కరోనా కట్టడికి క్రూరమైన చట్టాలు! కేరళ సర్కార్ పై విమర్శలు
posted on Nov 6, 2020 @ 10:36AM
కేరళలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉందని తెలుస్తోంది. దీంతో కరోనా మహమ్మారి నియంత్రణకు కఠిన చట్టాలను ప్రయోగిస్తోంది పినరయి విజయన్ ప్రభుత్వం. అందులో కొన్ని క్రూరమైన చట్టాలు కూడా ఉన్నాయి. కరోనా కట్టడి కోసం రాష్ట్రవ్యాప్తంగా సీఆర్పీసీ సెక్షన్ 144తో పాటు, సెక్షన్ 151, 149 తదితరాలను విధించింది. ప్రజలు గుమికూడటాన్ని, ఏదైనా కార్యక్రమాలకు పెద్దఎత్తున హాజరు కావడాన్ని అడ్డుకునేందుకే ఈ చట్టాలను ప్రయోగిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. కరోనా కట్టడి కోసమే ఈ చట్టాలను అమలు చేయాల్సి వస్తోందని సీఎం విజయన్ ప్రకటించారు.
సెక్షన్ 151, 149 అమలులో ఉన్నప్పుడు పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని భావిస్తే, మెజిస్ట్రేట్ అనుమతి లేదా వారంట్ లేకుండానే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయవచ్చు. ఆపై వారిని ఒక రోజు కస్టడీలో ఉంచవచ్చు. అవసరమైతే, దాన్ని పొడిగించవచ్చు. సెక్షన్ 144 అమలులో ఉంటే, ముగ్గురి కన్నా అధికంగా ఒక ప్రాంతంలో గుమికూడరాదు. ఈ చట్టాలు అమలులో ఉన్నప్పుడు నిబంధనలను ఉల్లంఘిస్తే, గరిష్ఠంగా రెండు సంవత్సరాల వరకూ జైలుశిక్ష విధించేందుకు వీలుంటుంది. ఈ సెక్షన్లను అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు ఎక్కువగా వినియోగిస్తుంటారు.
అయితే అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించే చట్టాలను ఇప్పుడు కేరళ రాష్ట్రమంతా ప్రయోగించడం వివాదమవుతోంది. కేరళ ప్రభుత్వ నిర్ణయంపై కొందరు న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నివారణకు ఈ సెక్షన్ల ప్రయోగం అవసరం లేదని నారు భావిస్తున్నారు. ఈ చట్టాల అమలు సమయంలో తమ అధికారాలను దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయని, ప్రజల స్వేచ్ఛ హరిస్తుందని అంటున్నారు. కరోనాను అడ్డుకునేందుకు ఇటువంటి కఠిన చట్టాలు అవసరమా అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి.