బండి వ్యాఖ్యలపై దుమారం.. మత విద్వేషాలే లక్ష్యమా? 

భారతీయ జనతా పార్టీ, బీజేపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సాగిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు మంచి స్పందనే వస్తోంది. ప్రజలు అనుభవిస్తున్న కష్టాలనే ఆయన తమ ప్రసంగాలలో ఏకరువు పెడుతున్నారు, కాబట్టి ప్రజలు గట్టిగానే చప్పట్లు కొడుతున్నారు. సమస్యలు చెప్పుకుంటున్నారు. బండి సంజయ్ కూడా, ఆలా నడుచుకుంటూ పోవడం కాకుండా, ఎక్కడంటే అక్కడ ఆగి, స్థానికులతో మాటామాటా కలుపుతున్నారు. వ్యక్తిగత సమస్యలు కూడా వింటున్నారు. ఆ విదంగా ప్రజా సమస్యల వరకే పరిమితమై,  ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేయడం వరకు అయితే, ఎవరికే ఎలాంటి అభ్యంతరం ఉండదు. సమస్యలకు తక్షణ పరిష్కారం చూపినా చూపక పోయినా, బండి యాత్ర రాజకీయంగా మంచి ముందడుగే  అనిపించుకుంటుంది.  అయితే బండి సంజయ్,ఆయన వెంట నడుస్తున్నఇతర నాయకులు, కార్యకర్తలు అంతటితో ఆగడం లేదు. మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు వివాదస్పదం అవుతున్నాయి. హైదరాబాద్ పాత బస్తీ, భాగ్యలక్ష్మి అమ్మవారి  ఆలయం నుంచి  యాత్ర ప్రారంభించిన బండి సంజయ్, ఎంఐఎం బుజాన తుపాకిపెట్టి, తెరాస లక్ష్యంగా చేస్తున్న వ్యాఖ్యలు విమర్శలు మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే నిజాం ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని బండి అన్నారు. అంతే కాదు, అంతకు మించి, రాష్ట్రంలో 80 శాతం ఉన్న హిందువులకు బీజేపీ అండగా ఉంటుందని కుండ బద్దలు కొట్టారు. బీజేపీ హిందువుల పార్టీనే కానీ, ఇంతవరకు  రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన నాయకులు ఎవరూ కూడా, ‘అవును, మాది హిందువుల పర్త్య, హిందువులకు అండగా  ఉండే పార్టీ, అని గట్టిగా చెప్పిన సందర్భం లేదు. అందుకే, బండి వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రగిల్చాయి. ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని ప్రత్యర్ధులు దుయ్యపడుతున్నారు. నిజానికి బడి సంజయ్, అక్కడితోనూ ఆగలేదు,మరో అడుగు ముందుకేశారు. హిందువులకు హని తలపెడితే మత విద్వేషాలను రెచ్చ కొట్టేందుకు కూడా  బీజేపీ వెనకాడదని  కుండబద్దలు కొట్టారు. ఒక విధంగా కుహన లౌకిక వాదంపై యుద్దాన్ని ప్రకటించారు. కుహనలౌకిక వాదులకు సవాలు విసిరారు.అయితే, బండి వ్యాఖ్యలపై ఎంఐఎం కంటే తెరాస నాయకులే ఎక్కువగా స్పందిస్తున్నారు. తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన  కుటుంబ అవినీతి, అక్రమాస్తుల గురించి బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు, హెచ్చరికలు హాస్యాస్పదంగా, నవ్వుతెప్పించేలా ఉంటున్నాయని అంటున్నారు. నిజానికి, బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడు అయిన నాటి నుంచి, కేసీఆర్ అవినీతిని నిరూపించి జైలుకు పంపడం ఖాయమని అంటూనే ఉన్నారు. అందుకు అవసరమైన ఆధారాలు సేకరిస్తున్నామని, ఇక రేపో మాపో కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమన్న రీతిలో ప్రకటనలుచేస్తూనే ఉన్నారు. కానీ, అదేమీ జరగలేదు. అయినా, ఇప్పుడు పాదయాత్రలో మరోమారు. లేస్తే మనిషిని కాదు, అన్నట్లుగా, తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ నేతల లెక్కలన్నీ తేల్చి బొక్కలో వేస్తామంటున్నారు. అంటే, ఇప్పటికి ఏమీ చేయలేమని చేతులు ఎత్తేశారు అనుకోవచ్చును. అందుకే, కేసీఆర్ అవినీతి గురించి చెప్పే ఆయనకు ఎలా ఉన్నా వినేవారికి  మాత్రం బ్రహ్మానందం జోకులా నవ్వు తెప్పిస్తోందని అంటున్నారు. అప్పటిదాకా, ఆగడం ఎందుకు, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, ఆరోపణలే నిజం అయితే, అందుకు ఆధారాలు నిజంగా ఉంటే ఇప్పుడు చర్యలు తీసుకునేందుకు అభ్యంతరం ఏమిటి అన్న ప్రశ్నలకు బీజేపీ నాయకుల వద్ద సమాధానం లేదు.  కేంద్ర నిధుల విషయంలోనూ బండి సంజయ్ ప్రజలను కన్విన్సు చేయలేక పోతున్నారని పార్టీ నాయకులే అంటున్నారు. కేంద్రం ఇచ్చే నిధులతోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్‌.. అవేవో తమ సొంత నిధులైనట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శలు అయితే చేస్తున్నారు, కానీ,  నిజానిజాలను జనం ముందు పెట్టడం లేదని అంటున్నారు.  బండి సంజయ్ సంగ్రామ యాత్ర సాగుతున్న తీరు పట్ల కేంద్ర నాయకత్వం సంతృప్తిని వ్యక్తచేసిందని, ప్రజల నుంచి వస్తున్న స్పందన కూడా ఆశాజనకంగా ఉందని, పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. మరో వంక తెరాస నాయకులు బండి పాదయాత్రను తేలిగ్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. పెట్రోల్ ధరల పెరుగుదలో ముడి పెట్టి జోకు లేస్తున్నారు. కానీ, అద్దాల మేడలో కూర్చున్న వారు, రోడ్డున పోయేవారి  మీద  రాళ్ళూ వేయడం అంత మంచింది కాదు.

హైదరాబాద్ సీపీకి నివేదిక ఇచ్చే తీరిక లేదా? 

వినాయక చవితి వేడుకలు, నిమజ్జనోత్సవంపై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిమజ్జనం సమస్యలపై ప్రభుత్వానికి శ్రద్ధ లేనట్లుగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. విచారణకు 10 నిమిషాల ముందు నివేదిక ఇస్తే ఎలా అంటూ  జీహెచ్ఎంసీపై అసహనం వ్యక్తం చేసింది. హైదరాబాద్ సీపీకి నివేదిక ఇచ్చే తీరిక కూడా లేదా అని ధర్మాసనం ఆగ్రహించింది. పీసీబీ మార్గదర్శకాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది.నిమజ్జనం సందర్భంగా జనం గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పడం లేదని హైకోర్టు కామెంట్ చేసింది.   విచారణలో ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. జీహెచ్ఎంసీ పరధిలోని 48 చెరువులు, కొలనుల్లోనూ  వినాయక నిమజ్జనం  ఏర్పాట్లు చేసినట్లు కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. మట్టి గణపతులను ప్రోత్సహిస్తున్నామని.. లక్ష విగ్రహాలు ఉచితంగా ఇస్తున్నామని తెలిపింది. అయితే సలహాలు కాదు.. చర్యలు, స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలన్న తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. నిమజ్జనం ఆంక్షలు, నియంత్రణలపై తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు వెల్లడించింది.  వినాయక నిమజ్జనం ఆంక్షలపై ఉత్తర్వులను న్యాయస్థానం రిజర్వ్ చేసింది

షర్మిల ఫందా మారింది..ప్రయోజనం ఉంటుందా? 

అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ లో అనేక పార్టీలు పుట్టాయి. పుట్టుట గిట్టుట కొరకే అన్నట్లుగా. అలా పుట్టిన చాలా పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి. అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కూడా కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. చక్కటి, ఉద్యమ నేపధ్యం ఉన్న కొదండ రామ్  పెట్టిన తెలంగాణ జన సమితి మొదలు అదే పంధాలో పుట్టిన ఇతర పార్టీలు ఏవీ నిలదొక్కుకోలేక పోయాయి. ఉద్యమ నేపధ్యం  ఉన్న నాయకులు, తామే పెంచి పోషించిన ముఖ్య నాయకుని ముందు నిలవలేక పోయారు. రాజకీయ ‘నీచ’ సూత్రాలలో ఒకే సారి పది పట్టాలు పుచ్చుకున్న, కుటుంబ పార్టీ నాయకుడి రాజకీయ, ఛ-తురతను తట్టుకోలేక పోయారు.   ఏపీ ఆడబిడ్డ, తెలంగాణ కోడలు వైఎస్ షర్మిల స్థాపించిన, వైఎస్సార్ తెలంగాణ పార్టీ కూడా ఇప్పుడు అదే కోవలోకి చేరిపోతుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి, రాజన్న రాజ్యం అజెండాతో వైఎస్సార్ జెండా పట్టుకుని, షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయడమే, వింతల్లో కెల్లా వింత. ఎవరి అండదండలతో ఎవరి కోసం, ఆమె పార్టీ స్థాపించారు అనేది పక్కన పెడితే, పార్టీ ప్రారంభించి నిండా రెండు నెలలు అయినా కాకముందే, పార్టీ సంక్షోభంలో చిక్కుకోవడంలో మాత్రం ఎలాంటి వింత విడ్డురం లేదనే చెప్పవచ్చును. ఈ ఊరు కరణం ఆ ఊరు వెట్టి’ అనే సామెత ఎరక్కుండా, జెండా ఎగరేసిన షర్మిల ఇప్పుడు, దిక్కుతోచని స్థితిలో  ఉనికిని కాపాడుకునేందుకు కష్ట పడుతున్నారు.చివరకు తల్లి విజయమ్మ, నోరు తెరిచి షర్మిలను దీవించమని వైఎస్ సహచర, అనుచర గణాలను కోరినా, స్పందన లేకుండా పోయింది.   పార్టీలో చేరిన నాయకులు కూడా  ఒకరొకరుగా పార్టీ వదిలి పోతున్నారు. నిజానికి షర్మిల పార్టీలో పేరున్న నాయకులు, పట్టుమని పదిమంది లేరు. అయినా ఇప్పటికీ, చేవెళ్ల ప్రతాప రెడ్డి, ఇందిరా శోభన్, రెండు రోజుల క్రితం మరో కీలక నేత, మహబూబ్ నగర్ పార్లమెంట్ కన్వీనర్, ఇబ్రహీం పార్టీకి రాజీనామా చేశారు. ఇంకా నలుగు రోజులు పోతే మిగిలిన నలుగురు కూడా ఎవరిదారి వారు చూసుకున్నా ఆశ్చర్య పోనవసరం లేదని పార్టీ వర్గాల సమాచారంగా ఉంది.  పార్టీ ప్రారంభానికి ముందు కొంత సందడి కనిపించినా, ఆ తర్వాత ప్రతి మంగళవారం పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపడుతున్న నిరుద్యోగ దీక్ష మాత్రమే పార్టీని ఉనికిని నిలబెడుతోంది. అయితే, ఆ ముచ్చట కూడా అట్టే కలం నిలవలేదు. ముందున్న జోష్ లేదు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పలకరించేందుకు వెళితే, అక్కడా అవమానాలే ఎదురవుతున్నాయి. మరో వంక, జనం కూడా ఆమె దీక్షలను పట్టించుకోవడం లేదన్న వార్త లొచ్చాయి. నిరుద్యోగ దీక్షకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి.  ఈ నేపధ్యంలోనే  షర్మిల ఇప్పుడు రూట్ మార్చారు. కొండ మన దగ్గరకు రాకపోతే మనేమే కొండ వద్దకు వెళ్ళాలనే సామెతను వంట పట్టించుకుని, రేప‌టి (సెప్టెంబర్ 7)నుంచి యూనివ‌ర్సిటీల ముందు దీక్ష‌లు చేయాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రేపు, పాల‌మూరు యూనివ‌ర్సిటీ ముందు నిరుద్యోగ దీక్ష‌ చేయాలని నిర్ణయించారు. ఇక నుంచి ప్ర‌తి మంగ‌ళ‌వారం యూనివర్సిటీ ముందు ఆందోళ‌న‌లు చేయాలని భావిస్తున్నారు. అయితే షర్మిల చేస్తున్న నిరుద్యోగ దీక్షకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం నుంచి ఆత్మ‌హ‌త్య చేసుకున్న కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించి అక్క‌డే ప్ర‌తి మంగ‌ళవారం నిరుద్యోగ దీక్షలు చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 12 కుటుంబాల‌ను షర్మిల ప‌రామ‌ర్శించారు. వరుసగా 8 చోట్ల ఉద్యోగ దీక్ష‌లు చేశారు. అయితే ఆత్మహత్య చేసుకుంటున్న కుటుంబాలు దీక్షలపై విముఖ‌త వ్య‌క్తం చేస్తున్నారు. రెండు చోట్ల కుటుంబస‌భ్యులు ఇంటికి తాళం వేసుకొని వెళ్లారు. మంచిర్యాల జిల్లా సిరిసేడులో ఓ నిరుద్యోగి కుటుంబం ష‌ర్మిల‌ను రావొద్ద‌ని విజ్ఞప్తి చేసింది. ముందుగా అనుకున్నట్లు రాష్ట్రంలో ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్న 167 కుటుంబాల‌ను షర్మిల పరామ‌ర్శించాల‌ని అనుకున్నారు. అయితే ఆ సంకల్పానికి అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇక నుంచి ఆత్మ‌హ‌త్య చేసుకున్న కుటుంబాల‌ను ఇబ్బంది పెట్టొద్ద‌ని షర్మిల భావించారు. దీంతో ఆమె రూటు మార్చుకున్నారు. ఇకపై యూనివ‌ర్సిటీల ముందు ఆందోళ‌న‌కు సిద్ద‌మ‌వుతున్నారు. అయినాఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడవలసి వుందని అంటున్నారు, రాజకీయ పండితులు.

చెత్త వాహనాల్లో వినాయక విగ్రహాల తరలింపు? 

ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు విధించడంపై రచ్చ కొనసాగుతుండగానే మరో వివాదం నెలకొంది. అధికారుల ఓవరాక్షన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వినాయక విగ్రహాలను చెత్త తరలించే వాహనంలో తరలించడం తీవ్ర దుమారం రేపుతోంది. అధికారుల తీరుపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి,.  విగ్రహాల తరలింపు వివాదం కావడం, జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కమిషనర్ స్పందించారు.  గుంటూరులో చెత్తను తరలించే వాహనాల్లో వినాయక విగ్రహాలను తరలించిన పారిశుద్ధ్య సిబ్బందిపై కమిషనర్‌ అనురాధ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటరీ సూపర్‌ వైజర్‌ను విధుల నుంచి తొలగించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా అత్యుత్సాహంతో వినాయక విగ్రహాలను పారిశుద్ధ్య ట్రాక్టర్‌లో వేసి తీసుకెళ్లడంపై ఆమె మండిపడ్డారు. ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్‌తో విచారణకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ తెలిపారు.   గుంటూరు నగరంలోని జ్వరాల ఆసుపత్రి సమీపంలో రహదారి వెంబడి కొందరు వినాయక విగ్రహాలను విక్రయిస్తున్నారు. అనుమతి లేదంటూ  గుంటూరు నగరపాలక సంస్థ సిబ్బంది విగ్రహాలను బలవంతంగా వాహనాల్లో తీసుకెళ్లారు. గణపతి విగ్రహాలను చెత్త ట్రాక్టర్లలో ఎక్కించి తరలించారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికే వేడుకలపై ఆంక్షలు పెట్టడంపై జనాలు మండిపోతున్నారు. ఇప్పుడు విగ్రహాలను కార్పొరేషన్ చెత్త తరలింపు వాహనంతో తరలించడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి తీరు వల్లే అధికారులు ఇలాంటి చర్యలకు దిగుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గుంటూరు కమిషనర్‌ చర్యలకు ఉపక్రమించారు.  

వినాయక చవితిపై రచ్చ ఎందుకు? ఓ పార్టీ టార్గెట్ గా రాజకీయ కుట్రా? 

ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితి పండుగపై రచ్చ జరుగుతోంది. వినాయక చవితి వేడుకలను ఇండ్లలోనే నిర్వహించుకోవాలన్న జగన్ రెడ్డి సర్కార్ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అదే సమయంలో బీజేపీ నేతల ప్రకటనలు, ఆందోళనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో నెలకొన్న వినాయక చవితి వివాదంపై కొత్త అనుమానాలు వస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే వేడుకలపై ఆంక్షలెందుకు పెట్టారన్న చర్చ జరుగుతోంది.  ఓట్ల రాజకీయంలో భాగంగానే వినాయక చవిత వేడుకలపై రచ్చ జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపిలో గతంలో జరిగిన పరిణామాలను కొందరు గుర్తు చేస్తున్నారు.  నిజానికి వినాయక చవితి వేడుకలు మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటకతో పోలీస్తే ఆంధ్రప్రదేశ్ లో తక్కువగానే జరుగుతాయి. ముంబై తర్వాత గణేష్ వేడుకలకు హైదరాబాదే టాప్. తెలంగాణతో పాటు భాగ్యనగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతాయి. హైదరాబాద్ లో వేలాది విగ్రహాలను ప్రతిష్టిస్తారు. నవరాత్రోత్సవాల తర్వాత నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతోంది. వినాయక చవితి అనగానే గుర్తుకు వచ్చే ఖైరతాబాద్ మహా గణపతిని చూసేందుకు రోజూ వేలాది మంది భక్తులు వస్తారు. గణేష్ నిమజ్జనోత్సవం రోజు లక్షలాది మంది శోభాయాత్రలో పాల్గొంటారు. ఏపీలో ఇంతగా ఉండదు. కాని వేడుకల సందర్భంగా వేలాది మంది గుమిగూడే తెలంగాణలో... అక్కడి సర్కార్ ఎలాంటి అంక్షలు పెట్టకపోగా.. ఏపీ సర్కార్ ఆంక్షలు విధించడం ప్రశ్నగా మారింది. వినాయక చవితి వేడుకలపై జగన్ రెడ్డి సర్కార్ ఎందుకు మొండిగా వెళుతుందన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు. వినాయక చవితి వేడుకలపై జగన్ సర్కార్ ఆంక్షలు పెట్టడంపై జనాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. హిందూ పండుగలపై వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో హిందుత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ వెంటనే రంగంలోకి దిగింది. ఏపీ సర్కార్ పై యుద్ధం ప్రకటించింది. ఏపీలో నిమజ్జోనత్సవం వైభవంగా జరిగే కర్నూల్ లో వెళ్లారు ఏపీ బీజేపీ నేతలు. జగన్ సర్కార్ కు వార్నింగులు ఇచ్చారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా పండుగను జరిపి తీరుతామని స్పష్టం చేశారు. ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చేసుకోవాలని సవాల్ చేశారు. కమలనాధులకు కౌంటర్ గా వైసీపీ నేతలు నోటికి పని చెప్పారు. మతం పేరుతో రాజకీయాలు చేయవద్దంటూ ఎదురు దాడికి దిగారు.  ఓ వర్గం వారిని రెచ్చగొట్టేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని మంత్రులు మండిపడుతున్నారు. ఇక హిందూ సంస్ధలు కూడా గతంలో  హైదరాబాద్ లో నిర్వహించిన శోభా యాత్రలను ఈసారి ఏపీలో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నాయు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధంతో వినాయక చవితి వేడుకలు కాస్త రాజకీయ రణరంగంగా మారిపోయాయి. ఇదే ఇప్పుడు ఏపీ జనాల్లో పలు అనుమానాలకు కారణమవుతోంది. గత ఏడాది ఏపీలో ఆలయాలపై వరుసగా దాడులు జరిగాయి. అంతర్వేది రథచక్రం దగ్ధం మొదలుకుని... వరుసగా ఆలయాల ధ్వంసం కొనసాగింది. విగ్రహాలు ధ్వంసం చేయడాలు, హుండీలు ఎత్తుకెళ్లడాలు సహా ఆలయాల్లో రోజు ఏదో ఒక విధ్వంసం జరిగింది. దాదాపు 140 ఆలయాలపై దాడులు జరిగాయని హిందూ సంస్థలు ప్రకటించాయి. మరో భద్రాద్రిగా చెప్పుకునే సుదీర్ఘ చరిత్ర కలిగిన రామతీర్థంలో జరిగిన విధ్వంసకాండ రాష్ట్రాన్ని షేక్ చేసింది. రామతీర్థంలోని బోడికొండపై సుమారు 400 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.  ఆలయాలపై దాడులకు నిరసనగా అప్పుడు కూడా బీజేపీ తీవ్ర నిరసనలు చేపట్టింది. బీజేపీ నేతలు ఆలయాలను సందర్శించి హడావుడి చేశారు. అయినా ఆలయాలపై దాడులు కొనసాగాయి. దీంతో దాడులను ప్రభుత్వం ఎందుకు నివారించలేకపోతుందనే ప్రశ్నలు జనాల నుంచి వచ్చాయి. దాడుల వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఓ వర్గం ఓటు బ్యాంక్ ఓ పార్టీ వైపు మళ్లే రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇదంతా జరుగుతుందనే విమర్శలు వచ్చాయి. వైసీపీ పార్టీకి ముస్లింలు, క్రిస్టియన్లు పూర్తిస్థాయిలో మద్దతుగా ఉంటున్నారు. మెజార్టీ హిందువులు టీడీపీకి సపోర్టుగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూ ఆలయాలపై దాడులు జరగడం.. దానిపై బీజేపీ ఆందోళనలు చేయడంతో.. ఆ పార్టీకి మైలెజ్ వచ్చినట్లు కనిపించింది. ఈ విషయంలో బీజేపీకి ప్లస్ అయినా  వైసీపీకి పెద్దగా నష్టం ఉండదనే అభిప్రాయం వ్యక్తమైంది. టీడీపీకి మద్దతుగా ఉంటున్న ఓ వర్గం ఓట్లలో చీలక తెచ్చేలా అదంతా జరిగిందనే వాదన బలంగా వినిపించింది. ఆలయాలపై దాడుల సందర్బంగా రాజకీయ కుట్రలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలను బలం చేకూరేలా అప్పటి ఘటనలు జరిగాయి. ఆలయాలపై దాడులకు వ్యతిరేకంగా చంద్రబాబు రోడ్డెక్కడంతో పరిస్థితి మారిపోయింది. రామతీర్థాన్ని సందర్శించిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.హిందుత్వ నినాదాన్ని బలంగా వినిపించారు. ముఖ్యంగా సీఎం జగన్‌, ఆయన మంత్రులు, అధికారులు క్రైస్తవాన్ని ప్రోత్సహిస్తున్న తీరుపై చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. పాస్టర్లకు నెలకు ఐదువేల సాయం ఇవ్వడం, పోలీసు స్టేషన్లలో క్రిస్టమస్‌ వేడుకలు నిర్వహించడం, తిరుమల కొండపై జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎం క్రిస్మస్‌ శుభాకాంక్షలు చెప్పడం వంటి పరిణామాలను గుర్తి చేస్తూ నిప్పులు చెరిగారు. చంద్రబాబు వ్యాఖ్యలను జాతీయ మీడియా హైలెట్‌ చేసింది. చంద్రబాబు రామతీర్థం పర్యటన తర్వాత ఒక్కసారిగా ఏపీలో ఆలయాలపై దాడులు ఆగిపోయాయి. ఇతర పార్టీలు సైలెంట్ అయ్యాయి.  ఇప్పుడు కూడా గతంలో జరిగినట్లే పరిణామాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా వినాయక చవితి వేడుకలపై ఏపీ సర్కార్ ఆంక్షలు పెట్టిందని, అందుకు వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమిస్తోందని చెబుతున్నారు. దీని ద్వారా ఓ వర్గం ఓట్లు ఓ పార్టీకి పోలరైజ్ అయ్యేలా కుట్రలు జరుగుతున్నాయని అంటున్నారు. చంద్రబాబును ఇబ్బంది పెట్డడానికే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. రాజకీయ లబ్ది కోసం అత్యంత సున్నితమైన అంశాలను వివాదం చేయడం సరికాదని అంటున్నారు.  ఏపీకి ఇది మంచిది కాదని కూడా సూచిస్తున్నారు. వినాయక చవిత వేడుకల సాక్షిగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్న జనాలు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  

40 సెంమీ వర్షం.. ఉత్తర తెలంగాణ అతలాకుతలం!ఢిల్లీ నుంచి కేసీఆర్ రివ్యూ..

ఉరుము ఉరిమింది. విరుచుకుపడింది. కుండపోతగా వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కురిసిన వర్షానికి ఉత్తర తెలంగాణ అతలాకుతలమైంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో కుండపోతగా వర్షం కురవడంతో వరద పోటెత్తింది. ఆ జిల్లాల్లో ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది. వాగులు, వంకలన్ని ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండి మత్తడి పోస్తున్నాయి. చిన్న ,మధ్య తరగతి ప్రాజెక్టులన్ని నిండిపోవడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో వరదలతో వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. వందలాది గ్రామాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. వాగులన్ని ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి.  వరంగల్ జిల్లాలోని నడుకుడలో రికార్డ్ స్థాయిలో 39 సెంటిమీటర్ల వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం మల్యాలలో 31, హుజారాబాద్ మండలం బోర్నిపల్లిలో 30 సెంటిమీటర్ల వర్షం కురిసింది. భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 25,జమ్మికుంటలో 25, వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో 23 సెంటిమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలోని 14 మండలాల పరిధిలో అత్యంత భారీ వర్షం కురవగా..60 ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది. కుండపోత వానతో వరంగల్ నగరం మహా సముద్రంలా మారిపోయింది. వందలాది కాలనీలు చెరువులుగా కనిపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి భారీగా వరద చేరింది. రెండో ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చాయంటే వరద పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్ల పూర్తిగా నీట మునిగింది. నర్మాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లోని చెరువులన్ని నిండి అలుగు పోస్తుండటంతో సిరిసిల్లలో వరద భారీగా వస్తోంది. కుండపోత వర్షాలతో సిరిసిల్ల పట్టణానికి వరద పోటెత్తింది. పట్టణం నిండు చెరువును తలపించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ లతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వరదనీరు పలు కాలనీల్లోకి వచ్చి చేరుతోందని... సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో  కురుస్తున్న భారీ  వర్షాల నేపథ్యంలో  పరిస్థితి పై  ఢిల్లీ నుంచి  సీఎం కేసిఆర్ సమీక్షించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో ఫోన్లో మాట్లాడి  తగు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, పూర్తి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని సిఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.భారీ వానల వల్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాలు మండలాల్లోని ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయా శాఖల ఉద్యోగులను అప్రమత్తం చేయాలన్నారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానల వల్ల గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో ప్రభావితమయ్యే  విద్యుత్తు, రోడ్లు,నాళాలు తదితర రంగాల పరిస్థితుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రోడ్లు భవనాల శాఖ, విద్యుత్  శాఖల అధికారులు కింది స్థాయి వరకు తమ  ఉద్యోగులను అప్రమత్తం చేయాలన్నారు.    భారీ ఎత్తున వరద పోటెత్తడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు, చెరువులు కుంటలు  పొంగిపొర్లుతున్న నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తం కావాలని సీఎం ఆదేశించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతూ   వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టాలని సిఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో, ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ బలగాలను సిద్ధం చేసుకోవాలన్నారు.  ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకునేందుకు ప్రజా ప్రతినిధులు వారి వారి నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రభుత్వ యంత్రాంగం తో సమన్వయం చేసుకుంటూ తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎడతెగని వర్షాల నేపథ్యంలో తమ తమ నివాసాల నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయకుండా సురక్షితంగా ఉండాలని, వర్ష ప్రభావిత వరద ముంపు ప్రాంతాల ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు మరోవైపు తెలంగాణకు రానున్న రెండు రోజులు అత్యంత భారీవర్షాల ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్రంలో మంగళవారం ఐదు జిల్లాల్లో, బుధవారం మరో నాలుగు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ హెచ్చరిక జారీ చేసింది. మంగళవారం పెద్దపల్లి, జయశకంర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురవనుండగా, బుధవారం ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురవనున్నాయి. ఇవే కాకుండా పలు ఇతర జిల్లాల్లోనూ రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ కె.నాగరత్న తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. సోమవారం రాత్రి బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని, దీని ప్రభావంతో రాష్ట్రమంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం ప్రభావంతో వాయవ్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడిందని చెప్పారు. 

ల‌గ్జ‌రీ చార్టెడ్ ఫ్లైట్‌లో ర‌ష్యాకు బాలినేని.. జల్సాలపై మండిపడుతున్న జనాలు?

వృత్తి రాజ‌కీయం. ప్ర‌వృత్తి వ్య‌వ‌సాయం. ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే. ఏపీకి మంత్రి. సీఎం జ‌గ‌న్‌రెడ్డికి ద‌గ్గ‌రి బంధువు. పాలించే వాడే త‌మ బంధువైతే.. ఇక బ‌లాదూర్ల‌కు కొద‌వేముంటుంది? అందుకే కాబోలు.. రాష్ట్రం ఆగ‌మాగం అవుతున్నా.. క‌రోనాతో క‌ల్లోలం చెల‌రేగుతున్నా.. ఖ‌జానా ఖాళీ అయి ఉద్యోగుల‌కు స‌మ‌యానికి జీతం రాకున్నా.. ఉపాధి లేక‌, పెట్టుబ‌డులు లేక‌, ఉద్యోగాలు లేక.. ప్ర‌జ‌లు ప‌స్తులుంటున్నా.. ఇవేమీ త‌న‌కు ప‌ట్ట‌వ‌న్న‌ట్టు.. ఎంచ‌క్కా చార్టెడ్ ఫ్లైట్ ఎక్కి.. విలాసాల్లో మునిగి తేలుతున్నారు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి. ప్రైవేట్ ఫ్లైట్‌లో వైసీపీ నేత రాజ‌భోగాలు అనుభ‌విస్తున్న ఫోటో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. విజ‌య‌మాల్యాలా ఫోజులు కొడుతూ చార్టెడ్ ఫ్లైట్‌లో విదేశీ యాత్ర‌ల‌కు వెళ్లే ఇమేజ్ చూసి మండిప‌డుతున్నారు. ఎవ‌డి సొమ్ము ఎవ‌డు ఎంజాయ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్ల‌తో కుమ్మేస్తున్నారు.  సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న మంత్రి బాలినేని ఫోటో చూస్తే ఎవ‌రికైనా ఒళ్లు మండాల్సిందే. ఓ రేంజ్‌లో ఉంది య‌వ్వారం. చాలా ఖ‌రీదైన చార్టెడ్ ఫ్లైట్ అని చూడగానే తెలిసిపోతోంది. అలాంటి రిచ్ ఫ్లైట్‌లో ఇండియా నుంచి ర‌ష్యాకు వెళ్ల‌డ‌మంటే మాట‌లా? ఎంత లేద‌న్నా.. అలాంటి ట్రిప్‌కు 55వేల డాల‌ర్ల‌ నుంచి 85 వేల డాల‌ర్ల వ‌ర‌కు చార్జ్ చేస్తారు. అంటే, ఇండియ‌న్ క‌రెన్సీలో 40 ల‌క్ష‌ల నుంచి 60 ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు అవుతుంది. ఆ లెక్క‌న‌.. ప్రైవేట్‌ చార్టెడ్ ఫ్లైట్‌లో మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి ర‌ష్యాకు వెళ్ల‌డానికి అయిన ఖ‌ర్చు.. దాదాపు స‌గం కోటి. ఒక వైపు జ‌ర్నీకే సుమారు 50 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తే.. ఇక మంత్రి గారి ర‌ష్యా ట్రిప్ మొత్తం లెక్కేస్తే.. ఏ 5 కోట్లో.. 10 కోట్లో అవ‌డం ఖాయ‌మంటున్నారు నెటిజ‌న్లు.  ఇక ఈ ఫోటో మంత్రి బాలినేని సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ అయింది. ఫుల్ పోష్‌గా ఉందా విమానం. సోఫాల్లాంటి ఛైర్‌లో మంత్రి గారొక్క‌రే కూర్చొని ఉన్నారు. సీటు ముందు టేబుల్‌పై.. తిన‌డానికి ఏదో వెరైటీ స్నాక్స్ రెడీగా ఉన్నాయి. ఫోటోకు ఓ క్యాప్స‌న్ కూడా ఇచ్చారు. లివ్ లైఫ్ విత్ నో ఎక్స్యూజెస్‌.. ట్రావెల్ విత్ నో రిగ్రెట్‌. ఇదీ ట్యాగ్ లైన్‌. అవును మ‌రి, ప్ర‌జ‌ల సొమ్ముతో జ‌ల్సా చేస్తే రిగ్రెట్ ఎందుకు ఉంట‌ది? అంటూ ఆ ట్యాగ్ లైన్‌కు ఖ‌త‌ర్నాక్ కౌంట‌ర్లు వేస్తున్నారు నెటిజ‌న్లు. మ‌రి, అంత ఖ‌రీదైన విమానంలో.. అంత ఖ‌ర్చుతో బాలినేని శ్రీనివాస‌రెడ్డి ర‌ష్యాకు ఎందుకు వెళ్లిన‌ట్టు? అక్క‌డ ఆయ‌న‌కు అంత ఇంపార్టెంట్ వ‌ర్క్ ఏమున్న‌ట్టు? జ‌స్ట్‌.. జ‌ల్సా చేయ‌డానికే వెళ్లారా? తానే సొంతంగా ఇలా ఫారిన్ ట్రిప్ వేశారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి, అంత ల‌గ్జ‌రీ జ‌ర్నీ చేయ‌డానికి మంత్రి గారేమైనా అంబానీ, అదానీ, టాటా, బిర్లాల ఫ్యామిలీనా అంటే కానే కాదు. పోనీ, విజ‌య్‌మాల్యా, నీర‌వ్ మోదీ, చోక్సీలాంటోడా అంటే అంత సీన్ కూడా లేదాయే? పెద్ద పెద్ద కంపెనీలు, ఫ్యాక్ట‌రీలు, ప‌వ‌ర్‌ప్లాంట్లు, మైనింగ్‌, కాంట్రాక్టులు, ఎక్స్‌పోర్ట్‌, ఇంపోర్ట్ లాంటి బిజినెస్‌లు ఏమైనా ఉన్నాయా అంటే లేవాయే. జ‌స్ట్‌, ఆయ‌నో ధ‌నిక‌ రైతు మాత్ర‌మే. ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌కు ఇచ్చిన డీటైల్స్ ప్ర‌కారం ఆయ‌న ఆస్తుల విలువ కేవ‌లం ఐదున్న‌ర కోట్లు మాత్ర‌మే. అదే నిజ‌మైతే.. లేటెస్ట్‌గా మంత్రి గారు చేస్తున్న ర‌ష్యా ప‌ర్య‌ట‌న‌కే సుమారు 5 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని అంటున్నారు. అలాగైతే, బాలినేని త‌న‌కున్న ఆస్తుల‌న్నీ అమ్మేసుకొని ర‌ష్యా టూర్‌కు వెళ్లారా? అలా కాక‌పోవ‌చ్చు. మ‌రి, 5 కోట్ల ఆసామి.. ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకొని ర‌ష్యాకు వెళ్లేంత సీన్ ఎక్క‌డిది? ఇలా సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు.. అంత‌కుమించి అనుమానాలు.  కొన్ని కామెంట్లు, మీమ్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. జ‌గ‌న్‌రెడ్డికి మంత్రి బాలినేని బంధువు కాబ‌ట్టి.. ఆయ‌న ప‌ని మీద ఈయ‌న వెళ్లి ఉంటారా? అనే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు నెటిజ‌న్లు. ఇవేవీ కావు.. ఫోటోకు యాడ్ చేసిన క్యాప్ష‌న్‌లో ఉన్న‌ట్టు.. లివ్ లైఫ్ విత్ నో ఎక్స్యూజెస్‌.. ట్రావెల్ విత్ నో రిగ్రెట్‌.. కాన్సెప్ట్‌తో మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డినే సొంతంగా.. టైమ్ పాస్‌కు.. సొంత డ‌బ్బుల‌తోనే.. ఇలా ఖ‌రీదైన ల‌గ్జ‌రీ ప్రైవేట్‌ చార్టెడ్ ఫ్లైట్‌లో ర‌ష్యా ట్రిప్‌కు వెళ్లారంటే మాత్రం.. క‌చ్చితంగా సీబీఐ, ఈడీ విచార‌ణ జ‌ర‌గాల్సిందే అంటున్నారు నెటిజ‌న్లు. ఎందుకంటే ఆయ‌న స‌మ‌ర్పించిన ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో ఆయ‌న ఆస్తుల విలువ కేవ‌లం 5.75 కోట్లు మాత్ర‌మే కాబ‌ట్టి. 

ఢిల్లీలో కేసీఆర్ రహస్య ఎజెండా? ఆయనను రహస్యంగా కలిసిందెవరు? 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయ, మీడియా వర్గాల్లో ఆసక్తిని రేకేతిస్తోంది. సెప్టెంబర్ 1 తేదీన ఢిల్లీ వెళ్ళిన కేసీఆర్, 2వ తేదీన దేశ రాజధానిలో నిర్మిస్తున్న టీఆర్ఎస్ కార్యాలయ భవన నిర్మాణ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. హరీష్ రావు మినహా ముఖ్యనేతలు.మంత్రులు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొబ్బరికాయలు కొట్టారు. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సుమారు 50 నిముషాలకు పైగా సమావేశమయ్యారు. మూడవ రోజు సెప్టెంబర్ 3వ తేదీన  కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో సమావేశ మయ్యారు.  నిజానికి ముఖ్యమంత్రి భూమి పూజ జరిగిన తర్వాత రాష్ట్రానికి తిరిగి రావలసి ఉంది, కానీ,రాలేదు.ఆయన తమ ఢిల్లీ యాత్రను మరి కొన్నిపొడిగించుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ( సోమవారం)కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షేకావత్‌తో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు సమర్పించి హామీలు పుచ్చుకున్నారు. హైదరాబాద్ – విజయవాడ రోడ్డును ఆరులైన్ల రోడ్డుగా విస్తరించడంతో పాటుగా  రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి సంబదించి ఐదు విజ్ఞాపన పత్రాలను కేంద్ర మంత్రికి సమర్పించారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తామని గడ్కరీ, హామీ ఇచ్చారని, అధికారవర్గాలు తెలిపారు.  అలాగే, కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌ పై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షేకావత్‌తో సుమారు 40 నిముషాలకు పైగా చర్చించారు. ఈ సందర్భంగా గెజిట్‌పై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూనే గెజిట్’ లోని అంశాల అమలుకు పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.కృష్ణా ట్రైబ్యునల్‌ ఏర్పాటుపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆవిధంగా, కేంద్రంతో తమకు ఎలాంటి విబేధాలు లేవనే చక్కటి స్నేహ సంకేతాలు పంపించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన కేవలం పార్టీ కార్యాలయ భూమిపుజలో పాల్గొనడం, ప్రదాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా ఇతర కేంద్ర మంత్రులను కలవటమేనా లేక ఇందులో ఇంకేదైనా రాజకీయ రహస్య కోణం దాగి ఉందా అంటే, ఉందనే అంటున్నారు, రాజకీయ పండితులు. దేశ రాజదానిలో పార్టీ కార్యాలయం భూమిపూజతో పాటుగా కేసీఆర్, భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు అంకురార్పణ కూడా కానిచ్చారని. అంటున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ప్రధాన లక్ష్యం, భూమిపూజ,మంత్రులతో భేటీలు కాదని, జాతీయ రాజకీయాల్లో తమకంటూ ఒక భూమికను ఏర్పరచుకునే లక్ష్యంతోనే, ఆయన ఢిల్లీలో కాలు పెట్టారని అంటున్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా సహా ఇతర కేంద్ర మంత్రులను బహిరంగంగా కలిసిన కేసీఆర్, ఇంకెవరినీ కలవ లేదా? అంటే కలిశారు. కాంగ్రెస్, కాంగ్రెస్ రెబెల్ (జీ23), నాయకులతో పాటుగా అందుబాటులో ఉన్న బీజేపీయేతర జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులుతో ముఖ్యమంత్రి కలిసి రాజకీయ చర్చలు జరిపారని, ప్రతిపక్ష పార్టీల ఐక్యత గురించి, వివిధ కోణాల్లో చర్చించారని  విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా, ముఖ్యమంత్రి జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యాన్మాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే, పాత ఆలోచనను కొత్త రూపంలో ముందుకు తీసుకుపోయేందుకు ఢిల్లీ పర్యటనను ఉపయోగించుకున్నారని సన్నిహిత వర్గాల సమాచారం. కేంద్రంలో మరో మారు బీజేపీ అధికారంలోకి వస్తే, ప్రాంతీయ పార్టీల మనుగడ మరింత ప్రశ్నార్ధకం అవుతుందని, ప్రాంతీయ పార్టీల నాయకులకు సవివరంగా వివరించి, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకతను నొక్కి చెప్పినట్లు సమాచారం.నిజానికి కేసీఆర్ జాతీయ స్థాయిలో బీజేపీతో సన్నిహితంగా మెలిగినట్లు కనిపించినా, అది కేవలం అవసరార్ధం బ్రాహ్మణార్ధం తంతు మాత్రమే అంటున్నారు. ఈ విషయం బీజేపీ నాయకులకు కూడా తెలుసు. అయితే నువ్వొకందుకు పోస్తే నేనొకందుకు తాగుతున్నాను అన్నట్లుగా, రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. బీజేపీ వ్యతిరేక శక్తులను ముఖ్యంగా ప్రాతీయ పార్టీలను ఏకం చేసి, ఫెడరల్ ఏర్పాటు చేయాలనేదే కేసీఆర్ ఢిల్లీ పర్యటన లక్ష్య్యంగా పరిశీలకులు భావిస్తున్నారు.  అంతే కాదు. ఇటు పార్టీని, అటు కుటుంబ వారసత్వాన్ని నిలుపుకోవాలంటే, కేసీఅర్ ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ చేయక తప్పని అనివార్య పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా, 2023 ఎన్నికల తర్వాత అధికార మార్పిడి అనివార్యంగా కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీలో తనకో కుర్చీ అవసరం, ఆ కోణంలో కూడా ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాలపై కన్నేశారని, అందులో భాగంగానే ఢిల్లీ యాత్రను చూడాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇసుక ట్రాక్టర్లను వదిలేయకపోతే ధర్నా చేస్తా.. ఎస్సైకి ఏపీ మంత్రి వార్నింగ్

ఆయనో మంత్రి. అక్రమాలను అడ్డుకోవాల్సిన బాధ్యతలో ఉన్న పెద్ద మనిషి. కాని హోదా మరిచారు. అక్రమ రవాణా కేసులో పట్టుకున్న ట్రాక్టర్లను వదిలేయాలంటూ స్థానిక ఎస్ఐని బెదిరించారు. తాను చెప్పినట్లు వినకపోతే మంత్రినని కూడా చూడకుండా పోలీస్ స్షేషన్ దగ్గర ధర్నా చేస్తానని హెచ్చరించాడు. ఎస్ఐని మంత్రి బెదిరిస్తున్న ఆడియో లీకైంది. వైరల్ గా మారింది. మంత్రి తీరుపై జనాలు తీవ్రంగా ఫైరవుతున్నారు.  కర్నూలు జిల్లా ఆస్పరి ఎస్సైని హెచ్చరిస్తూ ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యల ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్పిరి మండల పరిధిలోని యాటకల్లుకు చెందిన దాదాపు 40 ట్రాక్టర్ల యజమానులు, కార్యకర్తలు ఆలూరులో ఇటీవల మంత్రిని కలిశారు. పోలీసులు తమ ట్రాక్టర్లను పట్టుకున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.దీంతో మంత్రి జయరాం నేరుగా ఆస్పరి ఎస్సై‌కి ఫోన్ చేసి, స్పీకర్‌ ఆన్ చేసి, వారి ముందే మాట్లాడారు. నాలుగు ఖాళీ ట్రాక్టర్లను పట్టుకున్నట్టు తెలిసిందని, వెంటనే వదిలేయాలని ఎస్సైతో మంత్రి అన్నారు. వదలకుంటే తాను మంత్రినన్న విషయాన్ని కూడా మర్చిపోయి ధర్నాకు కూర్చుంటానని హెచ్చరించారు. తనకు జనమే కావాలని, తాను ఇక్కడ ఇంకోసారి పోటీ చేయాలని పేర్కొన్న మంత్రి జయరామ్..  ట్రాక్టర్లను వదిలిపెడతారో, ధర్నాకు కూర్చునేలా చేస్తారో తేల్చుకోవాలని హెచ్చరించడం ఆ ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. అంతేకాదు, ఆదోని ట్రాక్టర్లు విచ్చలవిడిగా ఇసుక తోలుకుంటున్నాయని, ఆస్పరి వాళ్లను మాత్రం ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఇసుక ఉంటే విలేకరులెవ్వరూ చూడకపోతే వదిలిపెట్టి ఏదో యవ్వారం చేసుకోవాలని ఎస్సైకి సూచించారు. అక్కడితో ఆగక మన తాలూకాలో ఎక్కడా బతకలేని పరిస్థితి అంటూ ఫోన్ పెట్టేశారు. మంత్రి ఆడియో వైరల్ కావడంతో జనాలు ఆయనపై ఫైరవుతున్నారు. అక్రమార్కులకు వంతపాడిన అతనిని మంత్రిగా కొనసాగే అర్హత లేదంటున్నారు. వెంటనే జయరామ్ ను కేబినెట్ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోపై మంత్రి స్పందించారు. తాను బీసీ వర్గానికి చెందిన వాడిని కావడంతో తనపై కావాలనే రెండు మీడియా చానళ్లు అసత్య ప్రసారాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ ట్రాక్టర్లను స్టేషన్ కు తీసుకెళ్లారని గ్రామస్థులు చెప్పడంతో.. తాను ఎస్సైతో మాట్లాడానని  మంత్రి చెప్పారు. 

జగన్ రెడ్డి సర్కార్ కు మరో షాక్.. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి షాక్. ఇంటర్మీడియెట్ ఆన్ లైన్ అడ్మిషన్లలో ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్ల నోటిఫికేషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి  పాత పద్దతి ప్రకారమే అడ్మిషన్లు కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లను అందరి అభిప్రాయాలు తీసుకొని ఆన్ లైన్ లో నిర్వహించవచ్చని హైకోర్టు సూచించింది.  ఇంటర్మీడియెట్ లో ఆన్ లైన్ అడ్మిషన్లకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈనెల 13 నుంచి 23 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఉన్న ఇంటర్ కళాశాలలన్నింటిలోనూ ఆన్ లైన్ ప్రవేశాలు ఉంటాయని.. ఇందులో రిజర్వేషన్లు వర్తిస్తాయంటూ ఇంటర్ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తొలివిడత ప్రవేశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలు ఇంటర్ బోర్డు వెబ్ సైట్ అందుబాటులో ఉంచారు.  దరఖాస్తు ఫీజుగా ఓసీ బీసీలు రూ.100 మిగతా వర్గాల వారు రూ.50 చెల్లించాలని పేర్కొన్నారు. రెగ్యులర్ ఓకేషనల్ కోర్టుల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఆన్ లైన్ లో అడ్మిషన్లు నిర్వహించాలన్న నిర్ణయంపై కొందరు హైకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారించిన ధర్మాసనం ఈ సంవత్సరానికి పాత పద్దతిలోనే అడ్మిషన్లు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో  ఈ సంవత్సరం డైరెక్ట్ అడ్మిషన్లను తీసుకోవడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

మధుసూదనాచారిని సీఎం పక్కన పెట్టేశారా? హుజురాబాద్ సభే కారణమా? 

తెలంగాణ తొలి సభాపతిగా శాసనసభ రికార్డులకెక్కిన సిరికొండ మధుసూదనాచారి తన పనితీరుతో అప్పట్లో ప్రజల్లో మంచి మార్కులే కొట్టేశారు. స్పీకర్ గా ఉన్నా కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడానికి, స్థానిక సమస్యల మీద ఎంతోకొంత శ్రద్ధ చూపించేవారని చెప్పుకుంటారు. అయితే స్పీకర్ కు ఉండే పరిమితుల కారణంగా రెగ్యులర్ పొలిటికల్ లీడర్ల మాదిరిగా గతంలోలాగా కలివిడిగా తిరిగే సౌలభ్యాన్ని ఆచారి కోల్పోయారు.  దీంతో ఆయన అనేక అంశాల మీద కొడుకుల మీదనే ఆధారపడాల్సి వచ్చింది. వారికే నియోజకవర్గ యోగ క్షేమాలు, ప్రజల బాగోగులు చూసుకునే బాధ్యతలు అప్పగించారు. అయితే తండ్రి నుంచి బాధ్యతలు తీసుకున్న ఆచారి కొడుకులు మాత్రం బాధ్యతలకు బదులు "బరువు" పెంచుకునే కార్యక్రమాలకు పాల్పడ్డారని, అందువల్ల 2018 ఎన్నికల్లో తండ్రి ఓటమికి వారే పరోక్షంగా కారణమయ్యారని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఈ క్రమంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఓ వెలుగు వెలిగిన సిరికొండ... కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా తన సెకండ్ ఇన్నింగ్స్ ను విజయవంతంగా ఆడతారా అన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఆయన్ని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆరే పక్కన పెట్టేశారన్న వ్యాఖ్యానాలు బలంగా వినిపిస్తున్నాయి. దీని గురించే ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గంలో విపరీతమైన చర్చ నడుస్తోంది.  కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు, ఉద్యమ సహచరుడు అయిన సిరికొండను కేసీఆర్ అకస్మాత్తుగా ఎందుకు పక్కన పెట్టేశారన్న చర్చ సంచలనం సృష్టిస్తోంది. గత రెండేళ్లుగా ప్రజల్లో అపనమ్మకాన్ని పెంచుకుంటున్న కేసీఆర్... తనకు ఎంతో పనికొచ్చే సిరికొండను ఈ టైమ్ లో ఎందుకని పక్కన పెట్టారో లోతుగా ఆరా తీస్తున్నారు. సిరికొండను  పక్కనపెట్టడానికి  పునాదులు ఎక్కడ పడ్డాయనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  బీసీ వర్గానికి చెందిన విశ్వబ్రాహ్మణులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర స్థాయిలో భారీ బహిరంగ సభ జరపాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 1న దానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఆ సభకు మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, బీసీ మినిస్టర్ గంగుల కమలాకర్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీ కవితను కూడా ఆహ్వానించారు. ఆ తేదీని కూడా ప్రభుత్వ పెద్దల అనుమతితోనే ఖరారు చేసుకున్నారు. అటు హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం కూడా విశ్వబ్రాహ్మల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించింది. అయితే 2వ తేదీనే ఢిల్లీ టూర్ ఉన్న కారణంగా ఆ తేదీని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి ప్రభుత్వ పెద్దల సూచనతోనే మళ్లీ 5వ తేదీని ఖరారు చేశారు. అటు సభా ఏర్పాట్లు కూడా అదే ప్రకారం మొదలుపెట్టుకున్నారు. మరోవైపు విశ్వబ్రాహ్మణ సామాజికవర్గం నుంచి హైప్రొఫైల్ కలిగిన వ్యక్తి అయిన మధుసూదనాచారిని సభకు ఆహ్వానించాలని వెళ్లిన విశ్వబ్రాహ్మణ పెద్దలకు చేదు అనుభవం ఎదురైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆ బహిరంగ సభ జరగడానికి వీల్లేదని, ఆ సభ జరిగితే తనకు రావాల్సిన క్రెడిట్ రాకుండా పోతుందని, కాబట్టి సభను తరువాత జరుపుకోవాలంటూ సిరికొండ విపరీతమైన అసహనానికి గురై మాట్లాడినట్లు సంఘ నాయకులు చెబుతున్నారు. గత మార్చిలో విశ్వబ్రాహ్మణ సంఘానికి రాష్ట్ర ఎన్నికలు జరిగాయి. అలా ప్రజల చేత ఎన్నికైన సంఘంగా, ప్రజల చేత ఎన్నికైన అధ్యక్షునిగా ఎర్రోజు భిక్షపతికి ప్రభుత్వం దగ్గర గుర్తింపు లభించింది. కేటీఆర్, హరీశ్ రావు సూచనతోనే ఖరారైన 5వ తేదీ బహిరంగ సభకు హాజరయ్యేది లేదని సిరికొండ తేల్చేయడంతో పాటు అసలు సభ జరగకుండా వీలైనన్ని కుయుక్తులు పన్నినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  అన్ని ఇతర బీసీ కులాల్లాగే విశ్వబ్రాహ్మణులకు కూడా ప్రత్యేకమైన ఆత్మగౌరవ భవనంతో పాటు దాని నిర్మాణానికి రూ. 5 కోట్ల నిధులు విడుదల చేయడానికి సర్కారు నాలుగేళ్ల క్రితమే అంగీకరించింది. ఉప్పల్ భగాయత్ లో ఐదెకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆ హామీని పూర్తి చేయాలన్న డిమాండ్ ను చాలా కాలంగా విశ్వబ్రాహ్మణులు వినిపిస్తున్నారు. హుజూరాబాద్ ఎన్నికల దరిమిలా టీఆర్ఎస్ పెద్దలు అన్ని సామాజికవర్గాల మద్దతూ కూడగడుతున్న సందర్భంలో సొంత కులస్తుల దగ్గరే ఆచారి పలుచనైపోయారని, కేవలం కొందరు వ్యక్తుల మెప్పు కోసం, దశాబ్దాలుగా కొనసాగుతున్న పాత సంఘం నాయకత్వాన్ని ఏదో స్థాయిలో కొనసాగించడం కోసం వారితో కుమ్మక్కయి అసలు సొంత వర్గ ప్రజలకే దూరమవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే 5వ తేదీన జరిగిన బహిరంగ సభకు ప్రభుత్వం తరఫున బీసీ మంత్రి గంగుల కమలాకర్ ను పంపించి విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి తాము శాయశక్తులా కృషి చేస్తామన్న మెస్సేజ్ ఇప్పించడం గమనార్హం. సభకు హాజరైన గంగుల... తాను మంత్రి హరీశ్ రావు చెబితే సభకు వచ్చానని, ఆయన చెప్పినట్లుగా విశ్వబ్రాహ్మణులకు ఐదెకరాల భూమితో పాటు భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తున్నట్టు పేర్కొందంటూ చెప్పి... ఆ ఉత్తర్వుల తాజా కాపీని భిక్షపతికి అప్పగించారు. కమలాకర్ మాటలతో సభికులంతా ఈలలు, కేరింతలతో భారీ స్థాయిలో రెస్పాండయ్యారు.  తనకు దక్కని క్రెడిట్ మరొకరికి దక్కడం జీర్ణించుకోలేని కొందరు పెద్దలు... ఈ సభను వాయిదా వేయడానికి శతవిధాలా ప్రయత్నించారని, అలాంటి నాయకుల లోగుట్లేంటో ప్రజలంతా గ్రహించాలని, ప్రభుత్వం వెన్నుదన్నుతో ముందుముందు కూడా విశ్వబ్రాహ్మణుల మేలు కోసం పని చేస్తానని ఎర్రోజు భిక్షపతి ఇండైరెక్టుగా సిరికొండ మీద అస్త్రాలు సంధించారు. దీంతో విశ్వబ్రాహ్మణ ప్రజానీకంతో ఎక్కడా సంబంధం లేని పాత సంఘం నాయకుల కోసం... ఆ వర్గం యావత్ ప్రజానీకానికి దూరమైన వ్యక్తిగా సిరికొండను ప్రభుత్వం గుర్తించినట్లయింది. హుజూరాబాద్ లో ఈటల మీద గెలుపు కోసం సర్వ శక్తులూ ఒడ్డుతున్న సర్కారుకు చేయూతనిచ్చి ఆదుకోవాల్సిన సమయంలో సొంత కులం ప్రజల ఓట్లను టీఆర్ఎస్ కు మళ్లించాల్సిన బాధ్యతను పక్కనపెట్టి.. అసలు సొంత జాతి నుంచే విమర్శలు ఎదుర్కొంటున్న వ్యక్తికి తాము మద్దతిస్తున్న సంకేతాలు వెళితే మొదటికే మోసం వస్తుందన్న అంశాన్ని ప్రభుత్వ పెద్దలు పసిగట్టినట్లు పక్కా సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా సేకరించిన కేటీఆర్ తదితరులు సిరికొండతో సంబంధం లేకుండా బహిరంగ సభకు ప్రభుత్వం తరఫున గంగుల కమలాకర్ ను పంపించడమే సిరికొండ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మరి తన రాజకీయ భవితవ్యాన్ని తానే ప్రశ్నార్థకం చేసుకున్న మధుసూదనాచారి స్వయంకృతాపరాధాన్ని ఎలా అధిగమిస్తారో చూడాలి.

తీన్మార్ మల్లన్న కేసులో మాజీ రౌడీ షీటర్? 

తెలంగాణలో సంచలనంగా మారిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కేసులో కీలక విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ లో నమోదైన బెదిరింపుల కేసులో ఆగస్టు 27న తీన్మార్ మల్లన్నను చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్డు రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. తర్వాత పోలీసులు కస్టడి పిటిషన్ వేయడంతో.. నాలుగు రోజుల కస్టడికి కోర్టు అనుమతిచ్చింది. కస్డడీలో భాగంగా మల్లన్నను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో మల్లన్న కేసులో హైదరాబాద్ కు చెందిన ఓ మాజీ రౌడీ షీటర్ పేరు తెరపైకి రావడం సంచలనంగా మారింది.  తీన్మార్ మల్లన్న కేసులో మాజీ రౌడీషీటర్ అంబర్ పేట శంకర్ పేరును పోలీసులు విచారించారు.  ఆదివారం శంకర్ ను పిలిచిన పోలీసులు.. అతడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.ఏప్రిల్ 19న తనకు వాట్సాప్ ద్వారా ఫోన్ చేసిన తీన్మార్ మల్లన్న రూ.30లక్షలు డిమాండ్ చేశాడని లక్ష్మీకాంత్ శర్మ ఆరోపించారు. ఈ కేసులోనే ప్రస్తుతం మల్లన్నను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ డబ్బు చెల్లింపు విషయంలో తనకు-శర్మకు మధ్య సెటిల్ మెంట్ చేయడానికి అంబర్ పేట శంకర్ ప్రయత్నించాడని మల్లన్న పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆదివారం శంకర్ ను పిలిచిన పోలీసులు అతడిని విచారించారు. శర్మ కోరిన మీదట ఇరువురి మధ్య రాజీ చేయడానికి ప్రయత్నించిన మాట వాస్తవమేనని.. అయితే తాను డీల్ సెటిల్ చేయలేకపోయానని అంబర్ పేట శంకర్ పోలీసులకు చెప్పారని తెలుస్తోంది. లక్ష్మీకాంత శర్మ బాధితులు పేరుతో తీన్మార్ మల్లన్న యూట్యూబ్ చానెల్ లో కొన్ని కథనాలు ప్రసారమయ్యాయి. అందులో లక్ష్మీకాంత శర్మ బాధితులమని చెబుతూ కొంతమంది తీన్మార్ మల్లన్నకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్నపై లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడు ఫిర్యాదు చేశారు. మల్లన్న తనకు ఫోన్ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేశాడని.. ఇవ్వకుంటే తప్పుడు వార్త కథనాలు ప్రసారం చేస్తానని బెదిరించినట్టు లక్ష్మీకాంత శర్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.  దీంతో గత ఏప్రిల్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగస్టు 27న అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పుడు రౌడీ షీటర్ పేరు తెరపైకి రావడంతో .. ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందోనన్న చర్చ జరుగుతోంది

అలా అయితే రాజీనామా చేస్త.. స్పీకర్ పోచారం సంచలనం

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఉప ఎన్నిక జరగాల్సి ఉన్న హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన దళిత బంధు పథకం చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కొత్త పథకాల పేరుతో డ్రామాలు చేస్తున్నారని మండిపడుతున్నాయి. విపక్షాలకు అదే స్థాయిలో కౌంటరిస్తున్నారు గులాబీ లీడర్లు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై చర్చకు రావాలని సవాల్ విసురుతున్నారు.  విపక్షాలపై ఆరోపణలపై స్పందించారు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.  విపక్షాలకు ఓ సవాల్ విసిరారు. దేశంలో ఎక్కడ లేని అభివృద్ధి తెలంగాణలోనే ఉందన్నారు స్పీకర్ పోచారం. అభివృద్ధి చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారని చెప్పారు. తెలంగాణలో ఉన్న అభివృద్ధి వేరే రాష్ట్రం లో ఎక్కడైనా ఉందా.. ఉందని ఎవరైనా చూపిస్తే రాజీనామా చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. తాము ప్రజలనే నమ్ముకున్నామని చెప్పారు,  ఓడించాలన్నా గెలిపించాలన్నా ప్రజల తోనే సాధ్యమన్నారు. గెలుపు ఓటములు మాట్లాడే హక్కు ప్రజలకు మాత్రమే ఉందన్నారు.  నోరు ఉంది కదా మైకు ఉంది కదా అని ఏది పడిత అది  మాట్లాడితే ఇక్కడ ఎవ్వరు వినడానికి సిద్ధంగా లేరని తేల్చి చెప్పారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.   

భవానీపూర్ లో మమత పోటీ.. నందిగ్రామ్ సీన్ రిపీటయ్యేనా? 

ఈ సంవత్సరం (2021) ప్రధమార్థంలో జరిగిన  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కానీ, పార్టీ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగాం నియోజక వర్గంలో అంతే ఘనంగా ఓడిపోయారు. అయినా తృణమూల్‌కు మెజార్టీ సీట్లు రావడంతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అయితే, ఆరు నెలల్లోగా ఆమె ఉప ఎన్నికలో గెలిచి  ఎమ్మెల్యేగా  సభలో కాలు పెడితేనే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారు, లేదంటే, ఆరు నెలల గడవు ముగిసిన వెంటనే నవంబర్ 5 తర్వాత మాజీగా మిగిలి పోతారు.  ఈ నేపధ్యంలో ఆమె,  ఆరు నెలల గడవులోగా ఎమ్మెల్యేగా ఎన్నికై పదవిలో కొనసాగుతారా లేక మాజీగ మిగిలి పోతారా? అనే విషయంలో ఇంతవరకు ఒక విధమైన సందిగ్దత కొనసాగింది. రాజకీయ, మీడియా వర్గాల్లో రకరకాల చర్చలు జరిగాయి. కరోనాను అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల గడవుకు ముందు ఉప ఎన్నికలు జరగకుడా అడ్డుకుంటుందని, ఆమెను మాజీని చేసి మోడీ, షా జోడీ పగ తీర్చుకుంటారని  అందరూ అనుకున్నారు.  కేంద్ర ప్రభుత్వం అలాంటి అపప్రదకు అవకాశం ఇవ్వలేదు. కేంద్ర ఎన్నికల సంఘం, కరోనా పరిస్థితుల నేపధ్యంలో ఉప ఎన్నికలు జరగవలసిన అన్ని రాష్ర్ల మలతో పాటుగానే, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అభిప్రాయం తీసుకుంది. రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా ఉండేందుకు త్వరగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేసిన వినతిని ఎన్నికల సంఘం ఆమోదించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేసి సిద్దం చేసిన, భవానీపుర నియోజక వర్గంతో  పాటుగా, రాష్ట్రంలోని మరో రెండు నియోజక వర్గాలు, ఒడిస్సాలోని పిప్లీ లోక్ సభ నియోజకవర్గానికి ఈ నెల 30న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.  దీంతో ఒక ఉత్కంట తొలిగి పోయింది. మరో వంక భవానీపుర నియోజకవర్గం ఉపఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తారని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారికంగా ప్రకటించింది. ఆ విధంగా మమత బెనర్జీకి తప్పదనుకున్న  పదవీ గండం తొలిగి పోయింది.  అయితే ఇల్లలకగానే పండగ కాదు, ఉప ఎన్నిక జరిగినంత మాత్రాన మమతా బెనర్జీ గెలుస్తారన్న గ్యారెంటీ ఏంటి, అంటే, నిజమే, ఎన్నికలలో గెలుపు ఓటములు అన్ని సందర్భాలలో ఒకేలా ఉండవు. అయితే, భవానీపుర నియోజక వర్గం విషయంలో అలాంటి అనుమానాలు అక్కరలేదని, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితిలో మమతా బెనర్జీని ఓడించడం బీజేపీకి అయ్యే పని కాదు.బీజేపీలో అసెంబ్లీ ఎన్నికలు ముందున్న జోష ఇప్పుడు లేదు. ఇప్పటికే, ఐదారుగురు బీజేపీ ఎమ్మెల్యేలు తృణమూల్ పంచన చేరారు. మమతా బెనర్జీ ఒకక్ విజిలేస్తే గోడ దుకేందుకు మరో డజను మందికి పైగా బీజేపీ ఎమ్మెల్యేలు సొంత గూటికి చేరేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు.  అదలా ఉంటె, భవానీపుర మొదటి నుంచి తృణమూల్ కాంగ్రెస్ కంచుకోట, వరసగా రెండు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ గెలిచారు. ముఖ్యమంత్రి అయ్యారు.  మొన్నటి ఎన్నికల్లో మాత్రం వ్యూహాత్మక పంతానికి పోయి,ఆమె నందిగ్రాం నుంచి పోటీ చేసి బీజేపీ  అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు.అయినా, భవానీపుర నియోజకవర్గంలో తృణమూల్  పట్టు సడల లేదు. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సోవన్‌దేవ్‌ ఛటోపాధ్యాయ అంతకు ముందు (2016) అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీకి వచ్చిన మెజారిటీ కంటే, ఎక్కువ మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి రెడ్నుసార్లు విజయంసాధించిన మమతా బెనర్జీకి, 2011లో 50 వేల పైచిలుకు మెజారిటీ వచ్చింది. కానీ, 2016లో ఆమె మెజారిటీ సగానికి సగం పది పోయింది.25 వేల మెజారిటీతో  గెలిచారు.కాగా, 2011 ఎన్నికల్లో  తృణమూల్ అభ్యర్ధి సోవన్‌దేవ్‌ ఛటోపాధ్యాయకు 28వేలకు పై చిలుకు మెజారిటీ వచ్చింది.  ఇక ఇప్పుడు, ఆమె ముఖ్యమంత్రి హోదాలో బరిలో దిగుతున్నారు. కాబట్టి, ఇటు పార్టీ నాయకులు, అటు విశ్లేషకులు కూడా ఆమె గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు, అయితే, రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో,రాజకీయం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం, ఎంతటి రాజకీయ పండితులకు అయినా అన్నిసందర్భాలలో సాధ్యం కాదు. అయితే, ఇది అలాంటి సందర్భమా అంటే కాదు..అనలేము ... అవుననీ అనలేము అంటున్నారు, రాజకీయ విశ్లేషకులు. 

స‌ర్పంచ్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బెదిరింపు!.. భూక‌బ్జా ఆరోప‌ణ‌ల‌తో క‌ల‌క‌లం..

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ‌రుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఏకంగా మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌ల‌పైనే ప‌లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. పెద్దోళ్లే అలా చేస్తుంటే.. చిన్నోళ్లమైన తాము చేస్తే త‌ప్పేముంది? అనుకున్నారేమో అంతా. భూదందా కేసుల్లో అనేక మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తుంటాయి. వీరిలో జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి పేరు అంద‌రికంటే ముందుంటుంద‌ని అంటున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ అంత‌టి నేత సైతం భూక‌బ్జా ఆరోప‌ణ‌ల‌తోనే పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావాల్సి వ‌చ్చింది. ఇక ఈట‌ల‌కు మంచి దోస్త్.. ఆ ప‌క్క నియోజ‌క‌వ‌ర్గానికే చెందిన గులాబీ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ పేరు సైతం తాజాగా ఓ భూ ఆక్ర‌మ‌ణ కేసులో వినిపించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఎమ్మెల్యే ర‌స‌మ‌యి వేధింపులు భ‌రించ‌లేక ఓ గ్రామ స‌ర్పంచ్ ఏకంగా టీఆర్ఎస్‌కు రాజీనామా చేయ‌డం.. వారిద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ ఆడియో వైర‌ల్ కావ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.  కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. శంకరపట్నం మండలం కరీంపేట సర్పంచి మల్లయ్య మధ్య జరిగిన ఆడియో టేపు వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే తీరుతో విసుగెత్తి స‌ర్పంచ్‌ మల్లయ్య టీఆర్‌ఎస్‌కి రాజీనామా కూడా చేశాడు. మానకొండూర్‌ నియోజకవర్గంలో తన భూమి విషయంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకున్న తీరుతో మనస్తాపం చెందిన సర్పంచ్ మ‌ల్ల‌య్య‌ పార్టీకి రాజీనామా చేయ‌డం.. ఆ య‌వ్వారంలో ఎమ్మెల్యే, సర్పంచ్ మధ్య జరిగిన ఆడియో కాల్ వైరల్‌గా మారి పార్టీని షేక్ చేస్తోంది. సర్పంచ్‌ మల్లయ్యకు చెందిన‌ 1.18 గుంటల భూమిని కొందరు ఆక్రమించుకుని ఇళ్లు కడుతుండ‌టంపై వివాదం న‌డుస్తోంది. మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జోక్యం చేసుకొని.. ఆక్ర‌మ‌ణదారుల‌కు అనుకూలంగా వ‌త్తాసు ప‌లుకుతూ.. త‌న‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌నేది స‌ర్పంచ్ ఆరోప‌ణ‌. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే బాలకిషన్ తనను కించపరిచేలా మాట్లాడారంటూ మల్లయ్య ఆడియో రికార్డును మీడియాకు విడుద‌ల చేశారు. ఎమ్మెల్యే తీరుతో మనస్తాపం చెంది తాను టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలా టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూదందా.. సొంతపార్టీలోనే చిచ్చు పెడుతోంది.   

సీనియర్ ఐపీఎస్ బదిలీకి అసలు కారణం ఇదా? ఇలాంటి రాజకీయాలు ఉంటాయా? 

తెలంగాణ రాష్ట్రంలో ఆయనో సీనియర్ ఐపీఎస్ అధికారి.. జనాల్లోనూ ఆయన క్రేజీ ఉన్న ఆఫీసర్.. కీలక కేసుల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలకు జనం జేజేలు కొట్టారు. అంతటి ఫేమస్ ఐపీఎస్ ను ప్రభుత్వం అకస్మాత్తుగా బదిలీ చేసింది. పోలీస్ శాఖతో సంబంధం లేని ఓ విభాగానికి అధికారిగా నియమించింది. సూపర్ కాప్ గా పేరున్న ఆ అధికారి ట్రాన్స్ ఫర్ అంశం జనాలకు షాకింగ్ గా మారింది. ఆయన బదిలీ ఎందుకు జరిగింది? సాధారణ బదిలీల్లో భాగంగానే జరిగిందా? లేక ఏమైనా బలమైన కారణాలున్నాయా? అన్న చర్చ కూడా కొన్ని వర్గాల నుంచి వస్తోంది. అయితే ఆ సీనియర్ ఐపీఎస్ బదిలీ వెనుక పెద్ద కథే ఉందని తెలుస్తోంది. ఓ కేంద్ర మంత్రి ఇందులో కీలక పాత్ర పోషించారని సమాచారం. ఇటీవల హైదరాబాద్ లో ఓ సంస్థ అక్రమ బాగోతం బయటపడింది. రూ.780 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసులో సీసీఎస్‌ పోలీసులు ఆ సంస్థ ఎండీని అదుపులోకి తీసుకున్నారు. తన సంస్థ షేర్లను తనఖా పెట్టి వివిధ బ్యాంకుల వద్ద అతడు రుణాలు స్వీకరించారని పోలీసులు గుర్తించారు. ఆ సంస్థపై  గతంలో సెబీ నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా  ఆ సంస్థ  స్టాక్ బ్రోకింగ్‌కు లక్షలాది మంది వినియోగదారులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వేల కోట్ల పెట్టుబడులు వినియోగదారులు పెట్టారు. కస్టమర్ల షేర్లను సంస్థ ఎండీ బ్యాంకులకు తనఖా పెట్టడంతో బ్యాంకులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే అతడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన ఆ సంస్థ ఎండీ విషయానికి, సీనియర్ ఐపీఎస్ అధికారి బదిలీకి సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంకు రుణాల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలో ఓ కేంద్ర మంత్రికి వాటా ఉందని సమాచారం. ఈ కేసు విచారణలో భాగంగా దర్యాప్తు చేసిన ఐపీఎస్ అధికారికి.. ఆ సంస్థలో కేంద్రమంత్రికి ఉన్న వాటాలకు సంబంధించిన ఆధారాలు దొరికాయట. అంతేకాదు ఆ సంస్థ ఎలా అక్రమాలకు పాల్పడింది.. ఇందులో ఎవరెవరి పాత్ర ఉందన్న వివరాలతో ఆయన సమగ్ర నివేదిక రూపొందించారట.  ఆ సంస్థ చేసిన అక్రమాలతో పాటు కేంద్ర మంత్రి వాటాకు సంబంధించిన వివరాలను కేంద్ర పెద్దల దృస్టికి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేశారట ఆ సీనియర్ ఐపీఎస్. పోలీసులు కేసు బుక్ చేసిన సంస్థలో తనకు సంబంధించిన వివరాలు సేకరించారే విషయాన్ని గ్రహించిన సదరుకేంద్ర మంత్రి.. మరో దారిలో చక్రం తిప్పారని అంటున్నారు. నేరుగా ఇక్కడి ప్రభుత్వ పెద్దలను కలిస్తే అనుమానం వస్తుందనే భయంతో మరో ప్లాన్ చేశారట. పక్క రాష్ట్రంలోని ముఖ్య నేత ద్వారా పావులు కదిపారట. తనకు మొదటి నుంచి మద్దతుగా నిలుస్తున్న కేంద్ర మంత్రి కోసం పక్క రాష్ట్ర కీలక నేత... కేసును దర్యాప్తు జరుగుతున్న ప్రభుత్వంలోని పెద్దలతో మాట్లాడారట. మొదటి నుంచి వాళ్లిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉండటంతో అతను కూడా ఓకే అన్నాడట. సీన్ కట్ చేస్తే ఆ సీనియర్ అధికారిని బదిలీ చేస్తు ఉత్తర్వులు వచ్చేశాయి. ఇటీవలే దేశ ప్రధానిని కలిసి రాష్ట్ర పెద్ద.. ఈ విషయంపైనా, కేంద్రమంత్రికి సంబంధించిన విషయాలపైనా చర్చించారని తెలుస్తోంది.  తమకు నమ్మకస్తుడిగా ఉన్న కేంద్ర మంత్రి కోసం రెండు రాష్ట్రాల కీలక నేతలు.. అలా సాయం చేశారనే చర్చ రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ వర్గాల్లోనూ సాగుతోంది. ఇక్కడే మరో ఆసక్తికర విషయం కూడా ఉంది. సీనియర్ ఐపీఎస్ అధికారి బదిలీకి కారణమని భావిస్తున్న కేంద్రమంత్రికి.. దేశ రాజధానిలో ఖరీదైన భవంతిని ఓ పారిశ్రామిక వేత్త నిర్మించి ఇస్తున్నారట. సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన సంస్థ ఎండీకి.. ఆ పారిశ్రామిక వేత్తకు కూడా మంచి సంబంధాలు ఉన్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.  

సెప్టెంబర్ 25,26న అమెరికా తెలుగు సాహితీ సదస్సు.. కెనడా టొరంటోలో ఘనంగా ఏర్పాట్లు.. 

అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు భాష ఔన్నత్యం మరోసారి వెలిగిపోనుంది. సెప్టెంబర్ 25, 26 తేదీల్లో 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు జరగబోతోంది. ఇదే మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు కూడా.vanguru fo ఇందుకోసం ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నారు.సెప్టెంబర్ 25, 26 తేదీల్లో టొరంటో, కెనడా ప్రధాన కేంద్రంగా ఆన్ లైన్ లో  జరగబోతున్న ప్రత్యేక తెలుగు భాషా, సాహిత్య సమావేశానికి ఏర్పాట్లు త్వరితగతిని జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. అమెరికా సాహితి సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే 100 మంది అమెరికా-కెనడా సాహితీవేత్తలు ముందుకు వచ్చారు. నిర్వాహకులు ఆహ్వానాలు పంపగా.. వాళ్లంతా అంగీకరించారు. తమ ప్రసంగ ప్రతిపాదనలు పంపించారు. భారత దేశం నుంచి కొందరు లబ్ద ప్రతిష్టులు ప్రసంగించనున్నారు.సాహితీ సదస్సు లోనే పలు పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. సాహిత్య సదస్సు చర్చా వేదికలు జరగనున్నాయి. కొందరికి జీవన సౌఫల్య పురస్కారం అందించనున్నారు నిర్వాహకులు.  సాహిత సదస్సులో పాల్గొనేందుకు ఆసక్తిగా చూపిన వక్తలందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. అందరికి అందరికీ అవకాశం కల్పించడానికి సదస్సు జరిగే సమయాలని రెండు రోజులూ ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 7:00 గంటల దాకా పొడిగించారు. మొత్తం 20 గంటలకు పైగా సాహితి సదస్సు జరగనుంది.  యూఎస్ లో అతి పెద్ద దేశాలయిన కెనడా, అమెరికా సంయక్త రాష్ట్రాలలోని సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు కలిసి ఇంత పెద్ద ఎత్తున క సాహిత్య వేదిక మీద కలుసుకోవడం చరిత్రలో ఇదే మొదటి సారిని అంటున్నారు. ఈ రెండు రోజుల ప్రత్యేక తెలుగు భాషా, సాహిత్య సమావేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులందరూ వీక్షించేలా ఆన్ లైన్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆసాంతం వీక్షించి ఆనందించాలని నిర్వాహకులు కోరుతున్నారు. రెండు రోజుల సాహిత్య సదస్సు ప్రత్యక్ష ప్రసారం చూపే లింక్ లు  (EST, Toronto Time 9:00 AM-7:00 PM) September 25, 2021 YouTube: https://bit.ly/3zcq0O1 September 26, 2021  YouTube: https://bit.ly/3mjgLYS సాహితి సదస్సుకు సంబంధించిన మరిన్ని వివరాలు.. త్రివిక్రమ్ సింగరాజు రచన, శశి వర్ధన్ పట్లోళ్ళ దర్శకత్వంలో కెనడా యువతులు హర్ష దీపిక రాయవరపు, భావన పగిడేల ఈ సదస్సు గురించి అందించిన వివరాలకు https://youtu.be/U4tX3dNHlKw సదస్సుకు సంబంధించిన ఏ విషయానికైనా ఈ క్రింది వారిని సంప్రదించండి.. సంచాలకులు : లక్ష్మీ రాయవరపు (టొరంటో, కెనడా): sadassulu@gmail.com  వంగూరి చిట్టెన్ రాజు (హ్యూస్టన్, టెక్సస్, USA): vangurifoundation@gmail.com సంధాన కర్తలు: విక్రమ్ సింగరాజు (కెనడా): triv.sing@gmail.com,శాయి రాచకొండ (USA): sairacha@gmail.com కార్యనిర్వాహక సంఘం సభ్యులు: యామిని పాపుదేశి, భావన పగిడేల, సర్దార్ ఖాన్, కృష్ణ కుంకాల నిర్వహిస్తున్న సంస్థలు: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తెలుగు తల్లి పత్రిక, ఆటవా తెలుగు అసోసియేషన్, అంటారియో తెలుగు ఫౌండేషన్, టొరాంటో తెలుగు టైమ్స్, కాల్గరి తెలంగాణా అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టోరాంటో, తెలుగు వాహిని సాహిత్య సమూహం

యేసుకు లేని కరోనా వినాయ‌కుడికేనా? జ‌గ‌న్‌పై ముప్పేట దాడి..

వైఎస్సార్ వర్థంతికి వర్తించని కొవిడ్ నిబంధనలు గణేష్ ఉత్సవాలకు ఏ విధంగా వర్తిస్థాయని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నిలదీశారు. తెలంగాణలో అనుమతించినప్పుడు.. ఏపీలో ఎందుకు అనుమతించరు? అని మండిప‌డ్డారు. ఏపీలో 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఘ‌నంగా వినాయ‌క చ‌వితి వేడుక‌లు జ‌రుపుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు చంద్ర‌బాబు.  అటు, ఎంపీ ర‌ఘురామ సైతం రంగంలోకి దిగాపోయారు. ఏపీలో వినాయ‌క చ‌వితి పండ‌గ‌పై ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధించ‌డంపై త‌న‌దైన స్లైల్‌లో సెటైర్లు వేశారు. ఆయ‌న అడిగే ప్ర‌శ్న‌ల‌న్నీ ప‌క్కా లాజికల్‌గా ఉంటాయి. అందుకే, ర‌ఘురామ నోటి నుంచి వ‌చ్చే తూటాల్లాంటి మాట‌లు.. జ‌గ‌న్ను తూట్లు పొడుస్తుంటాయి. ఇక వినాయ‌క చ‌వితి ఆంక్ష‌ల‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తూ ప్ర‌శ్న‌లు సంధించారు ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు.  యేసుకు లేని కరోనా గణేశ్‌కు ఎందుకని నిల‌దీశారు ర‌ఘురామ‌. చర్చిల్లో ప్రార్థనలకు అనుమతించారు.. అక్కడ కరోనా రాదా అని ప్ర‌శ్నించారు. గణేశుడు ఆదిదేవుడని ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులందరూ ఆరాధించే విఘ్నేశ్వరుని పూజలకు అడ్డంకులు ఎందుకని సీఎం జగన్‌పై మండిప‌డ్డారు. వైఎస్సార్ వర్థంతి, జయంతి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించార‌ని.. షాపింగ్ మాల్స్ ఓపెన్‌ చేశార‌ని.. మద్యం షాపుల దగ్గర రద్దీని చూస్తూనే ఉన్నామని.. ఇలా ఏ విష‌యంలోనూ లేని ఆంక్షలు.. వినాయ‌కుడి పండ‌గ వేడుక‌ల‌కే ఎందుక‌ని నిల‌దీశారు ఎంపీ ర‌ఘురామ‌.  విగ్రహాలు ధ్వంసం చేసిన వాళ్ళను పట్టుకోలేక పోయిన వారు.. విగ్రహాలు అమ్మనీయకుండ చేస్తారా? అని హిందువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని రఘురామ అన్నారు. మొహర్రం అప్పుడు లేని కరోనా.. ఇప్పుడు వినాయక చవితికి ఎలా వచ్చిందన్నారు. ముఖ్య‌మంత్రి బెట్టు వీడి.. అన్ని మతాల వారిని ఒకేలా చూడాలని సూచించారు. నిబంధనలు పెట్టి పండుగలు చేసుకునేందుకు అనుమతించాలని సీఎం జ‌గ‌న్‌కు విజ్ఞ‌ప్తి చేశారు ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.  మ‌రోవైపు, హిందువుల మనోభావాలను ఏపీ సీఎం జగన్‌ కించపరుస్తున్నారంటూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిప‌డ్డారు. వినాయక చవితి ఇళ్లల్లోనే జరుపుకోవాలన్న నిబంధన సరికాదని తప్పుబట్టారు. కొవిడ్ నిబంధనలతో గణేష్ ఉత్సవాలు జరుపుకునేందుకు అవకాశమివ్వాలని కోరారు. ఇలా జ‌గ‌న్ స‌ర్కారు తీరుపై స‌ర్వ‌త్రా తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.   

జ‌గ‌న్‌ ప్యాలెస్ కోసమే ఏపీ ప్ర‌జ‌ల నోట్లో ఆల్‌-మ‌ట్టి..!

స్వ‌లాభం లేనిదే సీఎం జ‌గ‌న్ ఏ ప‌నీ చేయ‌రంటారు. ఆయ‌న చేసే ప్ర‌తీ ప‌నిలో ఎంతోకొంత లాభం వెన‌కేసుకుంటార‌ని చెబుతారు. ఏపీలో జ‌రిగే అన్నిర‌కాల‌ మైనింగ్లో జ‌గ‌న్‌కు జే ట్యాక్స్ వెళుతుంద‌నేది ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌. ఇక లిక్క‌ర్ పాల‌సీలోనైతే లెక్క‌కు మించి దండుకుంటున్నార‌ని అంటారు. ఊరూ-పేరు లేని బ్రాండ్స్ తీసుకురావ‌డం వెనుక ఆ జే-ట్యాక్సే కార‌ణమ‌నే విమ‌ర్శ‌. ఇక‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కుమ్మ‌క్కై.. ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెడుతున్నార‌ని.. వాట‌ర్‌, కరెంట్ విష‌యంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జ‌రుగుతున్నా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటారు. తాజాగా, క‌ర్ణాట‌క విష‌యంలోనూ ఇలాంటి లాలూచీనే పడుతున్నార‌నేది టీడీపీ ఆరోపిస్తోంది. బెంగ‌ళూరులోని త‌న ప్యాలెస్‌ను కాపాడుకోవ‌డానికే కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుతున్నా సీఎం జగన్‌ పట్టించుకోవడం లేదని మాజీ నీటిపారుద‌ల‌శాఖ‌ మంత్రి దేవినేని ఉమా మండిప‌డ్డారు.  రాష్ట్ర రైతాంగ హక్కుల్ని తాకట్టు పెట్టే అధికారం జ‌గ‌న్‌కు ఎవరిచ్చారని ఉమా నిలదీశారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తును దాదాపు ఐదున్నర మీటర్ల మేర పెంచి.. 18 అడుగుల మేర గేట్ల నిర్మాణం చేస్తుంటే.. సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మొద్దునిద్రతో బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించే అక్రమ ప్రాజెక్టులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కేంద్ర గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టు పేరు లేకపోయినా సీఎంలో కనీసం స్పందన లేదని త‌ప్పుబ‌ట్టారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 50శాతం వాటా ఉందంటూ.. ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఢిల్లీలో మకాం వేసి ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలుస్తుంటే.. జగన్‌ ఏం చేస్తున్నారని దేవినేని ఉమ నిలదీశారు. అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల పరిరక్షణపై ఏనాడైనా అధికారులతో సమీక్ష నిర్వహించారా? అని ప్రశ్నించారు. గత 28 నెలల్లో పోలవరం పనులు ఎంత శాతం పూర్తిచేశారో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని దేవినేని డిమాండ్‌ చేశారు.