Indian businessman shot dead

అమెరికాలో ఆంధ్ర వ్యక్తి అనుమానాస్పద మృతి

      కరీంనగర్ కు చెందిన ఓ వ్యక్తి అమెరికా లో అనుమానాస్పద పరిస్థితిలో మరణించాడు. నగరంలోని మంకమ్మతోటకు చెందిన గాలి వెంకట రెడ్డి(48), 12 సంవత్సరాల క్రితం అమెరికాకు వలస వెళ్ళాడు. అక్కడ ఒహియో రాష్ట్రంలోని సిన్సినాటిలో ఆయన ఓ సూపర్ మార్కెట్ నడుపుతున్నాడు.   ఆయన ప్రతి రోజు రాత్రి పది గంటల ప్రాంతంలో తన ఇంటికి వస్తూ ఉండేవాడు.అయితే, గత శనివారం రాత్రి వంటి గంట వరకూ ఆయన ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య కవిత, వెంకట రెడ్డి వ్యాపార భాగస్వామి శైలేంద్ర రెడ్డికి ఫోన్ చేసింది. వీరిద్దరితో పాటు, ఆమె ఇంటికి సమీపాన ఉండే వెంకట రెడ్డి అనే మరో తెలుగు వ్యక్తి షాప్ కు వెళ్లి చూడగా వెంకట రెడ్డి అక్కడ నేలఫై పడి ఉన్నాడు. ఆయన నోటి నుండి, ముక్కు నుండి రక్తస్రావం అయి ఉన్నట్లుగా గుర్తించారు. అయితే, వెంకట రెడ్డి షాప్ కౌంటర్లోని డబ్బు అలాగే ఉండటంతో ఇది దొంగల పని కాదని, నిందితునికి, వెంకట రెడ్డి కి ఉన్న పాత కక్షల కారణంగానే హత్య జరిగిఉంటుందని పోలీసులు భావించి, ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే, మృతుని వ్యాపార భాగస్వాములను కూడా పోలీసులు ప్రశ్నించారు. వెంకట రెడ్డి దంపతులకు ప్రణీత్ అనే కుమారుడు ఉన్నాడు. ఆయన భార్య సాఫ్ట్ వేర్ ఇంజనీర్. రెడ్డి మరణంతో ఆయన  స్వగ్రామంలో విషాద వాతావరణం నెలకొని ఉంది.  

delhi gang rape

ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలికి సోనియా నివాళులు

      ఈ నెల 16 న ఢిల్లీ లోని ఓ బస్సులో దారుణంగా రేప్ కు గురి అయిన చివరకు మరణించిన మహిళ అంత్య క్రియలు నిన్న పూర్తి అయ్యాయి. ఆమె మృత దేహాన్ని నిన్న ఉదయం సింగపూర్ నుండి ఎయిర్ ఇండియా ప్రత్యెక విమానంలో ఢిల్లీ కి తీసుకువచ్చారు. అ వెంటనే ఆమె మృత దేహాన్ని ఢిల్లీ లోని ఆమె ఇంటికి తీసుకువెళ్ళారు. విమానాశ్రయం వద్ద ఆమె మృత దేహానికి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాళులు అర్పించారు. ఆ తర్వాత ప్రధాని, సోనియా ఇద్దరూ మృతురాలి తల్లి తండ్రులతో మాట్లాడి వారిని ఓదార్చారు. మృత దేహాన్ని ఆమె ఇంటికి  తీసుకు వెళ్ళిన వెంటనే, ఆ ప్రాంతంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో మృత దేహాన్ని పరమర్సించేందుకు వచ్చారు.ఢిల్లీ ముఖ్య మంత్రి షీలా దీక్షిత్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఆర్.పి.ఎన్.సింగ్ ఆ యువతి అంత్య క్రియల్లో పాల్గొన్నారు. ఆమె కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు, కొంత మంది కుటుంబ సభ్యులు మాత్రమే ఈ అంత్య క్రియల్లో పాల్గొన్నారు. మరో వైపు తన కుమార్తె మరణాన్ని తట్టుకోలేని అ యువతి తల్లి అనేక సార్లు మూర్చపోయింది. దీనితో ఆమెను దీన దయాల్ ఉపాద్యాయ్ ఆసుపత్రిలో చేర్చారు.

Chandra babu telangana

చంద్ర బాబుకు అన్ని పార్టీల థాంక్స్ !

      నిన్న ఢిల్లీ లో తెలంగాణా విషయాన్ని చర్చించడానికి జరిగిన అఖిల పక్ష సమావేశాలో తెలుగు దేశం పార్టీ అవలంభించిన వైఖరికి తెలంగాణా ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా కు అనుకూలమని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు సమర్పించిన లేఖలో చంద్ర బాబు పేర్కొనడంఫై వారంతా ఆనందంగా ఉన్నారు.   కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణా పార్లమెంట్ సభ్యులైతే బాబుకు ఏకంగా ధన్యవాదాలు తెలియచేసారు. మధు యాష్కి గౌడ్ ఓ వినూత్న ఆఫర్ ఇచ్చారు. ఆ మాటకే కట్టుబడి ఉంటే, తెలంగాణా రాష్రం ఏర్పాటు అయిన తర్వాత బాబు ముఖ్య మంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయని గౌడ్ వ్యాఖ్య చేశారు.   బాబు పాద యాత్ర తెలంగాణా ప్రాంతంలో సాగుతున్న సమయంలో జరిగిన ఇలాంటి పరిణామాలతో ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాత్ర వరంగల్ లో అడుగు పెట్టే సమయంలో బాబుకు ఘన స్వాగతం పలుకుతామని ఎర్రబెల్లి అన్నారు.   ఏది ఏమైనా, ప్రస్తుతానికి బాబు ఒక్క దెబ్బతో అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన నాయకునిగా మారిపోయాడు, ఒక్క టిఆర్ఎస్ కు తప్ప.

Delhi rape student dies

గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతి, ఢిల్లీలో టెన్షన్ టెన్షన్

      ఈ నెల 16న ఢిల్లీలో గ్యాంగ్ రేప్ కు గురి అయిన పారా మెడికల్ విద్యార్ధి ఈ ఉదయం 2.15 గంటల సమయంలో సింగపూర్ ఆసుపత్రిలో మరణించడంతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 23 సంవత్సరాల ఆ యువతి మృతి వార్త ప్రపంచానికి తెలియడంతో ఢిల్లీ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.   ఆందోళనలు జరిగే అవకాశం ఉన్న ఇండియా గేట్, విజయ్ చౌక్ వంటి ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా నిషేదాజ్ఞలు విధించి భద్రతను మరింత పెంచారు. 10 జనపథ్ వంటి ప్రముఖుల నివాసాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆందోళనలను నియంత్రించే చర్యల్లో భాగంగా అనేక మెట్రో రైల్వే స్టేషన్లను మూసివేశారు. భాదితురాలి మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్ తమ సంతాపాలను ప్రకటించారు.   మరణించిన యువతి విదేశీయురాలు కావడంతో తగిన లాంచనాలను పూర్తి చేయడానికి ఇప్పటికే ఆ మృత దేహాన్ని సింగపూర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఆ యువతి మృత దేహాన్ని ప్రత్యెక విమానంలో ఈ రోజు సాయంత్రానికి భారత్ తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ నుండి నేరుగా ఉత్తర ప్రదేశ్ బలియా జిల్లాలోని ఆమె స్వస్థలానికి తీసుకువెళ్తారు.   మరణించిన తమ కుమార్తెకు ప్రభుత్వం కల్పించిన వైద్య సదుపాయాలఫై ఆమె తల్లితండ్రులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సింగపూర్ లోని భారత హై కమీషనర్ టిసిఏ రాఘవన్ ప్రకటించారు. మృత దేహాన్ని భారత్ కు తీసుకువెళ్ళాలని కూడా వారు కోరారని ఆయన అన్నారు. యువతి మృతితో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిఫై ఢిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.   ఇక దారుణంగా దేశ రాజధానిలోనే రేప్ కు గురి అయ్యి, దాదాపు రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడి ఈ ఉదయం తనువు చాలించిన ఆ యువతి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఎలాంటి నష్ట పరిహారాన్ని అందిస్తుందో మాత్రం వేచి చూడాలి. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ, ఆ యువతి మృతికి  తెలుగు వన్. కామ్ ప్రగాడ సంతాపాన్ని తెలియచేస్తోంది.

V hanumantha rao mp

కాంగ్రెస్ లో సామాజిక న్యాయం లోపించింది : విహెచ్

      కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం లోపించిందని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్య సభ సభ్యుడు వి. హనుమంత రావు వ్యాఖ్యానించారు. నిన్న ఢిల్లీ లో తెలంగాణాఫై జరిగిన అఖిల పక్ష సమావేశానికి తమ పార్టీ నుండి హాజరయిన ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, శాసనసభ్యుడు గాదె వెంకట రెడ్డిలు ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని, ఇలా పంపడం ఎంత వరకు సమంజసమని ఆయన అన్నారు.   కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ విషయంలో ప్రశ్నిస్తే, దానికి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడి బొత్స సత్యనారాయణలే సమాధానం చెప్పాలని విహెచ్ స్పష్టం చేశారు. ఇలా చేసి కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయాన్ని ప్రశ్నార్థకంగా మార్చారని ఆయన విమర్శలు చేశారు. రాష్ట్రంలో తెలంగాణా, సీమంధ్రా ప్రాంతాలనుండి ఇతర సామాజిక వర్గాలకు చెందిన అనేక మంది అనుభవం కలిగిన నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ఆయన అన్నారు. ఆలాంటి వారెవరూ ఈ ప్రతినిధుల ఎంపికలు చేసిన నాయకులకు కనిపించలేదా అని విహెచ్ ప్రశ్నించారు.   బహుశా, విహెచ్ లేవనెత్తిన ఈ కీలక అంశం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కాస్తంత గందరగోళాన్నే కలిగించే అవకాశం ఉంది.

Kodela sivaprasada rao

గతమెంతో ఘనం, ప్రస్తుతం......కోడెల పరిస్థితి

        ఇటీవల ఓ సమస్య విషయంలో గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆందోళన చేస్తూ, స్థానిక డిఎస్పి చేతిలో లాఠీ దెబ్బలు తిని అరెస్టు అవడంతో తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి కోడెల శివ ప్రసాద రావు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయన, రాజకీయాల్లో ఎగిరిపడిన ఓ కెరటం. ఓ విలక్షణ నేత.   తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో ఉండటమే కాకుండా, రాష్ట్రంలో ముఖ్య మంత్రి పదవి తర్వాత అత్యంత కీలకమైన హోం మంత్రి పదవిని కూడా ఓ సారి చేపట్టారు. 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం కోడెల రాష్ట్ర హోం మంత్రిగా పదవి చేపట్టారు. మొత్తం ఐదు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో సంచలన నేతగా గుర్తింపు పొందారు.   గుంటూరు జిల్లాలో కోడెల పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అంతగా ప్రజల్లో పేరు ప్రతిష్టలు తెచ్చుకొన్నారు. తెలుగు దేశం పార్టీలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. ఒకప్పుడు సన్మానాలు, సత్కారాలతో బిజీ బిజీగా గడిపేవారు. హోం మంత్రి నియోజకవర్గంలో పనిచేస్తున్నామని పోలీస్ అధికారులు కూడా గర్వంగా చెప్పుకొనేవారు.   అయితే, ప్రస్తుతం అదే పోలీస్ శాఖలోని ఓ డిఎస్పి చేతిలో ఇటీవల లాఠీ దెబ్బ తిన్నారు. ఆయన హోం మంత్రి కాక ముందు ఓ ఎఎస్పి చేతిలో కూడా చెంపదెబ్బ తిన్నారు. ఇటీవల తనఫై చేయి చేసుకున్న డిఎస్పి ని సస్పెండ్ చేయాలని కోడెల డిమాండ్ చేస్తున్నారు. అయితే,ఆ అధికారిని సస్పెండ్ చేసినా, బదిలీ చేసినా ఆందోళనకు దిగుతామని ఆ అధికారి సబ్ డివిజన్ లోని సిఐ లు, ఎస్ఐ లు బహిరంగంగానే చెపుతున్నారని వార్తలు వస్తున్నాయి.   ఇలా పోలీస్ అధికారుల ఆగ్రహానికి గురికావడం, జైలుకు వెళ్లడంతో ఆయన ప్రతిష్టతో పాటు, పార్టీ ప్రతిష్టకు కూడా మచ్చేననే అభిప్రాయాలు వస్తున్నాయి. గతంలో హోం మంత్రిగా పని చేసిన కోడెల ప్రస్తుతం ఎంఎల్ఏ కూడా కాదు. అయితే, హోం మంత్రి దర్పాన్ని ఇంకా పోలీసుల వద్ద ప్రదర్శిస్తున్నారని ఇదే పోలీసుల ఆగ్రహానికి గురవుతూ ఉందనేది మీడియా కధనాలు చెపుతున్నాయి. కోడెల ఈ వైఖరి టిడిపి అధిష్టానానికి కూడా ఇబ్బందిగా మారిందనేది ఆ మీడియా కధనాల సారాంశం.

Rape victim Singapore

ఢిల్లీ గ్యాంగ్ రేప్: ఆరోగ్య పరిస్థితి విషమం

      ఢిల్లీ రేప్ బాధితురాలి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రత్యెక చికిత్స కోసం ఆమెను సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. తమ ఆసుపత్రిలోని ఐసియూ విభాగంలో ఆమెకు చికిత్స అందిస్తున్నామని, ఆమె ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని నిన్న సాయంత్రం 4.30 గంటలకు ఈ ఆసుప్రతి వర్గాలు విడుదల చేసిన బులెటిన్లో పేర్కొన్నారు.   బహుళ అవయవాల మార్పిడి సదుపాయాలున్న ఈ ఆసుపత్రిని 1973లో ఏర్పాటు చేశారు. ఇది 373 పడకల ఆసుపత్రి. ఈ ఆసుపత్రిలో అత్యంత అధునాతన వైద్య సదుపాయాలు ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడికి వైద్య చికిత్స కోసం వస్తూ ఉంటారు. ప్రత్యేక విమానంలో ఆమెను నిన్న ఉదయం ఐదు గంటల ప్రాంతంలో సింగపూర్ తీసుకువచ్చారు. సింగపూర్ లోని భారత హై కమీషన్ అధికారులు బాధితురాలి తల్లి తండ్రుల కోసం ఓ ప్రత్యెక సమన్వయ అధికారిని ఏర్పాటు చేశారు.   భాదితురాలి కుటుంబ సభ్యులు బస చేసిన హోటల్ గదిలో ఈ అధికారి రోజు మొత్తం అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు. బాధితురాలి ఆరోగ్యానికి అయ్యే ఖర్చు విషయంలో ఎలాంటి రాజీ పడబోమని, ఈ ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని హోం మంత్రి షిండే ప్రకటించిన విషయం తెలిసిందే.

Congress telangana seemandhra

కాంగ్రెస్ : ఆంధ్రా నేతలకు ‘టి’ నేతల సవాల్ !

          రేపు ఢిల్లీ లో తెలంగాణాఫై అఖిల పక్ష సమావేశం జరగనున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలోని సీమంధ్రా నేతలఫై అదే పార్టీకి చెందిన తెలంగాణా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు వారే అడ్డుపడుతున్నారని తెలంగాణా నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణా వాదాన్ని వినిపించే వారినే ఈ సమావేశానికి పంపించాలని ఈ నేతలు డిమాండ్ చేస్తున్నారు.   కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణా కు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. తెలంగాణాకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకోవాలని పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ వంటి నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాము కోరితేనే ఈ సమావేశం జరుగుతున్నందున పార్టీ ప్రత్యెక రాష్ట్రానికి కట్టుబడి ఉండాలని వారంటున్నారు.   తెలంగాణా రాష్ట్రం ఇస్తే, తమ ప్రాంతం నుండి 19 సీట్లను పార్టీకి అందిస్తామని ‘టి’ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఒక వేళ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకపోతే, సీమంధ్రా ప్రాంతం నుండి అన్ని సీట్లలో కాంగ్రెస్ అభ్యర్దులను వారు గెలిపించగలరా అని ఆ ప్రాంత పార్టీ నేతలను ‘టి’ నేతలు ప్రశ్నిస్తున్నారు.

 Telangana all party meeting

తెలంగాణాతో ఎవరికీ నష్టం లేదు !

        ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం విషయంలో అన్ని రాజకీయ పార్టీలు తమ తమ వైఖరులను ఖరారు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో కొంత మంది తెలంగాణా వాదులు ఓ ఆసక్తికరమైన వాదనను తెరపైకి తెచ్చారు. అదేమిటంటే, ప్రత్యెక తెలంగాణా రాష్ట్రంతో ఎవరికీ ఇబ్బంది లేదట !   రేపు ఢిల్లీలో జరగనున్న అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెస్, తెలుగు దేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలన్నీ కలిసి తెలంగాణాకు అనుకూల వైఖరిని ప్రకటిస్తే, ఈ పార్టీలకు పెద్దగా ఇబ్బంది ఉండదట. ఈ పార్టీలన్నీ తెలంగాణా ను అంగీకరిస్తే, సీమంద్రా ప్రజలకు మరో ప్రత్యామ్నయం అంటూ ఉండదు కాబట్టి వారు ఈ మూడు పార్టీల్లో దేనికో ఒకదానికి మద్దతు ఇవ్వక తప్పదు. ఆలాంటి పరిస్థితుల్లో, వారు వీటిలో మంచి పార్టీ ఏదో అలోచించి దానికి మద్దతు ఇస్తారు. ఈ పరిస్థితి రాష్ట్రం సమైఖ్యంగా ఉన్నా జరిగేదే కదా అనేది వారి వాదన.   ఇది నాణానికి ఒక వైపు పరిస్థితి. మరోవైపు ప్రత్యెక రాష్ట్రం వస్తే, తెలంగాణా రాష్ట్ర సమితి గుత్తాధిపత్యం ముగుస్తుంది కాబట్టి, ఈ మూడు పార్టీలకు ఆ ప్రాంతంలో మంచి భవిష్యత్ ఉంటుంది. తెలంగాణా కోసమే ఉన్నామన్న టిఆర్ఎస్ మాటకు అప్పుడు ఇక కాలం చెల్లినట్లే అవుతుంది. ఇంకా చెప్పాలంటే, ఈ సమావేశంలో తెలంగాణకు మద్దతుగా ఏకాభిప్రాయం వచ్చినప్పటికీ, ప్రత్యెక రాష్ట్రం ఏర్పాటు కావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. అంటే, ఈ మూడు పార్టీల్లో ప్రజలు మంచి పార్టీగా భావించినదానికి అప్పటివరకూ భవిష్యత్ ఉంటుంది.   ఇదే కొంత మంది తెలంగాణా వాదుల ‘సలహా’ !

Delhi gangrape victim

సింగపూర్ లో ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు

      ఢిల్లీ గ్యాంగ్‌రేప్ బాధితురాలి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం సింగపూర్ తరలించారు. బుధవారం రాత్రి ఆమెను పరీక్షించిన వైద్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. హుటాహుటినా పాస్‌పోర్టు ఏర్పాటు చేసి సింగపూర్ తరలించారు. గత 10 రోజుల నుంచి బాధితురాలు మృత్యువుతో పోరాడుతున్న విషయం తెలిసిందే. అయితే దుండగులు రేప్ అనంతరం రాడ్ తో ఆమె కడుపుపై విపరీతంగా కొట్టడంతో కడుపులో పేగులన్నీ చిద్రమయ్యాయి. వాటి స్థానంలో కొత్తగా పేగులను అమర్చేందుకు, మెరుగైన చికిత్స అందించేందుకు ఈ తరలింపు జరిగింది. అంతేకాకుండా సింగపూర్ అయితే ప్రయాణ కాలం తక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో అక్కడి ప్రఖ్యాత మౌంట్ ఎలిజబెత్‌ హాస్పిటల్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.   బాధితురాలిని చేర్పించనున్న సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పవూతిలోనే గతంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కిడ్నీ వ్యాధికి విజయవంతంగా చికిత్స జరిగింది. బహుళ అవయవ మార్పిడిలో ఈ ఆస్పవూతికి మంచి పేరు ఉందని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీడీ అథానీ చెప్పారు. బాధితురాలి చికిత్సకు అయ్యే  ఖర్చును కేంద్రమే భరిస్తుంది. బాధితురాలి వెంట కుటుంబసభ్యులు, బంధువులు వెళ్లారు. గ్యాంగ్ రేప్ బాధితురాలు ఆరోగ్యం మెరుగుపడి క్షేమంగా ఉండాలని ఢిల్లీలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.  

 Telangana all party meeting

పార్టీల్లో అఖిలం ఫీవర్ !

      తెలంగాణాఫై ఢిల్లీ లో జరగున్న అఖిల పక్ష సమావేశానికి ఇంకా సరిగ్గా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. దీనితో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల్లో దీనిఫై ఫీవర్ ప్రారంభం అయింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగు దేశం మినహా, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రతినిదులను ఇప్పటికే ప్రకటించాయి. ప్రతినిధుల విషయమే కాదు, తమ వైఖరులను ఖరారు చేసుకొనే విషయంలో కూడా ఇంకా ఈ రెండు పార్టీలు వెనుక వరుసలోనే ఉన్నాయి.   తెలంగాణా రాష్ట్ర ఉద్యమం కోసమే పుట్టిన టిఆర్ఎస్, బిజెపి, సిపిఐ లు ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా తమ వాదనను వినిపించనున్నాయి. సిపిఎం మాత్రం తెలంగాణాకు వ్యతిరేకంగా తన అభిప్రాయం చెప్పనుంది. తెలుగు దేశం పార్టీ మాత్రం తెలంగాణాకు తాను వ్యతిరేకం కాదని చెపుతూనే, ముందుగా కాంగ్రెస్ తన అభిప్రాయం చెప్పాలని పట్టు బట్టే అవకాశం ఉంది.   ముందుగా కేంద్రం తన వైఖరి చెప్పాలని జగన్ పార్టీ వాదించే అవకాశం ఉంది. రాయల తెలంగాణా అయితే, తమకు ఆమోదయోగ్యమని ఎంఐఎం అంటోంది.   ఈ సమావేశం ఆధారంగా తెలంగాణా విషయంలో ఎలాంటి నిర్ణయం జరగదని దాదాపు అన్ని పార్టీలు భావిస్తున్నా, ఆయా రాజకీయ పార్టీల వైఖరి ఈ సమావేశంలో స్పష్టం కానుంది. దీనితో, భవిష్యత్తులో ఆయా పార్టీల వైఖరులు రాష్ట్ర రాజకీయాలఫై ప్రభావం చూపే అవకాశం ఉంటుందనడంలో సందేహం ఉండక పోవచ్చు.   తెలంగాణఫై ముందుగా తన నిర్ణయం చెప్పాలని షిండే సమక్షంలో అన్ని పార్టీలు అధికార కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంది.

Sureedu acb raids

ఇబ్బందుల్లో సూరీడు !

      మాజీ ముఖ్య మంత్రి వైఎస్ రాజ శేఖర రెడ్డి వ్యక్తిగత సహాయకుడు సూరీడు నివాసంలో యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసిబి) అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. వైఎస్ హయంలో ఆయన వెంటే తిరుగుతూ చక్రం తిప్పిన సూరీడు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అనుమానంతో జూబ్లీహిల్స్ గాయత్రీ నగర్లోని ఆయన నివాసంలో ఈ దాడులు నిర్వహించారు. ఆయన నివాసంలో కొన్ని విలువైన పాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.   ఏ పి పి ఎస్ సి సభ్యుడు రిపున్జయ్ రెడ్డితో ఆయనకు సన్నిహిత సంభందాలు ఉన్నాయనే కారణంతోనే ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ సభ్యుడిఫై అవినీతి ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. రిపున్జయ్ రెడ్డి కమీషన్ లో సభ్యునిగా నియమితులైన తర్వాత ఆయన ఆస్తులు భారీగా పెరిగాయని మీడియా లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నియామకం ముందు ఓ ఫ్లాట్ కొనడానికి కూడా డబ్బులు లేని రిపున్జయ్ ఆ తర్వాత రూ.100 కోట్ల వరకూ ఆస్తులు కూడబెట్టినట్లు ఆ కధనాలు పేర్కొన్నాయి.   కాగా రిపున్జయ్ నివాసంలో కూడా ఈ దాడులు జరిగాయి. బ్యూరో డిఎస్పి చంద్ర శేఖర్ మీడియా తో మాట్లాడుతూ, వీరిద్దరూ కలిసి ఆస్తులు కూడబెట్టినట్లు తమ వద్ద సమాచారం ఉందని అన్నారు.

President Hyderabad tour

కొత్త సంవత్సరానికి ప్రణబ్ మన రాష్ట్రంలోనే

      ఈ సారి నూతన సంవత్సర వేడుకలను రాష్త్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ లోనే జరుపుకోనున్నారు. వారం రోజుల శీతాకాలం విడిది కోసం ప్రణబ్ నేడు హైదరాబాద్ వస్తున్నారు.   బేగంపేట్ లో ఆయన దిగిన వెంటనే బొల్లారం లోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. ఆయన మొత్తం ఐదు రోజుల పాటు బొల్లారంలో ఉంటారు. ప్రణబ్ జనవరి 2 వరకూ ఇక్కడే ఉంటారు. రేపు ప్రణబ్ తిరుపతిలో జరిగే నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలను ప్రారంభించిన అనంతరం తిరిగి అదే రోజు సాయంత్రం హైదరాబాద్ వస్తారు.   28 వ తేదీ ఉదయం ప్రణబ్ చెన్నై వెళ్లి అదే రోజు తిరిగి హైదరాబాద్ వస్తారు. ఆ తర్వాత ఉదయం ఆయన మహారాష్ట్ర వెళ్లి సోలాపూర్ వెళ్లి అక్కడ నిర్మల్ కుమార్ ఫాడ్కులే ఆడిటోరియం ను ప్రారంభిస్తారు. తిరిగి రాష్త్రపతి 30 వ తేదీ హైదరాబాద్ వచ్చి, జనవరి 2 వ తేదీ వరకూ ఇక్కడే ఉంటారు.   ఈ సమయంలో ఆయన రాష్ట్రంలో జరిగే వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇక్కడ నుండే ఆయన కోల్ కతా వెళ్ళే అవకాశం ఉంది. ప్రతి ఏడాది శీతాకాలంలో దక్షిణ భారతదేశంలో పర్యటించే రాష్త్రపతి బొల్లారంలో బస చేయడం ఆనవాయితీ.

Subhash Tomar delhi constable dies

‘రేప్’ ఆందోళనల్లో గాయపడిన కానిస్టేబుల్ మృతి

    పారా మెడికల్ స్టూడెంట్ ఫై రేప్ తదనంతర ఆందోళనల్లో గాయపడిన ఢిల్లీ పోలీస్ కు చెందిన కానిస్టేబుల్ సుభాష్ తోమార్ (45) ఈ ఉదయం మరణించారు. ఇండియా గేట్ వద్ద జరిగిన ఆందోళనలను నియంత్రించే క్రమంలో గాయపడిన సుభాష్ ఢిల్లీ లోని రాం మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మరణించారు.   మీరట్ కు చెందిన ఈ కానిస్టేబుల్ మరణించిన విషయంలో పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ ను గాయపరచిన సంఘటనకు సంభందించి తమ వద్ద వీడియో క్లిప్ ఉందని, దీనిని హత్య కేసుగా నమోదు చేస్తామని పోలీస్ అధికారులు ప్రకటించారు. కానిస్టేబుల్ గాయపడిన సంఘటనలో ఇంత వరకూ ఎనిమిది మందిని అరెస్టు చేసామని పోలీసులు చెప్పారు.   ఆం ఆద్మీ పార్టీ మనీష్ సిసోడియా వీరి తరపున బెయిల్ బాండ్ సమర్పించడంతో పోలీసులు వారిని ఆ తర్వాత విడుదల చేశారు. వీరిలో ఒకరు ఈ పార్టీకి చెందిన వారు కావడంతో ఆ పార్టీ ఫై పోలీస్ నిఘా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి బెయిల్ ను రద్దు చేయించడానికి అవసరమైతే కోర్టుకు వెళ్తామని ఢిల్లీ సంయుక్త పోలీస్ కమీషనర్ తాజ్ హాసన్ విలేఖరులతో అన్నారు.   సుభాష్ మరణానికి ఆందోళనకారులే కారణమని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు.

నటిఫై అసభ్య పవర్తన, జర్నలిస్ట్ మృతి

      మణిపూర్ లో ఓ సినీనటి ఫై నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ తీవ్రవాది అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనఫై ఈశాన్య భారతం బగ్గుమంటోంది. చందేల్ టౌన్ లో ఏర్పాటు చేసిన విరాళాల కార్యక్రమంలో సినీ నటి మోమోకో పాల్గొంది.   ఈ కార్యక్రమంలో అందరూ చూస్తుండగానే ఆ తీవ్రవాది ఆమెను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే, అక్కడ ఉన్న వ్యక్తులతో పాటు, పోలీసులు గానీ, అస్సాం రైఫిల్స్ సిబ్బంది గానీ ఏమాత్రం స్పందించలేదు. దీనితో ఆ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్టు చేసే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని, నిరసనను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించిన మణిపూర్ చిత్ర పరిశ్రమ బంద్ కు పిలుపు ఇచ్చింది.   మరో వైపు పెద్ద ఎత్తున జనం వీధుల్లోకి వచ్చి, ఈ సంఘటనఫై తమ నిరసనను తెలుపుతున్నారు. దీనితో, అక్కడ పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఓ దశలో ఫైరింగ్ చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనలను కవర్ చేయడానికి వచ్చిన ప్రైమ్ న్యూస్ విలేఖరి ననావో సింగ్ చాతీ లోకి బుల్లెట్ దూసుకుపోవడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. దీనితో ఇంఫాల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.   ఈ అంశంఫై చర్చించడానికి రాష్ట్ర ముఖ్య మంత్రి ఇబోబి కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తో సమావేశమయ్యారు. ఆ తీవ్రవాదిని పట్టుకుంటామని, నిరసన ప్రదర్శనలను ఆపాలని మణిపూర్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ఎస్సార్సీ వాదనను తెరపైకి తెచ్చిన కిరణ్ ?

    తెలంగాణా విషయంఫై ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం వద్ద రెండవ ఎస్సార్సీ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తెలంగాణా ఫై ఢిల్లీ లో జరగనున్న అఖిల పక్ష సమావేశపు తేదీ దగ్గర పడుతున్న తరుణంలో, ఆ సమావేశంలో పార్టీ వైఖరి ఎలా ఉండాలనే విషయంలో ఇంకా మల్లగుల్లాలు పడుతున్న సమయంలో కిరణ్ ఈ కొత్త వాదన ఢిల్లీ లో పార్టీ నేతల వద్ద తెచ్చినట్లు సమాచారం.   రెండు రోజుల క్రితం కిరణ్ ఢిల్లీ పర్యటన చేసిన విషయం తెలిసిందే. రెండో ఎస్సార్సీ వల్ల రాష్ట్రానికి ప్రయోజనం కలుతుందని పార్టీ నేతలకు ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. దీని వల్ల పార్టీకి, తెలంగాణా వాదానికీ ఎలాంటి ముప్పు రాదనీ కూడా కిరణ్ వారి వద్ద అన్నట్లు సమాచారం. దేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పాటు కావాలంటే, అది ఎస్సార్సీ వల్లే జరగాలని ఓ దశాబ్ద కాలం క్రితం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానాన్ని కూడా కిరణ్ వారికి గుర్తు చేసినట్లు తెలుస్తోంది. రెండో ఎస్సార్సీ కి కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తే సరిపోతుందని కిరణ్ అన్నట్లు సమాచారం.   దీని వల్ల టిఆర్ఎస్, బిజెపి, సిపిఐ లకు తప్ప ఇతర ఏ పార్టీకి పెద్ద అభ్యంతరం ఉండదని కిరణ్ అన్నారని తెలుస్తోంది. టిఆర్ఎస్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుందని, అయితే, వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి చక్కబడుతుందని కూడా తన అభిప్రాయంగా కిరణ్ పార్టీ అధిష్టానికి చెప్పినట్లు సమాచారం. దీనితో, ఈ నెల అఖిల పక్ష సమావేశానికి ముందే కిరణ్, బొత్స లతో మరో సారి సోనియా గాంధీ సమావేశం జరిపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఢిల్లీ గ్యాంగ్ రేప్ : విద్యార్ధిని పరిస్థితి ప్రమాదకరం

      డిల్లీలో మెడికల్ విద్యార్ధిని పరిస్థితి ఇప్పటికీ చాలా ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె శరీరంలో ఉన్న చిన్న ప్రేగులకు తీవ్ర ఇన్ఫెక్షన్ సోకడంతో డాక్టర్లు దానిని తొలగించేరు. మానవ శరీరంలో జీర్ణ ప్రక్రియని కొనసాగించే చిన్నప్రేగులు దాదాపు 21 అడుగుల పొడవు ఉంటాయి. డాక్టర్లు ఆమె చిన్న ప్రేగులలో కేవలం 3 అంగుళాలు పొడవు మినహా మిగిలిన దానిని మొత్తం ఆపరేషన్ చేసి తొలగించేయవలసి వచ్చింది. మనం రోజూ తీసుకొనే ఆహరం పూర్తిగా జీర్ణం కావాలంటే దాదాపు 21 అడుగుల పొడవు అవసరమే. అప్పుడు మాత్రమే, అక్కడ జీర్ణ ప్రక్రియ పూర్తయ్యి ఆహారం నుండి శరీరానికి అవసరమయిన శక్తిని ఉత్పత్తి చేసే వివిధ రకాలయిన ప్రోటీన్లు వగైరాలు ఈ ప్రక్రియలో విడదీయబడి చిన్నప్రేగుల గోడలద్వారా శరీరంలో అన్ని భాగాలకు చేర్చబడుతుంది. అయితే, ప్రస్తుతం బాదితురాలికి కేవలం 3 అంగుళాలు పొడవున్న చిన్న ప్రేగు మాత్రమే మిగిలి ఉంది. అందువల్ల, ఆమె ఇక ఏ రకమయిన ఘనాహారం లేదా ద్రవాహారం నోటి ద్వారా ఎన్నడూ తీసుకోలేదు. ఆమె జీవించి ఉండేందుకు సెలయిన్ లేదా అటువంటి వాటి మీదే కొన్ని సంవత్సరాలవరకు ఆదారపడక తప్పదు. ఒకవేళ ఆమె పొరపాటున నోటి ద్వారా ఏ రూపంగానయినా ఆహరం తీసుకొన్నా లోపల చిన్న ప్రేగులు లేవు గనుక, వాటిని శరీరం నేరుగా బయటకి విసర్జించక తప్పదు. కనుక, డాక్టర్లు ఆమె శరీరంలో ఒక గొట్టం అమర్చవలసి వచ్చింది. దాని ద్వారా ఆమె తీసుకొన్న ఆహారం నేరుగా బయటకి వచ్చేస్తుంది. నిన్నమొన్నటి వరకు ఏంతో హాయిగా బ్రతికిన ఒక అమాయకురాలయిన యువతి, మనుష్య రూపంలో తిరుగుతున్న క్రూర మృగాలకి బలయిపోయి ఇటువంటి దుస్తితికి జేరడం ఎవరి హృదయాలనయినా కలిచివేయక మానదు. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం, ఆమె పూర్తిగా కోలుకోనేందుకు ఒకటి లేదా రెండు సం.లు పట్టవచ్చును. అప్పుడు కేవలం అమెరికా వంటి దేశాలలో మాత్రమె అత్యంత ఖరీదయిన చిన్న ప్రేగుల మార్పిడి చికిత్స కోసం ప్రయత్నిస్తే ఆమె జీర్ణ వ్యవస్త బాగుపడవచ్చును. అయితే, మిగిలిన అవయవాల మార్పిడిలో దాదాపు 70 నుండి 80 శాతం వరకు విజయవంతం అవుతుండగా, ఈ చిన్న ప్రేగుల మార్పిడి చికిత్సలో మాత్రం కేవలం 20 నుండి 30 శాతం చికిత్సలు మాత్రమే విజయవంతం అవుతాయని డాక్టర్లు చెపుతున్నారు. అంటే, బాదితురాలికి భవిష్యత్ జీవితం అంతా ప్రశ్నార్దకమే అన్నమాట.

ముంబాయి లో మరో యువతి ఫై గ్యాంగ్ రేప్

    ఒక వైపు ఢిల్లీ లో గ్యాంగ్ రేప్ జరిగిన సంఘటనఫై దేశ రాజధానిలో ఆందోళన కార్యక్రమాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్న సమయంలో ముంబాయి లో దాదాపు ఇలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది.   భర్తను వెతుక్కుంటూ ఎక్కడో నేపాల్ నుండి వచ్చిన ఓ యువతిఫై స్థానిక వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. పవన్ ఎక్స్ ప్రెస్ లో నేపాల్ నుండి ముంబాయి వచ్చిన ఆ యువతి ముందుగా తన భర్త పని చేసే ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ తన భర్త ఆచూకీ తెలియలేదు. దీనితో ఆమె ఈ విషయంలో తన భర్త స్నేహితుడు జుల్ఫీకర్ సహాయం కోరింది. ఆ వ్యక్తి మాత్రం ఆమెను తన ఇంటికి తీసుకు వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అక్కడినుండి ఆమెను లాడ్జీ కి తీసుకువెళ్లగా, మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఆమెఫై అత్యాచారం చేశారు.   ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు జుల్ఫీకర్ తో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. మరో నిందితుని కోసం గాలిస్తున్నారు.