వైఎస్ వివేకాను చంపింది ఆ ఇద్దరేనా? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ కీలక పురోగతి సాధించిందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ కేసును దాదాపుగా సీబీఐ చేధించిందని అంటున్నారు. ఒకటి , రెండు రోజుల్లోనే హత్య కేసులో పూర్తి క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. వివేకా హత్య కేసులో గత మూడు నెలలుగా విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులు.. గురువారం గజ్జల ఉమా శంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇది అత్యంత కీలకమని తెలుస్తోంది. కడప జిల్లా సింహాద్రిపురం మండలం సుంకేసులకు చెందిన గజ్జల ఉమాశంకర్‌రెడ్డి (45)ని గురువారం అరెస్టు చేసి పులివెందుల కోర్టులో హాజరుపరిచారు సీబీఐ అధికారులు.  కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు సునీల్‌ యాదవ్‌ను కీలక నిందితుడిగా పరిగణించి అరెస్టు చేశారు. 10 రోజులు తమ కస్టడీలో ఉంచుకుని విచారించారు. ఆ తర్వాత వివేకా ఇంటి వాచ్‌మెన్‌ రంగయ్య, డ్రైవర్‌ దస్తగిరి వాంగ్మూలాలు మేజిస్ట్రేట్‌ సమక్షంలో నమోదు చేశారు. ఇదే క్రమంలో గురువారం కడప కేంద్రకారాగారంలోని అతిథిగృహంలో సునీల్‌ యాదవ్‌ బంధువు భరత్‌కుమార్‌ యాదవ్‌ను, ఉమాశంకర్‌రెడ్డిని మరోసారి సుదీర్ఘంగా విచారించారు. సాయంత్రం 5.10 గంటల ప్రాంతంలో సీబీఐ అధికారులు ఉమాశంకర్‌రెడ్డిని అరెస్టు చేసి పులివెందుల సివిల్‌ కోర్టుకు తీసుకొచ్చారు.జడ్జి రిమాండ్‌ విధించడంతో కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. వివేకా హత్యకేసులో ఉమాశంకర్‌ పాత్రపై సునీల్‌, డ్రైవర్‌ దస్తగిరి వెల్లడించినట్లు తెలుస్తోంది.   వివేకా హత్యకు ముందే ఆయన ఇంట్లో కుక్కను సునీల్‌, ఉమాశంకర్‌ కలిసి కారుతో ఢీకొట్టి చంపారని విశ్వసనీయ వర్గాల సమాచారం. వివేకాను హత్య చేయడానికి వీరిద్దరూ బైకుపై వెళ్లారని తెలుస్తోంది. హత్య అనంతరం ఉమాశంకర్‌ బైకులో గొడ్డలి పెట్టుకుని పారిపోయాడని సీబీఐ అధికారుల విచారణలో వెల్లడైందని సమాచారం. నిందితుడు వాడిన  బైకు, గొడ్డలిని సీబీఐ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌ నుంచి ఫోరెన్సిక్‌ నివేదిక తెప్పించారు. గత నెల 11న ఉమాశంకర్‌ ఇంట్లో రెండు చొక్కాలు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు నిందితులను కూడా పట్టుకోవలసి ఉందని, హత్యకు వాడిర ఇతర ఆయుధాలనూ స్వాధీనం చేసుకోవాలని సీబీఐ భావిస్తోందని తెలుస్తోంది. ఈ సమాచారం రాబట్టేందుకు ఉమాశంకర్‌రెడ్డిని 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ పిటిషన్‌లో పేర్కొందని సమాచారం. ఉమా శంకర్ విచారణ తర్వాత వివేకా హత్య కేసులో పూర్తి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. 

బ్రేకింగ్.. కొత్త సీఎస్ గా సమీర్ శర్మ.. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ సమీర్ శర్మ నియమితులయ్యారు. సమీర్ శర్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 1న ఆయన ప్రధాన కార్యదర్శగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 1985  ఐఎఎస్ బ్యాచ్  కు చెందిన సమీర్ శర్మ.. ప్రస్తుతం ప్రణాళిక విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా  ఉన్నారు. న్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లీడర్‌షిప్‌ గవర్నెన్స్‌ సంస్థ (ఐఎల్‌ఈజీ) వైస్‌ ఛైర్మన్, సభ్య కార్యదర్శిగా ఉన్నారు.  ఈనెల 30వ తేదీతో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పటికే మూడు నెలల ఎక్స్ టెన్షన్‌లో ఆదిత్యనాథ్ దాస్ ఉన్నారు. 

ఆరేండ్ల బాలికపై హత్యాచారం.. పండుగ పూట హైదరాబాద్ లో ఘోరం.. 

వినాయక చవిత పర్వదినం రోజున హైదరాబాద్ లో దారుణం జరిగింది. సైదాబాద్‌ లో తీవ్ర‌ క‌ల‌క‌లం చెల‌రేగింది. గురువారం సింగ‌రేణి కాల‌నీలోని ఆరేళ్ల బాలిక అదృశ్య‌మైంది. ఆమె కోసం వెత‌క‌గా చివ‌ర‌కు ఆమె ప‌క్కింట్లో నివ‌సించే రాజు అనే యువ‌కుడి ఇంట్లో మృత‌దేహం లభ్య‌మైంది.  అప్ప‌టికే రాజు ఆ ఇల్లు వ‌దిలి పారిపోయాడు. బాలిక‌పై రాజు అత్యాచారానికి పాల్ప‌డి, ఆ త‌ర్వాత చంపేసి, అక్క‌డి నుంచి పారిపోయాడ‌ని స్థానికులు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.  పొట్టకూటి కోసం నల్గొండ జిల్లా చందం పేట నుంచి నగరానికి వలస వచ్చింది ఆ బాలిక కుటుంబం. ఇంట్లో ఆడుతూ..పాడుతూ..కనిపించిన బాలిక గంటల తరబడి కంటకనిపించలేదు. సాయంత్రం అయినా చిన్నారి కనిపించకపోవడంతో బాలిక ఆచూకీ కోసం 2 గంటలపాటు తల్లిదండ్రులు వెతికినా లభించలేదు. దీంతో చిన్నారి ఇంటి పక్కనే ఉండే రాజుపై అనుమానంతో అర్ధరాత్రి 12 గంటలకు రాజు ఇంట్లో చూడగా చిన్నారి మృతదేహం లభ్యమైంది. చిన్నారి బాలికపై అత్యాచారం చేసి నిందితుడు హత్య చేశాడు.  పోలీసులతో అక్కడి స్థానికులు వాగ్వాదానికి దిగారు. నిందితుడిని వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. దీంతో పోలీసులు, స్థానికుల మధ్య తోపులాట జరిగింది. ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు పోలీసులపై రాళ్లు రువ్వి, కారం చల్లారు. దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు దాటిపోతుండటంతో కాలనీలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న చోటు చేసుకోకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.  శుక్రవారం ఉదయం నుంచి సింగ‌రేణి కాల‌నీ వాసులు చంపాపేట్ ర‌హ‌దారిపైకి వ‌చ్చి ధ‌ర్నాకు దిగారు. దీంతో పోలీసులు, కాల‌నీ వాసుల‌కు మ‌ధ్య వాగ్వివాదం కొన‌సాగుతోంది. బాలికను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఆందోళనకారులతో మాట్లాడి తక్షణ సాయం కింద కలెక్టర్ రూ.50 వేలు అందజేశారు. చంపాపేట్ రహదారిపై పోలీసులు భారీగా మోహరించారు.  

కమలదళం పంచ తంత్రం.. యూపీకి స్పెషల్ టీమ్ 

ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలలో వచ్చే సంవత్సరం (2022)లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం, కమల దళం, బీజేపీ అన్ని విధాలా సమయత్తమవుతోంది. నిజానికి రెండు మూడు నెలల ముందే వివిధ స్థాయిల్లో  సమీక్షలు, సమాలోచనలు చేసిన బీజేపీ జాతీయ నాయకత్వం..ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో క్షేత్ర స్థాయి పరిస్థితులను అధ్యయనం చేసి, కార్యప్రణాళిక, రోడ్ మ్యాప్ సిద్దం చేసుకుంది.  ఎన్నికలకు సిద్దమవుతున్న రాష్ట్రాలకు, ఎన్నికల ఇంచార్జీలను నియమించింది.  అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్టాలకు గాను, మూడు రాష్ట్రలలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ మూడు రాష్ట్రాలలో అధికారాన్ని నిలబెట్టుకోవడం, పార్టీ భవిష్యత్ ప్రస్థానానికి చాలా చాలా  అవసరం. ఒక విధంగా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, 2024 సార్వత్రిక ఎన్నికలకు దిక్సూచిగా నిలుస్తాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో పక్కా ప్రణాళికతో బీజేపీ ముందుకు పోతోంది.అన్నిటికంటే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ నాయకత్వం మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  గత (2017) అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండు వంతుల మెజారిటీతో విజయం సాధించిన యూపీలో బీజేపీకి ఇప్పుడు పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. కరోనా సెకండ్ వేవ్ కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనే భావన ప్రజలలో బలంగా ఏర్పడింది. యోగీ పాలనపట్ల ప్రజల్లోనే కాదు, పార్టీలోనూ తీవ్ర వ్యతిరేకత ఉందని జాతీయ మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చాయి.  చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా యోగీ పాలన పట్ల అసంతృప్తిని వ్యక్త చేసినట్లు వార్తలొచ్చాయి. ఒక దశలో ముఖ్యమంత్రిని మారుస్తారని కూడా రాజకీయ, మీడియా వర్గాల్లో ప్రచారం జరిగింది. బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల బాధ్యతల కోసం ఏకంగా ఐదుగురు కేంద్ర మంత్రులను రంగంలోకి దించింది.  కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ కు యూపీ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. ఆయన్ని రాష్ట్ర ఎన్నికల ఇంచార్జీగా నియమించారు. కేంద్రమంత్రులు అనురాగ్‌ ఠాకూర్‌, అర్జున్‌ రాం మేఘ్‌వాల్‌, శోభ కరంద్లాజే, అన్నపూర్ణదేవి యాదవ్‌లతో పాటు ఎంపీ సరోజ్‌ పాండే, హరియాణా మాజీ మంత్రి అభిమన్యులను సహా ఇంచార్జీలుగా పార్టీ ప్రకటించింది. అదే విధంగా ప్రాంతాల, రీజియన్ల వారీగా సంస్థాగత ఇంచార్జీలను నియమించింది. లోక్‌సభ ఎంపీ సంజయ్‌ భాటియాకు పశ్చిమ యూపీ, పార్టీ జాతీయ ఉప కోశాధికారి సుధీర్‌ గుప్తాకు కాన్పూర్‌ బాధ్యతలు అప్పగించింది. గోరఖ్‌పూర్‌ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ జాతీయ కార్యదర్శి అరవింద్‌ మేనన్‌ పర్యవేక్షించనున్నారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఒక్క బీజేపీకి మాత్రమే కాదు అన్ని పార్టీలకు కీలకమే. ఒక విధంగా యూపీ అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు, 2024 లోక్‌సభ ఎన్నికల ముందు జరికే సెమీఫైనల్  పోల్ గా భావిస్తున్నాయి. యూపీలో గెలిస్తే, కేంద్రలో బీజేపీకి హ్యాట్రిక్ ఖాయమైనట్లే అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. దేశంలోనే అత్యధికంగా 80 మంది లోక్‌సభ సభ్యులున్న రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. అందుకే, ఢిల్లీ పీఠాన్ని చేరేందుకు యూపీ దగ్గరి దారి అనేది నెహ్రూ కాలం  నుంచి నానుడిగా నిలిచి పోయింది. ఒక విధంగా ఇది రుజువుతున్న నిజం. అందుకే  లోక్ సభ ఎన్నికలలో విజయానికి, యూపీ అసెంబ్లీ ఎన్నికలు తొలి మెట్టు అంటారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ అఖండ విజయం సాధించిన కమల దళం, 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించింది, లోక్ సభలో ఏకంగా 300 మార్కును దాటేసింది. అందుకే,  వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లోనూ జయకేతనం ఎగురవేసేందుకు కాషాయ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్, ఎస్పీ, బీస్పీ వేటికవి ఒంటరి పోరాటానికి సిద్దమవుతున్నాయి. ఇది ఒక విధంగా బీజేపీకి అనుకూలించే అంశంగా భావిస్తున్నారు.   ఇక పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు కూడా వచ్చే ఏడాదే జరగనున్నాయి. అయితే ఈ రాష్ట్రంపై  కమలదళానికి అంతగా పట్టులేదు. ఆశలు కూడా లేవు. అయితే  అధికార కాంగ్రీస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చేందుకు పార్టీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. రాష్ట్ర బాధ్యతలను అధిష్ఠానం కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు అప్పగించింది. కేంద్రమంత్రులు హర్‌దీప్‌సింగ్‌ పురి, మీనాక్షి లేఖి, లోక్‌సభ ఎంపీ వినోద్‌ చావ్డా సహా ఇంచార్జీలుగా నియమించింది. పంజాబ్’లో ప్రస్తుతం కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా, అంతర్గత కుమ్ములాటలతో పార్టీ సతమతమవుతోంది. అయినా, గతంలో అకాలీదళ్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో  భాగస్వామిగా ఉన్న బీజేపీ ఇప్పుడు అనివార్యంగా ఒంటరి పోరుకు సిద్దమవుతోంది.  కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నెలల తరబడి సాగుతున్న ఆందోళన కారణంగా బీజేపీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటోంది.   మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్‌కు అప్పగించారు. మరో కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్‌, అసోం మంత్రి అశోక్‌ సింఘాల్‌ కో-ఇన్‌ఛార్జ్‌లు వ్యవహరిస్తారు. ఉత్తరాఖండ్‌ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ప్రహ్లాద్‌ జోషీ నియమితులయ్యారు. ఆయన నేతృత్వంలో ఎంపీ లాకెట్‌ ఛటర్జీ, పార్టీ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్‌ కో-ఇన్‌ఛార్జ్‌లు పనిచేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదో రాష్ట్రం గోవాకు ఇంకా నియామకాలు జరగలేదు. ఏది ఏమైనా, వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకే కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా అత్యంత కీలకం. ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ తేల్చే ఎన్నికలుగా కూడా భావించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

గోవిందా.. గోవిందా.. అమ్మకానికి తిరుపతి విమానాశ్రయం! 

తిరుమల.. హిందువులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం. తెలుగు రాష్ట్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వెంకన్న భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. విదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం తిరుపతి విమానాశ్రయం నిర్మించారు. దేశంలోని టాప్ విమానాశ్రయాల్లో  ప్రస్తుతం ఇది ఒకటి. అయితే ప్రైవేటీకరణ జపం చేస్తున్న మోడీ సర్కార్ ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుకు అప్పగించేందుకు కసరత్తు చేస్తోంది. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం కార్పొరేట్లకు దక్కబోతోంది. కేంద్ర సర్కార్ ప్రైవేటీకరణ విధానాల్లో భాగంగా తాజాగా తిరుపతి ఎయిర్ పోర్టును అమ్మకానికి పెట్టాలని కేంద్ర సర్కార్ ప్లాన్ చేస్తోంది.  నిధులను భారీ ఎత్తున సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల మానిటైజేషన్ ప్రణాళికను ప్రకటించింది. వివిద శాఖల్లోని సంస్థలు ఈ జాబితా ఉన్నాయి. తాజాగా ఇందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ముందుకొచ్చింది. వచ్చే ఏడాది నాటికి 13 విమానాశ్రయాలను ప్రైవేటీకరించేందుకు అంగీకరించింది. ఇందులో ఆరు పెద్ద విమానాశ్రయాలు, ఏడు చిన్నవి ఉన్నాయి. వీటిని కలిపేసి మరింత పెద్ద విమనాశ్రయాలుగా తీర్చిదిద్దనున్నారు. ఆరు పెద్ద విమనాశ్రయాల్లో అమృత్‌సర్, భువనేశ్వర్, ఇండోర్, రాయ్‌పూర్, తిరుచ్చి, వారణాసి ఉండగా,  ఏడు చిన్న విమానాశ్రయాల్లో హుబ్లి, తిరుపతి, ఔరంగాబాద్, జబల్‌పూర్, కంగ్రా, కుషినగర్, గయ ఉన్నాయి.  వారణాసి విమానాశ్రయంలో కుషినగర్, గయను కలిపేయనుండగా, అమృత్‌సర్‌లో కంగ్రాను, భువనేశ్వర్‌ను తిరుపతితో, రాయ్‌పూర్‌ను ఔరంగాబాద్‌తోను, ఇండోర్‌ను జబల్‌పూర్‌తోను, తిరుచ్చిని హుబ్లీతో కలిపేస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాది నాటికి ప్రైవేటీకరణ పూర్తయ్యేలా ఏఏఐ అతి త్వరలోనే కార్యాచరణ రూపొందించనుంది.  వారణాసి-కుషినగర్-గయ బుద్ధిస్ట్ సర్క్యూట్ కావడంతో బిడ్డర్లు దీనిపై ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఇవన్నీ పర్యాటక ప్రదేశాలు కావడంతోపాటు వారణాసి పవిత్ర పుణ్యస్థలం కావడం మరో కారణం. మార్చి 2024 నాటికి విమానాశ్రయాల్లో దాదాపు రూ.3,700 కోట్లు  ప్రైవేటు పెట్టబడులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. చిన్న విమానాశ్రయాలను పెద్దవాటితో కలపడం దేశంలో ఇదే తొలిసారి కానుంది. పీపీఈ మోడ్‌లో ఆదాయ పంపకాలు ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఓనర్‌షిప్ మాత్రం ప్రభుత్వానిదే. హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కొచ్చి, అహ్మదాబాద్, లక్నో, మంగళూరు విమానాశ్రయాలను పీపీపీ మోడ్‌లోనే అభివృద్ధి చేశారు.  జైపూర్, గువాహటి, తిరువనంతపురం విమానాశ్రయాలను త్వరలోనే స్వాధీనం చేసుకోనున్న అదానీ గ్రూప్.. నవీ ముంబై విమానాశ్రయాన్ని నిర్మించనుంది. ఇవన్నీ ఇప్పటికే స్వతంత్ర ప్రాతిపదికన ప్రైవేటీకరణ పూర్తిచేసుకున్నాయి.  అయితే హిందువుల పవిత్ర క్షేత్రంగా చెప్పుకునే తిరుపతి విమానాశ్రయాన్ని.. హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. భక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

సొంత చెల్లినే రోడ్డున పడేశాడు.. జనానికేం చేస్తడు! జగన్ పై నారా లోకేష్ ఫైర్.. 

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నర్సరావుపేట పర్యటన హై టెన్షన్ పుట్టించింది. లోకేష్ ను గన్నవరం ఎయిర్ పోర్టులోనే పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. లోకేష్ ను అదుపులోనికి తీసుకునే సమయంలో పోలీసులు అత్సుత్సాహం ప్రదర్శించారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశిస్తున్న లోకేష్ చేయి పట్టి కారులో నుంచి లాగేశారు పోలీసులు. తనపై పోలీసులు వ్యవహరించిన తీరుపై లోకేష్ తీవ్ర  ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ అన్నారు.  లేని దిశ చట్టాన్ని ఉందని మహిళలను వైసీపీ మోసం చేస్తోందని తెలిపారు. సొంత చెల్లికే న్యాయం చేయలేని జగన్‌.. ప్రజలకేం చేస్తారని ప్రశ్నించారు. జగన్ నివాసం సమీపంలోనే మహిళలపై ఎన్నో ఘోరాలు జరిగాయని గుర్తు చేశారు. మహిళలపై ఇన్ని దాడులు జరుగుతున్నా.. వైసీపీ మేలుకోవడం లేదని చెప్పారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్తోన్న మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు ఇప్పటివరకు న్యాయం చేయలేదన్నారు. అక్రమ కేసులతో టీడీపీ నేతలను హింసిస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే ఎందుకు భయపడుతున్నారని, దిశ చట్టం ద్వారా నిందితులను ఎందుకు శిక్షించలేకపోతున్నారని లోకేష్ ప్రశ్నించారు. అక్రమ కేసులతో టీడీపీ నేతలను హింసిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. పోలీసులతో మా పోరాటాన్ని ఆపలేరు. మొత్తం 517 బాధిత కుటుంబాలను కలిసి తీరుతానని  లోకేష్‌ ప్రకటించారు. నరసరావుపేట పర్యటనకు వెళుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను గన్నవరం ఎయిర్ పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై ఎలాంటి కేసులు లేవని ఎందుకు అదుపులోకి తీసుకున్నారని లోకేష్ వేసిన ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పలేక మౌనం వహించారు. అనవసరంగా తన పర్యటనను రాద్దాంతం చేస్తున్నారంటూ పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నరసరావుపేట పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. నారా లోకేశ్ ను ఉండవల్లిలోని ఆయన నివాసానికి తరలించారు. అనుమతి లేకుండా జాతీయ రహదారిపై ర్యాలీగా వచ్చారని పోలీసులు పేర్కొంటూ 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగించారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

క‌ల్లు తాగిన కోతుల్లా తాలిబ‌న్లు.. అఫ్గ‌న్‌లో అరాచ‌కం..

భ‌య‌ప‌డిన‌ట్టే జ‌రుగుతోంది. తాలిబ‌న్ల పాల‌న మ‌రోసారి భ‌య‌పెడుతోంది. మ‌హిళ‌లు, జ‌ర్న‌లిస్టుల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు. రాయ‌బార కార్యాల‌యాల్లో చొర‌బ‌డి పుస్త‌కాలు చింపేసి చింద‌ర వంద‌ర చేసేస్తున్నారు. ఇంట‌ర్నెట్ సేవ‌లు బంద్ చేశారు. ఆందోళ‌న కారుల‌పై ఆంక్ష‌లు విధిస్తున్నారు. మున‌ప‌టిలానే ష‌రియా చ‌ట్టాల ప్ర‌కార‌మే పాలిస్తామ‌ని తేల్చి చెప్పేశారు తాలిబ‌న్లు. త్వ‌ర‌లో కొలువుదీర‌నున్న కొత్త ప్ర‌భుత్వంలో అంత‌ర్జాతీయ స్థాయి ఉగ్ర‌వాదుల‌కు కీల‌క మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టి.. ప్ర‌పంచానికి టెర్ర‌ర్ మెసేజ్ పంపించారు తాలిబ‌న్లు.  మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన ఒక్కోడు ఒక్కో సైతాన్ లాంటోడు. ఉగ్రవాదులు, కిడ్నాపర్లు, హంత‌కులు, ఏళ్ల త‌ర‌బ‌డి జైళ్ల‌లో మ‌గ్గిన వారికి ప్ర‌భుత్వంలో స్థానం ల‌భించింది. ‘తాలిబన్‌ ఫైవ్‌’గా పేరున్న ఐదుగురు క్రూరమైన నాయకులకు కీలక పదవులు కట్టబెట్టారు. తాలిబన్‌ కొత్త ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ అబ్దుల్‌ హక్‌ వాసిక్‌, బోర్డర్‌ అండ్‌ ట్రైబల్‌ అఫైర్స్‌ మినిస్టర్‌ నూరుల్లా నూర్‌, డిప్యూటీ డిఫెన్స్‌ మినిస్టర్‌ మహమ్మద్‌ ఫాజీ, సాంస్కృతిక సమాచార మంత్రి ఖైరుల్లా ఖైరాహ్‌, తూర్పు కొహెస్త్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌గా నియమితులైన మహమ్మద్‌ నబీ ఒమర్‌. వీరంతా ‘తాలిబన్‌ ఫైవ్‌’గా పిలవ‌బ‌డే న‌ర‌హంత‌కులు.   అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల అరాచక పాలన మొదలైంది. మ‌హిళ‌ల‌ ఆందోళనలను కవర్‌ చేస్తున్న జర్నలిస్టులను చిత్ర‌హింస‌ల‌కు గురి చేశారు తాలిబ‌న్లు. తాలిబన్ల దాడిలో తీవ్రంగా గాయపడిన కొందరు జర్నలిస్టుల ఫొటోలు తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.    తాలిబన్లకు వ్యతిరేకంగా రాజధాని కాబుల్‌లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. దీంతో తాలిబన్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం.. కాబుల్‌లోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది. ఆందోళనకారులు 24 గంటల ముందు నిరసనల కోసం అనుమతి తీసుకోవాలని ఆదేశించింది.    తాజాగా కాబూల్‌లోని నార్వే రాయబార కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు లోపలున్న వైన్ సీసాలను పగలగొట్టి, పుస్తకాలను ధ్వంసం చేయ‌డంపై అంత‌ర్జాతీయంగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాలిబ‌న్ల తీరుపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది.   

డ్ర‌గ్స్ కేసులో టాప్ యాంక‌ర్‌.. ఆమెపై ఎఫ్ఐఆర్..!

డ్ర‌గ్స్ కేసు టాలీవుడ్‌ను మ‌రోసారి షేక్ చేస్తోంది. కేసు ఎక్సైజ్ శాఖ ప‌రిధి నుంచి ఈడీకి చేర‌డంతో ప్ర‌ముఖుల గుండెల్లో గుబులు రేపుతోంది. వ‌రుస‌గా సినీ సెల‌బ్రిటీల‌ను గంట‌ల త‌ర‌బ‌డి విచారిస్తోంది ఈడీ. డ్ర‌గ్స్ డీల‌ర్ కెల్విన్‌తో ఉన్న‌ సంబంధాలు, బ్యాంకు ద్వారా కెల్విన్‌కు న‌గ‌దు బ‌దిలీ లావాదేవీల‌పై ప్ర‌ధానంగా ప్ర‌శ్నిస్తోంది. ఈసారి కొత్త‌గా రానా, ర‌కుల్‌ప్రీత్‌లు కూడా డ్ర‌గ్స్ కేసులో ఈడీ ఎంక్వైరీని ఎదుర్కోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.  టాలీవుడ్‌లో కంటే శాండ‌ల్‌వుడ్‌లో డ్ర‌గ్స్ కేసు మ‌రింత ప్ర‌కంప‌ణ‌లు సృష్టిస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు క‌న్న‌డ సినీ ప్ర‌ముఖుల‌పై కేసులు న‌మోద‌య్యాయి. తాజాగా, మరోసారి శాండల్ వుడ్ డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. బెంగళూరు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ప్రముఖ కన్నడ నటి, యాంకర్ అనుశ్రీ పేరు ఉండ‌టం క‌న్న‌డ‌నాట సంచ‌ల‌నంగా మారింది. గతంలోనూ  అనుశ్రీ డ్ర‌గ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్నారు. ఆమె డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా.. మ‌త్తు ప‌దార్థాలు సరఫరా చేస్తోందని కొరియోగ్రాఫర్లు తరుణ్, కిషోర్‌లు స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇప్పటికే ఆ కేసులో కిషోర్, తరుణ్‌లు అరెస్ట్ అయ్యారు. 2017లో ఈ ఇద్ద‌రూ ఇచ్చిన వివ‌ర‌ణ‌ అధరంగా పోలీసులు విచారణ జరిపారు. ఆధారాలు దొరకడంతో తాజాగా న‌టి, యాంక‌ర్ అనుశ్రీపై కేసు నమోదు చేసి విచారణ జ‌రుపుతున్నారు. 

కేసీఆర్ తో కొండా దంపతులకు గొడవ ఇదే?  హుజురాబాద్ పోటీపై క్లారిటీ..

కొండా దంపతులు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఫ్రైర్ బ్రాండ్ లీడర్లుగా ముద్ర పడిన వారు. కొండా సురేఖ మంత్రిగా... కొండా మురళీ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను శాసించారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కొండా దంపతుల రాజకీయ జీవితం అనేక మలుపులు తిరిగింది. మొదట వైఎస్ జగన్ కు మద్దతుగా నిలిచారు. రాష్ట్ర విభజన తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పి.. ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కేసీఆర్ కేబినెట్ లో మంత్రి పదవి వస్తుందని భావించినా రాలేదు. తర్వాత కేసీఆర్ తో విభేదాలు రావడంతో 2018 ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ లో చేరారు కొండా దంపతులు. కాని గత అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసిన కొండా సురేఖ ఘోరంగా ఓడిపోయారు.  2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంత కాలం రాజకీయాల్లో యాక్టివ్ గా పాల్గొనలేదు కొండా దంపతులు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియమాకం తర్వాత మళ్లీ స్పీడ్ పెంచారు. నిజానికి గతంలో రేవంత్ రెడ్డితో వాళ్లకు తీవ్ర విభేదాలుండేవి. కాని ప్రస్తుతం రేవంత్ రెడ్డికి ప్రధాన మద్దతుదారులుగా మారిపోయారు కొండా దంపతులు. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కొండాను బరిలోకి దింపి తన సత్తా చాటాలని యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తారంటూ తమపై జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు కొండా దంపతులు. అంతేకాదు సీఎం కేసీఆర్ తో తమకు గ్యాప్ ఎందుకు వచ్చిందో చెప్పారు. అంతేకాదు టీఆర్ఎస్ లో కేసీఆర్ వ్యవహారశైలిపై సంచలన వ్యాఖ్యలు చేశారు కొండా దంపతులు.  టీఆర్ఎస్ నేతలు అంతా కేసీఆర్ కు ఊడిగం చేసేవారే  అన్నారు కొండా మురళీ. వరంగల్ దళితులకు కూడా దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వందలారీల్లో జనాలను తీసుకెళ్లి హుజురాబాద్ లో నామినేషన్ వేయిస్తా అన్నారు. టీఆర్ఎస్ లో దళిత నేతలకు సిగ్గుంటే రాజీనామా చేయాలన్నారు. 2018లో కొండా సురేఖకు ఓడించేందుకు 500 కోట్లు కేసీఆర్ ఖర్చు చేశారని కొండా మురళీ ఆరోపించారు. ఇప్పుడు ఈటల రాజేందర్ ను ఓడించేందుకు వేలకోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు.  కేసీఆర్ దగ్గర బూట్లు విడవలేదనే తనపై  కక్ష కట్టాడంటూ సంచలన ఆరోపణలు చేశారు కొండా మురళీ. వరంగల్ కు చెందిన టీఆర్ఎస్ కార్పోరేటర్లు తన కాళ్ళు పట్టుకుని టికెట్ అడుక్కుని తన కాళ్లే లాగేశారన్నారు. కాంగ్రెస్ లో గట్టినేతలను డమ్మీ చేసేందుకే మమ్ములను అప్పుడు టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని సురేఖ అన్నారు. కొండా సురేఖకు మంత్రి పదవి ఇస్తే గట్టిగా మాట్లాడుతుందని ఐదేళ్లు మంత్రి పదవి ఇవ్వకుండా దాటవేశారని ఆరోపించారు. కేసీఆర్ అసలు స్వరూపం తెలుసుకుని బయటకు వచ్చామని తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీపైనా మురళీ క్లారిటీ ఇచ్చారు. హుజురాబాద్ లో కొండా సురేఖకు పోటీచేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం అడుగుతోందంటే తమపై ఎంత నమ్మకముందో అర్థం చేసుకోవాలన్నారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ కి గట్టీ పోటీ ఇవ్వాలంటే కొండా సురేఖ కరెక్ట్ అని  కాంగ్రెస్ నేతలు  అంటున్నారని సురేఖ చెప్పారు. ఒకవేళ తాను హుజురాబాద్ లో పోటీచేసినా... మళ్లీ వరంగల్ కే వస్తానని క్లారిటీ ఇచ్చారు. అలాంటి హామీ వస్తేనే హుజూరాబాద్ లో పోటీచేస్తానని పీసీసీ చెప్పానని తెలిపారు.  గత ఎన్నికల్లో పరకాలకు వెళ్లి తప్పుచేశామన్నారు కొండా సురేఖ. కానీ ఇకపై వరంగల్ లోనే ఉంటామని స్పష్టం చేశారు.   

ఊరుకోబోమంటున్న కేటీఆర్.. తగ్గేదే లేదంటున్న విపక్షం! అందరికి ఆయనే ఆదర్శమట.. 

తెలంగాణలో రాజకీయాలు ఎంతగా దిగాజారాయో, రాజకీయ నాయకుల భాష అంతకంటే, అధః పాతాళానికి.. ఇంకా ఇంకా కానరాని లోతుల్లోకి దిగజారి పోయింది. ముఖ్యమంత్రి  కేసీఆర్ భాషలో చెప్పాలంటే, దరిద్రగొట్టు, దిక్కుమాలిన స్థాయికి చేరింది.  మంత్రి కేటీఆర్ ఆరోపిస్తున్నట్లుగా దిగజారింది, ప్రతిపక్షాల భాష  మాత్రమే కాదు, అధికార పార్టీ భాషా  పాండిత్యం అంతకంటే పది రెట్లు ఎక్కువ దిక్కుమాలిన స్థితికి ఎప్పుడో చేరుకుంది అనేది కాదనలేని జన వాక్యం. నిజం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ముఖ్యమంత్రి కేసీఆర్, అడుగుజాడల్లోనే అధికార, ప్రతిపక్ష పార్టీల చిన్న పెద్ద నాయకులు అందరూ  తమ భాషా పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్నారు. ’నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ అన్నట్లుగా విపక్ష పార్టీల నేతలు కేసీఆర్ ‘సార్’ కు ఆయన భాషలోనే గురుదక్షిణ సమర్పించుకుంటున్నారు.  భాష విషయంలో ముఖ్యమంత్రి కేసీఆరే తన గురువని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంగీకరించారు. బండి సంజయ్ లేదా మరొకరు అంగీకరించారా లేదా అనేది పక్కన పెడితే.. సామాన్య జనం మాత్రం  ప్రస్తుతం వివాదంగా మారిన తెలంగాణ రాజకీయ భాషకు, కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరే అని అంగీకరిస్తున్నారు. అందుకే ఈ భాషను సామాన్యులు కూడా కేసీఆర్ భాషగా పేర్కోవడం జరుగుతోంది. బండి సంజయ్ కానీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కానీ, మరొకరు కానీ, మాట్లాడుతోంది, వేరెవరి భాషో కాదు, కేసీఆర్ భాషలోనే మాట్లాడుతున్నారు. సరదాగానే కావచ్చు, బండి సంజయ్, రేవంత్ రెడ్డికి తమ తమ పార్టీ అధ్యక్ష పదవులు రావడానికి కూడా వారికున్న, ‘కేసీఆర్ భాషా పాండిత్యం’ కూడా ఒక కారణంగా చెపుతారు. కేసీఆర్’ కు కేసీఆర్ భాషలో సమాధానం చెప్పగలగడం ఆ ఇద్దరికి ఉన్న అదనపు అర్హతగా టీవీ చర్చల్లో, ఇతరత్రా మేథావులు, రాజకీయ విశ్లేషకులు అనేక సందర్భాలలో పేర్కొన్నారు. అంటే అటు సామాన్యుల నుంచి ఇటు మేథావుల వరకు, చివరకు ప్రతిపక్ష పార్టీల వరకు అందరూ కూడా ఈ భాషకు ఆద్యుడు కేసీఆర్ అనే భావనలోనే ఉన్నారు.  నిజంగా, తెరాస కార్యనిర్వాహక  అధ్యక్షుడు, మంత్రి కేటీఅర్’కు రాజకీయ నాయకుల భాష విషయంలో అభ్యంతరం ఉంటే, రాజకీయ భాషను సంస్కరించాలనే పవిత్ర ఆశయమే ఉంటే, అదేదో తమ ఇంట్లో మొదలు పెడితే బాగుటుంది. చిన్నవాడైనా చక్కని అడుకేశారని సభ్యసమాజం ఆయన్ని అభినందిస్తుంది. నిజమే, కేటీఆర్ అనంట్లుగా ముఖ్యమంత్రికి ఇవ్వవలసిన గౌరవం ముఖ్యమంత్రికి ఇవ్వాలి ... అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలకు, ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఇవ్వవలసిన గౌరవం వారికీ ఇవ్వాలి ... ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో, ఆ ఇంటికి ఈ ఇల్లు అంతే దూరం. అయితే, సోనియా గాంధీని దయ్యం అన్నా, అమిత షా అనామకుడు అన్నట్లుగా అవమానించినా, ప్రతిపక్ష నాయకులను దద్దమ్మలు, దగుల్బజీలు, థూ మీ బతుకులు... అన్నా, పెద్దాయన ప్రయోగించిన భాషను, మంత్రి కేటీఆర్ సంస్కారవంతమైన భాషా, భావిస్తున్నారు. అదే అసలు దురదృష్టం.   అంతే కాదు మంత్రి కేటీఆర్ ప్రతిపక్ష పార్టీలకు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి  మీద అవాకులు చవాకులు పేలితే ఊరుకున్నామని.. ఏడేళ్లు భరించామని.. ఇక భరించే ప్రసక్తే లేదని.. ఇకపై ఏదైనా మాట అంటే బరాబర్ సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు సమాధానం చెప్పాల‌ని టీఆర్ఎస్ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. అవ‌త‌లి వారు ఒక్కటి అంటే.. పది మాట‌లు అనాలంటూ బోధించారు. బహశా, ఇది తెలంగాణ భాషాదినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షడు కేటీఆర్ ఇచ్చిన సందేశం కావచ్చును. కాళోజీ మమ్ములను క్షమించు గాక..

చెయ్యి ప‌ట్టి లాగి.. లోకేశ్‌పై పోలీసుల దౌర్జ‌న్యం.. టీడీపీ తీవ్ర ఆగ్ర‌హం..

ఎందుకోగానీ ఇటీవ‌ల నారా లోకేశ్ అంటే జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు బాగా భ‌య‌ప‌డుతున్న‌ట్టుంది. ఆయ‌న ఎక్క‌డికి వెళితే అక్క‌డ పోలీసుల‌ను మోహ‌రించి లోకేశ్ ముంద‌రి కాళ్ల‌కు బంధం వేస్తోంది. ఏకంగా వెయ్యి మంది పోలీసులు లోకేశ్‌ను చుట్టుముట్ట‌డ‌మంటే మాట‌లా? లోకేశ్‌ మాట‌ల్లో దూకుడు, చేత‌ల్లో వాడి-వేడి పెర‌గ‌డ‌మే ప్ర‌భుత్వ ఆందోళ‌న‌కు కార‌ణం కావొచ్చు. పైగా నారా లోకేశ్ ఎంచుకుంటున్న స‌మ‌స్య‌లు సైతం స‌ర్కారును ఇర‌కాటంలో ప‌డేసేవే కాబ‌ట్టి.. లోకేశ్ ప‌ర్య‌ట‌న‌ల‌ను పోలీసుల స‌హాయంతో అడ్డుకుంటోంది వైసీపీ ప్ర‌భుత్వం. తాజాగా, న‌ర‌సరావుపేట‌లో అనూష కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను గన్నవరం ఎయిర్ పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొవిడ్ నిబంధ‌న‌ల కార‌ణంగా ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి లేదంటూ నారా లోకేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విజ‌య‌వాడ త‌రలించారు.  త‌నను అడ్డుకోవ‌డంపై పోలీసుల‌తో వాగ్వాదానికి దిగారు నారా లోకేశ్‌. ‘ నా పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియట్లేదు. నేను ధర్నాలు, ఆందోళనలు చేయడానికి వెళ్లట్లేదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుంటే పోలీసులు కావాలనే అడ్డుకుంటున్నారు. ఏది తప్పో.. ఏది ఒప్పో నాకు తెలుసు. నాపై ఎలాంటి కేసులు లేవు’ అని నారా లోకేష్ పోలీసుల‌పై మండిప‌డ్డారు. అయినా, లోకేశ్‌ను బ‌ల‌వంతంగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ సంద‌ర్భంగా ఖాకీలు లోకేశ్‌ చెయ్యి పట్టి కారు లోంచి బ‌య‌ట‌కు లాగడంపై టీడీపీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. పోలీసుల తీరును నిరసిస్తూ.. టీడీపీ నేత‌లు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు టీడీపీ నాయ‌కులు. పోలీసు వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడుతున్నారు. పోలీసులు తమ విధులు నిర్వర్తిస్తే క్రైం రేటు తగ్గేదన్నారు. లోకేష్‌ను చూసి జగన్ ప్రభుత్వం ఎందుకంత భయపడుతోంది ప్రశ్నింస్తోంది టీడీపీ. 

తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై 31 కేసులు.. కేసీఆర్ అంతలా భ‌య‌ప‌డుతున్నారా?

కేసీఆర్ భ‌య‌ప‌డేది ఇద్ద‌రే ఇద్ద‌రిక‌ని అంటారు. ఒక‌రు రేవంత్‌రెడ్డి.. మ‌రొక‌రు తీన్మార్ మ‌ల్ల‌న్న‌. రేవంత్‌రెడ్డి బ‌హిరంగ వేదిక‌లు, ప్రెస్‌మీట్ల‌తో కేసీఆర్‌ను కుమ్మేస్తుంటే.. తీన్మార్ మ‌ల్ల‌న్న క్యూ-న్యూస్ యూట్యూబ్ ఛానెల్‌తో కేసీఆర్ స‌ర్కారును కుళ్ల‌బొడుస్తుంటారు. ముఖ్య‌మంత్రిని, మంత్రుల‌ను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేత‌లు.. ఇలా ఏ ఒక్క‌రినీ వ‌ద‌ల‌కుండా మాట‌లు, తిట్ల‌తో తూట్లు పొడుస్తుంటారు. అందుకే మ‌ల్ల‌న్న ఛానెల్‌ను ఎన్నిసార్లు మూసేయించినా.. మ‌ళ్లీ మ‌రో పేరుతో అదే దూకుడు ప్ర‌దర్శిస్తుంటారు. మిలియ‌న్ల కొద్దీ స‌బ్‌స్క్రైబ‌ర్స్‌తో.. రోజూ ల‌క్ష‌ల్లో వ్యూస్‌తో.. కేసీఆర్ వ్య‌తిరేకులంద‌రికీ మంచి సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా మారింది క్యూ-న్యూస్‌. ఇక తీన్మార్ మ‌ల్ల‌న్న వారంద‌రికీ హీరో. తెలంగాణ‌లో తిరుగులేని పాపులారిటీ. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో కేసీఆర్ కంటే మ‌ల్ల‌న్న‌కే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారంటే న‌మ్మాల్సిందే. అందుకే, ఇటీవ‌ల ఎమ్మెల్సీగా పోటీ చేస్తే.. గ్రాడ్యూయేట్లు తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను విశేషంగా ఆద‌రించారు. కేసీఆర్ పార్టీకి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. కొద్దిలో సెకండ్ ప్లేస్‌కు ప‌రిమిత‌మ‌య్యారు. లేదంటేనా.. ఈపాటికి మ‌ల్ల‌న్న మ‌రో లెవెల్‌లో ఉండేవారు.  జ‌నాల్లో మ‌ల్ల‌న్న పాపులారిటీ చూసి.. అప్ప‌టి నుంచి ఆయ‌న్ను మరింత టార్గెట్ చేశార‌ని అంటారు. ఏదో ఒక కేసుతో.. క్యూ-న్యూస్‌ను క్లోజ్ చేసి.. మ‌ల్ల‌న్న‌ను మూసేయాల‌ని స‌ర్కారు ల‌క్ష్యంగా పెట్టుకుంద‌ని చెబుతారు. అందుకే, ఓ బెదిరింపు కేసులో ఆయ‌న్ను వారాల త‌ర‌బ‌డి జైల్లోనే ఉంచేస్తున్నారు. బెయిల్ రాకుండా చేసేందుకు స‌ర్కారు ప‌క‌డ్బందీ కేసులు బ‌నాయిస్తోంద‌ని అంటున్నారు. ఇదే మంచి ఛాన్స్ అంటూ క్యూ-న్యూస్ ఆఫీసుపై ప‌లుమార్లు పోలీసులు త‌నిఖీలు చేసి.. అనేక కంప్యూట‌ర్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు.  తీన్మార్ మ‌ల్ల‌న్న బ‌య‌ట‌కు వ‌స్తే.. అంద‌రికంటే కేసీఆర్‌కే ఎక్కువ డ్యామేజ్‌. అందుకే, ఆయ‌నపై కేసుల‌పై కేసులు న‌మోదు చేసి.. సాధ్య‌మైనంత కాలం జైల్లోనే ఉంచేలా ప్లాన్ చేస్తున్నార‌ని అనుమానిస్తున్నారు. మ‌ల్ల‌న్న‌పై ఇప్ప‌టి వ‌ర‌కూ 31 కేసులు న‌మోదు చేశారు పోలీసులు. ఆ కేసుల‌ వివ‌రాలు ఇలా ఉన్నాయి.... ఇక తాజాగా తీన్మార్ మ‌ల్ల‌న్న అలియాస్‌ చింతపండు నవీన్‌కుమార్‌ను సైబర్‌ క్రైం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మల్లన్నను ఒక్కరోజు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరగా.. ధర్మాసనం ఆ మేరకు అనుమతిచ్చింది. ఈ క్రమంలో ఆయనను హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు ప్రశ్నిస్తున్నారు.  మ‌రోవైపు, మ‌ల్ల‌న్న‌కు పార్టీల‌కు అతీతంగా వివిధ ప్ర‌ముఖుల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. బీజేపీ నేత‌, వీ6 ఛానెల్‌, వెలుగు పేప‌ర్ అధినేత వివేక్ వెంక‌ట‌స్వామి మ‌ల్ల‌న్న ఇంటికెళ్లి ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడారు. అంత‌కుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క సైతం మ‌ల్ల‌న్న కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఇలా అన్ని వ‌ర్గాల నుంచి తీన్మార్‌ మ‌ల్ల‌న్న‌కు స‌పోర్ట్ ల‌భిస్తుండ‌టంతో సర్కారులో ఫ్ర‌స్టేష‌న్ మ‌రింత పెరిగిపోతున్న‌ట్టుంది.   

లోకేష్ ను అడ్డుకునేందుకు 1000 మంది పోలీసులు.. జగన్ రెడ్డికి ఎందుకంత భయం? 

గుంటూరు జిల్లా నర్సారావుపేటలో టీడీపీ నేత నారా లోకేశ్ పర్యటన హై టెన్షన్ పుట్టిస్తోంది. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న లోకేశ్ ను ఎయిర్ పోర్టు నుంచి పోలీసులు బయటకు రానివ్వలేదు. విమానాశ్రయం లోపలే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. లోకేశ్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెపుతున్నారు. నారా లోకేశ్ వస్తున్న నేపథ్యంలో ఎయిర్ పోర్టు వద్దకు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. వీరందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని... అక్కడి నుంచి పోలీసు వాహనాల్లో తరలించారు.  నారా లోకేష్ ను అడ్డుకునేందుకు గన్నవరం ఎయిర్ పోర్ట్ లోనే 150 మంది పోలీసులను మోహరించారు. నలుగురు ఏసీపీలు అక్కడే ఉన్నారు. విమానాశ్రయం పరిసరాలు, జాతీయ రహదారిపై అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. గన్నవరం నుంచి నరసరావుపేట వరకు 1000 మంది పోలీసులతో  పహారా పెట్టారు. నరసరావుపేటలో 144 సెక్షన్ విధించారు. నరసరావుపేట టీడీపీ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల ఓవరాక్షన్ పై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. లోకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై మండిపడుతున్నారు. జగన్ రెడ్డి... ఎందుకంత భయం అంటూ ప్రశ్నిస్తున్నారు.  గత ఫిబ్రవరి 24న ఉన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష కుటుంబసభ్యులను నరసరావుపేటలో పరామర్శించనున్నారు లోకేష్. ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీడీపీ నేతలు స్థానిక పోలీసు అధికారులకు దరఖాస్తు అందజేసేందుకు వెళ్లగా దానిని స్వీకరించేందుకు వారు నిరాకరించారు.  లోకేష్ పర్యటన దృష్ట్యా టీడీపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు. సత్తెనపల్లిలో టీడీపీ నేత కోడెల శివరాంను హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ నేత అరవిందబాబును గృహ నిర్బంధం చేశారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి హౌస్‌ అరెస్ట్‌ చేశారు. నక్కా ఆనందబాబు, కార్పొరేటర్లు దేవినేని అపర్ణ, ఉషారాణిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గన్నవరంలో శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

కేసీఆర్‌పై సీబీఐ డైరెక్ట‌ర్‌కి ఫిర్యాదు.. ఢిల్లీలో రేవంత్‌రెడ్డి దూకుడు..

సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే తిష్ట వేశారు. కేంద్ర పెద్ద‌ల‌ను క‌లిశారు. ఆ త‌ర్వాత నుంచి గాయ‌బ్‌. ఢిల్లీలోనే ఉన్నారు కానీ, ఎక్క‌డ ఉన్నారో.. ఏం చేస్తున్నారో.. ఎవ‌రిని క‌లుస్తున్నారో.. ఏం మంత్రాంగం నెర‌పుతున్నారో... మూడోకంటికి తెలీడం లేదు. ఇలా కేసీఆర్ హ‌స్తిన‌లో త‌న‌దైన రాజ‌కీయం న‌డుపుతుండ‌గా.. గులాబీ బాస్‌కు పోటీగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం ఢిల్లీలో ద‌డ‌ద‌డ‌లాడిస్తున్నారు. ఇద్ద‌రు హేమాహేమీల పాలిటిక్స్‌తో.. ఢిల్లీలో తెలంగాణ పొలిటిక‌ల్ హీట్ పెరిగింది.  రేవంత్‌రెడ్డి ప‌లువురు పీసీసీ స‌భ్యుల‌తో క‌లిసి ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీని క‌లిశారు. రాష్ట్ర రాజ‌కీయాల‌పై మంత‌నాలు జ‌రిపారు. కేసీఆర్‌ను గ‌ద్దె దించ‌డానికి అవ‌లంభించాల్సిన భ‌విష్య‌త్ వ్యూహాల‌పై చ‌ర్చించారు. ద‌ళిత‌-గిరిజ‌న దండోరా స‌భ‌కు రావాల‌ని రాహుల్‌ను ఆహ్వానించారు రేవంత్‌.  రాహుల్‌గాంధీతో మీటింగ్ ముగిసినా.. ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు రేవంత్‌రెడ్డి. కేసీఆర్ ప‌న్నుతున్న ఎత్తుల‌ను చిత్తు చేసేలా కాంగ్రెస్ పెద్ద‌ల‌తో ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నార‌ని తెలుస్తోంది. ప‌నిలో ప‌నిగా.. కేసీఆర్ స‌ర్కారును ఇర‌కాటంలో పెట్టేలా ప‌లు పావులు సైతం కదుపుతున్నారు పీసీసీ చీఫ్‌. అందులో భాగంగా.. ఢిల్లీలో సీబీఐ డైరెక్ట‌ర్‌ను క‌లిసి.. సీఎం కేసీఆర్‌పై ఫిర్యాదు చేశారు రేవంత్‌రెడ్డి. ఇటీవ‌ల కోకాపేట‌, ఖానామెట్‌లో ప్ర‌భుత్వ భూముల వేలంలో పెద్ద ఎత్తున గోల్‌మాల్ జ‌రిగింద‌ని నేరుగా సీబీఐ డైరెక్ట‌ర్‌కే కంప్లైంట్ ఇచ్చి కాక రేపారు.  సీఎం కేసీఆర్ త‌న‌కు కావాల్సిన వారికి కారు చౌక‌గా ప్ర‌భుత్వ భూముల‌ను క‌ట్ట‌బెట్టార‌ని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఖ‌జానాకు 1500 కోట్ల న‌ష్టం తెచ్చార‌ని.. రాత‌పూర్వ‌కంగా సీబీఐ డైరెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు రేవంత్ తెలిపారు. సీఎస్ సోమేశ్‌కుమార్‌, జ‌యేశ్ రంజ‌న్‌పై కూడా ఫిర్యాదు చేసిన‌ట్టు వెల్ల‌డించారు. హ‌స్తిన‌లో మ‌కాం వేసి.. కులాసాగా రాజ‌కీయ వ్యూహాలు ర‌చిస్తున్న గులాబీ బాస్‌కు.. అదే ఢిల్లీలో రేవంత్‌రెడ్డి సీబీఐకి ఇచ్చిన‌ ఫిర్యాదుతో కేసీఆర్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ‌టం ఖాయ‌మంటున్నారు. రేవంత్‌రెడ్డా మ‌జాకా.. అంటున్నారు కాంగ్రెస్‌వాదులు.  

ఏపీలో వరుస దారుణాలు? జగన్ రెడ్డి ప్రభుత్వానిదే పాపమా? 

ఏపీలో వ‌రుస దారుణాలు. రెండేళ్లలో వంద‌లాది అరాచ‌కాలు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ఏమైంది? మ‌హిళ‌ల‌కు ఎందుకు ర‌క్ష‌ణ లేకుండా పోతోంది? ఓ శాడిస్టు న‌డిరోడ్డుపైనే క‌త్తితో హ‌త‌మారుస్తాడు. మ‌రో దుర్మార్గుడు ఏకంగా పెట్రోల్ పోసి త‌గ‌ల‌బెట్టేస్తాడా? ఇద్ద‌రు ఉన్మాదులు న‌దీ తీరంలో అఘా-యిత్యానికి తెగ‌బ‌డుతారు. తాజాగా, గుంటూరు జిల్లాలో అర్థ‌రాత్రి బైక్‌పై వెళ్తున్న దంప‌తుల‌ను బెదిరించి.. వివాహిత‌ను పొలాల్లోకి లాక్కెళ్లి.. చెర‌బ‌ట్టారు. ఏమిటీ అమానుషం? ఎందుకీ ఉన్మాదం? అనూష‌.. ర‌మ్య‌.. ఇలా ఎంత‌మంది యువ‌తులు మాన‌వ మృగాళ్ల‌కి బ‌లి కావాలి? ఒక‌ప్పుడు ప్ర‌శాంతంగా ఉండే రాష్ట్రం.. ఇప్పుడు ఎందుకిలా రాక్ష‌స‌ రాజ్యంగా మారింది? ఎవ‌రిది త‌ప్పిదం? ఎక్క‌డుంది లోపం? అంటే.. అన్ని వేళ్లూ జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు వైపే చూపిస్తున్నాయ‌ని అంటున్నారు.  యువ‌తిపై దారుణానికి ఒడిగ‌డితే.. ఎన్‌కౌంట‌ర్ పేరుతో కాల్చిపారేశారు తెలంగాణ పోలీసులు. ఆ ఘ‌ట‌న‌తో ఏపీలో దిశ చ‌ట్టం తీసుకొచ్చింది వైసీపీ స‌ర్కారు. 21 రోజుల్లోనే నిందితుల‌కు క‌ఠిన శిక్ష ప‌డేలా చేస్తామంటూ ప్ర‌గ‌ల్బాలు ప‌లికింది. మూడు వారాల్లో శిక్ష కాదుక‌దా.. నెల‌లు గ‌డుస్తున్నా తాడేప‌ల్లి రే*ప్ కేసు ఇద్ద‌రు నిందితుల్లో ఇంకొక‌డు ఇంకా ప‌రారీలోనే ఉండ‌టం జ‌గ‌న్ స‌ర్కారు చేత‌గానిత‌నానికి నిద‌ర్శ‌నమ‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ర‌క్ష‌ణ భ‌టుల‌ను ర‌క్ష‌ణ కోసం కాకుండా.. టీడీపీపై క‌క్ష్య సాధింపు చ‌ర్య‌ల్లో బిజీగా ఉంచ‌డంతో ఖాకీలంతా అస‌లు ప‌ని వ‌దిలేసి కొస‌రు ప‌నులు ఎక్కువ‌గా చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. పోలీసులంటే భ‌యంలేక పోవ‌డం వల్లే.. ఏపీలో వ‌రుస దారుణాలు జ‌రుగుతున్నాయ‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.  ఖాకీల తీరు అడుగ‌డుగునా వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. తాజా, గుంటూరు ఘ‌ట‌న‌నే తీసుకుంటే.. గ్యాంగ్ రే*ప్ బాధితులు అర్ధరాత్రి సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా.. ఫిర్యాదు తీసుకునేందుకు అక్కడి పోలీసులు నిరాకరించారంటే ఇంత‌కంటే దారుణం ఇంకోటి ఉండ‌దు. ఘటన జరిగిన ప్రదేశం గుంటూరు అర్బన్‌ పరిధిలోకి వస్తుందని.. తమ పోలీస్‌స్టేషన్‌ గుంటూరు రూరల్‌ పరిధిలో ఉంటుందని చెప్పి బాధితుల‌ను తిప్పిపంపించేయ‌డంపై పోలీసుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఘటన ఎక్కడ జరిగినా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. కేసును సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయాలంటూ ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నప్పటికీ సత్తెనపల్లి పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించడం ఖాకీల అధ్వాన‌పు ప‌నితీరుకు నిద‌ర్శ‌నమ‌ని మండిప‌డుతున్నారు.  దిశ చ‌ట్టం పేరుతో ప్ర‌చారం అయితే ఫుల్‌గా చేసుకుంటున్నారు కానీ.. ఆ చ‌ట్టం ప్ర‌కారం ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక‌రికైనా త‌క్ష‌ణ క‌ఠిన శిక్ష ప‌డిన దాఖ‌లాలు ఉన్నాయా? అని ప్ర‌శ్నిస్తున్నారు. దిశ బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం ఎలాంటి ఒత్తిడి చేయ‌డం లేద‌నేది ప్ర‌తిప‌క్షాల మాట‌. ఇక దిశ పేరుతో మొబైల్‌ యాప్‌ను హ‌డావుడిగా తీసుకొచ్చి.. ఇదే మీకు శ్రీరామ‌ర‌క్ష అంటూ స‌ర్కారు చేతులు దులిపేసుకుంద‌ని అంటున్నారు. దిశ యాప్ వ‌చ్చాక కూడా.. ముగ్గురు మ‌హిళ‌ల‌పై అమానుషాలు జ‌రిగాయంటే.. దిశ యాప్ ఏ మేర‌కు దారుణాల‌ను అడ్డుకుంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. గుంటూరులో అర్థ‌రాత్రి స‌డెన్‌గా ఉన్మాదులు అడ్డ‌గించి దాడి చేస్తే.. జేబులోంచి మొబైల్ తీసి.. దిశ యాప్ ఓపెన్ చేసి.. బ‌ట‌న్ నొక్కేంత ఛాన్స్ ఎక్క‌డుంటుంది? దిశ యాప్ కొన్ని ప‌రిస్థితుల్లో మాత్ర‌మే ఉప‌యుక్తం. అంతేకానీ, ఆ ఒక్క యాప్‌తో అన్ని ఘ‌ట‌న‌ల‌నూ అడ్డుకోలేమ‌నే విష‌యం స‌ర్కారుకు తెలీదా?  సీఎం జ‌గ‌న్‌రెడ్డి నివాస‌ముండే తాడేప‌ల్లి ప్యాలేస్ స‌మీపంలోని సీతాన‌గ‌రం ఘాట్‌లో యువ‌తిపై అఘాయిత్యం జ‌రిగితే.. నెల‌ల త‌ర‌బ‌డి ఒక్క నిందితుడిని కూడా ప‌ట్టుకోలేక‌పోయారు. పోలీసులు ప‌నితీరు ఇలా ఉంటే.. ఇక నేర‌గాళ్ల‌లో భ‌యం ఎలా ఉంటుంది? దిశ చ‌ట్టంతో ఇప్ప‌టి వ‌ర‌కూ త‌క్ష‌ణ శిక్ష ప‌డ‌క‌పోతే.. ఇక తామేమైనా త‌ప్పుచేస్తే పోలీసులు శిక్షిస్తార‌నే ఫియ‌ర్ ఎక్క‌డి నుంచి వ‌స్తుంది? ప్ర‌తిప‌క్షాలు దిశ చ‌ట్టం ఉత్తుత్తి చ‌ట్ట‌మంటూ ఉద్య‌మిస్తుంటే.. వారిని అణిచివేస్తూ.. విప‌క్షం గొంతునొక్క‌డంపై వైసీపీ ప్ర‌భుత్వం క‌న‌బ‌రుస్తున్న శ్ర‌ద్ధ‌.. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంపై పెట్టుంటే.. ఇలా వ‌రుస ఘ‌ట‌న‌లు జ‌రిగి ఉండ‌క‌పోవ‌చ్చు అంటున్నారు. ఇలాంటి దారుణాల‌న్నీ పోలీసులు, పాల‌కుల చేత‌గానిత‌నం వ‌ల్లేనంటూ మ‌హిళ‌లు మండిప‌డుతున్నారు.

గుంటూరు జిల్లాలో మరో గ్యాంగ్ రేప్! ఏపీలో మహిళలకు రక్షణే లేదా? 

ఆంధ్రప్రదేశ్ లో మహిళల రక్షణే లేకుండా పోతోంది. వరుస ఘటనలు జరుగుతున్నా పోలీసులు సీరియస్ గా స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అఘాయిత్సాలు జరుగుతూనే ఉన్నాయి. రమ్య ,అనూష ఘటనలు మరవకముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. సత్తెనపల్లి మండలంలో మరో గ్యాంగ్ రేప్ జరిగింది.  గుంటూరులో జరిగిన ఓ వివాహానికి హాజరైన సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గత రాత్రి బైక్‌పై తిరిగి బయలుదేరారు. ఈ క్రమంలో మేడికొండూరు అడ్డరోడ్డు సమీపంలో వారిని అడ్డగించిన దుండగులు మహిళ భర్తపై దాడిచేశారు. అనంతరం వివాహితను పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి దాటాక బాధితులు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు.  అయితే ఈ ఘటన జరిగిన ప్రదేశం గుంటూరు అర్బన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఫిర్యాదు తీసుకోబోమని పోలీసులు తేల్చి చెప్పినట్టు బాధితులు వాపోయారు. పోలీసుల తీరుతో బాధితులు నిరాశగా వెనుదిరిగారు. నిజానికి ఘటన ఎక్కడ జరిగినా తొలుత జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తర్వాత విచారణ చేపట్టిన పోలీసులు పురోగతి సాధించారు. పాలడుగు దగ్గర కోల్డ్‌ స్టోరేజ్‌లో పనిచేసే 8 మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ఒడిశా, విజయనగరానికి చెందిన యువకులుగా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళలపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలు, హత్యాచారాలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. సత్తెనపల్లి  ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అఘాయిత్యాలకు అడ్రస్ గా మారిందని లోకేశ్ విమర్శించారు. బైక్ పై వెళ్తున్న జంటపై దాడి చేసి, మహిళపై అమానుషానికి పాల్పడటం బాధాకరమని అన్నారు. ఫిర్యాదు చేయడానికి బాధితులు పోలీస్ స్టేషన్ కి వెళ్తే... అది తమ పరిధిలోకి రాదని పోలీసులు చెప్పడం దారుణమని మండిపడ్డారు. మహిళలపై వరుసగా అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వంలో ఏ మాత్రం చలనంలేదని అన్నారు. పరామర్శకు తాను వెళ్తుంటే వేలాది మంది పోలీసులను రంగంలోకి దించారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను కక్షసాధింపులకు ఉపయోగించుకుంటోందని... అందువల్లే ఇలాంటి దుస్థితి నెలకొందని చెప్పారు.

లోకేష్‌కు స్వాగ‌తం చెప్పేందుకు వెళ్లిన రఘురామ.. అదుపులోకి తీసుకున్న‌ పోలీసులు..

నారా లోకేశ్‌ను చూసి జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు భ‌య‌ప‌డుతున్న‌ట్టుంది? ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ల‌ను ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకుంటోంది. ఇటీవ‌ల ఏకంగా లోకేశ్‌ను అరెస్ట్ చేసి క‌క్ష్య తీర్చుకుంది. తాజాగా, నారా లోకేశ్ న‌ర‌స‌రావుపేట ప‌ర్య‌ట‌న‌పైనా పోలీసులు తీవ్ర ఆంక్ష‌లు విధించారు. టీడీపీ నాయ‌కుల‌ను గృహ నిర్బంధం చేశారు. గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం ద‌గ్గ‌ర పోలీసులు భారీగా మోహ‌రించారు.  ఫిబ్రవరి 24న ఉన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష కుటుంబసభ్యులను నరసరావుపేటలో పరామర్శించనున్నారు లోకేష్. ఆయన పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు ప్ర‌క‌టించ‌డం వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. టీడీపీ నాయ‌కుల‌ను, లోకేశ్‌కు మ‌ద్దతు తెలిపేందుకు వ‌స్తున్న వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఖాకీలు క‌ట్ట‌డి చేస్తున్నారు.  ఇక‌, గన్నవరం ఎయిర్ పోర్టులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు స్వాగతం పలికేందుకు బయలు దేరిన టీయన్‌టియుసి అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజును పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్‌టీఎస్ రోడ్డులో రఘురామ‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రభుత్వం, పోలీసులు తీరుపై రాఘురామ‌రాజు తీవ్ర‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

కేసీఆర్ ఢిల్లీ టూర్‌తో బీజేపీలో టెన్ష‌న్‌.. బండి సంజ‌య్ మాట‌ల్లో భ‌యం!

జ‌స్ట్ బిల్డింగ్ ఓపెనింగ్‌కు ఢిల్లీ వెళ్లారు. అంతే. ఆ త‌ర్వాత వెంట‌నే హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చేయాలి. కానీ, ఢిల్లీ వెద‌ర్ బాగా న‌చ్చిన‌ట్టుంది. అక్క‌డే తిష్ట వేశారు సీఎం కేసీఆర్‌. వెళ్లినాయ‌న ఊరికే ఉండ‌క‌.. వెద‌ర్ ఎంజాయ్ చేయ‌గా.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌ రాజ‌కీయ ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. పీఎం మోదీని అపాయింట్‌మెంట్ అడిగారు. ఆయ‌న వెంట‌నే ఇచ్చేశారు. దాదాపు గంట ముచ్చ‌ట పెట్టారు. ఆ త‌ర్వాత హోంమంత్రి అమిత్‌షాను క‌లుస్తాన‌న్నారు. ఆయ‌నా రండి రండి అంటూ వెల్‌క‌మ్ చెప్పారు. వెళ్లి క‌లిశారు. ఆ త‌ర్వాత ప‌లువురు మంత్రుల‌తో మిలాఖ‌త్‌. ఇలా సీఎం కేసీఆర్ ఢిల్లీలో తెగ బిజీగా ఉన్నారు. ఏపీ సీఎం జ‌గ‌న్ ప‌లుమార్లు ఢిల్లీలో మ‌కాం వేసి.. కేంద్రం పెద్ద‌ల ద‌ర్శ‌నం కోసం ఎంత పాకులాడినా.. ముఖం చాటేసేవారే కానీ.. అడిగిన వెంట‌నే అపాయింట్‌మెంట్ మాత్రం ఇచ్చేవారు కాదు. కానీ, తెలంగాణ ముఖ్య‌మంత్రికి మాత్రం ఇలా అడ‌గ్గానే.. అలా రెడ్ కార్పెట్ ప‌రిచేశారు కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌ముఖులంతా. దీంతో.. టీఆర్ఎస్, బీజేపీ దొందు దొందేనంటూ కాంగ్రెస్, సీపీఐలు విమ‌ర్శ‌లు గుప్పించాయి. నిజ‌మేనా..? కారు-క‌మ‌లం దోస్తులేనా? అనే సందేహం అంద‌రిలోనూ. అందుకు త‌గ్గట్టుగానే ఢిల్లీలో కేసీఆర్ న‌డుపుతున్న‌ రాజ‌కీయం తెలంగాణ‌లో కాక రేపుతోంది.  కేసీఆర్ ట్రాప్‌లో క‌మ‌ల‌నాథులు ప‌దే ప‌దే చిక్కుతున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు. గ‌తంలో గ‌వ‌ర్న‌ర్‌లుగా ఎంపికైన విద్యాసాగ‌ర్‌రావు, ద‌త్తాత్రేయ లాంటి వారికి ఘ‌నంగా స‌న్మానం చేసి బీజేపీ-టీఆర్ఎస్‌లు ఒక్క‌టేన‌నే ప్ర‌చారం జ‌రిగేలా చేసి క‌మ‌ల‌నాథుల‌ను కొన్నాళ్ల పాటు డిఫెన్స్‌లో ప‌డేశారు కేసీఆర్‌. ఆయ‌న రాజ‌కీయం అలానే ఉంటుంది మ‌రి. తాజాగా, ఓవైపు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర‌తో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌పై దండ‌యాత్ర ప్ర‌క‌టిస్తే.. హుజురాబాద్‌లో బీజేపీ నేత ఈట‌ల రాజేంద‌ర్ క‌వ్విస్తుంటే.. కేసీఆర్ ఏమో ఢిల్లీ వెళ్లి ఎంచ‌క్కా కేంద్ర పెద్ద‌ల‌ను క‌లిసి.. మ‌రో ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్‌కు మంచి అవ‌కాశం క‌ల్పించారు. తాను మోదీని, అమిత్‌షాను క‌లిస్తే.. బీజేపీ-టీఆర్ఎస్ దొందు దొందేన‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు ప్ర‌చారం చేస్తాయ‌ని ఆయ‌న‌కు ముందే తెలుసు. అలా చేయాల‌నేదే కేసీఆర్ స్కెచ్‌. తామిద్ద‌రం ఒక‌టేన‌నే మెసేజ్ వెళితే.. బీజేపీ దూకుడు, ఉత్సాహ‌మంతా నీరు కారిపోవ‌డం ఖాయమ‌నేది గులాబీ బాస్ వ్యూహం. ప‌నిలో ప‌నిగా కేంద్రానికి ప‌లు అంశాల్లో డిమాండ్లు వినిపించి.. అవి నెర‌వేర‌క‌పోతే.. బీజేపీ తెలంగాణ‌కు అన్యాయం చేస్తోంద‌ని ఆ పార్టీని బ‌ద్నామ్ చేసేందుకు కూడా కేసీఆర్‌కు మంచి ఛాన్స్ చిక్కుతుంది. ఇలా, టూ టార్గెట్స్ ఎట్‌ వ‌న్ టూర్‌.. అనేది కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ల‌క్ష్యం అంటున్నారు.   కేసీఆర్ ఎత్తుగ‌డ‌ను ప‌సిగ‌ట్టిన బండి సంజ‌య్ అందుకు విరుగుడు మంత్రాన్ని వ‌ల్లెవేస్తున్నారు. పాద‌యాత్ర‌లో ఉన్న బండి.. తాజాగా గులాబీ నేత‌ల‌పై సంచ‌ల‌న కామెంట్లు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తున్నారనే ఇంటలిజెన్స్ సమాచారంతోనే.. కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, మంత్రులను కాపాడుకోవడానికి కేసీఆర్ ఢిల్లీ వెళ్లార‌ని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కాదని తేల్చి చెప్పారు. బీజేపీతో తప్ప టీఆర్ఎస్ అన్ని పార్టీలతో కలిసి పోటీ చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్‌కి ఓటేస్తే టీఆర్ఎస్ వేసినట్లే అన్నారు. బండి సంజ‌య్ మాట‌ల్లో ఆరోప‌ణకంటే.. భ‌య‌మే ఎక్కువ క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. బీజేపీ-టీఆర్ఎస్ ఒక్క‌టి కాద‌ని బ‌లంగా చెప్ప‌డానికే ఇలాంటి వ్యాఖ్య‌లు ప‌దే ప‌దే గట్టిగా వినిపిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రి, ఢిల్లీలో కేసీఆర్ విసిరిన వ‌లకు చిక్క‌కుండా రాష్ట్ర బీజేపీ ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి...

గన్నవరం ఎయిరుపోర్టులోనే  లోకేష్ అరెస్ట్? గుంటూరు, కృష్ణ జిల్లా టీడీపీ నేతలపై పోలీసుల నిఘా..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నరసరావుపేట పర్యటనతో  విజయవాడలో టెన్షన్ నెలకొంది. గత ఫిబ్రవరి 24న ఉన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష కుటుంబసభ్యులను నరసరావుపేటలో పరామర్శించనున్నారు లోకేష్. ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీడీపీ నేతలు స్థానిక పోలీసు అధికారులకు దరఖాస్తు అందజేసేందుకు వెళ్లగా దానిని స్వీకరించేందుకు వారు నిరాకరించారు. లోకేశ్‌ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు.  నారా లోకేష్ ను విమానాశ్రయంలోనే అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భారీగా పోలీసుల మోహరించారు. నలుగురు ఏసీపీల పర్యవేక్షణలో వంద మంది పోలీసు బలగాలను మోహరించారు. విమానాశ్రయం పరిసరాలు, జాతీయ రహదారిపై అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నరసరావుపేట టీడీపీ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నరసరావుపేటలో 144 సెక్షన్‌ అమల్లో ఉందని జిల్లా పోలీసులు చెబుతున్నారు. నారా లోకేష్‌ను చూసేందుకు వచ్చిన మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, మహిళలకు మధ్య తోపులాట జరిగింది.  నారా లోకేష్ పర్యటన దృష్ట్యా టీడీపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. సత్తెనపల్లిలో టీడీపీ నేత కోడెల శివరాంను ముందస్తుగా అరెస్ట్ చేశారు. టీడీపీ నేత అరవిందబాబును గృహనిర్బంధం చేశారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి హౌస్‌ అరెస్ట్‌ చేశారు. నక్కా ఆనందబాబు, కార్పొరేటర్లు దేవినేని అపర్ణ, ఉషారాణిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.గన్నవరంలో శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఎమ్మెల్సీ ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.  లోకేష్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపట్ల ఆ పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయాన్ని ప్రశ్నించే హక్క ప్రతిపక్షాలకు లేదా? అని ప్రశ్నించారు. రమ్య హత్య కేసును రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు. వైఎస్‌ వర్థంతికి లేని కరోనా నిబంధనలు... బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాయా అని నిలదీశారు. అన్యాయానికి గురైన కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చే నారా లోకేష్‌ను అడ్డుకోవాలని చూడడం సరికాదని ధూళిపాళ్ళ అన్నారు.  రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమ అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా టీడీపీ వుంటే వైసీపీ పోలీసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. అమల్లోలేని దిశా చట్టం మహిళలకు రక్షణగా ఉంటుందని వైసీపీ చెబుతుందని విమర్శించారు. దిశా చట్టంతో ఏ కేసులో నిందితుడికి శిక్ష వేశారో వైసీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. లోకేష్‌ నరసరావుపేట వెళితే వైసీపీ బండారం బట్టబయలు అవుతుందనే అడ్డుకుంటున్నారని అన్నారు. అనూష కుటుంబానికి అండగా లోకేష్ ఉండటం తప్పా అని ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్‌ను గాలికి వదిలేసిన వైసీపీ...టీడీపీ నేతలపై మాత్రం పోలీసులను ఉపయోగిస్తుందని బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేశ్‌ పర్యటన నరసరావుపేటలో రాజకీయ హీట్‌ పెంచుతోంది. తెలుగుదేశం నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి విమర్శించారు. నరసరావుపేటలో పార్టీ మనుగడ కోసం లోకేశ్‌ వస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. నరసరావుపేటలో ఉన్న ప్రశాంతతను పాడు చేస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. దిశచట్టంపై ప్రభుత్వానికి పూర్తి నిబద్ధత ఉందన్నారు. ఈ వ్యాఖ్యలను టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, డాక్టర్‌ అరవిందబాబు తదితర నేతలు తీవ్రంగా ఖండించారు.