బాబు, లోకేష్ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు.. హైకోర్టులో పిల్!!
ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ 'క్విడ్ ప్రో కో' కు పాల్పడుతూ 25 వేల కోట్ల రూపాయల ఆస్తులు అక్రమంగా కూడబెట్టారని.. వారిపై సిబిఐ, ఈడి దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ రిటైర్డు న్యాయాధికారి, ముందడుగు ప్రజా పార్టీ అధ్యక్షులు జె.శ్రవణ్కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేవలం కాగితాలకే పరిమితం అయిన కంపెనీలకు అత్యంత ఖరీదైన వేల ఎకరాల భూములను సీఎం చంద్రబాబు,మంత్రి లోకేష్ కేటాయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ అక్రమాలకు అధికారికంగా చంద్రబాబు, లోకేష్.. తెరవెనుక కీలకపాత్రధారిగా ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సిఇవో వేమూరి రవికుమార్ ఉన్నారని జె.శ్రవణ్కుమార్ పిల్లో ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్, రవికుమార్ కలిసి దురుద్దేశంతోనే ఒక ఐటి పాలసీని రూపొందించి ప్రజలను, ముఖ్యంగా నిరుద్యోగుల్ని మోసం చేశారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఏకంగా లక్ష ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేశారని.. పాలన చేతికి రాగానే కాగితాల కంపెనీలకు భూకేటాయింపులు చేసేందుకు వీలుగా ఉన్న చట్టాల్ని అందుకు అనువుగా మార్చేశారన్నారు. ఉద్యోగ కల్పన పేరుతో లోకేష్, రవికుమార్లు నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారని తెలిపారు. ఈ అవినీతిపై సీబీఐ, ఈడీ దర్యాప్తులకు ఆదేశించాలంటూ శ్రావణ్ కుమార్ పిల్లో హైకోర్టును కోరారు.