నవ్వుతూ ప్రాణం (సెల్ఫీ) తీసుకుంటున్నారు

ఒకప్పుడు ఫోటో కావాలంటే స్టూడియోకి వెళ్లి తీయించుకుని గంటల కొద్దీ వెయిట్ చేసి మరి ఫోటో చూసుకుని మురిసిపోయే వారు. ఇప్పుడు ఒకరి ఫోటో మరొకరు తీసే రోజులు పోయి ఎవరికి వారే తమ సెల్ఫీలు దిగే రోజులు వచ్చాయి. దగ్గితే సెల్ఫీ..తుమ్మితే సెల్ఫీ..నవ్వితే సెల్ఫీ..ఏడిస్తే సెల్ఫీ ఇలా చెప్పుకుంటూ పోతే చేతిలో సెల్లు..మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉంటే చాలు సెల్ఫీల లోకంలో విహరిస్తోంది నేటి యువత. ఆధునిక సెల్‌ఫోన్ల పరిజ్ఞానం సద్వినియోగం చేసుకోవాల్సిన యువత..ఇలా సెల్ఫీల మోజులో పడి ప్రాణాలను తీసుకుంటోంది. ఈ వింత వికృత సంస్కృతి అన్ని దేశాలతో పాటే భారత్‌లోకి అడుగుపెట్టింది. ఏదైనా వింతగా తోస్తే దానికి బానిసై పోవడం భారతీయుల బ్లడ్‌లోనే ఉంది. మొన్నామధ్య సిక్స్‌ప్యాక్, సైజ్ జీరో అంటూ కడుపు మాడ్చుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువత తాజాగా సెల్ఫీ మాయలో పడి నవ్వుతూ ప్రాణాలు పొగోట్టుకుంటున్నారు. దురదృష్టవశాత్తూ ఇతర దేశాలతో పోలిస్తే సెల్ఫీ మృతులు, బాధితుల సంఖ్య భారత్‌లోనే ఎక్కువగా ఉన్నారని తాజాగా నిర్వహించిన సర్వే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీ మృతుల్లో 50 శాతం మంది భారతీయులే. ఈ ఏడాది అయితే దేశంలో వారానికి ఒకరు చొప్పున సెల్ఫీకి బలవుతున్నారు. సెల్ఫీ తీసుకునే సమయంలో పరిసరాలను పట్టించుకోకపోవడం..ధ్యాస మొత్తం కెమెరా పైనే ఉంచడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. చాలా ఎత్తులో నుంచి పడిపోయి, నీటిలో మునిగిపోయిన వారు కొందరైతే, కారు, రైలు, విమాన, తుపాకీ ప్రమాదాల్లోనూ, జంతువుల కారణంగాను ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. చెన్నైలో ఇంటర్మీడియట్ చదవుతున్న సుకుమార్ స్నేహితులతో కలిసి రైలు పట్టాలపై వస్తూ సెల్ఫీ తీసుకోవాలని ఆశపడ్డాడు. వేగంగా వస్తున్న రైలు బ్యాక్‌డ్రాప్‌లో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో రైలు వేగాన్ని పట్టించుకోకపోవడంతో అదుపుతప్పి అదే రైలు కిందపడి దుర్మరణం పాలయ్యాడు. విశాఖపట్నానికి చెందిన మరో కుర్రాడు..స్నేహితులతో సరదాగా రాజమండ్రి వెళ్లాడు. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉండటంతో పునకం వచ్చినట్టు స్టేషన్‌లో నిలిచి ఉన్న రైలు ఇంజన్‌పైకి ఎక్కి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇంజన్‌‌పై నున్న హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి బెడ్డుపై మృత్యువుతో పోరాడి మరణించాడు. జరిగిన ప్రమాదాల నుంచి పాఠాలు నేర్వని యువత మరింత విశృంఖలంగా సెల్పీ వలలో పడుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా పాణ్యం మండలం నెరవాడ రైల్వే వంతెన వద్ద ఓ యువకుడు వేగంగా వస్తున్న రైలు పక్కన నిలబడి సెల్ఫీ దిగబోయి ప్రమాదవశాత్తూ మరణించాడు. పదేళ్ల బాలల నుంచి డెబ్బయేళ్ల వృద్ధుల వరకు సెల్ఫీలు దిగడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. సెల్ఫీ అనేది ఒక తీయని జ్ఞాపకంగా నిలిచిపోవాలే తప్ప ప్రాణాంతకంగా మారకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రముఖులు, సెలబ్రిటీలు, సినీ తారలు ఇలా మనం అభిమానించే వ్యక్తులు తారసపడిన సందర్భంగా వారితో కలిసి సెల్ఫీలు దిగడం సరదా..గొప్ప వ్యక్తులను కలుసుకున్న క్షణాలను పదిలంగా దాచుకునేందుకు సెల్ఫీలు ఉపయోగపడతాయి.    కారణం ఎవరు: అందరి కంటే వింతగా, అందరి కంటే ముందుగా, సరికొత్తగా ఓ సెల్ఫీ దిగి ఫేస్‌బుక్‌ వాల్ ఎక్కెద్దామనుకుంటారు. దీనికి ప్రధాన కారణం వేగంగా విస్తరిస్తున్న సోషల్ మీడియాతో పాటు చుట్టూ ఉన్న స్నేహితులు కూడా. రెచ్చగొట్టే మాటలతో, పౌరుష పదజాలంతో ప్రాణాలతో చెలగాటం ఆడేలా మిత్రులను ముందుకు నెడుతున్నారు. అంతే ప్రాణాంతక సాహసాలతో సెల్ఫీలు దిగి వాటిని ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో పెట్టి మురిసిపోతున్నారు. ఇలాంటి సాహసాలు తప్పని చెప్పక పోగా..వాటిని అభినందిస్తూ "వావ్", అనో "సూపర్బ్" అనో కామెంట్లు వస్తుండటంతో సెల్ఫీ పిచ్చి మరింత వేలం వెర్రిగా మారిపోయింది.   ఒక సెల్ఫీ దిగితే వచ్చేదేంటి..? సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి? మహా అయితే ఓ పది లైకులు, ఓ ఐదు కామెంట్లు..అంతే. మార్కెట్ మాయలో పడిన ప్రపంచం స్మార్ట్‌ఫోన్‌తో చేస్తున్న సావాసం..సహజీవనం రాబోయే కాలంలో మనిషిని పిచ్చోడిని చేసేంత ప్రమాదకారిగా మారోబోతోందనేది నిపుణుల ఆందోళన.

మరో "నిప్పు" రాజేయాలనుకుంటున్న పాక్

కశ్మీర్ సమస్య..దశాబ్దాలుగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య వైరానికి కారణమైన ఓ జడ పదార్థం. దేశ నైసర్గిక సరిహద్దుల్లోని ఒక్క అంగుళం భూభాగాన్ని కోల్పోవడానికి మన మనస్తత్వం అంగీకరించదు. అలాగే తాను ఆక్రమించిన భూభాగంతో పాటు కశ్మీర్ మొత్తం తనదేనంటూ పాక్ ఎప్పటి నుంచో వాదిస్తోంది. దీనిపై యుద్ధాలు జరిగాయి..అనేక వేదికల మీద వాదనలు జరిగాయి. కానీ ఫలితం మాత్రం శూన్యం. భారత్‌లో ఏం జరిగినా దానిని కశ్మీర్ అంశంతో ముడిపెట్టేందుకు పాకిస్ధాన్ నక్కలా వేచి చూస్తూనే ఉంది. తాజాగా హిజుబుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వానీ‌ని సైన్యం హతమార్చడంతో కశ్మీర్ రగులుతోంది. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ ఆస్తులపై దాడులకు తెగబడటంతో పాటు భద్రతా దళాలపై రాళ్లు రువ్వుతున్నారు. దీంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఈ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 38కి పెరిగింది.   దీనిని అవకాశంగా మలుచుకునేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. బుర్హాన్ వానీని భారత్ హతమార్చడం తమను షాక్‌కు గురిచేసిందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. అక్కడి పౌరులను భారత ఆర్మీ, పారామిలటరీ బలగాలు అణచివేస్తున్నాయని అని నిరసించారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు కశ్మీర్‌ ఆందోళనకారులకు తమ పూర్తి మద్ధతు ఉంటుందని..జూలై 19న బ్లాక్‌ పాటిస్తామని నవాజ్ ప్రకటించారు. విషయం అక్కడితో ఆగలేదు..పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవజా ఎం ఆసిఫ్ ఏకంగా 2002 నాటి గుజరాత్ అల్లర్ల ఘటనను..నేటి కశ్మీర్ అల్లర్లతో పోల్చారు. ఓ జాతిని నిర్మూలించేలా 2002లో గుజరాత్‌లో మోడీ ప్రారంభించిన ఊచకోతలకు కొనసాగింపే ప్రస్తుతం కశ్మీర్‌లో జరుగుతున్న అల్లర్లు అంటూ ఆరోపించారు. కశ్మీర్‌ పరిస్థితిని సమీక్షించడానికి కేబినెట్‌ను ప్రత్యేకంగా సమావేశ పరిచి..కశ్మీరీలు స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారని, స్వీయ నిర్ణయాధికారం కోసం వారు చేస్తోన్న పోరాటానికి పాకిస్థాన్ పూర్తి మద్ధతిస్తోందని ప్రకటించారు.   మరో వైపు కశ్మీర్ పరిణామాలపై ఐక్యరాజ్యసమితి మద్ధతుతో స్వతంత్ర్య, పారదర్శక దర్యాప్తు జరిపించాలని పాక్ రాయబారి మలీహా లోధీ..ఐరాస ఉప సెక్రటరీ జనరల్ ఎడ్మంట్ ముల్లెట్‌ను కలిశారు. ఈ పరిణామాలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు గానీ, మూడో వ్యక్తికి గానీ జోక్యం చేసుకునే అర్హత లేదని స్ఫష్టం చేసింది. మా అంతర్గత వ్యవహారాల్లో తల దూర్చేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నాలు మాకు దిగ్భ్రాంతి కలుగజేస్తున్నాయన్నారు.  ఉగ్రవాదానికి పాక్ ఏ స్థాయిలో మద్ధతు ఇస్తోందో మళ్లీ అంతర్జాతీయ వేదికల సాక్షిగా రుజువైందన్నారు.   ఇరు దేశాల మధ్య పరిస్థితులు వేడేక్కుతున్న ఇలాంటి సమయంలో పాక్ మరో వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. నదీ జలాల పంపకం విషయంలో ఎప్పుడో ఖరారైన తీర్పును తిరగదోడేందుకు దాయాదీ దేశం ప్రయత్నాలు చేస్తోంది. జమ్మూకశ్మీర్‌లో కిషన్‌గంగా నదిపై నిర్మిస్తున్న జల విద్యుత్తు ప్రాజెక్ట్‌ల వల్ల తన ప్రయోజనాలకు భంగం కలుగుతుందని ఆరోపిస్తూ పాక్ ప్రభుత్వం హేగ్‌లోని "పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌"ను ఆశ్రయించాలని నిర్ణయించింది. హిమాలయ పర్వత ప్రాంతం నుంచి పశ్చిమ దిక్కుగా ప్రవహించే నదులు రెండు దేశాల మధ్య వివాదాలకు తావిస్తున్నాయి. ఈ నదీ జలాలను పంచుకునేందుకు, వివాదాలను పరిష్కరించుకునేందుకు 1960లో ఇరు దేశాల మధ్య సింధూ నదీ జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తూర్పు నదులుగా భావించే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు..పశ్చిమ నదులైన ఇండస్, చీనాబ్, జీలం నదులపై పాకిస్థాన్‌కు ఆజమాయిషీ లభించింది.   జమ్మూకశ్మీర్‌లో 330 మెగావాట్ల "కిషన్‌గంగా" జలవిద్యుత్ ప్రాజెక్ట్‌ను, 850 మెగావాట్ల "రాట్లే జలవిద్యుత్" ప్రాజెక్ట్‌లను భారత ప్రభుత్వం 2007లో ప్రారంభించింది. ఈ రెండింటిని పాక్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. దీనిపై 2010లోనే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్భిట్రేషన్‌కు వెళ్లింది. కానీ న్యాయస్థానం తన ప్రాథమిక తీర్పులో, తుది తీర్పులో భారత ప్రభుత్వ వాదనను సమర్థించింది. జల విద్యుత్తు కోసం కిషన్‌గంగా నది నుంచి నీరు మళ్లించవచ్చని పేర్కొంది. అయితే సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని భారత్, పాకిస్థాన్‌ను ఆహ్వానించింది. తత్ఫలితంగా గత రెండున్నరేళ్లుగా చర్చలు సాగుతూ వచ్చాయి. చివరికి తన వాదన నెగ్గని కారణంగా పాక్ మరో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించింది.

బీసీసీఐలో "రాజకీయా"నికి ఇక చెల్లు చీటీ

ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐకీ సుప్రీం చెంపదెబ్బ లాంటి తీర్పునిచ్చింది. బోర్డును శాసిస్తున్న పొలిటికల్ లీడర్లకు..ఏళ్ల తరబడి వేళ్లూనుకుపోయిన వృద్ధ నాయకులకు అడ్డుకట్ట వేసింది. బీసీసీఐ ప్రక్షాళనకు జస్టిస్ ఆర్ఎం లోథా కమిటీ చేసిన సిఫారసులను ఆమోదించడం ద్వారా అత్యున్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. లోథా కమిటీ సిఫారసులకు ఆమోద ముద్ర వేస్తూ వాటిని ఆరు నెలల్లోగా అమలు చేయాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎఫ్ఎంఐ కలీఫుల్లాలతో కూడిన ధర్మాసనం బీసీసీఐని ఆదేశించింది.  భారత్‌లో క్రీడా సంఘాలు రాజకీయ నాయకుల చెరలో మగ్గిపోవడం ఇవాళ కొత్త కాదు. ఏనాటి నుంచో కొనసాగుతోంది. నిజానికి రాజకీయాలు వేరు, క్రీడలు వేరు..రెండు పరస్పర భిన్నమైన రంగాలు. అయితే క్రీడతో ఏ మాత్రం సంబంధంలేని, క్రీడాకారులు కాని వ్యక్తులు క్రీడా సంఘాలను తమ అదుపాజ్ఞల్లోనే ఉంచుకుంటూ చక్రం తిప్పుతూ వాటిని భ్రష్టు పట్టిస్తున్నారు.   ఇలా ఆ పార్టీ, ఈ పార్టీ అని లేకుండా ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల కనుసన్నల్లోనే భారత క్రీడా సంఘాలు మనుగడ సాగిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డు అయిన బీసీసీఐతో పాటు దానికి అనుబంధంగా ఉన్న 28 క్రికెట్ సంఘాల్లోనూ రాజకీయ నేతలు వారి అనుయాయుల హవానే కనిపిస్తుంది. బెంగాల్‌ క్రికెట్‌ సంఘానికి జగ్‌మోహన్‌ దాల్మియా, దిల్లీ క్రికెట్‌ సంఘానికి అరుణ్‌జైట్లీ, కశ్మీర్‌ క్రికెట్‌ సంఘానికి ఫరూక్‌ అబ్దుల్లా, బిహార్‌ క్రికెట్‌ సంఘానికి లాలూప్రసాద్‌ యాదవ్‌, రాజస్థాన్‌ క్రికెట్‌ సంఘానికి లిలిత్‌మోడీ, తమిళనాడు క్రికెట్‌ సంఘానికి ఎన్‌.శ్రీనివాసన్‌ గతంలో అధ్యక్షులుగా వహించినవారే. అంతేకాదు బీసీసీఐతో పాటు ఐసీసీకి సైతం మరాఠా యోధుడు శరద్‌పవార్‌, తమిళనాడు వ్యాపారవేత్త ఎన్‌.శ్రీనివాసన్‌ నేతృత్వం వహించినవారే.   ఇలాంటి పరిస్థితుల్లో 2013లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం భారత క్రికెట్‌తో పాటు రాజకీయ రంగాలను ఒక కుదుపు కుదిపింది. స్కామ్ విచారణకు రిటైర్డ్ జస్టిస్ ముకుల్ ముద్గల్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీ బీసీసీఐని ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని చెప్పింది. దీంతో జస్టిస్ ఆర్ఎం లోథా నేతృత్వంలో జస్టిస్ అశోక్ బాన్, జస్టిస్ రవీంద్రన్ సభ్యులుగా కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. సుమారు ఏడాది పాటు మొత్తం వ్యవహారాన్ని పరిశీలించిన లోథా కమిటీ ఐపీఎల్ ప్రాంచైజీలు చెన్నై, రాజస్థాన్‌లపై రెండేళ్ల సస్పెన్షన్ వేటు వేసింది. అనంతరం బోర్డులో సమూల మార్పులను సూచిస్తూ అనేక సిఫారసులు చేసింది. వాటి అమలుపై కోర్టులో..బీసీసీఐ దాని అనుబంధ సంఘాలు వాదనలు వినిపించాయి. అలా అన్ని రకాల వాదనలు విన్న సుప్రీం ఈ ఏడాది జూన్ 30న లోథా కమిటీ సిఫారసుల అమలుపై వాదనలను ముగించి నిన్న చారిత్రక తీర్పును వెలువరించింది.  సుప్రీం కోర్టు ఆమోదించిన సిఫారసులు: - మంత్రులు, అఖిల భారత సర్వీసు అధికారులు, 70 ఏళ్లకు పైగా వయసున్న వారు బీసీసీఐలో సభ్యులుగా ఉండకూడదు.   ఒక రాష్ర్టానికి ఒక ఓటు మాత్రమే ఉండాలి.  - పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు చెక్‌ పెట్టాలంటే క్రికెట్‌ యంత్రాంగంలో ఒక వ్యక్తికి ఒక పదవి మాత్రమే ఉండాలి.  - బీసీసీఐలో కాగ్‌ ప్రతినిధి, క్రీడాకారుల సంఘం ఉండాలి. బీసీసీఐలో కాగ్‌ నామినీ వచ్చిన తర్వాత ఇతర పాలన      కమిటీలన్నీ రద్దయిపోవాలి.  - క్రికెటర్ల సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి బోర్డే ఆర్థిక సహకారం అందించాలి. - ప్రస్తుతం బోర్డులో వర్కింగ్ కమిటీని రద్దు చేసి దాని స్థానంలో తొమ్మిది మంది సభ్యులతో అపెక్స్ కమిటీని ఏర్పాటు    చేయాలి. ఇందులో ఒక మహిళా క్రికెటర్ సహా ఆటగాళ్ల ప్రతినిధులు తప్పనిసరిగా ఉండాలి. - బోర్డులో ఆఫీస్ బేరర్ల సంఖ్యను ఐదుకు తగ్గించాలి. దీని ప్రకారం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త    కార్యదర్శి, కోశాధికారి మాత్రమే ఉంటారు.    అనురాగ్ ఠాకూర్ తప్పుకోవాల్సిందే: లోధా కమిటీ సూచన ప్రకారం బోర్డులో ఏ ఆఫీస్ బేరర్ కూడా ఒకసారికి మూడేళ్ల చొప్పున మూడు పర్యాయల కంటే మించి పదవుల్లో ఉండరాదు. ఏ ఆఫీస్ బేరర్ కూడా వరుసగా రెండు పర్యాయాలు పదవిలో ఉండటానికి వీల్లేదు. అలాగే జోడు పదవుల్లో ఉన్న వారు ఒక పదవిని వదులుకోవాలి. ప్రస్తుత అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ బీసీసీఐ అధ్యక్షుడిగానూ..హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. దీంతో ఆయన ఒక పదవిని వదులుకోవాల్సి ఉంటుంది.   పవార్, శ్రీని శకం ముగిసినట్లే.. అన్ని పదవులకు వయోపరిమితి ఉన్నట్లే బీసీసీఐ ఆఫీసు బేరర్లకు 70 ఏళ్ల వయోపరిమితిని విధించాలన్న లోధా కమిటీ సూచనను సుప్రీం ఆమోదించడంతో శరద్‌పవార్, శ్రీనివాసన్, నిరంజన్‌షా వంటి ప్రముఖుల శకం ముగిసిపోయినట్లే. ఈ ముగ్గురు 70 ఏళ్లు దాటిన వాళ్లే. 75 ఏళ్ల పవార్ ప్రస్తుతం ముంబయి క్రికెట్ సంఘానికి..71 ఏళ్ల శ్రీనివాసన్ తమిళనాడు క్రికెట్ సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. 

కుట్రపై కొరడా..

ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోయాలని చూసిన టర్కీ సైన్యం కుట్రను ప్రభుత్వ అనుకూల దళాలు, ప్రజలు కలిసి విఫలం చేశారు. సైనిక కుట్ర విఫలమైన తర్వాత ఆ దేశ ప్రభుత్వం కుట్రదారులపై ఉక్కుపాదం మోపుతోంది. అందులో పాల్గొన్న వారిని ఒక్కొక్కరుగా నిర్బంధంలోకి తీసుకుంటోంది. ఇప్పటి వరకు ఆరువేల మందిని అరెస్ట్ చేశారు. అందులో మూడు వేల మంది సైనికులే. వారిలో సైన్యంలో అత్యున్నత పదవుల్లో ఉన్న ముగ్గురు జనరళ్లు, న్యాయమూర్తులు, ఇతర ముఖ్య అధికారులు ఉన్నారు. టర్కీ వాయువ్య తీరప్రాంతమైన మార్మారీస్‌కు అధ్యక్షుడు ఎర్డోగన్ విహారయాత్రకు వెళ్లడంతో ఇదే అదనుగా భావించిన సైన్యంలోని ఓ చిలీక వర్గం శనివారం తెల్లవారుజామున సైనిక కుట్రకు తెగబడింది.   టర్కీలోని ప్రధాన నగరాలైన ఇస్తాంబుల్, రాజధాని అంకారాలను తమ అధీనంలోకి తీసుకునేందుకు సైనిక తిరుగుబాటుదారులు ప్రయత్నించారు. ప్రభుత్వ ఛానెల్‌ను తమ అధీనంలోకి తీసుకుని దేశంలో సైనిక పాలన విధిస్తున్నట్టు ప్రకటన చేయాలని ఒత్తిడి చేశారు. కుట్ర విషయం తెలుసుకున్న అధ్యక్షుడు ఎర్డోగన్ ఆగమేఘాల మీద రాజధానికి తిరిగివచ్చి తిరుగుబాటును అణచివేసేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి సైనిక తిరుగుబాటును తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అధ్యక్షుని పిలుపు మేరకు లక్షలాది ప్రజల వీధుల్లోకి వచ్చి తిరుగుబాటును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఇటు పోలీసులు, ప్రభుత్వ అనుకూల దళాలు సైనిక తిరుగుబాటుదారుల దాడిని ధీటుగా తిప్పికొట్టడంతో సైన్యం తోకముడిచింది.   రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయటానికి ప్రయత్నించడమే కాకుండా 161 మంది పౌరులు, పోలీసులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన వారిపై ఎటువంటి కనికరం చూపబోమని అధ్యక్షుడు ఎర్డోగన్ ప్రకటించారు. అప్పటి నుంచి ఆయన తిరుగుబాటుదారులు ఒక్కొక్కరిపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాత్కాలిక ఆర్మీ చీఫ్‌ స్టాఫ్‌గా జనరల్ ఉమిత్ దుందర్‌ను నియమించారు. శనివారం విధుల్లోంచి తొలగించిన మూడు వేల మంది న్యాయమూర్తులు, ప్రభుత్వ న్యాయవాదుల అరెస్ట్‌కు తాజాగా వారెంట్లు జారీ చేశారు. సిరియాలోని ఐఎస్ఐఎస్‌పై దాడులకు అమెరికా ఉపయోగిస్తున్న టర్కీ వైమానిక స్ధావరంలోని జనరల్, 12 మంది అధికారులు ప్రభుత్వం కూల్చివేత కుట్రలో కీలక పాత్రధారులని తేలడంతో వారిని అరెస్ట్ చేశారు. తిరుగుబాటు దారులు వినియోగించిన విమానాలకు ఈ స్థావరంలోనే ఇంధనాన్ని సమకూర్చారు. కుట్ర నేపథ్యంలో టర్కీ ఈ వైమానిక స్థావరాన్ని మూసేసింది.   అదే సమయంలో తిరుగుబాటుదారులపై కఠినంగా వ్యవహరించవద్దని పలు వర్గాలు అధ్యక్షుడిని కోరుతున్నాయి. కుట్రను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా ప్రపంచ దేశాధినేతలు అనేకమంది ఖండించినప్పటికి..అదే సమయంలో టర్కీ ప్రభుత్వం కూడా చట్టాలను గౌరవించాలని సూచించారు. తిరుగుబాటుదారులపై బహిరంగంగా అధికారులు, ప్రజలు తీవ్రస్థాయిలో దాడులు చేయడం సరికాదని..వారికి చట్టపరిధిలో శిక్షలు విధించాలని వ్యాఖ్యానించారు.

బ్యాస్టిల్ డే..బ్లాక్ డే‌గా మారిన వేళ

స్వేచ్ఛా, సమానత్వం అనే భావాలు ప్రపంచానికి అందిన రోజు...పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్‌గా..ప్రశాంతతకు మారు పేరుగా నిలిచే నీస్ నగరం ఉగ్రోన్మాదంతో భీతిల్లింది. మతోన్మాదం నెత్తికెక్కిన ఓ ఆగంతకుడు..లారీనే ఆయుధంగా మార్చుకుని..సంబరాల్లో మునిగి తేలిన జనంపైకి దూసుకెళ్లాడు. కసి, నిర్లక్ష్యంతో కూడిన వికృతానందంతో కంప్యూటర్‌లో వీడియో గేమ్ ఆడుతున్నట్టుగా, తన వాహనాన్ని అత్యంత వేగంతో నడుపుతూ జనం మీదకు పోనిచ్చాడు. దీంతో అప్పటి వరకు ఆనందంలో మునిగితేలిన వారంతా కకావికలమయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు తలో దిక్కుకు పారిపోయారు. అయినవారు కళ్లముందే మృత్యుశకటానికి బలైపోయారు. చక్రాల కింద పడి నలిగి నుజ్జునుజ్జయిపోయారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర ఆ నరహంతకుడు వెళ్లిన దారంతా శవాల గుట్టలే..తలలు పగిలి, మెదళ్లు ఛిద్రమైన మృతదేహాలు. చిన్నపిల్లల మృతదేహాల పక్కనే పడి ఉన్న బొమ్మలు..కాపాడాలంటూ హృదయవిదారకంగా రోదిస్తున్న క్షతగాత్రులు..తప్పిపోయిన వారి కోసం వెతుకులాటలు ఇలా రెప్పపాటులో ఆనందహేల..మృత్యుహేలగా మారిపోయింది.   బ్యాస్టిల్ కోట పతనానికి గుర్తుగా ప్రతియేటా జూలై 14న ఫ్రాన్స్ ప్రజలు దేశవ్యాప్తంగా బ్యాస్టిల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటారు. ఫ్రెంచి రాజు లూయిస్-16 తనకు ఎదురు తిరిగిన వారిని బ్యాస్టిల్ అనే భవనంలో బంధించేవాడు. అలా రాజు చర్యలతో విసిగిపోయిన ప్రజలు 1789లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగారు. బ్యాస్టిల్ కోటను ముట్టడించి బందీలుగా ఉన్న వారిని విడిపించారు.  ఇది చారిత్రక ఫ్రెంచి విప్లవానికి నాంది పలికి ఫ్రెంచి రిపబ్లిక్‌ ఆవిర్భావానికి దారితీసింది. ఆ తర్వాతి ఏడాది నుంచి జూలై 14న ప్రెంచి ప్రజలు బ్యాస్టిల్ డే సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. 1879లో దీనిని జాతీయ దినోత్సవంగా ప్రకటించింది ఫ్రెంచి ప్రభుత్వం. ఆ రోజు మిలటరీ పరేడ్‌లు..సామూహిక భోజనాలు..విందులు వినోదాలతో దేశమంతా పండుగ శోభతో కళకళలాడుతుంది.   అలాంటి సంబరాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. నీస్‌లోని విహార ప్రదేశమైన ప్రొమనేడ్ డెస్ ఆంగ్లైస్ వద్ద జాతీయ దినోత్సవం ముగింపు కార్యక్రమాల సందర్భంగా రాత్రి 10.30 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. ఈ వేడుకలను తిలకించేందుకు దాదాపు 30 వేల మంది ప్రజలు గుమిగూడి ఉన్నారు..సంగీత కచేరి వింటూ..బీచ్‌లో ఉత్సాహంగా గడుపుతుండగా ఉగ్రవాదిగా భావిస్తున్న ఆగంతకుడు భారీ ట్రక్కును అతి వేగంగా, అడ్డదిడ్డంగా నడుపుతూ జనంపైకి దూసుకొచ్చాడు. ఆగంతకుడు లారీని నడుపుతూనే కాల్పులకు దిగినట్లుగా భావిస్తున్నట్టు ప్రత్యక్షసాక్షి ఒకరు వెల్లడించారు. అయితే  ఓ వ్యక్తి మోటార్ సైకిల్‌పై వెళ్లి లారీని నిలువరించే క్రమంలో డ్రైవర్ ‌ఉన్న క్యాబిన్ తలుపు తెరిచేందుకు ప్రయత్నించాడు. అయితే దురదృష్టవశాత్తూ లారీ కిందపడి మరణించాడు. పోలీసులు వేగంగా స్పందించి ఉన్మాదిపై కాల్పులు జరపడంతో మారణకాండకు తెరపడింది.   ఇంతటి నరమేధానికి కారణమైన ఆగంతకుడిని ట్యునీషియాకు చెందిన మొహ్మద్ లహౌయెజ్ బౌహ్లెల్‌గా గుర్తించారు. దాడికి పక్కాగా ప్రణాళిక వేసుకున్న మహ్మద్..రెండు రోజుల క్రితమే ఆ ట్రక్కును అద్దెకు తీసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ట్రక్కులో భారీగా తుపాకులు, గ్రెనేడ్‌లను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఐరోపా సమాఖ్యలో ముస్లిం జనాభా ప్రాన్స్‌లోనే ఎక్కువ. ఉత్తర ఆఫ్రికాలోని పూర్వపు వలస దేశాల నుంచి వీరంతా వలస వచ్చారు. అయితే ఐఎస్ఐఎస్‌పై పోరులో భాగంగా అమెరికా సారథ్యంలోని సంకీర్ణదళాల కూటమిలో ఫ్రాన్స్ క్రీయాశీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాకుండా ఇరాక్, సిరియాల్లో తలదాచుకున్న ముష్కరులపై వైమానిక దాడులకు దిగుతోంది. దీంతో ఫ్రాన్స్‌పై ఇస్లామిక్ స్టేట్ ఆగ్రహంతో ఉంది.   అందుకే ఐఎస్ రెండేళ్లుగా ఫ్రాన్స్‌లో నరమేధం సృష్టిస్తోంది. గతేడాది జనవరిలో వ్యంగ్య వారపత్రిక ఛార్లీ హెబ్డో కార్యాలయంపై విరుచుకుపడి పాత్రికేయులు, పోలీసులు సహా 17 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో రాజధాని పారిస్‌లో ఏకకాలంలో వివిధ చోట్ల దాడులకు తెగబడి 130 మంది ప్రాణాలు బలిగొన్నారు. తాజాగా జాతీయ దినోత్సవ వేడుకలను టార్గెట్ చేసి 84 మంది ప్రాణాలు తీశారు. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా..ఎంతమంది ఉగ్రవాదులను హతమార్చిన ఉగ్రవాదం చావదు. దానికి రూపురేఖలుండవు, విలువలుండవు. ఏ పేరు చెప్పుకున్నా మతం ఉండదు..మృత్యువే దాని మతమూ, అభిమతమూ. అందువల్ల ప్రపంచం జాగ్రత్తగా అడుగేయాల్సిన అవసరం ఉందని తాజా ఘటన మరోసారి నిరూపించింది.

ప్రాణాలు నిలబెడుతున్న సీఎం సహాయనిధి

చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం ఆర్‌ఎస్‌ కొత్తపల్లెకు చెందిన రమణప్ప, సరస్వతి దంపతుల కుమార్తె జ్ఞానసాయి దీనగాధ గుర్తుందా..? పాపకు పుట్టుకతోనే కాలేయ సంబంధ వ్యాధి ఉన్నట్లు తెలియడంతో ఆ తల్లిదండ్రులు తిరగని ఆసుపత్రి లేదు..ఆపరేషన్ చేయాలని అందుకు 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. అంతస్తోమత రమణప్ప కుటుంబానికి లేకపోవడంతో పాపను చంపడానికి అనుమతి ఇవ్వాలంటూ కారుణ్య మరణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కారుణ్య మరణం పిటిషన్ చూసిన అక్కడి న్యాయవాదులు, జడ్జి నివ్వెరపోయారు. ఇది తమ పరిధిలోకి రాదని పైకోర్టుకు వెళ్లాలని సూచించడంతో దంపతులు మీడియా ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు.   వీరి ఆవేదన మొత్తం పత్రికల్లో రావడం మరుసటి రోజు క్యాంపు కార్యాలయంలో పత్రికలు చదువుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈ కథనం కనిపించడంతో ఆయన చలించిపోయారు. పాపకు కావాల్సిన చికిత్సను అందించాలని మంత్రి కామినేని శ్రీనివాస్‌ను ఆదేశించారు. వెంటనే పాప చికిత్సకు కావాల్సిన రూ.30 లక్షల మొత్తాన్ని "సీఎం సహాయనిధి" నుంచి విడుదల చేశారు. ఇలా ఈ ఒక్క పాప మాత్రమే కాదు..తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, వైద్యం చేయించుకోవడానికి అవసరమైన ఆర్థిక స్థోమత లేని పేదలకు "ముఖ్యమంత్రి సహాయనిధి" చేయూతనందిస్తోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో సీఎంఆర్ఎఫ్ ద్వారా 20,312 మందికి రూ.167.36 కోట్ల ఆర్థిక సాయం అందించారు.     సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం చేస్తారని జనానికి తెలుసు కాని...దానిని ఎలా పొందాలో..ఎవరిని సంప్రదించాలో తెలిసేది కాదు. హైదరాబాద్‌ వెళ్లి రెండు మూడు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉండేది. పెద్ద సిఫార్సులు ఉంటే తెల్ల రేషన్‌ కార్డు లేకపోయినా సీఎం కార్యాలయ అధికారులు ఆర్థిక సహాయాన్ని అందించేవారు. అంతే కాకుండా మంత్రి సిఫారసు ఉంటే దరఖాస్తు చేసుకున్న మొత్తంలో 85 శాతం వరకూ మంజూరు చేస్తుండగా, సీఎం వద్ద పలుకుబడి ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా సిఫారసు చేస్తే 75 నుండి 80 శాతం వరకూ ఆర్థిక సహాయాన్ని అందించేవారు. ఎవరి సిఫారసు లేని పేదలు వాస్తవంగా వైద్యానికి అయిన ఖర్చులుకుగాను నేరుగా దరఖాస్తు చేసుకుంటే అందులో 15 శాతం నుండి 30 శాతం వరకూ మాత్రమే మంజూరు చేసేవారు. ముఖ్యమంత్రి సహాయనిధి ఎప్పటి నుంచో అమల్లో ఉన్నా, చంద్రబాబు ప్రభుత్వం దానిని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు సీఎం కార్యాలయం విజయవాడకే వచ్చేయడంతో నేరుగా అక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో బాధితులు నేరుగా ముఖ్యమంత్రినే కలిసే అవకాశం కూడా ఉంది.   సీఎంఆర్ఎఫ్ కింద పేద రోగులకు మూడు విధాలుగా సహాయం అందుతుంది. దానిలో మొదటిది లెటర్ ఆఫ్ క్రెడిట్ దీని కోసం వైద్యుడి సిఫారసు లేఖ, మెడికల్ రిపోర్టులు, గుర్తింపు కార్డు, తెల్ల రేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించిన మీదట వైద్యానికి ఎంత ఖర్చవుతుందో లెక్కవేసుకుని..దానిలో కొంత మొత్తాన్ని మంజూరు చేసి నేరుగా రోగికి చికిత్స చేసిన ఆసుపత్రికి పంపిస్తారు. మరో పద్ధతి రీయంబర్స్‌మెంట్..అత్యవసర పరిస్థితుల్లో రోగులు ఆసుపత్రుల్లో చేరి వైద్యం చేయించుకుని, ఆ తర్వాత తమకు ఎంత ఖర్చయిందో తెలిపే ఆసుపత్రి బిల్లులు, రిపోర్టులతో దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించిన అధికారులు కొంత మొత్తాన్ని మంజూరు చేస్తారు.   మూడో విధానం..ఎన్టీఆర్ వైద్య సేవ కింద గుర్తించిన వ్యాధితో బాధపడుతూ..ఈ పథకం కింద చికిత్స పొందే అర్హత ఉండి కూడా..తెల్ల రేషన్‌కార్డు గానీ, ఎన్టీఆర్ వైద్యసేవ కార్డుగానీ లేకపోతే అలాంటి వారు నేరుగా విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వైద్యసేవ కేంద్రానికి రోగితో సహా వస్తే, అక్కడి వైద్యులు ఆ రోగిని పరిశీలించి ఒక సిఫారసు లేఖ ఇస్తారు. దాని ఆధారంగా ఉచితంగా చికిత్స పొందవచ్చు. 

కేంద్రానికి చావుదెబ్బ...

బీజేపీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బతగిలింది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించి చేతులు కాల్చుకున్న మోడీ సర్కార్‌కు..సుప్రీంకోర్టు మరోసారి వాతలు పెట్టింది. రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్‌ను పునరుద్దరించాలని అత్యున్నత న్యాయస్థానం చారిత్రక తీర్పునిచ్చింది. ఆ ప్రభుత్వ పతనానికి కారణమైన గవర్నర్ నిర్ణయాలన్నీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేవిగా ఉన్నాయని పేర్కొంటూ వాటన్నింటిని రద్దు చేసింది. అసెంబ్లీలో 2015 డిసెంబర్ 15 నాటి స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. దీంతో ఈ ఏడాది జనవరిలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించడంతో పదవీచ్యుతుడైన నబమ్‌టుకీ తిరిగి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.   అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ 47 మంది ఎమ్మెల్యేల మద్థతుతో అధికారంలోకి రాగా, నబమ్ టుకీ 2011 నవంబర్ 1న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు..ఆయన సోదరుడు రెబియా స్పీకర్ అయ్యారు. 2014 డిసెంబర్‌లో టుకీ ప్రభుత్వం ఆర్థిక అవతవకలకు పాల్పడుతోందంటూ ఆరోగ్య శాఖ మంత్రి కలిఖోపుల్‌ ఆరోపణలు చేశారు. దీంతో సీఎం ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించారు. దీంతో పుల్ తిరుగుబాటుకు దిగారు..పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పుల్‌ను 2015లో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్‌గా జ్యోతి ప్రసాద్ రాజ్‌కోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించడంతో సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. 2016 జనవరి 14న జరగాల్సిన ఆరో విడత అసెంబ్లీ సమావేశాలను డిసెంబర్ 16, 2015నే నిర్వహించాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.   అదే సమయంలో స్పీకర్ రెబియా 21 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో 14 మందిని అనర్హులుగా ప్రకటించారు. స్పీకర్ ఆదేశాలను 2015 డిసెంబర్ 16న డిప్యూటీ స్పీకర్ రద్దు చేశారు. 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోవన్న స్పీకర్ నిర్ణయం చట్ట వ్యతిరేకమన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో టుకీ సర్కార్ అసెంబ్లీకి తాళం వేసింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు 33 మంది వేరే భవనంలో భేటీ అయ్యి అసెంబ్లీ నిర్వహించారు. స్పీకర్‌గా రెబియాను తొలగిస్తూ తీర్మానాన్ని ఆమోదించి, కొత్త స్పీకర్‌ను ఎన్నుకున్నారు. తిరిగి 2015 డిసెంబర్ 17 ఓ హోటల్‌లో సమావేశమై పుల్‌ను సీఎంగా ఎన్నుకున్నారు. రాజకీయ సంక్షోభం ముదిరిపాకాన పడటంతో కేంద్రం రంగంలోకి దిగి ఈ ఏడాది జనవరి 26న రాష్ట్రపతి పాలన విధించింది. జనవరి 28న రాష్ట్రపతి పాలనను వ్యతిరేకిస్తూ సీఎం టుకీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 19న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. అదే నెల 20న కలిఖోపుల్ సీఎంగా ప్రమాణం చేశారు.   టుకీ పిటిషన్‌పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తాజాగా తీర్పును వెలువరించింది. జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ పి.సి.ఘోష్, జస్టిస్ ఎన్.వి.రమణలతో కూడిన ధర్మాసనం 331 పేజీల తీర్పునిచ్చింది. ప్రజాప్రతినిధుల అధికారాన్ని కాదనే అధికారం గవర్నర్‌కు ఉండదు. మంత్రిమండలికి సభ విశ్వాసం ఉన్నంతకాలం..ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి సాయం, సలహాలకు గవర్నర్ బద్ధుడై ఉండాల్సిందే..అధికారంలో ఉన్న ప్రభుత్వం శాసనసభలో మెజారిటీని కోల్పోయినప్పుడు మాత్రమే మంత్రిమండలి సాయం, సలహా లేకుండా గవర్నర్ రాజ్యాంగంలోని 174వ అధికరణ కింద తనకు గల అధికారాన్ని వినియోగించవచ్చు. రాజకీయపార్టీలోని అసమ్మతి, విభేదం, అనైక్యత, అసంతృప్తి, అభిప్రాయబేధాలకు గవర్నర్ దూరంగా ఉండాలి. ఒక రాజకీయ పార్టీలోని కార్యకలాపాలు..ఆ పార్టీ శ్రేణుల మధ్య అలజడి, ఆందోళనల విషయం గవర్నర్‌కు సంబంధం లేని అంశం.   రాష్ట్ర శాసన వ్యవస్థకు తాను స్వతంత్ర న్యాయాధికారిగా వ్యవహరించరాదు. స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్‌కు లేదు. స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్‌ను తొలగించడంలో గవర్నర్‌కు ఎలాంటి పాత్రా ఉండకూడదని జస్టిస్ ఖేహార్ పేర్కొన్నారు. గవర్నర్‌కు..మంత్రిమండలికి మధ్య సమాచార సంబంధాలు పూర్తిగా విఫలమైనపుడు రాష్ట్రపతి జోక్యం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇక స్పీకర్ అత్యున్నత స్థాయి రాజ్యాంగహోదాను అనుభవిస్తారు. రాజ్యాంగం స్పీకర్‌పై అపార విశ్వాసం ఉంచుతుంది. ఈ ఒక్క కారణానికే, స్పీకర్ ఉన్నతమైన స్వతంత్ర భావన. రాజ్యాంగంలోని 179(సి) అధికరణ ఉద్దేశ్యం అదేనని గుర్తు చేశారు. సుప్రీం తీర్పుతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంతోషంలో మునిగి తేలుతుండగా..బీజేపీకి చావుదెబ్బ తగిలింది. ఈ ఏడాది మేలో ఉత్తరాఖండ్‌లో కేంద్రం విధించిన రాష్ట్రపతి పాలనను ఎత్తేసిన సుప్రీం..బలపరీక్ష జరపాలని ఆదేశించడంతో రావత్ సర్కార్ తిరిగి అధికారంలోకి వచ్చింది. 

సైన్యం పదఘట్టనల కింద ఇంకా ఏన్నాళ్లు..

  జమ్మూకశ్మీర్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేకాధికారాల మాటున సైన్యం చేస్తున్న మారణకాండపై విచారణ జరపాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.  మణిపూర్‌లొ బోగస్ ఎన్‌కౌంటర్ల ఆరోపణలపై విచారణ జరిపించాల్సిందిగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీం విచారించి 85 కేజీల తీర్పును వెలువరించింది. 2000 నుంచి 2012 వరకు అక్కడ జరిగిన బోగస్ ఎన్‌కౌంటర్‌లపై  సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించింది. ప్రత్యేకాధికారాల చట్టం కింద కల్లోలిత ప్రాంతాల్లో పోలీసులు అధిక బలప్రయోగాన్ని ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. మణిపూర్‌లో పరిస్థితి కేవలం ఒక అంతర్గత అశాంతి మాత్రమేనని పేర్కొంది. దేశ భద్రతకు లేదా దేశంలోని ఒక ప్రాంత భద్రతకు ముప్పు తెచ్చేలా ఎప్పుడూ అక్కడ యుద్ద పరిస్థితి లేదా వెలుపలి శక్తుల దాడి లేదా సాయుధ తిరుగుబాటు లేదు అని సుప్రీం కోర్టు నిర్దేశించింది.   శత్రువులన్న ఆరోపణలు వచ్చినంత మాత్రానే, శత్రువులు అన్న అనుమానంతోనే మనదేశ పౌరులను హతమార్చడానికి సాయుధ బలగాలను మోహరిస్తే చట్టబద్ధ పాలనే కాకుండా మన ప్రజాస్వామ్యమే తీవ్ర ప్రమాదంలో పడుతుందని ధర్మాసనం పేర్కొంది. అంతర్గత అశాంతిని చక్కదిద్దడానికి అక్కడి పౌర ప్రభుత్వానికి సహాయకంగా మాత్రమే సాయుధ బలగాలు కానీ..         అవి పరిపాలనా యంత్రాంగం స్థానాన్ని ఆక్రమించలేవని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. కల్లోల ప్రాంతాలుగా ఉన్న అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, త్రిపురలలో పరిస్థితుల్ని అదుపు చేయడం కోసం సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని భారత పార్లమెంట్ 1958 సెప్టెంబర్ 11న ఆమోదించింది. ఆ తర్వాత ఈ చట్టాన్ని జమ్మూకశ్మీర్‌కు కూడా వర్తింపజేస్తూ సాయుధ దళాల(జమ్మూకశ్మీర్) ప్రత్యేకాధికారాల చట్టం...1990 అమల్లోకి వచ్చింది. ఈ చట్టం భారత సాయుధ దళాలకు విస్తృతాధికారాలను కల్పించింది.   కనిపిస్తే కాల్చివేతకు, ఏ సాకుతోనైనా ఎవరినైనా అరెస్ట్ చేసేందుకు, ఎటువంటి వారెంటు లేకుండానే సోదాలు నిర్వహించే అవకాశం సైన్యానికి  దక్కింది. అయతే ఈ అధికారాన్ని సైన్యం దుర్వినియోగం చేసినట్టు ఎప్పటి నుంచో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారం మాటున సైన్మం మానభంగాలు, చిత్రహింసలు,  పౌరుల్ని విచక్షణారహితంగా కాల్చివేయడం లాంటి చర్యలకు పాల్పడింది. ఈ చట్టం ఆసరాతో అక్రమాలకు పాల్పడిన సైనికుల్ని అరెస్టు చేయడం గాని, ఎటువంటి విచారణకైనా గురిచేయడానికి కాని అవకాశం లేదు. దీంతో కొంతమంది సైనికులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నేరస్తులైన సైనికులపై కేసులు పెట్టలేక జరిగిన దారుణాలను బయట చెప్పుకోలేక ఎంతోమంది అభాగ్యులు నాలుగు గోడల మధ్య కుమిలిపోతున్నారు. ఇప్పుడు సుప్రీం తీర్పుతో విచారణ జరిగితే మణిపూర్‌ సహా ఈశాన్య రాష్ట్రాల్లో వాస్తవ పరిస్థితులు బయటకు వస్తాయి. సైనికుడు నేరం చేస్తే సాధారణ నేర న్యాయస్థానం నుంచి విచారణ లేకుండా పూర్తి రక్షణ ఉంటుందన్న భావనేమి లేదని...మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన ఏ సైనికుడినైనా విచారించకతప్పదని సుప్రీం వెల్లడించింది.

"ముందుచూపు" ఫలాలు?

  ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు ఎగువన ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి నదులు నుంచి భారీ ఎత్తున వరదనీరు వచ్చి చేరుతుండటంతో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఇది మరింత పెరిగితే తదుపరి మజిలి ఉభయగోదావరి జిల్లాలే. వరద నీరంతా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌కి చేరితే గోదావరి జిల్లాలు ముంపునకు గురవుతాయి. కానీ అక్కడి జనం కాని..ఏపీ ప్రభుత్వం కానీ ఎలాంటి చీకు చింతా లేకుండా ఉంది దానికి కారణం పట్టిసీమ. ఒకవేళ గోదావరి ఉరకలెత్తితే పట్టిసీమ ద్వారా కృష్ణమ్మను చేరుతుందిలే అన్న ధీమా.    అబ్బా ఏం ప్లానింగ్..ఏం ప్లానింగ్..ఎంతటి ముందుచూపు..ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగానే ఊహించి వృథాగా సముద్రంలోకి పోయే నీటిని ఒడిసిపట్టి నీరు లేక ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకు మళ్లించాలనే ఒకరి తపనకు నిలువెత్తు నిదర్శనం పట్టిసీమ. జలం లేనిదే జనం లేరన్నది జగమెరిగిన సత్యం. భూగ్రహంపై మానవాళి మనుగడకు మూలాధారం నీరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక మనదేశం ఎన్నో నదీమతల్లులకు నెలవైనా ఆ నీటి గలగలలను ఒడిసిపట్టడంలో ఇప్పటికీ విజయం సాధించలేకపోతున్నాం. అయితే అతివ‌ృష్టి..లేదంటే అనావృష్టి..ఇదీ మన దురవస్థ. ఇలాంటి గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే నదుల అనుసంధానమే సరైన పరిష్కార మార్గమంటూ నిపుణులు, మేధావుల నోట వినిపిస్తున్న మాట. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లైనా..ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ దిశగా ఒక్క అడుగు పడలేదు. మహామహులు సైతం కొరివితో తలగొక్కోవడం ఎందుకు అని వదిలివేసిన నదుల అనుసంధానాన్ని ఆచరణలో చేసి చూపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.   దక్షిణ భారతదేశంలో అత్యంత నీటి కొరతతో, కరువు కోరల్లో ఉన్న ప్రాంతం రాయలసీమ. అయితే మరో పక్క ఎక్కువ వరదలు వచ్చే ప్రాంతం గోదావరి..ప్రతి సంవత్సరం వరదల కారణంగా 3000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలోకి వృథాగా పోతున్నాయి. ఇందులో కొంత మొత్తం ఉపయోగించుకున్నా రాయలసీమ కరువు తీరిపోతుంది..అయితే ఎక్కడి గోదావరి జిల్లాలు..ఎక్కడి రాయలసీమ ఇంత దూరానికి నీటిని ఎలా చేరవేయ్యాలి. దానికి సమాధానమే పోలవరం ప్రాజెక్ట్ కుడికాలువ..ఇప్పటికే 70% పూర్తి అయిన కుడికాలువ మిగిలిన భాగాన్ని శరవేగంగా పూర్తి చేసి, గోదావరి నదిని విజయవాడ వద్ద కృష్ణానదితో అనుసంధానం చేసి, రాయలసీమకు నీటి కొరత తీర్చే ఈ బృహత్తర కార్యక్రమంలో తొలి దశను విజయవంతంగా పూర్తి చేశారు సీఎం. ప్రతి సంవత్సరం కృష్ణాడెల్టా రైతుల అవసరం కోసం ప్రకాశం బ్యారేజ్‌కి శ్రీశైలం నుంచి కొంత నీరు వస్తుంది.   ఇప్పుడు గోదావరి నుంచి నీరు వస్తున్నందున శ్రైశైలం, నాగార్జునసాగర్‌ నీరు కృష్ణా డెల్టా రైతులకు అవసరం ఉండదు. అందువలన ఈ ఆదా అయిన నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు తరలించి, అక్కడి పంటలను బతికించాలన్నది చంద్రబాబు ఆశయం. ఈ మహాక్రతువులో చంద్రబాబు ఎన్నో అటుపోట్లను ఎదుర్కొన్నారు. పట్టిసీమ పేరుతో వందల కోట్లు లూటీ చేసేందుకు సీఎం స్కెచ్ గీశారంటూ ప్రతిపక్షం ఆరోపణలు, పట్టిసీమ పేరుతో జలదోపిడి చేస్తున్నారంటూ పక్క రాష్ట్రం పేచీలు వాటన్నింటిని పరిష్కరించుకుంటూనే చంద్రబాబు చరిత్రను సృష్టించారు. అసాధ్యం అనకున్న దానిని సుసాధ్యం చేశారు. దేశంలోని చాలా రాష్ట్రాలు ఆయన్ను స్పూర్తిగా తీసుకుని తమ తమ రాష్ట్రాల్లో నదుల అనుసంధానానికి ప్రణాళికలు రచిస్తున్నాయి.  కాలువలు పారకపోయినా..ఎగువ రాష్ట్రంలోని ఆనకట్టల గేట్లు తెరుచుకోకపోయినా ఏపీకి ఇక దిగులులేదు.

ఒక వ్యక్తి మరణం..కాశ్మీరాన్ని రగిలిస్తోంది

మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వానీని సైన్యం హతమార్చడంతో జమ్మూకశ్మీర్‌ అట్టుడుకుతోంది. ఆ రోజు చేలరేగిన హింస ఇవాళ్టీకి కొనసాగుతోంది. ముఖ్యంగా భద్రతాదళాలు, పోలీసులే లక్ష్యంగా అల్లరిమూకలు దాడులకు తెగబడుతున్నాయి. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 21 మంది మరణించారు, 200 మందికి పైగా గాయపడ్డారు. అందులో 96 మంది పోలీసులేకావడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఒక ఉగ్రవాది మరణిస్తే కశ్మీర్ లోయ ఇంతలా ఎందుకు మండుతోంది అనేది ఒకసారి చూస్తే..జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని విస్తరించడమే ధ్యేయంగా ముందుకు వెళుతున్న వ్యక్తి బుర్హాన్ వాని.   కశ్మీర్‌లో వేర్పాటువాదులు ఎన్నో ఏళ్లుగా ఆధునాతన తుపాకులు, పేలుడు పదార్థాలను ఆయుధాలుగా ఉపయోగిస్తే అతను మాత్రం సోషల్ మీడియాను ఆయుధంగా ఎంచుకున్నాడు. కశ్మీర్‌ను ఎలాగైనా పాక్‌లో విలీనం చేయాలని కరడు గట్టిన ఉగ్రవాద సంస్థ అయిన హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరాడు. ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కశ్మీరీ యువతను ఆకట్టుకుని..తీవ్రవాద భావాలను, వేర్పాటువాద బీజాలను వారి మనసులో నాటాడు. సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతూ..ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేస్తూ ఎంతోమంది యువతను ప్రభావితం చేశాడు. తీవ్రవాదులుగా వచ్చే వారికి బహుమతులు, ఆయుధాలు ఎరగా వేసేవాడు.   దీంతో దిగువ మధ్యతరగతి. పేద వర్గాలకు చెందిన యువకులు ఎందరో అతని అనుచరులు అయ్యారు. ఇతని కదలికలపై నిఘా పెట్టిన భద్రతాదళాలు..తాజాగా త్రాల్ అటవీ ప్రాంతం నుంచి ఈద్ వేడుకులకు వస్తున్నాడనే స్పష్టమైన సమాచారంతో మాటువేసి బుర్హాన్‌ను మట్టుబెట్టాయి. బుర్హాన్ మరణాన్ని ఒక ఉగ్రవాది మరణంగా అక్కడి యువత భావించలేదు. గతంలో ఎందరో ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్లలో చనిపోతే వారిపై ఎటువంటి అభిమానం వ్యక్తమయ్యేది కాదు. కానీ బుర్హాన్ ఎన్‌కౌంటర్ మాత్రం తీవ్ర ప్రభావాన్ని చూపింది. కశ్మీర్ యువత అతడిని తమలో ఒకరిగా..ఒక హీరోగా భావించడమే అందుకు కారణం.   బుర్హాన్ మరణాన్ని జీర్ణించుకోలేని యువత అందుకు కారణమైన భద్రతా బలగాలపై కక్ష పెంచుకున్నాయి. అందుకే వారిని టార్గెట్ చేశారు. నిన్న జీలం నదిలోకి పోలీస్ జీపును తోసేయ్యడంతో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. అంతకు ముందు రోజు హాంజీపురా పోలీస్‌స్టేషన్‌ మీద యువత దాడి చేసినపుడు ముగ్గురు పోలీసులు జాడ తెలియకుండా పోయారు..ఇప్పటికి వారి క్షేమ సమాచారం అందడం లేదు. అనంతనాగ్ జిల్లాలో పోలీస్‌స్టేషన్‌పై రాళ్లదాడికి పాల్పడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాజధాని శ్రీనగర్ సహా కశ్మీర్ లోయ అంతటా కర్ఫ్యూ విధించింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. భద్రతా దళాలు గుంపును అదుపు చేయాల్సి వచ్చినపుడు తీసుకునే అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని, ప్రాణనష్టాన్ని తగ్గించాలని సీఎం, వేర్పాటువాద పార్టీలను కోరారు. ప్రభుత్వం తీసుకునే చర్యలు..కశ్మీర్‌ యువత గుండెల్లో మండుతున్న అగ్గిని ఏమేరకు చల్లార్చుతాయో వేచిచూడాలి. 

అమెరికాలో రగిలిన "జాతి" విద్వేష జ్వాల..

అగ్రరాజ్యం అమెరికాలో జాత్యాంహకారం మరోసారి పడగ విప్పింది. నల్లజాతీయులను తెల్ల పోలీసులు పదేపదే కాల్చి చంపడాన్ని నిరసిస్తూ డాలస్‌లో తెల్లజాతి పోలీసులే లక్ష్యంగా తుటాల వర్షం కురిపించారు. ఈ దాడిలో ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోగా..మరో ఏడుగురు గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అగ్రరాజ్యాన్ని వణికించిన 9/11 దాడుల తర్వాత..అమెరికాలో పోలీసులు పెద్ద సంఖ్యలో మరణించింది ఈ కాల్పుల్లోనే. అమెరికాలో నల్లజాతి వారిపట్ల తెల్లజాతి పోలీసులు వివక్ష చూపడం అనాదిగా జరుగుతోంది. అయితే ఈ వారంలో జరిగిన రెండు ఘటనలు నల్లజాతి ప్రజల్లో తీవ్ర ఆగ్రహన్ని కలిగించాయి.   బుధవారం మిన్నెసోటాలో ఫిలాండో క్యాజిల్ అనే నల్లజాతీయుడు, ఒక మహిళ, చిన్నారితో కలిసి కారులో వెళుతుండగా ఓ తెల్ల పోలీసు అధికారి కాల్చి చంపాడు. అంతకుముందు రోజు లూసియానాలో ఆల్టన్ స్టెర్లింగ్‌ అనే నల్లజాతీయుడిని ఇద్దరు శ్వేతజాతి అధికారులు రోడ్డు పక్కన పేవ్‌మెంట్ పైకి ఈడ్చుకెళ్లి, కాళ్లు, చేతులు తొక్కిపట్టేసి గుండెల్లోకి బుల్లెట్లు దింపారు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన వీడియోలు బయటికి రావడంతో అమెరికా అంతటా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ క్రమంలోనే డాల్లాస్‌ వేదికగా గురువారం రాత్రి 7 గంటల సమయంలో 800 మంది "బ్లాక్ లైవ్స్ మేటర్" పేరిట నిరసన ప్రదర్శన నిర్వహించారు.   బెల్‌గార్డెన్ పార్క్ నుంచి ఓల్డ్ రెడ్ కోర్ట్‌హౌస్ దాకా..1963లో అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నడీ హత్య జరిగిన చోటు మీదుగా వారి ప్రదర్శన సాగింది. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరక్కుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది..దాదాపు 100 మంది సాయుధ పోలీసులు ప్రదర్శనతో పాటు సాగారు. ప్రదర్శన అంతా శాంతియుతంగానే సాగింది. అయితే ఎల్‌సెంట్రో కాలేజీ వద్దకు చేరుకునే సరికి స్నైపర్ల మారణ కాండ మొదలైంది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం తుపాకుల మోతతో దద్దరిల్లింది. నిరసనకారులు భయంతో చెల్లాచెదురవ్వగా..వీరికి రక్షణగా ఉన్న పోలీసులు తమ ప్రాణాలను కాపాడుకుంటూనే..కాల్పులు జరిపారు.   ఇంతలో రైఫిల్‌తో ఉన్న ఒక దుండగుడు..పోలీసు వెనగ్గా వెళ్లి పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపేశాడు. అదే గన్‌మాన్ ఎల్‌సెంట్రో గ్యారేజ్ లోపల దాక్కుని పోలీసులపై కాల్పులు జరిపాడు. కొద్దిసేపు అతనితో చర్చలు జరిపిన అనంతరం పోలీసులు ఒక బాంబు రోబోకు పేలుడు పదార్ధాలు అమర్చి..దుండగుడి వద్దకు పంపి పేల్చివేయడంతో అతను చనిపోయాడు. చనిపోయే ముందు అతడు.. ‘ఈ గ్యారేజ్‌లో, డౌన్‌టౌన్‌ అంతటా బాంబులు పెట్టాం. మీలో ఇంకా చాలా మందిని చంపుతాం. అంతం సమీపిస్తోంది’ అన్నట్టు డాల్లాస్ పోలీస్‌ చీఫ్‌ బ్రౌన్‌ చెప్పారు. ఘటనకు కారణమైన వారిగా భావిస్తూ మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.   అటు కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన సమయంలో ఆయన వార్సాలో ఉన్నారు. పోలీసులపై హేయమైన, కుట్రపూరితమైన దాడి జరిగింది. ఈ విషాద సమయంలో డాల్లాస్ ప్రజలకు, పోలీస్ శాఖకు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఇవన్నీ చెదురుమదురుగా జరిగిన ఘటనలు కావు. మన దగ్గర నెలకొన్న వర్ణపరమైన అసమానతలకు నిదర్శనం. ఇది హిస్పానిక్ ఇష్యూ కాదని, ప్రతీ అమెరికన్ ఆలోచించాల్సిన విషయమని..మనిషి చర్మం రంగును బట్టి అతన్ని ట్రీట్ చెయ్యడం చాలా బాధాకరమని ఒబామా ఆవేదన వ్యక్తం చేశారు. 

ఒక ఉపన్యాసం: ఉత్తేజం..విధ్వంసం

ఉపన్యాసం..తనలోని భావాలతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ఒక అరుదైన కళ. కాకలు తీరిన మహా సామ్రాజ్యాలను సైతం కకావికలం చేసిన శక్తి ఉపన్యాసానికి ఉంది. భారత స్వాతంత్ర్యోద్యమంలో జాతి నేతలుగా వెలుగొందిన వాళ్లకి ఈ నేర్పరితనం ఉంది. నేతాజీ ఉపన్యాసం వింటే ఒంట్లోని రక్తం ఉడుకేక్కిపోయేదని చెప్పుకునేవారు. ఎన్టీఆర్ తన వాగ్ధాటితో 125 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని మట్టికరిపించారు. వివేకానంద అమెరికా పర్యటనలో చేసిన ఉపన్యాసాలు ప్రజలను ఉర్రూతలుగించి చివరి వరకూ వారు మంత్రముగ్ధులై తల తిప్పుకోకుండా కూర్చుండిపోయేవారు. ఆయన ఉపన్యాసం పూర్తికాగానే శ్రోతలు నూతన ధైర్యంతో, నూతన ఆశాభావంతో, కొత్త శక్తితో, కొత్త విశ్వాసంతో కదలివెళ్ళేవారు. ఆ ఉపన్యాసాలన్ని జాతిని చైతన్యపరిచి నవశకానికి నాంది పలికాయి. ఉపన్యాసంతో కలిగే చైతన్యం మంచితో పాటు చెడు కూడా చేయిస్తుందనడానికి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రదాడే ప్రత్యక్ష నిదర్శనం.   ముష్కరులు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే హోలి ఆర్టిసన్ రెస్టారెంట్‌పై దాడి చేసి 20 మంది విదేశీయులను ఊచకోత కోసిన ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతి పరిచింది. ఆ ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరులు ఒక ప్రసంగం నుంచి స్పూర్తి పొంది దాడులకు దిగారన్న వార్తలు మరోసారి కలకలం రేపాయి. ఆ ప్రసంగం చేసిన వ్యక్తి ఏ ఇస్లామిక్ దేశానికి చెందిన వ్యక్తో కాదు సాక్షాత్తూ మన భారతదేశానికి చెందిన వ్యక్తి.. డాక్టర్ "జకీర్ నాయక్". ముంబయికి చెందిన ఈయన ఇస్లామ్ మత బోధకుడు అహ్మద్ దీదత్ నుంచి ప్రేరణ పొంది ఇస్లామిక్ ఇంటర్నేషనల్ స్కూల్‌తో పాటు యునైటెడ్ ఇస్లామిక్ ఎయిడ్ అనే సంస్థనూ ప్రారంభించి పేద ముస్లిం యువతకు ఉపకార వేతనాలను అందిస్తున్నారు.   ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించిన ఆయన పీస్ టీవీ అనే ఛానల్‌ను స్థాపించి దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉపన్యాసాలు ఇచ్చారు. ఎన్నో చర్చల్లో పాల్గొన్నారు. అలా ఆయన ఉపన్యాసాలను విన్నవారిలో ఉగ్రవాదులు ఉన్నారు. తాజాగా ఆయన ప్రసంగాలు పలువురిని ఉగ్రవాదం వైపు నడిపించాయని వార్తలు వినిపిస్తున్నాయి. 2008లో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన మారణహోమానికి సూత్రధారిగా వ్యవహరించిన "హఫీజ్ సయీద్‌" చెందిన "జమాత్ ఉద్ దవా " సంస్థ వెబ్‌సైట్‌లో ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ పేరు ఉంది. దీంతో జకీర్ "జమాతే" ఉగ్రవాదులకు బోధనలు వినిపిస్తున్నారన్నట్లు తేలిపోయింది.   ఉగ్రదాడులకు తన బోధనలే కారణమన్న వార్తలతో జకీర్ నాయక్ స్పందించారు. ఉగ్రవాదానికి తాను పూర్తి వ్యతిరేకుడినని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆరోపించారు. ఎవరినైనా భయభ్రాంతులకు గురిచేసేవాడు ఉగ్రవాది అని నాటి కార్యక్రమంలో నేను చెప్పాను. దొంగను పోలీసు భయపెడతాడంటూ ఉదహరించానని.. అంటే దొంగ దృష్టిలో పోలీసు ఉగ్రవాది అన్నమాట. సమాజ వ్యతిరేక శక్తులకు ప్రతి ముస్లిం ఉగ్రవాదిగా మారాలి అని వివరించానని నాయక్ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై కేంద్రప్రభుత్వం మండిపడింది..నాయక్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని వెల్లడించింది. మరోవైపు జకీర్ నాయక్‌పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విచారణకు ఆదేశించారు. ఇలా జకీర్ తన మాటలతో చిక్కులను కొని తెచ్చుకున్నట్లైంది. రాబోయే రోజుల్లో అతని భవిష్యత్తు ఏంటో తేలిపోనుంది.  

పాలనకు కొత్త రక్తం...

ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. 19 మందిని కొత్తగా మంత్రులుగా తీసుకున్నారు. ఐదుగురు సహాయ మంత్రుల్ని తొలగించారు. పలువురు కేబినెట్ మంత్రుల శాఖలు మార్చేశారు. మోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ , వెంకయ్య నాయుడు లాంటి అగ్రనేతలు మినహా మిగిలిన మంత్రుల్లో చాలా మందికి శాఖలు మారాయి. వివాదాలు, వయసు మీద పడటం, పనితీరు వంటి వాటిని భేరీజు వేసుకుని మోడీ తన మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేశారు.   కేబినెట్‌లో మోడీ తర్వాత అంతటి ఛరిష్మా కలిగిన నేతగా పేరు తెచ్చుకున్న స్మృతి ఇరానీ నుంచి మానవ వనరుల అభివృద్ధిశాఖను తొలగించి, ఆ శాఖను ప్రకాశ్ జవదేకర్‌కు అప్పగించి ఆయనకు ప్రమోషన్ ఇచ్చారు. హెచ్‌ఆర్‌డీ శాఖ మంత్రిగా హెచ్‌సీయూలో దళిత స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య విషయంలోనూ, జేఎన్‌యూ వివాదంలోనూ స్మృతి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆమెను తప్పించి తక్కువ ప్రాధాన్యం గల శాఖకు బదిలీ చేయటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.   మరోవైపు సదానంద పనితీరు పట్ల ప్రధాని అంత సంతృప్తిగా లేరు. ఏపీ-తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విభజన అంశంలో వివాదాస్పద వ్యాఖ్యలు, న్యాయమూర్తుల నియామకం విధానంపై సుప్రీంకోర్టుకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య తలెత్తిన విభేదాల పరిష్కారంలో సమర్థంగా వ్యవహరించలేకపోవడం తదితర కారణాలతో న్యాయశాఖ మంత్రి డివి సదానంద గౌడను ఆ శాఖ నుంచి తప్పించారు. ఆయన్ను గణాంకాలు, పథకాల అమలు శాఖకు మార్చి..వాజ్‌పేయ్ హయాంలో న్యాయశాఖను సమర్ధవంతంగా నడిపిన ప్రస్తుత ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు అదనపు బాధ్యతగా న్యాయశాఖను అప్పగించారు. అటు సహాయమంత్రులైన సన్వర్‌లాల్ జాట్, మోహన్‌భాయ్ కుందారియా, నిహాల్‌చంద్, మన్‌సుఖ్‌భాయ్ ధాంజీభాయ్, రామ్‌శంకర్ కతేరియాలపై మోడీ వేటు వేశారు.   పాలనలో యువరక్తానికి పెద్దపీట వేయాలని భావించిన మోడీ అలాగే ముందుకెళ్లారు. తాజా మంత్రుల్లో ఐదుగురు 50 ఏళ్ల లోపు వయస్సు వారే. పది మంది 60 ఏళ్ల పైబడిన వారు.  కొత్త మంత్రులంతా విద్యాధికులు..వీరిలో 9 మంది పీజీ, ఏడుగురు న్యాయవాద పట్టభద్రులు, మరో ఏడుగురు పట్టభద్రులు, ఇద్దరు ఎంబీఏలు, ఒక వైద్యుడు ఉన్నారు.15 మందికి చట్టసభల కార్యకలాపాలు క్షుణ్ణంగా తెలుసు. నలుగురు మాత్రమే తొలిసారి చట్టసభకు వచ్చారు. 10 మందికి గతంలో కేంద్రంలోనో, రాష్ట్రంలోనో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది.   ఇదంతా చూస్తే ఈ మంత్రివర్గ విస్తరణపై మోడీ ఎప్పటి నుంచో కసరత్తు చేశారనిపిస్తోంది. మంత్రులుగా ఎంపిక చేసుకున్న వారి పూర్వానుభం, చదువు, పాలనపై పట్టు తదితర అంశాలను మోడీ మదింపు చేశారు. ఈ కొత్త కూర్పుతో పాలనను పరుగులు పెట్టించడంతో పాటు, రాజకీయ అవసరాలు కూడా ఉన్నాయి. కొత్త మంత్రి పదవుల్లో యూపీకి మూడు, గుజరాత్‌కు మూడు, రాజస్థాన్‌కు నాలుగు పదవులు దక్కాయి. యూపీ, గుజరాత్‌లకు వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరగనుండగా, రాజస్థాన్ వందశాతం ఎంపీ స్థానాలు గెలిపించిన రాష్ట్రం. మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగిన అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని ..ఇది పునర్‌వ్యవస్థీకరణ కాదని, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు మరింత సమర్థంగా, వేగంగా అమలు చేయడం కోసమే ఈ మార్పులు, చేర్పులన్నారు. పదవులు దక్కాయని సంబరపడకండి..ఈ నెలలోనే పార్లమెంట్ సమావేశాలున్నాయి..పని మొదలెట్టండి అని కొత్తమంత్రులకు దిశానిర్దేశం చేశారు.

కేజ్రీకి దెబ్బ మీద దెబ్బ..

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కేంద్రప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు గురించి ప్రత్యకంగా చెప్పవలసిన పనిలేదు. కేజ్రీ రెండోసారి అధికారాన్ని అందుకున్న దగ్గర నుంచి ఇవాళ్టీ వరకు కేంద్రంతో పోరాటం చేస్తూనే ఉన్నారు. దీనంతటికి ప్రధాన కారణం గడచిన ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోవడమేనని విమర్శకులు విశ్లేషిస్తున్నారు. గోవా, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఆప్ దూసుకుపోతుండటంతో కేంద్రం మైండ్ గేమ్ మొదలెట్టిందని ఆరోపిస్తున్నారు. నయానో..భయానో కేజ్రీవాల్‌ను తన దారికి తెచ్చుకోవాలని బీజేపీ చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.   ఇప్పటికే అనేక వ్యవహారాల్లో కేజ్రీ స్పీడ్‌కు బ్రేక్ వేసిన బీజేపీ సర్కార్ మరోసారి పెద్ద షాకిచ్చింది. సీఎం ముఖ్యకార్యదర్శి రాజేంద్రకుమార్ సహా ఐదుగురిని సీబీఐ నిన్న అవినీతి కేసులో అరెస్ట్ చేసింది. 2007-2015 మధ్య ఎండీవర్ సిస్టమ్స్ ప్రైవేట్‌ లిమిటెడ్ అనే సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ ప్రభుత్వ టెండర్లు ఐదింటిని దక్కించుకోవటానికి అనుకూలంగా వ్యవహరిస్తూ రాజేంద్రకుమార్ తన అధికారాలను దుర్వినియోగం చేశారని.. తద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయల మేర నష్టం కలిగించారని సీబీఐ గతేడాది డిసెంబర్‌లో కేసు నమోదు చేసింది.   ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం కేజ్రీవాల్ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న రాజేంద్రకుమార్ సహా ఉప కార్యదర్శిగా పనిచేస్తున్న తరుణ్‌శర్మ, మరో ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులను విచారణ నిమిత్తం నిన్న ఉదయం సీబీఐ ప్రధాన కార్యాలయానికి పిలిపించారు. మధ్యాహ్నం వరకు విచారించిన తర్వాత.. ఈ ఐదుగురిని అరెస్ట్ చేయాలని సీబీఐ నిర్ణయించింది. నిందితులైన అధికారులు ఆ కాంట్రాక్ట్‌లకు సంబంధించి రూ.3 కోట్లకు పైగా లబ్ధి పొందారనీ ఆరోపించింది. 1989 బ్యాచ్ అధికారి అయిన రాజేంద్ర, కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు. ఆప్ సర్కార్ అధికారంలోకి వచ్చినపుడు మొదటగా జరిపిన అపాయింట్‌మెంట్ ఆయనదే. పాలనపై, పలు విషయాల్లో ఆయన కేజ్రీవాల్‌కు తలలో నాలుకగా వ్యవహరించేవారని ప్రభుత్వ వర్గాల భావన. అలాంటి వ్యక్తి అరెస్ట్ కావడంతో కేజ్రీవాల్ కేంద్రంపై ఫైరయ్యారు.   ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీపై తాను దర్యాప్తునకు ఆదేశించినందుకు ప్రతీకారంగానే కేంద్రం సూచనతో సీబీఐ అధికారులు రాజేంద్ర వెంటపడ్డారని కేజ్రీవాల్ ఆరోపించారు. తన కార్యాలయాన్ని కూడా వారు సోదా చేశారని విమర్శించారు. మరోవైపు ఢిల్లీ సర్కార్ అధికారాలపై ఆప్ సర్కార్ వేసిన పిటిషన్‌లోనూ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. ఢిల్లీకి రాష్ట్రంగా సంక్రమించిన అధికారాలు నిర్వచించాలని, రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించకుండా ఆపాలని సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై తక్షణమే స్పందించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆదేశాలు జారీచేయాల్సిందిగా ఢిల్లీ తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన విజ్ఞాపనలను న్యాయమూర్తులు జేఎస్ ఖేహర్, అరుణ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. రెండు అంశాలపై నేడే విచారణ జరుపాల్సిందిగా ఆమె చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. మరి ఈ రెండు అంశాలపై కేజ్రీవాల్‌ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోందో వేచి చూడాలి.

స్వాతి హత్యకు బదులేది!

  దక్షిణ భారతదేశాన్నంతా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన ‘స్వాతి’ హత్య కేసు ఒక కొలిక్కి వచ్చింది. ఆమెను కొంతకాలంగా వెంటాడుతూ వచ్చిన రామ్‌కుమార్‌ అనే యువకుడే ఈ హత్యకు పాల్పడ్డాడని తేలింది. కానీ నిందితుడు అందించిన వివరాలతో మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న స్త్రీల రక్షణ గురించి మరిన్ని భయాలు కలిగిస్తున్నాయి.   స్వాతిని తాను ఫేస్‌బుక్‌లో చూసి ప్రేమించాననీ, ఆమెతో ఫేస్‌బుక్‌లోనే పరిచయం చేసుకున్నాననీ రామ్‌కుమార్‌ చెప్పుకొస్తున్నాడు. అలా ఫేస్‌బుక్‌ ద్వారా మొదలైన పరిచయాన్ని ప్రేమగా మార్చుకునేందుకు రామ్‌కుమార్‌ ప్రయత్నించడంతో స్వాతి నుంచి నిరాకరణ ఎదురైంది. ఆ నిరాకరణని జీర్ణించుకోలేని రామ్‌కుమార్ ఆమె మీద హత్యాయత్నానికి ఒడిగట్టాడు. వేలమంది తిరిగే నుంగంబాక్కమ్‌ (చెన్నై) రైల్వే స్టేషన్లో, నిర్భయంగా ఆమె గొంతుకోసి చంపేశాడు. ఎక్కడో తిరువన్వేలిలో ఉండే రామ్‌కుమార్‌, స్వాతిని వెతుక్కుంటూ చెన్నైకి రావడం వెనుక సామాజికమాధ్యమాల పాత్ర ఉండటం దురదృష్టకరం.   నిజానికి ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాలను యువత ప్రమాదరహితంగా భావిస్తోంది. చాప కింద నీరులా తమ జీవితాన్ని ప్రభావితం చేయగల సత్తా వీటికి ఉందన్న ప్రమాదాన్ని గ్రహించలేకపోతోంది. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్‌ని ఎన్నుకొనేటప్పుడు కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాలన్న సూచనని రామ్‌కుమార్‌ వంటి ప్రబుద్ధులు అందిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్, వారితో షేర్‌ చేసుకునే ఫొటోలు.... ఆఖరికి లైక్‌ చేసే పోస్టులు కూడా కొన్ని మృగాలకి ఆటవిడుపుగా మారే ప్రమాదం లేకపోలేదు.   సోషల్ మీడియాలో అకారణమైన పరిచయాలు, రోజుకో హత్యకు దారితీస్తున్నా.... అటు పోలీసులు కానీ, ఇటు సామాజిక మాధ్యమాలు కానీ వినియోగదారులని హెచ్చరించే ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదన్నది అసలు ప్రశ్న! మొన్నామధ్య ఇంటర్నెట్ మీద ఆధిపత్యం కోసం ఫేస్‌బుక్‌ కోట్ల రూపాయలను వెచ్చించి ప్రకటనలను రూపొందించింది. తమ పప్పులు ఉడకకపోయేసరికి మన దేశ వ్యవస్థను దుమ్మెత్తిపోసింది. కానీ కొత్తవారితో స్నేహం చేసే ముందు జాగ్రత్త అంటూ ఎక్కడన్నా మనకు పోస్టరు కనిపించిందా? ప్రకటన వినిపించిందా? సామాజిక మాధ్యమాల ద్వారా నేరస్తులు చెలరేగిపోతున్నారంటూ బాధపడుతున్న పోలీసులు, ఈ దిశగా ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రజల్లో సైబర్ క్రైం పట్ల అవగాహన కలిగించేందుకు ప్రభుత్వాలు, కళాశాలలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి?... లాంటి ప్రశ్నలెన్నో జవాబులు లేకుండా తిరిగి తిరగి వినిపిస్తూనే ఉన్నాయి.   స్వాతి హత్యలో కేవలం సామాజిక మాధ్యమాల దుర్వినియోగమే కాదు... స్త్రీల రక్షణ ఎంత దారుణమైన స్థితిలో ఉందో కూడా కనిపిస్తోంది. లేకపోతే ఒక మహా నగంలోని ముఖ్యమైన రైల్వే స్టేషన్లో పగటివేళ ఇలాంటి దారుణం జరగడం ఏమిటి? దానిని నివారించేందుకు కానీ, కనీసం బాధితురాలిని వైద్యం కోసం తరలించేందుకు కానీ ఎవ్వరూ ముందుకు రాకపోవడం ఏమిటి? సామాజిక మాధ్యమాల మాట అటుంచితే, సమాజంలోని ఈ వింత పోకడలే మరింత భయాన్ని కలిగిస్తున్నాయి స్వాతి హత్యకు బదులివ్వమని మనలో ప్రతి ఒక్కరినీ నిలదీస్తున్నాయి.

ఉగ్రవాదానికి మతం ఉంటుందా!

  నిఘావర్గాల పుణ్యమా అని హైదరాబాద్‌ పెను విపత్తు నుంచి తృటిలో బయటపడింది. మారణహోమం తప్పిందంటూ ఊపిరి పీల్చుకుంది. అయినా ఇంకా భాగ్యనగరం బిక్కుబక్కుమంటూనే ఉంది. వరుస పండుగలు, సెలవలని ఉపయోగించుకునేందుకు ఉగ్రవాదులు ఏ మూలన నక్కి ఉన్నారో అంటూ ప్రజలు భయపడుతూనే ఉన్నారు. కానీ ఇదే సమయంలో... ధ్వంసరచనకు పూనుకొన్న ఐఎస్‌ తీవ్రవాదుల చుట్టూ మతరాజకీయాలు కమ్ముకుంటున్నాయి.   మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ ఒకవైపు ఐఎస్‌ తీవ్రవాద తీరుని ఖండిస్తూనే, వారికి న్యాయసహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. పనిలో పనిగా నిఘావర్గాలు తరచూ అమాయకులైన కుర్రవాళ్లని హింసిస్తోందంటూ దుమ్మెత్తిపోశారు. భారత రాజ్యాంగం ప్రకారం ఎంతటి నేరం చేసినవారికైనా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఉంది. అలా నిరూపించుకునేందుకు వీలుగా ఒక న్యాయవాదిని నియమించుకునే హక్కూ ఉంది. ఒకవేళ వారికి ఆ స్తోమత లేకపోతే ప్రభుత్వమే వారి తరఫున వాదించేందుకు ఓ న్యాయవాదిని నియమిస్తుంది. ఇన్ని హక్కుల మధ్య ఒవైసీ తానే ఆ ముద్దాయిలకి న్యాయం అందించేందుకు ఎందుకు త్వరపడుతున్నారన్నది ప్రశ్న!   ఉగ్రవాదం ఏదో ఒక మతపు రంగుని పులుముకోవచ్చుగాక! కానీ వారికి తన మన అన్న బేధాలు ఉండవు. లేకపోతే రంజాన్‌వంటి పవిత్రమాసంలో పెను విధ్వంసానికి పాల్పడేందుకు ఎందుకు కుట్రపన్నినట్లు? హిందువులని రెచ్చగొట్టి ముస్లింలను బలిచేయాలన్న ప్రణాళికను ఎందుకు రచించినట్లు? ఈ విషయాన్ని కొందరు ముస్లిం పెద్దలు సైతం గ్రహించారు కనుకనే మసీదుల గుండా నిఘావర్గాలు ప్రవేశించేందుకు అనుమతిని ఇచ్చారు. మత ప్రాబల్యం ఉన్న పాతబస్తీలో ఇలాంటి సాయం... నిజంగానే అపురూపం. కానీ కొందరు రాజకీయ నేతలు, పట్టుబడ్డవారు అమాయకులేమో అంటూ ముందుగానే వెనకేసుకు రావడం దురదృష్టకరం.   ఇది కేవలం ఐఎస్‌ తరహా ఉగ్రవాదానికి సంబంధించిన సమస్య కాదు. గుజరాత్‌ అల్లర్లు, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన పేలుళ్లు, మాలేగావ్‌లో జరిగిన బాంబుదాడులు... వంటి సంఘటనల్లో హిందూ తీవ్రవాదులు పాల్గొన్నప్పుడు కూడా ఇలాంటి రాజకీయాలే చోటుచేసుకున్నాయి. సదరు సంఘటనలకి కాంగ్రెస్‌ ఒకలాగా, బీజేపీ మరొకలాగా స్పందించి ప్రజాస్వామ్యాన్ని ఇరుకున పెట్టాయి. ఇలా ఉగ్రవాదాన్ని మత కోణంలోంచి చూడటం మానుకున్న రోజునే నిందితులకు శిక్ష, నిర్దోషులకు రక్షణ లభిస్తాయి. లేకపోతే రాజకీయ పార్టీలు ఉగ్రవాదాన్ని కూడా అనుకూలంగా వాడుకునే రోజులు దాపురిస్తాయి.   అమెరికా వంటి ఆధునిక దేశాలలోనే తీవ్రవాదం అన్న పేరుతో అన్యమతస్తులను పీడించడం జరుగుతోంది. ఆ దేశ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టిన వెంటనే బట్టలూడదీసి మరీ తనిఖీలు చేస్తున్నారు. అలాంటి పరిస్థితితో పోల్చుకుంటే మన దేశం చాలా సహృద్భావంగానే వ్యవహరిస్తున్నట్లు లెక్క. ఈ దేశం ఏ ఒక్క మతం వారిదో కాదన్నది భారతీయుల నమ్మకం కాబట్టే, ప్రభుత్వాలు ఉదారంగా ఉన్నా ప్రమాదాలు ముంచుకురావడం లేదు. ఒకవేళ లెక్క తప్పి నిఘావర్గాలు ఎవరనన్నా నిర్దోషిని పట్టుకుంటే గొంతెత్తే అధికారం అసదుద్దీన్ వంటి నేతలకు ఎలాగూ ఉంది. అలాంటప్పుడు ముందుగానే మన దేశ రక్షణ దళాలను ఎందుకు దుమ్మెత్తిపోయడం అన్న ప్రశ్న ఎవరికైనా తట్టక మానదు.

ఐఎస్‌ ఉగ్రవాదులు... ఇంట్లోకి వచ్చేశారు

  ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఐఎస్ అనే తీవ్రవాద సంస్థ ఉందన్న విషయమే చాలామంది భారతీయులకి తెలియదు. తెలిసినా అదేదో సిరియాకు సంబంధించిన అతివాద సంస్థ అనీ, ఏదో అంతర్యుద్ధంలో మునిగిపోయిందనీ భావించేవారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఐఎస్‌ పంజా ప్రపంచమంతటా విస్తరించడం మొదలుపెట్టింది. పట్టించుకుని తీరాల్సిన పని పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ మొదలుకొని అమెరికా వరకూ ఐఎస్ బారిన పడ్డ దేశాల జాబితా పెరిగిపోతూ వచ్చింది. ఆ జాబితాలో ఇప్పుడు మన దేశం కూడా చేరే ప్రమాదమే ఉలిక్కిపడేలా చేస్తోంది.   ఐఎస్‌ సానుభూతిపరులు మన దేశంలో మారణహోమాన్ని సృష్టించాలనుకోవడం కొత్తేమీ కాదు. గత ఆరు నెలలోనే ఇలాంటి రెండు ప్రయత్నాలను మన నిఘా సంస్థలు భగ్నం చేశాయి. ముంబైలోనూ, రూర్కెలాలోనూ ఐఎస్‌ దాడులను అడ్డుకున్నాయి. అయితే అవన్నీ సిరియాలోని మాతృసంస్థతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు పన్నిన వ్యూహాలు కావు. కానీ నిన్న హైదరాబాదులో భగ్నం చేసిన ఉగ్రవాదుల వ్యూహం మాత్రం ఇందుకు విరుద్ధం! దానికి సహకరించిన వ్యక్తులు, సమకూర్చుకున్న మారణాయుధాలు, ఎంచుకున్న ప్రణాళిక.. ఐఎస్‌ మనకు ఎంత సమీపంలోకి వచ్చేసిందో తెలియచేస్తున్నాయి.   హైదరాబాదుకి చెందిన ‘మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ’ మరో నలుగురు ఉగ్రవాదులతో కలిసి భాగ్యనగరంలో మారణహోమాన్ని సృష్టించడానికి పక్కా ప్రణాళికను రచించాడు. ఐటీ ఉద్యోగులు సరదాగా గడిపే శనివారం రాత్రి మాదాపూర్‌లో పెను విధ్వంసాన్ని సృష్టించాలనుకున్నారు. రక్షణదళాలన్నీ ఆ విధ్వంసం దగ్గర మోహరించగానే, ఆదివారం మరికొన్ని ప్రదేశాలకు తన దాడులను విస్తరించాలనుకున్నాడు. పనిలో పనిగా గోమాంసాన్ని ఆలయాలలో వేసి హిందువులను రెచ్చగొట్టేందుకు సిద్ధపడ్డాడు. అసలే ఉగ్రదాడులతో ఉలిక్కిపడే హిందువులు, ఇలాంటి పనులతో మరింతగా రెచ్చిపోతారన్నది యజ్దానీ వ్యూహం. అదను చూసి ఓ బీజేపీ ఎమ్మెల్యేని కూడా హతమారిస్తే మతఘర్షణలు మరింతగా చెలరేగుతాయన్నది అతని పన్నాగం.   యజ్దానీ వ్యూహాలు ఏవో కాగితాల వరకు పరిమితమైనవి కావు. సిరియాలో ఉన్న ఐఎస్‌ పెద్దలతో స్వయంగా చర్చించి, దాడులకి తగిన మారణాయుధాలను సేకరించి ఏర్పరుచుకున్న కార్యాచరణ. స్వయంగా మెకానికల్‌ ఇంజనీర్‌ అయిన యజ్దానీ కనీసం 40-50 బాంబులకు కావల్సిన రసాయనాలను సమకూర్చుకున్నాడని నిఘావర్గాలు పేర్కొంటున్నాయి. లండన్‌, ప్యారిస్‌, బ్రెసిల్స్... వంటి ప్రాంతాల్లో మారణహోమం సృష్టించేందుకు ఎలాంటి పేలుడుపదార్థాలను ఉపయోగించారో, ఇక్కడా వాటినే సమకూర్చుకున్నారని తేలింది. అదృష్టవశాత్తూ నిఘావర్గాలు అప్రమత్తంగా వ్యవహరించాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే పరిస్థితి ఏమిటన్నది ఊహించడానికే ఒళ్లు గగుర్పొడిచే ప్రశ్న!   యజ్దానీ దాడులు వాస్తవరూపం ధరిస్తే ప్రాణనష్టం ఎలాగూ ఉంటుంది. దానికి తోడు భాగ్యనగరంలోని మతసామరస్యం శాశ్వతంగా దెబ్బతినేది. ఇక ఇక్కడి ఐటీ రంగం మీదా మచ్చపడేది. వీటిని బట్టి యజ్దానీ కుట్ర ఎంత విద్వేషపూరితమైనదో గ్రహించవచ్చు. ఇప్పుడు ఒక యజ్దానీని పట్టుకున్నంత మాత్రాన ప్రమాదం తప్పిపోలేదు. హైదరాబాదులో ఐఎస్‌ సానుభూతిపరులు నానాటికీ పెరిగిపోతున్నారని గణాంకాలే చెబుతున్నాయి. వారిలో ఏ ఒక్కరు బరితెగించినా భారీగా నష్టం వాటిల్లనుందని హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగమే దీనికి బలికావచ్చునని తెలుస్తోంది. ఎందుకంటే ఐటీ సంస్థలలో ఆర్థికపరమైన లక్ష్యాల పట్ల ఉన్న శ్రద్ధ అంతర్గత భద్రత పట్ల లేదని అనేక నివేదికలు రుజుబుచేస్తున్నాయి. దాదాపు 90 శాతం కంపెనీలలోకి మారణాయుధాలతో ప్రవేశించవచ్చని తేలింది. ఆర్థికమైన దన్ను ఉన్న ఐటీ పరిశ్రమల పరిస్థితే ఇలా ఉంటే ఇక షాపింగ్‌మాల్స్‌, సినిమాహాళ్లు, హోటళ్ల సంగతి చెప్పేదేముంది. కాబట్టి ఇప్పుడ యజ్దానీని పట్టుకున్నందుకు సంబరపడటం కాదు, అలాంటివారు తమ ప్రణాళికను అమలుపరిచే ప్రమాదం ఎక్కడెక్కడ పొంచి ఉందో పసిగట్టడం. ఎందుకంటే ప్రతిసారీ నిఘావర్గాల మీదే మన భద్రతా బాధ్యతలను మోపలేము కదా!

జగన్‌కు కోలుకోలేని దెబ్బ

  జగన్‌ ఆస్తులను ఈడీ జప్తు చేసుకుందన్న వార్తతో ఇవాళ తెలుగు రాష్ట్రాలు నిద్ర లేచాయి. నిజానికి ఇలాంటి ఎదురుదెబ్బలు జగన్‌కు కొత్తేమీ కాదు. కోర్టు బోనుల్లో నిల్చోవడం, జైలుకి వెళ్లి రావడం, ఆస్తులు జప్తు కావడం... ఈపాటికే జగన్ జీవితంలో భాగమైపోయాయి. కానీ ఈసారి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌) తీసుకున్న చర్య మాత్రం ఆయనను దివాళా అంచుల దాకా తీసుకువెళ్లే ప్రమాదం లేకపోలేదు. కుటుంబసమేతంగా బ్రిటన్‌లో కాస్త సేదతీరి తిరిగి రాజకీయాలలో చెలరేగిపోదామనుకున్న ఆయనకు ఇది దుర్వార్తే!   ఈడీ జప్తు చేసిన జగన్‌ ఆస్తుల విలువ 749 కోట్లు అన్నది అధికార ప్రకటన. కానీ బహిరంగ విపణిలో వీటి విలువ ఐదారు రెట్లు అధికంగా ఉండవచ్చని ఓ అంచనా. గుంటూరు జిల్లాలోని సరస్వతి పవర్‌ అండ్ ఇండస్ట్రీస్‌కు చెందిన 903 ఎకరాల విలువే 500 కోట్లకు పైగా ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక గూగుల్‌లో jagan mohan reddy అని టైప్ చేయగానే సెర్చ్‌లోని మొదటి వరుసలో కనిపించేది ఆయన ఇల్లే! బెంగళూరులోని శివారులో అంగరంగవైభవంగా కట్టుకున్న ఆయన భవనం కాస్తా ఇప్పుడు ఈడీ గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఇక హైదరాబాద్‌, లోటస్ పాండ్‌లోని ఇంటిదీ అదే దారి. ఇలా భవంతులూ, షేర్లూ, ఫిక్సిడ్‌ డిపాజిట్లూ... అటాచ్‌మెంటుకి కావేవీ అనర్హం అన్నట్లుగా జగన్‌కు చెందిన వందల కోట్ల ఆస్తిని ఈడీ చేజిక్కించుకుంది.   ఇంతకీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌ ఈ ఆస్తులను ఎందుకు జప్తు చేసుకుంది అన్నదానికి స్పష్టమైన సమాధానాలు వినిపిస్తున్నాయి. జగన్‌ తనకు అందిన ముడుపులను న్యాయబద్ధం చేసుకునేందుకు వాటిని భారతి సిమెంట్స్‌ వంటి సంస్థలలో పెట్టుబడులుగా చూపించారన్నది ఈడీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఇలా అక్రమమైన పెట్టుబడులను పెట్టడం ఒక ఎత్తయితే... ప్రభుత్వం దగ్గర ఉన్న పలుకుబడితో అనేక కాంట్రాక్టులను చేజిక్కించుకుని, వాటిని తిరిగి ఇష్టారాజ్యంగా అమ్ముకున్నారన్నది మరో ఆరోపణ. ఈ తతంగాన్ని వెనుక ఉండి నడిపించింది జగనేనని ఈడీ నమ్ముతోంది. ఈ నేరంలో భాగంగా నిమ్మగడ్డ ప్రసాద్, విజయసాయిరెడ్డి వంటివారు కూడా జగన్‌తో పాటుగా విచారణను ఎదుర్కొంటున్నారు.   జగన్‌ మీద ఏవో ఒక ఆరోపణలు రావడం, ఏవో ఒక కేసులు నడవడం కొత్తేమీ కాదు. కానీ ఈడీ ఈ స్థాయిలో విరుచుకుపడటం మాత్రం వైఎస్‌ఆర్‌సీపీకి ఊహించని ఎదురుదెబ్బే! ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని కాపు ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలోనూ, అమరావతి నిర్మాణం మీద సందేహాలను కలిగించడంలోనూ... అక్కడి పార్టీ శ్రేణులు ఇప్పుడిప్పుడే బలాన్ని పుంజుకుంటున్నాయి.   అక్కడ ప్రతిపక్ష పాత్రను వహించడంలో వైఎస్‌ఆర్‌సీపీతో పాటుగా సాక్షి కూడా తనదైన భూమికను నిర్వహిస్తోంది. ఇలాంటి సందర్భంలో సాక్షి పత్రిక, టీవీఛానల్ ఉన్న మీడియా భవంతిని కూడా ఈడీ జప్తు చేసుకోవడంతో ఇప్పుడు సాక్షి పత్రిక కూడా ఎదురీదక తప్పని స్థితి వచ్చింది. జులై ఎనిమిది నుంచి ప్రభుత్వ విధానాలను తూర్పారపడుతూ మరింత వేగాన్ని సాధిద్దామనుకున్న జగన్‌ ఇప్పుడెలా స్పందిస్తారన్నదే ‘కోట్ల రూపాయల’ ప్రశ్న! ఈడీ జప్తు చేసిన ఆస్తులు తాత్కాలిక చర్యే కాబట్టి, వాటిని విడిపించుకునే ప్రయత్నం చేస్తారా? లేకపోతే ఒక పక్క చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటూనే మడమ తిప్పకుండా రాజకీయ చదరంగంలో సైతం తన దూకుడిని చూపిస్తారా? అన్నవి కొద్ది రోజులలోనే తేలిపోయే జవాబులు!

మరణ మృదంగం..

పసికూనల బోసినవ్వులు విరబూయాల్సిన చోట మరణ మృదంగం మోగుతోంది..పురిటి నొప్పుల బాధను ఇంకా మరచిపోని ఆ తల్లులకు తీరని వ్యధే మిగులుతోంది. భారత్‌లో శిశు మరణాల రేటు ఆందోళన కలిగిస్తోందని..ప్రతి రోజు కొన్ని వేల మంది చిన్నారులు మరణిస్తున్నారు. ఈ విషయం ఎవరో చెబుతోంది కాదు..సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి.. భారత్ సహా పలు వర్థమాన దేశాల్లో నిర్వహించిన సర్వే ఈ నిజాలను బట్టబయలు చేస్తోంది.   భారత్‌లో పుట్టిన వెయ్యిమంది పసికందుల్లో 60 మంది ఏడాదిలోపు చనిపోతుంటే, మిగిలిన వారిలో సగం పోషకాహార లోపంతో మృత్యువాత పడుతున్నారు. అలా..ఏటా 1.45 మిలియన్ల మంది పిల్లలు పుట్టిన రెండు మూడు సంవత్సరాలకే తనువు చాలిస్తున్నారని ఐరాస తెలిపింది. పేద పిల్లల సంక్షేమంపై దృష్టిపెట్టకపోతే ప్రపంచ వ్యాప్తంగా 2016-2030 మధ్య 6.9 కోట్ల శిశు మరణాలు సంభవిస్తాయని..అందులో సగానికి పైగా భారత్, నైజీరియా, పాకిస్థాన్, కాంగో, అంగోలాల్లోనే చోటు చేసుకుంటున్నాయని తెలిపింది. ఒక్క భారత్‌లోనే ఇందులో 17 శాతం మరణాలు సంభవిస్తున్నాయని హెచ్చరించింది.   ప్రపంచ వ్యాప్తంగా "బాలల స్థితి వార్షిక నివేదిక"ను ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ "యూనిసెఫ్" విడుదల చేసింది. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు 1990తో పోలిస్తే సగానికిపైగా తగ్గినట్లు యూనిసెఫ్ తెలిపింది. 129 దేశాల్లో బాల, బాలికలు సమాన సంఖ్యలో ప్రాథమిక పాఠశాలలకు హాజరవుతున్నట్టు పేర్కొంది. పేదరికంలో మగ్గుతున్న చిన్నారుల శాతం సగానికి తగ్గినట్టు వెల్లడించింది. ధనిక వర్గాలతో పోలిస్తే..పేద పిల్లలు ఐదేళ్లలోపు మృత్యువాతపడటం, తీవ్ర పోషకాహార లోపాల బారినపడటం వంటి ముప్పు రెట్టింపు అయినట్లు తెలిపింది. పేద పిల్లల సంక్షేమంపై ప్రభుత్వాలు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు దృష్టిపెట్టాలని పిలుపునిచ్చింది.   భారత్‌లో శిశుమరణాల రేటును తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం ఏటా కోట్లు కేటాయిస్తున్నా, నిధులను సరిగా ఖర్చు చేయడంలో రాష్ట్రప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. పునురుత్పత్తి, శిశు ఆరోగ్యం కింద కేటాయిస్తున్న నిధుల్లో సింహభాగం సిబ్బంది జీతభత్యాలకు ఖర్చు చేస్తున్నారే తప్ప చిన్నారుల ఆరోగ్యం మెరుగుకు ప్రణాళికలేవీ రూపొందించడం లేదు. అయితే శిశు మరణాలపై ప్రజాసంఘాల వాదన మరోలా ఉంది. చిన్నారుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని అవి ఆరోపిస్తున్నాయి. చాలా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మౌలిక వసతులు లేకపోవడంతో శిశుమరణాలు పెరిగిపోతున్నాయి.   వసతులను కల్పించాల్సిన ప్రభుత్వం నిద్రపోతుండటంతో తల్లులకు కడుపు కోతే మిగులుతోంది. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో నిలోఫర్ ఆసుపత్రితో పాటు జీజీహెచ్, కేజీహెచ్ తదితర ఆసుపత్రుల్లో సౌకర్యాల లేమి గురించి ప్రతి రోజు ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం. ఇకనైనా ప్రభుత్వాలు స్పందించకుంటే పురిటి నొప్పులతో విలవిల్లాడుతూ మృత్యుముఖంలోంచి బయటికొచ్చిన తల్లిని మృతశిశువు వెక్కిరిస్తూనే ఉంటుంది.