జగన్ ప్రచార పిచ్చి కుదిరింది!

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్) జగన్ ఫొటోలున్న పాసుపుస్తకాల జారీని ఎన్నికల కోడ్ కారణంగా ఎన్నికల కమిషన్  నిలిపివేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పుస్తకాలను వెనక్కి తీసుకుంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతులకు కొత్తగా రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలు అందించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పాసు పుస్తకాలపై రైతుల సమగ్ర వివరాలు తెలియజేసే క్యూఆర్ కోడ్‌ని ముద్రించాలని చంద్రబాబు సూచన చేశారు. రైతులు ఆ కోడ్‌ని స్కాన్ చేస్తే తమ భూమి వివరాలు, సరిహద్దులు, లోకేషన్, ఇతర వివరాల తెలుసుకోగలుగుతారు. జగన్ బొమ్మలున్న పుస్తకాలను రీకాల్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. వైసీపీ అధినేత జగన్‌కి ఉన్న ప్రచార పిచ్చి రాష్ట్ర ఖజానాను గుల్లచేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. "కోటి రూపాయలో, పది కోట్లో కాదు... 700 కోట్ల రూపాయల మేర ప్రజాధనాన్ని జగన్ తన పేరు, ఫొటోల పిచ్చి కోసం తగలేశారు. భూముల సమగ్ర సర్వే పేరిట కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా సర్వేకోసం గ్రానైట్ రాళ్లను తీసుకొచ్చి వాటిపై తన తండ్రి పేరు, తన పేరు చెక్కించుకున్నారు. ఈ సరదా తీర్చుకునేందుకు జగన్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. పాత సామెత రాజుల సొమ్ము రాళ్లపాలు..! జగన్ సామెత ప్రజల సొమ్ము జగన్ రాళ్లపాలు…!  ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలోని తన కార్యాలయంలో రెవెన్యూశాఖ కార్యకలాపాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సర్వే రాళ్లు, పాసుపుస్తకాలు తదితర అంశాలపై కీలక చర్చ జరిగింది. “భూములను రీ సర్వే చేయాలని కేంద్రం నిధులు ఇస్తే జగన్ ఏం చేశారు? సరిహద్దులను నిర్దేశించేందుకు సాధారణ రాళ్లను వాడతారు. కానీ జగన్ కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా 77 లక్షల ఖరీదైన గ్రానైట్ రాళ్లను కొన్నారు. వాటిపై తన పేరును ముద్రించుకున్నారు. పాసుపుస్తకాలపై తనపేరు, ఫొటోలు అచ్చు వేయించుకున్నారు. కేంద్రం చెప్పినదానికి భిన్నంగా రీ సర్వేను తన ప్రచార పిచ్చికోసం వాడుకున్నారు. ఆయన పిచ్చి పనులకు 700 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయింది. పాసుపుస్తకాలపై జగన్ ఫొటోల ముద్రణ కోసం 15 కోట్లపైనే ఖర్చుపెట్టారు. ఆయన ఫొటోలున్న భూమి పత్రాలను రైతులు చించివేస్తున్నారు. జగన్ పేరున్న గ్రానైట్ రాళ్లను తమ గ్రామానికి తీసుకురావొద్దని ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఇప్పుడు వాటిని ఏం చేయాలి? రాళ్లపై జగన్ పేరు తొలగించాలంటే మరో 15 కోట్లు ఖర్చుపెట్టాలి. ఇంతాచేసి రైతులకు వివాదాలతో కూడిన సర్వే ఫలితాలు ఇచ్చారు" అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జగన్  ప్రచార పిచ్చికి అధికారులు సహకరించారని, నిధుల ఖర్చు విష యంలో ఏమాత్రం అడ్డుచెప్పలేకపోయారని ఆయన తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. కేంద్ర మార్గదర్శకాలను ఆచరించాల్సిన వారే, ఫొటోల పిచ్చికి సహకరిస్తే ఎలా? వృథా అయిన ప్రజాధనానికి ఎవరిని బాధ్యులను చేయాలని ప్రశ్నించినట్లు తెలిసింది. “సరి హద్దులను నిర్దేశించేందుకు ఎవరైనా ఖరీదైన గ్రానైట్ రాళ్లు వినియోగిస్తారా? దీన్ని ఎలా అనుమతించారు? ఎలా సమర్థించారు? ఆ రాళ్లను ఎలా ఉపయోగించుకోవచ్చు... వాటిని ఏం చేయవచ్చో ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి" అని ఆదేశించినట్లు తెలిసింది. జగన్ పేరున్న భాగాన్ని  తిప్పి భూమిలోకి  పాతేస్తే  పేరు కనబడకుండా  కొంతవరకు  ఉపయోగకరంగా  వుండొచ్చు అని  నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  చివరికి జగన్ రాళ్లు చెక్కిన గ్రానైట్ కంపెనీ ఓనర్స్ బాధితులుగా మిగిలారు .

స్మిత సబర్వాల్ ను తొలగించాలని దివ్యాంగుల నిరసన 

దివ్యాంగులను అవమానించిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను వెంటనే తొలగించాలని, అరెస్ట్ కూడా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక లోయర్ ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించింది. జాతీయ అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.స్మితా సబర్వాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్మితా సబర్వాల్‌కు నోటీసులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే తాము పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

పారిస్ ఒలింపిక్స్.. షూటింగ్ లో భారత్ కు మరో కాంస్య పతకం

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మూడో కాంస్య పతకం లభించింది. పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్ విభాగంలో భారత షూటర్ స్వప్నిల్ కాంస్య పతకం సాధించాడు. ఈ ఒలింపిక్స్ లో ఇప్పటి వరకూ భారత్ కు మూడు కాంస్య పతకాలు వచ్చాయి. మూడూ కూడా షూటింగ్ లోనే కావడం గమనార్హం.   మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో మను బాకర్ ఇప్పటికే రెండు కాంస్యాలు కైవసం చేసుకోవడం తెలిసిందే. గురువారం (ఆగస్టు 1) 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3పీ ఫైనల్ ఈవెంట్ లో స్వప్నిల్ కుశాలే 451.4 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. 28 ఏళ్ల స్నప్నిల్ కుశాలేకు ఒలింపిక్స్ లో ఇదే తొలి పతకం.  

 రేవంత్ రెడ్డి క్షమాపణ కోరుతూ బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన 

మహిళా శాసనసభ్యుల పట్ల అనుచితంగా, అగౌరవంగా మాట్లాడిన రేవంత్ వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కె. తారకరామారావ్ , మాజీ మంత్రి హరీష్ రావ్  గురువారం(ఆగస్టు 1) ఆందోళన చేపట్టారు. తెలంగాణ అసెంబ్లీ ముఖ్యమంత్రి ఛాంబర్ కార్యాలయం ఎంట్రన్స్ వద్ద ఆందోళన చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క నిన్న సబితా ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వారు సీఎం ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. సబితకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కేటీఆర్ సహా ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకువచ్చారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి బీఆర్ఎస్ భవన్ వైపు తీసుకువెళ్లారు. పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. మహిళా శాసనసభ్యుల పట్ల అనుచితంగా, అగౌరవంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యే పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా ఈ రోజు నిరసన తెలుపుతున్న తమను అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంకటాల్లో వెంకటరెడ్డి.. నేడో రేపో సస్పెన్షన్ వేటు?

జగన్ హయాంలో  నిబంధనలను గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ తో అంటకాగి నిబంధనలకు తిలోదకాలిచ్చినట్లుగా భావించిన కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా హోల్డ్ లో ఉంచింది. అలా ఉంచిన వారిలో ఒకరైన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఇంకా ఏడేళ్ల సర్వీసు ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు.  అంటే జగన్ హయాంలో తాను నిబంధనలకు తిలోదకాలిచ్చి తప్పిదాలకు పాల్పడినట్లు పరోక్షంగా అంగీకరించేశారు.  మునిసిపల్ ఎడ్మినిస్ట్రేటన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి,  రెవెన్యూ (ఎక్సైజ్) స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజిత్ భార్గవలకు కూడా చంద్రబాబు సర్కార్ ఎలాంటి పోస్టింగు ఇవ్వకుండా జీఏడీలో  రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది.  ఇంకా పలువురు అధికారులకు కూడా చంద్రబాబు సర్కార్ ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా హోల్డ్ లో పెట్టింది. అలాంటి వారిలో ఒకరైన జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేసిన ఐఏఎస్ అధికారి వెంకటరెడ్డి ఒకరు.   వెంకటరెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి.   జగన్ హయాంలో  ఎపీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఆయన భారీ స్థాయిలో అవకతవకలు, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే  మైన్స్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఆ విచారణలో వెంకటరెడ్డి అక్రమాలు, అవకతవకలకు పాల్పడినట్లు రుజువవ్వడంతో వెంకటరెడ్డిని సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాల్సిందిగా సీఎం చంద్రబాబుకు సిఫారసు చేశారు. ఈ మేరకు వెంకటరెడ్డిని సస్పెండ్ చేస్తూ నేడో రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.  కోస్ట్ గార్డ్స్ లో పని చేస్తున్న వెంకటరెడ్డిని జగన్ సర్కార్  కావాలని రాష్ట్రానికి డెప్యూటేషన్ పై పిలిపించుకుని ఎపీ ఎండిసి మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలకు కట్టబెట్టింది.  అదలా ఉంచితే తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టిన తరువాత ఏపీఎండీసీని సీజ్ చేసి, ప్రభుత్వ రికార్డులు ఏవీ బయటకు తరలి పోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.  మైన్స్ శాఖకు చెందిన సీనియర్ అధికారులు జగన్ సర్కా ర్ హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలను కూలంకషంగా పరిశీలించి ఒక నివేదిక రూపొందించి చంద్రబాబుకు అందజేశారు. ఆ నివేదిక మేరకే వెంకటరెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయనుంది. 

వర్గీకరణ జరగదన్న అజ్ఞాని జగన్!

ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణకు సుప్రీంకోర్టు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆయా వర్గాలో హర్షం వ్యక్తమవుతోంది. చంద్రబాబు నాయుడు కారణంగానే వర్గీకరణ సాధ్యమవుతోందని మందకృష్ణ మాదిగ కూడా చెబుతున్నారు. 30 సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటం ఫలించడానికి చంద్రబాబు సహకారం ఎంతో వుందని ఆయన అంటున్నారు. చంద్రబాబు నాయుడు గతంలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ జరిపినందువల్ల ఎన్నో వేలమందికి విద్య, ఉద్యోగ అవకాశాలు వచ్చాయని ఆయన చెప్పారు. అయితే ఈ వర్గీకరణ జరిపినందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ తాను అధికారంలో వుండగా చంద్రబాబుని ఎంతో విమర్శించారు. వర్గీకరణ అనేది అసలు అసాధ్యమైన విషయమని, ఎన్నటికీ జరిగదని ఆయన బల్లగుద్ది వాదించారు. వర్గీకరణ అసాధ్యమని తెలిసి కూడా చంద్రబాబు ఆమోదించారని అప్పట్లో జగన్ విమర్శించారు. వర్గీకరణను కోర్టులు కొట్టేస్తాయని తెలిసినప్పటికీ, ఆయా వర్గాల ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు వర్గీకరణ జరిపారని జగన్ విమర్శించారు. ఈ అంశం మీద జగన్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబుని అసెంబ్లీ సాక్షిగా ఎన్నో మాటలు అన్నారు. మరి ఇప్పుడు జగన్ తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలో ఆయనే ఆలోచించుకోవాలి. నా ఎస్టీలు, నా ఎస్సీలు అనడం కాదు.. వాళ్ళ సమస్యల పరిష్కారం గురించి కూడా ఆలోచించాలి. 

జగన్ కి వైసీపీ ఎంపీల రాజీ ‘నామాలు’?

వైసీపీ పతనం కొనసాగుతోంది. ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ  పయనం పతనం నుంచి పతనం దిశగా వేగంగా సాగుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ వైసీపీ అధినేత ఢిల్లీ ధర్నా నవ్వుల పాలైంది. అలాగే విపక్ష హోదా కోరుతూ జగన్ కోర్టును ఆశ్రయించడం, హోదా ఇస్తే తప్ప సభకు హాజరు కాబోమనడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం పార్టీకి సమయం ఇవ్వకుండా విమర్శల దాడికి దిగడాన్ని వైసీపీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. కేతిరెడ్డి వంటి వారైతే ఈ విషయాన్ని బాహాటంగానే చెబుతూ పార్టీకి దూరమైతే.. బొత్స వంటి  వారు మీడియా సమావేశాలలో పరోక్షంగా జగన్ తప్పిదాలను ఎత్తి చూపుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా జగన్ హస్తిన వేదికగా చేపట్టిన ధర్నాకు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టి మండలి సమావేశాలకు హాజరై తన ధిక్కారాన్ని వ్యక్తం చేశారు.  ఇవన్నీ చాలవన్నట్లు జగన్ ధీమాను, ధైర్యాన్ని నీరుగార్చే విధంగా ఏకంగా ఆరుగురు వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామాస్త్రం ప్రయోగించడానికి రెడీ అయిపోయారు. వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కు రాజ్యసభలో పూర్తి బలం లేకపోవడంతో తన పదకొండు మంది రాజ్యసభ సభ్యుల అవసరం మోడీ ప్రభుత్వానికి ఉంటుందన్న ధీమా జగన్ లో ఉంది. ఇప్పుడా ధీమా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. రాజ్యసభ సభ్యుల బలంతోనే ఆయన ఇండియా కూటమి వైపు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ బలమే లేకపోతే అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూటమి జగన్ ను పట్టించుకునే పరిస్థితి ఉండదు. అందుకే వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామా బాట జగన్ ను భయపెడుతోంది. ఆందోళనకు గురి చేస్తున్నది. ఇంతకీ వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామాల ప్రచారానికి తెరలేపిందెవరంటే స్వయంగా జగన్ సొంత పత్రికే. ఆ పత్రికలో వైసీపీకి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యలు రాజీనామా చేయనున్నారని పేర్కొంది. రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకీ రాజీనామా చేసి తెలుగుదేశం గూటికి చేరనున్నారనీ పేర్కొంది. అలా రాజీనామా చేసిన వారికి టీడీపీ మళ్లీ అదే రాజ్యసభ సభ్యత్వం ఇస్తుందని జోస్యం కూడా చెప్పింది. తొలి నుంచీ అంటే సార్వత్రిక ఎన్నికలలో ఓటమి తరువాత నుంచీ వైసీపీ నుంచి వలసలపై రాజకీయవర్గాలలో  పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడు వైసీపీ ఎంపీల రాజీనామాల వార్తతో ఆ వలసల ఒరవడి ఆరుగురితో ఆగే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

వర్గీకరణ చంద్రబాబు పుణ్యమే.. మందకృష్ణ మాదిగ!

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పుణ్యం చంద్రబాబు నాయుడిదేనని మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో మందకృష్ణ మాదిగ స్పందించారు. ‘‘షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది. ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే, ఇవాళ తీర్పు వచ్చే సమయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే వున్నారు. ఆనాడు వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాం. ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేవి కావు. విద్యావకాశాలు వచ్చేవి కావు. ఈరోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల న్యాయం బతికింది అంటే, చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చిన చట్టంవల్లే జరిగింది’’ అని మందకృష్ణ మాదిగ అన్నారు.

బెజవాడ దుర్గమ్మ గుడి అభివృద్ధికి నిధులు.. కేంద్ర మంత్రికి కేశినేని చిన్ని వినతి

అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలోని అతి పెద్ద, ప్రాచీన‌ దేవాల‌ల‌య అభివృద్దికి ప్ర‌సాద్  ప‌థ‌కం కింద వంద కోట్ల రూపాయ‌లు మంజూరు చేయాల‌ని  విజ‌య‌వాడ ఎంపీ  కేశినేని శివ‌నాథ్    కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్  షేకావ‌త్ ను కోరారు. కేంద్ర మంత్రి షెకావత్ తో గురువారం (ఆగస్టు 1) భేటీ అయిన కేశినేని చిన్ని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టాల్సిన అభృద్ధి, నిర్మాణాల ప్రతిపాదనలను వివరించారు. ఆ మేరకు ఒక వినతి పత్రం కూడా కేంద్ర మంత్రికి అందజేశారు.   ఇప్ప‌టికే    దేవాదాయ  శాఖ,  శ్రీ దుర్గ స్వామి వారి దేవస్థానం ఆల‌య ఈవో ప‌త్రిపాద‌న‌లు పంపించారని గుర్తు కేశారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో  టీటీడీ త‌రువాత   అతి పెద్దది శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానమేనని వివరించారు. బెజవాడ కనకదుర్గమ్మను నిత్యం  25,000 మందికిపైగా భక్తులు సందర్శించుకుంటారనీ, సెలవు రోజులు, శని, ఆదివారాలలో అయితే ఈ సంఖ్య సందర్శిస్తారని, శుక్రవారం, శనివారం,   50,000కు మించుతుందని వివరించారు.  ఇక దసరా న‌వ‌రాత్రులు,  భవానీ దీక్ష విరమణ సమయంలో ప‌లు రాష్ట్రాల నుంచి  రెండున్నర లక్షల మందికి పైగా భ‌క్తులు త‌ర‌లివ‌చ్చి అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటార‌ని తెలిపారు. ఇంతటి ప్రసిద్ధ దేవాలయ అభివృద్ధికి కేంద్రం నుంచి ఇతోథిక సహకారం అందజేయాలని కోరారు.  కేశినేని చిన్ని అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంతి గజేంద్రసింగ్ షెకావత్  తప్పనిసరిగా పరిశీలిస్తామని చెప్పారు.  

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్!

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశం మీద గురువారం నాడు సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్.కి కేటాయించిన రిజర్వేషన్లలను ఉప వర్గీకరణచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు వుంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు 2004లో అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనం పక్కన పెట్టింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజారిటీతో తీర్పును వెలువరించింది. ఈ తీర్పును అనుసరించి ప్రభుత్వాలు దీనిపై తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ‘వ్యవస్థాగతంగా ఏర్పడిన వివక్ష కారణంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు అభివృద్ధిలోకి రాలేకపోతున్నారు. ఒక కులంలో ఉపవర్గాలను చేసేందుకు రాజ్యాంగంలోని 14వ అధికరణ అనుమతి ఇస్తుంది. అందుకే 2004లో వెలువరించిన ఇ.వి.చిన్నయ్య తీర్పునే వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రాలు ఉప వర్గీకరణ చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నాం’ అని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. అణగారిన వర్గాల వారికి మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు రిజర్వ్.డ్ కేటగిరీలో రాష్ట్రాలు ఉప వర్గీకరణ చేసుకోవచ్చని కోర్టు వెల్లడించింది. ధర్మాసనంలోని ఆరుగురు న్యాయమూర్తులు దీనికి అనుకూలంగా తీర్పు చెప్పగా, జస్టిల్ బేలా ఎం. త్రివేది మాత్రం ఎస్టీ, ఎస్పీ ఉప వర్గీకరణ సాధ్యం కాదంటూ వ్యతిరేకించారు.

జలగన్న హాలోగ్రామ్స్ కుంభ(త్)కోణం!

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్) వైసీపీ హయాంలో ఎక్సైజ్  సమావేశానికి సంబంధించిన మినిట్స్  ఫైల్లో లేకుండా గల్లంతు చేశారు.  ఎక్సైజ్ శాఖలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మద్యం సీసాలపై ముద్రించే సెక్యూరిటీ హాలోగ్రామ్స్ సరఫరా టెండర్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లు విజిలెన్స్ కమిషన్ గుర్తించింది. ముందస్తు కుమ్మక్కు, కుట్ర మేరకే నిబంధనలకు విరుద్ధంగా కుంభత్ హాలోగ్రాఫిక్స్ సంస్థకు టెండర్లు కట్టబెట్టారన్న ఫిర్యాదులపై గతంలో విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్ పలు అవకతవకల్ని నిర్ధారిం చింది. వాటిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ గతేడాది సెప్టెంబరులో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించగా జగన్ ప్రభుత్వం దాన్ని తొక్కిపెట్టింది. ఏపీ బేవరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవ రెడ్డి ఈ వ్యవహారంలో ప్రధాన పాత్రధారన్న ఫిర్యాదులున్నాయి. మద్యం కుంభకోణంపైన సీఐడీ ద్వారా సమగ్ర విచారణకు కూటమి ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో విజిలెన్స్ కమిషన్ నివేదిక తాజాగా బయటకొచ్చింది. దీనిపై సీఐడీ దృష్టిసారించింది.  మద్యం సీసాలపై ముద్రించే హాలోగ్రామ్స్ తయారీ, సరఫరా కోసం 2020 సెప్టెంబరులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ టెండర్లు పిలిచి చెన్నైకు చెందిన కుంభత్ హాలోగ్రాఫిక్స్ సంస్థను ఎల్1గా ఖరారు చేసింది. నిబంధనలకు విరుద్దంగా ఈ టెండరు కట్టబెట్టారని విజిలెన్స్ కమిషన్ గుర్తించింది. కుంభత్ హాలోగ్రాఫిక్స్, హాలోస్టిక్ ఇండియా లిమిటెడ్, అల్ఫా లేజర్టెక్ LLP సంస్థలు మూడూ ఒక దానితో మరొకటి సంబంధం కలిగినవే. అవి కుమ్మక్కై టెండర్లలో పాల్గొన్నాయి. ఈ సంస్థల మధ్య గతంలో వ్యాపార లావాదేవీలు కొనసాగాయా? జీఎస్టీ డేటా ఏం చెబుతోంది అనేవి పరిశీలించకుండానే అనుమతిచ్చేశారు. హాలోగ్రామ్స్ తయారీ, ప్రింటింగ్, నంబరింగ్, సరఫరాలో కుంభత్ హాలోగ్రాఫిక్స్ సంస్థకు అనుభవం లేదు. ధ్రువీకరణ పత్రాలు నిజమైనవా? కావా? అనేది నిర్ధారించుకోలేదు. వరుసగా మూడేళ్ల పాటు 10 కోట్ల రూపాయల మేర వార్షిక టర్నోవర్ కలిగి ఉన్నామంటూ కుంభత్ సమర్పించిన నివేదికలు అసలైనవా? కావా? అనేది సాంకేతిక మదింపు కమిటీ పరిశీలించలేదు. ఆ సంస్థకు సంబంధించిన జీఎస్టి, ఆదాయపు పన్ను రిటర్న్.లు పరిశీలించలేదు. నిపుణుల కమిటీ చైర్మన్ అయిన ఎక్సైజ్ శాఖ కమిషనర్, సభ్యులైన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, ఆర్ధిక శాఖ ప్రతినిధి సంతకాలు సాంకేతిక మదింపు నివేదికలో లేకుండానే టెండర్లు ఖరారు చేసేశారు. నిపుణుల కమిటీ సమావేశానికి సంబంధించిన మినిట్స్ ఫైల్లో లేకుండా గల్లంతు చేశారు.  నకిలీ మద్యాన్ని నియంత్రించేందుకు వీలుగా టెండర్లలో పాల్గొనే కంపెనీలు... అథంటికేషన్ సొల్యూషన్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ హాలోగ్రామ్ మాన్యుఫ్యాక్చర్ అసోసియేషన్ (ఐహెచ్ ఎంఏ) సభ్యత్వం కలిగి ఉండాలి. వాటిల్లో సభ్యత్వం కలిగి ఉన్నట్లు టెండర్లలో పాల్గొన్న కంపెనీలు సమర్పించిన సర్టిఫికెట్లు నిజమైనవా కావా అన్నది పరిశీలించలేదు. కుంభత్ సంస్థ హాలోగ్రామ్స్ తయారీ, నంబరింగ్, కోడింగ్, బార్ కోడింగ్ అన్నీ విజయవాడలోనే చేపట్టి అక్కడ నుంచే సరఫరా చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా చెన్నై నుంచి సరఫరా చేశారు. ప్రభుత్వ దుకాణాల్లో టాక్స్ చెల్లించని మద్యాన్ని విక్రయించేందుకు వీలుగానే ఇలా చేశారని, దీని వెనక నకిలీ హాలోగ్రామ్స్ దందా జరిగిందన్న అనుమానాలున్నాయి. ఛత్తీస్ గఢ్ మద్యం కుంభకోణం, హర్యానాలో వెలుగుచూసిన మద్యం కుంభకోణాల్లోనూ ఇలా నకిలీ హాలోగ్రామ్లతోనే పెద్ద ఎత్తున ఆక్రమాలకు పాల్పడినట్లు తేలింది. ఈ నేపథ్యంలో సీఐడీ దర్యాప్తులో ఇవన్నీ ప్రధాన అంశాలు కానున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని  పణంగా పెట్టి వేల కోట్లు పందికొక్కుల్లా దోచుకు తినటానికి పలు రకాల కొత్త  కొత్త  అక్రమ మార్గాలు కనిపెడితే  అభినందించకుండా నేరం అంటారేంటి అని  వారి  అభిమాన  పత్రిక సాక్షిలో ప్రశ్నించవచ్చు!  బరితెగింపు  వారి జన్మ హక్కు!

హైద్రాబాద్ లో సాప్ట్ వేర్ ఇంజినీర్ పై షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ రేప్ 

రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లో ఒకే రోజు రెండు వేర్వేరు చోట్ల రేప్ సంఘటనలు  మరవకముందే  గచ్చిబౌలిలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ షార్ట్ ఫిల్మ్ డైరెకర్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధిత యువతి పుప్పాలగూడలోని ఓ కంపెనీలో పనిచేస్తోంది. షార్ట్‌ ఫిల్మ్ డైరెక్టర్ సిద్ధార్థ వర్మ మరో యువతి ద్వారా బాధితురాలిని పరిచయం చేసుకున్నాడు. సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి ఆమెను నమ్మించాడు. బుధవారం ఆమెను తన ఇంటికి డిన్నర్‌కు ఆహ్వానించాడు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి తాగించి, అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిద్ధార్థ వర్మను అరెస్టు చేశారు. మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహిళలను ఒంటరిగా చూస్తే చాలు, వారిపై దౌర్జన్యాలకు, అత్యాచారాలకు కొందరు కీచకులు పాల్పడుతున్నారు. ఈ నేరాలను అరికట్టేందుకు సర్కార్​ కఠిన చర్యలు తీసుకుంటున్నా, నేరాలు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే రెండ్రోజుల క్రితం రాష్ట్రంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన  రెండు దారుణాలు బాధితుల ఫిర్యాదులతో వెలుగుచూశాయి. మంగళవారం నాడు కదులుతున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిర్మల్ జిల్లా నుంచి ప్రకాశం వెలుతున్న మహిళపై ఆఘాయిత్యం జరిగింది. నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్‌ తనపై అత్యాచారం చేశాడని డయల్‌ 100 ద్వారా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేడ్చల్ సమీపంలో బస్సు ఉండగా మహిళ ఫిర్యాదుతో, అప్రమత్తమైన సిటీ పోలీస్. హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు కోసం గాలింపు చర్యలు చేపట్టి, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే బస్సును చేజ్ చేసి పట్టుకున్నారు. కాగా డ్రైవర్ కృష్ణ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. మరో డ్రైవర్ సిద్దయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వివరించారు.అదే రోజు  హైదరాబాద్​లో మరో దారుణ ఘటన సైతం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్​వేర్ ఇంజినీర్​పై స్నేహితుడు అత్యాచారం చేసిన ఉదంతం బాధితురాలి ఫిర్యాదుతో బయటపడింది. వరుసగా రెండు రోజుల వ్యవధిలో హైదరాబాద్ లో మూడు రేప్ కేసులు నమోదు కావడం పట్ల పలువురు ఆందోళన చెందుతున్నారు.    

పెరిగిన కమర్షియల్ ఎల్పీజీ ధర

ఆగస్టు ప్రారంభమవడంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ ధరలను సవరించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 8.50 మేర స్వల్పంగా పెంచాయి. సవరించిన ధర నేటి నుంచే  అమల్లోకి వచ్చిందని కంపెనీలు స్పష్టం చేశాయి. సవరించిన ధరల ప్రకారం.. ఢిల్లీలో 19 కేజీల ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.6.50 మేర పెరిగి రూ.1646 నుంచి రూ. 1652.50కు చేరిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్‌సైట్ డేటా పేర్కొంది. కోల్‌కతాలో రూ.8.50 మేర పెరిగి రూ.1764.50కి చేరింది. సవరించిన ధరలు ముంబైలో రూ.1605, చెన్నైలో రూ.1817గా ఉన్నాయి. రాష్ట్రాలను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి. కాగా 14 కేజీల గృహవినియోగ గ్యాస్ సిలిండర్ రేట్లలో ఎలాంటి మార్పులేదు. ధరలు యథాతథంగా ఉంటాయని కంపెనీలు తెలిపాయి. 14.2 కేజీల నాన్-సబ్సిడీ గ్యాస్ ధరలు ఢిల్లీలో రూ.803, కోల్‌కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50గా ఉన్నాయి.

కుప్పంలో వైసీపీ బుడగ పేలిపోయింది!

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో అంటే 2019 నుంచి 2024 వరకూ ఆ పార్టీ అధినేత జగన్ సహా నేతలంతా కుప్పంలో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా పావులు కదిపారు. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికలలో ధనబలం, అధికార మదంతో దౌర్జన్యాలు చేసి గెలిచారు. ఆ సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు చంద్రబాబు ముఖం చూడాలని ఉందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైనాట్ కుప్పం అంటూ కుప్పంలో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా ఆ నియోజకవర్గ బాధ్యతలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఎన్నికలకు చాలా ముందుగానే కుప్పం వైసీపీ అభ్యర్థిగా భరత్ పేరు ప్రకటించి.. భరత్ ను గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ జగన్ ప్రకటించారు. కుప్పం నియోజకవర్గ పార్టీ బాధ్యతలను పెద్దిరెడ్డికి జగన్ అప్పగించిన క్షణం నుంచీ కుప్పంలో ఫ్యాక్షన్ తరహా రాజకీయాలకు తెరలేచింది. తెలుగుదేశం కార్యకర్తలు, సానుభూతి పరులు లక్ష్యంగా వేధింపులు ఆరంభమయ్యాయి. బెదిరింపులతో తెలుగుదేశం శ్రేణులను భయభ్రాంతులకు గురి చేశారు. బలవంతంగా పార్టీ కండువా మార్పించారు. ఇంకే ముంది కుప్పంలో ఏదో జరిగిపోతోంది. చంద్రబాబుకు నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగిపోయింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రశాంతతకు మారుపేరు అయిన కుప్పం నియోజవకర్గం భయానక వాతావరణాన్ని సృష్టించారు. తన సొంత నియోజకవర్గ పర్యటనలకు కూడా చంద్రబాబును అడ్డుకుని దాడులకు తెగబడే పరిస్థితిని పెద్దిరెడ్డి పర్యవేక్షణలో వైసీపీ సృష్టించింది.   అయితే ప్రజలు కుప్పం నుంచి చంద్రబాబునాయుడిని భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. చంద్రబాబుకు ప్రత్యర్థిగా పోటీ చేసిన భరత్ ఎన్నికల ఫలితాల తరువాత కుప్పంలో కనిపించడమే మానేశారు. ఎన్నికల ఫలితాల తరువాత కుప్పంలో వైసీపీ బుడగ పేలిపోయింది. ఎన్నికల ఫలితాలు వచ్చి, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి 50 రోజులు అయ్యిందో లేదో.. కుప్పంలో  బలవంతపు పార్టీ మార్పిళ్ల బండారం బట్టబయలైంది. వైసీపీ ఖాళీ అయిపోయింది. ఆ పార్టీ కార్యాలయానికి తాళం పడిపోయింది. ఎన్నికల ముందు వరకూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ కుప్పం అభ్యర్థి ఎన్నికల ఫలితాల తరువాత నిశ్శబ్దంగా కుప్పం వదిలి వెళ్లిపోయారు. పార్టీ క్యాడర్ కు అస్సలు అందుబాటులోకి రావడం లేదు. ఇక కుప్పంలో భరత్ ను గెలిపిస్తాను, చంద్రబాబును నియోజకవర్గంలో అడుగుపెట్టనీయను అంటూ ప్రగల్భాలు పలికిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత నియోజకవర్గం పుంగనూరులో అడుగుపెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు.   పలువురు వైసీపీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు తెలుగుదేశం గూటికి చేరిపోయారు. ఇంకా వైసీపీలో ఎవరైనా మిగిలి ఉంటే వారు కూడా రానున్న రోజులలో సైకిల్ ఎక్కేయడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కుప్పం మునిసిపల్ చైర్మర్ డాక్టర్ సుధీర్ కూడా తెలుగుదేశం గూటికి చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే  తెలుగుదేశం క్యాడర్ నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత కారణంగా అది జరగలేదు.   కాగా ఎన్నికల ముందు కుప్పం తెలుగుదేశం వ్యవహారాల బాధ్యతను పార్టీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు చంద్రబాబు అప్పగించింది.  ఎన్నికల ప్రచారం నుంచి, పార్టీ నేతలు, కార్యకర్తలు, కూటమి భాగస్వామ్య పక్షాల క్యాడర్ ను సమన్వయ పరుచుకుంటూ శ్రీకాంత్ ముందుకు సాగారు. ఇక ఇప్పుడు ఆయన కుప్పంలో వైసీపీని ఖాళీ చేయడంపై దృష్టి పెట్టారు.   గత ఏడాది మార్చి లో జ రిగిన తూర్పు రాయ లసీమ గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలలో  శ్రీకాంత్ సంచలన విజయం.. అప్పట్లోనే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఘోర పరాజయం తప్పదన్న సంకేతాలు ఇచ్చింది. అయితే మా ఓటర్లు వేరే ఉన్నారు అంటూ అప్పట్లో వైసీపీ పట్టించుకోలేదు.   అయితే శ్రీకాంగ్ ప్రతిభను గుర్తించిన చంద్రబాబు ఆయనకు వెంటనే కుప్పం బాధ్యతలను అప్పగించారు.  చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టిన శ్రీకాంత్ ఇప్పుడు కుప్పంలో వైసీపీ జెండా పట్టుకోవడానికి కూడా ఎవరూ ఉండకుండా ఖాళీ చేయించే పనిలో ఉన్నారు.  

లోకేష్ ఓఎస్డీగా ఆకుల వెంకటరమణ

మంత్రి నారా లోకేష్ కు ఓ ఎస్ డి గా ఆకుల వెంకటరమణ నియమితులయ్యారు. ఆకుల వెంకటరమణ గతంలో తూర్పుగోదావరి జిల్లా  చింతూరు ప్రాంతంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా పనిచేసారు. ఆ సమయంలో అక్కడ గిరిజనుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ఎంతో కృషి చేశారు. అనంతరం కడప జిల్లా బద్వేల్ రెవెన్యూ డివిజన్ లో ఆర్డీవో గా సమర్థవంతంగా పనిచేసి అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ ఆస్తులను కాపాడి  ప్రజల ప్రశంసలు పొందారు. ఆకుల వెంకటరమణ ఉమ్మడి రాష్ట్రంలో   జరిగిన గ్రూప్ 1 పోటి పరీక్షలలో ప్రథమ స్థానం సాధించి  యువతి, యువకులకు మార్గదర్శకంగా నిలిచారు.   తన తల్లిదండ్రులు ఆకుల శ్రీరాములు, లక్ష్మీ నరసమ్మ పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి  మార్కాపురం పట్టణంలో గ్రంధాలయాన్ని సొంతంగా స్థాపించి  తద్వారా పోటీ పరీక్షలకు హాజరయ్యే యువతీ, యువకులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ ను అందజేసి వారి అభిమానాన్ని పొందుతున్నారు.మంత్రి లోకేష్ ఓఎస్డిగా ఆకుల వెంకటరమణ నియమితులు కావడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జీవీఎల్ మళ్లీ మొదలెట్టేశారు!

జీవీఎల్ నరసింహారావు తన జగన్ భక్తిని చాటుకోవడానికి తెగ ఉత్సాహపడుతున్నారు. పేరుకు బీజేపీ ఎంపీ అయినా జగన్ ఏపీలో అధికారంలో ఉన్నంత కాలం, అంతకు ముందు వైసీపీ విపక్షంలో ఉన్న సమయంలో కూడా జీవీఎల్  వైసీపీకి స్టార్ క్యాంపెయినర్ గానే వ్యవహరించారు. ఆయన తీరుకు అప్పట్లో బీజేపీ రాష్ట్ర నాయకులే అసహనం వ్యక్తం చేశారు. జీవీఎల్ తీరు పై రాష్ట్ర బీజేపీ నేతలు అధిష్ఠానానికి  ఫిర్యాదులు కూడా చేశారు.  అంతెందుకు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా జీవీఎల్ తీరుపై విమర్శలు గుప్పించారు.  జగన్ అండతో విశాఖపట్నం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సునాయాసంగా ఎంపీగా ఎన్నికైపోవచ్చని భావించి.. జగన్ పైనా, జగన్ పార్టీపైనా జీవీఎల్ రాజును మించిన రాజభక్తి ప్రదర్శించారు.  సరే ఆయనకు బీజేపీ ఎన్నికలలో పోటీ చేసేందుకు అవకాశమే ఇవ్వలేదు. చేసింది చాలు.. ఇక మౌనంగా ఉండండి అన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలో ఉంది. ఆ కూటమిలో బీజేపీ కూడా భాగస్వామ్య పక్షంగా ఉంది. దీంతో జీవీఎల్ కు తత్వం బోధపడి ఇక నోరెత్తే సాహసం చేయరని అంతా అనుకున్నారు. అయితే ఓ నెలా పదిహేను రోజులు నోరు కట్టేసుకుని మౌనంగా ఉన్న ఆయన మళ్లీ జగన్ కు మద్దతుగా తన డ్యూటీని ప్రారంభించేశారు.  అమరావతిపై విషం చిమ్మడం మొదలెట్టేశారు. అమరావతికి కేంద్రం ఇచ్చింది ముమ్మాటికీ అప్పేనని, ఎవరూ అడగకుండానే జగన్ గొంతు అరువు తీసుకుని మరీ రోడ్డెక్కేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి అమరావతి నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన 15 వేల కోట్ల రూపాయలూ అప్పేనని చెప్పారు. అయితే  ఆ అప్పును కేంద్రం చెల్లిస్తుందా? రాష్ట్రం చెల్లిస్తుందా అనే దానిపై క్లారిటీ లేదుని.. ఈ అప్పు తీర్చేందుకు కనీసం 30 ఏళ్లు పడుతుందని చెప్పుకొచ్చారు.  బీజేపీ నేతగా జీవీఎల్ అన్న ఈ మాటల్ని పట్టుకుని  వైసీపీ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం అంటూ గగ్గోలు పెట్టేయడం మొదలైంది.  వాస్తవానికి కేంద్రం గ్యారంటీగా ఉండి ఇప్పించే అప్పులు కేంద్రం ఖాతాలోనే ఉంటాయి. రాష్ట్రం ఓ పది శాతం కట్టాల్సి ఉంటుంది. ఆ పది శాతం కూడా రాష్ట్రం కట్టలేకపోతే.. అదీ కేంద్రమే కడుతుంది.  అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు. అభివృద్ధి పనులు జరిగితే ఆటోమేటిక్‌గా పెట్టుబడి అంతా తిరిగి వస్తుంది.  ఇది అందరికీ తెలిసిందే.  అయినా జీవీఎల్ ఎందుకు పనిగట్టుకుని కేంద్రం అమరావతికి ఇచ్చింది అప్పు అంటూ వైసీపీ వాదనకు మద్దతు పలకడానికి మీడియా ముందుకు వచ్చి జగన్ పట్ల తన స్వామి భక్తిని చాటుకోవడానికి తహతహలాడుతున్నారు.  నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తున్న చందంగా.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నానని చెబుతూనే.. బడ్జెట్ లో ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందనే అర్ధం వచ్చే మాటలు మాట్లాడుతూ.. జగన్ భక్తిని చాటుకున్నారు.  జీవీఎల్ బీజేపీలో ఉన్న జగన్ కోవర్టు అన్న విషయంలో బీజేపీకి స్పష్టత ఉంది.  కాషాయ కండువా కప్పుకుని ఫ్యాన్ గాలి పీలుస్తానంటున్న జీవీఎల్ కు  శృంగభంగం తప్పదని బీజేపీ, తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నాయి. 

కుప్పంలో వైసీపీ ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్!

వైనాట్ కుప్పం.. వైనాట్ 175.. అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో వైసీపీ నేత‌ల‌  స్లోగ‌న్ ఇదే. కుప్పంలోనూ వైసీపీ అభ్య‌ర్థి విజ‌యం సాధించ‌బోతున్నారంటూ ప్రెస్‌మీట్లు పెట్టి మ‌రీ వైసీపీ నేత‌లు ఢంకా  బజాయించారు. చంద్ర‌బాబు ఓడిపోతున్నారు.. కుప్పంలో తెలుగుదేశం దుకాణం బంద్ కావ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బ‌హిరంగ స‌భ‌ల్లో ప‌దేప‌దే చెప్పారు. అయితే ఎన్నికల ఫలితాలతో  సీన్ రివ‌ర్స్ అయింది. తాము ఒక‌టి త‌లిస్తే దైవం ఒక‌టి తలచింద‌న్న‌ట్లుగా.. వైసీపీ నేత‌లు ఒక‌టి త‌లిస్తే.. కుప్పం ప్ర‌జ‌లు మ‌రొక‌టి త‌లిచారు. అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ మెజార్టీతో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలో వ‌స్తే .. కుప్పంలో చంద్ర‌బాబు నాయుడు గ‌తంలో ఎప్పుడూ లేని స్థాయిలో భారీ మెజార్టీతో విజ‌యం సాధించాడు. ఒక‌ విధంగా చెప్పాలంటే కుప్పం నియోజ‌ క‌వ‌ర్గంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న అనుచ‌రులు చేసిన అరాచ‌కాల‌కు కుప్పం ప్ర‌జ‌లు విసిగిపోయి చంద్రబాబును అత్య‌ధిక మెజార్టీతో గెలిపించారు.   కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కుప్పం నియోజ‌క‌వ‌ర్గంపై  సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేక దృష్టి సారించారు. ఆయ‌న సతీమ‌ణి భువ‌నేశ్వ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. దీంతో అభివృద్ధి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. గ‌తంలో వైసీపీ నేత‌ల ఒత్తిడితో తెలుగుదేశం పార్టీకి వ్య‌తిరేకంగా మాట్లాడిన నేత‌లంతా ఇప్పుడు త‌మ త‌ప్పును తెలుసుకొని ప‌సుపు కండువా క‌ప్పుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.  తాజాగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో చంద్రబాబు సమక్షంలో కుప్పం  వైసీపీ నేతలు తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీలు వైసీపీని వీడి సైకిల్ ఎక్కేశారు. సీఎం చంద్రబాబుతోనే నియోజ‌క‌వర్గంలో అభివృద్ధి సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. గ‌తంలో వైసీపీ నేత‌ల ట్రాప్‌లోప‌డి తాము కంట్రోల్ త‌ప్పామ‌ని, కానీ, రాష్ట్రంతో పాటు కుప్పం నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కావాలంటే ఒక్క చంద్ర‌బాబుతోనే సాధ్య‌మ‌ని స్ప‌ష్టంగా అర్థ‌మైంద‌ని కొంద‌రు వైసీపీ నేత‌లు చెప్పుకొచ్చారు. నియోజ‌క‌వ‌ర్గంలో మిగిలిన వైసీపీ నేత‌లు సైతం త్వ‌ర‌లో తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే క‌ుప్పం నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ కార్యాల‌యాన్ని మూసేసి హోట‌ల్ గా మార్చేశారు. మ‌రోవైపు చంద్ర‌బాబుపై పోటీ చేసిన ఎమ్మెల్సీ భ‌ర‌త్ అధికారం కోల్పోయిన నాటి నుంచి నియోజ‌క‌వ‌ర్గంలో కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో లేకుండా పోయారు. కుప్పంలో చంద్ర‌బాబును కాద‌ని నిల‌బ‌డ‌టం క‌ష్ట‌మ‌ని ఆయ‌న‌కు స్ప‌ష్ట‌త రావ‌డంతో నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉంటున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో త్వ‌ర‌లోనే కుప్పంలో వైసీపీ పూర్తిగా ఖాళీఅయ్యే ప‌రిస్థితి ఏర్ప‌డింది.  కుప్పం నియోజకవర్గం తమిళనాడు, కర్ణాటకకు అత్యంత సమీపంలో వుంటుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషలు మాట్లాడేవాళ్లు నియోజకవర్గంలో ఎక్కువ.  కమ్మ , రెడ్డి, శెట్టిబలిజ, మైనారిటీ, దళితుల ప్రాబల్యం ఎక్కువ. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చంద్ర‌బాబు ఏడు ద‌ఫాలుగా వ‌రుస‌గా విజ‌యం సాధిస్తూ వ‌చ్చారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న స‌మ‌యంలోనూ కుప్పంలో చంద్ర‌బాబును ఢీకొట్టేందుకు సాహ‌సం చేయ‌లేదు.  కానీ, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కుప్పంపై దృష్టి పెట్టారు. చంద్ర‌బాబును 2024 ఎన్నిక‌ల్లో ఓడించే బాధ్య‌త‌ను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి అప్ప‌గించాడు. దీంతో పెద్దిరెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు తెర‌ లేపారు. ప‌లుసార్లు  చంద్ర‌బాబును సైతం నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెట్ట‌కుండా పెద్దిరెడ్డి ఆధ్వ‌ర్యంలోని వైసీపీ గూండాలు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. చంద్ర‌బాబుపై రాళ్ల‌దాడికి సైతం దిగారు. పోలీసులు సైతం పెద్దిరెడ్డి చెప్పిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ చంద్ర‌బాబుపై, తెలుగుదేశం నేత‌ల‌పైనే కేసులు పెట్టారు. పెద్దిరెడ్డి ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌తో కుప్పం నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. తెలుగుదేశం పార్టీకి ప‌లువురు ముఖ్య‌ నేత‌ల‌ను బెదిరింపుల‌కు గురిచేసి వైసీపీలో చేర్చుకున్నారు. దీంతో కుప్పంలో చంద్ర‌బాబు ఓడిపోతున్నారంటూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి స‌హా వైసీపీ నేత‌లు విస్తృత ప్ర‌చారం చేశారు. కానీ, గ‌త ఎన్నిక‌ల్లో కుప్పం ప్ర‌జ‌లు మేమంతా చంద్ర‌బాబువైపే అంటూ ఓటు ద్వారా స్ప‌ష్టం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో భ‌యంతో వైసీపీ గూటికి చేరిన తెలుగుదేశం నేత‌ల‌తో పాటు..  వైసీపీలో మొద‌టి నుంచి కొన‌సాగుతున్న అంద‌రూ చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. మ‌రి కొద్ది రోజుల్లో మిగిలిన వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు సైతం వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబుపై అవాకులు చ‌వాకులు పేలిన ఎమ్మెల్సీ భ‌ర‌త్ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు కూడా అందుబాటులో లేకుండా పోయారు. ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ కార్యాల‌యం మూత‌ప‌డ‌గా.. రాబోయే రోజుల్లో నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉండ‌ద‌ని తెలుగుదేశం నేత‌లు చెబుతున్నారు. మొత్తానికి కుప్పంలో చంద్ర‌బాబును ఓడించాల‌ని ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌తో రెచ్చిపోయిన వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప్ర‌స్తుత ప‌రిణామాలు బిగ్‌షాక్ అనే చెప్పొచ్చు. రాబోయే కాలంలో వైఎస్ జ‌గ‌న్ కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి రావాలంటే వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఉండ‌ని ప‌రిస్థితి కుప్పంలో ఏర్ప‌డ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది.