కవితకు అండగా తెరపైకి కేటీఆర్

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం పై ఇంతవరకు పెదవి విప్పని మంత్రి కల్వకుట్ల తారక రామా రావు, ఎట్టకేలకు పెదవి విప్పారు. నిజానికి, ఇంచు మించుగా ఆరేడు నెలలుగా ఢిల్లీ మద్యం కుంభ కోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ, ఈడీ దాఖలు చేసిన ప్రతి చార్జి షీట్ లోనూ ఆమె పేరు ఒకటికి పది సార్లు ప్రస్తావనకు వస్తూనే వుంది. ముద్దాయిగా ఆమె పేరు చేర్చలేదు అనే గానీ, కేసు మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతోంది. ఉచ్చులు బిగుస్తున్నాయి. అయినా  ఇంతవరకు ఒక్క కేటీఆర్ మాత్రమే కాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు కల్వకుట్ల కుటుంబంలో ఎవరూ  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు గురించి ఒక్క మాట మాటలాడలేదు. ఇప్పుడు ఈడీ సమాన్లు జారీ చేసి, ఆమె అరెస్ట్ కు రంగం సిద్దం చేస్తున్న సంకేతాలు అందుతున్న సమయంలో కేటీఆర్ చెల్లెలికి మద్దతుగా తెర మీదకు వచ్చారు.  అయితే ఢిల్లీ మద్యం కుంభకోణం గురించో, అందులో కవిత పాత్రకు సంబంధించి వస్తున్న ఆరోపణల గురించో కాకుండా, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ టార్గెట్ గా విమర్శలు చేశారు. కవితకు సమన్లు జారీ చేసింది ఈడీ  కాదు మోడీ అంటూ విరుచుకు పట్టారు. దేశంలో జుమ్లా లేదంటే హమ్లా అన్నట్లు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఇప్పటివరకు తమ పార్టీ నేతలపై  ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థలను ఉసిగొల్పారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు ఇచ్చారన్నారు. అవి ఈడీ సమన్లు కాదు.. మోడీ సమన్లు అని విమర్శించారు. కేంద్రం చేతిలో  దర్యాప్తు  సంస్థలు కీలక బొమ్మలుగా మారాయని  కేటీఆర్ ఆరోపించారు. కేంద్రం ప్రతిపక్షాల మీద కేసుల దాడి, ప్రజల మీద ధరల దాడి చేస్తోందని మండిపడ్డారు.  దేశమంతా అవినీతిపరులు తాము మాత్రం సత్యహరిశ్చంద్రుని కజిన్ బ్రదర్స్ అన్నట్లు  బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. మరి బీజేపీ నేతలు మీద ఉన్న కేసులు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు.   గురువారం(మార్చి 9) మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన లిక్కర్ స్కాంలో కవితకు.. ఈడీ నోటీసులు ఇవ్వటాన్ని ప్రస్తావించారు. మా ఎమ్మెల్సీ విచారణను ఎదుర్కొంటారని.. విచారణకు హాజరవుతారని స్పష్టం చేశారు కేటీఆర్. ఇది రాజకీయ వేధింపులుగానే చూస్తున్నామని.. అంతా డ్రామా నడుస్తుందన్నారు. రాజకీయంగా ప్రజాకోర్టులో తేల్చుకుంటామని.. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. అంతిమంగా న్యాయం గెలుస్తుందన్నారు మంత్రి కేటీఆర్. ఒక్క కవితకే కాదని.. 10, 12 మంది బీఆర్ఎస్ నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేశాయన్నారు. కవిత మొదటిది కాదు.. చివరిది కాదని.. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నేతలకు దాడులు చాలా జరుగుతాయన్నారు కేటీఆర్. రాజకీయ వేధింపులను రాజకీయంగానే ఎదుర్కొంటామన్నారు కేటీఆర్.  అయితే, కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని విమర్శించడం వలన రాజకీయంగా కేటీఆర్ కు ఏదైనా మేలు జరిగితే జరగవచ్చును కానీ, మోడీపై కేటీఆర్ చేసిన విమర్శలు  విచారణ ఎదుర్కుంటున్న కవితకు ఏ విధంగాను మేలు చేయక పోగా, సమస్యను మరింత జటిలం చేసే ప్రమాదముందని, అంటున్నారు.

ఉద్యోగులను జగన్ ప్రభుత్వం మోసం చేసింది.. బొప్పరాజు

కొంచం ఆలస్యంగానైనా ఉద్యోగ సంఘం నాయకులు, అందరూ కాకపోయినా కొందరు జగన్ సర్కార్ ఉద్యోగులను మోసం చేసిందని అంగీకరిస్తున్నారు. ఉద్యోగుల ఆగ్రహానికి జడిసి వారిలా చెబుతున్నారా? లేక వారిలో నిజంగానే జ్ణానోదయం అయ్యిందా అన్న విషయం పక్కన పెడితే.. ఇప్పటికైనా ప్రభుత్వం మోసం చేసిందని బహిరంగంగా ప్రకటించడం ఉద్యోగులలో జగన్ ప్రభుత్వం పట్ల ఆగ్రహం, వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్ధం అయ్యేలా చేసింది.   ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు    మీడియా సమావేశంలో ఉద్యోగుల డబ్బును ప్రభుత్వంఇతర అవసరాలకు వాడుకుందని, ఆ సొమ్మును ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని చెబుతోందదన్నారు. ఉద్యమ కార్యాచరణలోకి వెళ్లిన ఉద్యోగులను మభ్యపెట్టడానికి ప్రభుత్వం చెప్పే కల్లబొల్లి కబుర్లను తాము విశ్వసించబోమని స్పష్టం చేశారు. పీఆర్సీ ఒప్పందాలను పూర్తిగా అమలు చేయాలన్నారు.   మొక్కుబడికి చర్చలకు పిలిచారనీ, ఏ ఒక్క విషయంలోనూ స్పష్టత ఇవ్వలేదనీ బొప్పరాజు ఆరోపించారు. పదవీ విరమణ చేసిన వారికి బెనిఫిట్స్ అందే పరిస్థితి లేదని అన్నారు. ప్రతి నెలా మొదటి తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి లేదనీ, అది సాధ్యపడదనీ ప్రభుత్వం చెబుతోందన్నారు. మరి మంత్రులకూ, సలహాదారులకూ ఠంచనుగా మొదటి తేదీన జీతాలెలా చెల్లిస్తోందంటూ ఆయన నిలదీశారు.  సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి 2,600 కోట్ల రూపాయలు చెల్లించలేదన్నారు. సీపీఎస్ వినా మరే ప్రత్యామ్నాయాన్నీ తాము అంగీకరించే ప్రశక్తే లేదని బొప్పరాజు తేల్చి చెప్పారు.  కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణను జగన్ సర్కార్ గాలికొదిలేసిందన్నారు. ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులనూమోసం చేసిందన్నారు.  ప్రభుత్వం మొక్కుబడిగా హామీలు ఇస్తుందని అందుకే తమ కార్యాచరణ అమలుకు తీర్మానించామని బొప్పరాజు ప్రకటించారు

వివేకా హత్య కేసులో అవినాష్ కు అరెస్టు భయం.. అందుకేనా కోర్టుకు?

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడం ఖాయమన్న నిర్ణయానికి కడప ఎంపీ, వైసీపీ నేత అవినాష్ రెడ్డి వచ్చేశారా? అరెస్టును తప్పించుకోవడానికి దారులు వెతుకుతున్నారా? అంటే ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడాన్ని బట్టి చూస్తే ఔననే అనిపిస్తుంది. ఈ కేసులో  తనను అరెస్టు చేయకుండా సీబీఐని ఆదేశించాలంటూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.  ఈ మేరకు ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ తనను విచారించే సమయంలో వీడియో రికార్డింగ్ చేయాలని ఆ పిటిషన్ లో అవినాష్ రెడ్డి కోరారు. అంతే కాకుండా తన న్యాయవాది సమక్షంలోనే తనను విచారించేలా సీబీఐని ఆదేశించాలని కోరారు. వివేకా హత్య కేసులో ఏ4గా ఉన్న దస్తగిరిని సీబీఐ విచారించలేదని తన పిటిషన్ లో అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే దస్తగిరి ముందస్తు బెయిలు పిటిషన్ ను కూడా సీబీఐ వ్యతిరేకించలేదనీ, అప్రూవర్ గా మారానంటూ దస్తగిరి చెప్పిన మాటల ఆధారంగానే విచారణ చేస్తోందని ఆ పిటిషన్ లో అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో తనకు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలూ, ఆధారాలూ ల లేకపోయినప్పటికీ తనను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు.  వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారి పనితీరు పాదర్శకంగా లేదని అవినాష్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.  తనకు 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు కనుక  అరెస్టు చేయకుండాసీబీఐని ఆదేశించాలని ఆ పిటిషన్ లో అవినాష్ రెడ్డి కోరారు. ఇలా ఉండగా ఈ నెల 10న అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ రెండు సార్లు విచారించింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి విచారణకు పిలిచింది.   తొలి సారి విచారణ అనంతరం అవినాష్ రెడ్డి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా సీఎం జగన్ ఓఎస్ డీని, అలాగే జగన్ సతీమణి వ్యక్తిగత కార్యదర్శి నవీన్ ను సీబీఐ విచారించింది. నవీన్ కు అయితే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందన్న సమాచారం ఇచ్చింది. ఇక అవినాష్ రెడ్డి రెండో సారి సీబీఐ విచారణను ఎదుర్కొని బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన సమయంలో ఆయనలో ఆందోళన కనిపించింది.  సీబీఐ విచారణ సవ్య దిశలో సాగటం లేదని అప్పట్లో విమర్శించారు. అంతే కాకుండా తనను మూడో సిరి విచారణకు రావాలని సీబీఐ చెప్పలేదనీ, సీబీఐ ప్రశ్నలన్నిటికీ తాను సమాధానాలు చెప్పానని అప్పట్లో స్పష్టం చేశారు.  అయితే ఇప్పుడు  ముచ్చటగా మూడో సారి కూడా ఆయనను సీబీఐ విచారణకు పిలిచింది.   సీబీఐ సోమవారం (మార్చి 6)విచారణకురావాల్సిందిగా ఇచ్చిన నోటీసుకు అవినాష్ రెడ్డి ఆ రోజు విచారణకు హాజరు కావడం వీలుపడదని సమాధానం ఇచ్చారు.   తొలిసారి విచారణకు నోటీసు ఇచ్చిన సమయంలోనూ  ఆయన ఇదే సమాధానం ఇచ్చిన సంగతి విదితమే. దీంతో పెద్దగా కారణాలు వివరించాల్సిన అవసరం లేకుండా విచారణకు సహకరించడం లేదన్న ఒకే ఒక్క కారణంతో సీబీఐ అవినాష్  రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉంది. అయినా కూడా అవినాష్ రెడ్డి విజ్ణప్తి మేరకు సీబీఐ అధికారులు  ఈ  నెల 10న హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి హాజరు కావాల్సింది ఆదేశిస్తూ ఆదివారం (మార్చి 5)న పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లి మరీ నోటీసు ఇచ్చి వచ్చారు.  ఆ  రోజు  మాత్రం  ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందేనని సీబీఐ అధికారులు అల్టిమేటం ఇచ్చినట్లుగా  కూడా చెబుతున్నారు.  వరుస పరిణామాలను గమనిస్తే   వివాక్ హత్య కేసులో సీబీఐ దర్యాప్తు  తుదిదశకు చేరుకున్నట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు.   ఇక వరుస అరెస్టులు ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి అరెస్టు చేయకుండా సీబీఐని ఆదేశించాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇన్ఫ్లూయెంజా ఎఫెక్ట్.. కర్నాటకలో మాస్క్ మస్ట్

ఇటీవలి కాలంలో దేశంలో ఆందోళన రేకెత్తిస్తున్న ఇన్ ఫ్లుయెంజా వైరస్ (హెచ్3ఎన్2) ప్రభావంతో కర్నాటక ప్రభుత్వం తమ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బయటకు రావాలంటే మాస్క్ ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం కర్నాటకలో ఇన్ ఫ్లూయెంజా విశ్వరూపం చూపుతోంది. శరవేగంగా వ్యాపిస్తున్న   వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు మాస్కును తప్పనిసరి చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. బెంగళూరు నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పని సరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  అలాగే  గుంపులు గుంపులుగా చేరవద్దని,  భౌతిక దూరం పాటించాలని  ప్రజలకు హెచ్చరికలు  జారీ చేసింది. ఇన్ఫుయెంజాను కట్టడి చేసేందుకు ప్రజలు చొరవ తీసుకుని సురక్షితంగా ఉండాలని సూచించింది.  ఇన్ఫుయెంజా లక్షణాలు చాలా వరకూ కోవిడ్ లక్షణాలను పోలి ఉంటాయనీ, అందుకే లక్షణాలు కనిపించిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించింది. ఇన్ఫ్లుయెంజాను అరికట్టాలంటే  కఠిన ఆంక్షలు తప్పవని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.

కవిత అరెస్ట్ అయితే?

ఒకరోజు అటూ ఇటూ కావచ్చునేమో కానీ ఢిల్లీ మద్యం కేసులో  బీఆర్ఎస్ అధినేత,  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ, భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుట్ల కవిత, అరెస్ట్  ఖాయంగా కనిపిస్తోందనే అభిప్రాయమే సర్వత్రా వినిపిస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్  సమన్లు అందుకుని ఢిల్లీ వెళ్ళిన  కవితకు  ముఖ్యమంత్రి కేసేఆర్ ధైర్యం చెప్పి పంపించారనీ,  ఒక తండ్రిగానే కాకుండా, పార్టీ అధినేతగా కూడా కేసీఆర్ కుమార్తె కవితకు  నేనున్నానన్న ధైర్యాన్ని ఇచ్చారనీ చెబుతున్నా.. ఆమె హస్తినకుబయలుదేరి వెళ్లే ముందు   కసీఆర్ ను కలవకుండానే బయలుదేరడం చూస్తే ఆ భరోసా ఆమెకు లభించినట్లు లేదని  అయితే, జరుగతున్న పరిణామాలను గమనిస్తే మాత్రం  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెరాస రోజుల్లో కేసీఆర్ తెరపైకి తెచ్చిన రాజకీయ, న్యాయ పోరాటాన్ని, బీఆర్ఎస్ సుదీర్ఘ కాలం కొనసాగించక తప్పదని అంటున్నారు.   నిజానికి, ఈ కుంభకోణం నుంచి ఒక్క కవిత మాత్రమే కాదు, ఇప్పటికే అరెస్ట్ అయి విచారణ ఎదుర్కుంటున్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా, ఎవరికీ కూడా ఇప్పట్లో ఉపశమనం దొరికే అవకాశాలు పెద్దగా లేవని కూడా అంటున్నారు. అందుకే మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన వెంటనే ఆయన తన  మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటుగా మరో కేసులో ఎప్పడో కొన్ని నెలల క్రితం అరెస్ట్ అయిన మరో ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్  కూడా రాజీనామా చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, వారి రాజీనామాలను తక్షణం ఆమోదించారు. అంటే, ఈకేసు ఇప్పట్లో తేలేది కాదని, సుదీర్ఘ కాలం పాటు రాజకీయ, న్యాయ పోరాటం తప్పదనే ఉద్దేశంతోనే, కేజ్రీవాల్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారని అంటన్నారు.  అదలా ఉంచితే కవిత విషయానికి వస్తే, భూత, భవిష్యత్, వర్తమాన రాజకీయలను అవపోసన పట్టిన ముఖ్యమంత్రి కేసేఆర్ ,నిజంగా కవిత అరెస్ట్  అయితే  ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తలుస్తోంది. నిజానికి ఆరు నెలలకు పైగా ఢిల్లీ లిక్కర్ స్కాం కథ  నడుస్తున్నా, అందులో కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా, చివరకు కవిత అరెస్ట్ అనివార్యమని తెలిసినా, విపక్షాలు, ముఖ్యంగా బీజేపీ కవిత అరెస్ట్ కథలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా కేసీఆర్ ఏనాడూ ఢిల్లీ కుంభకోణం గురించి ఒక్క మాటైనా మాట్లాడలేదు. చివరకు ఈడీ సమాన్లు అందుకుని ఢిల్లీ వెళ్ళే ముందు కవిత ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ ను కలుస్తారని ప్రచారం జరిగినా,  ఆమె ప్రగతి భవన్ కు వెళ్ళ కుండా నేరుగా  శంషాబాద్ విమానాశ్రయానికి  అక్కడి నుంచి ఢిల్లీకి ఒంటరిగానే వెళ్లారు.  ఇదంతా కూడా కేసీఆర్ వ్యూహంలో భాగంగా జరిగిందన్న వాదన కూడా ఉంది. అది పక్కన పెడితే..  కవితను  అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి..?  ఈ విషయంలో కేసీఆర్ నెక్స్ట్  స్టెప్ట్ ఏంటి..?  ఎప్పటి నుంచో కేంద్రాన్ని ఢీకొంటున్న కేసీఆర్..  మరింత రెచ్చిపోతారా..? ప్రతిపక్ష పార్టీల అధినేతలను,  బీజేపీని వ్యతిరేకిస్తున్న నాయకులను కలుపుకొని వెళ్తారా..?  ఇప్పటికే పలు కేసుల్లో అరెస్ట్ అయిన వారితో,  విచారణను ఎదుర్కొంటున్న వారితో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారా..?  ఏది ఏమైనా   ప్రస్తుతానికి ఆయన వ్యూహం ఏమిటన్నది  గోప్యంగానే వుంది. అలాగే,ఇతర  పార్టీలు కూడా ఈ విషయాన్ని చాలా నిశితంగా గమనిస్తున్నాయి.   మీడియా సమావేశాలలో కూడా ఈ అంశంపై  ఒకటికి, పది సార్లు చర్చించిన తర్వాతే  స్పందించనున్నారని తెలుస్తోంది. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూలో ఏది పడితే అది మాట్లాడి పరువు పొగొట్టుకోవడం కంటే అన్ని తెలుసుకున్న తర్వాతే స్పందించాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి, అందరి దృష్టీ మత్రం కవిత అరెస్ట్ అయితే ... కేసీఆర్ ఏం చేస్తారన్నదానిపైనే కేంద్రీకృతం అయ్యిందని మాత్రం పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. .

కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తం సిద్ధమైందా?

ఈ ప్రశ్న బీఆర్ఎస్ వర్గాలలోనే కాదు.. సర్వత్రా వినిపిస్తోంది. ఇందుకు కారణం ఆ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి కనబరచకపోవడమే కారణం అని చెప్పవచ్చు. ఆ కారణంగానే ఇప్పుడు బీఆర్ఎస్ లో సీనియర్లు కూడా తరచుగా కాబోయే సీఎం కేటీఆర్ అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అయితే వారి ఈ ప్రకటనల వెనుక కేసీఆర్ అనుమతి కచ్చితంగా ఉండే ఉంటుంది. ఎందుకంటే ఇకపై తన ఫుల్ కాన్ సన్ ట్రేషన్  అంతా జాతీయ రాజకీయాలపైనే అని అయన స్వయంగా ప్రకటించేశారు కూడా. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ పట్టాభిషేకం ఎప్పుడు? ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చిన తరువాతనా, లేక ఎన్నికలకు ముందుగానే ఆ తంతు పూర్తి చేసి.. వచ్చే ఎన్నికలను కేటీఆర్ సారథ్యంలోనే పార్టీ ఎదుర్కొటుందా అన్న చర్చ ఇప్పుడు పార్టీ వర్గాలతో పాటు, పొలిటికల్ సర్కిల్స్ లో కూడా జోరుగా సాగుతోంది.  ఏది ఏమైనా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో సమయం లేదు. అయినా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ అధినేత మాత్రం నోరు మెదపడం లేదు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెడదాం అన్న దోరణినే ప్రదర్శిస్తున్నారు. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికలకు బీఆర్ఎస్ ను సన్నద్ధం చేయాల్సిన బృహత్తర బాధ్యత కూడా ఆయన భుజస్కంధాలపై ఉంది. ఉంది అనడం కంటే ఆయనంతట ఆయనే ఈ బాధ్యతను తలకెత్తుకున్నారు. ఈ పరిస్థితుల్లో ముందస్తుకు వెళ్లి జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణపై దృష్టి పెట్టలేని పరిస్థితిని స్వయంగా కొని తెచ్చుకుంటారని భావించలేమని పరిశీలకులు అంటున్నారు. అలాగని ముందస్తుకు వెళ్లకుండా ఎన్నికలలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకు వచ్చే బాధ్యతను తనయుడికి అప్పగించి తాను జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణ బాధ్యతలను చేపట్టాలన్నది కేసీఆర్ ఉద్దేశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా అదే చెబుతున్నారు.  ఇందుకు కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలు నెలల వ్యవధిలోకి వచ్చేసినా కూడా జాతీయ రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తుండటాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. నిజానికి బీఆర్ఎస్ విస్తరణ ఇంకా తొలి అడుగులోనే ఉంది.. అక్కడక్కడా ఒకటి రెండు రాష్ట్రాలలో బీఆర్ఎస్ లోకి చేరికలు జరిగినప్పటికీ.. ఏపీ మినమా మరే రాష్ట్రంలోనే బీఆర్ఎస్ అధ్యక్షుల నియామకం జరగలేదు. ఇందుకు తెలంగాణ కూడా మినహాయింపు కాదు. కేటీఆర్ పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నా, అది పార్టీ రాష్ట్ర శాఖ కు ఆయన పూర్తి స్థాయి అధ్యక్షుడి హోదాలో ఉన్నట్లు ఎంతమాత్రం కాదు.  మరి బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో విస్తరణ పనులు ఆరంభించాల్సిన తరుణంలో రాష్ట్ర పార్టీలో అసంతృప్తులు, అలకలను పరిష్కరిస్తూ సమయం వృధా చేసే సాహసం కేసీఆర్ చేస్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి.   అందుకే జాతీయ రాజకీయాల పేరిట కేసీఆర్ కావాలనే తన ప్రాధాన్యతను ఉద్దేశపూర్వకంగా తగ్గించుకుంటున్నారంటున్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే తాను సీఎం బాధ్యతల నుంచి తప్పించుకుని రాష్ట్ర పగ్గాలను తనయుడు, మంత్రి కేటీఆర్ కు అప్పగించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కవితకు ఈడీ నోటీసులపై కేసీఆర్ కాకుండా కేటీఆర్ గురువారం ( మార్చి 9)న మీడియా ముందుకు కేటీఆర్ వచ్చి మాట్లాడారని అంటున్నారు. ఈ మీడియా సమావేశంలో కూడా కవితకు నోటీసులపై కంటే.. గత కొద్ది కాలంగా తెరాస నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు పంపిన నోటీసులు, చేసిన దాడులన్నిటినీ వివరించారు. అదే సమయంలో గతంలో తెలుగుదేశంలో ఉన్న సుజనా చౌదరి వంటి వారపై ఈడీ కేసులు వారు బీజేపీలో చేరిన వెంటనే వాటి ప్రస్తావనే లేని విషయాన్ని ప్రస్తావించారు. మోడీ సర్కార్ తీరంతా హమ్లా, జుమ్లా వ్యవహారమని విమర్శించారు. మొత్తంగా కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ మోడీ కనుసన్నలలోనే పని చేస్తున్నది అని ఎస్టాబ్లిష్ చేయడానికే ప్రయత్నించారు. ఇదే సమయంలో ఆయన అదానీ, మోడీ వ్యవహారంపై కూడా విమర్శలు గుప్పించారు. మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత మొత్తంగా కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులన్నీ విపక్షాలపైనేనని కేసీఆర్ విమర్శించారు. మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఇప్పటి వరకూ విపక్షాలపై 5వేలకు పైగా కేసులు నమోదయ్యాయని ఆయన గణాంకాలతో సహా వివరించారు. ఈ నేపథ్యంలోనే ఇక రాష్ట్ర పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆర్ చేతుల మీదుగానే జరుగుతాయన్న సంకేతాన్ని ఇచ్చారని అన్నారు. మొత్తంగా కవితను మద్యం కుంభకోణం కేసులో వెనకేసుకురావడం కంటే.. మొత్తంగా కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ మోడీ ఆదేశాలపై విపక్షాల నేతలను వేధించడమే పనిగా పెట్టుకున్నాయని ఎస్టాబ్లిష్ చేయడమే పొలిటికల్ మైలేజీ ఇస్తుందని కేటీఆర్ భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. 

ఉద్యోగుల జీతాలకేనా కరోనా కష్టాలు.. మంత్రుల జీతాలకు లేవా?

ఏపీలో ప్రభుత్వోద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. మూడో వారంలో కూడా వారు వేతనాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిందే. అయితే వేతనాల జాప్యానికి ప్రభుత్వం కరోనా  కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు సాకుగా చూపుతోంది. అయితే రాష్ట్ర మంత్రులకు మాత్రం ఠంచనుగా ఒకటో తేదీకల్లా వేతనాలు అందేస్తున్నాయి. మరి వారికి వేతనాలు చెల్లించడానికి సర్కార్ చెబుతున్న ఆర్థిక ఇబ్బందులు అడ్డురావా అని ఉద్యోగులే కాదు.. చేసిన పనులకు బిల్లులు రాని కాంట్రాక్టర్లు కూడా నిలదీస్తున్నారు. ఎదుటి వారికి నీతులు చెప్పే వారు ముందుగా దానిని పాటించాలని ఎవరైనా సరే భావిస్తారు. కానీ జగన్ సర్కార్ మాత్రం తాము చెప్పే కష్టాలూ, బాధలూ అన్ని ప్రజలకే కానీ మంత్రులకూ, ప్రభుత్వానికీ కాదని తన చేతల ద్వారా కళ్లకు కట్టినట్లు చూపుతోంది.    కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురై  ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు, డీఏలు ఇవ్వలేకపోతున్నామనీ, అంతే కాకుండా వారి న్యాయమైన సమస్యలను కూడా పరిష్కరించలేకపోతున్నామనీ బీద అరుపులు అరుస్తున్న జగన్ సర్కార్  తమ బీద అరుపులన్నీ ఉద్యోగుల జీతాల విషయంలోనే తప్ప మంత్రుల వేతనాల విషయంలో కాదని తేటతెల్లమైంది. ఈ విషయాన్ని ప్రభుత్వమే వెల్లడించింది. సమాచార హక్కు చట్టం కంద ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ కోరిన మేరకు  ప్రభుత్వ సహాయ కార్యదర్శి  పబ్లిక్ ఇన్ఫర్మేషన్ హోదాలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో..  కరోనా కాలంలోనూ మంత్రులకు వేలనాలలో పైసా కోత లేకుండా ఠంచనుగా ఒకటో తేదీకల్లా వేతనాలు జమ అయ్యయని పేర్కొన్నారు.   ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ఇంత వివక్ష,  మంత్రుల పట్ల అంత అపేక్ష ఏమిటని సమాజిక మాధ్యమం సాక్షిగా నెటిజన్లు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులంటూ తమకు సకాలంలో వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వం మంత్రులకు మాత్రం ఠంచనుగా వేతనాలు ఎలా చెల్లించగలుగుతోందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   ఏపీ మంత్రులకు ఏ తేదీలో జీతాలు చెల్లిస్తున్నారంటూ.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ గత నెల 2న సమాచార హక్కు చట్టం కింద సాధారణ పరిపాల శాఖకు దరఖాస్తు చేశారు. దానికి  పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హోదా ఉన్న ప్రభుత్వ సహాయ కార్యదర్శి ఈ  నెల 1న సుంకర పద్మశ్రీకి లిఖిత పూర్వక సమాధానం పంపించారు. ఆ సమాధానం మేరకు  ఏపీ మంత్రులందరికీ ప్రతి నెల ఠంచనుగా ఒకటవ తేదీనే ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోంది.  గత ఏడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకూ ఒకటవ తేదీనే మంత్రులకు జీతాలు చెల్లించామన్నది, అధికారి ఇచ్చిన లేఖ సారాంశం. ప్రభుత్వ అధికారి ఇచ్చిన లిఖిత పూర్వక వివరణను సుంకర పద్మశ్రీ మీడియాముఖంగా వెల్లడించడంతో ఈ విషయం బట్టబయలైంది. ఓ వైపు తమకు న్యాయబద్ధంగా రావలసిన డీఏలు, అరియర్సుతో పాటు.. ఒకటవ తేదీన జీతాలు, పెన్షన్ల కోసం   ఆందోళన చేస్తుంటే.. మంత్రులు మాత్రం ఒకటో తేదీనే జీతాలు తీసుకుంటూ దర్జాగా ఏసీ కా కార్లలో తిరుగుతున్నారని, పైగా వారే తమతో చర్చల సందర్భంగా ప్రభుత్వం కష్టాల్లో ఉందంటూ బీద అరుపులు అరుస్తున్నారని ఉద్యోగులు విరుచుకు పడుతున్నారు. కరోనా కష్టాలు-ఆర్ధిక నష్టాలు మంత్రులకు వర్తించవా అని నిలదీస్తున్నారు.  ఈ ప్రభుత్వం ఉన్నంతవరకూ కరోనా కష్టాలుంటాయని ఓ ఉద్యోగ నేత తాజా చర్చల్లో చేసిన వ్యాఖ్య అబద్ధమేనని, తాజా ఆర్టీఐ లేఖతో రుజువయిందంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు. తమకు ఒకటవ తేదీన జీతాలు-పెన్షన్లు ఇచ్చేందుకు సినిమా కష్టాలు చెబుతున్న సర్కారు.. అదే సినిమా కష్టాలు సచివులకు ఎందుకు వర్తింపచేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. తమది  ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటూ చెబుతున్న  ‘సలహాదారులు’ ఈ  వివక్షకు ఏం సమాధానం చెబుతారని నిలదీస్తున్నారు. 

కవితకు కల్వకుంట్ల ఫ్యామిలీ అండ కరవైందా?

కల్వకుంట్ల కవిత మాజీ అయినా, ప్రస్తుతం ఎమ్మెల్సీ అయినా,  తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు అయినా,  ఏమైనా ఆమెకు ఆ స్థాయి రావడానికీ, రాజకీయంగా ఒక గుర్తింపు పొందడానికి ప్రధాన కారణం మాత్రం ఆమె కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కావడమే. రాజకీయంగా ఆమె ఎదుగుదలకు, ఆమెకు పదవులు దక్కడానికి తొలి కారణం ఆమె కేసీఆర్ కుమార్తె కావడమే.   ఔను ఇప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలను ఎదుర్కొంటూ, ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్న కవిత తెలంగాణ ముఖ్యమంత్రి,  భారాస అధ్యక్షుడు కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె. రాష్ట్ర మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుట్ల తారకరామా రావు సోదరి. కల్వకుట్ల కుటుంబ సభ్యురాలు.  వాస్తవానికి ఆమె రాజకీయానికి పునాది  ఆమె కుటుంబం.  కేసీఆర్ లేనిదే తెలంగాణ వచ్చేదో లేదో కానీ, కేసీఆర్ లేకుంటే కవిత రాజకీయ జీవితం ఇన్ని ఎత్తుపల్లాలను చూసేదే కాదు. ఆమె రాజకీయ గుర్తింపునకు ఎలా చూసుకున్నా కేసీఆరే కర్త, కర్మ, క్రియ.కేసీఆర్ కుమార్తె అన్న గుర్తింపుతోనే ఆమె రాజకీయంగా ఎదిగారు. ఇప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె చిక్కులు ఎదుర్కోవడానికి ఆమె కేసీఆర్ కుమార్తె కావడమే కారణం అనడంలో సందేహం లేదు. మద్యం కుంభకోణంలో ఆమె ప్రమేయం ఉండటం, లేకపోవడం పక్కన పెడితే..  కేసీఆర్ అనే మూడక్షరాలు కవిత రాజకీయంగా ఎదగడానికీ, ఇప్పుడు చిక్కుల్లో ఉండటానికి కూడా  కారణం అనడంలో సందేహం లేదు. అదలా ఉంటే.. ఇప్పుడు ఆ కేసీఆర్ కవితకు అండగా నిలుస్తున్నారా? నిలవగలుగుతారా? ఆమెను చిక్కుల్లోంచి బయటపడేయగలుగుతారా అంటూ మాత్రం ఔనన్న సమాధానం మాత్రం రావడం లేదు. తెలంగాణ రాజకీయాల్లో ఫస్ట్ ఫ్యామిలీగా, రాజకీయంగా తిరుగులేదని భావించే కల్వకుంట్ల కుటుంబం  ఢిల్లీ మద్యం  కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న కల్వకుంట్ల కవితను దూరం పెట్టిందా? ఆ కుంభకోణంలో కవిత పాత్ర ఉందా లేదా అన్న సంగతి పక్కన పెడితే.. ఆ కుంభకోణం మచ్చ ఇటు పార్టీకి, అటు కుటుంబానికి అంటకుండా ఉండేందుకు  కల్వకుంట్ల కవితతో పార్టీ పరంగా లేదా కుటుంబ పరంగా ప్రత్యక్ష సంబంధాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోందా? అంటే పరిశీలకులు ఔననే విశ్లేషిస్తున్నారు. అందుకే తెలంగాణ జాగృతి  అండ కోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.   ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొన్న మరుసటి రోజే  కవిత తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం? ఇప్పుడు ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు ఆమె వాయిదా కోరడానికి భారత జాగృతి ధర్నాకారణంగా చెప్పడాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. ఆమె ఈ కుంభకోణంలో సీబీఐ విచారణను ఎదుర్కొనడానికి ముందు న్యాయసలహా తీసుకోవడం దగ్గర నుంచి సలహా సంప్రదింపుల వరకూ ప్రగతి భవన్ వేదికగా కేసీఆర్ సమక్షంలో జరిగాయి. అదే ఈడీ విచారణ దగ్గరకు వచ్చేసరికి ఆమె ఢిల్లీ బయలుదేరి వెళ్లే ముందు కనీసం ప్రగతి భవన్ కు వెళ్లి తండ్రి కేసీఆర్ తో భేటీ కూడా కాలేదు. తన నివాసం నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లారు. ఆమెకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఈడీ నోటీసులు ఇచ్చినా.. తండ్రి కేసీఆర్ కానీ, సోదరుడు కేటీఆర్ కానీ కనీసం ఖండించలేదు. సంఘీభావంగా ఆమె నివాసానికి వెళ్ల లేదు. ఈ ఆరోపణలను కవిత ఒంటరిగానే ఎదుర్కొంటుందన్న సంకేతాలు ఇచ్చేలా వ్యవహరించారు. సరే కేసీఆర్ అయితే పార్టీ అండగా ఉంటుందన్న ఒక్క ముక్కతో ముక్తాయించేశారు. కొందరు నాయకులు, మంత్రులు మీడియా సమావేశాలు పెట్టి కవితకు నోటీసులు ఇవ్వడాన్ని ఖండించారు. ఇక ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శుక్రవారం (మార్చి 10) జరిగే ధర్నాలో పాల్గొనేందుకు పలువురు బీఆర్ఎస్ నేతలు గురువారం హస్తినకు బయలుదేరుతున్నారు. అంతే పార్టీ పరంగా కవితకు దక్కిన మద్దతు, అండ ఇంతే. ఈ విషయాన్ని గుర్తించడం వల్లనే ఆమె గత కొన్ని రోజులుగా తనపై కేసు, విచారణ అంతా రాజకీయ ప్రేరేపితమే అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ జాగృతి, భారత్ జాగృతిల అండతో మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారని పరిశీలకులు అంటున్నారు.  

విచారణకు సహకరించకుంటే అరెస్టే!?

ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత అరెస్టయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న భావనను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణం వ్యవహారంలో   ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గురువారం హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు ఆమెకు ఈడీ నోటీసులు పంపింది. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటం వల్ల, ముఖ్యంగా శుక్రవారం (మార్చి 10) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలో పాల్గొనాల్సి ఉంది కనుక తాను శుక్రవారం (మార్చి 9) విచారణకు హాజరు కాలేనని, 15వ తేదీ హాజరవుతానని కవిత ఈడీకి సమాచారం పంపారు. అయితే ఆమె విజ్ణప్తిపై ఈడీ అధికారుల నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. హోలీ కారణంగా ఈడీ అధికారులు ఎవరూ లేకపోవడం వల్ల ఆమె పంపిన సమాచారానికి బదులు రాలేదన్న వాదన వినిపిస్తున్నప్పటికీ, ఆమె హస్తినకు బయలుదేరి వెళ్లారు.  మహిళా రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద శుక్రవారం (మార్చ 10)ధర్నా చేయడం కోసమే ఆమె హఃస్తిన వెళ్లారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నా.. ఫర్ సపోజ్ ఆమె వినతి పై ఈడీ నుంచి ఎటువంటి స్పందనా గురువారం ఉదయానికి కూడా రాకపోతే కవిత అనివార్యంగా ఈడీ విచారణకు హాజరై తీరాల్సిందేనని న్యాయనిపుణులు చెబుతున్నారు. అందుకోసమే.. ఎటుపోయి ఎటువచ్చినా ఈడీకి అందుబాటులో ఉండేందుకే ఆమె బుధవారమే హస్తిన బయలు దేరి వెళ్లారని అంటున్నారు. అయితే ఆమె ఈడీ ముందు హాజరవుతారా, లేదా అనే విషయంలో అనుమానాలు వ్యక్తమౌతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. మనీలాండరింగ్ ప్రొవిజన్స్ (పీఎంఎల్ఏ) కింద ఈడీ నోటీసులు జారీ అయ్యాయని... విచారణకు సహకరించకపోతే సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అంటున్నారు.  అయితే, ముందస్తు బెయిల్ కోసం  హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించే వెసులుబాటు ఉందని తెలిపారు.

కోమటిరెడ్డి కొత్త రాగం!

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువగిరి ఎంపీ కొంటి రెడ్డి వెంకట రెడ్డి పార్టీ మారుతున్నారా? మారే ఆలోచన చేస్తున్నారా? అంటే, అవునని చెప్పలేము.  కాదనీ అనలేము. అయన పార్టీ మార వచ్చు, మారక పోనూ వచ్చు. నిజానికి ఈ చర్చ ఈ రోజుది కాదు. పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూసిన నాటి నుంచి, కోమటి రెడ్డి అసంతృప్తితో రగిలిపోతూనే ఉన్నారు. అలాగే,  అనేక సందర్భాలలో అసంతృప్తి బాహాటంగా వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. పార్టీ మారే అలోచన చేస్తున్నారనే వదంతులు వినిపిస్తూనే ఉన్నాయి.  మరోవంక ఆయన సోదరుడు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి, బీజేపీలో చేరిన తర్వాత అయితే ఆ వదంతులు ఇంకా బలంగా వినిపించాయి. అయినా, వెంకట రెడ్డి పార్టీ మారలేదు. చేయి వదల లేదు. హస్తం పార్టీలోనే కొనసాగుతున్నారు. రాజగోపాల రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగినా, వెంకట రెడ్డి తమ్ముడి తరపున ప్రత్యక్షంగా ప్రచారం చేయలేదు. అలాగే, కాంగ్రెస్ స్టార్  క్యాంపైనర్ పదవిలో ఉండి కూడా కాంగ్రెస్ అభ్యర్ది పాల్వాయి స్రవంతి పక్షాన ప్రచారంలో పాల్గొన లేదు. ఆస్ట్రేలియా  వెళ్లి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తిరిగొచ్చారు. అయినా  ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాంటే ఉన్నారు అన్నట్లుగానే ఉన్నారు. అప్పుడప్పుడు సంచలన ప్రకటనలు, వివాదస్పద వ్యాఖ్యలు  చేయడం మినహా పెద్దగా రాజకీయ వేదికల మీద కనిపించడం లేదు.   మరో వంక రేవత్ రెడ్డి వర్గం కూడా ఏదో విధంగా  కోమటి రెడ్డిని బయటకు పంపేందుకు ప్రయత్నిస్తూనే వస్తోంది. రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ వంటి నాయకులు వెంకట రెడ్డిని రెచ్చగొడుతున్నారు. అయితే,ఆయన ఒకసారి రెచ్చిపోయినా, మళ్ళీ అంతలోనే సర్దుకు పోతున్నారు. తెగే దాకా లాగకుండా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఒక విధంగా కోమటి రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య   టామ్ అండ్ జెర్రీ ఫైట్ నడుస్తోంది. అయితే, ఇప్పటికిప్పుడు కాకపోయినా కోమటిరెడ్డి వెంకట రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని,  అదే సమయంలో ఆయన బీజేపీలో చేరే విషయంలోనూ ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోరని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆశిస్తున్న లేదా అంచనా వేస్తున్న విధంగా హంగ్ అసెంబ్లీ వచ్చి, కాంగ్రెస్, బీఆర్ఎస్ చేతులు కలిపితే  కోమటి రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగుతారు. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే  అప్పుడు ఆయన కాంగ్రెస్ లో కొనసాగడమా, బీజేపీ తీర్ధం పుచ్చుకోవడమా అనే విషయంలో ఓక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.  ఈ నేపధ్యంలో కోమటి రెడ్డి పార్టీ మార్పుపై ఎన్నికలకు నెల ముందు మాట్లాడతా.. అంటూ చేసిన ప్రకటన సంచలనంగా మారింది.

మళ్ళీ అవే చర్చలు.. నేతల తీరుఫై ఉద్యోగుల ఆగ్రహం!

గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్ని సార్లు మోసపోయినా మళ్ళీ, మోసం చేసిన ప్రభుత్వాన్నే నమ్ముతున్నారు. అయితే, ఇలా మోస పోతోంది, ప్రభుత్వ ఉద్యోగులు కాదు, చర్చలకు రమ్మనగానే చంకలు గుద్దుకుంటూ వెళ్లి, ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి వస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు. అవును, కంచే చేను మేసింది అన్న చందంగా  ఉద్యోగ సంఘాల నాయకులే సర్కార్ తో కుమ్ముక్కై ఉద్యోగులను మోసం చేస్తున్నారనేది ఎవరో చేసిన ఆరోపణ కాదు. ఉద్యోగులే వ్యక్తం చేస్తున్నఆవేదన. గతంలో ఉద్యోగులే కాదు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు కొందరు బహిరంగంగా ఉద్యోగ సంఘాల నేతలపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకూ సిద్దమయ్యారు. ఇప్పడు కూడా మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం అవుతోందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నాయకులను తమ గుప్పిట్లో పెట్టుకుని ఆట బొమ్మల్లా  వాడుకుంటోంది. ఇది ఆరోపణ కాదు, రుజువైన వాస్తవం. పీఆర్సీ వివాదం తలెత్తిన సమయంలో ప్రభుత్వం ఇదే విధంగా ఉహ్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపింది. హామీలు ఇచ్చింది. కానీ, ఇంతవరకు కనీసం   ఉదాహరణగా చెప్పుకునేందుకు అయినా ఏ ఒక్క హామీనీ  పక్కాగా నూటికి నూరు శాతం అమలు చేయలేదు. కానీ, ఉద్యోగులు అడగని, పదవీ విరమణ వయోపరిమితిని పెంచి, అదే మహా ప్రసాదం అన్నరీతిన ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. నిజానికి వయోపరిమితి పెంపు నిర్ణయం, ఉద్యోగులకు మేలు చేసేందుకు తీసుకున్న నిర్ణయం కాదు. 2019 తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించవలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ పూర్తిగా చెల్లించలేని స్థితిలో.. రిటైర్మెంట్ వయసును పెంచారు.  ఇలా ప్రభుత్వం ఒకటికి పదిసార్లు ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసినా, ఉద్యోగ సంఘాల నాయకులు  మాత్రం ఏమి ఆశిస్తున్నారో, ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నారో  కానీ, ఉద్యోగుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి  ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.  నిజానికి, ఉద్యోగ సంఘాలు గొంతెమ్మ కోరికలు ఏవీ కోరడం లేదు. వారు అడుగుతున్న దల్లా గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చమనే. అవసరాల కోసం  ప్రభుత్వం వద్ద దాచుకున్న పీఎఫ్ సొమ్ములను జాప్యం లేకుండా నిబంధనల ప్రకారం సకాలంలో ఇవ్వాలని కోరుతున్నారు. అన్నిటినీ మించి వేతన జీవులు కోరుతున్నది  నెల జీతాలు సకాలంలో ఇవ్వాలని కోరుతున్నారు. ప్రధానంగా పదేళ్ల సర్వీసు పూర్తయిన కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ , పెండింగ్‌ డీఏల చెల్లింపు, సీపీఎస్‌ రద్దు , గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు, పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలు, సీపీఎస్‌ ఉద్యోగులపై నమోదు చేసిన 1,600 కేసుల మాఫీ వంటివే వారి డిమాండ్లు. అసలు ఉద్యోగుల సొమ్ములు వారికి తెలియకుండా తీసుకోవడం తప్పు. కాదు నేరం. నిజానికి  నేరం చేసిన సర్కార్ ను ఉద్యోగ సంఘాలు నిలదీయాలి. కానీ  ఉద్యోగ సంఘాల నాయకులు, తగుదునమ్మా అని, చేతులు కట్టుకుని మంత్రి వర్గ ఉప సంఘంతో చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వం ఏమో  ఉద్యోగులకు ఏదో గొప్ప మేలు చేస్తున్నట్లు  ప్రవర్తిస్తోంది. ఈ ( మార్చి) నెలాఖరులోపు  మూడు వేల కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెబుతున్నారు.  కానీ ప్రభుత్వం ఇస్తుందన్న నమ్మకం అయితే ఎవరికీ లేదు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, టీచర్లు ఓట్లు కావాలి కాబట్టి, చర్చల పేరున మరో మారు ఉద్యోగులను మోసం చేసేందుకు సర్కార్ ప్రయత్నిస్తోందనే ఉద్యోగులు అనుమానిస్తున్నారు.   ఉద్యోగుల జీతాలకే దిక్కులేని ప్రభుత్వం రూ. 3000 కోట్లు చెల్లించడం అయ్యే పని కాదు. అందుకేమ ఉద్యోగులు  అంత మొత్తాన్ని  ఎక్కడ నుంచి తెస్తుందో చెప్పాలని అంటున్నారు. నిజానికి  గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వస్తే,  సీపీఎస్ రద్దు అవుతుందని.. ఊహించనంత ఫిట్ మెంట్‌తో పీఆర్సీ ఇస్తారని డీఏలు ఆపరని.. ఇలా రకరకాలుగా ఉద్యోగులు ఊహించుకున్నారు. కానీ, అనుకున్నదొకటి అయితే అయింది మరొకటి అన్నట్లుగా  జగన్ రెడ్డి పాలనలో  చివరకు జీతాలకే దిక్కులేని పరిస్థితి వచ్చిందని అంటున్నారు. మరోవంక ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఐఆర్ కంటే ఫిట్ మెంట్ తగ్గించారు. అయినా నేతలు కిమ్మనలేదు. అందుకే అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాల నేతలు తమను మోసం చేస్తున్నారని,   తాము మోసపోయామని ఉద్యోగులుఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం సర్కార్ ను  సేవ్ చేందుకు అవసరం వచ్చినప్పుడు ఉద్యమం అంటున్నారు, అంతలోనే చల్లబడి పోతున్నారని  ఉద్యోగులు అంటున్నారు. అలాగే, ఈ సమస్యలు అన్నిటికీ  ఒకటే సమాధానం అంటున్నారు. మోసం చేసిన  ప్రభుత్వాన్ని సాగనంపడం ఒక్కటే మార్గమనే నిర్ణయానికి వారు వచ్చారు. ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు.

చాగంటి.. ఔనని కాదన్నారా?.. ఔననలేక కాదన్నారా?

పిలిచి పిల్లనిస్తానంటే వద్దనే వారు ఉంటారేమో కానీ, కుర్చీ వేసి పదవి ఇస్తామంటే వద్దనే వారు సహజంగా ఉండరు. నిజానికి, సర్కార్ పదవుల కోసం చాలామంది చాలా రకాల పైరవీలు చేయడం, లక్షల రూపాయల కానుకలు సమర్పించుకోవడమూ తెలియని విషయాలు కావు.  కానీ, అందరూ అలానే ఉండరు. పదవి వలన వ్యక్తిగత ప్రతిష్ట దిగజారుతుందని భావించడం వల్లనో లేక పదవికి తమ ప్రవృత్తికి పొంతన కుదరని కారణంగానో వచ్చిన పదవిని వద్దని తిరస్కరిస్తారు.  ప్రముఖ ప్రవచన కర్త  చాగంటి కోటేశ్వరరావు అదే చేశారు. చాగంటిని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రతిపాదనను టీటీడీ  ద్వారా ఆయనకు తెలియచేసింది. అయితే  చాగంటి సర్కార్  ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. తిరస్కరిస్తూనే చురకలు కూడా అంటించారు. టీటీడీ బోర్డు సభ్యులు, చైర్మన్, కార్యనిర్వహణాధికారి వంటి అన్నీ తెలిసిన సర్వజ్ఞులకు సందేహాలు రావడం ఏమిటి.. నేను సలహా ఇవ్వడం ఏమిటి, అలాంటి అవసరమే రాదు.. ఒక వేళ వచ్చినా అది తీర్చగల సామర్ధ్యం తనకు ఉందో లేదో అని వినమ్రంగా సూదులు గుచ్చారు. అలాగే, టీటీడీకి సలహాలు ఇవ్వడానికి పదవులే అవసరం లేదని  తిరుమల వేంకటేశ్వరుని సేవ చేసుకోవడం అదృష్టంగా భావిస్తానని.. టీటీడీకి తన అవసరం ఎప్పుడొచ్చినా స్వామి సేవకు సిద్ధంగా ఉంటానని, పదవి మాత్రం వద్దని స్పష్టం చేశారు.   నిజానికి, గతంలో చాగంటి (వంటి) వారిని టీటీడీ బోర్డు చైర్మన్ గా నియమించాలని హిందూ ధార్మిక సంస్థలు, శ్రీవారి భక్తులు ఎన్నో విజ్ఞప్తులు చేశారు. రాజకీయాలకు అతీతంగా, హిందూ ధర్మం పట్ల సంపూర్ణ విశ్వాసం ఉన్నవారినే టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులుగా నియమించాలనే ప్రతిపాదనలూ వచ్చాయి. కానీ, ప్రభుత్వం భక్తుల అభ్యర్ధనలను పక్కన పెట్టింది. ముఖ్యమంత్రి సొంత బాబాయిని చైర్మన్ గా నియమించింది. అలాగే  మత విశ్వాసాల పరంగా  అనుమానస్పద వ్యక్తులనూ బోర్డు సభ్యులుగా నియమించారు. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, బోర్డు చైర్మన్ సహా కొందరు సభ్యుల మత విశ్వాసాల విషయంలోనూ అనుమానాలు వ్యక్తమైనా,  జగన్ రెడ్డి అవేవీ పట్టించుకోలేదు. రెండవసారి కుడా బాబాయ్  నే టీటీడీ చైర్మన్ గా నియమించారు. ఒక విధంగా టీటీడీ బోర్డుని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారనే  ఆరోపణలున్నాయి. ఇక టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలు  ఏడుకొండలను వ్యాపార, పర్యాటక కేంద్రంగా మార్చేందుకు జరుగుతున్న కుట్రల గురించి అయితే చెప్పనే అక్కరలేదు. అందుకే చాగంటి వారు సలహాదారు పదవిని తిరస్కరించి ఉంటారని హిందూ ధర్మం పట్ల విశ్వాసమున్న భక్తులు భావిస్తున్నారు.  అయితే, పదవిని తిరస్కరించిన చాగంటి  సతీసమేతంగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఎందుకు కలిశారు? ఏమి మాట్లాడారు? ఈ విషయంలో ఇంత కాలం ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పడు ఎందుకు ఒక్కసారిగా తెరపైకొచ్చి,  పదవి  వద్దనే ప్రకటన చేశారు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి జనవరి 21న హెచ్‌డీపీపీ కార్యనిర్వాహక కమిటీ టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా చాగంటిని నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కమిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి స్వయంగా  మీడియా వేదికగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం టీటీడీ మూడేళ్లుగా వివిధ పారాయణాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా ఈ నియామకం చేపట్టినట్లు అప్పట్లో సుబ్బారెడ్డి మీడియా ముఖంగా చెప్పారు. గ్రామీణ యువత భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఈ సలహాదారు పదవిని ఇస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత చాగంటి సీఎం జగన్‌ను కలిశారు. కృతజ్ణతలు తెలియజేశారు. అంతా బాగానే ఉందనుకున్న టైమ్‌లో చాగంటి టీటీడీ పదవిని ఇలా తిరస్కరించడంతో ఆయన కాదనలేక అవునన్నారా? అవుననలేక కాదన్నారా?అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.  ముఖ్యంగా జగన్ రెడ్డి ప్రభుత్వం ఒకరో ఇద్దరో కాదు, వందల మందిని సలహాదారులుగా నియమించింది. ఇందులో చాలా వరకు, జగన్ పల్లకీ మోసే  రాజకీయ నాయకులు, ఆయనకు వంతపాడిన, పాడుతున్న జర్నలిస్టులే ఉన్నారు. ఈ నియామకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్  హైకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో, సలహాదారుల నియామకలకు సంబంధించి  జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఎప్పుడైనా ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే జరిగితే, ఇంతకాలం  తమ ప్రవచనాల ద్వారా హిందూ సమాజానికి మార్గదర్శనం చేసున్న చాగంటి   వ్యక్తిత్వం పై మచ్చపాడే ప్రమాదం వుంది. అందుకే ఆయన ఆ పదవిని తిరస్కరించారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. అలాగే  జగన్ రెడ్డి గతంలో హిందువుల ఓట్లను ఆకర్షించేందుకు స్వరూపానంద స్వామిని ఉపయోగించున్నారు, ఇప్పడు చాగంటిని ఉపయోగించుకునే వ్యూహం తో ఆయనకు పదవి ఆశ చూపారని కూడా వార్తలు వచ్చాయి. ఈ రాజకీయ కుట్రను ఒకింత ఆలస్యంగా అర్థం చేసుకున్న చాగంటి, పదవి వద్దన్నారని ఆయన అభిమానులు అంటున్నారు. ఏదైనా చాగంటి   మెత్తని చెప్పుతో సున్నితంగా చెప్పవలసింది చెప్పారనే మాటే గట్టిగా వినిపిస్తోంది.

మద్యం కుంభకోణం కేసులో కవితకు ఈడీ నోటీసులు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. గురువారం (మార్చి 9)న ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొంది. ఈ కేసులో  సీబీఐ, ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లలో పదేపదే కవిత ప్రస్తావన రావడంతో ఆమెను అరెస్టు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా అరెస్టు, ఆ వెంటనే హైదరాబాద్ కు పారిశ్రామిక వేత్త రుణ్ రామచంద్ర పిళ్లై అరెస్టు తరువాత ఇక తరువాయి కవితేనన్న ప్రచారం విస్తృతంగా జరిగింది.   తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె,  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత సన్నిహితులు, బి నామీలుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న ఒకరొకరినీ అరెస్టు చేసిన నేపథ్యంలోఆమెను కూడా అరెస్టు చేస్తారన్న అభిప్రాయం కూడా పొలిటిలక్ సర్కిల్స్ లో వ్యక్తమైంది.  అందుకు బలం చేకూర్చే విధంగానే ఇప్పుడు ఈడీ కవితకు విచారణకు హాజరుకావాలంటూ నోటీసు ఇచ్చింది. ముఖ్యంగా అరుణ్ రామచంద్రపిళ్లై రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరు ప్రస్తావించడం, అలాగే మనీష్ సిసోడియాను ఈడీ విచారించడంతో ఆమెకు నోటీసులు ఖాయమన్న భావన వ్యక్తమైంది. అయితే ఆమెను ఎప్పుడు విచారణకు పిలుస్తారన్న విషయంలో ఉన్న సందిగ్ధతకు ఇప్పుడు తెరపడింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ కవితను విచారించనుంది. ఈ కేసులో ఇప్పటి వరకూ 11 మంది అరెస్టయ్యారు. కవిత బినామీనంటూ అరుణ్ రామచంద్ర పిళ్లై అంగీకరించారని ఈడీ పేర్కొన్న నేపథ్యంలో ఇప్పుడు కవితకు నోటీసు ఇవ్వడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం విపక్షాలను అణచివేసేందుకు ఉపయోగిస్తోందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు విపక్ష నేతలు ప్రధాని మోడీకి లేఖ రాసిన ఒక రోజు వ్యవధిలోనే కవితకు ఈడీ నోటీసులు జారీ కావడం గమనార్హం.  

విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు పేర జగన్ సర్కార్ గారడీ!

విశాఖ వేదికగా జగన్ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రతిష్ఘాత్మకంగా అనే కంటే హడావుడిగా, ఆర్భాటంగా రెండు రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు సాధించిందేమిటన్న దానిపై భిన్న వాదాలు, అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి. అవన్నీ పక్కన పెడితే అధికారంలో ఉన్న నాలుగేళ్లుగా రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి వీసమెత్తు ప్రయత్నం చేయని జగన్ సర్కార్.. తీరా ఎన్నికలకు సిద్ధమౌతున్న వేళ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సును ఇంత హడావుడిగా, ఆర్భాటంగా నిర్వహించడమే విడ్డూరం. మామూలుగానే ఇలాంటి సదస్సుల్లో ఎంవోయూలు కుదుర్చుకున్న కంపెనీలన్నీ తమ పెట్టుబడులను గ్రౌండ్ చేస్తాయన్న నమ్మకం లేదు. సదస్సు వేదికగా  పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు ప్రకటించడం షరామామూలుగానే జరుగుతుంటుంది. అయితే ఆ తరువాత పెట్టుబడుల వచ్చాయా లేదా అన్నది ఎప్పటికో కానీ తెలియదు. ఇక జగన్ సర్కార్ తన అధికారం చివరి సంవత్సరంలో నిర్వహించిన ఈ సదస్సు ప్రధాన లక్ష్యం పెట్టుబడుల ఆకర్షణ కంటే  రాజకీయంగా పట్టు, పలుకుబడి సంపాదించడానికి, రాష్ట్ర ప్రగతి కోసం ఎంతో చేస్తున్నామని జనాన్ని నమ్మించడానికేనన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది.  ఇటీవలి కాలంలో జగన్ పట్ల, ఆయన సర్కార్ పట్ల ప్రజలలో ఇమేజ్ మసకబారిన నేపథ్యంలో దానిని పెంచుకోవడానికే గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు పేర ఓ కార్యక్రమం నిర్వహించారన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇందుకు ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదిరాయంటూ ఆర్భాటపు ప్రకటనలే తప్ప వాస్తవంగా కుదిరిన ఒప్పందాలేమిటి? ఆ ఒప్పందాలు కుదిరిన  కంపెనీల జాబితా ఏమిటి? ఏయే రంగాలలో పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి అన్న వివరాలను ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించకపోవడమే ఇందుకు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   గతంలో గుజరాత్‌, మహారాష్ట్రలలో   ఆర్భాటంగా సమ్మిట్ లు నిర్వహించి అప్పట్లో ఆయా రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు తమ ఇమేజ్ ను పెంచుకున్నాయి.   అదే దారిలో ఇప్పడు ఏపీలో జగన్ సర్కార్ కూడా గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు నిర్వహించింది. 13 లక్షల కోట్ల రూపాయల మేరకు 342 అవగాహనఒప్పందాల మీద సంతకాలు జరిగాయని ప్రకటించింది.  అయితే ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నామంటూ ఓ 74 కంపెనీల పేర్లు ప్రకటించింది. ఆ కంపెనీల చరిత్ర ఏమిటీ, వాటి సత్తా ఏమిటి అన్న విషయంలో సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అవి ప్రకటించిన పెట్టుబడులకు, వాటి వాస్తవ ఆర్థిక పరిస్థితికి పొంతన లేదన్నట్లుగానే ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ పుంఖాను పుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. ఇక ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో లేని కొన్ని కంపెనీలు, కొందరు పారిశ్రామిక వేత్తలూ కూడా విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్పు వేదికగా తాము ఇన్వెస్ట్ చేయడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామంటూ ప్రకటనలు చేస్తున్నాయి. మరి వాటి పేర్లు ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో ఎందుకు లేవన్నది ఇప్పటివరకూ అయితే సమాధానం దొరకని ప్రశ్నే. ఇక ఈ ఇన్వెస్టర్ల సదస్సు వెనుక పెద్ద భూ కుంభకోణానికి స్కెచ్ ఉందన్న ఆరోపణలూ వినవస్తున్నాయి. పెట్టుబడులు గ్రౌండ్ అవ్వడంతో సంబంధం లేకుండా కంపెనీలకు ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టే కుట్ర దాగుందని పలువురు విశ్లేషణలు చేశారు. ఇక అన్నిటికీ మించి ఈ సదస్సులో హైలైట్ అయ్యిందేమిటంటే.. భోజనాల దగ్గర ఇన్వెస్టర్ల తోపులాట, సదస్సు కిట్ల కోసం జరిగిన తొక్కిసలాట. వేల, లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి వచ్చిన పారిశ్రామిక వేత్తలైతే.. ఇలా తోపులాటలు, తొక్కిసలాటలూ జరిగేవా? వారంతా హుందాగా వ్యవహరించేవారు కదా అన్న అనుమానాలు విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాకుండా ఇన్వెస్టర్ల సదస్సుకు పెట్టుబడులు పెడతామంటూ వచ్చిన వారిలో ఎక్కువ మంది ఐప్యాక్ సభ్యులేనంటూ కొన్ని ఫొటోలను కూడా విపక్షాలు మీడియాకు విడుదల చేశాయి. ఏమి ఏమైనా గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు పేర జగన్ సర్కార్ గారడీ చేసిందన్న అభిప్రాయమే గట్టిగా వ్యక్తమౌతోంది.  

కోడికత్తి కేసు వాయిదాకు జగన్ గైర్హాజర్.. విచారణ వాయిదా!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కోడికత్తి కేసు విచారణ విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో  మంగళవారం (మార్చి 7)  జరిగింది.  అయితే కోర్టు గత విచారణ సందర్భంగా విస్పష్టంగా ఆదేశించినా ఈ కేసులో బాధితుడు జగన్  హాజరు కాకపోవడంతో విచారణను మార్చి 14కు వాయిదా వేసింది. ఈ సందర్భంగా బాధితుడు జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందేనని మరో మారు ఆదేశించింది. గత జనవరి 31న ఈ కేసు ఎన్ఐఏ కోర్టు ముందకు విచారణకు రాగా అప్పుడు కూడా జగన్ హాజరుపై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.   తదుపరి విచారణకు ఈ కేసులో బాధితుడిగా ఉన్న ఏపీ సీఎం జగన్ ను కూడా హాజరుపరచాలని ఎన్ఐఏను ఆదేశించింది. అసలు కేసు వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం విమానాశ్రమంలో 2018 అక్టోబర్ 25న అప్పటి విపక్ష నేత జగన్ పై కోడికత్తితో జనిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి దాడి చేశాడు. 2019 ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటన వెనుక ఉగ్ర కుట్ర ఉందన్నంతగా భూతద్దంలో చూపి కేసును ఎన్ఐఏకి అప్పగించారు. ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. కోడి కత్తి శీనును అరెస్టు చేసింది.   ఎన్ఐఏ అప్పటి నుంచి దర్యాప్తు చేస్తోంది.  2019 ఆగస్టు 13న ఈ కేసులో ఎన్ఐఏ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసింది.  కేసు విచారణలో భాగంగా ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి కోర్టు విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు మంగళవారం (జనవరి 31) ఆదేశించింది.  అలాగే   ఈ కేసులో తొలి సాక్షిగా ఉన్న విశాఖ ఎయిర్ పోర్ట్ అసిస్టెంట్ కమాండెంట్ విచారణకు హాజరు కాకపోవడంతో ఆయనను కూడా హాజరు పరచాలని ఆదేశించింది. అలాగే ఈ కేసులో 3వ సాక్షిగా ఉన్న జగన్ పీఏ నాగేశ్వరరెడ్డి కూడా హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. గత విచారణలో కూడా ఎన్ఐఏ కోర్టు కోడికత్తి కేసులో విజయవాడ ఎన్ఐఏ కోర్టు   ఈ కేసులో బాధితుడుగా ఉన్న సీఎం (అప్పటి ప్రతిపక్ష నేత)జగన ను ఎందుకు ప్రశ్నించలేదని  ఎన్ఐఏ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.   బాధితుడిని ప్రశ్నించకుండా మిగిలినివారిని ప్రశ్నించి విచారించి ఏం లాభం? అంటూ వ్యాఖ్యానించింది. ఈ కేసులో నిందితుడితో పాటు సీఎం జగన్ విచారణకు హాజరైన తరువాతే ట్రయల్ నిర్వహిస్తామని స్పష్టంచేసింది.  కోడికత్తి కేసులో తనపై చేసిన దాడిలో నిందితులకు శిక్ష పడాలంటే జగన్ కోర్టుకు హాజరు కావాలి. అయితే జగన్ మాత్రం ఈ కేసులో బాధితుడిగా   కోర్టుకు వెళ్లడం లేదు. ఎన్ ఐఏ కోర్టులో కోడి కత్తి కేసు విచారణకు వచ్చిన ప్రతి సారీ  బాధితుడు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశిస్తున్నారు. అయినా జగన్ ఖాతరు చేయడం లేదు.తాజాగా మంగళవారం (మార్చి 7) జరిగిన విచారణకు కూడా సీఎం జగన్ హాజరు కాలేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి ఘటనపై విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగుతోంది. ఈ ఘటన జరిగి నాలుగేళ్లు దాటిపోయింది.  చార్జిషీటు దాఖలు అయ్యింది. ప్రతీ వాయిదాకు   నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు హాజరు పరుస్తున్నారు. ప్రత్యక్ష సాక్షి అయిన సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ దినేష్ కుమార్ కూడా ఈ సారి హాజరయ్యారు. ఆయనను కోర్టు ప్రశ్నించి వివరాలు తెలుసుకుంది. మరోసారి బాధితుడు కూడా కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశిస్తూ ఎన్ఐఏ కోర్టు..తదుపరి విచారణ ఈనెల 14కు వాయిదా వేసింది. బాధితుడు కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇస్తే తప్ప విచారణ ముందుకు సాగదు. ఈ కేసులో నిందితుడిగా నాలుగేళ్లుగా కటకటాల వెనుక ఉన్న నిందితుడికి కనీసం బెయిలు కూడా రాదు. ఎందుకంటే..ఇది ఎన్ఐఏ కేసు.. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ పై దాడి వెనుక ఉగ్ర కుట్ర ఉందంటూ.. ఈ కేసు విచారణ ఎన్ఐఏకు అప్పగించారు.  ఇక తాజా విచారణలో అప్పట్లో జగన్ పై దాడికి ఉపయోగించిన  కోడి కత్తి గురించి సైతం ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి ఆరా తీశారు. దానిని తమ ముందు ప్రవేశ పెట్టాలని దర్యాప్తు అధికారుల్ని ఆదేశించారు. ఈ కేసులో బాధితుడైన జగన్  కోర్టుకు హాజరై.., జరిగిందేమిటో వాంగ్మూలం ఇస్తేనే కేసు విచారణ  కొలిక్కి వస్తుందంటున్నారు. మరి తనపై దాడి చేసిన వ్యక్తికి శిక్ష పడేలా చేయడానికైనా జగన్ కోర్టుకు రావాల్సి ఉంటుంది. తాను నిందితుడిగా ఉన్న కేసులలో హాజరుపై మినహాయింపు కోరుతున్న జగన్ తాను బాధితుడిగా ఉన్న కేసులోనూ కోర్టుకు హాజరు కావడానికి ఎందుకు సుముఖంగా లేరన్నది ఆయనే చెప్పాల్సి ఉంది. కాగా ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ తల్లి సావిత్ర‌మ్మ గత ఏడాది జులైలో అప్పటి సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌కు తన కుమారుడిని విడుదల చేయాలంటూ లేఖ రాశారు. నాలుగు సంవ‌త్స‌రాల నుంచి త‌న కుమారుడు రిమాండ్ ఖైదీగానే ఉన్నాడనీ, ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏకానీ, న్యాయ‌స్థానం కానీ  విచార‌ణ జ‌ర‌ప‌డంలేద‌ని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. 

విదేశీ గడ్డపై ఇవేమి వ్యాఖ్యలు.. రాహుల్ తీరుపై బీజేపీ ఫైర్

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశీ ( బ్రిటన్) పర్యటన వివాదాస్పదంగా మారింది. విదేశీ గడ్డపై నుంచి రాహుల్ గాంధీ దేశ అంతర్గత రాజకీయ విభేదాలను ప్రస్తావించడం, దేశ అంతర్గత విషయాల్లో విదేశాల జోక్యం చేసుకోవాలని కోరడం ఏమిటని  బీజేపీ ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ ఎంపీ, రాహుల్ గాంధీ భారత దేశాన్ని అవమానిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటన్‌కు వెళ్ళి భారత దేశ ప్రజాస్వామ్యం, రాజనీతి, పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, భద్రతలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. మన దేశంలో విదేశీ జోక్యాన్ని కోరుతున్నారన్నారు. ఈ వ్యాఖ్యలను సమర్థిస్తారా? అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రశ్నించారు. ఒకవేళ ఈ వ్యాఖ్యలను సమర్థించకపోతే, వాటితో తమకు సంబంధం లేదని స్పష్టం చేయాలని కోరారు. నిజానికి, బీజేపీ నాయకులు మాత్రమే కాదు, కాంగ్రెస్ నాయకులు కూడా  రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సంర్ధించేందుకు వెనకా ముందు అవుతున్నారు.  రాహుల్ గాంధీ బ్రిటన్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, యూరోప్, అమెరికా దేశాలు భారత దేశం నుంచి వ్యాపార, వాణిజ్యాలను, ఆదాయాన్ని పొందుతున్నాయని, భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు ఆ దేశాలు చేయవలసినంత చేయడం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.ఈనేపథ్యంలో రవిశంకర్ ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ బ్రిటన్‌  ప్రసంగాల్లో భారత దేశాన్ని అవమానించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. భారత దేశ ప్రజాస్వామ్యం, రాజనీతి, పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, భద్రతలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. మన దేశంలో విదేశీ జోక్యాన్ని కోరుతున్నారన్నారు. భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు అమెరికా, యూరోపియన్ యూనియన్ జోక్యం చేసుకోవాలని రాహుల్ గాంధీ కోరడం అత్యంత బాధ్యతారహితమని, దీనిపై ఖర్గే, సోనియా గాంధీ తమ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. గతంలో రక్షణ మంత్రిగా పని చేసిన దివంగత ఏకే ఆంటోనీ అధికారికంగా చైనాపై తెలిపిన వైఖరిని రవిశంకర్ ప్రసాద్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ద్వారా చైనాను ఇబ్బంది పెట్టాలని మేం అనుకోవడం లేదు  అని ఆంటోనీ గతంలో అన్నారని ప్రసాద్ గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ఇటీవల బ్రిటన్‌లో మాట్లాడుతూ, చైనా ముప్పును విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ అర్థం చేసుకోవడం లేదని ఆరోపించిన నేపథ్యంలో ప్రసాద్ ఈ ప్రస్తావన చేశారు.    ప్రస్తుతం బ్రిటన్పర్యటనలో ఉన్న రాహుల్.. బీజేపీ టార్గెట్‌గా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాల గొంతు నొక్కెస్తున్నారని.. మైకులు ఆఫ్‌ చేస్తున్నారని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు అగ్గి  రాజేశాయి.. ఇతర దేశాల్లో రాహుల్ ఈ విధంగా మాట్లాడడం సరికాదని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ పార్లమెంట్‌  అటెండెన్స్‌పై ఆసక్తికర గణాంకాలు బయటకువచ్చాయి. రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌పై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా తీవ్రంగా స్పందించారు. ట్వీట్టర్‌లో రాహుల్ అటెండెన్స్‌ను పోస్ట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. భారత్‌ పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నిరాధారమైనవిగా కంచన్‌ గుప్తా కొట్టిపారేశారు. పార్లమెంట్‌లో తమ మైక్‌లు పని చేస్తాయి.. కానీ వాటిని ఆన్ చేయలేమని.. తాను మాట్లాడుతున్నప్పుడు ఇది చాలాసార్లు జరిగిందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. వయనాడ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ జీరో అటెండెన్స్‌ ఉన్నప్పుడు సైతం భారత్‌ పార్లమెంట్‌ సమావేశాలు మొత్తం జరిగాయని కంచన్ గుప్తా గుర్తు చేశారు. రాహుల్ గాంధీ తమ పేలవమైన పని తీరును కప్పిపుచ్చుకునేదుకు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రాహుల్ గాంధీ పార్లమెంట్ అటెండెన్స్‌ డేటాను ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ హాజరు కేరళ సగటు కంటే చాలా తక్కువగా ఉందని కంచన్ గుప్తా వరుస ట్వీట్లలో ఆరోపించారు. జాతీయ సగటు కంటే కూడా ఆయన హాజరు శాతం చాలా తక్కువ అని విమర్శించారు. 2020లో పార్లమెంట్ వర్షకాల సమావేశాలలో రాహుల్ గాంధీ హాజరు శాతం జీరోగా ఉందన్నారు. ఓవరాల్‌గా రాహుల్ పార్లమెంట్ అటెండెన్స్‌ 52శాతమేనని.. అదే సమయంలో మొత్తం ఎంపీల హాజరు శాతం 79గా ఉందన్నారు. భారత పార్లమెంటులో 2019 నుంచి 2023 మధ్య రాహుల్ గాంధీ 92 ప్రశ్నలు అడిగారని.. ఇందుకు సంబంధించి కేరళ ఎంపీల సగటు 216గా, జాతీయ సగటు 163గా ఉందని విమర్శించారు. సగటున భారత్‌ ఎంపీలు 68 చర్చల్లో పాల్గొంటే.. రాహుల్ గాంధీ స్కోర్ దారుణంగా 6 మాత్రమే ఉందని వరుస ట్వీట్లలో ఫైర్ అయ్యారు. దీంతో ట్విట్టర్‌లో బీజేపీ మద్దతుదారులు సైతం కంచన్ గుప్తా ట్వీట్లను రీట్వీట్ చేస్తూ రాహుల్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

మోడీపై మరో లేఖాస్త్రం

 ఢిల్లీ మధ్య కుంభకోణం కేసులో  ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టుపై విపక్ష పార్టీలు విర్సుకు పడుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్, ఢిల్లీ మఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, పంజాబ్ సిఎం మాన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ నేత శరద్ పవార్ మరికొందరు ముఖ్య నేతలు  సిసోడియా అరెస్ట్ ను ఖండిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అయితే, చాలా కాలంగా మోడీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్, డిఎంకే,వామపక్ష పార్టీలు మాత్రం సిసోదియా అరెస్ట్ ను అంతగా ఖండించలేదు.  కాగా  తాజగా, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్  మంగళవారం(మార్చి 7) ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా లేఖ రాశారు. అయితే, విజయన్ సిసోడియా అరెస్ట్ ను ప్రత్యక్షంగా తప్పు పట్టలేదు, ఖండించనూ లేదు. రాజకీయ కారణాలతోనే సిసోడియాను లక్ష్యంగా చేసుకున్నారనే అభిప్రాయాలకు తావిచ్చే విధంగా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయని అన్నారు. వాటిని తొలగించేందుకు కృషి చేయాలని ప్రధానిని కోరారు. నిర్దిష్ట చర్యలు తీసుకోవాలంటూ సెంట్రల్ ఏజెన్సీలపై ఒత్తిడి తెస్తున్నారనే అభిప్రాయాలకు సిసోడియా అరెస్టు మరింత ఊతమిస్తోందని అన్నారు. 2021-22 ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై  ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. సిసోడియా కేసులో నగుదు స్వాధీనం చేసుకోవడం వంటి ఎలాంటి సాక్ష్యాలు లేవని, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా ఆప్ నేత సీబీసీ సమన్లతో విచారణ ముందుకు కూడా హాజరయ్యారని ప్రధానికి రాసిన లేఖలో పినరయి విజయన్ పేర్కొన్నారు. విచారణకు ఆటంకం కలుగుతోందని భావించినప్పుడు మాత్రమే అరెస్టు అనివార్యమవుతుందని, అలా కాని పక్షంలో అరెస్టు జోలికి వెళ్లక పోవడమే సబబని అన్నారు. పబ్లిక్ డొమైన్‌లో వచ్చిన సమాచారం ప్రకారం నగదు పట్టుబడటం వంటి ఎలాంటి అనుమానాస్పద సాక్ష్యాలు లేవని, చట్టం తన పని తాను చేసుకుపోవాల్సిందేనని, అయితే రాజకీయ కారణాలతోనే సిసోడియాను లక్ష్యంగా చేసుకున్నారనే విస్తృతాభిప్రాయాలను దృష్టిలో ఉంచుకునే విధంగా చర్యలు ఉంటాలని అన్నారు. రాజకీయ కారణాలే ఇందుకు కారణమా అనే అపోహలను తొలగించాలని ప్రధానిని కోరారు. సమాఖ్య స్ఫూర్తి, సిద్ధాంతాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కేసు విచారణలో ఉన్నందున దాని మంచిచెడ్డలపై తాను మాట్లాడదలచుకోలేదని విజయన్ అన్నారు. న్యాయం జరగడమే కాదు...న్యాయం జరిగేలా చూడటం కూడా సహజన్యాయ సూత్రంలో కీలకమని చెప్పారు. రాజకీయాల కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయనే ప్రస్తుత అభిప్రాయాలను తొలగించేందుకు ప్రధానమంత్రి మార్గదర్శకంగా ఉండగలరన్న ఆశాభావాన్ని ఆయన తన లేఖలో వ్యక్తం చేశారు.  కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం, సిసోడియా అరెస్ట్ విషయాన్ని పక్కన పెడితే, ఎనిమిది విపక్ష పార్టీలకు చెందిన తొమ్మిది మంది నేతలు ప్రధాని  మోడీకి  లేఖ రాసిన రెండు రోజుల తర్వాత కేరళ ముఖ్యమంత్రి అదే అంశం పై ప్రధానికి ప్రత్యేకంగా లేఖ రాయడం, ప్రతిపక్ష రాజాకీయ శిబిరంలో విబెధాలకు అద్దం పడుతోంది, విపక్ష పార్టీల్లోని విభేదాలను మరో మారు చర్చకు తెచ్చిందని  అంటున్నారు. అలాగే, విపక్ష పార్టీలు కాంగ్రెస్ అనుకూల, వ్యతిరేక, తటస్థ గ్రూపులుగా చీలి పోయిన వైనం స్పష్టమవుతోందని అంటున్నారు.

పిళ్లే ఆరెస్ట్.. హు ఈజ్ నెక్స్ట్ ?

ఢిల్లీ మద్యం కుంభకోణం రోజుకో  కొత్త మలుపు  తిరుగుతోంది. ఓ వంక సీబీఐ, మరోవంక ఈడీ విచారణ వేగం పెంచాయి. ముఖ్యంగా ఈ కేసుకు సంబదించి సీబీఐ, ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లలో పదేపదే ఒకటికి పదిసార్లు ప్రస్తావనకు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె,  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత సన్నిహితులు, బి నామీలుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న ఒకరొకరు అరెస్టవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ క్షణంలో అయినా కవితను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ  శ్రేణులు, ముఖ్యంగా ముఖ్య నాయకులు ఆందోళనకు గురవుతున్నారు.  నిజానికి, వంద రోజులకు పైగానే ఢిల్లీ మద్యం కుంభకోణం స్టొరీ నడుస్తున్నా, కవితను సీబీఐ విచారించినా, ఇంతవరకు కేసు విషయంగా పెదవి విప్పని ముఖ్యమంత్రి కేసీఆర్  ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా అరెస్ట్ తర్వాత పెదవి విప్పారు. ఈ కేసులో లేదా ఇతర అవినీతి కేసుల్లో సీబీఐ, ఈడీ విచారణ చిక్కుల్లో చిక్కుకున్న మరి కొన్ని పార్టీల నాయకులతో కలసి  ప్రధానమంత్రికి లేఖ రాశారు. మరో వంక కవిత టీవీ ఇంటర్వ్యూల ద్వారా తనను తాను సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అరెస్ట్ చేస్తే జైలుకు వెళ్లేందుకు సిద్దమంటూనే, కేంద్ర ప్రభుత్వం, ప్రధానీ మోడీ  బీఆర్ఎస్ ను  రాజకీయంగా దెబ్బతీసేందుకే సీబీఐ, ఈడీలను ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.    సరే, అదలా ఉంటే.. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్ర పిళ్లైని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త. ఆయనను కల్వకుంట్ల కవిత బినామీగా ఈడీ అధికారులు చెబుతున్నారు. నిజానికి మూడు రోజుల కిందటే సీబీఐ కేసుల్లో పిళ్లైకి ముందస్తు బెయిల్  వచ్చింది. కానీ సోమవారం (మార్చి 6) రాత్రి పొద్దుపోయాకా ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమలకు కవిత కుటుంబంతో పాటు అభిషేక్ బోయినపల్లి కుటుంబం, అరుణ్ రాంచంద్ర పిళ్లై కుటుంబం వెళ్లారు.  ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు వారిద్దరూ అరెస్టయ్యారు.  కాగా డిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన అరుణ్‌ పిళ్లై 17 పేజీల రిమాండ్‌ రిపోర్డులో ఈడీ కీలక విషయాలు వెల్లడించింది.  ఎమ్మెల్సీ కవితకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో అరుణ్‌ పిళ్లై అన్నీ తానై వ్యవహరించాడని పేర్కొంది. సౌత్‌ గ్రూప్‌లో ఎమ్మెల్సీ కవిత, అరబిందో ఫార్మా ప్రమోటర్‌ శరత్‌రెడ్డితోపాటు వైకాపా ఎంపీ మాగుంట కుమారుడు రాఘవ ఉన్నారు. సౌత్‌గ్రూప్‌ ప్రతినిధులుగా అరుణ్‌ పిళ్లై, అభిషేక్‌, బుచ్చిబాబు ఉన్నారు. కవితకు లబ్ధి కోసం ఆరుణ్‌ పిళ్లై అన్నీ తానై వ్యవహరించారు. ఆప్‌ నేతలకు రూ.100 కోట్లు ఇచ్చినట్లు అరుణ్‌ పిళ్లై దర్యాప్తులో అంగీకరించారు. రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టి రూ.292 కోట్లు సంపాదించారు. అరుణ్ పిళ్లై కవిత బినామీ అని విచారణలో పలు మార్లు చెప్పారు. ఇదే విషయాన్ని మరి కొందరు కూడా చెప్పారు. మద్యం విధానం రూపకల్పనలో పిళ్లై కీలక పాత్ర పోషించారు అని ఈడీ తన రిపోర్టులో పేర్కొంది. సౌత్‌గ్రూప్‌ వ్యక్తుల సంస్థలన్నీ కలిసి రూ.3,500 కోట్ల వ్యాపారం చేశాయని ఈడీ తెలిపింది. కాగా జరుగతున్న పరిణామాలను గమనిస్తే, సీబీఐ, ఈడీలు చాలా పకడ్బందీగా కవిత చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయన్న అభిప్రాయం బీఆర్ఎస్ నేతల్లోనూ వినిపిస్తోంది. ఇప్పటి వరకూ కవిత పేరును నిందితుల జాబితాలో చేర్చలేదు. కానీ ప్రతీ చార్జిషీటు, అఫిడవిట్‌లో కవిత పేరు ప్రస్తావనకు వస్తూనే ఉంది. సౌత్ లాబీ పేరుతో ఢిల్లీలో మద్యం వ్యాపారం ఆమె బినామీలదేనని సీబీఐ అధికారులు చెబుతున్నారు. దీనిపై కవితను ఓ సారి మాత్రమే ప్రశ్నించారు. గతంలో అసలు తన పాత్రే లేదని చెబుతూ వచ్చిన కవిత.. అరెస్టయిన వారు పరిచయస్తులని చెబుతున్నారు. వారు తనకు తెలిసినంత మాత్రాన తన లిక్కర్ స్కాంతో సంబంధం ఏమిటని ఆమె ప్రశ్నిస్తున్నారు. తెలుగు మీడియా ముందు ఆమె తన వాదనలు వినిపిస్తున్నారు. అయితే, ఎప్పుడన్నది పక్కన పెడితే, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్ట్ కావడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

లోకేష్ తో అడుగు కలిపిన వంగవీటి రాధా.. పార్టీ మార్పు వదంతులకు ఫుల్ స్టాప్

 కాపు నేత, దివంగత వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరబోతున్నారంటూ ఇటీవలి కాలంలో జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఈ విషయంలో రాధా ఇంత వరకూ నోరు విప్పలలేదు. తెలుగుదేశంలో కొనసాగుతున్నా ఆయన జనసేన వైపు అడుగులు వేస్తున్నారా అన్న అనుమానాలు అందరిలోనూ కలిగేంత రేంజ్ లో ఈ ప్రచారం జరిగింది. అయితే ఇంత కాలంగా జరుగుతున్న ప్రచారం అంతా వట్టిదేననీ, ఆయన తన చేతల ద్వారా క్లారిటీ ఇచ్చేశారు.  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో అడుగు కలపడం ద్వారా తాను తెలుగుదేశంలోనే ఉన్నాననీ, ఆ పార్టీలోనే కొనసాగుతానని వంగవీటి రంగా స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లాలో కొనసాగుతున్న లోకేష్‌ పాదయాత్రలో వంగవీటి రాధా కనిపించారు. ఆయనతో పాటు కలిసి నడిచి తన సంఘీభావం తెలిపారు.  దీనితో వంగవీటి రాధా జనసేనలో చేరుతున్నారంటూ వస్తున్న పుకార్లకు చెక్ పెట్టినట్టయింది. అన్నిటికీ మించి ఇటీవలి కాలంలో తెలుగుదేశం కార్యక్రమాలలో వంగవీటి రాధా పెద్దగా చురుగ్గా, క్రియాశీలంగా కనిపించకపోవడంతోనే ఆయన పార్టీ మారుతున్నారా అన్న వదంతులకు ఆస్కారం ఏర్పడింది. రధాకు మిత్రులుగా గుర్తింపు పొందిన కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఆయనను తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలన్న ప్రయత్నాలు చేస్తున్నారని కూడా వార్తలు వినవచ్చాయి. అయితే ఆయన పాదయాత్ర చేస్తున్న లోకేష్ ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించడంతో ఈ వదంతులన్నిటికీ చెక్ పడినట్లైంది. వంగవీటి రాధా తండ్రి దివంగత వంగవీటి రంగాకు విజయవాడలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా జిల్లాలోని పలు నియోజకవర్గాలలో కాపు సామాజిక వర్గానికి గట్టి పట్టు ఉంది.   రంగా కన్నుమూసిన తర్వాత  జరిగిన ప్రతి ఎన్నికలోనూ   గెలుపు ఓటములను నిర్ణయించే ఒక ఫాక్టర్ గా రంగా పేరు నిలిచిందంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కొంత కాలంగా బెజవాడ రాజకీయం మొత్తం రాధా చుట్టూ తిరుగుతూ వచ్చింది. ఆయన పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జోరందుకుంది. అయితే రాధా పార్టీ మార్పు విషయంలో ఇంత కాలం షికార్లు చేసినవన్నీ వదంతులేనని ఆయన లోకేష్ కు సంఘీభావం ప్రకటించడంతో తేలిపోయింది.