రాసలీలల సీడీ.. యువతి కిడ్నాప్!

కర్ణాటక మాజీ మంత్రి పేరుతో దుమారం రేపిన రాసలీలల సీడీ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తమ కుమార్తెను కిడ్నాప్‌ చేశారంటూ ఆ సీడీలో కన్పించిన యువతి తల్లిదండ్రులు బెళగావి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె ప్రమాదంలో ఉందంటూ ఓ వీడియో విడుదల చేశారు.   ‘‘ఆ వీడియో టీవీలో కన్పించగానే నేను మా కుమార్తెకు ఫోన్‌ చేశాను. అందులో ఉన్నది తాను కాదని, అది నకిలీ వీడియో అని ఆమె నాకు చెప్పింది. తాను ఏ తప్పూ చేయలేదని తెలిపింది. నీ తప్పు లేనప్పుడు నువ్వు ఇంటికి వచ్చేయ్‌ అని నేను అన్నాను. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. తన జీవితం ప్రమాదంలో ఉందని, ఇప్పుడు రాలేనని మా అమ్మాయి చెప్పింది. తనను కాంటాక్ట్‌ చేయొద్దని కూడా కోరింది. ఆ తర్వాత నుంచి ఆమె ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయ్యింది. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో తెలియట్లేదు’’ అని యువతి తల్లి వీడియోలో తెలిపారు. తమ కుమార్తె ఎక్కడ ఉందో చెప్పాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు. మార్చి 2 కంటే ముందే బెంగళూరులోని హాస్టల్‌ నుంచి తమ కుమార్తెను అపహరించుకెళ్లారని యువతి తండ్రి ఫిర్యాదులో రాశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.   సీడీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత గతవారం ఆ యువతి కూడా ఓ వీడియోను రీలీజ్ చేశారు. అందులో ‘నాకు, కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉంది, మేం రెండుసార్లు బలవన్మరణానికి ప్రయత్నించాం. రక్షణ కల్పించాలి’ అని ఆమె పోలీసులను కోరింది. మరోవైపు సీడీ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌ బృందం.. యువతికి నోటీసులు జారీ చేసింది.   రాసలీలల సీడీ వైరల్ అయ్యాక బాధిత యువతి గోవాకు వెళ్లిందని, అక్కడి నుంచి బెంగళూరుకు వచ్చి నగర శివారుల్లో తలదాచుకున్నట్టు అధికారులు గుర్తించారు. మరోవైపు.. కేసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. సీడీ విడుదలకు ముందు రోజు ఆ యువతి, మరో ఐదుగురితో ఆర్‌.టి.నగరలో సమావేశమైనట్లు కాల్‌ డేటా ఆధారంగా గుర్తించారు. వీడియో విడుదలైన అనంతరం ఒక్కొక్కరు ఒక్కో వైపు వెళ్లినట్లు తేల్చారు. యువతి మినహా మిగిలిన వారిని సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేసి విడిచి పెట్టారు. ఆ యువతి బాయ్‌ ఫ్రెండు, అతని స్నేహితుడ్ని సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు.  కర్ణాటక మాజీ మంత్రి రమేశ్‌ జర్కిహోలీ ఓ మహిళతో సన్నిహితంగా మెలిగిన దృశ్యాలు సంచలనం స‌ృష్టించిన విషయం తెలిసిందే. ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆ మంత్రి తనను లై*గిక అవసరాలకు వాడుకున్నారని ఆ యువతి ఆరోపించింది. ఆ వ్యవహారం వివాదాస్పదం కావడంతో రమేశ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతున్న సమయంలో.. తమ కూతురు కిడ్నాప్ అయిందంటూ ఆమె పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. 

మసాజ్ సెంటర్లో గన్ ఫైర్.. . 

రిలీఫ్ కోసం మసాజ్ సెంటర్ కి వెళ్లారు. కొంత మంది కాల్పులు జరపడం తో శవాలుగా మిగిలారు. అట్లాంటా అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. అట్లాంటా ప్రాంతంలోని వేర్వేరు మూడు మసాజ్‌ పార్లర్లపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనల్లో 8 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు.   అట్లాంటా పోలీసు చీఫ్‌ ర్యాంట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అట్లాంటాలోని బకెడ్‌, చెరోకీకౌంటీ ప్రాంతాల్లోని మూడు వేర్వేరు మసాజ్‌ పార్లర్‌పై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఆరుగురు మహిళలే కాగా.. వారు ఆసియాకు చెందిన వారు అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ కాల్పులకు సంబంధించి రాబర్ట్‌ ఆరోన్‌ అనే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మసాజ్‌ పార్లర్లనే లక్ష్యంగా చేసుకోవడంతో.. ఆయా ప్రాంతాల్లోని మిగతా కేంద్రాల వద్ద పోలీసులు భద్రత పెంచారు.       

అయ్యో నారాయణ.. కాంగ్రెస్ మొండి చేయి..

పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారయణ స్వామికి, అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు కొద్ది రోజుల ముందు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. వరసపెట్టి ఒకరొకరు రాజీనామా చేశారు. అసెంబ్లీలో  సంఖ్యాబలం తగ్గి ప్రభుత్వం మైనారిటీలో పడి పోయింది. చివరకు అసెంబ్లీలో బల  పరీక్ష కంటే ముందే ఆయన  రాజీనామా చేశారు. అందుకోసమే ఎదురుచూస్తున్నకేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. నిజానికి కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులకు బీజేపీనే పుణ్యం కట్టుకుంది. బీజేపీ కేంద్ర నాయకత్వం చొరవతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. బీజేపీలో చేరారు.ఇదేమీ రహస్యం కాదు. బహింరంగ రహస్యం.   అదలా సొంత పార్టీ ఎమ్మెల్యేలు, చివరకు సహచర మంత్రులు రాజీనామా చేయడం, సభలో బలం నిరుపించుకోలేక వెనుతిరగవలసి రావడం, సీనియర్ కాంగ్రెస్ నేత, నారయణ స్వామిని తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. రాజీనామ చేసిన అనతరం ఆయన పదవి పోయినందుకు తనకు పెద్దగా బాధ లేదని, సొంత పార్టీ ఎమ్మెల్యేలు చేసిన అవమానం మాత్రం తనను బాధిస్తోందని వాపోయారు.  ఇప్పుడు ఆ గాయం పూర్తిగా మానక ముందే,ఆయనకు మరో అవమానం ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం’ ఆయనకు ఈ ఎన్నికలలో పోటీచేసే అవకాశం కూడా లేకుండా చేసింది. టికెట్ నిరాకరించింది. మొత్తం 30 మంది సభ్యులున్నకేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభకు ఏప్రిల్ 6 ఎన్నికలు జరగ నున్నాయి. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 14 మంది అభ్యర్ధుల తొలిజాబితాను విడుదల చేసింది. ఇందులో మాజీ ముఖ్యమంత్రి, నారాయణ స్వామి పేరు లేదు.  నారాయణ స్వామి ఈ ఎన్నికలలో పోటీ చేయడం లేదని, అభ్యర్ధుల జాబితాను ప్రకటించిన ఏఐసీసీ ఇంచార్జి దినేష్ గుండు రావ్’ చెప్పేశారు. ‘మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి పోటీ చేయడం లేదు. పార్టీ ఎన్నికల బాధ్యతలను మాత్రమే నిర్వహిస్తారు’ అని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ని సంప్రదించి ఈ నిర్ణయం తీసుకుందా లేదా అనేది తెలియక పోయినా, నారాయణ స్వామి పరిస్థితి, మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు’ అన్నట్లుగా ఉందని, సుదీర్ఘ కాలం పాటు, పార్టీకి సేవ చేసిన సీనియర్ నాయకుని ఇలా అవమాన పరచడం ఏమిటని ఆయన అనుచరులు ‘పాపం పెద్దాయన ఆవేదన వ్యక్త పరుస్తున్నారు. నిట్టూరుస్తున్నారు.

తాడిపత్రి టెన్షన్.. రంజుగా రాజకీయం

గురువారం అనంతపురం జిల్లా తాడిపత్రి పురపాలక ఛైర్మన్‌ ఎన్నిక. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో ఓటు తిరస్కరణ. టీడీపీ క్యాంప్ పాలిటిక్స్, అధికార వైసీపీ బెదిరింపు రాజకీయాలతో ఛైర్మన్‌ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. కౌన్సిలర్లు చేజారకుండా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి రహస్య శిబిరం నిర్వహిస్తున్నారు. టీడీపీ క్యాంపులో సైకిల్ గుర్తుపై గెలిచిన 18 మంది కౌన్సిలర్లతో పాటు ఒక సీపీఐ, ఒక స్వతంత్ర కౌన్సిలర్‌ ఉన్నారు. ఛైర్మన్‌ ఎన్నికలో తెలుగుదేశం పార్టీకే మద్దతిస్తామనే స్పష్టమైన హామీ ఇచ్చి శిబిరంలో కొనసాగుతున్నారు. 20 మందిలో ఏ ఒక్కరూ చేజారే అవకాశం లేదని జేసీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.    టీడీపీ ప్రతిపాదించే ఛైర్మన్‌ అభ్యర్థికే తాము మద్దతిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ తాడిపత్రి మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్‌రెడ్డికి ముందుగానే విప్‌ సమర్పించారు. మొత్తం 36 స్థానాలున్న తాడిపత్రి పురపాలికలో టీడీపీ నుంచి 18 మంది, వైసీపీ తరఫున 16 మంది కౌన్సిలర్లు గెలవగా.. ఒకటి సీపీఐ, మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. వైసీపీకి ఎంపీ, ఎమ్మెల్యేల ఎక్స్‌అఫీషియో ఓట్లు ఉన్నాయి. దీంతో అధికార పార్టీ బలం 18కి చేరింది. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో ఓటును అధికారులు తిరష్కరించడంతో లెక్క సరిసమానమైంది. అయితే, సీపీఐ, ఇండిపెండెంట్ అభ్యర్థులు టీడీపీకి మద్దతు ప్రకటించి క్యాంపులో చేరడంతో తాడిపత్రి రాజకీయం రంజుగా మారింది.  మరోవైపు.. టీడీపీ సభ్యులపై అధికార పార్టీ నుంచి ఒత్తిడి, బెదిరింపులు పెరిగాయి. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా వైసీపీ చైర్మన్ అభ్యర్థికి మద్దతివ్వాలంటూ టీడీపీ కౌన్సిలర్ల కుటుంబ సభ్యులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. రెండు రోజుల క్రితం టాటా మోటార్స్ గ్యారేజ్‌కి వెళ్లి వైసీపీకి మద్దతు ఇవ్వాలంటూ టీడీపీ నేత హాజీ వలికి వైసీపీ నేత కాకర్ల రంగనాథ్ అల్టిమేటం జారీ చేశారు.  అధికారపార్టీ నేతల మాట వినకపోవడంతో టాటా మోటార్స్ షో రూమ్ నిర్వాహకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలు పోలీసులను అడ్డంపెట్టుకొని తమ పార్టీ నేతలపై అక్రమకేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నిర్వహిస్తున్న రహస్య శిబిరం విజయవంతంగా కొనసాగుతుండటం.. బెదిరింపులకు బెదరకుండా అంతా టీడీపీకి కట్టుబడి ఉండటంతో అధికార పార్టీ నేతల్లో అసహనం పెరుగుతోంది. ఛైర్మన్ ఎంపిక ముగిసేదాకా తాడిపత్రిలో హైటెన్షన్ కంటిన్యూ కానుంది.

సీఎం సొంతజిల్లాలో ఝలక్.. వైసీపీకి కౌన్సిలర్ షాక్

ఆమె అధికార పార్టీ కౌన్సిలర్. అందులోని సీఎం సొంత జిల్లా కడప. ఇటీవలే వార్డు కౌన్సిలర్‌గా గెలిచారు. ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. అంతలోనే వైసీపీకి షాకిచ్చారు. అధికార పార్టీ నేతల తీరుతో విసుగు చెంది కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాతో జమ్మలమడుగు వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. జమ్మలమడుగు 4వ వార్డు నుంచి జ్ఞాన ప్రసూన కౌన్సిలర్‌గా గెలిచారు. ఆమెకు మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి ఇస్తానంటూ గతంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాటిచ్చారు. అయితే.. చివరి క్షణంలో ఎమ్మెల్యే మరొకరికి అమ్ముడుపోయారని.. తనను ఛైర్‌పర్సన్ చేయకుండా హ్యాండ్ ఇస్తున్నారంటూ ఆరోపించారు కౌన్సిలర్ జ్ఞాన ప్రసూన. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చేసిన ద్రోహానికి మనస్తాపం చెంది ఇటీవల గెలిచిన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. ఎక్కువ డబ్బులు ఇచ్చినవారికి ఛైర్మన్ పదవి అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేశారు. పదవి కోసం తమ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారని జ్ఞాన ప్రసూన చెప్పారు. జమ్మలమడుగు వివాదంతో అధికార పార్టీ అరాచకాలు మరోసారి బయటపడ్డాయని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. 

భార్య రాలేదని.. భర్త .. 

నిత్యం భార్య భర్తల మధ్య గొడవలు. ఆ కుటుంబ కలహాలతో భర్త పురుగుల మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్లిన భర్తను భార్య పలకరించలేదని. కనీసం ఎలా ఉన్నాడని కూడా చూసేందుకు రాలేదని. తీవ్ర మనస్థాపానికి గురైన ఆ భర్త మరోసారి ఆత్మహత్యా యత్నం చేశాడు. ఒక వ్యక్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి భవనం మూడో అంతస్తు పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.  మంచిర్యాల పట్టణంలోని హమాలివాడ చెందిన శేఖర్ అనే వ్యక్తి గత కొంత కాలంగా భార్య భర్తల మధ్య గొడవలు పెరగడంతో మనస్తాపానికి గురైన శేఖర్ మంగళవారం  క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిసింది. అనంతరం శేఖర్ ని  ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తరలించారు.  చికిత్స పొందిన అనంతరం శేఖర్ ఇంటికి వెళ్ళాడు.  ఈ రోజు ఇంటికి వెళ్లిన శేఖర్ తన భార్య తనని చూడడానికి కూడా రాలేదని మనస్థాపానికి గురై ఆస్పత్రి మూడో అంతస్తుకు ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పోలీసులు సమయస్ఫూర్తితో చాకచాక్యంగా వ్యవహరించి సదరు వ్యక్తిని భవనం పై నుండి కిందికి దింపడంతో ప్రమాదం తప్పింది.

అంత వీజీ కాదు.. ఆ లెక్కే వేరప్పా...

తిరుపతి ఉపపోరు. నెల రోజులే గడువు. స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం. తిరుపతిలోనూ అదే రిపీట్ అవుతుందా? మళ్లీ అధికార పార్టీదే విజయమా? పైపైన చూస్తే అలానే అనిపించినా.. లెక్కలు పక్కాగా వేస్తే.. వైసీపీకి గెలుపు అంత ఈజీ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తిరుపతి పార్లమెంట్ స్థానం పరిధిలోని ఎమ్మెల్యే సీట్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ అన్నీ వైసీపీ ఖాతాలోనే ఉన్నా.. విజయం దక్కాలంటే చెమటోడ్చాల్సిందే అంటున్నారు. అందుకు వారు చెప్పే కారణాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అధికార బలం, ప్రభుత్వ పథకాలు ఇవి మాత్రమే వైసీపీకి అనుకూలం. ఫిజియోథెరపిస్టు గురుమూర్తి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆయనకు స్థానికంగా పెద్దగా ప్రాచుర్యం ఏమీ లేదు. ప్రజలకు చేసిన సేవ కూడా ఏమీ లేదు. ఉన్న అర్హతల్లా జగన్ రెడ్డికి ఫిజియోథెరపీ చేయడం మాత్రమే. ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన పాదయాత్రలో ఆయనకు ఫిజియోథెరపీ సేవలు అందించారు గురుమూర్తి. అందుకు ప్రతిఫలంగా అతనికి తిరుపతి ఎంపీ అభ్యర్థిత్వం వరించింది. అంతేగానీ, అతనికి రాజకీయ అనుభవమో.. ప్రజల్లో ఆదరణో అసలేమాత్రం లేదు. ఇదే అతని మైనస్. ఇక టీడీపీ నుంచి పనబాక లక్ష్మి పోటీలో నిలిచారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆమె సొంతం. తిరుపతిలో మంచి పాపులారిటీ, ఖ్యాతి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలతో దెబ్బ తిన్న పులిలా ఉన్న టీడీపీ.. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతుంది. ఎలక్షన్‌ను సవాల్‌గా తీసుకుంటుంది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కూడా కావడం ప్రతిపక్ష పార్టీకి అనుకూలమే.  ఇక కాంగ్రెస్ నుంచి చింతా మోహన్ రేసులో ఉండటంతో టఫ్ కాంపిటీషన్ తప్పకపోవచ్చు. ఇక బీజేపీ, జనసేన పొత్తు తిరుపతి పొలిటికల్ ఈక్వేషన్‌ను అమాంతం మార్చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక నగరం కావడం, మొదటి నుంచి బీజేపీ ఉనికి చాటుకుంటుండటం, పవన్ కల్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉండటం.. ఆ పార్టీకి అదనపు బలం. బీజేపీ నుంచి రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం.. ఆయనకున్న మిస్టర్ క్లీన్ ఇమేజ్.. ఇలా బీజేపీ, జనసేన పొత్తు అధికార పార్టీ ఓట్లను డైవర్ట్ చేసే ఛాన్స్ ఉంది.  స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిరి తిరుపతి ఎంపీ ఎలక్షన్లో వైసీపీకి వన్ సైడ్ ఓటింగ్ జరిగే అవకాశమే లేదంటున్నారు విశ్లేషకులు. నయానో, భయానో స్థానిక సంస్థలను కొల్లగొట్టింది అధికార పార్టీ. పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు ఎలా జరిగాయో అందరికీ తెలిసిందే. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ చిన్న ప్రాంతానికే పరిమితమవడం.. స్థానికంగా అంత బలంగా ఉండని అభ్యర్థులపై అధికారాన్ని ప్రయోగించి ఈజీగా లొంగ దీసుకోవడం.. ప్రభుత్వ పథకాలు, పనులు కావంటూ బెదిరించడం.. కేసులంటూ భయపెట్టడం.. లాంటి చర్యలతో స్థానిక సంస్థలను అధికార పార్టీ కైవసం చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ఎంపీ సీటు కోసం జరిగే ఎన్నికలో ఇలాంటి బెదిరింపులు, మేనేజ్ చేయడాలు కుదరవు. పార్లమెంట్ నియోజక వర్గ స్థాయి పెద్దదిగా ఉండటం.. పార్టీ తరఫున ఒకే అభ్యర్థి ఉండటం.. స్థానిక అంశాలకంటే విధాన పరమైన, పార్టీ పరమైన ప్రాధాన్యత వైపే ప్రజలు మొగ్గు చూపే అవకాశం.. తదితర కారణాలతో తిరుపతి ఎలక్షన్ అధికార పార్టీకి నల్లేరు మీద నడక కాకపోవచ్చు. టీడీపీకి ఇంకా విస్త‌ృత స్థాయి ప్రజాభిమానం ఉండటం.. చంద్రబాబు సొంత జిల్లా కావడం.. బీజేపీ, జనసేన పొత్తు.. కాంగ్రెస్ పట్టు.. ఇలా అనేక కారణాలతో తిరుపతి సీటు అన్ని పార్టీలకు సవాల్‌గా మారనుంది. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిపక్షాల మధ్య చీలిపోయే ప్రమాదం మాత్రం లేకపోలేదు. 

బీజేపీ ఎంపీ అనుమానాస్పద మృతి

బీజేపీ ఎంపీ రామ్‌స్వరూప్‌ శర్మ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. దిల్లీలోని ఆయన నివాసంలో ఉరి వేసుకొని చనిపోయారు. ఢిల్లీలోని గోమతి ఆపార్ట్‌మెంట్‌లో శర్మ నివాసముంటున్నారు. ఉదయం ఎంపీ శర్మ అసిస్టెంట్ ఆయనకు ఫోన్‌ చేయగా ఎంతకీ ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. అనుమానం వచ్చిన అతడు పోలీసులకు ఫోన్‌ చేశాడు. ఫ్లాట్‌కు వెళ్లిన పోలీసులు గది తలుపు బద్దలుకొట్టగా.. ఎంపీ శర్మ ఫ్యాన్స్‌కు వేలాడుతూ కన్పించారు. ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. గత కొంతకాలంగా శర్మ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన కరోనా టీకా కూడా వేయించుకున్నారు.    62 ఏళ్ల శర్మ హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో జన్మించారు. 2014, 2019 ఎన్నికల్లో రెండు సార్లు ఎంపీగా గెలిచారు. శర్మకు భార్య, ముగ్గురు కుమారులున్నారు.  గత నెల దాద్రానగర్‌ హవేలీ ఎంపీ మోహన్‌ దేల్కర్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ముంబయిలోని ఓ హోటల్‌ గదిలో ఆయన ఉరేసుకుని చనిపోయారు. గదిలో గుజరాతీలో రాసిన ఓ లేఖ కూడా లభించినట్లు పోలీసులు అప్పట్లో తెలిపారు. ఓ సీనియర్‌ రాజకీయ నాయకుడితో సహా కొందరు తనను వేధిస్తున్నారని దేల్కర్‌ అందులో రాసినట్లు సమాచారం. ఎంపీ మోహన్ దేల్కర్ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తమవుతుండగా.. రెండు వారాల వ్యవధిలోనే మరో ఎంపీ రామ్‌స్వరూప్‌ శర్మ మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ఉన్నతస్థాయి వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రూ.10కే బిర్యానీ.. రండి బాబు రండి..

మంచి బిర్యానీ తినాలంటే  మినిమమ్ 150 నుండి రెండు వందలు ఉండాలి.. స్టార్ హోటల్స్  లో ప్రైజ్ అయితే ఇక చెప్పనక్కర్లేదు.. 10 రూపాయలకు మంచి టీ కూడా దొరకని ఈ రోజుల్లో 10 రూపాయలకే బిర్యానీ దొరుకుతుందంటే నమ్ముతారా.. మీరు నమ్మిన నమ్మకపోయినా 10 రూపాయలకు బిర్యానీ  మాత్రం వాస్తవము..  ఆ ఏరియాలో  బస్సులు వస్తుంటాయి, వెళ్తుంటాయి. ప్రజలు బిజీ బిజీగా తిరుగుతుంటారు. భోజనం చేసే సమయానికి  ఓ బిర్యానీ షాప్ దగ్గర జనం గుమ్మికూడుతారు.  10 రూపాయలకే  వేడి వేడి వెజిటబుల్ బిర్యానీ కొనుక్కుంటున్నారు. హాయిగా తింటున్నారు. అదే అస్కా బిర్యానీ స్టాల్. హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ బస్టాప్ దగ్గరకు వెళ్లి... ఈ స్టాల్ పేరు చెప్పి అడ్రెస్ అడిగితే చూపిస్తారు. చూడ్డానికి పాత హోటల్‌లా ఉంటుంది. పదేళ్ల నాటిది మరి. రోజంతా ప్లేట్ బిర్యానీని రూ.10కే అక్కడ అమ్ముతున్నారు. ఉదయం 7 గంటలకే తెరిచి... అర్థరాత్రి వరకూ అందుబాటులో ఉంచుతారు. పేదవాళ్లు, రోజువారీ కూలీలకు ఈ హోటల్ ప్రాణం పోస్తోంది. తలాబ్ కట్ట దగ్గర నివసిస్తున్న ఇఫ్తికార్ మొమిన్... ఈ ఫుడ్ స్టాల్‌ను ఓ టేబుల్... కొన్ని గిన్నెలతో పదేళ్ల కిందట ప్రారంభించారు. అప్పట్లో ఇదే వెజ్ బిర్యానీని రూ.5 చొప్పున అమ్మారు. ధరలు పెరుగుతుంటే... ఆయన కూడా కాస్త పెంచుతూ ప్రస్తుతం రూ.10 చేశారు. ఇలాంటి స్టాల్స్‌ని ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్, కోటి ఉమెన్స్ కాలేజీ బస్టాప్, అబిడ్స్‌లోని జనరల్ పోస్టాఫీస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా ప్రారంభించి నడిపిస్తున్నారు.  

8 ఏళ్లుగా డేటింగ్..  సుసైడ్స్ ట్విస్ట్.. 

వారిద్దరిది ఒకే రకం వ్యాపారం. వారు చేసే వ్యాపారం సేమ్ కాబట్టి మూడు మాటలు కలిశాయి.. ఈ తర్వాత మనసులు, తనువులు  కలిశాయి.. కొన్నాలు ప్రేమ మాధుర్యంలో మునిగితేలారు. సహజీవనం చేస్తూ పెళ్లి కాకుండానే ఒక్కటయ్యారు. అలా కాలం కొన్నాలు గడిచింది. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు. ఒకటిగా కలిశాం ఒకటిగానే చనిపోదామనుకున్నారో ఏమో మరి.  ఇద్దరు ఒకే లాడ్జిలో వేర్వేరు రూములు తీసుకొని ఆత్మహత్య చేసుకుని వారి ముందు ఉన్న జీవితానికి ముగిపు పలికారు.    ఈ విషయం తెలుసుకున్న ఇరుకుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన వెంకట్ గౌడ్.. 15 ఏళ్లుగా తిరుపతిలో ఉంటూ పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. తిరుపతిలోని సత్యనారాయణపురానికి చెందిన అనిత కూడా అదే ప్రాంతంలో పండ్ల వ్యాపారం చేస్తుంటుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. అంతా బాగుంది అనుకున్న సయమంలోనే ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇద్దరు రేణిగుంట పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో ఇద్దరు రెండు రోజుల క్రితం రూమ్ తీసుకున్నారు. వేరువేరుగా గదులు అద్దెకు తీసుకున్న ఇద్దరు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్నారు. వెంకట్ గౌడ్ ఓ గదిలో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకోగా.. అనిత.. మరో గదిలో ఉరివేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఐతే వీళ్లిద్దరికీ నాలుగేళ్ల క్రితం పెళ్లైనట్లు తెలుస్తోంది. నిజంగా పెళ్లైందా.. లేక సహజీవనమే చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇద్దరి మధ్య కలహాలతో ఆత్మహత్య చేసుకున్నారా..? లేక పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని బలవన్మరణానికి పాల్పడ్డారా..? అనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఆమెకు ౩౦ అబ్బాయికి 15 

ఆమెకు ౩౦ సంవత్సరాలు ముగ్గురు పిల్లలు.. భర్త, ముగ్గురు పిల్లలు మాత్రమే ఆమె ప్రపంచం అని కుటుంభం సభ్యులు అనుకున్నాడు.. జీవితం సాఫీగా గడుపుతున్న ఓ వివాహిత.. మిస్టరీ సినిమాలో సడెన్ గా కనిపించకుండా పోయింది.. ఇంట్లో కూడా గొడవ జరగలేదు ఎక్కడికి పోతుందిలే  చీకటి పడితే ఆమె ఇంటికి వచ్చేస్తుందని పిల్లలు కూడా అనుకున్నారు కుటుంబ సభ్యులు. కానీ వాళ్లు అనుకున్నట్లు  జరిగలేదు. ఎవరూ ఊహించని విధంగా ఆమె కుటుంబ  సభ్యులకు ట్విస్ట్ ఇచ్చింది. ఎప్పుడూ ఇల్లు దాటి వెళ్లని ఆ మహిళ మొన్న బుధవారం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె ఎటూ పోయిందో అని అంతా కంగారుపడ్డారు. అయితే అసలు విషయం తెలిసి అంతా అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే ఆ మహిళ.. 15 ఏళ్ల తమ అబ్బాయితో కలిసి వెళ్లిపోయిందని అబ్బాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతడితో ఏడాదికాలంగా ఆ మహిళ సన్నిహితంగా ఉంటోంది. అయితే వారిద్దరి మధ్య ఉన్న వయసు వత్యాసం కారణంగా వారిని ఎవరూ అనుమానించలేదు. అయితే కొంతకాలంగా తన భార్య ప్రవర్తనలో మార్పు వచ్చిందని.. కానీ దానికి అసలు కారణం ఇలా ఉంటుందని తాను ఊహించలేకపోయానని ఆమె భర్త పోలీసులుకు వివరించాడు. ఈ మొత్తం వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పారిపోయిన ఆ ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు తమ కుమారుడిని త్వరగా తీసుకురావాలని.. అతడికి ఏమీ తెలియదని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు మొరపెట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ జరిగింది. 

విమానంలో నానా రచ్చ చేసిన మందుబాబు... ఏకంగా 20 ఏళ్ల శిక్ష..!

మద్యం సేవించిన వ్యక్తులు ఒళ్ళు పైన తెలియకుండా వీధుల్లోనూ, పబ్బుల్లోనూ.. ఎక్కడ పడితే అక్కడ చేసే రచ్చ గురించి మనకు తెలిసిందే. మరి ఇటువంటి మందుబాబులు ఒక విమానం ఎక్కితే ఇక ఆ ఫ్లయిట్ ప్రయాణికులకు, సిబ్బందికి పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. తాజాగా యుఎస్ లో ఒక  యువకుడు విమానం ఎక్కి అందులో ఒక బుద్ది ఉన్నవాడు చేయకూడని పనులన్నీ చేసాడు  దీంతో అక్కడి చట్టాల ప్రకారం అతడిపై  కనీసం  20 ఏళ్ల జైలు శిక్ష, అదే సమయంలో రూ.2 కోట్ల భారీ జరిమానా విధించే  అవకాశాలున్నాయి. కొలరాడో ప్రాంతానికి చెందిన లాండన్ గ్రియర్ అనే 24 ఏళ్ల యువకుడు మార్చి 9న  సియాటిల్ నుంచి డెన్వర్ వెళ్లేందుకు అలాస్కా ఎయిర్ లైన్స్ విమానంలో ఎక్కాడు. అయితే, విమానం ఎక్కిన దగ్గర నుండి ప్రతి నిమిషం రూల్స్ కు విరుద్ధంగా ప్రవరిస్తూ ఫ్లయిట్ సిబ్బందికి, తోటి ప్రయాణికులకు చుక్కలు చూపించాడు.   ఒకపక్క కరోనాతో ప్రపంచం సతమతమవుతుంటే.. అయ్యగారు మాత్రం మాస్కు ధరించమంటే నిద్ర పోతున్నట్టుగా నటించాడు. విమాన సిబ్బంది ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అసలు వినిపించుకోనట్టే నిర్లక్ష్యం వహించాడు. ఇదేమని అడిగితె ఏకంగా  ప్యాంట్ విప్పి మరింత అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా, తాను కూర్చున్న సీట్లోనే మూత్రవిసర్జన చేశాడు. అయితే లాండన్ గ్రియర్ విమానం ఎక్కేముందే నాలుగు బీర్లు లాగించాడట.. దీంతో ఆ మద్యం మత్తులో ఇష్టంవచ్చినట్టు ప్రవర్తించి అటు విమాన సిబ్బందిని ఇటు తోటి ప్రయాణీకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన అతడికి ఎటువంటి  శిక్ష విధిస్తారో వేచి చూడాలి  

సాగర్ జానారెడ్డికి సవాలే! 

ఉప ఎన్నికల నగారా మోగడంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి రాజుకుంది. తెలంగాణలోని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక పార్టీలకు ప్రధాన సవాల్ గా మారింది.వరుస ఓటములతో డీలా పడిన అధికార పార్టీ ఇక్కడ గెలుపు అత్యంత కీలకం. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలను సాగర్ లోనూ రిపీట్ చేయాలని తహతహలాడుతోంది కమలదళం. తమకు పట్టున నాగార్జున సాగర్ లో విజయం సాధించి తిరిగి ఫామ్ లోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీంతో ఉప ఎన్నిక హోరాహోరీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  నాగార్జున సాగర్ కు అందరి కంటే ముందే అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి  జానారెడ్డిని  ఉప ఎన్నిక బరిలో నిలుపుతున్నట్లు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది.గతంలో ఇక్కడి నుంచి ఏడుసార్లు విజయం సాధించారు జానా రెడ్డి. 2018 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. నాగార్జున సాగర్ నుంచి జానా రెడ్డి పోటీ చేస్తారని చాలా రోజుల క్రితమే క్లారిటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నియోజకవర్గంలో ఆయన ప్రచారం కూాడా చేసేస్తున్నారు. ఇప్పటికే జానారెడ్డి ఒక రౌండ్ ప్రచారం పూర్తి చేసుకున్నారని చెబుతున్నారు. తన కంచకోటగా చెప్పుకునే సాగర్ లో గెలిచి రాష్ట్రంలో మళ్లీ సత్తా చాాటాలని జానారెడ్డి భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన సర్వశక్తులు ఒడ్డనున్నారు. నిజానికి సాగర్ లో జానారెడ్డి కొడుకు పోటీ చేస్తారని ముందు ప్రచారం జరిగినా.. ఎన్నిక అత్యంత కీలకం కావడంతో జానారెడ్డినే పోటీ చేయాలని కాంగ్రెస్ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది. నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన జానారెడ్డిపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్య తిరుగులేని విజయం సాధించారు. నాగార్జున సాగర్‌ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఈ నెల 23న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మార్చి 30 వరకు నామినేషన్లు స్వీకరణ.. 31న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.  ఏప్రిల్‌ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు. 17న ఉప ఎన్నిక పోలింగ్‌, మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.  

స్కూల్ లో 38 మందికి  కరోనా

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. పాఠశాలల్లో మహమ్మారి కోరలు చాస్తోంది. హైదరాబాద్ శివారు నాగోల్‌లోని బండ్లగూడలో కరోనా కలకలం రేగింది. బాలికల మైనార్టీ పాఠశాలలో 38 మంది విద్యార్థినులకు కరోనా నిర్ధారణ అయింది. అదే పాఠశాలలో మొత్తం 160 మంది  విద్యార్థినులు చదువుతున్నారు. విద్యార్థినులు, సిబ్బంది అందరికీ అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసులు పెరిగితే అందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. రోజు రోజుకూ గాంధీ ఆస్పత్రిలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.  డెంటల్ ట్రీట్మెంట్ కోసం ఒక స్టూడెంట్ బయటకు వెళ్లారు.. అలా కరోనా వచ్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. 27 మంది స్కూల్ స్టాఫ్ బయటకు.. వెళ్లి వస్తుంటారు అలా కూడా కరోనా ఎవరినుంచయినా వచ్చి  ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. కరోనా టెస్టులో నెగటివ్ వచ్చిన కొందరు స్టూడెంట్స్ ను పేరెంట్స్ ఇంటికి తీసుకెళుతున్నారు. సడన్ గా ఫోన్ చేసి.. పిల్లలను తీసుకెళ్లమంటే ఎలా అని కొందరు పిల్లలు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కరోనా నెగటివ్ రిపోర్ట్స్ చూపించి లోపలకి పంపించినపుడు.. పాజిటివ్ ఎలా వచిందని నిలదీస్తున్నారు.  కొందరు పిల్లలకు ఫీవర్, బాడీ పెయిన్స్ ఉండడంతో... టెస్ట్ కు పంపారు ప్రిన్సిపాల్ వినీల. కొందరికి పాజిటివ్ రావడంతో... 152 మంది స్టూడెంట్స్, 27 మంది స్టాఫ్ కు టెస్ట్ లు నిర్వహిస్తున్నారు. అంబులెన్స్ ను రెడీగా ఉంచడంతో పాటు... అవసరం అయితే టిమ్స్, గాంధీ హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తామని మేడ్చల్ హెల్త్ అధికారులు తెలిపారు. పిల్లలకు పాజిటివ్ రావడంతో కన్నీరు పేరెంట్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పిల్లలను చూడాల్సిందే అని తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు. దీంతో వీడియో కాల్స్ చేసి మాట్లాడిస్తున్నారు ప్రిన్సిపాల్ వినీల. పాజిటివ్ వచ్చిన చిన్నారులను కలిస్తే.. వైరస్ సోకె అవకాశాలు ఉన్నాయని తల్లిదండ్రులకు విస్తరిస్తున్నారు అధికారులు

జగన్ ఫిజియోథెరపిస్టు‌కే తిరుపతి టికెట్

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే వైసీపీ తన అభ్యర్థిని ప్రకటించింది. పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ ను వెన్నంటే ఉన్న డాక్టర్ గురుమూర్తిని తిరుపతి ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. ఈ మేరకు సీఎం జగన్ ఖరారు చేసినట్టు వైసీపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.తిరుపతి బరిలో డాక్టర్ గురుమూర్తిని దింపాలని కొన్నినెలల కిందటే వైసీపీలో అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడి చేశారు. వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్ట్‌ అయిన మద్దిల గురుమూర్తి స్వస్థలం  ఏర్పేడు మండలం మన్నసముద్రం. స్విమ్స్‌లో ఫిజియోథెరపీ పూర్తిచేసిన ఈయన తిరుపతిలోని శ్రీసాయిసుధ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఏడేళ్లపాటు సీనియర్‌ ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేశారు. ఈ క్రమంలో జగన్‌ సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’లో ఆమెకు వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్‌గా వ్యవహరించారు.దీంతో జగన్‌ పాదయాత్రలోనూ ఆయనకు ఫిజియోథెరఫిస్ట్‌గా పని చేసే అవకాశం లభించింది.ఈ సేవలకు ప్రతిఫలంగా తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్టు లభించినట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గత ఏడాది సెప్టెంబర్ 16న మృతి చెందడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. తిరుపతి సీటును 2019లో భారీ మెజార్టీతో గెలుచుకుంది వైసీపీ. బల్లి దుర్గాప్రసాద్ 2 లక్షల 40 వేల మెజార్టీతో విజయం సాధించారు. ఉప ఎన్నికల్లో దుర్గాప్రసాద్ కొడుకే పోటీ చేస్తారని ముందు ప్రచారం జరిగినా... అతనికి ఎమ్మెల్సీ ఇచ్చారు జగన్. దీంతో తిరుపతిలో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని ఖరారు చేశారు. 

విశాఖకు రాజధాని షిష్టింగ్? నోటీసులతో డైవర్షన్ గేమ్!

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయభేరి. రెండు రోజుల వ్యవధిలో ప్రతిపక్ష నేతకు సీఐడీ నోటీసులు. మాజీ ముఖ్యమంత్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు. హైకోర్టు గతంలోనే క్లీన్‌చీట్ ఇచ్చినా.. ఎలాగోలా బాబు మెడకు అమరావతి అసైన్డ్ భూముల కేసు ఉచ్చు బిగించాలానే ప్రయత్నం. ఇదంతా ఎందుకు? సడెన్‌గా ఇప్పుడే ఎందుకు? అంటే దానికో లెక్కుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉలుకు పలుకు లేకుండా సడెన్‌గా హైదరాబాద్‌కు ఊడిపడ్డారు ఏపీ పోలీసులు. ఉదయమే చంద్రబాబు ఇంటి కాలింగ్ బెల్ కొట్టి.. నోటీసులు చేతిలో పెట్టి వెళ్లిపోయారు. అకస్మాత్తుగా అమరావతి అసైన్డ్ భూముల కేసు సీఐడీకి ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది? ఫలితాలు వెలువడిన రెండు రోజులకే సర్కారు ఎందుకింతలా హడావుడి చేస్తోంది? ఎలాగూ గెలిచారుగా? విజయం వారిదేగా? అయినా, ఈ వేధింపులు ఎందుకు? ఉన్నట్టుండి చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఎందుకిచ్చారు? అనే అనుమానం అందరిలోనూ. నోటీసుల వెనుక పక్కా పొలిటికల్ వ్యూహం దాగుందని అంటున్నారు. తెర వెనుక ఏదో గూడు పుఠాణి జరుగుతోందని తెలుస్తోంది. అదేంటో కూడా లీకులొస్తున్నాయి. మూడు రాజధానుల చిక్కుముడి విప్పేందుకు.. రాజధానికి అమరావతి నుంచి విశాఖకు రాత్రికి రాత్రి షిఫ్ట్ చేసేందుకు.. చంద్రబాబుకు సీఐడీ నోటీసుల ఇష్యూని తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు. ఇదంతా సర్కారు ఆడుతున్న డైవర్షన్ డ్రామాలో భాగమంటూ భగ్గుమంటున్నాయి విపక్షాలు.  ఇటు విజయవాడ, అటు విశాఖపట్నం.. రెండు కార్పొరేషన్లలోనూ వైసీపీ గట్టి పట్టు సాధించింది. అమరావతి సెంటిమెంట్ బెజవాడ ఎన్నికల్లో కనిపిస్తుందని.. ప్రజాగ్రహానికి ఫ్యాన్ కాలిపోతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఫ్యాన్ గాలి రివ్వున వీచింది. అమరావతి పక్కనే ఉన్న గుంటూరు కార్పొరేషన్‌లోనూ అమరావతి ప్రభావం పని చేయలేదు. అటు వైజాగ్‌లోనూ వైసీపీకి ఎదురు లేకుండా పోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఉందని తెలిసినా.. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు వైసీపీని ఆదరించారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌కు అక్కడి వారంతా జై కొట్టారని లెక్కేస్తున్నారు. ఇలా.. విజయవాడ, గుంటూరు, విశాఖ ఫలితాలతో.. ప్రభుత్వంలో ఉత్సాహం రెట్టించింది. ఇదే మంచి తరుణమని.. ఆలసించినా ఆశాభంగమని భావిస్తోంది. రాజధానిని రాత్రికి రాత్రే అమరావతి నుంచి విశాఖకు మార్చేయాలని జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని అంటున్నారు. అందుకు, ముహూర్తం కూడా నిర్ణయించేశారట. ఫలానా రోజున కేపిటల్ షిప్టింగ్ అంటూ ప్రజల్లో, సోషల్ మీడియాలో చర్చ కూడా జరుగుతోంది. తాజాగా, వైసీపీ ఎంపీ రఘురామ క‌ృష్ణంరాజు సైతం ఇదే ఆరోపించారు.  రాజధాని మార్పు అంశం ఇప్పటికే హైకోర్టులో ఉంది. ఫైనల్ తీర్పు వచ్చే వరకూ అమరావతి నుంచి ఇటుక కూడా కదిలించలేరని రైతులు హెచ్చరిస్తున్నారు. కేపిటల్ మార్పు విషయంలో ఎప్పుడో నిర్ణయం తీసేసుకున్న సర్కారు.. దాన్ని అమలు చేయలేక అడుగు ముందుకు వేయలేకపోతోంది. హైకోర్టు కేసులు, రైతుల నుంచి నిరసనలు, చంద్రబాబు పోరాటంతో సందిగ్థంలో పడింది. కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజాభిప్రాయం తమవైపే ఉందంటూ రాజధాని మార్పుపై దూకుడు పెంచబోతోంది జగన్‌రెడ్డి ప్రభుత్వం. అందులో భాగంగానే.. చంద్రబాబుకు సీఐడీ నోటీసులతో ప్రతిపక్ష నేతను ముందస్తుగా కట్టడి చేయడం.. విపక్షాన్ని డిఫెన్స్‌లో పడేయడం.. అమరావతి రైతులను భయబ్రాంతులకు గురి చేయడం.. ఇదంతా టాపిక్ డైవర్షన్ స్కీమ్‌లో భాగమే అంటున్నారు. ఇదంతా అమరావతిని విశాఖకు షిఫ్ట్ చేయడానికి సర్కారు ఆడుతున్న మైండ్ గేమ్ అనుమానిస్తున్నారు. రాజధాని తరలింపు ముహూర్తం ఫిక్స్ అయిందని.. ఇక ఫిష్టింగే ఆలస్యం అంటున్నారు.

తిరుపతిలో సంకుల సమరం!  పార్టీలకు ప్రతిష్టాత్మకం

సరిగ్గా నెల. ఏప్రిల్ 17న తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక. 30 రోజుల సమయం. మూడు పార్టీలకు కీలక రాజకీయ సమరం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ జోరు మీదుంది. స్థానిక సమరంలో ఓటమితో ప్రతిపక్ష టీడీపీ డిఫెన్స్‌లో ఉంది. జనసేన మద్దతుతో బీజేపీ సత్తా చాటేందుకు తహతహలాడుతోంది. తిరుపతి సంకుల సమరంలో గెలుపు ఎవరిదైనా.. గెలుపు కోసం పోరాటం మాత్రం ఓ రేంజ్‌లో సాగడం ఖాయం. అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం.  వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గత ఏడాది సెప్టెంబర్ 16న మ‌ృతి చెందడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. తిరుపతి సీటును 2019లో భారీ మెజార్టీతో గెలుచుకుంది వైసీపీ. బల్లి దుర్గాప్రసాద్ 2 లక్షల 40 వేల మెజార్టీతో విజయం సాధించారు. ఉప ఎన్నికల్లో దుర్గాప్రసాద్ కొడుకే పోటీ చేస్తారని ముందు ప్రచారం జరిగినా... అతనికి ఎమ్మెల్సీ ఇచ్చాురు జగన్. దీంతో తిరుపతిలో వైసీపీ అభ్యర్థిగా కొత్త వ్యక్తి బరిలో ఉండనున్నారు.  డాక్టర్ గురుమూర్తిని అభ్యర్థి అంటూ గతంలో వైసీపీ లీకులు ఇచ్చింది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్ లో ప్రతిపక్షాలు ఎక్కడా పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. దీంతో అభ్యర్థి ఎవరైనా గెలుపు తమదే అనే ధీమాతో  ఉంది వైసీపీ.  తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి గతానికి భిన్నంగా అందరికంటే ముందుగా టీడీపీ అధిష్టానం తమ అభ్యర్థిని నిలబెట్టింది. కేంద్ర మాజీ  మంత్రి పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించింది. తిరుపతి ఎన్నికకు సంబంధించి గతంలోనే పార్టీ నేతలను అప్రమత్తం చేశారు చంద్రబాబు. నియోజకవర్గాల వారీగా నేతలతో మాట్లాడారు. దళిత ఎంపీ దుర్గాప్రసాద్ చనిపోతే... ఆతని కుటుంబ సభ్యులను పరామర్శించలేదు సీఎం జగన్. దీనిపై దళిత వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇదే అస్త్రంగా ప్రచారం చేయాలని టీడీపీ భావిస్తోంది. అయితే పనబాక పోటీపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీకి తిరుపతిలో అభ్యర్థి కూడా లేరని.. పనబాక లక్ష్మి పేరును ప్రకటించినా ఆమె పోటీకి సిద్ధంగా లేరని ఆయన ఆరోపిస్తున్నారు.  బీజేపీ-జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి.  ఇటీవల జనసేన అధినేత పవన్ తో భేటీ అయిన బీజేపీ పెద్దలు.. ఆయన్ను ఒప్పించి బీజేపీ అభ్యర్ధిని నిలబెడుతున్నట్టు ప్రకటించాయి. తిరుపతిలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తున్న బీజేపీ.. ఆశావాహులైన పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌ల పేర్లను పరిశీలించిన తుది లిస్ట్‌ను తయారు చేసింది. ఇప్పటికే ఆ అభ్యర్థికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేసిన దాసరి శ్రీనివాసులు చాలా రోజుల కిందటే బీజేపీలో చేరారు. ఆయన దాదాపుగా ఖరారు కావచ్చొని తెలుస్తోంది. అయితే తిరుపతిలో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్ కల్యాణ్ వెనక్కి తగ్గడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ తీరు నచ్చకే పవన్ పోటీకి దూరంగా ఉన్నారంటున్నారు. దీంతో ఉప ఎన్నికలో బీజేపీకి జనసేన నుంచి ఎంతవరకు సహకారం అందుతుందన్నది సందేహమే. కాంగ్రెస్ నుంచి చింతామోహన్ కూడా మరోసారి బరిలో దిగే అవకాశం ఉంది. తిరుపతి ఎస్సీ రిజర్వడ్ లోక్ సభ పరిధిలో మొత్తం ఏడు నియోజకవర్గాలున్నాయి. చిత్తూరు జిల్లాలో తిరుపతి,  శ్రీకాళహస్తి, సత్యలేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. నెల్లూరు జిల్లాకు చెందిన గూడురు, వెంకటగిరి, సూళ్లూరుపేట, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో సూళ్లూరుపేట, సత్యవేడు, గూడురు ఎస్సీ రిజర్వ్ డు అసెంబ్లీ నియోజకవర్గాలు.  

జగన్ సర్కార్ విశాఖకు షిఫ్ట్ అయ్యే ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే...

ఏపీలో మున్సిపల్ ఎన్నికలు పూర్తయి ఫలితాలు కూడా వచ్చేశాయి. ఈ ఎన్నికలలో వైసిపి ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే. మరోపక్క కారణాలేమైనప్పటికీ ఇటు ప్రస్తుత రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న విజయవాడ, గుంటూరు నగరాలలోను..  అటు వైసిపి ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన విశాఖలోని ఆ పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలలో ఎదురు లేకుండా పోయింది.  దీంతో తమ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజల మద్దతు పూర్తిగా ఉందని వైసీపీ ప్రకటించుకుంటోంది. వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇదే విషయాన్నీ పడే పడే చెబుతున్నారు. ఇదే వేడిలో రాజధాని తరలింపు కూడా చేపట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది .   ఇప్పటివరకు పలు కోర్టు కేసులు, తీర్పులు అడ్డంకిగా ఉండడంతో జగన్ ప్రభుత్వం కాస్త వెనుకడుగు వేస్తూ వచ్చింది. అంతేకాకుండా గతంలో అనేక ముహూర్తాలు పెట్టినా.. కోర్టు కేసుల వల్ల అప్పట్లో అవన్నీ వాయిదా పడ్డాయి. అయితే తాజాగా పుర ప్రజల తీర్పుతో ఇక రాజధాని తరలింపులో ఎంతమాత్రం ఆలస్యం చేయకూడదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది . దీనికోసం కోర్టు కేసుల విచారణలో.. తాజా ఎన్నికల ఫలితాలను ఉదహరణగా చూపించి.. తమ నిర్ణయాలకు ప్రజామోదం కూడా ఉందని చెప్పొచ్చని భావిస్తోంది. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం రాజధానిని తరలించడం  సాధ్యం కాకపోయినా... సీఎం జగన్ మాత్రం త్వరలో విశాఖ నుండి తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైనట్టుగా  ప్రచారం జరుగుతోంది. జగన్ కోసం  సీఎం క్యాంపు కార్యాలయం కూడా సిద్ధమైనట్టుగా వార్తలు వస్తున్నాయి.. తాజాగా విశాఖకు చెందిన ఒక ప్రముఖ స్వామీజీ దీనికోసం   మే ఆరున ముహూర్తం పెట్టినట్టుగా  తెలుస్తోంది. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు కూడా ఇదే విషయం చెప్పారు.   ప్రస్తుతం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి జగన్ పాలనా వ్యవహారాలు చూస్తుండగా   మే ఆరో తారీఖు నుండి వైజాగ్ నుంచే పాలన జరిపేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఒకవేళ కోర్టు కేసులతో రాజధాని  తరలింపు ఆలస్యమైనా సీఎం మాత్రం వైజాగ్ నుంచి పాల‌న చేయ‌డానికి రెడీ అవుతున్నట్టుగా  తెలుస్తోంది. పరిపాలన కోసం అవసరమైన  ప్రభుత్వ భవనాలు పూర్తిగా సమకూరే వరకు.. ఎటువంటి ఇబ్బంది లేకుండా.. అంతా అనుకూలంగా ఉండే ప్లేస్ ను ఇప్పటికే సీఎం ఖరారు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి . దీంతో మే మొద‌టి వారంలో కీల‌కమైన పరిపాల‌నా విభాగ‌మంతా.. విశాఖ‌ వెళ్ల‌డానికి రెడీ అవుతోంది. మరోపక్క ప్ర‌భుత్వ భ‌వ‌నాల నిర్మాణానికి ఉగాధి రోజున  శంకుస్థాప‌న చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. దీనిపై సీఎం జగన్ ఇప్పటికే తన మంత్రులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. సీఎం విశాఖ వచ్చిన వెంటనే.. అన్ని వసతులతో కూడిన క్యాంప్ కార్య‌ల‌యం కూడా స్థానికంగా సిద్ధం చేసినట్టుగా  ప్రచారం జరుగుతోంది. నగరంలో ఉన్న ప్రముఖ వెల్ నెస్ రిసార్ట్ ను క్యాంప్ కార్యాలయం కోసం సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. తాత్కాలికంగా సీఎం  ఇక్క‌డ నుంచే ప‌రిపాల‌న కొన‌సాగించే అవ‌కాశాలు ఉన్న‌ట్లుగా సమాచారం.  వైజాగ్ లో పాలనకు అనుకూలంగా చాలా ప్రదేశాలు ఉన్నప్పటికీ.. ఈ రిసార్ట్  ప్ర‌భుత్వ స్థ‌లంలో ఉండడంతో సీఎం జగన్ దీన్నే ఎంపిక చేసిన‌ట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సుమారు 28 ఎకారాల్లో విస్త‌రించి ఉన్న ఈ వెల్ నెస్ రిసార్ట్ లో  పూర్తి స్థాయి విలాసావంత‌మైన సౌక‌ర్య‌లు అందుబాటులో  ఉన్నాయి. సీఎం జగన్ తలపెట్టిన ఈ తరలింపు సఫలం అవుతుందా లేక దీనికి కోర్టు కేసులు తీర్పులు అడ్డుగా నిలుస్తాయా వేచి చూడాలి.     

పీకే ఏడేళ్ల ప్రస్థానంలో మెరుపులు ...మరకలు

పవన్ కళ్యాణ్’ జనసేన పార్టీ పెట్టి ఏడేళ్ళు పూర్తయ్యాయి. 2014లోసార్వత్రిక ఎన్నికలకు ఒకటి రెండు మాసాల  ముందు మార్చి 14వ తేదీన ప్రశ్నిస్తానంటూ.. రాజకీయాల్లో అడుగుపెట్టారు. అంతవరకు పవర్ స్టార్’గా ఉన్న పీకే, అక్కడి నుంచి ‘జనసేనాని’గా కొత్త అవతారం ఎత్తారు. అయితే, పవన్  కళ్యాణ్ ‘కు రాజకీయ వేసాహం కట్టడం అదే తొలిసారి కాదు. అప్పటికది కొత్త వేషమే అయినా, రాజకీయాలలో అదే ఆయన తొలి అడుగు కాదు. అంతకు ఐదారేళ్ళ ముందు, చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో ఆయన కీలక పాత్రనే పోషించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి, బట్టలు ఊడతీసి కొడతాననే’ స్థాయిలో ప్రచారం సాగించారు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది,చరిత్ర. చిరంజీవి చాప చుట్టేశారు. ఏ కాంగ్రెస్ పార్టీని అయితే, ఉతికి ఆరేశారో అదే కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని  విలీనం చేశారు. చిరంజీవి కేంద్రంలో,పార్టీ టికెట్ పై గెలిచి, కాంగ్రెస్’లో కలిసిన సి. రామ చంద్రయ్య రాష్ట్రంలో మంత్రి పదవులు అనుభవించారు. అయితే, ఏమాటకు  ఆ మాటే చెప్పుకోవాలి, తిట్టిన నోటితో మెచ్చుకోవడం ఇష్టం లేకనో ఏమో పవన్ కళ్యాణ్ మాత్రం కాంగ్రెస్’ లోకి వెళ్ళలేదు.  రాజకీయాల నుంచి గ్యాప్ తీసుకున్నారు.సినిమాల్లో బిజీ అయి పోయారు. ఆ కథ అలా ఉంటే, పార్టీ పెట్టిన ఏడేళ్ళలో, పవన్ కళ్యాణ్  రైట్, లెఫ్ట్ అండ్ సెంటర్’ అన్ని భావజలాలతో సంసారం చేశారు. 2014లో ఎన్నికల ముందే జనసేన ఏర్పాటు చేసినప్పటికీ.. ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు.  టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. కూటమి గెలుపులో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంలో, పవన్ కళ్యాణ్ కీలక పాత్రనే పోషించారు. ఆ ఎన్నికల్లో తెలుగు దేశం, వైసీపీల మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా స్వల్పం. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 102 స్థానాలు గెలుచుకున్న తెలుగు దేశం పార్టీకి,44.9 శాతం ఓట్లు పోలయితే, వైసీపీకి 44.6 శాతం ఓట్లు పోలయ్యాయి.రెండు పార్టీలమధ్య వ్యత్యాసం జస్ట్ 0.3. అంటే, ఆ ఎన్నికలలో బీజేపీ, జనసేన పార్టీలో పొత్తు తెలుగు దేశం పార్టీకి ఐదేళ్ళ అధికారం ఇచ్చింది. సరే, అదలా ఉంటే ఆ తర్వాత, కొంత కాలం బీజేపీ, టీడీపీలతో పవర్ స్టార్ హనీమూన్ బానే సాగింది కానీ  మెల్లమెల్ల మెల్లగా దూరం పెరుగుతూ వచ్చింది. చివరకు అది విడాకుల వరకు వెళ్ళింది. ప్రత్యేక ప్యాకేజి విషయంలో కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మాట తప్పడంతో, పవర్ స్టార్ భగ్గుమన్నారు. కేంద్రం పై మండి పడ్డారు. ప్రత్యేక హోదా అడిగితే.. ప్యాకేజీ పేరిట పాచిపోయిన లడ్డులూ ఇచ్చారంటూ ఆయన కేంద్రంపై కస్సుమన్నారు. కళ్ళెర్ర చేశారు. అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగు దేశం ప్రభుత్వంతో, పార్టీతోనూ కొంత కాలం పాటు  అటూ ..ఇటూకాని, అదేదో రిలేషన్ మైంటైన్ చేశారు. పార్టీని అధికార టీడీపీకి  లీజుకిచ్చారని,అమ్మేశారని చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు. అయినా,అయన తుడిచేసుకున్నారు. ఇంతలో  2019 ఎన్నికలొచ్చాయి. ఆయన రాజకీయ ప్రస్థానం మరో మలుపు తీసుకుంది. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని, పార్టీ పెట్టిన ఐదున్నర, ఆరేళ్ళకు తొలిసారి  ఎన్నికల బరిలో దిగారు.గాజువాక, భీమవరం రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చేశారు. పార్టీకి, ఆయన సారధ్యం వహించిన కూటమికి కలిపి ఒకే ఒక్క సీటు  దక్కింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి, పార్టీ అభ్యర్ధి రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. అయితే, గెలిచిన కొద్ది రోజులకే రాపాక గోడ దూకారు. అధికార వైసీపీలో  చేరారు. అలా ఆయన అసెంబ్లీలో సింగిల్ సీటు లేని అరివీర భయంకర పార్టీలు, మాజీ, తాజా మిత్ర పక్షాలు (బీజేపీ, వామపక్షాలు) సరసన చేరారు. ఆ తర్వాత 2019 మిత్రులు వామపక్షాల చేయి వదిలి, కమలం చేయి పట్టుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీతో  కలిసి పోటీ చేశారు. పెద్దగా గిట్టుబాటు కాలేదు. బీజేపీతో స్నేహం చేసి చెడిపోయామని, లేదంటే మున్సిపల్ పోల్స్ లో ‘తడాఖా చూపేద్దుమని, అంటున్నారు, జన సైనికులు. అంటే, కమలం చేయి మళ్ళీ వదిలేందుకు ఆయన సిద్ధమై పోయారు.మరోవంక పక్క చూపులు చూస్తున్నారు. పక్క రాష్టం తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో అక్కడి అధికార పార్టీకి మద్దతు నిచ్చారు. బహుశః, షర్మిలమ్మకు పోటీగా తెలంగాణలో దుకాణం తెరుస్తారోరో ఏమో .. అదెలా ఉన్నా, జనసేనాని,  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ ఏడేళ్ళలో ,మలుపులు తిరుగుతూ, మరకలు అద్దుకుంటూ, ఇంకే నటరాజకీయ నేత వేయనన్ని రాజకీయ వేషాలు వేశారన్న పేరును సొంతం చేసుకున్నారు. రేపు ఏ వేషం వేస్తారో .. ఎవరితో కలుస్తారో ... అది ఆయనకు మాత్రమే తెలుసు.