నేడే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల?

  కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకి సిద్ధం అయినప్పటి నుండి.. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అని అందరిలో ఆసక్తి మొదలైంది. త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి అంటూ చర్చలు జరుగుతున్నాయి. అయితే దీని గురించి ఈరోజు స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు మీడియా సమావేశాన్ని నిర్వహించనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం‌లతోపాటు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అన్ని రాష్ట్రల ఎన్నికల అధికారులతో రెండ్రోజులుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమావేశమవుతున్నారు. ఇవాళ తెలంగాణకు సీఈసీ సాంకేతిక నిపుణులు రానున్నారు. తెలంగాణలో ఓటర్ల జాబితా రూపొందించే విషయంలో సాంకేతిక సమస్యలను పరిశీలించనున్నారు. ఈ నెల 8న ఓటర్ల తుది జాబితా విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. అయితే ప్రస్తుతం సాంకేతిక సమస్యలు వస్తున్నందున సాంకేతిక నిపుణులను సీఈసీ పంపిస్తోంది.

చంద్రబాబుని ఎన్‌కౌంటర్‌ చేయండి: శివాజీ

  కేంద్ర ప్రభుత్వాన్ని తనదైన శైలిలో కడిగేస్తూ విమర్శలు చేసే నటుడు, ప్రత్యేకహోదా ఉద్యమ నేత శివాజీ.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. 'మీ టార్గెట్‌ చంద్రబాబు. దానికోసం రాష్ట్ర ప్రజలను హింసించే బదులు ఆయన్ను ఒకేసారి ఎన్‌కౌంటర్‌ చేయండి. చంద్రబాబుపై కోపంతో ఆంధ్ర ప్రజలకు అన్యాయం ఎందుకు చేస్తున్నారు?’ అని నిలదీశారు. నలుగురు దుర్మార్గులు ఢిల్లీలో కూర్చుని రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మొన్న తెలంగాణలో రేవంత్‌రెడ్డి, తాజాగా రాష్ట్రంలో ఐటీ దాడులు జరగడానికి వెనుక ఒక వ్యక్తి చక్రం తిప్పాడని ఆరోపించారు. ఆ ఒక్కడే మొత్తం సమాచారాన్ని ఐటీ అధికారులకు ఇచ్చారన్నా రు. దేశంలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న రాఫెల్‌ కుంభకోణాన్ని దారిమళ్లించడానికే ఐటీ దాడులు చేయిస్తున్నారన్నా రు. ఎవరు ఊరుకున్నా ఈ విషయంలో మాత్రం తాను మౌనం వహించే ప్రసక్తి లేదని చెప్పారు. ర్యాలీ నిర్వహించి ప్రజానీకానికి వాస్తవాలు తెలియజేస్తానన్నా రు. ప్రత్యేకహోదా సాధన కోసం హోదా సైన్యాన్ని తయారు చేస్తున్నానని తెలిపారు. నవంబరు 2న ఈ సైన్యంతో రాష్ట్ర రహదారులపై ఆందోళనలు నిర్వహిస్తానన్నారు.

కేసీఆర్‌ చేసింది ఆమరణ దీక్ష కాదు.. దొంగ దీక్ష

తెరాస అధినేత,అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు.గాంధీభవన్‌లో జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు  ఈ నేపథ్యంలో ‘చావు నోట్లో తలపెట్టి వచ్చానంటూ పదేపదే చెబుతున్న కేసీఆర్‌ అప్పట్లో నిమ్స్‌లో చేసింది ఆమరణ దీక్ష కాదు.. దొంగ దీక్ష’ అంటూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. నిమ్స్‌లో ఉన్నన్ని రోజులు దొంగచాటుగా ఫ్లూయిడ్లు, ఇంజక్షన్లు, న్యూట్రియెంట్లు తీసుకున్నారని ఆరోపించారు.నిమ్స్‌ ఆసుపత్రి రికార్డులే ఈ విషయాన్ని చెబుతున్నాయంటూ ఓ నివేదికను బహిర్గతం చేశారు.నిజామాబాద్‌ సభలో తన గురించి అడ్డగోలుగా మాట్లాడారని మండిపడ్డారు.     చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో మిగ్‌-21, 23 విమానాల ద్వారా దేశ రక్షణ బాధ్యతల్ని నేను నిర్వర్తించాను. అప్పట్లో కేసీఆర్‌ దుబాయ్‌కు దొంగ పాస్‌పోర్టులు, వీసాలు ఇప్పించే బ్రోకర్‌గా, ఏజెంట్‌గా చేసింది నిజం కాదా? ఇదే కేసులో దిల్లీలో పోలీస్‌ఠాణాలో కేసీఆర్‌ను కూర్చోబెడితే.. అప్పట్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎమ్మెస్సార్‌ ఫోన్‌ చేసి విడిపించింది వాస్తవం కాదని చెప్పే ధైర్యముందా? తెలంగాణ ఉద్యమ సమయంలో అమెరికాలో ఉన్న నా కొడుకు, కూతురు ఇక్కడికి తిరిగి రారని చెప్పి.. ఇప్పుడు అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు.హరీశ్‌రావు, కవితకు కేంద్రమంత్రి మంత్రి పదవులు కట్టబెట్టేందుకు, కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు కేసీఆర్‌ పాట్లు పడుతున్నారు. అందుకే భాజపాతో జట్టు కట్టారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, కేంద్రంపై అవిశ్వాసం సమయంలో భాజపాకు అనుకూలంగా ఓటు వేయడమే ఇందుకు నిదర్శనం. మోదీ గ్రాఫ్‌ కూడా పడిపోతుండటంతో కేసీఆర్‌ మద్దతు తీసుకుంటున్నారు. ఈ పార్టీల కుతంత్రాల్ని ఓటర్లు తిప్పికొట్టాలి. తమకు సంతానం లేదని.. తాను, తన సతీమణి తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తున్నామన్నారు. జాతీయ నాయకుల జయంతి రోజున వారి విగ్రహాలకు పూలమాలల వేసే తీరిక కూడా కేసీఆర్‌కు లేదని ఉత్తమ్‌ విమర్శించారు. 50 శాతానికి పైగా ఓట్లున్నట్లు చెప్పుకుంటున్న కేసీఆర్‌‌.. మహా కూటమిని చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని, రెండు నెలలు కష్టపడితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్‌ జిల్లాలోని 15 సీట్లలో 10కి తగ్గకుండా కాంగ్రెస్‌ గెలుచుకోవాలి. నగరానికి కేసీఆర్‌ చేసిందేమీ లేదు. విమానాశ్రయం, ఓఆర్‌ఆర్‌, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే, కృష్ణా, గోదావరి జలాలు, మెట్రోరైలు, ప్రపంచస్థాయి సదుపాయాలు అన్ని గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలే సాధించాయి. ఆ విషయాలను కాంగ్రెస్‌ కార్యకర్తలు పాదయాత్ర ద్వారా ఇంటింటికి వెళ్లి వివరించాలి. కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో నినాదంతో ప్రచారం చేయాలి.’’ అని ఉత్తమ్‌ అన్నారు.

రాజకీయ కోణంలోనే ఐటీ దాడులు

    ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నా ఐటీ దాడులు సర్వత్రా ఉత్కంఠత రేపుతున్నాయి.వేర్వేరు ప్రాంతాలనుంచి ఆదాయపు పన్ను శాఖకు చెందిన అధికారుల బృందాలు విజయవాడకు చేరుకున్నాయని, ఈ ప్రాంతంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యులే లక్ష్యంగా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోదాలు జరిగే అవకాశం ఉందని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం సాగింది.సోదాల సమాచారం ముందే బయటకు వచ్చేయడంతో ఆ బృందాలు ఎక్కడెక్కడకు వెళ్తాయో తెలుసుకునేందుకు  విలేకరులు విజయవాడ ఆటోనగర్‌లో ఉన్న ఆదాయపన్ను శాఖ కార్యాలయం వద్ద పడిగాపులు కాశారు.వారి దృష్టి మరల్చేందుకు ఐటీ అధికారులు విజయవాడ బెంజిసర్కిల్‌ సమీపంలోని చంద్రబాబు కాలనీలో ఉన్న నారాయణ జూనియర్‌ కళాశాలలోకి వెళ్లారు. అక్కడ ఖాతాలు నిర్వహించే సిబ్బంది ఎన్ని గంటలకు వస్తారంటూ ప్రశ్నించి వెళ్లిపోయారు. దీంతో మంత్రి పి.నారాయణకు చెందిన నారాయణ విద్యా సంస్థలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయని ప్రచారం సాగింది. అయితే తమ విద్యాసంస్థలపై ఎక్కడా సోదాలు జరగలేదని ఆ సంస్థ యాజమాన్యంతో పాటు మంత్రి నారాయణ స్పష్టం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 చోట్ల తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు విశాఖ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు స్థిరాస్తి సంస్థలు, పరిశ్రమలు, రొయ్యల ఎగుమతి సంస్థలకు చెందిన కార్యాలయాలు, వాటిని నిర్వహిస్తున్నవారు, అందులో పనిచేస్తున్న ముఖ్యమైన ఉద్యోగుల ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు సాగాయి. హైదరాబాద్‌లోని పలు చోట్ల కూడా తనిఖీలు చేశారు.వీటిల్లో పలువురు రాజకీయ ప్రముఖులకు సంబంధించిన సంస్థలూ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో తెదేపా ముఖ్య నేత బీద మస్తాన్‌రావుకు చెందిన సంస్థల్లోనూ, ప్రకాశం జిల్లాలో కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావుకు చెందిన పరిశ్రమల్లోనూ, విశాఖలో  రేవంత్‌రెడ్డి సన్నిహితుడని పేరున్న నంబూరు శంకరరావు సంస్థల కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి.రాజకీయ కోణంలోనే ఐటీ దాడులు జరుగుతున్నాయంటూ విస్తృత ప్రచారం సాగుతోంది.  

కాంగ్రెస్‌ పార్టీ దేశానికి పట్టిన చీడ పురుగు : కేసీఆర్

  వనపర్తిలో టీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. కాంగ్రెస్, టీడీపీ గత పాలనపై తీవ్ర ఆరోపణలు చేశారు.కాంగ్రెస్‌ పార్టీ దేశానికి పట్టిన చీడ పురుగని కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.'పాలమూరును టీడీపీ, కాంగ్రెస్ కలిపి 58 ఏళ్లు పాలించాయి. ఇప్పుడు నాలుగున్నరేళ్లు టీఆర్ఎస్ పాలించింది. వాళ్ల పాలనలో తెలంగాణ ఎలా ఉంది? టీఆర్ఎస్ పాలనలో ఎలా ఉంది?’ అని ప్రజల అభిప్రాయాన్ని కేసీఆర్ కోరారు.గొర్రెలంటే ఈ కాంగ్రెస్ గొర్రెలకు తెలియదని,రోజూ 650 లారీల గొర్రెలు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు దిగుమతి అవుతున్నాయి.అది గమనించే గొర్రె పిల్లలు పంపిణీ చేశాం.బలమైన గొల్లకురుమలు దేశంలో ఎక్కడున్నారంటే తెలంగాణలో ఉన్నారనే పేరు మనకు రాబోతోంది' అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ‘గద్వాల్‌లో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడారు. కత్తి తిప్పాల్సిన చోట తిప్పని కాంగ్రెస్‌ నేతలు.. ఇప్పుడు తిప్పుతున్నారు. సమైక్య రాష్ట్రంలో నీళ్ల విషయంలో తెలంగాణకు మోసం జరిగింది. నాటిమోసాన్ని అధిగమించి ఇప్పుడైనా.. కోటి ఎకరాలకు నీరు సాధించుకోవాలి. 2004లో వైఎస్ మాయలో పడి సోనియా తెలంగాణ ఇవ్వలేదన్నారు. చివరకు తెలంగాణ సమాజం అంతా కలిసి గట్టిగా పోరాడితేనే తెలంగాణ ఇచ్చారని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి అనే దుర్మార్గుడు తెలంగాణ ప్రాజెక్టులను పెండింగ్ పెట్టి పాలమూరును ఎండబెట్టారని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక.. కరువును తరిమెయ్యాలనే ఉద్దేశంతో 40 మంది రిటైర్డ్ ఇంజినీర్లతో నదులపై సర్వే చేయించానని చెప్పారు. వారి సలహా మేరకు ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టామన్నారు. దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం.. నీళ్లు ఎలా వస్తాయో చూపిస్తామని రమ్మంటే.. కాంగ్రెస్ నేతలు శాసనసభకు రాకుండా పారిపోయారని,పాలమూరు జిల్లా బీడు భూమిగా మారడానికి కాంగ్రెస్‌ నేతలే కారణం అని కేసీఆర్ విమర్శించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాను చంద్రబాబు 9ఏళ్లు దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాకు చంద్రబాబు ఏం చేశారు? మన తెలంగాణ నిర్ణయాలు మనమే తీసుకుందామా.. విజయవాడ, ఢిల్లీ నేతలు తీసుకోవాలా? అని పాలమూరు ప్రజలు ఆలోచించుకోవాలి అని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.‘నేను చెప్పిన మాట్లలో వాస్తవం లేకుంటే తెరాసను ఓడించండి, నిజముంటే పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలి. తెలంగాణ కోసం 19 ఏళ్లుగా పోరాడుతున్నా. ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి. ప్రతి ఒక్కరూ కేసీఆర్‌ కావాలి. ఆరునూరైనా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.90 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు పూర్తి చేస్తోంది. ఇరవై లక్షల ఎకరాలకు నీళ్లిస్తేనే పాలమూరు జిల్లాలో ఓట్లు అడుగుతా. డిసెంబరు నాటికి మిషన్‌ భగీరథ పూర్తి చేసి ఇంటింటికీ నల్లా నీళ్లు ఇస్తామన్నారు.

లైంగిక హింసపై పోరాటం.. నోబెల్ పురస్కారం

  ప్రపంచ ప్రఖ్యాత పురస్కారం నోబెల్ శాంతి బహుమతి ఇద్దరిని వరించింది. లైంగిక అత్యాచారాలపై తిరుగు బావుటా ఎగురవేసినందుకు గానూ వారికి ఈ అవార్డు లభించింది. డెనిస్‌ ముక్‌వెగె, నదియా మురద్‌లకు సంయుక్తంగా ఈ బహుమతి దక్కింది. డెనిస్‌ మక్‌వెగె కాంగోకు చెందిన గైనకాలజిస్టు‌. ఆయన లైంగిక హింస బాధితులకు సహాయం చేశారు. అంతే కాకుండా వారికి చేదోడువాదుడుగా ఉంటూ వారికి మానసికంగా ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఇక నదియా మురద్‌ విషయానికి వస్తే.. ఆవిడ ఇరాక్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త. నదియా ఇరాక్‌లో యాజిదీలు ఎక్కువగా నివసించే సింజర్‌ ప్రాంతలో ఉండేది. ఇది సిరియా సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. అక్కడ ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. వారి చేసే అకృత్యాలు దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా యాజిదీ స్త్రీల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తారు. నదియాను కూడా ఉగ్రవాదులు అపహరించారు. కొన్ని నెలల పాటు బంధించి ఆమెపై ఉగ్రవాదులు సామూహికంగా అత్యాచారాలకు పాల్పడ్డారు. విపరీతంగా కొట్టి హింసించారు. తనలా నరకం అనుభవిస్తున్న యాజిదీ యువతులను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్న నదియా అందుకోసం ఎంతో కృషి చేసింది. యుద్ధంలో మహిళలపై లైంగిక హింసను ఆయుధంగా వాడుకోవడాన్ని నిర్మూలించేందుకు చేసిన కృషికి గాను కాంగోకు చెందిన డెనిస్‌ ముక్‌వెగె, నదియా మురద్‌లకు ఈ ఏడాది నోబెల్‌ శాంతి పురస్కారం లభించింది.

ఓటర్ల తుది జాబితాను విడుదల చేయవద్దు

  తెలంగాణ ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అవకతవకలపై ఉమ్మడి హైకోర్టులో పలు పిటిషన్లు విచారణ దశలో ఉండగానే తమ వద్ద అదే అంశాలపై దాఖలైన పిటిషన్లను తాము విచారించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.ఓటర్ల జాబితా అభ్యంతరాలపై దాఖలైన మూడు పిటిషన్లను తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. మూడు పిటిషన్లలో రెండింటిని హైకోర్టు తోసిపుచ్చింది.సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీ అందడంతో శశిధర్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.పిటిషన్‌లో పేర్కొన్న అంశాలను పరిశీలించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. విచారణ పూర్తయ్యే వరకు తుది ఓటర్ల జాబితాను విడుదల చేయవద్దని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.మరో వైపు తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులతో సమావేశమైన కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా తయారీ, ఈవీఎంలు సిద్ధం వంటి కీలక అంశాలపై చర్చించినట్టు సమాచారం.తెలంగాణాలో ఎన్నికల నిర్వహణకు ఉన్న పరిస్థితులను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ సీఈసీకి వివరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘానికి రజత్‌కుమార్‌ నివేదిక సమర్పించారు.ఓటర్ల జాబితా విడుదల చేయవద్దని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో దీనిపై కూడా ఈసీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.ఈనెల 10న ఈసీ బృందం హైదరాబాద్‌ వచ్చే అవకాశముంది. అనంతరం ఎన్నికల నిర్వహణ తేదీ ప్రకటన ఉంటుందని అంతా భావిస్తున్నారు.

కేసీఆర్‌ విమర్శలు..రాష్ట్రంలో ఐటీ దాడులు..సీఎం అత్యవసర భేటీ

ఒక పక్క తెలంగాణాలో కేసీఆర్‌ మరో పక్క రాష్టంలో ఐటీ అధికారుల దాడులు ఈ నేపధ్యం లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రివర్గ సమావేశానికి ముందే కొందరు మంత్రులతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది.మంత్రివర్గ సమావేశంలో రాష్టం లో జరుగుతున్నఐటీ దాడులపై చర్చ జరిగినట్టు సమాచారం.చంద్రబాబు నేతలకు కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరించి టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేయిస్తోందని,నేతలంతా ధైర్యంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది.సమావేశంలో కేసీఆర్ విమర్శలు కూడా చర్చకొచ్చినట్లు తెలిసింది. కేసీఆర్ విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇవ్వాలని నేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలిసింది.     ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ దాడులపై తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్,ఏపీ మంత్రి ఆదినారాయణ,కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు.అమరావతిలో మీడియా తో మాట్లాలిన కనకమేడల ఐటీ సోదాల పేరుతో కేంద్రం మైండ్‌ గేమ్‌ ఆడుతోందన్నారు. అధికార దుర్వినియోగంలో మోదీ ప్రభుత్వం ముందజలో ఉందని విమర్శించారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలుగుదేశం ప్రభుత్వం.. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీలు, రాష్ట్రంపై కేంద్రం చూపిస్తున్న వివక్ష పట్ల నిలదీస్తున్నందునే ఈ దాడులు జరుగుతున్నాయని కనకమేడల ఆరోపించారు.కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో పథకం ప్రకారమే ఐటీ దాడులు జరుగుతున్నాయని,రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ఐటీ దాడులు చేపట్టారని మండిపడ్డారు. కేసీఆర్‌కు నోటి దురుసు ఎక్కువని, సీఎం హోదాలో ఉండి వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పడిపోతుందని..కూటమిదే గెలుపని తులసిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఏపీ మంత్రి ఆదినారాయణ ఓటమి భయంతోనే కేసీఆర్ చంద్రబాబుని టార్గెట్ చేశారని,కేసీఆర్‌కి నోటి దురద ఎక్కువై అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.రాజకీయ కోణంలోనే ఏపీలో ఐటీ దాడులు జరుగుతున్నాయని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు పోరాడినా ఐటీ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే విషయం తెలుసుకోవాలని మంత్రి సూచించారు.

తెరాస ప్రచారానికి అడ్డంకులు

  ఓ వైపు తెరాస అధినేత కేసీఆర్‌ రానున్న ఎన్నికల్లో 100 కి పైగా సీట్లు గెలుస్తామని బహిరంగ సభల్లో వెల్లడిస్తుంటే మరో వైపు తమ నియోజక వర్గాల్లో ప్రచారానికి వెళ్లిన నేతలకు చేదు అనుభవం ఎదురవుతుంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన హుస్నాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత వొడితెల సతీశ్ కుమార్ ని కాంగ్రెస్ కార్యకర్తలు,స్థానికులు అడ్డుకొని నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని, తమ గ్రామాన్ని అనవసరంగా అక్కన్నపేట మండలంలో కలిపారని వొడితెలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డు పై బయటయించి నిరసన తెలుపగా వారిని బూటు కాలుతో తన్నుకుంటూ వెళ్లి వివాదంలో చిక్కుకున్న సంగతి మరవకముందే మరో ఇద్దరు తెరాస ప్రజాప్రతినిధులకు ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది.ఖమ్మం జిల్లా చీమలపాడులో ప్రచారానికి వెళ్లిన వైరా తాజా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు రైతుల నుంచి నిరసన వ్యక్తమైంది.‘‘మాపై అటవీ సిబ్బంది దౌర్జన్యాలు కొనసాగుతుంటే.. మీరు ఏమైనా చేశారా? ఇప్పుడు మీకు మేం ఎందుకు ఓట్లేయాలి?’ అంటూ ఆయనను పోడు రైతులు నిలదీశారు.అలానే ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ తాజా మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు ప్రచారంలో భాగంగా తలమడుగు మండలం కుచ్లాపూర్‌ వెళ్లగా చెరువు నిర్మిస్తామని ప్రతి ఎన్నికల్లో హామీ ఇస్తున్నారే తప్ప అమలుచేయడం లేదని గ్రామస్తులు ఆయనను నిలదీశారు. సీసీ రోడ్ల నిర్మాణానికి కొబ్బరికాయలు కొట్టి మూడేళ్లయినా ముందుకుసాగడం లేదని, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు,దళితులకు మూడెకరాల భూ పంపిణీ ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజల నుంచి ప్రశ్నల పరంపరను తట్టుకోలేక బాపూరావు.. తీవ్ర అసహనానికి గురయ్యారు. ‘మళ్లీ మీ ఊరికి ఎన్నికల ప్రచారానికి రాను’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

హైదరాబాద్‌ కేసీఆర్‌ అబ్బ సొత్తా?

  తెరాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు పలువురు టీడీపీ నాయకులు.అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి నక్కా ఆనందబాబు ‘కేసీఆర్ నీకు సిగ్గుందా?.. నీలాంటి నీచుడు రాజ‌కీయాల్లో ఉండ‌రు’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.పోటుకాడు త‌న్నుకోవ‌డానికి వ‌స్తాడా? రమ్మనండి అంటూ సవాల్ విసిరారు.చంద్రబాబుపై కేసీఆర్‌ వాడిన భాషను దేశంలో మరే సీఎం ఉపయోగించరని, తెదేపాని చూస్తే కేసీఆర్‌కి వణుకు పుడుతోందని ఆయన ధ్వజమెత్తారు. నీకు రాజకీయ భిక్ష పెట్టింది తెదేపాయే అని.. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దుతున్నారని ఆనందబాబు మండిపడ్డారు.2009లో చంద్రబాబుతో ఎందుకు పొత్తుపెట్టుకున్నావని మంత్రి ప్రశ్నించారు.కేసీఆర్‌ మనిషి అయితే ఆయనకు మూడో కన్ను ఎలా ఉంటుందని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లలో ఆయన చేసిన ఒక మంచిపని చెప్పగలరా అంటూ ఆనందబాబు నిలదీశారు.ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కప్పిపుచ్చుకునేందుకే తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ రోడ్లను చూసి సిగ్గు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. హైదరాబాద్‌ కేసీఆర్‌ అబ్బ సొత్తా? అని...తమకు పదేళ్ల హక్కు ఉందని ఆనందబాబు స్పష్టం చేశారు. కేసీఆర్‌ చేసిన దొంగదీక్షలతో తెలంగాణ రాలేదని, కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేకరాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు.

ఎమ్మెల్యేగా గెలిచినా రాజీనామా చేస్తా

నల్గొండలో బహిరంగ సభ నిర్వహించిన కేసీఆర్‌ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో 12 గెలుస్తామని అని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.నల్గొండ పట్టణంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లాలో 10 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించకపోతే తాను ఎమ్మెల్యేగా గెలిచినా రాజీనామా చేస్తానని సవాల్‌ చేశారు.రౌడీలకు, దోపిడీదారులకు కేసీఆర్ టికెట్లు ఇచ్చారని, రౌడీలను గెలిపిస్తే నల్గొండలో నిత్యం హత్యలు, దోపిడీలే అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్‌ వేల కోట్లు దోచుకుంటున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. మూడేళ్లలో శ్రీశైలం ఎడమ కాలువ (ఎస్ఎ‌ల్‌బీసీ) సొరంగమార్గం పూర్తి చేస్తానని హామినిచ్చిన కేసీఆర్‌ నాలుగున్నరేళ్ల పాలనలో ఎందుకు నిర్లక్ష్యం వహించారని ధ్వజమెత్తారు. ఎస్ఎ‌ల్‌బీసీలో కమీషన్లు రావనే పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. జగదీశ్‌రెడ్డి, ఆయన అనుచరులు దోచుకునేందుకే దామరచర్ల థర్మల్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దామరచర్ల ప్లాంట్‌ను ఆపేస్తామన్నారు.ఈ ప్లాంట్ల వల్ల మిర్యాలగూడ పరిసరాలు కాలుష్యమవుతున్నాయని పేర్కొన్నారు.మంత్రి వర్గంలో ఒక్క మహిళా మంత్రిని లేకుండా చేసి బతుకమ్మ చీరల గురించి కేసీఆర్‌ గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

తెలంగాణ రాజకీయాలపై అమిత్‌షా ఆరా

  2014 సాధారణ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భాజపా అప్పటి నుంచి వివిధ రాష్ట్రాల్లో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ విజయ ఘంటిక మోగించింది.దేశంలో 22 రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేసిన కమలనాథులు దక్షిణాదిలోనూ పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల కార్యాచరణ రూపొందిస్తున్నారు.రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని భాజపా ఇప్పటికే ప్రకటించింది. తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.ఈ నెల 10న కమలనాథులు కరీంనగర్‌లో మరో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు అమిత్‌షా హాజరు కానున్నారు. తెలంగాణలో ముమ్మర ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర ప్రముఖులను సభలకు రప్పించేందుకు స్థానిక నేతలు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం.అధినాయకత్వం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయటంతో పాటు తెలంగాణ ప్రజలు, అమరుల ఆకాంక్షలు ప్రతిబింబించేలా మేనిఫెస్టో రూపకల్పనకు సామాజిక వేత్తలు, మేధావులు, విద్యార్థి, యువజన సంఘాలతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా అభిప్రాయాలను సేకరిస్తోంది.

చంద్రబాబు నయ వంచకుడు

  తెరాస అధినేత కేసీఆర్‌ చంద్రబాబు,కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నమ్మదగ్గ వ్యక్తి కాదు.. నయ వంచకుడు. అని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. తెలుగువాళ్లమంతా ఒక్కటి, మనమిద్దరం ఒకటిగా ఉంటే దిల్లీలో పట్టు ఉంటుందని కేసీఆర్‌కు చెప్పినా వినలేదు అందుకే మహాకూటమి వచ్చిందని చంద్రబాబు చెబుతున్నారు. అది మహాకూటమా? కాలకూట విషమా?.. మహాకూటమా.. మన తెలంగాణను నాశనం చేసే గూటమా? అని ఎద్దేవా చేసారు.తాను, మోదీ ఒక్కటైపోయారంటూ చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ‘‘ నాలుగేళ్లు మోదీ సంకలో ఉన్నది నువ్వుకాదా? ఇన్నేళ్లు మోదీ సంకనాకింది నువ్వుకాదా? మోదీ కాళ్లుపట్టుకుని నా ఏడు మండలాలను గుంజుకున్నావు. సీలేరు పవర్‌ ప్రాజెక్టును పట్టుకుపోయావు. హైకోర్టు విభజనను అడ్డుకున్నావు’’ అని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ దెబ్బ ఏందో ఓసారి తగిలితే ఎగిరి విజయవాడ కరకట్టకు పడ్డావ్‌. మా బతుకు మేం బతుకుతున్నాం. మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో ఆలోచించుకో. తెలుగు దేశం పార్టీతో నిస్సిగ్గుగా పొత్తు పెట్టుకుంటామని పోతున్నారు. చావు నోట్లో తలపెట్టి సాధించుకున్న తెలంగాణను విజయవాడకు అప్పగిస్తామా? దరఖాస్తు పట్టుకుని అమరావతి వెళ్లాలా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంట గలుపుతున్నారు. మీ అధికారం కోసం, స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలు పదవులకోసం తెలంగాణను వాడుకున్నారు.. ఆడుకున్నారు అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. బారెడు మూరెడు కబుర్లు చెప్పే జానారెడ్డి కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో తెలంగాణ కోసం ఉద్యమిద్దామని తనకు చెప్పారని కేసీఆర్‌ వెల్లడించారు.మంత్రి పదవి కోసమే తెలంగాణ అంటున్నావని జానారెడ్డి ముఖంపైనే చెప్పానన్నారు. విజయభాస్కర్‌రెడ్డి నేను అన్నట్లే జానారెడ్డిని పిలిచి మంత్రి పదవి ఇవ్వగానే తెలంగాణ ఊసే ఎత్తలేదు.1956లో తెలంగాణను ఆంధ్రాలో కలిపింది ఎవరు? 1969లో తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపిందెవరు? మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో ఫ్లోరైడ్‌ మరణాలకు కారణం కాంగ్రెస్‌ నేతలు కాదా? మణుగూరు విద్యుత్‌ ప్లాంట్‌ విజయవాడకు తరలిస్తే కాంగ్రెస్‌ నేతలు నోరు మెదపలేదు. కాంగ్రెస్‌ నేతలు నల్గొండ జిల్లాను నాశనం చేశారు. ఫ్లోరైడ్‌తో లక్షా 40వేల మంది జీవితాలు నాశనమయ్యాయన్నారు.నల్గొండ ఆర్థిక ముఖచిత్రం దామచర్ల థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టుతో మారుతుందని చెప్పిన కేసీఆర్‌ వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 119 స్థానాలకు గాను తాజా సర్వేలో 7 స్థానాలు మజ్లీస్ కు పోగా మిగిలిన 112లో 110 టీఆర్ఎస్ వే అని చెప్పారు. నల్లగొండలోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని, పీసీసీ చీఫ్‌, సీఎల్పీ నేతలకు గోచీలు ఊసిపోవడం ఖాయమన్నారు.

కిడారి కుమారునికి మంత్రి పదవి

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరపనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఉన్న మంత్రి వర్గంలో గిరిజనులు లేకపోవటం తో మావోయిస్టుల కాల్పుల్లో మరణించిన అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కిడారి సర్వేశ్వరరావు పెద్ద కుమారుడు శ్రావణ్‌కుమార్‌ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాన్ని చంద్రబాబు పరిశీలుస్తున్నట్టు సమాచారం.ఇప్పటికిప్పుడు అరకు స్థానానికి ఉపఎన్నికలు జరిగే అవకాశం లేదు.మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆరునెలల్లోగా ఏదోఒక సభకు ఎన్నికవ్వాలి.ఆలోగా శాసనసభకు సాధారణ ఎన్నికలే రానున్నాయి.ముందు శ్రావణ్‌ని మంత్రిగా తీసుకుంటే... ఆ తరువాత అవకాశముంటే శాసనమండలికి ఎన్నికయ్యేలా చూడటం, లేదంటే ఆరు నెలల సమయం ముగిశాక రాజీనామా చేయించి సాధారణ ఎన్నికల్లో అరకు నుంచి పోటీ చేయించటం అనే అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఐఐటీ నుంచి ఇంజనీరింగ్‌ చదివిన శ్రావణ్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని కీలక శాఖ అప్పగిస్తే, ప్రజల్లోకి.. ప్రత్యేకించి గిరిజనుల్లోకి మంచి సంకేతాలు వెళతాయని,గిరిజనులకు మంత్రివర్గంలో అవకాశమివ్వలేదనే విమర్శ తొలగిపోవటంతోపాటు రాజకీయంగానూ సానుకూలత ఏర్పడుతుందని తెదేపా వర్గాల అంచనా.

తెరాస పై కాంగ్రెస్ ఎదురుదాడి

తెలంగాణ ఎన్నికల ప్రచార సభలతో హోరెత్తుతోంది.తెరాస,కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు సంధిచుకుంటూ ఎదురుదాడికి దిగుతున్నారు.అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి, సీనియర్‌ నేతలు జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్‌ అలి, భట్టి విక్రమార్క, డీకే అరుణ. అనంతరం ఎన్నికల ప్రచార శంఖారావం పూరించి గద్వాల్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.     ఈ సందర్బంగా మాట్లాడిన పీసీసీ చీఫ్‌ ఉత్తమకుమార్ రెడ్డి కేసీఆర్‌ అబద్ధాలకోరని ధ్వజమెత్తారు.కేసీఆర్‌ దళితుడిని ముఖ్యమంత్రి చేశారా? దళితులకు మూడు ఎకరాలు ఇచ్చారా? ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేశారా? అంటూ ప్రశ్నించారు. ‘మీ క్యాబినెట్‌లో ఉన్న మంత్రులు తలసాని, మహేందర్‌రెడ్డి, తుమ్మల తెలంగాణలో ఎక్కడ ఉద్యమం చేశారని పక్కన కూర్చోబెట్టుకున్నావు?’ అంటూ ధ్వజమెత్తారు.కాంగ్రెస్‌ ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకెందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన అంతం కావాలంటే అన్ని పార్టీలు కలిసి రావాలన్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఉపాధ్యక్ష పదవికి మద్దతు ఇచ్చి కేసీఆర్‌ కేంద్రంలోని నరేంద్ర మోదీకి జైకొట్టారన్నారు. దిల్లీలో మోదీని ఓడించాలంటే రాష్ట్రంలో కేసీఆర్‌ను ఇంటికి పంపాలన్నారు. అనంతరం మాట్లాడిన కాంగ్రెస్‌ ఎన్నికల స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి ‘‘అన్నా కేసీఆర్‌.. మా ప్రజలను కొంచెం పట్టించుకోండి దొరా! సమస్యలు పరిష్కరిస్తారనుకుంటే నాలుగున్నరేళ్లు ప్రగతిభవన్‌లో, ఫామ్‌హౌస్‌లో కూర్చున్నావు’’ అని కేసీఆర్‌ను ఎద్దేవా చేశారు.ఒసేయ్‌ రాములమ్మ సినిమాను తలపించేలా రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన నడిచిందన్నారు.రాములమ్మ సినిమాలో రామిరెడ్డి ఉంటే ఇక్కడ కేసీఆర్‌ ఉన్నారని ఆరోపించారు. ‘‘ఉద్యమంలో చూసిన కేసీఆర్‌ వేరు.. ఇప్పటి కేసీఆర్‌ వేరు’’ అన్నారు.అర్థరాత్రి తనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి బయటకు పంపించాడని, కారణం మాత్రం చెప్పలేదని విమర్శించారు.కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌, కవితను ఉద్దేశించి ‘‘వారు చార్‌మినార్‌ కాదు.. చోర్‌ మినార్‌’’ అని ధ్వజమెత్తారు.

ఐసిఐసిఐ బ్యాంక్ సీఈవో రాజీనామా

  ఐసిఐసిఐ బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో చందా కొచర్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈమె రాజీనామాకు బ్యాంకు బోర్డు గురువారం ఆమోదం తెలిపింది. ఇది వెంటనే అమలులోకి వస్తుంది. ఐసిఐసిఐ సెక్యూరిటీస్‌ సహా ఐసిఐసిఐ బ్యాంక్‌కు అనుబంధంగా ఉన్న అన్ని సంస్థల పదవులకు కొచర్‌ రాజీనామా చేశారు. క్విడ్‌ప్రోకో ఆరోపణలు ఎదుర్కొంటున్న చందా కొచర్‌ స్థానంలో ప్రస్తుతం బ్యాంక్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ గా ఉన్న సందీప్‌ భక్షిని కొత్త ఎండి, సీఈవోగా బోర్డు నియమించింది. అక్టోబరు 3 నుంచి ఈ నియామకం అమలులోకి వస్తుంది. భక్షి అయిదేళ్లు ఈ పదవిలో కొనసాగుతారని బోర్డు తెలియజేసింది. కొచర్‌పై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బిఎన్‌ శ్రీకృష్ణ సారథ్యంలో దర్యాప్తు కొనసాగుతుందని, దర్యాప్తులో తేలిన అంశాలను బట్టి ఆమెకు రిటైర్‌మెంట్‌ తర్వాత ఇచ్చే ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయని బ్యాంకు పేర్కొంది. మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా ఐసిఐసిఐ గ్రూపులో 1984లో ఉద్యోగ జీవితం ప్రారంభించిన కొచర్‌.. ఆ తర్వాత పాతికేళ్లకు ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ప్రైవేటు బ్యాంకింగ్‌ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన ప్రతిభాశాలిగా పేరు తెచ్చుకున్నారు. పద్మభూషణ్‌ పురస్కార పొంది ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఇవన్నీ ఒకప్పటి మాటలు. ఒక తప్పు చాలు వంద ఒప్పుల్ని చెడగొట్టడానికి అన్నట్టుగా.. ఒక్క సంఘటన ఆమె జీవితాన్నిపాతికేళ్ళు వెనక్కి నెట్టింది. భర్త దీపక్‌ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు కొచర్‌ నిబంధనలు అతిక్రమించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో బ్యాంకు నియమించిన స్వతంత్ర కమిటీతో అంతర్గత విచారణ ఎదుర్కోవడం జరిగింది. తుది నివేదిక వచ్చే వరకు సెలవుపై వెళ్లాల్సి రావడం.. తాజాగా ముందస్తు పదవీ విరమణకు పూనుకోవడం.. బ్యాంకు బోర్డు వెంటనే ఆమోదం తెలపడం అన్ని అలా జరిగిపోయాయి.

ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖులపై ఐటీ దాడులు

  తెలంగాణాలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై జరిగిన ఐటీ దాడులు రాజకీయ దుమారంలేపాయి.తాజా సమాచారం ప్రకారం ఐటీ కన్ను ఆంధ్రప్రదేశ్ పై పడినట్లు తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు ప్రముఖులపై ఐటీ దాడులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీకి చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లపై ఒక్కసారిగా విరుచుకుపడేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇందు కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి పెద్ద సంఖ్యలో ఐటీ సిబ్బంది సమాయత్తమవుతున్నట్లు చెబుతున్నారు.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాఖ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణ ఆస్తులపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.అయితే నారాయణ విద్యాసంస్థల్లో ఐటీ దాడులు జరుగుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఏపీ మంత్రి పి.నారాయణ తెలిపారు.ఇప్పటివరకు నారాయణ సంస్థలపై ఐటీ దాడులు జరగలేదని స్పష్టం చేశారు. అవన్నీ వదంతులేని కొట్టిపారేశారు.మరోవైపు విజయవాడలోని బెంజి సర్కిల్‌లో గల నారాయణ కాలేజీకి ఈరోజు ఉదయం ఐటీ అధికారులు వెళ్లినట్లు,ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి రికార్డులను సిద్ధం చేసి ఉంచాలని సిబ్బందికి సూచించినట్లు తెలుస్తుంది.ఇప్పటికే నెల్లూరులో తెదేపా నాయకుడు బీద మస్తాన్‌రావు కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహించారు.చెన్నైలోని బీఎంఆర్‌ సంస్థల కార్యాలయాల్లోనూ వారు ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు తెలిసింది.ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ ఐటీ రాజకీయంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

అవును హరీష్ రావు, నేను పోటీ పడుతున్నాం: కేటీఆర్

ఈ మధ్య తెలంగాణ రాజకీయాలు.. అందునా ముఖ్యంగా తెరాస రాజకీయాలు కేటీఆర్, హరీష్ రావు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ ఇద్దరి నేతల మధ్య మనస్పర్థలు ఉన్నాయని.. కేటీఆర్ ని సీఎం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ కావాలనే హరీష్ రావుని దూరం పెడుతున్నారని.. హరీష్ రావు త్వరలో పార్టీ వీడే అవకాశం ఉందని వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తాజాగా కేటీఆర్ స్పష్టం చేసారు. అంతేకాదు హరీష్ రావుని పొగడ్తలతో ముంచెత్తారు.     గురువారం సిరిసిల్లలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. అభివృద్ధిలో మేమిద్దరం పోటీ పడుతున్నామని చెప్పుకొచ్చారు. కాలంతో పాటు పోటీపడి హరీష్ కాళేశ్వరం ప్రాజెక్టును పరిగెత్తిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే మన బతుకులు కూడా ముడిపడి ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ అప్పజెప్పిన బాధ్యతలను నిర్వర్తిస్తూ బంగారు తెలంగాణలో భాగస్వాములవుతున్నామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మా ఇద్దరికి ఏవేవో మనస్పర్థలు ఉన్నాయని ఎవరెవరో చెబుతున్నారని.. అవన్నీ ఒట్టి పుకార్లేనని ఆయన కొట్టిపారేశారు. ఎస్ మేమిద్దరం పోటీ పడుతున్నాం. అందరూ అనుకున్నట్లుగా కాదు అభివృద్ధిలో మాత్రమేనని కేటీఆర్ చెప్పుకొచ్చారు. మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా బ్రహ్మాండంగా కలిసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకుపొదామని ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా కేటీఆర్ పనితీరుపై హరీష్ రావు ప్రశంసలు గుప్పించారు. ఆత్మహత్యల సిరిసిల్ల, సిరుల ఖిల్లాగా మారిందంటే పూర్తి క్రెడిట్ కేటీఆర్‌దేనని అన్నారు. సిద్దిపేట రికార్డ్ మెజార్టీ దాటేలా సిరిసిల్లలో మెజార్టీ రావాలని ఆకాంక్షించారు. సిరిసిల్ల కార్యకర్తలు పోటీపడి పని చేయాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

విజయశాంతి,బాలయ్య,చిరు కలిసి ప్రచారం చేయనున్నారా?

  తెలంగాణ లో ముందస్తు ఎన్నికలు రావటం,తెరాస ప్రభుత్వాన్ని గద్దె దింపటానికి తెలుగు దేశం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటంతో ఎన్నికల ప్రచారం ఎలా ఉండబోతుందో అని అందరికి ఆసక్తి నెలకొంది.ఇప్పటికే తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే , నటుడు బాలకృష్ణ ఖమ్మం జిల్లా లో పర్యటించి ప్రచారం ప్రారంభించారు.అలానే కాంగ్రెస్ పార్టీ విజయశాంతికి ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచార భాద్యతలు అప్పగించటంతో అన్ని నియోజక వర్గాల్లో పర్యటించి ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.చిరంజీవి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్నారు.మరి టీడీపీ,కాంగ్రెస్ పొత్తుతో ఏకమవుతున్న వీరు ఒకే వేదికపై ప్రచారం చేస్తే కన్నుల పండుగగా ఉంటుందని కార్యకర్తలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు టీఆర్ఎస్ నేతగా ఉన్న విజయశాంతి ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.ఇప్పుడు ఇద్దరు ఒకటే పార్టీ కాబట్టి పార్టీ ఆదేశాల మేరకు కలిసి పని చేయవలసి వస్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని విజయశాంతి తెలిపినట్లు సమాచారం.మరి ఈ ముగ్గురి కలయిక ఎప్పుడో? వీరి ప్రచారం తో రాజకీయ వాతావరణం ఎంత వేడెక్కనుందో?.