తహసీల్దారు ఆఫీసుకు నిప్పు పెట్టేందుకు మహిళ యత్నం.. కేసీఆర్ సొంత జిల్లాలో కలకలం..
posted on Sep 1, 2021 @ 5:16PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాలో కలకలం రేగింది. సిద్దిపేట జిల్లా కొండపాక తహశీల్దార్ కార్యాలయంలో ఓ మహిళ రైతు డీజిల్ బాటిల్ తో హల్చల్ చేసింది. ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయంది. దీంతో కొండపాక తహశీల్దార్ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అక్కడున్నవారంతా మహిళను అడ్డుకుని డీజిల్ బాటిల్ లాక్కోవడంతో ప్రమాదం తప్పింది.
కొండపాక మండలం దమ్మక్కపల్లి గ్రామానికి చెందిన తోకల లక్ష్మి అనే మహిళకు ఆరెపల్లెలో 22 ఎకరాల భూమి ఉంది. అయితే ఆ భూమిని ఇతరుల పేరుమీద మార్చారని ఆరోపిస్తూ బుధవారం ఆందోళన చేపట్టింది. భర్త యాదగిరి, కుమారుడు భానుతో కలిసి వచ్చిన ఆమె… పెట్రోల్ పోసి తహసీల్దారు ఆఫీసును తగలబెట్టేందుకు యత్నించింది.
తన భూములను ఇతరులకు రాసిచ్చారని మహిళ ఆరోపిచింది. కొండపాక తహశీల్దార్ తమను మోసం చేశారని మండిపడింది. లంచం తీసుకుని తమ భూమిని మరొకరి పేరుపై ఆన్ లైన్ చేశారని చెబుతోంది. తమ భూమిని మరొకరి పేరుతో రాయడమే కాకుండా ఏం చేసుకుంటారో చేసుకోండంటూ తహశీల్దార్ బెదిరిస్తున్నాడని బాధిత మహిళ వాపోయింది.
డీజిల్ బాటిల్ తో ఉన్న మహిళను గమనించిన తహసీల్దారు రామేశ్వర్ పోలీసులను అలెర్ట్ చేయడంతో కుకునూరుపల్లి పోలీసులు రంగ ప్రవేశం చేసి మహిళను అడ్డుకున్నారు. భూ వివాదంపై కోర్టుకు వెళ్లాలని మహిళకు తహసీల్దారు సూచించారు. ఇకపై ఇక్కడ ఆందోళనకు చేయవద్దంటూ ఆమెను అక్కడి నుంచి పంపించేశారు.