ఇంకా అంధకారంలోనే ఏపీ అధికారులు!

జగన్ చీకటి పాలన తొలగిపోయి దగ్గర దగ్గర రెండు నెలలు కావొస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులలో చాలామంది ఇంకా అంధకారంలోనే వున్నారు. ఇంతకాలంలో చేయడానికి పనేమీ లేక టైమ్‌పాస్ చేసిన అధికారగణం, ఇప్పుడు ఒళ్ళు వంచి పనిచేయాల్సి రావడంతో ఇబ్బంది పడిపోతున్నారు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్టుగా పని నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ, సచివాలయాల్లో వున్న కొందరు అధికారులైతే, తాము సక్రమంగా పని చేయకపోగా, కొత్త మంత్రులను బోల్తా కొట్టించేలా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వ ఘనకార్యాలకు సంబంధించిన వివరాలు అడిగితే పూర్తి వివరాలు ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయం మీద అసెంబ్లీ లాబీల్లో మంత్రుల మధ్య చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వ అక్రమాలను వెలికి తీస్తోంది. ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో జరిగిన పనులు, దోపిడీపై అనేక మంది సభ్యులు అసెంబ్లీలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వీటిపై సరైన సమాచారం ఇవ్వాలని మంత్రులు అధికారులకు సూచిస్తున్నారు. అయితే అధికారులు ఇచ్చే అరకొర వివరాలు చూసి కొత్త మంత్రులు అసంతృప్తికి గురవుతున్నారు. తమనే బోల్తా కొట్టించేలా అధికారులు వ్యవహరిస్తున్నాని అంటూ  పలువురు మంత్రులు అసెంబ్లీలో చర్చించుకుంటున్నారు. గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అధికారులిచ్చిన సమాచారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ప్రశ్నకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వకుండా ‘‘అవును, కాదు, ఉత్పన్నం కాదు’’ అంటూ అధికారులు సమాధానమివ్వడం ఏంటని పవన్ కళ్యాణ్ అభ్యంతరం తెలిపారు. పొడి పొడిగానే సమాధానాలు చెప్పాలనే నిబంధన ఏమైనా ఉందా అని ఆయన అధికారులను ప్రశ్నించారు. అనుబంధ పత్రాల్లో కాకుండా సభ్యులకిచ్చే సమాధానంలోనే వివరాలు ఉంచేలా చూడాలని అధికారులను పవన్ ఆదేశించారు. అదేవిధంగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపైనా అధికారుల సమాచారంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. జగన్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఎంత మాత్రం మళ్లించలేదని అధికారులు సమాచారమిచ్చారు. దీనిపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎస్సీ సబ్​ ప్లాన్​ నిధుల మళ్లింపు విషయంలో పూర్తిస్థాయి సమాచారం తనకు అందలేదని మంత్రి తెలిపారు. వెంటనే పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

తల్లికి వందనం.. జగన్‌కి వాత!

తల్లికి వందనం స్కీమ్ విషయంలో జగన్‌కి, ఆయన తోక బ్యాచ్‌కి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అట్లకాడ కాల్చి వాత పెట్టారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు.. ఈ జగన్ పిశాచాలు ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రకటించిన పథకాల మీద విష ప్రచారాన్ని చేయడంలో బిజీగా వున్నాయి. ముఖ్యంగా ‘తల్లికి వందనం’ పథకం మీద ఈ దండుపాళ్యం బ్యాచ్ ఎవరి నోటికొచ్చినట్టు వాళ్ళు వాగుతూ విషాన్ని చిమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌కి, జగన్ దండుపాళ్యం బ్యాచ్‌కి నోళ్ళు మూతలు పడేలా మంత్రి నారా లోకేష్ ప్రకటన చేశారు. తమ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగానే, తల్లికి ఎంతమంది పిల్లలు వున్నా అందరికీ ‘తల్లికి వందనం’ పథకం వర్తింపజేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. జగన్ ప్రభుత్వం వున్న సమయంలో అమ్మ ఒడి పథకంలో రకరకాల మార్సులు చేసి ఇచ్చే డబ్బులో ఎన్నెన్నో కోతలు కోశారని, తమ ప్రభుత్వం అలాంటి పనులు చేయదని లోకేష్ స్పష్టం చేశారు. జగన్ అండ్ జగన్ దండుపాళ్యం బాచ్‌లూ.. ఈ పథకం విషయంలో మీకు పడిందిగా వాత.. ఇక మీ నోళ్ళకి పడాలి మూత!

అక్కడ అన్న.. ఇక్కడ చెల్లి.. నాటకాల కుటుంబం!

అన్నియ్య జగన్, చెల్లెమ్మ షర్మిల ఎవరికివాళ్ళు ఆస్కార్ లెవల్లో యాక్టింగ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఒకవైపు జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్నిగుండంగా మారిపోయింది అని ఇక్కడ అరుపులు, రంకెలు పెట్టి.. ఇప్పుడు ఢిల్లీలో డ్రామా ఆడుతూ వుంటే, మరోవైపు చెల్లెమ్మ షర్మిల మరో వైరెటీ డ్రామా క్రియేట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నందమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల  పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడతో ఆగొచ్చు కదా.. అలా కాకుండా నడుంలోతు నీళ్లలో దిగి హడావిడి చేశారు. ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలిస్తూనే వుంది. ఇంతలోపే షర్మిల ఇలా నాటకాలు ఆడి, సీన్‌ని రక్తికట్టించే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్‌ని ఇంకా నాశనం చేసి తీరాలని వైఎస్సార్ కుటుంబం తమవంతు ప్రయత్నం చేస్తోంది. వీరి బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలదే!

మత్స్యకారులకు మంచి కబురు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులకు ఉరి తాడులా మారిన జీవో 217ను రద్దు చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శాసనసభలో ప్రకటించారు. శాసన సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ, గత ప్రభుత్వంలో మత్స్యకారులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో అచ్చెన్నాయుడు వివరించారు. జీవో 217 మత్సకారుల పాలిట మరణశాసనం అని చెప్పవచ్చు. ఇలాంటి దుర్మార్గమైన జీవోని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మత్స్యకారులు ఎంత వ్యతిరేకించినా వెనకడుగు వేయలేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల మెడకు చుట్టుకున్న జీవో నంబర్ 217 అనే ఉరితాడు తొలగిపోయింది. ఈ జీవో ప్రకారం గ్రామాల్లో వంద ఎకరాలకు పైబడి వుండే చెరువుల్లో చేపలు పట్టుకునే అవకాశం స్థానికంగా వుండే మత్స్యకారులకు వుండదు. ఆన్‌లైన్‌లో వేలంపాటలో పాల్గొనడం ద్వారానే సదరు చెరువుల మీద హక్కు ఏర్పడుతుంది. సాధారణంగా గ్రామాల్లో మత్స్యకార సహకార సంఘాల ఆధ్వర్యంలో చెరువుల్లో చేపల వేట జరుగుతూ వుంటుంది. ఆ సంప్రదాయానికి 217 జీవో బ్రేక్ వేస్తుంది. బయటివాళ్ళు చెరువుల మీద ఆధిపత్యం చేసే అవకాశం ఇస్తుంది. ఈ జీవో రాష్ట్రంలోని 7 వందలకు పైగా వున్న మత్స్యకార సహకార సంఘాలకు, వాటి మీద ఆధారపడి వున్న 4 లక్షల మంది మత్స్యకారులకు గొడ్డలిపెట్టు లాంటిది. తెలుగుదేశం ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడం పట్ల మత్స్యకారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తెలుగువన్ ముందే చెప్పింది.. జగన్ అడుగు కాంగ్రెస్ వైపే పడింది!

వైసీపీ వ్యూహం మార్చింది. ఇండియా కూటమికి అంటే కాంగ్రెస్ కు దగ్గరౌతోంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న ఐదేళ్లూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు అడుగులకు మడుగులొత్తుతూ రాష్ట్ర ప్రయోజనాల ఊసే లేకుండా గడిపేసిన వైసీపీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కోల్పోగానే బీజేపీకి దూరం జరిగి కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు దగ్గర అవ్వడానికి అడుగులు వేస్తున్నది.  కాంగ్రెస్‌తో దోస్తీ.. మారిన జ‌గ‌న్ వ్యూహం !? శీర్షికన జగన్ అడుగులు ఏ దిశగా పడనున్నాయన్న విషయాన్ని తెలుగువన్ మూడు రోజుల ముందే చెప్పింది.  ఏపీలో చంద్రబాబు సర్కార్ ను ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత  మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి   కాంగ్రెస్ కు దగ్గరౌతున్నారని విస్పష్టంగా చెప్పింది. ఇందుకు కాంగ్రెస్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని పేర్కొంది. ఇప్పుడు తాజాగా  వైసీపీ లోక్ సభ డిప్యూటీ స్పీకర్ విషయంలో కాంగ్రెస్ వాదనకు మద్దతు పలకడం ద్వారా తన అడుగులు ఎటుపడుతున్నాయన్నది చెప్పకనే చెప్పేసింది.    జగన్ కాంగ్రెస్ కు మద్దతుగా  నిలిస్తే అందుకు ప్రతిగా జాతీయ‌ రాజ‌కీయాల్లో జ‌గ‌న్ మోహ‌న్ను హైలేట్ చేసేందుకు కాంగ్రెస్ పెద్ద‌లు అంగీకరించారనీ, ఈ మేరకు వైసీపీ, కాంగ్రెస్ ల మధ్య డీల్ కుదిరిందని  ఢిల్లీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.  ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తరువాత, ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రెండు సార్లు బెంగళూరు పర్యటనకు వెళ్లారు. ఆ రెండు సందర్భాలలోనూ ఆయన కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగానే జగన్ తన ప్రతిపాదనలను ఆయన ద్వారా కాంగ్రెస్ హై కమాండ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు.  కాంగ్రెస్ పార్టీకి రాజ‌కీయంగా వైసీపీ  మ‌ద్ద‌తు, ఫండింగ్ ఉంటుందని జగన్ చెప్పారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే అప్పట్లో జగన్ తో  తన భేటీ వార్తలను డీకే శివకుమార్ ఖండించారు. కానీ తాజా పరిణామాలను గమనిస్తే.. జగన్, కాంగ్రెస్ ల మధ్య ఏదో స్థాయిలో సఖ్యత ఏర్పడిందని స్పష్టమౌతోంది.  వైసీపీ గత పదేళ్లుగా ఎన్డీయే కూట‌మికి మ‌ద్ద‌తుగా ఉంటూ వ‌చ్చింది. ఇందుకు ప్రధాన కారణం ఆ పార్టీ అధినేత జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసులేనని తెలిసిందే.  ఇప్పుడు కూడా అక్రమాస్తుల కేసులు జగన్ మెడపై కత్తిగా వేలాడుతున్నప్పటికీ   కాంగ్రెస్ కు వైసీపీ మ‌ద్ద‌తుగా నిలుస్తోంది. ఇందుకు  కారణం లేకపోలేదు. కాంగ్రెస్ కు లోక్ సభలో మద్దతుగా నిలిచినా.. రాజ్యసభలో వైసీపీకి ఉన్న 11 మంది ఎంపీల మద్దతు కోసం మోడీ సర్కార్ తన జోలికి రాదని జగన్ ధీమాగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ విషయంలో వైసీపీ బాహాటంగా కాంగ్రెస్ వాదనకు మద్దతు ప్రకటించింది.  లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమికి కేటాయించాలంటూ గళమెత్తింది.   ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలనే విషయాన్ని ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో విజయసాయిరెడ్డి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.  డిప్యూటీ స్పీకర్‌ పదవి ఖాళీగా ఉంటోందని, దీన్ని ప్రతిపక్షాల ఉమ్మడి కూటమికి దక్కాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇక చాలు.. ఆస్పత్రిలో లాలు..!

ఎన్నో సంవత్సరాలుగా అనారోగ్యంతో పోరాటం చేస్తున్న బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్న లాలు ప్రసాద్‌కి డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. సోమవారం వరకు లాలు పాట్నాలోనే వున్నారు. ఆయన అనారోగ్యం తిరగబెట్టడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీకి తరలించారు. బిహార్‌లో జరిగిన దాణా కుంభకోణంలో దోషిగా తేలిన ఆయన, ప్రస్తుతం అనారోగ్య కారణాలతో బెయిల్ మీద వున్నారు. లాలు ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందన్న అనుమానాలు కలుగుతూ వుండటంతో ఆయన కుటుంబ సభ్యులందరూ ఆస్పత్రిలోనే వున్నారు. లాలు స్పృహలోనే వున్నారు. ఒక సందర్భంలో కుటుంబ సభ్యులతో ‘ఇక చాలు.. చాలా అలసిపోయాను’ అని లాలు అన్నట్టు తెలుస్తోంది. లాలు ప్రసాద్ ఎన్నో సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో పోరాటం చేస్తున్నారు. రెండేళ్ళ క్రితం సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి కూడా చేయించుకున్నారు. లాలు కుమార్తె రోహిణి ఆచార్య తండ్రికి కిడ్నీ దానం చేశారు. కిడ్నీ మార్పిడి తర్వాత లాలు కోలుకున్నట్టే కనిపించారు. తనదైన శైలిలో మీడియాతో కూడా మాట్లాడేవారు. అయితే, ఈ మధ్యకాలంలో ఆయన అనారోగ్యం తిరగబెట్టింది. 

హైదరాబాద్ జియాగూడలో భారీ అగ్ని ప్రమాదం... బాలిక మృతి, పలువురి పరిస్థితి విషమం 

హైదరాబాద్‌ పాతబస్తీలోని జియాగూడలో భారీ అగ్నిప్రమాదం  జరిగింది. ఈ ఘటనలో బాలిక మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత జియాగూడ వెంకటేశ్వరనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న ఫర్నీచర్‌ తయారీ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి బిల్డింగ్‌ మొత్తానికి వ్యాపించాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా లాభంలేకపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కుల్సుంపుర జియగూడ పరిధిలోని వెంకటేశ్వరనగర్‌లో ఉన్న ఫర్నిచర్ తయారీ గోదాంలో జరిగిందీ ఘటన. భవనం మూడో అంతస్తులో ఈ తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే అగ్నిమాపిక సిబ్బందికి సమాచారం అందించారు. వారు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.  గోదాములో చిక్కుకున్న 20 మందిని రక్షించారు. వారిలో  తీవ్రంగా గాయపడిన ఆరుగురిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇక జగన్ అక్రమాస్తుల కేసుల రోజువారీ విచారణ

జగన్ అక్రమాస్తుల   కేసుల్లో ఇక రోజు వారీ విచారణ జరగనుంది. సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులు నత్తనడకన నడుస్తున్న సంగతి తెలిసిందే.   రోజువారీ విచారణ చేపట్టాలంటూ సీబీఐ కోర్టును మంగళవారం తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను సత్వరం పూర్తిచేసేలా సీబీఐ కోర్టుకు ఆదేశాలివ్వాలని కోరుతూ మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య గత ఏడాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆ ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు రోజువారీ విచారణను కొనసాగించాలని సీబీఐ కోర్టుకు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా  విచారణ ఏ స్థాయిలో ఉందన్న విషయంపై నివేదిక సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల  కేసుల విచారణను నిందితులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని హరిరామజోగయ్య తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్ కుమార్ లతో కూడిన ధర్మాసనం మంగళవారం(జులై 22న)  విచారించింది.తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.  హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు జగన్ అక్రమాస్తుల కేసుల్లో దాఖలైన డిశ్చార్జి పిటిషన్లపై   రోజువారీ విచారణ కొనసాగుతోంది. అరబిందో, హెటిరోలకు భూకేటాయింపులకు సంబంధించి నమోదైన కేసులో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. విజయసాయిరెడ్డి తరపు న్యాయవాది జి. అశోక్ రెడ్డి వాదనలు వినిపించగా తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో ఇక ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని న్యాయనిపుణులు అంటున్నారు. ఇంత కాలం ముఖ్యమంత్రి హోదా కారణంగా కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందిన జగన్ సీఎం పదవి నుంచి దిగిపోవడంతో అనివార్యంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని అంటున్నారు. 

కవిత అరెస్ట్ పై నోరు విప్పిన కెసీఆర్ 

తీహార్ జైల్లో గత నాలుగు నెలలుగా మగ్గుతున్న తన కూతురు కవిత విషయంలో బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నోరు విప్పారు. కవితకు బెయిల్ వచ్చే విధంగా ఢిల్లీ పెద్దలతో కెటీఆర్, హరీష్ రావు చర్చలు  జరిపిన సంగతి తెలిసిందే.  ఈ చర్చలు విఫలం కావడంతో పార్టీని విలీనం చేసే ప్రతిపాదన చేయనుందని వార్తలు సోషల్ మీడియాలో గుప్పు మన్నాయి. బిఆర్ఎస్ నేతలు పలువురు ఇప్పటికే బిజెపిలో చేరారు. నలుగురు బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరడానికి సిద్దమయ్యారు. అయినప్పటికీ కవిత విషయంలో ఈడీ కఠినంగా వ్యవహరిస్తోంది. బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. దీంతో బిఆర్ఎస్ అధినేత తీవ్ర ఆందోళనలో పడిపోయారు.   రాజకీయ కక్షతోనే తన కూతురు కవితను జైల్లో పెట్టారని... కూతురు జైల్లో ఉంటే తండ్రిగా తనకు బాధ ఉండదా? అని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తాను అగ్నిపర్వతంలా ఉన్నానన్నారు. తమ పార్టీకి ఎలాంటి క్లిష్ట పరిస్థితులూ లేవన్నారు. ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితులను కూడా తాము ఎదుర్కొన్నామన్నారు. చాలా క్లిష్టపరిస్థితుల్లో తెలంగాణను సాధించుకున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ పాలనపై పట్టు సాధించలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు పాలనపై దృష్టి సారించకుండా బద్నాం చేసే పనిలో ఉన్నారని విమర్శలు గుప్పించారు.

టీటీడీ పాలక మండలి రద్దు

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి రద్దైంది. పాలక మండలిలోని మొత్తం 24 మంది సభ్యులు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను ఆమోదించిన ప్రభుత్వం టీటీడీ బోర్డును రద్దు చేసింది.  కాగా ఇప్పటికే ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త ఛైర్మన్, బోర్డు సభ్యులను నియమించనుంది. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో రాజకీయ నియామకాలు జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల పవిత్రతను పాలకమండలి పట్టించుకోలేదనీ, కొండపై యథేచ్ఛగా అన్యమత ప్రచారం జరిగినా చూసీ చూడనట్లు వ్యవహరించిందనీ, శ్రీవారి బ్రేక్ దర్శనాల నుంచి కొండపై ప్రతి విషయంలోనూ వైసీపీ నేతల పెత్తనం పెరిగిపోయిందనీ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న చంద్రబాబు.. ప్రక్షాళనను తిరమల నుంచే ప్రారంభిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పినట్లుగానే పాత ఈవో ధర్మారెడ్డి స్థానంలో జె. శ్యామల రావు టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన తరువాత తిరుమల కొండపై అరాచకాలకు అడ్డుకట్ట వేసే కార్యక్రమం చేపట్టారు. కొండపై అపచారాలకు, అక్రమాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. తిరుమల కొండపై పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రద్దు కావడంతో త్వరలో కొత్త పాలక మండలి నియామకం జరిగనుంది.  

జగన్ ఢిల్లీ దీక్షకు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు డుమ్మా

ఆంధ్రప్రదేశ్‌‌లో శాంతిభద్రతలు అదుపు తప్పాయని ఆరోపిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నారు. ఇందుకోసం ఆయన నిన్ననే ఢిల్లీ వెళ్లిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులే టార్గెట్‌గా దాడులు, హత్యలు జరుగుతున్నాయని జగన్ ఆరోపిస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్వల్ప వ్యవధిలోనే 36 రాజకీయ హత్యలు జరిగాయని ఆరోపిస్తూ గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా నేడు ఇదే కారణంతో ఢిల్లీలోనూ నిరసనకు సిద్ధమయ్యారు. ప్రధాని, రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు కూడా చేయనున్నారు.నిన్న అసెంబ్లీని బాయ్‌కాట్ చేసిన జగన్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీ వెళ్లారు. అయితే, వీరిలో ఇద్దరు ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, వంకా రవీంద్ర మాత్రం జగన్‌తో ఢిల్లీ వెళ్లకుండా నిన్న శాసనమండలికి హాజరు కావడం చర్చనీయాంశమైంది. వీరిని చూసిన ఇతర నేతలు చర్చించుకోవడం కనిపించింది. రాజకీయంగానూ ఇది చర్చకు దారితీసింది.

ప్రత్యేక హోదా అడగకపోవడం చంద్రబాబు ముందు చూపుకు తార్కాణం!

ప్రత్యేక హోదా బీహార్ కు ఇవ్వడం సాధ్యంకాదని లోక్ సభలో కేంద్రం స్పష్టం చేసింది.ఎన్డీసీ పెట్టిన ఐదు నిబంధనలు హోదాకు అడ్డుగా ఉన్నాయన్నాయని కేంద్ర ఆర్ధిక మంత్రి పంకజ్ చౌదరి చెప్పడం గమనార్హం. దీనిని బట్టి ఏపీకీ హోదా హుళక్కే నని అర్ధమవుతున్నది.చంద్రబాబుకు ఆవిషయం తెలిసీ లేదు అనిపించుకోవడం ఇష్టంలేక అడగడంలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హోదా బదులు ప్రత్యక నిధులు అంశాల వారీగా కేంద్రం నుంచి రాబట్టాలని నిర్ణయించడం ద్వారా చంద్రబాబు తన ముందు చూపును చాటారని అంటున్నారు. అంశాల వారీగా కేంద్రం నుంచి నిథులు రాబట్టే అంశాన్ని ఎంపీలకు అప్పగించారు. అందులో భాగంగానే  విజయవాడ ఎంపీ  కేశినేని చిన్ని పోలవరం అంశాన్ని బడ్జెట్ కు ముందు రోజు అంటే  సోమవారం (జులై 22) సభలో ప్రస్తావించారు. కేశినేని నాని ప్రతిపాదనకు సభలో కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. ఆ స్పందన ప్రభావం బడ్జెట్ లో ప్రస్ఫుటంగా కనిపించింది.  అమరావతి రాజధాని,విశాఖ ఉక్కు ప్లాంట్, పోలవరం, రైల్వే ప్రాజెక్టుల విషయం పార్లమెంట్ లో తెలుగుదేశం ఎంపీలు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే ప్రస్తావించారు. పారిశ్రామిక ప్రగతి విషయంలో ఏపీకి కేంద్రం ఇతోధిక సహాయం, సహకారం అవసరమని కూడా సభలో ఎంపీలు కోరారు. ఒక రైల్వే ప్రాజెక్టుల విషయం మినహాయిస్తే లోక్ సభలో తెలుగుదేశం ఎంపీలు ప్రస్తావించిన ప్రతి అంశానికీ విత్త మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో సముచిత కేటాయింపులు  జరిపారు.  ఆ సంగతి పక్కన పెడితే వినుకొండ ఘటన సాకుతో రాజకీయ లబ్ధి కోసం హస్తినలో ధర్నా అంటూ జగన్ చేస్తున్న హడావుడికి కాంగ్రెస్ మద్దతు లభిస్తుందని ఆ పార్టీ నేతలు ఆశించారు. అయితే ఆ విషయంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు చంద్రబాబు కు మద్దతు పలికారు. వినుకొండ ఘటన పాత కక్షల కారణంగా జరిగిందని చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షర్మిల కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయి నుంచి అందిన సమాచారం మేరకు ఇద్దరు క్రిమినల్స్ మధ్య ఉన్న పాతకక్షలే వినుకొండ ఘటనకు కారణమని షర్మిల కుండబద్లలు కొట్టేశారు. దీంతో హస్తినలో ధర్నాకు కాంగ్రెస్ మద్దతుపై జగన్ పెట్టుకున్న ఆశలు ఆవిరి అయిపోయాయనే చెప్పాలి. జగన్ మాటలను ఆయన పార్టీ నేతలే నమ్మడం లేదన్న వార్తలకు ఊతం ఇచ్చే విధంగా జగన్ ఢిల్లీ ధర్నాకు ఆయన పార్టీకే చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, వంకా రవీంద్రలు గైర్హాజరయ్యారు. దీని ద్వారా జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని వారు చెప్పకనే చెప్పినట్లైంది.  రాష్ట్రం వరదలతో అతలాకుతలమౌతున్న సమయంలో అసెంబ్లీలో ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా  జగన్ ఢిల్లీలో ధర్నా అంటూ హడావుడి చేయడాన్ని ఆమె తప్పు పట్టారు.  

ఏపీకి ఊపిరి.. చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టిన కేంద్ర బడ్జెట్

ఏపీఅభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో నిధులు భారీగా కేటాయించడం నిజంగా రాష్ట్రానికి ఊపిరి పోసినట్లేననడంలో సందేహం లేదు.  ప్రధానిమోదీపై చంద్రబాబు,పవన్ కళ్యాణ్ పెట్టుకున్న నమ్మకాన్ని కేంద్ర బడ్జెట్ నిలబెట్టిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.   కేంద్ర విత్త మంత్రి నిర్మలాసీతారామన్ మంగళవారం (జులై 22) లోక్ సభలో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు  వరాల వర్షం కురిపించారు.  ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్లు నిధులు కేటాయించారు.ఈ నిధులు అప్పుగా ఇస్తున్నా  అభివృద్ధికి తోర్పాటు అవసరం. అలాగే స్వల్ప వడ్డీతో 30 ఏళ్లలోగా తీర్చాల్సిన ఆ అప్పు ఆంధ్రప్రదేశ్ కు ఏ మాత్రం భారం కాదన్న భావన వ్యక్తం అవుతోంది. అలాగే ఆహార భద్రతలో భాగంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుకు పూర్తి ఆర్ధిక సహకారం అందిస్తామని ఆర్ధిక మంత్రి నిర్మల్ సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.  రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్యాకేజీ ద్వారా నిధులు  బడ్జెట్ లో కేటాయిండం,  అలాగే విశాఖ-చెన్నై-ఒరుగల్లు-బెంగళూరు పారిశ్రామిక క్యారిడార్ నిర్మిస్తామన్నారు. రోడ్లు,పరిశ్రమల అభివృద్ధికి కనీససౌకర్యాల కల్పనకు సహకారం అందిస్తామని,ఐటీ అభివృద్ధికిచర్యలు చేపడాతామని ఆర్ధిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో  చెప్పడం విశేషం.అలాగే విభజన చట్టానికి అనుగుణంగా సహకారం అందిస్తామన్నారు. 50శాతం మిగిలేలా పంటల మద్దతు ధరలు పెంచుతామని హామీ ఇవ్వడం రైతులకు శుభవార్తే. పప్పు ధాన్యాలు,నూనె గింజల ఉత్పత్తి లో స్వయం సంవృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. అలాగే కూరగాయల ఉత్పత్తికి ప్రోత్సాహం, చిన్నమధ్యతరహా పరిశ్రమలకు ఆర్ధికసాయం,పేదలఇళ్ల నిర్మాణానికి చేయూత తదితరాలు రాష్ట్రానికి మంచి చేస్తాయనడంలో సందేహం లేదు. కేంద్రం ఏపీకీ బడ్జెట్లో అన్నివిధాల తోర్పాటు అందివ్వడం నిజంగా సంతోషదాయకమని సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ నిధుల వల్ల ఆర్ధిక కార్యకలాపాలు పెరుగుతాయన్నారు. వెనుకబడిన రాయలసీమ,ఉత్తరాంధ్ర జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా  సాయం లభిస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వాజపేయి హాయాం తరువాత బడ్జెట్ లో ఏపీకి ఈ స్థాయిలో కేటాయింపులు జరగడం ఇదే ప్రథమం.  2014లో రాష్ట్ర విభజన తరువాత  అధ:పాతాళంలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ కు10ఏళ్లగా రాజధాని లేదు.పోలవరం ఆగిపోయింది.అభివృద్ధి 20ఏళ్ల వెనుకబడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి బడ్జెట్లో ఈ స్థాయిలో నిధులు కేంద్రం కేటాయించడం రాష్ట్ర ప్రగతికి చంద్రబాబు చేస్తున్న కృషికి ఫలితం దక్కినట్టేనని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జెట్ స్పీడ్ తో తిరుమల ప్రక్షాళన

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల పవిత్రత జగన్ హయాంలో మంటగలిసింది. తిరుమల దేవుని సన్నిధిలో పారిశుద్ధం నుంచి ప్రతి విషయంలోనూ పూర్తి నిర్లక్ష్యం తాండవించింది. శ్రీవారి కల్యాణ కట్టలో పరిశుభ్రత కనుమరుగైంది. స్వామివారికి తలనీలాలు సమర్పించే భక్తులకు నిరంతరాయంగా వేడి నీరు అందే వసతి కూడా మృగ్యమైంది. తిరుమల కొండపై హోటళ్లు నాణ్యతకు, పరిశుభ్రతకు తిలోదకాలిచ్చేశారు. ఇక తిరుమలేశుని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పన విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం చేతులెత్తేసింది. అన్న ప్రసాద నాణ్యత నుంచి, తిరుమల దేవుని ప్రసాదమైన లడ్డూ నాణ్యత కూడా నాసిరకంగా మారిపోయింది. ఇక తిరుమల కొండపై అన్యమత ప్రచారం, టీటీడీలో అన్యమతస్థులకు కొలువుల సంగతి సరే సరి. ఈ పరిస్థితులన్నీ గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు కావాలని అన్నారు. అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే తిరుమల ప్రక్షాళనపై దృష్టి సారించారు.  దీంతో తిరుమల ప్రక్షాళన శరవేగంగా సాగుతోంది. ముందుగా ఆహార, ఆరోగ్య భద్రతపై దృష్టి సారించిన టీటీడీ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కౌస్తుభం సమీపంలోని బాలాజీ భవన్ లో నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఆహార పదార్థాలు లేవని గుర్తించిన అధికారులు ఆ హోటల్ ను సీజ్ చేశారు. అంతే కాకుండా ఈవో తిరుమల కొడపై పారిశుద్ధ్యం, పరిశుభ్రత, హోటళ్లలో నాణ్యతా లోపాలు, భక్తులకు సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే తిరుమలలోని ప్రధాన కల్యాణ కట్టను ఈవో, జేఈవో ఆకస్మిక తనిఖీ చేశారు.  శ్రీవారి కల్యాణ కట్టలో పరిశుభ్రత ఇంకా మెరుగుపరచాలని, తలనీలాలు సమర్పించే భక్తులకు నిరంతరాయంగా వేడి నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఈవో  జె.శ్యామలరావు ఆదేశించారు.  కళ్యాణ కట్టలో   తల వెంట్రుకలను ఎప్పటికప్పుడు తీసివేసి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. బాత్ రూంలు, ఇతర హాల్స్  ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. కళ్యాణ కట్టలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి డిటిఎస్ ఏజెన్సీ వారు నాణ్యమైన శానిటరీ పరికరాలు, వస్తువులు ఎప్పటికప్పుడు సరఫరా చేసేటట్లు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కళ్యాణ కట్టలోని అత్యంత పాత గీజర్లు, పగిలిన టైల్స్ ను గమనించి వాటిని వెంటనే మార్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే విరిగిన నీటి కొళాయిలు, పనిచేయని ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డులు స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న సివిల్, ఎలక్ట్రికల్, ఇతర ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.  ఆ తరువాత  మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని ఈవో తనిఖీ చేశారు. టిటిడి అందిస్తున్న అన్న ప్రసాదాలలో అన్నం బాగా ఉడికిందా, కూరలు ఎలా ఉన్నాయని భక్తులను అడిగి తెలుసుకున్నారు. అన్నప్రసాదాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. త రువాత చేతులు కడుగుకునే కుళాయిలు కొన్ని పనిచేయడం లేదని, వాటిని మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడేలా కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు!

కేంద్ర విత్త మంత్రి నిర్మలాసీతారామన్ మంగళవారం (జులై 23)న లోక్ సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులపై వైసీపీ ఎంపీ విజయసాయి పెదవి విరిచారు. బడ్జెట్ లో ఏపీకి ఏం దక్కిందని ఎటకారమాడారు. అయితే ఆయన ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం వరాల జల్లు కురిపించిందన్న సంగతిని విస్మరిస్తున్నారు.  కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కీలకమైన కేటాయింపులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి దోహదపడే విధంగా విత్తమంత్రి నిర్మలాసీతారామన్ కేటాయింపులు చేశారు. పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సామాజిక సంక్షేమం దిశగా ఏపీ అభివృద్ధి చెందడానికి వీలుగా ఈ కేటాయింపులు ఉన్నాయి. బడ్జెట్ లో ఏపీకి దక్కిన ప్రధాన కేటాయింపులు ఇలా ఉన్నాయి.   అమరావతి అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ లో 15వేల కోట్ల రూపాయలను కేటాయించారు. ఇది ఆధునిక మౌలిక వసతులు, సౌకర్యాలు, అర్బన్  డెవలప్ మెంట్ కోసం ఉద్దేశించారు. ఇక పోలవరం ప్రాజెక్టు కోసం పది వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు రాష్ట్రంలో తాగు, సాగునీటి సమస్యలను పూర్తిగా దూరం చేస్తుంది. వ్యవసాయ ఉత్పాదకత పెంపునకు పోలవరం ప్రాజెక్టు అత్యంత కీలకం. తన బడ్జెట్ ప్రసంగంలో పోలవరం జాతీయ ప్రాజెక్టు అని గుర్తు చేసిన నిర్మలా సీతారామన్.. ఈ ప్రాజెక్టుకు అయ్యే ప్రతి పైసా కేంద్రమే భరిస్తుందని పునరుద్ఘాటించారు.   అలాగే పీఎం ఆవాజ్ యోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణం కోసం 12 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ నిధులు పేదలకు గృహవసతి కల్పించడమే కాకుండా వారి జీవన ప్రమాణాలు మెరుగు అయ్యేందుకు దోహదపడుతుంది.  రోడ్ల అభివృద్ధి, నూతన జాతీయ రహదారులు, ఎక్స్ ప్రెస్ వేల నిర్మాణం కోసం 6వేల కోట్ల రూపాయలు కేటాయించారు. దీని వల్ల రోడ్ల అనుసంధానం, సులభతర రవాణ, ప్రయాణ కాలం తగ్గుతుంది. ఇది ఆర్ధిక కార్యకలాపాలు జోరందుకోవడానికి దోహదపడుతుంది.   అదే విధంగా విశాఖపట్నం, చెన్నై కారిడార్ లో భాగంగా కొప్పర్తి నోడ్ అభివృద్ధికి ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని, ఆర్థిక అవకాశాలకు ఎంతగానో దోహదపడుతుంది. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ పెట్టుబడుల ఆకర్షణ, వేగవంతమైన పారిశ్రామిక ప్రగతి, ఉద్యోగ కల్పనలకు ఎంతగానో దోహదపడుతుంది. ఇక పోతే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం గ్రాంట్ రూపంలో రాయలసీమ నాలుగు జిల్లాలు, ప్రకాశం, ఉత్తరాంధ్ర మూడు  జిల్లాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు నిధులు కేటాయించారు. ఈ నిధులను ఆయా జిల్లాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, విద్య, ఆరోగ్య, ఇతక అత్యవసర సేవల అభివృద్ధికి వినియోగిస్తారు.   అలాగే రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలు, ఇతర విద్యాసంస్థల ఏర్పాటుకు 2,500 కోట్ల రూపాయలను నిర్మలాసీతారామన్ బడ్జెట్ లో కేటాయించారు. వీటి ద్వారా రాష్ట్రంలో ఆరోగ్య భద్రత, విద్యాభివృద్ధి జరుగుతుంది.   అలాగే పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల కోసం 3, 500 కోట్ల రూపాయలు కేటాయించారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ఉపయోగిస్తారు. తద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడే పరిస్థితి గణనీయంగా తగ్గుతుంది.   ఇక జల్ జీవన్ మిషన్ కింద రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ నిధులు నాణ్యమైన, గ్రామీణ  ప్రాంతాలలో పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు దోహదపడతాయి.   ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కేంద్రంలో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చి నిధులను కేటాయించారని చెప్పడానికి ఇసుమంతైనా సందేహించాల్సిన పని లేదు.  కేంద్ర బడ్జెట్ లో ఏపీకి దక్కిన కేటాయింపుల ద్వారా ఆర్థిక వృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. తద్వార రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి.  

చంద్రబాబు చాణక్యం.. జగన్ కు కీలెరిగి వాత!

ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు క్షీణించాయంటూ అసంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టి మరీ హస్తిన వెళ్లి ధర్నా చేస్తానంటూ బయల్దేరిన జగన్ కానీ, ఆయన పార్టీ నేతలు కానీ.. కేంద్ర బడ్జెట్ పై నోరెత్తడం లేదు. ఐదేళ్ల తరువాత తొలి సారిగా కేంద్ర వార్షిక బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక కేటాయింపులు జరిగాయి.  కేంద్ర విత్తమంత్రి  నిర్మలా సీతారామన్  అమరావతికి 15వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అలాగే పోలవరం సత్వర పూర్తికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. అదే విధంగా విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. అంతే కాకుండా రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలలో ఎనిమిదింటిని వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించి వాటికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. రాయలసీమ లోని నాలుగు జిల్లాలూ, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాకు కూడా వెనుకబడిన ప్రాంతంగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ  దక్కనుంది. గతంలో తెలుగుదేశం ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసిన తరువాత ఏపీకి ప్రత్యేక కేటాయింపులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక జగన్ ఐదేళ్ల సుందర ముదనష్ట పాలనలో అసలు కేంద్రం దృష్టిలో ఏపీ అనే రాష్ట్రం ఒకటి ఉందా అన్న పరిస్థితి నెలకొంది. జగన్ రాష్ట్రం కోసం కేంద్రాన్ని అడిగిందీ లేదు.. కేంద్రం రాష్ట్రం వైపుగా దృష్టి పెట్టిందీ లేదు.   రాష్ట్రం కోసం నిధులు, విభజన హామీల అమలు అడిగితే  బీజేపీ పెద్దలకు ఎక్కడ కోపం వస్తుందో అన్న భయంతోనే జగన్ ఐదేళ్లూ గడిపేశారు. ఎంత సేపూ బటన్ నొక్కడానికి,  ఉద్యోగుల వేతనాలు, పించనర్ల పింఛన్లకు సొమ్ముల కోసం అప్పు చేసి పబ్బం గడిపేస్తే, తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ, బాబాయ్ హత్య కేసు విచారణ వేగవంతం కాకుండా చూసుకుంటే చాలన్న ధోరణిలోనే ఆయన పాలన సాగింది.  అయితే ఇటీవలి ఎన్నికలలో జగన్ పార్టీని జనం ఘోరంగా ఓడించారు. కనీసం విపక్ష హోదాకు కూడా వైసీపీకి అర్హత లేదని కుండబద్దలు కొట్టినట్లు రాష్ట్రం అంతటా జనం ఓకే విధమైన తీర్పు ఇచ్చారు. దీంతో జగన్ పార్టీ కేవలం 11 స్థానాలతో అసెంబ్లీలో విపక్ష హోదాకు కూడా నోచుకోకుండా పోయింది. జగన్ ఏలుబడిలో అన్ని విధాలుగా అధ్వానంగా మారిన రాష్ట్రాన్ని చంద్రబాబు మాత్రమే గాడిన పెట్టగలరని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు. చరిత్ర కనీవినీ ఎరుగని విజయాన్ని కట్టబెట్టారు.  అయితే ఘోర పరాజయం తరువాత కూడా జగన్ తీరు మారలేదు. ప్రజలు తాను పందేరం చేసిన సంక్షేమ సొమ్ములు తీసుకుని కూడా ఓటేయకుండా మోసం చేశారనీ, ఈవీఎంలను ట్యాంపర్ చేయడం ద్వారానే చంద్రబాబు విజయం సాధించారనీ ఇలా ఓటమికి సాకులు వెతుక్కుంటున్నారు. అంతే కాకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చి నెలన్నర అయ్యిందో లేదో.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా మారిందంటూ ఊరూవాడా ఏకం చేసేలా గందరగోళం సృష్టిస్తున్నారు.  వ్యక్తిగత కక్ష కారణంగా వినుకొండలో జరిగిన హత్యకు రాజకీయ రంగు పులిమి వైసీపీ కార్యకర్తలను నరికేస్తున్నారని గగ్గోలు పెడుతూ.. హస్తినలో బుధవారం (జులై 24) ధర్నాకు రెడీ అయిపోయారు.  అయితే  సీఎం చంద్రబాబు మాత్రం..  అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర అభివృద్ధి పైనే పూర్తిగా దృష్టి సారించారు. జగన్ విమర్శలపై స్పందించి సమయం వృధా చేయడం కంటే కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపైనే దృష్టి పెట్టారు. రెండు సార్లు హస్తిన పర్యటించి మరీ ప్రధాని మోడీ,  హోంమంత్రి అమిత్ షా, విత్త మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలు, అవసరమైన కేటాయింపులపై చర్చించారు. ఆయన కృషి ఫలించింది. ఏపీకి కేంద్రం బడ్జెట్ లో సముచిత కేటాయింపులు చేయడమే కాకుండా, విభజన హామీలకు కట్టుబడి ఉన్నామని విస్పష్టంగా చెప్పింది.  ఇక జగన్ విషయానికి వస్తే.. హస్తినలో ధర్నాఅంటూ హడావుడి చేస్తున్నారు.. కానీ   బడ్జెట్ పై మాత్రం నోరెత్తడం లేదు. జగన్ సహా వైసీపీ నేతలెవరూ బడ్జెట్ పై స్పందించలేదు. ఏపీ వ్యాప్తంగా చంద్రబాబు కృషి ఫలించి, ఏపీకి బడ్జెట్ లో ప్రాధాన్యత దక్కిందని ఆనందం, హర్షం వ్యక్తం చేస్తుంటే.. ఒక్క వైసీపీ మాత్రం ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ హస్తిన వేదికగా ధర్నాకు రెడీ అయ్యింది. దీంతో ఆయన హస్తిన ధర్నాను పట్టించుకునే నాథుడే ఏపీలో కరవయ్యాడు. ఏపీ వ్యాప్తంగా చంద్రబాబు సాధించారు.. ఏపీ అభివృద్ధికి ఇక ఢోకా లేదని మాట్లాడుతుంటే.. వైసీపీ ఎందుకు బడ్జెట్ పై ప్రశంస కానీ, విమర్శ కానీ చేయకుండా మౌనం వహించిదన్న చర్చ జరుగుతోంది.  బడ్జెట్ ను విమర్శిస్తే బీజేపీకి కోపం, పొగిడితే తెలుగుదేశంకు లాభం అన్న భయంతో నే వైసీపీ సైలెంట్ అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సరే బీజేపీకి కొపం వచ్చినా ఫరవాలేదని ఏపీకి కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేస్తే.. గత ఐదేళ్లలో నువ్వు సాధించిందేమిటని జనం నిలదీస్తారన్న జంకుతోనే  జగన్ అండ్ కో నోరు కుట్టేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు తన చాణక్యంతో జగన్ కు కీలెరిగి వాతపెట్టినట్లైందని అంటున్నారు. 

‘నీట్’ మళ్ళీ అక్కర్లేదు.. సుప్రీం తీర్పు!

‘నీట్’ పరీక్షను ఈ సంవత్సరానికి తిరిగి నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. నీట్ క్వశ్చన్ పేపర్ లీకైన మాట వాస్తవమేనని, అయితే ఆ కారణంగా పరీక్షను మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీం అభిప్రాయపడింది. నీట్ అంశంపై విచారణ ముగియడంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ‘నీట్’ మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్‌ని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. "క్వశ్చన్ పేపర్లీకేజీతో పరిమిత సంఖ్యలో విద్యార్థులు లాభం పొందారు. లాభం పొందిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలి. మళ్లీ పరీక్ష నిర్వహిస్తే 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారు. అందువల్ల ‘నీట్’ మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదు" అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సంవత్సరానికి నీట్ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో నిర్వహించారు. దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు నీట్ రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు మొదటి ర్యాంక్ రావడంతో అనుమానాలు తలెత్తాయి. టాప్ ర్యాంకును ఇంత మంది పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని ఇటీవల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే 'ఫిజిక్స్ వాలా' విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్ పాండేతో పాటు మరి కొందరు దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.

ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం తెలిపింది. మంగళవారం (జులై 23) అసెంబ్లీలో ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశ పెట్టింది. రెండు బిల్లులనూ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అలాగే హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.   కాగా   ఈ రెండు బిల్లులలూ సభలో  ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సభలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఎలాంటి ఆంగ్లపదాన్ని ఉపయోగించకుండా తెలుగులోనే ఈ ప్రకటన చేయడంపై పలువురు సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.  ఏ వైసీపీ ఓటమికి  కారణాల్లో ల్యాండ్ టైటిలింగ్  కూడా ఒకటన్నది తెలిసిందే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా పేద ప్రజల భూములపై హక్కులను తీసేసుకుంటారంటూ అప్పట్లో  తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఆరోపించిన సంగతి తెలసిందే. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదని.. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ పెద్దఎత్తున ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చంద్రబాబు అప్పట్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టగానే చేసిన ఐదు సంతకాల్లో ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ఆ తర్వాత  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం.. ఇవాళ సభలో  బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవ ఆమోందం పొందింది. అదే విధంగా హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లు కూడా. విజయవాడలోని ఎన్టీఆర్  ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును జగన్ ప్రభుత్వం  వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా మార్చింది. దీనిపై అప్పట్లోనే పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. తెలుగుదేశం కూడా హెల్త్ వర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. తాము అధికారంలోకి రాగానే  హెల్త్ వర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా  మారుస్తామని అప్పట్లోనే ప్రకటించింది. అన్న మాట మేరకు ఎన్టీఆర్ హెల్త్ వర్టీటీగా పునరుద్ధరిస్తూ బిల్లు ప్రవేశపెట్టింది. దానికి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.