టీడీపీ కార్యకర్తలకు కీలక పదవులు
posted on Sep 12, 2015 @ 11:30AM
పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ, టీడీపీ విజయాల్లో ప్రముఖ పాత్ర పోషించే కార్యకర్తలకు ఏదో ఒకటి చేయాలని పరితపిస్తున్న చంద్రబాబునాయుడు...మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే టీటీడీ సంక్షేమ నిధి...ద్వారా కార్యకర్తలకు అండదండలందిస్తున్న పార్టీ...ఏపీలో సుమారు లక్షమంది కార్యకర్తలకు పదవీయోగం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. పెద్దపెద్ద పదవులు కాకపోయినా, తమతమ గ్రామాల్లో గుర్తింపు లభించేలా పదవులు ఇవ్వనున్నారు. ఇప్పటికే కొందరికి ఇలాంటి పదవులు కల్పించినా, మరికొందరికి ఇవ్వడం ద్వారా కిందిస్థాయి కార్యకర్తలను సంతృప్తి పర్చాలనుకుంటున్నారు. ఏపీలో ప్రస్తుతం 16వేల కమిటీలు పనిచేస్తుండగా, వాటిలో దాదాపు 32వేల మంది కార్యకర్తలకు చోటు కల్పించగా, తాజా నిర్ణయంతో మరో లక్షమందికి ఇలాంటి అవకాశం దక్కనుంది. ఈ కమిటీల ద్వారానే గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించనున్నారు. అన్ని కమిటీల్లోనూ టీడీపీ కార్యకర్తలు ఉంటేనే, ప్రభుత్వానికి తగిన సమాచారం అందుతుందని, తద్వారా గ్రామాల్లో రాజకీయంగా పట్టు సాధించడానికి, పలుకుబడి పెంచుకోవడానికి, ప్రజలు సంబంధాలు మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3400 చిన్న దేవాలయాలకు కమిటీలను నియమించి, వాటిలో 30వేల మంది కార్యకర్తలకు చోటు కల్పించనున్నట్లు తెలుగుదేశం వర్గాలు తెలిపాయి. వీటితోపాటు పైస్థాయి పదవుల భర్తీపైనా దష్టిపెట్టిన హైకమాండ్ ...జిల్లా గ్రంథాలయాలకు ఛైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకూ సలహా మండళ్లు నియమించే పనిలో పడింది.