులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 16న సభలో విత్త మంత్రి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. 

ముందస్తు లేదంటూనే.. ఎన్నికల మూడ్ లోకి బీఆర్ఎస్!

రాజకీయ నాయకుల వ్యూహాలు చిత్రంగా ఉంటాయి. నోటితో ఒకటి చెబితే.. చేతలలో మరోటి చేస్తుంటారు. నోటితో ఔనన్నదానినే నొసటితో కాదంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటువంటి వ్యూహాలు, ఎత్తులలో సిద్ధహస్తడని రాజకీయ వర్గాలలో ఒక టాక్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ఇటీవలబీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశాలలో ముందస్తు ఎన్నికల ప్రశక్తే లేదని విస్పష్టంగా ప్రకటించారు. ఆ వెంటనే పార్టీని మాత్రం ఎన్నికలకు సమాయత్తం చేయడం ప్రారంభించేశారు. రాష్ట్రంలో మరో సారి అధికారమే లక్ష్యంగా పార్టీని  ఎన్నికల మూడ్ లోకి తీసుకు వెళ్లి  పోయారు. ఎన్నికల వ్యూహరచనలో భాగంగా కేసీఆర్ పలు కార్యక్రమాలను ప్రకటించారు. ఆత్మీయ సమ్మేళనాలు, నియోజకవర్గాలకు ప్రత్యేక ఇన్చార్జీల నిమామకాలతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే కార్యక్రమాలను మొదలెట్టేశారు. షెడ్యూల్ ప్రకారమైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరేడు నెలల సమయం ఉంది. ఇదేం పెద్ద ఎక్కువ సమయం కాదు. సాధారణంగా రాజకీయ పార్టీలన్నీఈ సమయం వచ్చే సరికే ఎన్నికల మూడ్ లోకి వెళ్లి పోతాయి. కానీ కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ కంటే రెండు మూడునెలల ముందే వస్తాయా అన్నట్లుగా తన ఎన్నికల సన్నాహకాల వేగాన్ని పెంచేశాయి. గతంలో ఒక సారి సిట్టింగులందరికీ సీట్లు అని ప్రకటించేసి తరువాత తీరిగ్గా నాలుక కరుచుకున్న కేసీఆర్.. తూచ్ అందరికీ కాదు.. గెలుపు గుర్రాలకే అని సవరించుకున్నసంగతి తెలిసిందే. తాజాగా మరోసారి సిట్టింగులకే సీట్లు అంటూ ప్రకటించారు. అదే సమయంలో 99 శాతం మంది సిట్టింగులకు మాత్రమే అని చెప్పారు. ఇది సిట్టింగులలోనే కాకుండా, ఆశావహుల్లో కూడా జోష్ నింపుతుంది. ఇక ఆత్మీయ సమ్మేళనాలకు షెడ్యూల్ ప్రకటించడంతో క్యాడర్ కు విరామం లేని కార్యక్రమాలు ఉంటాయి. జనంలోకి వెళ్లడమే ప్రజాప్రతినిథుల నిత్యకృత్యంగా మారిపోతుంది. ఈ పరిస్థితి ఇటీవలి పరిణామాలతో ఒకింత నైరాశ్యంలోకి వెళ్లిన శ్రేణులను వెంటనే యాక్టివ్ అవ్వడానికి ఆత్మీయ సమ్మేళనాలు దోహదం చేస్తాయనడంలో సందేహం లేదు. మరోవైపు ప్రభుత్వ పథకాలైన దళిత బంధు, గొర్ల పంపిణీ, సొంతింటి జాగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాల అమలుకూ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. విరామం లేని కార్యక్రమాలతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా లీడర్లు, క్యాడర్ కు చేతి నిండా పని కల్పించాలన్నది ఆయన ఉద్దేశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    

విద్యార్థుల ఆత్మహత్యలన్నీ.. వ్యవస్థ చేస్తున్న హత్యలే!

చదువు పేరుతో కళాశాల యాజమాన్యం పెట్టే ఒత్తిడి భరించలేక, తక్కువ మార్కులు వస్తే తోటి విద్యార్థుల ముందు చేసే అవమానం భరించ లేక తరగతి గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడో ఇంటర్ విద్యార్థి.  సరిగా చదవలేకపోతున్నానన్న బాధతో, మార్కులు తక్కువ వస్తాయన్న భయంతో, పరీక్ష తప్పుతానేమోనన్నఅనుమానంతో ఒక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అంతకంటే ముందు సీనియర్ల వేధింపులు భరించ లేక మోడికో ప్రీతి తనువు చాలించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో సంఘటనలు. ప్రతి రోజూ ఆత్మహత్యల వార్తలు మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి.  దేశంలో ఆత్మహత్యల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా విద్యార్థులు, అందులోనూ టీనేజీ పిల్లల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.  నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో గణాంకాల ప్రకారం, దేశంలో చోటు చేసుకుంటున్న ప్రమాద మరణాలు, ఆత్మహత్యల్లో ఎనిమిది శాతానికిపైగా విద్యార్థులే కావడం విషాదం.  అయితే విద్యార్థుల బలవన్మరణాలన్నీ వ్యవస్థ చేసిన హత్యలుగానే భావించాల్సి ఉంటుంది. స్వేచ్ఛగా, స్వచ్ఛంగా జరగాల్సిన విద్యాబోధన.. మార్కులు, ర్యాంకుల వేటగా మార్చేసి..పిల్లలను వాటి వెంట పరుగులెత్తిస్తుండటమే వారిలో ఆత్మవిశ్వాసం లోపించడానికి కారణంగా చెప్పాలి. ఇష్టాయిష్టాలు, శక్తి సామర్ధ్యాలను పరిగణనలోకి  తీసుకోకుండా ర్యాంకులు, మార్కులే జీవితం అంటూ అగమ్య పోటీతత్వాన్ని పెంచేసే విధానమే పిల్లలలో ఆత్మహత్యలు పెరగడానికి కారణమని మానసిక నిపుణులు చెబుతున్నారు. అసలు విద్యా సంస్థల్లో సంస్కరణల కోసం  ప్రభుత్వాలు తీసుకువచ్చిన చట్టాలు ఏ మేరకు అమలవుతున్నాయి? అసలు అమలు అవుతున్నాయా?  అన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తమౌతున్నాయి.  ఈ పరిస్థితికి   విద్యాసంస్థలు, అధ్యాపకులు, నిబంధనల రూపకర్తలు,  సమాజం కూడా కారణమనే చెప్పాల్సి ఉంటుంది.  విద్యను, విద్యాబోధనను సంస్కరించాలి. ఈ సంస్కరణల్లో   తల్లితండ్రులు, అధ్యాపకులు, అధికారులు భాగస్వాములు కావాలి.  ప్రధానంగా  విద్యా బోధనను, విద్యా సంస్థలను  వాణిజ్యమయం కాపాడాలి. అలాగే విద్యార్థుల మధ్య కుల, మత, లింగ  వివక్ష లేకుండా చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో ఇప్పటికీ ప్రభుత్వాలు ఒక నిర్దిష్ఠ కార్యాచరణను రూపొందించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోకుండా ముందు ముందు మరింత భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది.  

వైనాట్ 175.. జగన్ ధీమాకు కారణం ఇదేనా?

వైనాట్ 175.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాన్ఫిడెన్స్ కు కారణమేమిటో తేలిపోయింది. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలిచి తీరుతామంటున్న వైసీపీ భరోసా ఏమిటో అర్ధమైపోయింది. వచ్చే ఎన్నికలలో వైసీపీ ఎలా గెలవబోతోందో.. పట్ట భద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ ట్రయలర్ చూపింది. ఆ ట్రయలర్ లోనే అందరికీ వైసీపీ గెలుపు వ్యూహాలేమిటో తేటతెల్లమయ్యాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏరి కోరి ఏర్పాటు చేసుకున్న వంలంటీర్ల వ్యవస్థ ఏం చేయబోతోందో ఎమ్మెల్సీ ఎన్నికలలో తేలిపోయింది. పేరుకు జరిగినవి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు కానీ పెద్ద సంఖ్యలో అండర్ గ్యాడ్యుయేట్లు ఓటు వేశారు. కేవలం ఆరో తరగతి, ఏడో తరగతి, మహా అయితే టెన్త్ చదివిన వారు పెద్ద సంఖ్యలో ఓట్లు వేశారు. వలంటీర్లు వారికి ఓటింగ్ స్లిప్పులు ఇచ్చారు. అధికారులు దగ్గరుండి ఓట్లు వేయించారు. అడ్డుకున్న వారిపై పోలీసులు కేసులు పెట్టారు. లాఠీ చార్జి చేశారు. మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికను ప్రజాస్వామ్మమే నిర్ఘాంతపోయేంత ప్రశాంతంగా జరిపించారు. కనీస విద్యార్హత లేకుండా ఓటు వేయడానికి వచ్చిన వారిని ప్రశ్నిస్తే.. వారి నుంచి వచ్చిన సమాధానాలు వ్యవస్థలను జగన్ సర్కార్ ఈ నాలుగేళ్ల కాలంలో ఎంతగా నిర్వీర్యం చేసిందో అవగతమౌతుంది. ఒక ఓటరేమో తాను చదివించి  ఏడో తరగతేననీ, అయితే తమ వార్డులో ఈ ఎన్నికలలో ఓటు వేయడానికి తనతో పాటు మరో ముగ్గుర్ని ఎన్నుకున్నారనీ తెలిపారు. వారి విద్యార్హత కూడా ఆరు, ఏడు తరగతులేనట. ఓటింగ్ స్లిప్పులు ఎవరిచ్చారంటే ఇక్కడే ఇప్పుడే ఇచ్చారని చెప్పారు. మరి మీకు ఇక్కడకు వచ్చి ఓటేయాలని ఎవరు చెప్పారంటే.. ఫోన్ వచ్చిందన్నది వారి సమాధానం. ఇంతకీ తాను ఓటు వేస్తున్నది ఏ ఎన్నికకు అన్న సంగతి కూడా ఆమెకు తెలియదు. వచ్చి ఓటేయమన్నారట.. అంతే వచ్చి ఓటేశారు. ఇంత బహిరంగంగా వారి విద్యార్హతలపై వాస్తవం నిగ్గు తేలినా.. వారు ఓట్లు వేయకుండా అధికారులు నిలువరించలేదు.  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో  ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ మాత్రమే చదివిన వారిని కూడా ఓటర్లుగా ఓట్లు వేయించిన ఘనత జగన్ సర్కార్ ది. ఇందు కోసం ఆయన ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ఎంత గొప్పగా ఉపయోగించుకుందో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక అద్దంపట్టింది.  ఎమ్మెల్సీ ఎన్నికలలోనే ఇంతకు  తెగించిన వైసీపీ రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఇంకెన్ని జగన్నాటకాలకు తెరతీస్తారో అన్న సందేహాలు సర్వత్రా  వ్యక్తమౌతున్నాయి.  ఎంత నిర్భయంగా, ఎంత నిస్సిగ్గుగా వైసీపీ నేతలు వ్యవహరించారంటే.. దొంగ ఓట్లు, దొంగ ఓటర్లను మీడియా లైవ్ లో చూపించినా వెనక్కుతగ్గలేదు. పోలీసుల సంపూర్ణ సహకారంతో దొంగ ఓట్లను యథేచ్ఛగా వేయించుకున్నారు.  దొంగ ఓటర్లను గుర్తు పట్టే టీడీపీ నేతలు… పోలింగ్ ఏజెంట్లను పోలీసులు పోలీసు స్టేషన్లకు తరలించేశారు.  ఈ సందర్భంగా తిరుపతి, పులివెందుల సహా పలు చోట్ల ఘర్షణలు జరిగాయి.  ఆటోడ్రైవర్లు, ఆరేడు తరగతులు చదువుకున్న వారు, ఇంటర్మీయట్ కురాళ్లు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోలీసుల అండతో, వైసీపీ దన్నుతో ఓట్లు వేశారు.  ఇక పోలింగ్ బూత్ ల వద్దే కౌంటర్లు పెట్టేసి మరీ సొమ్ములు పంచారు. గెలవడం కావాలి, ఎలా గెలుస్తేం ఏం.. మమ్మల్ని అడ్డుకునే దమ్మెవరికి ఉందన్న ధీమా తప్ప వైసీపీలో కనిపించింది. ఈ మాత్రం అరాచకం లేకపోతే మనకు ఓటేసేదెవరు అన్న భావన కూడా వ్యక్తమైంది.  దొంగ ఓట్లతో గెలిచేయగలమన్న ధైర్యం కనిపించింది. ఇదే పద్ధతిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా దున్నేస్తామన్న ధీమా వ్యక్తమైంది. మొత్తం మీద వచ్చే ఎన్నికలు ఎలా జరుగుతాయో.. రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో ఒక ట్రయలర్, ఒక టీజర్ చూపించారు ముఖ్యమంత్రి జగన్

ప్రహసనంగా మారిన ఎమ్మెల్సీ ఎన్నికలు.. చంద్రబాబు

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ నేతలు, అధికారులు కలిసి ప్రహసనంగా మార్చేశారని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఓ పక్క బోగస్ ఓట్లు, మరోవైపు టీడీపీ నేతలు, ఏజెంట్ల అరెస్టులతో ఎన్నికలల్లో నిబంధనలను, రాజకీయ పక్షాల హక్కులను పూర్తిగా పాతర వేశారని ధ్వజమెత్తారు.  ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిపై పార్టీ కార్యాలయం లోని వార్ రూం లో ఉదయం నుంచి మినిట్ టు మినిట్ సమీక్ష చేసిన చంద్రబాబు,  ప్రజాస్వామ్యం ఆనవాలు కూడా కనిపించని పరిస్థితికి రాష్ట్రాన్ని వైసీపీ సర్కార్ తీసుకువచ్చిందని అన్నారు.  వార్ రూంలో కూర్చిని వైసీపీ అక్రమాలపై రియల్ టైంలో సమాచారం తెలుసుకున్న చంద్రబాబు,  ఆయా ఘటనలపై కడప, తిరుపతి, ప్రకాశం జిల్లా ఎస్పీలతో, తిరుపతి జిల్లా కలెక్టర్ తో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన ఉల్లంఘనలను అధికారులకు వివరించి తక్షణ చర్యలకు డిమాండ్ చేశారు. పలు జిల్లాల్లో యధేచ్చగా వైసిపి  దొంగ ఓట్లు వేస్తున్నా… అధికార పార్టీ నేతలు దాడులు, అక్రమాలకు పాల్పడుతున్నా పోలింగ్ అధికారులు అడ్డుకోకపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలు ఇంత అపహాస్యం అవుతుంటే అధికారులు చర్యలకు ఉపక్రమించకపోవడం దారుణం అన్నారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు నిబంధనలను ఉల్లంఘించిన ఘటనలపై ఎలక్షన్ కమిషన్ కు ఎప్పటికప్పుడు వరుసగా ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా తిరుపతిలో బస్సుల్లో, ప్రత్యేక వాహనాల్లో ఇతర రాష్ట్రాలనుంచి ప్రజలను తరలించి దొంగ ఓట్లు వేయిస్తున్నా యంత్రాంగం మౌనంగా ఉండడం పై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తూర్పు పట్టభద్రుల నియోజకవర్గంలో ఏకంగా అభ్యర్థినే వైసిపి గూండాలు అడ్డకోవడాన్ని చంద్రబాబు ఖండించారు. తిరుపతిలో దాడులు, అక్రమాలపై ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా సరిగా స్పందించ లేదన్నారు. పట్టభద్రులు ఓటువేయాల్సిన ఎన్నికల్లో అనర్హులతో, నిరక్షరాస్యులతో బోగస్ ఓట్లు వేయించినా అధికారులు కనీస బాధ్యతగా వ్యవహరించకపోవడం సరికాదన్నారు. అధికార పార్టీ ఓటమి భయంతోనే ఈ స్థాయి అక్రమాలకు దిగిందని చంద్రబాబు ఆరోపించారు. గతం లో ఎన్నడూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ స్థాయి అక్రమాలు చూడలేదని చంద్రబాబు అన్నారు. వార్ రూం మీటింగ్ లో పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు,బోండా ఉమా, వర్ల రామయ్య తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

మంత్రి రోజా ‘పుష్ప విలాపం’

మంత్రి రోజా అందరిలాంటి నాయకురాలు కాదు. ఫైర్ బ్రాండ్ లీడర్.. అది వెండితెర అయినా, బుల్లి తెర అయినా, రాజకీయ వేదికే అయినా  ఆమె నోరు తెరిస్తే... నిప్పుల వర్షం కురుస్తుది. అవతలి వారు ఎంతవారైనా  రోజా డోంట్ కేర్. తగ్గేదే లే .. కడిగేయడమే కానీ, కన్నీళ్లు పెట్టుకోవడం గతంలో ఎరగరు.  కానీ  ఇప్పడు ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. అవును, జబర్దస్త్  గా నవ్వడమే కానీ, ఏడుపు అన్నది ఎరుగని మంత్రి రోజా.. భోరు భోరున విలపించారు. అంటే ఏడ్చారు. అవును అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు అజాతశత్రువే అలిగిననాడు, అన్నట్లు ఏడుపే ఎరుగని మంత్రి రోజా, నిజంగా కన్నీరు పెట్టుకున్నారు. విలపించారు.  అయితే రోజా ఎందుకు విలపించారు? బుల్లి తెరకు వెకిలి నవ్వులు, వికృత నవ్వులు పరిచయం చేసిన(ఇప్పడు ఏ టీవీలో చూసినా, సో .. కాల్డ్ సెలేబ్రిటీలు, సో .. కాల్డ్ కమెడియన్లు, యాక్ ..రయ్యలు, అమ్మలు  అందరూ ఎందుకు నవ్వుతున్నారో తెలియకుండా వెకిలిగా నవ్వడం ఒక ట్రెండ్ గా మారి పోయింది.) జబర్దస్త్  రోజా ఏమిటి? ఏడవడం ఏమిటీ? అంటే అందుకో కథ, కారణం ఉంది. సోషల్ మీడియాలో రోజా ఏడుపుకు చాలా చాలా రీజన్స్ వినిపిస్తున్నాయి.   రాజకీయ ప్రయాణంలో తాను ఎదుర్కున్న చేదు అనుభవాలను గుర్తుచేసుకుని, రోజా కన్నీరు పెట్టుకున్నారు...ట.  అన్నిటినీ మించి, తనది, ‘ఐరెన్ లెగ్’ ఆని ప్రత్యర్ధులు చేసిన, చేస్తున్న విమర్శలు ఆమెను ఎంతగా బాధిస్తున్నాయో  ఆమె విపులంగా చెప్పుకొచ్చారు. అలా చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు, ఆ ‘పుష్ప విలాపం’  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   అయితే రోజా ఏడుపుకు, ఆమె రాజకీయాల్లో చవిచూసిన సినిమా కష్టాలే కారణమా? లేక ఇప్పడు వైసీపీలో వినిపిస్తున్న ‘ఐరన్ లెగ్’ కామెంట్స్ కారణమా? అంటే  సినిమాల్లో హిరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి, తెలుగుదేశం పార్టీలో  చేరి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని సైతం డోంట్’కేర్ అన్నపద్దతిలో తిట్టిపోసిన  రోజా, తర్వాత అదే వైఎస్  కుమారుడు జగన్ రెడ్డి పెట్టిన పార్టీ వైసీపీలో చేరి రెండు సార్లు ఎమ్మెల్ల్యే అయ్యారు. ఇప్పడు మంత్రిగా ఉన్నారు. సో.. రాజకీయాలల్లో ఆమె పడిన కష్టాలు పెద్దగా లేవు. ఒక విధంగా ఆమె రాజకీయ వైకుంఠపాళీలో పాములను తప్పించుకుని కొంచెం వేగంగానే నిచ్చెనలు ఎక్కారు.  అయితే, తెలుగు దేశం పార్టీలో చంద్రగిరి నుంచి రెండుసార్లు పోటీ చేసి రెండు సార్లూ ఓడి పోయిన తర్వాత ఆమె కోరుకున్న సీటు (నగరి) రాక, 2009 ఎన్నికల తర్వాత  కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిశారు. అయితే, ఆ తర్వాత కొద్ది రోజులకే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. దాంతో ఆమె కాంగ్రెస్ లో చేరలేక పోయారు. అప్పట్లోనే  రోజా అంటే గిట్టని వాళ్ళు, అమెది ఐరన్ లెగ్  అంటూ ఎగతాళి చేయడం ప్రారంభించారని అంటారు. ఆ తర్వాత ఆమె వైసేపీలో చేరి నగిరి నుంచి రెందు సార్లు గెలిచారు. అయినా  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినా  ఆమెకు తొలి విడతలో మంత్రి పదవి దక్కలేదు. గత సంవత్సరం (2022) ఏప్రిల్ లో జరిగిన మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో ఆమెకు ఎట్టకేలకు మంత్రి పదవి దక్కింది, కానీ, ఈసారి ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ దక్కే ఛాన్స్ లేదంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  గడప గడపకు సమీక్ష సమయంలో అందరి ముందు వార్నింగ్ ఇచ్చిన మంత్రులలో రోజా పేరు కూడా వుంది. అదీ గాక  నియోజకవర్గంలో ఆమెకు ఎదురు గాలి వీస్తోందనే ప్రచారం జరుగుతోంది. స్థానిక వైసీపీ నాయకులు కూడా అభ్యర్థిని మార్చాలని బహిరంగంగా  డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో రోజాను తప్పించి  స్థానికంగా అందుబాటులో ఉండే అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వాలనే వాదనలు వినిపిస్తున్నారు.ఆ ఫ్రస్ట్రేషన్ లోనే రోజా... తనను ఐరన్ లెగ్ అంటున్నారని.. కన్నీళ్లు పెట్టుకున్నారని అంటున్నారు. అయితే అవి నిజం కన్నీరా, సానుభూతి కోసం పెట్టుకున్న  గ్లిజరిన్  కన్నీరా.. అంటే ఎంతైనా నటి కదా ... గ్లిజరిన్ కన్నీళ్లు అయినా కావచ్చును అంటున్నారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మలి విడత మొదటి రోజు ..ఇలా వృధా

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత ప్రజాస్వామ్యంపై లండన్ లో చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ సమావేశాల్లో తీవ్ర దుమారం రేపాయి. రాహుల్‌ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ కేంద్ర ప్రభుత్వం.. ఆయన క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేసింది. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. రాహుల్ గాంధీ దేశాన్ని అవమానించారని, క్షమాపణలు చెప్పాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. మన దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని రాహుల్ విదేశాలను కోరారన్నారు.  పార్లమెంట్‌ మలి విడత బడ్జెట్‌ సమావేశాలు సోమవారం (మార్చి 13)  ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ మొదలవ్వగానే కేంద్ర  మంత్రి  రాజ్‌నాథ్ సింగ్‌ ఈ అంశాన్ని  ప్రస్తావించారు. విదేశీ గడ్డపై రాహుల్‌ గాంధీ భారత దేశాన్నిఅవమానించారు. ఆయన వ్యాఖ్యలను ఈ సభలోని సభ్యులంతా ఖండించాలి. రాహుల్‌ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి అని రాజ్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. ఆయన వ్యాఖ్యలకు బీజేపీ మిత్రపక్ష నేతలూ మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి విమర్శలను కాంగ్రెస్‌ సభ్యులు వ్యతిరేకించారు. ప్రధాని మోడీ కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విదేశాల్లో విమర్శలు గుప్పించారని గుర్తు చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.   అదలా ఉంటే  లండన్‌లో ఇటీవల భారత్‌పై చేసిన వ్యాఖ్యలపై రాహుల్‌ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ పార్లమెంటులో అధికారపక్షం డిమాండు చేయడంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వారే , ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని మాట్లాడుతుండటం దురదృష్టకరమని మండిపడ్డారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ రెండో దఫా సమావేశాలు మొదలైన కొద్దిసేపటికే కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ విపక్ష ఎంపీలతో కలిసి పార్లమెంటు హౌస్‌ కాంప్లెక్స్‌ నుంచి విజయ్‌ చౌక్‌ వరకు మల్లికార్జున ఖర్గే  ర్యాలీ నిర్వహించారు. దేశంలో చట్టపరమైన పాలన లేదని.. ప్రధాని మోడీ దేశాన్ని ఓ నియంతలా పాలిస్తున్నారని ఆరోపించారు.  వారు (బీజేపీ)ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ నాశనం చేస్తున్నారు. మోదీ పాలనలో రాజ్యాంగానికి స్థానం లేదు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ విపక్షాలనూ అణచివేతకు గురిచేస్తున్నారు. ఇలాంటి వారు ప్రజాస్వామ్యం, జాతీయవాదం, దేశ గౌరవం గురించి మాట్లాడుతున్నారు అని కేంద్ర ప్రభుత్వంపై మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ను విమర్శించే ముందు బీజేపీ నేతలు వాస్తవాలను సరి చూసుకోవాలని హితవు పలికారు.  కేవలం అదానీ, హిండెన్‌బర్గ్‌ అంశం నుంచి దృష్టి మరల్చేందుకే ప్రభుత్వం ఇటువంటి వాదనలు చేస్తోందని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. జేపీసీ వేయాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం   ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్న తనపైనా వివక్ష కొనసాగుతోందని.. సభలో మాట్లాడేందుకు తగిన సమయం కేటాయించడంలేదని ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, వామపక్ష పార్టీలతోపాటు ఆమ్‌ఆద్మీపార్టీ ఎంపీలు ర్యాలీ నిర్వహించారు.  కాగా, ఓ వంక అధికార పక్షం రాహుల్ గాంధీ క్షమాపణల కోసం పట్టు పట్టడం, మరో వంక విపక్షాలు అదానీ, హిండెన్‌బర్గ్‌ అంశంపై జేపీసీ ఏర్పటు చేయాలని పట్టుపట్టడంతో, పార్లమెంట్ బడ్జెట్ మలి విడత సమావేశాలు మొదటి రోజు ... వృధా రోజుల ఖాతాలో చేరిపోయింది.

ఢిల్లీ వీధుల కెక్కిన తెలంగాణ రాజకీయం?

తెలంగాణ రాజకీయాలు ఢిల్లీ బాట పట్టాయా? ఢిల్లీ కేంద్రంగానే రాష్ట్ర రాజకీయాలు, రాజకీయ వ్యూహాలు రూపు దిద్దుకుంటు న్నాయా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత ప్రమేయం బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయ రణక్షేత్రం హస్తినకు మారిందని అంటున్నారు.  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధిచి కవితకు ఈడీ సమన్లు జారీ చేయడం, అంతకు ముందే ఆమె  మూడు దశాబ్దాలకు పైగా త్రిశంకు స్వర్గంలో తేలియాడుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లును భూమార్గం పట్టించేందుకు  ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద  ‘దీక్ష’ చేయడం, ఆ వెంటనే, ఈడీ విచారణకు హాజరు కావడం ఇలా ఒకదాని వెంట ఒకటిగా చోటు చేసుకున్న పరిణామాలతో  తెలంగాణ రాజకీయాలకు ఢిల్లీ కేంద్రంగా మారింది.  అన్నిటినీ మించి ఢిల్లీ మద్యం కేసులో అంతవరకు  ఎక్కడా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోని  ముఖ్యమంత్రి కేసీఆర్  ముందు ఆమెను ఒంటరిగా ఢిల్లీకి పంపి, ఆ వెనక కేటీఆర్, హరీష్ రావు సహా అరడజను మందికి పైగా మంత్రులను ఢిల్లీకి పంపారు. అంతకు ముందే కవిత దీక్ష కోసం ఢిల్లీ చేరిన బీఆర్ఎస్  భారత జాగృతి (తెలంగాణ జాగృతి) శ్రేణులు, ఈడీ  విచారణ జరిగిన రోజు (మార్చి11)న ఢిల్లీ లో హల్ చల్ సృష్టించారు. ఇలా ఒక్కసారిగా, ఇటు పార్టీని, అటు ప్రభుత్వాన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్సీ కవితకు అండగా రంగంలోకి దింపడంలో కేసేఆర్  వ్యూహం ఏమైనప్పటికీ ఆ రోజుకు కవిత బయట పడ్డారు. కానీ, కథ అంతటితో ముగియ లేదు. మళ్ళీ  మార్చి 16న మరోమారు  విచారణకు హజరు కావాలని ఈడీ  కవితకు అదే రోజున తాజా సమన్లు జారీ చేసింది.  సరే  ఆరోజు (మార్చి 16)న ఏమి జరుగుతుంది? మంత్రులంతా మళ్ళీ కట్టకట్టుకుని ఢిల్లీ వెళ్తారా? ప్రత్యేక విమానాలు, రైళ్ళలో జనాలను, కార్యకర్తలను ఢిల్లీకి  తరలిస్తారా? ఢిల్లీలో మళ్ళీ అదే హల్ చల్ సృష్టిస్తారా  అనేది పక్కన పెడితే, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కుంటున్న భారీ అవినీతి ఆరోపణ  ఢిల్లీలో గజ్జెకట్టి ఆడేందుకు సిద్దమవుతోంది. అవును ప్రధాని నరేంద్ర మోడీ  మొదలు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్  వరకు బీఆర్ఎస్  ప్రభుత్వం ఏటీఎం గా అభివర్ణించిన  కాళేశ్వరంలో అవినీతిపై విచారణకు డిమాండ్ చేస్తూ  వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు  వైఎస్ షర్మిల మార్చి 14న అదే  ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు సిద్దమయ్యారు.  నిజానికి, కాళేశ్వరం అవినీతి గురించి ఇప్పటికే షర్మిల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దృష్టికీ తీసుకెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను అతిపెద్ద కుంభకోణంగా ఆమె మొదటి  నుంచి ఆరోపిస్తున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు అయితేనేమీ లేదంటే ఇతర సమాచారం ఆధారంగా అయితే నేమి, కాగ్   కాళేశ్వరం ప్రాజెక్ట్ పద్దులపై ప్రత్యేక ఆడిట్ ప్రారంభించింది.   ఈ నేపథ్యంలో  వైఎస్ షర్మిల  మంగళవారం(మార్చి 14) ఢిల్లీలో కాళేశ్వరం అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో  ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ భవనం వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. దీనికి మద్దతు ఇవ్వాలంటూ ప్రతిపక్ష పార్టీలకు షర్మిల విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం అవినీతి విషయంలో తాను చేస్తోన్న పోరాటానికి కలిసి రావాలని కోరారు. తెలంగాణలో బీఆర్ఎస్ యేతర పార్టీలు తనకు అండగా నిలుస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ నిరసన ప్రదర్శనకు సంఘీభావం తెలియజేయాలని కోరారు.  ఈసందర్భంగా షర్మిల కాళేశ్వరం దేశంలోనే అతి పెద్ద స్కామ్  గా పేర్కొన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16.46 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో రూ.38,000 కోట్ల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కమీషన్లకు కక్కుర్తిపడి రీ- డిజైన్ పేరుతో ప్రాజెక్టు వ్యయాన్ని మూడు రెట్లు పెంచారని విమర్శించారు. 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి లక్షన్నర ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని అన్నారు. నాణ్యత లేని పనులు చేపట్టి మూడు సంవత్సరాలే కాళేశ్వరాన్ని ముంచారని ధ్వజమెత్తారు. మెగా కంపెనీతో కుమ్మక్కై దాదాపు 70 వేల కోట్ల అవినీతికి తెరలేపారని ఆరోపించారు.  కాళేశ్వరం అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఇదివరకే తాము కాగ్, సీబీఐకి ఫిర్యాదు చేశామని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నందున ఈ విషయాన్ని ఎంపీల దృష్టికి తీసుకుని రావాలనేదే తమ ఉద్దేశమని అన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కేంద్రం చెప్పడం కాదని, విచారణ జరిపించి.. అది నిజం అని నిరూపించాలని డిమాండ్ చేశారు. నిజానికి, కవిత లిక్కర్ కుంభకోణం కంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై వస్తున్న అవినీతి ఆరోపణలు కాంగ్రెస్ సహా అన్ని పార్టీలూ చేస్తున్నాయి. అయితే  షర్మిల సంధించిన బాణం, బీఆర్ఎస్ నే కాదు, కాంగ్రెస్ పార్టీని కూడా ఇరకాటంలోకి నెట్టేస్తుందని అంటున్నారు.

ఈడీ దూకుడు తగ్గేదేలే?..నాలుగు రోజుల వ్యవధిలోనే మరోసారి కవిత విచారణ

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు ఇసుమంతైనా తగ్గంచినట్లు కనబడటం లేదు. గత శుక్రవారం (మార్చి 11)న ఇదే కుంభకోణం కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. కవిత విచారణకు హాజరవ్వడానికి ముందు వరకూ ఈడీ, మోడీ, మొదానీ అంటూ తీవ్ర స్థాయలో విరుచుకుపడిన బీఆర్ఎస్ శ్రేణులు ఆ తరువాత ఈ కేసుకు సంబంధంచి నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. విచారణ తీరుపై కానీ, ఈ కేసు వెనుక కేసీఆర్ జాతీయ రాజకీయాలలో వేగాన్ని నియంత్రించే లక్ష్యం ఉందని కానీ విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ కేసులో కవితను బయటకు తీసుకురావడానికి తెరవెనుక రాజీ ప్రయత్నాలు ఫలించేలా కనిపించాయనీ, అందుకే పార్టీ అధినేత కేసీఆర్ కవిత కేసు విషయంలో విమర్శలు వద్దనీ, టీవీ టాక్ షోలలో సైతం విమర్శలు చేయవద్దనీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు బీఆర్ఎస్ శ్రేణులే లోపాయికారీగా అంగీకరించారు. అయితే ఆ ప్రయత్నాలేమిటి? ఎవరిని కాంటాక్ట్ చేశారు? అన్న విషయాలు మాత్రం బయటకు రాలేదు. దీంతో ఈడీ కవితను ఈ నెల 16న మరో సారి విచారణకు రావాల్సిందని చెప్పినప్పటికీ బీఆర్ఎస్ దానికి పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. తప్పని సరి లాంఛనంగానే ఈడీ కవితను మరోసారి విచారణకు పిలిచిందని భావించారు. అయితే ఈడీ మాత్రం ఈ కేసులో  మనీ లాండరింగ్ ఉల్లంఘన, హవాలా లావాదేవీలు లాంటి ఆర్థిక అంశాల గుట్టుమట్ల నిగ్గు తేల్చే పనిలో ఉందని రాజకీయవర్గాలు అంటున్నాయి. అందుకే ఈ నెల 16న కవితను మళ్లీ విచారణకు పిలిచారనీ,  ఈ సారి విచారణకు ఆమె శుక్రవారం( మార్చి 11) విచారణ సందర్భంగా తెలియజేసిన వివరాలకు సంబంధించి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తీసుకు రావాల్సిందిగా ఆదేశించిందనీ చెబుతున్నారు. శుక్రవారం (మార్చి 11)న దాదాపు ఎనిమిదిన్నర గంటలకు పైగా సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు పెద్ద వ్యవధి ఇవ్వకుండానే కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే మళ్లీ విచారణకు రావాలసి ఆదేశించారంటే  తొలి రోజు విచారణలో తమ ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని ఈడీ అధికారులు భావించినట్లేనని పరిశీలకులు చెబుతున్నారు. అసలు తొలి విచారణలో ఈడీ అధికారులు ఏయే అంశాలపై కవితను ప్రశ్నించారన్న విషయంలో ఇటు కవిత నుంచి కానీ అటు ఈడీ వర్గాల నుంచీ కానీ క్లియర్ కట్ సమాచారం లేదు. ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచారు. అయితే రెండో సారి స్వల్ప వ్యవధిలోనే విచారణకురావాల్సిందిగా ఆదేశించడంతో ఈ సారి కవిత ఆర్థిక మూలాల విషయంలో ఈడీ దృష్టి సారించే అవకాశం ఉందనిఅంటున్నారు. అందుకే ఈ నెల 16న విచారణకు పలు డాక్యుమెంట్లను తీసుకు రావాల్సిందిగా ఈడీ అధికారులు కవితను ఆదేశించినట్లు చెబుతున్నారు. అన్నిటికీ మించి సౌత్ గ్రూపు నుంచి ఆప్ నేతలకు అందినట్లుగా చెబుతున్న రూ. వంద కోట్ల రూపాయల ముడుపుల విషయంలో కవిత నుంచి వివరాలు రాబట్టడమే లక్ష్యంగా ఈనెల 16న ఈడీ అధికారుల విచారణ ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.   ఈ నేపథ్యంలోనే కల్వకుంట్ల కవిత ఆదాయ వివరాలు, వివిధ కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నందున వాటి ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్టులు తీసుకురావాల్సిందిగా కూడా ఈడీ అధికారులు ఆమెను ఆదేశించారని చెబుతున్నారు. మద్యం కుంభకోణం కేసులో  ఇప్పటికే అరెస్టయిన వారి నుంచి తీసుకున్న  వాంగ్మూలాలకు అనుగుణంగా కవిత నుంచి వివరాలు రాబట్టిన ఈడీ అధికారులు..  కస్టడీలో ఉన్న పిళ్లయ్, మనీశ్ సిసోడియా వెల్లడించే అంశాల ఆధారంగా కవితను ఈ నెల 16న విచారించే అవకాశాలున్నాయంటున్నారు.  పిళ్లయ్ కస్టడీ సోమవారం (మార్చి 13)తో ముగియనుండగా,  సిసోడియా కస్టడీ ఈ నెల 17న ముగియనున్నది.    

సీబీఐకి ఫామ్ హౌస్ కేసు.. కేసీఆర్ వ్యూహం బూమరాంగ్?

ఫాం హౌస్ కేసులో కేసీఆర్ వ్యూహం దెబ్బతింది.  లిక్కర్ స్కాంలో తన కుమార్తె పై సీబీఐ, ఈడీ నజర్ కు కౌంటర్ అన్నట్లుగా ఫామ్ హౌజ్ లో ఎమ్మెల్యేల కొనుగోలు, బేరసారాలకేసును సిట్ కు అప్పగించాలని భావించిన ఆయనకు చుక్కెదురైంది. కేంద్రాన్నికి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉంటే.. మాకు రాష్ట్ర దర్యాప్తు సంస్థలున్నాయంటూ అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి కూడా. అయితే తన దొరికిన ఆయుధంగా కేసీఆర్ భావించిన ఫామ్ హౌజ్ కేసు దర్యాప్తు ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ చేతిలోకి వెళ్లి పోయింది. ఫామ్ హౌస్ కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసులో యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగుతుందని స్పష్టం చేస్తు విచారణను  జులై 31కి వాయిదా వేసింది.  దీంతో ఫామ్ హౌస్ కేసు దర్యాప్తు ప్రారంభించుందుకు ఇప్పుడిక సీబీఐకి ఎటువంటి అడ్డంకులూ లేదు. కేసు సీబీఐ చేపడితే సాక్ష్యాలు నాశనమైపోతాయంటూ వస్తున్న తెలంగాణ ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి. ఇప్పటి వరకూ ఈ కేసు దర్యాప్తు విషయంలో  ఇప్పుడు సీబీఐ రంగంలోకి దిగడానికి సుప్రీం కోర్టు స్టే ఇస్తుందా లేదా అన్నది వేచి చూడడానికే అని చెప్పవచ్చు. ఇప్పుడు సుప్రీం కోర్టు స్టే నిరాకరించడంతో సీబీఐ దర్యాప్తునకు రూట్ క్లియర్ అయిపోయింది. దీంతో ఏ క్షణంలోనైనా  దర్యాప్తు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అసలు గతంలోనే.. సీబీఐ ఈ కేసుకు సంబంధించిన   వివరాలు, ఆడియో, వీడియో, డాక్యుమెంట్లు  అందజేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పలు మార్లు లేఖలు రాసింది.   అయితే ఆ లేఖలకు తెలంగాణ సర్కార్ స్పందించలేదు. సరే సుప్రీం కోర్టు పూర్థి స్థాయిలో స్టేకు నిరాకరించిన తరువాత చూద్దాం అన్నట్లుగా సీబీఐ కూడా అప్పట్లో మిన్నకుండిపోయింది. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయిపోయిన నేపథ్యంలో ఏ క్షణంలోనైనా సీబీఐ కేసు దర్యాప్తును చేపట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో  ఫాం హౌస్ కేసు తెలంగాణ సర్కార్ మెడకు చుట్టుకున్నట్లే కనిపిస్తోంది ఈ కేసు విషయంలో సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం ఎంత వరకూ సహకారం అందిస్తుందన్న విషయంలో పొలిటికల్ సర్కిల్స్ లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పొరుగున ఉన్న ఏపీలో  వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో విధాలుగా అడ్డంకులు సృష్టించడాన్ని వారీ సందర్బంగా ప్రస్తావిస్తున్నారు. అదే విధంగా ఫామ్ హౌస్ కేసులోనూ   తెలంగాణ ప్రభుత్వం కూడా ఫాం హౌస్ కేసు దర్యాప్తు విషయంలో సీబీఐకి   అడ్డంకులు సృష్టించే వ్యూహాన్నే అనుసరించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అదే జరిగితే కేంద్రాన్ని ఇరుకున పెట్టాలనుకున్న కేసీఆర్ వ్యూహం పూర్తిగా బూమరాంగ్ అయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో… ముగ్గురు ఎమ్మెల్యేల్ని ప్రలోభపరిచేందుకు  బీజేపీ తరపున రాయబారులుగా వచ్చిన ముగ్గురు వ్యక్తులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్ లో దొరికిపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసునే ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ కు అప్పగించారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి జరిగిన ఈ ప్రయత్నం వెనుక  బీజేపీ పెద్ద నేతలున్నారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫాం హౌస్ కేసులో సాక్ష్యాలు ఇవిగో అంటే కొన్ని వీడియోలు, ఆడియోలు మీడియాకు విడుదల చేశారు. అలాగే వాటినన్నిటికీ దేశంలోని అందరు న్యయమూర్తులకూ పంపారు.  మీడియాకు ప్రదర్శించడమే కాకుండా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల వరకూ అందరికీ పంపారు. ఈ విషయాన్నే ఎత్తి చూపిన తెలంగాణ హైకోర్టు సాక్ష్యాలను అలా ఎలా పంపుతారంటూ సీరియస్ అయ్యింది. ఈ కేసులో సీట్ విచారణ కాదుంటూ.. కేసును.. సీబీఐకి అప్పగించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ సర్కార్ సుప్రీం కు వెళ్లింది. అక్కడా కేసీఆర్ కు చుక్కెదురైంది. దీంతో ఫామ్ హౌస్ కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టడం ఖాయమైంది. 

రాజకీయ నాయకులకు అవినీతి మరక.. మంచిదేనా?

అవినీతి ఆరోపణలను ఎదుర్కొనడం రాజకీయాలలో రాణించడానికి ఒక క్రెడిట్ గా నాయకులు భావిస్తున్నారా? అవినీతి మరక అంటితేనే జనంలో గుర్తింపు వచ్చినట్లుగా భావిస్తున్నారా? ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ నేతలకు ఈ మరక మంచిదేనా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే అనిపించక మానదు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితులను గమనిస్తే.. అవినీతి మరక అంటిన.. అంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులే గట్టిగా అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడటం, తమపై ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమేనంటూ ప్రకటనలు గుప్పించడం చూస్తుంటే.. ఆ మరకనే పాపులర్ లీడర్ గా మారే అవకాశాన్ని సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్న భావన కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమౌతోంది. మొత్తంగా చూస్తే అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిలో అత్యధికులు రాజకీయ నేతలే ఉంటున్నారు. మొత్తంగా పార్టీలకు పార్టీలు, ప్రభుత్వాలకు ప్రభుత్వాలు ఈ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం విషయానికి వస్తే.. ఈ కుంభకోణంలో ఆరోపణలు చేస్తున్నవారూ.. ఆరోపణలను ఎదుర్కొంటున్న వారూ అందరూ రాజకీయ నేతలే. మొత్తంగా ఈ కుంభకోణమే ఒక ప్రభుత్వ మద్యం విధానానికి సంబంధించినది. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం అమలు చేసి ఉపసంహరించుకున్న మద్యం విధానంలో లోపాలున్నాయంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదు ఈ తేనెతుట్టె కదలడానికి ఆధారభూతంగా మారింది. మద్యం కుంభకోణానికి ముందూ తరువాతా కూడా ఇలా అవినీతి ఆరోపణల్లో చిక్కుకుని రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్న నేతలు పలువురు ఉన్నారు.  ఎపి సిఎంగా ఉన్న జగన్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, తృణమూల్ మంత్రులు, ఆప్ నేతలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా కొండవీటి చాంతాడంత ఉంటుందనడానికి సందేహం అవసరం లేదు. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో నేరం రుజువు కాలేదు. ఆరోపణల మరకలు మాత్రమే పడ్డాయి. అయితే ఆ మరక అంటుకున్న నేతలకు విపక్షాలు మద్దతుగా నిలుస్తున్నాయి. అదే మరక పడిన తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరైన క్రమంలో రాత్రికి రాత్రి జాతీయ రాజకీయాలలో ప్రధాన ఆకర్షణగా మారిపోయారు. ఆమె ఈడీ విచారణకు హాజరవ్వడానికి ముందు వరకూ ఆమె తండ్రి, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రస్థానం కొండ ఎక్కదు.. కొండ దిగదు అన్నట్లుగా తొలి అడుగులోనే అటూ ఇటూ కదలకుండా స్థిరంగా ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో సత్తా చాటుతామంటూ ఆయన చేస్తున్న ప్రకటనలు వినా ఆ దిశగా కదలిక ఇసుమంతైనా కనిపించిన దాఖలాలు లేవు. అయితే ఎప్పుడైతే ఈ కుంభకోణంలో కవితను విచారణకు ఈడీ పిలిచిందో.. అప్పుడే జాతీయ స్థాయిలో రాజకీయ కదలిక ఆరంభమైంది. దాదాపు 18 పార్టీలు కవితకు మద్దతుగా ఢిల్లీలో ఏకతాటిపైకి వచ్చాయి. తాను ఈడీ విచారణకు హాజరు కావడానికి ఒక రోజు ముందు.. అంటు శుక్రవారం ( మార్చి 9)న చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ఆమె చేపట్టిన దీక్షకు మద్దతు పలికాయి. ఆమెతో పాటు ఆయా పార్టీల నాయకులూ దీక్షలో కూర్చున్నారు. ఆ దీక్షా వేదిక నుంచే మద్యం కుంభకోణంలో కవితను ఈడీ విచారణకు పిలవడాన్ని ఖండించారు. ఈ ఖండన, ఆయా పార్టీల మద్దతు కచ్చితంగా బీఆర్ఎస్ కు  రాజకీయంగా జాతీయ స్థాయిలో ఒక ముందడుగు వేసేందుకు అవకాశం ఇచ్చిందనే చెప్పాలి. అలాగే కవితకు సంఘీ భావంగా హస్తిన వెళ్లిన బీఆర్ఎస్ అగ్రనేతలు, తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు బీఆర్ఎస్ జాతీయ ప్రస్థానానికి అవసరమైన అడుగులు వేయడానికి వీలుగా రోడ్ క్లియర్ చేసే కార్యక్రమం చేపట్టారని కూడా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో కవిత తన ఒక్కరి తరఫునే కాకుండా ఈడీ, సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న విపక్షాలకు చెందిన అందరి నాయకుల తరఫునా వకల్తా పుచ్చుకున్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలకు ముందు ప్రచారం కోసం మోడీ రావడానికి ముందుగానే ఈడీ, సీబీఐ, ఐటీలు వస్తాయన్న ఆమె వ్యాఖ్యల వెనుక ఉన్న అంతరార్దం ఒక్కటే. ఈ వేధింపులు ఒక్క తెలంగాణ రాష్ట్రానికే పరిమితమై లేవనీ, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న అన్ని రాష్ట్రాలలోనూ  విపక్షాలకు ఈ వేధింపులు ఉన్నాయనీ, ఉంటాయనీ కవిత అంటున్నారు.  దాదాపు విపక్షాలన్నిటిదీ అదే మాట. ఇప్పటి వరకూ వేటికవిగా ఉన్న పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు కవిత ఈడీ విచారణ ఎపిసోడ్ ను వేదికగా చేసుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోందని అంటున్నారు. ఆ విధంగా చేస్తు కవితపై పడిన ఈ అవినీతి మరక మంచిదేనని బీఆర్ఎస్ భావిస్తోందా అన్నే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరందుకుంది.  

వెంకయ్యకు నిజంగానే అన్యాయం జరిగిందా?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ఒక  సారి  చెపితే వంద సార్లు చెప్పినట్లే.. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ ఆయన చేసే వ్యాఖ్యలు, ఆయన చెప్పే సినిమా డైలాగుల్లానే  భలే పేలుతుంటాయి. ఆయన అభిమానులు అయితే, ఆయన్ని దేవుడితో సమానంగా చూస్తారు. రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటారు. నిజానికి, ఒకప్పడు  ఆయన రాజకీయ అరంగేట్రం గురించి చాలా పెద్ద ఎత్తున చర్చే జరిగింది.  అభిమానుల అభిప్రాయ సేకరణ పేరిట అభిములు తమిళనాడులో అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. నిజానికి ఒక దశలో ఆయన   ప్రత్యక్ష రాజకీయాల్లోను ఒక కాలు పెట్టేశారు కూడా.  సొంత పార్టీ పెడుతున్నానని ప్రకటించేశారు కూడా.  అయితే రెండవ కాలు   పెట్టకుండానే ఆయన ముందు పెట్టిన కాలుని వెనక్కి తీసుకున్నారు. డ్రాపై పోయారు. సైలెంటైపోయారు. అనారోగ్యం కారణంగా రాజకీయ అరంగేట్రం చేయకుండానే, శుభం కార్డు వేశారు.  గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల గురించి ఆయన ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు. అయితే ఇప్పుడు హఠాత్తుగా పాత పడిపోయిన  రాజకీయ చర్చను ఫ్రెష్ గా తెరమీదకు తెచ్చారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురించి చేసిన తాజా వ్యాఖ్యలు  రాజకీయ వర్గాలలో సంచలనంగా మారాయి. కొత్త చర్చకు తలుపులు తెరిచాయి. నిజానికి వెంకయ్య నాయుడు రాజకీయాల్లో చురుగ్గా ఉన్నసమయంలో ఆయన్ను ప్రధాని మోడీ ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం రజనీకాంత్ కు ఇప్పుడు నచ్చలేదేమో కానీ, అప్పట్లోనే  చాలా మందికి నచ్చలేదు. ఆయన్ని క్రియాశీల రాజకీయలకు దూరం చేశారనే  అభిప్రాయం, ఆవేదన  ఇప్పుడు  రజనీ కాంత్ వ్యక్తం చేశారు కానీ  అప్పట్లో నే చాలా మంది,  ముఖ్యంగా దక్షణాది రాష్ట్రాలలో... చాలా గట్టిగా వ్యక్తమైంది.  రాజకీయ విశ్లేషకులు, రాజకీయ ప్రముఖులు అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వాళ్లు, వీళ్ల దాకా ఎందుకు స్వయంగా వెంకయ్య నాయుడు కూడా, ఒకటి రెండు సందర్భాలాలో  క్రియాశీల రాజకీయాలకు దూరం కావడం ఒక విధంగా తనకు కూడా ఇష్టం లేదని, అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాన్ని కాదనలేక పోయానని చెప్పుకొచ్చారు. అలాగే  ఒక విధంగా ఇది దక్షిణాది రాష్ట్రాలకు జరిగిన అన్యాయంగా భావించే వారు కూడా లేకపోలేదు.  ఇప్పడు అదే విషయాన్ని, సూపర్ స్టార్ రజనీకాంత్, తన దైన స్టైల్లో  చెప్పు కొచ్చారు. వెంకయ్య నాయుడుకి,  ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదని, ఒక గొప్పనాయకుడిని క్రియాశీల రాజకీయాల నుంచి దూరం చేశారని కుండ బద్దలు కొట్టారు.  అది కూడా వెంకయ్య నాడు సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి దుమారం సృష్టించారు. చెన్నైలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెంకయ్య, రజనీకాంత్ అతిధులుగా వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడిన రజనీకాంత్, వెంకయ్య నాయుడు ఇంకొంత కాలం క్రియాశీల రాజకీయాల్లో, కేంద్ర మంత్రిగా కొనసాగి ఉంటే బాగుండేదని అన్నారు.  అయితే, తాను  ఉపరాష్ట్ర పదవిని చులకన చేయడం లేదని, వెంకయ్య నాయుడు మరికొంత కాలం కేంద్ర మంత్రిగా  కొనసాగి ఉంటే బాగుండేదని మాత్రమే చెబుతున్నాననీ అన్నారు. రజనీ కాంత్  ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో  కానీ, వెంకయ్య నాయుడు ఐదేళ్ళ పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా వెంకయ్యనాయుడుకి అన్యాయం జరిగిందనే చర్చ జరగడం మాత్రం, నిజంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల మనోభావాలను  అద్దంపడుతోందన్నది మాత్రం వాస్తవం. నిజానికి వెంకయ్యకు  ఒకసారి కాదు, రెండు సార్లు అన్యాయం, అవమానం జరిగింది. దక్షణాది రాష్ట్రాల ప్రజల్లో ముఖ్య్యంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రదేశ్ ప్రజల మనసుల్లో నిలిచి పోయింది. ఉప రాష్ట్ర పదవి ఇచ్చి ఒకసారి, రాష్ట్రపతి పదవి ఇవ్వకుండా వెంకయ్యను రెండో సారి మోసం చేశారన్న అభిప్రాయం   దక్షిణాది రాష్ట్రాల ప్రజల్లో ఉందనేది మాత్రం కాదన లేని నిజం. 

జగన్ కు నాడు కలిసి వచ్చిన ఆ రెండు సంఘటనలే ఇప్పుడు ప్రతికూలం?

2019 ఎన్నికలలో వైసీపీ విజయానికి ప్రధాన కారణాలలో ముందువరుసలో ఉన్న ఆ రెండు సంఘటనలే ఇప్పుడు 2024 ఎన్నికలలో అదే వైసీపీకి ప్రతికూలంగా మారనున్నాయా? అంటే వైసీపీ శ్రేణుల నుంచి సామాన్య జనం వరకూ ఔననే అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ రెండు సంఘటనలూ ఏమిటంటే.. ఒకటి విశాఖ విమానాశ్రయంలో అప్పటికి విపక్ష నేతగా ఉన్న జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి కాగా రెండోది..   జగన్ సొంత బాబాయ్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన స్వగృహంలో దారుణ హత్యకు గురి కావడం. ఈ రెండు సంఘటనలూ   జగన్ 2019 ఎన్నికలలో విజయం సాధించడానికి దోహదపడ్డాయనడంలో సందేహం లేదు. సరే ఆ తరువాత ఎన్నికలలో విజయం సాధించి జగన్ అధికారంలోకి వచ్చి కూడా నాలుగు సంవత్సరాలు కావస్తోంది. ఈ నాలుగేళ్ల కాలంలోనూ ఈ రెండు సంఘటనలకు సంబంధించిన కేసులూ ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. కోడి కత్తి కేసు విషయానికి వస్తే.. తనపై దాడి జరిగిందంటూ అప్పట్లో ఊరూవాడా ఏకం చేసి ఎన్ఐఏ దర్యాప్తును సాధించుకున్న జగన్ తాను ముఖ్యమంత్రి అయ్యాకా.. ఆ కేసు ను పట్టించుకున్న దాఖలాలే లేవు. పైపెచ్చు ఈ కేసు ముందుకు సాగాలంటే.. బాధితుడిగా జగన్ కోర్టుకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు పేర్కొన్నా.. జగన్ హాజరు కావడం లేదు. ఈ నాలుగేళ్లుగా ఈ కేసులో నిందితుడైన జనుపల్లి శ్రీను అనే యువకుడు రిమాండ్ ఖైదీగానే మగ్గిపోతున్నాడు. తనపై హత్యాయత్నం కేసు విచారణ పూర్తై నిందితుడికి శిక్ష పడాలన్న భావన జగన్ లో  ఏ కోశానా కనిపించడం లేదు. అసలా సంఘటనే జరగలేదన్నట్లుగా ఆయన తీరు కనిపిస్తోంది.  ఇక సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయాన్నే తీసుకుంటే.. అప్పట్లో అప్పటి అధికార పక్షమే ఈ దారుణానికి కారణమంటూ గగ్గోలు పెట్టిన జగన్.. విపక్ష నేతగా ఈ హత్య కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి హోదాలో సీబీఐ విచారణ అవసరం లేదన్నారు. కానీ వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత తన తండ్రి హంతకులకు శిక్ష పడాల్సిందేననీ, ఈ హత్య వెనుక పాత్రధారులు, సూత్రధారులు వెలుగులోనికి రావాల్సిందే అంటూ పట్టుబట్టి సీబీఐ దర్యాప్తును సాధించారు. ఆ తరువాత సీబీఐ దర్యాప్తునకు ఏపీలో అడుగడుగునా..అడ్డంకులు అవాంతరాలు కలగడంతో మళ్లీ సునీతే సుప్రీం ను ఆశ్రయించి కేసు విచారణను మరో రాష్ట్రానికి బదలీ చేయాలని కోరింది. ఆ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానానికి సీబీఐ కూడా సునీత చెప్పిన ప్రతి మాటా అక్షర సత్యమని నివేదించింది. దీంతో కేసు విచారణ తెలంగాణకు మారింది. అప్పటి నుంచీ దర్యాప్తులో వేగం పెరిగింది. కేసు దర్యాప్తు వేగంగా వివేకా హత్య వెనుక సూత్రధారులు, పాత్ర ధారులు ఎవరన్నది లేల్చే దిశగా సాగుతోందన్న అభిప్రాయమూ అందరిలో కలిగింది. సరిగ్గా ఈ తరుణంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ దర్యాప్తు తీరు సరిగా లేదని ఆరోపిస్తూ, కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్టు చేయకుండా సీబీఐని ఆదేశించాలంటూ కోర్టుకు వెళ్లారు. ఆ సందర్భంగా ఈ హత్య వైఎస్ వివేకా అల్లుడే చేశాడంటూ ఆరోపించారు. సరే ఇదంతా కొద్ది సేపు పక్కన పెడితే.. కోడికత్తి కేసు, వివేహా హత్య కేసు ఈ రెండిటి విషయంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ ప్రతిష్టను మసకబార్చిందనడంలో సందేహం లేదు. విపక్షంలో ఉన్న సమయంలో ఒకలా, అధికారంలోకి వచ్చాకా మరోలా వ్యవహరించడం వల్ల ఈ రెండు సంఘటనల్లో గతంలో జగన్ ఆరోపణలు వాస్తవాలు కావన్న అభిప్రాయం జనంలోకి బలంగా వెళ్లిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ముఖ్యంగా సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య విషయంలో విపక్షంలో ఉన్న సమయంలో అప్పటి అధికార పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా, తెలుగుదేశం పార్టీపైనా విమర్శలు గుప్పించిన వైసీపీ ఇప్పుడు ఆయన హత్య వెనుక ఉన్నది తెలుగుదేశం కాదు, వివేకా కుటుంబ సభ్యులే అనడంతో వైసీపీ, జగన్ ల మాటలలో విశ్వసనీయత కరవైందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీ ప్రతిష్ట మసకబారిందన్న భావన కలుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ జీవించి ఉన్న కాలంలో రామలక్ష్మణులకు ప్రతీకగా వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డిలను జనం చెప్పుకునే వారు.  అయితే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తరువాత నుంచీ పరిస్థితుల్లో మార్పు వచ్చింది.   వివేకానందరెడ్డి కాంగ్రెస్ లోనే ఉండటం, జగన్ వైసీపీ పార్టీ ప్రారంభించడం, ఆ తరువాత వివేకా వైసీపీలోకి వచ్చిన తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన స్వయంగా పరాజయం పాలు కావడంతో వివేకా, జగన్ మధ్య విభేదాలున్నాయా అన్న అనుమానాలు అప్పట్లోనే పొడసూపాయి. ఇక వైఎస్ వివేకా హత్య, తదననంతర పరిణామాలు  వైపీపీ ప్రతిష్ట మసకబార్చడమే కాకుండా, వైఎస్ ఫ్యామిలీ ప్రతిష్టను కూడా మసకబార్చాయంటున్నారు.  వైఎస్సార్ ఫ్యామిలీ ప్రతిష్టకు భంగం వాటిల్లిందనీ చెబుతున్నారు.   కేసు దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ మరెన్ని విషయాలు బయటకు వస్తాయో అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. 

ఆస్కార్ కొట్టిన ‘నాటు నాటు’ పాట

అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ సత్తా చాటింది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కింది. దీంతో ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి భారతీయ గీతంగా ఈ పాట చరిత్ర సృష్టించింది.  ఆర్ఆర్ఆర్ సంగీత దర్శకుడు కీరవాణి, నాటు నాటు పాట రచయత  చంద్రబోస్ ఆస్కార్ వేదికపైస ఈ అవార్డు అందుకున్నారు. అయితే పురస్కారం ప్రకటించడానికి ముందే  ఆస్కార్ వేదికపై.. నాటు నాటు పాటకు హాలీవుడ్ డ్యాన్సర్లు డ్యాన్స్ చేశారు. సినిమాలో ఈ పాట పాడిన గాయకులు రాహుల్ సిప్లింగంజ్, కాలభైరవ లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. వారి పాటకీ, బీట్ కి ఆస్కార్ ఆడియన్స్ స్టాండిగ్ ఒవేషన్ ఇచ్చారు. అస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకకు  ఆర్ఆర్ఆర్  దర్శకుడు రాజమౌళి, నటులు రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ హాజరయ్యారు. కాగా తెలుగు సినిమా పాటకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కడం పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు  కేసీఆర్, జగన్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు,  జనసేనాని పవన్ కల్యాణ్, మెగా స్టార్ చిరంజీవి..ఇలా ఒకరని కాదు రాజకీయ సినీ ప్రముఖులెందరో ఆర్ఆర్ఆర్ బృందానికి అభినందనలు తెలిపారు.  ఇక ఆస్కార్ పురస్కారం పొందిన నాటు నాటు పాట కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ప్రాంతం, భాష,  దేశం ఇలాంటి వాటి వేటితోనూ సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లభించింది. వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ ఉర్రూతలూగించింది. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరిచేతా స్టెప్పులేయించింది. ఇప్పుడు ఆస్కార్ పురస్కారాన్ని సాధించుకు వచ్చింది. ఇక బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో  ఇండియాకు మరో ఆస్కార్ పురస్కారం కూడా దక్కింది. 'ది ఎలిఫెంట్ విష్పర్స్' ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఒకే ఏడాది ఇండియాకి రెండు ఆస్కార్స్ రావడం గర్వించదగ్గ విషయం.

ఇప్పటికి ముగిసింది.. మళ్లీ రండి మేడమ్!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ శనివారం సుదీర్ఘంగా ఉంటే ఎనిమిది గంటలకు పైగా విచారించింది. ఉదయం ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లినప్పటి నుంచీ తిరిగి రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో బయటకు వచ్చే వరకూ అక్కడ హస్తినలో, ఇక్కడ తెలంగాణలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది.  కవితను అరెస్ట్ చేస్తారంటూ ఉదయం నుంచి ఏర్పడిన ఓ టెన్షన్ వాతావరణానికి రాత్రి ఎనిమిది గంటల సమయంలో ముగింపు లభించింది. ఎనిమిది గంటల విచారణ తర్వాత కవితను వదిలేశారు. దాంతో ఆమె ఢిల్లీలోని ఇంటికి వెళ్లిపోయారు. అక్కడ నుంచి రాత్రికి రాత్రే బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు. మళ్లీ కవితను ఈడీ ఈ నెల 16న విచారించనుంది. అయితే శనివారం రోజంతా మాత్రం హై డ్రామా నడిచింది. తొలుత సాయంత్రం ఐదు గంటల వరకూ కవిత విచారణ సాగుతుందన్న వార్తలు వచ్చినా, విచారణ మాత్రం రాత్రి ఎనిమిది దాటే వరకూ కొనసాగింది. మధ్యలో ఆమె ఫోన్ ను ఈడీసీజ్ చేసింది. ఉదయం విచారణకు వచ్చేటప్పుడు కవిత పోన్ తెచ్చుకోలేదు. ఢిల్లీలోని నివాసంలోనే ఫోన్ ఉంచి వచ్చారు. అయితే విచారణలో ఫోన్ గురించి ఈడీ అధికారులు వాకబు చేశారు. తన వద్ద లేదని చెప్పడంతో వెంటనే తెప్పించాలని ఆదేశించారు.దీంతో అప్పటికప్పుడు ఆమె తన డ్రైవర్ ను డిల్లీలో తాను బస చేసిన నివాసానికి పంపి ఫోన్ ను తెప్పించారు. వెంటనే సామాజిక మాధ్యమలో ఫోన్ సీజ్ చేశారంటే అరెస్టు ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.   రామచంద్ర పిళ్లై, కవితను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగారని.. అలాగే ఇతర నిందితుల నుంచి విచారణలో భాగంగా రాబట్టిన అంశాలను ఆధారం చేసుకుని కూడా కవితను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారని అంటున్నారు.   ఈడీ కార్యాలయం బయట ఎదురు చూస్తున్న కవిత డ్రైవర్‌కు సమాచారం పంపి.. ఆయనను నివాసానికి వెళ్లి ఫోన్ తీసుకు రావాలని పురమాయించారు. మధ్యాహ్నం సమయంలో కవిత డ్రైవర్ ఫోన్ తీసుకుని ఈడీ కార్యాలయానికి వచ్చి అధికారులకు ఇచ్చారు.  అంతే కాకుండా శుక్రవారం నాడే బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కవితను అరెస్టు చేయవచ్చంటూ చెప్పడంతో   ఆర్ఎస్ నేతలు  ఆందోళనలు చేయడానికి సిద్ధమయ్యారు. ఢిల్లీ, తెలంగాణల్లో ధర్నాలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఢిల్లీలో ఈడీ కార్యాలయం వద్దా   పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు మోహరించారు. కవితకు సంఘిభావంగా … మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా ఢిల్లీ చేరుకున్నారు. అలాగే ఇతర సీనియర్ నేతలు.. బీఆర్ఎస్ న్యాయనిపుణులు కూడా ఢిల్లీలోనే మకాం వేశారు.  చివరకు కవితను సుదీర్ఘంగా విచారించిన ఈడీ మరో సారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పి ఆమెను పంపేశారు. కవిత హైదరాబాద్ చేరుకోగానే ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి అయిన కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు. ఈడీ విచారణకు సంబంధించి అంశాలన్నీ వివరించారు. ఇక కవితను ఈడీ సుదీర్ఘంగా విచారించి పంపిన క్షణం నుంచీ బీఆర్ఎస్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం గురించి కానీ, ఈడీ కవితను విచారించడంపై కానీ ఆ పార్టీ నేతలు కానీ, శ్రేణులు కానీ మాట్లాడటం లేదు. అలా మాట్లాడవద్దని వారికి పార్టీ అగ్రనేత నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లుగా పార్టీ శ్రేణులే అంటున్నాయి. దీంతో ఈ కుంభకోణం విచారణలో బీఆర్ఎస్ రాజీధోరణి అవసంబిస్తోందా అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తమౌతున్నాయి.  హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీ వెళ్లి చేసిన ప్రయత్నాల వల్లే కవిత అరెస్టు కాకుండా ఈడీ విచారణ ఎదుర్కొని బయటకు వచ్చారని కూడా పరిశీలకులు అంటున్నారు.  అయితే కల్వకుంట్ల కవిత మరోసారి ఈ నెల 16న ఈడీ విచారణకు హాజరు కానున్నారు. అంత వరకూ ఈ అనుమానాలు, ప్రచారాలు అయితే సాగుతూనే ఉండే అవకాశాలు ఉన్నాయి.  

సమైక్యాంధ్రవాదికి కమలం పార్టీలో తెలంగాణ బాధ్యతలా?

ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి   నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి చర్చల ప్రక్రియ పూర్తయ్యిందని చెబుతున్నారు. వాస్తవానికి గతంలోనే ఆయన కమలం గూటికి చేరతారన్న వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే అప్పట్లో ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. పేరుకైతే కాంగ్రెస్ లో ఉన్నారు కానీ పార్టీలో ఏ మాత్రం క్రియాశీలంగా వ్యవహరించడం లేదు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ తో విభేదించి జై సమైక్యాంధ్ర పేరుతో పార్టీ స్థాపించి 2014 ఎన్నికలలో పరాజయం తరువాత ఆయన రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నది లేదు. రాహుల్‌గాంధీ ఏపీ-తెలంగాణలో పాదతయాత్ర సాగినప్పుడు కూడా ఆయన బయటకు వచ్చిన దాఖలాలు లేవు. చివరాఖరికి ఆయన తన సొంత జిల్లా అయిన చిత్తూరులో కూడా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.  అయితే ఆయన  సోదరుడు నల్లారి కిశోర్‌రెడ్డి టీడీపీలో చురుకుగా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఎక్కువగా హైదరాబాద్‌లోనే గడుపుతున్నారు రాజకీయాలతో సంబంధం లేకుండా. అంటే రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకులలో లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్లు ప్రకటించి రాజకీయ సన్యాసం తీసుకుంటే.. ఎటువంటి ప్రకటనా లేకుండా ఇంతకాలం అదే పని చేశారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. అంటే రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు  అటువంటి ఆయన ఇప్పుడు బీజేపీలో చేరి రాజకీయాలలో క్రియాశీలంగా మారేందుకు సమాయత్తమౌతున్నారు. అయితే ఆయనకు బీజేపీలో ఏపీ బాధ్యతలు కాకుండా, తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా, సమైక్యాంధ్ర పేరుతో పార్టీని స్థాపించిన కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు అప్పగించడం బీజేపీకి ఎంత వరకూ ఉపయుక్తంగా ఉంటుందన్నది ప్రశ్నార్థకమే. అయితే బీజేపీ మాత్రం స్వయంగా తెలంగాణ జాతిపితగా తనను తాను అభివర్ణించుకున్న కేసీఆరే తెలంగాణ వాదానికి స్వస్తి చెప్పి జాతీయ వాదమంటూ ఏపీలో కూడా బీఆర్ఎస్ విస్తరణకు ప్రయత్నాలు ప్రారంభించిన పరిస్థితుల్లో ఇక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నాటి వాదనలకు తావే ఉండదని   భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే తెలంగాణలో బీజేపీకి రెడ్డి సమాజిక వర్గాన్ని చేరువ చేసే బాధ్యతలు కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించాలని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఏది ఏమైనా ఒక మాజీ సీఎం పార్టీలో చేరారంటే.. అది బీజేపీకి ప్లస్ అవుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన క్రియాశీలంగా ఉన్నారా లేదా అన్నది తరువాత ఇప్పటి పరిస్థితుల్లో మాజీ సీఎం స్థాయి వ్యక్తి కమలం గూటికి చేరారు అని చెప్పుకోవడం ఎంత కాదనుకున్నా బీజేపీకి సానుకూల వాతావరణం ఉన్నందునే చేరికకు ఇతర పార్టీల నేతలు ఉత్సుకత చూపుతున్నారన్న ప్రచారమైనా జరుగుతుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు.  

వాట్సప్ చాట్ డీకోడ్.. ఇక అరెస్టేనా?

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ కవితను విచారిచడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దేశం మొత్తం దృష్టి ఇప్పుడు కవితను ఈడీ అరెస్టు చేస్తుందా? చేయదా అన్న అంశంపైనే ఉంది. కాగా ఈడీ కూడా కవిత విచారణకు ముందు చాలా పకడ్బందీగా ఈ కుంభకోణంలో ఆమె ప్రమేయానికి సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించిందని కూడా అంటున్నారు. కవితను విడిగా విచారించడమే కాకుండా.. ఈ కేసులో ఇప్పటికే అరెస్టై ఉన్న ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా,  మనీష్ సిసోడియా, అరుణ్ పిళ్లై, దినేష్ ఆరోరా, బుచ్చిబాబు, మనీష్ సిసోడియా మాజీ కార్యదర్శి అరవింద్, మాజీ అధికారులు కులదీప్ సింగ్, నరేంద్ర సింగ్ లతో కలిపి విచారిస్తోందనని తెలుస్తోంది. వీరంతా కూడా తమతమ సెల్ ఫోన్ లను ధ్వంసం చేసిన వారేనని ఈడీ చెబుతోంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కుంభ కోణం వ్యవహారంలో వీరు కోడ్ భాషలో వాట్సాప్ చాటింగ్ చేశారన్న విషయాన్ని గుర్తించిన ఈడీ ఆ కోడ్ ను కూడా డీ కోడ్ చేయగలిగిందని అంటున్నారు.  దీంతో పక్కా సాక్ష్యాధారాలతో ఆమె అరెస్టుకు ఈడీ రంగం సిద్ధం చేసిందని పరిశీలకులు అంటున్నారు. ఈ కుంభకోణంలో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న వారంతా తమ ఐఫోన్లను ధ్వంసం చేశారని, అందులో ఉన్న సమాచారాన్ని మొత్తం క్రోడీకరిస్తే కీలక విషయాలు తెలిసాయని ఈ డి అంటోంది. వాటి ఆధారంగానే కవిత, మిగతా తొమ్మిది మందిని ఒకేసారి ఈడి అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ విస్తరణకు దోహదం?!

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ సమన్ల మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. విచారణ షురూ అయ్యింది. విచారణ అనంతరం కవితను అరెస్టు చేసే అవకాశాలున్నయన్న ప్రచారమూ జోరుగా సాగుతోంది. నిన్న మొన్నటి వరకూ కవితకు పెద్దగా మద్దతు ప్రకటించని బీఆర్ఎస్ అధినేత, తండ్రి కేసీఆర్, మంత్రి సోదరుడు కూడా అయిన కేటీఆర్, సమీప బంధువు హరీష్ రావు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఇప్పుడు ఆమెకు సంఘీభావంగా హస్తిన చేరుకున్నారు. బీఆర్ఎస్ నినాదమైన బైబై మోడీ ఫ్లెక్సీలు ఢిల్లీలో కవితకు మద్దతుగా వెలిశాయి. ఒక్క సారిగా బీఆర్ఎస్ రాజకీయం మొత్తం ఢిల్లీపై కాన్సన్ ట్రేట్ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కవితను అరెస్టు చేసే అవకాశాలున్నాయని చెప్పేశారు. చేసుకోనివ్వడం చూద్దాం అంటూ చాలెంజ్ కూడా చేశారు. అలా బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ముగిసిందో లేదో ఇలా మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు హస్తిన ఫ్లైట్ ఎక్కేశారు. ఈ మధ్యలోనే ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ విచారణలో తాను ఎమ్మెల్సీ కవితకు బినామీని అని అంగీకరించిన హైదరాబాద్ కు చెందిన వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై యూటర్న్ తీసుకున్నారు. అంతే కాదు తాను ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతించాలంటూ కోర్టును శుక్రవారం (మార్చి 10) ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై కోర్టు ఈడీకి నోటీసులు ఇచ్చింది. వాస్తవానికి కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడానికి అరుణ్ రామచంద్రపిళ్లై వాంగ్మూలమే ఆధారమని చెప్పవచ్చు. అటువంటిది అరుణ్ రామచంద్రపిళ్లై తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకుంటానంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కవితకు ఏదో మేరకు ఊరట లభించినట్లేనని అంటున్నారు. ఆమెను అరెస్టు చేసే అవకాశాలు పెద్దగా లేవన్న ప్రచారం కూడా సాగుతోంది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు హైదరాబాద్ నుంచి హుటాహుటిన హస్తినకు వెళ్లినది కూడా ఈడీ విచారణ ఎదుర్కొని బయటకు వచ్చే కవితకు ఘనస్వాగతం పలికి తోడ్కొని రావడానికేనని కూడా అంటున్నారు.   అయితే  ఒక సారి ఇచ్చిన వాంగ్మూలం ఉపసంహరించుకోవటం సాధ్యం అవుతుందా.. చట్టంలో  అటువంటి  వెసులు బాటు ఉందా, అలాగే వాగ్మూలం ఉపసంహరించుకోవటానికి కోర్టు అనుమతి ఇస్తుందా? అన్న ప్రశ్నలపైనే ఇప్పుడు చర్చ అంతా సాగుతోంది.  మొత్తానికి అరుణ్ రామచంద్రపిళ్లై వాంగ్మూలం ఉపసంహరించుకోవడానికి దాఖలు చేసిన పిటిషన్ అలా ఉంటే.. కవిత మాత్రం ఈడీ విచారణకు హాజరయ్యారు.  అమె అరెస్టవుతారా లేదా అన్న ఉత్కంఠకు మరి కొన్ని గంటలలో తెరపడుతుంది. అయితే కవితకు ఈడీ  నోటీసులు, విచారణ నేపథ్యంలో జాతీయ రాజకీయాలలో ఒక్కసారిగా కుదుపు వచ్చిన మాట వాస్తవం. ఆమె హస్తిన వేదికగా శుక్రవారం (మార్చి 10) చేపట్టిన మహిళా రిజర్వేషన్ల బిల్లు దీక్షకు దాదాపు 18 రాజకీయ పార్టీలు మద్దతు, సంఘీభావం ప్రకటించాయి. ఈ దీక్ష వేదికగా ఆమె కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలలో మరింత చురుకుగా వ్యవహరించేందుకు ఈ పరిణామాలు కచ్చితంగా దోహదం చేస్తాయనడంలో సందేహం లేదు. 

ఇక నమ్మలేం.. నమ్మం కూడా.. జగన్ సర్కార్ కు తేల్చేసిన ఉద్యోగులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగులు జగన్ సర్కార్ ను ఇక నమ్మేదేలే.. అంటూ బాహాటంగా చెప్పేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ ఉద్యోగులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ప్రభుత్వంపై ఆగ్రహంతో మండిపడుతున్నారు. నిరసనలతో హోరెత్తించడానికి రెడీ అయిపోయారు. ప్రభుత్వంతో చర్యలంటున్న తమ సంఘాల నేతలపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు ఆగ్రహాగ్ని తట్టుకోలేకే అనివార్యంగా ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళనా కార్యక్రమాలకు కార్యాచరణ ప్రకటించారు. ఔను ఉద్యమ కార్యాచరణ తప్ప మరో మార్గం లేని పరిస్థితిని నేతలను ఉద్యోగులే తీసుకువచ్చారు. ఉద్యోగులు ఇంకెంత మాత్రం ప్రభుత్వాన్ని నమ్మడానికి సిద్ధంగా లేరని నేతలే చెప్పేపరిస్థితికి వచ్చారు. ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వం ఇచ్చే హామీలను ఉద్యోగులు ఎంత మాత్రం నమ్మే పరిస్థితి లేదని కుండబద్దలు కొట్టేశారు. ప్రభుత్వం చర్చలంటూ పిలిచి ఓవో నోటి మాటలతో హామీలు ఇచ్చినంత మాత్రాన సరిపోదనీ...తాము ఉద్యమ కార్యాచరణ మేరకే ముందుకు వెడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర నాయకత్వం నచ్చచెప్పినా ఉద్యోగులు వినే పరిస్థితి అయితే కనిపించడం లేదని తేల్చేశారు. వాస్తవం కూడా అదే. చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఐఆర్ కంటే తక్కువ పీఆర్సీకి ఉద్యోగ సంఘాల నేతలు తలలూపినప్పుడే వారు ఉద్యోగుల నమ్మకాన్ని కోల్పోయారు. అది కూడా ఆచరణలోనికి రాకపోయే సరికి ఉద్యోగులే నేతలను ఉద్యమ కార్యాచరణ దిశగా నడిపించారు. ఇప్పుడు ఆ వాస్తవం నెమ్మదిగా నేతలకూ అర్ధం అవుతోంది. అందుకే ప్రభుత్వ హామీలను నేతలు కూడా నమ్మడం లేదు. తక్షణం బకాయిలు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం జీతాలే చెల్లించడం లేదనీ, ఇటువంటి పరిస్థితుల్లో తాము తగ్గితే ఇక బకాయిలకు నీళ్లొదిలేసుకోవాల్సిందేనని వారు అంటున్నారు. ఆందోళనను కొనసాగించాల్సిందేననీ, అవసరమైతే మరింత ఉధృతం చేయడానికైనా వెనుకాడవద్దనీ ఉద్యోగులు నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ విషయాన్నే విలేకరుల సమావేశంలో చెప్పారు. తమ కార్యవర్గ సమావేశంలో ఇదే అభిప్రాయం చాలా చాలా బలంగా వ్యక్తమైందని చెప్పారు. ఈ నెలాఖరులోగా  చట్టబద్ధంగా తమకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేయడం ఖాయమని చెప్పారు. అసలు ప్రభుత్వం పిలిస్తే చర్చలకు వెళ్లడంపైనే తన నేతలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలు అనగానే ఎందుకు ఎగిరి గంతేసి మరీ వెళుతున్నారని నిలదీస్తున్నారు. సీఎం జగన్ సర్కార్ ఉద్యోగ సంఘాల నాయకులను తమ గుప్పిట్లో పెట్టుకుందనీ ఆరోపిస్తున్నారు.  పీఆర్సీ వివాదం తలెత్తిన సమయంలో ప్రభుత్వం ఇదే విధంగా ఉహ్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేరలేదని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.   అసలు ఉద్యోగుల సొమ్ములు వారికి తెలియకుండా తీసుకోవడం తప్పు. కాదు నేరం. నిజానికి  నేరం చేసిన సర్కార్ ను ఉద్యోగ సంఘాలు నిలదీయాలి. కానీ  ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం అందుకు భిన్నంగా మంత్రి వర్గ ఉప సంఘంతో చర్చలు జరపడాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు.   మార్చి నెలాఖరులోపు  మూడు వేల కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెబుతున్నారు. కానీ ప్రభుత్వం ఇస్తుందన్న నమ్మకం అయితే  ఉద్యోగులలో కలగడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, టీచర్లు ఓట్లు కావాలి కనుకనే  చర్చల పేరు ఉద్యోగులను మరో సారి మోసం చేసేందుకు సర్కార్ ప్రయత్నిస్తోందని ఉద్యోగులు గట్టిగా చెబుతున్నారు.