నితీష్ టార్గెట్ గా పీకే పొలిటికల్ ఎంట్రీ

నితీష్ కుమార్, ప్రశాంత్ కిశోర్ ఈ ఇద్దరిలో ఏ ఒక్కరికీ పరిచయం అవసరం లేదు. ఒకరు, కుర్చీలోంచి కదలకుండా  అలవోకగా కూటములు మార్చడంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన జేడీయు నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. రెండవ వ్యక్తి, ఒక దశాబ్ద కాలంగా  దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న, రాజకీయలలో ప్రముఖంగా వినిపిస్తున్న, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఇద్దరు ఒకే రాష్ట్రానికి చెందిన వారు కావడం ఒకటైతే, ఇద్దరికిద్దరూ, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు చురుగ్గా పావులు  కదుపుతున్నారు. అలాగే, ఇద్దరికిద్దరూ, రాజకీయాలను ఆవపోసన పట్టిన ఉద్దండ పిండాలు. అంతే కాదు రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనే నానుడికి నిలువెత్తు నిదర్శనం ఈ బీహారీ జోడీ. రాజకీయాలను తమకు అనుకూలంగా మలచుకోవడంలో ఇద్దరికిద్దరూ అందె వేసిన చెయ్యిగా గుర్తింపు పొందారు. అఫ్కోర్స్, ఆ ప్రయత్నాలలో అన్ని వేళలా సక్సెస్  కాకపోవచ్చును, అయినా, ప్రయత్నాలు అయితే విరమించుకోలేదు. ఈ ఇద్దరి మధ్య, (ఇక్కడ అసందర్భమే అయినా)  మరో సారూప్యం కూడా వుంది. ఈ ఇద్దరు తెలంగాణ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుట్ల చంద్రశేఖర రావుకు మంచి మిత్రులు. మంచి శత్రువులు.  అయితే ఇప్పడు విషయం అది కాదు. సో   ఆ విషయాన్ని పక్కన పెట్టి అసలు విషయంలోకి వస్తే ...   బీహార్ సీఎం నితీష్ కుమార్  'సమాధాన్ యాత్ర' పేరిట బీహార్లో యాత్ర చేపట్టారు. మరో వంక, ఒకప్పుడు జేడీయు ఉపాధ్యక్షుడిగా  కీలక బాధ్యతలు నిర్వహించిన ప్రశాంత్ కిశోర్ ఆ తర్వాతి కాలంలో రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రాజకీయాలు తన వంటికి పడవని ప్రకటించుకున్నారు. నేనొక విఫల రాజకీయ వేత్తనని చెప్పుకున్నారు. ఇక పై క్రియాశీల రాజకీయాల్లో వేలు పెట్టనని ప్రకటించుకున్నారు.అయితే, ఒపీనియన్ మార్చుకుని, ప్రత్యక్ష రాజకీయాల్లో వేలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఎన్నికల వ్యూహకర్త అవతారానికి ఫుల్ స్టాప్ పెట్టిన ప్రశాంత్ కిశోర్  ఇప్పటికే, జన సూరజ్  యాత్ర పేరిట బీహార్ లోని చంపరాన్ జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్నారు.  అయితే, ఎవరి మానాన వారు ఎవరి యాత్ర వారు చేసుకుంటే ఏమో కానీ, ఒకప్పుడు జిగ్నీ దోస్తులుగా ఉన్న ఆ ఇద్దరి మధ్య ఇప్పడు మాటాల యుద్ధం నడుస్తోంది. నిజానికి  ఇప్పుడే కాదు చాల కాలంగా ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగింది. ఈ నేపధ్యంలో నితీష్ కుమార్ ప్రారంభించిన యాత్రపై ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు, బీహార్ రాష్ట్ర రాజకీయాలలోనే కాదు జాతీయ రాజకీయాల్లోనూ  వేడి  పుట్టిస్తున్నాయి.  పీకే విపక్ష్ల ఐక్యతకు గండి కొట్టే ప్రయత్నాలకు  ఆయన శ్రీకారం చుట్టినట్లుగా భావిస్తున్నారు.  ప్రజలను మరోమారు మోసం చేసేందుకే నితీష్ యాత్ర చేపట్టారని ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు ప్రశాంత్ కిశోర్  కోరి కోరి కాలు దువ్వుతున్నట్లు ఉందని అంటున్నారు. నితీష్ గతంలో అనేక యాత్రలు చేసిన విషయాన్నిగుర్తు చేసిన ప్రశాంత్ కిషోర్.. వాటి వల్ల రాష్ట్రానికి ఏం లాభం చేకూరిందని ప్రశ్నించారు. కేవలం ప్రజలను మభ్యపెట్టే  ప్రయత్నంలో భాగంగానే నితీష్ ఈ యాత్ర చేస్తున్నారని అన్నారు. అలాగే, రాహుల్ భారత్ జోడో యాత్రలో ముఖ్యమంత్రి నితీష్ పాల్గొనకపోవడంపై కూడా ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఇతర రాజకీయ పార్టీల నాయకులు కాంగ్రెస్ యాత్రకు హాజరవుతున్నా, నితీష్ మాత్రం రాహుల్ యాత్రకు దూరంగా ఉన్నారని అన్నారు. 'మహాఘట్ బంధన్' ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి అయినప్పటికీ ఆ పార్టీ యాత్రపై ముఖ్యమంత్రి ఎందుకు ఆసక్తి చూపించడం లేదని ప్రశ్నించారు.అలాంటప్పుడు ఆయన ప్రతిపక్షాల ఐక్యత గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.  అయితే, ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలను నితీష్ కుమార్ అంత సీరియస్ గా తీసుకోలేదు కానీ, జేడీయు నేతలు మాత్రం ప్రశాంత్  కిశోర్ కు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. నితీష్ కుమార్ ని విమర్శించే ముందు, ప్రశాంత్ కిశోర్  ఆత్మ విమర్శ చేసుకోవాలని అంటున్నారు. మరో వంకఎన్నికలు దగ్గరవుతున నేపధ్యంలో బీహార్ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని, అందులో ప్రశాంత్ కిశోర్ ఫాక్టర్ కుడా ఒకటి పరిశీలకులు అంటున్నారు.

పొంగులేటి పయనమెటు ?

అంతా అయిపోయింది, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, బీజేపీలో చేరడం ఖాయమని ప్రచారం జరిగింది. ఇక  కండువాలు కప్పుకోవడమే మిగిలుందని చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జనవరి 18న ఇక్కడ ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరుగుతున్న సమయంలోనే, అక్కడ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో పొంగులేటి, ‘కడువా’ మార్పిడి వేడుకకు ముహూర్తం ఖరారైందనే ప్రచారం జరిగింది. అఫ్కోర్స్, బీజేపీ ముఖ్యనాయకులు ఎవరూ అధికారికంగా అలాంటి ప్రకటన ఏదీ చేయక పోయినా, సోషల్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే పెద్ద ఎత్తునే ప్రచారం జరిగింది. అయితే జనవరి 18 వచ్చింది వెళ్ళింది. పొంగులేటి అయన వర్గం సభకు హాజరు కాలేదు కానీ, అనుకున్నవిధంగానే ధూం ..దాంగా బీఆర్ఎస్  ఆవిర్భావ సభ జరిగింది. ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా హాజరయ్యారు. ఆశించినంత కాకపోయినా జన సమీకరణ కూడా భారీగానే జరిగింది. కానీ  పొంగులేటి బీజేపీ కండువా కప్పుకోలేదు. అసలు ఢిల్లీ వెళ్ళనే లేదు. అంతే కాదు, ఆతర్వాత ఆ ఊసే ఎక్కడ వినిపిచడం లేదు.  మరోవంక పొంగులేటి మనసు మార్చుకున్నారని, బీజేపీలో చేరడమా, కాంగ్రస్ లో కలవడమా అనే మీమాంసలో ఉన్నారని అంటున్నారు. బీజేపీలో చేరితే రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుదనే విషయంలో పొంగులేటికీ కొన్ని అనుమానాలున్నాయని అంటున్నారు. భారాసలో ఎదురైన చేదు అనుభావాలే అక్కడా ఎదురవుతాయనే భయంతోనే వెనకడుగు వేశారని అంటున్నారు. అలాగని, కాంగ్రెస్ లో చేరితే రాజకీయంగా ఢోకా ఉండదు. కానీ, ఇంతవరకు వచ్చి వెనకడుగు వేస్తే  మోడీ, షా నిముషం ఆలస్యం చేయకుండా ఐటీ, ఈడీ గొలుసులు విప్పుతారనే భయం పొంగులేటిని వెంటాడుతోంది. ఇప్పడు ఈ రెండు భయాల మధ్య ఆయన అటూ ఇటూ ఉగుతున్నారని, అంటున్నారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీల బలాబలాలను బేరీజు వేసుకుంటే, బీజేపీ కంటే కాంగ్ర్రేస్ పార్టీ పుష్టిగా, పటిష్టంగా వుంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మంచి పట్టుంది. గట్టి నాయకులున్నారు. కమిట్మెంట్ తో పనిచేసే క్యాడర్ వుంది. అదే సమయంలో గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఒక్క భట్టి మినహా మిగిలిన వారంతా కట్టకట్టుకుని భారాసలోకి దూకేశారు.  సో..పొంగులేటి తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకోగలుగుతారు. అఫ్కోర్స్ టిక్కెట్ల వరకు బీజేపీలో అయితే అసలు ఆ మాత్రం  సమస్య కూడా లేదు. కానీ జిల్లాలో బీజేపీకి కనీస ఉనికి లేదు. లీడర్లు లేరు.. క్యాడర్ లేరు. సో  రాజకీయ లెక్కలు బేరీజు వేసుకుంటే, కాంగ్రెస్ లో చేరడమే ఉత్తమం.  నిజానికి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయనకు ఆఫర్లు వచ్చాయి. తమ పార్టీలో చేరాలని కాంగ్రెస్ నేతలు  పిలుపునిచ్చారు. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డైలమాలో పడిపోయారని అంటున్నారు. అయితే, బీజేపీ నాయకులు మాత్రం పొంగులేటి తమ పార్టీలో చేరడం ఖాయమని, అయితే, ఢిల్లీలో కాకుండా, రాష్ట్రంలో తెలంగాణ ప్రజల సమక్షంలో బీజేపీలో చేరాలని భావిస్తున్నారని, అందుకే చేరిక  పోస్ట్ పోన్ అయ్యిందని  అంటున్నారు. ముందు   ఈనెల ( జనవరి) 28 అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భంగా పొంగులేటి పార్టీలో చేరతారని అనుకున్నా, ఇప్పుడు షా పర్యటన రద్దవడంతో, ఫిబ్రవరి 13వ ప్రధానిమోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా పొంగులేటి పార్టీలో చేరడం ఖాయమని అంటునారు. ఇక అప్పుడు కూడా పొంగులేటి బీజేపీలో చేరలేదంటే..ఆయన యూ  టర్న్   తీసుకున్నట్లే అవుతుందని అంటున్నారు. అయితే, ముందు నుంచి కూడా పొంగులేటి బీజేపీలో చేరడం ఒక ప్రహసనంగా సాగుతోంది. ముందుగా  జనవరి 15 న ప్రధాని హైదరాబాద్ పర్యటన సందర్భంగా పొంగులేటి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది,అయితే మోడీ పర్యటన్ రద్దవడంతో సీన్ ఢిల్లీకి మారింది, అది జరగలేదు. మళ్ళీ జనవరి 28 న అమిత్ షా రాష్ట్ర  పర్యటన సందర్భంగా అనుకుంటే అదీ రద్దయింది .ఇక ఇప్పుడు ఫిబ్రవరి 13వ ప్రధానిమోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా అంటున్నారు .. ఇలా వినాయకుడి పెళ్ళికి వేయి విఘ్నాలు అన్నట్లు, పొంగులేటి పార్టీ మారే ప్రక్రియ ఒక ప్రహసనంగా మారిందని, అంటున్నారు. అయితే.. ఆలస్యం అయినా, పొంగులేటికీ మాత్రం లెక్కలు సరిచూసుకునేందుకు కావలసినంత సమయం అయితే చిక్కింది.

ఏపీలో ఆర్ధిక ఎమర్జెన్సీ తప్పదా?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వాన్నంగా ఉందనేది అందరికీ తెలిసిన రహస్యం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన క్షణం నుంచే రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ అనేదే లేకుండా పోయింది. అందుకే సంవత్సరం తిరగ కుండానే, గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముందుచూపుతో వేసిన ఆర్థిక పునాదులు సడలి పోయాయి. అప్పుల వేట మొదలైంది. కూచమ్మ కూడా బెడితే మాచమొచ్చి మాయం చేసింది అన్నట్లుగా పరిస్థితి తల్లకిందులైపోయింది  ఆర్థిక మంత్రి అప్పుల మంత్రిగా మారిపోయారు. అప్పులు పుడితేనే కానీ పూట గడవని పరిస్థితికి రాష్ట్ర్ర ఆర్థిక పరిస్థితి చేరుకుంది. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అయినా  ఇవ్వలేని దౌర్భాగ్య స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేరుకుంది. అయినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  ప్రతిపక్ష నాయకులు చేసిన సూచనలను పట్టించుకోలేదు. ముఖ్యంగా, సుదీర్ఘ కాలం ఉమ్మడి రాష్ట్రంలో, రాష్ట్ర విభజన అనతరం అవశేష ఆంధ్ర ప్రదేశ్ లొ తొలి ఐదేళ్ళు ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు వంటి అనుభవజ్ఞులు చేసిన సూచనలను కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పట్టించుకోలేదు.  బహుశా ఆయనకు సహజసిద్ధంగా అబ్బిన దురహంకారంతో కావచ్చును, మీటలు నొక్కుకుంటూ పోయారు.  ఫలితంగా ఇప్పడు ఇదిగో, ఉద్యోగ సంఘాల మాజీ నాయకుడు, టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అన్నట్లుగా జీతాల కోసం ఉద్యోగులు గవర్నర్ ని కలవడం అనేది దేశచరిత్రలో బహుశా ఇదే తొలిసారి కావచ్చును. అప్పులు పుడితే తప్ప ప్రభుత్వం నడిచే పరిస్థితి, ఉద్యోగులకు జీతాలు అందని స్థితి ఉంటే, ముఖ్యమంత్రి తక్షణమే తనపదవికి రాజీనామాచేయడంమంచిది. నిజానికి ఇదొక్క అశోక్ బాబు మాట కాదు. రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు మొదలు, రాజ్యంగ నిపుణుల వరకు అందరూ అదే మాట అంటున్నారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వక పోవడం, ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో సర్కార్ చేతులు పెట్టడం, రిటైరైన ఉద్యోగులకు బెనిఫిట్స్ విషయంలో జరుగుతున్న జాప్యం, ఒకటి అని కాదు,  ఇలా ఒక్క ప్రభుత్వ  ఉద్యోగులకు సంబందించిన ఆర్థిక వ్యవహారాల్లో జరుగతున్న అవకతవకలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నా, ముఖ్యమంత్రి  రాజీనామా చేయడం ఉత్తమం అంటున్నారు.  జనవరి జీతాలు ఫిబ్రవరి నెల్లోకూడా ఇవ్వలేమని, ఇప్పటికే ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు. అప్పులు పుడితేనే ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇస్తోంది. రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జన్సీ వచ్చింది అనడానికి ఇదే నిదర్శనం. చెద పట్టిన గుమ్మంలా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి తయారైంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్షించి, వెంటనే ఒక నిర్ణయానికి రావాలి. 7వేలకోట్ల డీఏలు ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాలి ఉంది. గతం లో పీఆర్సీ సందర్భంలో ఉద్యోగులకు రూ.2,500 కోట్లు ఇవ్వాల్సి ఉందని, మార్చి 2022 నాటికి ఇస్తామని ప్రభుత్వమే చెప్పింది. ఇప్పటికీ ఆ బకాయిలు ఇవ్వలేదు. జీపీఎఫ్ అడ్వాన్స్ లు కూడా ఇవ్వని ప్రభుత్వం, వాటినికూడా వాడుకుంది. రాష్ట్రప్రభుత్వం రూ.480 కోట్లు వాడుకుందని కేంద్రమే చెప్పింది, ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఫైనాన్షియల్ ఎమర్జన్సీ డిక్లేర్ చేయాలని అంటున్నారు.

యాత్ర ముగింపుకు ముందే అభియాన్ ఆరంభం

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సారథ్యంలో సాగుతున్న భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంది. గత ఏడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో  మొదలైన యాత్ర  జనవరి 30వ తేదీన కశ్మీర్ లోముగుస్తుంది. భారత్ జోడో యాత్ర ముగింపు సభకు కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ముగింపు సభకు  భావసారూప్యత కలిగిన 24 రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. ఆాయా పార్టీల అధినేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖలు రాశారు. బీఎస్పీ- మాయావతి, టీఎంసీ- మమతా బెనర్జీ, జేడీయూ- నితీశ్ కుమార్, టీడీపీ- చంద్రబాబు నాయుడు, ఆర్జేడీ- లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్ వాదీ- అధినేత అఖిలేష్ యాదవ్, వంటి వారితో పాటు.. కమ్యూనిస్ట్ పార్టీలతో సహా మరికొన్ని పార్టీలకు స్వాగతం పలికారు. జనవరి 30న జరిగే సభను ఎలాగైనా సరే విజయవంతం చేయాలన్న కృత నిశ్చయంతో ఉంది కాంగ్రెస్ అధిష్టానం.  అయితే ఇక్కడితో యుద్ధం ఆగదని, కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాహుల్ గాంధీ సారథ్యంలో సాగిన  'భారత్ జోడో యాత్ర' సందేశాన్ని ఇంటింటికి చేరవేసేందుకు కాంగ్రెస్ పార్టీ 'హాథ్ సే హాథ్ జోడో అభియాన్' ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ, యాత్ర ముగింపుకు నలుగు రోజులు ముందుగానే, జనవరి 26 శ్రీకారం చుడుతున్నారు.  ఇందుకు సంబంధించిన లోగోతో పాటు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చార్జిషీటును హస్తం పార్టీ విడుదల చేసింది. ఈనెల 26వ తేదీ నుంచి రెండు నెలల పాటు  హాథ్ సే హాథ్ జోడో  ప్రచారం సాగనుందని న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. రాహుల్ గాంధీ సారథ్యంలోని జోడో యాత్ర సందేశాన్ని సామాన్య ప్రజానీకానికి   చేరవేసేందుకు ఈ ప్రచారం చేపడుతున్నట్టు తెలిపారు.  మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చార్జిషీటును కూడా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు (పీసీసీలు) స్టేట్ స్పెసిఫిక్  చార్జిషీట్లు తయారు చేస్తాయని వేణుగోపాల్ తెలిపారు. మోడీ ప్రభుత్వ అవకతవక విధానాల కారణంగా ప్రజలకు ఎదురైన ఇబ్బందులను పరిష్కరించేందుకు తమ పార్టీ కృష్టి చేస్తుందన్నారు. 130 రోజుల చారిత్రక భారత్ జోడో యాత్ర తర్వాత దేశ ప్రజల నుంచి విస్తృత సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ సేకరించిందని, లక్షలాది మంది రాహుల్ గాంధీ అడుగులో అడుగులు వేసి ఆయనతో సంభాషించారని చెప్పారు. మోడీ ప్రభుత్వ తప్పిదాల పాలన కారణంగా ప్రజలు ఎదుర్కొన్న ఈతి బాధలను తాము అవగతం చేసుకున్నామని అన్నారు.  కాగా, జమ్మూకశ్మీర్‌లోని కతువాలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరామ్ రమేష్ మాట్లాడుతూ, తమ పార్టీ చేపట్టనున్న ఇంటింటి ప్రచారం 6 లక్షల గ్రామాలు, 2.5 లక్షల గ్రామ పంచాయతీల్లోని 10 లక్షల పోలింగ్ బూత్‌లకు తీసుకువెళ్తామని చెప్పారు. హాథ్ సే హాథ్ జోడో  ప్రచారం జనవరి 26 నుంచి మార్చి 26 వరకూ జరుపుతామన్నారు. పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి రాహుల్ గాంధీ లేఖను ప్రజలకు అందజేస్తారని చెప్పారు.

మెగాస్టార్ మా..వాడే !

మెగాస్టార్ చిరంజీవి తేల్చి చెప్పేశారు, రాజకీయాలకు శాశ్వతంగా గుడ్’బై చెప్పేశానని స్పష్టం చేశారు. ఏపీ రాజకీయాల గురించి అయితే తనకు ఏమీ తెలియదని, తన ఓటు తెలంగాణలో ఉందని, ఏపీ రాజకీయాలతో నాకేటి పని అన్నట్లుగా చేతులు కడిగేసుకున్నారు. అయినా, "గాడ్‌ఫాదర్" సినిమాలో ఆయనే చెప్పిన  రాజకీయాల నుంచి నేను దూరంగా ఉంటున్నా... నా నుంచి రాజకీయాలు దూరం కాలేదు  అనే డైలాగులో లాగా ఆయన రాజకీయాలను వదిలేసినా, రాజకీయాలు ఆయన్ని వదలడం లేదు.ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నా.. అప్పుడప్పుడు ఆయన రాజకీయ తెర మీద కూడా దర్శనమిస్తున్నారు. ఆయన ‘ప్రత్యక్ష’  ప్రమేయం లేకుండానే ఆయన చుట్టూ రాజకీయ చర్చ అల్లుకుంటోంది. (అయితే చిరంజీవి తమ సినిమా ప్రచారానికి ఇలా రాజకీయాలు ఉపయోగించుకుంటారని, అనుమానించేవారు లేక పోలేదు. గతంలో ‘గాడ్ ఫాదర్’ రిలీజ్’కు ముందు. గుట్టుచప్పుడు కాకుండా ఆ సినిమాలోని "రాజకీయాల నుంచి నేను దూరంగా ఉంటున్నా... నా నుంచి రాజకీయాలు దూరం కాలేదు" అనే పది సెకండ్స్’ ఆడియోను సోషల్ మీడియాలో వదిలారు. ఆ పది సెకండ్ల ఆడియో, సినిమా ప్రచారానికి చక్కగా ఉపయోగించిందని అంటారు). తాజాగా ఇప్పుడు, ‘వాల్తేరు వీరయ్య’ నడుస్తున్న సమయంలో మళ్ళీ  మరోమారు  చిరంజీవి అందరివాడు అవునా కాదా అనే చర్చ,తెర మీదకు వచ్చింది. ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని, ఏపీ పీసీసీ కొత్త అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చేసిన వ్యాఖ్యలు పాత చర్చను కొత్తగా తెరమీదకు తెచ్చాయి.అంతేకాదు, రుద్రా రాజు, ఇంకో ప్రకంపనం కుడా సృష్టించారు.చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టే రాహుల్ గాంధీకి లేఖ రాశారని చిరు చర్చకు మెగా టచ్’ ఇచ్చారు. అయితే ఆలేఖ ఆయన ఎప్పుడు రాశారో, ఆ లేఖలో  ఏముందో మాత్రం ఆయన చెప్పలేదు. తాంబూలాలు ఇచ్చేశా తన్నుకు చావండి అన్నట్లు, ఊహాగానలకు గేట్లు మాత్రం  బార్లా తెరిచారు.  ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్’లో విలీనం చేశాక చిరంజీవి రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా ఉన్నారని రుద్రరాజు  పేర్కొన్నారు. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలపై పూర్తి ఫోకస్ పెట్టారని అన్నారు. కాగా కొన్ని రోజుల క్రితం రాజకీయాలకు నేను పూర్తి దూరంగా ఉన్నానని చిరంజీవి) పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. అయితే, చిరంజీవి స్కండ్ ఇన్నిగ్స్’లోనూ మెగా స్టార్’గ దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలతో సమానంగా సినిమాలు  చేస్తున్నారు.జనం చూస్తునారు. ఉతీవల విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ కలెక్షన్స్ దూసుకుపోతున్నాయి. చిరంజీవి ఇప్పడు ఆ  సక్సెస్’ను ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు భోళా శంకర్ సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో, చిరంజీవి రాబోయే రోజుల్లో ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చింది.

రేవంత్ తో వెంటకరెడ్డి భేటీ.. కాంగ్రెస్ సీనియర్లకు షాక్

రాజకీయాలలో శాత్వత శతృత్వం, శాశ్వత మితృత్వం అంటూ ఉండవు. నేడు బద్ధ శత్రువుల్లా ఉన్న వారు రేపు ఆప్త మిత్రులుగా మారి ఆలింగనం చేసుకుంటారు. నిన్న ఆప్త మిత్రులుగా ఉన్న వారు నేడు ఆగర్భ శతృవులుగా మారి కత్తులు దూసుకుంటారు. రాజకీయాలలో ఇది సహజం. కానీ అలా ఎంతలా సరిపెట్టుకుందామనుకున్నా వీలుకాని సంఘటనకు గాంధీ భవన్  వేదికైంది. ఆ ఇరువురి భేటీ కాంగ్రెస్ శ్రేణులనే కాదు.. సామాన్య జనాలను సైతం ఆశ్చర్య చకితులను చేసింది. ఔను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్ వేదికగా కలుసుకున్నారు. కరచాలనం చేసుకున్నారు. కొద్ద సేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా గతం గత: అన్న వెంకటరెడ్డి.. తానెప్పుడూ గాంధీ భవన్ ముఖం చూడనని అన్న పాపాన పోలేదన్నారు. పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా తన విధులు తాను నిర్వర్తిస్తానని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ గా మాణిక్ రావు ఠాక్రే బాధ్యతలు తీసుకున్న తరువాత జరిగిన ఈ పరిణామం కాంగ్రెస్ లో గ్రూపుల సంస్కృతికి చరమగీతం పాడేందుకు ఆయన తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయా అన్న ఆశలను పార్టీ వర్గాల్లో రేకెత్తిస్తున్నాయి.   ఎందుకంటే ఇద్దరి మధ్యా కొంత కాలంగా ఎడముఖం, పెడముఖంగా పరిస్థితి ఉంది. అటువంటిది ఇరువురూ సడన్ గా కలిసి కూర్చుని మనసు విప్పి మాట్లాడుకున్నారు. పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావు  థాక్రే గాంధీ భవన్ కు వచ్చారు. థాక్రే ఆహ్వానం తో గాంధీ భవన్ కు కోమటిరెడ్డి వచ్చారు. రేవంత్ తో కలిసి భేటీ  కావడం పార్టీలో రేవంత్ వ్యతిరేకులకు మింగుడు పడటం లేదు అది వేరే సంగతి. ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిందేమిటంటే.. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతల చేపట్టిన నాటి నుంచీ కోమటిరెడ్డి విభేదిస్తూనే ఉన్నారు.  వేరే పార్టీ నుంచి వచ్చి చేరిన వ్యక్తిగా పార్టీ పగ్గాలప్పగించడమేమిటని అధిష్ఠానాన్ని నిలదీశారు.  మునుగోడు ఉప ఎన్నిక వేళ సహాయ నిరాకరణ చేశారు. స్టార్ క్యాంపెయినర్ అయి ఉండీ  మునుగోడు ప్రచారానికి వెంకటరెడ్డి దూరంగా ఉన్నారు. రాహుల్ జోడో యాత్ర హైదరాబాద్ చేరుకున్నా  కోమటిరెడ్డి హాజరు కాలేదు. అంతే కాకుండా మునుగోడు ఉప ఎన్నిక వేళ ఆయన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి అక్కడ చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చాయి. దీంతో కాంగ్రస్ నాయకత్వం వెంకటరెడ్డికి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే తెరవెనుక ఏం జరిగిందో కానీ..  గాంధీ భవన్ కు వచ్చి రేవంత్ తో చేతులు కలిపి.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని ప్రకటించారు.  కాంగ్రెస్ లో సీనియర్, జూనియర్ విభేదాలకు కారణమైన వెంకటరెడ్డి రేవంత్ తో చేయి కలపడంతో కాంగ్రెస్ లో సంక్షోభం ప్రస్తుతానికి టీ కప్పులో తుపానుగా చల్లారిపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. 

రాష్ట్రంలో.. బలిపీఠంపై ఉద్యోగులు.. పరస్పర దూషణ పర్వంలో ఉద్యోగ సంఘాల నేతలు

జీతాల కోసం, ప్రైవేటు ఉద్యోగులు వీధుల్లోకి వచ్చారంటే అర్థం చేసుకోవచ్చును. ఆందోళనకు దిగారంటే సరిపెట్టుకోవచ్చు. సమ్మెకు దిగారంటే ఔను మరేంచేస్తారని సమాధాన పడొచ్చు. కానీ, ప్రభుత్వ ఉద్యోగులు వీధుల్లోకి రావడం, ఆందోళనలకు దిగడం, సమ్మె చేయడం కాదు ఏకంగా గవర్నర్  ను కలిసి, ప్రతి నెలా ఫస్ట్  కు జీతాలు ఇప్పించండి మహా ప్రభో అని మొరపెట్టుకోవడం బహుశా  దేశ చరిత్రలో ఇదే మొదటి సారి కావచ్చు. ఆ మొదటి గౌరవం ఆంధ్రప్రదేశ్ కే దక్కింది. ఇప్పటికే అక్షర క్రమంలో కాదు అప్పుల్లో కూడా ఏపీయే ఫస్ట్ అనిపించుకున్న ఏపీ ఇప్పుడు.. ఉద్యోగులే జగన్  ప్రభుత్వంపై గవర్నర్ కు ఫిర్యాదు చేసి.. గౌరవ ముఖ్యమంత్రి నిర్వాకం ఎలా ఉందో యావద్దేశానికీ చాటారు.    రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభత్వ ఉద్యోగులు రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేయడం ఏదైతే వుందో అది నభూతో న భవిష్యతి.. అన దగిన అద్భుత సన్నివేశం. ఇటువంటి ఘటన అంటే ప్రభుత్వోద్యోగులు  జీతాలకోసం గవర్నర్ ని కలవడం అనేది దేశచరిత్రలో  గతంలో ఎన్నడూ జరగలేదు.. భవిష్యత్తులో జరిగే అవకాశం లేదు. ఔను భవిష్యత్ లో జరిగే అవకాశం లేదని ఉద్యోగులే చెబుతున్నారు. ఎందుకంటే జగన్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాదు కనుక అంటున్నారు. మరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా  ఇంతటి అధ్వాన పాలన చేయడం జగన్ కు వినా మరెవరికీ సాధ్యం అయ్యే పని కాదని వారు అంటున్నారు. సరే ఉద్యోగులు గవర్నర్ ను కలిసి ప్రభుత్వంపై ఫిర్యాదు ఇచ్చిన ఘటన ఉద్యోగ సంఘాల మధ్య చీలికకు కారణమైందంటే అదే వేరే విషయం.   కానీ  ఉద్యోగసంఘం నేతలు రాష్ట్ర గవర్నర్ ని కలవడం, రాష్ట్ర ఆర్థికపరిస్థితి దిగజారిందనడానికి నిదర్శనం. ప్రతినెలా 1వ తేదీన జీతాలు ఇప్పించాలని, రిటైరైన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇప్పించాలని ఉద్యోగసంఘాలు గవర్నర్ ని కోరాయి. ఉద్యోగ సంఘాలు గవర్నర్ ని కలవడం అనేది సాధారణమే. కానీ జీతాల కోసం గవర్నర్ ని కలవడం దేశంలో ఇదే తొలిసారి. ప్రభు త్వం స్పందించకుంటే ఏప్రిల్ లో సమ్మె చేస్తామన్నారు..  సమ్మె చేసినా ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటి? అసలు ఉద్యోగ సంఘాలను నమ్మి ఉద్యోగులు వస్తారా?  గతంలో వారిని నమ్మించి మోసగించారు కదా! ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులకు మధ్య అభిప్రాయ బేధాలు సృష్టించి, ప్రభుత్వం పబ్బం గడుపు కుంటోంది. ఉద్యోగ సంఘాల్ని బెదిరించి, వేధించి ప్రభుత్వం ఉద్యోగుల్ని నియంత్రిస్తోంది. ఉద్యోగ సంఘాల్ని విడదీసి, కొత్త సంఘాలను సృష్టించి, ఉద్యోగ సంఘాల నేతలను ప్రలోభపెడుతూ, ప్రభుత్వం నెట్టుకొస్తోంది. ఈ పద్ధతి ఎన్నాళ్లు అమలు చేస్తారో చూడాలి.   జనవరి జీతాలు ఫిబ్రవరి నెల్లో కూడా ఇవ్వలేమని, ఇప్పటికే ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు. అప్పులు పుడితేనే ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇస్తోంది. రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉంది. అధికారికంగా ప్రకటించలేదు కానీ.. జీతాల కోసం ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వాన్ని కాకుండా గవర్నర్ ను ఆశ్రయించి గోడు వినిపించుకునే పరిస్థితి వచ్చిందంటే ఫైనాల్షియర్ ఎమర్జెన్సీ అని కాక ఇంకేం అనాలి.  ఉద్యోగులు బలిపీఠంపై ఉన్నారు. ఉద్యోగ సంఘాల మధ్య చీలికలను ప్రోత్సహించి సర్కార్ వారిలో వారు విమరశించుకుంటుంటూ నీరో చక్రవర్తిలా జగన్ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 7 వేల కోట్ల డీఏలు ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది.  గతం లో పీఆర్సీ సందర్భంలో ఉద్యోగులకు రూ.2,500కోట్లు ఇవ్వాల్సి ఉందని, మార్చి 2022 నాటికి ఇస్తామని ప్రభుత్వమే చెప్పింది. ఇప్పటికీ ఆ బకాయిలు ఇవ్వలేదు. జీపీఎఫ్ అడ్వా న్స్ లు కూడా ఇవ్వని ప్రభుత్వం, వాటినికూడా వాడుకుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.480 కోట్లు వాడుకుందని కేంద్రమే చెప్పింది. ఈ ప్రభుత్వానికి హక్కులపై ఉన్న అవగాహన బాధ్యతలపై లేదు. అలవెన్సుల విషయంలో పోలీస్ శాఖ కన్నీళ్లు పెట్టుకుంటోంది. చాలా మంది పోలీసు లు వారి జీతాల్లో 25శాతం సొమ్ముని టీ.ఏ, డీ.ఏలకు ఖర్చుపెడుతున్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు  ఏడుపే మిగిల్చింది. గత ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి 50 జీవోలు ఇచ్చింది. ఉద్యోగాల భర్తీ,  పీఆర్సీ, ఇతర త్రా ప్రయోజనాలన్నీ నెరవేర్చింది. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తాన న్నారు. తరువాతేమో దాని గురించి తెలియక చెప్పామని నాలుక మడ తేశాడు. ముఖ్యమం త్రికి చేతగాకపోతే తక్షణమే రాజీనామా చేయాలి. ఆ పని చేయకపోతే రాష్ట్రమే మునిగి పోతుంది.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో భోజనం పెట్టేవారికి బిల్లులు చెల్లించడంలేదు, ఆరోగ్యశ్రీ  బకాయిలు ఇవ్వడంలేదు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పని చేసిన వైద్యులు, నర్సులకు హై కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప, ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదు. ఆప్కాస్ లోని లక్షమంది ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఈ ప్రభుత్వం ఏనాడూ కరెక్ట్ గా జీతాలు ఇవ్వలేదు?  ప్రభుత్వం చేయాల్సింది సకాలంలో జీతాలు, ఇతరత్రా ప్రయోజ నాలు ఉద్యోగులకు కల్పించడం.  ఆ పని చేయని ప్రభుత్వం.. మాట్లాడితే కేసులంటూ, ఉద్యమం చేస్తామంటే నిర్బంధాన్ని ప్రయోగిస్తుంటే.. ఉద్యోగులు గవర్నర్ ను కలవకుండా ఇంకేం చేస్తారు. గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయడాన్ని ప్రశ్నిస్తున్న ఉద్యోగ నేత.. ఉద్యోగులకు కాకుండా జగన్ కు ప్రతినిథిగా వ్యవహరిస్తున్నారనే చెప్పాలి.  మొత్తంగా ఉద్యోగ సంఘాల నేతల మధ్య ఇప్పుడు జరుగుతున్న మాటల యుద్ధం ఒక విధంగా ఉద్యోగులు సమస్యలపై నిరసన గళం విప్పకుండా అడ్డుకుంటూ పరోక్షంగా ప్రభుత్వానికి సహకరిస్తోందనడంలోసందేహం లేదు. 

అందుకేనా.. కేటిఆర్ దూరం?

టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిన తరువాత సీఎం కేసీఆర్ నోటి వెంట జై తెలంగాణ నినాదం స్థానంలో జై భారత్ నినాదం వచ్చింది. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్‌ను బలోపేతం చేయడానికి కేసీఆర్ ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది పక్కన పెడితే.. టీఆర్ఎస్ తరహాలోనే బీఆర్ఎస్‌ కూడా విజయవంతం అవుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  బీఆర్ఎస్ తరపున తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ సభలు, సమావేశాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు.  అయితే బీఆర్ఎస్ కీలక కార్యక్రమాలకు తెలంగాణ మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీ రామారావు దూరంగా ఉంటున్నారు.  ఇంత వరకూ బీఆర్ఎస్ తరఫున జరిగిన ఏ కార్యక్రమంలోనూ ఆయన పెద్దగా కనిపించలేదు.   మంత్రి కెటిఆర్ కావాలనే దూరంగా బీఆర్ఎస్ తరఫున పార్టీ కార్యక్రమాలకుదూరంగా ఉంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  రాజకీయ వర్గాల్లోనూ, పార్టీ శ్రేణుల్లోనే కాదు.. తెలంగాణ ప్రజల్లో కూడా ఈ అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పార్టీ తరఫున జరిగిన  కార్యక్రమాల్లోనూ కేటీఆర్ పాల్గొనకపోవడంతో టీఆర్ఎస్ ను కనుమరుగు చేసి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేయడాన్ని ఆయన తనయుడు కేటీఆర్ స్వాగతించడం లేదా అన్న సందేహం ఇప్పుడు సర్వత్రా వ్యక్తం అవుతోంది.  టీఆర్ఎస్‌ బీఆర్ఎస్‌గా మార్చేందుకు  తీర్మానం చేయడానికి  ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన మంత్రి కేటీఆర్..  ఆ తరువాత ఏ కీలక సమావేశానికీ హాజరు కాలేదు.  ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం, ఏపీ నేతలు బీఆర్ఎస్‌లో చేరే సందర్భం, ఇటీవల బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిర్వహించిన ఖమ్మం సభ వీటి వేటిలోనూ కూడా కేటీఆర్ పాల్గొనలేదు.   కేటీఆర్ ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్లే ఆయన వీటికి హాజరుకాలేక పోతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే కేటీఆర్ ఉద్దేశ పూర్వకంగానే బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్న చర్చ రాజకీయ వర్గాలలోనే కాదు, పార్టీ శ్రేణుల్లో కూడా జోరుగా సాగుతోంది. జాతీయ రాజకీయాలపై మంత్రి కేటీఆర్‌కు ఆసక్తి  లేదని..  అందుకే బీఆర్ఎస్‌కు సంబంధించిన  కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారని ఇటు పార్టీ వర్గాలూ, అటు తెలంగాణ ప్రజలూ భావిస్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినా.. తాను కేవలం తెలంగాణ రాజకీయాలకు మాత్రమే పరిమితమనే సంకేతాలు ఇవ్వడానికే మంత్రి కేటీఆర్ ఇలా వ్యవహరిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  భవిష్యత్తులోనూ బీఆర్ఎస్ జాతీయస్థాయి కార్యక్రమాలకు కేటీఆర్ దూరంగా ఉండొచ్చని.. అదే జరిగితే తాను కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమనే సంకేతాలను కేటీఆర్ ఇచ్చినట్టు స్పష్టమవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే.. ఇక్కడ ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు తీసుకుంటారని బీఆర్ఎస్ నేతలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. వచ్చే ఎన్నికల తరువాత ఇదే జరుగుతుందనే వాదన కూడా ఉంది. అందుకే కేటీఆర్ తెలంగాణకు పరిమితమయ్యే విధంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఆందోళన విరమించిన రెజ్లర్లు.. బ్రిజేష్ భూషణ్ పపైపోయినట్లేనా?

భారత రెజ్లర్ల తో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చర్చలు ఫలించాయి. దీంతో గత మూడు రోజులుగా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న రెజ్లర్లు తమ ఆందోళనను విరించారు.  భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు ఆందోళనకు దిగిన సంగతి విదితమే.   కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో శుక్రవారం (జనవరి 20) అర్ధరాత్రి ముగిసిన సుదీర్ఘ చర్చల తర్వాత ఆందోళన విరమించారు.  బ్రిజ్ భూషణ్ సింగ్ పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు, సమాఖ్యలో ఆర్థిక అవకతవకలపై సమగ్ర విచారణకు ముగ్గురు ప్రముఖ మాజీ క్రీడాకారులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వారికి  హామీ ఇచ్చారు. కమిటీలో ఇద్దరు మహిళలు ఉంటారని చెప్పారు. ఆ కమిటీని శనివారం (జనవరి 21)న ప్రకటిస్తారు.   విచారణ పూర్తయ్యేంత వరకూ రెజ్లింగ్ సమాఖ్య రోజువారీ కార్యకలాపాలను కూడా కమిటీనే పర్యవేక్షిస్తుంది.  మరోవైపు మహిళా రెజ్లర్లు  బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు భారత ఒలింపిక్ సంఘం దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. భారత్ రెజ్లర్ల ఆందోళనకు కారణమైన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఎవరు? రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎలా ఎంపికయ్యారు అంటే..  బీజేపీ ఎంపీగా ఆరు సార్లు గెలిచిన   బ్రిజ్ భూషణ్ ప్రస్తుతం  ఉత్తర్ ప్రదేశ్ లోని కైసర్ గంజ్ నియోజకవర్గానికి ఎంపీగా  ప్రాతినిధ్యం వహిస్తున్నరు.  2011 నుంచి ఈయన రెజ్లింగ్ ఫెడరేషన్  అధ్యక్షుడిగా ఉన్నారు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, సుమీత్ మాలిక్, బజరంగ్ పూనియా వంటి రెజ్లింగ్ హేమాహేమీలు ఇప్పుడు ఈయన దిగిపోవాలని.. ఈయన ఆధ్వర్యంలో సాగిన లైంగిక కాండలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. మహిళా రెజ్లర్లు, మహిళా రెజ్లింగ్ శిక్షకులపై గత కొన్నేళ్లుగా లైంగిక వేధింపులు రెజ్లింగ్ ఫెడరేషన్ క్యాంపులో రొటీన్ గా మారాయంటూ వినేష్ ఫోగట్ ఆరోపించారు.  అయితే ఈ వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న బ్రిజ్ భూషణ్ రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. అయితే తనపై ఆరోపణల వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన అంటున్నారు.   గోండా, కైసర్ గంజ్, బలరాంపూర్ వంటి నియోజకవర్గాల నుంచి ఎంపీగా ఎన్నికైన బ్రిజ్ భూషణ్ కు విస్తృత రాజకీయ అనుభవం ఉంది. గోండా నివాసి అయిన బ్రిజ్ భూషణ్ తాను యువకుడిగా ఉన్నప్పుడు స్వయంగా కుస్తీ పోటీల్లో పాల్గొనేవారు. 1980ల్లో విద్యార్థి దశలోనే ఆయన రాజకీయాల్లో చేరారు. హిందుత్వ ఇమేజ్ తో ఈయన చాలా తక్కువ కాలంలోనే పాపులర్ అయ్యారు. అయోధ్య రామ మందిర ఉద్యమ సమయంలో ఈయన పేరు మారుమోగింది కూడా. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులోనూ నిందితుడిగా ఉన్నారు. కానీ 2020లో కోర్టు నిరపరాధిగా ప్రకటించింది. బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీతోపాటు మరో 40 మందిపై అయోధ్య విషయంలో ఛార్జ్ షీట్ నమోదు కాగా వీరిలో బ్రిజ్ భూషణ్ కూడా ఒకరు.   దశాబ్దకాలంగా రెజ్లింగ్ ఫెడరేషన్ పై పట్టు బిగించిన ఈయన మంచి వక్త. ప్రస్తుతం 66 ఏళ్ల వయసున్న ఈయన తనపై వినేష్ ఫోగట్ వంటివారు చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ చేశారు. వివాదం నేపథ్యంలో తాను బజరంగ్ పూనియాతో సహా చాలామందితో సంప్రదింపులు చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని ఇప్పటికే ఆయన వివరణ కూడా ఇచ్చారు.

‘యువగళం’తో జగన్ కు ఉక్కపోత!

లోకేష్ తండ్రి అడుగుజాడలలో నడుస్తున్నారు. తండ్రి బాటలోనే పాదయాత్ర చేయాలని సంకల్పించారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు గతంలో ఏపీలో పాదయాత్ర చేసిన సంగతి విదితమే. 208 రోజుల పాటు సాగిన ఆ యాత్రలో చంద్రబాబు 2, 817 కిలోమీటర్లు నడిచారు. హిందు పురం నుంచి ఇచ్ఛాపురం దాకా వస్తున్నా మీకోసం అంటే ఆయన అడుగులు వేస్తుంటే యావదాంధ్రదేశం ఆయన వెంట కదిలిందా అనేలా అద్బుత స్పందన వచ్చింద. ఇప్పుడు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా తండ్రి బాట పట్టారు. ఆయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు.  జనవరి 27న నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర తన తండ్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రారంభం కానుంది. కుప్పం నుంచి ప్రారంభమయ్యే లోకేష్‌ పాదయాత్ర సక్సెస్ కోసం పార్టీ సర్వం సిద్ధంగా ఉంది.   ఈ పాదయాత్రలో భాగంగా లోకేష్.. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు నడవనున్నారు. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి రోడ్ మ్యాప్ ను కూడా సిద్ధం చేశారు. అయితే.. నారా లోకేష్ పాదయాత్ర పేరు వినగానే జగన్ సర్కార్ ఎందుకో వణికి పోతోంది.  అందుకే  యువగళం పాదయాత్రకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. యువగళం యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. లేఖలు రాసినా శనివారం (జనవరి 21) వరకూ ఎటువంటి స్పందనా ప్రభుత్వం నుంచి లేదు. అయితే ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా పాదయాత్ర జరిగి తీరుతుందని తెలుగు తమ్ముళ్లు గట్టిగా చెబుతున్నారు. పాదయాత్రకు అనుమతే అవసరం లేదని.. ముఖ్యమంత్రి జగన్ గతంలో తాను విపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన ప్రకటనలను వారు ఇప్పుడు బయటకు తీస్తున్నారు.     నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అంశాలుగా లోకేష్ యాత్ర సాగనుంది. మహిళలు, రైతుల సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా, యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేసేలా లోకేష్ పాదయాత్ర ముందుకు సాగుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా తన పాదయాత్ర జనవరి 27 నుంచి ప్రారంభమౌతుందని నవంబర్ లోనే లోకేష్ ప్రకటించారు. వచ్చే ఎన్నకలలో తాను పోటీ చేయదలచిన మంగళగిరి నియోజకవర్గంలో మీడియా సమావేశం పెట్టి మరీ  పాదయాత్ర తేదీ ప్రకటించారు. తండ్రి చాటు బిడ్డగా రాజకీయాలలో తొలి అడుగులు వేసిన లోకేష్.. మొదటి నుంచీ మంచి అడ్మినిస్ట్రేటర్ గా గుర్తింపు పొందారు. తెలుగుదేశం విధాన నిర్ణయాలలో వెనుక ఉండి కీలకంగా వ్యవహరించిన లోకేష్..  ఇప్పుడు ప్రజా నాయకుడిగా, ప్రజల మనిషిగా వారితో మమేకం అయ్యారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షమౌతో ప్రజాభిమానాన్ని గెలుచుకున్నారు. ఇదంతా ఆయన చంద్రబాబు తనయుడు కావడం వల్లనే జరగలేదు. రాజకీయాలలో తొలి అడుగులు వేసే సమయంలోనే రాజకీయ ప్రత్యర్థులు ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. బాడీ షేమింగ్ చేశారు. ఆహారం, ఆహార్యంపై ఎగతాళి చేశారు. పప్పు అన్నారు. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టే యత్నాలు చేశారు. అయితే వాటన్నిటినీ  తట్టుకుని తనదైన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని లోకేష్ ఇప్పుడు ప్రత్యర్థులకు సింహస్వప్నంగా ఎదిగారు. అన్నిటికీ మించి లోకేష్ పార్టీ కార్యకర్తలతో పూర్తిగా మమేకమై మెలుగుతారు. సాధారణంగా నాయకుడికి కార్యకర్తలతో వ్యక్తిగత సంబంధాలు ఎంత బలంగా ఉంటే క్యాడర్ అంత గట్టిగా పార్టీ కోసం, నాయకుడి కోసం పనిచేస్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్టీ కార్యకర్తలు నాయకులు అనే కాదు, పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ, వారి వారి పుట్టిన రోజున లేఖ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేస్తారు. ప్రధాని సంతకంతో శుభాకాంక్షలు అందడం ఎవరికైనా ఆనందాన్ని ఇస్తుంది. ఇక పార్టీ కార్యకర్తలకు అయితే కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే, కార్యకర్తలతో వ్యక్తిగత సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చే నాయకులు ఇంకా ఉన్నారు.  ఆ కోవలోకే వస్తారు.. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలన దుష్పరిణామాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు లోకేష్ పూర్తి స్థాయిలో  సిద్ధమయ్యారు. అదే సమయంలో యువగళంలో యువతను ఆకట్టుకునేలా టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నారు.     నిజానికి తెలుగుదేశం పార్టీలో చాలా కాలంగా లోకేష్ పార్టీ కార్యకర్తల మంచి చెడులు చూసుకుంటున్నారు, కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇష్తున్నారు. రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించే సంప్రదాయాన్ని టీడీపీతోనే ప్రారంభించారు. ఈ ఆలోచన లోకేష్ బ్రెయిన్ చైల్డ్ . కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి లోకేష్ ప్రత్యేక  వ్యవస్థను ఏర్పాటు చేశారని.. ఇప్పుడు అందివచ్చిన టెక్నాలజీ సాయంతో అందరితో దగ్గర సంబంధాలు పెంచుకుంటున్నారు. లోకేష్ తీరుతో పార్టీలో యువత మరింత చురుకుగా పని చేస్తోందని అంటున్నారు.   అందుకే లోకేష్ పాదయాత్ర అంటేనే వైసీపీలో వణుకు పుడుతోంది. అనుమతులు ఇవ్వకుండా కుట్రలకు తెరలేపుతోంది. పార్టీ నేతలూ, శ్రేణులను భయభ్రాంతులకు గురి చేసి పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తోంది. పార్టీ నేతలను విచారణల పేరుతో పోలీసు స్టేషన్లకు పిలిపించి వేధిస్తోంది. ఎలాగైనా సరే పాదయాత్రను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు లోకేష్ పాదయాత్రపై జనంలో మరింత క్రేజ్ ను పెంచుతున్నాయి. లోకేష్ పాదయాత్రలో కీలకంగా వ్యవహరిస్తున్న చింతకాయల అయ్యన్న పాత్రుడి కుమారుడు విజయ్ ను పాదయాత్ర ప్రారంభమయ్యే జనవరి 27వ తేదీన విచారణకు రావాలని సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే లోకేష్ కానీ, తెలుగుదేశం శ్రేణులు కానీ వీటన్నిటినీ ఖాతరు చేయడం లేదు.   పాదయాత్రకు అనుమతి, భద్రత కల్పించడంపై టీడీపీ నేతలు గతంలో రికార్డెడ్ గా అందించిన దరఖాస్తులపై  పోలీసుల నుంచి ఇంత వరకూ ఎటువంటి స్పందనా లేదు. పాదయాత్రకు అనుమతి ఉందని కానీ, లేదని కానీ తేల్చి చెప్పలేదు. అనుమతి లేదని చెబితే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకునే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఏ విషయం చెప్పకుడా నాన్చుతూ చివరి నిముషంగా యాత్రను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య  డీజీపీకి మరో లేఖ   రాశారు. యాత్రకు అనుమతి రాకపోతే చట్ట పరంగా ఏం చేయాలన్న విషయంపై కూడా తెలుగుదేశం కసరత్తు చేస్తున్నది. అలాగే  విపక్ష నేతగా ఉన్న సమయంలో  జగన్ పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఎలాంటి అనుమతులూ తీసుకోకున్నా.. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం యాత్రను అడ్డుకోలేదు. పటిష్టమైన భద్రత కల్పించి మరీ యాత్ర సజావుగా సాగేందుకు సహకారం అందించింది.  అప్పటి విషయాలన్నీ ఇప్పుడు ప్రజల ముందుకు తీసుకు వస్తున్న తెలుగుదేశం  లోకేష్ పాదయాత్ర విషయంలో జగన్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిని జనంలో ఎండగడుతోంది. 

అత్తమీద కోపం దుత్త మీద అంటే ఇదే..!

అత్తమీద కోపం దుత్త మీద చూపినట్టు అంటారు. అలాగే అనుమానం పెను భూతం అని కూడా అంటారు. ఉత్తర ప్రదేశ్ లోని వ్యక్తి చేసిన పని అచ్చం అలాగే ఉంది. ఉత్తరప్రదేశ్ లోని షాజాన్ పూర్ లో నివసించే అబిద్ అనే  తన పెంపుడు పిల్లిని పోగొట్టుకున్నాడు. తానెంతో ప్రేమగా పెంచుకుంటున్న పిల్లిని పొరుగింటి వ్యక్తే చంపేసి ఉంటాడని అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానమే  పెనుభూతంగా మారింది. అయితే తన కోపాన్ని ఆ వ్యక్తిపై ప్రదర్శించలేక ఆ కోపాన్ని ఎదురింటి వ్యక్తి పెంచుకుం టున్నపావురాలపై చూపాడు. తన పిల్లిని దొంగిలించాడన్నఅనుమానంతో పొరుగున ఉన్న వ్యక్తి పెంచుకుంటున్న దాదాపు 30 పావురాలను విషమిచ్చి చంపాడు.  

ఎర్రబెల్లి ఓవరాక్షన్.. సీఎం సీరియస్?

ముఖ్యమంత్రి కేసీఆర్ తో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు చాలా చక్కని, దగ్గరి సంబంధాలే ఉన్నాయి. అవును ఒక్కప్పుడు తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పుడు, ఎర్రబెల్లి   ముఖ్యమంత్రి కేసీఆర్ ను చాలా తీవ్రంగా దూషించారు. దుర్భాష లాడారు. అయినా  ఎర్రబెల్లి తనను ఎంత లేసి మాటలన్నా  ఎంతగా దూషించినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన్ని పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చారు. అంటే అది మామూలు బంధం కాదు. చాలా గట్టి బంధం అని వేరే చెప్పనకకరలేదు.  అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్  కు ఒక లెక్కుంది, ఆయనకు దగ్గరయ్యే కొద్ది దూరం పెరుగుతుంది. ఎంతటివారైనా, ఎంతటి బంధం, బంధుత్వం ఉన్నా, గీత దాటానంతవరకే గీత దాటితే, ఎంతటి వారికైనా వాత తప్పదు.  నరేంద్ర మొదలు ఈటల వరకు, ఎవరి కథ తీసుకున్నా అదే ముగింపు కనిపిస్తుంది. అయితే ఎర్రబెల్లికి ఆ విషయం కొంచెం ఆలస్యంగా తెలిసిందో ఏమో కానీ  నోరు జారారు. గీత దాటారు ముఖ్యమంత్రిని మెప్పించాలని అనుకున్నారో  ఏమో కానీ, అనుమతి లేకుండా సర్వే నిర్వహించడమే కాకుండా, పాతిక మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, వారిని మార్చాల్సిన అవసరం ఉందని మీడియా ముందు మాట్లాడి భారాసలో ప్రకంపలు సృష్టించారు. అయితే ఆ తర్వాత తప్పు తెలుసుకుని కావచ్చు అబ్బే ... నేన్నది అది కాదు, మీడియా వక్రీకరించిందని తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారు.   అయితే ఎర్రబెల్లి కుప్పి గంతులు  ముఖ్యమంత్రి కేసేఆర్ దగ్గర పనిచేయలేదో ఏమో  కానీ, ఎర్రబెల్లి కామెంట్స్‌పై కేసీఆర్ సీరియస్ అయినట్లు సమాచారం. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని  అత్సుత్సాహం ప్రదర్శించవద్దని ఫోన్‌లో కేసీఆర్ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిధి దాటి ప్రకటనలు చేయవద్దని హెచ్చరించినట్లు చెబుతున్నారు. ఇంకోసారి అలా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చినట్లు బీఆర్ఎస్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీలో మరో ప్రచారం కూడా జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలనే ఎర్రబెల్లి చేత ఆ ప్రకటన చేయించారని, అయితే, అది కాస్తా లీక్ కావడంతో  ముఖ్య మంత్రి సీరియస్ అన్న ఎపిసోడ్ ను తెర మీదకు తెచ్చారని అంటున్నారు.   సిట్టింగ్ ఎమ్మెల్యేందరికీ టికెట్లు ఇస్తానంటూ గతంలో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలందరూ ఇప్పటినుంచే ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని కేసీఆర్ తెలిపారు. ఎమ్మెల్యేలందరికీ టికెట్ కన్ఫామ్ అని కేసీఆర్ క్లారిటీ ఇవ్వడంతో.. అందరూ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే పాతిక మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, వారిని మార్చాల్సిన అవసరం ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో సంచలనం రేపాయి. కేసీఆర్ అందరికీ టికెట్లు ఖాయమని చెప్పగా..  ఎర్రబెల్లి ఎందుకు అలా కామెంట్స్ చేశారనే చర్చ తెరపైకి వచ్చింది. ఎర్రబెల్లి కామెంట్స్ వెనుక కేసీఆర్ ఉన్నారనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.  ఇప్పుడు ఎర్రబెల్లికి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారనే వార్తలతో ఆ ప్రచారానికి కాస్త తెరపడినట్లు అయింది. కానీ, అసలు కథ ఏమిటి?  అంటే  నిజానికి భారస ఎమ్మెల్యేలలో కేవలం 25మందికి కాదు, సగం మందికి పైగానే ఎమ్మెల్యేలు చిక్కుల్లో ఉన్నారు.  మరో వంక పక్క చూపులు చూస్తున్న ఎమ్మెల్యేల సంఖ్యా పెరుగు తోందని అంటున్నారు. అందుకే, కేసీఆర్  వ్యూహాత్మకంగా ఎర్రబెల్లి ఎపిసోడ్  వన్ అండ్, టూ.. సీక్వెల్ ను తెరకెక్కించారని అంటున్నారు. అయితే ఏది నిజం ఏది కాదు అంటే, ఏమో ..ఎవరికీ తెలియదు.

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో పులల సందడి.. చూద్దాం రారండి!

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పులులు సందడి చేస్తున్నాయి. ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో ప్రస్తుతం 26 పులులు ఉన్నాయి.   తెలంగాణ అటవీ, పర్యావరణ   శాఖ   అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. తాజాగా  మన్ననూర్ లోని వనమాలికలో నూతనంగా నిర్మించిన 6 కాటేజీలు, 8 సఫారీ వాహనాలను ప్రారంభించింది. ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో వన్యప్రాణుల సంఖ్య  బాగా పెరిగింది. దీంతో అడవుల ప్రత్యేకత కాపాడుతూనే, పర్యావరణహిత టూరిజం అందుబాటులోకి  తీసుకువచ్చింది ప్రభుత్వం. దీనిలో భాగంగా అటవీ ప్రాంతాలు, టైగర్ రిజర్వుల సమీపంలో మరిన్ని ఎకో టూరిజం ప్రాంతాలను అభివృద్ది చేయడానికి కార్యాచరణ రూపొందించింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో రూ. 1.20 కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా తయారు చేసిన 8 సఫారీ వాహనాలు, రూ. 90 లక్షల వ్యయంతో నిర్మించిన 6 కాటేజీలను ప్రారంభమయ్యాయి. సహజమైన అటవీ వాతావరణంలోనే పులులను వీక్షించే అవకాశం, వెసులుబాటు కల్పించింది.   ఇంకెందుకు ఆలస్యం చూసొచ్చేద్దాం రండి. అన్నట్లు ఇక్కడ ఆన్ లైన్ కాటేజీలు బుక్ చేసుకోవడానికి వెసులు బాటు ఉంది.

బీఆర్ఎస్ తో పొత్తు .. పావులు కదుపుతున్న కాంగ్రెస్ పెద్దలు ?

కాంగ్రెస్ పార్టీతో పొత్తుకోసం కేసీఆర్... తహతహ లాడుతున్నారా? ప్రస్తుత పరిస్థితిలో  దేశం సంగతి ఎలా ఉన్నా రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలంటే, కాంగ్రెస్ ‘చే’ తోడు అనివార్యమనే నిర్ణయానికి వచ్చారా? అంటే, అవుననే అంటున్నారు, అటూ ఇటూ ఉన్న ముఖ్య నేతల సన్నిహిత నాయకులు. నిజానికి  ఇదేమి కొత్త విషయం కాదు. పొలిటికల్, మీడియా సర్కిల్స్ లో ఈ చర్చ చాలా కాలంగా జరుగుతూనే వుంది. ఇప్పుడు ఫ్రెష్ గా మరో మారు తెర మీదకు వచ్చింది.  ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు భగ్గుమన్న నేపధ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ముఖ్య నేతలు కొందరు, అంతకు ముందు ఏంతో కాలంగా, తాము చేస్తూ వచ్చిన భారాస తో పొత్తు ప్రతిపాదనను మరో మారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్, ఆ తర్వాత ప్రత్యేక పరిశీలకునిగా వచ్చిన దిగ్విజయ్ సింగ్ ద్వారా తమ ప్రతిపాదనను మరో మారు పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్ళారు. అప్పటినుంచి ఢిల్లీ హైదరాబాద్  మధ్య ‘పొత్తు’ ప్రతిపాదన చక్కర్లు కొడుతోందని విశ్వసనీయంగా తెలుస్తోంది. కాగా తాజాగా, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ అధిష్టానికి ఇచ్చిన నివేదికలో భారాస, కాంగ్రెస్ పొత్తు ప్రస్తవన చేసినట్లు తెలుస్తోంది.  ఈ నేపధ్యంలో బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తు వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెర వెనక నడుస్తున్న రహస్య రాయబారాల వివరాలను బయట పెట్టారు. తెలంగాణ కాంగ్రెస్‌లోని కొంతమంది సీనియర్లు తొమ్మిది నెలల క్రితం బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ప్రతిపాదనను ఏఐసీసీ ముందు పెట్టారని తెలిపారు. బీఆర్ఎస్‌తో పొత్తుపై ఏఐసీసీ తమ అభిప్రాయాలను అప్పట్లో కోరిందని, అప్పట్లో తాము వద్దని చెప్పినట్లు అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తు గురించి పార్టీలో చర్చ జరిగిన మాట వాస్తవమేనని, తనకు పూర్తి సమాచారం ఉందని ఆయన అన్నారు. టీఆర్ఎస్‌తో కొట్లాడుతున్నప్పుడు పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి సరెండర్ అయినట్లు ఉంటుందని అద్దంకి దయాకర్ అభిప్రాయపడ్డారు. గతంలో కేసీఆర్ బీహార్ వెళ్లి నితీష్ కుమార్‌ని కలిశారని, ఆ తర్వాత రెండు రోజులకే నితీష్ కుమార్ వెళ్లి రాహుల్ గాంధీని కలిసి కేసీఆర్‌ను కాంగ్రెస్‌లో కలుపుకోవాలని కోరినట్లు అద్దంకి దయాకర్ చెప్పారు. కానీ రాహుల్ గాంధీ ఆ ప్రతిపాదనను పట్టించుకోలేదని, లైట్‌గా తీసుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఇప్పటికీ కాంగ్రెస్‌తో పొత్తుకు ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్‌లోని కొంతమంది సీనియర్లు ఏఐసీసీ దగ్గర బీఆర్ఎస్ పొత్తు గురించి ప్రపోజల్స్ ఇప్పటికీ పెడుతున్నారని, దయాకర్ స్పష్టం చేశారు.  తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారని, కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ పొత్తుకు రావాలని గతంలో కాంగ్రెస్ జాతీయ నేతలు కొంతమంది చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తుపై ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తుండగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వాటిని కొట్టిపారేస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీ వరంగల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కూడా బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఎవరైనా నేతలు బీఆర్ఎస్‌తో పొత్తు గురించి మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని కూడా రాహుల్ వార్నింగ్ ఇచ్చారు.ఆ తర్వాత పొత్తు వార్తలకు చెక్ పడగా.. ఇటీవల మాణిక్యం ఠాగూర్ ఇచ్చిన రిపోర్టుతో మరోసారి చర్చ మొదలైంది. ఇదలా ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ లో వర్గ పోరును చల్లార్చేందుకు, అధిష్టానం దూతగా హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ సింగ్ ను కలిసిన మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకరు తెలంగాణలో బీజేపీ అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ తో పొత్తు అవసరమని చెప్పినట్లు తెలుస్తోంది. భారాస పొత్తుతో పోటీచేయడం వలన కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా అధికారాన్ని పంచుకుంటుంది.అదే ఒంటరిగా పోటీ చేసి ముక్కోణ పోటీలో ఇరవై పాతిక సీట్లు గెలిచినా, గత అనుభవాలను బట్టి చూస్తే  గెలిచిన ఎమ్మెల్యేలను నిలుపుకోవడం కష్టమవుతుందని ఆయన వివరించినట్లు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గద్దల్లా ఎగరేసుకు పోవడానికి బీఆర్ఎస్ కు తోడు ఇప్పుడు బీజేపీ కూడా సిద్ధంగా ఉందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, నిర్ణయం తీసుకోవాలని ఆయన హితబోధ చేసినట్లు తెలుస్తోంది.  దీంతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. కాగా, తొలి పర్యటనలో కొంత సమాచారం సేకరించిన  తెలంగాణ కాంగ్రెస్ కొత్త  ఇంచార్జి మాణిక్‌రావు థాకరే, తాజా పర్యటనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు విషయం పై కూడా ప్రత్యేక దృష్టి కేద్రీకరిస్తారని తెలుస్తోంది.

బాధిత కుటుంబాలకు సాయంపై వైసీపీ వికృత రాజకీయం

ఓ అబద్దాన్ని నిజం చేయాలంటే.. చాలా చాలా చేయాలి. అందుకు చదువు చట్టుబండలు అవసరం లేదు కానీ... కాస్తాంత కపటం, మోసం ఉంటే చాలు. సామిరంగా.. జనాన్ని ఏంటి ప్రతిపక్ష పార్టీలను సైతం రింగ రింగా అంటూ.. అల్లాడించేయచ్చు. స్కూళ్లు‌, కాలేజీల్లో నేర్పని ఈ విద్య.. అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బాగానే ఒంట పట్టించుకుంది.  ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కందుకూరులో బాదుడే బాదుడు కార్యక్రమంలో   జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మరణించారు. ఈ సందర్భంగా టీడీపీ, ఆ పార్టీ నేతలతోపాటు ఎన్నారైలు సైతం స్పందించి భారీగా నష్ట పరిహారాన్ని చెక్కులుగా అందించారు. అయితే ఎన్నారై కంచర్ల శ్రీకాంత్ ఇచ్చిన చెక్‌లు బౌన్స్ అయ్యాయంటూ.. మృతుల కుటుంబాలకు నకిలీ చెక్కులు అంటగట్టారంటూ.. వైసీపీ.. సోషల్ మీడియా సాక్షిగా .. తెలుగుదేశం పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తూ.. విషం కక్కుతోంది.  ఈ విషయంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. అదే సోషల్ మీడియా సాక్షిగా స్పందించారు. నాయకుడు దొంగ పనులు చేస్తే, అనుచరులు వెధవ పనులే చేస్తారు. జగన్ రెడ్డి నోరిప్పితే అబద్దం.. వైసీపీ కార్యకర్తలు చేసేదంతా దుష్ప్రచారం. కందుకూరు మృతుల కుటుంబాలకు ఎన్ఆర్ఐ కంచర్ల శ్రీకాంత్ ఇచ్చిన చెక్కులు క్యాష్ చేసుకున్నాక బౌన్స్ అయ్యాయని జగన్ ఫేక్ గ్యాంగ్ విష ప్రచారం చేస్తోంది. శవాలపైనా, చివరకు మరణించిన వారి కుటుంబాలకు చేసే సాయంపైనా వికృత రాజకీయాలు చేయడం కేవలం వైసీపీకే సాథ్యమంటూ పేర్కొన్నారు. అంతేకాదు.. బాధిత కటుంబాలకు టీడీపీ తరఫున ఇచ్చిన చెక్కు నెంబర్లను సైతం నారా లోకేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఈ మొత్తం ఎపిసోడ్‌పై నెటిజన్లు..  వైసీపీకి చురకలంటిస్తున్నారు. అధికారం అందుకోవడం కోసం.. విశాఖ ఎయిర్ పోర్ట్ సాక్షిగా కోడి కత్తి డ్రామా నడిపినా.. సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురైనా.. జస్ట్ గుండెపోటుతో ఆయన మరణించారంటూ తొలుత మీడియాకు చెప్పినా... ఈ హత్య కేసు సీబీఐకి అప్పగించినా.. వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారి.. సబీఐ ఎదుట ఈ హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరెవరో చెప్పినా.. ఈ హత్య కేసు ముందు సాగపోవడం వెనుక ఉన్నది ఎవరనేది ప్రజలందిరికీ తెలిసిందేనని నెటిజన్లు వైసీపీకి చురకలంటిస్తున్నారు. అలాగే విశాఖ ఎయిర్ పోర్ట్‌లో కోడి కత్తి కేసులో పోడిపించినవాడు తాడేపల్లి ప్యాలెస్‌లో సకల భోగాలు అనుభవిస్తున్నాడని... కానీ కోడికత్తితో పోడిచిన వాడు   గత నాలుగేళ్లుగా జైల్లో మగ్గిపోతున్నాడని..  నెటిజన్లు అంటున్నారు.     ఈ ఘటనలు గడిచి... నాలుగేళ్లు అయినా.. వీటిపై స్పందించని అధికార వైసీపీ,  కందుకూరు ఘటనలో బాధితులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యారంటూ అబద్దపు వార్తలు..  అదే పనిగా ప్రచారం చేయడం ఎంత వరకు సబబు అని నెటిజనులు వైసీపీని నిలదీస్తున్నారు. అధికారం అందుకోవడం కోసమే కాదు.. ఆ వచ్చిన అధికారాన్ని నిలుపుకోవడం కోసం.. ఎన్ని చేయడానికికైనా.. ఎంత చేయడానికైనా.. ఎంతటి విషప్రచారానికైనా.. తెగబడడం  జగన్, ఆయన పార్టీ నైజం అన్నట్లుగా పరిస్థితి ఉందని నెటిజన్లు  అభిప్రాయపడుతున్నారు. ఉన్న అధికారాన్ని నిలుపుకోవడం కోసం.. సమాధులనే పునాదులుగా చేసుకుని.. అధికారాన్ని నిలబెట్టుకోవాలనే నైజం జగన్ పార్టీలో కొట్టోచ్చినట్లుగా కనిపిస్తోందని  నెటిజన్లు తమ అబిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదీ కాక.. జనవరి నుంచి జగనన్న ఏమిటో చూపిస్తాడు.. చూడండంటూ.. జగన్ సైన్యం పేరిట.. సోషల్ మీడియాలో గత ఏడాది నవంబర్‌లో జగన్ సైన్యం.. తన ఖాతాలో పోస్ట్ పెట్టిందని.. అది ఇలాంటి వాటి కోసమేనా అని నెటిజన్లు డౌట్ వ్యక్తం చేస్తున్నారు.

హైపర్ ఆదికి రోజా సపోర్ట్

పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే, జగన్ మీద పోటీకి సిద్ధం .. హైపర్ ఆది..  ఇంతకీ ఈ హైపర్ ఆదీ ఎవరు? చాలామందికి తెలియక పోవచ్చును కానీ, ఓ ప్రముఖ టీవీలో ప్రసారమయ్యే ... ఓ బూతు కామెడీ షో చూసే వారికి మాత్రం ఇతగాడి పరిచయం అవసరం లేదు. సరే .. ఇప్పుడు విషయం అదికాదు కాబట్టి, ఆవిషయాన్ని పక్కన పెట్టి, విషయంలోకి వస్తే... ఈ ఆది అనే వాడు... జనసేన వేదిక నుంచి పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసీపీ ప్రభత్వం పై సెటైర్లు, పంచ్ డైలాగులతో విరుచుకు పడ్డారు. అంతే కాదు, పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే, జగన్ మీద పోటీకి సిద్ధం, అంటూ జగన్ రెడ్డి ఇమేజ్ మొత్తాన్ని బెలూన్ లో గాలిలా కామెడీగా తీసి పారేశారు. మరో కమెడియన్, ఏపీ సర్కార్ లో ఉన్నశతకోటి సలహాదారుల్లో .. మరో సలహదారు అలీ, ఇటీవల జగన్ రెడ్డి ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తానని చేసిన కామెంట్ కు కౌంటర్ గా ఆది ఈ వ్యాఖ్య చేశారు  కావచ్చు.    అయినా, ఆది కామెంట్స్ మీద వైసేపీ నేతలు భగ్గుమంటున్నారు. కొంచెం చాలా తీవ్రంగానే హెచ్చరిస్తున్నారు. అతగాడి భాషలోనే సమాధానం ఇస్తున్నారు. కానీ మంత్రి రోజా మాత్రం, ఆది అమాయకుడు అంటూ కితాబు నిస్తున్నారు. జగన్ రెడ్డిని ఇంతవరకు ఎవరూ దూషించనంతగా దూషించడమే కాకుండా తలకాయ ఎక్కడ  పెట్టుకోవాలో తెలియని విధంగా తొడగొట్టి సవాలు విసిరిన ఆది ని నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకుడు అంటూ మంత్రి రోజా సర్టిఫికేట్ ఇస్తున్నారు. అయితే రోజా రియాక్షన్ చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఎవరైనా చిన్నమాట అంటేనే రెచ్చిపోయే రోజా అంతలేసి మాటలన్న ఆది విషయంలో ఎందుకిలా ‘చిన్నోడు’ ఏమీ తెలియని అమాయకుడు అంటూ చిరునవ్వుతో ఎందుకు సమర్ధించు కొచ్చారు? ఆ మాటలు అన్నది ఆది అయినా అనిపించింది, మెగా ఫ్యామిలీ  అంటూ, ఊరుము ఉరిమి మంగలం మీద పడినట్లు చిరంజీవి ఫ్యామిలీ మీద ఎందుకు పడ్డారు? ఆదిని రక్షించే బాధ్యతను ఆమె ఎందుకు భుజాల మీద వేసుకున్నారు? ఎందుకు ఆదికి అండగా నిలిచారు? అంటే అందుకు మంత్రి రోజా పూర్వాశ్రయంలో, జబర్దస్త్ షో జడ్జిగా ఈ ఆది వేసిన జోకులకు పగలబడి నవ్వారు. ఆ విధంగా ఆ ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ బంధం ఉంటే ఉండవచ్చని, అందుకే ఆమె, ఆది మీద ఆగ్రహాన్నిడైవెర్ట్ చేసేందుకే మెగా ఫ్యామిలీ మీద మండి పడుతున్నారనే టాక్ ఒకటి నడుస్తోంది.  చిరు ఫ్యామిలీ ఇండస్ట్రీలో చాలా మందిని నాశనం చేశారు, చిరు ఫ్యామిలీ మాట వినకుంటే సినిమా అవకాశాలు రావు, మెగా ఫ్యామిలీలో హీరోలకు వ్యతిరేకంగా మాట్లాడితే సినిమా ఇండస్ట్రీ లో ఏమి లేకుండా చేస్తారు. అందుకే ఆది లాంటి చిన్న ఆర్టిస్టులు వాళ్ళకి సపోర్ట్ చేస్తారంటూ చెప్పు కొచ్చారని అంటున్నారు. అయితే  ఆది మరీ అంత అమాయకుడు కాదని, అతగాడికీ మంత్రి రోజా స్థాయిలో రాజకీయ కోరికలున్నాయని అంటారు. రణస్థలంలో ఇటీవల జనసేన నిర్వహించిన యువశక్తి సభలోనూ ఆది ఘాటుగా మాట్లాడారు. గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా, పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు. అవకాశం ఇస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు ఇచ్చేందుకే ఆది అలా రెచ్చిపోయారని అంటున్నారు.  మరో వంక ప్రకాశం జిల్లాకు చెందిన హైపర్ ఆది.. సొంత జిల్లా నుంచే పోటీ చేస్తారనే చర్చ నడుస్తోంది. దీంతో ప్రధానంగా రెండు నియోజక వర్గాల పేర్లు తెరపైకి వచ్చాయి. వీటిలో గిద్దలూరు నియోజకవర్గం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆది సొంత ఊరికి దగ్గరలోనే ఈ నియోజకవర్గం ఉంది. అక్కడ జనసేన పార్టీ కూడా బలంగా ఉందని జనసేన నేతలు చెబుతున్నారు.అయితే, పులివెందులలో  జగన్ రెడ్డి పైనే పోటీకి సై అంటున్న ఆది..నగరిలో మంత్రి రోజా పై పోటీ అంటే ఏమంటారో ..  సై ..అంటారా .. నై అంటారా? ఊ అంటారా.. ఊహూ అంటారా అటూ సోషల్ మీడియాలో పంచుల మీద పంచులు పడుతున్నాయ్ .. అయితే, రాజకీయాలు ‘జబర్దస్త్’ స్థాయికి  పడిపోవడమే కొంచెం చాలా విచారం ... అనే బాధపడేవాళ్ళు బాధపడుతున్నారు.

బీఆర్ఎస్ టార్గెట్ కాంగ్రెస్.. బీజేపీకి లబ్ధి చేకూరేలా కేసీఆర్ చాణక్యం

కేంద్రంలో మోడీ సర్కార్ ను గద్దె దించడమే లక్ష్యం అంటూ  తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చి జాతీయ రాజకీయాలలోకి లాంగ్ జంప్ చేసిన కేసీఆర్ నిజంగా ఆ లక్ష్యంతోనే ముందుకు వెళుతున్నారా? అందు కోసమే దేశంలోని వివిధ రాష్ట్రాలలో బీఆర్ఎస్ శాఖల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించేశారా? ఆ దిశగా ఆయన అడుగులు సవ్యంగా పడుతున్నాయా? అంటే మాత్రం సంతృప్తి కరమైన సమాధానం రాదు. ఆయన పైకి చెబుతున్న లక్ష్యం ఒకటి.. ఆచరణలో అమలు చేస్తున్న వ్యూహం మరొకటి అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  కేసీఆర్ బయలకు బీజేపీ లక్ష్యం అని చెబుతున్నా.. ఆయన టార్గెట్ చేసింది మాత్రం కాంగ్రెస్స్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు ఉదాహరణగా ఖమ్మం బీఆర్ఎస్ సభను చూపుతున్నారు. ఆ సభకు ఒడిశాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు, ఒడిశా పీసీసీ కార్యదర్శి కైలాశ్ కుమార్ ముఖి హాజరు కావడం, ఆ మరునాడే ఆయన కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరనున్నట్లు ప్రకటించడాన్ని చూపుతున్నారు. అలాగే అంతకు ముందు ఒడిశా మాజీ సీఎం    గిరిధర్ గమాంగ్ తో సీఎం కేసీఆర్ భేటీ  అయ్యారు.  ఒడిశా నుంచి గిరిధర్ కుమార్, ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ ను ప్రగతి భవన్ కు పిలిపించుకుని మరీ కేసీఆర్ వారితో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా... 9 సార్లు లోక్ సభ ఎంపీగా.. 1999, ఫిబ్రవరి 17 నుంచి 1999, డిసెంబర్ 6 వరకు ఒడిశా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన గిరిధర్ గమాంగ్ తన కుమారుడికి కాంగ్రెస్ తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన తన కుమారుడితో కలిసి కేసీఆర్ తో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ కాంగ్రెస్ టార్గెట్ గానే పావులు కదుపుతున్నారనడానికి వీటికి తోడు.. కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ఆయన బేరసారాలు జరిపారన్న ఆరోపణలు కూడా బలం చేకూరుస్తున్నాయి.    ఈ ఏడాది జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నది రేవంత్ ఆరోపణ. ఆ రాష్ట్రానికి చెందిన దాదాపు పాతిక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ప్రయత్నించారనీ, ఇందుకు వారికి రూ.500 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారనీ టీపీసీసీ చీఫ్ ఆరోపించారు. ఈ ఆరోపణలన్నిటికీ బలం చేకూర్చేవిగానే బీఆర్ఎస్ గమనం, ప్రస్థానం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పైకి బీజేపీని గద్దె దించడమేనని కేసీఆర్ చెబుతున్నా.. ఆయన అసలు లక్ష్యం మాత్రం కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయడమేనని అంటున్నారు. బీఆర్ఎస్ ద్వారా రాష్ట్రాలలో బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చడమే కేసీఆర్ అక్ష్యమని అంటున్నారు.   తన కుమార్తె కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో పీకలోతు ఇరుక్కుపోవడం, అలాగే తనపైనా కొన్ని పాత కేసులు ఉండటంతో వాటి నుంచి బయటపడేందుకే కేసీఆర్ బీజేపీకి లోపాయకారీ సహకారం అందిస్తున్నారనీ, అందుకే బీజేపీ కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు తన వంతు దోహదం చేస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇవన్నీ పక్కన పెడితే వాస్తవంగా ప్రధాని నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్ మంచి మిత్రులు, ఇద్దరూ కూడా ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. కేంద్రంలో మోడీ నాయకత్వంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు.. అలాగే కేసీఆర్ తెలంగాణలో మరోసారి గద్దెనక్కాలన్న లక్ష్యం చేరుకోవాలంటే.. ఈ సారి అంత సులభ సాధ్యం కాదు. రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న మోడీ, కేసీఆర్ లు ఇరువురూ కూడా తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అందుకే తమ లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఇద్దరూ కూడా వ్యూహాత్మక వైరం పాటిస్తున్నారు. ఈ ఆరోపణలన్నీ గతం నుంచీ ఉన్నవే. విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలే. కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు తరువాత ఆ ఆరోపణలన్నీ నిజమేనని నమ్మడానికి వీలు కలిగించేవిగానే కేసీఆర్ అడుగులు, వ్యూహాలూ ఉన్నాయి.  కేసీఆర్ జాతీయ రాగం అందుకున్న క్షణం నుంచీ ఆయన ప్రయత్నాలన్నీ కాంగ్రెస్ మిత్రపక్షాలను ఆ పార్టీకి  దూరం చేసి కాంగ్రెస్ ను ఏకాకిని చేయడంగానే సాగాయి. తమిళ నాడులో కాంగ్రెస్ మిత్ర పక్షంగా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన డిఎంకే అధినేత ఆ ర్రాష్ట ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను కలిశారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేద్దాం రమ్మని ఆహ్వానించారు.  అలాగే, మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమిలోని శివసేన, ఎన్సీపీలను కాంగ్రెస్ నుంచి విడదీసే ప్రయత్నం చేశారు. జార్ఖండ్ లోనూ కాంగ్రెస తో కలిసున్న ఝార్ఖండ్ ముక్తి మోర్చా ( జేఎంఎం) ను థర్డ్ ఫ్రంట్ లోకి తెచ్చే ప్రయత్నం చేశారు.  ఇలా చెప్పుకుంటూ పొతే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఆలోచన కాంగ్రెస్ ను బలహీన పరిచి బీజేపీని బలపరిచేందుకు చేసిన కుట్రగానే పరిశీలకులు చెబుతున్నారు. సరే కేసీఆర్ చేసిన ఆ ప్రయత్నాలు  ఫలించ లేదు అది వేరే విషయం. ఇప్పుడు సొంతంగా బీఆర్ఎస్ పేరిట జాతీయ పార్టీ పెట్టి కూడా అవే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నిటి వెనుకా మోడీని మరో సారి కేంద్రంలో అధికారంలో కూర్చోపట్టి, తెలంగాణలో తన అధికారాన్ని పదిలం చేసుకోవడానికేనని పరిశీలకులు అంటున్నారు. పనిలో పనిగా తన కుమార్తె కవితను ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు నుంచి బయటపడేసేందుకు కూడా బీజేపీకి, మోడీకి తెరవెనుక నుంచి సాయపడుతున్నారని అంటున్నారు.  

ఆహా మోడీ.. ఓహో మోడీ.. కేంద్రానికి కావల్సిందదేనా?

ప్రధాని మోడీకి ఎన్నికల లబ్ధి వినా మరేం కనిపించడం లేదా? ఆఖరికి గణతంత్ర దినోత్సవాలను కూడా ఎన్నికలలో లబ్ధి చేకూర్చే కార్యక్రమంలా మార్చేస్తారా? అంటే పరిస్థితులు గమనిస్తుంటే ఔననే అనాల్సి వస్తోంది. బడుగులకు పెద్ద పీట వేయాల్సిందే.. ఎవరూ కాదనరు. వారి ఆదాయం పెంపునకు మార్గాలు చూపాలి. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. కానీ ఒక ఉత్సవానికి ముఖ్య అతిథిలను చేసేసి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? కానీ మోడీ మాత్రం అలా చేస్తే చాలు ఓట్లు వాటంతటవే రాలుతాయని అంటున్నారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలను బడుగులకు భాగస్వామ్యం థీమ్ తో నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ థీమ్ తో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా గణతంత్ర స్ఫూర్తిని చాటుతున్నామని మోడీ సర్కార్ ఘనంగా ప్రచారం చేసుకుంటోంది. అంతే కాకుండా సాధారణంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మొదటి వరుసలో కూర్చునే అవకాశాన్ని వీవీఐపీలకు ఇస్తారు. కానీ ఈ సారి బడుగుల భాగస్వామ్యం థీమ్ తో నిర్వహిస్తున్న ఈ గణతంత్ర దినోత్సవంలో మాత్రం ఆ అవకాశాన్ని రిక్షా కార్మికులు, తోపుడు బండ్ల వ్యాపారులకు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల వేళ బడుగుల ఓట్లకు గాలం వేయడానికి మోడీ సర్కార్ వేసిన కొత్త ఎత్తుగడగానే దీనిని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కరోనా కష్ట కాలంలో తోపుడు బండ్ల కార్మికులను ఆదుకోవడం కోసం అంటు ఘనంగా ప్రకటనలు గుప్పించినా ఆ తరువాత వారిని పూర్తిగా విస్మరించిన కేంద్రం ఇప్పుడు ఎన్నికల వేల ఓట్ల గాలం కోసం కొత్త కొత్త ఎత్తుగడలతో ముందుకు వస్తోందంటున్నారు.  వీవీఐపీలకు కాకుండా రిక్షా కార్మికులు, కూరగాయలు అమ్మే చిరు వ్యాపారులకు కేటాయించినట్టు కేంద్రం స్పష్టం చేసింది.  ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సిసి ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరౌతున్నారు. మొత్తం 45,000 మంది ఈ పెరేడ్ లో కూర్చునే సదుపాయం ఉంది. రాజ్ పథ్ రోడ్డును కర్తవ్యపథ్ గా పేరు మార్చాక జరుగుతున్ తొలి రిపబ్లిక్ డే పెరేడ్ ఇదే.  

మోడీ ప్రచారయావ.. ఉద్యోగ నియామకాల్లోనూ గెలుపు లెక్కలే..

ప్రజా ధనంతో సొంత ప్రచారం చేసుకునే విషయంలో ప్రధాని మోడీ కొత్త పుంతలు తొక్కుతున్నారు. స్వాతంత్ర్య భారత దేశంలో గత ఏడున్నర దశాబ్దాలుగా జరుగుతున్న నియామక ప్రక్రియను కూడా తన ఘనతగా చాటుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. వివిధ శాఖలలో ఉద్యోగాల నియామకం ఒక నిరంతర ప్రక్రియ. ఆయా ఉద్యోగాలలో ఎంపికైన వారు తమ అర్హతను రుజువు చేసుకుని, అవసరమైన పరీక్షల్లో, ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణులైన వారే. వారికి హక్కుగా వచ్చే నియామకాలను కూడా ప్రధాని మోడీ ఇప్పుడు.. తన ఉదారత్వంగా చాటుకుని ప్రచారం పొందాలని చూస్తున్నారు. ఇప్పటి వరకూ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలకు ఎంపికైన 71 వేల మందికి ప్రధాని మోడీ నియామక పత్రాలు (అప్పాయింట్ మెంట్ లెటర్స్) పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమానికి రోజ్ గార్ మేళా అని పేరు పెట్టి ఘనంగా ప్రచారం చేసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్యోగ నియామకపత్రాలను పంపిణీ చేసిన మోడీ.. ఇటువంటి మేళాల ద్వారా యువతకు సాధికారత లభిస్తుందన్నారు. రోజ్ గార్ మేళా ద్వారా స్టెనోగ్రాఫర్, జూనియర్ అకౌంటెంట్, ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, టీచర్, నర్సు, డాక్టర్, సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్, మల్టీ టాస్క్ స్టాఫ్ లకు మోడీ నియామక పత్రాలు అందజేశారు. ఏడున్నర దశాబ్దాలలో గతంలో ఎవరికీ ఉద్యోగాలు రాలేదా?  నియామక పత్రాలు అందుకోలేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యే విధంగా మోడీ చేసిన ఈ హంగామా రాజకీయ వర్గాలలో తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఎన్నికల ప్రయోజనాలు లక్ష్యంగా ఇటీవలి కాలంలో ప్రధాని మోడీలో ప్రచార యావ విపరీతంగా పెరిగిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  బీజేపీ సర్కార్ కేంద్రంలో అధికారం చేపట్టడానికి పూర్వం కూడా కోట్లాది మంది  తమ అర్హతలను ప్రూవ్ చేసుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. అయినా అప్పటి ప్రభుత్వాలేవీ ఇలా అర్భాటంగా ప్రచార పర్వానికి తెరతీసిన దాఖలాలు లేవు. ఎన్నికలు గతంలోనూ జరిగాయి. కానీ అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా ఇప్పటి మోడీ సర్కార్ లాగా ఒక పద్ధతి ప్రకారం..జరిగే నియామకాలను రాజకీయ ప్రయోజనం కోసం ఉపయోగించుకున్న దాఖలాలు వేవు.   ఉద్యోగ నియామకాల ప్రక్రియను పర్యవేక్షించే వ్యవస్థలు ఉన్నాయి. వాటి ద్వారానే ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు వెలువడతాయి. ఆయా వ్యవస్థల ఆధ్వర్యంలోనే రాత పరీక్షలు జరుగుతాయి. అందులో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూలకు కాల్ లెటర్స్ వస్తాయి. ఇంటర్వ్యూలో కూడా అర్హత సాధించిన వారికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇదీ నియామక ప్రక్రియ. ఆ విధంగా తమను తాము ప్రూవ్ చేసుకుని, రాత పరీక్షలో, ఇంటర్వ్యూలో నెగ్గి ఉద్యోగాలకు అర్హత సాధించిన వారికి నియామకపత్రాల పంపిణీ అంటూ మోడీ ఆర్భాటం చేయడమేమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.. ఆ తరువాత వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో ప్రధాని మోడీ పార్టీ లక్ష్యమేమిటో ప్రకటించేశారు. 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తీరాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు. ఈ విజయాల ద్వారా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి కేంద్రంలో తాను మళ్లీ ముచ్చటగా మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ఇదే బీజేపీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లక్ష్యం అని విస్పష్టంగా చెప్పేశారు. ఇప్పటికే గత ఎనిమిదేళ్లుగా ఎన్నికల నుంచి ఎన్నికలకు అన్న టార్గెట్ తోనే ప్రబుత్వాన్ని నడుపుతున్న మోడీ సర్కార్ ఇక ఇప్పుడు పాలనను పూర్తిగా గాలికి వదిలేసి ప్రభుత్వ కార్యక్రమాలను కూడా పార్టీ కార్యక్రమాలుగా ప్రచారం చేసుకుంటూ ఎన్నికలలో లబ్ధి పొందే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.