అతి పేద ముఖ్య మంత్రి నితీష్ !
బీహార్ ముఖ్య మంత్రి నితీష్ కుమార్ ప్రస్తుతం దేశంలో కెల్లా అత్యంత నిరుపేద ముఖ్య మంత్రిగా నిలిచారు. బీహార్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ ప్రకారం ఆయన వద్ద నగదు రూపంలో ఉన్నది కేవలం రూ.14,475 మాత్రమే. పరిపాలనలో పారదర్శకతను చాటుకోవడానికి వీలుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం అందరు మంత్రుల ఆస్తుల వివరాలను ఆ వెబ్ సైట్ లో పెట్టింది.
ఈ గణాంకాలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఆయన స్థిర, చరాస్తుల విషయానికి వస్తే, నితీష్ కు ఢిల్లీ లో రూ.40 లక్షల విలువైన ఓ భవంతి, సుమారు ఆరు లక్షల విలువైన కారు, ఇంకా ఇతర గృహోపకరణాలు ఉన్నాయి. ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఇవన్నీ ఆయన కుమారుడు నిశాంత్ పేరు మీదే ఉన్నాయి.
ఆయన మంత్రివర్గంలోని సభ్యుల విషయానికి వస్తే, ఉప ముఖ్య మంత్రి సుశీల్ కుమార్ మోడి వద్ద నగదు రూపంలో ఉన్నది కేవలం రూ.20,000 మాత్రమే నట. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బిజేంద్ర ప్రసాద్ వద్ద రూ.60,000, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నితీష్ మిశ్రా వద్ద రూ.96,992, పరిశ్రమల శాఖ మంత్రి రేణు కుమారి వద్ద రూ.5,000 మాత్రమే ఉన్నట్లు ఆ వెబ్ సైట్ వివరించింది. ఇక నితీష్ మంత్రి మండలిలో అందరికన్నా ఎక్కువ మొత్తంలో నగదు కలిగి ఉంది సునీల్ కుమార్ శింటు. ఆయన వద్ద ఉన్న నగదు విలువ రూ.8,74,000.
ఇక బీహార్ క్యాబినెట్లో అందరికన్నా ఎక్కువ ఆస్తులతో (రూ.5 కోట్లతో) పి.కె. షాపి ప్రధమ స్థానంలో నిలిచారు.