జగన్ ఫిజియోథెరపిస్టు‌కే తిరుపతి టికెట్

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే వైసీపీ తన అభ్యర్థిని ప్రకటించింది. పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ ను వెన్నంటే ఉన్న డాక్టర్ గురుమూర్తిని తిరుపతి ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. ఈ మేరకు సీఎం జగన్ ఖరారు చేసినట్టు వైసీపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.తిరుపతి బరిలో డాక్టర్ గురుమూర్తిని దింపాలని కొన్నినెలల కిందటే వైసీపీలో అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడి చేశారు. వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్ట్‌ అయిన మద్దిల గురుమూర్తి స్వస్థలం  ఏర్పేడు మండలం మన్నసముద్రం. స్విమ్స్‌లో ఫిజియోథెరపీ పూర్తిచేసిన ఈయన తిరుపతిలోని శ్రీసాయిసుధ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఏడేళ్లపాటు సీనియర్‌ ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేశారు. ఈ క్రమంలో జగన్‌ సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’లో ఆమెకు వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్‌గా వ్యవహరించారు.దీంతో జగన్‌ పాదయాత్రలోనూ ఆయనకు ఫిజియోథెరఫిస్ట్‌గా పని చేసే అవకాశం లభించింది.ఈ సేవలకు ప్రతిఫలంగా తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్టు లభించినట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గత ఏడాది సెప్టెంబర్ 16న మృతి చెందడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. తిరుపతి సీటును 2019లో భారీ మెజార్టీతో గెలుచుకుంది వైసీపీ. బల్లి దుర్గాప్రసాద్ 2 లక్షల 40 వేల మెజార్టీతో విజయం సాధించారు. ఉప ఎన్నికల్లో దుర్గాప్రసాద్ కొడుకే పోటీ చేస్తారని ముందు ప్రచారం జరిగినా... అతనికి ఎమ్మెల్సీ ఇచ్చారు జగన్. దీంతో తిరుపతిలో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని ఖరారు చేశారు. 

విశాఖకు రాజధాని షిష్టింగ్? నోటీసులతో డైవర్షన్ గేమ్!

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయభేరి. రెండు రోజుల వ్యవధిలో ప్రతిపక్ష నేతకు సీఐడీ నోటీసులు. మాజీ ముఖ్యమంత్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు. హైకోర్టు గతంలోనే క్లీన్‌చీట్ ఇచ్చినా.. ఎలాగోలా బాబు మెడకు అమరావతి అసైన్డ్ భూముల కేసు ఉచ్చు బిగించాలానే ప్రయత్నం. ఇదంతా ఎందుకు? సడెన్‌గా ఇప్పుడే ఎందుకు? అంటే దానికో లెక్కుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉలుకు పలుకు లేకుండా సడెన్‌గా హైదరాబాద్‌కు ఊడిపడ్డారు ఏపీ పోలీసులు. ఉదయమే చంద్రబాబు ఇంటి కాలింగ్ బెల్ కొట్టి.. నోటీసులు చేతిలో పెట్టి వెళ్లిపోయారు. అకస్మాత్తుగా అమరావతి అసైన్డ్ భూముల కేసు సీఐడీకి ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది? ఫలితాలు వెలువడిన రెండు రోజులకే సర్కారు ఎందుకింతలా హడావుడి చేస్తోంది? ఎలాగూ గెలిచారుగా? విజయం వారిదేగా? అయినా, ఈ వేధింపులు ఎందుకు? ఉన్నట్టుండి చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఎందుకిచ్చారు? అనే అనుమానం అందరిలోనూ. నోటీసుల వెనుక పక్కా పొలిటికల్ వ్యూహం దాగుందని అంటున్నారు. తెర వెనుక ఏదో గూడు పుఠాణి జరుగుతోందని తెలుస్తోంది. అదేంటో కూడా లీకులొస్తున్నాయి. మూడు రాజధానుల చిక్కుముడి విప్పేందుకు.. రాజధానికి అమరావతి నుంచి విశాఖకు రాత్రికి రాత్రి షిఫ్ట్ చేసేందుకు.. చంద్రబాబుకు సీఐడీ నోటీసుల ఇష్యూని తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు. ఇదంతా సర్కారు ఆడుతున్న డైవర్షన్ డ్రామాలో భాగమంటూ భగ్గుమంటున్నాయి విపక్షాలు.  ఇటు విజయవాడ, అటు విశాఖపట్నం.. రెండు కార్పొరేషన్లలోనూ వైసీపీ గట్టి పట్టు సాధించింది. అమరావతి సెంటిమెంట్ బెజవాడ ఎన్నికల్లో కనిపిస్తుందని.. ప్రజాగ్రహానికి ఫ్యాన్ కాలిపోతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఫ్యాన్ గాలి రివ్వున వీచింది. అమరావతి పక్కనే ఉన్న గుంటూరు కార్పొరేషన్‌లోనూ అమరావతి ప్రభావం పని చేయలేదు. అటు వైజాగ్‌లోనూ వైసీపీకి ఎదురు లేకుండా పోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఉందని తెలిసినా.. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు వైసీపీని ఆదరించారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌కు అక్కడి వారంతా జై కొట్టారని లెక్కేస్తున్నారు. ఇలా.. విజయవాడ, గుంటూరు, విశాఖ ఫలితాలతో.. ప్రభుత్వంలో ఉత్సాహం రెట్టించింది. ఇదే మంచి తరుణమని.. ఆలసించినా ఆశాభంగమని భావిస్తోంది. రాజధానిని రాత్రికి రాత్రే అమరావతి నుంచి విశాఖకు మార్చేయాలని జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని అంటున్నారు. అందుకు, ముహూర్తం కూడా నిర్ణయించేశారట. ఫలానా రోజున కేపిటల్ షిప్టింగ్ అంటూ ప్రజల్లో, సోషల్ మీడియాలో చర్చ కూడా జరుగుతోంది. తాజాగా, వైసీపీ ఎంపీ రఘురామ క‌ృష్ణంరాజు సైతం ఇదే ఆరోపించారు.  రాజధాని మార్పు అంశం ఇప్పటికే హైకోర్టులో ఉంది. ఫైనల్ తీర్పు వచ్చే వరకూ అమరావతి నుంచి ఇటుక కూడా కదిలించలేరని రైతులు హెచ్చరిస్తున్నారు. కేపిటల్ మార్పు విషయంలో ఎప్పుడో నిర్ణయం తీసేసుకున్న సర్కారు.. దాన్ని అమలు చేయలేక అడుగు ముందుకు వేయలేకపోతోంది. హైకోర్టు కేసులు, రైతుల నుంచి నిరసనలు, చంద్రబాబు పోరాటంతో సందిగ్థంలో పడింది. కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజాభిప్రాయం తమవైపే ఉందంటూ రాజధాని మార్పుపై దూకుడు పెంచబోతోంది జగన్‌రెడ్డి ప్రభుత్వం. అందులో భాగంగానే.. చంద్రబాబుకు సీఐడీ నోటీసులతో ప్రతిపక్ష నేతను ముందస్తుగా కట్టడి చేయడం.. విపక్షాన్ని డిఫెన్స్‌లో పడేయడం.. అమరావతి రైతులను భయబ్రాంతులకు గురి చేయడం.. ఇదంతా టాపిక్ డైవర్షన్ స్కీమ్‌లో భాగమే అంటున్నారు. ఇదంతా అమరావతిని విశాఖకు షిఫ్ట్ చేయడానికి సర్కారు ఆడుతున్న మైండ్ గేమ్ అనుమానిస్తున్నారు. రాజధాని తరలింపు ముహూర్తం ఫిక్స్ అయిందని.. ఇక ఫిష్టింగే ఆలస్యం అంటున్నారు.

తిరుపతిలో సంకుల సమరం!  పార్టీలకు ప్రతిష్టాత్మకం

సరిగ్గా నెల. ఏప్రిల్ 17న తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక. 30 రోజుల సమయం. మూడు పార్టీలకు కీలక రాజకీయ సమరం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ జోరు మీదుంది. స్థానిక సమరంలో ఓటమితో ప్రతిపక్ష టీడీపీ డిఫెన్స్‌లో ఉంది. జనసేన మద్దతుతో బీజేపీ సత్తా చాటేందుకు తహతహలాడుతోంది. తిరుపతి సంకుల సమరంలో గెలుపు ఎవరిదైనా.. గెలుపు కోసం పోరాటం మాత్రం ఓ రేంజ్‌లో సాగడం ఖాయం. అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం.  వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గత ఏడాది సెప్టెంబర్ 16న మ‌ృతి చెందడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. తిరుపతి సీటును 2019లో భారీ మెజార్టీతో గెలుచుకుంది వైసీపీ. బల్లి దుర్గాప్రసాద్ 2 లక్షల 40 వేల మెజార్టీతో విజయం సాధించారు. ఉప ఎన్నికల్లో దుర్గాప్రసాద్ కొడుకే పోటీ చేస్తారని ముందు ప్రచారం జరిగినా... అతనికి ఎమ్మెల్సీ ఇచ్చాురు జగన్. దీంతో తిరుపతిలో వైసీపీ అభ్యర్థిగా కొత్త వ్యక్తి బరిలో ఉండనున్నారు.  డాక్టర్ గురుమూర్తిని అభ్యర్థి అంటూ గతంలో వైసీపీ లీకులు ఇచ్చింది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్ లో ప్రతిపక్షాలు ఎక్కడా పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. దీంతో అభ్యర్థి ఎవరైనా గెలుపు తమదే అనే ధీమాతో  ఉంది వైసీపీ.  తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి గతానికి భిన్నంగా అందరికంటే ముందుగా టీడీపీ అధిష్టానం తమ అభ్యర్థిని నిలబెట్టింది. కేంద్ర మాజీ  మంత్రి పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించింది. తిరుపతి ఎన్నికకు సంబంధించి గతంలోనే పార్టీ నేతలను అప్రమత్తం చేశారు చంద్రబాబు. నియోజకవర్గాల వారీగా నేతలతో మాట్లాడారు. దళిత ఎంపీ దుర్గాప్రసాద్ చనిపోతే... ఆతని కుటుంబ సభ్యులను పరామర్శించలేదు సీఎం జగన్. దీనిపై దళిత వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇదే అస్త్రంగా ప్రచారం చేయాలని టీడీపీ భావిస్తోంది. అయితే పనబాక పోటీపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీకి తిరుపతిలో అభ్యర్థి కూడా లేరని.. పనబాక లక్ష్మి పేరును ప్రకటించినా ఆమె పోటీకి సిద్ధంగా లేరని ఆయన ఆరోపిస్తున్నారు.  బీజేపీ-జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి.  ఇటీవల జనసేన అధినేత పవన్ తో భేటీ అయిన బీజేపీ పెద్దలు.. ఆయన్ను ఒప్పించి బీజేపీ అభ్యర్ధిని నిలబెడుతున్నట్టు ప్రకటించాయి. తిరుపతిలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తున్న బీజేపీ.. ఆశావాహులైన పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌ల పేర్లను పరిశీలించిన తుది లిస్ట్‌ను తయారు చేసింది. ఇప్పటికే ఆ అభ్యర్థికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేసిన దాసరి శ్రీనివాసులు చాలా రోజుల కిందటే బీజేపీలో చేరారు. ఆయన దాదాపుగా ఖరారు కావచ్చొని తెలుస్తోంది. అయితే తిరుపతిలో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్ కల్యాణ్ వెనక్కి తగ్గడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ తీరు నచ్చకే పవన్ పోటీకి దూరంగా ఉన్నారంటున్నారు. దీంతో ఉప ఎన్నికలో బీజేపీకి జనసేన నుంచి ఎంతవరకు సహకారం అందుతుందన్నది సందేహమే. కాంగ్రెస్ నుంచి చింతామోహన్ కూడా మరోసారి బరిలో దిగే అవకాశం ఉంది. తిరుపతి ఎస్సీ రిజర్వడ్ లోక్ సభ పరిధిలో మొత్తం ఏడు నియోజకవర్గాలున్నాయి. చిత్తూరు జిల్లాలో తిరుపతి,  శ్రీకాళహస్తి, సత్యలేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. నెల్లూరు జిల్లాకు చెందిన గూడురు, వెంకటగిరి, సూళ్లూరుపేట, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో సూళ్లూరుపేట, సత్యవేడు, గూడురు ఎస్సీ రిజర్వ్ డు అసెంబ్లీ నియోజకవర్గాలు.  

జగన్ సర్కార్ విశాఖకు షిఫ్ట్ అయ్యే ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే...

ఏపీలో మున్సిపల్ ఎన్నికలు పూర్తయి ఫలితాలు కూడా వచ్చేశాయి. ఈ ఎన్నికలలో వైసిపి ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే. మరోపక్క కారణాలేమైనప్పటికీ ఇటు ప్రస్తుత రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న విజయవాడ, గుంటూరు నగరాలలోను..  అటు వైసిపి ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన విశాఖలోని ఆ పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలలో ఎదురు లేకుండా పోయింది.  దీంతో తమ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజల మద్దతు పూర్తిగా ఉందని వైసీపీ ప్రకటించుకుంటోంది. వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇదే విషయాన్నీ పడే పడే చెబుతున్నారు. ఇదే వేడిలో రాజధాని తరలింపు కూడా చేపట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది .   ఇప్పటివరకు పలు కోర్టు కేసులు, తీర్పులు అడ్డంకిగా ఉండడంతో జగన్ ప్రభుత్వం కాస్త వెనుకడుగు వేస్తూ వచ్చింది. అంతేకాకుండా గతంలో అనేక ముహూర్తాలు పెట్టినా.. కోర్టు కేసుల వల్ల అప్పట్లో అవన్నీ వాయిదా పడ్డాయి. అయితే తాజాగా పుర ప్రజల తీర్పుతో ఇక రాజధాని తరలింపులో ఎంతమాత్రం ఆలస్యం చేయకూడదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది . దీనికోసం కోర్టు కేసుల విచారణలో.. తాజా ఎన్నికల ఫలితాలను ఉదహరణగా చూపించి.. తమ నిర్ణయాలకు ప్రజామోదం కూడా ఉందని చెప్పొచ్చని భావిస్తోంది. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం రాజధానిని తరలించడం  సాధ్యం కాకపోయినా... సీఎం జగన్ మాత్రం త్వరలో విశాఖ నుండి తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైనట్టుగా  ప్రచారం జరుగుతోంది. జగన్ కోసం  సీఎం క్యాంపు కార్యాలయం కూడా సిద్ధమైనట్టుగా వార్తలు వస్తున్నాయి.. తాజాగా విశాఖకు చెందిన ఒక ప్రముఖ స్వామీజీ దీనికోసం   మే ఆరున ముహూర్తం పెట్టినట్టుగా  తెలుస్తోంది. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు కూడా ఇదే విషయం చెప్పారు.   ప్రస్తుతం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి జగన్ పాలనా వ్యవహారాలు చూస్తుండగా   మే ఆరో తారీఖు నుండి వైజాగ్ నుంచే పాలన జరిపేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఒకవేళ కోర్టు కేసులతో రాజధాని  తరలింపు ఆలస్యమైనా సీఎం మాత్రం వైజాగ్ నుంచి పాల‌న చేయ‌డానికి రెడీ అవుతున్నట్టుగా  తెలుస్తోంది. పరిపాలన కోసం అవసరమైన  ప్రభుత్వ భవనాలు పూర్తిగా సమకూరే వరకు.. ఎటువంటి ఇబ్బంది లేకుండా.. అంతా అనుకూలంగా ఉండే ప్లేస్ ను ఇప్పటికే సీఎం ఖరారు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి . దీంతో మే మొద‌టి వారంలో కీల‌కమైన పరిపాల‌నా విభాగ‌మంతా.. విశాఖ‌ వెళ్ల‌డానికి రెడీ అవుతోంది. మరోపక్క ప్ర‌భుత్వ భ‌వ‌నాల నిర్మాణానికి ఉగాధి రోజున  శంకుస్థాప‌న చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. దీనిపై సీఎం జగన్ ఇప్పటికే తన మంత్రులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. సీఎం విశాఖ వచ్చిన వెంటనే.. అన్ని వసతులతో కూడిన క్యాంప్ కార్య‌ల‌యం కూడా స్థానికంగా సిద్ధం చేసినట్టుగా  ప్రచారం జరుగుతోంది. నగరంలో ఉన్న ప్రముఖ వెల్ నెస్ రిసార్ట్ ను క్యాంప్ కార్యాలయం కోసం సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. తాత్కాలికంగా సీఎం  ఇక్క‌డ నుంచే ప‌రిపాల‌న కొన‌సాగించే అవ‌కాశాలు ఉన్న‌ట్లుగా సమాచారం.  వైజాగ్ లో పాలనకు అనుకూలంగా చాలా ప్రదేశాలు ఉన్నప్పటికీ.. ఈ రిసార్ట్  ప్ర‌భుత్వ స్థ‌లంలో ఉండడంతో సీఎం జగన్ దీన్నే ఎంపిక చేసిన‌ట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సుమారు 28 ఎకారాల్లో విస్త‌రించి ఉన్న ఈ వెల్ నెస్ రిసార్ట్ లో  పూర్తి స్థాయి విలాసావంత‌మైన సౌక‌ర్య‌లు అందుబాటులో  ఉన్నాయి. సీఎం జగన్ తలపెట్టిన ఈ తరలింపు సఫలం అవుతుందా లేక దీనికి కోర్టు కేసులు తీర్పులు అడ్డుగా నిలుస్తాయా వేచి చూడాలి.     

పీకే ఏడేళ్ల ప్రస్థానంలో మెరుపులు ...మరకలు

పవన్ కళ్యాణ్’ జనసేన పార్టీ పెట్టి ఏడేళ్ళు పూర్తయ్యాయి. 2014లోసార్వత్రిక ఎన్నికలకు ఒకటి రెండు మాసాల  ముందు మార్చి 14వ తేదీన ప్రశ్నిస్తానంటూ.. రాజకీయాల్లో అడుగుపెట్టారు. అంతవరకు పవర్ స్టార్’గా ఉన్న పీకే, అక్కడి నుంచి ‘జనసేనాని’గా కొత్త అవతారం ఎత్తారు. అయితే, పవన్  కళ్యాణ్ ‘కు రాజకీయ వేసాహం కట్టడం అదే తొలిసారి కాదు. అప్పటికది కొత్త వేషమే అయినా, రాజకీయాలలో అదే ఆయన తొలి అడుగు కాదు. అంతకు ఐదారేళ్ళ ముందు, చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో ఆయన కీలక పాత్రనే పోషించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి, బట్టలు ఊడతీసి కొడతాననే’ స్థాయిలో ప్రచారం సాగించారు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది,చరిత్ర. చిరంజీవి చాప చుట్టేశారు. ఏ కాంగ్రెస్ పార్టీని అయితే, ఉతికి ఆరేశారో అదే కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని  విలీనం చేశారు. చిరంజీవి కేంద్రంలో,పార్టీ టికెట్ పై గెలిచి, కాంగ్రెస్’లో కలిసిన సి. రామ చంద్రయ్య రాష్ట్రంలో మంత్రి పదవులు అనుభవించారు. అయితే, ఏమాటకు  ఆ మాటే చెప్పుకోవాలి, తిట్టిన నోటితో మెచ్చుకోవడం ఇష్టం లేకనో ఏమో పవన్ కళ్యాణ్ మాత్రం కాంగ్రెస్’ లోకి వెళ్ళలేదు.  రాజకీయాల నుంచి గ్యాప్ తీసుకున్నారు.సినిమాల్లో బిజీ అయి పోయారు. ఆ కథ అలా ఉంటే, పార్టీ పెట్టిన ఏడేళ్ళలో, పవన్ కళ్యాణ్  రైట్, లెఫ్ట్ అండ్ సెంటర్’ అన్ని భావజలాలతో సంసారం చేశారు. 2014లో ఎన్నికల ముందే జనసేన ఏర్పాటు చేసినప్పటికీ.. ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు.  టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. కూటమి గెలుపులో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంలో, పవన్ కళ్యాణ్ కీలక పాత్రనే పోషించారు. ఆ ఎన్నికల్లో తెలుగు దేశం, వైసీపీల మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా స్వల్పం. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 102 స్థానాలు గెలుచుకున్న తెలుగు దేశం పార్టీకి,44.9 శాతం ఓట్లు పోలయితే, వైసీపీకి 44.6 శాతం ఓట్లు పోలయ్యాయి.రెండు పార్టీలమధ్య వ్యత్యాసం జస్ట్ 0.3. అంటే, ఆ ఎన్నికలలో బీజేపీ, జనసేన పార్టీలో పొత్తు తెలుగు దేశం పార్టీకి ఐదేళ్ళ అధికారం ఇచ్చింది. సరే, అదలా ఉంటే ఆ తర్వాత, కొంత కాలం బీజేపీ, టీడీపీలతో పవర్ స్టార్ హనీమూన్ బానే సాగింది కానీ  మెల్లమెల్ల మెల్లగా దూరం పెరుగుతూ వచ్చింది. చివరకు అది విడాకుల వరకు వెళ్ళింది. ప్రత్యేక ప్యాకేజి విషయంలో కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మాట తప్పడంతో, పవర్ స్టార్ భగ్గుమన్నారు. కేంద్రం పై మండి పడ్డారు. ప్రత్యేక హోదా అడిగితే.. ప్యాకేజీ పేరిట పాచిపోయిన లడ్డులూ ఇచ్చారంటూ ఆయన కేంద్రంపై కస్సుమన్నారు. కళ్ళెర్ర చేశారు. అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగు దేశం ప్రభుత్వంతో, పార్టీతోనూ కొంత కాలం పాటు  అటూ ..ఇటూకాని, అదేదో రిలేషన్ మైంటైన్ చేశారు. పార్టీని అధికార టీడీపీకి  లీజుకిచ్చారని,అమ్మేశారని చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు. అయినా,అయన తుడిచేసుకున్నారు. ఇంతలో  2019 ఎన్నికలొచ్చాయి. ఆయన రాజకీయ ప్రస్థానం మరో మలుపు తీసుకుంది. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని, పార్టీ పెట్టిన ఐదున్నర, ఆరేళ్ళకు తొలిసారి  ఎన్నికల బరిలో దిగారు.గాజువాక, భీమవరం రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చేశారు. పార్టీకి, ఆయన సారధ్యం వహించిన కూటమికి కలిపి ఒకే ఒక్క సీటు  దక్కింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి, పార్టీ అభ్యర్ధి రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. అయితే, గెలిచిన కొద్ది రోజులకే రాపాక గోడ దూకారు. అధికార వైసీపీలో  చేరారు. అలా ఆయన అసెంబ్లీలో సింగిల్ సీటు లేని అరివీర భయంకర పార్టీలు, మాజీ, తాజా మిత్ర పక్షాలు (బీజేపీ, వామపక్షాలు) సరసన చేరారు. ఆ తర్వాత 2019 మిత్రులు వామపక్షాల చేయి వదిలి, కమలం చేయి పట్టుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీతో  కలిసి పోటీ చేశారు. పెద్దగా గిట్టుబాటు కాలేదు. బీజేపీతో స్నేహం చేసి చెడిపోయామని, లేదంటే మున్సిపల్ పోల్స్ లో ‘తడాఖా చూపేద్దుమని, అంటున్నారు, జన సైనికులు. అంటే, కమలం చేయి మళ్ళీ వదిలేందుకు ఆయన సిద్ధమై పోయారు.మరోవంక పక్క చూపులు చూస్తున్నారు. పక్క రాష్టం తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో అక్కడి అధికార పార్టీకి మద్దతు నిచ్చారు. బహుశః, షర్మిలమ్మకు పోటీగా తెలంగాణలో దుకాణం తెరుస్తారోరో ఏమో .. అదెలా ఉన్నా, జనసేనాని,  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ ఏడేళ్ళలో ,మలుపులు తిరుగుతూ, మరకలు అద్దుకుంటూ, ఇంకే నటరాజకీయ నేత వేయనన్ని రాజకీయ వేషాలు వేశారన్న పేరును సొంతం చేసుకున్నారు. రేపు ఏ వేషం వేస్తారో .. ఎవరితో కలుస్తారో ... అది ఆయనకు మాత్రమే తెలుసు.

ఏడేండ్లుగా అదే డ్రామా! ఉద్యోగులతో కేసీఆర్ సర్కార్ ఆట

స్వరాష్ట్రం కోసం పోరాడారు.. ఉద్యమాన్ని హోరెత్తించారు. సొంత పాలనలో పని చేయాలనుకున్నారు.. కాని ప్రత్యేక రాష్ట్రం సిద్ధించినా.. వారి కల మాత్రం కలగానే మిగిలిపోయింది. ఏడేండ్లు కావస్తున్నా సొంత రాష్ట్రంలో పనిచేసే భాగ్యం వారికి లేకుండా పోయింది. ఇది తెలంగాణ స్థానికత ఉండి ఆంధ్రప్రదేశ్ లో పని చేస్తున్న క్లాస్ 3,  క్లాస్ 4 ఉద్యోగుల ఆవేదన.  తమను సొంత రాష్ట్రానికి తీసుకురావాలని ఏడేండ్లుగా పోరాడుతున్నారు ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులు. ఇదిగో తీసుకువస్తాం.. అదిగో తీసుకువస్తున్నాం అంటూ ప్రకటనలు చేస్తూ కాలయాపన చేస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. ఎన్నికలు వచ్చినప్పుడు జీవోలు ఇచ్చి హడావుడి చేస్తూ.. ఎన్నికలు ముగియగానే మళ్లీ మర్చిపోతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ  మరోసారి ఉద్యోగుల తరలింపుపై కేసీఆర్ సర్కార్ లో కదలిక వచ్చింది. ఏపీలో పని చేస్తున్న 669 మంది తెలంగాణ స్థానికత ఉద్యోగులకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలని మార్చి9 ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు లేఖ రాసింది. అయితే ఆ లేఖలో ఎలాంటి క్లారిటీ లేదు. ఉద్యోగుల తరలింపునకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు లేవు. దీనిపైనే ఉద్యోగ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.  ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 ఏండ్లకు పెంచింది. తెలంగాణలో మాత్రం 58 ఏండ్లే. ఇక్కడ కూడా పెంచుతామని చెబుతున్నా అమలు మాత్రం చేయలేదు. అంతేకాదు జగన్ సర్కార్ గత జూలైలోనే 27 శాతం పీఆర్సీ ప్రకటించింది. తెలంగాణలో ఇంతవరకు అతీగతీ లేదు. ఇస్తారో లేదో కూడా క్లారిటీ లేదు. దీంతో ఏపీలో పని చేస్తున్న ఉద్యోగులకు ఇక్కడి తీసుకురావాలంటే.. వీటిపై క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఒక వేళ అక్కడ పీఆర్సీ తీసుకుంటూ.. తెలంగాణకు వస్తే పరిస్థితి ఏంటన్నది ఎవరికి స్పష్టత లేదు. ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులకు సొంత రాష్ట్రానికి తీసుకువస్తామని చెబుతున్న కేసీఆర్ సర్కార్.. అందుకు కావాల్సిన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. వచ్చే ఉద్యోగుల కోసం కొత్త పోస్టులు స్పష్టించాల్సి ఉంది. అది లేకుండా తీసుకువచ్చినా ఉపయోగం ఉండదు. ఇన్ని సమస్యలు ఉన్నా.. వాటిపై స్పష్టత లేకుండా ఉద్యోగులకు తీసుకువస్తామంటూ ప్రకటన చేయడం మోసపూరితమే అంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. కేసీఆర్ సర్కార్ తీరును గమనిస్తున్న ఉద్యోగులు కూడా ఏపీలో పని చేస్తున్న వారిని తీసుకొచ్చే యోచన లేదనే భావనకు వచ్చారంటున్నారు.  విభజన సమయంలో 2 వేల మంది తెలంగాణ స్థానికత గల ఉద్యోగులను కమలనాథన్ కమిటి ఏపీకి కేటాయించింది. అప్పటి నుండి తెలంగాణ ఉద్యోగులు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఏపీలో ఉన్న ఉద్యోగుల కోసం టీఎన్జీవో, టీజీవో సంఘాలు ఒత్తిడి తేవడంతో విడతల వారీగా 12 వందల మంది ఉద్యోగులను అమరావతి నుంచి తీసుకువచ్చారు. మిగిలిన 800 మంది అక్కడే ఉన్నారు. వీరిని కూడా తీసుకువస్తామని ప్రభుత్వం చెబుతూనే ఉంది కాని కార్యరూపం దాల్చడం లేదు. సొంత రాష్ట్రంలో పనిచేయాలనే ఆశ తీరకుండానే ఏపీలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు చనిపోయారు. మరికొందరు రిటైర్ అయ్యారు. మిగిలిన 669 మంది తెలంగాణ స్థానికత ఉద్యోగులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పని చేస్తున్నారు. వీళ్ల కోసమే ఇటీవల ఏపీకి లేఖ రాసింది..తెలంగాణ సర్కార్.  

కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు? రేవంత్ టీమ్ జంప్ అందుకే..!

ఏమో.. గుర్రం ఎగరావచ్చు. అవును, కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు పొట్టుకోవచ్చు. ఈ మాట అంటున్నది ఎవరో సామాన్యుడో, చిలక జోతిష్యుడో కాదు. మాజీ ఎంపీ, ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వరరెడ్డి. అంత స్థాయి నేత.. అంతటి నిఖార్సైన నేత.. ఇంతటి మాటను ఇలా ఊరికే అంటారా? అస్సలు అనరు. ఆ మాట వెనుక ఏదో నిజం దాగుండే ఉంటుంది అంటున్నారు. అందుకే, కొండా కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మధ్యలో రేవంత్‌రెడ్డి మేటర్ కూడా జత కలవడంతో మరింత కాక పుడుతోంది.  తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. ఏ ఎన్నిక వచ్చినా రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతాయి. అయితే, మధ్యలో బీజేపీ ఎంట్రీ ఇవ్వడంతో పొలిటికల్ సీన్ మారిపోయింది. దుబ్బాక, జీఎహ్ఎమ్సీ ఎలక్షన్స్ తర్వాత పోరు గులాబీ వర్సెస్ కమలంగా మారింది. హస్తం పార్టీ ఉనికి కోసం తాపత్రయపడుతోంది. శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టు.. దేశంలోనే అత్యంత బలంగా ఉన్న బీజేపీని ఢీకొట్టాలంటే టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కలవక తప్పదా? అందుకే కొండా అలా అన్నారా? అనే అనుమానం వస్తోంది. దేశవ్యాప్తంగా చూస్తే కాంగ్రెస్‌కు బీజేపీనే ప్రధాన శత్రువు. టీఆర్ఎస్‌ది అధికారం కోసం ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునే చరిత్ర. అవసరమైతే గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటారు కేసీఆర్. అందుకే, తెలంగాణలో వేగంగా దూసుకొస్తున్న కమలదళాన్ని అడ్డుకోవాలంటే.. అవసరమైతే కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్య పోనవసరం లేదనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఏమో.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే... ఇక కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామాతో రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ మరోసారి చర్చనీయాంశమైంది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రేవంత్ ప్రధాన అనుచరుడైన కూన శ్రీశైలంగౌడ్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి పాల్వాయి హరీష్‌బాబు బీజేపీ కండువా కప్పుకోవడం.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి పార్టీని వీడటం.. ఇలా వరుస ఘటనలు అన్నీ రేవంత్‌రెడ్డి కనుసన్నల్లోనే జరిగాయని టాక్. పార్టీని వీడిన ఈ ముగ్గురు నేతలు రేవంత్ వర్గమే. ఇక, లేటెస్ట్‌గా హస్తం పార్టీకి హ్యాండిచ్చిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సైతం రేవంత్ మనిషే. త్వరలోనే కొండా సైతం కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇలా రేవంత్ వర్గమే వరుసగా పార్టీని వీడుతుండటం.. బీజేపీలో చేరుతుండటం.. అంతా రేవంత్‌రెడ్డి డైరెక్షన్‌లోనే జరుగుతోందని అంటున్నారు. పీసీసీ చీఫ్ పోస్టు కోసం రేవంత్‌రెడ్డి కొంతకాలంగా గట్టిగా పోరాడుతున్నారు. అందుకు సీనియర్లు ససేమిరా అంటుండటంతో ఎంపిక ఆలస్యమవుతోంది. చిర్రెత్తుకొచ్చిన చిచ్చర పిడుగు రేవంత్.. తన మనుషులను ఒక్కక్కరిగా బీజేపీలోకి పంపుతున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు పొత్తు పెట్టుకుంటే.. తాను పీసీసీ చీఫ్ పదవిలో ఉన్నా ఉపయోగం లేదు. కేసీఆర్‌ను గద్దె దింపి, జైలుకు పంపించడమే రేవంత్ ఏకైక లక్ష్యం. ఈ రెండు పార్టీలు మిలాఖత్ అయితే అది సాధ్యం కాదు. అందుకే, అలా జరిగే అవకాశం ఉంటే తాను బీజేపీలోకి జంప్ అవుతాననే సిగ్నల్ ఢిల్లీ అధిష్టానానికి పంపి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడానికే ఇలా రేవంత్‌రెడ్డి తన అనుచరులతో పావులు కదుపుతున్నారని విశ్లేషిస్తున్నారు. రేవంత్‌రెడ్డా మజాకా అంటున్నారు ఆయన అభిమానులు. ఇంతకీ, భవిష్యత్‌లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు ఉంటుందా? రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అవుతారా? లేక, ఆ డైనమిక్ లీడర్ బీజేపీ వైపు డైవర్షన్ అవుతారా? ఏమో.. గుర్రం ఎగరావచ్చు...

బడిలో కరోనా బెల్స్.. 

కరోనా మల్లి కోరలు చాస్తోంది.. ఇప్పటికే ప్రపంచాన్ని వణికించిన కరోనా..మళ్ళీ తన పంజా విసురుతుంది  తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు వరుసగా కరోనా బారినపడుతున్నారు. ఇటీవల వికారాబాద్‌, సంగారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో పలువురికి వైరస్‌ నిర్ధారణ కాగా.. లేటెస్ట్ గా  మంచిర్యాల, కరీంనగర్‌లోని మూడు పాఠశాలల్లో కొందరి విద్యార్థులకు  పాజిటివ్‌ అని తేలింది. పాఠశాలలు, వసతి గృహాల్లో కొవిడ్‌ నిబంధనలను పాటించకపోవడం, శానిటైజేషన్‌ సరిగా లేకపోవడంతో వైరస్‌ వ్యాప్తి చెందిందని.. ఇలా ఉంటే మరింత  ప్రమాదం ఉందనే ఆందోళన స్థానికులో వ్యక్తం అవుతోంది. కాగా, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలికల పాఠశాలలో కరోనా పరీక్షలు నిర్వహించగా గర్ల్స్ హైస్కూల్ లో ఈ రోజు 29 మంది  స్టూడెంట్స్ కు కరోనా పాజిటివ్..నిన్న 14 రికి పాజిటివ్ వీరిలో 11 మంది టీచర్లు, 2 వంట మనుషులు 1విద్యార్థినికి పాజిటివ్ మొత్తం 43 పాజిటివ్ కేసులు పదో తరగతి 20 ,తొమ్మిదో తరగతి, 8ఎనిమిదో తరగతి 1 విద్యార్థినికి పాజిటివ్ అని తేలింది.. పాజిటివ్ వచ్చిన  స్టూడెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కు టెస్టులు చేస్తున్నారు ఆఫీసర్స్. ఈ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు ఇటీవల జైపూర్‌ మండలంలో జాతరకు వెళ్లి వచ్చారు. అనంతరం జలుబు, జ్వరం ఉండటంతో  శాంపిల్స్‌ పరీక్షకు ఇచ్చారు.  కరీంనగర్ నగరంలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. రామడుగు మండలం, వెలిచాల అనుబంధ గ్రామంలో 20 మందికి కరోనా సోకింది. ఒకే ఊరిలో అన్ని కేసులు నమోదు కావడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. దీంతో గ్రామ పంచాయతీ, వైద్య శాఖ అధికారులు కట్టడి చర్యలు ప్రారంభించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో నలుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్  వచ్చింది. సుభాష్ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరికి కరోనా వచ్చింది. కార్ఖానా గడ్డ హైస్కూల్, సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం రేపడంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. స్కూల్లో మిగతా వారికి పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏప్రిల్ 17న తిరుపతి, సాగర్ బై పోల్

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లోక్ సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. ఈ రెండు స్థానాలకు ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈనెల 23న నోటిఫికేషన్ రానుండగా.. మార్చి 30 వరకు నామినేషన్లు స్వీకరణ.. 31న నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపింది. ఏప్రిల్‌ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. 17న ఉప ఎన్నిక పోలింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొంది. మే 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు చనిపోవడంతో తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నిక జరగనుంది. దుర్గాప్రసాద్ సెప్టెంబర్ 16న చనిపోయారు. ఆయన చనిపోయి మార్చి16కు ఆరు నెలలు అయింది. రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ప్రజా ప్రతినిధి చనిపోతే.. ఆ సీటుకు ఆరు నెలల్లోగా ఎన్నిక జరపాల్సి ఉంటుంది. అందుకే మార్చి16న ఎన్నికకు షెడ్యూల్ ఇచ్చింది సీఈసీ. తెలంగాణలోని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న నోముల నర్సింహయ్య డిసెంబర్ 1వ తేదిన చనిపోయారు. దీంతో అక్కడ కూడా ఉప ఎన్నిక అనివార్యం అయింది. 

షర్మిలకు డిప్యూటీ సీఎం పదవి! 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెడుతుండటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన షర్మిల.. వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు షర్మిలకు మద్దతు తెలిపారు. అయితే జగన్ తో విభేదాల వల్లే షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో వైఎస్సార్ తో సన్నిహితంగా మెలిగిన కొందరు నేతలు కూడా షర్మిలకు జగన్ తో గ్యాప్ పెరిగిందని చెబుతున్నారు. జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగానే వైసీపీలో , జగన్ కుటుంబంలో పరిణామాలు కనిపిస్తున్నాయి. వైఎస్ వివేకాంద రెడ్డి వర్ధంతిలో పాల్గొనేందుకు షర్మిల పులివెందుల వెళ్లగా.. జగన్ ఫ్యామిలీ మాత్రం అక్కడికి రాలేదు. అంతేకాదు గతంలో షర్మిల వస్తే ఎంతో హడావుడి చేసే స్థానిక వైసీపీ నేతలు ఈసారి షర్మిలను ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో  ఏపీ సీఎం , తన అన్న జగన్ తో షర్మిలకు విభేదాలు తీవ్రంగానే ఉన్నాయనే చర్చ జరుగుతోంది.  వైఎస్ షర్మిల కొత్త పార్టీ , ఆమెకు జగన్ తో విభేదాలపై టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ విజయమ్మకు షర్మిల అంటే చాలా ప్రేమ అని తెలిపారు. షర్మిలకు ఏదైనా కీలక పదవి ఇచ్చుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని జేసీ అభిప్రాయపడ్డారు.  మరో ఏడాదిన్నరలో షర్మిల ఏపీ రాజకీయాల్లోనూ అడుగుపెడుతుందని దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రస్తుతం షర్మిల వార్మప్ చేస్తోందన్నారు  జేసీ. ఏపీలో ఎంటరయ్యేందుకు ఇది కేవలం సన్నాహకమేనని చెప్పారు. ఆ తర్వాత విజయవాడకు షర్మిల షిఫ్టవడం ఖాయమన్నారు. రాజన్న రాజ్యం తెలంగాణలో అవసరంలేదని, ఏపీలోనే అవసరం అన్నది షర్మిలకు తెలిసి వస్తుందన్నారు జేసీ దివాకర్ రెడ్డి.  ఒకవేళ షర్మిలకు.. జగన్ డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేస్తే కొత్త పార్టీ విషయంపై పునరాలోచన చేస్తుందేమో చూడాలంటూ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలంటే కుటుంబ సభ్యులందరూ పదవులు కోరుతుంటారని, జాతీయ పార్టీలే నయమని జేసీ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లిన జేసీ.. అక్కడి సీనియర్లతో ముచ్చటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ షర్మిల అంశంలో తన అభిప్రాయాలు వినిపించారు. 

చదివింది 8 వ తరగతి మాత్రమే.. 

విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యమ్  అధ్యక్షుడు కమల్ హాసన్ తన ఆస్తుల వివరాలను తాజాగా ప్రకటించారు. దక్షిణ కోయంబత్తూర్ నియోజకవర్గం నుంచి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న కమల్.. ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ రూ.176.9 కోట్లుగా పేర్కొన్నారు. దీంతో  ఇప్పటి వరకు నామినేషన్లు వేసిన అభ్యర్థులలో కమల్ అత్యంత ధనవంతుడిగా నిలిచారు.  తన స్థిరాస్తుల విలువ రూ. 131.8 కోట్లు, చరాస్తుల విలువ రూ.45 కోట్లుగా కమల్ పేర్కొన్నారు. లండన్‌లో రూ.2.5 కోట్లు విలువ చేసే ఇల్లు, రూ.2.7 కోట్ల ఖరీదైన లెక్సస్,  కోటి రూపాయల విలువైన బీఎమ్‌డబ్ల్యూ కార్లు  ఉన్నాయని. తనకు భార్య, తన మీద ఆధారపడే వ్యక్తులు ఎవరూ లేరని తెలిపారు. అలాగే తన విద్యార్హత 8వ తరగతి మాత్రమేనని కమల్ తెలిపారు.

వివేకా హత్య కేసులో జగన్ కు కష్టాలు.. అందుకే ఇలా..

అమరావతిలో అస్సైన్డ్ భూముల వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబుకు సీఐడీ నోటీసులు పంపడంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జగన్ సర్కార్ పై  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 23న తప్పకుండా విచారణకు హాజరుకావాలని, ఒకవేళ అలా హాజరుకాకపోతే అరెస్ట్ తప్పదని చంద్రబాబును సీఐడీ హెచ్చరించడాన్ని రామయ్య తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్రంలో పరిపాలన చేపట్టిన రెండేళ్ల తర్వాత హఠాత్తుగా కళ్లు తెరిచి ఇప్పుడు నోటీసులు ఇస్తారా..? అని అయన మండిపడ్డారు. అంతేకాకుండా త్వరలోనే సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి బెయిళ్లు రద్దు కాబోతున్నాయని వర్ల రామయ్య అన్నారు. ప్రస్తుతం కేద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, సీఎం జగన్ వెన్నులో వణుకు పుట్టించే పనిలో ఉందని అయన పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో అసలు ముద్దాయిని త్వరలోనే పట్టుకుంటారని, ఈ కేసులో జగన్ కూడా ఇరుక్కునే అవకాశం ఉందని వర్ల తెలిపారు. అయితే ఈ వ్యవహారం నుండి రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఐడీ ద్వారా చంద్రబాబుకు నోటీసులు పంపించారని వర్ల రామయ్య ఆరోపించారు. మరోపక్క గతంలో ఇడుపులపాయలో దళితులకు అన్యాయం చేసింది మీ కుటుంబమే అంటూ సీఎం జగన్ ను విమర్శించారు. అసైన్డ్ భూములను తమ అధీనంలోకి తీసుకున్నది ఎవరో అందరికీ తెలుసని అన్నారు. దళితులకు చెందిన 690 ఎకరాల భూములను  సాగుచేశామని అప్పటి సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంగీకరించారని వర్ల గుర్తు చేసారు.  

చాలా బాధేస్తోంది.. నేనూ బతకాలి కదా..

"మీరు కేసీఆర్‌ను ఓడించలేరు. నేను సీఎం.. నేను సీఎం.. అంటూ పార్టీని నాశనం చేశారు. కాంగ్రెస్ పార్టీ దుస్థితి చూసి చాలా బాధేస్తోంది. కాంగ్రెస్‌లో బతికే ఛాన్స్ లేదు. కొత్త మార్గాలు చూసుకోండి."ఇలా ఒకప్పడు తనకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గురించి ఆ పార్టీ మాజీ నేత, ఫైర్ బ్రాండ్ లీడర్ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన ఆసక్తికర  స్టేట్‌మెంట్స్ ఇవి. సలహాలు, సూచనలు, కోపం, బాధ, ఆగ్రహం.. ఇలా రకరకాల వేరియేషన్స్‌లో తెలంగాణ కాంగ్రెస్ గురించి ఆయన చెప్పిన జోస్యం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే.. జేసీ సమక్షంలో జరిగిన చిట్‌చాట్‌లో ఆఫ్ ది రికార్డ్ మాటొకటి ఆన్ రికార్డ్ అవడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. అదే, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతారనే ప్రచారంకు మరింత కన్ఫర్మేషన్ వస్తోంది.  జేసీ దివాకర్‌రెడ్డి. బోలామనిషి. మంచి మాటకారి. మొహమాటం అస్సలు ఉండదు. కడుపులో ఏమీ దాచుకోరు. ఉన్నది ఉన్నట్టు బయటకు అనేస్తారు. ఎవరు ఏమనుకుంటారో పట్టించుకోరు. అలాంటి జేసీ.. సడెన్‌గా తెలంగాణ అసెంబ్లీ భవనంలోని సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. పాత పార్టీకి చెందిన పాత దోస్తులను కలిశారు. సీఎల్పీ నేత భట్టి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. తదితర బడా నేతలంతా అక్కడే ఉన్నారు. అంతా కలిసి ఆ రోజుల్లో... అంటూ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిపోయారు. అంతలోనే తేరుకొని.. మళ్లీ వర్తమానంలోకి వచ్చి.. భవిష్యత్ గురించి మాట్లాడుకున్నారు.  కాంగ్రెస్ పార్టీ దుస్థితికి హస్తం నేతలే కారణమంటూ పాత సహచరులను ఏకిపారేశారు జేసీ. "నేను పుట్టింది పెరిగింది.. నా ఉన్నతికి కారణం కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ దుస్థితిని చూసి చాలా బాధేస్తోంది. మీరు కేసీఆర్‌ను ఓడించలేరు. నేను సీఎం.. నేను సీఎం.. అంటూ పార్టీని నాశనం చేశారు. తెలంగాణ వచ్చాక మీరు, మేమూ ఇద్దరం ఆగమైపోయాం." అంటూ పార్టీ నేతలను తప్పుబట్టారు దివాకర్‌రెడ్డి. "కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిపోయింది.. నేను కూడా బతకాలి కదా.. కాంగ్రెస్‌లో బతికే ఛాన్స్ లేదు." అంటూ తాను కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరడానికి కారణమేంటో చెప్పారు జేసీ.   ఈ సందర్భంగా అక్కడో మరో ఆసక్తికర సంభాషణ జరిగింది. అదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామంగా మారింది. జేసీతో మాట్లాడుతున్న సమయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "ఇప్పుడు టీఆర్ఎస్‌పై యుద్ధం చేయాలి. కానీ కాంగ్రెస్‌లో ఆ పరిస్థితి లేదు. నేనైతే ఒక నిర్ణయం తీసుకున్నాను." అంటూ ఆ కీలక నిర్ణయం ఏంటో చెప్పబోతుండగా.. పక్కనే ఉన్న సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క కోమటిరెడ్డిని చెప్పొద్దంటూ వారించారు. దీంతో.. నోటి దాకా వచ్చిన ఆ మాటను అనకుండానే ఆపేశారు కోమటిరెడ్డి. ఇంతకీ.. కోమటిరెడ్డి తీసుకున్న నిర్ణయం ఏమిటన్నది అందరికీ తెలిసిందే అయినా.. ఆ మాట ఆయన నోట వచ్చుంటే ఇంకా కన్ఫామ్‌గా ఉండేది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు కొంతకాలంగా విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆయనే తానో నిర్ణయం తీసుకున్నానని జేసీతో అనడం.. అదేంటో చెప్పద్దంటూ భట్టి ఆపడంతో.. అది కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడమే అయ్యుంటుందని అంటున్నారు. ఇప్పటికే కూన శ్రీశైలంగౌడ్ పార్టీ వీడటం కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీకి దూరమవగా.. ఈ సమయంలో కోమటిరెడ్డి సైతం పార్టీకి హ్యాండ్ ఇస్తే అది కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ.

లేచిపోతే ఎంత బాగుంటుంది! ముహూర్తం ఫిక్స్..

మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అమరావతి అసైన్డ్ భూముల కేసులో సీఐడీ నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. దళితులను మోసం చేసిన చంద్రబాబుపై తగిన చర్యలు తీసుకోవాలని కొందరు వైసీపీ నేతలు కోరుతున్నారు. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. చంద్రబాబుకు నోటీసులు, జగన్ సర్కార్ తీరుపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.  మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలను సాకుగా చూపి రాత్రిరాత్రే దుకాణం సర్దేయడానికి సీఎం సిద్ధమవుతున్నారని రఘురామ చెప్పారు. ప్రజలు తీర్పు ఇచ్చారని... ఇక్కడ రాజధాని వద్దంటున్నారని కోర్టుకు వైసీపీ ప్రభుత్వం చెప్పనుందని అన్నారు. ఓ మహానుభావుడు ముహూర్తం పెట్టారట... మూటాముళ్లే సర్దుకుని ఆయన వెళ్లిపోతారట అని తెలిపారు. అధికారుల పిల్లలకు స్కూళ్లు, కాలేజీలు, ఇళ్లపై పలు సూచనలు చేశారని తెలుస్తుందన్నారు రఘురామ రాజు. ఈ అప్రతిహత విజయాన్నిసాకుగా చూపి... ఇక్కడి నుంచి రాత్రికి రాత్రి దుకాణం కట్టేసి లేచిపోదామని అనుకుంటున్నారని వెల్లడించారు. రాత్రికి రాత్రే లేచిపోవడానికి  జగన్ ప్లాన్ చేస్తున్నారని రఘురామ రాజు చెప్పారు. అయితే  లీగల్‌గా ఇది చెల్లదన్నారు. వందలాది సలహాదారులు మీకు సలహా ఇవ్వడం లేదా? 20 సార్లు ముహూర్తం పెట్టారు. మధ్యలోనే ఆగిపోయారు అని జగన్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు రఘురామ రాజు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్రటేరియట్ అమరావతిలోనే ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు.  

టీచర్ పై.. కరస్పాండెంట్..

విద్యాలయాలు దేవాలయాలు అంటారు కానీ.. ఇప్పుడు వేదింపులకు నిలయాలుగా మారుతున్నాయి.. వేదాల్లో దుశ్యాసనుడు, ఇంద్రుడు, రావణుడు ఉన్నట్లుగా ప్రస్తుత సమాజంలో అలాంటి వాళ్ళు లేకపోలేదు.. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే వక్ర బుద్దులకు పాల్పడుతున్నారు.. తోటి ఉపాద్యాలు అని చూడకుండా ప్రవర్తిస్తున్నారు.  స్కూల్ పని చేస్తున్న ఉపాధ్యాయురాలిపై ఓ కరస్పాండెంట్ కన్నేశాడు.. వేధిస్తున్నాడు..  గుంటూరు జిల్లా కారంపూడిలోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ అంటోనీ బాల తనను వేదిస్తున్నాడని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని అదే పాఠశాలలో పనిచేస్తున్న ఆర్. జయలక్ష్మి అనే ఉపాధ్యాయురాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గత 12 సంవత్సరాలుగా ఉపాయధ్యాయురాలు జయలక్ష్మి ఇదే పాఠశాలలో పనిచేస్తుంది. అయితే స్కూల్ కరస్పాండెంట్ అంటోనీ బాల తనను బెదిరించి బలవంతంగా తెల్ల కాగితాల మీద సంతకం చేపించుకొని వేదిస్తున్నాడని మహిళ ఫిర్యాదులో తెలిపింది . కరస్పాండెంట్‌కు మద్దతుగా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాద్యాయుడు శేర్పనీ కూడా తనని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో చెప్పారు.  ఇక, సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే పల్నాడు ప్రాంతంలోనే ఎంతో ప్రాముఖ్యత గల పాఠశాల. కరస్పాండెంట్ అంటోనీ బాల పాఠశాలలో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎంతోమంది మహిళలు ఉపాధ్యాయులపై వేధింపులకు గురిచేసి అసభ్యకరంగా ప్రవర్తించారు. కొంతమంది చెప్పుకోలేక పాఠశాలలో పనిచేయలేక బయటకి వెళ్లినట్లు సమాచారం. ఇలాంటి కీచక కరస్పాండెంట్ వలన విద్యాసంస్థలకు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

ఒక్కొక్కటి కాదు జగన్..

అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడంపై రాజకీయ రచ్చ జరుగుతోంది. చంద్రబాబుకు నోటీసులపై మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్  జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా సీఎం.. మా వాడు అంటూనే జగన్‌ను టార్గెట్ చేశారు జేసీ దివాకర్ రెడ్డి.  చంద్రబాబుకు ఒక్క కానిస్టేబుల్ మాత్రమే వెళ్లి ఒకే ఒక్క కాగితం ఇచ్చాడు.. కానీ మా సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి, ఎంపీ విజయసాయి రెడ్డికి నోటీసులు ఇవ్వాలంటే లారీలు కావాలని చెప్పారు. చంద్రబాబుకు సీఐడీ ఒక్క పేజీలో మాత్రమే నోటీసు ఇచ్చింది. అదే జగన్‌కు ఇవ్వాల్సి వస్తే లారీల్లో తీసుకెళ్లాలి అంటూ జేసీ సెటైర్లు వేశారు.  తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన జేసీ దివాకర్ రెడ్డి...  సీఎల్పీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ తెలంగాణ  కాంగ్రెస్ పార్టీ నేతలతో చాలా సేపు మాట్లాడారు. సీఎల్పీ నుంచి బయటికొచ్చాక మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబుకు నోటీసులు, ఏపీ రాజధానిపై పలు విషయాలు చెప్పారు జేసీ.  దొనకొండ లేదా వైజాగ్ రాజధాని చేయాలని చంద్రబాబుకు తాము ఆనాడే చెప్పామన్నారు. ఒకసారి నిర్ణయం జరిగిన తర్వాత మార్చడం సరికాదని చంద్రబాబు చెప్పారని జేసీ తెలిపారు.

ప్రేమ జంట పై స్థానికులు అటాక్ ..

ప్రేమ పక్షులకు అక్కడ ఇక్కడ అని సంబంధం లేదు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటూ.. కాలయాపన చేస్తుంటారు.. ప్రేమ పక్షుల  కాలాయపాల చుట్టూ పక్కల ఉన్న వారికీ ఇబ్బంది అనిపించింది.. పక్క వాళ్ళు చూస్తారు అన్న భయం కూడా లేకుండా వారి పనుల్లో వాళ్ళు ఉంటారు.. వారి ప్రవర్తన పై కోపం వచ్చిన స్థానికులు వారిని మందలించారు..  షాప్ వద్ద కూర్చొని మాట్లాడుకుంటున్న ఒక జంటను కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేశారు. ప్రణాళిక ప్రకారం వారిపై దాడికి పాల్పడ్డారు. అయితే యువకుడు వారి నుంచి తప్పించుకొని పారిపోయాడు. కానీ పట్టుబడిన యువతిని దారుణంగా హింసించారు. ముఖానికి కట్టుకున్న స్కార్ఫ్‌ను బలవతంగా తొలగించారు. ఆమె దుప్పట్టా తీసివేసి ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. తాజాగా బయటకు వచ్చిన ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీంతో దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక యువతి తన స్నేహితుడితో కలిసి ఏకాంత ప్రదేశంలో కూర్చుని మాట్లాడుతుండగా.. కొంతమంది స్థానిక యువకులు గమనించారు. గుంపుగా వారి వద్దకు వెళ్లి బెదిరించడంతో యువకుడు పారిపోయాడు. అనంతరం యువతిపై వేధింపులకు పాల్పడ్డారు. ఆమెను దుర్భాషలాడుతూ దుప్పట్టాతో ఈడ్చుకెళ్లినట్టు వీడియోలో కనిపిస్తోంది. భయంతో కేకలు వేస్తూ రోధిస్తున్నా ఆమెను వదల్లేదు. స్థానికులు ఎవరూ ఆమెను కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు. ఏకాంత ప్రదేశానికి ఒక యువకుడితో వెళ్లినందుకు ఆమెపై ఒక వర్గం వ్యక్తులు దాడి చేశారని స్థానికులు తెలిపారు.ఈ ఘటన గత వారం రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో చోటుచేసుకుంది. దీని బట్టి ప్రేమికులు అర్థం చేస్కుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకోవడం.. కలుసుకోవడం ఈ రోజుల్లో మంచిది కాదు.. సో మీరు జాగ్రత్తగా ఉండండి.. 

గెలుపు.. బలుపు! చంద్రబాబు టార్గెట్ అందుకేనా?

ఆదివారం మున్సిపల్ ఫలితాలు. వైసీపీ ఘన విజయం. విజయవాడ, గుంటూరు, విశాఖలోనూ అనూహ్య గెలుపు. మంగళవారం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నోటీసులు. పోలా.. అర్థమై పోలా? కేసు ఎందుకు పెట్టారో.. చంద్రబాబును ఎందుకు టార్గెట్ చేశారో తెలిసిపోలా? అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. స్థానిక సంస్థలు గంపగుత్తగా వైసీపీ ఖాతాలో పడటంతో రాష్ట్రంలో తమకిక తిరుగులేదనే అహంకారంతో విర్రవీగుతోంది జగన్ సర్కారు అనేది టీడీపీ ఆరోపణ.  అమరావతి ఆగ్రహం విజయవాడలో అధికారపార్టీని దహించి వేస్తుందని అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. నయానో, భయానో.. బెజవాడపైనా వైసీసీ జెండా ఎగరడం.. పక్కనే ఉన్న గుంటూరు సైతం అధికార పార్టీ హస్తగతమవడంతో జగన్ రెడ్డి సర్కారులో సమరోత్సాహం పెరిగింది. వెయ్యి ఏనుగుల బలంతో చంద్రబాబును అణగదొక్కాలని ప్రయత్నిస్తోంది. అందుకే, విపక్ష నేత చంద్రబాబు టార్గెట్ గా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని అంటున్నారు. చరిత్రలో తొలిసారి ఓ మాజీ ముఖ్యమంత్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం వైసీపీ సర్కారు ఓవరాక్షన్ కు నిదర్శనం అని విమర్శిస్తున్నారు.  విభజన ఆంధ్రప్రదేశ్‌ను సన్‌రైజ్ స్టేట్‌ దిశగా నడిపించడం.. ఏపీ కేపిటల్‌గా అమరావతిని అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం.. ఇదే చంద్రబాబు చేసిన నేరం. అందుకు ఫలితమే ప్రతిపక్ష నేతకు నోటీసులు. ఏ అమరావతి కోసమైతే చంద్రబాబు అంత తాపత్రయ పడ్డారో.. ఆ కలల రాజధానిని కాలరాసి.. చరిత్రలో చంద్రబాబు పేరు లేకుండా చేసే ప్రయత్నమే ఇదంతా అనేది టీడీపీ మాట. ఇప్పటికే అమరావతిని మరుగున పడేశారు.. ఇప్పుడిక చంద్రబాబు పని పడుతున్నారు. ఎలాంటి ఆరోపణలు  లేకుండా ఐదేళ్లు సుపరిపాలన అందించిన చంద్రబాబును ఎలాగైనా ఏదో ఒక కేసులో ఇరికించి.. ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో కేసు క్రియేట్ చేసి.. ఆ ఉచ్చును చంద్రబాబు మెడకు బిగించాలని చూస్తున్నారని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో గుడ్డు మీద ఈకలు పీకి.. బలవంతపు కేసులు పెట్టడం.. వైసీపీ చేస్తున్న ప్రతీకార చర్యని.. అచ్చెంనాయుడు నుంచి వర్ల రామయ్య వరకూ.. టీడీపీ నేతలంతా ముక్తకంఠంతో మండిపడుతున్నారు.  ఎన్నికల్లో గెలిచామనే జోష్‌తో.. ప్రజాబలం తమకే ఉందనే భ్రమలో ఉంది వైసీసీ సర్కారు. స్థానికం ఎంతలా రణక్షేత్రంగా మారిందో.. ఎలా ఏకగ్రీవాలు అయ్యాయో.. ఎలా బెదిరింపులు, డబ్బు పంపిణీ జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ గెలుపు బలుపు కాదని కేవలం వాపు మాత్రమేననేది టీడీపీ వాదన. ఎన్నికల ఫలితాలతో వైసీపీ సర్కారు కళ్లు నెత్తికెక్కాయని.. అందుకే చంద్రబాబుకు అమరావతి భూముల కేసులో నోటీసులు ఇచ్చారనేది తమ్ముళ్ల ఆగ్రహం. ఈ కేసుపై గతంలోనే హైకోర్టులో విచారణ జరగ్గా.. అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో చంద్రబాబుకు సంబంధం లేదని ఉన్నత న్యాయస్థానం కూడా తేల్చేసింది. అయినా.. పాత కేసును మరింత తవ్వి.. ఆ దుమ్మంతా చంద్రబాబుపై ఎత్తిపోసే ప్రయత్నం జరుగుతోందని టీడీపీ మండిపడుతోంది. ఇక సంబంధంలేని ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి.. ప్రతిపక్ష నేతను భయబ్రాంతులకు గురి చేయాలనుకోవడం వైసీపీ సర్కారు దిగజారుడుతనమే అంటున్నారు. ఇదంతా స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావమేనని.. ఆ వాపును చూసి బలుపు అనుకునే ప్రభుత్వం ఇలా బరితెగిస్తోందనేది టీడీపీ వర్షన్.

మహారాష్ట్రలో ప్రతి ఒక్కరికి వెంటనే వ్యాక్సిన్ ఇవ్వండి...

కొద్ది రోజుల క్రితం వరకు దేశంలో తగ్గుతూ వస్తున్న కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి.  తాజాగా నమోదవుతున్న పాజిటీవ్ కేసులలో ఎక్కువ భాగం మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా 15 వేలకు తగ్గకుండా పాజిటీవ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ఈ నేసథ్యంలో మహారాష్ట్రలో తాజా పరిస్థితులపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తన ఆందోళన వ్యక్తం చేసారు. .    దేశంలోని ఆర్థిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రమైన మహారాష్ట్రలోని కోరుకున్న ప్రతి ఒక్కరికి  కోవిడ్ వ్యాక్సిన్ అందించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు, ప్రస్తుతం  దేశంలో ప్రతిరోజు నమోదవుతున్న కేసుల్లో సగం పైగా ఆ రాష్ట్రం నుంచే నమోదవుతున్నా విషయాన్నీ అయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో మళ్ళీ లాక్ డౌన్ వంటి చర్యలు చేపడితే.. దేశ ఆర్ధిక పరిస్థితి దెబ్బ తినే ప్రమాదముందని అయన పేర్కొన్నారు. దీంతో ఈ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని.. రాష్ట్రంలోని పౌరులందరికీ వ్యాక్సిన్లు అందించేలా రాష్ట్ర ప్రభుత్వానికి అత్యవసర అనుమతులు ఇవ్వాలని కోరారు. అదేసమయంలో వ్యాక్సిన్ల కొరత కూడా ఉండకూడదని  ఆనంద్ ట్వీట్ చేశారు. అయన తన ట్వీట్ లో ప్రధానమంత్రి కార్యాలయాన్ని, అలాగే కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి హర్షవర్ధన్ ను కూడా ట్యాగ్ చేశారు. ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్‌కు ఒక నెటిజన్ స్పందిస్తూ.. కేవలం వ్యాక్సినేషన్ ఒక్కటే పెంచితే సరిపోదు. సమాంతరంగా కరోనా పరీక్షలు, ట్రేసింగ్, మెరుగైన చికిత్స కూడా అందాలి. ఇంకా ప్రజలు కూడా క్రమశిక్షణతో మెలగాలని రిప్లై ఇచ్చాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన ఆనంద్  మహీంద్రా... "అవును.. నేను మీతో అంగీకరిస్తున్నాను. అయితే, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయకపోతే మనం రెండు, మూడు, నాలుగు దశల కరోనా వ్యాప్తితో తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంద"ని ఆందోళన వ్యక్తం చేశారు.