Rahul Gandhi as working president

ఎఐసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాహుల్?

        కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధిని ఎ.ఐ.సి.సి. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏ క్షణాన్నయినా నియమించవచ్చునని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఆయన కాంగ్రెస్‌లో తిరుగులేని నాయకునిగా కొనసాగుతున్నప్పటికీ అధికారికంగా ఒక సీనియర్ హోదా ఇచ్చే సమయం ఎంతో దూరంలో లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. జైపూర్‌లో కాంగ్రెస్ పార్టీ జరుపుతున్న మేధోమథన సదస్సులో దేశ రాజకీయ పరిస్థితులతో పాటు రాహుల్ గాంధీకి పార్టీ కీలక బాధ్యతలు అప్పగించే అంశంపై కూడా చర్చించారు. ఈ విషయమై బహుశ నేడో రేపో అధికార ప్రకటన వెలువడగలదని భావిస్తున్నారు. రాహుల్ గాంధికి ఎ.ఐ.సి.సి. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా లభించినట్టయితే రాహుల్ కు పార్టీ వ్యవహారాలపై పూర్తి పట్టు లభిస్తుందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాహులే తమ ప్రధాని అభ్యర్థి అని పార్టీ ఇక అధికారికంగా ప్రకటించాలని కొందరు సీనియర్లు ఇప్పటికే పట్టుపడుతున్నారు. జ్యోతిర్ ఆదిత్య సిందియా, రాజీవ్ శుక్లా లతో పాటు మణి శంకర్ అయ్యర్ వంటి వారు సైతం రాహుల్‌కు మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. శనివారం ఉదయం చింతన్ శిబిర్ చర్చలు ప్రారంభం కావడానికి ముందు పార్టీ నాయకుడు సంజయ్ నిరుపమ్ మాట్లాడుతూ 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని రాహులే నడిపిస్తారని, ప్రధాని అభ్యర్థి కూడా రాహుల్ గాంధీయేనని అని వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్ నాయకుడు జితేందర్ ప్రసాద కూడా ఇవే మాటలు మాట్లాడారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో పార్టీని నడిపించేదీ రాహులే, దేశాన్ని నడిపించేది కూడా రాహులే అని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి నాయకత్వం అప్పగించాలని దిగ్విజయ్ సింగ్ కూడా సూచిస్తున్నారు. ఒకరి ఒకే పదవి అనే విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని రాహుల్ గాంధీ శనివారం చింతన్ శిబిర్‌లో సూచించారు. జోడు పదవులను నాయకులు అన్ని స్థాయిల్లో వదులుకోవాలని ఆయన సూచించారు. పార్టీలో సామాజిక న్యాయాన్ని తెస్తామని ఆయన అన్నారు. పార్టీ, ప్రభుత్వాల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు.  

Kamalananda Bharati gets bail

స్వామి కమలానంద భారతికి బెయిల్

        ఎంఐఎం నేత అక్బరుద్దీన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్వామి కమలానంద భారతికి బెయిల్ దొరికింది. నాంపల్లి కోర్టు శనివారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఐదు వేల రూపాయలేసి రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు కమలానంద భారతిని ఆదేశించింది.   కేసు విచారణ సమయంలో సిట్ పోలీసులకు పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని, హైదరాబాద్‌ విడిచి వెళ్లరాదని కోర్టు కమలానందకు షరతు విధించింది. కమలానంద భారతిని పోలీసులు ఈ నెల 14వ తేదీన శ్రీశైలంలో అరెస్టు చేశారు. కమలానంద భారతిని ఒక రోజు పాటు తమ కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించారు. ఆ గొంతు తనదేనని అంగీకరిస్తూ తాను వ్యక్తిగత దూషణలకు దిగలేదని, అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై మాత్రమే తాను వ్యాఖ్యలు చేశానని కమలానంద భారతి పోలీసులకు చెప్పారు.  

17th NTR death anniversary

నేడు ఎన్టీఆర్ 17వ వర్థంతి

  దివంగత ముఖ్యమంత్రి, భారతదేశం గర్వించదగిన గొప్ప నటుడు, దర్శకనిర్మాత నందమూరి తారక రామారావు గారి 17వ వర్ధంతి నేడు. తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా 1982 లో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి 9 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ఎకచ్చత్రాధిపత్యానికి తెరదించారు. 302 సినిమాల్లో నటించిన ఎన్టీఆర్.. తన పాలనలో చేపట్టిన పథకాలను వేర్వేరు పేర్లతో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇప్పటికి అమలు చేస్తూ తమ పేర్లు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పిన తక్కువేనని చెప్పని వాళ్ళెవ్వరూ ఉండరంటే అతిశయక్తి కాదేమీ..! నందమూరి తారక రామారావు గారి 17వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లోని ఆయన సమాధి వద్ద ఆయన కుటుంబసభ్యులంతా నివాళు అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, దగ్గుబాటి దంపతులు, బాలకృష్ణ, హరికృష్ణ ,రామకృష్ణ మోహనకృష్ణ తదితరులు ఎన్టీయార్ కు ఘనంగా నివాళులర్పించారు.   

BJP protests Kamalananda Swamy's arrest

కమలానంద విడుదల కోసం పిఎస్ వద్ద స్వామిజీల జాగారం

        కమలానంద అరెస్ట్ ను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు రాత్రి నుంచి ఆందోళనలు చేస్తున్నారు. కమలానంద ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకున్నా పోలీసులు అరెస్ట్ చేశారని వారు ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ ని కలిసేందుకు వెళ్ళిన హిందూ మత పెద్దలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి స్వామీజీలు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకి దిగారు. కమలానంద భారతిని విడుదల చేసేంతవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని పోలీస్ స్టేషన్ ముందు బైటాయించారు. రాత్రి నుండి ఆందోళన చేస్తున్న స్వామిజీలకు భారతీయ జనతా పార్టీ నేతలు, విశ్వహిందూ పరిషత్ నేతలు మద్దతు పలికారు. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి "కమలానంద మాట్లాడుతుండగా తాను అక్కడే ఉన్నానని, ఆయన ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదన్నారు". ఆయనను వెంటనే విడుదల చేయాలన్నారు.  స్వామిజీలకు మద్దతుగా భారీగా బిజెపి, విహెచ్‌పి కార్యకర్తలు తరలి వస్తున్నారు.          

ganta srinivasa rao

శ్రీనివాసరావు డిల్లీ యాత్రకి బ్రేకులేసిన చిరంజీవి?

  ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన అనకాపల్లి శాసనసభ్యుడు గంటా శ్రీనివాస రావు చిరంజీవి వెంటతిరుగుతూ, రాష్ట్రంలో మంత్రి పదవి కూడా కైవసం చేసుకొని రాష్ట్ర రాజకీయాలలోచక్రం తిప్పుతున్నారిప్పుడు.   కొద్దిరోజులక్రితం విశాఖలో జరిగిన సమైక్యాంధ్ర సభలో పాల్గొని తానూ సమైక్యవాదినని విస్పష్టంగా తెలియజేసారు. తమ నాయకుడు చిరంజీవి కూడా సమైక్యవాదయినప్పటికీ, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న కారణంగా, ఆయన తన మనసులో మాటను పైకి అనలేకపోతున్నారనే సంగతి గ్రహించిన గంటా శ్రీనివాసరావు, గత కొద్ది రోజుల నుండి కొంచెం గట్టిగానే సమైక్యంద్ర గళం వినిపించడం మొదలుపెట్టారు.   మరొక పదిరోజుల్లో కేంద్రం రాష్ట్ర విభజనపై తన నిర్ణయం ప్రకటించనున్న ఈ తరుణంలో, విభజన ఖాయం అని వస్తున్న వార్తల నేపద్యంలో కొంత మంది సీమంద్రా మంత్రులు, శాసనసభ్యులతో కలిసి గంటా శ్రీనివాసరావు కూడా డిల్లీ వెళ్లి సమైక్యాంద్రకు అనుకూలంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సిద్దమయారు. అయితే ఆఖరి నిమిషంలో ఆయన ప్రయాణం వాయిదాపడింది.   కేంద్రం తన నిర్ణయం ప్రకటించబోతున్న తరుణంలో తన సహచరుడయిన ఆయన స్వయంగా డిల్లీ వెళ్ళినట్లయితే, తానే వెనకుండి కధ నడిపిస్తున్నాననే తెరాస వాదనకి బలం చేకూర్చినట్లు ఉంటుందని చిరంజీవి భావించడం వల్లనే గంటా శ్రీనివాసరావు ప్రయాణానికి చిరంజీవి బ్రేకులు వేసి ఉండవచ్చును.

 Tamil Nadu CM Jayalalitha Idly 1 rupee

జయలలిత కొత్తస్కీమ్: రూపాయికే ఇడ్లీ, పెరుగన్న రూ.3

      తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఓ ప్రజాకర్షక పథకానికి రంగం సిద్దం చేశారు. కేవలం 5 రూపాయలకు భోజనం, రూపాయికి ఇడ్లీ పెట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సంధర్భంగా ఆమె తన కొత్త నిర్ణయం వెలువరించారు. ఈ భోజన పధకం కోసం వెయ్యి క్యాంటిన్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.ఇందులో ఐదు రూపాయలకు భోజనం,మూడు రూపాయలకు పెరుగన్నం, రూపాయికి ఇడ్లి విక్రయిస్తారు. పేదలకు గొప్పవరంగా ఈ పథకం మారుతుందని అంటున్నా ..వారిని బద్దకస్తులు చేయడానికి ఇది పనికి వస్తుందని విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పటికే గుజరాత్ లో ఇలాంటి పథకం అమలు శ్రీకారం చుట్టారు. రూ.10 కి చపాతి, కుర్మా అందించేందుకు రంగం సిద్దం చేశారు. ఢిల్లీలోనూ జన ఆహార కేంద్రాల పేరుతో అల్పాహారం అందిస్తున్నారు.  

prime minister

మౌన ముని మన్మోహన్

  బహుశః మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ.నరసింహరావు గారి శిష్యరికం చేయడం వల్లనే ఆయన మౌనదీక్షను పుణికిపుచ్చుకోన్నారో మరేమో తెలియదు గానీ మన ప్రధాని మన్మోహన్ సింగు అక్షరాల అయనకి ఈ విషయంలో సరయిన వారసుడని చెప్పవచ్చును. అయితే, నరసింహారావుగారిని ఇదే విషయాన్నీ పత్రికలవాళ్ళు అడిగినప్పుడు, అయన “ఎవరన్నారు నేను స్పందించడం లేదని? నా మౌనం కూడా ఒక రాజకీయ ఎత్తుగడలో భాగమే” అని తెలివిగా పలికి తప్పించుకొన్నారు. అయితే మన్మోహన్ సింగు మాత్రం ఆమాట కూడా అనలేకపోయారు.   దేశంలో ఎంత పెద్ద సంచలనం లేదా ఉపద్రవం తలెత్తినాకూడా ఆయన పెదవి విప్పి ప్రజలకి నేనున్నాని భరోసా ఇవ్వరు. ఒకవేళ నోరు విప్పినా అది ఓ మొక్కుబడి తంతుగా ఉంటుందే తప్ప నిజంగా హృదయంలోంచి వచ్చిన స్పందనగా మాత్రం కనిపించదు. గత నెల, డిల్లీలో జరిగిన ఘోర అత్యాచారంపై దేశమంతా ముక్త కంఠంతో నిరసనలు తెలియజేస్తుంటే, స్పందించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదే తప్ప, తనది కాదన్నట్లు నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయారు. దేశాన్నిపాలిస్తున్న ఒక సమున్నత ప్రభుత్వాధినేతగా స్పందించకపోవడం, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తదితరులు మాత్రమే దీనిపై స్పందిస్తుండటంతో, విపక్షాలు నిలదీసినప్పుడు మాత్రమే ఆయన మొక్కుబడిగా స్పందిచేరు.   అయన తన చర్యలతో తను, తన ప్రభుత్వం వెనకుండి నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీయే పరోక్షంగా దేశాన్ని పాలిస్తున్నట్లు మరోమారు ఋజువు చేసారు. ఆదేవిదంగా, పలు కీలక అంశాలయిన తెలంగాణా సమస్య, మణిపూర్ అల్లర్లు వంటి వాటిపై మన్మోహన్ సింగు కూడా ఆయన పెదవి విప్పిందిలేదు. అందువల్లే నేడు, మన రాష్ట్రంలో నేతలు, మంత్రులు నేరుగా సోనియా గాంధీని కలిసి సమస్యలు విన్నవించుకొని ఆమె నుండి పరిష్కారాలు ఆశిస్తారే తప్ప ప్రధాన మంత్రిని కలవాలని ఎవరూ అనుకోరు. నిర్ణయాలు ప్రకటించే అధికారం లోపించినట్లు ప్రవర్తిస్తున్నఆయన తీరుతో ప్రధాన మంత్రి పదవికూడా ఒక రబ్బర్ స్టాంప్ పదవేనన్న భావన ప్రజలలో కలిగిస్తున్నారు.   మళ్ళీ, ఇటీవల కొద్ది రోజులుగా జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలో పూంచ్ సరిహద్దు వద్ద పాకీస్తానీ సైనికులు చేసిన దురాగతం పట్ల, పాక్ ఆగడాల గురించీ ఆయన నుండి ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. ఆయన ప్రభుత్వం, మంత్రులు ఈ విషయంలో ఏ చర్యలు తీసుకొంటున్నారో ప్రజలకి పత్రికలూ టీవీ చాన్నాళ్ళ ద్వారా తెలుసుకోవాలి తప్ప, ఆయన స్వయంగా నోరువిప్పి ప్రజలకి తెలియజేయాలనుకోలేదు. మళ్ళీ, ఇప్పుడు కూడా ఆ బాధ్యతను కాంగ్రెస్ పార్టీకీ, సోనియా గాంధీకే అప్పగించేసినట్లు కనిపిస్తోంది.   అయన నిర్లిప్తధోరణిపై స్పందించిన ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక, ఇటువంటి విషయాలలో హృదయపూర్వకంగా స్పందించే అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాతో పోలుస్తూ ఒక వ్యాసం కూడా ప్రచురించింది. అమెరికాలో కొద్ది కాలం క్రితం న్యూయార్క్ నగర ప్రజలని శాండీ తుఫాను గడగడ లాడించినప్పుడు, అయన తన జీవితంలోనే అత్యంత కీలకమయిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని కూడా పక్కన బెట్టి స్వయంగా రంగంలోదిగి అక్కడి ప్రజలకు ఏవిదంగా భరోసా ఇచ్చేడో అందరికీ తెలిసిందే.   అదే విదంగా అ తరువాత కనెక్టికట్ నగరంలో స్కూలులో చదువుకొంటున్న చిన్నారులను ఒక ఉన్మాది పొట్టన పెట్టుకోన్నపుడు కూడా ఒబామా చేసిన భావోద్వేగప్రసంగంతో ప్రజల మన్ననలు పొందగలిగేరు. ఒక ప్రముఖ అంతర్ జాతీయ పత్రిక టైమ్స్ పత్రిక మనోమోహన్ గురించి వ్రాస్తూ ‘అండర్ ఎచీవర్’ (అసమర్దుడు) అని కవర్ పేజీ ఆర్టికల్ కూడా వ్రాసేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉలిక్కి పడి దిద్దుబాటు చర్యలు చేపటింది. గానీ మళ్ళీ షరా మామూలుగానే సాగిపోతోంది ఆయన, కాంగ్రెస్ పార్టీ ధోరణి.   ఒక సంఘటన లేదా ఒక ఉపద్రవంపై మన ప్రధాని వెంటనే స్పందించడం మనం ఎన్నడూ చూసి ఉండలేదు. ఒక వేళ స్పందించినా అది రాజకీయ కోణంలోనే ఉంటుంది తప్ప నిజమయిన హృదయ స్పందనలా మాత్రం ఉండదు. ప్రతీ చిన్న, పెద్ద అంశాన్నికూడా రాజకీయ రంగుటద్దాలలోంచి తప్ప వేరేలా చూడలేని దౌర్భాగ్య పరిస్థితులవల్లనే, అయన వెనకంజ వేయక తప్పట్లేదు అనుకొని జనం సర్ది చెప్పుకోక తప్పదు.

congress leader

నేడు తల్లి కాంగ్రెస్ రేపు....

  ఎప్పుడు ఏశాసనసభ్యుడు ఏపార్టీలోకి కప్పలా గెంతుతాడో ఊహించలేని సంధి కాలం ఇది. నిన్నటివరకు ఏపార్టీ తరపున వఖల్తా పుచ్చుకొని మాట్లాడాడో, మరో పార్టీలోకి మారగానే ఆపార్టీనే ఒక పనికిరాని చెత్త పార్టీగా మీడియా ముందు నిర్లజ్జగా మాట్లాడుతూ ప్రజలని కూడా మభ్యపెట్టాలని చూస్తారు. కాకినాడ కాంగ్రెస్ శాసన సభ్యుడు ద్వారపూడి చంద్రశేకర్ రెడ్డి కాంగ్రెస్ నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మారగా, రెండవ వ్యక్తి కృష్ణా జిల్లా పెడన శాసనసభ్యుడు జోగి రమేష్ నేడో రేపో అదే పార్టీలోకి జంపింగ్ కోసం సిద్దంగా ఉన్నారు. తనను శాసనసభ్యుని చేసిన కాంగ్రెస్ పార్టీని వదిలిపెడతాను, గానీ తన శాసనసభ్యత్వం మాత్రం వదలబోనని చంద్రశేకర్ రెడ్డి నిసిగ్గుగా తెలియజేయడం వర్తమాన రాజకీయ ప్రమాణాలకు అద్దం పడుతోంది. జోగి రమేష్ కూడా పార్టీ నుంచి బయటపడే ప్రయత్నంలో భాగంగా ‘తాను గత ఎన్నికలలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి బొమ్మతోనే ఎన్నికయ్యానని, వచ్చే ఎన్నికలలో కూడా రాజశేఖరరెడ్డి బొమ్మతోనే ప్రజల దగ్గరకు వెళతానని’ లాంచనంగా ప్రకటన కూడా చేసేసి మూటా ముల్లె సర్దుకోవడం ప్రారంబిచేరు.   ఎన్నికలు దగ్గిర పడుతున్న కొద్దీ, ఇటువంటి కప్ప గంతుల కబుర్లు మనం చాలానే వినవలసి ఉంటుంది. ప్రజలు ఒక పార్టీని అభిమానించి ఆ పార్టీకి చెందినా వ్యక్తికి ఓటేసి గెలిపిస్తే అతను ఈ విదంగా తనకు రాజకీయ ప్రయోజనం చేకూర్చే మరో పార్టీలోకి మారడం ప్రజల ఓటుని అపహాస్యం చేయడమే అవుతుంది.

 Akbaruddin Owaisi sent to five day police custody

అక్బరుద్దీన్ ఓవైసీకి 5 రోజుల పోలీస్ కస్టడీ

        వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్టై అదిలాబాద్ సబ్ జైలులో ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీకి ఐదు రోజులపాటు పోలీస్ స్టడీ విధిస్తూ నిర్మల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్బర్‌ను కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు పెట్టుకున్న పిటిషన్‌పై శుక్రవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు ముగిసిన అనంతరం తీర్పును మధ్యాహ్నానికి వాయిదా పడింది. భోజన విరామం అనంతరం న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు ఇచ్చారు. అక్బరుద్దీన్ ఓవైసీకి శుక్రవారం కడుపు నొప్పి వచ్చింది. జిల్లా జడ్జి మధుసూదన్ మధ్యాహ్నం జైలును సందర్శించారు. ఈ సమయంలో అక్బరుద్దీన్ తనకు కడుపు నొప్పి వచ్చిందని జడ్జికి తెలియజేశారు. దీంతో ఆ జడ్జి వెంటనే రిమ్స్ వైద్యులను రప్పించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అక్బరుద్దీన్‌కు వైద్యులు చికిత్స అందించారు.  

mim party

ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్న యం.ఐ.యం.

  యం.ఐ.యం.పార్టీ శాసన సభ్యుడు అక్బరుదీన్ ఓవైసీ లండన్ నుండి హైదరాబాదులో కాలుపెట్టిన ప్పటినుండీ, ఈ రోజు వరకూ కూడా నగరంలో చుట్టుపక్కల జిల్లాలలోకూడా ప్రశాంతత కరువయింది. ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజల మద్య యం.ఐ.యం.పార్టీ శాసన సభ్యుడు చిచ్చుపెట్టడమే కాకుండా, అతనిని పోలీసులు అరెస్ట్ చేసినందుకు ఆ పార్టీ అల్లర్లను ప్రోత్సాహిస్తుండటం విచారకరం.   యం.ఐ.యం. పార్టీ ఒకవైపు తమది లౌకికవాద పార్టీ అని చెప్పుకొంటూనే మరో వైపు తమ శాసన సభ్యుడు అక్బరుదీన్ చేసిన విద్వేష ప్రసంగాన్ని సమర్దించుకొంటూ ద్వంద వైఖరిని ప్రదర్శిస్తోంది. అది చాలదన్నట్లు, కోర్టులు, చట్టాల పై తమకు పూర్తీ నమ్మకం ఉందని పలికిన నోటితోనే, చట్టాలను, పోలీసు వ్యవస్థను పరిహసిస్తున్నట్లు అల్లర్లను ప్రోత్సహిస్తోంది. యం.ఐ.యం.పార్టీ చెపుతున్న మాటలకి అది చేస్తున్న పనులకి ఎక్కడా పొంతన లేదు.   అక్బరుదీన్ కు జరిగినది ఘోర అన్యాయమని, అది అతనికేగాక యావత్ మైనార్టీ వర్గాలకు జరిగిన అన్యాయంగా చిత్రీకరించి చూపేందుకు ప్రయత్నిస్తూ, మైనార్టీ వర్గాలకు తామే అసలుసిసలయిన ప్రతినిదులము, రక్షకులమన్నట్లు వ్యహవహరిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలను పణంగా పెట్టి రాజకీయంగా ఎదగాలని ప్రయత్నిస్తోంది. దేశ వ్యాప్తంగా అనేకమంది ముస్లిం మేధావులు ఈ ధోరణిని తీవ్రంగా ఖండించినా పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నయం.ఐ.యం.పార్టీ, ముస్లిమేతరులు తమకు వ్యతిరేఖంగా పలికే ప్రతీ మాటను మాత్రం ఆయుధంగా మలుచుకొని ముందుకు సాగడం నీచ రాజకీయాలకి పరాకాష్టగా చెప్పవచ్చును.

income tax raids

సీతమ్మ వాకిట్లో...ఎఫెక్ట్, దిల్ రాజు ఆఫీస్ పై ఐటీ దాడులు

  సినీ నిర్మాతలు దిల్ రాజు, దానయ్యల కార్యాలయాలు, నివాసాలపై గురువారంనాడు ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడి చేశారు. సినీ పరిశ్రమపై ఆదాయపు పన్నుశాఖల దాడులు సాదారణమయినప్పటికీ, ఇద్దరూ కూడా పెద్ద నిర్మాతలు కావడం, ఇద్దరూ కూడా పెద్ద హీరోలతో సినిమాలు తీస్తుండటంవల్ల ఈ దాడులకు కొంత ప్రతేకత ఉంది. దిల్ రాజు మహేష్ బాబు మరియు వెంకటేష్ లను పెట్టి తీసిన సినిమా 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' మరి కొద్ది గంటల్లో విడుదల కానుండగా ఈ దాడులు జరగడంతో ఆదాయపు పన్నుశాఖ అధికారుల దృష్టి దిల్ రాజు ఆదాయం పైనే కాకుండా. ఆ ఇద్దరు హీరోలతో అతను చేసుకొన్నఅగ్రిమెంటు మీద కూడా పడే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే, తరువాత వారిరువురి వంతూ వస్తుందనుకోవచ్చును. అదేవిదంగా నిర్మాత దానయ్య కార్యాలయంపై జరిపిన దాడిలో ఈ రోజు విడుదలయిన రామ్ చరణ్ తేజ చేసిన ‘నాయక్’ సినిమా అగ్రిమెంటుపై దృష్టిసారిస్తే, ఇంతవరకు నిశ్చింతగా ఉన్న రామ్ చరణ్ తేజకి కూడా ఆదాయపు పన్నుశాఖ అధికారులతో తలనొప్పులు మొదలయ్యే అవకాశం ఉంది. తీగలాగితే దొంక కదలుతుందంటే ఇదేనేమో!

chiranjeevi

విద్యుత్ ఛార్జీలు పెంచడం తప్పే: చిరంజీవి

  ఒకవైపు ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా పెంచిన విద్యుత్ చార్జీలమీద వీధులకెక్కి పోరాటాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరో వైపు తన కాబినెట్ మంత్రులే ఒకరి తరువాత మరొకరు తనని తప్పు పట్టడం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దానికి తోడూ పీ.సీ.సీ. అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బయట ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతున్నా, తనని కలిసినప్పుడు మాత్రం పుండు మీద కారం చల్లినట్లు ‘ మాకెవరికీ తెలీనీకుండా అట్టాగ మీరొక్కరే ఫైళ్ళమీద సంతకాలు పొడిసేత్తే మరిట్టాగే ఉంటుంది యవ్వారం’ అని సన్నాయి నొక్కులు నొక్కుతుంటే కిరణ్ కుమారుని పరిస్థితి కక్కలేని, మింగలేని పరిస్థితయింది.   అందరూ ఎవరికీ తోచినది వారు మాట్లాడేస్తుంటే కేంద్ర మంత్రినయి ఉండి తానూ మాట్లాడితే తప్పేమిటి అనుకొన్న చిరంజీవి కూడా తన అనుచరుడు రామచంద్రయ్య చెప్పినట్లు కరెంటు చార్జీలు పెంచితే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదన్న అభిప్రాయంతో తానూ కూడా ఏకీభవిస్తునానంటూ పత్రిక వాళ్ళని పిలిచి చెప్పేడు.

 Case filed against Asaram Bapu

ఢిల్లీ గ్యాంగ్ రేప్: ఆశారాం సంచలన వ్యాఖ్య, కేసు నమోదు

          ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆధ్యాత్మిక గురువు ఆసారాం బాపూ పై కేసు నమోదైంది. న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా పిర్యాదు మేరకు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎన్ పి సింగ్ ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద ఆసారాం బాపూ పై కేసు నమోదు చేశారు. గ్యాంగ్ రేప్ కు గురై చనిపోయిన యువతిని అసారాం తన వ్యాఖ్యలతో అవమానించారని, ప్రజల మనోభావాలు దెబ్బతీశారని న్యాయవాది సుధీర్ కుమార్ ఆరోపించారు. ఆయనను కటినంగా శిక్షించాలని కోరారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ లో నిందుతులతో పాటు బాధితురాలిది కూడా సమాన బాధ్యత ఉందంటూ అసారాం చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదం రేపింది. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన మహిళ లోకాన్ని, ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారని పిటిషనర్ ఆరోపించారు. 

అసదుద్దీన్ ఇంటి పై భజరంగ్‌దళ్ దాడి

        అక్బరుద్దీన్ సోదరుడి నివాసంపై దాడి జరిగింది. ఢిల్లీలోని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నివాసంపై భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ కార్యకర్తలు దాడి చేశారు. నివాసంపై రాళ్లు విసరడం వల్ల కిటికీల అద్దాలు పగిలినట్లు సమాచారం. ప్రవర్తన మార్చుకోకుంటే భవిష్యత్ లో మరిన్ని దాడులు చేస్తామని వీహెచ్‌పీ కార్యకర్తలు హెచ్చరించినట్లు సమాచారం. అసదుద్దీన్ ఓవైసీ తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ హిందువులకు వ్యతిరేకంగా, హిందూ మతానికి వ్యతిరేకంగా, ఉగ్రవాది కసబ్ కు మద్దతుగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగానే తాము దాడి చేశామని కార్యకర్తలు తెలిపారు.

ఢిల్లీ గ్యాంగ్ రేప్: ఆసారాం బాపు వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు

      ఢిల్లీ గ్యాంగ్ రేప్ పై ఆధ్యాత్మిక గురువు అసారాం బాపూ వివాదాస్పద వ్యాఖ్యలు చెసి వార్తల్లోకెక్కారు. ఢిల్లీ రేప్ ఘటనపై దేశమంతటా నిందుతులను నిందిస్తుంటే ఈయన మాత్రం బాధితురాలను కూడా ని౦దిస్తున్నారు. దీంతో అసారాం బాపు వ్యాఖ్యలపై మహిళ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసారాం బాపూ వివాదాస్పద వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ పై నిన్న అసారాం బాపూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు మాత్రమే దోషులు కారని, రేపిస్ట్ కూడా దోషేనని వ్యాఖ్యానించారు. తనపై రేప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు వారిని అన్న అని వేడుకోవాల్సిందని అన్నారు. ఒక చేతితో చప్పట్లు రావని, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయని, బాధితురాలు మర్యాదపూర్వకంగా వేడుకోనివుంటే తనకి ఈ గతి పట్టి ఉండేది కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిందితులను కటినంగా శిక్షిస్తే చట్టాలు దుర్వ్వినియోగం అయ్యే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. ఆధ్యాత్మిక గురువులు అసారాం బాపూ వ్యతిరేకంగా స్పందించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మరి దీనిపై అసారాం  ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

మహారాష్ట్రలో మత ఘర్షణలు, నలుగురి మృతి

      మహారాష్ట్రలోని ధూలే లో జరిగిన మత ఘర్షణల్లో నలుగురు మృతి చెందారు. ఆ పట్టణం మత ఘర్షణలతో అట్టుడుకి పోతోంది. ఓ హోటల్ లో మొదలైన చిన్నపాటి ఘర్షణ కొద్దిసేపటికి తీవ్ర స్థాయిలో మత ఘర్షణలకుదారి తీసింది. ఓ హోటల్ లో ఓ యువకుడు బిల్లు కట్టడానికి నిరాకరించిన విషయంతో ప్రారంభం అయిన ఈ ఘర్షణలను అదుపులోకి తేవడానికి పోలీసులు తీవ్రంగా కష్ట పడాల్సి వస్తోంది.   ఇరు వర్గాల దాడుల్లో ఇప్పటికే చాలా షాపులు ద్వంసం అయ్యాయి. ముంబాయి కి దాదాపు 350 కి.మీ. దూరంలో ఉన్న ఈ పట్టణంలో జరిగిన ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకూ 250 మంది వరకూ గాయపడినట్లు సమాచారం. ఆందోళన చేస్తున్న వారు కనిపించిన షాపులన్నింటినీ ధ్వంసం చేయడం మొదలు పెట్టారు.   ఈ అల్లర్లను అదుపులోకి తేవడానికి పోలీసులు మొదటగా లాఠీ చార్జ్, ఆ తర్వాత కాల్పులు జరపాల్సి వచ్చింది. మరోవైపు 160 మంది పోలీసులు కూడా తమ విధి నిర్వాహణలో గాయపడ్డారు. గాయపడిన వారందరినీ వివిధ ఆసుపత్రిలలో చేర్పించారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆ పట్టణంలో నిరవధిక కర్ఫ్యూ విధించారు.

ఢిల్లీ రేప్ విక్టిమ్ కూడా దోషే: ఆసారాం బాపు సంచలనం

        ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు పై ఆధ్యాత్మిక గురువు అసారాం బాపు సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్యాంగ్ రేప్ కు గురైన బాధితురాలు కూడా దోషేనని అసారాం బాపు అన్నారు. అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు మాత్రమే దోషులు కారని, రేపిస్ట్ కూడా దోషేనని వ్యాఖ్యానించారు. తనపై రేప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు వారిని అన్న అని వేడుకోవాల్సిందని అన్నారు. ఒక చేతితో చప్పట్లు రావని, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయని, బాధితురాలు మర్యాదపూర్వకంగా వేడుకోనివుంటే తనకి ఈ గతి పట్టి ఉండేది కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిందితులను కటినంగా శిక్షిస్తే చట్టాలు దుర్వ్వినియోగం అయ్యే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. గ్యాంగ్ రేప్ నిందితులను కఠినంగా శిక్షించాలని దేశమంతటా ప్రజలు డిమాండ్ చేస్తుంటే, అసారాం బాపు మాత్రం ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం సంచలం సృష్టించింది.