కృష్ణపట్నం కరోనా ఆయుర్వేద మందు కోసం క్యూ కట్టిన జనాలు
posted on May 21, 2021 @ 9:41AM
కృష్ణపట్నం కరోనా ఆయుర్వేద మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తిరిగి పంపిణి ప్రారంభించారు. ఆనందయ్య యాదవ్ పంపిణీ చేస్తున్న కరోనా ఆయుర్వేద మందులో ఎలాంటి హానికారక పదార్థాలు లేవని ల్యాబ్లో తేలడంతో.. శుక్రవారం నుంచి మళ్లీ మందు పంపిణీ ప్రారంభమైంది. ఆనందయ్య కరోనా మందుకు ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం క్యూకడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వమే అనుమతి ఇవ్వడంతో ఇంకా పెద్ద సంఖ్యలో జనం వచ్చే అవకాశముంది. దీంతో కృష్ణపట్నంలో ప్రత్యేక కౌంటర్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మందు కోసం వచ్చేవారు భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. గ్రామానికి వెలుపల పోలీసు ఔట్పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. మందు పంపిణీ ఏర్పాట్లను తహశీల్దార్ సోమ్లా నాయక్, కృష్ణపట్నం సీఐ ఖాజావలి పరిశీలించారు. మందు కోసం వచ్చేవారు ఇబ్బందులు పడకుండా భోజన సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఉన్న కృష్ణపట్నంలో కరోనా నివారణకు ఆయుర్వేద మందు ఇస్తున్నారు. బొనిగి ఆనందయ్య యాదవ్ ఉచితంగానే మందును పంపిణీ చేస్తున్నారు. ఐతే దీనికి మొదట బ్రేక్లు వేసిన ప్రభుత్వం.. తాజా మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత వారం నెల్లూరు జిల్లా అధికారులు ఈ కరోనా ముందు నమూనాలను హైదరాబాద్లోని ఆయుష్ ప్రయోగశాలకు పంపించారు. అనంతరం ఆనందయ్య ఆయుర్వేద మందులో హానికారకాలు లేవని ప్రాథమికంగా నిర్ధారించారు. అందులో నల్ల జీలకర్ర, తోక మిరియాలు, పచ్చ కర్పూరం, పెద్ద పల్లేరు కాయ, నేల ఉసిరి, పిప్పిళ్ల చెక్క, పుప్పింట ఆకు, గుంట గరగర తేనె, పసుపు, జాజికాయ,మారేడు, నేరేడు, వేప ఇగురు, దేవర ఒంగి తదితర పదార్థాలు ఉన్నాయని.. ఇవి హానికారక పదార్థాలు లేవని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
కృష్ణపట్నంలో శ్రీరామనవమి నుంచి ఆనందయ్య ఈ ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటి వరకు వేలాది మంది ప్రజలు తీసుకున్నారు. కరోనా రాని వారికి ఒక ముందు, ఇప్పటికే పాజిటివ్ వచ్చిన వారికి మూడు రకాల మందును అందిస్తున్నారు. దాన్ని స్వీకరించిన వారిలో ఇప్పటి వరకు ఎలాంటి సమస్యా రాలేదు. పైగా కరోనా రోగులకు రిపోర్టుల్లో నెగెటివ్ వచ్చిందని చెబుతున్నారు. అంతేకాదు ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉన్న ఓ వ్యక్తి ఈ మందు తీసుకున్నాక కోలుకున్నారని అంటున్నారు. అందుకే కృష్ణపట్నం ఆయుర్వేద మందు కోసం జనం ఎగపడుతున్నారు.