ఏపీకి ఊపిరి.. చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టిన కేంద్ర బడ్జెట్
posted on Jul 24, 2024 @ 10:31AM
ఏపీఅభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో నిధులు భారీగా కేటాయించడం నిజంగా రాష్ట్రానికి ఊపిరి పోసినట్లేననడంలో సందేహం లేదు. ప్రధానిమోదీపై చంద్రబాబు,పవన్ కళ్యాణ్ పెట్టుకున్న నమ్మకాన్ని కేంద్ర బడ్జెట్ నిలబెట్టిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.
కేంద్ర విత్త మంత్రి నిర్మలాసీతారామన్ మంగళవారం (జులై 22) లోక్ సభలో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు వరాల వర్షం కురిపించారు. ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్లు నిధులు కేటాయించారు.ఈ నిధులు అప్పుగా ఇస్తున్నా అభివృద్ధికి తోర్పాటు అవసరం. అలాగే స్వల్ప వడ్డీతో 30 ఏళ్లలోగా తీర్చాల్సిన ఆ అప్పు ఆంధ్రప్రదేశ్ కు ఏ మాత్రం భారం కాదన్న భావన వ్యక్తం అవుతోంది.
అలాగే ఆహార భద్రతలో భాగంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుకు పూర్తి ఆర్ధిక సహకారం అందిస్తామని ఆర్ధిక మంత్రి నిర్మల్ సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్యాకేజీ ద్వారా నిధులు బడ్జెట్ లో కేటాయిండం, అలాగే విశాఖ-చెన్నై-ఒరుగల్లు-బెంగళూరు పారిశ్రామిక క్యారిడార్ నిర్మిస్తామన్నారు. రోడ్లు,పరిశ్రమల అభివృద్ధికి కనీససౌకర్యాల కల్పనకు సహకారం అందిస్తామని,ఐటీ అభివృద్ధికిచర్యలు చేపడాతామని ఆర్ధిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం విశేషం.అలాగే విభజన చట్టానికి అనుగుణంగా సహకారం అందిస్తామన్నారు. 50శాతం మిగిలేలా పంటల మద్దతు ధరలు పెంచుతామని హామీ ఇవ్వడం రైతులకు శుభవార్తే.
పప్పు ధాన్యాలు,నూనె గింజల ఉత్పత్తి లో స్వయం సంవృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. అలాగే కూరగాయల ఉత్పత్తికి ప్రోత్సాహం, చిన్నమధ్యతరహా పరిశ్రమలకు ఆర్ధికసాయం,పేదలఇళ్ల నిర్మాణానికి చేయూత తదితరాలు రాష్ట్రానికి మంచి చేస్తాయనడంలో సందేహం లేదు. కేంద్రం ఏపీకీ బడ్జెట్లో అన్నివిధాల తోర్పాటు అందివ్వడం నిజంగా సంతోషదాయకమని సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ నిధుల వల్ల ఆర్ధిక కార్యకలాపాలు పెరుగుతాయన్నారు.
వెనుకబడిన రాయలసీమ,ఉత్తరాంధ్ర జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా సాయం లభిస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వాజపేయి హాయాం తరువాత బడ్జెట్ లో ఏపీకి ఈ స్థాయిలో కేటాయింపులు జరగడం ఇదే ప్రథమం. 2014లో రాష్ట్ర విభజన తరువాత అధ:పాతాళంలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ కు10ఏళ్లగా రాజధాని లేదు.పోలవరం ఆగిపోయింది.అభివృద్ధి 20ఏళ్ల వెనుకబడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి బడ్జెట్లో ఈ స్థాయిలో నిధులు కేంద్రం కేటాయించడం రాష్ట్ర ప్రగతికి చంద్రబాబు చేస్తున్న కృషికి ఫలితం దక్కినట్టేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.