ND Tiwari  Mulayam Singh

మళ్ళీ తెరపైకి తివారి ?

    రాజకీయాల్లో అన్ని కీలక పదవులనూ అనుభవించిన నారాయణ్ దత్ తివారి మరలా రాజకీయాల్లో అడుగు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. 87 సంవత్సరాల తల పండిన ఈ రాజకీయ వేత్త మరలా వార్తల్లోకి ఎక్కారు. లక్నోలో సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ తో కలసి మీడియా సమావేశం లో పాల్గొనడమే ఈ ఊహాగానాలకు కారణం. ములాయం, అయన తనయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లు ఇద్దరూ తివారిని కలుసుకున్నారు.   ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా పని చేసిన కాలంలో సెక్స్ స్కాండల్ తో అయనను కాంగ్రెస్ పార్టీ దాదాపు పక్కన పెట్టింది. ఇటీవల ఉత్తరాఖండ్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆయనను మచ్చిక చేసుకోవడానికి చాలా కష్ట పడాల్సి వచ్చింది. రాష్ట్రపతి, ప్రధాని తప్ప దేశంలోని అన్ని ముఖ్య పదవులను నిర్వహించిన ఈ నాయకునికి ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ లోని కొన్ని వర్గాల్లో గణనీయ మైన పట్టు ఉండడంతో రాజకీయంగా ఎప్పుడూ డిమాండ్ ఉంటూ వచ్చింది. ములాయం పార్టీలో చేరుతున్నారా అనే ప్రశ్నకు తివారి నేరుగా సమాధానం ఇవ్వనప్పటికీ, అయన ములాయం తో చేతులు కలపడం దాదాపు ఖాయమైనట్లే. రాజకీయంగా జిత్తులమారి అయిన తివారి కాంగ్రెస్ ను పక్కన పెట్టి సమాజ్ వాదీ పార్టీ తో చేతులు కలపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వ్యక్తిగత జీవితం ఫై ఎన్ని విమర్శలు వచ్చినా అవి తన రాజకీయ జీవితం ఫై పడక పోవడమే తివారి ప్రత్యేకత.  

congress gujarat polls

కాంగ్రెస్ నగదు బదిలీ పధకం ఫై ఈసి సీరియస్

    గుజరాత్లో ఎన్నికలు జరగనున్న సమయంలో కాంగ్రెస్ నగదు బదిలీ పధకాన్ని ప్రకటించడం ఫై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో ఈ పధకాన్ని ఎలా ప్రకటించారని ఎన్నికల సంఘం కేంద్ర కేబినేట్ కార్యదర్శిని వివరణ అడిగింది. ఈ రోజు సాయంత్రానికి వివరణ ఇవ్వాలని ఆయనకు ఈసి సూచించింది. గుజరాత్ కు  ఎన్నికలు జరగనున్న సమయంలో ఈ పధకాన్ని ప్రకటించి ఉండాల్సింది కాదని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. కేంద్రం తగిన రీతిలో వివరణ ఇవ్వక పొతే, కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఈసి ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని ఈ సి దృష్టికి తీసుకు వచ్చింది.  

Rahul Gandi

కొత్త ఊసులు చెప్పిన రాహుల్ దూతలు

    రాష్ట్ర౦లో ముఖ్య మంత్రి మొదలుకొని కేంద్రంలో ఎ.ఐ.సి.సి నేతల వరకు, అందరూ కూడా జగన్ కేసులు, అతని అరెస్ట్ తో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, జగన్ విషయంలో చట్టం తనపని తానూ చేసుకుపోతుందని చెప్పిన నేతల చిలక పలుకులు మనం చాలాసార్లు విన్నాము. అదే సమయంలో, జగన్ కుటుంబ సభ్యులు అమాయకుడయిన తమ జగన్ బాబును అన్యాయంగా కేసులలో ఇరికించి జైలు పాలు చేసారని చెప్పుకొంటూ ప్రజల ‘ఓదార్పు’ కోరుకోవడమూ మనం నిత్య చూస్తునే ఉన్నాము. మరో వైపు, మీడియా కూడా కట్టకట్టుకొని జగన్ వెంటాడుతూ అతని అవినీతి లీలలు కోసం వృదా అనుకోకుండా తమ ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియాలలో సింహభాగం కేటాయించి నిత్యం ప్రచురిస్తున్న వరుస కధనాలు ఒకవైపూ, వాటిని అంతే సమర్ధంగా తిప్పి కొడుతున్న జగన్ సొంతబాకా మీడియా మరియు జగన్ తల్లీ చెల్లెళ ఆక్రోశం మరో వైపు ప్రజలని అయోమయంలో పడేస్తున్న ఈ తరుణంలో ప్రజల సంశయ నివృత్తి చేసేందుకే అన్నట్లు రాష్ట్రంలో వచ్చి వాలారు రాహుల్ దూతలు. వారు, రాబోయే ఎన్నికలలో జగన్ తో కాంగ్రేసు జతకట్టడం లాభమా నష్టమా? ఎంత శాతం? జగన్ని కాంగ్రేసు గూటికి మళ్ళీ తెచ్చుకొంటే మంచిదా కాదా? ఒకవేళ, రప్పించుకోవాలంటే ఏమి చేయాలి? ప్రతిగా యేయే వరాలు ఇవ్వాలి? వంటి ప్రశ్నావళిని చేతబట్టుకొని వచ్చి ‘అసలు జగన్ నిర్దోషా కాదా?’ అనే బేతాళ ప్రశ్నకు సమాధానం యిచ్చే పుణ్యం కట్టుకొంటున్నారు.   రాహుల్ దూతలు మన రాష్ట్ర నేతల ద్వారా తెలుసుకొన్న విషయాలలో చాల ఆసక్తి కరమయిన విషయాలు బయటకి వచ్చేయి. ఒక సీనియర్ కాంగ్రేసు నాయకుడు ప్రస్తుతం జగన్ మీదనున్న అన్ని కేసులు ఎత్తివేసి, అతనికి ముఖ్య మంత్రి పదవి ఇచ్చేస్తే జగన్ మన గూటికోచ్చేస్తాడని చెప్పాడు. మరో నేత, మన కాంగ్రేసుకన్నా జగన్ పార్టీ మరియు తే.రా.స. లే ప్రస్తుతం రాష్ట్రంలో బలంగా ఉన్నాయని చెప్పి రాహుల్ దూతలకి షాకు తినిపించేడు. ఈ రెండు సలహాలలో మొదటిది జగన్ పై కేసులు ఎత్తివేయడం మన చేతిలో పనే అని తెలియజేస్తూనే, ఆ పని (కేసుల్లో అతనిని ఇరికించడం జైలు పాలూ చేయడం చేసిందీ కాంగ్రేసే అని చెప్పక చెప్పింది. అంటే, ఒక వేళ కాంగ్రేసు జగన్ని కావాలనుకొంటే అతనిని అవలీలగా కేసుల నుంచి బయట పడేయగలదు. అతనివల్ల తమ పార్టీకి నష్టం అనుకొంటే అతనిని ఎంత కాలమయిన జైల్లోనే ముగ్గ బెట్టేయగలదు. కనుక, ప్రజల ధర్మ సందేహం తీరిపోయినట్లే. ఇప్పుడు ఒకటి కొంటే మరొకటి ఉచితంగా పొందే రోజులివి గనుక, రాహుల్ దూతల రాష్ట్ర పర్యటన ద్వారా మనకి మరో గొప్ప నిజం ఉచితంగా లభించింది. అదేమంటే, చంద్రబాబు నొక్కి వక్కణిస్తున్నట్లు ప్రస్తుతానికి ‘తల్లి కాంగ్రేసు’ ‘పిల్ల కాంగ్రేసు’  పైపైకి ఒకరినొకరు ఎంత తిట్టుకొన్నపటికీ రేపు ఎన్నికలు దగ్గిరపడగానే ఆ తల్లిపిల్లలొకటయిపోతాయని, లేదంటే కనీసం ఆ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మనకి అడగకుండానే తెలియజేసి పుణ్యం కట్టుకొన్నారు. గాని వాళ్ళు మనకి ఇంకా చెప్పవలసిన విషయం మరొకటి ఉండిపోయింది. ప్రస్తుతానికి బయట పడకుండా, ఇదివరకు కాంగ్రేసు మన మెగాస్టారు ఆడిన ఆటనే మళ్ళీ ఆడి మనకి చూపించి అప్పుడు తే.దే.పా.ను దెబ్బకొట్టినట్లే మళ్లీ దెబ్బకొట్టిన తరువాత కలుస్తారా లేక ముందే కలుస్తారా అనే సంగతి కూడా చెప్పేస్తే ప్రజలకి మరో పెద్ద సంశయ నివృత్తి చేసిన పుణ్యం కాంగ్రేసుకి దక్కుతుంది.  

Actress jayaprada

జయప్రదను పట్టిస్తే పదివేలు..!

    ఎంపీ జయప్రద తప్పిపోయిందట..! ఆమెను పట్టించిన వారికి పదివేలు బహుమతి ప్రకిటించారు..? అవును ఆమె కనిపించడం లేదంటూ ఉత్తర్ ప్రదేశ్ లోని జయప్రద లోక్ సభ నియోజకవర్గం రాంపూర్ లో ఏకంగా వాల్ పోస్టర్లు అంటించారు. ఆమెను పట్టుకుంటే పదివేల బహుమతులు అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. దీంతో అక్కడ ఆమె రాజకీయ భవిష్యత్ మరింత రసకందాయంలో పడింది. ఒకప్పటి సమాజ్ వాదీ నేత అమర్ సింగ్ తో కలిసి జయప్రద సమాజ్ వాదీ పార్టీకి దూరమయింది. తాజాగా ములాయంతో అమర్ సింగ్ సంబంధాలు మెరుగుపడ్డాయి. అయితే ఆమె మళ్లీ తిరిగి పార్టీలోకి వస్తుందన్న అనుమానంతో అక్కడి మంత్రి జయప్రదకు వ్యతిరేకంగా ఇలా చేయిస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీకి దూరమయ్యాక జయప్రద రాంపూర్ కు రావడం, పోవడం తగ్గించారు.

chandrababu

ఎస్సీ,ఎస్టీ సబ్‌ ప్లాన్‌ స్వాగతిస్తున్నా౦: చంద్రబాబు

    బడుగు బలహీన వర్గాలను ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ బిల్లు స్వాగతిస్తున్నామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రణాళిక కింద ఆ నిధులను సక్రమంగ ఖర్చుపెట్టాలన్నారు. ప్రణాళిక నిధులు వేరే పథకాలకు మళ్లించకుండా నిషేధం విధించాలని బాబు కోరారు. జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ నిధులను కేటాయించాలని ప్రణాళిక సంఘం ఏనాడో చెప్పిందని గుర్తుచేశారు. దళిత, గిరిజన సబ్‌ప్లాన్ బిల్లులో పదేళ్ల కాలపరిమితి పెట్టడం సరికాదన్నారు. వర్గీకరణ కోసం రాజ్యాంగ సవరణ చేయాలని ఉషా మెహ్రా కమిషన్ స్పష్టంగా చెప్పినా, కాంగ్రెస్ ఇప్పటి వరకు స్పందించడం లేదని ఆయన విమర్శించారు. టీడీపీ హయాంలో ఎస్సీ వర్గీకరణతో మాదిగ, ఉపకులాలకు 24,500 ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. దళిత, గిరిజన ఉప ప్రణాళిక బిల్లులో వర్గీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు సూచించారు.  

Britain Travellers

తగ్గుతున్న బ్రిటన్ వలసలు

    గత ఇరవై సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా బ్రిటన్ కు వెళ్ళే వారి సంఖ్య తగ్గిపోయింది. వీటికి సంభందించిన గణాంకాలను అధికారులు లండన్ లో నిన్న విడుదల చేశారు. 2011 లో 5,36,000 మంది విదేశీయులు ఈ దేశంలో నివసించడానికి వచ్చారు. అంత క్రితం సంవత్సరం తో పోలిస్తే, ఇది 42,000 తక్కువ. 1991 సంవత్సరంలో మాంద్యం పరిస్ధితుల కారణంగా, అంత క్రితం సంవత్సరం తో పోలిస్తే, 61,000 మంది తక్కువ మంది విదేశీయులు ఆ సంవత్సరం లో బ్రిటన్ కు వలస వెళ్లారు. ఆ తర్వాత ఈ స్థాయిలో వలసలు తగ్గడం ఇదే ప్రధమం. ఈ తగ్గుదలకు రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. విద్యార్థి వీసా లఫై వచ్చే వారి సంఖ్య తగ్గిపోవడం మొదటి కారణం కాగా, వలసల సంఖ్య తగ్గించాలని బ్రిటన్ ప్రభుత్వం భావించి తగు చర్యలు తీసుకోవడం రెండో కారణం.

telugu latest news

అక్కడ అన్నీ ‘తెలుగే’ !

    ఆ కార్యాలయం రాష్ట్రంలోని అన్నీ ఇతర కార్యాలయాలకు భిన్నం. అక్కడ ఇంగ్లీష్ అనే పదమే వినపడదు. అక్కడ నుండి జరిగే అన్ని ప్రత్యుత్తరాలు తెలుగు లోనే జరుగుతాయి. ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడే వారు కూడా అక్కడ వస్తే మాత్రం తెలుగు లోనే మాట్లాడాలి. ఆ కార్యాలయం ఎక్కడో తెలుసుకోవాలని ఉందా? అదే మన రాజధానిలోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం (పీసీబి). అక్కడ ఉద్యోగులు అయినా, పని మీద వచ్చిన వారు అయినా తెలుగు లోనే మాట్లాడాల్సి ఉంటుంది. ఇదే ఈ కార్యాలయం ప్రత్యేకత. ఇక్కడ అన్ని ప్రత్యుత్తరాలు తెలుగు లోనే జరగాలని ఈ కార్యాలయ అధిపతి, బోర్డు సభ్య కార్యదర్శి రవి చంద్ర ఉత్తర్వులు జారీ చేసి, తెలుగు భాష ఫై తన అభిమానాన్ని చాటుకున్నారు. త్వరలో, ఈ కార్యాలయంలో జరిగే అన్ని పనులు తెలుగు లోనే జరిగే స్థాయికి చేరాలని రవి చంద్ర సూచించారు. రాష్ట్రంలో ఇంగ్లీష్ మాట్లాడేవారు తనకు తెలిసి నాలుగు శాతం మంది కూడా ఉండరని ఈ ఐఏఎస్ అధికారి అన్నారు.

PVR buys Cinemax

పివిఆర్ చేతిలో సినీమాక్స్

    మల్టీ ప్లెక్స్ సంస్థ పివిఆర్ సినీమాక్స్ ను త్వరలో సొంతం చేసుకోనుంది. సినీమాక్స్ కూడా అదే రంగంలోని సంస్థే. సినీమాక్స్ లో దాదాపు 95.27 శాతం వాటాను కొనుగోలు చేయడానికి పివిఆర్ రూ. 543 కోట్లను వెచ్చించాలని భావిస్తోంది.   ఇందులో మొదటి దశగా, సినీ మాక్స్ లోని 69.27 శాతం వాటాను  పివిఆర్ 395 కోట్లకు సొంతం చేసుకోనుంది. తన అనుబంద సంస్థ సినీ హాస్పిటాలిటీ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా సినీమాక్స్ షేరుకు రూ. 203.65 వెచ్చించి పివిఆర్ కు ఈ వాటాను విక్రయించనుంది. కాగా, సెబి నిభందనలకు అనుగుణంగా, మరో 26 శాతం వాటాను కూడా పివిఆర్ కొనుగోలు చేయనుంది.  ప్రమోటర్ల వాటాను విక్రయించేందుకు పివిఆర్ తో ఒక ఒప్పందానికి వచ్చినట్లు సినీ మాక్స్ బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ కు తెలియచేసింది. అదే విషయాన్ని పివిఆర్ కూడా బీఎస్ఇ కి తెలియచేసింది. ఈ లావాదేవి ఖరారు అయినట్లు తెలిసిన వెంటనే, బిఎస్ఇ లో పివిఆర్ షేరు 8శాతం, సినీ మాక్స్ షేరు 5 శాతం మేర పుంజుకున్నాయి. ఈ లావాదేవి పూర్తయితే, పివిఆర్ దేశంలోనే అతిపెద్ద మూవీ ఎగ్జిబిషన్ సంస్థగా ఆవిర్భవిస్తుందని పివిఆర్ అధినేత అజయ్ బిజ్లీ ప్రకటించారు.    

 Railway Reservation

రిజర్వేషన్ కు ఇక గుర్తింపు కార్డు తప్పనిసరి

    రైల్వేల్లో రిజర్వేషన్ టికెట్ పొందాలంటే ఇక గుర్తింపు కార్డు తప్పనిసరి. ఈ నియమం రేపటి నుండి అమల్లోకి వస్తుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.   ఇంతవరకూ, ఎ సి, తత్కాల్ టికెట్లకు మాత్రమే ఈ నియమం వర్తించేది. ప్రస్తుతం స్లీపర్ క్లాస్ టికెట్లకు కూడా ఇక గుర్తింపు కార్డు తప్పనిసరి. పాస్ పోర్ట్, పాన్ కార్డ్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐ డి కార్డ్ వంటి కొన్ని గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఇక రైల్వే ప్రయాణానికి తప్పనిసరి. గుర్తింపు కార్డు లేని ప్రయాణీకుల్ని టికెట్ లేని వారిగా గుర్తించి టికెట్ ఛార్జ్ తో పాటు జరిమానా కూడా విధిస్తామని రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలియచేసారు. ఈ నియమాన్ని కచ్చితంగా అమలు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయితే స్లీపర్ క్లాస్ ప్రయాణీకులు టికెట్ తీసుకొనే సమయంలో ఈ గుర్తింపు కార్డులను చూపించాల్సిన పనిలేదు.దొడ్డి దారిన ఆదాయాన్ని పొందేందుకే ఈ నియమాన్ని అమల్లోకి తెచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, దేశంలో చాలా మంది ప్రజలకు ఏ విధమైన గుర్తింపు కార్డులు లేవు. అంటే, వారు రిజర్వేషన్ ప్రయాణానికి అనర్హులా అనే ప్రశ్న తలెత్తుతుంది. దేశ ప్రజలందరికి, ఏదో ఒక గుర్తింపు కార్డు జారీ చేసిన తర్వాత ఈ నియమం అమల్లోకి తెస్తే బాగుండేది.

Rajani super star

రజనీతో మణిరత్నం కొత్త సినిమా

    ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీ తన కూతురు తీస్తున్న యానిమేషన్ ఫిల్మ్ తో బిజీగా ఉన్నారు. పుట్టిన రోజుకి త్రీడీ శివాజీతో హల్ చల్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయ్. విక్రమ్ సింహా ఎంత త్వరగా విడుదలవుతుందా అని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు.   రజనీ త్వరలోనే మణిరత్నంతో ఓ కొత్త సినిమా చేయబోతున్నాడన్న వార్త కోలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. సరిగ్గా ఇరవై రెండేళ్లక్రితం రజనీ మణిరత్నంల కాంబినేషన్ లో వచ్చిన దళపతి సూపర్ హిట్టయ్యింది.   ప్రస్తుతం కడల్ సినిమాతో బిజీగా ఉన్న మణిరత్నం తన తర్వాత ప్రాజెక్ట్ కింద రజనీ సినిమాని టేకప్ చేస్తున్నాడని ప్రచారం జోరుగా జరుగుతోంది. చేస్తున్న సినిమా పూర్తి కాగానే.. 2013లో రజనీతో కొత్త సినిమాని సెట్స్ మీదికి తీసుకెళ్లేందుకు మణిరత్నం ప్లాన్ చేస్తున్నాడట కూడా..

Bhuvaneswari arrest

పోలీసుల అదుపులో సెక్సీతార భువనేశ్వరి

  తప్పతాగి చెన్నైలో సినిమా థియేటర్ ముందు తైతక్కలాడి ఓ వ్యక్తిపై దాడి చేసిన కేసులో తెలుగు, తమిళ సెక్సీనటి భువనేశ్వరి అరెస్టైంది. ఈగంబాక్కంలో ఓ థియేటర్ ముందు జరిగిన గొడవలో భువనేశ్వరి అనుచరులు ఓ వ్యక్తిమీద దాడిచేసి గాయపరిచారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుల్ని వలేసి గాలించి పట్టుకున్నారు.   తనని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న భువనేశ్వరి చల్లగా బెంగళూరు చెక్కేసే ప్రయత్నం చేసింది. అనుచురుల్ని పట్టుకుని రాచమర్యాదలు చేసే సరికి అమ్మగారి వేసిన అసలు ప్లాన్ గురించిన సమాచారం బైటికి కక్కేశారు. అప్రమత్తమైన పోలీసులు హైవే విభాగానికి సమాచారం అందించారు.   అంటూరు సమీపంలోని కన్నికాపురం దగ్గర భువనేశ్వరిని పోలీసులు అడ్డగించినప్పుడు సినేమాకతలు చెప్పి తప్పించుకోవాలని చూసింది. తాను భువనేశ్వరిని కాదని, తన పేరు శివానీ అని.. మెలికలు తిరుగుతూ వేసిన వేషాలు పోలీసుల దగ్గర పారలేదు. మర్యాదగా చెబితే వినవా.. అంటూ లాక్కెళ్లి లాకప్ లో పడేసేసరికి నిజం ఒప్పుకోక తప్పలేదు.

Denikaina ready

మోహన్ బాబు మీద మరో కేసు

  దేనికైనా రెడీ సినిమా వివాదం మోహన్ బాబుని వెంటపడి తరుముతోంది. సినిమా విడుదలై నెలరోజులు దాటినా బాబుకి చిక్కుల తప్పడంలేదు. ఫిర్యాదులు, కేసుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. సినిమాలో హిందూ బ్రాహ్మణ సమాజాన్ని, వాళ్ల ఆచారవ్యవహారాల్ని కించపరిచేలా ఉన్న దృశ్యాల్ని తొలగించాలని లేదా సినిమాని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తారా స్థాయికి చేరుతున్నాయి.   బ్రాహ్మణులపై అభ్యంతరకరమైన సీన్లతో ఉన్న దేనికైనా రెడీ సినిమాని వెంటనే నిషేధించాలని కోరుతూ వరంగల్ జిల్లా జనగామ వాసి పవన్ కుమార్ ఓ పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్ ని స్వీకరించి పరీశీలించిన కోర్టు మోహన్ బాబు, విష్ణు, బ్రహ్మానందం, డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, రచయిత కోన వెంకట్, రీజినల్ సెన్సార్ అధికారి ధనలక్ష్మిలపై కేసు నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. ఐపీసీ సెక్షన్ 420, 295 ఎ, 298, 153 ఏఆర్/డబ్ల్యూ, 120 బి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

26/11 terror attack

26/11 తలచుకుంటేనే వణుకొచ్చేస్తుంది

    నాలుగేళ్లక్రితం.. సరిగ్గా.. నాలుగేళ్ల క్రితం ఇదే రోజున ముంబై నగర వీధుల్లో పాకిస్తానీ ముష్కర మూకలు అరాచకం సృష్టించాయి. కనిపించినవాళ్లనల్లా కాల్చిపారేస్తూ టెర్రరిస్టులు ఇష్టారాజ్యంగా చెలరేగారు. ముంబైపై ఉగ్రవాదులు విసిరిన పంజా 166మంది ప్రాణాల్ని పోగొట్టుకున్నారు. క్షణాల్లో పదులకొద్దీ ప్రాణాల్ని హరించిన టెర్రరిస్టులు ముంబై నగరాన్ని శ్మశానవాటికగా మార్చేశారు. ఎటుచూసినా ఏడుపులు, పెడబొబ్బలు, ఎవరు బతికున్నారో, ఎవరు చనిపోయారోకూడా తెలీని స్థితి. పగవాడిక్కూడా రాకూడదనుకునేంతటి దారుణ స్థితి.. ఇప్పటికీ ఆ పీడకల ముంబై వాసుల్ని వెన్నాడుతూనే ఉంది. ప్రాణాలతో పట్టుబడ్డ ఉగ్రవాది కసబ్ ని 21న పుణెలోని ఎరవాడ జైల్లో ఉరితీశాక బాధితుల్లో కొందరికి కడుపుకోత తగ్గింది. తమవాళ్లని అన్యాయంగా పొట్టనపెట్టుకున్న నరరూప రాక్షసుడ్ని వార్తని విని చాలామంది పండగ చేసుకున్నారు. ముంబై మహానగరాన్ని అతలాకుతలం చేసిన అలాంటి దారుణమైన స్థితి మరెన్నటికీ కలగకూడదంటూ ఏటా ఈ రోజున కోట్లాదిమంది ప్రార్ధనలు జరుపుతున్నారు. ముంబై చౌపట్టీలోని పోలీస్ జింఖానా గ్రౌండ్స్ల్ లో జరిగిన కార్యక్రమానికి కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్ కుమార్ షిండే, మహారాష్ట్ర గవర్నర్ శంకర్ నారాయణ్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్, రాష్ట్ర హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్ హాజరై మృతులకు ఘన నివాళి అర్పించారు.

Actor rajinikanth

రజనీ వియ్యంకుడిపై పోలీస్ కేసు

    సూపర్ స్టార్ రజనీకాంత్ వియ్యంకుడు, తమిళ హీరో ధనుష్ తండ్రి అయిన కస్తూరి రాజాపై పోలీస్ కేసు నమోదయ్యింది. గతంలో ఓ ఫైనాన్సర్ కి చెల్లని చెక్కిచ్చిన నేరంపై కస్తూరిపై కేసు నమోదయ్యింది. చాలారోజులపాటు రావాల్సిన డబ్బుకోసం ప్రయత్నం చేసిన ఫైనాన్సియర్ చివరికి నేరుగా పోలీస్ కేసు పెట్టేసినట్టు తెలుస్తోంది. ధనుష్ తోపాటు దర్శకుడు సెల్వరాఘవన్ కీ తండ్రి అయిన కస్తూరి రాజా గతంలో తమిళ సినీరంగంలో సార్ డైరెక్టర్ గా చెలామణీ అయ్యారు. రజనీ – కస్తూరి రాజాల హిట్ సినిమా “ ఎన్ రాసావిన్ మనసిలే” తెలుగులో మొరటోడు నా మొగుడు పేరుతో రీమేక్ కూడా అయ్యింది. ప్రస్తుతం కస్తూరి రాజా చెక్ బౌన్స్ వివాదం అటు పెద్దకొడుగు ధనుష్, తన మామగారు రజనీల పైన, ఇటు చిన్నకొడుకు సెల్వరాఘవన్ పైన పడుతుందని తమిళ సినీవర్గాల్లో తారా స్థాయి గుసగుసలు వినిపిస్తున్నాయ్. పోయిన సినిమాలక్కూడా బయ్యర్లకు పిలిచి డబ్బులిచ్చేసే అలవాటు, మంచి పేరు ఉన్న రజనీకాంత్ ఈ వివాదాన్ని ఎలా చూస్తారోనన్న ఉత్కంఠకూడా చాలా మందికి కలుగుతోంది.

Ajmal Kasab hanged

కసబ్ కు ఉరి: భారత్ కు తాలిబన్ల హెచ్చరిక

    తీవ్రవాది అజ్మల్ కసబ్‌ను ఉరి తీయడంతో భారత్‌కు తాలిబన్ల నుంచి హెచ్చరికలు మొదలయ్యాయి. గురువారం తాజాగా తాలిబన్లు ఓ హెచ్చరికను జారీ చేశారు. కసబ్ ఉరికి ప్రతీకారం తీర్చుకుంటామని, భారతీయులపైనే తమ దాడులు ఉంటాయని హెచ్చరించారు. కసబ్ ఉరికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రకటించిన విషయం తెలిసిందే. తీవ్రవాది అయిన అజ్మల్ కసబ్‌ను ఉరి తీసిన నేపథ్యంలో ఆయన స్వగ్రామానికి మీడియా వెళ్లకూడదని పాకిస్తాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ ప్రాంతానికి వెళ్ళి కసబ్‌కు సంబంధించిన వివరాలు సేకరించవద్దని పాక్ తెలిపింది. పాకిస్థాన్‌, పంజాబ్ ప్రావిన్స్‌లోని పరిద్గోట్ గ్రామం వ్యవసాయ కుటుంబంలో కసబ్ 1987వ సంవత్సరం జన్మించాడు. తన తండ్రితో తినుబండారాలను అమ్మే వ్యాపారం చేస్తూ వచ్చిన కసబ్‌కు.. బాలీవుడ్ సినిమాలు, కరాటే అంటే చాలా ఇష్టమట.  

కసబ్‌ను ఉరి తీసిన తలారికి రూ.5 వేలు

    ఎరవాడ జైల్లో అజ్మల్ కసబ్‌ను ఉరి తీసిన తలారికి అధికారులు రూ.5 వేలు చెల్లించారు. గతంలో.. దోషులను ఉరితీసే తలారికి రూ.10 చొప్పున చెల్లించేవాళ్లం. ఇప్పుడు ఆ మొత్తం రూ.5 వేలు. నిజానికి.. తమకు అవకాశం ఇస్తే కసబ్‌ను ఉచితంగా ఉరి తీస్తామంటూ పలువురి నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. అనుభవం ఉన్న వ్యక్తి ఈ పని చేస్తే మంచిదని మేం భావించాం... అని మహారాష్ట్ర హోం మంత్రి పాటిల్ తెలిపారు. కసబ్‌ను ఉరి తీసింది ఎవరో చెప్పడానికి మాత్రం అధికారులు నిరాకరించారు. అతడి వివరాలను గోప్యంగా ఉంచారు. కసబ్ కంటే ముందు 1995లో ఓక వ్యక్తిని ఉరి తీసినట్లు తెలిపారు. స్వాతంత్రం వచ్చిన తరువాత మహారాష్ట్రలో ఇప్పటి వరుకు 17మంది దోషులను ఉరి తీసినట్లు తెలిపారు.

అఫ్జల్‌గురూ కు త్వరలో ఉరి..?

  పార్లమెంట్‌పై ఆయుధాలతో దాడి చేసిన కేసులో నిందితుడు అఫ్జల్‌గురూ క్షమాభిక్ష కోరుతూ పెట్టుకున్న పిటిషన్ రాష్ట్రపతి తిరస్కరించారు. అఫ్జల్‌గురూకు కూడా కసబ్‌లాగే రహస్యంగా ఉరి తీసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉరి తీసేది ఎప్పుడనేది ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ తెలియజేసింది. ఆఫ్జల్‌గురూతో పాటు మరో ఆరుగురికి కూడా రాష్ట్రపతి క్షమాభిక్ష నిరాకరించారు. అఫ్జల్ గురూకు ఉరి శిక్ష అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు. అఫ్జల్‌గురూతోపాటు మరో అరుగురికి రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించడతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

కసబ్ ఊరిపై ఆచితూచి స్పందించిన పాక్ మీడియా

    ఉగ్రవాది కసబ్ ఊరిపై పాక్ మీడియాలు ఆచితూచి వార్తలను ప్రచురించాయి. ఆ వార్తకు ఎవరు అధిక ప్రాధాన్యం ఇవ్వలేదు. పాకిస్తాన్ ప్రముఖ ఛానల్ జియే టివీ వెబ్ సైట్లో "ఇండియా హా౦గ్స్ ముంబాయి గన్ మ్యాన్ అజ్మల్ కసబ్" అని రాసింది. కసబ్ ను ఉరితీసినట్లు భారతీయ మీడియా ప్రచురించిందని మరో పత్రిక డాన్. కామ్ పేర్కొంది. అన్ని వెబ్ పత్రికలూ కూడా.. ముంబాయి దాడుల్లో పట్టుబడ్డ ఏకైక గన్ మ్యాన్ కసబ్ ని బారత్ ఉరితీసిందని, అతని క్షమాబిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించారని ఈ వార్తను ప్రచురించడం గమనహర్షం. కొన్ని వెబ్ పత్రికలూ ఈ వార్తను అసలు ప్రచురించలేదు.