Top Stories

బాబాయిని ఏసేసినోడికి సింగయ్య ఒక లెక్కా? : వర్ల రామయ్య

  సొంత బాబాయిని ఏసేసినోడికి సింగయ్య ఒక లెక్కా అని  జగన్‌ను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. సింగయ్య చావుకు తన కారుకు సంబంధం లేదని చెప్పే ధైర్యం జగన్ కు ఉందా? సింగయ్యను వైసీపీ కార్యకర్తలే టైర్ క్రింద నుండి లాగి పక్కన పడేయలేదని చెప్పే ధైర్యం జగన్ కు ఉందా? ఆయన ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ ని  నిలదీశారు.  చిన్న నాటి నుండి జగన్ రెడ్డి వ్యక్తిత్వం నేర ప్రవృత్తితో మిళితం అయ్యిందని.  విద్యార్థి దశలోనే ప్రశ్నాపత్రాలు దొంగిలించారన్న ఆరోపణలు తనపై ఉన్నాయిని రామయ్య అన్నారు.  ఆ ఆరోపణలపై ఇప్పటికీ జగన్ రెడ్డి నుండి సమాధానం లేదు. పార్లమెంట్ కు రాజీనామా చేయనన్నాడని.. లాలించి పెంచి ప్రేమించిన బాబాయిని లాగి చెంప పగలగొట్టిన మనస్తత్వం జగన్‌దని ఆయన ఆరొపించారు. హైదరాబాద్ కు వద్దని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ను వారించినా బెంగళూరులో ఉండకుండా పదే పదే హైదరాబాద్ కు వచ్చి తండ్రికి తలనొప్పి కలిగించిన కొడుకు జగన్ రెడ్డి.  తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకొని లక్షకోట్లు కొల్లగొట్టి 16 నెలలు చంచలగూడ జైల్లో చిప్పకూడు తిన్న నేర చరిత్ర జగన్ ది. ఆర్థిక నేరస్తుడిగా ముద్రపడిన జగన్ కు 16 నెలలుగా బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరించిందని ఆయన పేర్కొన్నారు.  సొంత తల్లి తన ఇంట్లో లేకపోవడానికి జగన్ రెడ్డి వీపరీత మనస్తత్వమే కారణం. సోంత చెల్లి తనకు దూరం అవ్వడానికి జగన్ వీపరీత మనస్తత్వమే కారణం. మాజీ సీఎంకు ధనాశకు వారు ఎక్కడో ఉంటూ బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. జగన్ రెడ్డి బాబాయి కూతరు సునీత నాడు న్యాయం కోసం ఢిల్లీ నడివీధుల్లో ఎండలో నడుస్తుంటే నాకే బాధేసింది జగన్ రెడ్డికి మాత్రం మనసు కరగలేదని ఆయన అన్నారు. అధికార దాహం కోసం జగన్ రెడ్డి ఏదైనా చేయగలరు. స్టేరాయిడ్స్ తీసుకునే అథ్లెట్ కు.. అరాచకంతో అధికారంలోకి రావాలనుకునే జగన్ రెడ్డికి ఎటువంటి తేడాలేదు. తన ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి ఏవర్గానికి మేలు చేశాడో చెప్పగలడాని వర్ల రామయ్య నిలదీశారు.  
బాబాయిని ఏసేసినోడికి సింగయ్య ఒక లెక్కా? : వర్ల రామయ్య Publish Date: Jun 26, 2025 6:11PM

రోడ్డు ప్రమాదంలో ఎస్సై కానిస్టేబుల్ మృతిపై...చంద్రబాబు విచారం

  కేసు విచారణలో భాగంగా నిందితుల కోసం కారులో హైదరాబాద్ వెళ్తున్న ఏపీ పోలీసులు సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద రోడ్డు ప్రమాదానికి గురికావడం విషాదకరమని సీఎం చంద్రబాబు  తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్సై ఎం. అశోక్, కానిస్టేబుల్ బ్లెస్సన్ జీవన్ లు అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ స్వామి, డ్రైవర్ రమేష్‌లకు అందుతున్న వైద్య సహాయం గురించి అధికారులతో మాట్లాడినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.  వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించినట్లు చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు, అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చంద్రబాబు వివరించారు. బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.  
రోడ్డు ప్రమాదంలో ఎస్సై కానిస్టేబుల్ మృతిపై...చంద్రబాబు విచారం Publish Date: Jun 26, 2025 5:54PM

గోల్కొండ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రులు

  హైదరాబాద్‌లో ఆషాడ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. లంగర్‌హౌస్ చౌరస్తాలో గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తెలంగాణ ప్రభుత్వ తరుపున  పట్టు వస్త్రాలను మంత్రి కొండా సురేఖ, బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాదకుమార్ సమర్పించారు. మంత్రి కొండా సురేఖ అమ్మవారికి తొలి బోనం నేవేద్యంగా ఇచ్చారు. మరోవైపు.. బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత కూడా బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు.  గోల్కొండ జగదాంబిక మహంకాళి, ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు తెలిపారు.ఈ బోనాలు జూలై 24వ తేదీ వరకు గురు, ఆదివారాల్లో కొనసాగనున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దీనిని అధికారిక పండుగగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఈ యేడాది బోనాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. 
గోల్కొండ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రులు Publish Date: Jun 26, 2025 4:37PM

నేడు జగన్నాథుని నేత్రోత్సవం

  జగన్నాటక సూత్రధారి జగన్నాథుడు కోలుకున్నాడు. గురువారం (26వ తేదీన) నవయవ్వన రూపంతో భక్తులకు దర్శనం ఈయనున్నాడు. శుక్లపక్షమి పాడ్యమి తిథి పర్వదినం పురస్కరించుకుని గురువారం బ్రహ్మాండనాయకుని నేత్రోత్సవం పూరీ శ్రీక్షేత్రంలో నిర్వహించనున్నారు. కాగా పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర శుక్రవారం (27న) నిర్వహించనున్నారు. నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాలు నేడు శ్రీక్షేత్రం ఎదుట కార్డన్ కు చేరుకోనున్నాయి. స్వామి రాక కోసం శ్రీ మందిరం గడపలో మూడు రథాలు దేవతల ఆగమనం కోసం ఆహ్వానం పలుకుతున్నాయి. ఇటు శ్రీ మందిరం, అటు శ్రీ గుండిచా మందిరం వాకిళ్ళు మొదలుకొని ఆలయ ప్రాంగణాలు సైతం శోభాయమానంగా రూపుదిద్దుకున్నాయి. గుండిచా మందిరంలో అడపా మండపం చతుర్థాదారు మూర్తుల ఆసీనం కోసం సిద్ధమై ఉంది. భారీ రంగవళ్లులతో రెండు మందిరాల వాకిళ్లు మిరమిట్లు గొలిపిస్తున్నాయి
నేడు జగన్నాథుని నేత్రోత్సవం Publish Date: Jun 26, 2025 4:11PM

ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ ఆకస్మిక దాడులు

  తెలంగాణ వ్యాప్తంగా పలు పలు రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉప్పల్, తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి తదితర జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతుండటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.  ఆర్టీఏ ఆఫీసులో బ్రోకర్లు పెరిగిపోయారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రవాణా శాఖ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టింది.హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌, రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ఆనంద్‌ల పర్యవేక్షణలో అధికారులు కార్యాలయాల్లోని రికార్డులను, కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఇద్దరు క్లర్క్‌లతో పాటు కార్యాలయం వద్ద తిష్టవేసిన 10 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయం తలుపులు మూసివేసి, బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిలిపివేసి అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. 
ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ ఆకస్మిక దాడులు Publish Date: Jun 26, 2025 3:58PM

శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వేడుకగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

  శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 30 నుండి జూలై 02వ తేదీ వరకు జరగనున్న సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకుని గురువారం వేడుకగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 7 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు.   అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. మ‌ధ్యాహ్నం 12.30  గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు.సాక్షాత్కార వైభవోత్సవాల్లో భాగంగా జూన్ 30వ తేదీన  రాత్రి 07 – 08 గం.ల వరకు పెద్దశేష వాహనంపై, జూలై 01వ తేదీన రాత్రి 07 – 08 గం.ల వరకు హనుమంత వాహనంపై శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారు విహరించనున్నారు. జూలై 02వ సాయంత్రం 6.30 – 07.00 గం.ల మధ్య లక్ష్మీ హారాన్ని ఆలయ ప్రదక్షిణగా అలంకార మండపంలోకి తీసుకురానున్నారు. అదే రోజు రాత్రి 07 – 08.30 గం.ల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. జూలై 03న పార్వేట ఉత్సవం జూలై 03వ తేదీన ఉదయం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన, శాత్తుమొర, అనంతరం ఉదయం 07 – 11 గం.ల వరకు ఉత్సవ మూర్తులు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 – 02 గం.ల మధ్య పార్వేట ఉత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా ఆస్థానం, వైదిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.సాక్షాత్కార వైభవోత్సవం, పార్వేట ఉత్సవం సందర్భంగా జూన్ 26న, జూన్ 30 నుండి జూలై 03వ తేది వరకు నిత్య కళ్యాణోత్సవం, జూన్ 26 నుండి జూలై 03 వరకు తిరుప్పావడ సేవ, జూలై 02న అష్టోత్తర శతకలశాభిషేకం, జూలై 01వ తేదీన స్వర్ణపుష్పార్చన రద్దు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో వరలక్ష్మి, సూప‌రింటెండెంట్ రమేశ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ మునిశేఖర్, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధనశేఖర్, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వేడుకగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం Publish Date: Jun 26, 2025 3:23PM

విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు : కాగ్నిజెంట్

  ఆంధ్రప్రదేశ్‌లోని  విశాఖలో కొత్త ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లు కాగ్నిజెంట్ సంస్థ ప్రకటించింది. కాపులుప్పాడలో 22 ఎకరాల్లో ఈ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. దీని ద్వారా ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాల్లో సుమారుగా 8 వేల మందికి పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపింది. 2026 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామని, 2029 నాటికి తొలిదశ పూర్తిచేస్తామని ప్రకటించింది. ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపింది. రూ. 1,500 కోట్లతో క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి కాగ్నిజెంట్ కంపెనీకి కుటమి ప్రభుత్వం భూమిని కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ పెట్టుబడి ద్వారా ఎనిమిదేళ్లలో 8,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా. కాగ్నిజెంట్ 2029 మార్చి నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుందట. వైజాగ్ ఐటీ హబ్‌గా ఎదుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు : కాగ్నిజెంట్ Publish Date: Jun 26, 2025 3:06PM

తిరుమల యాత్రపై గేమింగ్ యాప్ మోసం

  తిరుమల యాత్రపై గేమింగ్ యాప్ రోబ్‌లాక్స్ సృష్టించి భక్తులను మోసగిస్తున్నది. భక్తుల సెంటిమెంట్ ను ఉపయోగించుకొని సోషియల్ మీడియాలో నయో మోసాలు పాల్పడుతున్నదని జనసేన నేత కిరణ్ రాయల్ తెలిపారు. తిరుమల మీద గేమ్ డిసైన్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కిరణ్ రాయల్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును కోరారు. దీనిపై స్పందించిన చైర్మన్  వెంటనే చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులను టీటీడీ చైర్మన్  అదేశించారు. తిరుపతి నుండి తిరుమల ప్రయాణం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి శ్రీవారి ఆలయం, దైవదర్శనం చేసుకొనే దృశ్యాలతో యాప్ రూపొందించిన రోబ్‌లాక్స్ కంపెనీ దైవ భక్తిని...అదును చేసుకొని డాలర్స్ రూపంలో అన్ లైన్ లో వసూలు చేసినట్లు మాకు ఫిర్యాదు అందిందని వారు తెలిపారు.  స్వలాభం కోసం తిరుమల దృశ్యాలతో అక్రమాలను పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.ఈ రోబ్‌లాక్స్ గేమ్‌కు మరింత లోకలైజ్ చేసేందుకు కొందరు స్థానికంగా ఉంటే ప్రాంతాలను రిఫరెన్స్‌గా తీసుకొని గేమ్స్ రన్ చేస్తూ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. అందుకే అలాంటి వీడియోలకు యూట్యూబ్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. ఎంత పెద్ద ఆటంకాలు దాటుకుంటూ వెళ్తే అన్ని వ్యూస్‌ వస్తాయి. అందుకే దీన్ని లోకలైజ్ చేసి వీడియో వ్యూస్ పెంచుకోవాలని చూస్తున్నారు.  శ్రీవారికి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ గేమ్ డిజైన్ చేశారని అన్నారు. శ్రీవారి ఆలయంలో అణువణువు ఎలా ఉంటుంది అని గేమ్ డిజైన్ చేశారని వెంటనే ఆ గేమ్ అకౌంట్ ని తొలగించాలని టిటిడిని కోరాని కిరణ్ రాయల్ తెలిపారు.
తిరుమల యాత్రపై గేమింగ్ యాప్  మోసం Publish Date: Jun 26, 2025 2:56PM

వైసీపీని అధికారంలోకి రానివ్వం.. జనసేనాని ధీమా

  రాదు..రానివ్వం..! వైసీపీ విషయంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లివి. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వైసీపీ వస్తుందేమో.. అప్పుడు పరిస్థితి ఏంటి అని ఎంతో మంది తమను అడుగుతున్నారంటూ.. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు మంత్రులు, అధికారులు మాట్లాడుతున్న వేళ.. కీలక కామెంట్లు చేశారు జనసేనాని. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ఈ కామెంట్లే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి.ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ.. 2029లో అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటన్న మాట గత కొంత కాలంగా ఏపీ రాజకీయాల్లో గట్టిగా విన్పిస్తోంది. ఈ అంశంపై పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య వర్గాలు తమను పలు సందర్భాల్లో ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నాయంటూ స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ సహా పలువురు చెప్పుకొచ్చారు.  సరిగ్గా ఇలాంటి పరిణామాల వేళ కీలక కామెంట్లు చేశారు పవన్ కల్యాణ్. అంతేకాదు.. ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులను ఉద్దేశిస్తూ తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఎక్కడున్నా వెనక్కు రప్పిస్తామంటూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటరిచ్చారు పవన్ కల్యాణ్. అయితే.. వైసీపీ ప్రభుత్వం మళ్లీ రాబోయే రోజుల్లో అధికారంలోకి రాదు.. రానివ్వం అంటూ పవన్ వ్యాఖ్యానించడం వెనుక దీమా ఏంటన్న ప్రశ్నలే ఇప్పుడు తలెత్తుతున్నాయి. కూటమి సర్కారు అమలు చేస్తున్న, రాబోయే రోజుల్లో అమలు చేయబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే కారణం అని కొందరు చెబుతుంటే.. ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో తెలిసి వాడే జనసేనాని అని మరికొందరు చెబుతున్నారు. తమది సుదీర్ఘ కాల లక్ష్యంగా చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. 15 నుంచి 20 ఏళ్లు అధికారంలో ఉండాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు మరోమారు స్పష్టం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం.. ఇందుకోసం ఎలాంటి త్యాగాలకైనా రెడీ అని ప్రకటించారు.  వికసిత్ భారత్‌లో ఏపీ భాగస్వామ్యం అవుతుందని చెప్పిన ఆయన.. వికసిత్ ఏపీగా మారాలంటే కూటమి ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో తాను కానీ, మరెవరూ కానీ లేరని స్పష్టం చేశారు. ఇది సైతం పవన్ దీమాకు ఓ కారణమని చెబుతున్నారు పొలిటికల్ అనలిస్ట్‌లు. నిజానికి.. 2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి ఏర్పాటయ్యేందుకు గట్టిగా కృషి చేశారు పవన్ కల్యాణ్. ఎన్డీఏతో భాగస్వామిగా ఉన్న పవన్.. ఇటు టీడీపీతోనూ జట్టు కట్టారు. చివరకు మూడు పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎన్డీఏ కూటమిగా మార్చేందుకు తనవంతు పాత్ర పోషించారు. దీంతో.. 2024 ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలలేదు. ఫలితంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి జైత్రయాత్ర కొనసాగించింది. తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. 2029 నాటికి వైసీపీ ఓటు చీలకుండా తన వంతు పాత్ర బలంగా పోషించేందుకు ఎల్లప్పుడూ తాను సిద్ధంగా ఉంటానని మరోసారి తన వ్యాఖ్యల ద్వారా చెప్పేశారు పవన్ అన్న టాక్ ఇప్పుడు విన్పిస్తోంది. మరి.. జనసేనాని మాటలకు వైసీపీ ఎలా స్పందిస్తుంది..? అన్నది ఆసక్తికరంగా మారింది.  
వైసీపీని అధికారంలోకి రానివ్వం.. జనసేనాని ధీమా Publish Date: Jun 26, 2025 2:26PM

అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌

  ఏపీలో  రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌  శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో  మంత్రి కందుల దుర్గేశ్‌, ఎంపీ పురందేశ్వరి  పాల్గొన్నారు. పుష్కర ఘాట్‌ వద్ద రూ.94.44 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టారు. దీంతో చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇక పర్యాటకులకు నూతన శోభను సంతరించుకోనుంది. విదేశీ పర్యాటకులనూ ఆకర్షించేలా నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు 2027లో జరిగే పుష్కరాల నాటికి ఇది పూర్తి కానుంది. డబుల్ ఇంజన్ సర్కార్ అనేది కేవలం ఒక పదం మాత్రమే కాదని, శక్తివంతమైన నాయకత్వమని పవన్ అన్నారు.  రాజమండ్రి అంటే గుర్తుకు వచ్చేది గోవావరి తీరం అన్నారు. ఆది కవి నన్నయతో పాటు ఎంతో మంది కళాకారులు జన్మనిచ్చిన నేల ఇదని అన్నారు. తీరం వెంబటి నాగరికత, భాష అన్నీ పెరుగుతాయనడానికి ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు.ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మకు జన్మనిచ్చిన నేల ఇదన్నారు. టూరిజం రంగంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏటా 4 లక్షల మంది పర్యాటకులు పెరిగే అవకాశం ఉందన్నారు. హేవ్ లాక్ బ్రిడ్జి చాలా పురాతనమైనది, వాడకుండా వదిలేయబడింది, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని ఆలోచించి పర్యాటకం కింద మంచి ప్రాజెక్ట్ చెయ్యాలి అని నిర్ణయించుకున్నాం అని తెలిపారు. శక్తివంతమైన నాయకులు, ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగవంతం అవుతుందని అభాప్రాయపడ్డారు. పుష్కరాలన నాటికి అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ Publish Date: Jun 26, 2025 12:56PM

తిరుమల ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి విరాళం

  తిరుమల ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ఎన్‌ఆర్‌ఐ తోట చంద్రశేఖర్‌ రూ.కోటి విరాళం అందించారు. టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడును ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి దీనికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ను బీఆర్‌ నాయుడు అభినందించారు.మరోవైపు అమలాపురం వాసి నిమ్మకాయల సత్యనారాయణ టీటీడీకు 2వేల హెల్మెట్లను అందించారు. తిరుమల ఛైర్మన్‌ను కలిసి రూ.15లక్షల విలువైన హెల్మెట్లను విరాళంగా అందజేశారు.  శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే నిన్న స్వామివారిని 75,001 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల కానుకల ద్వారా శ్రీవారికి 3.67 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలకు భక్తుల రద్ధీ తగ్గినట్లు తెలుస్తోంది. బుధవారం అమావాస్య కావడంతో ప్రజలు తమ ప్రయాణాలు నిలిపివేసుకుంటారు. దీంతో గురువారం తెల్లవారుజామున తిరుమల కొండపై భక్తుల రద్ధీ భారీగా తగ్గిపోయింది.  
తిరుమల ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి విరాళం Publish Date: Jun 26, 2025 12:27PM

గచ్చిబౌలి‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య

  హైదరాబాద్ గచ్చిబౌలి‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న నిఖిల్ మదన్ 17వ అంతస్తు బాల్కనీ నుంచి కిందికి దూకాడు. తీవ్ర గాయాలతో నిఖిల్ మదన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  మృతునికి తొమ్మిది నెలల క్రితం పెళ్లి జరిగింది. ఆయన భార్య ప్రేరణ టీవీ చూస్తుండగా తాను ఉంటున్న 17వ అంతస్తు బాల్కనీ నుంచి కిందికి దూకాడు. మానసిక కుంగుబాటే కరణమని పోలీసులు అనుమానిస్తున్నరు.
గచ్చిబౌలి‌లో  అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య Publish Date: Jun 26, 2025 11:39AM

ఇంద్రకిలాద్రిపై వారహి నవరాత్రులు..సారెను సమర్పించిన ఈవో

  ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో వారాహి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా అమ్మవారికి ఆలయ అలయ ఈవో శీనాయక్ దంపతులు తొలి సారెను సమర్పించారు. ఈ ఉత్సవాలు నెల రోజులు పాటు జరగనున్నాయి.  జూన్ 26 నుంచి జులై 4 వరకు వారహి నవరాత్రులు, జూన్ 26 నుంచి జూలై 24 తేదీ వరకు అమ్మవారి ఆషాఢ మాస సారె సమర్పణ ఉత్సవాలు నిర్వహించనున్నారు.జూన్ 26 నుండి జూలై 24 వరకు వివిధ దేవాలయాలు, ధార్మిక సంస్థల నుంచి భక్త సమాజముల అమ్మవారికి ఆషాఢ మాస సారె సమర్పించడం జరుగుతుంది. మహా మండపంలోని 6వ అంతస్తులో అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్టించి.. ప్రత్యేక పూజాభిషేకాలు నిర్వహిస్తారు. జూన్ 29న కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు.  జూలై 4న పూర్ణహుతి కార్యక్రమంతో వారాహి నవరాత్రుల ఉత్సవాలు ముగుస్తాయి. మేలతాళాలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సారే సమర్పించారు. పసుపు కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, గోరింటాకు అమ్మవారికి శేష వస్త్రాలను సమర్పించారు.ఈ సందర్బంగా ఈవో శీనానాయక్ మీడియాతో మాట్లాడారు.. తమ చేతుల మీదుగా అమ్మవారికి సారె సమర్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆషాఢ మాసంలో అమ్మవారిని తమ పుట్టింటికి రమ్మని వేడుకుంటూ సారె సమర్పించామన్నారు. ఆషాఢ మాసం నెల రోజులపాటు అంగరంగ వైభవంగా సారే సమర్పణ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. తెలంగాణ నుంచి అమ్మవారికి ఈనెల 29వ తేదీన బంగారు బొనాం సమర్పిస్తారని ఆయన తెలిపారు.
ఇంద్రకిలాద్రిపై వారహి నవరాత్రులు..సారెను సమర్పించిన ఈవో Publish Date: Jun 26, 2025 10:59AM

రైలు పట్టాలపై కారు నడిపి యువతి హల్‌చల్‌

  రైలు పట్టాలపై  కారు నడుపుతూ యువతి హల్‌చల్‌ చేసింది.  రంగారెడ్డి జిల్లాలోని నాగుపల్లి-శంకర్‌పల్లి మార్గంలో రైలు పట్టాలపై కారు నడుపుతూ వెళ్లింది. గమనించిన రైల్వే సిబ్బంది ఆపడానికి యత్నించారు. అయినప్పటికీ ఆగకుండా వెళ్లిపోయింది. ఈ క్రమంలో నాగులపల్లిలో స్థానికులు కారును అడ్డుకున్నారు. దీంతో వారిని చాకుతో బెదిరించింది. అదే సమయంలో ఓ రైలు రాగా అప్రమత్తమైన లోకోఫైలట్ రైలును ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు.  యువతి నిర్వాకంతో గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిసింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న రైళ్లను అధికారులు నిలిపివేశారు. కాగా, యువతి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తున్నది. అనంతరం శంకర్‌పల్లి పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పట్టాలపై కారు నడిపిన యువతిని ఉత్తరప్రదేశ్, లఖ్‌నవూకి చెందిన రవికా సోనిగా గుర్తించారు. రీల్స్‌ కోసమే ఈ నిర్వాకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆమె హైదరాబాద్‌లోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తోంది.  
రైలు పట్టాలపై కారు నడిపి యువతి హల్‌చల్‌ Publish Date: Jun 26, 2025 10:32AM

రోడ్డు ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్ మృతి

  సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం వద్ద  ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ బైపాస్‌లోని దుర్గాపురం వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న ఒక కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారు కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్సై అశోక్, మరొక  కానిస్టేబుల్‌గా పోలీసులు గుర్తించారు.  సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను అతి కష్టం మీద బయటకు తీసి, చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం అతివేగం, డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలుగా పోలీసులు భావిస్తున్నారు.ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేప‌ట్టారు  
రోడ్డు ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్ మృతి Publish Date: Jun 26, 2025 10:16AM

లోయలో పడిన బస్సు.. 10 మంది గల్లంతు

  ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రుద్రప్రయాగ్ వద్ద అలకనంద నదిలో ఓ బస్సు పడిపోయింది.ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. బద్రీనాథ్ నుంచి వెళ్తున్న పర్యాటకుల బస్సు నదిలో పడిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కొందరిని రక్షించారు. ఇంకా, 10 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో నది పొంగిపొర్లుతుంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసులు కొందరిని రక్షించారు
లోయలో పడిన బస్సు.. 10 మంది గల్లంతు Publish Date: Jun 26, 2025 10:00AM

బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే..?

బ్రహ్మ ముహూర్తానికి మించిన ముహూర్తం లేదు. బ్రహ్మ ముహూర్తంలో ఏ పని ప్రారంభించినా శుభమే. సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు... రాత్రి భాగంలో ఆఖరి నలభై ఎనిమిది నిమిషాల ముందు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారం. ఇది ఎంతో విశిష్టమైన సమయం. పూజలు చేయడానికి, వ్రతాలు జపాలు చేయడానికి అనువైన సమయం. అందుకే ఈ ముహూర్తానికి అంత విశిష్టత. అయితే కేవలం ఆధ్యాత్మిక పరంగాగానే కాదు... మన జీవనపరంగా కూడా ఈ ముహూర్తం ఎంతో మేలు చేకూరుస్తుంది. ఏ మంచి పని చేసినా బ్రహ్మ ముహూర్తంలో కనుక మొదలు పెడితే విజయం లభించి తీరుతుంది. పిల్లలను ఉదయమే లేచి చదువుకోమని చెప్పేది అందుకే. ఆ సమయంలో చదివితే చదివింది బాగా ఎక్కడమే కాకుండా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే వైద్యులు, నిపుణులు కూడా ఆ సమయంలోనే చదుకొమ్మని సూచిస్తుంటారు.  ఉదయాన్నే వాకింగ్ కి వెళ్లే సమయం కూడా అదే. లేలేత భానుడి కిరణాల నుంచి విటమిన్ డి లభిస్తుంది. తద్వారా ఎముకలు గట్టిపడతాయి. ఎన్నో రకాల వ్యాధులు నయమవుతాయి. కొన్ని రకాల వ్యాధులు దగ్గరికి రాకుండా ఉంటాయి. అసలు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల మానసిక ఒత్తిడి కూడా ఉండదట. మనసు, మెదడు ప్రశాంతంగా ఉండి ఆరోగ్యం ఇనుమడిస్తుందట.  అందుకే బ్రహ్మ ముహూర్తాన్ని మించిన ముహూర్తం లేదని అంటారు. ఆ ముహూర్తాన్ని చేజార్చుకోకూడదని పెద్దలు సూచిస్తుంటారు. -Sameera  
బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే..? Publish Date: Jun 26, 2025 9:30AM

 ఈ టిప్స్ పాటిస్తే చాలు.. హ్యాపీ హార్మోన్స్ పెరుగుతాయి..!

  ఆరోగ్యంగా ఉండటానికి సంతోషంగా,  ఒత్తిడి లేకుండా ఉండటం చాలా ముఖ్యం. దీని కోసం చాలామంది  తమకు ఇష్టమైన కార్యకలాపాలు చేయడానికి, తమకు ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడటానికి, సంగీతం వినడానికి, ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. కానీ ప్రతి ఒక్కరి ఆనందంలో హార్మోన్లు  పెద్ద పాత్ర పోషిస్తాయని చాలామందికి తెలియదు.  మన శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు విడుదలవుతాయి. వీటిని హ్యాపీ హార్మోన్స్ అంటారు.  ఇవి  వ్యక్తిని సానుకూలంగా,  సంతోషకరమైన మూడ్‌లో ఉంచడానికి బ్యాలెన్స్డ్ గా ఉండటం చాలా ముఖ్యం.  సంతోషకరమైన హార్మోన్లు ప్రధానంగా మెదడు,  శరీరంలోని వివిధ భాగాలు (పిట్యూటరీ గ్రంథి, హైపోథాలమస్ మరియు న్యూరాన్లు) ఉత్పత్తి చేస్తాయి. శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అయితే, అది ఆ వ్యక్తి మానసిక,  శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల  విచారం, ఆందోళన,  ఒత్తిడిని వంటివి  అనుభవించవచ్చు. కానీ  ఈ హార్మోన్లను కొన్ని విధాలుగా పెంచవచ్చు. ఇది ఆందోళనను తగ్గిస్తుంది,   సంతోషంగా,  ఒత్తిడి లేకుండా చేస్తుంది. సంతోషకరమైన హార్మోన్లను మంచి అనుభూతిని కలిగించే హార్మోన్లు అని కూడా అంటారు. అవి సంతోషకరమైన,  ఉత్సాహభరితమైన భావాలను ఉత్పత్తి చేయడానికి పనిచేస్తాయి. వాటిలో ప్రధానంగా నాలుగు రకాలు ఉన్నాయి. డోపమైన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్లు,  ఆక్సిటోసిన్. హ్యాపీ హార్మోన్స్ పెంచే మార్గాలు.. వ్యాయామం.. వ్యాయామం చేయడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి  విని ఉంటారు. కానీ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల, ముఖ్యంగా పరుగు వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. ఇది  మంచి అనుభూతిని కలిగిస్తుంది. సంగీతం.. సంగీతం వినడం అనేక విధాలుగా ప్రయోజనకరంగా నిరూపించబడింది. సంగీతం శరీరంలో డోపమైన్‌ను పెంచడానికి కూడా పనిచేస్తుంది. ఈ హార్మోన్ ఆనందం,  ప్రతిఫల భావనలలో పాత్ర పోషిస్తుంది. బయటకు వెళ్లడం.. శరీరంలో సెరోటోనిన్ హార్మోన్  పెంచుకోవాలనుకుంటే, బయటకు వెళ్లి కొంత ఎండలో ఉండాలి. సెరోటోనిన్ మానసిక స్థితిని నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.  కాబట్టి దీనిని "హ్యాపీ కెమికల్" అని కూడా పిలుస్తారు. ఫిజికల్ అఫెక్షన్.. శారీరక అనురాగం, కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటివి శరీరంలో ఆక్సిటోసిన్‌ను పెంచుతాయి. ఇది సంతోషకరమైన హార్మోన్. దీనిని "ప్రేమ హార్మోన్" లేదా "బంధన హార్మోన్" అని కూడా పిలుస్తారు. సానుకూల సంబంధాలు,  ప్రేమ శరీరంలో కార్టిసాల్ స్థాయిలను (ఒత్తిడి హార్మోన్) కూడా తగ్గిస్తాయి.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
 ఈ టిప్స్ పాటిస్తే చాలు.. హ్యాపీ హార్మోన్స్ పెరుగుతాయి..! Publish Date: Jun 26, 2025 9:30AM

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బోనాల పండుగ శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం రేవంత్

  రేపటి నుంచి తెలంగాణ‌లో ఆషాడ‌మాస బోనాలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు భోనాల పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. గోల్కొండ జగదాంబకి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.  అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగతి సాధించేలా తల్లి దీవెనలు ఉండాలన్నారు. బోనాల ఉత్సవ ఏర్పాట్లు, భక్తుల సదుపాయం కోసం రూ.20 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
 రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బోనాల పండుగ శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం రేవంత్ Publish Date: Jun 25, 2025 9:28PM

ఆషాడం వస్తే చాలు..పూరీలో రథ యాత్ర ప్రారంభం

  పూరి జగన్నాథ ఆలయం. అంతుచిక్కని రహస్యాల గని. ఈ ఆలయంపై ఏ సమయంలోనూ నీడ పడక పోవడం ఒక ప్రాకృతిక విచిత్రి. కాగా.. ఆలయ పై భాగంలో ఉన్న ఇరవై అడుగుల సుదర్శన చక్రం పూరీలోని ఏ ప్రాంతం నుంచి చూసినా కనిపించే దిక్సూచి. ఆలయ శిఖరంపై ఎగిరే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగరడమొక దైవలీలగా ప్రసిద్ధి. ఆలయంలోపలికి ప్రవేశించిన తర్వాత సముద్రపు ఘోష వినిపించకపోవడం మరో విశేషం. ఇక ఆలయంలో వండే ప్రసాదం ఎంత మందికి వండినా ఎప్పుడూ వృధా కాక పోవడం మరో అంతుచిక్కని రహస్యం. ఏటా జరిగే పూరీ జగన్నాథ రథయాత్ర జగత్ ప్రసిద్ధం. భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో బంగాళా ఖాతం తీరాన వెలసిన అత్యంత పురాతన ఆలయం పూరీ జగన్నాథ ఆలయం. హిందువులు తప్పక సందర్శించాల్సిన దేవాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. చార్ ధామ్ ఆలయాల్లోనే సుప్రసిద్ధం.  ఈ ఆలయం ఇటు ఇతిహాస అటు చారిత్రక విశేషాల సమాహారం. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం కళింగ పాలకుడైన చోడగంగాదేవ నిర్మించినదిగా చెబుతుంది ఆలయ చరిత్ర. అంతే కాదు ఈ ఆలయ నిర్మాణంలో అనంగభీమదేవ పాత్ర కూడా ఉంది. తర్వాతి కాలంలో రామచంద్ర దేవ విగ్రహ పునఃప్రతిష్ట చేసినట్టుగానూ చెబుతోంది స్థల చరిత్ర. అయితే జగన్నాథుడి విగ్రహాలు ఒక పూర్ణ రూపంలో గాక.. విచిత్రాకారంలో ఉంటాయి కారణమేంటన్నది అంతుచిక్కని ప్రశ్న. అయితే ఇందుకంటూ కొన్నికథనాలు ప్రచారంలో ఉన్నాయి. స్వతహాగా.. ఇక్కడి జగన్నాథుడిని స్థానిక గిరిజనుల దేవుడనీ, నీల మాధవుడనీ నమ్ముతారు. అడవిలో ఒక రహస్య ప్రాంతంలో గిరిజన రాజు విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఈ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే ఒక యువకుడ్ని పంపుతాడట. అయితే అతడు విశ్వావసు కుమార్తెను ప్రేమించి పెళ్లాడుతాడట. తన వివాహానంతరం.. జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే విద్యాపతి అడగ్గా.. అతడి మామగారైన విశ్వావసుడు కళ్లకు గంతలు కట్టి.. ఆ ప్రాంతానికి తీస్కెళ్తాడట. ఆ దారి గుండా ఆవాలు ఆనవాళ్లుగా చల్లిన విద్యాపతి.. ఎట్టకేలకు రాజుకు కబురు పెడతాడట. అయితే రాజు ఆ ఆనవాళ్ల ద్వారా అక్కడకు చేరుకోగానే విగ్రహాలు కనిపించవట.  తిరిగి రాజ్యానికి చేరిన రాజు కలలో జగన్నాథుడు కనిపించి.. సముద్ర తీరానికి వేపకొయ్యలు కొట్టుకొస్తాయని.. వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడట. కొయ్యలు కొట్టుకొస్తాయి కానీ విగ్రహం చేయడమెలా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. అయితే విశ్వకర్మ.. ఒక వికలాంగుడి రూపంలో వచ్చి తానీ కార్యం నెరవేర్చుతానని అంటాడట. అయితే.. 21 రోజుల పాటు తాను నిద్రాహారాలు లేకుండా ఈ విగ్రహాలు చెక్కుతాననీ.. ఎవరూ ఈ పరిసరాలకు రాకూడదని షరతు విధిస్తాడట. ఎన్నాళ్లయినా విగ్రహ నిర్మాణం పూర్తి కాకపోవడంతో రాణి గుడించా దేవి.. తొందర పెట్టడంతో.. గడువు తీరకుండానే తలుపులు తెరుస్తారట. అక్కడ శిల్పి కనిపించడు. సగం చెక్కీ చెక్కని శిల్పాలుంటాయి. దీంతో బ్రహ్మదేవుడ్ని ప్రార్ధిస్తాడా రాజు. అయితే అదే రూపంలో ఇక్కడ విగ్రహాలు పూజలందుకునేలా ఆనతిస్తాడా చతుర్ముఖుడు. తానే వాటికి ప్రాణప్రతిష్ట చేస్తాడు. అందుకే ఇక్కడి విగ్రహాలకు అభయ హస్తం, వరద హస్తం కనిపించదని అంటారు. అయితే 14 లోకాలను వీక్షించడానికి చారడేసి కళ్లతో ఇక్కడి విగ్రహాలుంటాయని అంటారు. ఇక దేవాలయానికి సంబంధించిన సంప్రదాయ గాథల ప్రకారం.. పూరీ సముద్ర తీరంలోని ఒక మర్రి చెట్టు దగ్గర.. ఇంద్రనీల ఆభరణంగా అవతరించాడట ఆ జగన్నాథుడు. అయితే ఈ నీలి ఆభరణం చూడగానే తక్షణ మోక్షం లభిస్తుందట. దీంతో యమధర్మరాజు ఈ ఆభరణాన్ని భూమిలో పాతి పెడతాడట. ద్వాపరయుగంలో మాల్వాకి చెందిన ఇంద్రద్యుమ్న అనే రాజు.. అంతు చిక్కని ఆ రూపం గురించి తెలుసుకోవాలని చెప్పి.. ఘోర తపస్సు చేశాడట. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమై పూరీ సముద్ర తీరానికి వెళ్లి.. అక్కడే తేలియాడే చెట్టు దుంగను కనుక్కని దాని కాండలోంచి తనకు రూపు తయారు చేసుకురమ్మని అతడ్ని ఆజ్ఞాపించాడట. ఈ కార్యం నిర్విఘ్నంగా నిర్వహించిన రాజు విగ్రహాలను ఎలా చేయాలో అర్ధం కాక యజ్ఞం  చేశాడట. యజ్ఞ నారసింహరాజు ప్రత్యక్షమై నారాయణుడ్ని నాలుగు అక్షరాల్లో విశదీకరించమనడంతో.. అవి జగన్నాథ- బలరామ- సుభద్ర- సుదర్శన చక్రాలైతే బావుంటాయని భావించారట. విశ్వకర్మ చిత్రకారుడి రూపంలో వచ్చి ఈ విగ్రహాలను చెక్కి వెళ్లాడట. ఈ ఆలయం కొన్ని తరాలుగా హిందూ- ఆదివాసీ సంస్కృతుల మేలు కలయికగా వస్తోంది. ఈ మూడు విగ్రహాలు జైన ఆచారాలుగా పిలిచే సమ్యక్ దర్శన్, సమ్యక్ జ్ఞానంద్, సమ్యక్ చరితలకు ప్రతీకగా ప్రాచుర్యం పొందాయి. ఇవి మోక్ష మార్గాలుగా అంతులేని ఆనంద ప్రదాతలుగా పిలవబడుతున్నాయని నమ్ముతారు. ఇక్కడి జగన్నాథుడు నారాయణుడిగా, బలభద్రుడు ఆదిశేషువుగా అదే సమయంలో ఆలయంలోని విగ్రహాలు భైరవ, విమలగానూ పూజలందుకుంటున్నాయి. అందుకే ఇది శైవ వైష్ణవ క్షేత్రాల్లోనే సుప్రసిద్ధమైనదిగా భావిస్తుంటారు. అంతే కాదు ఇటు శైవ అటు వైష్ణవతో పాటు శక్తిత్వానికీ ఈ ఆలయం ఒక ప్రతీక. ఈ ఆలయ నిర్మాణం 4 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో చుట్టూ ప్రహరీ ఎత్తైన కోటగోడలను కలిగి ఉంటుంది. ఇందులో 120 గుడులు ఇతర పూజనీయ స్థలాలున్నాయి. ఒడిశా నిర్మాశైలికి చెందిన ఈ ఆలయం భారతీయ అద్భుత నిర్మాణాలలో ఒకటి.  ఇక ఎనిమిది ఆకులతో నిర్మితమైన నీలచక్ర- శ్రీ చక్రం అష్టధాతువులతో తయారైనదిగా నమ్ముతారు. ఎత్తైన రాతి దిమ్మపైగల ధ్వజస్థంభం గర్భగుడికన్నా 214 అడుగుల ఎత్తులో ఉంటుంది. చుట్టపక్కల పరిసరాల్లో అతి పెద్దదిగా దర్శనమిస్తుంది. చుట్టూ ఒక పర్వత శ్రేణి ఉన్నట్టు కనిపిస్తుంది. సింహద్వారం సంగతి సరేసరి. రెండు వైపులా గాండ్రించే సింహాలతో అత్యంత గంభీరంగా ఉంటుంది. ఆలయానికి మొత్తం నాలుగు ద్వారాలుండగా.. ఉత్తర, పడమట, దక్షిణ దిక్కులలో హథిద్వారా అంటే ఏనుగు, వ్యాగ్ర ద్వారా అంటే పులి, అశ్వద్వారా అంటే గుర్రాల ద్వారాలుగా ఇవి కనిపిస్తాయి. గర్భగుడిలో త్రిమూర్తులుగా పిలిచే జగన్నాథ, బలభద్ర, సుభద్రల మూల విరాట్టులు రత్నవేది ఆభరణాలతో అలంకరించబడి ఉంటాయి. వీటితో పాటే సుదర్శన చక్ర, మదనమోహన, శ్రీదేవి, విశ్వధాత్రిల విగ్రహాలు కూడా రత్నవేదిపై ఉంటాయి. జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన చక్రాల విగ్రహాలు దారు బ్రహ్మగా పిలిచే పవిత్రమైన వేప కాండాల నుంచి తయారయ్యాయి. కాలాలను బట్టి ప్రతిమల నగలు, దుస్తులను మారుస్తుంటారు. వీటిని కొలవటం ఆలయ నిర్మాణం ముందు నుంచీ ఉంది. అంటే ప్రాచీన ఆదివాసుల కాలం నుంచీ ఉందని చెబుతారు. ఇక్కడ మండపాలు ఇతరత్రా ఎన్నో ఆలయాలతో ఎంతో పవిత్రత తొణికిసలాడుతుంది. ఇక ఆలయ వంట శాల ఇక్కడి మహాప్రసాదం ఏ ఫైవ్ స్టార్ ఫుడ్ కి తీసి పోనంత నాణ్యంగా ఉండటమే కాదు. ఆ రుచికి ప్రత్యేకమైన జియోగ్రాఫికల్ గుర్తింపు ఉంది. ఇక్కడి వంటకాలు ఎంతో రుచిగా శుచిగా ఎందుకు ఉంటాయని చూస్తే.. ఈ వంటశాల మహాలక్ష్మీదేవి పర్యవేక్షణలో సాగుతుందని విశ్వసిస్తారు. ఇక్కడి వంటకు కేవలం మట్టి పాత్రలను మాత్రమే వినియోగించడం మరో ప్రత్యేకత. వంటశాలకు దగ్గరగా ఉన్న గంగా యమున అనే రెండు పవిత్ర బావుల నీటిని మాత్రమే వాడుతారు. మొత్తం 56 నైవేద్యాలను వండుతారు. ఈ నైవేద్యం జగన్నాథునికి సమర్పించిన తర్వాత మహా ప్రసాదంగా ఈశాన్యంలోని ఆనంద బజార్ లో పంచుతారు. ఇక్కడి భక్తులు ఈ మహాప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇక్కడి ప్రధానమైన పండుగలేంటని చూస్తే.. జూన్ లో జరిగే రథయాత్ర. ఈ బ్రహ్మాండమైన పండగలో జగన్నాథ, బలరామ, సుభద్రల విగ్రహాలున్న మూడు పెద్ద రథాలను ఊరేగిస్తారు. ఏడాదిలో రెండు ఆషాడ మాసాలు వచ్చినపుడు నబకలేవర ఉత్సవం పేరిట.. కొత్త విగ్రహాలను మార్చుతారు. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున చందన యాత్ర రథ నిర్మాణ ప్రారంభాన్ని సూచిస్తుంది. జేష్ట పౌర్ణమిరోజున అన్ని ప్రతిమలకు స్నానం చేసి అలంకరిస్తారు. వసంతకాలంలో డోలాయాత్ర, వర్షాకాంలో ఝులన్ యాత్ర వంటి పండగలు నిర్వహిస్తారు. కార్తీక, పుష్యమాసాలలో ప్రత్యేక వేడుకలు జరుగుతాయి. ఇక విమలాదేవి కోసం  ఆశ్వయుజ మాసంలో షోడశ దినాత్మక పూజ ఘనంగా నిర్వహిస్తారు. ఇక బ్రహ్మపరివర్తన వేడుక సైతం గొప్పగా జరుగుతుంది.  జేష్ట పౌర్ణమినాడు స్నాన యాత్ర తర్వాత జగన్నాథ- బలభద్ర- సుభద్ర- సుదర్శన విగ్రహాలను రహస్య మందిరాలకు తీస్కెళ్తారు. అక్కడ కృష్ణపక్షం వరకూ ఉంచుతారు. ఆ సమయంలో భక్తులకు జగన్నాథ దర్శనానికి వీలు పడదు. అప్పుడు బ్రహ్మగిరిలోని విష్ణువు స్వరూపమైన అల్వర్నాత్ ని కొలుస్తారు. అధిక స్నానం చేయడంతో దేవుళ్లకు జ్వరం చేసిందని.. పదిహేను రోజుల పాటు రాజ వైద్యునితో చికిత్స చేయిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్నాథ మహిమాన్విత చరితం. నిరంతర పారాయణం. ఒడిశాలోని పూరీకి ఎలా చేరుకోవాలో చూస్తే.. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణా సదుపాయాలున్నాయి. భువనేశ్వర్ బీజూపట్నాయక్ ఎయిర్ పోర్ట్ పూరీకి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాన నగరాల నుంచి రైలు సర్వీసులు విస్తృతంగా ఉన్నాయి. కోల్ కతా- చైన్నై ప్రధాన రైలు మార్గం కావంతో .. ఖుర్దారోడ్ రైల్వే స్టేషన్లో దిగి.. అక్కడి నుంచి పూరీకి టాక్సీల్లో చేరుకోవచ్చు. ఈ స్టేషన్ పూరీకి కేవలం 44 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భువనేశ్వర్, కోల్ కతా, విశాఖ నుంచి బస్సు సౌకర్యం ఉంది.
ఆషాడం వస్తే చాలు..పూరీలో రథ యాత్ర ప్రారంభం Publish Date: Jun 25, 2025 9:15PM

మాజీ సీఎం జగన్ చేసే ర్యాలీలను నిషేధించాలి : షర్మిల

  కారు కిందపడ్డ సింగయ్యను  వదిలేసి ఎలా ముందుకు వెళ్లారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. మాజీ సీఎం జగన్ జగన్‌ చేసే ర్యాలీలు, బల ప్రదర్శనలను నిషేధించాలని షర్మిల తెలిపారు.  సింగయ్య మృతికి జగన్ నిరక్ష్యంతో పాటు పోలీసుల వైఫల్యం కూడా అని  పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. 3 కార్లకే పోలీసులు అనుమతి ఇస్తే వేల మందితో ఎందుకు పర్యటన చేశారని షర్మిల నిలదీశారు.  కారు కింద పడిన వ్యక్తిని జగన్ పట్టించుకోకుండా వెళ్లిపోవడం దారుణమన్నారు. ఇప్పటికే జగన్ చాలా తప్పులు చేశారని, అందుకే ఆయనపై కేసులు నమోదు అయ్యాయని షర్మిల వ్యాఖ్యానించారు. ఇటీవల పల్నాడులో జగన్‌తో కరచాలనం చేసేందుకు వచ్చి ఓ వృద్ధుడు కారు కింద పడ్డాడని.. అయినా డ్రైవర్‌ పట్టించుకోకుండా వెళ్లారని ఆమె మండిపడ్డారు. కనీస మానవత్వం లేకుండా పక్కకు లాగి ర్యాలీగా వెళ్లారన్నారు. సొంత పార్టీ కార్యకర్తపైనా మానవత్వం లేకుండా వ్యవహరించారంటూ షర్మిల ఆక్షేపించారు.  
మాజీ సీఎం జగన్ చేసే ర్యాలీలను నిషేధించాలి : షర్మిల Publish Date: Jun 25, 2025 9:01PM

గ్లోబల్ క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా అమరావతి

    గ్లోబల్ క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా అమరావతిని మార్చేందుకు ఉన్న అవకాశాలపై అమరావతి క్వాంటం వ్యాలీ, క్వాంటం టెక్నాలజీలపై నేషనల్ వర్క్ షాప్ ను ప్రభుత్వం నిర్వహించనుంది. దీనికి సన్నాహకంగా విజయవాడలో కర్టైన్ రైజర్ కార్యక్రమాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ శాఖ నిర్వహించింది. జూన్ 30 తేదీ విజయవాడలో నిర్వహించనున్న జాతీయ స్థాయి వర్క్ షాప్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. 2026 జనవరి నాటికి అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం టెక్నాలజీలపై భాగస్వాములను ఒక్క చోటకు చేర్చేలా ఈ నేషనల్ వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఒక్క రోజు నిర్వహించే వర్క్ షాప్ లో క్వాంటం హార్డ్ వేర్ సహా కీలకమైన అంశాలపై నిపుణులతో రౌండ్ టేబుల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.  ఈ వర్క్ షాప్ లో ఐబీఎం, టీసీఎస్, అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధులు, నీతి ఆయోగ్ సహా వివిధ ఐఐటీల నుంచి ప్రోఫెసర్లు, నిపుణులు, గ్లోబల్ లీడర్లు ప్లీనరీ సెషన్లకు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్వాంటం వ్యాలీ ఏర్పాటులో రాష్ట్ర ప్రాధాన్యతలను వివరించనున్నారు. దీనిపై అమరావతి డిక్లరేషన్ను అధికారికంగా విడుదల చేయనున్నారు. అలాగే క్వాంటం స్టార్టప్, క్వాంటం డిక్లరేషన్ బుక్ ను కూడా సీఎం ఆవిష్కరించనున్నారు. ఈ అంశంపై విజయవాడలో నిర్వహించిన కర్టైన్ రైజర్ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ముఖ్యమంత్రి కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, టీసీఎస్ సలహాదారు, జాతీయ క్వాంటం మిషన్ సభ్యులు ప్రోఫెసర్ అనిల్ ప్రభాకర్, ఐబీఎం సంస్థ డైరెక్టర్ డాక్టర్ అమిత్ సింఘీ, ఎల్టీఐ మైండ్ ట్రీ లీడ్ విజయరావు హాజరయ్యారు. క్వాంటం టెక్నాలజీని అందిపుచ్చుకునేలా ఆంధ్రప్రదేశ్ వేగంగా ముందడుగు వేస్తోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రాజధాని అమరావతిలో ప్రఖ్యాత ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి సంస్థలు క్వాంటం వ్యాలీ టెక్ పార్కును ఏర్పాటు చేయనున్నాయి. ఇందులో భాగంగా ఐబీఎం సంస్థ దేశంలోనే అతిపెద్ద క్వాంటం కంప్యూటరును అమరావతిలో ఏర్పాటు చేయనుంది. రెండు 156 క్యూబిట్  క్వాంటం సిస్టంలను ఐబీఎం ఇన్ స్టాల్ చేయనుంది. ఇక దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఎల్ అండ్ టీ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఇక మరో సంస్థ టీసీఎస్ క్వాంటం కంప్యూటింగ్ సేవలతో పాటు హైబ్రీడ్ కంప్యూటింగ్ సొల్యూషన్సును అందించనుంది. వైద్యారోగ్యం, ఆర్ధిక, ఉత్పత్తి రంగం సహా వేర్వేరు రంగాల్లో సేవలు అందించేలా ఈ క్వాంటం వ్యాలీ  సిద్ధం కానుంది. 2026 జనవరి నాటికి అమరావతి క్వాంటం వ్యాలీ దేశానికి సేవలందిస్తుందని ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ స్పష్టం చేశారు.
గ్లోబల్ క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా అమరావతి Publish Date: Jun 25, 2025 8:14PM

రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

  వాయువ్య బంగాళాఖతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన కారణంగా  రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుంచి ఉరుములు, మెరుపులతో పాటుగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నాది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.   శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో  అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో, పలు జిల్లాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి ములుగు, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన సాధారణ వర్షాలు కురుస్తాయంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్  జారీచేశారు.   
రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు Publish Date: Jun 25, 2025 7:59PM

ఫోన్ పే రచ్చ రాజకీయులు సరే... స్టార్ల సంగతేంటి?

  ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ సరిహద్దులు దాటి పోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరూ, అప్పట్లో అధికారం నిలుపుకునేందుకు ఫోన్ ట్యాపింగ్’నూ ఒక అస్త్రంగా వాడుకున్నారు. అలాగే,స్నేహపూర్వకంగా ‘సమాచారం’ ఇచ్చి పుచ్చుకున్నారని అంటున్నారని, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తాను తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న సమయంలో,తన ఫోన్’తో పాటుగా తమ కుటుంబ సభ్యులు, తమ పార్టీ (టీవైసీపీ) నాయకుల ఫోన్లు కూడా, ట్యాప్  చేసి సమాచారాన్ని, బ్రదర్ జగన్ రెడ్డి’కి అందించారని ఆరోపించారు. నిజానికి, ఒక షర్మిల అనేముంది,అప్పట్లో తెలంగాణలో క్రియాశీలంగా ఉన్న రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరులు ఎవరినీ వదిలి పెట్ట కుండా, దొరికిన’ ప్రతి ఒక్కరి ఫోను ట్యాప్ చేశారు. అదేదో ఎవరో చెప్పిన మాటో,ఇంకెవరో చేసిన ఆరోపణ కాదు, అధికారులేతారీకులతో సహా, ట్యాపింగ్ స్టాటిస్టిక్స్ ఇచ్చారు. అయితే, ఇది పూర్తిసమాచారం కాదు,చేయగలిగినంత డిస్ట్రాయ్ చేసి, తగల బెట్టగలిగినంత తగల బెట్టగా, మిగిలిన సమాచరం మాత్రమే ఇచ్చారు. ఆ సమాచరం  ప్రకారం చూసిన ఒకే ఒక్క పక్ష రోజుల్లో, ( 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు) 4013 పోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసినట్లుగా ప్రణీత్ రావు ,ఇతర అధికారులు అంగీకరించారు.అందులో 618 మంది రాజకీయ నాయకుల ఫోన్లు ఉన్నట్లుసమాచరం.ఆ 618 మందిలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్,పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్టులు ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, బండి సంజయ్ ఆయన కుటుంబ సభ్యులు, ఈటెల రాజేందర్ ఆయన కుటుంబ సభ్యులు,పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కుటుంబ సభ్యులతో పాటు అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్‌ చేసినట్లు గుర్తించారు.అలాగే, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మైనంపల్లి హనుమంత్ రావు, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం , మర్రి శశిధర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి , మర్రి జనార్ధన్ రెడ్డి, తాటి కొండ రాజయ్యలకు సిట్ నోటీసు ఇవ్వనుంది. ఐఏఎస్‌లు రోనాల్డ్ రాస్, గౌతంల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి. మొత్తం 618 మంది స్టేట్‌మెంట్లను కూడా పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ఇప్పటి వరకు 228 మంది స్టేట్‌మెంట్ రికార్డింగ్‌లు పూర్తి అయ్యాయి. 618 మంది ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి ఆధారాలను బట్టి ఇప్పటి వరకు 228 మంది స్టేట్‌మెంట్లను రికార్డు చేయగా.. మరికొంత మంది స్టేట్‌మెంట్లను కూడా రికార్డు చేయనుంది సిట్. ఇంతటి సంచలనమైన కేసును సీబీఐకు అప్పగించాలని, సీబీఐ విచారణలోనే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ కేసులో ఎవరి పాత్ర ఉన్నా వదిలిపెట్టేది లేదని, విచారణలో ఎవరి ప్రమేయం ఉన్నా అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అయితే ఇప్పటి వరకు అధికారుల వరకు మాత్రమే విచారణ, అరెస్ట్‌లు జరుగగా.. అధికారుల వెనక ఉన్న అప్పటి బీఆర్‌ఎస్ నేతలు ఎవరనేది మాత్రం దర్యాప్తులో వెల్లడి కావాలసి వుంది..అదొకటి అయితే, మొత్తం ట్యాపింగ్ చేసిన  4013 చేసియన్ ఫోన్ నెంబర్లలో కేవలం 618 మాత్రమే రాజకీయ నాయకుల ఫోన్ నెంబర్లు, మిగిలిన మిగిలిన మూడు వేల పైచిలుకు నెంబర్లు ఎవరివీ ?  ఎన్నికలు జరుగుతున్న సమయం కాబట్టి, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారంటే ఓకే, తప్పయినా ఒప్పయినా అర్థం చేసుకో వచ్చును.  అదే సమయంలో వేల సంఖ్యలోఇతరుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేసినట్లు? అసలు ఇంతకీ ఆ ఇతరులు ఎవరు? ఇది కూడా తేల  వలసిందే అంటున్నారు.అలాగే తాజాగా, పీసీసీ చీఫ్, మహేష్ కుమార్ గౌడ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఫోన్ ట్యాపింగ్‌తో సినీతారల కుటుంబంలో చిచ్చు పెట్టారంటూ చేసిన వ్యాఖ్యలు  తెరపైకి తెచ్చిన కొత్త కోణాన్ని విచారించవలసిందే అంటున్నారు.  అదలా ఉంటే 618 మంది ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి ఆధారాలను బట్టి ఇప్పటి వరకు 228 మంది స్టేట్‌మెంట్లను సిట్’ రికార్డు చేసింది. మరికొంత మందికి కూడా సిట్’ ఇపైకే నోటీసులు ఇచ్చింది,నోటీసులు ఇవ్వవలసిన వారు ఇంకా కూడా ఉంటారు. దీనికి మహేష్ కుమార్ గౌడి యాడ్ చేసిన, సినిమా స్టార్స్, ఇతర సెలబ్రిటీలు ఇతరులను కలిపితే, వాగ్మూలం రికార్డ్ద్ చేయవలసిన వారి చిట్టా, కొండవీటి చాంతాడంత’ ఉన్నాఆశ్చర్య పోనవసరం లేదు. ఇలా తవ్విన కొద్దీ తన్నుకొస్తున్న సంచలనాలను దృష్టిలో ఉంచుకుని, కేసును సీబీఐకు అప్పగించాలని, సీబీఐ విచారణలోనే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని బీజేపీ బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. నిజానికి కేసు పూర్వాపరాలు తెలిసిన, న్యాయనిపుణులు కూడా అదే అంటున్నారు. ఇంతవరకు అయితే ప్రభుత్వం స్పందించలేదు.
ఫోన్ పే రచ్చ రాజకీయులు సరే... స్టార్ల సంగతేంటి? Publish Date: Jun 25, 2025 7:40PM

ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు

  ఫార్ములా ఈ రేసు కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేశారు. జూలై 1 విచారణకు హజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నాది. అరవింద్ కుమార్‌ను మరోసారి విచారణ జరిపి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కుమార్తె కాన్వకేషన్ కోసం యూరోప్ పర్యటనలో ఉన్నారు. అయితే, ఇటీవల ఇదే ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు రెండోసారి విచారించారు. విచారణ తర్వాత అందిన సమాచారంతో ఏసీబీ అధికారులు ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌కు నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిను ఏసీబీ విచారించిన విషయం తెలిసిందే. 2022 అక్టోబర్ 25న జరిగిన తొలి ఒప్పందంపై కంపెనీ ప్రతినిధులను ఏసీబీ ప్రశ్నిస్తోంది. సీజన్ 9, తర్వాత రేస్‌ల నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకోవడంపై ఆరా తీస్తున్నారు.   
ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు Publish Date: Jun 25, 2025 7:29PM

జగన్‌కు అరెస్ట్ భయం..హైకోర్టులో పిటిషన్

  వైసీపీ అధినేత జగన్ , ఆ పార్టీ నేతలకు పల్నాడు ఫియర్ పట్టుకుంది. పోలీసుల ఆంక్షలను సవాల్ చేస్తూ జగన్ పల్నాడులో భారీ జన సందోహాన్ని మోహరించడంతో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు అయింది. నాన్ బెయిలబుల్ కేసు కావడంతో జగన్ , బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు తీసుకున్న హైకోర్టు గురువారం విచారిస్తామని పేర్కొంది. విచారణ అనంతరం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది జగన్ తోపాటు వైసీపీ వర్గాల్లో ఉత్కంఠగా రేపుతోంది. కేసును కోర్టు క్వాష్ చేయకపోతే ఏ క్షణమైనా జగన్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని వైసీపీ శ్రేణుల్లో సర్వత్రా ఆందోళన కనిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఆదివారం జగన్ డ్రైవర్ రమణారెడ్డిని అదుపులోకి తీసుకోగా…మంగళవారం జగన్ కారును సీజ్ చేసి నోటీసులు కూడా ఇచ్చారు పోలీసులు.ఈ క్రమంలోనే ఆయనను విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉందని అనుకున్నారో ఏమో, కేసును క్వాష్ చేయాలని జగన్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ జగన్ కు నిరాశ ఎదురైతే ఈ కేసులో పోలీసులు దూకుడు పెంచే అవకాశం ఉంది.  
జగన్‌కు అరెస్ట్ భయం..హైకోర్టులో పిటిషన్ Publish Date: Jun 25, 2025 6:35PM

ఆషాఢ మాసం బోనాలను జంట నగరాలు ముస్తాబు

  హైదరాబాద్ జంటనగరాల్లో జరిగే బోనాల ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.20కోట్లు మంజూరు చేసింది. నగరంలోని 2,783 దేవాలయాలకు వివిధ కార్యక్రమాలు నిర్వహణ కోసం నిధులను చెక్కుల రూపంలో జారీ చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. ఆషాఢ మాసంలో ముందుగా నగరంలోని గోల్కొండ బోనాలు జూన్‌ 29న జులై 1, 2 తేదీల్లో బల్కంపేట ఎల్లమ్మ బోనాలు, జులై 13, 14 తేదీల్లో శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానం బోనాలు, జులై 20న లాల్‌ దర్వాజా బోనాలు.. జులై 23న చార్మినార్‌ భాగ్యలక్ష్మి బోనాలు, మిగిలిన దేవాలయాల్లో ఈ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయని పేర్కొన్నారు.  జూలై 21న పాతబస్తీలో భక్తిశ్రద్ధలతో అమ్మవారి సామూ హిక ఘటాల ఊరేగింపు, తదనంతరం మారు బోనంతో ఈసారి ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ముగియనున్నాయి.పాతబస్తీలో నిర్వహించే బోనాల జాతరకు మరో రూ.10 కోట్ల నిధులను అదనంగా కేటాయించాలని భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రతినిధులు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కోరారు. హైదరాబాద్-గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నేడు అమ్మవారికి మెట్ల బోనాలు, ఒడి బియ్యం సమర్పించే కార్యక్రమాలు నిర్వహించనున్నారు   
ఆషాఢ మాసం బోనాలను జంట నగరాలు ముస్తాబు Publish Date: Jun 25, 2025 6:29PM

రూ.3,626 కోట్లతో పూణే మెట్రో విస్తరణకు కేబినెట్ ఆమోదం

  ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినేట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  1975లో అత్యవసర పరిస్థితిని విధించడాన్ని ఖండిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మంత్రివర్గం ఆమోదించింది. మరోవైపు ఎమర్జెన్సీ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.   పూణేలోని మెట్రో లైన్ ఫేజ్-2 కోసం రూ.3,626 కోట్ల రూపాయ‌ల‌ను మంజూరు చేసింది. ఆగ్రాలోని పొటాటో రీజ‌న‌ల్ సెంట‌ర్ ఏర్పాటుకు రూ.111.5 కోట్లు మంజూరు చేసింది. అదే విధంగా కోల్డ్ ఫీల్డ్ రీహాబిటేష‌న్ కోసం రివైజ్డ్ మాస్ట‌ర్ ప్లాన్‌కు రూ.5,940 కోట్ల రూపాయలు కేటాయించింది. శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రను స్వాగతిస్తూ మరో తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.  
రూ.3,626 కోట్లతో పూణే మెట్రో విస్తరణకు కేబినెట్ ఆమోదం Publish Date: Jun 25, 2025 5:59PM

కేసీఆర్‌ వల్లే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు : కవిత

  గోదావరి జలాల అంశంపై నిన్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసరడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అసెంబ్లీలో కచ్చితంగా చర్చిద్దాం అయితే ఆరు గ్యారెంటీల అమలు, మహిళలను మోసం చేసిన అంశాలపై కూడా చర్చ జరగాలని కవిత డిమాండ్ చేశారు.  కేసీఆర్ దమ్ము ఏమిటో అసలైన కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే రేవంత్ ముఖ్యమంత్రి కాగలిగారని ఆమె అన్నారు. ఇదే సమయంలో, పెన్షన్ల పెంపుదల వంటి హామీలను నెరవేర్చాలని కోరుతూ ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీకి పోస్టుకార్డులు పంపే ఉద్యమానికి ఆమె శ్రీకారం చుట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని ఆమె హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. వృద్ధులకు రూ.2 వేల పెన్షన్ ను రూ.4 వేలకు పెంచుతామన్న హామీని విస్మరించారు. వికలాంగుల పెన్షన్ ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచకుండా మోసం చేశారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్న హామీ ఏమైంది?" అని కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ హామీలన్నింటినీ తక్షణమే నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు
కేసీఆర్‌ వల్లే  రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు :  కవిత Publish Date: Jun 25, 2025 5:19PM