టీఆర్ఎస్‌కు మజ్లిస్ షాక్! గులాబీ పార్టీలో గుబులు

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ గులాబీ పార్టీకి మజ్లిస్ గుబులు పట్టుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి, పీవీ కూతురు వాణీదేవిపై ఆ వర్గం ఓటర్లు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్‌తో ఎంతగా దోస్తీ ఉన్నా.. ఈసారి మాత్రం కారు గుర్తుకు ఓటేసేది లేదంటున్నారు. అందుకు కారణం పీవీపై ఉన్న ధ్వేషమే. ఆయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతకు.. అప్పడు ప్రధానమంత్రిగా ఉన్న పీవీ నరసింహరావే బాధ్యుడని మజ్లిస్‌ పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. అందుకే, పీవీ కూతురి అభ్యర్థిత్వాన్ని సమర్థించే ప్రసక్తే లేదనే అభిప్రాయానికి ఎంఐఎం మద్దతుదారులు వచ్చారని చెబుతున్నారు. పీవీపై మైనార్టీ వర్గంలో ఉన్న వ్యతిరేకత.. పీవీ కూతురు వాణీదేవిపై కనిపిస్తోంది. ఈ విషయం తెలిసిన గులాబీ బాస్ మదిలో కలవరం మొదలైందని అంటున్నారు.  అధికార టీఆర్‌ఎస్‌తో మజ్లిస్‌ పార్టీకి మొదటి నుంచి బలమైన మిత్రబంధం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ బరిలో దిగని స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు  సహకరించింది. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీలో ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేసినప్పటికీ..  మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించింది. పట్టభద్రుల ఎన్నికల్లో మాత్రం.. అభ్యర్థి కారణంగా అధికార పక్షానికి సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఎంఐఎం తీరుతో టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే, మరోరకం ప్లాన్-బి అప్లై చేస్తున్నారట గులాబీ శ్రేణులు.  వేస్తే మొదటి ప్రాధాన్యత ఓటు టీఆర్ఎస్‌కే వేయండి. అంతే. ఇక 2, 3 లాంటి ప్రాధాన్యతా ఓట్లు ఎవరికీ వేయకండి అని వేడుకుంటున్నారట. ఒకవేళ కాదూ కూడదంటే.. రెండో ప్రాధాన్యతా ఓటు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థికి మాత్రం వేయకండి అని చెబుతున్నారట. తప్పనిసరిగా వేస్తామంటే.. తాము సూచించిన కేండిడేట్స్‌కు మాత్రమే ఓటేయమని రిక్వెస్ట్ చేస్తున్నారట. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు.. వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గంలో ప్రొఫెసర్ కోదండరాంకు 2వ ప్రాధాన్యత ఓటు వేయండని చెబుతున్నారట. ఇలా.. బీజేపీ నుంచి కాచుకోడానికి.. ఎమ్ఐఎమ్‌తో కలిగే నష్టాన్ని పూరించుకోడానికి.. రెండో ప్రాధాన్యత ఓటుతో ప్లాన్-బి అమలు చేస్తున్నారట టీఆర్ఎస్ శ్రేణులు. మరి, ఈ స్ట్రాటజీ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో..? రెండు ఎమ్మెల్సీ స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ఓటర్లను మభ్యపెట్టే కార్యక్రమాలు ఎక్కువవుతున్నాయి. ఓటరు లిస్టు ప్రకారం డబ్బు పంపిణీ కార్యక్రమం కూడా మొదలుపెట్టేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 30 మంది ఓటర్లుకు.. ఒక టీఆర్ఎస్ నేత చొప్పున బాధ్యతలు అప్పగించి వారిని మచ్చిన చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారని అంటున్నాయి. టీఆర్ఎస్ ఎన్ని గిమ్మిక్కులు చేసినా.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదని తేల్చి చెబుతున్నాయి విపక్షాలు.

అవి'నీతి' బండి! 600కోట్లు.. ఏది నిజం? ఏది ప్రచారం?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కి 600 కోట్ల ఆస్తులు. ఢిల్లీ కంపెనీలో 50 కోట్ల పెట్టుబడులు, కరీంనగర్ జిల్లా తీగలగుట్ట దగ్గర 3 కోట్ల పంటభూమి. రాజేంద్రనగర్‌లో బినామీ పేరిట 75 కోట్ల విలువైన భూములు. ఇలా సోషల్ మీడియాలో విస్త‌ృత ప్రచారం. ఇవి చాలవన్నట్టు.. తాజాగా ఓ గ్రానైట్ స్కాంలోనూ బండి సంజయ్ పేరంటూ మరో వీడియో. బండి సంజయ్ ఆస్తుల పేరుతో ఓ పేపర్ క్లిప్పింగ్, గ్రానైట్ దందా అంటూ ఓ వీడియో. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ రెండూ ఫేక్ అని తెలుస్తోంది.  బండి సంజయ్‌పై ఆరోపణలకంటే ఈ సమయం, సందర్భమే మరింత ఆసక్తికరంగా కనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించి ఏడాది అవుతోంది. ఆయన నాయకత్వంలో దుబ్బాకలో దుమ్ము లేపింది కమలం పార్టీ. గ్రేటర్‌లోనూ గులాబీ పార్టీకి చుక్కలు చూపించింది. ఇక నాగార్జున సాగర్ బై పోల్, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్‌ల్లోనూ సత్తా చాటేందుకు సై అంటోంది. ఇక, అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఎమ్మెల్సీ ఎన్నికలకూ సమయం దగ్గర పడింది. పేరుకు ఎమ్మెల్సీ ఎన్నికలే అయినా.. ఈ రెండు స్థానాల్లో గెలుపు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని అమాంతం మార్చేయగలవు. ఇలాంటి కీలక సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కి 600 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఆరోపణలు రావడం, గ్రానైట్ బ్లాక్‌మెయిల్ దందాలో ఆయన పేరు వినిపించడం.. రాజకీయంగా సంచలనంగా మారింది.  కరీంనగర్‌ కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీగా, పార్టీ అధ్యక్షుడిగా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు బండి సంజయ్. రెండేళ్లకు ముందు ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో ఆయనకు పెద్దగా ఆస్తులేమీ లేవు. అలాంటిది సడెన్‌గా.. 600 కోట్ల ఆస్తులంటూ ఆరోపణలు రావడం, గ్రానైట్ వ్యాపారుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడంపై పొలిటికల్ అటెన్షన్ నెలకొంది. అయితే.. తనపై వచ్చిన ఆరోపణలపై బండి సంజయ్ ఇచ్చిన వివరణపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాను 600 కోట్లు సంపాదించినట్టు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని.. నిరూపిస్తే నిరుద్యోగ భృతి తానే చెల్లిస్తానని బండి సంజయ్ అన్నారు. అంతే, ఈ ఒక్క స్టేట్‌మెంట్‌తో ఆ మేటర్‌ను అక్కడికి క్లోజ్ చేశారు. మళ్లీ 600కోట్ల గురించి పెద్దగా వివరణ ఇచ్చింది లేదు. మరోవైపు, తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపైనే ఇంత పెద్ద అవినీతి ఆరోపణ వస్తే.. బీజేపీ నేతలు సైతం పెద్దగా స్పందించలేదు. అంటే.. మౌనం అర్థ అంగీకరమేగా? అంటున్నారు ప్రత్యర్థి పార్టీ నేతలు.   బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే పార్టీ. డబ్బు కంటే జెండా, ఎజెండానే వారికి ప్రాధాన్యం. అందుకే, బీజేపీ నేతలపై పెద్దగా అవినీతి ఆరోపణలు వినిపించవు. కానీ, ఇటీవల ఇటు ఏపీలో, అటు తెలంగాణలో పలువురు ప్రముఖ బీజేపీ నేతలకు అవినీతి మకిలీ అంటుకోవడం వివాదాస్పదమవుతోంది. ఓ ఆశ్రమం విషయంలో ఏపీ బీజేపీ నాయకులు జీవీఎల్, విష్ణువర్ధన్‌రెడ్డిలపై కూడా ఇలాంటి ఆరోపణలే వినిపించాయి. వరుస ఘటనలు మిస్టర్ క్లీన్ పార్టీకి చెడ్డ పేరు తెస్తోందని అంటున్నారు. అయితే, అవినీతి ఆరోపణల్లో నిజానిజాలు ఎలా ఉన్నా.. కనీసం ఆ ఆరోపణలను గట్టిగా ఖండించడమో, సరైన వివరణ ఇవ్వడమో కూడా చేయడం లేదు ఆయా నేతలు. తాజాగా, బండి సంజయ్‌పై వినిపిస్తున్న 600 కోట్ల ఆస్తులు, గ్రానైట్ వ్యాపారుల నుంచి పైసా వసూల్ వ్యవహారంపై బీజేపీ నేతలను వివరణ అడిగే ప్రయత్నం చేసింది తెలుగు వన్ న్యూస్. బీజేపీ నేతలెవరూ ఆ విషయంపై స్పందించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నామంటున్నారు బీజేపీ నేతలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కమలనాథులపై వరుసగా వస్తున్న అవినీతి ఆరోపణలపై స్పష్టమైన వివరణ ఇస్తేనే.. అసలు నిజానిజాలు ఏంటో ప్రజలకు తెలిసేది. లేదంటే, ఫేక్ న్యూసే నిజమనుకునే ప్రమాదం ఉంది. కాదంటారా..?

ఆంధ్రప్రదేశ్ దేశంలో లేదా? విపక్షాలపై కేటీఆర్ ఫైర్

ఆంధ్రప్రదేశ్ దేశంలో లేదా? మేం నోరు మెదపకుండా ఉంటే ఎలా? రేపు మాకు కష్టం వస్తే ఎవరు ఉంటారు? మొదట భారతీయులం, తర్వాతే తెలంగాణ బిడ్డలం. ఇదీ కేటీఆర్ ఆగ్రహం. విశాఖ ఉక్కు ఉద్యమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దతు ప్రకటించాక ఆయనపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే కేటీఆర్ విశాఖ ఉక్కుకు మద్దతు ఇచ్చారని ఆరోపించాయి. కేటీఆర్ స్టేట్‌మెంట్ దురుద్దేశపూర్వకంగా ఉందంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మండిపడితే.. ముందు తెలంగాణలో మూతపడిన ప్రాజెక్టులపై పోరాడమంటూ బీజేపీ నేతలు నిలదీశారు.  తన వ్యాఖ్యలపై రాజకీయ రచ్చ కొనసాగుతుండటంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విశాఖ ఉక్కును తుక్కు తుక్కు చేసి అమ్మేస్తున్నారు. నీవెవరు అడిగేందుకు? ఏపీతో నీకేం పని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ దేశంలో లేదా? మేం మాట్లాడకూడదా? 80వేల మంది బీఎస్‌ఎన్ఎల్‌ ఉద్యోగులను రోడ్డుపై పడేసింది. దేశంలో మాకు భాగస్వామ్యం లేదా?ఇవాళ విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్ముతున్నారు. రేపు సింగరేణి, బీహెచ్‌ఈఎల్‌పై కూడా పడతారు. ఏపీకి కష్టం వచ్చింది కదా.. మాకేంటి సంబంధం అని మేం నోరు మెదపకుండా ఉంటే ఎలా? రేపు మాకు కష్టం వస్తే ఎవరు ఉంటారు? ఎవరికో కష్టం వచ్చింది.. నాకెందుకులే అనుకుంటే సరికాదు. మొదట భారతీయులం.. తర్వాతే తెలంగాణ బిడ్డలం. దేశంలో ఎక్కడ తప్పు జరిగినా అందరూ ఖండించాలంటూ విపక్షాలపై కస్సుమన్నారు కేటీఆర్. 

కేటీఆర్ పై బీజేపీ భగ్గు...

కమలనాధులు ముక్త కంఠంతో టీఆర్ఎస్ పార్టీతో పాటు.. మంత్రి కేటీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు విమర్శలు గుప్పించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిచిన తర్వాతనే కేసీఆర్ కుటుంబం విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడాలని కిషన్ రెడ్డి ఆంటే. కేటీఆర్ నిజంగానే గట్స్ ఉన్న నాయకుడైతే అజంజాహీ మిల్స్, నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెలిపించాలని బండి సంజయ్ మండిపడ్డారు. షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామని టీఆర్ఎస్ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిందన్నారు. ఏడేళ్ళుగా షుగర్ పరిశ్రమను ఎందుకు తెరవలేదో కేటీఆర్ చెప్పాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు కేటీఆర్‌కు పూనకం వస్తోందని ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవటానికి కేంద్రాన్ని విమర్శిస్తున్నారన్నారు. 70శాతం ఫిట్‌మెంట్ ఇస్తామన్నప్పటికీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు టీఆర్ఎస్‌కు ఓటు వేయరన్నారని కిషన్ రెడ్డి అన్నారు. కేటీఆర్ తన ఏడుపు తాను  ఏడిస్తే బాగుంటుందని. విశాఖపట్నంలో వాళ్ళ ఉద్యమం వాళ్ళు చేసుకుంటారని బండి సంజయ్ అన్నారు. 

ఆ వ్యాక్సిన్ తో హెల్త్ సమస్యలు .. వ్యాక్సినేషన్ ను ఆపేసిన ఆరు దేశాలు 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టించిన కల్లోలంతో.. అన్ని దేశాలు తమ ప్రజలకు అత్యవసరంగా వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసిన సంగతి తెల్సిందే. ఇప్పటికే అమెరికాలో ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ లు ఇస్తుండగా.. ఇతర దేశాలు వీటితోపాటు ఆస్ట్రాజెనికా ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ను ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ ను ఆరు యూరప్ దేశాలు నిలిపివేశాయి. ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొందరి శరీరంలో రక్తం గడ్డకట్టినట్లుగా తీవ్రమైన ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెల్సుస్తోంది. మరోపక్క ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో రక్తం గడ్డ కట్టినట్టుగా రిపోర్టులు వచ్చాయని డానిష్ హెల్త్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో, ఈ వ్యాక్సిన్ వాడకాన్ని డెన్మార్క్ లో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. మరోపక్క వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే రక్తం గడ్డ కట్టిందని చెప్పేందుకు ఇంకా సరైన ఆధారాలు లేవని పేర్కొంది. ఇదే కారణం చూపిస్తూ.. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని ఆపేస్తున్నట్టు ఆస్ట్రియా ప్రకటించింది. లిథువేనియా, లాత్వియా, ఎస్టోనియా, ఐస్ ల్యాండ్ దేశాలు కూడా తరువాతి బ్యాచ్ ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ల వాడకాన్ని ఆపేశాయి. తాజాగా వ్యాక్సిన్ వాడకాన్ని నిలిపి వేస్తున్నట్టు డెన్మార్క్ కూడా ప్రకటించింది. ఇది ఇలా ఉండగా ఈ నెల 9వ తేదీకి యూరోపియన్ ఎకనామిక్ ఏరియాలో 30 లక్షల మందికి పైగా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు వేయాగా.. వీరిలో కొన్ని రక్తం గడ్డం కట్టిన కేసులు వచ్చాయి. దీంతో, ఈ వ్యాక్సిన్ వాడకం పై ప్రజలలో అనుమానాలు తలెత్తుతున్నాయి.            

అమ్మను కొట్టి చంపిన కొడుకు

మనుషుల్లో మానవత్వం నశిస్తోంది. మనిషన్న వాడు మాయమవుతున్నాడు. డబ్బు మీద అత్యాశతో దారుణాలకు తెగబడుతున్నాడు. ఆస్తి కోసం అమ్మను హింసించాడు ఓ దుర్మార్గుడు. రోజుల తరబడి చిత్ర హింసలకు గురిచేశాడు. సిగరెట్లతో ఆమె ఒంటిపై కాల్చాడు. చుట్టుపక్కలవారు అడ్డగిస్తే.. వారితోనూ గొడవ పడ్డాడు. కొడుకు దెబ్బలకు తాళలేక ఆ ముసలి తల్లి ప్రాణాలు విడిచింది. ఈ అమానుష ఘటన కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం, మిట్టపల్లెలో జరిగింది.  గ్రామంలో పుల్లమ్మ (60) పేరిట రెండు ఎకరాల పొలం ఉంది. ఆ భూమిని తనకు రాసివ్వాలంటూ ఆమె కొడుకు ప్రసాదరెడ్డి కొంత కాలంగా వేధిస్తున్నాడు. రోజూ మద్యం తాగి వచ్చి టార్చర్ చేసేవాడు. కొడుకును నమ్మని ఆ తల్లి.. పొలాన్ని కూతురు పేరిట రాసిచ్చింది. దీంతో అతడిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. తల్లిని కర్రలతో విచక్షణా రహితంగా కొట్టాడు. తల్లి శరీరంపై సిగరెట్లతో కాల్చాడు. దెబ్బలకు తాళలేక ఆమె ప్రాణాలు విడిచింది. తల్లి చనిపోయిందని తెలిసి ప్రసాదరెడ్డి ఇంట్లో నుంచి పారిపోయాడు. అత్తారింట్లో దాక్కున్నాడు. మరునాడు ఏమీ తెలీనట్టు అమాయకంగా ఇంటికొచ్చాడు. పోలీసుల దర్యాప్తులో కొడుకే కన్న తల్లిని కొట్టి చంపాడని తేలింది. ప్రసాదరెడ్డిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు పోలీసులు.  ఆస్తి కోసం అమ్మను చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ముసలి తల్లిని కర్రలతో దారుణంగా కొట్టడం.. సిగరెట్లతో కాల్చడం.. వాడిలోని పైశాచికత్వానికి నిదర్శనం. పొలం కోసం ఇంతటి దారుణానికి ఒడిగడతాడా? మ‌ృగంలా ప్రవర్తిస్తాడా? అంటూ విషయం తెలిసిన వారంతా అతడిని తిట్టిపోస్తున్నారు. క్రూరుడైన ఆ కొడుకును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉక్కుపై ఉగ్రరూపం.. కేటీఆర్‌తో రేవంత్, రాములమ్మ చెడుగుడు

విశాఖ ఉక్కు ఉద్యమానికి టీఆర్ఎస్ మద్దతు. అవసరమైతే తాను విశాఖ వెళ్లి ఉద్యమంలో పాల్గొంటానంటూ కేటీఆర్ స్టేట్‌మెంట్. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. కేటీఆర్ ఫోటోకు విశాఖలో ఉక్కు కార్మికులు పాలాభిషేకం చేస్తే.. తెలంగాణ నేతలు కేటీఆర్ కామెంట్స్ పై సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. కేటీఆర్ కు లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే దురుద్దేశంతో కేటీఆర్ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించారని ఎద్దేవా చేశారు. తాజాగా, బీజేపీ నేత విజయశాంతి సైతం కేటీఆర్ కామెంట్లపై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి కాస్త సాఫ్ట్ గా విమర్శిస్తే.. రాములమ్మ మాత్రం ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఆమె విసిరిన ఒక్కో బాణం.. కేటీఆర్ ఇమేజ్ ను ఫుల్ డ్యామేజ్ చేసేలా ఉన్నాయి.  అమ్మకు అన్నం పెట్టనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తున్నాడంటూ కేటీఆర్‌పై ఫేస్‌బుక్‌లో సెటైర్లు వేశారు విజయశాంతి. తెలంగాణలోని మూతపడిన నిజాం షుగర్స్, ఆజంజాహి మిల్స్, ఆల్విన్ కంపెనీ, ప్రాగా టూల్స్ కోసం ఉద్యమం చేయడం లేదేంటని నిగ్గదీసి అడిగారు. పనిలో పనిగా.. గతాన్ని కూడా తవ్విపోశారు రాములమ్మ. ‘‘అమ్మకు అన్నం పెట్టనోడు... పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడని.. తెలంగాణలో తరచుగా వినిపించే సామెత. సరిగ్గా టీఆర్ఎస్ నేతలు కూడా అదే బాటలో పయనిస్తున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతోంది. విశాఖపట్టణంలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై కేటీఆర్ స్పందిస్తూ అవసరమైతే అక్కడికెళ్ళి నేరుగా ఉద్యమంలో పాల్గొంటామంటూ కేంద్రంపై చిర్రుబుర్రులాడారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ కుటుంబం ఎలాంటి హామీలిచ్చిందో ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది. ఉమ్మడి రాష్ట్ర పాలకుల హయాంలో మూతపడిన తెలంగాణలోని నిజాం షుగర్స్, ఆజంజాహి మిల్స్, ఆల్విన్ కంపెనీ, ప్రాగా టూల్స్ లాంటి పలు కంపెనీలను వంద రోజుల్లో తెరిపించి ఉద్యోగాలు కల్పిస్తామని హామీలిచ్చారు. ఇప్పుడు మాటమాత్రంగానైనా వాటి ప్రస్తావన చెయ్యడం లేదు. ఇంతకీ ఇదంతా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్ల కోసం మాటలే తప్ప, ఈ దొర కుటుంబపు అసలు ధోరణి ఆంధ్ర ప్రాంత ప్రజలపై ఎంత అసభ్యకరంగా... అవమానించే ధోరణిలో... బూతు మాటలతో కూడి ఉంటుందో ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే, వీరి ప్రస్తుత ప్రకటనలను సమర్థిస్తున్న ఆయా నేతలు కొందరికి సరిగ్గా అర్థం అవుతుంది’’ అంటూ రాములమ్మ కామెంట్లు చేశారు.  ఇటు కాంగ్రెస్ నుంచి రేవంత్‌రెడ్డి.. అటు బీజేపీ నుంచి విజయశాంతి.. రెండు పార్టీలకు చెందిన ఇద్దరు ఫైర్ బ్రాండ్ లీడర్లు.. కేటీఆర్ ను విశాఖ ఉక్కుపై నిలదీయడంతో.. కేటీఆర్ స్టేట్‌మెంట్ వెనుక అసలు మతలబు ఏముంటుందనే అనుమానం పెరుగుతోంది. 

4 రోజులు వైన్స్ క్లోజ్.. బార్లు బంద్

అవును. మీరు చదివింది నిజమే. తెలంగాణలో మద్యం షాపులు బంద్. ఒకటి, రెండు కాదు.. వరుసగా మూడు రోజులు వైన్స్ క్లోజ్. ఆ తర్వాత మరో రోజు కూడా బంద్. అంటే, మొత్తం నాలుగు రోజులు వైన్స్ ఓపెన్ కావు. ఆరు జిల్లాల్లో లిక్కర్ షాపులన్నీ మూసివేయనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైన్ షాపులు బంద్ చేస్తుండటం మద్యం ప్రియులకు షాకింగ్ న్యూసే. ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైన్‌ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, క్లబ్బులు మూసివేయనున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాప్‌లు మూతపడనున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా జిల్లాల పరిధిలోని మద్యం దుకాణాలన్నీ మూసేయాలని ఆదేశాలు వచ్చాయి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు నేపథ్యంలో ఈ ఆరు జిల్లాల్లో మద్యం దుఖాణాలు బంద్ చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే మద్యం షాపులు మూతపడనున్నాయి. మళ్లీ మార్చి 14 ఆదివారం పోలింగ్ ముగిసిన తర్వాతే తెరుచుకుంటాయి. ఇక, ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే ఈనెల 17, బుధవారం రోజున కూడా వైన్ షాపులను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో, మందు బాబులు ముందే మద్యం కొనుగోలుకు ఆరాటపడుతున్నారు. 

రాజకీయ తెరపై.. సినీ వెలుగులు..

ఎన్నికల సమయంలో సెలబ్రిటీలు, ముఖ్యంగా, సినీరంగ ప్రముఖులను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ఆసక్తి చూపుతుంటాయి.కాషాయ దళం, బీజేపీలో అయితే ఈ ఆసక్తి కొంచెం చాలా ఎక్కువ కనిపిస్తుంది. అయితే, అలా ఎన్నికల సమయంలో ఎంట్రీ ఇచ్చిన సినీ ప్రముఖులలో చాలా వరకు వడపోతలో జారిపోతూనే ఉంటారు. కొద్దిరోజుల క్రితం, బెంగాలీ వృద్ధ నటుడు, మిదున్ చక్రవర్తి, ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో బీజేపీలో చేరారు. ఇప్పటికే రెండు పార్టీలు మారిన మిదున్ చక్రవర్తి, మూడవ పార్టీలో ఎంత కాలం ఉంటారో, ఈ వయసులో (70 ప్లస్) ఆయన పార్టీకి ఎలాంటి సేవలు అందిస్తారో ఏమో కానీ, ఆయన చేరికకు బీజీపీనే కాదు, మీడియా కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యతే ఇచ్చింది. మిధున్ చక్రవర్తి ఎంట్రీతో ఏవేవో జరిగిపోతాయని మీడియా ఊదర కొట్టింది. ఒక్క మిధున్ చక్రవర్తి మాత్రమే కాదు, ఇంకొందరు, హీరోలు, విలన్లు, హీరోయిన్లు, బుల్లి తెర బెంగాలీ నటీ నటులు అనేక మంది బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్’లో చేరారు. చేరుతూనే ఉన్నారు.  నిజానికి, కొద్ది కాలం క్రితం వరకు ‘బెంగాలీ సినీ/టీవీ ఇండస్ట్రీలో తృణమూల్’దే పైచేయిగా వుంది.ఇప్పటికే,ఇటు బెగాలీ సినిమాలలో,అటు బుల్లి తెరమీద రాణించిన మిమీ చక్రవర్తి, నుసారత్ జహాన్’ 2019 లోక్ సభ ఎన్నికల్లో గెలిచి, పార్లమెంట్’ సెలబ్రిటీ ఎంపీలుగా చక్రం తిప్పుతున్నారు. ఈ మధ్య కాలంలో కూడా దీపాంకర్ డే’సహా అనేక మంది బెంగాలీ నటులు తృణమూల్ తీర్ధం పుచ్చుకున్నారు.అలాగే, మిధున్ కంటే ముందే,యంగ్ హీరో యాష్ దాస్ గుప్తా, సౌమిలి ఘోష్, పాపియా అధికారి వంటి అనేక మంది బెంగాలీ నటీనటులు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.అంతే కాదు, బెగాలీ ఇండస్ట్రీలో రాజకీయ వివక్ష కూడా ఉందని, ప్రముఖ నటి అంజనా బసు ఆరోపించారు. బీజేపీకి మద్దతు ఇవ్వడం వలన తనను ఇండస్ట్రీ వెలివేసిందని, మంచి టీఆర్పీ రేటింగ్ ఉన్నా తన సీరియల్ ప్రసారాన్ని రాజకీయ వత్తిళ్ళ కారణంగా నిలిపి వేశారని ఆమె చెపుతున్నారు.  ఇదిలా ఉంటే సినిమా ప్రముఖులకు కండువాలు కప్పేందుకు, రాజకీయ నాయకులు కొంచెం దిగివచ్చి మరీ ప్రయత్నాలు సాగిస్తున్నారు.ఇటీవల సీనియర్ బీజేపీ నాయకుడు,అనిర్బంజన్ గంగోపాధ్యాయ ప్రముఖ హీరో ప్రోసెన్’జిత్ చటర్జీ’ని పార్టీలోకి ఆహ్వానించేందుకు మేళ తాళాలతో ఆయన ఇంటికి వెళ్లారు. అయితే, చటర్జీ రాజకీయాలలో చేరే ఆలోచన లేదని, సున్నితంగా  చెప్పి పంపారు అనుకోండి అది వేరే విషయం.ఇదిలా ఉంటే, మరో ప్రముఖ నటుడు,తృణమూల్ ఎమ్మెల్యే చిరాంజిత్ చక్రవర్తి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రెండుసార్లు ఎమ్మెల్ల్యేగా పనిచేసిం తర్వాత రాజకీయాలు తన వంటికి పడవని అర్థమైందని  ఆయనే చెప్పుకున్నారు. ఇక రాజకీయాలు,సినిమా రంగాలు ఒకటిగా  కలిసి పోయిన తమిళనాడులో పరిస్థితి ఏమిటో వేరే చెప్పనక్కర లేదు. అయితే చాలా చాలా సంవత్సరాల తర్వాత ప్రధాన ద్రవిడ పార్టీలు, డిఎంకే, అన్నా డిఎంకే ప్రత్యక్ష సినిమా లింకులు అంతగా లేని నాయకుల సారధ్యంలో ఎన్నికల బరిలో దిగుతున్నాయి.అయితే,చాలా కాలంగా రాజకీయాలలో ఉన్న విజయకాంత్, కొత్తగా అరంగేట్రం చేసిన కమల హసన్ వంటి వారి పక్క వాద్యపార్టీలు ఉన్నాయి. మరో వంక బీజేపీ తాతకు దగ్గులు నేర్పే పనిలో పడింది. సినిమా రంగ ప్రముఖలను ఆకట్టుకునేందుకు చాలా చాలా ప్రయత్నాలే చేసింది. కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలి అన్నట్లుగా, తమిళ మెగా స్టార్ రజనీకాంత్’ పై చాలా ఆశలు పెట్టుకుంది. కానీ కథ అడ్డం తిరిగింది.అయినా, తమిళ నాడులోనూ సినీ ప్రముఖు చాలామందే కమల దళంలో చేరారు.తాజాగా కొద్ది రోజుల క్రితం తమిళ హాస్య నటుడు సెంథిల్‌ బీజేపీలో చేరారు. గతంలో ఏఐఏడీఎంకే, ఆ తర్వాత టీటీవీ దినకరన్‌ ఏఎంఎంకేలోనూ ఆయన పని చేశారు.అంతకు ముందే, ఖుష్బూ కాంగ్రెస్’కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అలాగే, గౌతమి, రాధా రవి, నమిత, గంగై అమరన్‌, వి.శేఖర్‌ తదితరులు ఇప్పటికే బీజేపీలో చేరారు.  అయితే, ఒక్క బీజేపీలోనే కాదు, కాంగ్రెస్’లో ఇతర ప్రాంతీయ పార్టీలలోనూ అనేక, అగ్ర నటుడు అమితాబ్ నుంచి మన కోటా వరకు అనేక మంది సినిమా సెలబ్రిటీలు, చట్ట సభల మెట్టెక్కి కూడా, మళ్ళీ వెనక్కి వచ్చేశారు.అలా వచ్చిన వాళ్ళలో  మన తెలగు వెలుగులు ఉన్నారు. ఏకంగా  సొంత పార్టీలే పెట్టిన ఎన్టీఅర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, విజయశాంతి మంచో చెడో రాజకీయాల్లో కొంతవరకు నిలతొక్కు కున్నారు. అలాగే అలనాటి కొంగర జగ్గయ్య మొదలు మోహన్ బాబు, బాబు మోహన్ వరకు, ఈ మధ్యనే రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మురళీ మోహన్ వరకు, చట్ట సభల మెట్లెక్కి దిగి రాజకీయాల నుంచి తప్పుకున్నవారి  జాబితా కూడా చాలా ఎక్కువగానే ఉంది.

కారుతో ఢీకొట్టి.. మెడ కోసి.. కోటి కోసం టీచర్ మర్డర్ 

వారిద్దరికీ రెండు సంవత్సరాల పరిచయం. ఆ పరిచయం ఆర్థిక సంబంధాలుగా మారాయి. అంతే అవసరానికి  ఓ ప్రభుత్వ టీచర్ ఒక వ్యక్తికి కోటి రూపాయలు ఇచ్చాడు. తిరిగి డబ్బులు ఇవ్వమంటే తన పేరుమీద ఉన్న ల్యాండ్ రాసి ఇస్తాను అని బుకాయించాడు. చివరికి అప్పు ఇచ్చిన టీచర్ ప్రాణాలను తీశాడు.  మహబూబ్ నగర్ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. నిందితులు ఆయనను తొలుత కారుతో ఢీకొట్టి,  ఆపై కత్తితో మెడకోసి దారుణంగా చంపేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌లోని వైష్ణోదేవి కాలనీకి చెందిన నరహరి (40) ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఆయన భార్య అరుణకుమారి హన్వాడ మండలంలోని వేపూర్ జీహెచ్ఎంగా పనిచేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని మంథనికి చెందిన జగదీశ్ అలియాస్ జగన్‌ పదేళ్ల క్రితం రాజేంద్రనగర్  వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం నరహరికి ఆయనతో పరిచయం ఏర్పడింది. ఇది ఆర్థిక సంబంధాలకు దారితీసింది. ఈ క్రమంలో జగదీశ్‌కు దాదాపు కోటి రూపాయల వరకు నరహరి రుణంగా ఇచ్చాడు. డబ్బులు తిరిగి వెనక్కి ఇస్తానన్న సమయం మించిపోవడంతో జగదీశ్‌పై నరహరి ఒత్తిడి పెంచాడు. డబ్బుల గురించి అడిగేందుకు బుధవారం సాయంత్రం జగదీశ్ ఇంటికి నరహరి వెళ్లాడు. ఈ క్రమంలో రాత్రి 12 గంటల వరకు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో బాలానగర్‌లో తనకు ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయిస్తానని జగదీశ్ హామీ ఇవ్వడంతో శాంతించిన నరహరి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో స్థానిక భగీరథ కాలనీ సమీపంలో ఆయన బైక్‌ను ఓ కారు ఢీకొట్టింది. కిందపడిన నరహరి మెడను కత్తితో కోసి దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఢీకొట్టిన కారు వివరాల గురించి ఆరాతీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ కారు జగదీశ్‌దేనని తేలింది. నరహరిని కారులో వెంబడించి ఢీకొట్టి హతమార్చినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆయన భార్య అరుణకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

బెజవాడ మేయర్.. కాయ్ రాజా కాయ్..

విజయవాడ మేయర్ ఎవరు? ఇది మిలియన్ణ డాలర్ల ప్రశ్న. అందుకే, మేయర్ ఎవరనే దానిపై లక్షల్లో బెట్టింగ్ నడుస్తోంది. ఇటీవల విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. అన్ని పార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అంతర్గత కుమ్ములాటలు టీడీపీని కలవర పెడుతుంటే.. అమరావతి ఇష్యూతో అధికార పార్టీ బెదిరిపోతోంది. జనసేన తమ బలమెంతో పరీక్షించుకుంటోంది. మూడు పార్టీలకు గెలుపు ఓ సవాల్.  విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. పోరు హోరాహోరీ జరగడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. సందట్లో సడేమియాలా.. పందెంరాయుళ్లు రంగంలోకి దిగిపోయారు. కాయ్ రాజా కాయ్ అంటూ కాసులు కుమ్మరిస్తున్నారు. ఏ పార్టీ గెలుస్తుంది? మేయర్ సీటు ఎవరికి దక్కుతుంది? డివిజన్లలో ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది? ఇలా డివిజన్ల వారీగా.. నగర వ్యాప్తంగా బెట్టింగ్ జరుగుతోంది. టఫ్ ఫైట్ ఉన్న చోట్ల 50 లక్షల వరకూ బెట్టింగ్ జరుగుతోందని అంటున్నారు. పందెం విషయంలో టీడీపీ, వైసీపీ, జనసేన అనే తేడా లేకుండా అంతా కలిసిపోయారు. మనీ మేటర్ అయ్యేసరికి తమ పార్టీ అభ్యర్థిపై కాకుండా గెలిచే ఛాన్స్ ఉన్న కేండిడేట్ పైనే బెట్టింగ్ కడుతుండటం ఆసక్తికరం. కార్పొరేటర్లపైనా, మేయర్ పైనా వేరు వేరుగా బెట్టింగ్ నడుస్తోంది. ముఠాగా ఏర్పడి కొందరు పందాలు కాస్తుంటే.. వ్యక్తిగతంగా పక్క వారితో బెట్టింగ్ వేస్తున్న వారి మరికొందరు.  విజయవాడ కార్పొరేషన్‌లో 64 డివిజన్లకు ఎన్నికలు జరిగితే.. వీటిలో కొన్ని స్థానాల్లో పందాలు భారీగా జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో రిజల్ట్స్ రాబోతుండటంతో ఈలోగా బెట్టింగ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. పందెంరాయుళ్లతో పాటు బెజవాడ వాసుల్లో మేయర్ ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

కోహ్లీ స్వీట్ కిస్..  

టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచి క్రికెట్ ప్లేయర్ మాత్రమే కాదు రొమాంటిక్ ఫెలో అని మళ్ళీ అనిపించుకున్నాడు. విరాట్  ఓ అందమైన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. భార్య అనుష్క శర్మను కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ ఫొటోకు క్యాప్షన్‌గా లవ్ సింబల్‌ను జోడించాడు. కోహ్లీ, అనుష్క దంపతులు ఇటీవలె తల్లిదండ్రులుగా మారిన సంగతి తెలిసిందే. జనవరిలో అనుష్క పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి వామిక అని విరుష్క జోడీ నామకరణం చేసింది.  శుక్రవారం నుంచి ఇండియా ఇంగ్లండ్ మధ్య ‌ ఐదు టీ-20ల సిరీస్. ఇటీవల టెస్ట్ సిరీస్ గెలిచి కదనోత్సాహంతో ఉన్న టీమిండియా టీ-20 సిరీస్‌ను చేజిక్కించుకోవాలని ఊవిళ్లూరుతోంది. ఈ రోజు సాయంత్రం మొతేరా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగబోతోంది.  

టీఆర్ఎస్ నేత ఫాంహౌజ్ లో రేవ్ పార్టీ

యాదాద్రి భువనగిరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేగింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం గ్రామ శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జరిగింది.  ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్‌వోటీ పోలీసులు రంగంలోకి రేవ్ పార్టీని భగ్నం చేశారు. 99 మంది యువకులు, మహిళలు పట్టుపడ్డారు. పట్టుబడిన వారంతా ఇంజనీరింగ్ విద్యార్థులేనని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి వచ్చి రేవ్ పార్టీలో పాల్గొన్నారని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రేవ్ పార్టీ జరిగిన ఫాంహౌజ్ స్థానిక టీఆర్ఎస్ నేత జక్కిడి ధన్వంత రెడ్డిగా గుర్తించారు. ధన్వంత రెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి.. రేవ్ పార్టీని నిర్వహించారని, అతని స్నేహితుడు గిరీష్ పార్టీని కో ఆర్డీనేట్ చేశారని చెబుతున్నారు. రేవ్ పార్టీ కోసం భారీగా మద్యంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకువచ్చారని తెలుస్తోంది. గంజాయి కూడా లభ్యమైందని స్థానికులు చెబుతున్నారు. పెద్ద ఎత్తున డీజేలు పెట్టుకుని డ్యాన్సులు చేస్తుండటంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రేవ్ పార్టీ జరిగిన ఫాంహౌజ్ ఓవర్ ధన్వంత రెడ్డి.. మునుగోడు టీఆర్ఎస్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ప్రధాన అనుచరుడని చెబుతున్నారు. రియల్టర్ గా ఉన్న ధన్వంత రెడ్డి... కూసుకుంట్ల రాజకీయ వ్యవహారాల్లో కీలకంగాా ఉంటారని సమాచారం. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే క్యాంప్ నిర్వహించారని, అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే రేవ్ పార్టీ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.   

కాళ్లు పట్టుకుంటేనే వైసీపీలో చేరా! రఘురామ రచ్చబండ 

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు, అధికార పార్టీ నేతల మద్య మాటల యుద్ధం సాగుతోంది. సీఎం జగన్ పై సొంత పార్టీలోనే కుట్ర జరుగుతుందని, జగన్ జైలుకు వెళ్తే ముఖ్యమంత్రి కావాలని మంత్రి పెద్దిరెడ్డి కోరుకుంటున్నారని రఘురామ కృష్ణం రాజు కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపాయి. దీంతో రఘురామకు కౌంటరిచ్చిన మంత్రి పెద్ది రెడ్డి... తీవ్రంగా విరుచుకుపడ్డారు. రఘురామను దున్నపోతుతో పోల్చారు. చంద్రబాబుకు బంట్రోతులా వ్యవహరిస్తున్నారని పెద్ది రెడ్డి మండిపడ్డారు. కార్పొరేటర్ గా గెలవలేని వ్యక్తి.. జగన్ దయతో ఎంపీ అయ్యారని చెప్పారు. రఘురామకు సిగ్గుంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాలు విసిరారు పెద్దిరెడ్డి.  మంత్రి పెద్దిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు రఘురామ కృష్ణం రాజు. తన కాళ్లు పట్టుకుని బతిమాలిడితేనే తాను వైసీపీలో చేరానని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి సవాలును స్వీకరిస్తున్నట్టు చెప్పిన ఆయన.. తాను రాజీనామా చేసి మళ్లీ పోటీచేసి గెలిస్తే జగన్ తన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి మళ్లీ పోటీకి దిగాలని, తన ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలని అన్నారు. ఆయన సవాలును తాను స్వీరిస్తున్నానని, అయితే,  తాను విసిరే ఈ సవాలును కూడా స్వీకరించాలని రఘురామ ప్రతి సవాల్ విసిరారు. ‘నేను కనుక సీఎం అయితే’ అన్న మాటల వెనక ఉన్న ఉద్దేశం ఏమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మీ సీఎం అసమర్థుడు, చేతకానివాడు అనేదే ఆ మాటల వెనక ఉన్న ఉద్దేశమా? అని ప్రశ్నించారు. తాను చంద్రబాబుకు బంట్రోతుగా ఉండాల్సిన అవసరం లేదని, రాజకీయంగా చంద్రబాబు తనకు ఉన్నత స్థానం ఇచ్చారని రఘురామ అన్నారు. చంద్రబాబును విమర్శించే స్థాయి నీది కాదని తెలుసుకోవాలని పెద్దిరెడ్డికి హితవు పలికారు. తానెప్పుడూ సీఎం జగన్‌ను విమర్శించలేదని, ఆయన ప్రభుత్వ విధానాలను, తప్పు చేస్తున్న వారిని మాత్రమే విమర్శించానని అన్నారు. ఇసుక ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావో అందరికీ తెలుసని పెద్దిరెడ్డిపై రఘురామ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  

పదేండ్లు సీఎం.. ఆస్తి 16 లక్షలు!

పదేండ్లుగా ముఖ్యమంత్రి.. రెండు సార్లు కేంద్ర మంత్రి.. పశ్చిమ బెంగాల్ లో మూడోసారి అధికారం కోసం పోరాడుతున్న మమతా బెనర్జీ మొత్తం ఆస్తి ఎంతో తెలుసా... రూ. 16. 73 లక్షలు. అక్షరాలు 16 లక్షల 73 వేల రూపాయలు మాత్రమే. మమతా బెనర్జీకి సొంత వాహనం కూడా లేదు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి పుర్బా మేదినీపూర్‌ జిల్లాలోని నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న మమతా బెనర్డీ.. నామినేషన్ సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తన నికర ఆస్తుల విలువను రూ. 16.72 లక్షలుగా తెలిపారు. అలాగే తనకు సొంత వాహనం కూడా లేదని అఫిడవిట్‌లో ఆమె వెల్లడించారు.  ఎన్నికల సంఘానికి మమతా బెనర్జీ  సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. 66 ఏళ్ల మమత వద్ద ఉన్న మొత్తం చరాస్తుల విలువ రూ. 16.72 లక్షలు. 2016 ఎన్నికలకు ముందు వీటి విలువ రూ. 30.45 లక్షలు మాత్రమే. అలాగే, 2019-20లో రూ. 10,34,370 ఆదాయం వచ్చింది. రూ. 69,255 నగదు ఆమె వద్ద ఉంది. మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 13.53 లక్షలు. ఇందులో ఆమె ఎన్నికల ఖర్చుకు సంబంధించిన రూ. 1.51 లక్షలు కూడా ఉంది.జాతీయ పొదుపు సర్టిఫికెట్ లో రూ. 18,490 డిపాజిట్ చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను టీడీఎస్ రూపంలో రూ. 1.85 లక్షలు రావాల్సి ఉందని అఫిడవిట్‌లో మమత పేర్కొన్నారు.  రూ. 43,837 విలువైన 9 గ్రాముల బంగారం కూడా దీదీ వద్ద ఉంది. తన పుస్తకాలపై 2019-20లో రూ. 930 రాయల్టీగా వచ్చినట్టు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో మమత వివరించారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగులో లేవని, కలకత్తా యూనివర్సిటీ నుంచి ఎంఏ చేశానని,  ఎల్ఎల్‌బీ కూడా చేశానని మమత వివరించారు. 

మహారాష్ట్రలో కరోనా పంజా! నాగపూర్ లో లాక్ డౌన్

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. కొత్త కేసులు మళ్లీ పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో బుధవారం ఒక్క రోజే  13,659 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇది 60 శాతం. దేశంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న 10 నగరాల్లో 8 మహారాష్ట్రలో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. పూణె, నాగ్ పూర్, థానే, ముంబై, అమరావతి, జల్ గావ్, నాశిక్, ఔరంగాబాద్ నగరాల్లో కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. నాగ్ పూర్ లో గత 24 గంటల్లో 1800 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.కరోనా తీవ్రత పెరగడంతో మార్చ్ 15 నుంచి 21 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టు మహా ప్రభుత్వం ప్రకటించింది.  రాబోయే రోజుల్లో మరిన్ని జిల్లాల్లో లాక్ డౌన్ విధించే అవకాశాలు లేకపోలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చెప్పారు.  మహారాష్ట్రలో కేసుల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న తరుణంలో మహారాష్ట్రలో కొత్త కేసులు మళ్లీ పెరుగుతుండటంపై కేంద్రం తీవ్రంగా ఆందోళన చెందుతోందని నీతిఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు.మన దేశం కోవిడ్ రహితంగా ఉండాలంటే... ప్రతి ఒక్కరూ వైరస్ ను సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు. నాగ్ పూర్ లో మళ్లీ లాక్ డౌన్ విధించాలనుకోవడం పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తోందని పాల్ చెప్పారు. మళ్లీ సీరియస్ లాక్ డౌన్ నాటి పరిస్థితులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిణామాల నుంచి మనం రెండు విషయాలను నేర్చుకోవాలని... వైరస్ ను తేలికగా తీసుకోకూడదనేది తొలి విషయమని, కరోనా రహితంగా దేశం తయారు కావాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలనేది రెండో విషయమని వీకే పాల్ తెలిపారు.