తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసినందుకు నాలుగేళ్లు జైలు శిక్ష.!!

జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా చూసుకుంటేనే ఆ జన్మకో అర్ధం ఉంటుంది. కానీ తల్లిదండ్రుల విలువ అర్ధం చేసుకోలేని కొందరు.. ఎదిగే వరకు తల్లిదండ్రుల నీడలో బ్రతుకుతారు.. ఎదిగాక వారిని దూరంగా ఉంచి పట్టించుకోవడం మానేస్తారు. అయితే అలాంటి వారి మీద చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతుంటారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల్ని పట్టించుకోని కుమారుడుకి కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది.     అహ్మదాబాద్‌కు చెందిన రాంఛోద్‌భాయ్ సోలంకి, జసుమంతి సోలంకికి ఇద్దరు కుమారులు. వృద్ధాప్యంలో ఉన్న ఆ దంపతులకు కొడుకులతో వివాదం నడుస్తోంది. ఇద్దరు కుమారులు తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోవడంతో.. తప్పనిసరి  పరిస్థితుల్లో 2013లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. కొడుకుల నుంచి తమకు ప్రతి నెలా కొంత డబ్బు అందేలా చూడాలని కోరారు. ఆ దంపతుల కష్టాలను చూసిన కోర్టు.. ప్రతి నెలా తల్లిదండ్రులకు ఒక్కొక్కరు రూ.900 చొప్పున ఇవ్వాలని ఆదేశించింది. అప్పటి నుంచి మొదటి కుమారుడు దయాభాయ్ మాత్రం ప్రతి నెలా తల్లిదండ్రులకు డబ్బు చెల్లిస్తున్నాడు. రెండో కుమారుడు కాంతి భాయ్ మాత్రం సరిగా డబ్బు ఇవ్వడం లేదు. రెండో కుమారుడి నుంచి డబ్బు సరిగా అందకపోవడంతో.. ఆ దంపతులు మళ్లీ 2015లో కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఏప్రిల్‌లోనే నాలుగేళ్లు జైలు శిక్ష విధించాలని కోర్టు నోటీసులు పంపిందట. కానీ అరెస్ట్ వారెంట్ మాత్రం రాలేదట. ఆ తర్వాత కూడా అతడు డబ్బు చెల్లించకపోవడంతో శిక్షను ఖరారు చేసింది. మొత్తానికి కోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పు తల్లిదండ్రుల్ని పట్టించుకోని పిల్లలకు గట్టి సంకేతాలు పంపిందనే చెప్పాలి.

కొండగట్టు భాదితులకు సాయం అందేదెప్పుడు?

  కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడిన ప్రమాదంలో 62 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడిన ఘటన అందరికి తెలిసిందే.మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2.50 లక్షలు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.కానీ సంఘటన జరిగి నెలరోజులు కావొస్తున్నా బాధితులకు నేటికీ పరిహారం మంజూరు కాలేదు.ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ ద్వారా ఆపద్బంధు పధకం కింద రూ.50 వేలు మాత్రమే చెల్లించే వెసులుబాటు ఉండటంతో గత నెల 19 నే  జిల్లా కలెక్టర్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం రాష్ట్ర సచివాలయానికి నివేదిక పంపినప్పటికీ పరిహారం మంజూరీ ఉత్తర్వులపై సీఎం సంతకం చేయాల్సి ఉండగా ఎన్నికల నియమావళి అడ్డంకిగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు.ఎన్నికల కమిషన్‌ నుంచి అనుమతి తీసుకున్నాకగానీ నిధుల మంజూరీపై నిర్ణయం తీసుకోలేమని సీఎంఆర్‌ఎఫ్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.ప్రభుత్వం భాదితులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నప్పటికీ రాకపోకలకు అయ్యే ఖర్చులతో కుదేలవుతున్నారు.ఆర్టీసీ సంస్థ రూ.3 లక్షల చొప్పున మంజూరు చేయగా మొదట చేతి ఖర్చుల నిమిత్తం రూ.20 వేలు ఇచ్చింది.ఆర్ధిక ఇబ్బందులతో భాదపడుతున్న నిరుపేద కుటుంబాలు సాయం అందేదెప్పుడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మహాకూటమి చర్చలకు అమావాస్య అడ్డు

  సాధారణంగా ముఖ్యమైన పని మొదలు పెట్టినప్పుడు అంతా మంచి రోజు మంచి మూహూర్తం చూసుకొని మొదలు పెడతారు.అమావాస్య రోజు ఏ పని ప్రారంభించినా అది ముందుకు సాగదు అని అందరూ విశ్వసిస్తారు.అందుకేనేమో ఈ రోజు జరగాల్సిన మహాకూటమి చర్చని కూడా వాయిదా వేసుకున్నాయి కాంగ్రెస్,తెదేపా,సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలు.తెరాస ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే లక్ష్యంతో  తెదేపా, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని మహాకూటమిగా ఏర్పడ్డాయి.కానీ ఇంతరకు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ మాత్రం పూర్తికాలేదు.దీంతో సీట్ల సర్దుబాటుపై చర్చించి ఓ కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్‌, తెదేపా, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీ ముఖ్య నేతలు సమావేశమవ్వాల్సిన నేపధ్యంలో అమావాస్య కారణంగా సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

మరో పరువుహత్య?

  మిర్యాలగూడలో ప్రణయ్ హత్య.. హైదరాబాద్లో మాధవిపై దాడి మరువకముందే మరో పరువుహత్య జరిగింది. ప్రేమను తుంచలేక పరువు పేరుతో నిండు ప్రాణాలు బలితీసుకుంటున్నారు. తాజాగా కరీంనగర్‌ జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. తాడికల్‌కు చెందిన గడ్డి కుమార్‌ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. తాడికల్‌ శివారులోని వంకాయగూడెం గ్రామం వద్ద ఓ పొలంలో మంగళవారం ఉదయం అతడి మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. కుమార్‌కు అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే విషయం తెలిసిన యువతి కుటుంబసభ్యులు కుమార్‌ను బెదిరించినట్లు తెలుస్తోంది. యువతిని మర్చిపోవాలని లేదంటూ చంపేస్తామని యువకుడిని చాలా సార్లు హెచ్చరించారు. అయినప్పటికీ యువతితో కుమార్ ప్రేమను కొనసాగించాడు. ఈ క్రమంలో కుమార్ శవమై కనిపించాడు. దీంతో యువతి బంధువులే కుమార్‌ను చంపేశారని ఇది ఖచ్చితంగా పరువు హత్యే అని యువకుడి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న శంకరపట్నం పోలీసులను గ్రామస్థులు అడ్డుకున్నారు. పోలీసు వాహనంపై దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ కరీంనగర్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో ఈ మార్గంలో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

ఆనాడు పాండవులు..ఈనాడు మావోయిస్టులు

  ఛత్తీస్‌గఢ్‌ - ఆంధ్రా సరిహద్దుల్లో ఇడుమా బెటాలియన్‌ డిప్యూటీ కమాండర్‌ పొడియం ముడా అలియాస్‌ మల్లేశ్‌ను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.సుకుమా జిల్లాకు చెందిన ముడా మొత్తం 116 మంది భద్రతా సిబ్బంది మృతి కేసుల్లో కీలక పాత్ర పోషించినట్టు జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ తెలిపారు.ముడా గతంలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన మంత్రి మహేంద్ర కర్మ హత్య సహా మొత్తం 15 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని ఎస్పీ వివరించారు.అతడి నుంచి పెద్ద ఎత్తున డిటోనేటర్లు, జిలెటిన్‌ స్టిక్స్‌ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఆనాడు పాండవులు జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను దాస్తే నేడు మావోయిస్టులు ఒక చెట్టు తొర్రలో తమ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రంగా ఉంచారు.ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం మినప అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు చేపట్టిన గాలింపు చర్యల్లో ఇవి బయటపడ్డాయి. ఒక చెట్టులో బర్మా తుపాకీ, ఐఈడీ పేలుడు పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బురకాపాల్‌ సమీపంలో ప్రమాదకరమైన మూడు స్పైక్‌ రంధ్రాలను కనుగొని నిర్వీర్యం చేశారు.

బీజేపీ.. ఆపరేషన్ తెలంగాణ

  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు నెలలు కూడా సమయం లేదు. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రణాళికలు, ప్రచారాలతో బిజీబిజీ అయిపోయాయి. ప్రధానంగా తెరాస, మహాకూటమి మధ్య పోటీ జరగనుంది. అధికారం మాది అంటే మాది అంటూ దూసుకుపోతున్నాయి. అయితే ఎప్పటినుండో దక్షిణాదిలో పాతుకుపోవాలని చూస్తున్న బీజేపీ తెలంగాణ మీద ప్రత్యేకదృష్టి పెడుతోంది. ఇప్పటికిప్పుడు అధికారం పొందకపోయినా బలమైన పార్టీగా ఎదగాలని చూస్తోంది. అందుకే తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది కానీ కొన్ని స్థానాల మీదనే ప్రత్యేక దృష్టి పెట్టాలనుకుంటుంది. దానిలో భాగంగానే 30 స్థానాలను టార్గెట్ గా పెట్టుకుందట. దీంతో కనీసం 15 స్థానాలైనా గెలిచే అవకాశం ఉంటుందని బీజేపీ భావిస్తోంది. 15 స్థానాలు ఉంటే ఆటోమేటిక్ గా రాష్ట్రంలో కీలక పార్టీ అవుతుంది. '119 స్థానాల్లో పోటీ చేయి.. 30 స్థానాలు టార్గెట్ చేయి.. 15 స్థానాలు గెలువు.. కింగ్ మేకర్ అవ్వు' ఇది ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ ఫార్ములా. అంతేకాదు తెలంగాణ ఎన్నికల ప్రచారం విషయంలో కూడా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల ప్రచారానికి 15మంది పార్టీ సీఎంలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 100మంది ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి నేతలు రాబోతున్నారట. మొత్తానికి బీజేపీ తెలంగాణను బాగానే టార్గెట్ చేసినట్టుంది.

ఖమ్మం టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి సెగ

  సాధారణంగా ఎన్నికల ప్రచారానికి సభలు నిర్వహిస్తారు.కానీ ఇందుకు భిన్నంగా ఓ నియోజకవర్గ అభ్యర్థిని మార్చాలని అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభ నిర్వహించటం అరుదు.ఖమ్మం జిల్లా  వైరా నియోజక వర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌లాల్‌ ని మార్చాలని ఆ పార్టీ అసంతృప్తి నేతలు డిమాండ్‌ చేశారు. ఐదుమండలాల నుంచి వేలాదిమంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులను అసంతృప్తులు సమీకరించి వైరాలో భారీ బలప్రదర్శన, సభ నిర్వహించారు.టీఆర్‌ఎస్‌ అసంతృప్తి నాయకుడు బొర్రా రాజశేఖర్‌ అధ్యక్షతన ఈ సభ జరిగింది.గత నాలుగేళ్లలో మదన్‌లాల్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలను అనేక కేసుల్లో ఇరికించి వేధించారని విమర్శించారు. తనకు నచ్చని నాయకులు, కార్యకర్తలను జైలుపాలు చేశారని విమర్శించారు.మదన్‌లాల్‌ వైరాలో పోటీచేస్తే టీఆర్‌ఎస్‌ను ఓడించటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. వేరే ఏ నాయకుడినైనా వైరాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నిలబెడితే గెలిపించి కేసీఆర్‌కు కానుక ఇస్తామని ప్రకటించారు.మదన్‌లాల్‌ అభ్యర్థిత్వాన్ని మార్చాలనే డిమాండ్‌తో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గానికి చెందిన అసంతృప్తి నేతలు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ లో పాల్గొనేందుకు లంబాడీ తండా నుంచి బయల్థేరి వెళ్తున్న ఎంపీ వర్గీయులకు ఆ ర్యాలీని వ్యతిరేకించిన మదన్‌లాల్‌ వర్గీయులు పరస్పరం ఎదురు దాడి చేసుకున్నారు.ఓ వైపు వర్గ పోరు మరో వైపు అసంతృప్తి సభలు దీంతో మదన్ లాల్ గెలుపు కన్నా ఓటమి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.మరి అభ్యర్థిని మార్చి పార్టీని గెలిపించుకుంటారో?లేదో?

పొత్తులో సీట్ల సర్దుబాటు కొలిక్కిచేరేనా?

  ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెరాస ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే లక్ష్యంతో  తెదేపా, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని మహాకూటమిగా ఏర్పడ్డాయి.పొత్తులో భాగస్వామ్యం కావటంతో ఒకే వేదికపై పలు పార్టీల నేతలు పాల్గొని ప్రచారం కూడా ముమ్మరం చేశారు.ఇప్పటికే కూటమి పార్టీల ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక ముసాయిదాని పార్టీ అధ్యక్షులు సమీక్షించారు.కానీ ఇంతరకు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ మాత్రం పూర్తికాలేదు.దీంతో మహాకూటమి ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక ముసాయిదా ఆమోదం,సీట్ల సర్దుబాటుపై చర్చించి ఓ కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్‌, తెదేపా, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీ ముఖ్య నేతలు సమావేశమవుతున్నారు.     తెదేపా, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలు ఇప్పటికే ప్రాథమికంగా తాము కోరుకుంటున్న స్థానాలపై కాంగ్రెస్‌కు స్పష్టత ఇచ్చాయి.ఈ నేపథ్యంలో ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలి? ఎవరెవరికి ఏయే స్థానాలు కేటాయించాలనే అంశాలపై చర్చించి నిర్ణయానికి రానున్నారు. గెలుపు ప్రాతిపదికగానే స్థానాలను తీసుకోవాలనేది సీట్ల సర్దుబాటులో ప్రధాన అంశం.ఈ చర్చలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెదేపా తెలంగాణ అధ్యక్షుడు రమణ, చాడ వెంకటరెడ్డి, కోదండరాం పాల్గొంటారు. నేరుగా ప్రధాన నేతలే చర్చలకు దిగుతుండడంతో సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వస్తుందని కాంగ్రెస్‌ ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు.ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈ నెల 18వ తేదీ లోపు పూర్తి స్థాయిలో విడుడల చేయాలని టీపీసీసీ నిర్ణయించింది.పోటీ చేసే అన్ని స్థానాల అభ్యర్థులను ఒకేసారి ప్రకటించనున్నారు.

డిసెంబర్ 12న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది

షాపూర్‌నగర్‌లో నిర్వహించిన ‘కాంగ్రెస్‌ మహిళా గర్జన’ సభలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ పాలనపై నిప్పులు చేరగటంతో పాటు,హామీల జడివాన కురిపించారు.ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వని కేసీఆర్‌కు మహిళలను ఓట్లు అడిగే హక్కు ఉందా? అని ఆయన ప్రశ్నించారు.ముదునష్టపు కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రంలో మహిళలు, మహిళా సంఘాలు, డ్వాక్రా గ్రూపు మహిళలందరికి అన్యాయం జరిగిందని ఉత్తమ్ ఆరోపించారు.మహిళల బతుకులు బాగుపడితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్‌ పార్టీ నమ్ముతోందన్నారు.     డిసెంబర్‌ 12న కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ఉత్తమ్‌ ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డ్వాక్రా సంఘాలకు రూ. లక్ష చొప్పున గ్రాంట్ ఇస్తామని, ఒక్కో సంఘానికి వడ్డీ లేకుండా రూ. 10 లక్షల రుణాలు మంజూరు చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆ వడ్డీ భారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు.మోదీ పరిపాలనలో వంటగ్యాస్‌ రూ.970కి చేరిందని.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలనంటుతున్నాయని ఉత్తమ్‌కుమార్‌ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు ఏడాదికి 6 వంటగ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్నారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న కుటుంబసభ్యుల్లోని ప్రతి మనిషికి నెలకు ఏడు కిలోల సన్నబియ్యంతో పాటు ఉప్పు, పప్పు, చక్కెర సహా 9 రకాల వస్తువులు ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా నిత్యావసర వస్తువులు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని‌ హామీ ఇచ్చారు.వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, బీడీ కార్మికులకు నెలకు రూ.2వేలు, దివ్యాంగులకు రూ.3వేల చొప్పున పింఛన్‌ ఇస్తామని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హామీ ఇచ్చారు.డబుల్ బెడ్ రూం పథకాన్ని మార్చి రూ.5 లక్షలు ఇస్తామని, 2లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ప్రకటించారు.

అసెంబ్లీ రద్దుతోనే కేసీఆర్‌ పతనం

మహాకూటమిగా ఏర్పడిన పార్టీలు ప్రచారం సందర్భంగా ఒకే వేదికపైకి చేరాయి.టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి జగిత్యాలలో మహాకూటమి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఒకే వేదికపై కనిపించారు.ఈ సందర్బంగా మాట్లాడిన రమణ ప్రధాని మోదీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు.ప్రచారం కోసం కేసీఆర్‌ కుటుంబం హెలికాప్టర్లలో తిరుగుతోందని మండిపడ్డారు.కొండగట్టు మృతులను మాత్రం ముఖ్యమంత్రి పరామర్శించలేదని, కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకే కూటమిగా ఏర్పడినట్టు చెప్పారు.జగిత్యాల నుంచే మహాకూటమి జైత్రయాత్ర ప్రారంభమవుతుందన్నారు. సీట్లు, వ్యక్తిగత ప్రయోజనాలేమీ లేవని, ప్రజా సంక్షేమం కోసమే తామంతా ఏకమయ్యామని స్పష్టంచేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ఎన్నికలే దేశానికి దిక్సూచిగా నిలుస్తాయని రమణ అభిప్రాయపడ్డారు.     కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కలిగించటమే తమ లక్ష్యమని జీవన్ రెడ్డి అన్నారు.అసెంబ్లీ రద్దుతోనే కేసీఆర్‌ పతనం మొదలయిందన్న జీవన్ రెడ్డి..తొమ్మిది నెలల ముందే కేసీఆర్‌ కుటుంబం నుంచి ప్రజలకు విముక్తి కల్గిందని వ్యాఖ్యానించారు.కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేసినట్టు అయితే ఇన్ని ఉద్యమ పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తాయని ఆయన ప్రశ్నించారు.రాష్ట్ర భవిష్యత్తు కోసమే మహాకూటమి అని చెప్పారు.నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని లూటీ చేశారని విమర్శించారు. మిగులు బడ్జెట్‌ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని.. రాష్ట్ర ఏర్పాటుతో కేసీఆర్‌ కుటుంబానికి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.

కనిపించకుండా పోయాడని కేసు మూసేస్తున్నారు

రెండేళ్ల క్రితం జేఎస్‌యూలోని మహిమండ్వి హాస్టల్ నుంచి కనిపించకుండా పోయిన నజీబ్‌ అహ్మద్‌ కేసు మూసివేసేందుకు దిల్లీ హైకోర్టు సీబీఐ అధికారులకు అనుమతి ఇచ్చింది.సీబీఐ విచారణ నిలిపివేయడంపై నజీబ్‌ తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.‘రెండేళ్లు అయ్యింది. కోర్టు మాకు న్యాయం చేస్తుందని చాలా నమ్మకం పెట్టుకున్నాను. కానీ, రెండేళ్లలో ఈ కేసు విచారణ ఒక అంగుళం కూడా కదల్లేదు. భద్రతా సిబ్బంది కోర్టును తప్పుదోవ పట్టించారు. నేను సుప్రీంకోర్టుకు వెళ్తాను. కొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసు విచారణ ముందుకు సాగనివ్వకుండా చేశారు’ అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.     2016 అక్టోబర్ 15 నుంచి అహ్మద్ కనిపించకుండా పోయాడు. అంతకు ముందురోజు రాత్రే ఏబీవీపీ విద్యార్ధి సంఘం నేతలతో అతడు గొడవకు దిగడం... ఆ మరుసటి రోజే జాడ లేకుండా పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.దీనిపై కేసు నమోదు చేసుకున్నదిల్లీ పోలీసులు విచారణ ప్రారంభించారు.ఈ కేసు విచారణ గతేడాది మే 16న సీబీఐకి వచ్చింది.అన్ని కోణాల్లోను విచారించి వెతికినప్పటికీ నజీబ్‌ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఈ కేసును మూసివేసేందుకు సీబీఐకి దిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది.ఈ కేసు విచారణ నుంచి సీబీఐ తప్పుకొంటున్నందున సిట్‌ కు అప్పగించాల్సిందిగా కోరుతూ నజీబ్‌ తల్లి నఫీస్‌ మరో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను జస్టిస్‌ ఎస్‌ మురళీధర్‌, జస్టిస్‌ వినోద్‌ గోయల్‌తో కూడిన ధర్మాసనం తిరస్కరించింది.

తెలంగాణకి గుడ్ న్యూస్.. ఏపీకి బ్యాడ్ న్యూస్

  ఏపీని కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందనే అభిప్రాయం రోజురోజుకి బలపడుతోంది. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం దగ్గరనుండి విభజన చట్టంలోని హామీలు నెరవేర్చడం విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపింది. ఆఖరికి వెనుకబడిన ఏడు జిల్లాలకు.. ఒక్కో జిల్లాకు 50 కోట్లు చొప్పున కేటాయించిన 350 కోట్లను ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుంది. దీంతో ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మీద ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండిచేయి చూపింది. ఏపీలో ఏడు వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు విడుదల విషయంలో కేంద్రం ఇంకా ఎటూ తేల్చడంలేదు. ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన రూ.350 కోట్లను మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అంతకుముందు విడుదల చేసిన నిధులకు సంబంధించిన యూసీలు, ఖర్చుల వివరాలు అందించని కారణంగా వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు కేంద్రం గతంలో వెల్లడించింది. దీంతో తక్షణమే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలాఖరు కల్లా యూసీలు, ఖర్చుల వివరాలను అందించింది. ఆర్నెళ్లు గడుస్తున్నా ఈ నిధుల విడుదలకు సంబంధించి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏపీతో పాటు పెండింగ్‌లో పెట్టిన తెలంగాణకు చెల్లించాల్సిన రూ.450 కోట్ల నిధులను మాత్రం తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక, డీవోపీటీ అధికారులు ఉత్తర్వులు విడుదల చేశారు. అయితే, ఏపీ విషయంలో మాత్రం ఎలాంటి పురోగతి లేదని తేల్చి చెప్పారు. ఏపీలో వెనుకబడిన ఏడు జిల్లాలకు రూ.50 కోట్లు చొప్పున మొత్తం రూ.350 కోట్లు, తెలంగాణలో తొమ్మిది జిల్లాలకు రూ.450 కోట్ల మేర చెల్లిస్తూ వస్తోన్న కేంద్రం ఏపీకి మాత్రం మొండిచేయి చూపింది.

హైదరాబాద్‌ రోడ్ల కంటే గ్రామాల్లో రోడ్లు అద్భుతం

హైదరాబాద్‌ నగర శివారు షాపూర్‌నగర్‌లో నిర్వహించిన ‘మహిళా కాంగ్రెస్‌ గర్జన’ సభకు హాజరైన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకురాలు డీకే అరుణ తెరాస అధినేత కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు.తెలంగాణ రాష్ట్రం ప్రజల కోసం కాకుండా కేసీఆర్‌ కుటుంబ కోసమే వచ్చినట్లుందని ధ్వజమెత్తారు.తెలంగాణలో నిరుద్యోగులు, మహిళలు, పేదలు ఇలా అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతోందన్నారు.హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేస్తామని చెప్పిన కేసీఆర్‌ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఇప్పుడు వేస్తున్న రహదారుల కంటే గ్రామాల్లో కాంగ్రెస్‌ హయాంలో వేసిన రోడ్లే ఇంకా మన్నికగా ఉన్నాయన్నారు. పరిపాలించేందుకు ప్రజలు ఐదేళ్ల అధికారం కట్టబెడితే తొమ్మిది నెలల ముందుగానే ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.   తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడి నుంచి ఆంధ్రవాళ్ళను తరిమికొడతామన్న కేసీఆర్‌... జీహెచ్‌ఎంసీ ఎన్నిక సమయంలో వారికి ముళ్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని చెప్పారని డీకే అరుణ గుర్తుచేశారు.కేసీఆర్‌ సమయానికి తగ్గట్లుగా మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.కేసీఆర్ తన అధికారాన్ని అడ్డంపెట్టుకుని రాజధానిలోని ఆంధ్రుల ఇళ్లను లాక్కుంటామని భయపెట్టారని, ఆ భయంతోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఆంధ్రా సెటిలర్లు ఓటేశారని అరుణ ఆరోపించారు.తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని,దీనివల్ల ఆంధ్రాలో మా పార్టీ నష్టపోయిందని,వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆమె కోరారు.

స్వచ్ఛభారత్‌ మరచిన బీజేపీ మంత్రి

  రాజస్థాన్ ఎన్నికలు జరగనుండటంతో ప్రచారం ప్రారంభించిన ఓ బీజేపీ మంత్రి బహిరంగ మూత్ర విసర్జన చేసి వార్తల్లో నిలిచారు.అంతేకాదు అలా చేయడం పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయమని విచిత్ర వివరణ ఇచ్చుకున్నారు.అజ్‌మేర్‌లోని ఓ ప్రాంతంలో గోడ వద్ద భాజపా పోస్టర్‌ ఉండగా దాని పక్కనే భాజపా మంత్రి శంభూ సింగ్‌ మూత్ర విసర్జన చేస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.దీనిపై నెటిజన్లు సింగ్‌ను బాగా ట్రోల్‌ చేస్తుండటంతో ఆయన స్పందించారు.మీడియాతో మాట్లాడిన మంత్రి 'బహిరంగ మూత్ర విసర్జన వ్యాధులకు దారి తీస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయడమనేది సమస్య కాదు కానీ అది నిర్మానుష్య ప్రదేశమై ఉండాలి. నేను మూత్ర విసర్జన చేసిన ప్రదేశం కూడా నిర్మానుష్య ప్రాంతమే. అలాంటి ప్రాంతాల్లో ఎవరైనా మూత్ర విసర్జన చేస్తే వ్యాధులు వ్యాపించవు’ అంటూ వివరణ ఇచ్చుకున్నారు.దేశాన్ని బహిరంగ మల,మూత్ర రహిత దేశంగా మార్చాలి అని ప్రధాని మోడీ చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి సొంత పార్టీ నేతలే గండి కొడుతున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

ఎన్నికల నియమావళి అమలుపై ప్రత్యేక దృష్టి

  తెలంగాణలో ఎన్నికల నియమావళి అమలులో ఉండటం,ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ తేదీని కూడా ప్రకటిచటంతో మహా నగరం లో ఎన్నికల నియమావళి అమలుపై ద్రుష్టి సారించారు అధికారులు. ప్రధాన రహదారులు, పైవంతెనల పక్కన, విద్యాసంస్థల ప్రాంగణాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన బోర్డులు, గోడపత్రాలను తొలగించడంపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.పది ప్రత్యేక వాహనాలు, ఎస్‌ఎఫ్‌ఏలు, పారిశుద్ధ్య కార్మికులు, విపత్తు నిర్వహణ దళం, సహాయ వైద్యాధికారులు ఆయా కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.పలు పార్టీల నేతలు గోడలపై పెద్దపెద్ద అక్షరాలతో రాసిన రాజకీయ నినాదాలు, ప్రకటనలపై దృష్టిపెట్టారు.విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు ఇతరత్రా నిర్మాణాల గోడలపై రాతలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు.వాటిపై సున్నం వేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.భవన సముదాయాలపై, ఇళ్లపై, ప్రైవేటు ఆస్తుల గోడలపై ఏర్పాటు చేసుకునే ప్రకటనలకు సదరు యజమానుల అనుమతి తప్పనిసరి అని, అనుమతి లేకపోతే ఉల్లంఘన కింద భావించి ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 కింద కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఒకసారి తొలగించిన ప్రకటనల్ని మళ్లీ ఏర్పాటు చేస్తే సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.డబ్బు పంపిణీ, అక్రమ ప్రకటనలు, ఇతర మార్గాల్లో ఓటర్లను ప్రలోభపెట్టే ఉల్లంఘనలపై జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసేందుకు సీ-విజిల్‌ అనే మొబైల్‌ అప్లికేషన్‌ను ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది.ఫిర్యాదు చేసిన 30 నిమిషాల్లోనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం నిబంధన.

అసెంబ్లీ రద్దును సవాల్‌ చేస్తూ డీకే అరుణ పిటిషన్‌

  తెలంగాణ రాజకీయం రోజురోజుకి వేడెక్కుతుంది. ఓ వైపు కాంగ్రెస్, తెరాస మీద మాటల యుద్ధంతో పొలిటికల్ హీట్ పెంచుతూనే మరోవైపు పిటిషన్లతో ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ అసెంబ్లీ రద్దును సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటీషనర్ తరపున న్యాయవాది నిరూప్‌రెడ్డి వాదనలు వినిపించనున్నారు. ఈ పిటిషన్‌‌లో తెలంగాణలో ముందస్తుగా అసెంబ్లీ రద్దును డీకే అరుణ తప్పుబట్టారు. ప్రభుత్వం రద్దు చేసిన తీరు రాజ్యాంగ విరుద్ధమని, శాసనసభను సమావేశ పర్చకుండా ఎలా ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండానే ప్రభుత్వాన్ని రద్దు చేశారని డీకే అరుణ పిటిషన్‌లో పేర్కొన్నారు. మరి ఈ పిటిషన్‌ పై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

శబరిమల తీర్పు.. రివ్యూ పిటిషన్.. ఏం జరుగుతుంది?

  సుప్రీంకోర్టు ఈమధ్య ఇచ్చిన సంచలన తీర్పుల్లో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం ఒక్కటి. అయితే ఈ తీర్పును కొందరు స్వాగతించిగా.. కొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసన గళం వినిపిస్తోంది. ముఖ్యంగా కేరళలో వేల సంఖ్యలో మహిళలు నిరసన ర్యాలీ కూడా చేపట్టారు. అయితే తాజాగా శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ అయ్యప్పభక్తుల సంఘం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. శైలజా విజయన్ అనే ఆ మహిళ ఈ రీవ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఇది ప్రజల ఆకాంక్షలకు విరుద్ధమైన తీర్పు అని పిటిషనర్ వాదించారు. శతాబ్దాల నిషేధాన్ని ఎత్తేయాలని పిటిషన్ వేసిన వ్యక్తులు అయ్యప్ప భక్తులు కారని అందులో స్పష్టంచేశారు. ఈ తీర్పు కోట్లాది మంది అయ్యప్ప భక్తుల ప్రాథమిక హక్కులను ప్రభావితం చేసేలా ఉందని ఆమె పిటిషన్‌లో తెలిపారు.

నగరి టికెట్ వివాదంపై చంద్రబాబు సమీక్ష

  టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు మరణించటం తో నగరి టికెట్ పై వివాదం నెలకొంది.గాలి తనయులు టికెట్ తమకు కావాలంటే తమకే కావాలని పోటీపడుతున్నారు.దీంతో నగరి టికెట్ వివాదంపై నియోజకవర్గం నేతలందరితో గత వారం ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు సమావేశమయ్యారు.నియోజకవర్గం నుంచి వచ్చిన దాదాపు 350 మంది ముఖ్యనేతలు, కార్యకర్తల అభిప్రాయాలను చంద్రబాబు సేకరించారు. గాలి కుటుంబంలో ఎవరికి టికెట్‌ ఇచ్చినా ఇబ్బంది లేదని వారంతా అధినేతకు స్పష్టంచేశారు.అయితే గాలి అన్నదమ్ముల తీరుపై అసహనం వ్యక్తం చేసిన సీఎం..కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు నగరి ఇన్‌చార్జ్‌గా ఉండేలా మాట్లాడుకుని రావాలని లేని పక్షంలో వేరే వారికి ఇన్‌చార్జ్ పదవి ఇస్తాను అని హెచ్చరించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో గాలి ముద్దుకృష్ణమ శిష్యుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నివాసంలో వారంతా సమావేశమై ఏకతాటిపైకి వచ్చారు.ఇదే విషయాన్ని బుద్దా వెంకన్నతో పాటు గాలి కుటుంబసభ్యులు చంద్రబాబును ఆయన నివాసంలో కలిసి వివరించారు.నగరి టిక్కెట్ తమ కుటుంబంలో ఎవరికి ఇచ్చినా ఇబ్బంది లేదని గాలి ముద్దు కృష్ణమనాయుడు సతీమణి, తనయులు చంద్రబాబుకు స్పష్టం చేశారు.తమ కుటుంబానికి కాకుండా వేరొకరికి టిక్కెట్ కేటాయించినా పార్టీ కోసం కృషి చేస్తామని వారు అధినేతకు చెప్పారు.

తెలంగాణలో ప్రియాంక గాంధీ ప్రచారం.!!

  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రాన్ని విడదీసిన పార్టీగా ఏపీలో వ్యతిరేకత అయితే మూటకట్టుకుంది కానీ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా తెలంగాణలో మైలేజీ సాధించి 2014 లో అధికారాన్ని మాత్రం పొందలేకపోయింది. దీంతో రాష్ట్రాన్ని ఇచ్చింది మేమే అనే విషయాన్నీ ఈసారైనా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తోంది. తెరాసను ఓడించి తెలంగాణలో జెండా ఎగరేయాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుంది. దానికోసం టీడీపీ, టిజెఎస్, సిపిఐ లాంటి పార్టీలను కలుపుకొని పోతుంది. అంతేకాదు ప్రచారం విషయంలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోన్నట్టు తెలుస్తోంది. ఇందిరాగాంధీ అన్నా, ఇందిరాగాంధీ కుటుంబమన్నా కాంగ్రెస్ శ్రేణులకు మొదటినుండి విరీతమైన అభిమానం. ఈ అభిమానాన్ని తట్టి లేపాలని కాంగ్రెస్ భావిస్తోందట. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎలాగూ ప్రచారానికి వస్తారు. సోనియాగాంధీ ఆరోగ్య సమస్యల కారణంగా ప్రచారానికి వచ్చే అవకాశాలు తక్కువున్నాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్, ప్రియాంక గాంధీని రంగంలోకి దింపాలని చూస్తోందట. రూపంలో అచ్చు తన నాయనమ్మ ఇందిరాగాంధీలా ఉండే ప్రియాంకకు.. యువతలో విశేష ఆదరణ ఉందనీ, ఆమె వాగ్దాటి, చరిష్మా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రియాంక రాకతో కొత్త ఉత్సాహం రావడమే గాక.. గతంలో కాంగ్రెస్ పార్టీని వీడిన వారు ఇందిరాగాంధీని గుర్తుచేసుకొని ఆమె మీద అభిమానంతో తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తారని కొందరు నేతల అభిప్రాయం. మరి ప్రియాంక గాంధీ నిజంగానే తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వస్తారా? తెలంగాణలో కాంగ్రెస్ ను విజయం దిశగా నడిపిస్తారా? చూద్దాం ఏం జరుగుతుందో.