మౌన ముని మన్మోహన్
బహుశః మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ.నరసింహరావు గారి శిష్యరికం చేయడం వల్లనే ఆయన మౌనదీక్షను పుణికిపుచ్చుకోన్నారో మరేమో తెలియదు గానీ మన ప్రధాని మన్మోహన్ సింగు అక్షరాల అయనకి ఈ విషయంలో సరయిన వారసుడని చెప్పవచ్చును. అయితే, నరసింహారావుగారిని ఇదే విషయాన్నీ పత్రికలవాళ్ళు అడిగినప్పుడు, అయన “ఎవరన్నారు నేను స్పందించడం లేదని? నా మౌనం కూడా ఒక రాజకీయ ఎత్తుగడలో భాగమే” అని తెలివిగా పలికి తప్పించుకొన్నారు. అయితే మన్మోహన్ సింగు మాత్రం ఆమాట కూడా అనలేకపోయారు.
దేశంలో ఎంత పెద్ద సంచలనం లేదా ఉపద్రవం తలెత్తినాకూడా ఆయన పెదవి విప్పి ప్రజలకి నేనున్నాని భరోసా ఇవ్వరు. ఒకవేళ నోరు విప్పినా అది ఓ మొక్కుబడి తంతుగా ఉంటుందే తప్ప నిజంగా హృదయంలోంచి వచ్చిన స్పందనగా మాత్రం కనిపించదు. గత నెల, డిల్లీలో జరిగిన ఘోర అత్యాచారంపై దేశమంతా ముక్త కంఠంతో నిరసనలు తెలియజేస్తుంటే, స్పందించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదే తప్ప, తనది కాదన్నట్లు నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయారు. దేశాన్నిపాలిస్తున్న ఒక సమున్నత ప్రభుత్వాధినేతగా స్పందించకపోవడం, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తదితరులు మాత్రమే దీనిపై స్పందిస్తుండటంతో, విపక్షాలు నిలదీసినప్పుడు మాత్రమే ఆయన మొక్కుబడిగా స్పందిచేరు.
అయన తన చర్యలతో తను, తన ప్రభుత్వం వెనకుండి నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీయే పరోక్షంగా దేశాన్ని పాలిస్తున్నట్లు మరోమారు ఋజువు చేసారు. ఆదేవిదంగా, పలు కీలక అంశాలయిన తెలంగాణా సమస్య, మణిపూర్ అల్లర్లు వంటి వాటిపై మన్మోహన్ సింగు కూడా ఆయన పెదవి విప్పిందిలేదు. అందువల్లే నేడు, మన రాష్ట్రంలో నేతలు, మంత్రులు నేరుగా సోనియా గాంధీని కలిసి సమస్యలు విన్నవించుకొని ఆమె నుండి పరిష్కారాలు ఆశిస్తారే తప్ప ప్రధాన మంత్రిని కలవాలని ఎవరూ అనుకోరు. నిర్ణయాలు ప్రకటించే అధికారం లోపించినట్లు ప్రవర్తిస్తున్నఆయన తీరుతో ప్రధాన మంత్రి పదవికూడా ఒక రబ్బర్ స్టాంప్ పదవేనన్న భావన ప్రజలలో కలిగిస్తున్నారు.
మళ్ళీ, ఇటీవల కొద్ది రోజులుగా జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలో పూంచ్ సరిహద్దు వద్ద పాకీస్తానీ సైనికులు చేసిన దురాగతం పట్ల, పాక్ ఆగడాల గురించీ ఆయన నుండి ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. ఆయన ప్రభుత్వం, మంత్రులు ఈ విషయంలో ఏ చర్యలు తీసుకొంటున్నారో ప్రజలకి పత్రికలూ టీవీ చాన్నాళ్ళ ద్వారా తెలుసుకోవాలి తప్ప, ఆయన స్వయంగా నోరువిప్పి ప్రజలకి తెలియజేయాలనుకోలేదు. మళ్ళీ, ఇప్పుడు కూడా ఆ బాధ్యతను కాంగ్రెస్ పార్టీకీ, సోనియా గాంధీకే అప్పగించేసినట్లు కనిపిస్తోంది.
అయన నిర్లిప్తధోరణిపై స్పందించిన ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక, ఇటువంటి విషయాలలో హృదయపూర్వకంగా స్పందించే అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాతో పోలుస్తూ ఒక వ్యాసం కూడా ప్రచురించింది. అమెరికాలో కొద్ది కాలం క్రితం న్యూయార్క్ నగర ప్రజలని శాండీ తుఫాను గడగడ లాడించినప్పుడు, అయన తన జీవితంలోనే అత్యంత కీలకమయిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని కూడా పక్కన బెట్టి స్వయంగా రంగంలోదిగి అక్కడి ప్రజలకు ఏవిదంగా భరోసా ఇచ్చేడో అందరికీ తెలిసిందే.
అదే విదంగా అ తరువాత కనెక్టికట్ నగరంలో స్కూలులో చదువుకొంటున్న చిన్నారులను ఒక ఉన్మాది పొట్టన పెట్టుకోన్నపుడు కూడా ఒబామా చేసిన భావోద్వేగప్రసంగంతో ప్రజల మన్ననలు పొందగలిగేరు. ఒక ప్రముఖ అంతర్ జాతీయ పత్రిక టైమ్స్ పత్రిక మనోమోహన్ గురించి వ్రాస్తూ ‘అండర్ ఎచీవర్’ (అసమర్దుడు) అని కవర్ పేజీ ఆర్టికల్ కూడా వ్రాసేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉలిక్కి పడి దిద్దుబాటు చర్యలు చేపటింది. గానీ మళ్ళీ షరా మామూలుగానే సాగిపోతోంది ఆయన, కాంగ్రెస్ పార్టీ ధోరణి.
ఒక సంఘటన లేదా ఒక ఉపద్రవంపై మన ప్రధాని వెంటనే స్పందించడం మనం ఎన్నడూ చూసి ఉండలేదు. ఒక వేళ స్పందించినా అది రాజకీయ కోణంలోనే ఉంటుంది తప్ప నిజమయిన హృదయ స్పందనలా మాత్రం ఉండదు. ప్రతీ చిన్న, పెద్ద అంశాన్నికూడా రాజకీయ రంగుటద్దాలలోంచి తప్ప వేరేలా చూడలేని దౌర్భాగ్య పరిస్థితులవల్లనే, అయన వెనకంజ వేయక తప్పట్లేదు అనుకొని జనం సర్ది చెప్పుకోక తప్పదు.