ఏడేండ్లుగా అదే డ్రామా! ఉద్యోగులతో కేసీఆర్ సర్కార్ ఆట

స్వరాష్ట్రం కోసం పోరాడారు.. ఉద్యమాన్ని హోరెత్తించారు. సొంత పాలనలో పని చేయాలనుకున్నారు.. కాని ప్రత్యేక రాష్ట్రం సిద్ధించినా.. వారి కల మాత్రం కలగానే మిగిలిపోయింది. ఏడేండ్లు కావస్తున్నా సొంత రాష్ట్రంలో పనిచేసే భాగ్యం వారికి లేకుండా పోయింది. ఇది తెలంగాణ స్థానికత ఉండి ఆంధ్రప్రదేశ్ లో పని చేస్తున్న క్లాస్ 3,  క్లాస్ 4 ఉద్యోగుల ఆవేదన.  తమను సొంత రాష్ట్రానికి తీసుకురావాలని ఏడేండ్లుగా పోరాడుతున్నారు ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులు. ఇదిగో తీసుకువస్తాం.. అదిగో తీసుకువస్తున్నాం అంటూ ప్రకటనలు చేస్తూ కాలయాపన చేస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. ఎన్నికలు వచ్చినప్పుడు జీవోలు ఇచ్చి హడావుడి చేస్తూ.. ఎన్నికలు ముగియగానే మళ్లీ మర్చిపోతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ  మరోసారి ఉద్యోగుల తరలింపుపై కేసీఆర్ సర్కార్ లో కదలిక వచ్చింది. ఏపీలో పని చేస్తున్న 669 మంది తెలంగాణ స్థానికత ఉద్యోగులకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలని మార్చి9 ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు లేఖ రాసింది. అయితే ఆ లేఖలో ఎలాంటి క్లారిటీ లేదు. ఉద్యోగుల తరలింపునకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు లేవు. దీనిపైనే ఉద్యోగ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.  ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 ఏండ్లకు పెంచింది. తెలంగాణలో మాత్రం 58 ఏండ్లే. ఇక్కడ కూడా పెంచుతామని చెబుతున్నా అమలు మాత్రం చేయలేదు. అంతేకాదు జగన్ సర్కార్ గత జూలైలోనే 27 శాతం పీఆర్సీ ప్రకటించింది. తెలంగాణలో ఇంతవరకు అతీగతీ లేదు. ఇస్తారో లేదో కూడా క్లారిటీ లేదు. దీంతో ఏపీలో పని చేస్తున్న ఉద్యోగులకు ఇక్కడి తీసుకురావాలంటే.. వీటిపై క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఒక వేళ అక్కడ పీఆర్సీ తీసుకుంటూ.. తెలంగాణకు వస్తే పరిస్థితి ఏంటన్నది ఎవరికి స్పష్టత లేదు. ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులకు సొంత రాష్ట్రానికి తీసుకువస్తామని చెబుతున్న కేసీఆర్ సర్కార్.. అందుకు కావాల్సిన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. వచ్చే ఉద్యోగుల కోసం కొత్త పోస్టులు స్పష్టించాల్సి ఉంది. అది లేకుండా తీసుకువచ్చినా ఉపయోగం ఉండదు. ఇన్ని సమస్యలు ఉన్నా.. వాటిపై స్పష్టత లేకుండా ఉద్యోగులకు తీసుకువస్తామంటూ ప్రకటన చేయడం మోసపూరితమే అంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. కేసీఆర్ సర్కార్ తీరును గమనిస్తున్న ఉద్యోగులు కూడా ఏపీలో పని చేస్తున్న వారిని తీసుకొచ్చే యోచన లేదనే భావనకు వచ్చారంటున్నారు.  విభజన సమయంలో 2 వేల మంది తెలంగాణ స్థానికత గల ఉద్యోగులను కమలనాథన్ కమిటి ఏపీకి కేటాయించింది. అప్పటి నుండి తెలంగాణ ఉద్యోగులు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఏపీలో ఉన్న ఉద్యోగుల కోసం టీఎన్జీవో, టీజీవో సంఘాలు ఒత్తిడి తేవడంతో విడతల వారీగా 12 వందల మంది ఉద్యోగులను అమరావతి నుంచి తీసుకువచ్చారు. మిగిలిన 800 మంది అక్కడే ఉన్నారు. వీరిని కూడా తీసుకువస్తామని ప్రభుత్వం చెబుతూనే ఉంది కాని కార్యరూపం దాల్చడం లేదు. సొంత రాష్ట్రంలో పనిచేయాలనే ఆశ తీరకుండానే ఏపీలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు చనిపోయారు. మరికొందరు రిటైర్ అయ్యారు. మిగిలిన 669 మంది తెలంగాణ స్థానికత ఉద్యోగులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పని చేస్తున్నారు. వీళ్ల కోసమే ఇటీవల ఏపీకి లేఖ రాసింది..తెలంగాణ సర్కార్.  

కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు? రేవంత్ టీమ్ జంప్ అందుకే..!

ఏమో.. గుర్రం ఎగరావచ్చు. అవును, కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు పొట్టుకోవచ్చు. ఈ మాట అంటున్నది ఎవరో సామాన్యుడో, చిలక జోతిష్యుడో కాదు. మాజీ ఎంపీ, ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వరరెడ్డి. అంత స్థాయి నేత.. అంతటి నిఖార్సైన నేత.. ఇంతటి మాటను ఇలా ఊరికే అంటారా? అస్సలు అనరు. ఆ మాట వెనుక ఏదో నిజం దాగుండే ఉంటుంది అంటున్నారు. అందుకే, కొండా కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మధ్యలో రేవంత్‌రెడ్డి మేటర్ కూడా జత కలవడంతో మరింత కాక పుడుతోంది.  తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. ఏ ఎన్నిక వచ్చినా రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతాయి. అయితే, మధ్యలో బీజేపీ ఎంట్రీ ఇవ్వడంతో పొలిటికల్ సీన్ మారిపోయింది. దుబ్బాక, జీఎహ్ఎమ్సీ ఎలక్షన్స్ తర్వాత పోరు గులాబీ వర్సెస్ కమలంగా మారింది. హస్తం పార్టీ ఉనికి కోసం తాపత్రయపడుతోంది. శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టు.. దేశంలోనే అత్యంత బలంగా ఉన్న బీజేపీని ఢీకొట్టాలంటే టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కలవక తప్పదా? అందుకే కొండా అలా అన్నారా? అనే అనుమానం వస్తోంది. దేశవ్యాప్తంగా చూస్తే కాంగ్రెస్‌కు బీజేపీనే ప్రధాన శత్రువు. టీఆర్ఎస్‌ది అధికారం కోసం ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునే చరిత్ర. అవసరమైతే గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటారు కేసీఆర్. అందుకే, తెలంగాణలో వేగంగా దూసుకొస్తున్న కమలదళాన్ని అడ్డుకోవాలంటే.. అవసరమైతే కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్య పోనవసరం లేదనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఏమో.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే... ఇక కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామాతో రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ మరోసారి చర్చనీయాంశమైంది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రేవంత్ ప్రధాన అనుచరుడైన కూన శ్రీశైలంగౌడ్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి పాల్వాయి హరీష్‌బాబు బీజేపీ కండువా కప్పుకోవడం.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి పార్టీని వీడటం.. ఇలా వరుస ఘటనలు అన్నీ రేవంత్‌రెడ్డి కనుసన్నల్లోనే జరిగాయని టాక్. పార్టీని వీడిన ఈ ముగ్గురు నేతలు రేవంత్ వర్గమే. ఇక, లేటెస్ట్‌గా హస్తం పార్టీకి హ్యాండిచ్చిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సైతం రేవంత్ మనిషే. త్వరలోనే కొండా సైతం కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇలా రేవంత్ వర్గమే వరుసగా పార్టీని వీడుతుండటం.. బీజేపీలో చేరుతుండటం.. అంతా రేవంత్‌రెడ్డి డైరెక్షన్‌లోనే జరుగుతోందని అంటున్నారు. పీసీసీ చీఫ్ పోస్టు కోసం రేవంత్‌రెడ్డి కొంతకాలంగా గట్టిగా పోరాడుతున్నారు. అందుకు సీనియర్లు ససేమిరా అంటుండటంతో ఎంపిక ఆలస్యమవుతోంది. చిర్రెత్తుకొచ్చిన చిచ్చర పిడుగు రేవంత్.. తన మనుషులను ఒక్కక్కరిగా బీజేపీలోకి పంపుతున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు పొత్తు పెట్టుకుంటే.. తాను పీసీసీ చీఫ్ పదవిలో ఉన్నా ఉపయోగం లేదు. కేసీఆర్‌ను గద్దె దింపి, జైలుకు పంపించడమే రేవంత్ ఏకైక లక్ష్యం. ఈ రెండు పార్టీలు మిలాఖత్ అయితే అది సాధ్యం కాదు. అందుకే, అలా జరిగే అవకాశం ఉంటే తాను బీజేపీలోకి జంప్ అవుతాననే సిగ్నల్ ఢిల్లీ అధిష్టానానికి పంపి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడానికే ఇలా రేవంత్‌రెడ్డి తన అనుచరులతో పావులు కదుపుతున్నారని విశ్లేషిస్తున్నారు. రేవంత్‌రెడ్డా మజాకా అంటున్నారు ఆయన అభిమానులు. ఇంతకీ, భవిష్యత్‌లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు ఉంటుందా? రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అవుతారా? లేక, ఆ డైనమిక్ లీడర్ బీజేపీ వైపు డైవర్షన్ అవుతారా? ఏమో.. గుర్రం ఎగరావచ్చు...

బడిలో కరోనా బెల్స్.. 

కరోనా మల్లి కోరలు చాస్తోంది.. ఇప్పటికే ప్రపంచాన్ని వణికించిన కరోనా..మళ్ళీ తన పంజా విసురుతుంది  తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు వరుసగా కరోనా బారినపడుతున్నారు. ఇటీవల వికారాబాద్‌, సంగారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో పలువురికి వైరస్‌ నిర్ధారణ కాగా.. లేటెస్ట్ గా  మంచిర్యాల, కరీంనగర్‌లోని మూడు పాఠశాలల్లో కొందరి విద్యార్థులకు  పాజిటివ్‌ అని తేలింది. పాఠశాలలు, వసతి గృహాల్లో కొవిడ్‌ నిబంధనలను పాటించకపోవడం, శానిటైజేషన్‌ సరిగా లేకపోవడంతో వైరస్‌ వ్యాప్తి చెందిందని.. ఇలా ఉంటే మరింత  ప్రమాదం ఉందనే ఆందోళన స్థానికులో వ్యక్తం అవుతోంది. కాగా, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలికల పాఠశాలలో కరోనా పరీక్షలు నిర్వహించగా గర్ల్స్ హైస్కూల్ లో ఈ రోజు 29 మంది  స్టూడెంట్స్ కు కరోనా పాజిటివ్..నిన్న 14 రికి పాజిటివ్ వీరిలో 11 మంది టీచర్లు, 2 వంట మనుషులు 1విద్యార్థినికి పాజిటివ్ మొత్తం 43 పాజిటివ్ కేసులు పదో తరగతి 20 ,తొమ్మిదో తరగతి, 8ఎనిమిదో తరగతి 1 విద్యార్థినికి పాజిటివ్ అని తేలింది.. పాజిటివ్ వచ్చిన  స్టూడెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కు టెస్టులు చేస్తున్నారు ఆఫీసర్స్. ఈ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు ఇటీవల జైపూర్‌ మండలంలో జాతరకు వెళ్లి వచ్చారు. అనంతరం జలుబు, జ్వరం ఉండటంతో  శాంపిల్స్‌ పరీక్షకు ఇచ్చారు.  కరీంనగర్ నగరంలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. రామడుగు మండలం, వెలిచాల అనుబంధ గ్రామంలో 20 మందికి కరోనా సోకింది. ఒకే ఊరిలో అన్ని కేసులు నమోదు కావడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. దీంతో గ్రామ పంచాయతీ, వైద్య శాఖ అధికారులు కట్టడి చర్యలు ప్రారంభించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో నలుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్  వచ్చింది. సుభాష్ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరికి కరోనా వచ్చింది. కార్ఖానా గడ్డ హైస్కూల్, సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం రేపడంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. స్కూల్లో మిగతా వారికి పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏప్రిల్ 17న తిరుపతి, సాగర్ బై పోల్

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లోక్ సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. ఈ రెండు స్థానాలకు ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈనెల 23న నోటిఫికేషన్ రానుండగా.. మార్చి 30 వరకు నామినేషన్లు స్వీకరణ.. 31న నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపింది. ఏప్రిల్‌ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. 17న ఉప ఎన్నిక పోలింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొంది. మే 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు చనిపోవడంతో తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నిక జరగనుంది. దుర్గాప్రసాద్ సెప్టెంబర్ 16న చనిపోయారు. ఆయన చనిపోయి మార్చి16కు ఆరు నెలలు అయింది. రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ప్రజా ప్రతినిధి చనిపోతే.. ఆ సీటుకు ఆరు నెలల్లోగా ఎన్నిక జరపాల్సి ఉంటుంది. అందుకే మార్చి16న ఎన్నికకు షెడ్యూల్ ఇచ్చింది సీఈసీ. తెలంగాణలోని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న నోముల నర్సింహయ్య డిసెంబర్ 1వ తేదిన చనిపోయారు. దీంతో అక్కడ కూడా ఉప ఎన్నిక అనివార్యం అయింది. 

షర్మిలకు డిప్యూటీ సీఎం పదవి! 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెడుతుండటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన షర్మిల.. వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు షర్మిలకు మద్దతు తెలిపారు. అయితే జగన్ తో విభేదాల వల్లే షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో వైఎస్సార్ తో సన్నిహితంగా మెలిగిన కొందరు నేతలు కూడా షర్మిలకు జగన్ తో గ్యాప్ పెరిగిందని చెబుతున్నారు. జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగానే వైసీపీలో , జగన్ కుటుంబంలో పరిణామాలు కనిపిస్తున్నాయి. వైఎస్ వివేకాంద రెడ్డి వర్ధంతిలో పాల్గొనేందుకు షర్మిల పులివెందుల వెళ్లగా.. జగన్ ఫ్యామిలీ మాత్రం అక్కడికి రాలేదు. అంతేకాదు గతంలో షర్మిల వస్తే ఎంతో హడావుడి చేసే స్థానిక వైసీపీ నేతలు ఈసారి షర్మిలను ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో  ఏపీ సీఎం , తన అన్న జగన్ తో షర్మిలకు విభేదాలు తీవ్రంగానే ఉన్నాయనే చర్చ జరుగుతోంది.  వైఎస్ షర్మిల కొత్త పార్టీ , ఆమెకు జగన్ తో విభేదాలపై టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ విజయమ్మకు షర్మిల అంటే చాలా ప్రేమ అని తెలిపారు. షర్మిలకు ఏదైనా కీలక పదవి ఇచ్చుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని జేసీ అభిప్రాయపడ్డారు.  మరో ఏడాదిన్నరలో షర్మిల ఏపీ రాజకీయాల్లోనూ అడుగుపెడుతుందని దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రస్తుతం షర్మిల వార్మప్ చేస్తోందన్నారు  జేసీ. ఏపీలో ఎంటరయ్యేందుకు ఇది కేవలం సన్నాహకమేనని చెప్పారు. ఆ తర్వాత విజయవాడకు షర్మిల షిఫ్టవడం ఖాయమన్నారు. రాజన్న రాజ్యం తెలంగాణలో అవసరంలేదని, ఏపీలోనే అవసరం అన్నది షర్మిలకు తెలిసి వస్తుందన్నారు జేసీ దివాకర్ రెడ్డి.  ఒకవేళ షర్మిలకు.. జగన్ డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేస్తే కొత్త పార్టీ విషయంపై పునరాలోచన చేస్తుందేమో చూడాలంటూ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలంటే కుటుంబ సభ్యులందరూ పదవులు కోరుతుంటారని, జాతీయ పార్టీలే నయమని జేసీ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లిన జేసీ.. అక్కడి సీనియర్లతో ముచ్చటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ షర్మిల అంశంలో తన అభిప్రాయాలు వినిపించారు. 

చదివింది 8 వ తరగతి మాత్రమే.. 

విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యమ్  అధ్యక్షుడు కమల్ హాసన్ తన ఆస్తుల వివరాలను తాజాగా ప్రకటించారు. దక్షిణ కోయంబత్తూర్ నియోజకవర్గం నుంచి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న కమల్.. ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ రూ.176.9 కోట్లుగా పేర్కొన్నారు. దీంతో  ఇప్పటి వరకు నామినేషన్లు వేసిన అభ్యర్థులలో కమల్ అత్యంత ధనవంతుడిగా నిలిచారు.  తన స్థిరాస్తుల విలువ రూ. 131.8 కోట్లు, చరాస్తుల విలువ రూ.45 కోట్లుగా కమల్ పేర్కొన్నారు. లండన్‌లో రూ.2.5 కోట్లు విలువ చేసే ఇల్లు, రూ.2.7 కోట్ల ఖరీదైన లెక్సస్,  కోటి రూపాయల విలువైన బీఎమ్‌డబ్ల్యూ కార్లు  ఉన్నాయని. తనకు భార్య, తన మీద ఆధారపడే వ్యక్తులు ఎవరూ లేరని తెలిపారు. అలాగే తన విద్యార్హత 8వ తరగతి మాత్రమేనని కమల్ తెలిపారు.

వివేకా హత్య కేసులో జగన్ కు కష్టాలు.. అందుకే ఇలా..

అమరావతిలో అస్సైన్డ్ భూముల వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబుకు సీఐడీ నోటీసులు పంపడంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జగన్ సర్కార్ పై  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 23న తప్పకుండా విచారణకు హాజరుకావాలని, ఒకవేళ అలా హాజరుకాకపోతే అరెస్ట్ తప్పదని చంద్రబాబును సీఐడీ హెచ్చరించడాన్ని రామయ్య తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్రంలో పరిపాలన చేపట్టిన రెండేళ్ల తర్వాత హఠాత్తుగా కళ్లు తెరిచి ఇప్పుడు నోటీసులు ఇస్తారా..? అని అయన మండిపడ్డారు. అంతేకాకుండా త్వరలోనే సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి బెయిళ్లు రద్దు కాబోతున్నాయని వర్ల రామయ్య అన్నారు. ప్రస్తుతం కేద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, సీఎం జగన్ వెన్నులో వణుకు పుట్టించే పనిలో ఉందని అయన పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో అసలు ముద్దాయిని త్వరలోనే పట్టుకుంటారని, ఈ కేసులో జగన్ కూడా ఇరుక్కునే అవకాశం ఉందని వర్ల తెలిపారు. అయితే ఈ వ్యవహారం నుండి రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఐడీ ద్వారా చంద్రబాబుకు నోటీసులు పంపించారని వర్ల రామయ్య ఆరోపించారు. మరోపక్క గతంలో ఇడుపులపాయలో దళితులకు అన్యాయం చేసింది మీ కుటుంబమే అంటూ సీఎం జగన్ ను విమర్శించారు. అసైన్డ్ భూములను తమ అధీనంలోకి తీసుకున్నది ఎవరో అందరికీ తెలుసని అన్నారు. దళితులకు చెందిన 690 ఎకరాల భూములను  సాగుచేశామని అప్పటి సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంగీకరించారని వర్ల గుర్తు చేసారు.  

చాలా బాధేస్తోంది.. నేనూ బతకాలి కదా..

"మీరు కేసీఆర్‌ను ఓడించలేరు. నేను సీఎం.. నేను సీఎం.. అంటూ పార్టీని నాశనం చేశారు. కాంగ్రెస్ పార్టీ దుస్థితి చూసి చాలా బాధేస్తోంది. కాంగ్రెస్‌లో బతికే ఛాన్స్ లేదు. కొత్త మార్గాలు చూసుకోండి."ఇలా ఒకప్పడు తనకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గురించి ఆ పార్టీ మాజీ నేత, ఫైర్ బ్రాండ్ లీడర్ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన ఆసక్తికర  స్టేట్‌మెంట్స్ ఇవి. సలహాలు, సూచనలు, కోపం, బాధ, ఆగ్రహం.. ఇలా రకరకాల వేరియేషన్స్‌లో తెలంగాణ కాంగ్రెస్ గురించి ఆయన చెప్పిన జోస్యం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే.. జేసీ సమక్షంలో జరిగిన చిట్‌చాట్‌లో ఆఫ్ ది రికార్డ్ మాటొకటి ఆన్ రికార్డ్ అవడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. అదే, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతారనే ప్రచారంకు మరింత కన్ఫర్మేషన్ వస్తోంది.  జేసీ దివాకర్‌రెడ్డి. బోలామనిషి. మంచి మాటకారి. మొహమాటం అస్సలు ఉండదు. కడుపులో ఏమీ దాచుకోరు. ఉన్నది ఉన్నట్టు బయటకు అనేస్తారు. ఎవరు ఏమనుకుంటారో పట్టించుకోరు. అలాంటి జేసీ.. సడెన్‌గా తెలంగాణ అసెంబ్లీ భవనంలోని సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. పాత పార్టీకి చెందిన పాత దోస్తులను కలిశారు. సీఎల్పీ నేత భట్టి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. తదితర బడా నేతలంతా అక్కడే ఉన్నారు. అంతా కలిసి ఆ రోజుల్లో... అంటూ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిపోయారు. అంతలోనే తేరుకొని.. మళ్లీ వర్తమానంలోకి వచ్చి.. భవిష్యత్ గురించి మాట్లాడుకున్నారు.  కాంగ్రెస్ పార్టీ దుస్థితికి హస్తం నేతలే కారణమంటూ పాత సహచరులను ఏకిపారేశారు జేసీ. "నేను పుట్టింది పెరిగింది.. నా ఉన్నతికి కారణం కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ దుస్థితిని చూసి చాలా బాధేస్తోంది. మీరు కేసీఆర్‌ను ఓడించలేరు. నేను సీఎం.. నేను సీఎం.. అంటూ పార్టీని నాశనం చేశారు. తెలంగాణ వచ్చాక మీరు, మేమూ ఇద్దరం ఆగమైపోయాం." అంటూ పార్టీ నేతలను తప్పుబట్టారు దివాకర్‌రెడ్డి. "కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిపోయింది.. నేను కూడా బతకాలి కదా.. కాంగ్రెస్‌లో బతికే ఛాన్స్ లేదు." అంటూ తాను కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరడానికి కారణమేంటో చెప్పారు జేసీ.   ఈ సందర్భంగా అక్కడో మరో ఆసక్తికర సంభాషణ జరిగింది. అదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామంగా మారింది. జేసీతో మాట్లాడుతున్న సమయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "ఇప్పుడు టీఆర్ఎస్‌పై యుద్ధం చేయాలి. కానీ కాంగ్రెస్‌లో ఆ పరిస్థితి లేదు. నేనైతే ఒక నిర్ణయం తీసుకున్నాను." అంటూ ఆ కీలక నిర్ణయం ఏంటో చెప్పబోతుండగా.. పక్కనే ఉన్న సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క కోమటిరెడ్డిని చెప్పొద్దంటూ వారించారు. దీంతో.. నోటి దాకా వచ్చిన ఆ మాటను అనకుండానే ఆపేశారు కోమటిరెడ్డి. ఇంతకీ.. కోమటిరెడ్డి తీసుకున్న నిర్ణయం ఏమిటన్నది అందరికీ తెలిసిందే అయినా.. ఆ మాట ఆయన నోట వచ్చుంటే ఇంకా కన్ఫామ్‌గా ఉండేది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు కొంతకాలంగా విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆయనే తానో నిర్ణయం తీసుకున్నానని జేసీతో అనడం.. అదేంటో చెప్పద్దంటూ భట్టి ఆపడంతో.. అది కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడమే అయ్యుంటుందని అంటున్నారు. ఇప్పటికే కూన శ్రీశైలంగౌడ్ పార్టీ వీడటం కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీకి దూరమవగా.. ఈ సమయంలో కోమటిరెడ్డి సైతం పార్టీకి హ్యాండ్ ఇస్తే అది కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ.

లేచిపోతే ఎంత బాగుంటుంది! ముహూర్తం ఫిక్స్..

మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అమరావతి అసైన్డ్ భూముల కేసులో సీఐడీ నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. దళితులను మోసం చేసిన చంద్రబాబుపై తగిన చర్యలు తీసుకోవాలని కొందరు వైసీపీ నేతలు కోరుతున్నారు. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. చంద్రబాబుకు నోటీసులు, జగన్ సర్కార్ తీరుపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.  మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలను సాకుగా చూపి రాత్రిరాత్రే దుకాణం సర్దేయడానికి సీఎం సిద్ధమవుతున్నారని రఘురామ చెప్పారు. ప్రజలు తీర్పు ఇచ్చారని... ఇక్కడ రాజధాని వద్దంటున్నారని కోర్టుకు వైసీపీ ప్రభుత్వం చెప్పనుందని అన్నారు. ఓ మహానుభావుడు ముహూర్తం పెట్టారట... మూటాముళ్లే సర్దుకుని ఆయన వెళ్లిపోతారట అని తెలిపారు. అధికారుల పిల్లలకు స్కూళ్లు, కాలేజీలు, ఇళ్లపై పలు సూచనలు చేశారని తెలుస్తుందన్నారు రఘురామ రాజు. ఈ అప్రతిహత విజయాన్నిసాకుగా చూపి... ఇక్కడి నుంచి రాత్రికి రాత్రి దుకాణం కట్టేసి లేచిపోదామని అనుకుంటున్నారని వెల్లడించారు. రాత్రికి రాత్రే లేచిపోవడానికి  జగన్ ప్లాన్ చేస్తున్నారని రఘురామ రాజు చెప్పారు. అయితే  లీగల్‌గా ఇది చెల్లదన్నారు. వందలాది సలహాదారులు మీకు సలహా ఇవ్వడం లేదా? 20 సార్లు ముహూర్తం పెట్టారు. మధ్యలోనే ఆగిపోయారు అని జగన్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు రఘురామ రాజు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్రటేరియట్ అమరావతిలోనే ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు.  

టీచర్ పై.. కరస్పాండెంట్..

విద్యాలయాలు దేవాలయాలు అంటారు కానీ.. ఇప్పుడు వేదింపులకు నిలయాలుగా మారుతున్నాయి.. వేదాల్లో దుశ్యాసనుడు, ఇంద్రుడు, రావణుడు ఉన్నట్లుగా ప్రస్తుత సమాజంలో అలాంటి వాళ్ళు లేకపోలేదు.. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే వక్ర బుద్దులకు పాల్పడుతున్నారు.. తోటి ఉపాద్యాలు అని చూడకుండా ప్రవర్తిస్తున్నారు.  స్కూల్ పని చేస్తున్న ఉపాధ్యాయురాలిపై ఓ కరస్పాండెంట్ కన్నేశాడు.. వేధిస్తున్నాడు..  గుంటూరు జిల్లా కారంపూడిలోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ అంటోనీ బాల తనను వేదిస్తున్నాడని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని అదే పాఠశాలలో పనిచేస్తున్న ఆర్. జయలక్ష్మి అనే ఉపాధ్యాయురాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గత 12 సంవత్సరాలుగా ఉపాయధ్యాయురాలు జయలక్ష్మి ఇదే పాఠశాలలో పనిచేస్తుంది. అయితే స్కూల్ కరస్పాండెంట్ అంటోనీ బాల తనను బెదిరించి బలవంతంగా తెల్ల కాగితాల మీద సంతకం చేపించుకొని వేదిస్తున్నాడని మహిళ ఫిర్యాదులో తెలిపింది . కరస్పాండెంట్‌కు మద్దతుగా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాద్యాయుడు శేర్పనీ కూడా తనని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో చెప్పారు.  ఇక, సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే పల్నాడు ప్రాంతంలోనే ఎంతో ప్రాముఖ్యత గల పాఠశాల. కరస్పాండెంట్ అంటోనీ బాల పాఠశాలలో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎంతోమంది మహిళలు ఉపాధ్యాయులపై వేధింపులకు గురిచేసి అసభ్యకరంగా ప్రవర్తించారు. కొంతమంది చెప్పుకోలేక పాఠశాలలో పనిచేయలేక బయటకి వెళ్లినట్లు సమాచారం. ఇలాంటి కీచక కరస్పాండెంట్ వలన విద్యాసంస్థలకు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

ఒక్కొక్కటి కాదు జగన్..

అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడంపై రాజకీయ రచ్చ జరుగుతోంది. చంద్రబాబుకు నోటీసులపై మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్  జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా సీఎం.. మా వాడు అంటూనే జగన్‌ను టార్గెట్ చేశారు జేసీ దివాకర్ రెడ్డి.  చంద్రబాబుకు ఒక్క కానిస్టేబుల్ మాత్రమే వెళ్లి ఒకే ఒక్క కాగితం ఇచ్చాడు.. కానీ మా సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి, ఎంపీ విజయసాయి రెడ్డికి నోటీసులు ఇవ్వాలంటే లారీలు కావాలని చెప్పారు. చంద్రబాబుకు సీఐడీ ఒక్క పేజీలో మాత్రమే నోటీసు ఇచ్చింది. అదే జగన్‌కు ఇవ్వాల్సి వస్తే లారీల్లో తీసుకెళ్లాలి అంటూ జేసీ సెటైర్లు వేశారు.  తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన జేసీ దివాకర్ రెడ్డి...  సీఎల్పీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ తెలంగాణ  కాంగ్రెస్ పార్టీ నేతలతో చాలా సేపు మాట్లాడారు. సీఎల్పీ నుంచి బయటికొచ్చాక మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబుకు నోటీసులు, ఏపీ రాజధానిపై పలు విషయాలు చెప్పారు జేసీ.  దొనకొండ లేదా వైజాగ్ రాజధాని చేయాలని చంద్రబాబుకు తాము ఆనాడే చెప్పామన్నారు. ఒకసారి నిర్ణయం జరిగిన తర్వాత మార్చడం సరికాదని చంద్రబాబు చెప్పారని జేసీ తెలిపారు.

ప్రేమ జంట పై స్థానికులు అటాక్ ..

ప్రేమ పక్షులకు అక్కడ ఇక్కడ అని సంబంధం లేదు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటూ.. కాలయాపన చేస్తుంటారు.. ప్రేమ పక్షుల  కాలాయపాల చుట్టూ పక్కల ఉన్న వారికీ ఇబ్బంది అనిపించింది.. పక్క వాళ్ళు చూస్తారు అన్న భయం కూడా లేకుండా వారి పనుల్లో వాళ్ళు ఉంటారు.. వారి ప్రవర్తన పై కోపం వచ్చిన స్థానికులు వారిని మందలించారు..  షాప్ వద్ద కూర్చొని మాట్లాడుకుంటున్న ఒక జంటను కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేశారు. ప్రణాళిక ప్రకారం వారిపై దాడికి పాల్పడ్డారు. అయితే యువకుడు వారి నుంచి తప్పించుకొని పారిపోయాడు. కానీ పట్టుబడిన యువతిని దారుణంగా హింసించారు. ముఖానికి కట్టుకున్న స్కార్ఫ్‌ను బలవతంగా తొలగించారు. ఆమె దుప్పట్టా తీసివేసి ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. తాజాగా బయటకు వచ్చిన ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీంతో దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక యువతి తన స్నేహితుడితో కలిసి ఏకాంత ప్రదేశంలో కూర్చుని మాట్లాడుతుండగా.. కొంతమంది స్థానిక యువకులు గమనించారు. గుంపుగా వారి వద్దకు వెళ్లి బెదిరించడంతో యువకుడు పారిపోయాడు. అనంతరం యువతిపై వేధింపులకు పాల్పడ్డారు. ఆమెను దుర్భాషలాడుతూ దుప్పట్టాతో ఈడ్చుకెళ్లినట్టు వీడియోలో కనిపిస్తోంది. భయంతో కేకలు వేస్తూ రోధిస్తున్నా ఆమెను వదల్లేదు. స్థానికులు ఎవరూ ఆమెను కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు. ఏకాంత ప్రదేశానికి ఒక యువకుడితో వెళ్లినందుకు ఆమెపై ఒక వర్గం వ్యక్తులు దాడి చేశారని స్థానికులు తెలిపారు.ఈ ఘటన గత వారం రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో చోటుచేసుకుంది. దీని బట్టి ప్రేమికులు అర్థం చేస్కుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకోవడం.. కలుసుకోవడం ఈ రోజుల్లో మంచిది కాదు.. సో మీరు జాగ్రత్తగా ఉండండి.. 

గెలుపు.. బలుపు! చంద్రబాబు టార్గెట్ అందుకేనా?

ఆదివారం మున్సిపల్ ఫలితాలు. వైసీపీ ఘన విజయం. విజయవాడ, గుంటూరు, విశాఖలోనూ అనూహ్య గెలుపు. మంగళవారం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నోటీసులు. పోలా.. అర్థమై పోలా? కేసు ఎందుకు పెట్టారో.. చంద్రబాబును ఎందుకు టార్గెట్ చేశారో తెలిసిపోలా? అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. స్థానిక సంస్థలు గంపగుత్తగా వైసీపీ ఖాతాలో పడటంతో రాష్ట్రంలో తమకిక తిరుగులేదనే అహంకారంతో విర్రవీగుతోంది జగన్ సర్కారు అనేది టీడీపీ ఆరోపణ.  అమరావతి ఆగ్రహం విజయవాడలో అధికారపార్టీని దహించి వేస్తుందని అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. నయానో, భయానో.. బెజవాడపైనా వైసీసీ జెండా ఎగరడం.. పక్కనే ఉన్న గుంటూరు సైతం అధికార పార్టీ హస్తగతమవడంతో జగన్ రెడ్డి సర్కారులో సమరోత్సాహం పెరిగింది. వెయ్యి ఏనుగుల బలంతో చంద్రబాబును అణగదొక్కాలని ప్రయత్నిస్తోంది. అందుకే, విపక్ష నేత చంద్రబాబు టార్గెట్ గా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని అంటున్నారు. చరిత్రలో తొలిసారి ఓ మాజీ ముఖ్యమంత్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం వైసీపీ సర్కారు ఓవరాక్షన్ కు నిదర్శనం అని విమర్శిస్తున్నారు.  విభజన ఆంధ్రప్రదేశ్‌ను సన్‌రైజ్ స్టేట్‌ దిశగా నడిపించడం.. ఏపీ కేపిటల్‌గా అమరావతిని అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం.. ఇదే చంద్రబాబు చేసిన నేరం. అందుకు ఫలితమే ప్రతిపక్ష నేతకు నోటీసులు. ఏ అమరావతి కోసమైతే చంద్రబాబు అంత తాపత్రయ పడ్డారో.. ఆ కలల రాజధానిని కాలరాసి.. చరిత్రలో చంద్రబాబు పేరు లేకుండా చేసే ప్రయత్నమే ఇదంతా అనేది టీడీపీ మాట. ఇప్పటికే అమరావతిని మరుగున పడేశారు.. ఇప్పుడిక చంద్రబాబు పని పడుతున్నారు. ఎలాంటి ఆరోపణలు  లేకుండా ఐదేళ్లు సుపరిపాలన అందించిన చంద్రబాబును ఎలాగైనా ఏదో ఒక కేసులో ఇరికించి.. ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో కేసు క్రియేట్ చేసి.. ఆ ఉచ్చును చంద్రబాబు మెడకు బిగించాలని చూస్తున్నారని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో గుడ్డు మీద ఈకలు పీకి.. బలవంతపు కేసులు పెట్టడం.. వైసీపీ చేస్తున్న ప్రతీకార చర్యని.. అచ్చెంనాయుడు నుంచి వర్ల రామయ్య వరకూ.. టీడీపీ నేతలంతా ముక్తకంఠంతో మండిపడుతున్నారు.  ఎన్నికల్లో గెలిచామనే జోష్‌తో.. ప్రజాబలం తమకే ఉందనే భ్రమలో ఉంది వైసీసీ సర్కారు. స్థానికం ఎంతలా రణక్షేత్రంగా మారిందో.. ఎలా ఏకగ్రీవాలు అయ్యాయో.. ఎలా బెదిరింపులు, డబ్బు పంపిణీ జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ గెలుపు బలుపు కాదని కేవలం వాపు మాత్రమేననేది టీడీపీ వాదన. ఎన్నికల ఫలితాలతో వైసీపీ సర్కారు కళ్లు నెత్తికెక్కాయని.. అందుకే చంద్రబాబుకు అమరావతి భూముల కేసులో నోటీసులు ఇచ్చారనేది తమ్ముళ్ల ఆగ్రహం. ఈ కేసుపై గతంలోనే హైకోర్టులో విచారణ జరగ్గా.. అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో చంద్రబాబుకు సంబంధం లేదని ఉన్నత న్యాయస్థానం కూడా తేల్చేసింది. అయినా.. పాత కేసును మరింత తవ్వి.. ఆ దుమ్మంతా చంద్రబాబుపై ఎత్తిపోసే ప్రయత్నం జరుగుతోందని టీడీపీ మండిపడుతోంది. ఇక సంబంధంలేని ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి.. ప్రతిపక్ష నేతను భయబ్రాంతులకు గురి చేయాలనుకోవడం వైసీపీ సర్కారు దిగజారుడుతనమే అంటున్నారు. ఇదంతా స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావమేనని.. ఆ వాపును చూసి బలుపు అనుకునే ప్రభుత్వం ఇలా బరితెగిస్తోందనేది టీడీపీ వర్షన్.

మహారాష్ట్రలో ప్రతి ఒక్కరికి వెంటనే వ్యాక్సిన్ ఇవ్వండి...

కొద్ది రోజుల క్రితం వరకు దేశంలో తగ్గుతూ వస్తున్న కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి.  తాజాగా నమోదవుతున్న పాజిటీవ్ కేసులలో ఎక్కువ భాగం మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా 15 వేలకు తగ్గకుండా పాజిటీవ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ఈ నేసథ్యంలో మహారాష్ట్రలో తాజా పరిస్థితులపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తన ఆందోళన వ్యక్తం చేసారు. .    దేశంలోని ఆర్థిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రమైన మహారాష్ట్రలోని కోరుకున్న ప్రతి ఒక్కరికి  కోవిడ్ వ్యాక్సిన్ అందించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు, ప్రస్తుతం  దేశంలో ప్రతిరోజు నమోదవుతున్న కేసుల్లో సగం పైగా ఆ రాష్ట్రం నుంచే నమోదవుతున్నా విషయాన్నీ అయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో మళ్ళీ లాక్ డౌన్ వంటి చర్యలు చేపడితే.. దేశ ఆర్ధిక పరిస్థితి దెబ్బ తినే ప్రమాదముందని అయన పేర్కొన్నారు. దీంతో ఈ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని.. రాష్ట్రంలోని పౌరులందరికీ వ్యాక్సిన్లు అందించేలా రాష్ట్ర ప్రభుత్వానికి అత్యవసర అనుమతులు ఇవ్వాలని కోరారు. అదేసమయంలో వ్యాక్సిన్ల కొరత కూడా ఉండకూడదని  ఆనంద్ ట్వీట్ చేశారు. అయన తన ట్వీట్ లో ప్రధానమంత్రి కార్యాలయాన్ని, అలాగే కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి హర్షవర్ధన్ ను కూడా ట్యాగ్ చేశారు. ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్‌కు ఒక నెటిజన్ స్పందిస్తూ.. కేవలం వ్యాక్సినేషన్ ఒక్కటే పెంచితే సరిపోదు. సమాంతరంగా కరోనా పరీక్షలు, ట్రేసింగ్, మెరుగైన చికిత్స కూడా అందాలి. ఇంకా ప్రజలు కూడా క్రమశిక్షణతో మెలగాలని రిప్లై ఇచ్చాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన ఆనంద్  మహీంద్రా... "అవును.. నేను మీతో అంగీకరిస్తున్నాను. అయితే, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయకపోతే మనం రెండు, మూడు, నాలుగు దశల కరోనా వ్యాప్తితో తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంద"ని ఆందోళన వ్యక్తం చేశారు.  

అమరావతి కథ తేలుస్తాం.. మంత్రి కొడాలి హాట్ కామెంట్స్ 

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడం ఏపీలో సంచలనంగా మారింది. చంద్రబాబుకు నోటీసులివ్వడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఈ నోటీసులు, టీడీపీ నేతల విమర్శలపై మంత్రి కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. అమరావతిలో దళితులను మోసం చేసేలా చంద్రబాబు అండ్ కో భారీ భూ స్కాంలు చేశారని సంచలన ఆరోపణలు చేశారు.సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన ఏకపక్ష జీఓలతో, దళిత వర్గాలను మోసం చేశారని నాని వ్యాఖ్యానించారు. అమరావతిలో అసైన్మెంట్ భూముల హక్కు దారులైన దళిత వర్గాలను బెదిరించి, మోసపూరిత ప్రచారాలు చేసి, నామమాత్ర ధర చెల్లించి, అక్రమ జీవోల ద్వారా చంద్రబాబు బ్యాచ్ కోట్లు కాజేశారని నాని ఆరోపించారు. దళిత వర్గాలను మోసం చేసిన చంద్రబాబు అండ్ కో పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాలన్నారు. అక్రమ మార్గాల్లో భూములు కాజేసిన పలువురికి ఇప్పటికే 41సీ నోటీసులు జారీ చేశారు.. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు చేసిన స్కాం లకు సీఐడీ నోటీసులు ఇస్తే తప్పేంటి..?’ అని కొడాలి నాని ప్రశ్నించారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై ఏమనుకున్నా, దళిత వర్గాలకు చెందిన వందలాది కోట్లు కాజేసిన చంద్రబాబుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కొడాలి అన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ ఫాలో అవుతూ కుమ్మక్కు రాజకీయాలు చేసే ప్రతిపక్షాలకంటే.. తమకు దళిత వర్గాల ప్రయోజనాలే ముఖ్యమన్నారు మంత్రి. ప్రజలను మోసం చేసిన చంద్రబాబు సీఐడీ, కోర్టులకు జవాబు చెప్పాలన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలకు న్యాయం చేయడమే ముఖ్యం. దళితులకు న్యాయం చేసేలా చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని సీఐడీని మంత్రి కొడాలి నాని కోరారు. 

పైసా వసూల్.. పైసా కొట్టు.. కొట్టు నడుపు  

సంపాదించే వాడు ఒకడైతే ఆ సంపదను అనుభవించే వాడు మరొకడు.. కలోగంజి కోసం కొందరు చిరు వ్యాపారాలు చేసుకుంటూ.. తల్లిదండ్రుల మందులు.. పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులు ఎల్లదీస్తు ఏదో జీవనం కొనసాగిస్తుంటే.. చిరువ్యాపారులు మాంసపు ముద్దలను గడ్డలా ఎత్తుకు పోతున్నారు.. పోలీసులు, ఆయా ఏరియాలో పలుకుబడి ఉన్న మంది. అదేంటి అలాంటి సీన్లు సినిమాలో కదా ఉండేది అనుకుంటున్నారా.. ఈ దునియాలో  అలా బతికేవాళ్లు చాలా మందే ఉన్నారు. పోలీసులు హైదరాబాద్ లో ఎప్పటి నుంచో చిరువ్యాపారులు దగ్గర వసూల్ చేస్తున్న పద్ధతి ఇప్పుడు  ట్రెండ్ మారింది.. పోలీసులు లే కాదు మాములు వాసులు చేసేది ఆ ఏరియాలో అంతో ఇంతో పలుకుబడి ఉన్న వాడు కూడా మాములు వసూల్ చేస్తున్నారు.. వ్యాపారం చేసుకో! రోజూ రూ.200.. రాత్రి పది దాటితే రూ.500ల పైనే   చిరువ్యాపారుల నుంచి వసూళ్ల దందా       వేసవి కాలం వచ్చిందంటే కొబ్బరి బోండాలు, సోడా బండ్లు, చెరుకు రసాలు, పళ్ల రసాల కొట్లు.. ఇలా వందల్లో దుకాణాలు ప్రధాన రహదారుల పక్కన వెలుస్తుంటాయి. ఇతర వ్యాపారాలు, ఉద్యోగాలూ వదిలి ఈ సీజన్‌ మొత్తం వీటిమీదే బతికేవాళ్లు వేల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు వీరినే లక్ష్యంగా దోచేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ఇక్కడ వ్యాపారం నడవాలంటే రోజూ వీరి చేతులు తడపాల్సిందే. సర్కారు ఖాళీ స్థలాల్ని సైతం తమ సొంత జాగాగా చెప్పుకుంటూ వసూళ్లకు పాల్పడుతున్న వారు కొందరైతే.. ఫుట్‌పాత్‌ మీదా, రోడ్డు పక్కన వ్యాపారం నడవాలంటే డబ్బులు కట్టాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్న వారిలో కొందరు పోలీసులు, బల్దియా సిబ్బంది ఉండటం గమనార్హం. మరోవైపు రాత్రి 10 గంటలు దాటిందంటే ఆ తర్వాత కొట్టు తెరిచి ఉండాలంటే నిర్వాహకుల నుంచి రూ.500 నుంచి ఆపైన వసూలు చేస్తున్నారు కొందరు పెట్రోలింగ్‌ సిబ్బంది.     గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి వెనకాల గల్లీలో ఓ నివాసం. ఆ ఇంటిని ఆనుకుని రోడ్డు పక్కన నెలరోజుల నుంచి చెరుకు రసం బండి నడుపుతున్నారు ఓ మహిళ. గతంలో పేట్‌బషీరాబాద్‌లో ఇదే వ్యాపారంలో ఉన్న ఆమె ఇక్కడ ఖాళీ స్థలం ఉందని తెలిసి బండి పెట్టుకున్నారు. అయితే పక్కనే ఉన్న ఇంటి యజమాని ఆమె నుంచి నిత్యం రూ.100 వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఆ స్థలం తనదేనని చెబుతున్నాడని.. ఖర్చులు పోనూ రోజూ రూ.200 మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారా మహిళా వ్యాపారి.     బేగంపేట ప్రధాన రహదారి పక్కన ఓ పండ్ల రసం కొట్టు. ఆ వ్యాపారితో పాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలకు జీవనాధారం ఇదే కొట్టు. ప్రతిరోజూ ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ తన వద్దకు రావడం రూ.100 నుంచి రూ.200 దాకా అడుక్కెళ్లటం మామూలుగా మారింది. రోజూ వచ్చిన సంపాదనలో మిగిలేది రూ.300 నుంచి రూ.400. అందులో పెద్దమొత్తం ఆ కానిస్టేబుల్‌ తీసుకెళ్లడంతో భారంగా ఉందని వాపోతున్నాడా చిరువ్యాపారి. ఇదేంటని అడిగితే ఇవ్వకపోతే ఇక్కడి నుంచి బండి తీసేయిస్తారని చెప్పడం గమనార్హం.      కేపీహెచ్‌బీ ప్రధాన రహదారిపై ఓ టీ కొట్టు. రాత్రి 10 దాటితే  ఓ పెట్రోలింగ్‌ వాహనం సైరన్‌ వేసుకుని వచ్చి కొంచెం దూరంలో ఆగుతుంది. టీకొట్టు నిర్వాహకుడు ఓ పేపర్లో రూ.200 నుంచి రూ.500 వరకు పెట్టి తీసుకెళ్లి గుట్టుగా ఆ వాహనంలో ఇచ్చేసి వస్తాడు. ఇదే తంతు ఇక్కడ ప్రతిరోజూ దాదాపు ప్రతి దుకాణంలోనూ జరుగుతోంది. నైట్ డ్యూటీ తో పాటు వ్యాపారులను లూటీ     నగరంలో పలు టీకొట్లు, హోటళ్లు, పాన్‌షాపుల వద్ద రాత్రికాగానే ఓ వాహనం వచ్చి ఆగుతుంది. ఓ పోలీస్‌ దిగి చేతిలో ఉన్న ట్యాబ్‌తో ఫొటోలు తీస్తారు. బేరం కుదిరితే సరి లేకుంటే బండెక్కిస్తారు. ఇదే తంతు ప్రతిరోజూ నగరంలో చాలాచోట్ల జరుగుతోంది. ఎర్రగడ్డ నుంచి మొదలుకుని కేపీహెచ్‌బీ మెట్రో వరకూ ప్రధాన రహదారిపై ఉన్న దాదాపుగా అన్ని చిరువ్యాపార కేంద్రాల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల వెస్ట్‌జోన్‌ పరిధిలో రాత్రి పెట్రోలింగ్‌ పోలీసులు కొందరు గూగుల్‌పే ద్వారా మామూళ్లు వసూలు చేయడంపై ఫిర్యాదులు రావడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.  అడుక్కునే వాడే నయం అనిపించేలా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు, ఆకు రౌడీల వ్యవహారం.. ఎవరైనా తప్పుచేస్తే పోలీసులకు కంప్లీట్ చేస్తాం పోలీసులే ఇలాంటి దారుణాలకు  పాలుపడుతుంటే తాము ఎవరికి చెప్పుకోవాలని చిరువ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.       

విశాఖకు ఆరుగురు డిప్యూటీ మేయర్లు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించడం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారు ఉన్నారు... స్వాగతించిన వారు ఉన్నారు. తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదనతో మరో సంచలనానికి తెర తీశారు జగన్. మూడు రాజధానుల ప్రతిపాదనపై వివాదం ఇంకా కొనసాగుతోంది. తాజాగా సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.  విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో నెగ్గిన వైసీపీ అధిష్టానం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోందని.. ఉప ముఖ్యమంత్రుల ఫార్ములాను విశాఖ కార్పోరేషన్ విషయంలోనూ అమలు పర్చే దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.  అన్ని కార్పొరేషన్ల మాదిరిగానే విశాఖకు ఒక మేయర్ ఉంటారు. కానీ డిప్యూటీ మేయర్ల విషయంలో మాత్రం కొత్తగా ఆలోచిస్తున్నారట జగన్. విశాఖ మేయర్ పదవి బీసీ జనరల్ కు రిజర్వ్ అయ్యింది. అయితే మేయర్ పదవిని బీసీ జనరల్ కు కాకుండా.. బీసీ మహిళకు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.  విశాఖ కార్పొరేషన్ లో 8 నియోజకవర్గాలు ఉన్నాయి. విశాఖ తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తరతో పాటు గాజువాక, అనకాపల్లి, పెందుర్తి, భీమిలి ఉన్నాయి.  ప్రతీ నియోజకవర్గానికి ఒక డిప్యూటీ మేయర్ ని నియమించాలని జగన్ ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. అయితే అన్ని నియోజకవర్గాలు అంటే సంఖ్య మరీ భారీగా అవుతుందనే ఆలోచనతో నలుగురు లేదా ఆరుగురు డిప్యూటీ మేయర్లను నియమించే అవకాశం ఉందని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సామాజికవర్గం కోణం నుంచే కాకుండా పాలనాపరంగా కూడా ఇది కొత్త విధానం అవుతుందని భావిస్తున్నట్టు సమాచారం.చదువుకున్న వారు, మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని కూడా తెలుస్తోంది. అలాంటి నిర్ణయం తీసుకుంటే విశాఖ కార్పొరేషన్ ఏపీ రాజకీయ చరిత్రలో కొత్తగా నిలవనుంది.  జగన్ ఆలోచనకు చాలానే కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. జీవీఎంసీలో మొత్తం 98 డివిజన్లు ఉన్నాయి. వైసీపీకి చెందిన అభ్యర్థులు 58 మంది గెలుపొందారు. వీరిలో ఆశావాహులు చాలామంది ఉన్నారు. మేయర్‌ పదవి బీసీ జనరల్‌కు రిజర్వు అయినా.. మహిళకే మేయర్ పదవి ఇస్తారనే ప్రచారం ఉంది. దీంతో మిగిలిన ఆశావాహుల నుంచి వ్యతిరేకత ఎదురవ్వకుండా ఉండేందుకు ఎక్కువమంది డిప్యూటీ మేయర్ల ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది.  టీడీపీని బలహీన పర్చాలి అంటే బీసీ ఓటర్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వడమన్నది రెండో లక్ష్యం. ఇతర నగరాలతో పోల్చుకుంటే విశాఖలో టీడీపీకి మంచి పట్టు ఉంది. తాజాగా గ్రేటర్ విశాఖ ఎన్నికల్లోనూ మరోసారి అది రుజువు అయ్యింది.  అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విశాఖలో నాలుగు అసెంబ్లీ స్థానాలు నెగ్గగా.. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి బాగానే ఓట్లు పడ్డాయి. 30 స్థానాలను సొంతం చేసుకుంది. టీడీపీ మద్దతుతో మరో ఇద్దరు గెలిచారు. ఇక వైసీపీ నెగ్గిన చోట కూడా అత్యల్ప ఓట్లతోనే విజయం సాధించిన డివిజన్లు ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం విశాఖలో  బలంగా ఉండే  బీసీ సామాజిక వర్గం టీడీపీకి అండగా  ఉండటమే అంటున్నారు.  అందుకో బీసీ సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి టీడీపీ పూర్తిగా దెబ్బ కొట్టాలి అంటే బీసీ ఓటర్లను ఆకర్షించుకోవాలన్నది వైసీపీ వ్యూహాంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆరుగురు డిప్యూటీ మేయర్ల అంశం తెరపైకి తెచ్చారని తెలుస్తోంది. 

ఆ దేశం అప్పు 45 లక్షల కోట్లు.. ఒక్కొక్కరిపై లక్షా 75 వేలు 

ఉగ్రవాదులకు అడ్డాగా చెప్పుకునే పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ దేశం అప్పుల ఊబిలో మునిగిపోయింది. పాకిస్థాన్ మెడపై ఆర్థిక సంక్షోభం కత్తి వేలాడుతోంది. 2019 డిసెంబర్ నాటికి పాకిస్థాన్ అప్పులు 40.94 ట్రిలియన్ రూపాయలుగా ఉన్నాయి. ఈ సంవత్సరం గడువు లోనే పాకిస్థాన్ అప్పులు 45 ట్రిలియన్లకు పెరగనున్నాయి. అంటే పాకిస్తాన్ అప్పు 45 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. ఇవి పాకిస్థాన్ సెంట్రల్ బ్యాంక్ వెల్లడించిన వివరాలివి. పాకిస్థాన్ ఆర్థిక శాఖ రిపోర్ట్ కూడా దీన్ని బలపర్చింది. తాజాగా పార్లమెంట్ లో ఆ దేశ ఆర్థిక మంత్రి దేశానికి ఉన్న అప్పుల గురించి వెల్లడించారు. ఈ అప్పులన్నింటినీ పాకిస్థాన్ లో ఉన్న 21.66 కోట్ల మంది కి సమానంగా పంచితే ఒక్కొక్కరికీ లక్షా 75 వేల రూపాయల అప్పు ఉన్నట్లుగా తేలుతుంది.రెండేళ్లలో ఒక్కొక్కరిపై సగటున 55 వేల రూపాయల అప్పు పెరగడం పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితిని వివరిస్తోంది. 2018 మధ్య నాటికి పాకిస్థాన్ కి ఉన్న అప్పుల విలువ 24.9 ట్రిలియన్ రూపాయలు. పాకిస్థానీ న్యూస్ పేపర్ ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ కథనం ప్రకారం ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రి గా ఎన్నికయ్యాక ఈ అప్పులు 46 శాతం పెరిగాయట. ఇంతకుముందు కూడా పాకిస్థాన్ పరిస్థితి పెద్ద గొప్పగా ఏమీ లేకపోయినా ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ పాలనలో మరింత దిగజారింది. ఆ తర్వాత కరోనా వల్ల ఆర్థిక భారం ఎక్కువైంది. ఆ మేరకు అప్పులు కూడా పెరిగాయి. మిగిలిన దేశాలన్నింటితో పోల్చితే పాకిస్థాన్ లో లాక్ డౌన్ చాలా తక్కువ కాలం కొనసాగింది. తమ దేశం పేద దేశం కాబట్టి ఆర్థిక వ్యవస్థ పై భారం పడకూడదని చెబుతూ ఇమ్రాన్ లాక్ డౌన్ ని ఎత్తేశారు. అయితే ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయింది. గతంలో ఆర్థిక శాఖ చెప్పిన వివరాల ప్రకారం పాకిస్థాన్ ప్రభుత్వం తాను రూపొందించుకున్న ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ క్రెడిట్ లిమిట్ (ఎఫ్ ఆర్ డీ ఎల్) చట్టాన్ని అతిక్రమించింది. 2005 లో ఈ చట్టాన్ని రూపొందించారు. దీనికి ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ కంటే ద్రవ్య లోటు 4 శాతం కంటే ఎక్కువగా ఉండకూడదు. కానీ ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో ఈ ద్రవ్యలోటు 8.6 శాతంగా ఉంది. ఇది నిర్ణయించిన రేటుకు రెట్టింపు కంటే ఎక్కువ కావడం విశేషం. . అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పాకిస్థాన్ ఒక దేశం నుంచి అప్పు చేస్తూ మరో దేశానికి దాన్ని చెల్లిస్తోంది. ఎక్కువ వడ్డీలు చెల్లించాల్సి రావడంతో అప్పులు పెరుగుతున్నాయి. తాజాగా ఇతర దేశాల్లో ఉన్న పాకిస్థాన్ ఆస్తులను అమ్మే వరకూ పరిస్థితి వచ్చింది. ఇతర దేశాలకు చెందిన మైనింగ్ కంపెనీలు తమ దేశంలో బంగారాన్ని తవ్వుకోవచ్చని అంగీకరించిన పాకిస్థాన్ అగ్రిమెంట్ అయ్యాక మనసు మార్చుకొని వారికి అనుమతిని నిరాకరించింది. అగ్రిమెంట్లను క్యాన్సిల్ చేసింది. దీనిపై కంపెనీలు కోర్టుకి వెళ్లగా పాకిస్థాన్ ఈ కేసును కూడా ఓడిపోయింది. పరిస్థితి ఎంతగా దిగజారిందంటే.. యుఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) తనకు పాకిస్థాన్ అప్పు బకాయి ఉన్న బిలియన్ డాలర్లు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసేంతగా.. గతంలో కూడా యూఏఈ ఇలాగే డిమాండ్ చేసింది. అప్పుడు చైనా ముందుకొచ్చి పాకిస్థాన్ కి సాయం చేసింది. ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధానిగా మారిన తర్వాత ఇలా ఒక దేశం నుంచి సహాయం తీసుకొని మరో  దేశానికి అప్పులు తీర్చడం ఆ దేశానికి కామన్ గా మారింది.   

చంద్రబాబుతోపాటు మరో ఎనిమిది మందిపై సిఐడి కేసులు

ఏపీ రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో సిఐడి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవాళ ఉదయం అయన హైదరాబాద్ నివాసంలో నోటీసులు ఇచ్చిన సంగతి తెల్సిందే. ఆయనతో పాటు అప్పట్లో పురపాలక శాఖా మంత్రిగా ఉన్న మరో టీడీపీ నేత నారాయణకు కూడా సిఐడి నోటీసులు జారీ చేసింది.    వైసిపి ప్రతిపక్షంలో ఉండగా అమరావతి భూముల వ్యవహారంలో టీడీపీ నేతలు అక్రమాలకు పాలపడ్డారని ఆరోపిస్తూ వచ్చింది. ఆ తరువాత 2019 ఎన్నికలలో గెలిచి.. జగన్ సర్కార్ ఏర్పడిన తరువాత రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో అవకతవకలపై విచారణ చేయడానికంటూ ఒక  మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘం భూముల వ్యవహారంపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. భూముల అక్రమాల వ్యవహారంలో సంబంధం ఉన్న టీడీపీ నేతల జాబితాను కూడా మంత్రివర్గ ఉపసంఘం సమర్పించింది. ఈ నివేదికలో చంద్రబాబుతోపాటు నారాయణ, పుట్టా మహేష్ యాదవ్, పరిటాల సునీత, లోకేష్, పయ్యావుల కేశవ్, వేమూరు రవికుమార్, జీవీ ఆంజనేయులు, లంకా దినకర్, లింగమనేని రమేష్, దూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్ పేర్లను పేర్కొంది.  దీంతో ఈ నివేదిక ఆధారంగా  సీఐడి కేసులు నమోదు చేసి.. తాజాగా  ఈ వ్యవహారంపై బాబుతోపాటు మాజీ మంత్రి నారాయణకు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే రాజధాని ప్రకటనకు ముందే ముఖ్య నేతలు తమ అనుచరులకు సమాచారం ఇచ్చి అక్కడ దళితులకు చెందిన అసైన్డు భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదు అయినట్లు సమాచారం. ఆ సందర్భంలో అసైన్డ్‌ రైతులను మోసం చేసి తమ  అనుచరులకు లబ్ధి చేకూర్చారని  ఇందులో ఆరోపణలు ఉన్నాయి. అయితే దీనిపై హైకోర్టులో కూడా విచారణ కూడా జరిగింది. ఈ విషయంలో చంద్రబాబుకు ఏమాత్రం సంబంధం లేదంటూ న్యాయస్థానం తేల్చి చెప్పింది.అయితే రాజధాని ప్రకటన తర్వాత భూముల ధరలు విపరీతంగా పెరిగాయని..దీంతో అసైన్డ్‌ రైతులు మోసపోయారని.. మరోపక్క టీడీపీ నేతల అనుచరులకు లబ్ధి కలిగించారని కేసు నమోదు చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఇది జగన్ సర్కార్  రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగమేనని ఆ పార్టీ నేతలు కార్యకర్తలు మండి పడుతున్నారు. వైసిపి బెదిరింపులకు తాము ఎంతమాత్రం భయపడేది లేదని స్ఫష్టం చేస్తున్నారు