బిరియానీ బెంగళూరు టు ముంబై.. ఆర్డర్ ను ఒబే చేసిన జుమాటో

మత్తు తలకెక్కితే.. నింగిలోని చందమామను నేలకు దించేయాలనిపిస్తుంది. కొండ మీద కోతి చేత కల్లు తాగించాలనిపిస్తుంది.. ఇలా ఒకటేమిటి.. అసాధ్యమన్నదేదీ లేదన్న ధీమా పెరుగుతుంది. ముంబైకి చెందిన ఒక అమ్మాయి.. ఇంచుమించు అలాగే అనుకుంది. ఫుల్ గా మందు కొట్టేసిన తరువాత మంచి ఫుడ్ తినాలనుకుంది. అంతే వెంటనే తనకు బాగా ఇష్టమైన బిరియానీని జొమాటో ద్వారా ఆర్డర్ చేసేసింది. ఇందులో వింతేముంది అనుకోకండి.. ఆమెకు బిర్యానీ చాలా చాలా ఇష్టం.. అంతే కాదు ఆమెకు బెంగళూరులోని ఓ ప్రముఖ హోటల్ బిరియానీ అంటే అంటే మరీ ఇష్టం. దీంతో ఆమె మంబై నుంచి బెంగళూరులోని ప్రసిద్ధ హోటల్ నుంచి బిరియానీ కావాలంటూ జొమాటోకు ఆర్డర్ చేసింది. జుమాటో కూడా చాలా సిన్సియర్ గా ఆమె ఆర్డర్ ను బుక్ చేసుకుని.. అంతే సిన్సియర్ గా డెలివరీ చేసింది. అయితే చాలా చాలా దూరం కదా.. అందుకు ఆ డెలివరీ ఆ మరుసటి రోజు  ఇచ్చింది. బిల్ కూడా పాతిక వందల రూపాయలు వేసింది. ఈ విషయాన్నంతా ఆ అమ్మాయి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది. తాను చేసింది తప్పని తాను అనుకోవడం లేదనీ, బేంగళూరు నుంచి బిరియానీ తెప్పించుకుని తినడం చాలా సంతోషాన్నిచ్చిందని ఆమె ఆ పోస్టులో పేర్కొంది. 

వైసీపీలో మహిళలకు మరిన్ని టికెట్లు.. నాకు నోటికెట్.. బాలినేని

ఆంధ్రప్రదేశ్  లో  ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ఆల్మోస్ట్  ఖరారు అయినట్లు వార్తలు వస్తున్ననేపధ్యంలో మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి  ఈ సారి తనకు వైసీపీ టికెట్  రాకపోవచ్చని చేసిన వ్యాఖ్యలు  సంచలనంగా మారాయి. నిజానికి, ఆయనకు ఆ మేరకు సంకేతాలు వచ్చాయా, లేక అటు నుంచి రియాక్షన్ చూసేందుకు ఒక రాయి వేశారా, ఆనేది పక్కాన్ పెడితే, వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాదని, బాలినేని తనంతట తానుగా ముందుగానే ప్రకటించారు. అయితే, తనకు బదులుగా తన స్థానంలో తన భార్య సచీదేవికి టికెట్ వచ్చే అవకాశం ఉందని మరో సంకేత మిచ్చారు.  నిజానికి, బాలినేని కేవలం మాజీ మంత్రి మాత్రమే కాదు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువు. అందకే  “నీకు సీటు లేదు. నీ భార్యకు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అంటే నేనైనా చేసేదేం లేదు. ఈసారి మహిళలకే అవకాశాలు అని జగన్ రెడ్డి తేల్చి చెబితే నేనైనా పోటీ నుంచి పక్కకు తప్పుకోవాల్సిందే” నని బాలినేని చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మార్కెట్ యార్డు ఛైర్మన్‌ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి  2024 ఎన్నికలు - సీట్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  నిజానికి,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ సమయంలోనూ అందరికంటే ముందుగా బాలినేని, తనంతట తానుగా మంత్రి పదవిని వదులుకునేందుకు సిద్దమయ్యారు. రాజీనామా లేఖను జేబులో పెట్టుకు తిరుగుతున్నాని ప్రకటించారు. ఒక విధంగా ఇతర సీనియర్ మంత్రులను మానసికంగా తయారు చేసేందుకు, ముఖ్యమంత్రి జగన్మోహన్  రెడ్డి తన బంధువు బాలినేని చేత ఆ మాట చెప్పించారనే టాక్కూడా అప్పట్లో వినిపించింది. అలాగే, అప్పట్లో ఆయనలో ఎక్కడో లోలోపల,అందరికీ ఉద్వాసన పలికినా, బంధువు కోటాలో అయినా జగన్ రెడ్డి తనను మాత్రం మంత్రివర్గంలో కొనసాగిస్తారనే ఓ చిరు ఆశ లాంటింది ఏదో ఆయనలో ఉందని, అందుకే ఆయన, ఆ విధంగా మాట్లాడారనే వదంతులు అప్పట్లో  షికారు చేశాయి. అయితే,చివరకు బాలినేని ఒకటి తలిస్తే, జగన్ రెడ్డి ఇంకొకటి తలిచారు అన్నట్లు, బంధువు కావడం వల్లనే బాలినేనికి ఉద్వాసన పలికారని ఆ తర్వాత గానీ తెలిసిరాలేదుని అంటారు. జగన్ రెడ్డి తొలి  మంతివర్గంలో ప్రకాశం జిల్లానుంచి బాలినేని శ్రీనివాసులరెడ్డితో పాటుగా  ఆదిమూలపు సురేష్ కూడా మంత్రిగా ఉన్నారు. మత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో ముఖ్యమంత్రి ఆదిమూలపు సురేష్ ను కొనసాగించి, బాలినేనికి ఉద్వాసన పలికారు. దీంతో బాలినేని హర్టయ్యారు. అలక వహించారు. బందువును నన్ను కాదని, ఆదిములపు సురేష్ ను కొనసాగించడం ఏమిటని, కొంత కాలం ఆయన కొంచెం చాలా బాధపడిపోయారు. మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు అన్నట్లుగా బాధపడ్డారు.అయితే ఆ తర్వాత సర్దుకుపోయారు. తీరా ఇప్పుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు వైసీపీ టికెట్‌ ఇవ్వకపోవచ్చునని అన్నారు.  అయితే, బాలినేనికి టికెట్  వస్తుందా రాదా అనే విషయాన్ని పక్కన పెడితే, ఆయన పని కట్టుకుని చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల అభ్యర్ధుల ఎంపిక కసరత్తుకు అప్పుడే శ్రీకారం చుట్టినట్లుందని అంటున్నారు. అదొకటి అలా ఉంటే, ఒంగోలులో బాలినేని తన వారసుడిగా కొడుకు ప్రణీత్ రెడ్డిని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే బాలినేని వ్యవహారాలన్నీ ఆయన కొడుకు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన కొత్తగా తన భార్య సచీదేవి పేరు తెరపైకి తేవడం విశేషం. మొత్తమ్మీద బాలినేని వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లోనే కాదు, ఏపీ మొత్తం సంచలనంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబర్చిన వాళ్లకే మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. ఈ విషయంలో మంత్రులకు కూడా మినహాయింపు ఉండదని క్లారిటీ ఇచ్చారు. పని తీరు బాగోలేకపోతే ఎవరినైనా పక్కన పెడతామని ఆయన  అనేకసార్లు నిర్మొహమాటంగా చెప్పారు. దీంతో ఇప్పుడు బాలినేని చేసిన వ్యాఖ్యలతో, ఏరివేతలు మొదలయ్యాయనే ప్రచారం జోరందుకుంది. అయితే,  బాలినేని  భార్యకు ఇచ్చినట్లుగానే, టికెట్  ఇవ్వని ఇతర ఎమ్మెల్యేల భార్య లేదా ఇతర కుటుబ సభ్యులకు అవకాశం కల్పిస్తారా? అనేది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అలాగే, సగం మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజాగ్రహం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈసారి మహిళలకు ఎక్కువ టికెట్లు ఇచ్చే అవకాశం లేక పోలేదనే ప్రచారం కూడా జరుగుతోంది.

కర్ణాటకలో హస్తానిదే హవా !

కర్ణాటక రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. మరో వంక అధికారం నిలుపుకునేందుకు బీజేపీ, చేజారిన అధికారాన్ని తిరిగి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ, హంగ్ మీద ఆశలతో జేడీఎస్ ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా తో పాటుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర నాయకులు, ఇప్పటికే ఒకటి రెండు మార్లు రాష్ట్రంలో పర్యటించారు.  కాంగ్రెస్ పార్టీలో  మాజీ ముఖ్యమంత్రి సిద్దామయ్య,  పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్’ వర్గాల మధ్య   అంతర్గత విభేదాలు ఇంకా ఒక కొలిక్కి రాక పోయినా  ఎవరికి వారుగా జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. మరో వంక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్వరాష్ట్రం కావడంతో ఆయన ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి వ్యూహ రచన చేస్తున్నారు. జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి  ఎన్నికలకు పార్టీని సిద్దం చేసే పనిలో పడ్డారు. అలాగే  బీజేపీ మాజీ నాయకుడు గాలి జనార్ధన్  రెడ్డి సొంత కుంపటి పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ భారాస కూడా ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అదలా ఉంటే ఎన్నికల ఫలితాలపై ఊహగానాలు, వ్యూహాగానాలతో పాటుగా  వివిధ సంస్థలు నిర్వహిస్తున్న ప్రీ పోల్ సర్వేల ఫలితాలు కర్ణాటకలోనే కాకుండా, తెలంగాణలోనూ ఆసక్తిని కల్గిస్తున్నాయి. కాగా ఇంత వరకు వచ్చిన అన్ని సర్వేలు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే  అధికార బీజేపీ అధికారం నిలబెట్టుకోవడం అయ్యే పని కాదని, ఈ సారి అధికారం  హస్తం పార్టీదేనని అంటున్నాయి.  కాగా తాజగా హైదరాబాద్ కు చెందిన ఎస్ఏఎస్ గ్రూప్ సర్వే కూడా హస్తనిదే అధికారమని అంటోంది. రానున్న కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోతుంది, కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎస్ఏఎస్ గ్రూప్ సర్వే అంచనా వేసింది. 224 స్థానాల్లో బీజేపీకి కేవలం 65 నుంచి 75 స్థానాలు మాత్రమే వస్తాయని తెలిపింది. కాంగ్రెస్‌కు 108 నుంచి 114 స్థానాలు, జేడీఎస్‌కు 24 నుంచి 34 స్థానాలు లభించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కర్ణాటకలోని ఐపీఎస్ఎస్ టీమ్‌తో కలిసి నవంబరు 20 నుంచి జనవరి 15 వరకు ఈ సర్వేను నిర్వహించినట్లు హైదరాబాద్‌కు చెందిన ఎస్ఏఎస్ గ్రూప్ ప్రకటించింది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం పెరుగుతుందని, బీజేపీ ఓట్ల శాతం తగ్గుతుందని వెల్లడైందని తెలిపింది. కాంగ్రెస్‌కు పడే ఓట్లు 38.14 శాతం నుంచి 40 శాతానికి, అంటే 1.86 శాతం పెరుగుతాయని తెలిపింది. బీజేపీకి పడే ఓట్లు 36.35 శాతం నుంచి 34 శాతానికి, అంటే 2.35 శాతం తగ్గుతుందని తెలిపింది. జేడీఎస్ కూడా 1.3 శాతం మేరకు ఓట్లను కోల్పోయే అవకాశం ఉన్నట్లు తెలిపింది. చిన్న పార్టీలు, స్వతంత్రులు ఏడు స్థానాలను దక్కించుకోవచ్చునని అంచనా వేసినట్లు పేర్కొంది. వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీల నుంచి కాంగ్రెస్‌ గరిష్ఠ మద్దతు పొందుతుందని ఈ సర్వే అంచనా వేసింది. ఒక్కళిగ కులస్థుల్లో 50 శాతం మంది జేడీఎస్‌ను బలపరిచే అవకాశం ఉందని, వీరిలో 38 శాతం మంది కాంగ్రెస్‌కు, 10 శాతం మంది బీజేపీకి మద్దతిచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కొప్పల్, గంగావతి, బళ్లారి, కోలార్, దావణగేరే, రాయ్‌చూరులలో అభ్యర్థుల గెలుపోటములపై గాలి జనార్దన రెడ్డి ఏర్పాటు చేసిన పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపిస్తుందని తెలిపింది. ఏఐఎంఐఎం పోటీ చేస్తే కేవలం ఆరు లేదా ఏడు నియోజకవర్గాల్లో మాత్రమే ప్రభావం చూపించగలదని అంచనా వేసింది. మరో వంక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి రాదని కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. అసెంబ్లీలోని 224 సీట్లకు కాంగ్రెస్ పార్టీ 130 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కోలార్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేసే విషయంపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని చెప్పారు. ఉడుపిలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'ప్రజా ధ్వని' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం కోస్టల్ కర్ణాటకను హిందుత్వ లేబొరేటరీగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. సమాజాన్ని విడగొట్టేందుకు హిందుత్వ పేరుతో అబద్ధాలను బీజేపీ వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. హిందూయిజం, హిందుత్వ అనేవి పూర్తిగా భిన్నమైనవని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మత ప్రసక్తి లేకుండా ప్రజలంతా కలిసిమెలసి ఆప్యాయానురాగాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని, బీజేపీకి అభివృద్ధి అంశాల కన్నా 'లవ్ జీవాద్' అశంపైనే మక్కువ ఎక్కువ అని ఆన్నారు. బీజేపీ అసలు రంగు ఏమిటో ప్రజలు గ్రహించాలని సూచించారు.

నాట్ టుడే.. అనదర్ డే.. సీబీఐ నోటీసులకు ఎంపీ అవినీష్ రెడ్డి జవాబు

వైసీపీ నేత, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అవినాష్ రెడ్డి మంగళవారం (జనవరి 24) హైదరాబాదులోని సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.  ఈ మేరకు సీబీఐ అధికారులు పులివెందులలో అవినాష్ రెడ్డి పీఏకు నోటీసులు అందజేశారు. అయితే మంగళవారం తనకు బిజీ షెడ్యూల్ ఉన్నందున విచారణకు మరో తేదీని విచారణకు నిర్ణయించాల్సిందిగా అవినాష్ రెడ్డి సీబీఐను కోరారు. అదలా ఉంటే.. వివేకా హత్య కేసు విచారణను ఏపీ నుంచి తెలంగాణకు కోర్టు ఆదేశాల మేరకు మార్చిన తరువాత సీబీఐ జోరు పెంచినట్లు కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారనీ,  ఏపీలో నిష్పక్షపాత విచారణ జరుగుతున్న నమ్మకం లేదని, కేసు విచారణ బయట రాష్ట్రాలకు బదిలీ చేయాలని వివేకా కుమార్తె  సునీతా రెడ్డి కోరగా, ఈ కేసు విచారిస్తున్న సీబీఐ కూడా సునీత చెప్పిన ప్రతి విషయం అక్షర సత్యమని సుప్రీం కోర్టుకు తెలియజేసిన సంగతి విదితమే.  దీంతో సుప్రీం కోర్టు వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు బదలీ చేసిన సంగతి విదితమే.   గత ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డి తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. తన పినతండ్రిని హత్య చేసిన వారికి శిక్షపడేలా చూడాల్సిన వ్యక్తి అయిన సీఎం జగన్ ఆ కేసులో నేరస్థులను కాపాడటానికి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో ప్రస్తుత సీఎం జగన్ విపక్ష నేతగా ఉన్నారు.  ఆ సమయంలో తొలుత తన బాబాయ్ గుండె పోటుతో మరణించారనీ, ఆ తరువాత అది గుండె పోటు కాదు.. గొడ్డలి పోటని బహిర్గతమైపోవడంతో అధికార పక్షమే ఆయన హత్యకు కారణమని.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపైనే నేరుగా ఆరోపణలు చేశారు. ఈ హత్యపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సరే తరువాత ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు అందుకున్న తరువాత వివేకా హత్య కేసులో సిబీఐ దర్యాప్తు అవసరం లేదని ప్రభుత్వం కోర్టుకు చెప్పడం గమనార్హం. అసలు వివేకా హత్య జరిగిన క్షణం నుంచీ ఆ కేసును పక్కదారి పట్టించే యత్నాలు, సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నాలు జరిగాయి. రక్తపు మరకలను కడిగి వేయడం.. గుండె పోటు అంటూ  పదే పదే చెప్పడం దగ్గర నుంచి.. అప్పటి ముఖ్యమంత్రే ఈ హత్య చేయించారంటూ ప్రచారం చేయడం ఆరోపణలు గుప్పించడం వరకూ ఈ కేసులో అసలు దోషులను కప్పిపుచ్చే యత్నాలే జరిగాయి.. జరుగుతూ వచ్చాయి. సరే వివేకా కుమార్తె తన తండ్రి హంతకులకు శిక్ష పడాలన్న పట్టుదలతో చేసిన న్యాయపోరాటం ఫలితంగా ఈ కేసును సీబీఐ టేకప్ చేసింది. అయినా కూడా సీబీఐ దర్యాప్తునకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. ఈ కేసులో సాక్షులు అను మానాస్పదస్థితిలో  మరణించడం, అప్రూవర్ గా మారిన  దస్తగిరి ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఎస్పీని ఆశ్రయించడం, కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే దాడి యత్నాలు జరగడం, సాక్షాత్తూ సీబీఐ అధికారులపైనే కేసులు నమోదు కావడం వరకూ ఈ కేసును మసిపూసి మారేడుకాయ చేయడం కోసం జరగని ప్రయత్నం లేదు. చివరకు ఏపీలో అయితే ఈ కేసు విచారణ సజావుగా సాగే అవకాశం లేదంటూ సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  ఈ పిటిషన్ విచారించిన సుప్రీం కోర్టు కూడా  ఎపి పోలీసు మీద నమ్మకం లేనద్న భావన వ్యక్తం చేసింది. అందుకే కేసు విచారణ ఏపీ బయట జరగాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడి తెలంగాణకు బదలీ చేసింది.    

ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఔట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను బదిలీ చేసింది. డీజీ హోదాలో ఉన్న ఆయనకు మరో పోస్టింగ్‌ కూడా ఇవ్వకుండా... జీఏడీలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా ఆదేశించింది. సునీల్ కుమార్ స్థానంలో ప్రస్తుతం ఫైర్ సర్వీసెస్ డీజీగా సంజయ్ కుమార్  నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  1996 బ్యాచ్ కు చెందిన సంజయ్ ను ఏపీ సీఐడీ చీఫ్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది.  జగన్ సర్కార్ ఏర్పడినప్పటి నుండి సీఐడీ చీఫ్ గా సునీల్ కుమార్   ఉన్నారు. ఆయన హయాంలో.. సీఐడీ ఒక  ప్రైవేటు సైన్యంలా, విపక్ష నేతలను వేధించడం కోసమే పని చేసిందన్న  ఆరోపణలు వచ్చాయి. రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టడమే ఏపీ సీఐడి పనిగా పెట్టుకుందని, అందుకోసమే  పని చేస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సీఐడీ చీఫ్   సునీల్ కుమార్ పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి.    సునీల్ కుమార్ కు డీజీగా పదోన్నతి వచ్చి నిండా నెలరోజులు కూడా కాలేదు. అంతలోనే హఠాత్తుగా ఆయనపై బదిలీ వేటు పడింది. అంతే కాదు డీజీ స్థాయిలో ఉన్న సునీల్ కుమార్ కు పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.   1995లో పులివెందుల ఏఎస్పీగా తన కెరీర్ ను ప్రారంభించిన సునీల్, జగన్ సర్కార్ ఏర్పడిన తరువాత ఏడీజీ హోదాలో సీఐడీ చీఫ్ గా ఉన్నారు. ఏపీ సర్కార్  జనవరి 1న ఆయనకు డీజీ ర్యాంకు ప్రమోట్ చేసింది . వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు విజయ్ సహా పలు కేసులలో సీఐడీ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయిన దానికీ, కాని దానికీ విపక్ష నేతలపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడానికే సీఐడీ పని చేస్తోందా అన్నట్లుగా సునీల్ ఆధ్వర్యంలో సీఐడీ పని చేసిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ విపక్షాలను వేధించడం కోసమే అన్నట్లుగా సీఐడీ వ్యవహరించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. సీఐడీ చీఫ్ గా సునీల్ వ్యవహార శైలిపై కేంద్రానికి పలు ఫిర్యాదులు అందాయి. అయినా జగన్ సర్కార్ పట్టించుకోలేదు.. సరికదా ప్రొత్సహించింది. అలాంటిది ఏపీ సీఐడీ చీఫ్ గా ఆయనను హఠాత్తుగా బదిలీ చేసి, ఎక్కడా పోస్టింగ్ కూడా ఇవ్వకపోవడం విస్మయం గొలుపుతోంది. దీని వెనుక ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుందన్న చర్చ జరుగుతోంది.

సీట్ల సర్దుబాటుపైనే ఇప్పుడు దృష్టంతా?

జనసేన   తెలుగుదేశం  పొత్తు పై ఇక ఇప్పుడెవరికీ ఎటువంటి అనుమానాలూ లేవు. జనసేన సీనియర్ నేత, పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు కూడా పొత్తు ఉంటుంది. సీట్ల సర్దుబాటుపై పార్టీ అధినేత పవన్ నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేశారు.  వైసీపీని  గద్దె దించాలంటే పొత్తులు తప్పవని ఇటీవల రణస్థలంలో జరిగిన యువగళం సభలో పవన్ కల్యాణ్ స్పష్టత ఇవ్వడం, ఆ తరువాత సీట్ల సర్దుబాటుపై నాగబాబు సంకేతాలివ్వడంతో  ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా  ఇరు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటుపైనే చర్చ సాగుతోంది.  ఎపిలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 40-50 స్థానాలపై జనసేన డిమాండ్   చేస్తున్నట్లుగా ఇరు పార్టీలలోనూ చర్చ అయితే జరుగుతోంది. కానీ చివరకు పాతిక సీట్లతో జనసేన సరిపెట్టుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ  వర్గాలు అంచనా వేస్తున్నాయి.  ఆ సీట్లన్నీ కూడా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఇంకా సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల నుంచీ ఎటువంటి ప్రకటనా రాకముందే.. తెలుగువన్  ఈ నెల 5వ తేదీనే జనసేన- తెలుగుదేశం పొత్తు ఖరారు.. సీట్ల సర్దుబాటు కొలిక్కి అన్న శీర్షికన ప్రత్యేక కథనంలో పేర్కొంది. పొత్తులో జనసేన పార్టీకి ఏడు జిల్లాల పరిధిలో 20 సీట్లు కేటాయించేందుకు తెలుగుదేశం అంగీకరించిందనీ, ఈ మేరకు ఇరు పార్టీల మధ్యా అవగాహన కూడా కుదిరిందనీ ఆ కథనం లో వెల్లడించింది. ఇప్పుడు సీట్ల సర్దుబాటుపై జనసేనాని నిర్ణయం తీసుకుంటారని ప్రకటించడమే కాకుండా.. ఎవరూ ఫలానా స్థానం నుంచి పోటీ చేస్తామంటూ ప్రకటనలు చేయవద్దని పార్టీ నేతలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జనసేన తెలుగుదేశంతో సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే చర్చలు ప్రారంభించిందని తేటతెల్లమైపోయింది.  తెలుగువన్ చెప్పినట్లు ఏడు జిల్లాల్లో సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహన ఇరు పార్టీల మధ్యా కుదిరిందన్న చర్చ కూడా రాజకీయ వర్గాలలో ఆరంభమైంది. ఇవి కాక మరి కొన్ని స్థానాల విషయంలో ప్రతిష్ఠంభన కొనసాగుతోందని అంటున్నారు. ఇప్పటి వరకూ  గుంటూరు, కృష్ణ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, చిత్తూరు,కర్నూలు జిల్లాలలో సీట్ల సర్దుబాటు విషయంలో ఒక అవగాహన ఇరు పార్టీల మధ్యా కుదిరిందని చెబుతున్నారు. విజయనగరం, అనంతపురం జిల్లాల విషయంలో చర్చలు సాగుతున్నాయంటున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు  గుంటూరు జిల్లాలో తెనాలి, సత్తెన పల్లి, కృష్ణా జిల్లాలో పెడన, కైకలూరు, విజయవాడ వెస్ట్, తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం, పి. గన్నవరం, రాజోలు, రాజానగరం, కాకినాడ రూరల్ నియోజకవర్గాలలోనూ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, నరసాపురం, తాడేపల్ల్లిగూడెం, పాలకొల్లు నియోజకవర్గాలలోనూ జనసేన అభ్యర్థులు రంగంలో ఉంటారు. ఇక విశాఖ జిల్లాలో పెందుర్తి, భీమిలి, గాజువాక, చోడవరం నియోజకవర్గాలలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు లేదా తిరుపతిలో పొత్తలో భాగంగా జనసేన పోటీ చేస్తుంది.  ప్రకాశం జిల్లా లోని దర్శి, గిద్దలూరు స్థానాలను తెలుగుదేశం జనసేనకు కేటాయించింది.   ఏతా వాతా ఈ పొత్తు  కారణంగా జనసేన, తెలుగుదేశం కూడా అనివార్యంగా కొన్ని త్యాగాలకు సిద్ధపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో కొన్ని స్థానాలను తెలుగుదేశం జనసేనకు కేటాయించడం అంటే.. ఆయా స్థానాలలో ఇంత కాలం అధికార వైసీపీ వేధింపులను తట్టుకుని నిలబడిన కొందరు నాయకులు తమతమ స్థానాలను త్యాగం చేయాల్సి ఉంటుంది.  అలాగే మిగిలిన స్ధానాల జనసేన త్యాగం చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద తెలుగుదేశం అధినేత ఇప్పటికే ఓ పాతిక స్థానాలను జనసేనకు కేటాయించడానికి ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇందుకు 2019 ఎన్నికల ఫలితాలను బేస్ గా చేసుకున్నారని అంటున్నారు.  ప్రభుత్వ వ్యతిరేక వోటు చీలకుండా ఉండాలంటే.. జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు అవసరం.  ఇరు పార్టీలకూ కూడా అది అవసరం.   అందుకే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల మార్పుపై జరుగుతున్న చర్చలో బీజేపీ ప్రస్తావన ఎక్కడా రావడం లేదు.అందుకే వచ్చే ఎన్నికల నాటికి బిజెపి, జనసేన మధ్య మైత్రీ బంధం తెగిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి

కుప్పం నుంచి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ఈ నెల 27న ప్రారంభం కానున్నది. ఆయన పాదయాత్రకు నాన్చి నాచ్చి ఎట్ట కేలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  నిబంధనలకు లోబడి పాదయాత్ర సాగాలని షరతు విధించింది.  అలాగే  పాదయాత్రలో ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలూ చేయరాదని కండీషన్ పెట్టింది.   తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. రాష్ట్రంలో ఉత్కంఠభరిత వాతావరణం చిక్కన అవుతోంది. ఆయన పాదయాత్రకు అనుమతి విషయంలో పోలీసులు అనుసరిస్తున్న విధానం తెలుగుదేశం శ్రేణులను రెచ్చగొట్టే విధంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాదయాత్ర ప్రారంభానికి ముందే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించే విధంగా పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లోకేష్ పాదయాత్ర ఈ నెల 27 నుంచి శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పాదయాత్రను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం యాత్రకు అన్ని ఏర్పాట్లూ చేసింది. కుప్పం నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్రకు నారా, నందమూరి కుటుంబ సభ్యులతో పాటు.. ఎన్టీఆర్ కుటుంబీకులు అంతా హాజరయ్యేం  అవకాశం ఉంది.   మొత్తం రాష్ట్రం  దృష్టి అంతా లోకేష్ పాదయాత్రపైనే ఉంది.  అందుకే పాదయాత్రకు అనుమతి విషయంలో పోలీసుల వైఖరి పట్ల సర్వత్రా అసహనం వ్యక్తం అవుతోంది. కావాలనే అనుమతి విషయం తేల్చకుండా పోలీసులు తాత్సారం చేయడంపై తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తెలుగుదేశం సీనియర్ నాయకుడు వర్ల రామయ్య లేఖకు డీజీపీ స్పందించిన తీరును రాజకీయాలకు అతీతంగా అందరూ తప్పు పడుతున్నారు. ఇప్పటికే అసందర్భం, అనుచితం అయిన జీవో 1తో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన జగన్ ప్రభుత్వం.. పోలీసుల ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదనడానికి వర్ల లేఖకు డీజీపీ స్పందనే నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. లోకేష్ ప్రజలలో చైతన్యం తీసుకువచ్చేందుకు, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు చేస్తున్న పాదయాత్ర ఒక  ప్రాంతానికో, నియోజకవర్గానికో పరిమితమైనది కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన 400 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలూ కవర్ అయ్యేలా 4000 కిలోమీటర్ల మేర సాగనుంది. ఈ యాత్రలో ఆయనను అన్ని వర్గాల ప్రజలనూ కలుస్తారు. తనను కలవడానికి వచ్చే ప్రజలందరితోనూ మాట్లాడుతారు. ఇందుకు ఆంక్షలు విధించడానికి ప్రభుత్వానికి ఉన్న అధికారం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం ఒక అగ్నిగోళంగా తయారైంది. పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తే రాష్ట్రంలో జనం స్వచ్ఛందంగా బయటకు వచ్చి ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి నిరసనగా ఆందోళనలకు దిగే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అలాగే పాదయాత్రకు అనుమతి ఇవ్వకుంటే కోర్టును ఆశ్రయించడానికీ,  చట్ట పరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంలో కూడా తెలుగుదేశం స్పష్టమైన అవగాహనతో ఉందని అంటున్నారు. గతంలో అంటే విపక్ష నేతగా జగన్ రాష్ట్రంలో పాదయాత్ర చేసిన సందర్బంగా ఎటువంటి అనుమతులూ లేకపోయినా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం యాత్రకు పూర్తి భద్రత కల్పించిన సంగతిని ఈ సందర్భంగా తెలుగుదేశం గుర్తు చేస్తున్నది. ఈ పరిణామాలన్నీ గమనించిన సర్కార్ ఎట్టకేలకు లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కింద పడ్డా మాదే పై చేయి అని చెప్పుకునేందుకు, రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేయరాదనీ, నిబంధనలను మీరరాదనీ షరతులు విధించింది. దీనిపై తెలుగుదేశం శ్రేణులు జోకులు పేల్చుతున్నాయి. ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద కాల్చాలి అని గతంలో విపక్ష నేతగా జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ అవి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కావా అని ప్రశ్నిస్తున్నాయి. సంయమనంతో అంశాల వారీగా విశ్లేషణాత్మక విమర్శలు లోకేష్ తన పాదయాత్ర సందర్భంగా చేస్తారనీ, అవి రెచ్చగొట్టేవిగా ఉండవనీ, జగన్ దుష్టపాలనను ప్రజలకు అవగతమయ్యేలా వివరణాత్మకంగా ఉంటాయనీ చెబుతున్నారు. లోకేష్ పాదయాత్ర శాంతియుతంగా క్రమశిక్షణతో జరుగుతుందనీ, రెచ్చగొట్టే చర్యలూ, వ్యాఖ్యలకు పాల్పడకుండా పోలీసులు వైసీపీ గూండాలనే నియంత్రించాల్సి ఉంటుందని చెబుతున్నాయి. 

టీటీడీ అనుమతితోనే తిరుమలపై డ్రోన్ సర్వే: అంగీకరించిన ఈవో ధర్మారెడ్డి

తిరుమత పవిత్రత, భద్రత విషయంలో టీటీడీకి ఇసుమంతైనా చిత్త శుద్ధి లేదన్న విషయం మరోసారి తేటతెల్లమైంది.  నోఫ్లై జోన్ అయిన తిరుమల కొండపై డ్రోన్ సర్వేకు సాక్షాత్తూ తిరుమల తిరుపతి దేవస్ధానమే అనుమతి ఇచ్చిందని తేలడంతో సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. తిరుమలలో డ్రోన్ సర్వేకు అనుమతి ఇచ్చింది సాక్షాత్తూ తిరుమల తిరుపతి దేవస్థానమేనని స్వయంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి అంగీకరించారు.   తిరమలపై డ్రోన్ సర్వేకు ఐఓసీకి అనుమతి ఇచ్చిన మాట వాస్తవమేనని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెబుతూ అయితే  తాము అన్నదానం నుంచి డంపింగ్ యార్డ్ వరకూ మాత్రమే డ్రోన్ సర్వేకు అనుమతి ఇచ్చామని,   టీటీడీలో భద్రతకు ఎక్కడా రాజీ పడటంలేదని.. టీటీడీకి హై సెక్యూరీటీ వ్యవ‌స్థ ఉందన్నారు. అయితే డ్రోన్ ఆపరేటర్ అత్యుత్సాహంతో అనుమతించిన పరిధి దాటి చిత్రీకరణ జరిపారని చెప్పారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాుకండా  తిరుమలకు యాంటీ డ్రోన్ టెక్నాలజీని త్వరలో తీసుకొస్తున్నామన్నారు. అయితే డ్రోన్ ద్వారా చిత్రీకరించారంటూ  సామాజిక మాధ్యమంలో వైరల్ అయనవి నిజమైనవేనా ఫేకా అన్నది తేలాలని ఈవో ధర్మారెడ్డి సమర్ధించుకోజూశారు. అలా కాకుండా అనుమతించిన మేర కాకుండా అత్యుత్సాహంతో పరిధి దాటి వీడియోలు తీసినట్లు తేలితే డ్రోన్ ఆపరేటర్ పై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే  డ్రోన్‌తో శ్రీవారి ఆలయం చిత్రికరణపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.  యూట్యూబ్‌లో ఉన్న వీడియోను తొలగించామన్నారు.    ‘నో ఫ్లై జోన్’గా ఉన్న తిరుమల కొండపై  డ్రోన్ వీడియో వైరల్ అయిన సంగతి విదితమే.   ఇక టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అయితే డ్రోన్తో తిరుమల ఆలయాన్ని చిత్రించే అవకాశమే లేదని  చెప్పారు పాత చిత్రంతో యానిమేట్‌  చేశారని విచారణకు ముందే నిర్ధారించేశారు.    

సోమేష్ రెడీ అయిపోయారు.. కారణమేంటి?

సోమేష్ కుమార్ నిన్న మొన్నటి వరకూ తెలంగాణ ప్రభుత్వ సీఎస్. విభజన సమయంలో ఆయనను ఆంధ్రాకు కేటాయించినా సోమేష్ కుమార్ మాత్రం ససేమిరా ఏపీకి వెళ్లేది లేదంటూ క్యాట్ ను ఆశ్రయించి తెలంగాణలోనే కొనసాగుతూ వచ్చారు. అయితే చివరాఖరకు కోర్టు తీర్పుతో ఆయన అనివార్యంగా ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఆయన ఏపీలో రిపోర్ట్ చేసి ఆ తరువాత పదవీ విరమణ చేస్తారనీ, బీఆర్ఎస్ లో చేరుతారనీ, లేదా తెలంగాణ ప్రభుత్వమే ఆయనను ఏదో ఒక సలహాదారు పదవిలో అకామిడేట్ చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. అయితే అందరి అంచనాలు, ఊహలకు భిన్నంగా సోమేష్ కుమార్ ఏపీలో సెటిల్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక విధంగా ఇది ఆశ్చర్యకర పరిణామమే. ఏపీలో పని చేయనని భీష్మించుకు కూర్చున్న సోమేష్ కుమార్ కోర్టు తీర్పుతో అనివార్యంగా ఏపీ వెళ్లినా అక్కడి జగన్ ప్రభుత్వం ఆయనను కీలక పోస్టులోనే నియమించడానికి సుముఖత వ్యక్తం చేయడం కూడా ఆశ్చర్యమే. ఏది ఏమైనా సోమేష్ కుమార్ ఏపీలోన సెటిల్ కావడానికే నిర్ణయించుకున్నారు. ఏపీ సర్కార్ కూడా ఆయనకు పోస్టింగ్ ఇచ్చేందుకు నిర్ణయించుకుంది. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక బీఆర్ఎస్ ఏపీలో కాలూనడం ప్రధాన కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పైకి ఎలా ఉన్నా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య ఉన్న స్నేహ సంబంధాలు అందరికీ తెలిసిందే. కేసీఆర్ బీఆర్ ప్రకటించగానే.. వైసీపీ ప్రభుత్వ ముఖ్య  సలహాదారు ఆ పార్టీకి ఏపీలో రెడ్ కార్పెట్ అంటూ ఆహ్వానం పలికారు. ఆ తరువాతే.. జాయినై కోర్టు తీర్పును సుప్రీంలో   సవాల్ చేసే అవకాశం ఉన్నా సోమేష్ ఆ ఆప్షన్ ఎంచుకోకుండా ఏపీలో తన కంటే జూనియర్ అయిన అధికారికి రిపోర్టు చేయడమే కాకుండా  పోస్టు చిన్నాదా పెద్దదా అనే ఆలోచన లేకుండా ఏ పొజిషిన్ ఇచ్చినా అభ్యంతరం లేదని చెప్పడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  ఈ ఏడాది డిసెంబర్‌ లో సోమేష్ కుమార్ పదవీ విరమణ చేయనున్నారు.  ఇప్పటి వరకూ సోమేష్ కుమార్ కు ఫలానా పోస్టు అంటూ ఏపీ సర్కార్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయకపోయినా.. నేడో రేపో ఏదో ఒక కీలక పోస్టింగ్ ఇవ్వనున్నట్లు ఏపీ అధికార వర్గాలు చెబుతున్నాయి. 

యాత్రను అడ్డుకునే కుట్ర.. డీజీపీ లేఖే సాక్ష్యం!

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం ఇక రోజుల్లోకి వచ్చేసింది. 400 రోజుల పాటు సాగే ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా 4000 కిలోమీటర్లు సాగనుంది. ఇంతటి భారీ స్థాయిలో జరిగే యాత్రకు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే యాత్రకు అనుమతి విషయంలో ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచీ, పోలీసుల నుంచీ ఎటువంటి స్పందనా లేదు. తెలుగుదేశం సీనియర్ నాయకుడు రాష్ట్ర డీజీపీకి రాసిన రిమైండర్ లేఖపై స్పందించిన డీజీపీ అనుమతి ఇవ్వడానికి ముందు ఈ వివరాలు కావాలంటూ రాసిన లేఖలో ఆ వివరాలకు సంబంధించి కొండవీటి చాంతాడంత చిట్టా పొందుపరిచారు. ఆ చిట్టా చూస్తే నారా లోకేష్ యాత్ర విషయంలో జగన్ సర్కార్ ఆడుతున్న తొండాట ఏమిటన్నది స్పష్టంగా తేలిపోతుంది. పొమ్మన లేక పొగపెడుతున్న చందంగా.. అనుమతి ఇవ్వడం ఇష్టం లేక వివరాల పేరుతో యాత్రను అడ్డుకోవడమే లక్ష్యంగా సర్కార్ వ్యూహ రచన చేసినట్లు అవగతమౌతోంది. దీంతో తెలుగుదేశం అప్రమత్తమైంది. డీజీపీ అడిగిన వివరాలు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అంతే కాకుండా నాడు గాంధీ పాదయాత్ర నుంచి రాహుల్ గాంధీ జోడో యాత్ర వరకూ పాదయాత్రల వివరాలను పొందు పరిచింది. జగన్ పాదయాత్రకు అసలు ప్రభుత్వం నుంచి అనుమతే తీసుకోలేదన్న విషయాన్నీ ప్రస్తావించింది. ఇన్నీ ప్రస్తావించి అసలు పాదయాత్రకు డీజీపీ అనుమతి ఇవ్వాల్సిన అవసరమే లేదని తేల్చేసింది. సమాచారం ఇచ్చామనీ, ఇక నిర్ణయించుకోవలసింది.. ప్రభుత్వం, పోలీసులేనని తెలుగుదేశం స్పష్టం చేసింది. అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా ఒక ప్రభంజనంలా యాత్ర సాగి తీరుతుందని స్పష్టం చేసింది.   లోకేష్ యువగళం యాత్రకు అనుమతి కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య ఇప్పటికే డీజీపీతో పాటుగా హోం శాఖ కార్యదర్శికి లేఖలు పంపారు. ఆ తరువాత హార్డ్ కాపీలను అందించారు. చిత్తూరు జిల్లా అధికారులకు లేఖలు రాసారు. సమయం సమీపిస్తుండటంతో మరోసారి అనుమతి పైన టీడీపీ నేత లేఖ పంపారు. దీని పైన డీజీపీ  జిల్లాల వారీగా పాదయాత్ర సాగే రూట్ మ్యాప్ ఇవ్వాలని  కోరారు. యాత్రలో పొల్గొనే వారితో పాటు వాహనాలు వివరాలు.. స్థానికంగా బాధ్యత తీసుకొనే వారి సమాచారం పంపాలని వర్లకు రాసిన లేఖలో డీజీపీ కోరారు.   ఆదివారం డీజీపీ కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరై లేదా లిఖిత పూర్వకంగా వివరాలు సమర్పించాలని పేర్కొన్నారు.   లోకేష్ యాత్రకు అనుమతి కోరుతూ తాము రాసిన లేఖపైన డీజీపీ స్పందనకు సమాధానంగా వర్ల రామయ్య పలు ప్రశ్నలు సంధించారు. గతంలో పాదయాత్రలు చేసిన వారిని ఎవరినైనా ఇవన్నీ అడిగారా అని ప్రశ్నిస్తూ వెంటనే టీడీపీ మరో లేఖ రాసింది. అందులో గాంధీ చేసిన యాత్ర నుంచి ప్రతిపక్ష నేతగా జగన్ నిర్వహించిన పాదయాత్ర వరకు అన్ని అంశాలను ప్రస్తావించింది. తాజాగా డీజీపీ కోరిన వివరాలను అప్పట్లో వీరిని ఎవరూ అడగలేదని లేఖలో పేర్కొంది. ఇటీవల రాహుల్‌ గాంధీ ఏపీలో కూడా కొంత దూరం పాదయాత్ర చేసిన విషయాన్ని లేఖలో ప్రస్తావించింది. తాత్కాలిక ప్రణాళిక ప్రకారం ఈ యాత్ర కుప్పంలో ప్రారంభమై 125అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఇచ్ఛాపురం చేరుతుందని లేఖలో పేర్కొంది. తాము ఇచ్చిన రూట్‌ మ్యాప్‌ ఆధారంగా స్థానిక పోలీస్‌ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పేర్కొంది.  జగన్ పాదయాత్ర సందర్భంగా అప్పట్లో ఎటువంటి వివరాలు ఇవ్వలేదని టీడీపీ డీజీపీకి రాసిన లేఖలో పేర్కొంది. జగన్ పాదయాత్ర సందర్భంగా  వైసీపీ అప్పటి ప్రభుత్వానికి  రాసిన లేఖను టీడీపీ బయట పెట్టింది.  ఇప్పుడు డీజీపీ అడుగుతున్న వివరాలేవీ అప్పుడు జగన్‌ ఇవ్వకపోయినా ఆయన పాదయాత్రకు తాము అనుమతి ఇవ్వడంతో పాటు భద్రత కల్పించామని టీడీపీ వెల్లడించింది.  ఆంక్షలు, అనుమతుల పేరిట ప్రభుత్వం చేస్తున్న కుట్రలన్నిటినీ ఛేదించుకుని లోకేష్ పాదయాత్ర కొనసాగి తీరుతుందని తెలుగుదేశం శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. 

వైనాట్ 175 కాదు.. కనీసం కడపలో టెన్ ఔటాఫ్ టెన్ అయినా సాధ్యమా?

రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయా? ఆది నుంచీ బలంగా ఉన్న రాయల సీమలో సైతం వైసీపీ పునాదులు కదులుతున్నాయా? అంటే విపక్షం ఔననే అంటేందు. సర్వేలూ పరిస్థితి అలానే ఉందని చెబుతున్నాయి. సీమకు చెందిన కొందరు వైసీసీ నేతలు సైతం జగన్ ఆటలు ఇంక సీమలో సాగే అవకాశాలు అంతంత మాత్రమే అంటున్నరు.   ఇదే మాట తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తరచూ చెబుతున్నారు. నిజంగానే సీమలో వైసీపీకి ప్రతికూల వాతావరణం ఉందా అంటే తాజాగా  మాజీ మంత్రి, కపడ జిల్లా కమలాపురం  వాసి వీరశివారెడ్డి కూడా ఔననే అంటున్నారు.  వైసీపీ మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావడం అసాధ్యమని కుండబద్దలు కొట్టడమే కాదు.. రాయలసీమలోనూ, జగన్ సొంత జిల్లా అయిన కడపలోనూ ఆ పార్టీకి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని చెబుతున్నారు. వీర శివారెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శిష్యుడిగా రాజకీయాలలో ప్రవేశించారు. మధ్యలో తెలుగుదేశం పార్టీలో చేరినా.. 2019లో ఆయన వైసీపీకి గట్టి మద్దతుగా నిలిచారు.  ఇప్పుడు ఆయనే వైసీపీ పనైపోయిందని చెబుతున్నారు. ఆయనే కాదు.. సొంత పార్టీ అని కూడా చూడకుండా డీఎల్ రవీంద్రారెడ్డి కూడా  జగన్ పనైపోయిందనీ, జనం ఆయనకు ఇచ్చిన ఒక్క చాన్స్ దుర్వినియోగం అయ్యిందనీ, మరో చాన్స్ అవకాశమే లేదని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఈ ఇరువురూ కూడా సీమలో చెప్పుకోదగ్గ బలం, పలుకుబడి ఉన్న నాయకులే. ఇరువురూ మాజీ మంత్రులే. వీరే కాకుండా పలువురు మాజీ ఎమ్మెల్యేలు.. అదీ రాయలసీమకు చెందిన వారే జగన్ పార్టీకి ఇక సీమలో కూడా చుక్కలే కనిపిస్తాయని చెబుతున్నారు. వీళ్లందరూ కూడా సైకిలెక్కే ఉద్దేశంతోనే వైసీపీ వ్యతిరేక గళం వినిపిస్తున్నారని అధికార పార్టీ లైట్ గా తీసుకుంటోంది. అయితే వీరే కాకుండా రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి కూడా తెలుగుదేశం పలుకులే పలుకుతున్నారు. అంటే ఇప్పటికే సీఎం సొంత జిల్లా అయిన కడపలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో అధికార పార్టీ నాయకులు జగన్ విజయం అసాధ్యమన్న రీతిలో ప్రకటనలు చేస్తున్నారు.   2019 ఎన్నికలలో కడప జిల్లాలో పది పది అసెంబ్లీ నియోజకవ్గాలలోనూ విజయం సాధించిన వైసీపీకి ఇప్పుడు నాటి హవా కొనసాగించడం అసాధ్యమనే పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలోనూ ఈ సారి జగన్ కు గట్టి పోటీ ఎదురు కావడం ఖాయమని అంటున్నారు. వైఎస్ వివేకా హత్య, ఆయన కుటుంబాన్ని జగన్ దూరం పెట్టడం, వివేకా హత్య కేసులో అనుమానితులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు నియోజకవర్గంలో జగన్ పట్ల వ్యతిరేకతను పెంచాయని అంటున్నారు.   సీమలోనే వైసీపీకి వ్యతిరేక సెగలు ఉన్నాయంటే.. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలలో ఆ పార్టీ మరింత గడ్డపరిస్థితిని ఎదుర్కొంటుందనడంలో సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు. 

లోకేష్.. దారి రహదారి

ఎవరైనా విజయం సాధించాలంటే కష్టపడాల్సిందే. తండ్రి వారసత్వమనో.. మరోటనో అడ్డదారిలో అందలాలు ఎక్కినా.. అక్కడ నిలవాలంటే టాలెంట్ ఉండాల్సిందే. లేకుంటే అడ్డదారుల్లో ఎంత ఎత్తు ఎదిగినా.. అక్కడ నుంచి పడితే మళ్లీ లేవడం అసాధ్యం. లేవలేరు.. లేద్దామనుకున్నా జనం లేవనీయరు. తొక్కేస్తారు. పాతేస్తారు. మనకు సినీ, రాజకీయ రంగాలలో అలా టాలెంట్ లేకుండా నెపోటిజంతొ అగ్రస్థానానికి చేరుకున్నా.. అక్కడ నుంచి కింద పడ్డాకా వారిని గుర్తు పెట్టుకునే వారు కూడా ఉండరు. ఎవరికైనా వారసత్వమనేది.. తొలి అడుగుకే పనికి వస్తుంది. ఆ తరువాత ఎవరైనా సరే సొంత కాళ్ల మీద నిలబడాని.. సొంత బాట పరచుకోవాలి. సొంత నడక నడవాలి. అయితే.. అలా తొలి అడుగు కూడా వేయకుండానే దారుణంగా ట్రోలింగ్ కు గురైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే.. అది తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మాత్రమే. ఆయన  రాజకీయాలలో తొలి అడుగు వేడయానికి ముందే ఆయనపై వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా దాడి ఆరంభమైంది. ఆయన ప్రతిభను పట్టించుకోకుండా ఆయన ఆహార్యం, ఆహారం లక్ష్యంగా ఎదుగుదలను అడ్డుకోవడమే ధ్యేయంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీలు బ్యాక్ స్టాబింగ్ అనదగ్గ స్థాయిలో విమర్శల దాడి చేశాయి. పప్పు అన్నాయి.   ఉన్నత విద్యావంతడైన లోకేష్.. సమాజంలో మార్పునకు, బడుగులకు ప్రయోజనం చేకూర్చే విధానాలకు పార్టీని వేదిక చేశారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా పార్టీ పటిష్టతకు కార్యకర్తలకు భరోసా కల్పించాల్సిన అవసరాన్ని గుర్తెరిగారు. పార్టీ కార్యకర్తలకు బీమా కల్పించిన మొట్టమొదటి  పార్టీ భారత దేశంలో బహుశా తెలుగేదేశం పార్టీయే. ఆ ఆలోచన లేకేష్ దే. ఆ విషయాన్ని ఏ పార్టీ కార్యకర్తను అడిగినా చెబుతారు.  ఇక పార్టీల ప్రభుత్వాలూ ఇప్పడు అమలు చేస్తున్న నగదు బదలీ (క్యాష్ ట్రాన్స్ఫర్) పథకం లోకేష్ బ్రెయిన్ చైల్డే. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రత్యర్థులు ఆయనలోన ప్రతిభను ప్రపంచానికి తెలియకుండా చేయడమే లక్ష్యంగా ఆరంభం నుంచే విమర్శలతో, ఎగతాళి చేయడంతో, ట్రోలింగ్ కు గురి చేయడంతో ఆయన ఇమేజ్ పై దెబ్బకొట్టే వ్యూహంతో పని చేశారు. సామాజిక మాధ్యమాన్ని ఇందుకు వేదికగా వాడుకున్నారు. అయితే ఈ కుట్రల్నీ, కుతంత్రాల్నీ లోకేష్ సమర్ధంగా ఎదుర్కొన్నారు. సంయమనం కోల్పోకుండా కూల్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవడమే ధ్యేయంగా కదిలారు. ఇప్పుడు ఆయన తిరుగులేని నేతగా ఎదిగారు. అందుకు ఆయన యువగళం పేర పాదయాత్ర సాగుతున్నారంటే.. అధికార పార్టీలో కనిపిస్తున్నవణుకే నిదర్శనం. టీడీపీకి పునర్వైభవం ఆయన అడుగులతోనే సాధ్యమౌతుందని తెలుగుదేశం శ్రేణులు విశ్వసిస్తున్నాయి. అధికార పార్టీ కూడా అందుకే భయపడుతోంది. కార్యకర్తలతో పర్సనల్ గా టచ్ లో ఉండటం.. వైసీపీ నేతల విమర్శలకు దీటుగా బదులివ్వడం, సామాజిక మాధ్యమంలో చురుకుగా ఉండటం లోకేష్ తనను తాను నాయకుడిగా మలచుకోవడంలో అనుసరించిన విధానాలు. రాజకీయ అరంగేట్రం నుంచి లోకేష్ పై ఒక పద్ధతి ప్రకారం, వ్యూహాత్మకంగా జరిగిన వ్యక్తిత్వ హనన దాడి కారణంగా తొలి నాళ్లలో ఏర్పడిన ఇమేజ్ ను లోకేష్ సమర్ధంగా పటాపంచలు చేశారు. సంపూర్ణ నాయకుడిగా, సొంత వ్యక్తిత్వంతో ఎదిగారు. తన నాయకత్వంపై ప్రజలలో నమ్మకం కలిగించారు.   ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు.  ప్రజలు ఆయన మాటలు వినడానికి తహతహలాడుతున్నారు. లోకేష్ పై గతంలోలా లోకేష్ పై విమర్శలు చేయాలంటే ప్రత్యర్థులు ఒకటికి రెండు సార్లు కాదు వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు నెలకొంది. లోకేష్ పాదయాత్ర తమ కాళ్ల కింద భూమిని కదిలించేస్తుందన్న భయం అధికార పార్టీలో నెలకొని ఉంది. ఇదే లోకేష్ విజయం. ముందు ముందు మరిన్ని విజయాలకు ఇదే ఆరంభం. ఆల్ ది బెస్ట్.. అండ్ హ్యాపీ బర్త్ డే లీడర్ లోకేష్.

అయ్య బాబోయ్ ఈ పిజ్జా తినడానికేనా?

రికార్డుల యావతో ఏం చేస్తున్నారో.. ఎందుకు చేస్తున్నారో తెలియని ఒక పిచ్చ ఇప్పడు ట్రెండింగ్ లో ఉంది. అదిగా అలాంటి పిచ్చితోనే లాస్ఏంజిల్స్ లోని ఓ పిజ్జా హిట్ ప్రపంచంలోకే అతి పెద్ద పిజ్జా తయారు చేసింది. ఆ పిజ్జా హట్ లక్ష్యం నెరవేరింది. ప్రపంచంలోనే అతి పెద్ద పిజ్టా తయారీదారుగా గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. ఇంతకీ ఆ గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న పిజ్జా విస్తీర్ణం ఏం రేంజ్ లో ఉందో తెలుసా?  అది ఏకంగా 13 వేల 99 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇక దీనిని తయారు చేయడానికి 6 వేల 183 కిలోల పిండి వాడారు. అంతేనా 3990 కిలోల జున్ను వాడారు. ఇప్పుడీ పిజ్జాయే ఫుడ్డీల హాట్ టాపిక్. అసలీ పిజ్జా తినడానికేనా అంటే నెటిజన్లు జోకులేస్తున్నారు. ఏది ఏమైనా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన ఈ పిజ్జాకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి. 

కప్పా.. కప్పా నీ బరువెంత?

ఏదైనా సరే అసాధారణంగా ఉంటే.. అది అందరినీ ఆకర్షిస్తుంది. భారీ సొరకాయలూ, నిలువెత్తు వంకాయలు.. ఇలా సామాజిక మాధ్యమంలో వైరల్ అయిన కూరగాయలన చూశాం. అలాగే సాధారణంగా 50 నుంచి 150 గ్రాముల బరువుండే కప్ప ఏకంగా ఆరు పౌండ్ల కు పైగా బరువు ఉందంటే అది వింతే కదా. అటువంటి వింత కప్ప ఒకటి ఆస్ట్రేలియాలో కనిపించింది.  బొడ్జిల్లాగా పిలవబడుతున్న ఈ కప్ప  రెడిన్ ఫారెస్ట్ లో దొరికింది. శాస్త్ర వేత్తలు దీనికి బోడ్జిల్లా అని పేరు పెట్టారు. ప్రస్తుతానికి అత్యధిక బరువు ఉన్న కప్పగా బోడ్జిల్లాదే రికార్డు. గతంలో 2.65 కిలోల బరువున్న కప్ప గిన్నిస్ రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. ఇప్పుడీ కప్ప దానిని మించి 2.7 కిలోల బరువు ఉండటంతో ఆ రికార్డును బోడ్జిల్లా అధిగమించింది.

నితీష్ టార్గెట్ గా పీకే పొలిటికల్ ఎంట్రీ

నితీష్ కుమార్, ప్రశాంత్ కిశోర్ ఈ ఇద్దరిలో ఏ ఒక్కరికీ పరిచయం అవసరం లేదు. ఒకరు, కుర్చీలోంచి కదలకుండా  అలవోకగా కూటములు మార్చడంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన జేడీయు నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. రెండవ వ్యక్తి, ఒక దశాబ్ద కాలంగా  దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న, రాజకీయలలో ప్రముఖంగా వినిపిస్తున్న, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఇద్దరు ఒకే రాష్ట్రానికి చెందిన వారు కావడం ఒకటైతే, ఇద్దరికిద్దరూ, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు చురుగ్గా పావులు  కదుపుతున్నారు. అలాగే, ఇద్దరికిద్దరూ, రాజకీయాలను ఆవపోసన పట్టిన ఉద్దండ పిండాలు. అంతే కాదు రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనే నానుడికి నిలువెత్తు నిదర్శనం ఈ బీహారీ జోడీ. రాజకీయాలను తమకు అనుకూలంగా మలచుకోవడంలో ఇద్దరికిద్దరూ అందె వేసిన చెయ్యిగా గుర్తింపు పొందారు. అఫ్కోర్స్, ఆ ప్రయత్నాలలో అన్ని వేళలా సక్సెస్  కాకపోవచ్చును, అయినా, ప్రయత్నాలు అయితే విరమించుకోలేదు. ఈ ఇద్దరి మధ్య, (ఇక్కడ అసందర్భమే అయినా)  మరో సారూప్యం కూడా వుంది. ఈ ఇద్దరు తెలంగాణ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుట్ల చంద్రశేఖర రావుకు మంచి మిత్రులు. మంచి శత్రువులు.  అయితే ఇప్పడు విషయం అది కాదు. సో   ఆ విషయాన్ని పక్కన పెట్టి అసలు విషయంలోకి వస్తే ...   బీహార్ సీఎం నితీష్ కుమార్  'సమాధాన్ యాత్ర' పేరిట బీహార్లో యాత్ర చేపట్టారు. మరో వంక, ఒకప్పుడు జేడీయు ఉపాధ్యక్షుడిగా  కీలక బాధ్యతలు నిర్వహించిన ప్రశాంత్ కిశోర్ ఆ తర్వాతి కాలంలో రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రాజకీయాలు తన వంటికి పడవని ప్రకటించుకున్నారు. నేనొక విఫల రాజకీయ వేత్తనని చెప్పుకున్నారు. ఇక పై క్రియాశీల రాజకీయాల్లో వేలు పెట్టనని ప్రకటించుకున్నారు.అయితే, ఒపీనియన్ మార్చుకుని, ప్రత్యక్ష రాజకీయాల్లో వేలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఎన్నికల వ్యూహకర్త అవతారానికి ఫుల్ స్టాప్ పెట్టిన ప్రశాంత్ కిశోర్  ఇప్పటికే, జన సూరజ్  యాత్ర పేరిట బీహార్ లోని చంపరాన్ జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్నారు.  అయితే, ఎవరి మానాన వారు ఎవరి యాత్ర వారు చేసుకుంటే ఏమో కానీ, ఒకప్పుడు జిగ్నీ దోస్తులుగా ఉన్న ఆ ఇద్దరి మధ్య ఇప్పడు మాటాల యుద్ధం నడుస్తోంది. నిజానికి  ఇప్పుడే కాదు చాల కాలంగా ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగింది. ఈ నేపధ్యంలో నితీష్ కుమార్ ప్రారంభించిన యాత్రపై ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు, బీహార్ రాష్ట్ర రాజకీయాలలోనే కాదు జాతీయ రాజకీయాల్లోనూ  వేడి  పుట్టిస్తున్నాయి.  పీకే విపక్ష్ల ఐక్యతకు గండి కొట్టే ప్రయత్నాలకు  ఆయన శ్రీకారం చుట్టినట్లుగా భావిస్తున్నారు.  ప్రజలను మరోమారు మోసం చేసేందుకే నితీష్ యాత్ర చేపట్టారని ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు ప్రశాంత్ కిశోర్  కోరి కోరి కాలు దువ్వుతున్నట్లు ఉందని అంటున్నారు. నితీష్ గతంలో అనేక యాత్రలు చేసిన విషయాన్నిగుర్తు చేసిన ప్రశాంత్ కిషోర్.. వాటి వల్ల రాష్ట్రానికి ఏం లాభం చేకూరిందని ప్రశ్నించారు. కేవలం ప్రజలను మభ్యపెట్టే  ప్రయత్నంలో భాగంగానే నితీష్ ఈ యాత్ర చేస్తున్నారని అన్నారు. అలాగే, రాహుల్ భారత్ జోడో యాత్రలో ముఖ్యమంత్రి నితీష్ పాల్గొనకపోవడంపై కూడా ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఇతర రాజకీయ పార్టీల నాయకులు కాంగ్రెస్ యాత్రకు హాజరవుతున్నా, నితీష్ మాత్రం రాహుల్ యాత్రకు దూరంగా ఉన్నారని అన్నారు. 'మహాఘట్ బంధన్' ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి అయినప్పటికీ ఆ పార్టీ యాత్రపై ముఖ్యమంత్రి ఎందుకు ఆసక్తి చూపించడం లేదని ప్రశ్నించారు.అలాంటప్పుడు ఆయన ప్రతిపక్షాల ఐక్యత గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.  అయితే, ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలను నితీష్ కుమార్ అంత సీరియస్ గా తీసుకోలేదు కానీ, జేడీయు నేతలు మాత్రం ప్రశాంత్  కిశోర్ కు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. నితీష్ కుమార్ ని విమర్శించే ముందు, ప్రశాంత్ కిశోర్  ఆత్మ విమర్శ చేసుకోవాలని అంటున్నారు. మరో వంకఎన్నికలు దగ్గరవుతున నేపధ్యంలో బీహార్ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని, అందులో ప్రశాంత్ కిశోర్ ఫాక్టర్ కుడా ఒకటి పరిశీలకులు అంటున్నారు.

పొంగులేటి పయనమెటు ?

అంతా అయిపోయింది, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, బీజేపీలో చేరడం ఖాయమని ప్రచారం జరిగింది. ఇక  కండువాలు కప్పుకోవడమే మిగిలుందని చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జనవరి 18న ఇక్కడ ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరుగుతున్న సమయంలోనే, అక్కడ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో పొంగులేటి, ‘కడువా’ మార్పిడి వేడుకకు ముహూర్తం ఖరారైందనే ప్రచారం జరిగింది. అఫ్కోర్స్, బీజేపీ ముఖ్యనాయకులు ఎవరూ అధికారికంగా అలాంటి ప్రకటన ఏదీ చేయక పోయినా, సోషల్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే పెద్ద ఎత్తునే ప్రచారం జరిగింది. అయితే జనవరి 18 వచ్చింది వెళ్ళింది. పొంగులేటి అయన వర్గం సభకు హాజరు కాలేదు కానీ, అనుకున్నవిధంగానే ధూం ..దాంగా బీఆర్ఎస్  ఆవిర్భావ సభ జరిగింది. ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా హాజరయ్యారు. ఆశించినంత కాకపోయినా జన సమీకరణ కూడా భారీగానే జరిగింది. కానీ  పొంగులేటి బీజేపీ కండువా కప్పుకోలేదు. అసలు ఢిల్లీ వెళ్ళనే లేదు. అంతే కాదు, ఆతర్వాత ఆ ఊసే ఎక్కడ వినిపిచడం లేదు.  మరోవంక పొంగులేటి మనసు మార్చుకున్నారని, బీజేపీలో చేరడమా, కాంగ్రస్ లో కలవడమా అనే మీమాంసలో ఉన్నారని అంటున్నారు. బీజేపీలో చేరితే రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుదనే విషయంలో పొంగులేటికీ కొన్ని అనుమానాలున్నాయని అంటున్నారు. భారాసలో ఎదురైన చేదు అనుభావాలే అక్కడా ఎదురవుతాయనే భయంతోనే వెనకడుగు వేశారని అంటున్నారు. అలాగని, కాంగ్రెస్ లో చేరితే రాజకీయంగా ఢోకా ఉండదు. కానీ, ఇంతవరకు వచ్చి వెనకడుగు వేస్తే  మోడీ, షా నిముషం ఆలస్యం చేయకుండా ఐటీ, ఈడీ గొలుసులు విప్పుతారనే భయం పొంగులేటిని వెంటాడుతోంది. ఇప్పడు ఈ రెండు భయాల మధ్య ఆయన అటూ ఇటూ ఉగుతున్నారని, అంటున్నారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీల బలాబలాలను బేరీజు వేసుకుంటే, బీజేపీ కంటే కాంగ్ర్రేస్ పార్టీ పుష్టిగా, పటిష్టంగా వుంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మంచి పట్టుంది. గట్టి నాయకులున్నారు. కమిట్మెంట్ తో పనిచేసే క్యాడర్ వుంది. అదే సమయంలో గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఒక్క భట్టి మినహా మిగిలిన వారంతా కట్టకట్టుకుని భారాసలోకి దూకేశారు.  సో..పొంగులేటి తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకోగలుగుతారు. అఫ్కోర్స్ టిక్కెట్ల వరకు బీజేపీలో అయితే అసలు ఆ మాత్రం  సమస్య కూడా లేదు. కానీ జిల్లాలో బీజేపీకి కనీస ఉనికి లేదు. లీడర్లు లేరు.. క్యాడర్ లేరు. సో  రాజకీయ లెక్కలు బేరీజు వేసుకుంటే, కాంగ్రెస్ లో చేరడమే ఉత్తమం.  నిజానికి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయనకు ఆఫర్లు వచ్చాయి. తమ పార్టీలో చేరాలని కాంగ్రెస్ నేతలు  పిలుపునిచ్చారు. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డైలమాలో పడిపోయారని అంటున్నారు. అయితే, బీజేపీ నాయకులు మాత్రం పొంగులేటి తమ పార్టీలో చేరడం ఖాయమని, అయితే, ఢిల్లీలో కాకుండా, రాష్ట్రంలో తెలంగాణ ప్రజల సమక్షంలో బీజేపీలో చేరాలని భావిస్తున్నారని, అందుకే చేరిక  పోస్ట్ పోన్ అయ్యిందని  అంటున్నారు. ముందు   ఈనెల ( జనవరి) 28 అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భంగా పొంగులేటి పార్టీలో చేరతారని అనుకున్నా, ఇప్పుడు షా పర్యటన రద్దవడంతో, ఫిబ్రవరి 13వ ప్రధానిమోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా పొంగులేటి పార్టీలో చేరడం ఖాయమని అంటునారు. ఇక అప్పుడు కూడా పొంగులేటి బీజేపీలో చేరలేదంటే..ఆయన యూ  టర్న్   తీసుకున్నట్లే అవుతుందని అంటున్నారు. అయితే, ముందు నుంచి కూడా పొంగులేటి బీజేపీలో చేరడం ఒక ప్రహసనంగా సాగుతోంది. ముందుగా  జనవరి 15 న ప్రధాని హైదరాబాద్ పర్యటన సందర్భంగా పొంగులేటి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది,అయితే మోడీ పర్యటన్ రద్దవడంతో సీన్ ఢిల్లీకి మారింది, అది జరగలేదు. మళ్ళీ జనవరి 28 న అమిత్ షా రాష్ట్ర  పర్యటన సందర్భంగా అనుకుంటే అదీ రద్దయింది .ఇక ఇప్పుడు ఫిబ్రవరి 13వ ప్రధానిమోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా అంటున్నారు .. ఇలా వినాయకుడి పెళ్ళికి వేయి విఘ్నాలు అన్నట్లు, పొంగులేటి పార్టీ మారే ప్రక్రియ ఒక ప్రహసనంగా మారిందని, అంటున్నారు. అయితే.. ఆలస్యం అయినా, పొంగులేటికీ మాత్రం లెక్కలు సరిచూసుకునేందుకు కావలసినంత సమయం అయితే చిక్కింది.

ఏపీలో ఆర్ధిక ఎమర్జెన్సీ తప్పదా?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వాన్నంగా ఉందనేది అందరికీ తెలిసిన రహస్యం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన క్షణం నుంచే రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ అనేదే లేకుండా పోయింది. అందుకే సంవత్సరం తిరగ కుండానే, గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముందుచూపుతో వేసిన ఆర్థిక పునాదులు సడలి పోయాయి. అప్పుల వేట మొదలైంది. కూచమ్మ కూడా బెడితే మాచమొచ్చి మాయం చేసింది అన్నట్లుగా పరిస్థితి తల్లకిందులైపోయింది  ఆర్థిక మంత్రి అప్పుల మంత్రిగా మారిపోయారు. అప్పులు పుడితేనే కానీ పూట గడవని పరిస్థితికి రాష్ట్ర్ర ఆర్థిక పరిస్థితి చేరుకుంది. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అయినా  ఇవ్వలేని దౌర్భాగ్య స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేరుకుంది. అయినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  ప్రతిపక్ష నాయకులు చేసిన సూచనలను పట్టించుకోలేదు. ముఖ్యంగా, సుదీర్ఘ కాలం ఉమ్మడి రాష్ట్రంలో, రాష్ట్ర విభజన అనతరం అవశేష ఆంధ్ర ప్రదేశ్ లొ తొలి ఐదేళ్ళు ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు వంటి అనుభవజ్ఞులు చేసిన సూచనలను కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పట్టించుకోలేదు.  బహుశా ఆయనకు సహజసిద్ధంగా అబ్బిన దురహంకారంతో కావచ్చును, మీటలు నొక్కుకుంటూ పోయారు.  ఫలితంగా ఇప్పడు ఇదిగో, ఉద్యోగ సంఘాల మాజీ నాయకుడు, టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అన్నట్లుగా జీతాల కోసం ఉద్యోగులు గవర్నర్ ని కలవడం అనేది దేశచరిత్రలో బహుశా ఇదే తొలిసారి కావచ్చును. అప్పులు పుడితే తప్ప ప్రభుత్వం నడిచే పరిస్థితి, ఉద్యోగులకు జీతాలు అందని స్థితి ఉంటే, ముఖ్యమంత్రి తక్షణమే తనపదవికి రాజీనామాచేయడంమంచిది. నిజానికి ఇదొక్క అశోక్ బాబు మాట కాదు. రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు మొదలు, రాజ్యంగ నిపుణుల వరకు అందరూ అదే మాట అంటున్నారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వక పోవడం, ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో సర్కార్ చేతులు పెట్టడం, రిటైరైన ఉద్యోగులకు బెనిఫిట్స్ విషయంలో జరుగుతున్న జాప్యం, ఒకటి అని కాదు,  ఇలా ఒక్క ప్రభుత్వ  ఉద్యోగులకు సంబందించిన ఆర్థిక వ్యవహారాల్లో జరుగతున్న అవకతవకలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నా, ముఖ్యమంత్రి  రాజీనామా చేయడం ఉత్తమం అంటున్నారు.  జనవరి జీతాలు ఫిబ్రవరి నెల్లోకూడా ఇవ్వలేమని, ఇప్పటికే ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు. అప్పులు పుడితేనే ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇస్తోంది. రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జన్సీ వచ్చింది అనడానికి ఇదే నిదర్శనం. చెద పట్టిన గుమ్మంలా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి తయారైంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్షించి, వెంటనే ఒక నిర్ణయానికి రావాలి. 7వేలకోట్ల డీఏలు ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాలి ఉంది. గతం లో పీఆర్సీ సందర్భంలో ఉద్యోగులకు రూ.2,500 కోట్లు ఇవ్వాల్సి ఉందని, మార్చి 2022 నాటికి ఇస్తామని ప్రభుత్వమే చెప్పింది. ఇప్పటికీ ఆ బకాయిలు ఇవ్వలేదు. జీపీఎఫ్ అడ్వాన్స్ లు కూడా ఇవ్వని ప్రభుత్వం, వాటినికూడా వాడుకుంది. రాష్ట్రప్రభుత్వం రూ.480 కోట్లు వాడుకుందని కేంద్రమే చెప్పింది, ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఫైనాన్షియల్ ఎమర్జన్సీ డిక్లేర్ చేయాలని అంటున్నారు.

యాత్ర ముగింపుకు ముందే అభియాన్ ఆరంభం

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సారథ్యంలో సాగుతున్న భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంది. గత ఏడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో  మొదలైన యాత్ర  జనవరి 30వ తేదీన కశ్మీర్ లోముగుస్తుంది. భారత్ జోడో యాత్ర ముగింపు సభకు కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ముగింపు సభకు  భావసారూప్యత కలిగిన 24 రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. ఆాయా పార్టీల అధినేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖలు రాశారు. బీఎస్పీ- మాయావతి, టీఎంసీ- మమతా బెనర్జీ, జేడీయూ- నితీశ్ కుమార్, టీడీపీ- చంద్రబాబు నాయుడు, ఆర్జేడీ- లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్ వాదీ- అధినేత అఖిలేష్ యాదవ్, వంటి వారితో పాటు.. కమ్యూనిస్ట్ పార్టీలతో సహా మరికొన్ని పార్టీలకు స్వాగతం పలికారు. జనవరి 30న జరిగే సభను ఎలాగైనా సరే విజయవంతం చేయాలన్న కృత నిశ్చయంతో ఉంది కాంగ్రెస్ అధిష్టానం.  అయితే ఇక్కడితో యుద్ధం ఆగదని, కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాహుల్ గాంధీ సారథ్యంలో సాగిన  'భారత్ జోడో యాత్ర' సందేశాన్ని ఇంటింటికి చేరవేసేందుకు కాంగ్రెస్ పార్టీ 'హాథ్ సే హాథ్ జోడో అభియాన్' ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ, యాత్ర ముగింపుకు నలుగు రోజులు ముందుగానే, జనవరి 26 శ్రీకారం చుడుతున్నారు.  ఇందుకు సంబంధించిన లోగోతో పాటు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చార్జిషీటును హస్తం పార్టీ విడుదల చేసింది. ఈనెల 26వ తేదీ నుంచి రెండు నెలల పాటు  హాథ్ సే హాథ్ జోడో  ప్రచారం సాగనుందని న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. రాహుల్ గాంధీ సారథ్యంలోని జోడో యాత్ర సందేశాన్ని సామాన్య ప్రజానీకానికి   చేరవేసేందుకు ఈ ప్రచారం చేపడుతున్నట్టు తెలిపారు.  మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చార్జిషీటును కూడా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు (పీసీసీలు) స్టేట్ స్పెసిఫిక్  చార్జిషీట్లు తయారు చేస్తాయని వేణుగోపాల్ తెలిపారు. మోడీ ప్రభుత్వ అవకతవక విధానాల కారణంగా ప్రజలకు ఎదురైన ఇబ్బందులను పరిష్కరించేందుకు తమ పార్టీ కృష్టి చేస్తుందన్నారు. 130 రోజుల చారిత్రక భారత్ జోడో యాత్ర తర్వాత దేశ ప్రజల నుంచి విస్తృత సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ సేకరించిందని, లక్షలాది మంది రాహుల్ గాంధీ అడుగులో అడుగులు వేసి ఆయనతో సంభాషించారని చెప్పారు. మోడీ ప్రభుత్వ తప్పిదాల పాలన కారణంగా ప్రజలు ఎదుర్కొన్న ఈతి బాధలను తాము అవగతం చేసుకున్నామని అన్నారు.  కాగా, జమ్మూకశ్మీర్‌లోని కతువాలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరామ్ రమేష్ మాట్లాడుతూ, తమ పార్టీ చేపట్టనున్న ఇంటింటి ప్రచారం 6 లక్షల గ్రామాలు, 2.5 లక్షల గ్రామ పంచాయతీల్లోని 10 లక్షల పోలింగ్ బూత్‌లకు తీసుకువెళ్తామని చెప్పారు. హాథ్ సే హాథ్ జోడో  ప్రచారం జనవరి 26 నుంచి మార్చి 26 వరకూ జరుపుతామన్నారు. పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి రాహుల్ గాంధీ లేఖను ప్రజలకు అందజేస్తారని చెప్పారు.

మెగాస్టార్ మా..వాడే !

మెగాస్టార్ చిరంజీవి తేల్చి చెప్పేశారు, రాజకీయాలకు శాశ్వతంగా గుడ్’బై చెప్పేశానని స్పష్టం చేశారు. ఏపీ రాజకీయాల గురించి అయితే తనకు ఏమీ తెలియదని, తన ఓటు తెలంగాణలో ఉందని, ఏపీ రాజకీయాలతో నాకేటి పని అన్నట్లుగా చేతులు కడిగేసుకున్నారు. అయినా, "గాడ్‌ఫాదర్" సినిమాలో ఆయనే చెప్పిన  రాజకీయాల నుంచి నేను దూరంగా ఉంటున్నా... నా నుంచి రాజకీయాలు దూరం కాలేదు  అనే డైలాగులో లాగా ఆయన రాజకీయాలను వదిలేసినా, రాజకీయాలు ఆయన్ని వదలడం లేదు.ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నా.. అప్పుడప్పుడు ఆయన రాజకీయ తెర మీద కూడా దర్శనమిస్తున్నారు. ఆయన ‘ప్రత్యక్ష’  ప్రమేయం లేకుండానే ఆయన చుట్టూ రాజకీయ చర్చ అల్లుకుంటోంది. (అయితే చిరంజీవి తమ సినిమా ప్రచారానికి ఇలా రాజకీయాలు ఉపయోగించుకుంటారని, అనుమానించేవారు లేక పోలేదు. గతంలో ‘గాడ్ ఫాదర్’ రిలీజ్’కు ముందు. గుట్టుచప్పుడు కాకుండా ఆ సినిమాలోని "రాజకీయాల నుంచి నేను దూరంగా ఉంటున్నా... నా నుంచి రాజకీయాలు దూరం కాలేదు" అనే పది సెకండ్స్’ ఆడియోను సోషల్ మీడియాలో వదిలారు. ఆ పది సెకండ్ల ఆడియో, సినిమా ప్రచారానికి చక్కగా ఉపయోగించిందని అంటారు). తాజాగా ఇప్పుడు, ‘వాల్తేరు వీరయ్య’ నడుస్తున్న సమయంలో మళ్ళీ  మరోమారు  చిరంజీవి అందరివాడు అవునా కాదా అనే చర్చ,తెర మీదకు వచ్చింది. ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని, ఏపీ పీసీసీ కొత్త అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చేసిన వ్యాఖ్యలు పాత చర్చను కొత్తగా తెరమీదకు తెచ్చాయి.అంతేకాదు, రుద్రా రాజు, ఇంకో ప్రకంపనం కుడా సృష్టించారు.చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టే రాహుల్ గాంధీకి లేఖ రాశారని చిరు చర్చకు మెగా టచ్’ ఇచ్చారు. అయితే ఆలేఖ ఆయన ఎప్పుడు రాశారో, ఆ లేఖలో  ఏముందో మాత్రం ఆయన చెప్పలేదు. తాంబూలాలు ఇచ్చేశా తన్నుకు చావండి అన్నట్లు, ఊహాగానలకు గేట్లు మాత్రం  బార్లా తెరిచారు.  ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్’లో విలీనం చేశాక చిరంజీవి రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా ఉన్నారని రుద్రరాజు  పేర్కొన్నారు. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలపై పూర్తి ఫోకస్ పెట్టారని అన్నారు. కాగా కొన్ని రోజుల క్రితం రాజకీయాలకు నేను పూర్తి దూరంగా ఉన్నానని చిరంజీవి) పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. అయితే, చిరంజీవి స్కండ్ ఇన్నిగ్స్’లోనూ మెగా స్టార్’గ దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలతో సమానంగా సినిమాలు  చేస్తున్నారు.జనం చూస్తునారు. ఉతీవల విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ కలెక్షన్స్ దూసుకుపోతున్నాయి. చిరంజీవి ఇప్పడు ఆ  సక్సెస్’ను ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు భోళా శంకర్ సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో, చిరంజీవి రాబోయే రోజుల్లో ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చింది.