సుప్రీంకోర్టు ముందస్తు ఝలక్.. స్టే విధించే అధికారం హైకోర్టుకు

  ఓ వైపు తెరాస అసెంబ్లీ రద్దు చేసి, అభ్యర్థులను ప్రకటించి, ప్రచారం మొదలుపెట్టి ముందస్తు వైపు ఆశగా అడుగులు వేస్తోంది. మరోవైపు మహాకూటమి సీట్ల సర్దుబాటు చర్చలతో మునిగితేలుతోంది. అయితే కొందరు మాత్రం అసలు ముందస్తు ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముందస్తుకు నిలిపివేయాలంటూ ఇప్పటికే హైకోర్టులో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పైన సుప్రీం కోర్టులో తాజాగా విచారణ జరిగింది. అన్ని పిటిషన్లను రేపే విచారణ చేపట్టాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల పైన స్టే విధించవలసి వస్తే హైకోర్టుకు ఆ అధికారం ఉందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఈ నెల 8వ తేదీన ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ లోపే విచారణ పూర్తి కావాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. మరోవైపు ఓటర్ల జాబితా విషయంలో అవకతవకలు కనిపిస్తే హైకోర్టు స్టే విధిస్తుందనే ఆశతో విపక్షాలు ఉన్నాయి. అదే జరిగితే తెరాసకు షాక్ అని చెప్పవచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

వైఎస్‌ హయాంలో మహిళల పసుపు-కుంకుమలు తుడిచేశారు

  గుంటూరులోని తెదేపా కార్యాలయంలో మీడియా తో మాట్లాడిన మంత్రి పరిటాల సునీత జగన్ పాదయాత్రలకే పరిమితమని,ఆయన ఎప్పటికీ సీఎం కాలేరని స్పష్టం చేశారు.రాష్ట్రాభివృద్ధిపై అవగాహన లేని జగన్‌ తెదేపాపైనా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.వైఎస్‌ హయాంలో ఎంతో మంది మహిళల పసుపు-కుంకుమలు తుడిచేశారని, తాము చంద్రన్న పసుపు-కుంకుమ పేరుతో మహిళలకు సాయం చేస్తున్నామని తెలిపారు.కాంగ్రెస్‌ పదేళ్ల పాలనలో డ్వాక్రా మహిళలకు రూ.2,300కోట్ల వడ్డీ రాయితీ ఇస్తే తాము నాలుగేళ్లలోనే రూ.2,500 కోట్లు చెల్లించామన్నారు. రూ.50వేల కోట్లకు పైగా బ్యాంకు లింకేజీ రుణాలు చెల్లించామని మంత్రి తెలిపారు. భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్‌కు వంతపాడుతున్నారని.. వైకాపా, భాజపా కుమ్మక్కై తెదేపా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.రాష్ట్రాభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సునీత వ్యాఖ్యానించారు. రాయలసీమలో అభివృద్ధి జరగలేదని కన్నా దుష్ప్రచారం ప్రారంభించారని విమర్శించారు. వైఎస్‌ఆర్‌ హయాంలో రాయలసీమలో అభివృద్ధి జరిగిందా..? అని మంత్రి ప్రశ్నించారు.ఎన్టీఆర్‌ శంకుస్థాపన చేసిన హంద్రీనీవాను వైఎస్‌ ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చాక హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇస్తున్నామని, ఇవాళ సీమ మొత్తం పంటలతో కళకళలాడుతోందని మంత్రి సునీత తెలిపారు.

తగ్గిన పెట్రోల్ ధర.. సామాన్యునికి కాస్త ఊరట

  నిన్న మొన్నటి వరకు పెట్రోల్,డీజిల్ ధరలు ఊహించని రీతిలో పెరుగుతూ సామాన్యునికి చుక్కలు చూపించాయి.వీటి దారెక్కడ సెంచరీ కొడుతుందో అని అంతా ఆందోళన చెందారు,పెరిగిన ధరలపై సర్వత్రా నిరసన గళం వినిపించారు,కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అంటూ ఆందోళనలు చేపట్టారు.ఇన్నాళ్లుగా ఎక్సైజ్ డ్యూటీ త‌గ్గించే ప్ర‌స‌క్తే లేద‌ని మొండి ప‌ట్టు ప‌ట్టిన కేంద్రం.. మొత్తానికి దిగి వ‌చ్చింది.ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీని 1.50 మేర తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సైతం ఇంధన ధరలను రూ.1 మేర తగ్గించనున్నట్టు పేర్కొన్నారు. దీంతో మొత్తంగా పెట్రోల్, డీజిల్‌ ధరలపై సామాన్యుడికి రూ.2.5 మేర ఉపశమనం కల్పిస్తున్నట్టయింది.కాగా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యాట్ రూపంలో వసూలు చేస్తున్న పన్నులను రూ.2.5 మేర తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రాలకు లేఖలు రాసినట్టు జైట్లీ పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఖజానాపై ఏటా రూ.10,500 కోట్ల భారం పడనుందని జైట్లీ తెలిపారు.అయితే సామాన్యులకు మరో భయం పట్టుకుంది పైసల్లో తగ్గినప్పుడే పెరుగుదల రూపాయల్లో ఉంది అలాంటిది రూపాయల్లో తగ్గుతుందంటే మళ్లీ ఎంత పెరుగుతుందో అని ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

చంద్రబాబు కోసం దేవుడిని ప్రార్ధించిన శివాజీ!!

  నటుడిగా శివాజీ సినిమాల్లో ఎంత ఫేమస్ అయ్యారో.. ఆపరేషన్ గరుడతో రాజకీయాల్లో అంతకంటే ఎక్కువ ఫేమస్ అయ్యారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో మొదటినుండి తన గళాన్ని వినిపిస్తున్న శివాజీ.. కేంద్రాన్ని నిలదీస్తూ విమర్శిస్తూ ఉంటారు. తాజాగా వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శివాజీ.. చంద్రబాబు కోసం, అప్ ప్రత్యేకహోదా కోసం దేవుణ్ణి ప్రార్థించినట్టు చెప్పారు. ఏపీలో రాజకీయాలు నడవటం లేదని, ఆ స్థానంలో కుట్రలు, కుతంత్రాలు నడుస్తున్నాయన్నారు. నీచమైన మనస్తత్వాలతో రాజకీయ నేతలు ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న నాయకుడికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ వేంకటేశ్వరుని కోరుకున్నానని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదాకోసం కూడా ఆ దేవదేవున్ని ప్రార్థించానని శివాజీ తెలిపారు.

చేయిచేసుకున్న ఎంఆర్ఓ ..విలపించిన యువతి

  ప్రభుత్వ అధికారిణిగా బాధ్యతాయుతమైన పదివిలో ఉండి ఓ యువతి పట్ల భాద్యతారాహిత్యంగా చేయిచేసుకోవటంతో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆందోళన చోటుచేసుకుంది.నాంపల్లి మండలం చిట్టంపహాడ్‌కు చెందిన ఉగ్గపల్లి సరిత ఆదాయ, కులధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చారు. ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవ రశీదులతో కార్యాలయంలోని కంప్యూటర్‌ కౌంటర్‌ వద్ద నిరీక్షిస్తున్నారు. ఈ సమయంలో ఛాంబర్‌ నుంచి బయటకు వచ్చిన ఎంఆర్ఓ కేసీ ప్రమీల.. ఇక్కడ నీకేంపని అంటూ ఆగ్రహంతో చేయిచేసుకున్నారని సరిత రోదిస్తూ తెలిపింది. విషయం తెలుసుకున్న యువతి బంధువులు కార్యాలయానికి చేరుకొని ఎంఆర్ఓ తో వాగ్వాదానికి దిగారు.అయితే ఎంఆర్ఓ మాత్రం తాను ఎవరిపై చేయిచేసుకోలేదని, కంప్యూటర్‌ కౌంటర్‌ వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో పక్కకు జరగాల్సిందిగా చేతితో తట్టి సూచించానని తెలిపారు.

వెస్టీండీస్‌తో టెస్ట్.. రికార్డు సృష్టించిన పృథ్వీ షా.!!

  టీమిండియా అండర్19 టీమ్ మాజీ కెప్టెన్ పృథ్వీ పంకజ్ షా ఆరంభ టెస్ట్ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా విండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో ఓపెనర్ గా దిగిన పృథ్వీ షా 56బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసాడు. ఆ తరువాత సెంచరీ చేయడంలో కూడా అదే దూకుడు కొనసాగించాడు. 99బంతుల్లోనే 101 కొట్టి సెంచరీతో సత్తా చాటాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆరంగేట్రంలోనే సెంచరీ చేసిన 15వ ఆటగాడు పృథ్వీ షా కావడం విశేషం. తొలి మ్యాచ్‌లోనే ఫాస్టెస్ట్ సెంచరీ (99 బంతుల్లో) చేసిన మూడో బ్యాట్స్‌మెన్ కూడా పృథ్వీనే. ఇతని కంటే ముందు శిఖర్ ధావన్(85బంతుల్లో).. ఆ తర్వాత వెస్టీండీస్ ఆటగాడు స్మిత్ (93బంతుల్లో) ఉన్నారు. ఇదిలా ఉంటే, అతి తక్కువ వయసులోనే సెంచరీ చేసిన భారత రెండో ఆటగాడు పృథ్వీ కావడం విశేషం. పృథ్వీ కంటే ముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.1990లో 17సంవత్సరాలకే ఇంగ్లండ్‌పై జరిగిన మ్యాచ్‌లో సచిన్ సెంచరీ చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో పృథ్వీ షా 154 బంతుల్లో 134 పరుగులు చేసి వెనుతిరిగాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 278/3 కాగా కోహ్లీ (33) , రహానే (15 ) క్రీజులో ఉన్నారు.

రూపాయి పతనం..బ్రేకింగ్‌ న్యూస్‌ కాదు.. బ్రోకెన్‌ న్యూస్‌.

  అవకాశం దొరికిందే తడవు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం,మోడీ పాలనపై విరుకుపడుతున్నారు.తాజాగా డాలర్‌తో రూపాయి మారకం విలువ ఎన్నడూ లేనంత దారుణంగా పతనం కావడంపై ట్విట్టర్ వేదికగా రాహుల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.'బ్రేకింగ్‌ రూపాయి విలువ 73.67 వద్ద కొనసాగుతోంది. ఇది బ్రేకింగ్‌ న్యూస్‌ కాదు. బ్రోకెన్‌ న్యూస్‌’ అని ట్వీట్‌ చేశారు.మరో ట్వీట్‌లో ‘ రూపాయి పతనం స్పందించాల్సిన వారు, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన వారు పత్తా లేకుండా పోయారు. ప్రస్తుతం వారంతా రైతులపై ప్రతాపం చూపే పనిలో బిజీగా ఉన్నారు. పతనంపై ఎవ్వరూ మాట్లాడకపోవడం కేంద్రం నిర్లక్ష్యానికి నిదర్శనం’ అంటూ ట్వీట్‌ చేశారు. రూపాయి పాతాళానికి పడిపోయినా ప్రధాని మోదీ నోరు విప్పకపోవడంపై రాహుల్ మండిపడ్డారు. 'రూపాయి 73 మార్కును దాటేసింది. దీంతోపాటు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చమురు, ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతూ ఉంది. ఇవన్నీ కలిసి దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 56 అంగుళాల ఛాతీ కలిగిన వారు ఇప్పటికీ ‘సైలెంట్ మోడ్‌’లోనే ఉన్నారు. ఇక అచ్ఛేదిన్‌ ఊసే లేదు’ అంటూ రాహుల్‌ ధ్వజమెత్తారు.

ఓ ఇంటర్వ్యూతో కోర్టుకెళ్లనున్న స్పీకర్

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు హైకోర్టులో చుక్కెదురైంది.ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించి అధికంగా ఖర్చు చేశారన్న కేసులో కోడెల శివప్రసాద్‌కు ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈనెల 10న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.2014 ఎన్నికల్లో రూ.11 కోట్ల 50లక్షలు ఖర్చుపెట్టానని కోడెల ఓ ఇంటర్వ్యూలో చెప్పారని సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి గతంలో కరీంనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించిన పిటిషనర్ ఐటీ అధికారులతో విచారణ జరిపించాలని కోరారు. దీన్ని విచారణకు స్వీకరించిన కరీంనగర్ కోర్టు విచారణకు హాజరుకావాలని కోడెలను గతంలో ఆదేశించింది. అయితే కరీంనగర్ కోర్టు ఆదేశాలపై కోడెల శివప్రసాద్ హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసుల విచారణకు నాంపల్లిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు కావడంతో ఆ కేసు అక్కడికి బదిలీ అయింది. కోడెల స్టే పొంది ఆరు నెలలు పూర్తి కావడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టే పొడిగించాలని హైకోర్టును కోరారు. హైకోర్టులో పిటిషన్ ఇంకా విచారణకు రాకపోవటంతో ప్రత్యేక కోర్టు ఈ నెల 10న విచారణకు రావాలని కోడెలను ఆదేశించింది.

దటీజ్ చంద్రబాబు.. 1100 తో ప్రజలకు అండగా

  చంద్రబాబు ఏం చేసినా అలోచించి చేస్తారు. ప్రజలకి మంచి జరిగేలా చూస్తారు. ఇది కేవలం నోటి మాట కాదు. చాలా సందర్భాల్లో రుజువైంది. తాజాగా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో చంద్రబాబుకి ఎంత విజన్ ఉందో అర్ధమవుతుంది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. గుంటూరు జిల్లాకు చెందిన షేక్ మొయినుద్దీన్ ఎంపీడీఓగా పనిచేసి పదవి విరమణ చేసారు. ఆయన 2008 లో తెనాలిలో 60 గజాల స్థలం కొని రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ సమయంలో కార్యాలయ సిబ్బంది నిర్వాకం మూలంగా రిజిస్ట్రేషన్లో కొన్ని తప్పులు దొర్లాయి. అప్పుడు ఆయన వాటిని గమనించలేదు. ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకుందామని ప్లాన్ అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకోగా తప్పులు ఉన్నట్టు తేలింది. వాటిని సరి చేయిస్తే కానీ ప్లాన్ అప్రూవల్ చేయలేమని మున్సిపల్ అధికారులు స్పష్టం చేసారు. దీంతో మొయినుద్దీన్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి తప్పులు సరిచేయాలని కోరారు. దీనికి కార్యాలయ ఉద్యోగులు 12 వేలు డిమాండ్ చేసారు. చివరికి మొయినుద్దీన్ 7 వేలు ఇచ్చి పని చేయించుకున్నారు. ఇది జరిగి రెండేళ్లయింది.     ఇటీవల 1100 పై చంద్రబాబు చేసిన ప్రకటనతో మొయినుద్దీన్ లో చైతన్యం వచ్చింది. తనకు జరిగిన అన్యాయాన్ని 1100 కు ఫోన్ చేసి చెప్పారు. ఎప్పుడో రెండేళ్ల క్రితం జరిగిన విషయం.. ఇప్పుడు స్పందిస్తారా? అనే అనుమానం ఆయనలో ఎక్కడో దాగుంది. కానీ ఆ అనుమానం పటాపంచలైంది. ఫోన్ చేసిన కొద్దిరోజులకే ఒక ఉద్యోగి ఆయన వద్దకు వచ్చి తన వల్లే తప్పు జరిగింది అంటూ క్షమాపణలు చెప్పి.. లంచంగా తీసుకున్న 7 వేలు తిరిగిచ్చాడు. ఆ ఉద్యోగి తిరిగిచ్చింది డబ్బుని మాత్రమే కాదు.. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందనే నమ్మకాన్ని. ఈ సంఘటనతో మొయినుద్దీన్ కళ్ళు ఆనందబాష్పలతో నిండిపోయి మనసులోనే చంద్రబాబు ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలుపుకున్నాడు.

చంద్రబాబుని చూసి కేసీఆర్‌,మోడీ భయపడుతున్నారు..!!

  నిజామాబాద్ లో జరిగిన సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రస్థాయి లో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ విమర్శలు తిప్పికొట్టారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటమి భయంతోనే కేసీఆర్‌ తెదేపాపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.కేసీఆర్‌ నిరాశ, నిస్పృహలతో చంద్రబాబుపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. చంద్రబాబును ఎంత తిడితే అన్ని ఓట్లు వస్తాయనే భ్రమలో కేసీఆర్‌ ఉన్నారని.. తెలుగు ప్రజలంతా దీనిని నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్‌ నగరం అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కేసీఆర్‌ మరిచారా? అని ప్రశ్నించారు.రాజకీయ నేతగా ఎదిగిన కేసీఆర్‌,తెరాస మంత్రివర్గంలో ఉన్న సగంమంది తెదేపా గూటికి చెందిన వాళ్లేనన్న సత్యాన్ని ఆయన గ్రహించాలన్నారు.చంద్రబాబుపై వ్యాఖ్యలు చేస్తే కేసీఆర్‌కు నష్టమే తప్ప లాభం ఉండదని తెలిపారు. 2004లో కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీతో ఎందుకు పొత్తుపెట్టుకున్నావని ఆయన ప్రశ్నించారు. సైబరాబాద్‌ సృష్టికర్త చంద్రబాబు అన్న మీరే ఇప్పుడు చంద్రబాబు తెలంగాణను నాశనం చేశారనడం బాధాకరమన్నారు. రూ.500 కోట్లు కాదు రూ.5 కోట్లు కూడా తెలంగాణకు పంపాల్సిన కర్మ పట్టలేదన్నారు. కేసీఆర్‌కు ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని సోమిరెడ్డి అన్నారు.ప్రధాని మోదీ నుంచి కేసీఆర్‌ వరకు అందరికీ చంద్రబాబు భయం పట్టుకుందని విమర్శించారు.

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా 'పైసావసూల్' ప్రొడ్యూసర్

  తెలంగాణలో ముందస్తు వేడి మొదలైన సంగతి తెలిసిందే. ఓవైపు తెరాస, మరోవైపు మహాకూటమి నువ్వా నేనా అన్నట్టుగా గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే తెరాస 105 అభ్యర్థులను ప్రకటించి ప్రచారం కూడా మొదలుపెట్టింది. మహాకూటమి మాత్రం ఇంకా సీట్ల సర్దుబాటు చర్చల దశలోనే ఉంది. మఖ్యంగా కాంగ్రెస్, టీడీపీల మధ్య సీట్ల సర్దుబాటు ఎక్కువ సమయం తీసుకునేలా ఉంది. అయితే ఇంకా అధికారకంగా చెప్పనప్పటికీ టీడీపీ ఖచ్చితంగా పోటీ చేసే స్థానాల్లో శేరిలింగంపల్లి, కూకట్ పల్లి లాంటివి ఉంటాయి. అయితే మొదట్లో ఈ రెండు స్థానాల్లో ఏదోక స్థానం నుండి నందమూరి కళ్యాణ్ రామ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తలు వార్తల్లాగానే మిగిలిపోయాయి. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. హైదరాబాద్ లో కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటైన శేరిలింగంపల్లి నియోజకవర్గం టికెట్ ను `భవ్య క్రియేషన్స్`అధినేత - నిర్మాత ఆనంద ప్రసాద్ కు కేటాయించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాలయ్యతో ప్రసాద్ కు ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆయనకు టికెట్ దక్కే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ వార్తలో నిజమెంతో త్వరలో తెలుస్తోంది.

మహాకూటమిలో కోదండరాంకే పెద్దపీట

  తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే లక్ష్యంతో కాంగ్రెస్,తెలుగు దేశం,సీపీఐ,తెలంగాణ జన సమితి మహాకూటమి ఏర్పాటుచేశాయి.తాజాగా మహాకూటమి ఉమ్మడి ఎన్నికల ముసాయిదాను సిద్ధం చేసింది.హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కన్వీనర్‌ మల్లు భట్టివిక్రమార్క, తెలుగుదేశం నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు, తెలంగాణ జన సమితి నేత దిలీప్‌కుమార్‌తోపాటు ఆ పార్టీల నాయకులు సమావేశమై ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక ముసాయిదాను ఖరారు చేశారు.కాంగ్రెస్‌, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జన సమతిలు విడివిడిగా రూపొందించుకున్న ఎన్నికల హామీలతోపాటు ఉమ్మడిగా చర్చించిన అనేక అంశాలను ఈ ముసాయిదాలో పొందుపరిచారు.ఈ ముసాయిదా ప్రతులు నాలుగు పార్టీల రాష్ట్ర అధ్యక్షుల ఆమోదానికి పంపారు.వారి ఆమోదం అనంతరం ప్రజల ముందు పెట్టి సలహాలు, సూచనలు తీసుకుని ఉమ్మడి ప్రణాళికను ప్రజల ముందుకు తీసుకెళ్లనున్నారు. అంతేకాకుండా మహాకూటమికి పేరు మార్చాలని సమావేశంలో నిర్ణయించుకున్నారు.ప్రాధమికంగా తెలంగాణ ఐక్యవేదిక, తెలంగాణ ఫ్రంట్‌, తెలంగాణ పరిరక్షణ వేదిక, తెలంగాణ పరిరక్షణ సమితి, తెలంగాణ ప్రజా కూటమి తదితర పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.నాలుగు పార్టీల ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక కమిటీకి ఛైర్మన్‌గా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఉండాలనే అభిప్రాయం చర్చకు రాగా అన్ని పార్టీల నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.కాంగ్రెస్‌, తెదేపా, సీపీఐ, తెజస నాయకులు ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక ప్రక్రియ కొలిక్కి రావడంతో ఇక సీట్ల సర్దుబాటుపై దృష్టిసారించనున్నారు. ఏయే పార్టీ ఎన్ని స్థానాలకు పోటీ చేయాలి, ఎక్కడకెక్కడ పోటీ చేయాలనే అంశాలపై త్వరలనో చర్చలు జరిపే అవకాశం ఉందని సమాచారం. ఉమ్మడి ప్రణాళిక ముసాయిదాలోని ముఖ్యాంశాలు.. *ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాలు ఇచ్చే వరకూ ఒక్కో కుటుంబానికి నెలకు రూ.3 వేలు పంపిణీ.  * ఒక్కో రైతు కుటుంబానికి ఒకే దఫా రూ.2 లక్షల రుణమాఫీ.  * తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాల భర్తీ. క్రమం తప్పకుండా ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌.  * రూ.10 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు.  * కౌలు రైతులకు అన్ని రకాల భద్రత.  * బలవంతపు భూసేకరణ నిలిపివేత.  * భూనిర్వాసితుల పట్ల మానవీయ కోణం. యోగ్యులైన వారికి ప్రభుత్వ భూమి పంపిణీ.  * ప్రకృతి వైపరీత్యాల నష్టాల నుంచి రైతులను ఆదుకునేందుకు రూ.2 వేల కోట్లతో నిధి.  * రైతులకు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు.  * అన్ని పంటలకు బీమా. ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లింపు.  * పేదలకు గృహనిర్మాణ పథకం అమలు, అర్హులందరికీ పక్కా ఇళ్లు.  * ధర్నా చౌక్‌ పునరుద్ధరణ. ప్రజలకు భావ ప్రకటనా స్వేచ్ఛా హక్కు కల్పన.  * పంచాయతీల వారీగా ప్రణాళికల రూపకల్పన. వాటికి అనుగుణంగా బడ్జెట్‌ కేటాయింపు.  * నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి.  * రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి నిధులు రాబట్టడం.  * ప్రాజెక్టుల్లో జరిగిన భారీ అవినీతిపై విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవడం. ప్రాజెక్టులను పునరాకృతి చేసి ప్రాధాన్యక్రమంలో నిర్మించడం.  * కేజీ నుంచి పీజీ విద్యను అందించడానికి ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతోపాటు సమగ్ర విధానం.  * దారిద్య్రరేఖకు దిగువనున్న వారందరికీ ఉచితంగా కార్పొరేటు వైద్యాన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కల్పించడం.  * చాకలి ఐలమ్మ పేరుతో మహిళా సాధికారత కార్యక్రమాల నిర్వహణ.  * ఆచార్య జయశంకర్‌ పేరిట విద్యాభివృద్ధి కార్యక్రమాలు.  * కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరుతో శిక్షణ కార్యక్రమాలు.  * అమరుల స్మృతి చిహ్నం ఏర్పాటు.  * బీసీ ఉప ప్రణాళిక రూపకల్పన.  * ఒక ఏఎన్‌ఎం ఉన్నచోట మరొకరి నియామకం.  * విద్యుత్‌, పంచాయతీ కార్మికులకు వేతనాల పెంపు.  * అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల కమిషన్‌ పదవుల భర్తీ.  * కళాకారులు, ఉద్యమ కుటుంబాలకు పింఛన్లు ఇవ్వడానికి ప్రత్యేకంగా కమిషన్‌ ఏర్పాటు.  * పౌరసేవల చట్టం బలోపేతం, లోక్‌పాల్‌ ఏర్పాటు.

దిగ్విజయ్‌ ఆరెస్సెస్‌, బీజేపీ ఏజెంటు: మాయావతి

  రాష్ట్రాల్లో విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి బీజేపీని మట్టికరిపించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కు బీఎస్పీ అధినాయకురాలు మాయావతి ఆశాభంగం మిగిల్చారు.రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆమె తేల్చిచెప్పేశారు.‘‘బీఎస్పీని అంతం చేయడానికే కాంగ్రెస్‌ కంకణం కట్టుకుంది. ఎన్నికల్లో గెలుపు కన్నా తమ పార్టీని దెబ్బతీయడమే ఆ పార్టీ లక్ష్యంగా కనపడుతోంది’’ అని మాయావతి తీవ్రంగా విమర్శించారు.ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసిన అజిత్‌ జోగితో జట్టుకట్టడం ద్వారా ఆమె కాంగ్రెస్‌-వ్యతిరేక వైఖరిని పూర్తిస్థాయిలో అనుసరించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమయ్యింది.కాంగ్రెస్‌కు సరైన కూటమి ఏర్పర్చాలన్న ఆలోచనే లేదని, అసలు బీజేపీని ఓడించాలన్న పట్టుదలే ఆ పార్టీలో కనపడ్డం లేదని, కాంగ్రెస్‌ అనుసరిస్తున్న ఈ వైఖరి వల్లే తాము ఛత్తీస్ గఢ్, కర్ణాటకల్లో ఇతర పార్టీలతో చేతులు కలిపామన్నారు. సీట్ల విషయంలో ఒప్పందం కుదరకపోవటంతో మధ్యప్రదేశ్‌లో బీఎస్పీ కలిసిరాకపోవచ్చని కాంగ్రెస్‌ ముందే ఓ అంచనాకు వచ్చింది.దీనికితోడు మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్‌ చేసిన ఓ వ్యాఖ్య కూడా మాయావతికి ఆగ్రహం తెప్పించింది. మాయావతిపై చాలా సీబీఐ కేసులున్నాయని, కాంగ్రెస్ తో వెళితే ఆ కేసులు తిరగదోడతామని అమిత్‌ షా బెదిరించడం వల్లే ఆమె వ్యతిరేక వైఖరితో ఉన్నారని దిగ్విజయ్‌ వ్యాఖ్యానించారు. దీంతో మాయావతికి చిర్రెత్తుకొచ్చింది. ‘అసలు దిగ్విజయే ఆరెస్సెస్‌, బీజేపీ ఏజెంటు. వాటికి అనుకూలంగా మాట్లాడతారు’ అని ఆమె ఎదురుదాడి చేశారు. ‘కాంగ్రెస్‌కు విపరీతమైన పొగరు. ఈ పొగరు వల్లే గుజరాత్‌లాంటి రాష్ట్రాల్లో 20 ఏళ్లుగా అధికారానికి దూరమైపోయింది’ అని ఆమె ఘాటుగా దుమ్మెత్తిపోశారు.‘కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ లోక్‌సభ, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు రెంటిలోనూ కలిసి పోటీచేయాలని గట్టిగా భావిస్తున్నారు. వారి చిత్తశుద్ధిని శంకించలేం. కానీ రాష్ట్రాల్లో మాత్రం కొందరు నాయకులు ఈ పొత్తు యత్నాలను దెబ్బతీయాలని ద్రోహం తలపెట్టారు’ అని మాయావతి పేర్కొన్నారు.

కిడారి హత్య ముందురోజు.. పోలీసులు నాటుకోడి.. మావోలు కల్లు

పోలీసులు అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా మావోయిస్టులు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో చాలా అలెర్ట్ గా ఉండాలి. కానీ కొందరి పోలీసుల్లో అది లోపించింది. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే కిడారి,మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలను మావోలు హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రత్యేక పోలీసుల బృందం విచారణ సందర్భంగా వెలుగుచూస్తున్న విషయాలు నివ్వెరపరుస్తున్నాయట. మావోల దాడి గురించి వందలాదిమందిని ప్రశ్నిస్తున్న క్రమంలో వారికి ప్రత్యక్షంగా సహకరించిన కొందరిని పోలీసులు గుర్తించి ఆరా తీయగా.. దాడికి ముందు రోజు రాత్రి పోలీసులు నాటుకోడితో పార్టీ చేసుకుంటే, మావోయిస్టులు జీలుగు కల్లుతో మజా చేసుకున్నారని తెలిసి విస్తుపోయారట.   మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు స్వీయ రక్షణ విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన పోలీసులు.. మామూళ్ల మత్తులో పడి గ్రామాల్లో తిరగడమే మానేశారని ఉన్నతాధికారులకు అందిన నివేదికల్లో తేలింది. మైదాన ప్రాంతాల్లో పనిచేసి పనిష్మెంట్‌పై అరకు ప్రాంతానికి వచ్చిన ఓ పోలీసు అధికారి ఇక్కడకు వచ్చిన తరువాత విందుల్లో మునిగితేలడమే సరిపోయిందట. గిరిజనులు ప్రతి ఆదివారం తనకు తప్పనిసరిగా నాటుకోడి పంపాల్సిందేననేది ఈ అధికారి హుకుం జారీ చేశారట. ఆ క్రమంలో ఒక్కోసారి శనివారం రాత్రి నుంచే పార్టీ మూడ్ లోకి వెళ్లిపోయే ఆయన.. ఆ రోజు తనకు అత్యంత సన్నిహితులైన మిత్రులతో కలసి మంచి విందు చేసుకుంటారట. అలాగే మావోల అరకు దాడి ముందు రోజు సెప్టెంబర్‌ 22 రాత్రి కూడా ఆయన అదే పనిలో ఉన్నారని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఆ రాత్రి ఆయన గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ఒక వైద్యుడితో కలసి పార్టీ చేసుకున్నారట. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిన్సియర్ గా డ్యూటీ చేసేవాళ్ళని ఇలాంటి ప్రాంతాల్లో ఉంచితే అలెర్ట్ గా ఉంటారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటారు. కానీ సరిగ్గా పనిచేయని వ్యక్తిని పనిష్మెంట్ పేరుతో ఇలాంటి ప్రాంతంలో డ్యూటీ వేస్తే ఎలా?. అతను పార్టీలు, విందులు చేసుకుంటాడు తప్ప డ్యూటీ చేయడు అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నుండైనా ఇలాంటి ప్రాంతాల్లో కరెక్ట్ గా డ్యూటీ చేసే వాళ్ళని ఉంచితే బాగుంటుందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇక మావోల విషయానికొస్తే ఎమ్మెల్యే కిడారి హత్య కోసం తమకు సహకారం అందించేందుకు ఒడిశా,ఛత్తీస్ ఘడ్ దండకారణ్యం నుంచి గిరిజనులను రప్పించారట. అలా సెప్టెంబరు 22 రాత్రికి గ్రామానికి వచ్చిన ఆ గిరిజనుల్లో అత్యధికులు మహిళలు ఉండటంతో పాటు వారి కోరికమేరకు మావోలు స్థానికుల చేత సమీప అడవి నుంచి జీలుగకల్లు తెప్పించి పార్టీ ఇచ్చారట. టార్గెట్ ఫినిష్ చేసే వ్యూహంలో భాగంగా స్థానిక గిరిజనుల పేర్లను వాడుతూ ఎమ్మెల్యే అనుచరులకు మావోలే ఫోను చేయించారట. మా ఊరికి ఎమ్మెల్యే సార్‌ ఎన్ని గంటలకు వస్తున్నారు?.. అని వారితో అరా తీయించారని పోలీసుల విచారణలో తెలిసిందట. నిజానికి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాత్రమే మావోల టార్గెట్‌ కాగా ఆయనతో కలసి రావడంవల్లే మాజీ ఎమ్మెల్యే సోమనూ చంపారని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఇక కిడారికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఆయన సన్నిహితులనుంచే తెలుసుకున్న మావోలు,కిడారికి బంధువులు అయ్యే ఓ జంటను బెదిరించి ఆయన రాకపోకల గురించి పక్కాసమాచారం తెలుసుకున్నారట. అలాగే కిడారి కారు డ్రైవర్‌,అనుచరులు,గన్‌మెన్‌ నంబర్లు కూడా దాడికి ముందే మావోయిస్టులు సంపాదించారని తెలుస్తోంది.

స్కూళ్లను మూసివేయనున్న తెలంగాణ విద్యాశాఖ

  టోలిచౌకిలోని ఓ పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి జరిగిన నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖాధికారులు నగరంలో,నగర పరిసరాలలో ఎటువంటి గుర్తింపు లేకుండా నడుపుతున్న పాఠశాలలను మూసివేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.చిన్నారిపై లైంగికదాడి ఘటనతో పాటు మరో చిన్నారిపై లైంగికదాడికి యత్నించిన వరస ఘటనలు చోటు చేసుకున్న అజాన్‌ జెమ్స్‌ పాఠశాలపై చర్యలు తీసుకున్న అధికారులు ప్రీప్రైమరీ తరగతులను మూసివేయాలంటూ ఆదేశాలిచ్చారు.అనుమతి లేకున్నా ప్రీప్రైమరీ సెక్షన్‌ నిర్వహించడం, నిబంధనల ప్రకారం ప్రీప్రైమరీ తరగతులు గ్రౌండ్‌ఫ్లోర్‌లో నిర్వహించకుండా మూడో అంతస్తులో నిర్వహించడం, స్కూల్‌ ప్రధాన ద్వారాల వద్ద సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం, తల్లిదండ్రులతో యాజమాన్యం సమావేశమై వారి సలహాలు తీసుకోకపోవడంతో పాటు స్కూల్‌ ఉద్యోగియే లైంగికదాడికి పాల్పడినా చిన్నారుల విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకున్నారు.ఈ క్రమంలో ప్రీప్రైమరీ విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్చడానికి విద్యాశాఖాధికారులు కూడా తల్లిదండ్రులతో సమావేశమై ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించనున్నారు. విద్యాశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయంతో ఆ పాఠశాలలో ఉన్నత తరగతుల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పునరాలోచనలో పడ్డారు. వారి పిల్లలను కూడా పాఠశాల మార్చాలని చాలా మంది తల్లిదండ్రు లు భావిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది స్కూల్‌ మానేశారని కూడా సమాచారం.ఘటనల దృష్ట్యా చాలా మంది పాఠశాల మానేయాలనుకుంటున్న సమయంలో వారికి ఇతర పాఠశాలల్లో సీట్లు దొరుకుతాయా అనేదీ ప్రశ్నార్థకమే.స్టేట్‌ సిలబస్‌ విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్చినా... సీబీఎస్ఈ సిలబస్‌ విద్యార్థులను చేర్చాలంటే బోర్డు అనుమతి తప్పనిసరి.

మాటల తూటాలు పేల్చిన కేసీఆర్‌

తెరాస అధినేత,ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసారు.బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రతి పక్ష పార్టీలపై తీవ్ర స్థాయి లో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.నిజామాబాద్‌ గిరిరాజ్‌ కళాశాల మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తూ మహాకూటమిపై, చంద్రబాబు, కాంగ్రెస్‌లపై నిప్పులు చెరిగారు.ఆంధ్రప్రదేశ్‌ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలంగాణ పాలిట రాక్షసి అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివర్ణించారు. చట్టప్రకారం తెలంగాణకు రావాల్సిన కరెంటు ఇవ్వకుండా ఇక్కడి ప్రజలు అవస్థలు పడుతుంటే రాక్షసానందం పొందారని ఆరోపించారు. తెలంగాణ నుంచి 7 మండలాలను, సీలేరు పవర్‌ ప్లాంటును బలవంతంగా గుంజుకున్నారని ధ్వజమెత్తారు. ‘ఎవ్వడైతే తెలంగాణను నాశనం చేసిండో, ఎవడైతే గుండు గొట్టిండో, నిర్దాక్షిణ్యంగ ఎన్‌కౌంటర్ల పేరు మీద ఎవ్వడైతే వందల మంది తెలంగాణ బిడ్డలను బలిపెట్టుకున్నడో తెలంగాణ ద్రోహి.. చెడిపోయి చంద్రబాబునాయుడితోని పొత్తా, మీ బతుకులకు? ఏమయా అడుక్కుంటే మేమిస్తమయ్యా నాలుగు సీట్లు గావాలంటే.. ఇదా మీ బతుకు?’’ అని నిప్పులు చెరిగారు.'‘ఢిల్లీకి, అమరావతికి గులాములు చేస్తున్నారు. థూ... మీ బతుకులు చెడ’’ అంటూ విరుచుకుపడ్డారు.   తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచారం కోసం చంద్రబాబు రూ.500 కోట్ల నిధులు, మూడు అద్దె హెలికాప్టర్లు ఇచ్చి సాయం చేయనున్నట్లు కేసీఆర్‌ ఆరోపించారు.కాంగ్రెస్‌ నేతలు చిల్లర మల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని, దుర్మార్గమైన ఆరోపణలు చేస్తున్నారని కేసీఆర్‌ ధ్వజమెత్తారు.అసెంబ్లీలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్నపుడు తెలంగాణ మంత్రులెవరూ ప్రశ్నించలేదని ప్రస్తావించారు.టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు.మహారాష్ట్రతో ఒప్పందం జరిగినపుడు 1974లోనే ఒప్పందం జరిగిందని చెప్పారని ప్రస్తావించారు. అప్పటి జీవో చూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పానన్నారు. ఆయన పారిపోయాడని ఎద్దేవా చేశారు. ఉత్తమ్‌ తనను బట్టేబాజ్‌ అనడంపై సీఎం మండిపడ్డారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని అలా తిట్టొచ్చా అని ప్రశ్నించారు. తన నోరు కూడా చెడ్డదే అని నోరు తెరిచానంటే తెల్లారే వరకు తిట్టగలనని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతాయుత స్థాయిలో ఉన్నందువల్లే తాను స్పందించడం లేదన్నారు.2014లో అసెంబ్లీలో రెండేళ్లలో రెప్పపాటు కరెంటు పోకుండా చేస్తానంటే జానారెడ్డి.. అలా చేస్తే గులాబీ కండువా వేసుకొని ప్రచారం చేస్తామన్నారు. ఇప్పుడు తప్పించుకునే యత్నం చేస్తున్నారని ఎద్దేవాచేశారు.కేసీఆర్‌ బీజేపీ పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు.తెలంగాణాలో బీజేపీ ఎక్కడ ఉందో కూడా తెలియదు.ఇళ్ల కిరాయిల కడతామని ఆ పార్టీ నేత లక్ష్మణ్‌ అంటున్నారు.అధికారంలోకి రాగానే నల్లధనం తీసుకువస్తానని ప్రధాని మోదీ, అమిత్‌షా ప్రకటించారని, ప్రతీ కుటుంబానికి 15 లక్షలు ఖాతాలో వేస్తామని చెప్పారని గుర్తు చేశారు.ఈ డబ్బులిస్తే మేమే మీ ఇంటి కిరాయి కడతాం. ఇప్పటికీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.

తాగి పోలీసులపై దాడి చేసిన అమ్మాయిలు

  మద్యం మత్తులో చెలరేగిపోయిన నలుగురు యువతులు పోలీసులపై దాడి చేసిన ఘటన ముంబయి మహానగరంలో చోటుచేసుకుంది. మీరా రోడ్ లో జరిగిన ఓ పార్టీ లో మద్యం సేవించిన వీరు భయాండర్‌లోని ఓ ప్లే గ్రౌండ్‌ కు చేరుకున్నారు.ఈ క్రమం లో వారి మధ్య గొడవ మొదలైంది.వారి గొడవతో గుంపు పోగయ్యింది అటుగా వెళ్తున్న పెట్రోలింగ్ పోలిసులు వారి గొడవను గమనించారు.గొడవ పడుతున్న యువతులను విడతీసే ప్రయత్నం చేసారు అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ మనీషా పాటిల్.  మద్యం మత్తులో ఉన్న వీరు పోలిసుల మాటలను పెడచెవిన పెట్టి పోలిసుల పై దాడి చేసారు.లాఠీలను లాక్కునే ప్రయత్నం చేసారు.పోలీస్ ల షర్ట్ బటన్స్ ,బ్యాడ్జిలను లాగేందుకు ప్రయత్నం చేసారు.పోలీసులను అసభ్యపదజాలంతో దూషించారు.ఆ నలుగురు అమ్మాయిలను మమతా మెహార్(25), అలీషా పిైళ్లె(23), కమల్ శ్రీవాత్సవ(22), జెస్సీ డీ కోస్టా(22)లుగా గుర్తించారు.నలుగురు అమ్మాయిలను అరెస్టు చేసే క్రమంలో ఓ యువతి తప్పించుకుంది. మిగతా ముగ్గురిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు.డీ కోస్టా పరారీలో ఉంది.ఈ నలుగురిపై కేసు నమోదు చేసారు.వైద్య పరీక్షలు నిర్వహించగా వారు మద్యం సేవించినట్లు తేలిందని పోలీసులు ధ్రువీకరించారు.

ఐటీ కార్యాలయానికి రేవంత్

  రేవంత్ రెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు,అనుచరుల ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేశారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఇంట్లో లాప్‌టాప్‌, హార్డ్ డిస్కులు, పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు అక్టోబరు 3న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.ఈ మేరకు బషీర్‌బాగ్‌లోని ఆయకార్‌‌ భవన్‌కు రేవంత్‌ చేరుకున్నారు. ఐటీ అధికారులు జారీ చేసిన సమన్లను రేవంత్ తన వెంట తీసుకువచ్చారు. రేవంత్‌తో పాటు ఉదయ్‌సింహ కార్యాలయానికి వచ్చారు. రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహ ఇళ్లలో చేసిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల పరిశీలనను ఐటీ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.ఓటుకు నోటు కేసులో 50లక్షల రూపాయల గురించే ఐటీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.ఈ రోజు జరిగే విచారణలో రేవంత్‌రెడ్డిని ఐటీ అధికారులు దీనిపైనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి, మామ పద్మనాభరెడ్డి, స్నేహితుడు ఉదయసింహ, సెబాస్టియన్‌ను ప్రశ్నించిన ఐటీ అధికారులు ఓటుకు నోటు కేసులో విచారించారు.ఇదిలా ఉంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందనే ఆందోళనతో ఐటీ కార్యాలయానికి రేవంత్ అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.

భారత ప్రధాన న్యాయమూర్తిగా రికార్డ్

  ఈశాన్య రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు జస్టిస్‌ రంజన్ గొగొయ్‌.భారత 46వ ప్రధాన న్యాయమూర్తిగా గొగోయ్ రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు.రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జస్టిస్‌ గొగొయ్‌ చేత ప్రమాణస్వీకారం చేయించారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2019 నవంబరు 17న విరమణ పొందే వరకు 13 నెలల పాటు జస్టిస్‌ గొగొయ్‌ ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. ఇప్పటివరకు సీజేఐగా కొనసాగిన జస్టిస్ దీపక్‌ మిశ్ర అక్టోబరు 1న పదవీ విరమణ చేశారు. సాధారణంగా సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిని తన వారసుడిగా సీజేఐ సిఫార్సు చేస్తుంటారు. ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. సర్వోన్నత న్యాయస్థానంలో తన తర్వాత అత్యంత సీనియర్‌గా ఉన్న జస్టిస్‌ గొగొయ్‌ పేరును జస్టిస్‌ దీపక్‌ మిశ్ర ప్రతిపాదించారు. ఈ సిఫార్సుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలపడంతో జస్టిస్ గొగొయ్‌ నేడు సీజేఐగా బాధ్యతలు చేపట్టారు.కాగా జస్టిస్ దీపక్ మిశ్రా స్థానంలో గొగోయ్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించడాన్ని సవాల్ చేస్తూ గతవారంలో దాఖలైన ఓ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే.