ప్రేమ జంట పై స్థానికులు అటాక్ ..

ప్రేమ పక్షులకు అక్కడ ఇక్కడ అని సంబంధం లేదు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటూ.. కాలయాపన చేస్తుంటారు.. ప్రేమ పక్షుల  కాలాయపాల చుట్టూ పక్కల ఉన్న వారికీ ఇబ్బంది అనిపించింది.. పక్క వాళ్ళు చూస్తారు అన్న భయం కూడా లేకుండా వారి పనుల్లో వాళ్ళు ఉంటారు.. వారి ప్రవర్తన పై కోపం వచ్చిన స్థానికులు వారిని మందలించారు..  షాప్ వద్ద కూర్చొని మాట్లాడుకుంటున్న ఒక జంటను కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేశారు. ప్రణాళిక ప్రకారం వారిపై దాడికి పాల్పడ్డారు. అయితే యువకుడు వారి నుంచి తప్పించుకొని పారిపోయాడు. కానీ పట్టుబడిన యువతిని దారుణంగా హింసించారు. ముఖానికి కట్టుకున్న స్కార్ఫ్‌ను బలవతంగా తొలగించారు. ఆమె దుప్పట్టా తీసివేసి ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. తాజాగా బయటకు వచ్చిన ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీంతో దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక యువతి తన స్నేహితుడితో కలిసి ఏకాంత ప్రదేశంలో కూర్చుని మాట్లాడుతుండగా.. కొంతమంది స్థానిక యువకులు గమనించారు. గుంపుగా వారి వద్దకు వెళ్లి బెదిరించడంతో యువకుడు పారిపోయాడు. అనంతరం యువతిపై వేధింపులకు పాల్పడ్డారు. ఆమెను దుర్భాషలాడుతూ దుప్పట్టాతో ఈడ్చుకెళ్లినట్టు వీడియోలో కనిపిస్తోంది. భయంతో కేకలు వేస్తూ రోధిస్తున్నా ఆమెను వదల్లేదు. స్థానికులు ఎవరూ ఆమెను కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు. ఏకాంత ప్రదేశానికి ఒక యువకుడితో వెళ్లినందుకు ఆమెపై ఒక వర్గం వ్యక్తులు దాడి చేశారని స్థానికులు తెలిపారు.ఈ ఘటన గత వారం రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో చోటుచేసుకుంది. దీని బట్టి ప్రేమికులు అర్థం చేస్కుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకోవడం.. కలుసుకోవడం ఈ రోజుల్లో మంచిది కాదు.. సో మీరు జాగ్రత్తగా ఉండండి.. 

గెలుపు.. బలుపు! చంద్రబాబు టార్గెట్ అందుకేనా?

ఆదివారం మున్సిపల్ ఫలితాలు. వైసీపీ ఘన విజయం. విజయవాడ, గుంటూరు, విశాఖలోనూ అనూహ్య గెలుపు. మంగళవారం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నోటీసులు. పోలా.. అర్థమై పోలా? కేసు ఎందుకు పెట్టారో.. చంద్రబాబును ఎందుకు టార్గెట్ చేశారో తెలిసిపోలా? అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. స్థానిక సంస్థలు గంపగుత్తగా వైసీపీ ఖాతాలో పడటంతో రాష్ట్రంలో తమకిక తిరుగులేదనే అహంకారంతో విర్రవీగుతోంది జగన్ సర్కారు అనేది టీడీపీ ఆరోపణ.  అమరావతి ఆగ్రహం విజయవాడలో అధికారపార్టీని దహించి వేస్తుందని అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. నయానో, భయానో.. బెజవాడపైనా వైసీసీ జెండా ఎగరడం.. పక్కనే ఉన్న గుంటూరు సైతం అధికార పార్టీ హస్తగతమవడంతో జగన్ రెడ్డి సర్కారులో సమరోత్సాహం పెరిగింది. వెయ్యి ఏనుగుల బలంతో చంద్రబాబును అణగదొక్కాలని ప్రయత్నిస్తోంది. అందుకే, విపక్ష నేత చంద్రబాబు టార్గెట్ గా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని అంటున్నారు. చరిత్రలో తొలిసారి ఓ మాజీ ముఖ్యమంత్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం వైసీపీ సర్కారు ఓవరాక్షన్ కు నిదర్శనం అని విమర్శిస్తున్నారు.  విభజన ఆంధ్రప్రదేశ్‌ను సన్‌రైజ్ స్టేట్‌ దిశగా నడిపించడం.. ఏపీ కేపిటల్‌గా అమరావతిని అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం.. ఇదే చంద్రబాబు చేసిన నేరం. అందుకు ఫలితమే ప్రతిపక్ష నేతకు నోటీసులు. ఏ అమరావతి కోసమైతే చంద్రబాబు అంత తాపత్రయ పడ్డారో.. ఆ కలల రాజధానిని కాలరాసి.. చరిత్రలో చంద్రబాబు పేరు లేకుండా చేసే ప్రయత్నమే ఇదంతా అనేది టీడీపీ మాట. ఇప్పటికే అమరావతిని మరుగున పడేశారు.. ఇప్పుడిక చంద్రబాబు పని పడుతున్నారు. ఎలాంటి ఆరోపణలు  లేకుండా ఐదేళ్లు సుపరిపాలన అందించిన చంద్రబాబును ఎలాగైనా ఏదో ఒక కేసులో ఇరికించి.. ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో కేసు క్రియేట్ చేసి.. ఆ ఉచ్చును చంద్రబాబు మెడకు బిగించాలని చూస్తున్నారని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో గుడ్డు మీద ఈకలు పీకి.. బలవంతపు కేసులు పెట్టడం.. వైసీపీ చేస్తున్న ప్రతీకార చర్యని.. అచ్చెంనాయుడు నుంచి వర్ల రామయ్య వరకూ.. టీడీపీ నేతలంతా ముక్తకంఠంతో మండిపడుతున్నారు.  ఎన్నికల్లో గెలిచామనే జోష్‌తో.. ప్రజాబలం తమకే ఉందనే భ్రమలో ఉంది వైసీసీ సర్కారు. స్థానికం ఎంతలా రణక్షేత్రంగా మారిందో.. ఎలా ఏకగ్రీవాలు అయ్యాయో.. ఎలా బెదిరింపులు, డబ్బు పంపిణీ జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ గెలుపు బలుపు కాదని కేవలం వాపు మాత్రమేననేది టీడీపీ వాదన. ఎన్నికల ఫలితాలతో వైసీపీ సర్కారు కళ్లు నెత్తికెక్కాయని.. అందుకే చంద్రబాబుకు అమరావతి భూముల కేసులో నోటీసులు ఇచ్చారనేది తమ్ముళ్ల ఆగ్రహం. ఈ కేసుపై గతంలోనే హైకోర్టులో విచారణ జరగ్గా.. అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో చంద్రబాబుకు సంబంధం లేదని ఉన్నత న్యాయస్థానం కూడా తేల్చేసింది. అయినా.. పాత కేసును మరింత తవ్వి.. ఆ దుమ్మంతా చంద్రబాబుపై ఎత్తిపోసే ప్రయత్నం జరుగుతోందని టీడీపీ మండిపడుతోంది. ఇక సంబంధంలేని ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి.. ప్రతిపక్ష నేతను భయబ్రాంతులకు గురి చేయాలనుకోవడం వైసీపీ సర్కారు దిగజారుడుతనమే అంటున్నారు. ఇదంతా స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావమేనని.. ఆ వాపును చూసి బలుపు అనుకునే ప్రభుత్వం ఇలా బరితెగిస్తోందనేది టీడీపీ వర్షన్.

మహారాష్ట్రలో ప్రతి ఒక్కరికి వెంటనే వ్యాక్సిన్ ఇవ్వండి...

కొద్ది రోజుల క్రితం వరకు దేశంలో తగ్గుతూ వస్తున్న కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి.  తాజాగా నమోదవుతున్న పాజిటీవ్ కేసులలో ఎక్కువ భాగం మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా 15 వేలకు తగ్గకుండా పాజిటీవ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ఈ నేసథ్యంలో మహారాష్ట్రలో తాజా పరిస్థితులపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తన ఆందోళన వ్యక్తం చేసారు. .    దేశంలోని ఆర్థిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రమైన మహారాష్ట్రలోని కోరుకున్న ప్రతి ఒక్కరికి  కోవిడ్ వ్యాక్సిన్ అందించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు, ప్రస్తుతం  దేశంలో ప్రతిరోజు నమోదవుతున్న కేసుల్లో సగం పైగా ఆ రాష్ట్రం నుంచే నమోదవుతున్నా విషయాన్నీ అయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో మళ్ళీ లాక్ డౌన్ వంటి చర్యలు చేపడితే.. దేశ ఆర్ధిక పరిస్థితి దెబ్బ తినే ప్రమాదముందని అయన పేర్కొన్నారు. దీంతో ఈ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని.. రాష్ట్రంలోని పౌరులందరికీ వ్యాక్సిన్లు అందించేలా రాష్ట్ర ప్రభుత్వానికి అత్యవసర అనుమతులు ఇవ్వాలని కోరారు. అదేసమయంలో వ్యాక్సిన్ల కొరత కూడా ఉండకూడదని  ఆనంద్ ట్వీట్ చేశారు. అయన తన ట్వీట్ లో ప్రధానమంత్రి కార్యాలయాన్ని, అలాగే కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి హర్షవర్ధన్ ను కూడా ట్యాగ్ చేశారు. ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్‌కు ఒక నెటిజన్ స్పందిస్తూ.. కేవలం వ్యాక్సినేషన్ ఒక్కటే పెంచితే సరిపోదు. సమాంతరంగా కరోనా పరీక్షలు, ట్రేసింగ్, మెరుగైన చికిత్స కూడా అందాలి. ఇంకా ప్రజలు కూడా క్రమశిక్షణతో మెలగాలని రిప్లై ఇచ్చాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన ఆనంద్  మహీంద్రా... "అవును.. నేను మీతో అంగీకరిస్తున్నాను. అయితే, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయకపోతే మనం రెండు, మూడు, నాలుగు దశల కరోనా వ్యాప్తితో తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంద"ని ఆందోళన వ్యక్తం చేశారు.  

అమరావతి కథ తేలుస్తాం.. మంత్రి కొడాలి హాట్ కామెంట్స్ 

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడం ఏపీలో సంచలనంగా మారింది. చంద్రబాబుకు నోటీసులివ్వడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఈ నోటీసులు, టీడీపీ నేతల విమర్శలపై మంత్రి కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. అమరావతిలో దళితులను మోసం చేసేలా చంద్రబాబు అండ్ కో భారీ భూ స్కాంలు చేశారని సంచలన ఆరోపణలు చేశారు.సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన ఏకపక్ష జీఓలతో, దళిత వర్గాలను మోసం చేశారని నాని వ్యాఖ్యానించారు. అమరావతిలో అసైన్మెంట్ భూముల హక్కు దారులైన దళిత వర్గాలను బెదిరించి, మోసపూరిత ప్రచారాలు చేసి, నామమాత్ర ధర చెల్లించి, అక్రమ జీవోల ద్వారా చంద్రబాబు బ్యాచ్ కోట్లు కాజేశారని నాని ఆరోపించారు. దళిత వర్గాలను మోసం చేసిన చంద్రబాబు అండ్ కో పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాలన్నారు. అక్రమ మార్గాల్లో భూములు కాజేసిన పలువురికి ఇప్పటికే 41సీ నోటీసులు జారీ చేశారు.. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు చేసిన స్కాం లకు సీఐడీ నోటీసులు ఇస్తే తప్పేంటి..?’ అని కొడాలి నాని ప్రశ్నించారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై ఏమనుకున్నా, దళిత వర్గాలకు చెందిన వందలాది కోట్లు కాజేసిన చంద్రబాబుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కొడాలి అన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ ఫాలో అవుతూ కుమ్మక్కు రాజకీయాలు చేసే ప్రతిపక్షాలకంటే.. తమకు దళిత వర్గాల ప్రయోజనాలే ముఖ్యమన్నారు మంత్రి. ప్రజలను మోసం చేసిన చంద్రబాబు సీఐడీ, కోర్టులకు జవాబు చెప్పాలన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలకు న్యాయం చేయడమే ముఖ్యం. దళితులకు న్యాయం చేసేలా చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని సీఐడీని మంత్రి కొడాలి నాని కోరారు. 

పైసా వసూల్.. పైసా కొట్టు.. కొట్టు నడుపు  

సంపాదించే వాడు ఒకడైతే ఆ సంపదను అనుభవించే వాడు మరొకడు.. కలోగంజి కోసం కొందరు చిరు వ్యాపారాలు చేసుకుంటూ.. తల్లిదండ్రుల మందులు.. పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులు ఎల్లదీస్తు ఏదో జీవనం కొనసాగిస్తుంటే.. చిరువ్యాపారులు మాంసపు ముద్దలను గడ్డలా ఎత్తుకు పోతున్నారు.. పోలీసులు, ఆయా ఏరియాలో పలుకుబడి ఉన్న మంది. అదేంటి అలాంటి సీన్లు సినిమాలో కదా ఉండేది అనుకుంటున్నారా.. ఈ దునియాలో  అలా బతికేవాళ్లు చాలా మందే ఉన్నారు. పోలీసులు హైదరాబాద్ లో ఎప్పటి నుంచో చిరువ్యాపారులు దగ్గర వసూల్ చేస్తున్న పద్ధతి ఇప్పుడు  ట్రెండ్ మారింది.. పోలీసులు లే కాదు మాములు వాసులు చేసేది ఆ ఏరియాలో అంతో ఇంతో పలుకుబడి ఉన్న వాడు కూడా మాములు వసూల్ చేస్తున్నారు.. వ్యాపారం చేసుకో! రోజూ రూ.200.. రాత్రి పది దాటితే రూ.500ల పైనే   చిరువ్యాపారుల నుంచి వసూళ్ల దందా       వేసవి కాలం వచ్చిందంటే కొబ్బరి బోండాలు, సోడా బండ్లు, చెరుకు రసాలు, పళ్ల రసాల కొట్లు.. ఇలా వందల్లో దుకాణాలు ప్రధాన రహదారుల పక్కన వెలుస్తుంటాయి. ఇతర వ్యాపారాలు, ఉద్యోగాలూ వదిలి ఈ సీజన్‌ మొత్తం వీటిమీదే బతికేవాళ్లు వేల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు వీరినే లక్ష్యంగా దోచేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ఇక్కడ వ్యాపారం నడవాలంటే రోజూ వీరి చేతులు తడపాల్సిందే. సర్కారు ఖాళీ స్థలాల్ని సైతం తమ సొంత జాగాగా చెప్పుకుంటూ వసూళ్లకు పాల్పడుతున్న వారు కొందరైతే.. ఫుట్‌పాత్‌ మీదా, రోడ్డు పక్కన వ్యాపారం నడవాలంటే డబ్బులు కట్టాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్న వారిలో కొందరు పోలీసులు, బల్దియా సిబ్బంది ఉండటం గమనార్హం. మరోవైపు రాత్రి 10 గంటలు దాటిందంటే ఆ తర్వాత కొట్టు తెరిచి ఉండాలంటే నిర్వాహకుల నుంచి రూ.500 నుంచి ఆపైన వసూలు చేస్తున్నారు కొందరు పెట్రోలింగ్‌ సిబ్బంది.     గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి వెనకాల గల్లీలో ఓ నివాసం. ఆ ఇంటిని ఆనుకుని రోడ్డు పక్కన నెలరోజుల నుంచి చెరుకు రసం బండి నడుపుతున్నారు ఓ మహిళ. గతంలో పేట్‌బషీరాబాద్‌లో ఇదే వ్యాపారంలో ఉన్న ఆమె ఇక్కడ ఖాళీ స్థలం ఉందని తెలిసి బండి పెట్టుకున్నారు. అయితే పక్కనే ఉన్న ఇంటి యజమాని ఆమె నుంచి నిత్యం రూ.100 వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఆ స్థలం తనదేనని చెబుతున్నాడని.. ఖర్చులు పోనూ రోజూ రూ.200 మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారా మహిళా వ్యాపారి.     బేగంపేట ప్రధాన రహదారి పక్కన ఓ పండ్ల రసం కొట్టు. ఆ వ్యాపారితో పాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలకు జీవనాధారం ఇదే కొట్టు. ప్రతిరోజూ ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ తన వద్దకు రావడం రూ.100 నుంచి రూ.200 దాకా అడుక్కెళ్లటం మామూలుగా మారింది. రోజూ వచ్చిన సంపాదనలో మిగిలేది రూ.300 నుంచి రూ.400. అందులో పెద్దమొత్తం ఆ కానిస్టేబుల్‌ తీసుకెళ్లడంతో భారంగా ఉందని వాపోతున్నాడా చిరువ్యాపారి. ఇదేంటని అడిగితే ఇవ్వకపోతే ఇక్కడి నుంచి బండి తీసేయిస్తారని చెప్పడం గమనార్హం.      కేపీహెచ్‌బీ ప్రధాన రహదారిపై ఓ టీ కొట్టు. రాత్రి 10 దాటితే  ఓ పెట్రోలింగ్‌ వాహనం సైరన్‌ వేసుకుని వచ్చి కొంచెం దూరంలో ఆగుతుంది. టీకొట్టు నిర్వాహకుడు ఓ పేపర్లో రూ.200 నుంచి రూ.500 వరకు పెట్టి తీసుకెళ్లి గుట్టుగా ఆ వాహనంలో ఇచ్చేసి వస్తాడు. ఇదే తంతు ఇక్కడ ప్రతిరోజూ దాదాపు ప్రతి దుకాణంలోనూ జరుగుతోంది. నైట్ డ్యూటీ తో పాటు వ్యాపారులను లూటీ     నగరంలో పలు టీకొట్లు, హోటళ్లు, పాన్‌షాపుల వద్ద రాత్రికాగానే ఓ వాహనం వచ్చి ఆగుతుంది. ఓ పోలీస్‌ దిగి చేతిలో ఉన్న ట్యాబ్‌తో ఫొటోలు తీస్తారు. బేరం కుదిరితే సరి లేకుంటే బండెక్కిస్తారు. ఇదే తంతు ప్రతిరోజూ నగరంలో చాలాచోట్ల జరుగుతోంది. ఎర్రగడ్డ నుంచి మొదలుకుని కేపీహెచ్‌బీ మెట్రో వరకూ ప్రధాన రహదారిపై ఉన్న దాదాపుగా అన్ని చిరువ్యాపార కేంద్రాల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల వెస్ట్‌జోన్‌ పరిధిలో రాత్రి పెట్రోలింగ్‌ పోలీసులు కొందరు గూగుల్‌పే ద్వారా మామూళ్లు వసూలు చేయడంపై ఫిర్యాదులు రావడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.  అడుక్కునే వాడే నయం అనిపించేలా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు, ఆకు రౌడీల వ్యవహారం.. ఎవరైనా తప్పుచేస్తే పోలీసులకు కంప్లీట్ చేస్తాం పోలీసులే ఇలాంటి దారుణాలకు  పాలుపడుతుంటే తాము ఎవరికి చెప్పుకోవాలని చిరువ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.       

విశాఖకు ఆరుగురు డిప్యూటీ మేయర్లు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించడం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారు ఉన్నారు... స్వాగతించిన వారు ఉన్నారు. తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదనతో మరో సంచలనానికి తెర తీశారు జగన్. మూడు రాజధానుల ప్రతిపాదనపై వివాదం ఇంకా కొనసాగుతోంది. తాజాగా సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.  విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో నెగ్గిన వైసీపీ అధిష్టానం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోందని.. ఉప ముఖ్యమంత్రుల ఫార్ములాను విశాఖ కార్పోరేషన్ విషయంలోనూ అమలు పర్చే దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.  అన్ని కార్పొరేషన్ల మాదిరిగానే విశాఖకు ఒక మేయర్ ఉంటారు. కానీ డిప్యూటీ మేయర్ల విషయంలో మాత్రం కొత్తగా ఆలోచిస్తున్నారట జగన్. విశాఖ మేయర్ పదవి బీసీ జనరల్ కు రిజర్వ్ అయ్యింది. అయితే మేయర్ పదవిని బీసీ జనరల్ కు కాకుండా.. బీసీ మహిళకు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.  విశాఖ కార్పొరేషన్ లో 8 నియోజకవర్గాలు ఉన్నాయి. విశాఖ తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తరతో పాటు గాజువాక, అనకాపల్లి, పెందుర్తి, భీమిలి ఉన్నాయి.  ప్రతీ నియోజకవర్గానికి ఒక డిప్యూటీ మేయర్ ని నియమించాలని జగన్ ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. అయితే అన్ని నియోజకవర్గాలు అంటే సంఖ్య మరీ భారీగా అవుతుందనే ఆలోచనతో నలుగురు లేదా ఆరుగురు డిప్యూటీ మేయర్లను నియమించే అవకాశం ఉందని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సామాజికవర్గం కోణం నుంచే కాకుండా పాలనాపరంగా కూడా ఇది కొత్త విధానం అవుతుందని భావిస్తున్నట్టు సమాచారం.చదువుకున్న వారు, మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని కూడా తెలుస్తోంది. అలాంటి నిర్ణయం తీసుకుంటే విశాఖ కార్పొరేషన్ ఏపీ రాజకీయ చరిత్రలో కొత్తగా నిలవనుంది.  జగన్ ఆలోచనకు చాలానే కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. జీవీఎంసీలో మొత్తం 98 డివిజన్లు ఉన్నాయి. వైసీపీకి చెందిన అభ్యర్థులు 58 మంది గెలుపొందారు. వీరిలో ఆశావాహులు చాలామంది ఉన్నారు. మేయర్‌ పదవి బీసీ జనరల్‌కు రిజర్వు అయినా.. మహిళకే మేయర్ పదవి ఇస్తారనే ప్రచారం ఉంది. దీంతో మిగిలిన ఆశావాహుల నుంచి వ్యతిరేకత ఎదురవ్వకుండా ఉండేందుకు ఎక్కువమంది డిప్యూటీ మేయర్ల ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది.  టీడీపీని బలహీన పర్చాలి అంటే బీసీ ఓటర్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వడమన్నది రెండో లక్ష్యం. ఇతర నగరాలతో పోల్చుకుంటే విశాఖలో టీడీపీకి మంచి పట్టు ఉంది. తాజాగా గ్రేటర్ విశాఖ ఎన్నికల్లోనూ మరోసారి అది రుజువు అయ్యింది.  అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విశాఖలో నాలుగు అసెంబ్లీ స్థానాలు నెగ్గగా.. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి బాగానే ఓట్లు పడ్డాయి. 30 స్థానాలను సొంతం చేసుకుంది. టీడీపీ మద్దతుతో మరో ఇద్దరు గెలిచారు. ఇక వైసీపీ నెగ్గిన చోట కూడా అత్యల్ప ఓట్లతోనే విజయం సాధించిన డివిజన్లు ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం విశాఖలో  బలంగా ఉండే  బీసీ సామాజిక వర్గం టీడీపీకి అండగా  ఉండటమే అంటున్నారు.  అందుకో బీసీ సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి టీడీపీ పూర్తిగా దెబ్బ కొట్టాలి అంటే బీసీ ఓటర్లను ఆకర్షించుకోవాలన్నది వైసీపీ వ్యూహాంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆరుగురు డిప్యూటీ మేయర్ల అంశం తెరపైకి తెచ్చారని తెలుస్తోంది. 

ఆ దేశం అప్పు 45 లక్షల కోట్లు.. ఒక్కొక్కరిపై లక్షా 75 వేలు 

ఉగ్రవాదులకు అడ్డాగా చెప్పుకునే పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ దేశం అప్పుల ఊబిలో మునిగిపోయింది. పాకిస్థాన్ మెడపై ఆర్థిక సంక్షోభం కత్తి వేలాడుతోంది. 2019 డిసెంబర్ నాటికి పాకిస్థాన్ అప్పులు 40.94 ట్రిలియన్ రూపాయలుగా ఉన్నాయి. ఈ సంవత్సరం గడువు లోనే పాకిస్థాన్ అప్పులు 45 ట్రిలియన్లకు పెరగనున్నాయి. అంటే పాకిస్తాన్ అప్పు 45 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. ఇవి పాకిస్థాన్ సెంట్రల్ బ్యాంక్ వెల్లడించిన వివరాలివి. పాకిస్థాన్ ఆర్థిక శాఖ రిపోర్ట్ కూడా దీన్ని బలపర్చింది. తాజాగా పార్లమెంట్ లో ఆ దేశ ఆర్థిక మంత్రి దేశానికి ఉన్న అప్పుల గురించి వెల్లడించారు. ఈ అప్పులన్నింటినీ పాకిస్థాన్ లో ఉన్న 21.66 కోట్ల మంది కి సమానంగా పంచితే ఒక్కొక్కరికీ లక్షా 75 వేల రూపాయల అప్పు ఉన్నట్లుగా తేలుతుంది.రెండేళ్లలో ఒక్కొక్కరిపై సగటున 55 వేల రూపాయల అప్పు పెరగడం పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితిని వివరిస్తోంది. 2018 మధ్య నాటికి పాకిస్థాన్ కి ఉన్న అప్పుల విలువ 24.9 ట్రిలియన్ రూపాయలు. పాకిస్థానీ న్యూస్ పేపర్ ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ కథనం ప్రకారం ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రి గా ఎన్నికయ్యాక ఈ అప్పులు 46 శాతం పెరిగాయట. ఇంతకుముందు కూడా పాకిస్థాన్ పరిస్థితి పెద్ద గొప్పగా ఏమీ లేకపోయినా ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ పాలనలో మరింత దిగజారింది. ఆ తర్వాత కరోనా వల్ల ఆర్థిక భారం ఎక్కువైంది. ఆ మేరకు అప్పులు కూడా పెరిగాయి. మిగిలిన దేశాలన్నింటితో పోల్చితే పాకిస్థాన్ లో లాక్ డౌన్ చాలా తక్కువ కాలం కొనసాగింది. తమ దేశం పేద దేశం కాబట్టి ఆర్థిక వ్యవస్థ పై భారం పడకూడదని చెబుతూ ఇమ్రాన్ లాక్ డౌన్ ని ఎత్తేశారు. అయితే ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయింది. గతంలో ఆర్థిక శాఖ చెప్పిన వివరాల ప్రకారం పాకిస్థాన్ ప్రభుత్వం తాను రూపొందించుకున్న ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ క్రెడిట్ లిమిట్ (ఎఫ్ ఆర్ డీ ఎల్) చట్టాన్ని అతిక్రమించింది. 2005 లో ఈ చట్టాన్ని రూపొందించారు. దీనికి ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ కంటే ద్రవ్య లోటు 4 శాతం కంటే ఎక్కువగా ఉండకూడదు. కానీ ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో ఈ ద్రవ్యలోటు 8.6 శాతంగా ఉంది. ఇది నిర్ణయించిన రేటుకు రెట్టింపు కంటే ఎక్కువ కావడం విశేషం. . అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పాకిస్థాన్ ఒక దేశం నుంచి అప్పు చేస్తూ మరో దేశానికి దాన్ని చెల్లిస్తోంది. ఎక్కువ వడ్డీలు చెల్లించాల్సి రావడంతో అప్పులు పెరుగుతున్నాయి. తాజాగా ఇతర దేశాల్లో ఉన్న పాకిస్థాన్ ఆస్తులను అమ్మే వరకూ పరిస్థితి వచ్చింది. ఇతర దేశాలకు చెందిన మైనింగ్ కంపెనీలు తమ దేశంలో బంగారాన్ని తవ్వుకోవచ్చని అంగీకరించిన పాకిస్థాన్ అగ్రిమెంట్ అయ్యాక మనసు మార్చుకొని వారికి అనుమతిని నిరాకరించింది. అగ్రిమెంట్లను క్యాన్సిల్ చేసింది. దీనిపై కంపెనీలు కోర్టుకి వెళ్లగా పాకిస్థాన్ ఈ కేసును కూడా ఓడిపోయింది. పరిస్థితి ఎంతగా దిగజారిందంటే.. యుఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) తనకు పాకిస్థాన్ అప్పు బకాయి ఉన్న బిలియన్ డాలర్లు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసేంతగా.. గతంలో కూడా యూఏఈ ఇలాగే డిమాండ్ చేసింది. అప్పుడు చైనా ముందుకొచ్చి పాకిస్థాన్ కి సాయం చేసింది. ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధానిగా మారిన తర్వాత ఇలా ఒక దేశం నుంచి సహాయం తీసుకొని మరో  దేశానికి అప్పులు తీర్చడం ఆ దేశానికి కామన్ గా మారింది.   

చంద్రబాబుతోపాటు మరో ఎనిమిది మందిపై సిఐడి కేసులు

ఏపీ రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో సిఐడి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవాళ ఉదయం అయన హైదరాబాద్ నివాసంలో నోటీసులు ఇచ్చిన సంగతి తెల్సిందే. ఆయనతో పాటు అప్పట్లో పురపాలక శాఖా మంత్రిగా ఉన్న మరో టీడీపీ నేత నారాయణకు కూడా సిఐడి నోటీసులు జారీ చేసింది.    వైసిపి ప్రతిపక్షంలో ఉండగా అమరావతి భూముల వ్యవహారంలో టీడీపీ నేతలు అక్రమాలకు పాలపడ్డారని ఆరోపిస్తూ వచ్చింది. ఆ తరువాత 2019 ఎన్నికలలో గెలిచి.. జగన్ సర్కార్ ఏర్పడిన తరువాత రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో అవకతవకలపై విచారణ చేయడానికంటూ ఒక  మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘం భూముల వ్యవహారంపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. భూముల అక్రమాల వ్యవహారంలో సంబంధం ఉన్న టీడీపీ నేతల జాబితాను కూడా మంత్రివర్గ ఉపసంఘం సమర్పించింది. ఈ నివేదికలో చంద్రబాబుతోపాటు నారాయణ, పుట్టా మహేష్ యాదవ్, పరిటాల సునీత, లోకేష్, పయ్యావుల కేశవ్, వేమూరు రవికుమార్, జీవీ ఆంజనేయులు, లంకా దినకర్, లింగమనేని రమేష్, దూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్ పేర్లను పేర్కొంది.  దీంతో ఈ నివేదిక ఆధారంగా  సీఐడి కేసులు నమోదు చేసి.. తాజాగా  ఈ వ్యవహారంపై బాబుతోపాటు మాజీ మంత్రి నారాయణకు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే రాజధాని ప్రకటనకు ముందే ముఖ్య నేతలు తమ అనుచరులకు సమాచారం ఇచ్చి అక్కడ దళితులకు చెందిన అసైన్డు భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదు అయినట్లు సమాచారం. ఆ సందర్భంలో అసైన్డ్‌ రైతులను మోసం చేసి తమ  అనుచరులకు లబ్ధి చేకూర్చారని  ఇందులో ఆరోపణలు ఉన్నాయి. అయితే దీనిపై హైకోర్టులో కూడా విచారణ కూడా జరిగింది. ఈ విషయంలో చంద్రబాబుకు ఏమాత్రం సంబంధం లేదంటూ న్యాయస్థానం తేల్చి చెప్పింది.అయితే రాజధాని ప్రకటన తర్వాత భూముల ధరలు విపరీతంగా పెరిగాయని..దీంతో అసైన్డ్‌ రైతులు మోసపోయారని.. మరోపక్క టీడీపీ నేతల అనుచరులకు లబ్ధి కలిగించారని కేసు నమోదు చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఇది జగన్ సర్కార్  రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగమేనని ఆ పార్టీ నేతలు కార్యకర్తలు మండి పడుతున్నారు. వైసిపి బెదిరింపులకు తాము ఎంతమాత్రం భయపడేది లేదని స్ఫష్టం చేస్తున్నారు  

సీఐడీ నోటీసులో ఏముంది.. చంద్రబాబు విచారణ ఎప్పుడు?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అమరావతి రాజధానిలో అసైన్డు భూముల కొనుగోలు, అమ్మకాలపై ఇటీవల కేసు నమోదైంది. ఈ కేసులో చంద్రబాబుతోపాటు ఎనిమిదిమందిపై కేసులు నమోదయ్యాయి. రాజధాని రైతులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసులు నమోదు చేశారు. 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ చెప్పారు. చంద్రబాబుపై 120బీ, 166, 167, 217 ఐపీసీ సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసింది.  దేశంలో ఒక మాజీ ముఖ్యమంత్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కోసం పెట్టడం ఇదే తొలిసారని చెబుతున్నారు.  చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి పొంగూరు నారాయణకు కూడా సీఐడీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం నారాయణ హైదరాబాద్‌లో లేరు. ఈ నెల 23న విచారణకు రావాలని నారాయణకు ఇచ్చిన నోటీసుల్లో అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. రాజధాని ప్రకటనకు ముందే తన అనుచరులకు సమాచారం ఇచ్చి అక్కడ దళితులకు చెందిన అసైన్డు భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలతో కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. అసైన్డ్‌ రైతులను మోసం చేసి తన అనుచరులకు లబ్ధి కలిగించారని ఆరోపణలు ఉన్నాయి. రాజధాని ప్రకటన తర్వాత భూముల ధరలు విపరీతంగా పెరిగాయని.. అసైన్డ్‌ రైతులు మోసపోయి..అనుచరులకు లబ్ధి కలిగించారన్నది అభియోగం. దీనిపై హైకోర్టులో కూడా విచారణ జరిగింది. ఈ విషయంలో చంద్రబాబుకు సంబంధం లేదంటూ న్యాయస్థానం చెప్పింది.  చంద్రబాబుకు నోటీసుల వ్యవహారాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.రాజకీయ కక్ష సాధింపుల కోసమే టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు. 21 నెలలుగా వైసీపీ సర్కార్ ఏం చేసిందని ప్రశ్నించారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్‌పై ఇప్పటికే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందన్నారు. వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. దీనిపై హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని బోండా ఉమ వెల్లడించారు. తప్పుడు కేసులతో టీడీపీ అధినేత చంద్రబాబును భయపెట్టాలనుకుంటున్నారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. రెండేళ్లలో ఏమీ చేయలేని జగన్ సర్కార్.. ఇప్పుడు ఏం చేస్తుందని ప్రశ్నించారు. రెండ్రోజుల నుంచి జగన్ క్యాంప్ భయపడుతోందన్నారు. జైలుకు వెళ్లాల్సివస్తుందనే భయంలో సీఎం జగన్ ఉన్నారని విమర్శించారు. ఏ1, ఏ2 బెయిల్ రద్దయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఏపీ సీఎంపై ఉన్న కేసులు దేశంలో ఏ ముఖ్యమంత్రులపై లేవని వర్ల రామయ్య తెలిపారు.   

గుజరాత్ అసెంబ్లీ  టీషర్ట్ గందరగోళం

నా ఇష్టం నాదంటే అన్నిచోట్లా కుదరదు. సమయ, సందర్భాలను బట్టి ప్రవర్తిస్తేనే, ఎవరికైనా గౌరవం దక్కుతుంది. అందులోనూ చట్ట సభల్లో సభ్యుల ప్రవర్తన,వేషధారణ పదిమందికి ఆదర్శంగా ఉంటేనే సభకున్న గౌరవం నిలబడుతుంది. అందుకే, చట్టసభల్లో సభ్యులప్రవర్తనకు సంబంధించిన నియమావళిని సభాధ్యక్షులు అమలు చేయడం ఆచారంగా వస్తుంది. అప్పుడప్పుడు కొదంరు సభ్యులు, నాయిష్టం నాది అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి సందర్భాలలో సభాధ్యక్షుడు నియమావళికి అనుగుణంగా సూచనలు, సలహాలు ఇవ్వడం అవసరం అయితే మందలించడం, చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయినా, కొందరు సభ్యులు, అందుకు విరుద్ధంగా వ్యవహరించి వివాదాలు సృష్టిస్తారు. కౌగిలింతలు, కన్ను గీటటం వంటి చిల్లర చేష్టలతో  నవ్వుల పాలవుతుంటారు. ఇదిగో అలాంటి సంఘటనే గుజరాత్ శాసన సభలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే  రాష్ట్రంలోని సోమనాథ్‌ నియోజకవర్గం నుంచి తొలిసారిగా శాసనసభకు ఎన్నికైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విమల్‌ చుడాస్మ.. గతవారం అసెంబ్లీకి టీషర్ట్‌, ప్యాంట్‌ వేసుకుని వచ్చారు. అయితే మరోసారి ఇలా రావొద్దని.. ఎమ్మెల్యేలు అసెంబ్లీ మర్యాద పాటించాలని స్పీకర్‌ రాజేంద్ర త్రివేది అప్పుడే హెచ్చరించారు. అయితే ఆయన మళ్ళీ సోమవారం కూడా విమల్‌ మళ్లీ టీషర్ట్‌ ధరించే సభకు హాజరవడంతో స్పీకర్‌ త్రివేది అసహనం వ్యక్తం చేశారు. ఆయనను సభ నుంచి బయటకు వెళ్లిపోవాలని ఆదేశించారు. షర్ట్‌ లేదా కుర్తా వేసుకుంటేనే అసెంబ్లీకి రావాలని సూచించారు. అయితే అసలే కాంగ్రెస్ సభ్యుడు ఆపైన ఉడుకు రక్తం కావడంతో కావచ్చు ఎమ్మెల్ల్యే తీవ్ర అసహనానికి గురయ్యారు. స్పీకర్’తో వివాదానికి దిగారు. ‘ఇదే టీషర్ట్‌తో నేను ఎన్నికల్లో ఓట్లు అభ్యర్థించాను. ప్రజలకు నాకు ఓటేసి అసెంబ్లీకి పంపారు. మీరు మా ఓటర్లను అగౌరవపరుస్తున్నారు’అంటూ స్పీకర్’కు కౌంటర్ ఇచ్చారు.  అయితే, ఇలాంటి కుర్ర చేష్టలు సభలో చెల్లవని కర్రు కాల్చి వాత పెట్టారు. ‘మీరు మీ ఓటర్లను ఎలా కలిశారన్నది అప్రస్తుతం, ఇపుడు మీరు సభలో ఉన్నారు.  ఎమ్మెల్యే అయినంతమాత్రాన మీకు నచ్చినట్లుగా సభకు రావడానికి కుదరదు. ఇదేం ప్లేగ్రౌండ్‌ కాదు. అసెంబ్లీ నిబంధనలు పాటించాలి. షర్ట్‌, కుర్తా లాంటి ఫార్మల్‌ దుస్తులు వేసుకుంటేనే సభకు రండి అని గట్టిగా చురకేశారు.దీంతో ఎమ్మెల్యే సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం.. స్పీకర్‌తో వాదన పెట్టుకున్న ఎమ్మెల్యే విమల్‌ను మూడు రోజుల పాటు సభ నుంచి బహిష్కరించాలంటూ మంత్రి ప్రదీప్‌ సిన్హ్‌ జడేజా స్పీకర్‌ ముందు ప్రతిపాదన చేశారు. అయితే ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి  విజయ్‌ రూపానీ వెనక్కి తీసుకున్నారు. గతంలో టీషర్ట్‌ వ్వేస్కుని సభకు వచ్చిన మంత్రి స్పీకర్‌ చెప్పిన తర్వాత ఆయన తన డ్రెసింగ్‌ స్టైల్‌‌ను మార్చుకున్న విఃయాన్ని గుర్తుచేశారు. సభకు టీషర్ట్‌లలో రావడం అంత బాగుండదు. ఈ విషయంలో విమల్‌కు కాంగ్రెస్‌ నేతలు సర్దిచెప్పాలని ముఖ్యమంత్రి రూపాని, కాంగ్రెస్ నాయకులకు చిన్నపాటి క్లాస్ తీసుకున్నారు.

ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఎస్సీనా? ఎస్టీనా?.. కక్ష సాధింపులోనే సీఐడీ నోటీసులు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కక్ష సాధింపులో భాగంగానే జగన్ రెడ్డి సర్కార్.. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిందని ఆరోపిస్తున్నారు.  దేశ చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఎప్పుడైనా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టారా? అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎస్సీనా, ఎస్టీనా? ఆయన ఫిర్యాదు చేయగానే ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఏ విధంగా కేసు పెడతారు? అని అచ్చెన్నాయుడు నిలదీశారు. అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.   అసైన్డ్ భూములను రైతుల ఆమోదంతో తీసుకుని రాజధాని కోసమే ఉపయోగించామని చెప్పారు అచ్చెన్నాయుడు. రాజధానిలో అసైన్డ్ రైతులకు కూడా జరీబు రైతులకు ఇచ్చిన ప్యాకేజీనే ఇచ్చామన్నారు. ల్యాండ్ పూలింగ్ 2015లో జరిగితే దానిపై ఇప్పుడు సీఐడీ నోటీసులు అంటూ కేసు పెట్టడం కక్ష సాధింపుకాదా? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి నేటికీ సొంత ప్రయోజనాల కోసం పేదల అసైన్డ్ భూములు వాడుకుంటున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. అసైన్డ్ భూముల్లో ఇళ్లు కట్టుకున్న చరిత్ర జగన్ రెడ్డికి ఉందన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో వందలాది మంది అసైన్డ్ భూములను లాక్కున్నారని మండిపడ్డారు. దశాబ్ధాలు తరబడి ఇడుపులపాయలో అసైన్డ్ భూములు వాడుకుంటన్న చరిత్ర జగన్ ది అని అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు.  వాన్ పిక్ భూములు లాక్కుని రైతులకు పరిహారం నేటికీ ఇవ్వలేదన్నారు అచ్చెన్నాయుడు. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ ను చేపట్టామని, రైతుల అనుమతితోనే ఆ భూమలు సేకరికంచడం జరిగిందన్నారు. సోలార్ కంపెనీలు అవసరాలకు అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కోవడానికి జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చిన విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. పేదలు ఎంతో కాలం నుండి సాగుచేసుకొంటున్న అసైన్దు  భూములను దౌర్జన్యంగా గుంజుకొని ఇళ్లస్థలాలు ఇస్తున్నారని తెలిపారు. ఇడుపులపాయలో అసైన్డ్‌ భూములు 700 ఎకరాలను 30 ఏళ్లు అనుభవించారు.. ఆ విషయం బయటపడటంతో 610 ఎకరాలు ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్నానని అసెంబ్లీలో వై.ఎస్‌. చెప్పారు.. ఆ తరవాత 300 ఎకరాలే స్వాధీనం చేస్తున్నానని మాట మార్చలేదా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అసైన్డు భూముల బదిలీ నిషేధ చట్టాన్ని 2007లో సవరించి ఆర్డినెన్స్‌ ద్వారా అమలులోకి తెచ్చింది మీతండ్రి వైఎస్‌. కాదనగలరా? అని జగన్ ను సూటిగా అడిగారు.  ఫలితంగా పేదల భూములు లాక్కొని తమకు ఇష్టమైన వారికి కట్టబెట్టుకొనే వీలు కలిగించగలిగారని అచ్చెన్నాయుడు తెలిపారు.               

పసుపు బోర్డ్ లేదన్న కేంద్రం.. ఎంపీ అరవింద్ రాజీనామా  చేస్తారా?

తెలంగాణలో ముఖ్యంగా నిజామబాద్  రాజకీయాల్లో పసుపు బోర్డు ఏర్పాటు, సంచలనమే సృష్టించింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర రాకుమార్తె కవితను ఎన్నికలలో ఓడించింది. వివరాలలోకి వెళితే, నిజామాబాద్   జిల్లాలో పసుపు బోర్డ్ ఏర్పాటు చేయాలని, రైతులు ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్నారు.ఈ ఆందోళనల నేపధ్యంలో జరిగిన 2019లోక్ సభ ఎన్నికల్లో, బీజేపీ అభ్యర్ధిగా పోటీ  చేసిన, ప్రస్తుత ఎంపీ ధర్మపురి శ్రీనివాస్, తనను గెలిపిస్తే, ఆరే ఆరు నెలల్లో పసుపు బోర్డు పట్టుకోస్తాని వాగ్దానం చేశారు.అంతే కాదు, ఒక వేళ తేలేక పోతే రాజీనామా చేస్తానని, సంతకం చేసిన బ్యాండ్ పేపర్లు ఇంటింటికీ పంచారు.ప్రజలు అలవాటుగా  ఆయన్ని నమ్మారు.అంతకు ముందు ఇదే వాగ్దంతో గెలిచిన సిట్టింగ్ తెరాస ఎంపీ, కవితను ఓడించి ఎంపీ అయ్యారు. ఆయన ఎంపీగా గెలిచి మూడార్లు 18నెలలైన ఇంతవరకు పసుపు బోర్డు మాత్రం రాలేదు. తాజాగా చావు కబురు చల్లగా చెప్పినట్లు, తెలంగాణలో  పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ స్పష్టం చేశారు.రాజ్య సభలో తెరాస సభ్యుడు సురేశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. బోర్డుకు బదులుగా నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు. పసుపు ఎగుమతుల కార్యక్రమాలు ప్రోత్సహించడం, దిగుబడులపై రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయానికి ఈ కార్యాలయం పనిచేస్తుందని తెలిపారు. పసుపుతోపాటు సుగంధ ద్రవ్యాల ఎగుమతుల ప్రోత్సాహానికి హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మంలో బోర్డు కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రత్యేక హోదాకు బదులుగా,ప్యాకేజని రెంటికీ పంగనామం పెట్టినట్లుగానే, ఇప్పుడు తెలంగాణలో  బోర్డు స్థానంలో ప్రాంతీయ కార్యలయమని  రెంటికీ ... ఎగనామం పెడతారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వంక అరవింద్ రాజీనామా చేయాలని రాజకీయ పార్టీలు రాజీనామా చేయలని డిమాండ్ చేస్తున్నాయి.

మళ్ళీ మోగుతున్న వార్నింగ్ బెల్స్... అలర్ట్ అయిన కేంద్రం

కరోనా వైరస్ వ్యాప్తి మొదలవడంతో గతేడాది మార్చి 24 న దేశ వ్యాప్తంగా కేంద్రం మొట్టమొదటిసారి లాక్ డౌన్ విధించిన సంగతి తెల్సిందే. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసి ప్రజల ప్రాణాలను కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గడిచిన సంవత్సరంలో అనేక చర్యలు తీసుకున్నాయి. మరోపక్క ఈ ఏడాది జనవరిలో కరోనా వ్యాక్సిన్ కు కేంద్ర ప్రభుత్వం అత్యవసర అనుమతి ఇవ్వడంతో ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు తరువాత 60 ఏళ్ల పైబడిన వృద్దులకు కూడా ప్రస్తుతం వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇది ఇలా ఉండగా కొంత కాలం క్రితం వరకు తగ్గినట్లుగా కనిపించిన వైరస్ వ్యాప్తి మళ్ళీ ఉధృతమవుతోంది. మరీ ముఖ్యంగా ఐదారు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. రెండు వారాల క్రితం వరకు 10 వేలలోపే ఉన్న రోజువారీ కేసులు.. ఉన్నట్టుండి 26 వేలకు చేరడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ మళ్ళీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసే పనిలో పడింది   దీంతో ప్రధాని మోదీ మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కావాలని నిర్ణయించారు. దీనికోసం  బుధవారం నాడు వర్చువల్ సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రంతో నిమిత్తం లేకుండా తగిన చర్యలను తీసుకుంటున్నాయి. మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కొన్ని ప్రాంతాలలో లాక్‌డౌన్, రాత్రి వేళ కర్ఫ్యూను విధిస్తూ కరోనాను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో పాటు ఇంకా ఏమేమి చర్యలు తీసుకుంటే కరోనాను కట్టడి చేయవచ్చన్న విషయంపై ఈ సమావేశంలో చర్చలు జరపనున్నారు. కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఏమేం చేయాలన్న దానిపైనే ప్రధానంగా చర్చించనున్నారు. కరోనా విజృంభిస్తున్న రాష్ట్రాలు తాము తీసుకుంటున్న చర్యలను గురించి ప్రధానికి వివరించనున్నట్లు తెలుస్తోంది.  

చంద్రబాబుకు సీఐడీ నోటీసులు

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సిఐడి అధికారులు..ఆయన నోటీసులు ఇచ్చారు. అమరావతి రాజధానిలో అసైన్డ్ భూములు కొనుగోలు అమ్మకాలపై చంద్రబాబుపై కేసు నమోదు అయింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది.  41సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు. నోటీసులు  ఇచ్చాక ఇన్వెస్టిగేషన్ కు పిలుస్తామని ఏపీ సీఐడీ అధికారులు చెబుతున్నారు. అమరావతి నుంచి రెండు సీఐడీ బృందాలు హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై 120బి, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులుకూ సీఐడీ నోటీసులు  అందాయి. 41 సీఆర్పీసీ కింద మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. 

రెండేళ్లయింది.. వివేకా కేసు ఏమైంది?

వైసీపీ నేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి రెండు సంవత్సరాలు పూర్తయింది. పులివెందులలో వైఎస్ వివేకా రెండో వర్ధంతిని నిర్వహించారు.డిగ్రీ కళాశాల రోడ్డుకు సమీపంలో ఉన్న వైఎస్‌ కుటుంబీకుల సమాధుల ప్రాంగణంలో ఆయన సమాధి వద్ద పలువురు కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన స్మారకార్థం నిర్మించిన చిన్న పిల్లల పార్కును ప్రారంభించారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందారెడ్డి 2019 మార్చి 14 అర్ధరాత్రి తర్వాత పులివెందులలో తన స్వగృహంలో దారుణ హత్యకు గురయ్యారు. అయితే వైఎస్ వివేకా వర్థంతి కార్యక్రమానికి కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి కుటుంబ సభ్యులు హాజరుకాలేదు. వివేకా హత్య ఘటనపై ఆయన కూతురు మారెడ్డి సునీత హైకోర్టుకు ఇచ్చిన అనుమానితుల జాబితాలో ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిల పేర్లు ఉన్నాయి.   వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై రెండేండ్లు పూర్తైనా.. ఇప్పటికీ ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదని కాంగ్రెస్ నేత, ఆ పార్టీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో నిందితులను గుర్తించలేదని, చార్జిషీటు కూడా దాఖలు చేయలేదని అన్నారు. ఇలా చేయడం వల్ల పోలీసు వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సిట్, సీబీఐలపై ప్రజలకు ఉన్న కాస్త నమ్మకం కూడా పోతుందని తులసిరెడ్డి అన్నారు. ఇప్పటికైనా ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు అనుమానాలు తలెత్తుతున్నాయని తులసిరెడ్డి అన్నారు.  తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటును ప్రకటించిన తర్వాత, తొలిసారి షర్మిల తన తల్లితో కలిసి పులివెందుల వచ్చారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందారెడ్డి రెండో వర్ధంతి కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు. అనంతరం షర్మిల వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఘాట్‌కు చేరుకొని తన తండ్రి సమాధి వద్ద నివాళులు ఆర్పించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, వైసీపీ కీలక నాయకులు, గతంలో షర్మిలతో సన్నిహితంగా ఉన్న నాయకులు సైతం ఆమెను కలిసి పలకరించలేదు  

2 వేల నోటు ఇక ఉండదా! 

రెండు వేల నోటుపై ఎప్పుడూ ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంటుంది. 2 వేల నోటును కేంద్ర సర్కార్ రద్దు చేస్తుందనే ప్రచారం కూడా చాలా సార్లు జరిగింది. అయితే తాజా కేంద్ర ప్రభుత్వమే రెండు వేల నోటుకు సంబంధించి కీలకమైన ప్రకటన చేసింది.  2019 ఏప్రిల్ నుంచి రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడంలేదని ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఎన్డీయే సర్కారు 2017లో పెద్ద నోట్లను రద్దు చేసింది.  వాటి స్థానంలో కొత్త నోట్లను తీసుకువచ్చింది. పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర సర్కార్... మునుపెన్నడూ లేనివిధంగా రూ.2000 నోట్లను ప్రవేశపెట్టింది. దీవిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉండగానే  కొద్దికాలానికే రెండు వేల నోటు లభ్యత తగ్గిపోయింది. తాజాగా ఈ అంశంపై కేంద్రం వివరణ ఇచ్చింది.ఈ నోట్లను పెద్ద ఎత్తున దాచుకోవడంతో పాటు, నల్లడబ్బు రూపేణా విపణిలో చలామణీ చేసే అవకాశం ఉందని... అందుకే ఈ నోట్ల ముద్రణను రెండేళ్లుగా నిలిపివేసినట్టు వివరించారు. లోక్ సభలో ఆయన ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో చర్చించిన మీదటే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 2018 మార్చి 30 నాటికి దేశంలో 3,362 మిలియన్ల రూ.2000 నోట్లు చలామణీలో ఉండగా... 2021 ఫిబ్రవరి నాటికి కేవలం 2,499 మిలియన్ల రూ.2000 నోట్లు చలామణీలో ఉన్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. కేంద్ర సర్కార్ నిర్ణయం ప్రకారం త్వరలో రెండు వేల నోటు రద్దు కాబోతోందని తెలుస్తోంది. రెండేండ్లుగా కొత్త నోట్లు ముద్రణ కావడం లేదు. అంటే ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్ల వరకే మార్కెట్లో వినియోగంలో ఉంటాయన్న మాట. దీన్ని బట్టి కొంత కాలానికి 2 వేల నోటు మొత్తానికే కనిపించకుండా పోతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.  

టీడీపీని అమ్మేసుకోండి! ఎమ్మెల్యే రోజా సెటైర్లు 

మున్సిపల్ ఎన్నికల్లో విజయంతో విపక్ష నేతలను ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు నగరి ఎమ్మెల్యే రోజా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్  తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీని ఓఎల్‌ఎక్స్‌లో పెట్టుకుంటే మంచిదంటూ ఎద్దేవా చేశారు.  చంద్రబాబు నాయుడు మనవడితో ఆడుకుంటూ శేషజీవితం గడపాలంటూ రోజా ఎద్దేవా చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భారీ విజయం అందుకున్న వైసీపీ ఇక టీడీపీని పూర్తిగా అణచివేసినట్లేనని ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు.  శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు వైసీపీ విజయకేతనం ఎగురవేసి టీడీపీని తరిమికొట్టిందని రోజా చెప్పారు. 18 నెలల పాలనలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజల హృదయాల్ని కొల్లగొట్టారని రోజా తెలిపారు. పవన్‌ ఒక్కోచోట ఒక్కో పార్టీ అభ్యర్థికి మద్దతిస్తున్నారని.. ఆయనకు ఒక స్పష్టతే లేదని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీరు వానపాము లేచి నాగుపాముపై బుసకొట్టినట్లు ఉందన్నారు. పవన్‌కు అసలు జెండా, అజెండానే లేవని ఘాటుగా ఎమ్మెల్యే రోజా. విమర్శించారు. ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వస్తాయని పవన్‌, చంద్రబాబుకు ముందే తెలుసని.. అందుకే వారు లెక్కింపు రోజు హైదరాబాద్‌లోనే విశ్రాంతి తీసుకున్నారని రోజా అన్నారు తమ సొంత పార్టీలోని రెబల్స్‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదని.. విజయంతోనే వారికి సమాధానం చెప్పామన్నారు రోజా. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున సొంత పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రోజా. తాను నిలబెట్టిన అభ్యర్థులను ఓడించడానికి రెబెల్స్ ను పెట్టారని, వారు డబ్బులు కూడా కొందరు నేతలు సాయం చేస్తున్నారని ఆరోపించారు. ఫలితాల రోజున సొంత పార్టీ నేతలను టార్గెట్ చేసిన రోజా.. తమకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ల తాట తీస్తామని హెచ్చరించారు. 

బీజేపీ నోటాను బీట్ చేసింది...

రాష్ట్ర విభజతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో ప్రధాన జాతీయ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్ ఉనికిని కోల్పోయాయి. 2014లో తెలుగు దేశం, జనసేన పార్టీలతో జట్టు కట్టి పోటీ చేసిన బీజేపీ, 2.2 శాతం ఓట్లతో నాలుగు అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానం గెలుచుకుంది. ఆ విధంగా పొత్తు పుణ్యాన  ఆ మాత్రం ఉనికిని కాపాడుకుంది. కాంగ్రెస్ పార్టీకి 2.8 శాతం ఓట్లు అయితే వచ్చాయి కానీ ఒక్క సీటు కూడా రాలేదు. కేవలం ఒకే ఒక్క సీటులో డిపాజిట్ దక్కించుకుని ఉన్నాను అనిపించుకుంది.  ఇక 2019 కి వచ్చే నాటికి బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు తప్పి ఒంటరిగా పోటీ చేయడంతో కమలం ఓటు 0.9 శాటానికి పడిపోయింది. ‘నోటా’ కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీగా చరిత్ర సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ 1.2 శాతం ఓట్లు తెచ్చుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ, నోటాను బీట్ చేసింది. ఈసారి నోటాకు,1.07 శాతం ఓట్లు పోలైతే, బీజేపీకి 2.41 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి పట్టుమని పది కౌన్సిలర్ /కార్పొరేటర్ సీట్లు అయితే రాలేదు కానీ.. నోటాను అయితే దాటేసింది.  ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సంఘం విడుదల చేసిన లెక్కల ప్రకారం 20 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలో కంటే మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ ఓటు అంత గొప్పగా ఏమీ పెరగలేదు. కానీ టీడీపీ ఓటు గణనీయంగా పడిపోయింది.2019 ఎన్నికలలో వైసీపీకి 50.6శాతం ఓట్లు పోలయ్యాయి, ఈ ఎన్నికలో వైసీపీ ఓటు షేర్ 52.63 శాతానికి పెరింగింది. తెలుగు దేశం ఓటు షేర్ 39.7 శాతం నుంచి 30.63 శాతానికి పడిపోయింది. జనసేన ఓటులో కూడా స్వల్పంగానే అయినా తగ్గింది. జనసేనకు 2019లో 5.6 శాతం ఓట్లు పోలయ్యాయి, ఈసారి అది 4.67 శాతానికి తగ్గింది. మున్సిపల ఎన్నికలలో అధికార వైసీపీ సీట్ల పరంగా ప్రభంజనం సృష్టించింది కానీ.. ఓట్ల పరంగా ఓ రెండు శాతం మాత్రమే గెయిన్ చేసింది.

మమతా బెనర్జీ నామినేషన్ పై బీజేపీ అభ్యంతరం... తృణమూల్ లో టెన్షన్

పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో అనుక్షణం ఉత్కంఠ పెరుగుతూ పోతోంది. ముందుగా  సీఎం మమతా బెనర్జీ కొంత మంది దుండగుల దాడిలో గాయపడ్డారని ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత ఆమె ప్రచారంలో జరిగిన యాక్సిడెంట్ గా అధికారులు తేల్చారు. తాజాగా దీదీ పై పోటీ చేస్తున్న బీజేపీ నేత సువేందు అధికారి ఆమెపై కొత్త అభియోగం మోపారు. మమతా దాఖలు చేసిన నామినేషన్ తోపాటు ఇచ్చిన అఫిడవిట్ లో తనపై ఉన్న పోలీసు కేసుల వివరాలు తెలపకుండా దాచిపెట్టారని ఆరోపిస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. సీఎం మమతా బెనర్జీపై  ఆరు క్రిమినల్ కేసులతోపాటు ఒక సిబిఐ కేసు కూడా ఉందని, మరోపక్క అసోం లో ఆమెపై మరో ఆరు క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆ ఫిర్యాదులో తెలిపారు.   ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మమతా బెనర్జీ నామినేషన్ ను తిరస్కరించాలని యిసిని కోరినట్లుగా వెల్లడించారు.  దీనిపై అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని తాను ఆశిస్తున్నట్లుగా అయన చెప్పారు. ఎన్నికల నిబంధనలు ముందు సీఎం అయినా మరొకరైనా ఒకటేనని.. ఒక బాధ్యతగా దీనిపై అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసానని అయన అన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై దృష్టి పెట్టినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలియచేసారు.  దీంతో తృణమూల్ పార్టీ కేడర్ లో టెన్షన్ నెలకొంది.