రాసలీలల సీడీ.. యువతి కిడ్నాప్!
posted on Mar 17, 2021 @ 2:28PM
కర్ణాటక మాజీ మంత్రి పేరుతో దుమారం రేపిన రాసలీలల సీడీ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తమ కుమార్తెను కిడ్నాప్ చేశారంటూ ఆ సీడీలో కన్పించిన యువతి తల్లిదండ్రులు బెళగావి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె ప్రమాదంలో ఉందంటూ ఓ వీడియో విడుదల చేశారు.
‘‘ఆ వీడియో టీవీలో కన్పించగానే నేను మా కుమార్తెకు ఫోన్ చేశాను. అందులో ఉన్నది తాను కాదని, అది నకిలీ వీడియో అని ఆమె నాకు చెప్పింది. తాను ఏ తప్పూ చేయలేదని తెలిపింది. నీ తప్పు లేనప్పుడు నువ్వు ఇంటికి వచ్చేయ్ అని నేను అన్నాను. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. తన జీవితం ప్రమాదంలో ఉందని, ఇప్పుడు రాలేనని మా అమ్మాయి చెప్పింది. తనను కాంటాక్ట్ చేయొద్దని కూడా కోరింది. ఆ తర్వాత నుంచి ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో తెలియట్లేదు’’ అని యువతి తల్లి వీడియోలో తెలిపారు. తమ కుమార్తె ఎక్కడ ఉందో చెప్పాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు. మార్చి 2 కంటే ముందే బెంగళూరులోని హాస్టల్ నుంచి తమ కుమార్తెను అపహరించుకెళ్లారని యువతి తండ్రి ఫిర్యాదులో రాశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
సీడీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత గతవారం ఆ యువతి కూడా ఓ వీడియోను రీలీజ్ చేశారు. అందులో ‘నాకు, కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉంది, మేం రెండుసార్లు బలవన్మరణానికి ప్రయత్నించాం. రక్షణ కల్పించాలి’ అని ఆమె పోలీసులను కోరింది. మరోవైపు సీడీ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం.. యువతికి నోటీసులు జారీ చేసింది.
రాసలీలల సీడీ వైరల్ అయ్యాక బాధిత యువతి గోవాకు వెళ్లిందని, అక్కడి నుంచి బెంగళూరుకు వచ్చి నగర శివారుల్లో తలదాచుకున్నట్టు అధికారులు గుర్తించారు. మరోవైపు.. కేసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. సీడీ విడుదలకు ముందు రోజు ఆ యువతి, మరో ఐదుగురితో ఆర్.టి.నగరలో సమావేశమైనట్లు కాల్ డేటా ఆధారంగా గుర్తించారు. వీడియో విడుదలైన అనంతరం ఒక్కొక్కరు ఒక్కో వైపు వెళ్లినట్లు తేల్చారు. యువతి మినహా మిగిలిన వారిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేసి విడిచి పెట్టారు. ఆ యువతి బాయ్ ఫ్రెండు, అతని స్నేహితుడ్ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు.
కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జర్కిహోలీ ఓ మహిళతో సన్నిహితంగా మెలిగిన దృశ్యాలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆ మంత్రి తనను లై*గిక అవసరాలకు వాడుకున్నారని ఆ యువతి ఆరోపించింది. ఆ వ్యవహారం వివాదాస్పదం కావడంతో రమేశ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతున్న సమయంలో.. తమ కూతురు కిడ్నాప్ అయిందంటూ ఆమె పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.