తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటిన్ విడుదల చేసిన వైద్యులు

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆయన పూర్తిగా వైద్య సాయంపైనే ఆధారపడి ఉన్నారు. మరి కొన్ని రోజుల పాటు ఆయన ఆరోగ్యంపై ఏమీ చెప్పలేమని నారాయణ హృదయాలయ ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులిటిన్ పేర్కొంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆయనను కుప్పం నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తీసుకువచ్చిన సంగతి విదితమే. ఇక్కడకు చేరుకునే సమయానికి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. అప్పటి నుంచి నిపుణులతో కూడిన వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే తారకరత్న పరిస్థితి విషమంగానే ఉంది.  ప్రస్తుత పరిస్థితుల్లో తారకరత్నను సందర్శించేందుకు ఎవరూ రావొద్దని, వచ్చి చికిత్సకు ఆటంకం కలిగించవద్దని నారాయణ హృదయాలయ బులెటిన్ లో  కోరింది. కుప్పంలో తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర శుక్రవారం (జనవరి 28) ప్రారంభమైన సంగతి తెలిసిందే. లోకేష్ కు మద్దతు తెలిపేందుకు వచ్చి పాదయాత్రలో అడుగు కలిపిన తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి విదితమే. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మరింత మెరుగైన చికిత్స కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి రోడ్డు మార్గంలో తీసుకు వచ్చారు. ఆయనకు మాసివ్ హార్ట్ అటాక్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. ఇలా ఉండగా తారకరత్నను పరామర్శించేందుక మరి కొద్ది సేపటిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు బెంగళూరు చేరుకుంటారు.

సీబీఐ విచారణకు ముందు విజయమ్మతో అవినాష్ రెడ్డి భేటీ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి శనివారం (జనవరి 28,2023) సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఇందుకోసం హైదరాబాద్ చేరుకున్న ఆయన సీబీఐ విచారణ కోసం ఆ దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వెళ్లడానికి ముందు ఏపీ సీఎం జగన్ తల్లి విజయమ్మతో భేటీ అయ్యారు.  లోటస్ పాండ్ లో విజయమ్మను కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆమెతో కొద్ది సేపు ఏకాంతంగా మాట్లాడారు  అనంతరం కోఠిలోని సీబీఐ కార్యాలయానికి  బయలుదేరి వెళ్లారు. వైఎస్ వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్ర ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో సీబీఐ నోటీసుల మేరకు అవినాశ్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే అంతకు ముందు  లోటస్ పాండ్ కు వెళ్లి  సీఎం జగన్ తల్లి విజయమ్మతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

మరి కొద్ది సేపటిలో బెంగళూరుకు చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ కూడా?

నందమూరి తారక రత్నను పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు మరి కొద్ది  సేపటిలో బెంగుళూరు వెళ్లనున్నారు.  కుప్పంలో నిన్న తీవ్ర అస్వస్థతకు గురై బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను పరామర్శించేందుకు ఆయన బెంగళూరు బయలు దేరుతున్నారు.  తారకరత్నకు వైద్యులు ప్రస్తుతం ఎక్మో అమర్చి  చికిత్స అందిస్తున్నారు.    లోకేష్ కు మద్దతుగా కుప్పంలో యువగళం యాత్రలో పాల్గొన్న  యాత్రలో పాల్గొన్న సినీ నటుడు నందమూరి తారకరత్నఅస్వస్థతకు గురి కావడంతో  ఆస్పత్రికి తరలించారు. అక్కడ గుండెపోటు అని వైద్యులు తేల్చారు. వెంటనే ఆయనను కుప్పం మెడికల్ కాలేజీకి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.   టీడీపీ నేత, హీరో బాలయ్య ఆస్పత్రికి చేరుకొని అన్నీ దగ్గరుండి పర్యవేక్షించారు. అక్కడి నుంచి  మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరుకు రోడ్డు మార్గంలో అంబులెన్స్ లో తరలించారు.  నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలలో వైద్యులు క్రిటికల్ ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. వైద్యులు ఆయనకు ఎక్మో అమర్చారు. తారకరత్న రక్తనాళాళ్లో 95 శాతం బ్లాక్స్ ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తారకరత్న ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకుని ఆయనను పరామర్శించేందుకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు బెంగళూరు బయలుదేరి వెళుతున్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా తారకరత్నను పరామర్శించేందుకు బెంగళూరు బయలుదేరనున్నట్లు సమాచారం.  ఇప్పటికే బాలకృష్ణ బెంగళూరులో ఉన్నారు. ఆయన దగ్గరుండి తారకరత్నకు అందుతున్నచికిత్సను పర్యవేక్షిస్తున్నారు. 

రేపో మాపో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ!.. తెలుగు రాష్ట్రాలకు నో చాన్స్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గం విస్తరణ, పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. ఈ నెల31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ లోగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఢిల్లీ రాజకీయ వర్గాల భోగట్టా. ఆ మేరకు రేపో మాపో మోడీ తన మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశాలున్నాయి.  2023) ఒక విధంగా ఎన్నికల నామ సంవత్సరం. ఈ ఏడాది తెలంగాణ సహా 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సో .. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా వచ్చే ఏడాది ( 2024)లో జరిగే సార్వత్రిక ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని   కేంద్ర మంత్రి వర్గంలో    మార్పులు చేర్పులు చేసేందుకు మోడీ   నిర్ణయించారనీ, ఇందు కోసం భారీ కసరత్తు కూడా చేశారని అంటున్నారు.    ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో రెండోసారి కొలువుదీరిన ఎన్డీయే మూడున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. సాధారణ ఎన్నికలకు దాదాపు ఏడాది పైగా గడువు ఉంది.  ఈ నేపధ్యంలో, అన్ని కోణాల్లో పరిస్థితిని సమీక్షించుకుని, మరింత మెరుగైన పాలనకు వీలుగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రెడీ అయ్యారని అంటున్నారు.  కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఏడాది మే 31న తొలి మంత్రివర్గం ఏర్పడింది. 2021 జులై ఏడో తేదీన మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. ప్రస్తుతం ప్రధానమంత్రితో కలిపి 31 మంది కేబినెట్‌ మంత్రులు, ఇద్దరు స్వతంత్ర హోదా మంత్రులు, 45 మంది సహాయ మంత్రులు మొత్తం   78 మంది ఉన్నారు. కేంద్రంలో గరిష్ఠంగా 83 మంది వరకు మంత్రులుగా ఉండే అవకాశం ఉంది. అంటే మరో ఐదుగురిని కేబినెట్ లో చేర్చుకునే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  ఇదే చివరి మంత్రివర్గ విస్తరణగా భావిస్తున్నారు.   కేవలం అవకాశం ఉన్న ఐదుగురికి స్థానం కల్పించడమే కాకుండా పని తీరు ఆధారంగా కొందరికి ఉద్వాసన పలికి.. మరి కొందరు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని మోడీ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పోతే ఈ ఏడాది  జగరనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ఎలాగైనా తెలంగాణలో విజయం సాధించి అధికారం చేజిక్కించుకోవాలన్న పట్లుదలతో ఉంది. అందుకే మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనగానే తెలంగాణకు బెర్త్ ఖాయం అంటూ ఊహాగానాలు చెలరేగాయి. అలాగే గత మూడున్నరేళ్లుగా  కేబినెట్ లో అసలు ప్రాతినిథ్యమే లేని ఏపీకి కూడా ఈ సారి బెర్త్ కన్ఫర్మ్ అంటూ వార్తలు వినవచ్చాయి. అయితే మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో తెలుగు రాష్ట్రాలకు రిక్తహస్తమేనని ఢిల్లీలోని బీజేపీ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు తెలుస్తోంది. తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరువాత జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్ఠిలో పెట్టుకుని అన్ని విధాలుగా ఆలోచించి.. మోడీ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరనించనున్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి. 

వస్తున్నా.. న్యాయవాదిని తెచ్చుకుంటా.. సీబీఐకి అవినాష్ రెడ్డి లేఖ

సీబీఐ నోటీసుల మేరకు తాను శనివారం (జనవరి 28) విచారణకు హాజరౌతున్నట్లు ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కావాలని వైసీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి శనివారం (జనవరి 28)  హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ పేర్కొన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. తాను శనివారం  సీబీఐ ఎదుట విచారణకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.  కేసు విచారణ పారదర్శకంగా సాగాలని   ఆడియో, వీడియో రికార్డింగ్‌కు అనుమతించాలని ఆ లేఖలో కోరారు. అలాగే తనతో పాటుగా తన న్యాయవాదిని కూడా అనుమతించాలని ఆ లేఖలో కోరారు.  

బీఆర్ఎస్ లో తెలుగు, తెలంగాణ మాయం

తానే మారెనో, తలపే మారెనో.. తెలంగాణ ఊసే మరిచెనో అన్నట్లుగా తయారైంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు. తెలంగాణ  రాష్ట్ర సమితి.. తెలంగాణ సాధన కోసం ఏర్పాటైన ఉద్యమ పార్టీ.. ఆ తరువాత ఫక్తు రాజకీయ పార్టీగా ప్రకటించిన  ఆ పార్టీ నేత  పార్టీలో ఉద్యమ స్ఫూర్తికి చరమ గీతం పాడేశారు. ఆ  తరువాత టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చి.. తెలంగాణ పదాన్ని తొలగించారు. దానితో పాటే తెలంగాణ ఆత్మకూ తిలోదకాలిచ్చేశారు. ఇక ఇప్పుడు విస్తరణలో భాగంగా తెలుగు భాషకూ చెల్లు చీటీ పాడేశారు. నిజమే బీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీ.. ప్రాంతం, భాష తారతమ్యాలు లేకుండా అన్ని ప్రాంతాలకూ, భాషలకూ సమ ప్రాధాన్యత ఇవ్వాలి. అంత వరకూ అయితే అభ్యంతరం లేదు. అందుకు తగినట్లుగానే బీఆర్ఎస్ లో ఇతర రాష్ట్రాల వారు ఎవరన్నా చేరితే ఆ రాష్ట్ర భాషలో కండువాలు తయారు చేయించి కప్పుతున్నారు. అంత వనరై ఓకే. కానీ తెలంగాణ రాజధానికి వచ్చి బీఆర్ఎస్ లో చేరే వారిని పార్టీలోకి ఆహ్వానించే సందర్భంలో కూడా తెలుగుకు, తెలంగాణకు ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని బీఆర్ఎస్ శ్రేణులే జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇటీవల ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్, ఆయన తనయుడు ప్రగతి భవన్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ గూటికి చేరారు. కేసీఆర్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అయితే ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలలో ఎక్కడా తెలంగాణ కనిపించలేదు. తెలుగు భాష కనిపించలేదు. భారత దేశం మ్యాప్, హిందీ, ఇంగ్లీషు, ఒరియాలలో బ్యానర్లు మాత్రమే దర్శనమిచ్చాయి.    తెలంగాణ భవన్ లో జరిగే బీఆర్ఎస్ కార్యక్రమాలలో సైతం పార్టీ బ్యానర్లు కేవలం హిందీ, ఇంగ్లీషు భాషలోనే దర్శనమిస్తున్నాయి. ఇక ఇతర రాష్ట్రాల వారి చేరికల సందర్భంగా ఏర్పాటు చేసే బ్యానర్లలో  ఆయా రాష్ట్రాల భాషలో మాత్రమే బ్యానర్లు దర్శనమిస్తున్నాయి.  ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలను ఏ భాషలో ఓట్లు అడగాలని బీఆర్ఎస్ నాయకులు మధన పడుతున్నారు.   రాష్ట్ర సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఇటీవలి కాలంలో కేసీఆర్ అసలు ప్రస్తావించడం లేదనీ, ఎంత సేపూ కేంద్రంపై విమర్శలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో భేటీలు, సమావేశాలూ, చర్చలకే పరిమితమౌతున్నారనీ, దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పార్టీ దూరం అవుతోందని పార్టీ శ్రేణులే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రెండు సార్లు పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన తెలంగాణను విస్మరించడమంటే మూలాలను వదిలేయడమేనని అంటున్నారు. బీఆర్ఎస్ విస్తరణ సంగతి అలా ఉంచి ఇదే తీరు కొనసాగితే.. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఏమౌతుందో కేసీఆర్ ఆలోచించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. 

యువగళం డే నంబర్ 2 ప్రారంభం

కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల సమీపంలో క్యాంప్ నుంచి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి   నారా లోకేశ్ యువగళం పాదయాత్ర రెండో రోజు ప్రారంభమయింది. ఈ రోజు ఆయన 9.7 కిలోమీటర్లు నడవనున్నారు.  బెగ్గిలపల్లిలో స్థానికులతో మాటా మంతీలో పాల్గొంన్నారు.  కలమలదొడ్డిలో భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. పార్టీ సీనియర్ నేతలతో సమావేశమవుతారు. కలమలదొడ్డి నుంచి పాదయాత్ర కొనసాగించి శాంతిపురం క్యాంప్ కు చేరుకుంటారు. అక్కడ ప్రముఖలతో భేటీ అవుతారు. శనివారం ఆయన శాంతిపురంలో బసచేస్తారు.  ప్రముఖులతో సమావేశమవుతారు. కుప్పంలోని శాంతిపురంలో రాత్రి బస చేయనున్నారు. తొలి రోజులాగే రెండో రోజు కూడా లోకేష్ పాదయాత్రలో అడుగు కలిపేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులూ తరలి వచ్చారు. వారికి అభిమాదం చేస్తూ లోకేష్ ముందుకు కదిలారు.

ఎక్మోపై తారకరత్న.. కండీషన్ క్రిటికల్?

కుప్పంలో నిన్న తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్నకు వైద్యులు ప్రస్తుతం ఎక్మో అమర్చి  చికిత్స అందిస్తున్నారు.కుప్పంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.    లోకేష్ కు మద్దతుగా ఈ యాత్రలో పాల్గొన్న సినీనటుడు నందమూరి తారకరత్న నిన్న సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్నను   వెంటనే తారకరత్నను ఆస్పత్రికి తరలించారు. అక్కడ గుండెపోటు అని వైద్యులు తేల్చారు. వెంటనే ఆయనను కుప్పం మెడికల్ కాలేజీకి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.   టీడీపీ నేత, హీరో బాలయ్య ఆస్పత్రికి చేరుకొని అన్నీ దగ్గరుండి పర్యవేక్షించారు. అక్కడి నుంచి  మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరుకు రోడ్డు మార్గంలో అంబులెన్స్ లో తరలించారు.  నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలలో వైద్యులు క్రిటికల్ ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. వైద్యులు ఆయనకు ఎక్మో అమర్చారు. తారకరత్న రక్తనాళాళ్లో 95 శాతం బ్లాక్స్ ఉన్నాయని చెబుతున్నారు.  

కొందరు సీనీ నటులకు ఎమ్మెల్సీ తాయిలాలు.. జగన్ ఎత్తుగడ

జగ‌న్ కు ఈసారి సినిమా వాళ్ళ అవసరం తప్పేలా లేదు. ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. సర్వేలు కూడా అదే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. వాస్తవమెంతో తెలియదు కానీ జగన్ స్వయంగా ఐ ప్యాక్ ద్వారా చేయించుకున్న సర్వేలో కూడా ఆయన క్యాబినెట్ లోని పాతిక మంది మంత్రులు వచ్చే ఎన్నికలలో ఓటమి చవిచూడనున్నారని తేలింది. మరో వైపు ఏపీలో తెలుగుదేశం, జనసేన పొత్త దాదాపు ఖరారైంది. బీజేపీ సంగతి ఇంకా ఎటూ తేలకపోయినా, తెలుగుదేశంతో జనసేన కలిసి పోటీ చేస్తే జగన్ పార్టీకి పరాజయం తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికలలో వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కోకతప్పదని అంటున్నారు. గత ఎన్నికలలో అంటే 2019 ఎన్నికలలో వైసీపీకి అనుకూలంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రచారం చేశారు. మోహన్ బాబు, మంచు విష్ణు, కృష్ణుడు, భానుచందర్, అలి, పోసానికృష్ణమురళి, రాజశేఖర్, జీవిత, థర్టీ ఇయర్స్ పృధ్వీ ఇలా జాబితా పెద్దదే ఉంది. అయితే ఈ సారి మాత్రం జగన్ కు అనుకూలంగా ప్రచారం చేయడానికి ఇప్పటి వరకూ అయితే అలీ, పోసాని వినా మరెవరూ కనిపించడం లేదు. మోహన్ బాబు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తనకు టీటీడీ చైర్మన్ లేదా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం వస్తుందని ఆశించి భంగపడ్డారు. జగన్ అధికారం చేపట్టగానే ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వికి మాత్రమే పదవి ఇచ్చారు. అది కూడా మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది. ఇక ఆ తరువాత మూడున్నరేళ్లకు అలీ, పోసానిలకు సలహాదారు పదవులు కట్టబెట్టారు. మిగిలిన వారి గురించి కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు.  దీంతో వారంతా పార్టీ కార్యక్రమాలకు ఒకింత దూరంగానే ఉంటున్నారు. ఇక వచ్చే ఎన్నికలలో తీవ్ర మైన ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న జగన్ గట్టెక్కేందుకు మరో సారి సినీ జీవులపైనే ఆధారపడనున్నారని పరిశీలకులు అంటున్నారు. అందు కోసమే.. వారికి ఏదో విధంగా ప్రయోజనం చేకూర్చేందుకు యోచిస్తున్నారని చెబుతున్నారు. వచ్చే మార్చిలో రాష్ట్రంలో 12 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటిని సీనీ జీవులతో భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే అది ఎంత వరకూ సాధ్యమౌతుందన్నది ప్రశ్నార్థకమే. ఎందుకంటే పార్టీలో కూడా జగన్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. పలువురు ఆశావహులు ఎమ్మెల్సీ సీట్ల కోసం ఎదురు చూస్తున్నారు. చిలకలూరిపేట   మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ తో పాటు పలువురికి జగన్ ఇప్పటికే హామీ  ఇచ్చారు.  ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయంలో పవన్ ను విమర్శించే వారికి జగన్ పెద్దపీట వేయొచ్చు అనే మాట వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి ఒకరిద్దరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే అవకాశం ఉందని కూడా పార్టీ శ్రేణులు అంటున్నాయి.  వచ్చే ఎన్నికలలో పార్టీకి సినీ గ్లామర్ ను అద్దడానికి జగన్ ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.

జగన్ ఢిల్లీ పర్యటన.. అందుకోసమేనా?

ఏపీ సీఎం హఠాత్తుగా తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. నిర్దుష్టంగా ఇందుకు కారణమేమిటన్నది తెలియరాలేదు. అయితే ఆయన హస్తిన పర్యటన కోసమే కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.    శుక్రవారం, శనివారం నాటి పర్యటనలను జగన్ రద్దు చేసుకుని హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అయితే ఇప్పటి వరకూ మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ ఖరారు కాకపోవడంతో ఇంకా బయలుదేరలేదని చెబుతున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శ్రుక్రవారం (జనవరి 27)  ఉమ్మడి చిత్తూరు జిల్లా  పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కుమారుడి వివాహానికి సీఎం జగన్ హాజరు కావాల్సి ఉంది.  అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పొన్నూరు వైసీపీ నేత ఇంట్లో జరిగే వివాహ వేడుకకు సైతం సీఎం   హాజరవ్వాల్సి ఉంది. అలాగే శనివారం జగన్ విశాఖలో పర్యటించాల్సి ఉంది. విశాఖలో ఆయన చినముషిడివాడలోని శారదా పీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాల్సి ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి లోక్ సభ సభ్యుల నివాసాల్లో జరిగే వివాహ వేడకలకు వెళ్లాల్సి ఉంది. కానీ ఈ కార్యక్రమాలను ఇంత అర్థాంతరంగా రద్దు అయ్యాయి.  హస్తిన పర్యటన కోసమే ఈ కార్యక్రమాలన్నీ రద్దయ్యాయని అంటున్నారు. కు ఎందుకు వెళ్తున్నారంటూ సదరు వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది.  అయితే సీఎం ఢిల్లీ పర్యటనపై సీఎంవో కార్యాలయం పెదవి విప్పడం లేదు. దీంతో జగన్ హఠాత్తుగా ఢిల్లీ పర్యటన ఎందుకు అన్న విషయంపై పలు రకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.   కడప ఎంపీ ఆవినాశ్ రెడ్డి.. శనివారం (జనవరి 28)  సీబీఐ ఎదుట... విచారణకు హాజరుకావాల్సి ఉంది.  అలాగే జనవరి 31వ తేదీన రాజధాని కేసులపై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో  జగన్.. తన ఢిల్లీ పర్యట ప్రాధాన్యత సంతరించుకుంది.   వివేకా హత్య కేసులో   అవినాశ్ రెడ్డికి ఇటీవల సీబీఐ నోటీసులు అందజేసింది. అయితే తాను.. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. లోక్ సభ నియోజకవర్గ పరిధిలో వివిధ కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉందని.. సీబీఐ అధికారులకు  అవినాశ్ రెడ్డి సమాధానం ఇచ్చారు. అయితే ఆయన అజ్ణాతంలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారన్న సమాచారంతో సీబీఐ అప్రమత్తమైంది. దీంతో అవసరమైతే అవినాష్ రెడ్డిని అరెస్టు చేసైనా విచారించాలని సీబీఐ నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి.    ఇప్పటికే  వివేకానందరెడ్డి హత్య కేసులో పాత్రదారులు, సూత్రదారులు ఎవరనే అంశంపై సీబీఐకి ఓ క్లారిటీ వచ్చిందని.. ఈ నేపథ్యంలో వైయస్ ఫ్యామిలీలోని పలువురు కీలక వ్యక్తులను విచారించి.... అనంతరం సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న చర్చ జగన్ సొంత నియోజకవర్గం అయిన పులివెందులతో జోరుగా సాగుతోంది.    ఇటీవల  అవినాశ్ రెడ్డి తండ్రి   భాసర్కరెడ్డి కోసం..  సీబీఐ ఆరా తీయడం కూడా అవినాశ్ రెడ్డి, భాస్కరరెడ్డిలను సీబీఐ అరెస్టు చేస్తుందన్న అనుమానాలు వ్యక్తం కావడానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్ హడావుడిగా హస్తిన పర్యటన పెట్టుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవంగా ఆయన శుక్రవారం (జనవరి 27)నే హస్తినకు బయలుదేరుతారని భావించారు. అయితే కారణాలేమిటైనా పర్యటనలు రద్దు చేసుకుని ఆయన తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారు. ఏ క్షణంలోనైనా హస్తిన నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉందని ఆయన ఎదురు చూస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.  

కివీస్ తో తొలి టి20.. టీమ్ ఇండియా పరాజయం

టీమ్ ఇండియా వరుస   విజయాలకు  బ్రేక్ పడింది. న్యూజిలాండ్ తో టి20 సిరీస్ లో భాగంగా రాంచీ వేదికగా శుక్రవారం (జనవరి 27) జరిగిన తొలి మ్యాచ్ లో భాతర్ పోరాడి ఓడింది.  న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా  టీ20 సిరీస్ ను మాత్రం ఓటమితో మొదలెట్టింది.  తొలి టీ20 మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ (50)   హాఫ్ సెంచరీ వృధా అయ్యింది. లక్ష్య ఛేదనలో టీమ్ ఇండియా  15 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడం లక్ష్యఛేదనపై ప్రభావం చూపింది. గి ల్ 7, ఇషాన్ కిషన్ 4 పరుగులు చేయగా, రాహుల్ త్రిపాఠి డకౌట్ అయ్యాడు. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ 47(34 బంతుల్లో), కెప్టెన్ హార్దిక్ పాండ్యా 21 పరుగులతో జట్టును గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే వారిద్దరూ వెంటవెంటనే ఔట్ కావడంతో ఇన్నింగ్స్ నడిపించే భారం వాషింగ్టన్ సుందర్ పై పడింది. అతడికి మరో ఎండ్ నుంచి సహకారం కరవైంది. దాంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. కివీస్ బౌలర్లలో మైకేల్ బ్రేస్వెల్, శాంట్నర్, ఫెర్గుసన్ చెరో 2 వికెట్లు తీశారు. డఫీ, సోధీ తలో వికెట్ తీశారు.  అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఈ విజయంతో మూడు టీ20 ల సిరీస్ లో 1-0తో కివీస్ లీడ్ లో ఉంది.   ఇరుజట్ల మధ్య రెండో టి20 ఆదివారం (జనవరి 29) లక్నో వేదికగా జరుగుతుంది.

యువగళం డే నంబర్ 1.. ఆకట్టుకున్నారు.. అదరగొట్టేశారు!

తొలి అడుగు అదిరింది. ఆరంభం బ్రహ్మాండంగా ఉంది. కుప్పం నుంచి శుక్రవారం ఉదయం ప్రారంభమైన నారా లోకేష్ యువగళం పాదయాత్ర అధికార పార్టీపై విమర్శలతో, ప్రజా సమస్యల పరిష్కారం హామీలతో సాగింది. అదే సమయంలో పరోక్షంగానైనా జనసేన, తెలుగుదేశం మధ్య పొత్తు ఉంటుందన్న సందేశాన్నీ ఇచ్చింది.  ఈ సందర్భంగా లోకేష్ వేసిన ప్రతి అడుగులోనూ ఆయనలో పరిణితి చెందిన నాయకుడు కనిపించాడు. రాజకీయ విమర్శలు చేస్తూనే వాటిని ప్రజా సమస్యలతో మేళవించారు. తన రాజకీయం ప్రజల కోసమేననీ, రాష్ట్రంలో దుష్టపాలన అంతం చేయడానికేననీ విస్పష్టంగా చాటారు.   తొలి రోజు పర్యటనలో ఆయన ప్రసంగం ప్రజాసమస్యలను ప్రస్తావిస్తూ, జగన్ సర్కార్ ను ఎండగడుతూ సాగింది. ఎక్కడా తడబాటు లేదు. తనపై, తెలుగుదేశంపై మంత్రులు గతంలో చేసిన విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్లు వేశారు. ముఖ్యమంత్రిని జాదూరెడ్డిగా అభివర్ణించారు. రాష్ట్రంలో జాదూ రెడ్డి పాలన అంతా జాదూయే అని చెప్పారు.  జగన్ పాలనా వైఫల్యాలను ఎండగట్టారు.  మూడున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పీకింది ఏమిటని ప్రశ్నించారు.  తెలుగుజాతి గర్వపడేలా దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. యావత్ ప్రపంచం అచ్చెరువొందేలా చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. జాదూరెడ్డి వచ్చి  రాష్ట్రాన్ని 67 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు. మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు, అలాగే జాదూరెడ్డి జాబ్ క్యాలెండర్లో జాబ్ లు ఉండవు అంటూ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే యువత కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.  ఇక మంత్రి రోజాకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. తనకు చీర, గాజులు పంపిస్తామని ఓ మహిళా మంత్రి అన్నారు.. పంపమనండి వాటిని మా అక్కాచెల్లెమ్మలకు ఇచ్చి కాళ్లు మొక్కుతానని కౌంటర్ ఇచ్చారు. తాను తల్లి, చెల్లిని గెంటేసేవాడిని కాదన్నారు.   జే బ్రాండ్‌ మద్యంతో జాదూరెడ్డి మహిళల మంగళసూత్రాలు తెంపుతున్నాడంటూ విమర్శించారు.  రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడోస్థానంలో ఉందన్నారు.  జే ట్యాక్స్‌ కట్టలేక పరిశ్రమలను ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయన్నారు. వీధుల్లో డ్యాన్సులు వేస్తేనో.. క్యాసినో ఆడిస్తేనో పరిశ్రమలు రావని ఎద్దేవా చేశారు.   ఎక్కడా తడబాటు లేకుండా జగన్ వైఫల్యాలనూ, తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అన్న విషయాలను సూటిగా, స్పష్టంగా జన హృదయాలను హత్తుకునేలా చెప్పారు. తాను పాదయాత్ర పేరు ప్రకటించగానే వైసీపీ నేతల ఫ్యాంట్లు తడిసిపోయాయన్నారు. అందుకే జీవో నంబర్ 1 తెచ్చారని లోకేష్ అన్నారు. పాదయాత్ర అనుకోగానే తన సన్నిహితులు కొందరు వారించారనీ, సొంత బాబాయ్ ని చంపేసిన వ్యక్తి.. ఎంతకైనా తెగిస్తాడు వద్దని చెప్పారనీ లోకేష్ అన్నారు. అయితే  స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీలో చదివా. వరల్డ్‌ బ్యాంక్‌లో పనిచేశా. హెరిటేజ్‌ వంటి పెద్ద వ్యాపార సంస్థను నిర్వహించా. ప్రజల కంట కన్నీరు చూసి పాదయాత్ర చేస్తున్నానని వారిని సముదాయించానన్నారు, భయం అన్నది నా బయోడేటాలోనే లేదు అని లోకేష్ ఉద్ఘాటించారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే యూత్‌ మేనిఫెస్టో తెస్తామన్నారు, ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించి ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇసుకను ఉచితంగా ఇస్తామన్నారు. ఇలా ఏం చేస్తామో చెప్పడమే కాకుండా.. తాను మంత్రిగా ఉన్నప్పుడు చేసినదేమిటో కూడా చెప్పారు.  పంచాయతీరాజ్‌ మంత్రిగా 25 వేల కిలోమీటర్ల   సిమెంట్‌ రోడ్లు వేయించా, పల్లెల్లో 25 లక్షల వీధి దీపాలు ఏర్పాటు చేయించా. 25 వేల కోట్లతో ఇంటింటికీ కుళాయిల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. ఐటీ మంత్రిగా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసి రాష్ట్రంలో 80 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించానని లోకేష్ గుర్తు చేశారు. ఈ మూడున్నరేళ్లలో జగన్ సర్కార్ ప్రజల కోసం చేసిన ఒక్క మంచి పని ఉందా అని ప్రశ్నించారు. 

రాహుల్ జోడో యాత్ర లక్ష్యం నెరవేరేనా?

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మరి కొద్ది రోజులలో అంటే ఈ నెలాఖరుకు ముగియనుంది. కన్యాకుమారి టు కాశ్మీర్ ఆయన సాగించిన సుదీర్ఘ పాదయాత్ర ప్రజలలో ఆయన ఇమేజ్ పెరిగేందుకు దోహదపడింది. అందులో సందేహం లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీలోనూ నూతనోత్సాహం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అయినంత మాత్రాన ఈ పాదయాత్ర కాంగ్రెస్ ను వచ్చే సార్వత్రిక ఎన్నికలలో అధికార పీఠంపై కూర్చోపెడుతుందా? అంటే మాత్రం కచ్చితంగా ఔను అనే సమాధానం రావడం లేదు. అందుకు కారణాలు అనేకం ఉన్నా.. ప్రధాన కారణం మాత్రం కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో ఉన్న నమ్మకం, విశ్వాసం ఆ పార్టీ సీనియర్ నేతలలో కనిపించకపోవడమే. అలాగే రాష్ట్రాలలో ఆ పార్టీ నాయకుల మధ్య విభేదాలు, వాటిని నియంత్రించే స్థితిలో పార్టీ అధిష్ఠానం లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చ. పార్టీ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చూపినంతగా గాంధీ కుటుంబానికి పార్టీలోని మిగిలిన నేతలు విధేయంగా లేరన్న సంగతి స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ అధినాయకత్వం అంటే ఇప్పటికీ గాంధీ కుటుంబమే. పేరుకు మాత్రమే ఖర్గే అధ్యక్షుడు.. కానీ పార్టీ వ్యవహారాలన్నీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల కనుసన్నలలోనే సాగుతాయన్నది బహిరంగ రహస్యమే. జాతీయ పార్టీగా కాంగ్రెస్ పునాదులు కదలడం 2014లో పరాజయంతోనే ప్రారంభమయ్యాయి. 2019 ఎన్నికల పరాజయం తో కాంగ్రెస్ సౌథం బీటలు వారడం ఆరంభమైంది. ఇప్పుడు కాంగ్రెస్ మరమ్మతులు చేపట్టింది. ఆ మరమ్మతులు పూర్తై పార్టీకి పూర్వవైభవం రావాలంటే ఇంకా చాలా చాలా సమయం పడుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీకి దీటుగా నిలవగలుగుతుందా అంటే  అనుమానమే. అయితే గత రెండు సార్వత్రిక ఎన్నికల నాటి తో పోలిస్తే చాలా చాలా మెరుగుపడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలకు ఆధారంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ పాదయాత్ర సాగిన మార్గాన్నీ, తీరునూ వారు ఉదహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనంగా ఉన్న యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలను రాహుల్ పాదయాత్ర పట్టించుకోలేదు. అలాగే పార్టీ అంతో ఇంతో బలంగా ఉన్న కేరళ, కర్నాటక, మధ్య ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ రోజులు, ఎక్కువ కిలోమీటర్లు సాగింది. ఇక రాహుల్ గాంధీ కాంగ్రెస్ లో తిరుగులేని నేతగా.. ప్రజలలో గుర్తింపు సాధించడానికి కూడా ఈ యాత్ర దోహదపడింది. అలాగే ఈ యాత్రలో మోడీకి ప్రత్యామ్నాయం తానేనని చాటేందుకు రాహుల్ ప్రయత్నించారు. ఆ ప్రయత్నం ఫలించిందా లేదా అన్నది వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాతే తేలుతుంది. కానీ ఆ దిశగా రాహుల్ ప్రయత్నమైతే చేశారు. యాత్ర ప్రారంభం నాటికి రాహుల్ లో పరిణితి చెందిన నేతను ఎవరూ చూడలేదు.. కానీ యాత్ర సాగిన కొద్దీ ఆయనలో పరిపక్వతను పార్టీ శ్రేణులే కాదు, విపక్షాలు, ప్రజలూ కూడా గుర్తించాయి. అంగీకరించాయి. ఎక్కడా ఏ చిన్న అవాంతరం, అవాంఛనీయ సంఘటనా లేకుండా యాత్ర సాగడం నిజంగా రాహుల్ ఘనతే. యాత్ర సమయంలో పెరిగిన ఆయన గడ్డం.. అమృతసర్ లో కాషాయ వస్త్రధారణ.. ఆయనలో మోడీకి దీటుగా ఎదుగుతున్న నేతను ప్రజల కళ్లకు కట్టింది.   ఈ యాత్ర లక్ష్యం విషయంలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఏ కారణం చెప్పినా.. వాస్తవం మాత్రం పార్టీకి పునర్వైభవం తీసుకువచ్చి.. మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావడమే. అయితే అందుకు రాహుల్ గాంధీ యాత్ర చాలా వరకూ దోహదం చేసిందనడంలో సందేహం లేదు. ఇక మిగిలిన పని పార్టీ రాష్ట్రాల శాఖలపై ఆధారపడి ఉంది. రాష్ట్రాలలో కాంగ్రెస్ లో విభేదాలను పరిష్కరించుకుని ఏకతాటిపైకి వస్తేనే రాహుల్ పాదయాత్ర ఫలితాలు పార్టీకి దక్కుతాయి.   

వైసీపీకి మరో చాన్స్ లేదు..!

ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు? ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ భవిష్యత్ ఎలా ఉందో తెలియడానికి సర్వేలు ఎందుకు?  ఏపీలో అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది.     సర్వేలతో పని లేకుండానే వైసీపీకి వచ్చే ఎన్నికలలో మరోమారు అధికారం దక్కడం అసాధ్యం అని ఎవరినడిగినా చెప్పేస్తున్నారు. జగన్ మూడున్నరేళ్ల పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతృప్తిగా లేదు. ఏ వర్గమూ ప్రభుత్వ పాలన బాగుందని చెప్పే పరిస్థితి లేదు. ప్రతిపక్షాలు, ప్రజలే కాదు.. స్వయంగా వైసీపీ వర్గాలు కూడా అంతర్గత సంభాషణల్లో ఈ విషయాన్నిఅంగీకరిస్తున్నారు. ఆఫ్ ది రికార్డుగా  వైసీపీ నేతలు తమ ప్రభుత్వం మరోసారి అనుమానమేనని చెబుతున్నారు.  స్వయంగా ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలోనే పార్టీకి ఎదురీత పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ వైసీసీ పట్ల వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని అంగీకరిస్తున్నారు. వై నాట్ 175 అంటూ జగన్ ప్రదర్శిస్తున్నది మేకపోతు గాంభీర్యమేనని అంటున్నారు. విశ్లేషకుల అభిప్రాయాలూ, సర్వేల ఫలితాలతో సంబంధం లేకుండానే వైసీపీ భవిష్యత్ ఏమిటన్నది సామాన్య జనానికి సైతం తేటతెల్లమైపోవడానికి.. ఆ పార్టీ నేతలు సొంత పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న ప్రకటనలూ, వ్యాఖ్యలే కారణం అని చెప్పవచ్చు. ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన వైసీపీ నాయకులే.. సొంత పార్టీపైనా, ముఖ్యమంత్రిపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగుదేశం వైపే తమ అడుగులని విస్పష్టంగా ప్రకటించేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డిపై ఈ అవిధేయత రానున్న రోజులలో మరింత పెరుగుతుందని కూడా వారు చెబుతున్నారు. సరే ఇవన్నీ పక్కన పెడితే. ఇటీవల ఇండియా టుడే ఇటీవల నిర్వహించిన సర్వేలో కూడా జగన్ ప్రభుత్వానికి రానున్నది గడ్డుకాలమేనని తేల్చింది. ఇక మంత్రుల విషయానికి వస్తే కేబినెట్ లో ఉన్న పాతిక మంత్రులలో ముగ్గురు నలుగురు మినహా మిగిలిన వారెవరూ విజయం సాధించే అవకాశాలు లేవని పరిశీలకులు చెబుతున్నారు. ఇందుకు వారికి గడపగడపకు లో ఎదురైన పరాభవాన్ని, నిరసనల వెల్లువను తార్కాణంగా చూపుతున్నారు. అలాగే మాజీ మంత్రులకు కూడా వచ్చే ఏన్నికలలో విజయావకాశాలు అంతంత మాత్రమేనని అంటున్నారు. మాజీలు అయిన తరువాత వారు పెద్దగా జనంలోకి రాకపోవడం, అంతకు ముందు మంత్రులుగా కూడా వారు జనంలో పెద్దగా తిరిగింది లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో వారి పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని చెబుతున్నారు. ఇక ఇండియా టుడే సర్వే ప్రకారమే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో  13 పార్లమెంటు నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులకు విజయం సాధించే అవకాశాలు ఇసుమంతైనా లేవని వెల్లడైంది. ట్రెండ్ ఇలాగే సాగితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సర్వే చెబుతోంది.   

నందమూరి తారకరత్నకు తీవ్ర అస్వస్థత

నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న ఆయన లోకేష్ పాదయాత్ర సందర్భంగా కుప్పంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కుప్పంలోని వరదరాజస్వామి ఆలయంలో పూజల కార్యక్రమంలోనూ, అనంతరం మసీదులో ప్రార్ధనలలోనూ తారకరత్న పాల్గొన్నారు. అనంతరం పాదయాత్రలో అడుగు కదిపారు. నడుస్తుండగానే ఒక్క సారిగా తారకరత్న కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే కేసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి పీఈఎస్ హాస్పటల్ కు తరలించారు. ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికి తారకరత్న నాడి అందడం లేదనీ, శరీరం రంగు కూడా మారిందని వైద్యులు తెలపారు. దాదాపు 45 నిముషాల చికిత్స అనంతరం ఆయన పల్స్ నార్మల్ కు చేరుకుందని వివరించారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తారకరత్నకు గుండె పోటు వచ్చిందని అంటున్నారు. హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసుపత్రికి చేరుకున్నారు. చంద్రబాబు తారకరత్న ఆరోగ్యం గురించి వాకబు చేశారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యులను కోరారు. అవసరమైతే తారకరత్నను బెంగళూరు తరలించే అవకాశం ఉంది.  

బీఆర్ఎస్ గూటికి ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్

ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ తన తనయుడు  శిశిర్‌ గమాంగ్‌  తో కలిసి శుక్రవారం (జనవరి 27) బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందుకోసం ఆయన రెండు రోజుల కిందట బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి విదితమే.  బీఆర్‌ఎస్‌  అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో  గిరిధర్‌ గమాంగ్‌, శిశిర్ గమాంగ్ అలాగే   కోరాపుట్‌ మాజీ ఎంపీ జయరాం పాంగి కూడా బీఆర్ఎస్ గూటికి చేరనున్నారు.  కాంగ్రెస్‌ను వీడి 2015లో బిజెపిలో చేరిన గిరిధర్ గమాంగ్ కొద్ది రోజుల కిందట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయిన సంగతి విదితమే. ప్రగతి భవన్ లో జరిగిన ఈ భేటీలో   గిరిధర్ కుమారుడు శిశిర్ గమాంగ్, ఇతర నేతలు పాల్గొన్నారు. అప్పటి నుంచీ గిరిధర్ గమాంగ్ తన కుమారుడితో సహా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారన్న ప్రచారం జరుగోతోంది.   వీరిరువూ బీఆర్ఎస్ లో నేడు చేరనుండటంతో ఆ ప్రాచారం వాస్తవమేనని తేలింది. బీఆర్ఎస్ లో చేరేందుకు ఒడిశా నుంచి హైదరాబాద్ చేరుకున్న గిరిధర్ గమాండ్.. మరి కొద్ది సేపటిలో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. బీఆర్ఎస్ పార్టమెంటరీ సమావేశం జరుగుతోందనీ, ఆ సమావేశం పూర్తి కాగానే కేసీఆర్ వీరిరువురికీ గులాబీ కండువా కప్పుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ కార్యకలాపాలను తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించనున్నట్లు ఇప్పటికే కేసీఆర్ ప్రకటించిన  నేపథ్యంలో ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్  బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఇంతకీ ఈ గిరిధర్ గమాంగ ఎవరంటే..  1999లో అప్పటి వాజ్ పేయి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన  ఒకే ఒక్క ఓటు వేసిన వ్యక్తి. 1999 ఏప్రిల్ 17 న అవిశ్వాస పరీక్షలో 13 నెలల నాటి ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వాన్ని కూల్చిన కాంగ్రెస్ నేత గిరిధర్ గమాంగ్. ఈయన 9 సార్లు పార్లమెంటుకు ఎన్నియ్యారు. కాగా, గమాంగ్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే ఒడిశా ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలోనే  వాజ్‌పేయి ప్రభుత్వం ఎదుర్కొన్న అవిశ్వాస పరీక్షలో చివరి నిమిషంలో పార్లమెంట్‌కు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఒ ఒక్క వోటు కారణంగానే  నాటి బీజేపీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ  తరువాత కొద్ది రోజులకే ఆయన కాంగ్రెస్ పార్టీకి క్రమంగా దూరమయ్యారు. తన కుమారుడికి కాంగ్రెస్ తగు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోిస్తూ.. 2015లో బీజేపీ గూటికి చేరారు.

జనం మొగ్గు ఎటో తేలిపోయింది! .. చంద్రబాబు చుట్టూ ఐఏఎస్, ఐపీఎస్ ల ప్రదక్షిణలు

జనం మొగ్గు ఎటువైపు ఉంది.. ఏ పార్టీ పట్ల జనంలో అభిమానం మెండుగా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సర్కార్ వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ గద్దె ఎక్కుతుంది వంటి ప్రశ్నలకు సాధారణంగా ఎవరైనా సర్వేల మీద ఆధారపడతారు. అయితే జనం మూడ్ ఏమిటన్నది తెలుసుకోవడానికి వారికి సర్వేలు అక్కర్లేదు. వచ్చే ఎన్నికలలో విజయం సాధించే పార్టీ ఏది? పరాజయం పాలయ్యే పార్టీ ఏది అన్న విషయం వారు  అందరి కంటే ముందే పసిగట్టేయగలరు. వాళ్లే ఐఏఎస్ అధికారులు. రాజకీయ పరిభాషలో చెప్పాలంటే.. బాబూస్.  అధికారంలో ఉన్న పార్టీ వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చెప్పడానికి ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్ల అధికారుల విధేయత స్థాయిని బట్టి ఇట్టే చెప్పేయ వచ్చు.  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారుల తీరు గమనిస్తే రాబోయే ప్రభుత్వం ఎవరిదన్నది ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. నాలుగేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు అడుగులకు మడుగులొత్తిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పుడు సాధ్యమైనంతగా ప్రభుత్వానికి దూరం జరుగుతున్నారు. ఇంత కాలం చూసి రమ్మంటే కాల్చి వచ్చిన చందంగా ప్రభుత్వం ఇంత చెప్తే అంత చేసి విపక్షాన్ని చీకాకు పెట్టేందుకు మాత్రమే తమ అధికారాన్ని వాడిన అధికారులంతా.. ఇప్పుడు విపక్ష నేత కరుణాక్ష వీక్షణాల కోసం పడిగాపులు కాస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నాలుగేళ్లుగా జగన్ కరుణాకటాక్షాల కోసం పరిధి దాటి మరీ పనులు చేసిన కొందరు అధికారులు ఇప్పుడు చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నారని తెలుస్తే చాలు.. గప్ చిప్ గా తెలంగాణ రాజధానికి చేరుకుంటున్నారు. రహస్యంగా ఆయనతో భేటీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నాలుగేళ్లలో తాము వ్యవహరించిన తీరుకు క్షమాపణలకు కోరుకోవడమే కాదు.. అలా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందో వివరణ ఇస్తున్నారు. జగన్ సర్కార్ ఒత్తిడితోనే తాము  తెలుగుదేవం పార్టీకి వ్యతిరేకంగా చేయాల్సి వచ్చిందని చెప్పుకుంటున్నారు.   బరితెగించి మరీ ఇంత కాలం జగన్ కు భజన చేసిన అధికారులే ఇప్పడు బాబు ప్రాపకం కోసం కాళ్లా వేళ్లా పడుతున్నారు. ఈ తీరే ఏపీలో మారిన రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోంది.  చంద్ర‌బాబు రాష్ట్ర‌వ్యాప్త ప‌ర్య‌ట‌న‌లు స‌క్సెస్ కావ‌డం, అదే సమయంలో సీఎం జగన్ సహా, వైసీపీ చేపట్టిన కార్యక్రమాలపై జనం విముఖత చూపుతుండటం.. జగన్ సభలకే జనం కరవౌవుతున్న పరిస్థితి, గడపగడపకు లో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజా నిరసన ఎదురు అవుతుండటంతో  అధికారులకు విషయం అర్ధమైపోయింది.   బాబు-ప‌వ‌న్ భేటీతో జగన్ కు మరో చాన్స్ అసాధ్యం అన్న స్పష్టత వచ్చేసింది. దీంతో వచ్చేది తెలుగుదేశం సర్కారేనని నిర్ధారించుకున్న అధికారులు ప్లేట్ ఫిరాయించేందుకు రెడీ అవుతున్నారు. నిబంధనల మేరకు నడుచుకున్న అధికారులు యథావిథిగా తమ ఉద్యోగ ధర్మం తాము నిర్వర్తిస్తుంటే.. పరిధి దాటి ఎక్స్ ట్రాలు చేసిన వారు మాత్రం ఇప్పడు గాబరా పడుతున్నారు. వచ్చే ప్రభుత్వం తమపై చర్యలు తీసుకోవడం ఖాయమని భయపడుతున్నారు. అందుకే ముందుగానే తమ ఎక్స్ ట్రాలకు కారణాలను చంద్రబాబుకు వివరణ ఇచ్చుకుని కొంచెం సేఫ్ అవుదామని తాపత్రేయ పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు హైద‌రాబాద్లో చంద్ర‌బాబుని ర‌హ‌స్యంగా కలిశారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్ర‌భుత్వ  ఆదేశాల‌తో తాము అడ్డ‌గోలు నిర్ణ‌యాలు తీసుకోక త‌ప్ప‌డంలేద‌ని చంద్రబాబు ముందు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారని అంటున్నారు.   తెలుగుదేశం ప్ర‌భుత్వంలో తాము నిర్వర్తించిన విధులు, తమ ప్రతిభను  గుర్తు చేస్తూ  గత నాలుగేళ్లుగా తమ పనితీరు అధ్వానంగా ఉండటానికి కారణం జగన్ సర్కార్ అసమర్థతా, అనుచిత ఒత్తిడే కారణమని వివరణ ఇచ్చుకుంటున్నారు.   అలాగే తెలుగుదేశం పార్టీలోనే  కొనసాగుతూ.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మొహం చాటేసిన సీనియర్ నేతలు కూడా ఇప్పుడు మళ్లీ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేందుకు అడుగులు కదుపుతున్నారు.   అవకాశం దొరికితే చంద్రబాబును కలిసి తాము ఇంత కాలం ఒకింత సైలెన్స్ మెయిన్ టైన్ చేయడానికి కారణాలను చెప్పుకుని మళ్లీ పార్టీలో పూర్వపు స్థానాన్ని పదిలపరుచుకోవడానికి ప్రయత్నాలు ఆరంభించేశారు. వీలైతే చంద్రబాబును, కుదరకపోతే లోకేష్ ను కలిసి  తాము ఇక‌పై యాక్టివ్ గా ఉంటామ‌ని న‌మ్మ‌బ‌లుకుతున్నారు. ఇప్పడు నారా లోకేష్ పాదయాత్ర వారికి తమ పలుకుబడిని ప్రదర్వించేందుకు ఒక అవకాశంగా లభించిదని భావిస్తున్నారు. అలాగే వివిధ కారణాల వల్ల  పార్టీ మారిన వారు మళ్లీ తెలుగుదేశం గూటికి చేరేందుకు తమదైన శైలిలో, స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించేశారు.  

చిలుకా చిలుకా పలుకవా?

చిలుకా చిలుకా పలుకవా? అంటూ ఓ పాట ఉంది. బీహార్ పోలీసులు ఓ చిలుకను బంధించి  అదే పాట పాడుతున్నారు. ఆ చిలుక చేత మాట్లాడించి.. ఆ చిలుక పలుకుల ద్వారా మద్యం మాఫియా గుట్టు బయటపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఔను నిజమే లిక్కర్ మాఫియా కేసులో పోలీసులు ఓ రామచిలుకను అదుపులోనికి తీసుకున్నారు. ఇంతకీ ఆ రామచిలుకను ఎందుకు అరెస్టు చేశారంటే అది నిందితుల పెంపుడు చిలుకట. ఆ చిలుకను విచారించి మద్యం మాఫియా కేసును ఛేదిస్తామంటున్నారు. బీహార్ లోని గురువా పోలీసులు ఈ వింత విచారణ చేస్తున్నారు. మద్యం దందాపై విషయంలో వారు ఓ ఇంటిపై దాడి చేశారు. అయితే పోలీసుల దాడి గురించి ముందే తెలుసుకున్న నిందితులు పరారయ్యారు. దీంతో ఆ ఇంట్లో పోలీసులకు వారి పెంపుడు చిలుక మాత్రమే దొరికింది. దీంతో పోలీసులు దానిని అదుపులోనికి తీసుకున్నారు. ఇంతకీ విశేషమేమిటంటే అది మాట్లాడుతుంది. పోలీసులు ఏ మడిగినా కటోరే.. కటోరే అంటూ బదులిస్తోంది. ఇంకా విచారిస్తే.. నిందితులకు సంబంధించి బోలెడు వివరాలు రాబట్టవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు రామచిలుకను బంధించి విచారణ పేరున సాగిస్తున్న ప్రహసనంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.  గతంలో జానపద కథల్లో విన్నాం రాక్షసుడి ప్రాణం రామచిలుకలో ఉంది.. ఆ రామ చిలుక చెట్టు తొర్రలో ఉంది అని.. ఇప్పుడు మాత్రం నిందితుల గుట్టుముట్లన్నీ రామచిలుక నోట్లో ఉన్నాయి. ఆ రామచిలుక పోలీసు స్టేషన్ లో ఉంది అంటున్నారు. .

సర్కార్ వారి జీవోలకు అర్థాలే వేరులే!

అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రిగా ఉన్న కొణిజేటి రోశయ్య ఒక చక్కని సత్యాని చెప్పారు. ప్రభుత్వం జారీ చేసే జీవోలన్నీ అమలవుతాయని ఎవరికైనా ఓ చెడ్డ,  దురాభిప్రాయం ఏదైనా ఉంటే, ఆ అభిప్రాయాన్ని వెంటనే తుడిచేసుకోండని నిండు సభలో గొంతెత్తి మరీ చెప్పారు. జీవోలన్నీ జీవోలు కాదు, అందులో కొన్ని ఉత్తుత్తి జీవోలుంటాయని రోశయ్య సర్కార్ వారి సీక్రెట్   ఓపెన్ చేశారు. నిజమే  సమయ సందర్భాలను బట్టీ రాజకీయ అవసరాలను బట్టీ, ప్రభుత్వం జీవోలు జారీచేయడం ఎప్పటినుంచో ఉన్నదే.. అయితే, అన్ని జీవోలను అలా తీసి పక్కన పెట్టే పరిస్థితి ఉండదు.  కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఉత్తుత్తి జీవోలే  కాదు, రాజ్యాంగ విరుద్ధమైన జీవోలు కూడా వచ్చి పోతున్నాయి. అవును  జగన్ రెడ్డి విచిత్ర సర్కార్ జారీ చేసే జీవోల్లో ఎన్ని పని చేస్తాయో.. ఎన్ని రాజ్యాంగ బద్దంగా ఉంటాయో.. చెప్పడం కష్టం. అనేక జీవోలను కోర్టు కొట్టి వేస్తే.. కొన్ని జీవోలను ప్రభుత్వం తనకు తానే రద్దు చేసుకుంటూ ఉంటుంది. మరోవంక మరికొన్ని జీవోలను పబ్లిక్ డొమైన్  లో లేకుండా  చీకటి కొట్లో దాచేస్తుంది.  తాజాగా జగన్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలు ఒకే రోజు కాలం చేశాయి..  అందులో ఒకటి ఫ్లెక్సీ బ్యాన్ విధిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు పక్కన పెట్టింది. అలాగే, రియల్ ఎస్టేట్ వెంచర్లలో ఐదు శాతం పేదలకివ్వాలంటూ గతంలో ఇచ్చిన జీవోను ప్రభుత్వమే ఉపసంహరించుకుంది. అర్థాంతరంగా తనువు చాలించిన ఈ జంట జీవోలకు ఒక చిన్నపాటి చరిత్ర వుంది. ఎప్పుడో చాలా కాలం క్రితం  విశాఖ బీచ్‌లో ప్లాస్టిక్  వ్యర్ధాలను  ఏరివేసేందుకు ఓ స్వచ్చంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముఖ్యాతిధిగా పాల్గొన్నారు. మైక్  ముందు నిలబడి తమదైన స్టైల్లో గంభీర ఉపన్యాసం చేశారు.  అదే ఊపులో ( గిట్టని వాళ్ళు పూనకం అంటారు)  ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లుగా ప్రకటించారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవేముంటుంది. అధికారులు ముందు వెనక చూసుకోకుండా ఫ్లెక్సీలను నిషేధిస్తూ జీవోను తెచ్చారు. దీంతో ఫ్లెక్స్ ల మీద ఆధారపడి బతుకుతున్న వ్యాపారులు తమ బతుకు తెరువు మీద బండరాయి పడిందని  ఆందోళనకు గురయ్యారు. నిజానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అదే రోజు నుంచే  బ్యాన్ అమల్లోకి వస్తుందన్నారు కానీ ఆ తర్వాత వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు. చివరికి ఈ నెల 26 నుంచి అమల్లోకి వస్తుందన్నారు.  కానీ కొంత మంది కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు ఆ జీవో చెల్లదని.. సింగిల్ యూజ్ ఫ్లెక్సీలు ఉంటే.. వాటిపైనే నిషేధం అమలవుతుందని స్పష్టం చేసింది. అసలు ఫ్లెక్సీలు ప్లాస్టిక్ కాదని.. సింగిల్ యూజ్ కానే కాదని వ్యాపారులు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. అయినా. జగన్ రెడ్డి ప్రభుత్వం (బహుశా సహజసిద్ద దురహకారంతో కావచ్చును) నథింగ్ డూయింగ్  ముఖ్యమంత్రి మాట తప్పరు మడమ తిప్పరు అని మొండి కేసింది. ఇక చేసేది  లేక వ్యాపారాలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు జీవో చెల్లదని తీర్పు ఇవ్వడంతో పాటుగా, సర్కార్ నెత్తిన నాలుగు అక్షింతలు కూడా వేసింది. అలాగే  ఏపీలో ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే 5 శాతం జగనన్న కాలనీలకు చందా ఇచ్చుకోవాల‌ని గతంలో జీవో ఇచ్చారు. స్థలం రూపంలో అయినా లేదా డబ్బు రూపంలో నా అన్నది రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇష్టం అని జీవోలో పేర్కొన్నారు. అంటే ప్ర‌తి వెంచ‌ర్ లో 10 శాతం సామాజిక అవ‌స‌రాల కోసం కేటాయిస్తున్న దానికి అద‌నంగా మ‌రో 5 శాతం స్థ‌లం వ‌ద‌లాల్సి ఉంది. అయితే ఇది చట్ట విరద్ధమని.. చాలా మంది కోర్టు కెళ్లారు. చివరికి జగన్ రెడ్డి ప్రభుత్వం స్వహస్తాలతో సదరు జీవోను వెనక్కి తీసుకుంది. అఫ్కోర్స్ జీవో అమలు కాలేదు కానీ, కావాల్సిన వారికి కావలసిన మేళ్ళు జరిగాయని అంటారనుకోండి అది వేరే విషయం. ఉత్తుతి జీవోనే అయినా ఉత్తినే వెనక్కి తీసుకోలేదని చాలా మంది చేతులు తడిపిన తర్వాతనే జీవో వెనక్కి వెళ్లిందని అనేవాళ్ళు ఉన్నారు. అయినా డబ్బులు ఎవరికీ ఊరికే రావు అని  వాళ్ళకు మాత్రం తెలియదా ఏంటి?   నిజానికి, ఈ నాలుగేళ్ల కాలంలో జగన్ రెడ్డి ప్రభుత్వం నిబంధనలకు  అనుగుణంగా తెచ్చిన జీవోలేన్ని? అడ్డదారిన పట్టుకొచ్చిన జీవో లెన్ని? అందులో బతికిన వెన్ని? ఉన్నవెన్నిఅని లెక్కతీస్తే, పక్కాగా మాలిన జీవోలు ఓ పుంజీడు అయినా ఉంటాయో లేదో అనుమానమే అంటున్నారు అధికారులు. అందుకే జగన్ రెడ్డి ప్రభుత్వం జీవోలకు ముసుగులు వేస్తుంది. సీక్రెట్ గా ఉంచుతుందని అంటున్నారు. నిజానికి  అస్మదీయులకు మేళ్ళు చేసేందుకు సీక్రెట్ గా తెచ్చిన జీవోలను జగన్ రెడ్డి ప్రభుత్వం సీక్రెట్ గానే ఉంచుతోందని అంటున్నారు. అందులో కొన్ని జీవోలు వెలుగు చూస్తే, ప్రభుత్వ భూములు, ఇతర ఆస్తులు, చిన్నా పెద్ద కాంట్రాక్టులు ఇలా ఒకటని కాదు, సర్కార్ వారి అవినీతికి అద్దం పట్టే అనేక జ్వోలు వెలుగు చూస్తాయని అంటునారు. అయితే అది ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు మాత్రం జరగదు గాక జరగదని అంటున్నారు .