రైల్వే బడ్జెట్ గమ్యం మారింది

బడ్జెట్ అనగానే సహజంగా, సాధారణ బడ్జెట్ గురించే ఆలోచిస్తారు, కానీ, రైల్వే బడ్జెట్  గురించి పెద్దగా పట్టించుకోరు. సాధారణ బడ్జెట్ ప్రభావం నేరుగా సామాన్య ప్రజలపై పడుతుంది. సాధారణ బడ్జెట్ ప్రభావంతో పప్పు ఉప్పు మొదలు, చుట్టా బీడీ దాకా అన్నిటి ధరలు పెరుగుతాయనే భయం సామాన్యులను సహజంగా వెంటాడుతుంది.  అంతే సహజంగా  ప్రజల జీవన ప్రమాణాలపై సాధారణ బడ్జెట్ ప్రభావం ఉంటుంది. సాధారణ బడ్జెట్ కు ఉన్న ప్రాధాన్యత  రైల్వే బడ్జెట్ కు లేక అపోవడానికి అదొక కారణం అయితే,  గతంలో ఎప్పుడూ రైల్వే బడ్జెట్ కు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు పెద్దగా లేక పోవడం మరొక కారణం కావచ్చును. అయితే, ఇటీవల కాలంలో మోడీ ప్రభుత్వం సుస్థిర ఆర్థిక  అభివృద్ధి లక్ష్యంగా మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేస్తోది. ముఖ్యంగా రవాణా వ్యవస్థను పటిష్ట పరిచేందుకు రోడ్డు, జల, వాయు మార్గాలతో పాటుగా రైలు మార్గాల విస్తరణ, ఆధునీకరణకు ప్రాధాన్యత ఇస్తోంది. అందుకే, ఇటీవల కాలంలో రైల్వే బడ్జెట్  కూడా చర్చకు వస్తున్నది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో సాధారణ బడ్జెట్‌తో పాటు రైల్వే బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టనున్నారు. దీంతో కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్లు, కొత్త రైల్వే ఛార్జీలు..  తదితర విషయాలపై అందరిలోనూ ఈ బడ్జెట్ ఆసక్తిని నింపుతోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో వందే భారత్‌ రైళ్లు, బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే మూడేళ్లలో 400 సెమీ హైస్పీడ్, నెక్స్ట్ జనరేషన్ వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికను రూపొందించినట్లు గత బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఇప్పుడు వీటిపై ఏం చర్యలు తీసుకుంటారన్నదని ఆసక్తిగా మారింది. భారతీయ రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి బడ్జెట్‌ను పెంచే అవకాశాలు ఉన్నాయి. రైల్వేలకు కేటాయింపులు ప్రస్తుత సంవత్సరంలో రూ. 1.4 లక్షల కోట్లుగా ఉండగా అది 2023-2024 ఆర్థిక సంవత్సరానికి 30 శాతం పెంచి రూ. 1.9 లక్షల కోట్లు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2.45 లక్షల కోట్ల క్యాపిటల్‌ ఎక్స్‌పెండీచర్‌తో పోలిస్తే  వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం మూలధన వ్యయం రూ. 3 ట్రిలియన్లకు అంటే 20 శాతానికి పైగా పెరుగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. 2024 మొదటి క్వార్టర్‌లో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న వందే భారత్ రైలు  రీవ్యాంప్డ్ స్లీపర్ వెర్షన్ గురించి ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇంతకు ముందు ప్రకటించిన దానికి మించి ఈ ఏడాది బడ్జెట్‌లో మరో 400 కొత్త వందే భారత్ రైళ్ల ప్రణాళికలను ప్రభుత్వం ఆవిష్కరించే అవకాశం ఉంది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌, శతాబ్దీ ఎక్స్‌ప్రెస్‌లు సహా అన్ని హైస్పీడ్‌ రైళ్లను ఒక్కొక్కటిగా పక్కన పెట్టి వాటి స్థానంలో అన్ని చోట్లా వందే భారత్‌ రైళ్లను తీసుకురావాలని ప్రభుత్వం యోచనలో ఉంది. ప్రధాన మార్గాల్లో వేగాన్ని గంటకు 180 కిలోమీటర్ల స్థాయికి పెంచాలని చూస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశం స్టాండర్డ్-గేజ్ వందే భారత్ రైళ్లను ఎగుమతి చేయడం ప్రారంభిస్తుందని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఇటీవల చెప్పారు. ఈ ప్రణాళిక కార్యరూపం దాలిస్తే 180 కిమీ లేదా అంతకంటే ఎక్కువ వేగంతో రైళ్లను తయారు చేయగల సామర్థ్యం ఉన్న ఎనిమిది దేశాల సరసన భారత్‌ చేరుతుంది. 2025-2026 నాటికి యూరప్‌, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియాలోని మార్కెట్‌లకు ఎగుమతి చేయడానికి రైళ్లను తయారు చేయాలని కూడా రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే, బహుశా చరిత్రలో మొదటి సారి రైల్వే బడ్జెట్ కోసం ప్రజలు  ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంతవరకు ఎవరు  రైల్వే మత్రిగా ఎవరున్నా..  రైల్వే బడ్జెట్ లో సింహ భాగం మంత్రి వర్యుని స్వరాష్రాతునికి వెళ్ళిపోవడం ఆనవాయితీగా వస్తోంది.  ఇప్పుడు ఆ దృక్పథం మారింది ..వార్షిక బడ్జెట్ కు అనుబంధంగా ఆర్థిక మత్రిత్వ శాఖ రైల్వే బడ్జెట్ రూపొందించడంతో బడ్జెట్ బరువుతో పాటుగా దృక్పథం కూడా మారింది ... జాతీయ దృక్పథం ప్రాధాన్యత సంతరించుకుంది.

జీవో నంబర్1పై సుప్రీంలో జగన్ సర్కార్ కు దక్కని ఊరట

జీవో నంబర్ 1 విషయంలో జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో కూడా ఊరట లభించలేదు. రాష్ట్రంలో సభలూ సమావేశాలను నిషేధిస్తూ జగన్ సర్కార్ విడుదల చేసిన జీవో నంబర్ 1 ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీం కోర్టు ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు జరిగే విచారణలో వాదనలు వినిపించాలని ఏపీ సర్కార్ కు సూచించింది. 23వ తేదీన కేసు విచారణలోకి తీసుకోవాలని ఏపీ హైకోర్టు జడ్జిని ధర్మాసనం ఆదేశించింది.  ప్రమాదాల నివారణ కోసమే జీవో నంబర్ 1 తీసుకొచ్చామని, ప్రజలకు ఇబ్బంది కలగని ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చని జగన్ ప్రభుత్వం చెబుతున్నా. వైసీపీ వినా అన్ని రాజకీయ పార్టీలూ  జీవోను వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్షాల గొంతు నొక్కడం కోసమే జీవో తెచ్చారని, ఎమర్జెన్సీ కంటే కూడా దారుణమైన జీవో ఆరోపిస్తున్నారు. జీవోను వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిటిషన్ వేశారు. రామకృష్ణ పిటిషన్‌పై విచారణ చేపట్టి జీవోను ఈ నెల 23 వరకూ హైకోర్టు సస్పెండ్ చేసింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంను రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది.

రాహుల్ పాదయాత్రలో టీ షర్ట్ పైన జాకెట్..

భారత్ జోడో యాత్రలో శుక్రవారం ఓ విశేషం కనిపించింది. ఇంత కాలంగా కేవలం టీ షర్ట్ మాత్రమే వేసుకుని చలిని లెక్క చేయకుండా పాదయాత్ర సాగించిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు జమ్మూ కశ్మీర్ లో ఆయన పాదయాత్ర పవేశించిన తరువాత చలి నుంచి రక్షణ కోసం జాకెట్ ధరించారు. ఇప్పటి వరకూ 125 రోజులలో 3400 కీలోమీటర్ల మేర పాదయాత్ర సాగించిన రాహుల్ గాంధీ ఇన్ని రోజులూ చాలా చాలా సింపుల్ గా టీ షర్ట్ మాత్రమే ధరించి నడక సాగించారు. ఎందరు ప్రశ్నించినా తనకు చలి అనిపించేంత వరకూ స్వెట్టర్, జాకెట్ వేసుకునే ప్రశక్తి లేదని రాహుల్ పలుమార్లు స్పష్టం చేశారు. గజగజలాడించే చలిలో సైతం ఆయన కేవలం టీషర్ట్ తోనే నడిచారు. అయితే పంజాబ్ నుంచి జమ్మూ కాశ్మీర్ లో అడుగు పెట్టిన తరువాత ఆయన జాకెట్ వేసుకోక తప్పలేదు. జమ్మూలో ఉదయం నుంచీ చిరు జల్లులు కురుస్తున్నాయి. దీంతో రాహుల్ గాంధీ కొద్ది సేపు టీషర్ట్ వేసుకున్నారు. అనంతరం తొలగించేశారు అది వేరే విషయం. జమ్ము-కశ్మీర్ లో రాహుల్ కు మరింత  భద్రతా ఏర్పాట్లు చేశారు.  భద్రతా వలయాన్ని పటిష్టం చేశారు. జామర్స్ ను కూడా పెట్టారు. కశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల్లో కాలి నడకన వెళ్లద్దంటూ భద్రతా బలగాలు రాహుల్ ను ఇప్పటికే హెచ్చరించాయి కూడా. ఈనేపథ్యంలో భారత్ జోడో యాత్రలో కొన్ని మార్పులు చేస్తూ, పాదయాత్రను కుదిస్తున్నారుకూడా.

ఆర్థిక క్రమశిక్షణ ఎదీ?

ఎవరి బడ్జెట్ వారిదే.. ఎవరి తీరు వారిదే.. ఎక్కడా సామరస్యం కనిపించడం లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఒక దేశం అన్నట్లుగా ఆయారాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. దీంతో ఆర్థిక వ్యవహారాలవిషయంలో ఎవరి తీరు వారిదే అన్నట్లుగా తయారైంది. ప్రపంచాన్ని ఇప్పుడు ఆర్థిక మాంద్యం కమ్మేస్తోంది. ఇప్పటి వరకూ భారత్ మాత్రం ఆ ఆర్థిక మాంద్యం బారిన పడలేదు. ఇందుకు కారణాలనేకం ఉన్నా.. దేశం కూడా ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే ఆర్థిక మాంద్యం బారిన పడక తప్పదన్నసంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే కేంద్రం, కానీ రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ ఆ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ఇసుమంతైనా దృష్టి సారిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.   ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచంలో ఆర్థిక మాంద్యం, దేశ ఆర్థిక పరిస్థితి గురించిన పట్టింపే లేకుండా వ్యవహరిస్తున్నాయి. ఏవో కొన్ని రాష్ట్రాలు ప్రపంచ ఆర్థిక పోకడలు.. రానున్న ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో ఉంచుకుని తమ విధానాలను సవరించుకుంటున్నప్పటికీ.. చాలా రాష్ట్రాలు తమ ఆర్థిక విధానాలను వచ్చే ఎన్నికలలో విజయానికి పెట్టుబడి మార్గాలుగానే భావిస్తు్నాయి. ముఖ్యంగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయమే తీసుకుంటే సంక్షేమం పేరుతో ఉచితాలు, బుజ్జగింపులకే నిధులను దారాదత్తం చేస్తున్నది. ఉచితాల కోసం అప్పులు, ఆ అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులూ అంటూ, అభివృద్ధి, ఆదాయం పెంచుకునే మార్గాల వైపు దృష్టి సారించకుండా వ్యవహరిస్తున్నది.    సంక్షేమ పథకాలు, ఉచితా లపై చూపిస్తున్నంత శ్రద్ధను రాష్ట్రాలు పెట్టుబడులు, అభివృద్ధి, ఆదాయాన్నిపెంచుకునే విధానాలపై పై చూపించడం లేదు.  వర్తమాన ఆర్థిక సమస్యలను భవిష్యత్తుకు వాయిదా వేయాలన్న రాష్ట్రాల ఆలోచనల వల్ల భవిష్యత్  కూడా అంధకారమవుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా భవిష్యత్తు ప్రణాళికలపై, అవసరాలపై   దృష్టి పెట్టాలి. అనవసర ఖర్చులు తగ్గించుకుని, పెట్టుబడులు పెంచడానికి, ఆర్థిక వనరులను సమ కూర్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. తమ దుబారా, వ్యర్ధ వ్యయాలను అదుపు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ఇప్పటికే అనేక అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలను చుట్టుముట్టి, ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్న ఆర్థిక మాంద్యం భారతన్ను కూడా కబళించే అవకాశం లేకపోలేదు. భవిష్య త్తులో ఎదురు కాబోయే ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తమ తీరు మార్చుకుని, అభివృద్ధి పథకాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించాలి.

బీఆర్ఎస్ కు ఖమ్మం సభ ప్లస్సా.. మైనస్సా?

బీఆర్ఎస్ ఖమ్మం సభ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నట్లు విజయవంతమైందా? విపక్షాలు చెబుతున్నట్లుగా అట్లర్ ప్లాప్ అయ్యిందా? అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఈ సభ బీఆర్ఎస్ లో జోష్ నింపిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ మొదలు పెట్టినప్పటి నుంచీ ఆయన చేసిన ప్రయత్నాలు నీరు గారిపోయాయన్న అభిప్రాయమే రాజకీయ వర్గాలలో వ్యక్త మౌతోంది. గతంలో సిఎం కెసిఆర్ పలు రాష్ట్రాలకు వెళ్లి మరీ కలిసిన సిఎంలను బిఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఆహ్వానించలేదా..?  ఆహ్వానించినా వారు రాలేదా..? అన్న ప్రశ్నలు భారాస వర్గాలలోనే వినిపిస్తున్నాయి.   పలువురు సిఎంలతో చర్చించిన సిఎం కెసిఆర్ బీఆర్ఎస్ ఆవిర్బావ సబకు  వారినెందుకు దూరం పెట్టారన్నచర్చ సామాన్య జనంతో పాటుగా రాజకీయ వర్గాలలో కూడా జోరుగా సాగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఝార్ఖండ్ సిఎం హేమంత్ సోరేన్, బిహార్ సిఎం నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ సిఎం మమతాబెనర్జీ  వీరితో పాటు ఎన్సీపి అధినేత శరద్ పవార్, శి వసేన అధినేత  ఉద్దవ్ ఠాక్రే, రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వి యాదవ్ లను కేసీఆర్ ఎందుకు ఆహ్వానించలేదు.. ఒక వేళ ఆహ్వానించినా వారు ఆ ఆహ్వానాన్ని మన్నించలేదా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి.  ఆదిలోనే వారితో సిఎం కెసిఆర్ కు సయోధ్య కరువైందా...?  లేక బిఆర్ఎస్ తో వారు దూరంగా ఉండాలని భావిస్తున్నారా..? అన్న చర్చ ఇప్పుడు రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. బిఆర్ఎస్ ఆవిర్భావ సభకు వారెవరూ రాకపోవడం కేసీఆర్ తొలి అడుగులోనే జాతీయ రాజకీయాలలో తడబడ్డారా అన్న అనుమానాలను పరిశీలకుల వ్యక్తం చేస్తున్నారు. మోడీ ఇంటికి.. మేం ఢిల్లీకి అని ఖమ్మం సభ వేదికగా గంభీరంగా ప్రకటించిన కేసీఆర్.. కేవలం ఈ సభకు వచ్చిన ముగ్గురు, నలుగురు నాయకులతో ఎర్రకోటమీద జెండా ఎగురవేయగలనని భావిస్తున్నారా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మం సభకు వచ్చిన నాయకుల పార్టీలన్నీ కలిపినా కూడా పట్టుమని పాతిక లోక్ సభ స్థానాలు లేవు. అటువంటిది.. ఈ మద్దతుతో కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేస్తానంటే నమ్మశక్యంగా లేదనీ, అతి విశ్వాసమో.. లేదా అతి అమాయకత్వమో తప్ప మరొకటి కాదనీ అంటున్నారు.   జాతీయ స్థాయిలో రాజకీయం చేద్దామని భావిస్తున్న  సిఎం కెసిఆర్ కు  ప్రాంతీయ పార్టీల నుంచి ప్రతిబంధకాలు ఎదురౌతున్నాయన్న భావనా వ్యక్తమౌతోంది.   ప్రతి రాష్ట్రంలోనూ బిఆర్ఎస్ శాఖలను ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ ఉద్దేశానికి ఆయా రాష్ట్రాల్లోని అధికార ప్రాంతీయ పార్టీల నాయకత్వం   విముఖత ఎదురౌతోందని అంటున్నారు.  ఈ నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలో బిఆర్ఎస్ శాఖలను ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కు ఆయా రాష్ట్రాలలో ప్రతికూలతలే ఎదురౌతున్నాయనీ, అందుకే ఇప్పటి వరకూ ఏపీలో వినా మరే రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ శాఖలు ఏర్పాటు కాలేదనీ విశ్లేషిస్తున్నారు.   

మంగళగిరిలో నారా లోకేష్ కు నల్లేరు మీద బండి నడకే!

మంగళగిరిలో అధికార వైసీపీకి ఆ పార్టీలోని లీడర్ల నుంచి కేడర్ వరకు అంతా వరుసగా ఝలక్ ఇచ్చారు... ఇస్తున్నారు.  తాజాగా మంగళగిరి నియోజకవర్గంలోని పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు.. తెలుగుదేశం పార్టీలో చేరారు. మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు, కోమ్మారెడ్డి వీరారెడ్డి, నూతలపాటి నంబూద్రిపాద్, తిరువీధుల నరసింహమూర్తి తదితరులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరారు.ఇటీవలి కాలంలో  వైసీపీ నుంచి భారీగా తెలుగుదేశం పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. అలా వలస వస్తున్న వారిలో లీడర్ నుంచి కేడర్ వరకు   ఉంటున్నారు.   అయితే టీడీపీలోకి వైసీపీ నుంచి వలసలు పోటెత్తడంపై   విపక్ష నేతగా వైయస్ జగన్.. నాడు పాదయాత్రలో ఇచ్చిన హామీలకు.. అలాగే ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత.. ఆయన అమలు చేస్తున్న   విధానాలకు ఎక్కడా పొంతన లేదని...  ముఖ్యంగా  రాష్ట్ర రాజధాని అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు ఇచ్చిన  జగన్ అధికారంలోకి రాగానే.. మూడు రాజధానులంటూ కొత్త పల్లవి అందుకున్నారనీ, ఆ కారణంగా వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతను గమనించే మంగళగిరిలో వైసీపీ ఖాళీ అయిపోతోందనీ స్థానికులు చెబుతున్నారు.  అలాగే 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గ ప్రచారంలో భాగంగా.. నాటి ప్రతిపక్ష నేత  జగన్..  టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌పై పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. తన కేబినెట్‌లో ఆయనకు మంత్రి పదవి ఇస్తానని.. నియోజకవర్గ ప్రజల సాక్షిగా ప్రకటించారు... కానీ వైయస్ జగన్.. తన రెండు కేబినెట్ల కూర్పులో ఎక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు కనిపించలేదు.. వినిపించలేదు.  ఇలా   జగన్ ప్రతిపక్షనేతగా మాట తప్పం.. మడం తిప్పమంటూ ప్రకటించి,  ముఖ్యమంత్రి కాగానే.. మాట తప్పేయడం.. మడమ తిప్పేడయం చేశారని నియోజకవర్గ ప్రజల్లు సోదాహరణగా చెబుతున్నారు. మరోవైపు ఎన్నికలకు ముందు తెలుగుదేశం నుంచి వైసీపీలోకి  జంప్ చేసిన  చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీకి సైతం వైయస్ జగన్... తన కేబినెట్‌లో అత్యంత కీలక శాఖల్లో ఒకటైన వైద్య ఆరోగ్య శాఖను కట్టబెట్టారని..  దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒకానొక దశలో తీవ్రంగా హర్ట్ అయి.. బుంగమూతి సైతం పెట్టుకున్నారని.. అందుకే వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదని.. ఇప్పటికే   ఎమ్మెల్యే ఆళ్ల... స్వయంగా తన కేడర్ వద్ద పేర్కొన్నట్లు ఇప్పటికే నియోజకవర్గంలో ఓ టాక్ అయితే హల్‌చల్ చేస్తోంది.   ఇంకోవైపు గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలైనా నారా లోకేశ్.. గత మూడున్నర్లేళ్లుగా నియోజకవర్గ ప్రజల మధ్యనే ఉంటూ.. వారి సమస్యలపై  అలుపెరగకుండా పోరాటం చేస్తున్నారని.. అలాగే  నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు ... ఆరోగ్య సంజీవినీ పేరిట మొబైల్ వైద్యశాలలు సైతం ఏర్పాటు చేశారు. ఇంకోవైపు.. మంగళగిరి టీడీపీలో బలమైన నాయకుడిగా పేరున్న గంజి చిరంజీవి లాంటి వారిని సైతం జగన్ పార్టీ ఆకర్షించేసిందని.. అలాగే వచ్చే ఎన్నికల్లో నారా లోకేశ్ విజయాన్ని అడ్డుకునేందుకు ఎంత చేయాలో అంతా చేసేందు ఫ్యాన్ పార్టీ అధినేత, సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఎం హనుమంతరావును సైతం ఇలా పార్టీలొకి తీసుకుని..  అలా ఆయన్ని ఎమ్మెల్సీగా ఎంపిక చేశారని నియోజకవర్గ ప్రజలే అంటున్నారు. అలాంటి సమయంలో సైతం.. మంగళగిరి నియోజకవర్గంలోని జగన్ పార్టీలో కీలక నేతలంతా.. వరుసగా సైకిల్ ఎక్కేస్తుండటం పార్టీ పట్ల ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చెబుతోందని అంటున్నారు. ఇక నారా లోకేశ్.. యువగళం పేరుతో చేపట్టనున్న పాదయాత్ర. జనవరి 27న కుప్పంలో ప్రారంభం కానుంది. దాదాపు 400 రోజుల పాటు.. నాలుగువేల కిలోమీటర్లు మేర ఈ పాదయాత్ర సాగనుంది. అలా నారా లోకేశ్.. ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకొంటూ..ఈ జగన్ ప్రభుత్వంలోని పాలన వైఫల్యాలను తన గళంతో ఎండగడుతూ.. నారా లోకేశ్ ముందుకు సాగనున్నారు.

బీజేపీకి ఈశాన్య గండం!

బీజేపీ వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తమౌతోంది. ఈ ఏడాది జరగనున్న తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలోనూ విజయం సాధించాలన్న నిర్ణయంతో అడుగులు వేస్తోంది. పాలనా వ్యవహారాలన్నీ పక్కన పెట్టేసి కేంద్రం కూడా ఎన్నికల మూడ్ లోకి వెళ్లి పోయింది. ఈ ఏడాది ఇప్పటికే తొలి ఎన్నికల నగారా మోగింది. మూడు ఈశాన్య రాష్ట్రాలలో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మార్చి 2న విడుదల కానున్నాయి. అయితే కొత్త ఏడాది లో జరగనున్న మూడు ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీకి కేక్ వాక్ కాదు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించేసిన బీజేపీకి ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికలు పెద్ద అగ్నిపరీక్షగానే మారనున్నాయి.    త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలలో బీజేపీ విజయంపై పరిశీలకులే కాదు, బీజేపీ శ్రేణులు కూడా నమ్మకంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ మూడు రాష్ట్రాలలో త్రిపురలో ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉంది. త్రిపురలో గత ఎన్నికల్లో మేజిక్‌ ఫిగర్‌ను సాధించి అధికారంలోకి వచ్చింది బీజేపీ. అంతకు ముందు త్రిపురలో బీజేపీకి ఉనికి కూడా నామమాత్రం అన్నట్లుగా పరిస్థితి ఉంది.   అలాంటి స్థితి నుంచి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఐదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత ఇప్పుడు  గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ పార్టీ   రాష్ట్ర నాయకత్వంలో అంతర్గత విభేదాలు తీవ్ర మయ్యాయి. 2018లో విప్లవ్‌ దేవ్‌ను సీఎంగా ఎంపిక చేసిన బీజేపీ ఆయనను దింపేసి మాణిక్‌ సాహాను సీఎం చేసింది. ఇప్పుడు ఆయన కూడా పార్టీ నాయకుల నుంచే  వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.  త్రిపురలో బెంగాలీ జనాభా ఎక్కువ. ఇక్కడ కాంగ్రెస్, వామపక్షాలు, మమతా బెనర్జీ బరిలో నిలిస్తే..   బీజేపీకి గడ్డు పరిస్థితులు ఎదురౌతాయి. ఇక  మేఘాలయ విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో  బీజేపీకి ఉన్నది రెండే రెండు సీట్లు. అయితే నేషనల్ పీపుల్స్ పార్టీకి మద్దతిచ్చి ప్రభుత్వంలో భాగం అయింది. . అయితే, ఇప్పుడు రెండు పార్టీల మధ్య పొత్తుకు బీటలు వారాయి . తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని మేఘాలయ ముఖ్యమంత్రి సీఎం కన్రాడ్‌ సంగ్మా ప్రకటించి బీజేపీతో పొత్తు లేదని విస్పష్టంగా చెప్పేశారు. అలాగే బీజేపీ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపుతామని ప్రకటించింది. అయితే వాస్తవానికి మేఘాలయలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఒకటి, రెండు సీట్లు సాధిస్తే.. బలవంతంగా అధికార కూటమిలో చేరే అవకాశం ఉంటుంది. నాగాలాండ్‌లో కూడా బీజేపీ ఒంటరి విజయం సాధించే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆ పార్టీ సంకీర్ణ కూటమిలో  భాగస్వామి. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదు. గత ఎన్నికల్లో 12 స్థానాలు గెలిచిన బీజేపీ ఇప్పుడు 20 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నది. మరోవైపు   గిరిజన తెగలు  ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్‌  బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నాయి.   ఏ విధంగా చూసుకున్నా.. 2024 సార్వత్రిక ఎన్నికల టార్గెట్ లో భాగంగా బీజేపీ నిర్దేశించుకున్న మిషన్ 9లో తొలి మూడు రాష్ట్రాలలోనే ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అందుకే ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అగ్నిపరీక్ష అనే చెప్పాలి.  

జనసేనతో బీజేపీ కటీఫ్.. వైసీపీతోనే కలిసి వెళుతుందా?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు పొత్తుల చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కొనాలంటే పొత్తులు అనివార్యం అన్న నిర్ణయానికి ప్రధాన పార్టీలు వచ్చేశాయి. ఈ విషయంలో మొదటి నుంచీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చొరవ తీసుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల నివ్వనని, ఈ విషయంలో అవసరమైతే ప్రధాని మోడీతో స్వయంగా మాట్లాడుతాననీ కూడా ప్రకటించారు. అయితే ఏపీలో ఇసుమంతైనా ఓట్ స్టేక్ లేని బీజేపీకి కేంద్రంలో అధికారంలో ఉందన్న ఏకైక కారణంతో ఒకింత ప్రాధాన్యత ఏపీలో రాజకీయంగా లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే జనసేన పవన్ కల్యాణ్ ను ఒక ట్రాప్ లో చిక్కుకునేలా గత మూడున్నరేళ్లుగా దిగ్బంధంలో ఉంచగలిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధం, అరాచకాలు పెరుగుతున్న నేపథ్యంలో జనసేనాని రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండాలన్న దానిపై ఒక క్లారిటీకి వచ్చేశారు. ఇటీవల తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో భేటీ అనంతరం ఆయనతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతరం.. రణస్థలితో సభలో మాట్లాడిన ఆయన తెలుగుదేశంతో కలిసి సాగనున్నట్లు దాదాపుగా స్పష్టత ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీని పూర్తిగా విస్మరించినట్లే కనిపించింది. ఇప్పుడు తెలుగుదేశం, జనసేనతో కలిసి నడవాలా వద్దా అన్నది బీజేపీయే నిర్ణయించుకోవలసిన అవసరం ఏర్పడింది. ఇంత కాలం మిత్రపక్షంగా ఉన్నా జనసేనను బీజేపీ విస్మరిస్తే.. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనసేన బీజేపీని ఇగ్నోర్ చేసింది. బంతిని ఆ పార్టీ కోర్టులోకే నెట్టేసింది. తొలి సారి జనసేనాని ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ప్రకటించినప్పుడు రాష్ట్రంలో 2014 నాటి పొత్తులు పొడుస్తున్నాయా అన్న చర్చ తెరమీదకు వచ్చింది.  జనసేన విశాఖ గర్జన సందర్భంగా  చోటు చేసుకున్న పరిణామాలు, పవన్ కల్యాణ్ ను హోటల్ కు పరిమితం చేసేలా ఆంక్షలు విధించడం తో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పవన్ కు ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించడమే కాకుండా.. ఆయన విశాఖ నుంచి వచ్చిన తరువాత స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆయనతో కలిసి సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. ఆ సందర్భంగా జనసేన మిత్ర పక్షం బీజేపీ కూడా పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించింది. దీంతో ఏపీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేనల పొత్తు ఖాయమని అంతా భావించారు.   ఈ సందర్భంగానే రాష్ట్ర పతి ఎన్నిక సందర్భంగా  బెజవాడలో ముర్ముతో టీడీపీ నేతల భేటీ వద్దంటూ వైసీపీ  బీజేపీపై ఎంత  ఒత్తిడి తసుకు వచ్చినా వినకుండా  ఆమెతో టీడీపీ నేతల భేటీ కి సోము వీర్రాజు వంటి నేతలు స్వయంగా పూనుకోవడం,  చంద్రబాబుకు   12+12 ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ పెంచడం వీటన్నిటినీ కలిపి చూస్తే రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు దగ్గరౌతున్నాయనడానికి పరిశీలకులు నిర్ధారణకు వచ్చేశారు. అాదే విధంగా `ఢిల్లీలో  మోడీ అధ్యక్షతన జరిగిన ఆజాదీకా అమృతోత్సవ్ జాతీయ కమిటీ సమావేశానికి కేంద్రం నుంచి అందిన ఆహ్వానం మేరకు  చంద్రబాబు  హస్తిన వెళ్లడం, ఆ సందర్బంగా కొద్ది సేపు మోడీతో ముచ్చటించడాన్ని కూడా పరిశీలకులు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయనడానికి తార్కానాలుగా పేర్కొన్నారు. అయితే.. ఏపీ బీజేపీలో మాత్రం తెలుగుదేశంతో మైత్రి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.  ఈ నేపథ్యంలోనే ఇటీవల హస్తినలో జరిగిన  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఏపీలో పొత్తులు వద్దని నిర్ణయించింది.  ఈ నెల 23, 24 తేదీల్లో భీమవరంలో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఈ విషయాన్ని బీజేపీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పొత్తులకు దూరం అని బీజేపీ ప్రకటించడమంటే వైసీపీకి సానుకూలంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేవలం 1 లేదా 1.5 శాతం ఓట్లతో బీజేపీ రాష్ట్రంలో సాధించేదీ, సాధించగలిగేదీ ఏమీ లేకపోయినా.. జనసేనకు దూరం జరగడం ద్వారా ఏపీలో వైసీపీ పట్ల బీజేపీ సానుకూలంగా ఉందన్న సంకేతాలు ఇవ్వాలన్నది ఆ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది.  పేరుకు సొంతంగా ఎదగడానికే పొత్తులకు దూరం అని చెబుతున్నా.. ఇప్పటి వరకూ కేంద్రంలోని మోడీ సర్కార్ ఏపీలోని జగన్ సర్కార్ కు అందిస్తున్న సహకారాన్ని గమనిస్తే బీజేపీ జగన్ పార్టీకి దగ్గరౌతోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

రక్తంతో మోడీకి నిరసన లేఖలు

బృందావన్ టెంపుల్ కారిడార్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.   బంకి బిహారీ  ఆలయం చుట్టూ  నిర్మించ తలపెట్టిన ఈ కారిడార్ పనులను స్థానికులు, వ్యాపారులు, పూజారులు వ్యతిరేకిస్తున్నారు. గత కొన్ని రోజులుగా యూపీ సర్కారు, కేంద్రానికి తమ గోడు వెళ్లబోసుకుంటున్నా పట్టించుకోవటం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యతిరేకతను పట్టించుకోవడం లేదంటూ వారు వినూత్న నిరసనకు దిగారు. బృందావన్ టెంపుల్ కారిడార్ పనులను ఆపేయాలంటూ వీరు ప్రధాని మోడీకీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు రక్తంతో లేఖలు రాశారు.   బృందావన్ కారిడార్ ప్రాజెక్టు ప్రతులను తగులబెట్టి..తమ రక్తంతో మొత్తం 108 లేఖలను రాశారు.   బృందావనం పవిత్రతను కాపాడాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. కాగా మందిరాన్ని ఆనుకున్న వీధుల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నవారంతా తమ వ్యాపారాలు మూసేసి రోడ్డెక్కారు. కాశీ విశ్వనాథ్ టెంపులు కారిడార్ ప్రాజెక్టులా దీన్ని నిర్మిస్తే చాలా మంది ఉపాధి కోల్పోవడమే కాకుండా    సొంత ఇళ్లను కోల్పేయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంకి బిహారీ మందిరంలో కృష్ణుడు చిన్న బాలుడిలా ఉంటూ దర్శనం ఇస్తాడు..అయితే ఈ మందిరంలో తరచూ తొక్కిసిలాట జరిగి మరణాలు సంభవిస్తుంటాయి. భక్తుల రద్దీని తట్టుకునే  ప్రభుత్వం తలపెట్టిన ఈ కారిడార్ పనులు ఆపేయాలంటూ స్థానికులు న్యాయపోరాటానికి దిగారు.

ఖమ్మంలో మరో బహిరంగ సభ.. ఈ సారి బీజేపీ?

ఖమ్మంలో మరో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.  ఈసారి బీజేపీ.. ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నట్లు  తెలుస్తోంది. వచ్చే నెలలో ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  ఈ సభకు కమలం పార్టీకి చెందిన అగ్రనేతలు హాజరవుతారని.. వారి సమక్షంలో ఖమ్మం జిల్లాకు చెందిన లోక్‌సభ మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కాషాయం కుండువా కప్పుకోనున్నారని చెబుతున్నారు.  మరో వైపు జనవరి 18న ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించిన సభ జరిగిన రోజే న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఖమ్మంలో బీఆర్ఎస్ సభ జరిగింది,  కానీ పొంగులేటి కమలం గూటికి చేరడం మాత్రం జరగలేదు. ఖమ్మం వేదికగా కేసీఆర్ సభ జరిగిన అనంతరం..  బీజేపీలో చేరాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి  భావించారని.. అందుకే ఆయన బీజేపీలోకి ఎంట్రీ కొంచం వాయిదా పడిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  మరోవైపు గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసి.. అనంతరం మునుగోడులో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో  కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచినా.. బీజేపీ మాత్రం అనూహ్యంగా ఓటు బ్యాంకును భారీగా పెంచుకొంది.   అదే విధంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, ఆ సభావేదికపైనే పొంగులేటిని బీజేపీ గూటిలో చేర్చుకోవాలని కమలనాథులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఎందుకంటే.. ఇప్పటికే టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు తెలంగాణలోని ఖమ్మం వేదికగా నిర్వహించిన శంఖారావం సభ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత...  సైకిల్ పార్టీకి కేడర్ తప్ప లీడర్ లేంటున్న ప్రత్యర్థి పార్టీల నాయకులకు..ఈ సభతో సరైన సమాధానం లభించినట్లు అయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించిన సభకు.. వివిధ రాష్ట్రాల బీజేపీయేతర ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నాయకులు  హాజరయ్యారు.   దీంతో బీజేపీ అగ్రనాయకత్వం.. ఖమ్మంలోనే భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ స్పష్టమైన సందేశం ఇవ్వాలనే తలంపుతో ఉన్నట్లు తెలుస్తోంది.    ఇప్పటికే తెలంగాణలో ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని  కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటి .. అధికారం చేపట్టాలని  బీజేపీ భావిస్తోంది. ఆ క్రమంలో తెలంగాణలో పార్టీ బలహినంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి..  ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగు వేస్తోంది.  అందులోభాగంగా వివిధ పార్టీల్లో ఉన్న కీలక నేతలను తమ గుటిలోకి తీసుకు వచ్చేందుకు ఎంత చేయాలో అంతా చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించి.. అదీ కూడా గ్రాండ్ సక్సెస్ చేయడం ద్వారా తెలంగాణలో తమ పార్టీకి ఏ మాత్రం ఢోకా లేదనే ఓ స్పష్టమైన సంకేతాన్ని, సందేశాన్నీ.. ప్రత్యర్థి పార్టీలకే కాదు.. ప్రజలకు సైతం ఇవ్వాలన్న  అజెండాతో కమలదళం.. ఆ దిశగా అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

జై తెలంగాణ అనేందుకు కేసీఆర్ కు భయమా?

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభ రేపిన దుమారం కొంత సర్డుమణిగింది. ఎక్కడి నుంచో వచ్చిన నాయకులు వచ్చిన దారిన వెనక్కి వెళ్ళారు. ఆ వచ్చిన నలుగురూ ఏ సందేశం తీసుకు వెళ్ళారో ఏమో కానీ, భారాస నాయకులు, కార్యకర్తలే కాదు తెలంగాణ మేథావులు,సామాన్య ప్రజానీకంలోనూ అంతర్మథనం మొదలైన సంకేతాలు స్పష్టమవుతున్నాయి.  మరో వంక ఖమ్మం సభ మంచి చెడులు, లాభ నష్టాలపై అన్ని పార్టీలలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అధికార భారాసలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడదు కదా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రాజకీయ విశ్లేషకులు విభిన కోణాల్లో విశ్లేషణలు చేస్తున్నారు. అయితే  ఎవరు ఎన్ని విశ్లేషణలు చేసినా ఖమ్మం సభ ఇస్తుందనుకున్న క్లారిటీ అయితే ఇవ్వలేదని పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు.  తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి( తెరాస) పేరును  భారతీయ రాష్ట్ర సమితిగా (భారాస) గా మార్చడంతోనే తెలంగాణ అస్థిత్వ రాజకీయాలకు, రాజకీయ విలువలకు పార్టీ దూరమైందని.. ఇప్పడు ఖమ్మం సభలో ఎక్కడా జై తెలంగాణ నినాదమే వినిపించక పోవడం తెలంగాణ సమాజం జీర్ణించుకోలేక పోతోందని విశ్లేషకులు అంటున్నారు. గడచిన రెండు దశాబ్దాల కాలంలో ఎక్కడ తెరాస సభ జరిగినా, జై తెలంగాణ నినాదమే ప్రధానంగా వినిపించేది. చివరకు ఆ నినాదంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ముగిసేది,  కానీ, ఇప్పడు జై భారత్  కేసీఆర్ తమ ప్రసంగం ముగించారు. కానీ, ఏ నినాదం నినదిస్తూ 1200 మంది ప్రాణత్యాగం చేశారో .. అమరులయ్యారో ఆ ‘జై తెలంగాణ’ అనే మాట ఆయన నోటి నుంచి రాలేదు. ఇది ప్రజలకు పార్టీకి మధ్య దురాన్ని మరింత పెంచుతుందని అంటున్నారు.  ఇదే విషయంగా రాజకీయ ప్రత్యర్దులే కాదు, మేథావులు, ఉద్యమ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఏవరి దాకానో ఎందుకు, తెలంగాణ మలి దశ ఉద్యమంలో,కేసీఆర్ కు  కుడి భుజంగా నిలిచిన కోదండరాం, బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో జై తెలంగా అనడానికి సీఎం కేసీఆర్ సిగ్గుపడ్డారని  ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల పంపిణీ జాప్యానికి వ్యతిరేకంగా ఈనెల 30న ఢిల్లీలో జరప తలపెట్టిన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రిక, కరపత్రాలను కోదండరాం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన  మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని భావించడం లేదన్నారు. కృష్ణా నదీపైన ప్రాజెక్టులు అన్నీ పెండింగ్‌లో ఉన్నాయని, కాళేశ్వరం కట్టలు పూర్తి అయ్యాయి తప్పితే.. కాలువలు పూర్తి కాలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయ్యిందని చెప్పడం అబద్దమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. పేదల భూములను ఇష్టానుసారంగా గుంజుకుంటున్నారన్నారు.  ప్రైవేటుకు వ్యతిరేకమని చెబుతున్న కేసీఅర్ సింగరేణిలో సగం ప్రైవేటు పరం చేసింది నిజం కాదా? అని కోదండరాం ప్రశ్నించారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు తప్పితే అభివృద్ధి చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదని, విద్యా, వైద్యం, సింగరేణి ప్రైవేటు అయ్యాయనీ, ముఖ్యమంత్రి నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమయ్యాయన్నారు. ఈ నెల 30న కృష్ణా నదీ జలాల్లో వాటాపై డిల్లీలో పోరాడుతామని, 31న విభజన హామీలపై సెమినార్ నిర్వహిస్తామని కోదండరాం తెలిపారు. ఒక్క కోదండ రామ్ మాత్రమే కాదు, భారాస నాయకులు కూడా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంద్రా పాలకులు అసెంబ్లీలో తెలంగాణ పేరును బ్యాన్ చేశారని ఆరోపించిన కేసేఆర్, ఇప్పడు స్వరాష్ట్రంలో తెలంగాణ పేరును నిషేదించారని ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.

మోడీకి వ్యతిరేకంగా బీబీసీ డాక్యుమెంట్

వలసవాద పాలన అంతమై, ఏడున్నర దశాబ్దాలు పూర్తయినా  బ్రిటన్ నేషనల్ బ్రాడ్‌కాస్టర్ బీబీసీ ధోరణి మాత్రం మారలేదు. ఇప్పటికీ భారత దేశాన్ని, భారతీయ ఆచార వ్యవహారాలను అవహేళన చేయడం మానలేదు. భారతే దేశం విభిన్న రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రపంచం అంతా గుర్తించినా, బీబీసీ మాత్రం భారత దేశం సాధించిన పురోగతిని తిరోగమనంగా ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా, కేంద్రంలో అధికార మార్పిడి జరిగి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీబీసీ సాగిస్తున్న భారతగా వ్యతిరేక ప్రచారం మరింత  పెరిగింది. హద్దులు దాటి, వ్యక్తిగత దూషణల స్థాయికి దిగజారిన వైనం ఈ మధ్య కాలంలో మరింత పస్పుటంగా కనిపిస్తోంది.  ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ సిరీస్‌ వివాదాస్పదంగా మారింది. ఈ సిరీస్ పై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అపఖ్యాతి పాలు చేసే కథనాన్ని ప్రచారం చేయడం కోసమే ఈ విశ్వసనీయత లేని డాక్యుమెంటరీని ప్రసారం చేశారని దుయ్యబట్టింది. బ్రిటన్‌లోని అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో వలసవాద మనస్థత్వం, ఆలోచనా ధోరణి కనిపిస్తోందని పేర్కొంది.  బ్రిటన్ నేషనల్ బ్రాడ్‌కాస్టర్ బీబీసీ మోడీ పై రెండు భాగాలుగా ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.  2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల సమయంలో మోడీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెబుతూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంపై ఈ డాక్యుమెంటరీలో విమర్శలు గుప్పించింది. దీంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. కొన్ని ప్లాట్‌ఫామ్‌ల నుంచి దీనిని తొలగించారు. భారతీయ మూలాలుగల బ్రిటన్ పౌరులు ఈ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించారు. ప్రముఖ బ్రిటన్ పౌరుడు లార్డ్ రమి రేంజర్ మాట్లాడుతూ, 100 కోట్ల మందికి పైగా గల భారతీయుల మనసును బీబీసీ తీవ్రంగా గాయపరిచిందన్నారు. ఈ నేపథ్యంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియాతో మాట్లాడారు.   బ్రిటన్ అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీ షో వలసవాద ఆలోచనా ధోరణిని వెల్లడిస్తోందని అన్నారు. విశ్వసనీయత లేని కథనాన్ని అందరి మనసుల్లోకి జోప్పించాలనే లక్ష్యంతో రూపొందించిన, తప్పుదారి పట్టించే, పక్షపాతంతో కూడిన ప్రచారమని ఆరోపించారు. పక్షపాతం ఉండటం, నిష్పాక్షికత లేకపోవడం, వలసవాద ఆలోచనా ధోరణిని యథేచ్ఛగా కొనసాగించడం  స్పష్టమవుతున్నాయన్నారు.  దీనిని ప్రసారం చేయడం వెనుక ఎజెండా ఏమిటని ప్రశ్నించారు. గౌరవ, మర్యాదలతో పని చేయాలని కోరుకుంటున్నామన్నారు. ఈ డాక్యుమెంటరీలో బ్రిటన్ మాజీ సెక్రటరీ జాక్ స్ట్రా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, జాక్ స్ట్రా ఏదో అంతర్గత బ్రిటన్ నివేదికను ప్రస్తావించినట్లు కనిపిస్తోందని, అది తనకు ఏవిధంగా అందుబాటులో ఉంటుందని ప్రశ్నించారు. అది ఇరవయ్యేళ్ళ క్రితంనాటి నివేదిక అని, దానిపైన మనం ఇప్పుడు ఎందుకు స్పందించాలని అడిగారు. జాక్ చెప్పినంత మాత్రానికి అది సరైనదని వారు ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. ఇంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ అనే మాటలను తాను విన్నానని, వలసవాద ఆలోచనా ధోరణి అనే పదాలను మనం మాట్లాడటానికి ఓ కారణం ఉందని తెలిపారు. మనం పదాలను ఇష్టానుసారం వాడబోమన్నారు. ఇంక్వైరీ ఏమిటి? వారు అక్కడ దౌత్యవేత్తలు కదా? అన్నారు. ఇన్వెస్టిగేషన్ అంటే దేశాన్ని వారు పాలిస్తున్నారా? అని ప్రశ్నించారు.  అయితే, దురదృష్టం ఏమంటే ... బీబీసీ తప్పుడు కథనాలను బ్రిటన్ లోని భారతీయలు వ్యతిరేకిస్తున్నారు. కానీ, దేశంలోని కొందరు వ్యక్తులు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు బీబీసీ కథనానికి సోషల్ మీడియాలో ప్రాచుర్యం కల్పిస్తున్నారు.

బాబులు పసికట్టారు.. బాబుదే అధికారం

రాజకీయ నాయకుల లెక్కలు తప్పవచ్చును. రాజకీయ విశ్లేషకుల అంచనాలు తారుమారు కావచ్చును. పీకేల సర్వేలు, జ్యోతిష్య పండితుల లెక్కలూ తపవచ్చును  కానీ  రేపటి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ రోజే పక్కగా చెప్పే పండితులు ఎవరైనా ఉన్నారంటే, వారు  ప్రభుత్వ అధికారులు మాత్రమే. అవును, ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు చాలా గుంభనంగా అసలేమీ తెలియనట్లు ఉంటారు కానీ  రాజకీయ క్షేతంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నదో ఇట్టే పట్టేస్తారు.  రాజకీయలతో అసలు ఏ సంబంధం లేనట్లుండే అధికారులు రాజకీయ పరదాల చాటున ఏమి జరుగుతుందో కళ్ళు మూసుకుని చూసేస్తారు అందుకు తగ్గట్టుగా తమను తాము ట్యూన్ చేసుకుంటారు. స్ట్రాటజీలు మార్చుకుంటారు, ఇప్పడు ఏపీలో అదే జరుగుతోంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు వరసగా హైదరాబాద్ కు క్యూ కడుతున్నారు. అక్కడ రహస్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుస్తున్నారు. అంటే మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే నిజాన్ని, అధికారులు పసి గట్టారు. అందుకే, అలా ఒకరివెంట ఒకరుగా ఐఏఎస్, ఐపీఎస్‌లు హైద‌రాబాద్ లో  చంద్ర‌బాబుని  క‌లుస్తున్నారని ప్రచారం జరుగుతోంది.  నిజానికి, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రంలో వైఎస్పార్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే, జగన్మోహన్ రెడ్డి అధికారులను అడ్డగోలుగా వాడుకున్నారనే ఆరోపణలున్నాయి. జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లోనూ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు బుక్కయ్యారు. జైలు పాలయ్యారు. అలాగే, జగన్ రెడ్డి  ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సీఎస్, డీజీపీలతో సహా అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కోర్టు బోనెక్కారు. అవమానాలు ఫేస్ చేశారు. చివాట్లు తిన్నారు. అయినా కొందరు అధికారులు తాము చేస్తున్నది తప్పని తెలిసీ, ముఖ్యమంత్రి, మంత్రులు, సలహాదారుల ఒత్తిళ్ళకు తలొగ్గి తప్పులు చేయక తప్పడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా పోలీసు అధికారులు  టీడీపీ నాయకులు, కార్యకర్తలను అనేక విధాల వేధింపులకు గురి చేశారు. ఇప్పుడు అలాంటి వారంతా, ప్రభుత్వ పెద్ద‌ల ఆదేశాల‌తో తాము అడ్డ‌గోలు నిర్ణ‌యాలు తీసుకోక త‌ప్ప‌డం లేద‌ని వాపోతున్నారు. అలాంటి వారు ఇప్పడు గతంలో చంద్ర‌బాబు నాయుడుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ... త‌మ త‌ప్పుల్ని మ‌న్నించేయాల‌ని ముందుగానే వేడుకుంటున్నారు.  నిజానికి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తప్పు చేసిన అధికారులు చేసిన తప్పు ఒప్పుకుని పశ్చాతాపం ప్రకటిస్తే,  పెద్దమనసు చేసుకుని అలాంటి వారిని క్షమించి వదిలేసిన సందర్భాలు లేక పోలేదని అంటారు. అలాగే, అప్పట్లో బెట్టింగ్ మాఫియా కేసుల్లో అడ్డంగా దొరికిపోయిన అధికారిని చంద్రబాబు ముఖ్యమంత్రిగా తన విచక్షణాధికారాలను వినియోగించి రక్షించారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే,, అదే ఐపీఎస్ అధికారి వైసీపీ స‌ర్కారు రాగానే టిడిపిపై జులుం చెలాయిస్తూ చెల‌రేగిపోయారు. ఇప్పడు మళ్ళీ ఆయనే అన్యధా శరణం నాస్తి, అంటూ చంద్రబాబు నాయుడుని వేడుకునేందుకు, అయన అప్పాయింట్ మెంట్ కోసం, బూట్లు అరిగేలా తిరుగుతున్నారని  స‌మాచారం.   మ‌రోవైపు సీఐడీలో ప‌ని చేస్తున్న వారంతా చంద్ర‌బాబుని ఎలాగైనా క‌లిసి త‌మ త‌ప్పేమీ లేద‌ని  పై అధికారులు, రాజకీయ పెద్దలు ఆడుతున్న జగన్ నాటకంలో తాము పావులమయ్యామంటూ  అంటూ చెప్పుకుంటామ‌ని రిఫ‌రెన్సులు వెతుక్కుంటున్నార‌ట‌. మరో వంక రాష్ట్ర రాజకీయాలలో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పులు, ముఖ్యంగా ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు చంద్రబాబు నాయుడు అప్పాయింట్ మెంట్ కోసం పడుతున్న తీరును గమనిస్తున్న రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఇంతకాలం కొంత స్తబ్దుగా ఉన్న టీడీపీ నాయకులు, మంచి రోజులు మళ్ళీ  వస్తున్నాయనే విషయాని పసిగట్టి  యాక్టివ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబు నాయుడు ప‌ర్య‌ట‌న‌లు స‌క్సెస్ కావ‌డం తో రాష్ట్రంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణంపై అన్ని వ‌ర్గాల‌కు స్ప‌ష్ట‌త వస్తోంది. మ‌రోవైపు బాబు-ప‌వ‌న్ భేటీతో జగన్ అధికారం అంతం అవ్వడం ఖాయమన్న విషయంలో  అంద‌రికీ క్లారిటీ  వ‌చ్చేసింది. తెలుగుదేశం ప్ర‌భుత్వం రావ‌డం ఖాయ‌మ‌ని నిర్ధారించుకున్న నేత‌లు చంద్రబాబుతో కాదంటే చిన‌బాబు లోకేష్ తో కుదిరితే కప్పు కాఫీ, కాదంటే నాలుగు మాటల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా, ప‌ద‌వుల కోస‌మో, కేసుల భ‌యంతోనో, తాత్కాలిక ప్ర‌యోజ‌నాల కోస‌మో పార్టీ మారిన వారు సైతం తెలుగుదేశంలోకి మ‌ళ్లీ వ‌స్తామంటూ సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. అలా ఫీలర్స్ పంపుతున్న వారిలో ప్రస్తుతం వైసీపీలో ఉన్న కీలక నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాలు అంటేనే అంత... ఎప్పుడు ఏ గాలి ఎటు వీస్తుందో .. ఎవరికీ తెలియదు.

భద్రతా లోపాలు.. భారత్ జోడో యాత్ర కుదింపు?

రాహుల్ భారత్ జోడో యాత్రను కుదిస్తారా? అనంతనాగ్ ప్రాంతంలో పాదయాత్ర కాకుండా జోడో యాత్ర వాహనాలలో సాగుతుందా? అంటూ కాంగ్రెస్ వర్గాలు ఔననే అంటున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ జోడో యాత్రను కుదించాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. అనామక వ్యక్తులు జోడో యాత్రలోని అకస్మాత్తుగా వచ్చి చేరుతున్నారని కాంగ్రెస్ అనుమానిస్తోంది. రాహుల్ ను హగ్ చేసుకోవడానికి ఒక వ్యక్తి భద్రతా వలయాన్ని ఛేదించుకుని రావడం పలు అనుమానాలకు తావిచ్చింది. రాహుల్ భద్రత విషయంలో సరైన ప్రమాణాలు పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే.. ఆయన సెక్యూరిటీ మాత్రం రాహుల్ గాంధీ భద్రత పరమైన ప్రొటోకాల్ ను పాటించడం లేదని అంటున్నది. ఈ నేపథ్యంలోనే అనంతనాగ్ కు రాహుల్ జోడో యాత్ర చేరుకోగానే పాదయాత్రగా కాకుండా రాహుల్ వాహనంలో ప్రయాణించేందుకు అవసరమైన ఏర్పాట్లను కాంగ్రెస్ చేస్తోంది. అలాగే రూట్ మ్యాప్ లో కూడా మార్పులు చేయాలని ఆలోచిస్తోంది. ప్రస్తుతం రోజుకు పాతిక కిలోమీటర్లు  పాదయాత్ర సాగుతుందడా..దానిని కూడా తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే శ్రీనగర్ లో లాల్ చౌక్ లో భారత జెండా ఆవిష్కరణ కార్యక్రమం రద్దు చేసిన కాంగ్రెస్ పార్టీ అక్కడ కాకుండా మరో చోట రాహుల్ జాతీయ జెండా ఆవిష్కరిస్తారని చెబుతోంది. 

జగన్ సర్కార్ పై గవర్నర్ కు ఉద్యోగుల ఫిర్యాదు

జీతాల కోసం, ప్రైవేటు ఉద్యోగులు వీధుల్లోకి వచ్చారంటే అర్థం చేసుకోవచ్చును. ఆందోళనకు దిగారంటే సరిపెట్టుకోవచ్చు. సమ్మెకు దిగారంటే ఔను మరేంచేస్తారని సమాధాన పడొచ్చు. కానీ, ప్రభుత్వ ఉద్యోగులు వీధుల్లోకి రావడం, ఆందోళనలకు దిగడం, సమ్మె చేయడం కాదు ఏకంగా గవర్నర్  ను కలిసి, ప్రతి నెలా ఫస్ట్’ కు జీతాలు ఇప్పించండి మహా ప్రభో అని మొరపెట్టుకోవడం బహుశా  మరో రాష్ట్రంలో ఎక్కడా ఉండదేమో. ఆ ప్రత్యేక ‘గౌరవం’ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి, రాష్ట్ర ‘గౌరవ’ ముఖ్యమంత్రి   వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కింది.  నిజానికి  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర  గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసి, తమ సమస్యలను ఏకరవు పెట్టడమే కాదు, ఏకంగా తమ ప్రభుత్వం మీద తామే ఫిర్యాదు చేశారు. ఇది కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సర్కార్ కు మాత్రమే దక్కిన మరో ‘విశేష’ గౌరవం కావచ్చును. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభత్వ ఉద్యోగులు రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేయడం ఏదైతే వుందో అది నభూతో న భవిష్యతి.. అన దగిన ‘అద్భుత’  సన్నివేశం కావచ్చును.  నిజమే, ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య వివాదాలు తలెత్తడం, జీతాల పెంపు కోసమో, పీఆర్సీ కోసమో సమ్మెలు చేయడం కొత్తకాదు  కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు రాష్ట్రంలో తమ పరిస్థితి ముందు నుయ్యి వెంక గొయ్యి అన్న చందంగా మారిందని, గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. పీఅర్సీ విషయంలో మోసపోయినా, నష్ట పోయినా ప్రభుత్వం ఏదో విధంగా ఉద్యోగులను ఆదుకుంటుందనే ఓ చిన్న ఆశతో ఉండేదని  ఇప్పడు ఆ కాస్త ఆశ కూడా ఆవిరై పోవడంతో చేసేదిలేక  గవర్నర్  ఆశ్రయించామని ఉద్యోగ సంఘాల నాయకులు మీడియా ముందు గోడును వెళ్లబోసుకున్నారు. నిజానికి  వైసీపీ ప్రభుత్వం అధిఅక్రంలోకి వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోలి సంతకం చేసింది మొదలు రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ  పూర్తిగా గతి తప్పిందని  ఇంతవరకు విపక్షాలు, ఆర్థిక నిపుణులు మాత్రమే ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా అదే ఆరోపణ చేశారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాల నేతలు విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం పై ఫిర్యాదు చేశారు. అనతరం మీడియాతో మాట్లాదారు .. వారేమన్నారంటే ...   రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులంతా నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. సకాలంలో వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సూర్యనారాయణ, ఆస్కారరావుతో పాటు మరో ఆరుగురు నేతలు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని ఫిర్యాదు చేశారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు.  ఉద్యోగులకు వేతనాలను ప్రతి నెలా మొదటి తేదీనే ఇవ్వాలని ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సూర్యనారాయణ ఆరోపించారు. ఉద్యోగుల అనుమతి లేకుండా జీపీఎస్‌ను విత్‌డ్రా చేశారు. 90 వేల మంది ఉద్యోగుల ఖాతాల నుంచి డబ్బులు తీసుకున్నారు. మేం ప్రశ్నిస్తే సాంకేతిక సమస్య వల్ల జరిగిందని అధికారులు చెబుతున్నారు. గవర్నర్‌ను కలిసి అన్ని విషయాలు వివరించాం. మా సమస్యలను గవర్నర్‌ సానుకూలంగా విని కొన్ని సందేహాలు కూడా వ్యక్తం చేశారు. న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారని చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం అవమానకర రీతిలో వ్యవహరిస్తోంది. మేమేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులను సమాయత్తం చేస్తాం. ఏప్రిల్‌ నుంచి రాష్ట్ర కౌన్సిల్‌ నిర్ణయం ప్రకారం ఆందోళన చేపడతాం. ఆర్థికశాఖ అధికారులు, మంత్రివర్గ ఉప సంఘానికి సమస్యలు చెప్పాం. వారు స్పందించకపోవడం వల్లే గత్యంతరం లేని పరిస్థితుల్లో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశాం. బకాయిల చెల్లింపులపై జోక్యం చేసుకోవాలని ఆయన్ను కోరాం అని సూర్యనారాయణ తెలిపారు.

ఇదిగో ఇంకో .. ఫార్మ్ హౌస్ కథ

భారత రాష్ట్ర సమితి (భారాస) ఎమ్మెల్యేల కొనుగోలుకు,బీజేపీ నాయకత్వం ప్రయత్నించిందంటూ భారాస నాయకత్వం చేసిన ఆరోపణలు, ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ చేపట్టిన విచారణ  చిత్ర విచిత్ర మలుపులు తిరిగి, చివరకు సిబిఐకి చేరింది. సిట్  విచారణ చెల్లదని తేల్చిన రాష్ట్ర హై కోర్టు  విచారణను సిబిఐకి అప్పగించాలని ఆదేశించడంతో, డామిట్  కథ అడ్డం తిరిగిందని భారాస ప్రభుత్వం తల పట్టుకుంది. అయితే, పరిస్థితిని మదింపు వేసుకుని కేసును సీబీఐ విచారణకు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ప్రభుతం అప్పీల్ కు వెళ్లింది.  కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. దీంతో ఇటు సిట్ దర్యాప్తుతో పాటు సీబీఐ దర్యాప్తు కూడా నిలిచిపోయింది.   అయితే, ఆ ఫార్మ్ హౌస్ కథ.. అలా ఉంటే టీపీసీసీ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి మరో ఫార్మ్ హౌస్ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలోని సుమారు 25 మంది కాంగ్రెస్ నేతలతో కేసీఆర్ మాట్లాడారని రేవంత్ రెడ్డి  ఆరోపించారు. వారిని ఫామ్ హౌజ్ కు పిలిచి మాట్లాడారని అన్నారు. ఈ విషయం పార్టీ అధిష్టానానికి తెలిసిందని అన్నారు. ఆ నేతలకు రూ.500 కోట్ల ఆఫర్ ఇచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయం తెలిసి తమ నేతలకు సైతం ఏఐసీసీ క్లాస్ తీసుకుందని రేవంత్ రెడ్డి తెలిపారు. సునీల్ కనుగోలు రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్ పనిచేస్తున్నారని విమర్శించారు. సునీల్ కనుగోలు కార్యాలయంపై దాడి వెనుక చాలా కారణాలున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.  తక్కువ మార్జిన్‌తో గెలిచే నేతలను టార్గెట్ పెట్టుకొని కేసీఆర్ ఈ పని చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ విషయం కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామికి కూడా తెలియదని చెప్పారు. బీఆర్ఎస్ మీటింగ్‌కు కుమారస్వామి రాకపోవడానికి అదే కారణమని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలలో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, భారాస ఆవిర్భావ సభ నేపథ్యంగా ఆయన చేసిన సంచలన ఆరోపణలు రాజకీయ వర్గాలో దుమారం రేపుతున్నాయి. నిజానికి  కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రస్థానంలో అందరికంటే ముందుగా ఆయనతో జట్టు కట్టింది, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ సెక్యులర్’ అధ్యక్షుడు కుమార స్వామి. అలాంటిది  పార్టీ అవిర్భావ సభకు ఆయనే రాలేదు. సరే, ఆయన బిజీగా ఉండి రాలేక పోయారని అనుకున్నా, అయన తరపున ఆయన కుమారుడో లేదా జేడీఎస్ మరో ముఖ్య నాయకుడో మరొకరో అయినా రావాలి కదా ..కానీ, ఎవరు రాలేదు. దీంతో రేవంత్ రెడ్డి ఆరోపణలలో ఎంతో కొంత  నిజం ఉండే ఉంటుందని  అంటున్నారు. నిజానికి , కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ముందుకు సాగేందుకు, అడుగడుగునా ‘డబ్బు’ మూటలనే నమ్ముకుంటున్నారని అంటున్నారు. సో.. రేవంత్ రెడ్డి చేసియన్ సంచలన ఆరోపణల పై విచారణకు ఆదేశిస్తే, మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాని అంటున్నారు.

మిడిల్ క్లాస్ మెలోడీ మాయమౌతోందా?

యూనియన్ బడ్జెట్ అనగానే దేశంలో మధ్యతరగతి ఆశల పల్లకిలో ఊరేగడం మొదలెట్టేస్తోంది. ఇది ఏటా మామూలుగా జరిగే వ్యవహారమే. అయితే అదే మధ్య తరగతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి సంపన్నులకు సానుకూలంగా.. మధ్య తరగతిని దిగువ మధ్య తరగతిని డిమోషన్ ఇచ్చే విధంగా బడ్జెట్ రూపకల్పన అన్నది పరిపాటిగా మారిపోయింది.  స్వతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ నిర్లక్ష్యానికి గురౌతు వస్తున్న వర్గం ఏదైనా ఉందా అంటే అది మిడిల్ క్లాస్ వర్గం మాత్రమేనని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. మధ్యతరగతి ఆదాయం, పొదుపులపై ఎక్కవ శ్రద్ధ, దృష్టి పెడుతుంది. ప్రభుత్వాలు దానినే లక్ష్యంగా చేసుకుని బడ్జెట్ ల పేరుతో ఆ తరగతి మీద దాడి చేస్తున్నాయి. అంటే మధ్యతరగతిని దోచి సంపన్నులకు భారీగా, పేదలకు పరిమితంగా పంచి పెడుతున్నాయి. దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు బడ్జెట్‌ ప్రస్తావన వచ్చినా   మధ్యతరగతి వర్గం తమకు ఏదైనా మేలు జరుగుతుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఏడున్నర దశాబ్దాలుగా మధ్యతరగతికి మిగిలింది ఆ ఎదురు చూపే.. ప్రభుత్వాలు మాత్రం మధ్యతరగతి నెత్తిన ఎంత పెద్ద బండ పెడితే.. అంతగా దేశాభివృద్ధి జరిగిందన్నట్లు భావిస్తూ ముందుకు సాగుతున్నాయి.  ప్రభుత్వం చెప్పే జీడీపీ పెరుగుదల మధ్యతరగతిని పీల్చి పిప్పి చేయడంపైనే ఆధారపడి ఉందని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.   ఎందుకంటే దేశాబివృద్ధిలో అత్యంత కీలకమైన పన్నులు కట్టేది ఎక్కువగా మధ్య తరగతే. ధరల భారాన్ని మోసేదీ ఆ తరగతే. బడ్జెట్‌ వస్తోందంటే చాలు ఆ తరగతి జీవుల్లో  పన్నుల భయం పట్టుకుంటుంది. ఆ పన్నులపై శ్లాబులు ఇస్తే బాగుండుని, ఆదాయపన్ను మినహాయింపు పెంచితే చాలనీ కోరుకుంటుంది.  గత నాలుగేళ్లుగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ సమయం అయినా కాకపోయినా, సందర్భం వచ్చినా రాకున్నా తాను మధ్యతరగతికి చెందిన మహిళలని చెప్పుకుంటుంటారు. గత నాలుగు బడ్జెట్ లలో ఆమె మధ్యతరగతికి ఒరగబెట్టిందేమీ లేదు. ఇప్పుడు మరి కొద్ది రోజుల్లో ఆమె వరుసగా ఐదో సారి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పుడు కూడా యథావిధిగా తాను మధ్యతరగతి మహిళలనీ, వారి కష్టాలు, బాధలు, ఆశలూ తనకు బాగా తెలుసుననీ చెప్పుకొచ్చారు.  ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీన తాను ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో మధ్యతరగతి మీద అదనపు పన్నుల భారం ఉండబోదని ఆమె ప్రకటించారు. అయితే అదనపు ఆదాయం కోసం ప్రభుత్వాలు ఎక్కువగా ఆధారపడేది మధ్యతరగతి మీదే.  ఆ తరగతి జీవుల ద్వారానే అధికంగా పన్నుల ద్వారా ఆదాయం సమకూరుతుంది.  అందువల్ల బడ్జెట్‌కు సంబంధించి ఏ ప్రస్తావన వచ్చినా మధ్యతరగతి జనులే ముందుగా స్పందిస్తుంటారు సాలీనా రూ. 5.30 లక్షలు సంపాదించే వారంతా మధ్యతరగతికి చెందినవారేనని ‘ప్రెస్‌’ అనే ఆర్థిక వ్యవహారాల అధ్యయన సంస్థ చెప్పింది. దాని ప్రకారం, దేశంలో 30 శాతం కుటుంబాలు మధ్య తరగతికి చెందినవే. 2018-19 ఆర్థిక సంవత్సర గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 5.60 కోట్ల మంది వ్యక్తులు ఆదాయ పన్ను రిటర్న్స్‌ దాఖలు చేయగా, అందులో కోటీ 90 లక్షల మంది అంటే 34 శాతం మంది రూ. 5.25 లక్షల లోపు ఆదాయం కలిగినవారే, అంటే మధ్య తరగతి వారే.   అంతేకాదు, దేశంలో అసలు సిసలు కొనుగోలుదారుల గణాంకాలను సేకరించినప్పుడు కూడా మధ్యతరగతి జనులే అధికం.   ఈ బడ్జెట్‌లో మధ్యతరగతి మీద పన్నుల భారం వేయబోమని చెప్పిన నిర్మలా సీతారామన్‌, ప్రాథమిక సదుపాయాల కల్పన మీదే దృష్టి కేంద్రీకరింస్తామనీ, వీటి అభివృద్ధి మీదే భారీగా పెట్టుబడి పెట్టబోతున్నామనీ ప్రకటించారు. నిజానికి ప్రాథమిక సదుపాయాల కల్పన అనేది మధ్య తరగతికి పెద్దగా ప్రయోజనం కలిగించే అంశమేమీ కాదు. అది తమ జీవన స్థితిగతులను, జీవిత నాణ్యతను పెంచగ లదనే నమ్మకం ఆ తరగతి జీవులలో ఇసుమంతైనా లేదు. ఆరోగ్య సంరక్షణ, విద్య, రవాణా సౌకర్యాల వల్ల మధ్యతరగతి ప్రత్యక్షంగా లబ్ధి పొం దుతుందే తప్ప ప్రాథమిక సదుపాయాల వల్ల కాదన్నది పలు అధ్యయనాలు వెల్లడించాయి. మరి విత్త మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెల మొదటి తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్ అయినా ఏదో ఒక మేరకు మధ్యతరగతి జనుల.. వీరిలో అత్యధికులు వేతన జీవులే ఆశలను నెరవేర్చేదిగా ఉంటుందా? చూడాలి.

కొయ్యా గుర్రం ఎగరావచ్చు!

మూడు పార్టీలకు చెందిన నలుగురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి, మరో జాతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ... ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్బావ సభ వేదిక నుంచి ప్రసంగించిన నేతలు ఈ ఐదుగురు. సరే, ఐదుగురు నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, మోడీ ప్రభుత్వ విధానాలను విమర్శించారు. దేశం ఏమైపోతోందనే ఆవేదన, ఆగ్రహం వ్యక్తపరిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి, కేసేఆర్  అయితే, 2024 ఎన్నికల తర్వాత ప్రధాని మోడీ ఇంటికి ...మేము ఢిల్లీకీ అని, చాలా విశ్వాసంగా ప్రకటించారు.  అయితే, ఈ ‘మేము’ లో ఉన్నది ఎవరు? వేదిక మీద ఐదు ముఖాలు కనిపించినా, ఉన్నది బీఆర్ఎస్  సహా  నాలుగే పార్టీలు.. అందులో లోక్ సభలో సింగిల్ సీటున్న పార్టీ ఒకటి (ఆప్), రెండే సీట్లున్న పార్టీ ( సిపిఐ) ఇంకొకటి, ఐదు సీట్లున్న పార్టీ (ఎస్పీ), మూడు సీట్లకు పరిమితం అయిన సిపిఎం మరొకటి. ఇక బీఆర్ఎస్ సంగతి చెప్పనే అక్కరలేదు. కారు సారు పదహారు ..కాస్తా తొమ్మిదికి చేరింది.  అంటే 545 సంఖ్యా బలమున్న లోక్  సభలో బీఆర్ఎస్ వేదికను అలంకరించిన జాతీయ నేతల టోటల్ స్ట్రెంక్త్  20కి లోపే. పోనీ ఈ నాలుగు పార్టీల ఐదుగురు నేతలు ఒకే మాట మీదున్నారా? అంటే  అదీ లేదు. ఎవరి అవసరాలకు తగ్గట్టుగా నలుగురూ నాలుగు పక్కలకూ లాగుతున్నారు. ముఖ్యంగా ఎంత చెడ్డా  లోక్ సభలో అధికారికంగా ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా, జాతీయ స్థాయిలో  బీజేపీకి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీనే ..అయినా కాంగ్రెస్ పొత్తు విషయంలో ఏ రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఏ రెండు పార్టీలు కాదు, ఏ ఇద్దరు నాయకుల మధ్య కూడా ఏకాభిప్రాయం లేదు.   కేసీఆర్  బీజేపీతో పాటుగా కాంగ్రెస్ పార్టీని కూడా శత్రు పక్షంగా చూస్తున్నారు. ఆ రెండు పార్టీల నిర్వాకం వల్లనే దేశం ఈ దౌర్భాగ్య స్థితి చేరిందని ఆయన అంటున్నారు. మరో వంక సిపిఐ నేత డి.రాజా కాంగ్రెస్ సహా లౌకికవాద ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఒక్కటైతేనే కానీ, మోడీ పీఠాన్ని కదల్చలేమని అంటున్నారు. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ సగం అటు సగం ఇటుగా ఉన్నారు. అదే పార్టీకి చెందిన పంజాబ్ ముఖ్యమంత్రి మాన్    బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేశారు. అలాగే సిపిఐ జాతీయ నేత రాజా, కాంగ్రెస్ తో కలిసి నడవాలని అంటే, కేరళ ముఖ్యమంత్రి (సిపిఎం) హస్తం పార్టీతో చేయి కలిపేది లేదని అంటున్నారు. అఫ్కోర్స్, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా కాంగ్రెస్   కలిసిపోదామని అన్నా, గత ఏప్రిల్లో జరిగిన సిపిఎం కాంగ్రెస్  ఏచూరి ప్రతిపాదనను తోసి పుచ్చింది. జాతీయ స్థాయిలో ఏ పార్టీ, కూటమితో పొత్తు ఉండదని, సిపిఎం కాంగ్రెస్ ఆమోదించిన రాజకీయ తీర్మానంలో స్పష్టం చేసింది.  నిజానికి, ఈ నాలుగు పార్టీలు ఐదుగురు నాయకులే కాదు, ఓ వంక నుంచి మమతా బెనర్జీ, మరో వంక నుంచి నితీష్ కుమార్, ఎవరికి వారు 2024 ఎన్నికలలో మోడీని ఇంటికి పపంపాలని శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే, అది అయ్యే పనేనా? అందులోనూ... కాంగ్రెస్ ను పక్కన పెట్టి, అంటే ..ఏమో కొయ్యా గుర్రం ఎగరావచ్చు .. అంటున్నారు.

బీఆర్ఎస్ కు కుమార స్వామి దూరం ఎందుకంటే.. ?

ఖమ్మం బీఆర్ఎస్ సభకు జేడీఎస్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి దూరంగా ఉన్నారు. ఆయనే కాదు.. జీడీఎస్ పార్టీ ప్రతినిధులెవరూ కూడా హాజరు కాలేదు.  దీంతో.. కేసీఆర్ జాతీయ రాజకీయాలు అంటూ పయనం ప్రారంభించనప్పటి నుంచీ ఆయనతో అడుగులు వేయడానికి ఉత్సాహం చూపిన జేడీఎస్, కుమారస్వామి.. బీఆర్ఎస్ కు దూరం జరిగారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ తన జాతీయ ఆకాంక్షను బయటపెట్టిన క్షణం నుంచీ..   కుమారస్వామి ఆయనకు మద్దతు పలికారు.  పార్టీ ప్రకటన సందర్భంలోనూ,  ఢిల్లీ లో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం కార్యాలయం ప్రారంభోత్సవ సమయంలోనూ కుమార స్వామి కేసీఆర్ వెంట నిలిచారు. కానీ   ఆవిర్భావ సభకు మాత్రం దూరం జరిగారు. బీఆర్ఎస్ వర్గాలు ఆయన బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారని చెబుతున్నా.. జేడీఎస్ కు సంబంధించి ఎవరూ ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభకు హాజరు కాకపోవడాన్ని బట్టి చూస్తే ఎక్కడో ఏదో చెడిందన్న అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి.  అలాగే.. నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఖమ్మం ఆవిర్భావ సభలో ఎక్కడా కనిపించలేదు. బీఆర్ఎస్ కర్నాటక బాధ్యతలు ప్రకాశ్ రాజ్ చేపడతారన్నంతగా ప్రచారం జరిగినా.. అత్యంత కీలకమైన ఆవిర్భావ సభకు ఆయన గైర్హాజర్ కావడంతో ఏదో జరిగింది, బీఆర్ఎస్ కు, కేసీఆర్ కు ప్రకాష్ రాజ్ దూరం జరిగారా, లేక కేసీఆరే పక్కన పెట్టారా అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.   తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తో పాటే జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కుమారస్వామి బీఆర్ఎస్ తో ఎడం పాటించడంతో..   జేడీఎస్ బీఆర్ఎస్ మిత్రపక్షంగా ముందుకు సాగడానికి సుముఖంగా లేదన్న వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపాలని భావిస్తుండటం జేడీఎస్ నేత కుమారస్వామికి నచ్చలేదనీ, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండి జేడీఎస్ అభ్యర్థుల కోసం ప్రచారానికే పరిమితమవ్వాలన్న ఆయన కండీషన్ ను కేసీఆర్ అంగీకరించలేదనీ ఒక ప్రచారం జరుగుతోంది. అందుకే బీఆర్ఎస్ తో పొత్తుకు ముందే కుమారస్వామి తెగతెంపులు చేసుకున్నారని అంటున్నారు.   అసలింతకీ ఖమ్మంలో జరిగిన ఆవిర్భావ సభతో కేసీఆర్ భారాస పార్టీ జాతీయ పార్టీగా అన్ని వర్గాల గుర్పింపు పొందేసినట్లేనా? అంటే ఔనన్న సమాధానం వస్తుందా, వచ్చిందా? అని స్పష్టంగా చెప్పలేము. కత్తీ పోయి డాలు వచ్చే ఢాంఢాంఢాం అన్నట్లుగా ఆవిర్బవం నుంచీ తొడుగా ఉన్న మిత్రుడు దూరమై కొత్త మిత్రులు వచ్చారు అని మాత్రమే చెప్పగలం.  జేడీఎస్ దూరమై ఆప్ దగ్గరైంది. వామపక్షాలు వచ్చి చేతులు కలిపినా.. ఆ పార్టీలకు కేసీఆర్ బలం కావాలే తప్ప కేసీఆర్ కు అవి బలంగా ఉండే అవకాశం లేదు. మరి ఖమ్మం సభ ద్వారా కేసీఆర్ సాధించిందేమిటయ్యా అంటే జేడీఎస్ ను దూరం చేసుకుని ఆప్ కు దగ్గరవ్వడం. కేసీఆర్ కు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఆకాంక్ష ఎంత బలీయంగా ఉందో.. ఆప్ అధినేత కేజ్రీవాల్ కు కూడా అంతే బలీయంగా ఉంది. తెలుగు రాష్ట్రాలలో పాగా కోసం ఆప్ గతంలో కొంత ప్రయత్నం చేసినా సఫలీకృతం కాలేదు. దీంతో ఆయన వ్యూహం మార్చి తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టి ఆప్ ను బలోపేతం చేయాలని భావిస్తున్నారు. గతంలో తెలుగుదేశం హస్తినలో ఆందోళనలకు దిగినప్పుడు కూడా స్వయంగా వచ్చి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారాస విషయంలో మాత్రం ఆయన ఖమ్మం సభకు రావడానికి ముందు వరకూ ఎటువంటి సానుకూలతా ప్రదర్శించలేదు. హిమాచల్, గుజరాత్ ఎన్నికలలో ఆప్ పరాభవం తరువాత వ్యూహం మార్చుకుని భారాస ఆవిర్భావ సభకు హాజరయ్యారు. భారాస అండతో తెలంగాణలో  బలోపేతం అన్న వ్యూహంతో ఆయన అడుగులు వేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ పార్టీ పూర్తిగా విస్తరించకముందే.. కొందరు మిత్రులను దూరం చేసుకుని కొత్త మిత్రులకు దగ్గరయ్యారు అని మాత్రమే భారాస ఆవిర్భావ సభ ద్వారా వెల్లడైంది. అయినా తనకు తానుగా జాతీయ నాయకుడినని భావిస్తున్న కేసీఆర్ కు నిజంగా ఆ గుర్తింపు వచ్చిందా? ఓ ముగ్గురు, నలుగురు ఇతర పార్టీల కు చెందిన నాయకులు మద్దతు పలికితే బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయిపోతుందా? ఆయనకు జాతీయ నేతగా గుర్తింపు వచ్చేసిందా? ఆయనను కలిసిన వారంతా తమ నాయకుడిగా కేసీఆర్ ను అంగీకరించేసినట్లేనా?  అంటే కాదనే రాజకీయ వర్గాలు అంటున్నాయి. గత మూడు నాలుగేళ్లుగా జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఆకాంక్షతో ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైన కేసీఆర్ సొంతంగా బీఆర్ఎస్ ఏర్పాటు చేసేసి జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేస్తానంటున్నారు.  కానీ బీహార్ సీఎం నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్  వంటి వారు జాతీయ రాజకీయాలలో బీజేపీ వ్యతిరేక పార్టీల ఐక్యత విషయంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. వారు ముగ్గురూ కూడా ఆది నుంచీ కేసీఆర్ తో అడుగులు వేయడానికి సుముఖంగా లేరు. స్టాలిన్ అయితే కాంగ్రెస్ లేకుండా బీజేపీయేతర శక్తుల ఐక్యత వీలుకాదని ఇప్పటికే కుండ బద్దలు కొట్టేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ది కూడా దాదాపు అదే బాణి, అదే బాట. ఆయన సొంత రాష్ట్రం బీహార్ లో జేడీఎస్ ఆర్జేడీ, కాంగ్రెస్ లతో పొత్తులో ఉంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఆవిర్బావ సభతో కేసీఆర్ సాధించిందేమిటన్న ప్రశ్న ఉత్పన్నమౌతోంది.