కిడారి హత్యకి నమ్మక ద్రోహమే కారణమా?

  గిరిజన నేత, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు పక్కా ప్రణాళికతో హతమార్చిన సంగతి విదితమే.ఈ హత్య లో కిడారికి విశ్వాసపాత్రులుగా వ్యవహరిస్తున్న ఇద్దరు స్థానిక నేతల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.వీరిలో ఒకరు మండల స్థాయి నాయకుడు కాగా, మరొకరు గ్రామస్థాయిలో కీలకంగా వ్యవహరించే వ్యక్తని,వీరిలో ఒకరు గంజాయి స్మగ్లింగ్‌, అక్రమ రవాణా కార్యకలాపాల్లో నిరంతరం మునిగి తేలుతుంటారని సమాచారం.ఎమ్మెల్యే హత్యకు గురికావడానికి రెండు, మూడు రోజుల ముందు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు? ఆయనకు ఆ రెండు మూడు రోజుల్లో వరుసగా ఫోన్‌ చేసింది ఎవరు? సర్రాయిలో గ్రామదర్శిని కార్యక్రమానికి బయల్దేరే ముందు ఆయన ఫోన్‌కు ఎక్కడెక్కడి నుంచి కాల్స్‌ వచ్చాయనే దానిపై కాల్‌ డేటా విశ్లేషించగా ఈ ఇద్దరి ప్రమేయానికి సంబంధించి పక్కా ఆధారాలు లభించినట్లు సమాచారం.ఎమ్మెల్యే లివిటిపుట్టు వైపు వచ్చేలా చేయడం, మావోయిస్టుల ఉచ్చులో చిక్కుకునేలా చూడటంలో వీరు క్రియాశీల పాత్ర పోషించారని తెలుస్తోంది.గత రెండు, మూడు రోజులుగా వీరిరువురిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు జంట హత్యల్లో తమ పాత్ర ఉందని వీరు అంగీకరించినట్లు సమాచారం.అదుపులో ఉన్న ఈ ఇద్దరు నాయకుల నుంచి మరికొన్ని వివరాలు సేకరించి ఒకటి, రెండు రోజుల్లో అరెస్టు చేసే అవకాశముంది.అయితే మావోయిస్టులకు ఎందుకు సహకరించాల్సి వచ్చింది? ఎప్పటి నుంచి వారితో సంబంధాలు కొనసాగిస్తున్నారు? ఎమ్మెల్యేపై వారికి ఏమైనా వ్యక్తిగత కక్ష ఉందా? తదితర అంశాలకు సంబంధించి అత్యంత కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది.

కొండా సురేఖ అక్కడ నుండే పోటీ చేస్తారట.!!

  వరంగల్‌ తూర్పు తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ వచ్చే ఎన్నికల్లో ఏ స్థానం నుండి పోటీ చేస్తారనే విషయంపై క్లారిటీ వచ్చింది. తెరాస ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో కొండా సురేఖ పేరు లేకపోవడంతో.. అసంతృప్తి వ్యక్తం చేసిన కొండా దంపతులు తెరాసను వీడి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ లో అయితే చేరారు కానీ కొండా సురేఖ ఏ స్థానం నుండి పోటీ చేస్తారు? కొండా ఫ్యామిలీ నుండి ఎంతమంది బరిలోకి దిగుతారు? లాంటి విషయాలపై క్లారిటీ లేదు. అయితే ప్రస్తుతం కొండా సురేఖ పోటీ చేయబోయే స్థానంపై క్లారిటీ వచ్చినట్టే కనిపిస్తోంది. తాజాగా కొండా సురేఖ పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు, దామెర, పరకాలలో ఇటీవల మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పరకాలలో ఆమె మాట్లాడుతూ పరకాల, భూపాలపల్లి, వరంగల్‌ తూర్పు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని కార్యకర్తలు, అభిమానులు ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. అయితే తాను పరకాలలో పోటీ చేయడంతో పాటు వరంగల్‌ తూర్పు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత కూడా తనపైనే ఉందని అన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి 10 సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌లో చేరాలని గద్దర్ కు ఆహ్వానం.!!

  ప్రజల అవసరాలు, ఆకాంక్షలే లక్ష్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంటుందని ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గాంధీభవన్‌లో ప్రచార కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ భేటీలో డీకే అరుణ, విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. 2019లో జరగాల్సిన ఎన్నికలు 2018లో రావటానికి కారణమైన కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని కోరారు. దీనికి మీడియా కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రశ్నించే వారిని కట్టడి చేసేందుకు అధికారులతో కేసీఆర్ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. అయినా ఎవరికీ భయపడేది లేదన్నారు. ఎన్నికల సభల్లో, సమావేశాల్లో రాహుల్, సోనియాగాంధీ పాల్గొంటారని తెలిపారు. కాంగ్రెస్‌లో చేరాలని గద్దర్‌ను ఆహ్వానించామన్నారు. విమలక్క, గోరేటి వెంకన్న కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తాజాగా గద్దర్, భట్టితో భేటీ అయిన విషయం తెలిసిందే. మరి కాంగ్రెస్ ఆహ్వానానికి గద్దర్ ఓకే చెబుతారో లేదో చూడాలి.

బీజేపీ అదిరిపోయే ఆఫర్.. 30 కోట్లు, మంత్రి పదవి.!!

  కర్ణాటక రాజకీయాలు మళ్ళీ వేడెక్కుతున్నాయి. తనకి బీజేపీ వారు పార్టీ మారడానికి 30 కోట్లు డబ్బు, మంత్రి పదవి ఆఫర్ చేసారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేసారు. కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలను తమ పార్టీ వైపు తిప్పుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేసి.. అధికారం పొందడానికి బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తుందని ఆరోపణలు ఎప్పటినుండో వస్తూనే ఉన్నాయి. అయితే ఇవి ఆరోపణలు కాదు.. నిజమే అంటూ బెళగావి గ్రామీణ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మి హెబ్బాల్కర్‌ బాంబు పేల్చారు. బిజెపి పార్టీలో చేరడానికి తనకు రూ. 30 కోట్లు ఆఫర్ చేయడంతో పాటు అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తామని ఆ పార్టీ నాయకులు ఆశ చూపారని ఆమె ఆరోపించారు. తనకు బీజేపీ పార్టీకి చెందిన ఓ కీలక నేత ఫోన్ చేసి బీజేపీకి మద్దతివ్వాలని కోరినట్లు లక్ష్మి వెల్లడించారు. కేవలం ఫోన్ మాత్రమే కాదు.. బీజేపీ పార్టీలో చేరితే మీకు ఏమేం లభిస్తాయో చూడండంటూ మెసేజ్ కూడా పంపించినట్లు అమె పేర్కొన్నారు. అయితే తాను వారి ప్రతిపాదనను తిరస్కరించడంతో పాటు ఈ విషయాన్ని అప్పుడే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పరమేశ్వరన్ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఇలా అధికారం కోసం ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించి బిజెపి అనైతికంగా ప్రవర్తించిందంటూ లక్ష్మి విమర్శించారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వ భద్రతకు ఎలాంటి ఢోకాలేదన్నారు. ఐదేళ్లపాటు ఈ ప్రభుత్వమే అధికారంలో కొనసాగుతుందని లక్ష్మి ధీమా వ్యక్తం చేసారు.

కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కతో గద్దర్ భేటీ.!!

  తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మల్లు భట్టి విక్రమార్క‌తో ప్రజా గాయకుడు గద్దర్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. భట్టి విక్రమార్క నివాసానికి వచ్చిన గద్దర్.. ఆయనతో వివిధ అంశాలపై సుదీర్ఘ మంతనాలు జరిపినట్టు సమాచారం. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కోసం కవులు, కళాకారులు, గద్దర్ లాంటి వారు కలిసిరావాలని కోరారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఏ ఆశయాలు, లక్ష్యాల కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నామో.. వాటిని చేరుకునేందుకు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘పొడుస్తున్న పొద్దుమీద కదులుతున్న కాలమా.. పోరు తెలంగాణమా’ అన్న గీతం లక్ష్యాన్ని చేరుకుందామని భట్టి వ్యాఖ్యానించారు.. ఓ వైపు ముందస్తు, మరోవైపు మహాకూటమితో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్న సమయంలో ప్రజా గాయకుడు గద్దర్, కాంగ్రెస్ నేత భట్టితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. చూద్దాం ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో.

ఐటీ దాడులపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

  టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఇళ్లలో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డి తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తనకు అండగా ఉన్న కార్యకర్తలందరికీ మొదట ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనపై తప్పుడు కేసులు పెడుతూ ప్రభుత్వం వేధిస్తోందన్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలో భాగమే ఈ దాడులు అని వ్యాఖ్యానించారు.  2009లో నేను ప్రస్తావించిన ఆస్తులు.. 2014లో ప్రస్తావించిన ఆస్తులను పోల్చిచూడండి. 2009 తర్వాత నేను ఏ ఒక్క ఆస్తి కూడా కొనలేదు అని స్పష్టం చేశారు. ప్రజలకోసమే ఆరోపణలపై వివరణ ఇస్తున్నాన్న ఆయన.. 'నా ఇంటి అడ్రెస్ తో కంపెనీల చిరునామాలు ఉన్నాయి అంటున్నారు.. నా నాలుగంతస్తుల భవనాన్ని 23 ఏళ్లుగా అద్దెలకు ఇస్తున్నాను.. అద్దెలకు తీసుకున్న వాళ్ళు భవనం అడ్రెస్ తో కంపెనీలు పెట్టుకుంటే నాకేంటి సంబంధం?' అని ప్రశ్నించారు. నాకు విదేశాల్లో బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని అంటున్నారు.. హాంగ్ కాంగ్ లోనో, మలేషియాలోనో విదేశీయులు బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయాలంటే నిబంధనలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలించండి అన్నారు. అదేవిధంగా తన ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమని రేవంత్‌ ప్రకటించారు. అయితే కేసీఆర్‌ కుటుంసభ్యులు కూడా దీనికి సిద్ధమా? అంటూ సవాల్‌ విసిరారు. ‘మన ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ కోసం ప్రధాని మోదీకి లేఖ రాద్దాం. లేఖ రాసేందుకు 24 గంటలు సమయం ఇస్తున్నా. 24 గంటల్లో నా సవాల్‌కు బదులు ఇవ్వకుంటే కేసీఆర్‌ అవినీతి పరుడని ప్రజలకు అర్థమవుతుంది’ అని రేవంత్‌ అన్నారు.

హరీష్‌రావుకు తప్పిన ప్రమాదం

  తెరాస సీనియర్ నేత, మంత్రి హరీష్‌రావుకు పెను ప్రమాదం తప్పింది. సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన తెరాస కార్యకర్తల సమావేశానికి హరీష్‌రావు హాజరయ్యారు. కార్యకర్తలతో కలిసి హరీశ్‌రావు ద్విచక్రవాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ కూడలి వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. అయితే ద్విచక్రవాహనాలకు అతిసమీపంలో బాణసంచా కాల్చడంతో పలు టపాసులు పేలి కార్యకర్తలపై పడ్డాయి. దీంతో కార్యకర్తలు భయంతో ద్విచక్రవాహనాలు వదిలి ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఆ ప్రాంతమంతా పొగలు వ్యాపించడంతో హరీష్‌రావు అందులో చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది హరీష్‌రావుని అక్కడినుండి సురక్షిత ప్రాంతానికి తరలించడంతో ప్రమాదం తప్పింది.

రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన న్యాయవాదిపై ఇన్ని కేసులా!!

  తెలంగాణ కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన న్యాయవాది రామారావు గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనపై చాలా కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. న్యాయవాది రామారావుపై సికింద్రాబాదులోని చిలకలగూడ పోలీసు స్టేషన్లో కేసులున్నాయట. భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని అతడిపై చిలకలగూడ పోలీసులు రౌడీషీట్‌ తెరిచినట్టు సమాచారం. భూమి, ప్లాట్స్‌ తదితరాలకు సంబంధించిన వివాదాల్లో క్లయింట్లు ఇతని వద్దకు వస్తారని, ఆస్తుల పత్రాలను ఇతనికి అందజేస్తారని.. అవి విలువైన ఆస్తులు, భూములైతే వాటికి నకిలీ పత్రాలు తయారు చేసి కబ్జా చేస్తాడని ఆయన మీద ఆరోపణలున్నాయి. గతంలో న్యాయవాది రామారావు అనుచరులతో కలిసి వచ్చి తన ఇంటిని కబ్జా చేశాడని 2013 అక్టోబరు 24న పద్మారావునగర్‌కు చెందిన జి.సాయిపవన్‌ చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. భూకబ్జాలకు సంబంధించి 2016 జనవరి 11న ఒక్కరోజే రామారావుపై ఐదు కేసులు నమోదయ్యాయని సమాచారం. ఆ కేసుల్లో ఆ ఏడాది మార్చి 14వ తేదీన రామారావును చిలకలగూడ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించి.. రౌడీషీట్‌ తెరిచారట. ప్రస్తుతం ఇతనిపై చిలకలగూడ, చందానగర్‌, బోయినపల్లి పోలీస్ స్టేషన్లలో సుమారు 32 కేసులు నమోదై ఉన్నట్టు సమాచారం.

టీఆర్ఎస్ కు షాక్.. బీజేపీలోకి బాబు మోహన్..!!

  అసెంబ్లీ రద్దు తర్వాత 105మంది అభ్యర్థులతో భారీ జాబితాను ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అందోల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాబుమోహన్‌ను పక్కన పెట్టారు. అందోల్ నియోజకవర్గం నుంచి బాబుమోహన్ స్థానంలో జర్నలిస్టు క్రాంతి కిరణ్‌కు టికెట్ కేటాయించారు. దీంతో అసంతృప్తితో ఉన్న బాబుమోహన్‌ తాజాగా టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. అంతేకాదు బీజేపీలో చేరేందుకు బాబుమోహన్ రంగంసిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బాబుమోహన్ బీజేపీ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం.

ఇంకా ఏం కావాలి మీకు?.. మావోలను ప్రశ్నించిన బాబు

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు.. కిడారి, సివేరి సోమ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ఈ ఘటనను ఖండించారు. టీడీపీ ప్రభుత్వం బాక్సైట్‌ జోలికి వెళ్లదని పదే పదే చెప్పినా.. ఇటువంటి చర్యలకు పాల్పడడం సరికాదని అన్నారు.     వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బాక్సైట్‌ తవ్వకాలపై రెండు దఫాలుగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటికి ఇక్కడి గిరిజనుల అంగీకారం లేదు. అందుకే మేం అధికారంలోకి వచ్చాక ఒప్పందాలు రద్దు చేశాం. దీనిపై ఆయా కంపెనీలు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీనిపై కేంద్రం వివరణ అడుగుతోంది. ఎంత ఒత్తిడి తెచ్చినా సరే.. గిరిజనులకు ఇష్టం లేనందున బాక్సైట్‌ తవ్వకాలు జరపరాదని నిర్ణయించాం. బాక్సైట్‌ తవ్వకాలు వద్దని గతంలో కిడారి, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నన్ను కోరారు. ఇదే విషయాన్ని పాడేరులో జరిగిన ఆదివాసీ దినోత్సవంలో లక్ష మంది ప్రజల సమక్షంలో చెప్పానన్నారు. ముఖ్యమంత్రిగా బాక్సైట్‌ తవ్వకాలకు వెళ్లబోమని చెబుతున్నాను.. ఇంకా ఏం కావాలి మీకు? అని మావోలను ప్రశ్నించారు. ఇంత స్పష్టంగా మా వైఖరి తెలిపినప్పటికీ గిరిజన నేతలను మావోయిస్టులు హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న నాయకులను అకారణంగా చంపేశారని, ఇది వారికి న్యాయమేనా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని చెప్పారు. అసలు ఈ హత్యలకు, మైనింగ్‌కు సంబంధమే లేదని చెప్పారు. బాక్సైట్‌ తవ్వకాలు ఓ నెపం మాత్రమే. దీనిని కొంతమంది రాజకీయం చేస్తున్నారు అని ఆరోపించారు.

బిగ్ షాక్.. 5 కోట్ల ఫేస్‌బుక్ అకౌంట్లు హ్యాక్..!!

  వేలు... లక్షలు కాదు... ఏకంగా 5 కోట్ల ఫేస్‌బుక్ అకౌంట్లు హ్యాక్ అవడం అంటే మాములు విషయమా?.. అసలు అది సాధ్యమేనా? అనుకుంటాం. కానీ నిజంగానే సాధ్యమైంది. ఈ విషయాన్ని స్వయంగా ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపారు. వెబ్‌సైట్‌ భద్రత వ్యవస్థలోని ఓ లోపాన్ని వినియోగించుకుని.. దాదాపు 5 కోట్ల అకౌంట్ల ‘యాక్సెస్‌ టోకెన్స్‌’ను హ్యాకర్లు చోరీ చేశారు. ఈ యాక్సెస్‌ టోకెన్‌ ద్వారా.. యూజర్స్ డేటా చూడొచ్చు. మంగళవారం ఈ లోపాన్ని గుర్తించామని.. గురువారం రాత్రికి సరిచేశామని జుకర్‌బర్గ్‌ తెలిపారు. వినియోగదారుల అకౌంట్లు ఏమైనా దుర్వినియోగమయ్యాయా అన్న సంగతి ఇంకా తెలియదని చెప్పారు. ఇది తీవ్రమైన సమస్యేనని ఆయన పేర్కొన్నారు. ఇతరులకు మన అకౌంట్ ఎలా కనిపిస్తుందన్నది అని తెలుసుకునేందుకు వీలు కల్పించే ‘వ్యూ ఆజ్‌’ ఫీచర్‌లో ఈ లోపం ఉందని.. దీన్ని తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పారు. ఈ ఫీచర్‌ను వినియోగించిన 4 కోట్ల యూజర్ల యాక్సెస్‌ టోకెన్లను.. ముందుజాగ్రత్త చర్యగా మార్చివేశామని ఫేస్‌బుక్‌ పేర్కొంది. హ్యాకింగ్‌ ఘటనపై సంబంధిత ప్రభుత్వ విభాగానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.

శబరిమల ప్రవేశం.. ఆమె ఒక్కరే వ్యతిరేకం

సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఏ వయసు మహిళలైనా శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకోవచ్చునని స్పష్టం చేసింది. శబరిమలకు మహిళల ప్రవేశాన్ని నిషేధించడం వారిపట్ల లింగ వివక్ష ప్రదర్శించడమేనని తేల్చిచెప్పింది. అయితే ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ మంది ఈ తీర్పుని సమర్దిస్తుంటే.. కొందరు మాత్రం మతాలకు వారి ఆచారాలకు గౌరవం ఇవ్వాలంటూ తీర్పును వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇలా వ్యతిరేకించిన వారిలో ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ఉన్న మహిళ న్యాయమూర్తి జస్టిస్‌ ఇందూ మల్హోత్రా ఉన్నారు.     శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో  జస్టిస్ ఇందూ మల్హోత్రా ఉన్నారు.  ఇందూ మల్హోత్రా మాత్రం  ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని మాత్రం వ్యతిరేకించారు. మతపరమైన మనోభావాలను న్యాయస్థానాలు అడ్డుకోకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. ట్రిపుల్‌ తలాక్‌ కేసుకు, శబరిమల కేసుకు మధ్య ఉన్న తేడాను చెప్పారు. ట్రిపుల్ తలాక్, సెక్షన్ 377  కేసుల్లో నిజమైన బాధితులతో పాటు ఇతర సామాజిక సంస్థలు కూడా పిటిషన్‌ దాఖలు చేయడంతో అవి ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని పేర్కొన్నారు. కానీ శబరమల ఆలయం ప్రవేశం నిషేధంపై ఆ రాష్ట్రానికి చెందిన మహిళలు ఎవరూ కూడ కోర్టును ఆశ్రయించలేదని గుర్తు చేశారు. కేరళలో మహిళలు వారి విద్యాభ్యాసం కారణంగా సామాజికంగా పురోభివృద్ధి సాధించారని చెప్పారు. వీరిలో ఎక్కువమంది శబరిమల ఆచరించే పద్ధతులకు వ్యతిరేకంగా లేరని ఆమె అభిప్రాయపడ్డారు. భారతదేశం వేర్వేరు మతపరమైన ఆచారాలను కలిగి ఉందన్నారు. రాజ్యాంగం కేవలం ఎవరైనా ఒక మతాన్ని గౌరవించటానికి ,పాటించటానికి అనుమతిస్తుందన్నారు.. అతను లేదా ఆమె నమ్మే ఆచరించే మతపరమైన ఆచారాలలో జోక్యం చేసుకోవటానికి కాదన్నారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని ఇందూ మల్హోత్రా వ్యతిరేకించడంతో 4-1తేడాతో ఈ తీర్పు వెలువడింది.

రేవంత్‌ రెడ్డి ఓ గంజాయి మొక్క... ఎంపీ సుమన్

రేవంత్ రెడ్డి ఇంట్లో,కార్యాలయాల్లో ఐటీ దాడులు జరుగుతుండటం అందరికి విదితమే.దీన్ని కాంగ్రెస్ నేతలు ఖండిస్తూ ఇదంతా తెరాస కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు.అయితే తెరాస నాయకులు ఈ విమర్శలు తిప్పికొట్టే పనిలోపడ్డారు.తెరాస ఎంపీ బాల్క సుమన్ ఐటీ సోదాలు కొనసాగడం వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయంటూ కాంగ్రెస్‌ నేతలు చేస్తోన్న ఆరోపణల్ని ఆయన తప్పుపట్టారు.ఐటీ దాడులకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని,రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక తెరాస పై బురదచల్లే ప్రయత్నంలో కాంగ్రెస్‌ ఉందని విమర్శించారు.అసలు కాంగ్రెస్‌ తమకు పోటీయే కాదని,వచ్చే ఎన్నికల్లో తెరాస విజయం ఖాయమని సుమన్‌ ధీమా వ్యక్తంచేశారు.తెరాస పుట్టిందే ప్రజల కోసమని, బంగారు తెలంగాణను నిర్మించే యజ్ఞంలో తాము ఉన్నామన్నారు.తెలంగాణ అనే తులసి వనంలో రేవంత్‌ రెడ్డి ఓ గంజాయి మొక్క అని ధ్వజమెత్తారు. తప్పుడు లెక్కలతో ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించినందుకు గాను వచ్చే ఎన్నికల్లో రేవంత్‌ పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు.

కిడారి కుమారునికి ఎమ్మెల్యే టికెట్..!!

మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు పరామర్శించారు.అనంతరం సీఎం మాట్లాడుతూ కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు చంపారన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నానని చంద్రబాబు తెలిపారు.కిడారి ఆశయాల సాధనకు తెదేపా కృషి చేస్తుంది. గిరిజనుల్లో ఇంతటి బలమైన రాజకీయ నేత ఉండటం చాలా అరుదు.  ఏజెన్సీ అభివృద్ధికి తపనపడిన వ్యక్తి కిడారి సర్వేశ్వరరావు అని కొనియాడారు. అలాంటి వ్యక్తి హత్యకు గురికావడం చాలా దారుణం అన్నారు. కిడారి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.కోటి సాయం అందిస్తాం. కుటుంబసభ్యుల్లో నలుగురికి రూ.5లక్షల చొప్పున పార్టీ తరపున ఇస్తాం. చిన్న కుమారుడికి గ్రూప్‌-1 ఉద్యోగం కల్పిస్తాం. మొదటి కుమారుడికి ఏం చేయాలన్న దానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఆయనకు పార్టీ టిక్కెట్‌ ఇవ్వాలా? వద్దా? అన్నది పార్టీ నిర్ణయిస్తుంది. కిడారి కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదు. కాబట్టి విశాఖ నగరంలో వారికి స్థలం కేటాయిస్తాం. ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తాం. బాక్సైట్‌కు, కిడారి హత్యకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతి ఇవ్వబోమని లక్ష మంది ఉన్న సభలో చెప్పానన్నారు.

దాడి చేసిన వారితో నాకు సంబంధం లేదు - చింతమనేని

  తెలుగు దేశంలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న నేత దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.ఇలాంటి నేత పేరు చెప్పుకొని ఇద్దరు యువకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విజయవాడ నగరంలోని బందరు లాకుల వద్ద ట్రాఫిక్ సిగ్నల్‌ దాటి వేగంగా ముందుకెళ్తున్న ఏపీ16 సీఎం 2244 నంబరు గల కారును కానిస్టేబుల్‌ అనిల్‌కుమార్‌ ఆపి పక్కన పెట్టాలని ఆదేశించడంతో వారు దుర్భాషలాడుతూ ఘర్షణకు దిగారు. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్‌ కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించాలని చెప్పడంతో చేయి చేసుకున్నారు.     తాము దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అనుచరులమని చెప్పుకుంటూ వారిద్దరూ వీరంగం సృష్టించడం నగరంలో చర్చనీయాంశమైంది.పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ కానిస్టేబుల్‌ అనిల్‌కుమార్‌ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి కారును గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.దీనిపై స్పందించిన చింతమనేని తన అనుచరులని చెప్పుకుంటూ కానిస్టేబుల్‌పై దాడి చేసిన వారితో తనకెలాంటి సంబంధం లేదని,తన పేరు వాడుకుని అరాచకాలు సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.ఇకమీదట తన పేరు వాడుకొని ఎవరైనా దాడులు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చింతమనేని ప్రభుత్వానికి సూచించారు.

రేవంత్‌కి మద్దతుగా కాంగ్రెస్... కక్ష సాధింపు

  తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఓ సంచలనాత్మక నిర్ణయం అయితే మరో పక్క తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంట్లో జరుగుతున్న ఐటీ దాడులు తెలంగాణ రాజకీయ వాతావరణాన్నిమరింత వేడెక్కిస్తున్నాయి.రేవంత్ రెడ్డి ఇంట్లో రెండవ రోజు సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖా అధికారులు రూ.కోటి నగదు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఐటీ అధికారులు రేవంత్ రెడ్డిని విచారించారు. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన బ్యాంకు లావాదేవీల పైనా అధికారులు దృష్టి సారించారు. రేవంత్ రెడ్డి భార్యను తీసుకెళ్లి బ్యాంకు లాకర్లు తెరిచారు.రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటీ సోదాలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు.మాజీ మంత్రి ,కాంగ్రెస్ నేత డీకే అరుణ,పలువురు కాంగ్రెస్ నేతలు రేవంత్ కి మద్దతుగా నిలిచారు.డీకే అరుణ జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ నివాసానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలో గట్టిగా మాట్లాడే నేతలను రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్‌ చేసి బెదిరింపులకు పాల్పడుతోందని డీకే అరుణ్‌ ఆరోపించారు.అందరూ తనకు బానిసలుగా ఉండాలన్న కేసీఆర్‌ రాచరిక పాలనకు తెలంగాణ ప్రజలు త్వరలోనే తెరదించుతారన్నారు.ప్రతిపక్ష నేతలపై కుట్రలకు పాల్పడుతున్న తెరాసకు భవిష్యత్‌లో అదే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. భాజపాతో కుమ్మక్కైన అధికార పార్టీ.. రాష్ట్రంలో ఇతర పార్టీలు నిలదొక్కుకోకుండా కుట్రలకు పాల్పడుతోందన్నారు.టీఆర్‌ఎస్ మాత్రం కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, జైపాల్ రెడ్డి 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా వారి ఆస్తులపై ఎప్పుడూ ఐటీ దాడులు జరగలేదని, రేవంత్ అవినీతి చేసినందు వల్లే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని చెబుతున్నారు.

ముందస్తుపై తెలంగాణ సర్కార్ కు సుప్రీం నోటీసులు..!!

  తెలంగాణలో ముందస్తు ఎన్నికల అంశంలో కేంద్ర ఎన్నికల సంఘం, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. ముందస్తు ఎన్నికలను సవాల్‌ చేస్తూ సిద్దిపేటకు చెందిన శశాంక్‌రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ముందస్తు ఎన్నికల కారణంగా తెలంగాణలో 2018, జనవరి1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని మాత్రమే ఓటర్లుగా పరిగణిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణలో సుమారు 20లక్షల మంది యువత ఓటుహక్కు కోల్పోయే ప్రమాదముందని శశాంక్‌రెడ్డి సుప్రీంకోర్టుకు వివరించారు. ఎన్నికలు సరైన సమయంలో జరిగితే 2019, జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు సైతం ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉండేదని.. ముందస్తు వల్ల వారంతా ఓటేసే అవకాశం కోల్పోతారని పేర్కొన్నారు. దీనికి తోడు హడావుడిగా ఎన్నికలు జరిగితే పారదర్శకత లోపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూనే.. సీఈసీ, తెలంగాణ ప్రభుత్వానికి షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. దీనిపై వారం రోజుల్లోగా ఇరు వర్గాలు సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీచేసింది. ఆ తర్వాతే ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ చేపడతామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఎన్నికల బరిలో స్టార్ హీరో..!!

  తమిళ సినిమాలో విప్లవాత్మక నిర్ణయాలతో సంచలనం సృష్టిస్తున్న నటుడు విశాల్‌ రాజకీయాల్లోనూ సత్తా చాటుకునేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. రాజకీయాల్లో విశాల్‌ ప్రయాణం గతేడాదిలోనే ఆరంభమైంది. 2017, డిసెంబరులో జరిగిన ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించి, ప్రచారానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే ఆయన దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాన్ని రిటర్నింగ్‌ అధికారి నిరాకరించడంతో ఆ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు.   ఆ తరువాత మళ్లీ సినిమాల్లో బిజీ అయినప్పటికీ, తరచూగా ప్రజా సమస్యలపై గళం విప్పుతూనే ఉన్నారు. ఇటీవల అభిమాన సంఘాలను ‘మక్కల్‌ నల ఇయక్కం’గా మార్చుతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశాల్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రతి ఇంటా సిరులు కురవాలని, భావితరం భవిత బాగుండాలని కాంక్షిచే ప్రతి ఒక్కరూ తనకు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. తాను స్థాపించిన 'మక్కల్‌ నల ఇయక్కం' పార్టీగా మారుతుందని, ఇక నుంచి తాను క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా తిరుప్పరంకుండ్రం శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీచేయనున్నట్టు విశాల్‌ సూచన ప్రాయంగా వెల్లడించడంతో అభిమానులను ఉత్సాహంలో నెలకొంది.

కేసీఆర్ కు షాక్..తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి

  గడువు కన్నా ముందే అసెంబ్లీని రద్దు చేస్తే రద్దయిన రోజు నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు కేంద్రానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టతనిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈసీ నిబంధనావళిని విడుదల చేయడంతో తెలంగాణలో తక్షణమే కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఇదే అంశాన్ని హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ ధ్రువీకరించారు. ఆపద్ధర్మ ప్రభుత్వ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నిబంధనావళిలోని ఏడో అంశం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు చెప్పారు. కోడ్‌లోని ఏడో నిబంధన శాసనసభ రద్దయి అధికారంలో కొనసాగుతున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి వర్తిస్తుందని వెల్లడించారు. ఈ నిబంధన ప్రకారం ప్రభుత్వం కొత్తగా విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడం కుదరదని, కొత్తగా పథకాలను ప్రకటించడానికి వీల్లేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో ప్రైవేటు కార్యక్రమాలను కలిపి నిర్వహించడం కుదరదని స్పష్టం చేశారు. అసెంబ్లీ రద్దయిన వెంటనే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది.. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు నిబంధనలు అమల్లో ఉంటాయి. ఆపద్ధర్మ ప్రభుత్వానికీ నిబంధనలు వర్తిస్తాయి. కేంద్రం కూడా ఆ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల కోడ్‌ ఏడో నిబంధనకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. సదరు రాష్ట్రంలో కొత్త పథకాలను ప్రవేశపెడుతూ ఆపద్ధర్మ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రకటనలు జారీ చేయరాదు. కొత్త ప్రాజెక్టులు ప్రకటించొద్దు. ఎన్నికల కోడ్‌లోని ఏడో నిబంధనలో నిషేధించిన కార్యకలాపాలు ఏవీ చేపట్టొద్దు. వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోరాదు. అనధికార కార్యక్రమాల కోసం అధికారిక వనరులు ఉపయోగించొద్దు. ఎన్నికల ప్రచార పనులను అధికారిక పర్యటనలో భాగం చేయొద్దు. ఆపధర్మ ప్రభుత్వంలో పని చేస్తున్న రాష్ట్ర మంత్రులతో పాటు కేంద్ర మంత్రులకూ ఈ నిబంధనలు వర్తిస్తాయి.