Mnns raj dehi rape

ఆ రేపిస్టులంతా బీహారీలే : రాజ్ థాకరే

    బీహారీలఫై మరో సారి విరుచుకు పడ్డారు మహారాష్ర్ట నవ నిర్మాణ్ సేన అధినేత రాజ్ థాకరే. గత నెల ఢిల్లీ లో ఓ పారా మెడికల్ స్టూడెంట్ ఫై రేప్ చేసిన వ్యక్తులంతా బీహార్ నేపధ్యం కలిగిన వారేనని రాజ్ థాకరే అన్నారు. ఆ కామ పిశాచాలంతా బీహార్ నుండి వలస వచ్చిన వారేనని రాజ్ వెల్లడించారు.   ‘అసలు వీరంతా ఎవరు ? ఎక్కడ నుండి వచ్చారని ఎవరూ ప్రశ్నించడం లేదు.వారంతా బీహార్ వారేననే విషయంఫై ఎవరూ ఎందుకు స్పందించడం లేదు? బీహార్ కు వ్యతిరేకంగా మాట్లాడినందుకే నాఫై కేసులు పెట్టారు’, అని రాజ్ పేర్కొన్నారు. వారంతా బీహార్ వారేననే విషయం బయటి ప్రపంచానికి తెలియకుండా కొంత మంది జాగ్రత్త పడుతున్నారని రాజ్ వ్యాఖ్యానించారు.   ఢిల్లీ రేప్ ఘటన తనను మనో వేదనకు గురి చేసిందని రాజ్ అన్నారు. ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన వారి వల్లే ఢిల్లీ లో నేరాలు ఎక్కువయ్యాయని ముఖ్య మంత్రి షీలా దీక్షిత్ కూడా ప్రకటించారని రాజ్ గుర్తు చేశారు.   ఇక ఈ విషయం ఫై ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి నితీష్ కుమార్ ఎలా స్పందిస్తారో మాత్రం వేచి చూడాల్సిందే.

  Delhi rape name jyothi singh pande

ఢిల్లీ గ్యాంగ్ రేప్: విక్టిమ్ పేరు జ్యోతి సింగ్

    గత నెల 16 వ తేదీన ఢిల్లీ లో అత్యాచారానికి గురి అయి ఆ తర్వాత మరణించిన పారా మెడికల్ స్టూడెంట్ పేరు జ్యోతి సింగ్ పాండే. ఈ విషయాన్ని ఆమె తండ్రి బద్రీ సింగ్ పాండే వెల్లడించారు. లండన్ నుండి ప్రచురితమయ్యే ‘ద డైలీ మిర్రర్’ ప్రత్రిక’ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన తన కుమార్తె పేరును ప్రకటించారు.   ఈ కధనాన్ని ఆ పత్రిక నిన్నటి ఎడిషన్ లో ప్రకటించింది. జ్యోతి తల్లి పేరు ఆషా. జ్యోతి కి గౌరవ్ సింగ్, సౌరవ్ సింగ్ అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో బద్రీ లోడర్ గా పనిచేస్తుంటారు. అయితే, తన కుమార్తె జ్ఞాపకాలు ఆయనను వెంటాడుతూ ఉండటంతో ఆయన ఉత్తర ప్రదేశ్ లోని తన స్వస్థలానికి వెళ్ళిపోయారు.   ‘నా కుమార్తె ఏ తప్పూ చేయలేదు. ఆమె తనను తాను రక్షించుకొనే ప్రయత్నంలోనే చనిపోయింది. ఆమె అసలు పేరు ప్రపంచానికి తెలవాలని నేను కోరుకుంటున్నాను. అలా చేయడం వల్ల ఇలా అత్యాచారాలకు గురి అయిన ఇతర మహిళలకు దైర్యం లభిస్తుంది’, అని బద్రీ అన్నారు.   భారతీయ చట్టాల ప్రకారం అత్యాచారానికి గురి అయిన మహిళల పేర్లను వెల్లడించడం చట్ట విరుద్దం కాబట్టి దేశంలోని ఏ మీడియా సంస్థ ఆమె పేరును బయట పెట్టలేదు. అయితే, ఆ బాధితురాళ్ళ పేరును, ఆమె మరణించినట్లయితే ఆమె కుటుంబ సభ్యుల అంగీకారంతో మాత్రం వెల్లడించవచ్చు.

 Telangana decision soon

తెలంగాణాఫై నిర్ణయం దిశగా కాంగ్రెస్ ?

      ఇంత కాలం ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం విషయంలో నాన్చుడు ధోరణి అవలంభించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇక తెలంగాణా విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలనే అంతిమ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కేంద్ర మంత్రి షిండే చెప్పిన దాని ప్రకారం రిపబ్లిక్ దినోత్సవం సమయానికి కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది.   పార్టీ అధిష్టానం రాష్ట్ర కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను తెలుసుకొనే ప్రయత్నాలను ఇప్పటికే మొదలు పెట్టింది. హైదరాబాద్ తో కూడిన తెలంగాణా రాష్ట్రమే తమకు అంగీకారమని ఆ ప్రాంతానికి చెందిన పార్టీ నేతలు తమ అధిష్టానానికి చెప్పారు. ఇక తెలంగాణా అభివృద్ధి మండలి కూడా ఒక పరిష్కార మార్గంగా పార్టీ భావిస్తున్నట్లు ఇప్పటికే మీడియా లో పలు కధనాలు వచ్చాయి.   మరోవైపు తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి, హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేసే అవకాశాలను కూడా కాంగ్రెస్ పరిశీలిస్తోంది. ఈ విషయంలో ఓ అవగాహనకు రావడానికి చండీఘర్ విషయాన్ని అధ్యయనం చేస్తోంది. ఆ ప్రాంతానికి చెందిన పార్టీ సీనియర్ నేతలను ఇప్పటికే పార్టీ కలిసి ఇలా చేస్తే ఉండే కష్ట నష్టాలను తెలుసుకుంది.   అన్ని విషయాలను అధ్యయనం చేసిన పిదప ఇక తుది నిర్ణయం తీసుకోవాల్సిన భాద్యత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేతుల్లో ఉంది.

 Jana reddy delhi tour

జైపాల్ సాయానికి టి కాంగ్రెస్ నేతల రిక్వెస్ట్

      ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం విషయంలో కేంద్రంఫై వత్తిడి తెచ్చే కార్యాచరణను ఖరారు చేసేందుకు ఇటీవలే హైదరాబాద్ లో సమావేశం అయిన తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ నేతలు ఇక సీన్ ను ఢిల్లీ కి మార్చారు. కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణాఫై ఓ నెల రోజుల్లో నిర్ణయం ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పుడే, ఒక వారం పూర్తయిపోయింది.   దీనితో, ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి కె.జానా రెడ్డి ఈ రోజు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ని కలిసి ఈ విషయంలో తన వంతు ప్రయత్నాలు చేయాలని కోరినట్లు సమాచారం. నిన్న హైదరాబాద్ లో జరిగిన సమావేశం వివరాలను కూడా జానా రెడ్డి, జైపాల్ కు వివరించినట్లు తెలుస్తోంది. కేంద్రం నిర్ణయం తెలంగాణా కు అనుకూలంగా ఉండేలా తగిన విధంగా వత్తిడి తేవాలని ఆయన జైపాల్ కు సూచించినట్లు సమాచారం.   ఈ సమస్యకు నిజమైన పరిష్కారం ప్రత్యెక రాష్ట్రమేనని జానా రెడ్డి అన్నట్లు తెలుస్తోంది. జానా రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ అజాద్ ను కూడా తన ఢిల్లీ పర్యటనలో కలువనున్నారు.

Malala Yousafzai Pakistan discharge

హాస్పటల్ నుండి మలాలా డిశ్చార్జ్

      తాలిబన్ల ఆటవిక చర్యకు తీవ్రంగా గాయపడి లండన్ లోని క్వీన్ ఎలిజబెత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాకిస్తాన్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్ జాయ్ నిన్న ఆసుపత్రి నుండి తాత్కాలికంగా డిశ్చార్జ్ అయ్యారు.   పదిహేను సంవత్సరాల మలాలా తలఫై తాలిబన్లు గత అక్టోబర్ 9 న కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె ఎడమ కంటి ఫై భాగం నుండి ఓ బుల్లెట్ దూసుకువెళ్ళింది. ఆ బాలిక పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో ఆమెను పాకిస్తాన్ ప్రభుత్వం లండన్ కు తరలించింది. ఆమె ప్రస్తుతం కోలుకోవడంతో ఆమెను డిశ్చార్జ్ చేసామని ఆ ఆసుపత్రి ఓ ప్రకటనలో తెలియచేసింది. కాగా, భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఆమెకు ఈ నెల చివర్లో మరో శస్త్ర చికిత్స చేయాల్సిఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అప్పటి వరకూ ఆమె అవుట్ పేషంట్ గా ఉంటుందని ఆసుపత్రి వర్గాలు తెలియచేశాయి.   పాకిస్తాన్ లోని స్వాట్ లోయలో బాలికలు విద్యను అభ్యసించడంఫై తాలిబన్లు విధించిన ఆంక్షలను ప్రశ్నించిన పాపానికి ఆమెఫై తాలిబాన్లు కాల్పులు జరిపారు. వివిధ వర్గాలతో చిన్నభిన్నంగా ఉండే పాకిస్తాన్ ప్రజలంతా మలాలాఫై దాడిని మాత్రం ఖండించి ఆ బాలికఫై తమ అభిమానాన్ని చూపించుకొన్నారు.

dmk party

డియంకె పార్టీ శంకర మఠం కాదు: అళగిరి..!

  నిన్న మొన్నటి వరకు తీహార్ జైల్లోఉన్న తన కూతురు కనిమోలికోసం వగచిన కరుణానిధి తండ్రి హృదయం, ఆమె బెయిలుపై విడుదలయి బయటకి వచ్చేక ‘హమ్మయ్యా’ అని నిట్టూర్పు విడిచేలోగా పగబట్టిన త్రాచువంటి తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత, అయన కుటుంబంలో, పార్తీలోప్రటీ ఒక్కరినీ, ఒకరొకరిగా కేసుల్లో ఇరికిస్తూ ముప్పతిప్పలు పెట్టసాగింది. 88 ఏళ్ళ కురువృద్దుడు కరుణానిధి తానూ స్వయంగా ఆమెను ఎదుర్కొనే స్థితిలో లేనందున, ఆ పని చక్కగా చేస్తున్న తన రెండవ కుమారుడు స్టాలిన్ ను చూసి మురిసిపోతూ అతనే తన వారసుడని కొద్ది రోజుల క్రితమే ప్రకటించేశారు.   ఆవిధంగా ప్రకటించేముందు, తనకి అళగిరి అనే మరో కొడుకు ఉన్నాడని వృద్దాప్యం తెచ్చిన మతిమరుపులో మరిచిపోయేరో మరేమో తెలియదుగానీ, స్టాలినే ఇక ముందు పార్టీని నడిపిస్తాడని ప్రకటించేయడంతో, అళగిరికి కోపం వచ్చేసింది. ఒకనాడు తన తండ్రి చెప్పిన మాటనే మళ్ళీ తనకి గుర్తు చేస్తూ ‘ఈ విదంగా వారసుడిని ప్రకటించేయడానికి డియంకె పార్టీ ఏమి శంకర మఠం కాదని’ ఘాటుగా విమర్శించేడు.   తనుకూడా పార్టీపగ్గాలు చేప్పటి ఇవాళ కాకపొతే రేపయినా తమిళనాడుని ముఖ్యమంత్రి గా ఏలుకోవాలని కలలుగంటు కేంద్రమంత్రిగా డిల్లీలో ఉన్న అళగిరికి తండ్రి ప్రకటన ఘాడనిద్రలోంచి మేల్కొలిపినట్లయింది. గానీ, స్టాలిన్ ఇప్పటికే పార్టీపై పూర్తిపట్టు సాదించి ఉన్నాడు.   మరి, అళగిరి తన తంబి చేతిలోంచి పార్టీ పగ్గాలు లాకొంటాడా లేక పార్టీని రెండు ముక్కలుగా చీల్చుకొని జయలలితకి ఆనందం కలిగిస్తాడా అనేది చూడాల్సి ఉంది.  

 Akbaruddeen speech jagan

అక్బరుద్దీన్ వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో జగన్ పార్టీ ?

      ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఇటీవల నిర్మల్ లో హిందూ మతంఫై చేసిన మతపరమైన వ్యాఖ్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. ఎంఐఎం ఇటీవలే కాంగ్రెస్ తో తెగతెంపులు చేసుకొని జగన్ పార్టీతో జతకట్టిన విషయం తెలిసిందే.   ఆ పార్టీతో కలవడం ద్వారా తెలంగాణా ప్రాంతంలో బలపడదామని జగన్ పార్టీ నేతలు ఆలోచించారు. అలాగే, జగన్ తో చేతులు కలపడం ద్వారా, సీమాంధ్ర ప్రాంతాల్లో ముస్లిం జనాభా చెప్పుకోదగిన స్థాయిలో ఉన్న జిల్లాల్లో లభ్ది పొందుదామని ఎంఐఎం పార్టీ భావించాయి. ఈ రెండు పార్టీలు 2014 లో జత కట్టడానికి బహిరంగంగానే తమ ప్రయత్నాలు చేసుకొన్నాయి.   అయితే, మత తత్వాన్ని రెచ్చగొట్టే విధంగా అక్బరుద్దీన్ చేసిన తాజా వ్యాఖ్యలతో జగన్ పార్టీ నేతలు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అయితే, ఇక సెక్యులర్ పార్టీగా ఎంత మాత్రం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ఎంఐఎంతో జగన్ పార్టీ జతకడుతుందో లేదోమాత్రం వేచిచూడాల్సిందే.

Prakasam congress mla ycp

ప్రకాశం కాంగ్రెస్ ఎంఎల్ఏ ల చూపు జగన్ వైపు ?

          ప్రకాశం జిల్లాలోని అనేక మంది కాంగ్రెస్ శాసనసభ్యులు జగన్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేస్తే, తాము గెలవడం కష్టమని వారు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చి, జగన్ పార్టీ వైపు పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారు ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతూ, తమకు 2014 లో టికెట్ ఇచ్చేటట్లయితే, పార్టీ మారడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రాయబారాలు చేస్తున్నట్లు సమాచారం.   జిల్లాకు చెందిన నలుగురు కాంగ్రెస్ ఎంఎల్ఏ లు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దం అయి ఉన్నారు. వారిలో దర్శి ఎంఎల్ఏ శివ ప్రసాద రెడ్డి, అడ్డంకి ఎంఎల్ఏ గొట్టిపాటి రవి కుమార్ లకు ఆ పార్టీ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఆయా నేతల శక్తి సామర్ధ్యాలు, వారి నియోజక వర్గాల్లో వారికున్న ప్రజాదరణ వంటి అంశాలను ప్రస్తుతం జగన్ పార్టీలోని సీనియర్ నేతలు అంచనా వేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చిన వారందరినీ చేర్చుకోకూడదని వారు భావిస్తున్నారు.   జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాస రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ ఎంఎల్ఏ లు మరో ఆలోచన లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తమ దృష్టి మళ్ళించారు. జిల్లాకు చెందిన అనేక మంది కాంగ్రెస్ ఎంఎల్ఏ లు తమ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపించారని బాలినేని ప్రకటించారు కూడా. అయితే, ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం జగన్ మోహన్ రెడ్డిదే నని ఆయన అన్నారు.   జిల్లాలోని సీనియర్ కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం లోపించడం కూడా ఈ పరిణామాలకు కారణంగా తెలుస్తోంది.

 Tamil nadu gang rape

పుదుచ్చేరి లో గ్యాంగ్ రేప్

      ఢిల్లీ లో గ్యాంగ్ రేప్ కు గురి అయి, ఆ తర్వాత గాయాలతో మరణించిన యువతి ఘటన జరిగి కొద్ది రోజులు కూడా కాకమునుపే పుదుచ్చేరి లో మరో గ్యాంగ్ రేప్ జరిగింది. పుదువై లో కొంత మంది యువకులు ఓ ఇంటర్ స్టూడెంట్ (17) ని కిడ్నాప్ చేసి, గ్యాంగ్ రేప్ చేసిన అనంతరం ఓ బస్ స్టాండ్ లో వదిలి వెళ్లారు.   ఈ నెల ఒకటో తేదీన ఆమె విల్లియనూర్ బస్ స్టాండ్ లో బస్ కోసం వేచిచూస్తోంది. ఆ సమయంలో ఆమెకు గతంలోనే పరిచయం ఉన్న ఓ బస్ కండక్టర్ ఆమె తల్లికి ఓ రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయని, ఆసుప్రతిలో ఉందని, వెంటనే తీసుకువెళ్తానని చెప్పి తన బస్సులో ఎక్కించుకొని ఓ రహస్య ప్రదేశానికి తీసుకు వెళ్ళాడు.   అక్కడ ఆమెఫై మత్తు మందు చల్లి ఆ వ్యక్తితో పాటు మరి కొంత మంది కలిసి ఆమెఫై గ్యాంగ్ రేప్ చేశారు. అయితే, ఆమె తల్లి తండ్రులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా ముందుగా పట్టిన్చుకోలేదని సమాచారం. అయితే, ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు ఆ బస్ కండక్టర్ తో సహా మరో వ్యక్తిని అరెస్టు చేశారు.మూడవ వ్యక్తి కోసం ప్రస్తుతం పోలీసులుగాలిస్తున్నారు. రేప్ సంఘటనతో ఆగ్రహించిన స్థానికులు ఆ ప్రాంతంలో ఆందోళనకు దిగారు.   ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురి అయిన ఆమె తండ్రి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

 Stalin dmk karunanidhi

నా వారసుడు స్టాలిన్ : కరుణానిధి

    తమిళనాడులోని డిఎంకె పార్టీలో ఓ సస్పెన్స్ కు తెర పడింది. తన రాజకీయ వారసుడు స్టాలిన్ అని ఆ పార్టీ అధినేత కరుణానిధి నిన్న అధికారికంగా ప్రకటించారు. చాలా కాలంగా కరుణానిధి తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టడానికి ఆయన కుమారులు అళగిరి, స్టాలిన్ ల మధ్య అంతర్యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.   స్టాలిన్ మొదటి నుండి పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తుండగా, చాలా ఆలస్యంగా పార్టీలోకి వచ్చిన అళగిరి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. డిఎంకె పార్టీ అంతా ప్రస్తుతం స్టాలిన్, అళగిరి వర్గాలుగా విడిపోయి ఉంది. ‘దళిత సమాజ అభివృద్ధి కోసం నా చివరి శ్వాస ఉన్నంతవరకూ పాటు పడతా. నేను చివరి వరకూ పార్టీని చూసుకొంటాను. నా తర్వాత అన్నీ స్టాలిన్ చూసుకొంటారు’, అని కరుణానిధి నిన్న అన్నారు.   స్టాలిన్ కు పార్టీ పగ్గాలు ఇవ్వాలంటూ కొంత మంది పార్టీ నాయకులు కరుణ కు సూచిస్తున్నా, ఆయన ఇంత వరకూ మౌనం వహిస్తూ వచ్చారు. పిఎంకె పార్టీకి చెందిన సుమారు రెండు వేల మంది కార్యకర్తలు తన పార్టీలో చేరిన చేరిన సందర్భంగా కరుణానిధి మాట్లాడుతూ తన వారసుడిగా స్టాలిన్ అన్నారు. ఇప్పటివరకూ,పార్టీలోని నేతలంతా ఏదో ఒక వర్గానికి మద్దతుదారులుగా ఉన్నారు. ఇక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకొంటాయో వేచి చూడాల్సిందే.   తన వారసునిగా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంలో ఎప్పటి నుండో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.

Pyramid subhash patri maktal

పిరమిడ్ బాబా రాసలీలలు !

        పిరమిడ్ బాబా రాసలీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బహిరంగంగా ఆయన మహిళల పట్ల వ్యవహరించిన తీరుకు సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కడ్తాల్ లో ప్రపంచ మహాసభలు నిర్వహించిన, తాత వయసున్న ఆయన మహిళలను వశపరచుకొని అదే ప్రాంతంలోని తన రహస్య గదిలో గ్రూప్ సెక్స్ చేసినట్లు కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి.   అయితే, మహిళలు మాత్రం తమ పరువు పోతుందనే భయంతో బయటపడటం లేదని తెలుస్తోంది. పవిత్రమైన ధ్యాన మహాసభల పేరుతో సుభాష్ పత్రీ అనే పేరు గల ఆ బాబా బహిరంగంగానే మహిళల పట్ల వికారపు చేష్టలకు పాల్పడ్డాడు.  ఈ విషయంలో పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర హోం శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కూడా ఈ విషయంఫై విచారణ జరపాలని ఆదేశించారు. ఓ న్యాయవాది వేసిన పిటీషన్ ఫై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ కూడా బాబా అక్రమాలఫై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ లను ఆదేశించింది.   బాబా చీకటి కోణాలను ప్రసారం చేసిన ఓ టెలివిజన్ చానెల్ ఫై ఆయన అనుచరులు దాడి చేసి ఆ చానెల్ వాహనాన్ని దగ్దం చేశారు. అయితే, తనను అరెస్టు చేస్తారనే భయంతో తలదాచుకోవడానికి పిరమిడ్ బాబా బెంగళూరు వెళ్ళినట్లు తెలుస్తోంది.

 Nitish kumar poor chief minister

అతి పేద ముఖ్య మంత్రి నితీష్ !

          బీహార్ ముఖ్య మంత్రి నితీష్ కుమార్ ప్రస్తుతం దేశంలో కెల్లా అత్యంత నిరుపేద ముఖ్య మంత్రిగా నిలిచారు. బీహార్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ ప్రకారం ఆయన వద్ద నగదు రూపంలో ఉన్నది కేవలం రూ.14,475 మాత్రమే. పరిపాలనలో పారదర్శకతను చాటుకోవడానికి వీలుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం అందరు మంత్రుల ఆస్తుల వివరాలను ఆ వెబ్ సైట్ లో పెట్టింది.   ఈ గణాంకాలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఆయన స్థిర, చరాస్తుల విషయానికి వస్తే, నితీష్ కు ఢిల్లీ లో రూ.40 లక్షల విలువైన ఓ భవంతి, సుమారు ఆరు లక్షల విలువైన కారు, ఇంకా ఇతర గృహోపకరణాలు ఉన్నాయి. ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఇవన్నీ ఆయన కుమారుడు నిశాంత్ పేరు మీదే ఉన్నాయి.   ఆయన మంత్రివర్గంలోని సభ్యుల విషయానికి వస్తే, ఉప ముఖ్య మంత్రి సుశీల్ కుమార్ మోడి వద్ద నగదు రూపంలో ఉన్నది కేవలం రూ.20,000 మాత్రమే నట. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బిజేంద్ర ప్రసాద్ వద్ద రూ.60,000, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నితీష్ మిశ్రా వద్ద రూ.96,992, పరిశ్రమల శాఖ మంత్రి రేణు కుమారి వద్ద రూ.5,000 మాత్రమే ఉన్నట్లు ఆ వెబ్ సైట్ వివరించింది. ఇక నితీష్ మంత్రి మండలిలో అందరికన్నా ఎక్కువ మొత్తంలో నగదు కలిగి ఉంది సునీల్ కుమార్ శింటు. ఆయన వద్ద ఉన్న నగదు విలువ రూ.8,74,000.   ఇక బీహార్ క్యాబినెట్లో అందరికన్నా ఎక్కువ ఆస్తులతో (రూ.5 కోట్లతో) పి.కె. షాపి ప్రధమ స్థానంలో నిలిచారు.

Ram singh delhi rape case

'రేప్’ నిందితుడు రామ్ సింగ్ ఇంటి పేల్చివేతకు ప్రయత్నం

    గత నెల 16 వ తేదీన ఢిల్లీ లో పారా మెడికల్ స్టూడెంట్ ను రేప్ చేసిన ఘటనతో ఆగ్రహించిన కొంత మంది వ్యక్తులు ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న రామ్ సింగ్ ఇంటిని పేల్చివేయడానికి నిన్న ప్రయత్నం చేశారు.   దక్షిణ ఢిల్లీ ఆర్.కె.పురంలోని రవి దాస్ మురికివాడ సమీపంలో గల ఆయన ఇంటి వద్ద కొంత మంది అనుమానాస్పద వ్యక్తులు నిన్న తిరుగుతూ ఉండగా, స్థానికులు వారిని పట్టుకొన్నారు. వారిలో ఇద్దరు వ్యక్తులు పారిపోగా, రాజేష్ (37) అనే వ్యక్తి మాత్రం స్థానికుల చేతికి దొరికి పోయాడు. రామ్ సింగ్ ఇంటి వద్ద టపాసుల్లో వాడే పేలుడు పదార్ధాలతో తయారుచేసిన బాంబులు పెట్టి వారు పారిపోతుండగా స్థానికులు వారిని వెంబడింఛి రాజేష్ అనే వ్యక్తిని పట్టుకోగలిగారు.   ఆ వ్యక్తి నుండి పోలీసులు రెండు నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు.

Delhi rape murder attempt

అదే రోజు బస్సు కిందకు తోసేసి..........

    ఢిల్లీ లోని ఓ బస్సులో ఆరుగురు వ్యక్తుల చేతిలో దారుణంగా అత్యాచారానికి గురి అయి, ఆ తర్వాత మరణించిన 23 సంవత్సరాల పారా మెడికల్ స్టూడెంట్ కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. రేప్ చేసిన వెంటనే వారు ఆమెను హత్య చేయాలని పన్నాగం పన్నారు.   రేప్ జరిగిన వెంటనే భాదితురాలిని, ఆమె స్నేహితుడిని వారు బస్సులో నుండి తోసేశారు. ఆ వెంటనే వారిఫై నుండి బస్సు నడిపి వారిని హత్య చేయాలని భావించారు. ఆ బస్సు తమవైపు వేగంగా వస్తుందని గ్రహించిన ఆమె స్నేహితుడు ఆమెను రెప్పపాటులో పక్కకు లాగాడు. దీనితో, ఆమె ఆ సమయానికి తన ప్రాణం కాపాడుకోగలిగింది. వారిద్దరూ మొదట బస్సు ఎక్కిన వెంటనే, బస్సులో ఉన్న ఆ ఆరుగురు వ్యక్తులు ప్రయాణీకులేనని భావించారు.   అయితే, కొద్ది సేపటికే వారంతా ఆ యువతితో అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. దీనిని వారించిన ఆమె స్నేహితుడిఫై వారు చేయి చేసుకున్నారు. ఈ దాడిని అడ్డుకొన్న ఆమెను కూడా వారు కొట్టారు. అనంతరం వారు ఆ యువతిని బస్సు వెనక్కి తీసుకెళ్ళి అంతా కలిసి రేప్ చేశారు. రేప్ ను అడ్డుకొనే ప్రయత్నంగా ఆ యువతి వారిని కొరికింది. వారి శరీరాలఫై ఉన్న పంటి గాట్లను గూడా పోలీసులు ఈ కేసులో సాక్ష్యంగా చూపనున్నారు.   ఢిల్లీ పోలీసులు తమ వెయ్యి పేజీల చార్జ్ షీట్ లో ఈ వివరాలను పొందు పరచినట్లు సమాచారం. ఈ చార్జ్ షీట్ ను మరో రెండు రోజుల్లో పోలీసులు కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది.

Shashi Tharoor delhi rape

ఆమె పేరు వెల్లడించాలన్న మంత్రి థరూర్

    వివాదాస్పద వ్యాఖ్యలకు మారు పేరుగా నిలిచే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శశి థరూర్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నగరంలో రేప్ కు గురి అయి ఆ తర్వాత మరణించిన యువతి పేరును బయట పెడితే తప్పేమిటని ఆయన నిన్న ప్రశ్నించారు.   ‘ఆమె పేరు రహస్యంగా ఉంచడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? చాలా ధైర్యంగా వ్యవహరించిన ఆమె పేరు బయట పెడితే తప్పేముంది’ అని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నారు. అలాగే, బాధితురాలి తల్లి తండ్రులకు అభ్యంతరం లేకపోతే, అత్యాచార నిరోధక చట్టానికి ఆమె పేరు పెట్టాలని ఆయన అన్నారు. అయితే, థరూర్ చేసిన ఈ వ్యాఖ్యలకు కొంత మంది నుండి మద్దతు కూడా లభించింది.అయితే, మరి కొంత మంది మాత్రం ఆయన సలహాను ప్రశ్నించారు. థరూర్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.   ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం భాదితురాలి పేరును, గుర్తింపును బయట పెట్ట కూడదు. అలా చేయడం ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 228 ఏ ప్రకారం నేరం. ఆమె గుర్తింపు తెలిసేలా ఓ కధనాన్ని ప్రచురించిన ఓ ఆంగ్ల పత్రిక ఫై పోలీసులు ఇటీవలే కేసును నమోదు చేశారు.

ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో చార్జ్ షీట్ రెడీ !

      ఈ నెల 16 వ తేదీన ఢిల్లీలోని ఓ బస్సులో దారుణంగా రేప్ కు గురి అయి ఆ తర్వాత మరణించిన యువతి కేసుకు సంభందించి దాదాపు వెయ్యి పేజీల చార్జ్ షీట్ ను సిద్దం చేస్తున్నట్లు ఢిల్లీ పోలీస్ కు చెందిన ఓ సీనియర్ అధికారి ప్రకటించారు. దీనిని న్యాయ నిపుణులు పరిశీలించిన అనంతరం వచ్చే గురువారం కోర్టుకు సమర్పిస్తామని ఆయన అన్నారు. నిందితులందరికీ ఉరిశిక్ష వేయాలని తాము కోర్టును కోరతామని, బాల నేరస్తునిఫై ఉన్న అభియోగాలను బాల నేరస్తుల సదనానికి నివేదిస్తామని ఆ పోలీస్ అధికారి అన్నారు. ఈ కేసుకు సంభందించి ఇప్పటివరకూ 30 మంది సాక్ష్యాలను ఇందులో పొందుపరచామని ఆయన వివరించారు. ఇందులో ఆమెకు వైద్య చికిత్స చేసిన వైద్యులు కూడా ఉన్నారు. ఈ సంఘటనలో ఆమెతో పాటు దాడికి గురి అయిన ఆమె బాయ్ ఫ్రెండ్ సాక్ష్యం నిందితులకు శిక్షను ఖరారు చేయడంలో కీలకం కాబోతోంది. అలాగే, ఆమె వాంగ్మూలం కూడా. అత్యాచార ఘటన జరిగిననాటినుండి ఆమె మరణించే వరకూ జరిగిన చోటు చేసుకున్న సంఘటనలను అన్నింటినీ ఈ చార్జ్ షీట్ లో పెర్కొన్నామని ఆ అధికారి అన్నారు.

వెంకటరెడ్డిది హత్యేనన్న అమెరికా పోలీసులు

      గత ఆదివారం అమెరికాలోని సిన్సినాటి లో మరణించిన గోలి వెంకట రెడ్డి (47) ది హత్యేనని అమెరికా పోలీసులు తేల్చారు. కరీం నగర్ కు చెందిన ఆయన తన స్నేహితుల సహాయంతో ఆ ప్రాంతంలో ఓ మద్యం షాపు నడుపుతున్నారు. దుండగులు ఆయన నోటిలో రివాల్వర్ పెట్టి కాల్చినట్లు సమాచారం. స్థానిక పోలీస్ అధికారులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఈ హత్యఫై దర్యాప్తు ప్రారంభించామని, అయితే ఇంత వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని అన్నారు. ఆయనను కాల్చి చంపిన అనంతరం షాపులో ఉన్న డబ్బును దుండగులు ఎత్తుకు వెళ్ళినట్లు రెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృత దేహాన్ని చూసిన వెంటనే అందరూ దానిని అనుమానాస్పద మృతిగా భావించారు. రెడ్డి మృత దేహాన్ని ఇంత వరకూ ఆయన భార్య, బిడ్డలకు కూడా చూపించలేదని ఆయన కుటుంబ సభ్యులు అన్నారు. ఆయన ఇల్లు, షాపుల సమీపంలోని అనుమానాస్పద వ్యక్తులను ఒక్కొక్కరినీ గంట సేపు అక్కడి పోలీసులు ప్రశ్నించారు.  

జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త పార్టీ ?

      కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి త్వరలో తన పదవికి రాజీనామా చేయనున్నారనే వార్తలు ప్రస్తుతం జాతీయ మీడియాలో కూడా వస్తున్నాయి. తన శాఖ మార్చడంఫై తీవ్ర అసంతృప్తితో ఉండటంతో పాటు, రాజీనామా చేయాలని ఆయనఫై తెలంగాణా వాదుల నుండి కూడా వత్తిడి పెరుగుతోంది. అయితే, సరైన సమయంలో ఈ విషయంలో నిర్ణయం తీసుకొంటాననే సంకేతాలు ఆయన ఇస్తూ వచ్చారు. నెల రోజుల్లోపు హోం మంత్రి షిండే చేస్తానన్న ప్రకటన తెలంగాణా కు అనుకూలంగా లేకపోతే రాజీనామా చేస్తానని ఆయన తమతో అన్నారని పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఓ ప్రకటన కూడా ఇచ్చారు. ప్రత్యెక రాష్ట్రమే తమకు ముఖ్యమని, ఎలాంటి ‘ప్యాకేజీ’ లకు తాము ఒప్పుకోమని తెలంగాణా ప్రాంతానికి చెందిన పార్లమెంట్ సభ్యులు అంటున్నారు.ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే,తెలంగాణా ప్రాంతానికి చెందిన పార్లమెంట్ సభ్యులంతా కలిసి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త పార్టీ ఏర్పాటు చెయ్యాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణా అజెండాగా ఆ పార్టీ ఉంటుందని వారు  అంటున్నారు. తెలంగాణా ఏర్పడకపోతే, తాము కాంగ్రెస్ లో కొనసాగలేమని వారు భావిస్తున్నారు. అయితే, నెల రోజుల్లోపు కేంద్రం తీసుకొనే నిర్ణయంఫైనే ఈ పరిణామాలు ఆధారపడిఉన్నాయి.

ఢిల్లీ గ్యాంగ్ రేప్: అంత్యక్రియల ‘రహస్యం’ఫై బిజెపి అభ్యంతరం

      ఢిల్లీ అత్యాచారపు బాధితురాలి అంత్య క్రియలు నిన్న ఢిల్లీ లో పూర్తి అయ్యాయి, అయితే, వీటిని అత్యంత రహస్యంగా నిర్వహించడంఫై మాత్రం పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.   13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు మరణించిన ఆ యువతి అంత్యక్రియలను రహస్యంగా పూర్తి చేయడంఫై  బిజెపి నాయకుడు రవి శంకర్ ప్రసాద్ తన అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘బాధితురాలి కుటుంబ సభ్యుల మనోభావాలను మేము అర్ధం చేసుకోగలం. అయితే, ఆమె దహన సంస్కారాలను ఇలా నిర్వహించడం వల్ల ప్రజల్లో అనేక సందేహాలు తలెత్తుతాయి’, అని ఆయన అన్నారు. అయితే, ఇందులో తమ పాత్ర ఏమీ లేదని అంతా బాధితురాలి కుటుంబ సభ్యుల కోరిక మేరకే జరిగిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఆర్.పి.ఎన్.సింగ్ అన్నారు. ‘వారి గోప్యతను గౌరవించాలనే ఉద్దేశంతోనే ఇలా చేసాం. మీడియా కూడా ఇందుకు పూర్తిగా సహకరించింది. రహస్యంగా చేయాలనే ఉద్దేశం మాకేమీ ప్రత్యేకంగా లేదు’, అని మంత్రి అన్నారు. అలాగే, ఆమెకు నివాళులు అర్పించడానికి జంతర్ మంతర్ వద్దకు వచ్చిన అనేక మంది ప్రజలు కూడా అంత్య క్రియలను రహస్యంగా నిర్వహించడంఫై మిశ్రమ స్పందనను వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయం ఎలా ఉన్నా, ఆమె ఆత్మ శాంతికి మాత్రం ప్రార్ధనలు కొనసాగిస్తామని వారన్నారు.